Association for Democratic Reforms: ఆస్తుల్లో టాప్‌ జిందాల్‌ | Lok Sabha Election 2024: 39percent candidates in 6th phase LS polls crorepatis says ADR Report | Sakshi
Sakshi News home page

Association for Democratic Reforms: ఆస్తుల్లో టాప్‌ జిందాల్‌

Published Sat, May 18 2024 4:27 AM | Last Updated on Sat, May 18 2024 4:27 AM

Lok Sabha Election 2024: 39percent candidates in 6th phase LS polls crorepatis says ADR Report

రూ.1,241 కోట్లతో మొదటి స్థానం 

21 శాతం మందికి నేరచరిత్ర 

ఆరో దశలో 866 మంది పోటీ 

లోక్‌సభ ఎన్నికల ఆరో విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థులందర్లో బీజేపీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త నవీన్‌ జిందాల్‌ అత్యధిక ఆస్తులతో తొలి స్థానంలో ఉన్నారు. జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ కంపెనీ చైర్మన్‌ అయిన నవీన్‌ హరియాణాలోని కురుక్షేత్ర నుంచి బీజేపీ అభ్యరి్థగా పోటీ చేస్తున్నారు.

 తనకు రూ.1,241 కోట్ల ఆస్తులున్నట్టు అఫిడవిట్లో వెల్లడించారు. మొత్తం 866 మంది అభ్యర్థుల్లో 39 శాతం మంది కోటీశ్వరులే. వీరికి సగటున రూ.6.21 కోట్ల ఆస్తి ఉన్నట్టు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫామ్స్‌ ప్రకటించింది. 

ఆశ్చర్యకరంగా కురుక్షేత్రలో జిందాల్‌పై ఆప్‌ కూడా సంపన్న నేతనే పోటీకి దించింది. ఆ పార్టీ అభ్యర్థి సుశీల్‌కుమార్‌ గుప్తా రూ.169 కోట్ల ఆస్తులతో టాప్‌–3లో ఉన్నారు. ఒడిశాలో కటక్‌ బీజేడీ అభ్యర్థి సంతృప్త్‌ మిశ్రా రూ.482 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. తనవద్ద కేవలం రెండు రూపాయలే ఉన్నట్టు రోహ్‌తక్‌ లోక్‌సభ స్థానంలో స్వతంత్రుడిగా పోటీ చేస్తున్న రణ«దీర్‌ సింగ్‌ పేర్కొన్నారు! 

180 మందిపై క్రిమినల్‌ కేసులు 
ఆరో విడతలో 180 మంది (21 శాతం) అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్టు ఏడీఆర్‌ వెల్లడించింది. వీరిలో 141 మందిపై సీరియస్‌ కేసులున్నాయి. 12 మంది తమను దోషులుగా కోర్టు ప్రకటించినట్టు పేర్కొనగా, పలువురు హత్య కేసుల్లోనూ అభియోగాలు ఎదుర్కొంటున్నట్టు వెల్లడించారు. 21 మందిపై హత్యాయత్నం కేసులున్నాయి. 24 మంది మహిళలకు సంబంధించిన కేసుల్లో నిందితులు. 

ముగ్గురిపై అత్యాచారం కేసులున్నాయి. ఆప్‌ తరఫున పోటీలో ఉన్న ఐదుగురు, ఆర్జేడీ అభ్యర్థులు నలుగురూ క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు. ఎస్పీ అభ్యర్థుల్లో 75 శాతం, బీజేపీ అభ్యర్థుల్లో 55 శాతం మందిపై క్రిమినల్‌ కేసులున్నాయి. ఆర్జేడీకి చెందిన నలుగురూ, ఆప్‌నకు చెందిన నలుగురు (80 శాతం), ఎస్పీ నుంచి 12 మంది (75 శాతం) బీజేడీ నుంచి 18 మంది (35 శాతం)పై సీరియస్‌ క్రిమినల్‌ కేసులున్నాయి. 
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement