Goldy Brar: ఇక ఉగ్రవాదిగా గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్‌ Gangster Goldy Brar declared terrorist by Centre | Sakshi
Sakshi News home page

గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్‌ను టెర్రరిస్టుగా ప్రకటించిన భారత్‌! ఇంతకీ నేపథ్యం ఏంటంటే..

Published Mon, Jan 1 2024 7:28 PM | Last Updated on Mon, Jan 1 2024 7:34 PM

Gangster Goldy Brar declared terrorist by Centre - Sakshi

ఢిల్లీ: ఉగ్రవాద నిర్మూలన, తీవ్రవాద కార్యకలాపాల కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాలో ఆశ్రయం పొందుతున్న గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ మేరకు అతడిని మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో చేరుస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతం కెనడాలో ఉంటున్న గోల్డీ బ్రార్‌కు నిషేధిత ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌తో సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. గోల్డీ బ్రార్‌కు ఉగ్రవాద సంస్థలతోపాటు పలు హత్యలతో సంబంధం ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది.  చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), 1967 ప్రకారం గోల్డీ బ్రార్‌ను ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్లు హోంశాఖ తెలిపింది.  


దేశంలోని పలువురు ప్రముఖులను హత్య చేసేందుకు కొన్ని హంతక ముఠాలకు డ్రోన్ల ద్వారా అక్రమంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను రవాణా చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. తన అనుచరులతో పంజాబ్‌ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించాలని గోల్డీ బ్రార్‌ ప్రయత్నిస్తున్నట్లు కేంద్రం భావిస్తోంది. అతడిపై ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేసినట్లు కేంద్రం ఈ సందర్భంగా తెలిపింది.

గోల్డీ బ్రార్‌ నేపథ్యం..
సతీందర్‌ సింగ్‌ అలియాస్‌ గోల్డీ బ్రార్‌ పంజాబ్‌లోని శ్రీ ముక్త్సార్‌ సాహిబ్‌లో 1994లో జన్మించాడు. ఇతడి తండ్రి పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌. తొలిసారిగా సిద్ధూ మూసేవాలా హత్య కేసు దర్యాప్తులో ఇతడి పేరు వెలుగులోకి వచ్చింది. మూసేవాలా హత్య కేసులో అరెస్టయిన లారెన్స్‌ బిష్ణోయ్‌తో ఇతడికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ హత్య గురించి గోల్డీ బ్రార్‌కు ముందే తెలుసని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement