CWC Qualifiers 2023: Netherlands Bas De Leede And Teja Nidamanuru Interesting Facts In Telugu - Sakshi
Sakshi News home page

WC 2023: ఒక్క బంతి ఎక్కువ తీసుకున్నా గోవిందా! నాడు తండ్రి సచిన్‌ వికెట్‌ తీసి.. ఇప్పుడేమో కొడుకు..

Published Fri, Jul 7 2023 7:28 AM | Last Updated on Tue, Oct 3 2023 6:15 PM

CWC Qualifiers 2023 Netherlands Bas De Leede Teja Nidamanuru Intresting Facts - Sakshi

CWC Qualifiers 2023: వన్డే వరల్డ్‌ కప్‌కు అర్హత సాధించేందుకు నెదర్లాండ్స్‌ తమ చివరి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై తప్పనిసరిగా గెలవాలి. లక్ష్యం 278 పరుగులు... అదీ 44 ఓవర్లలో సాధిస్తేనే బెర్త్‌ దక్కుతుంది. అంతకంటే ఒక్క బంతి ఎక్కువ తీసుకొని మ్యాచ్‌ గెలిచినా లాభం లేదు. స్కాట్లాండ్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తక్కువ వ్యవధిలో ఒక్కో వికెట్‌ కోల్పోతూ వచ్చిన జట్టు ఒక దశలో 163/5 వద్ద నిలిచింది.

79 బంతుల్లోనే మరో 115 పరుగులు కావాలి. ఇలాంటి స్థితిలో బాస్‌ డి లీడె ఒక్కసారిగా చెలరేగిపోయాడు. తర్వాతి 40 బంతుల్లోనే 76 పరుగులు సాధించి జట్టుకు సంచలన విజయం అందించాడు. డి లీడె శతకానికి తోడు జుల్ఫికర్‌ అండగా నిలవడంతో నెదర్లాండ్స్‌ మరో 7 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరి ఈ ఏడాది అక్టోబర్‌–నవంబర్‌లలో భారత్‌లో జరిగే వరల్డ్‌ కప్‌కు అర్హత సాధించింది.

‘సూపర్‌ సిక్స్‌’ దశలో జింబాబ్వేను ఓడించి ఆ జట్టును వరల్డ్‌ కప్‌కు దూరం చేసి తమ అవకాశాలు మెరుగుపర్చుకున్న స్కాట్లాండ్‌ అనూహ్య ఓటమితో నిష్క్రమించింది. వరల్డ్‌ కప్‌కు నెదర్లాండ్స్‌ అర్హత సాధించడం ఇది ఐదోసారి. 2011 తర్వాత మళ్లీ భారత్‌లోనే ఆ జట్టు బరిలోకి దిగుతోంది.   

అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు
సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం 2003 వన్డే వరల్డ్‌ కప్‌... పార్ల్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 68 పరుగుల తేడాతో ఓడింది. అయితే సచిన్‌ టెండూల్కర్‌ సహా 4 వికెట్లు తీసిన టిమ్‌ డి లీడె ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

అతని కొడుకే ఈ బాస్‌ డి లీడె. టోర్నీ ఆసాంతం నిలకడైన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అతను జట్టును ముందుకు నడపడంలో కీలకపాత్ర పోషించాడు. 285 పరుగులు చేయడంతో పాటు డి లీడె 15 వికెట్లు పడగొట్టడం విశేషం. 

ప్రధాన ఆటగాళ్లు తప్పుకొన్నా..
కౌంటీల్లో ఒప్పందాల కారణంగా పలువురు ప్రధాన ఆటగాళ్లు ఈ టోర్నీ నుంచి తప్పుకున్నా... డి లీడె మాత్రం రెండిటిలో వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్స్‌నే ఎంచుకున్నాడు. సీనియర్లు లేకపోయినా స్ఫూర్తిదాయక ఆటతో డచ్‌ బృందం సత్తా చాటింది. గ్రూప్‌ దశలో జింబాబ్వే చేతిలో ఓడినా అమెరికా, నేపాల్‌పై సునాయాస విజయాలు సాధించింది. విండీస్‌తో మ్యాచ్‌ ఆ జట్టు స్థాయిని చూపించింది. 374 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ తడబడకుండా స్కోరు సమం చేయగలిగింది. 

తేజ అద్భుతంగా ఆడి
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తేజ నిడమనూరు అద్భుత సెంచరీతో చెలరేగగా, కీలకమైన సూపర్‌ ఓవర్‌లో వాన్‌ బీక్‌ 30 పరుగులు కొట్టి జట్టును గెలిపించాడు. ‘సూపర్‌ సిక్స్‌’ దశలో ఒమన్‌పై భారీ విజయం జట్టుకు మేలు చేయగా, ఇప్పుడు స్కాట్లాండ్‌పై గెలుపు ఆ జట్టును ప్రధాన టోరీ్నకి చేర్చింది.

4 అర్ధ సెంచరీలు చేసిన స్కాట్‌ ఎడ్వర్డ్స్, మరో సెంచరీ చేసిన విక్రమ్‌జిత్‌ సింగ్‌తో పాటు బౌలింగ్‌లో వాన్‌ బీక్, ర్యాన్‌ క్లీన్‌ కీలక పాత్ర పోషించారు. ‘భారత గడ్డపై అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాలనేది నా కల’ అని తేజ కొన్నాళ్ల క్రితం ‘సాక్షి’తో ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఇప్పుడు అతను భారత్‌పైనే వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ ఆడబోతుండటం విశేషం. నవంబర్‌ 11న బెంగళూరులో భారత్‌తో తలపడే నెదర్లాండ్స్‌... అక్టోబర్‌ 6న తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో హైదరాబాద్‌లో ఆడుతుంది.  

చదవండి: Ind Vs WI: విఫలమైన కోహ్లి.. 2 పరుగులకే అవుట్‌! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement