ప్రధాని మోదీని కలువనున్న టీ20 ఛాంపియన్స్‌.. ఓపెన్‌ టాప్‌ బస్‌లో ఊరేగింపు | T20 World Cup 2024: Team India To Tour Mumbai In Open Bus After Meeting PM Modi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీని కలువనున్న టీ20 ఛాంపియన్స్‌.. ఓపెన్‌ టాప్‌ బస్‌లో ఊరేగింపు

Published Wed, Jul 3 2024 10:59 AM | Last Updated on Wed, Jul 3 2024 11:03 AM

T20 World Cup 2024: Team India To Tour Mumbai In Open Bus After Meeting PM Modi

యూఎస్‌ఏ, కరీబియన్‌ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ 2024ను టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 14 ఏళ్ల తర్వాత భారత్‌ జట్టు పొట్టి ప్రపంచకప్‌ను చేజిక్కించుకుంది. టోర్నీ ఆరంభ ఎడిషన్‌లో (2007) టీమిండియా టైటిల్‌ను సాధించింది. అనంతరం 2011లో వన్డే ప్రపంచకప్‌ గెలిచింది. టీమిండియా 2013లో చివరిసారిగా ఐసీసీ ట్రోఫీ సాధించింది. ఆ ఏడాది భారత్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది.

టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలిచిన ప్రతిసారి భారత్‌లో సంబురాలు అంబరాన్నంటుతాయి. ఈసారి కూడా అదే తరహాలో సెలబ్రేట్‌ చేసుకోవాలని భారత క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. ఇందుకు భారత ప్రభుత్వం కూడా సహకరించనుందని తెలుస్తుంది.

వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ టీమ్‌ స్వదేశానికి తిరిగి రాగేనే తొలుత ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉంది. మోదీ భారత బృందం మొత్తాన్ని సన్మానించనున్నట్లు తెలుస్తుంది. అనంతరం ప్రభుత్వం ఆథ్వర్యంలోనే భారత ఆటగాళ్లను ముంబై నగర వీధుల్లో ఓపెన్‌ టాప్‌ బస్‌లో ఊరేగించే అవకాశం ఉంది. గతంలో టీమిండియా ఐసీసీ టోర్నీలు, ముఖ్యంగా వరల్డ్‌కప్‌ గెలిచినప్పుడు ఓపెన్‌ టాప్‌ బస్‌ల్లో ఊరేగించారు. ఈసారి కూడా అలాగే చేయాలని భారత ప్రభుత్వం బీసీసీఐని ఆదేశించినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్‌లో విజయబావుటా ఎగరవేసిన టీమిండియా ఇంకా స్వదేశానికి చేరుకోలేదు. భారత క్రికెటర్లు హరికేన్‌ (గాలివాన) కారణంగా ఫైనల్‌ మ్యాచ్‌కు వేదిక అయిన బార్బడోస్‌లో ఇరుక్కుపోయారు. భారత బృందం రేపు ఉదయం కల్లా స్వదేశానికి చేరే అవకాశం ఉంది. టీమిండియా ఢిల్లీలో ల్యాండ్‌ అయ్యేందుకు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భారత బృందం ప్రత్యేక ఛార్టర్‌ విమానంలో బార్బడోస్‌ నుంచి బయల్దేరనుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement