Woman posing with 'Marry me Shubman Gill' placard, that missed runout chance - Sakshi
Sakshi News home page

#ShubmanGill: లవ్‌ ప్రపోజ్‌కు పడిపోయాడు.. రనౌట్‌ మిస్‌ చేశాడు!

Published Fri, Jun 9 2023 9:40 PM | Last Updated on Sat, Jun 10 2023 9:07 AM

Young Woman Love-Proposal Shubman Gill After-That Missed Run-out Chance - Sakshi

ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌లో బ్యాటింగ్‌లో వీరవిహారం చేసి 890 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్న శుబ్‌మన్‌ గిల్‌ డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచాడు. 13 పరుగులు మాత్రమే చేసి క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. అయితే తాజాగా ఫీల్డింగ్‌లోనూ గిల్‌ విఫలమయ్యాడు. ఈజీ రనౌట్‌ చేసే చాన్స్‌ను చేజేతులా జారవిడిచాడు. ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ సమయంలో ఇది జరిగింది. 

ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో సిరాజ్ బౌలింగ్‌లో మార్నస్ లబుషేన్ ఆడిన షాట్ నేరుగా శుబ్‌మన్ గిల్ చేతుల్లోకి వెళ్లింది. సమన్వయ లోపంతో మార్నస్ లబుషేన్, ఉస్మాన్ ఖవాజా ఇద్దరూ కూడా ఒకే వైపు పరుగెత్తారు. మూడో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుబ్‌మన్ గిల్, మెల్లిగా లేచి బంతి అందుకుని వికెట్ కీపర్ వైపు బంతి వేసేందుకు కావాల్సినంత సమయం ఉంది. అయితే బంతిని ఆపగానే కంగారుపడిన శుబ్‌మన్ గిల్ బ్యాటర్లు ఎటువైపు ఉన్నారనే విషయాన్ని కూడా గమనించకుండా బౌలింగ్ ఎండ్‌వైపు బంతి త్రో చేశాడు. అటు వైపు బంతిని ఆపేందుకు కూడా ఎవ్వరూ లేకపోవడంతో రనౌట్ ఛాన్స్ మిస్ అయింది. 

అయితే ఈ సంఘటనకి ముందు గ్రౌండ్‌లో ఉన్న ఓ యువతి, శుబ్‌మన్ గిల్‌కి మ్యారేజ్ ప్రపోజ్ చేసింది. ''శుబ్‌మన్ గిల్ మ్యారీ మీ'' అని రాసి ఉన్న ఫ్లకార్డును కెమెరావైపు ప్రదర్శించింది.  వాస్తవానికి గిల్‌ దీనిని పట్టించుకోలేదు. కానీ అభిమానులు ఊరికే ఉండరుగా.  గిల్ ఆ పిల్ల ప్రపోజల్ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని రనౌట్ చాన్స్ మిస్ చేశాడంటూ ట్రోల్‌ చేశారు.

ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఒక దశలో ఫాలోఆన్‌ గండం దాటుతుందా అన్న అనుమానం కలిగింది. అయితే అజింకా రహానే, శార్దూల్ ఠాకూర్ హాఫ్ సెంచరీలతో రాణించి ఏడో వికెట్‌కు 109 పరుగులు జోడించి టీమిండియాను ఫాలోఆన్‌ ముప్పు నుంచి తప్పించారు. ఆసీస్‌కు 173 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ భారీ ఆధిక్యం లభించింది.

అయితే తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన గిల్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే తరహా ఆటతీరు నమోదు చేస్తే అభిమానుల ఆగ్రహానికి గురవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు మ్యాచ్‌లో విజయావకాశాలు ఆసీస్‌కే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 80 పరుగులతో ఆడుతున్న ఆసీస్‌ మొత్తంగా 253 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆటకు ఇంకా రెండురోజులు సమయం ఉండడంతో టీమిండియా ఏ మేరకు పోరాడుతుందనేది ఆసక్తిగా మారింది.

చదవండి: 'సామాన్యుడు కాడు వీడు'.. టెన్నిస్‌ చరిత్రలో అత్యుత్తమ షాట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement