మరోసారి భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌..! Champions Trophy 2025: Lahore To Host India, Pakistan Clash Says Reports Sakshi
Sakshi News home page

మరోసారి భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌..!

Published Mon, Jun 10 2024 1:14 PM | Last Updated on Mon, Jun 10 2024 3:03 PM

Champions Trophy 2025: Lahore To Host India, Pakistan Clash Says Reports

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా భారత్‌, పాకిస్తాన్‌ జట్ల మధ్య నిన్న (జూన్‌ 9) హైఓల్టేజీ మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. హోరాహోరీగా సాగిన ఈ సమరంలో భారత్‌.. పాక్‌పై 6 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగినప్పటికీ అంతిమంగా టీమిండియానే విజయం వరించింది.

ఈ ఓటమి అనంతరం పాక్‌ సూపర్‌-8 అవకాశాలను (వరల్డ్‌కప్‌లో తదుపరి దశ) సంక్లిష్టం చేసుకుంది. ఒకవేళ పాక్‌ సూపర్‌-8కు అర్హత సాధించకపోతే ఈ టోర్నీలో మరోసారి భారత్‌-పాక్‌ జరిగే అవకాశం ఉండదు.

క్రికెట్‌ అభిమానులు తిరిగి దాయాదుల సమరాన్ని చూడాలంటే మరో ఎనిమిది నెలల పాటు వేచి చూడాలి. అది కూడా పాక్‌లో ఆడేందుకు భారత్‌ సమ్మతిస్తేనే ఈ మ్యాచ్‌ జరుగుతుంది.

వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్‌ వేదికగా 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగాల్సి ఉంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ టోర్నీలో భారత్‌, పాకిస్తాన్‌ తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ కోసం పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు లాహోర్‌ మైదానాన్ని పరిశీలిస్తుంది. ఎనిమిది జట్లు పాల్గొనే ఈ ఐసీసీ టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్యలో జరుగనుంది. 

అయితే దీనికి ముందు ఓ ముఖ్య విషయం తేలాల్సి ఉంది. పాక్‌లో అడుగుపెట్టేందుకు భారత ప్రభుత్వం అనుమతిస్తేనే ఈ మ్యాచ్‌ సాధ్యపడుతుంది. పీసీబీ ప్రతిపాదనకు భారత్‌ ఒప్పుకోకపోతే హైబ్రిడ్‌ పద్దతిలో (తటస్థ వేదికలపై) ఈ టోర్నీ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ అన్నీ పాక్‌ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది మార్చిలో భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరిగే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే, చివరిసారిగా జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో (2017) పాకిస్తాన్‌ విజేతగా నిలిచింది. ఆ టోర్నీలో ఫైనల్లో పాక్‌.. భారత్‌ను ఓడించి టైటిల్‌ను సాధించింది. వన్డే ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో భారత్‌, పాక్‌ సహా ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్లు పోటీ పడతాయి.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement