![Ex Minister Gudiwada Amarnath Key Comments Over TDP And Rishikonda](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/17/Minister-Gudiwada-Amarnath.jpg.webp?itok=9wNbtEyT)
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ ఆస్తుల విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. రుషికొండ నిర్మాణాలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెందినవిగా చూపించేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. టీడీపీ అనుకూల మీడియాలో జరుగుతున్న విష ప్రచారంపై సోమవారం విశాఖలో అమర్నాథ్ మాట్లాడారు..
‘‘వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్ను బద్నాం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్.. ఎవరు వచ్చినా ఉండేలా నిర్మాణాలు చేపట్టింది. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ విశాఖ వచ్చిన సందర్భంలో రుషికొండ భవనాలను వినియోగించుకోవాలి. రుషికొండపై కట్టిన భవనాల్లో వైఎస్ జగన్ ఏమీ ఉండరు. ప్రారంభించిన భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలి.
.. నాలుగు నెలలు క్రితమే రుషికొండ భవనాలను ప్రారంభించాం. విశాఖను రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత రుషికొండ నిర్మాణంపై ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశారు. కమిటీ ఒకే అన్న తరువాతే రుషికొండ భవనాలను నిర్మించారు. టీడీపీ నేతలు వైఎస్ జగన్ మీద, వారి కుటుంబం మీద బురద జల్లాలని చూడటం ఎంతవరకు సమంజసం? అని అమర్నాథ్ ప్రశ్నించారు.
![](/sites/default/files/inline-images/24_0.png)
ఇది కూడా చదవండి: రుషికొండ ప్రభుత్వ భవనాలపై విషం కక్కుతున్న టీడీపీ అండ్ కో..
ఆక్రమణలు జరిగింది రుషికొండలో కాదు.. గీతం యూనివర్సిటీలో జరిగాయి. గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణలను గంటా శ్రీనివాసరావు చూపిస్తే బాగుండేది. అమరావతిలో చంద్రబాబు తాత్కాలిక భవనాలు నిర్మిస్తే, వైఎస్ జగన్ రుషికొండపై శాశ్వత భవనాలు నిర్మించారు. టీడీపీ నేతలకు ధైర్యం ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించాలి. రుషికొండ భవనం గురించి మీడియోలు, ఫోటోలు తీసి చూపించారు. అదే సమయంలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా చూపించండి.
.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరుగుతోంది. మెడికల్ కాలేజీలు, ఉద్దానంలో కట్టిన ఆసుపత్రిని చూపించండి. వాటర్ ప్రాజెక్ట్, నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణం, కురపం కాలేజీ, మూలపేటలో పోర్టు నిర్మాణం, పలు ప్రాజెక్ట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి అవి చూపించండి.
.. అమరావతిలో తాత్కాలిక భవనాల పేరిట వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆనాడు ప్రభుత్వధనం ఏమైంది?. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో అందరికీ తెలుసు. మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకోవాలి. టీడీపీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది. అధికార పార్టీ ఇలాంటివి మానుకోవాలని కోరారు. రుషికొండపై ఉన్నవి ప్రభుత్వ భవనాలు అని టీడీపీ నేతలు గుర్తించాలి’ అంటూ గుడివాడ అమర్నాథ్ వైఎస్సార్సీపీ తరఫున ఎల్లో ముఠాకు కౌంటర్ ఇచ్చారు.