ప్ర‌భుత్వాల‌ మార్పుతో 'సెర్ప్' పే స్కేల్ అమ‌లుపై అత‌లాకుతలం! | - | Sakshi
Sakshi News home page

ప్ర‌భుత్వాల‌ మార్పుతో 'సెర్ప్' పే స్కేల్ అమ‌లుపై అత‌లాకుతలం!

Published Sun, Dec 17 2023 10:10 AM | Last Updated on Sun, Dec 17 2023 11:37 AM

- - Sakshi

నిజామాబాద్‌: న్యాయబద్ధమైన తమ హక్కులను సాధించుకోవడానికి ముడుపులు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడిందని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) ఉద్యోగులు వాపోతున్నారు. గత ప్రభుత్వ పెద్దలు, కొందరు ఉన్నతాధికారులు అడిగినంత ఇచ్చినా పే స్కేల్‌ అమలులో సరైన న్యాయం జరుగలేదని ఉద్యోగులు సామాజిక మాధ్యమాలల్ల చర్చించుకుంటున్నారు.

గత ప్రభుత్వం దిగిపోయి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో సెర్ప్‌ ఉద్యోగులు ఇప్పుడు గత ప్రభుత్వ పనితీరును తప్పుపడుతూ గత పది రోజుల నుంచి పే స్కేల్‌ అమలులో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలపై చర్చించుకోవడం గమనార్హం. సెర్ప్‌ సంస్థలో కమ్యునిటీ కో–ఆర్డినేటర్లు, ఏపీఎం, డీపీఎం, ఏపీడీలు అందరూ గతంలో కాంట్రాక్టు పద్ధతిన నియమించిన వారే. రాష్ట్ర వ్యాప్తంగా 3వేల వరకు ఉండగా మన జిల్లాలో 216 మంది ఉన్నారు. పే స్కేల్‌ అమలు చేసినా ఉద్యోగుల క్యాడర్‌ను తగ్గించడంతో తాము ఆశించిన వేతనం లభించడం లేదన్నారు.

సీసీలను జూనియర్‌ అసిస్టెంట్‌, ఏపీఎంలను సీనియర్‌ అసిస్టెంట్‌, డీపీఎంలను సూపరింటెండెంట్‌, ఏపీడీలను ఎంపీడీవో స్థాయి అధికారులుగా గుర్తించారు. క్యాడర్‌ గుర్తింపులో తేడా స్పష్టంగా ఉండటంతో పే స్కేల్‌ వర్తించినా ఆశించిన వేతనం దక్కడం లేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దమొత్తంలో వసూలు చేసిన ఉద్యోగ సంఘం ప్రతినిధులు క్యాడర్‌ గుర్తించడంలో న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంపై వత్తిడి తీసుకురాలేదని ఉద్యోగులు అంటున్నారు. ఏది ఏమైనా గత ప్రభుత్వ హాయంలో చోటు చేసుకున్న పరిణామాలు కొత్త ప్రభుత్వంలో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో వేచి చూడాలి.
ఇవి కూడా చ‌ద‌వండి: సీఎం రేవంత్‌రెడ్డి రెడ్‌డైరీలో బోధన్‌ ఏసీపీ పేరు..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement