● సారిసామగ్రి ఇచ్చేందుకు వెళ్తుండగా
రోడ్డుప్రమాదం
● సంఘటన స్థలంలోనే మహిళ మృతి
● మరో పదకొండు మందికి తీవ్రగాయాలు
పెళ్లింట విషాదం
గుమ్మలక్ష్మీపురం/కురుపాం: వివాహానంతరం వధువుకు ఇవ్వాల్సిన సారి సామగ్రి ఇచ్చేందుకు వెళ్తుండగా మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదం పెళ్లివారింట విషాదం నింపింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా..మరో 11 మంది తీవ్రగాయాల పాలయ్యారు. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. కురుపాం మండలంలోని కాకితాడ గ్రామానికి చెందిన పెద్దింటి కాంతారావు, సరోజినిల కుమార్తె లిజితకు కొమరాడ మండలంలోని పూడేసు గ్రామానికి చెందిన యువకుడితో ఇటీవలే వివాహమైంది. వధువుకు సారిసామగ్రి ఇచ్చేందుకు కుటుంబసభ్యులు, బంధువులు గురువారం ట్రక్కర్లు్, ఆటోల్లో బయల్దేరారు. ఈ క్రమంలో అందరికంటే వెనుకగా వధువు సొంతకుటుంబీకులను తీసుకువెళ్తున్న ట్రక్కర్ రస్తాకుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం సమీపంలో అదుపుతప్పి ప్రధానరహదారిలోని కల్వర్టుగోడను బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆ వాహనంలో ఉన్న వధువు మేనత్త కమిడి కమల(55) అక్కడికక్కడే మృతిచెందగా..మృతురాలి తమ్ముడు పెద్దింటి భుజంగరావు, మరదలు సుజాత, మరో మేనకోడలు బి. సుగుణ, మేనకోడలి కుమారుడు చైతన్య, మేనకోడలు సుగుణ భర్త రవితో పాటు ఇతర కుటుంబసభ్యులు గంటా పవన్, లిమ్మ సుమన్, పాలక శశిరేఖ, పి.మారతమ్మ, ఎన్.పుష్పరాజ్లతో పాటు డ్రైవర్ తేజ తీవ్రగాయాలపాయ్యారు. ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించిన ఇతర కుటుంబసభ్యులు క్షతగాత్రులను హుటాహుటిన భద్రగిరి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కమలను పరీక్షించిన వైద్యాధికారి రవికుమార్ ఆమె అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అలాగే తల పుర్రెభాగంలో తీవ్రంగా గాయపడిన నాలుగేళ్ల బాలుడు చైతన్యతో పాటు మారతమ్మ, పుష్పరాజు, తదితరులను మెరుగైన వైద్యం నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఈ సంఘటనపై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కురుపాం ఎస్సై ఎస్.షన్ముఖరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment