![BRS chief KCR announced that he has formed an alliance with BSP - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2024/03/6/kcr_0.jpg.webp?itok=iaSneLOw)
భావసారూప్య శక్తులను కలుపుకొని పోవాలి
బీఎస్పీతో కలసికట్టుగా పనిచేసి ప్రజాభీష్టాన్ని నెరవేరుద్దాం
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలతో భేటీలో కేసీఆర్
మహబూబ్నగర్ లోక్సభ అభ్యర్థిగా మరోమారు ‘మన్నె’
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆకాంక్షలకు అనుగు ణంగా దీర్ఘకాలిక లక్ష్యంతోనే బీఎస్పీతో పొత్తు కుదుర్చుకున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్లో మంగళవారం జరిగిన మహబూబ్నగర్, నాగర్కర్నూలు లోక్సభ నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలతో ఉమ్మడి భేటీలో కేసీఆర్ మాట్లా డారు. బీఎస్పీతో పొత్తుకు సంబంధించి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్తో జరిగిన చర్చలు, తీసుకున్న నిర్ణయాలను వివరించారు.
శక్తులను కూడదీసుకోవాలి
‘ప్రస్తుత పరిస్థితుల్లో మనం మన శక్తులను కూడదీసుకోవడంతోపాటు కలసి వచ్చే భావసా రూప్య శక్తులను కలుపుకొని పోవాలి. ఆ దిశగా మనం తీసుకున్న నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రయోజనాలను కాపాడే దీర్ఘకాలిక లక్ష్యంతో కూడుకొని ఉంది. లౌకికవాద తాత్వికతతో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిన కృషి దేశానికే ఆదర్శంగా నిలిచింది.
ఈ నేపథ్యంలో దళిత బహుజన శక్తులతో కలసి పనిచేయడం ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మరింత చేరువవుతాం. బీఎస్పీ కలసికట్టుగా పనిచేసి ప్రజాభీష్టాలను సంపూర్ణంగా నెరవేరుద్దాం. ఈ దిశగా మరిన్ని చర్చలు జరిపి రాబోయే లోక్సభ ఎన్నికల్లో పొత్తుల విధివిధానాలను ఖరారు చేస్తాం’ అని కేసీఆర్ ప్రకటించారు. ఈ ప్రకటనను హర్షధ్వానాల నడుమ ముక్తకంఠంతో పార్టీ నేతలు ఏకీభవించారు.
లోక్సభ ఎన్నికల్లో ప్రజాదరణ పొందుదాం
‘ఉద్యమ కాలం నుంచి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే బీఆర్ఎస్ పనిచేస్తోంది. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ లోక్సభ ఎన్నికల్లో ప్రజాదరణ పొందుదాం. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో నిలిచిన పెండింగ్ ప్రాజెక్టుల తోపాటు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాం.
బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన ఎత్తిపోతల పథకం ద్వారానే కొడంగల్కు పుష్కలంగా సాగునీటిని తరలించవచ్చు. అయినా ఉన్నదాన్ని తీసేసి కొడంగల్కు లిఫ్ట్ను ఏర్పాటు చేయాలను కోవడం సరైన నిర్ణయం కాదు’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పార్టీని వీడే వారి గురించి ఆలోచించకుండా ప్రజా సమస్యలపై పోరాడదా మని పిలుపునిచ్చారు.
డొల్లతనంతో కాంగ్రెస్ సర్కార్ అభాసుపాలు
‘ఓట్లేసి గెలిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం తాగు, సాగునీరు, విద్యుత్ వంటి కనీస అవసరాలను తీర్చలేకపోవడంతో ప్రజలు విస్మయం చెందుతున్నారు. కొత్తగా ఇచ్చే తెలివి లేక గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కూడా కొనసాగించలేక పాలనలోని డొల్లతనాన్ని స్వయంగా కాంగ్రెస్ సర్కార్ బయటపెట్టుకొని అభాసుపాలవు తోంది.
ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు కాకముందే ప్రజావ్యతిరేకతను మూటకట్టు కుంది. అధికారం కోసం ఎన్నికల ముందు గ్యారంటీల పేరిట అలవికాని హామీలు ఇచ్చింది. ఇప్పుడు అమలు చేతకాక అబద్ధాలకు, బెదిరింపులకు దిగి తప్పించుకుంటోంది’ అని కేసీఆర్ మండిపడ్డారు.
మహబూబ్నగర్ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్రెడ్డి
మహబూబ్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేశారు. ఆయన గెలుపు కోసం అను సరించాల్సిన కార్యాచరణౖపై నేతలకు దిశాని ర్దేశం చేశారు. తక్షణమే మండలాలవారీగా ఎన్నికల సన్నాహక సమావేశాల ఏర్పాటుకు షెడ్యూల్ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు ఉంటాయని, త్వరలో మహబూ బ్నగర్ పట్టణంలో భారీ బహిరంగ సభ ఉంటుందని కేసీఆర్ ప్రకటించారు. మరోవైపు బీఎస్పీతో పొత్తు నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు నుంచి పోటీ చేస్తారనే అంశాన్ని కేసీఆర్ సూత్రప్రాయంగా వెల్లడించారు.
కాగా, ఉచిత ఎల్ఆర్ఎస్ బుధ, గురువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునివ్వడం, శుక్ర వారం శివరాత్రి పర్వదినం కావడంతో ఉమ్మడి జిల్లాలవారీగా నిర్వహిస్తున్న భేటీలకు బీఆర్ ఎస్ 3 రోజుల బ్రేక్ ఇచ్చింది. ఈ నెల 9 నుంచి ఉమ్మడి జిల్లాలవారీగా కేసీఆర్తో భేటీలు తిరిగి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment