![Harish Rao: Telangana To Set Up STPs In 20 Govt Hospitals - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2022/03/4/CJ.jpg.webp?itok=jwyB-a7F)
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాస్పత్రుల్లో జీవ వైద్యవ్యర్థాల నిర్వహణలో భాగంగా వ్యర్థజలాలను శుద్ధి చేయడానికి సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, టిమ్స్ సహా రాష్ట్రవ్యాప్తంగా 20 ఆస్పత్రుల్లో ఈ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇందు కోసం రూ.68.31 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా ఉత్తర్వులు జారీ అయ్యాయని చెప్పారు.
ఆస్పత్రుల్లోని ద్రవవ్యర్థాల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాల్సి ఉందని, లేనట్లయితే పరిసరాలు, సమీప నీటివనరులు కాలుష్యం బారిన పడే ప్రమాద ముందని ఆందోళన వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, సూర్యాపేట, నల్లగొండ, ఆదిలాబాద్ రిమ్స్, సంగారెడ్డి, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్, జగిత్యాల, రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్కర్నూల్, సిద్దిపేట మెడికల్ కాలేజీ, ఖమ్మం, కరీంనగర్ ప్రభుత్వాస్పత్రుల్లో కూడా మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు.
రూ.52.59 కోట్లను ప్లాంట్ల ఏర్పాటుకు, మరో రూ.15.72 కోట్లు మూడేళ్లపాటు ఈ ప్లాంట్ల నిర్వహణకు ఖర్చు చేయాలని నిర్ణయించామన్నారు. ఆస్పత్రుల్లోని ఆపరేషన్ థియేటర్లు, ల్యాబొరేటరీల నుంచి వెలువడే వ్యర్థాలతోపాటు పేషెంట్ల బెడ్లను, బెడ్ షీట్లను, వార్డులను శుభ్రం చేసే సమయంలో వెలువడే వ్యర్థాల్లోని వైరస్లు పలు ఇన్ఫెక్షన్లు, కాలుష్యానికి కారకమవుతాయని హరీశ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment