వ్యక్తిగత కారణాలతో కోహ్లి దూరం.. క్లారిటీ ఇచ్చిన సోదరుడు Ind vs Eng: Let Me Clear That Our Mom, Says Virat Kohli Brother Slams Fake News | Sakshi
Sakshi News home page

Ind vs Eng: వ్యక్తిగత కారణాలతో కోహ్లి దూరం.. క్లారిటీ ఇచ్చిన సోదరుడు

Published Wed, Jan 31 2024 2:30 PM | Last Updated on Wed, Jan 31 2024 3:15 PM

Ind vs Eng: Let Me Clear That Our Mom: Virat Kohli Brother Slams Fake News - Sakshi

Ind vs Eng Virat Kohli: ఇంగ్లండ్‌తో మూడో టెస్టు నుంచైనా టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి అందుబాటులోకి వస్తాడా? జట్టుతో చేరతాడా? లేదా? అన్న అంశం మీద క్రీడావర్గాల్లో చర్చ నడుస్తోంది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ ఢిల్లీ బ్యాటర్‌ తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. 

అయితే, ఆ కారాణాలు ఏమిటన్న దానిపై ఇంత వరకూ స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో కోహ్లి, అతడి కుటుంబం గురించి వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. 

అందుకే దూరంగా ఉన్నాడా?
‘‘ప్రస్తుతం గర్భవతిగా ఉన్న భార్య అనుష్క శర్మను దగ్గరుండి చూసుకునేందుకే కోహ్లి సెలవు తీసుకున్నాడు’’ అని కొందరు.. ‘‘లేదు.. కోహ్లి తల్లి సరోజ్‌ అనారోగ్యం వల్లే అతడు ఆటకు దూరమయ్యాడు’’ అని ఇంకొందరు ఇష్టారీతిన ప్రచారం చేస్తున్నారు.

ఈ విషయంపై విరాట్‌ కోహ్లి సోదరుడు వికాస్‌ కోహ్లి తాజాగా స్పందించాడు. తమ తల్లి పూర్తి ఆరోగ్యంగా ఉన్నారంటూ దుష్ప్రచారాన్ని ఖండించాడు. దయచేసి తప్పుడు వార్తలను నమ్మవద్దని కోహ్లి అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. 

మా అమ్మ ఆరోగ్యంగా ఉన్నారు
‘‘అందరికీ నమస్కారం. మా అమ్మ ఆరోగ్యం గురించి ఫేక్‌ న్యూస్‌ ప్రచారమవుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. మా అమ్మ పూర్తి ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నారు. పూర్తి వివరాలు తెలియకుండా దయచేసి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దు’’ అని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వికాస్‌ కోహ్లి క్లారిటీ ఇచ్చాడు.

కాగా ఢిల్లీలో జన్మించిన విరాట్‌ తల్లిదండ్రుల పేర్లు సరోజ్‌- ప్రేమ్‌ కోహ్లి. విరాట్‌కు అక్క భావనా కోహ్లి ధింగ్రా, అన్న వికాస్‌ కోహ్లి ఉన్నారు. భావనా ఎంటర్‌ప్రెన్యూర్‌ కాగా.. వికాస్‌ కూడా వ్యాపారరంగంలో ఉన్నట్లు సమాచారం.

కాగా టీమిండియా.. జనవరి 25 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి తొలి రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో కోహ్లి పేరు ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాల దృష్ట్యా జట్టు నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి సైతం ధ్రువీకరించింది. 

విశాఖలో విజయం కోసం
ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌ వేదికగా తొలి టెస్టులో ఓటమి పాలైన టీమిండియా.. విశాఖపట్నం మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలగా ఉంది. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్టేడియంలో ఫిబ్రవరి 2 నుంచి ఈ టెస్టు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు విశాఖ చేరుకున్నారు. మరోవైపు.. కోహ్లితో పాటు రవీంద్ర జడేజా, కేఎల్‌ రాహుల్‌ వంటి స్టార్లు కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. ఇది జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

చదవండి: Ind vs Eng: కోహ్లి వస్తే వేటు పడేది నీ మీదే సర్ఫరాజ్‌! తాడోపేడో తేల్చుకో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement