-
వేగంగా, క్షేమంగా పట్టాలెక్కితేనే...
ఈ నెలలో పశ్చిమ బెంగాల్లో జరిగిన రైలు ప్రమాదం రైల్వేల పనితీరును మరోసారి వార్తల్లోకి తెచ్చింది. కాగ్ నివేదిక ప్రకారం, రైళ్లలో అత్యంత ప్రమాదాలకు కారణం అవుతున్నవి సిగ్నల్ వైఫల్యాలు, పట్టాల్లో బీటలు. భద్రతా ప్రమాణాలకు తోడు, నత్తనడక వేగం వల్ల రైల్వేలు తమ మార్కెట్ వాటాను కోల్పోయాయి. మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్ల సగటు వేగం గంటకు 50 – 51 కిలోమీటర్ల మధ్యనే ఉండిపోయిందనీ, ‘మిషర్ రఫ్తార్’ ద్వారా సగటు వేగం 75 కిలోమీటర్లకు పెరిగిందన్నది ప్రచారమేననీ తేలింది. వందే భారత్ రైళ్లు వేగం కంటే హంగులకే ప్రసిద్ధి చెందాయి. 140 కోట్ల జనాభా కలిగిన దేశంలో రైల్వే వ్యవస్థ అన్ని విధాలుగా పటిష్టంగా ఉన్నప్పుడే ప్రజల అవసరాలు తీరుతాయి.భారతీయ రైల్వే మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ నెల 16న పశ్చిమ బెంగాల్లోని సిలిగురి వద్ద ఓ గూడ్సు బండి, ప్యాసెంజర్ రైలును ఢీకొట్టడంతో తొమ్మిది మంది మరణించగా, సుమారు 40 మంది గాయపడ్డారు. 1995 నుంచి తీసుకుంటే దేశంలో కనీసం ఏడు భయంకరమైన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వీటిల్లో ఐదింటిలో 200కు పైగా ప్రాణాలు పోయాయి. ఇంకోదాంట్లో 358 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ వద్ద 1995లో జరిగింది. ఏడాది క్రితం ఒడిశాలోని బాలాసోర్ వద్ద పలు రైళ్లు ఢీకొనడంతో 287 మంది చనిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ ఏడు ప్రమాదాల్లోనే విలువైన 1,600 ప్రాణాలు గాల్లో కలిసిపోవడం గమనార్హం. 140 కోట్ల జనాభా కలిగిన మనలాంటి దేశంలో రైల్వే వ్యవస్థ పటిష్టంగా ఉండాలనీ, రోడ్డు, వాయు మార్గాలతో పోటీపడేలా ఉన్నప్పుడే ప్రజల అవసరాలు తీర్చగలమనీ రైల్వే ప్లానర్స్ చెబుతారు. రైల్వే బోర్డు లేదా కేంద్ర ప్రభుత్వం రెండూ ఈ ప్రాథమ్యాన్ని కాదని అనలేదు. రైల్వే వేగం రెట్టింపు చేస్తామనీ, మరిన్ని రైల్వే లైన్లతోపాటు భద్రతను కూడా పెంచుతామనీ కేంద్రం తరచూ ప్రకటనలు చేస్తూనే ఉంటుంది. ప్రధానమైన రైల్వే రూట్లలో రద్దీ విపరీతమైన నేపథ్యంలో ఇది అవసరం కూడా. కాకపోతే ఈ మాటలు ఇప్పటివరకూ మాటలకే పరిమితం కావడం గమనార్హం. గూడ్స్, ప్యాసెంజర్ రవాణా రెండింటిలోనూ రైల్వేలు తమ మార్కెట్ వాటాను ఎప్పుడో కోల్పోయాయి. 2010–12 మధ్యకాలంలో ఈ రెండింటిలో వృద్ధి స్తంభించిపోయింది. రోడ్డు, వాయు మార్గాల వాటా ఏటా 6 నుంచి 12 శాతం వరకూ పెరిగాయి. 2014–15 నుంచి 2019 – 20 మధ్యలో ప్రయాణికుల సంఖ్య కిలోమీటర్కు 99,500 కోట్ల నుంచి కిలోమీటర్కు 91,400 కోట్లకు పడిపోవడం గమనార్హం. అదే గూడ్స్ రవాణా విషయానికి వస్తే, అది కిలోమీటర్కు 68,200 – 73,900 టన్నుల మధ్యే నిలిచిపోయింది. 2019–20 నుంచి ఇప్పటి వరకూ ఉన్న కాలంలో ప్యాసెంజర్, గూడ్స్ రవాణా గణాంకాలను రైల్వే శాఖ వెల్లడించలేదు.దేశంలో రవాణాలో రైల్వేది గుత్తాధిపత్యం అనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అయితే ప్రస్తుతం అది తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మార్కెట్ వాటా తగ్గుదల ఇప్పటిమాదిరే ఇంకో పదేళ్లు కొనసాగితే రైల్వేలు రెండో తరగతి రవాణా వ్యవస్థలుగా మారిపోతాయి. రైల్వే లైన్లు, వేగం, భద్రతా ప్రమాణాలు పెరగకపోవడాన్ని బట్టి చూస్తే భారతీయ రైల్వే ప్రస్థానం ఈ దిశగానే సాగుతోందని అనాలి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి విశాలమైన, జనాభా తక్కువ ఉన్న దేశాల్లో రైల్వేలు ఇప్పుడు ఇదే దశలో ఉన్నాయి. అయితే భారతదేశంలోని జనాభా సాంద్రత, ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న వైనాలను దృష్టిలో పెట్టుకుంటే రైల్వేల తిరోగమనం మంచిది కాదు.రైళ్లలో భద్రత అంశాన్ని విస్తృత దృష్టికోణంతో చూడాల్సి ఉంటుంది. గత రెండు దశాబ్దాల్లో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే రైల్వే బోర్డు ఒక దిశ, దిక్కూ లేకుండా పని చేస్తోంది. అకస్మాత్తుగా విధానాల మార్పులు జరిగిపోతుండటంతో విస్తరణ, వృద్ధికి సంబంధించిన భవిష్యత్తు ప్రణాళికలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. నత్తనడకన నడుస్తున్న రైళ్లను మరింత వేగంగా పరుగెత్తించడంలో బోర్డు ఘోరంగా విఫలమైంది. రైళ్ల రాకపోకలు దైవాధీనమన్న పరిస్థితి ఇప్పటికీ మారలేదు. భద్రతపై ఆందోళనలూ పెరిగిపోతున్నాయి. రైల్వేల భద్రత, వేగం, సమయపాలన విషయాల్లో భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇటీవలే రెండు ముఖ్యమైన నివేదికలు సమర్పించారు. 2014–19 మధ్యలో మెయిల్, ఎక్స్ప్రెస్ రైల్వేల సగటు వేగంలో పెద్దగా మార్పుల్లేవనీ, గంటకు 50 – 51 కిలోమీటర్ల మధ్యనే ఉండిపోయిందనీ స్పష్టం చేసింది. ‘మిషర్ రఫ్తార్’ ద్వారా సగటు వేగం గంటకు 75 కిలోమీటర్లకు పెరిగిందన్న ప్రచారం వట్టిదేనని తేల్చింది. సరుకు రవాణా రైళ్ల విషయంలో రైల్వే బోర్డు చెప్పుకొంటున్నట్లుగా వేగం రెట్టింపు కాకపోగా, సగటు వేగం కొంత తగ్గినట్లు ఈ నివేదిక తెలిపింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, రైళ్లను గంటకు 110–130 కి.మీ. వేగం నుంచి, గంటకు 160 – 200 కి.మీ. వేగంతో పరుగెత్తించేందుకు కావాల్సిన టెక్నాలజీ, కోచుల తయారీ సామర్థ్యాలను భారత్ 20 ఏళ్ల క్రితమే సముపార్జించుకోవడం! కాగ్ విడుదల చేసిన రెండో నివేదిక ప్రమాదాలకు సంబంధించినది. ప్రమాదాల సంఖ్యలో కొంత తగ్గుదల ఉంది. మనుషుల కావలి లేని గేట్ల దగ్గర మనుషులను పెట్టడం దీనికి ముఖ్య కారణం. కానీ పట్టాలు తప్పిపోవడం, ఢీకొనడం వంటి వాటి విషయంలో పెద్దగా పురోగతి లేదు. సిగ్నల్ వైఫల్యాలు, రైల్ ఫ్రాక్చర్లు(పట్టాల్లో బీటలు) పెరిగిపోతూండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. భారతీయ రైల్వేల్లో అత్యంత భారీ ప్రమాదాలు ఈ రెండు కారణాలతోనే జరగడం గమనార్హం. బాలాసోర్లో గత ఏడాది సంభవించిన ప్రమాదానికి సిగ్నల్ వైఫల్యం కారణమన్నది తెలిసిన విషయమే. మొత్తమ్మీద కాగ్ నివేదికలు రెండింటి సారాంశం చూస్తే రైల్వేల్లోని వ్యవస్థల వైఫల్యానికి వేగం, సామర్థ్యం పెంపు వంటివి తోడయ్యాయి. ఫలితంగా భద్రత అంతంత మాత్రంగా మారిపోయింది. సమయపాలన అసాధ్యంగా మారింది. భారతీయ రైల్వేల్లో ప్రస్తుత నెట్వర్క్ తిరోగమన దిశలో ఉంటే... ఏటికేడాదీ భారీ ప్రాజెక్టుల ప్రకటన కొనసాగుతూనే ఉంది. వీటి ఆర్థిక వెసలుబాటు గురించి ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. ప్రధాన బ్రాడ్గేజ్ లైన్తో అనుసంధానం కాకుండా ఉండే ‘స్టాండ్ అలోన్ బుల్లెట్ ట్రైన్లు’ వీటిల్లో ఒకటి. ఈ లైన్లు అన్నీ స్టాండర్డ్ గేజ్పై నిర్మించినవి. అలాగే సరుకు రవాణాకు ఉద్దేశించిన కారిడార్ పొడవాటి, బరువైన రైళ్ల కోసం సిద్ధం చేసినది. దేశంలో తొలి బుల్లెట్ రైలు నిర్మాణం 2017లో మొదలైంది. 2012లోనే సరుకు రవాణాకు ప్రత్యేకమైన కారిడార్ల నిర్మాణం మొదలైంది. ఇదిలా ఉంటే... గత మూడేళ్లలోనే దేశంలో సుమారు 50 జతల ‘సెమీ హై స్పీడ్’ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టారు. ఇవి వేగం కంటే వాటి హంగులకే ఎక్కువ ప్రసిద్ధి చెందాయి. ఒక్క విషయమైతే స్పష్టం. రైల్వే బోర్డు తన ప్రాథమ్యాలను సమగ్రంగా సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మరి కొత్త ప్రభుత్వం ఈ అంశాన్ని తలకెత్తుకుంటుందా అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకం.అలోక్ కుమార్ వర్మ వ్యాసకర్త రైల్వే విశ్రాంత చీఫ్ ఇంజినీర్ -
నిజ్జర్కు కెనడా నివాళి.. స్పందించిన భారత ప్రభుత్వం
న్యూఢిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్కు కెనడా పార్లమెంట్ సంతాపం ప్రకటించడంపై భారత ప్రభుత్వం శుక్రవారం(జూన్ 21) స్పందించింది. వేర్పాటువాదం, హింసను సమర్థించే చర్యలను వ్యతిరేకిస్తామని తెలిపింది. గతేడాది జూన్లో కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా బయట నిజ్జర్ను కొందరు దుండగులు కాల్చి చంపారు.ఈ ఘటన వెనుక భారత ‘రా’ ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య దౌత్య విభేదాలు ఏర్పడ్డాయి. ట్రూడో ఆరోపణలను అప్పట్లో భారత్ ఖండించింది. హత్యకు గురై ఏడాది పూర్తయిన సందర్భంగా కెనడా ప్రభుత్వం ఆ దేశ పార్లమెంట్లో ఇటీవల నిజ్జర్కు నివాళులర్పించడం గమనార్హం. ఓ దేశం ఉగ్రవాదిగా ప్రకటించడమే కాకుండా ఇంటర్పోల్ వాంటెడ్ జాబితాలో ఉన్న వ్యక్తి మృతికి దేశ పార్లమెంట్లో అంజలి ఘటించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారంటూ సోషల్మీడియాలో నెటిజన్లు మండిపడ్డారు. మరోవైపు వాంకోవర్లోని భారత రాయబార కార్యాలయం దీనికి తగిన కౌంటర్ కూడా ఇచ్చింది.ఎయిర్ ఇండియాా కనిష్క విమానాన్ని గాల్లో పేల్చివేసి ఈ జూన్ 23కు 39 సంవత్సరాలు పూర్తవుతుంది. ఖలిస్తానీ తీవ్రవాదులు పెట్టిన బాంబుకు ఆ విమానం ముక్కలు కావడంతో 329 మంది మృతి చెందారు. ఆ రోజున వాంకోవర్లో ఉన్న ఎయిర్ ఇండియా మెమోరియల్ వద్ద సంతాప కార్యక్రమం నిర్వహించనున్నట్టు భారత రాయబార కార్యాలయం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
విత్తనాలకు.. సుస్థిర విధానం అవసరం!
మన దేశంలో వరిలో దాదాపు 3 లక్షల దేశీ రకం విత్తనాలు ఉండేవని వ్యవసాయ చరిత్ర చెబుతున్నది. అనేక పంటలకు వివిధ రకాల విత్తనాలను వృద్ధి చేసుకున్న ఘనత భారత సాంప్రదాయ వ్యవసాయానిది. హరిత విప్లవం ఒక విధానంగా వచ్చిన గత 60 ఏళ్లలో అనేక రకాల హైబ్రిడ్ విత్తనాలను ప్రవేశపెట్టారు. ఏకపంట పద్ధతికి ప్రోత్సాహం రావడంతో, పంటల వైవిధ్యం తగ్గింది. రసాయనాలు వాడి తయారు చేసిన విత్తనాలు రసాయన వ్యవసాయంలోనే పని చేస్తాయి. కొన్ని కంపెనీల ఆధిపత్యంలో మార్కెట్లు ఉండటం వ్యవసాయ సుస్థిరతకు శ్రేయస్కరం కాదు. రైతులకు విత్తనాల మీద స్వావలంబన కొనసాగించే వ్యవస్థ అవసరం. ప్రభుత్వాలు సుస్థిర, గుత్తాధిపత్య రహిత విత్తన వ్యవస్థకు ప్రోత్సాహం అందించే విధానాలు రూపొందించాలి.ఆహార ఉత్పత్తి మొదలయ్యేది విత్తనాల నుంచే. దాదాపు ప్రతి పంటకు అనేక రకాల విత్తనాలు ఉన్నాయి. స్థానికంగా లభ్యమయ్యే ప్రత్యేక పర్యావరణ, వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి పంటలో రైతులు వందల ఏండ్లుగా విత్తనాలను రూపొందిస్తున్నారు. మన దేశంలో వరిలో దాదాపు 3 లక్షల దేశీ రకం విత్తనాలు ఉండేవని వ్యవసాయ చరిత్ర చెబుతున్నది. వంకాయలో 3 వేలతో సహా అనేక పంటలకు వివిధ రకాల విత్తనాలను వందల యేండ్ల నుంచి వృద్ధి చేసుకున్న ఘనత భారత సాంప్రదాయ వ్యవసాయానిది. దేశవ్యాప్తంగా విత్తనాల చుట్టూ అనేక సంప్రదాయాలు, పండుగలు, గ్రామీణ కార్యక్రమాలు ఉండేవి. గ్రామీణులు, రైతులు, ప్రత్యేకంగా మహిళలు విత్తనాలను గుర్తించటంలో, దాచటంలో, శుద్ధి చేయడంలో గణనీయ జ్ఞానం, కౌశల్యం సంపాదించారు. 35,000 సంవత్సరాలకు పైగా, తరతరాలుగా రైతాంగం పరిశోధనల ఫలితంగా అనేక రకాల విత్తనాలు వృద్ధి అయినాయి. ఈ జానపద విత్తన రకాలు మానవాళికి సుమారు 2,500 పంటలు, 14 పశువుల రకాలకు సంబంధించి ఆశ్చర్యపరిచే స్థాయిలో 11.4 లక్షల రకాల పంటలు, 8,800 పశువుల జాతులను అందించాయి.హరిత విప్లవం ఒక విధానంగా వచ్చిన గత 60 ఏళ్లలో అనేక రకాల హైబ్రిడ్ విత్తనాలు, ప్రధానంగా వరి, గోధుమలు, మక్కల(మొక్కజొన్న)లో ప్రవేశపెట్టారు. 1968–2019 మధ్య వివిధ సంస్థల ద్వారా 1200 వరి హైబ్రిడ్లు ప్రవేశ పెట్టింది ప్రభుత్వం. ఏకపంట పద్ధతికి ప్రోత్సాహం రావడంతో, పంటల వైవిధ్యం క్రమంగా తగ్గుతూ వచ్చి, ప్రమాదకర స్థాయికి చేరింది. హైబ్రిడ్ విత్తనాలను ప్రతి 3, 4 ఏళ్లకు మార్చాల్సి వస్తుంది. ఆధునిక వ్యవసాయం ల్యాబ్ విత్తనాలను ప్రవేశపెట్టి, సంప్రదాయ విత్తనాలను కనుమరుగు చేస్తున్నది. విత్తనాలు కంపెనీల గుప్పిట్లోకి పోయాయి. విత్తనాలు పోయినాయి అంటే మొత్తం ఆహార వ్యవస్థ ఈ కంపెనీల చేతులలోకి వెళ్లిపోవచ్చు. అట్లని కంపెనీల అధీనంలో, ఒక గొప్ప విత్తన వ్యవస్థ వచ్చిందా అంటే అదీ లేదు. రసాయనాలు వాడి తయారు చేసిన విత్తనాలు రసాయన వ్యవసాయంలోనే పని చేస్తాయి. సహజంగా విత్తనాలలో సహజీవన సూక్ష్మజీవులు ఉంటాయి. రసాయన చర్యకు లోనైన ఆధునిక విత్తనాలలో ఈ సూక్ష్మ జీవులు ఉండవు. జీవ ప్రక్రియలో ముఖ్య ఘట్టం విత్తనాలు. ఆ విత్తనాలు విషానికి, విష వ్యాపార సంస్కృతికి బలవుతున్నాయి. ప్రైవేటు కంపెనీల విత్తన వ్యాపారం మన దేశంలో 2002 నుంచి పుంజుకుని, ప్రతి యేడు పెరుగుతున్నది. దాదాపు రూ.25 వేల కోట్ల వార్షిక టర్నోవర్కు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా 75 శాతం విత్తన వ్యాపారం కేవలం మూడు బహుళజాతి కంపెనీల గుత్తాధిపత్యంలో ఉన్నది. అమెరికాలోనే పారిశ్రామిక వ్యవసాయానికి అనుగుణమైన విత్తన వ్యవస్థ పుట్టుకొచ్చింది.అమెరికా ప్రభుత్వం ఎల్లప్పుడూ ఈ కంపెనీలకు మద్దతుగా తన వాణిజ్య, విదేశాంగ విధానం అమలు చేస్తుంది. మార్కెట్లో పోటీ తగ్గి కొన్ని కంపెనీల ఆధిపత్యంలో మార్కెట్లు ఉండడం వ్యవసాయ సుస్థిరతకు శ్రేయస్కరం కాదు. బీటీ పత్తి మినహా వేరే రకం పత్తి మార్కెట్లో లేకుండా ఈ ప్రైవేటు కంపెనీలు సిండికేట్ అయినాయి. ప్రభుత్వ సంస్థలలో విత్తన పరిశోధనలు జరగకుండా ప్రైవేటు విత్తన వ్యాపారం అడ్డు పడుతున్నది.అధిక దిగుబడి వంగడాలు, హైబ్రిడ్ విత్తనాలు ప్రవేశపెట్టిన నేపథ్యంలో 1968లో కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టం తెచ్చింది. ఈ చట్టం ప్రాథమిక లక్ష్యం అప్పట్లో ప్రభుత్వ పరిశోధన సంస్థలు విత్తనాలను విడుదల చేసే పద్ధతిని నిర్దేశించిడం. తరువాత 2002లో ప్రైవేట్ కంపెనీలకు విత్తనాలను ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చినాక విత్తన చట్టం సవరించాలని భావించారు. 2003 నుంచి కొత్త విత్తన చట్టాన్ని రైతాంగం కోరుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం చేయలేదు. కంపెనీలకు అనుకూల ముసాయిదాలతో 20 యేండ్ల కాలం దాటింది. కొన్ని రాష్ట్రాలు తమ పరిధిలో చట్టం తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్నది. వ్యవసాయానికి విత్తన ఆవశ్యకత ఉన్నందున విత్తనాలను నిత్యావసర చట్టంలో చేర్చిన ప్రభుత్వం ప్రైవేటు విత్తన కంపెనీలకు ఆదాయ పన్ను చట్టం నుంచి మినహాయింపు ఇచ్చింది. విత్తన ధరల మీద నియంత్రణ లేదు. ఉత్తుత్తగా ప్రతి సంవత్సరం పత్తి విత్తనాల ధర నిర్ణయిస్తారు. కొరత ఉందని రైతులను భయపెట్టి బ్లాకు మార్కెట్లో ధరను పదింతలు పెంచుతారు. రైతు మీద భారం మోపుతారు. ఎవరైనా రైతు సొంతంగా విత్తనాలు చేసి అమ్మితే వారి మీద 420 కేసులు పెట్టే శాసన వ్యవస్థ, నాణ్యత లేని విత్తనాల వల్ల వేల ఎకరాల పంట నష్టపోయినా ఆయా కంపెనీలకు తాఖీదులు కూడా ఇచ్చే ధైర్యం చేయలేదు.జన్యుమార్పిడి విత్తనాల వల్ల శ్రేష్ఠమైన సంప్రదాయ విత్తనాలు కనుమరుగు అవుతుంటే, కలుషితం అవుతుంటే పట్టించుకుని సంరక్షించే విత్తన సంస్థ లేకపోవడం దురదృష్టకరం. ప్రత్తి విత్తనాలలో శ్రేష్ఠమైన, దేశీ విత్తనాలు ఇప్పుడు దొరికే పరిస్థితి లేదు. అనేక పంటలలోనూ ఇదే పరిస్థితి. పసుపు, చెరుకు, గోధుమలు, జొన్నలు, కూరగాయలు, మక్కలలో దేశీ రకాలు కనుమరుగు అవుతున్నాయి. ప్రైవేటు కంపెనీలు అమ్ముతున్న కంకర లాంటి మక్క గింజల పంటను ఫ్యాక్టరీకి పంపించి, ప్రాసెస్ చేసి, పశువుల, కోళ్ళ దాణాగా మాత్రమే ఉపయోగించేందుకు వృద్ధి చేశారు. ఇప్పటి మక్క కంకులు నేరుగా ఇళ్లల్లో కాల్చుకుని, ఉడకపెట్టుకుని, ఒలుచుకుని తినే విధంగా లేవు. అటువంటి మక్క గింజలనే పక్కాగా వాడమనీ, తమ కంపెనీల దగ్గర కొనుక్కోమనీ వివిధ దేశాల మీద ఒత్తిడి తేవడం అమెరికా పని. ఇటీవల అటువంటి జన్యుమార్పిడి మక్కలు మాకు వద్దని మెక్సికో ప్రభుత్వం అమెరికా నుంచి మక్కల దిగుమతిని ఆపేసింది. ముక్కలకు మక్కాగా ప్రసిద్ధి చెందిన మెక్సికో తమ గింజలను, తమ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి అమెరికాను ధిక్కరించింది. వరి గింజలకు, వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన మన దేశం మాత్రం విత్తన వైవిధ్యాన్ని కాపాడుకునేందుకు ఒక్కడుగు కూడా వేయడం లేదు. రైతులే కేంద్రంగా విత్తన వ్యవస్థను పునరుద్ధరించే పనిని అనేక స్వచ్చంద సంస్థలు దేశ వ్యాప్తంగా చేస్తున్నాయి. సహకార విత్తన బ్యాంకులను (కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్) ఏర్పాటు చేసి రైతులు, ప్రత్యేకంగా మహిళలను ప్రోత్సహిస్తున్నాయి. గత పదేళ్ళలో వరిలో, గోధుమలలో, చిరు ధాన్యాలలో, వివిధ కూరగాయలు, పండ్లలో తిరిగి దేశీ విత్తనాలను ఉపయోగించే వాతావరణం కల్పించటంలో అనేక సంస్థలు, వ్యక్తుల కృషి ఉన్నది. మన దేశంలో ఈ రెండు వ్యవస్థల (రైతు కేంద్రీకృత విత్తన వ్యవస్థ, లాభాపేక్షతో కొన్ని జన్యుమార్పిడి విత్తనాలను గుప్పిట్లో పెట్టుకున్న ప్రైవేటు వ్యవస్థ) మధ్య కనపడని సంఘర్షణ ఏర్పడింది. కానీ ప్రభుత్వాలు మాత్రం ప్రైవేటు విత్తన వ్యవస్థ వైపు మొగ్గు చూపుతూ, సబ్సిడీలు అందిస్తూ గుత్తాధిపత్యానికి ఊతం అందిస్తున్నాయి. రైతులకు విత్తనాల మీద స్వావలంబన కొనసాగించే వ్యవస్థ అవసరం. వ్యవసాయం లాభసాటిగా ఉండాలన్నా, రసాయన రహిత పౌష్టిక ఆహారం అందాలన్నా, అందరికి కూడు, బట్ట అందాలన్నా విత్తన వ్యవస్థ లాభాపేక్ష లేని వ్యవస్థగా రూపుదిద్దాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుస్థిర, గుత్తాధిపత్య రహిత విత్తన వ్యవస్థకు ప్రోత్సాహం అందించే విధానాలు రూపొందించాలి. గాలి, నేల, నీరు వంటివి సహజ పర్యావరణ వనరులు. విత్తనాలు కూడా సహజ వనరు. ఏ ఒక్కరి సొంతమో కారాదు. డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
ఇక... జమ్మూ వంతు!
జమ్మూలో వరుస తీవ్రవాద దాడులు కలవరం సృష్టించగా, ఎట్టకేలకు సర్కార్ రంగంలోకి దిగింది. కేంద్ర హోమ్ మంత్రి సారథ్యంలో ఆదివారం ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అందులో తొలి అడుగు. పాక్ నుంచి తీవ్రవాదుల చొరబాటు యత్నాలను నిర్వీర్యం చేసేందుకు భద్రతా దళాల సంఖ్యను పెంచడం సరైన దిశలో సరైన చర్యగా చెప్పుకోవాలి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రాజౌరీ, పూంచ్ , రియాసీ, కఠువా, ఉధమ్పూర్, దోడా జిల్లాలు ఆరింటిలో ఆరు ప్రధాన తీవ్రవాద దాడులు జరిగాయి. సైనిక వర్గాల కథనం ప్రకారం విదేశీ తీవ్రవాదులు నలుగురైదుగురు చొప్పున బృందాలుగా ఏర్పడుతున్నారట. అలాంటి బృందాలు కనీసం అయిదు పీర్ పంజల్, చీనాబ్ ప్రాంతాల్లో పని చేస్తున్నాయి. జమ్మూలోని ఈ కొత్త తరహా తీవ్రవాద ధోరణి కశ్మీర్కూ వ్యాపించే ప్రమాదం పొంచివుంది. అందుకే, జమ్మూ కశ్మీర్పై స్వయంగా ప్రధాని గత వారం సమీక్షా సమావేశం నిర్వహిస్తే, తర్వాత మూడు రోజులకే హోమ్ మంత్రి సైతం సమీక్ష చేశారు. పరిస్థితి తీవ్రతకు ఇది దర్పణం. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతున్న సమయంలోనే తాజా దాడులు యాదృచ్ఛికం అనుకోలేం. జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు సజావుగా లేవనీ, 370వ అధికరణం రద్దు తర్వాత శాంతి నెలకొనలేదనీ వీలైనప్పుడల్లా ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు పని చేస్తూనే ఉన్నారు. తాజా తీవ్రవాద దాడులు అందులో భాగమే. ఇటీవల కొన్నేళ్ళుగా కశ్మీరీ తీవ్రవాదులు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలను అనుసరిస్తున్నారు. 2022లో నిర్దేశిత వ్యక్తులే లక్ష్యంగా హత్యలు చేసే పద్ధతిని అనుసరిస్తే, గత ఏడాది నుంచి సాంప్రదాయిక విన్యాసాలు సాగిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల పైచిలుకుగా ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో అలజడులు సృష్టించసాగారు. గతంలో కశ్మీర్ ప్రాంతంపై పంజా విసిరిన ముష్కర మూకలు ఇప్పుడు ప్రశాంతమైన జమ్ము ప్రాంతంపై గురి పెట్టాయి. దాంతో, భద్రతా దళాలు తమ వ్యూహాలను మార్చుకోక తప్పని పరిస్థితి. గతాన్ని సింహావలోకనం చేసుకుంటే, కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన 370వ అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత దృష్టి అంతా కశ్మీర్పై నిలిచింది. అప్పటికి పదిహేనేళ్ళుగా జమ్మూలోని అధిక భాగంలో నిస్సైనికీకరణ సాగింది. ప్రశాంతత నెలకొంది. ఫలితంగా, విదేశీ తీవ్రవాదులు ఈసారి జమ్మూని తమకు వాటంగా చేసుకున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రధానంగా అడవులు ఈ విదేశీ చొరబాటుదారులకు కలిసొచ్చాయి. రాజౌరీ, పూంచ్∙జిల్లాల్లోని దట్టమైన అడవులు, సంక్లిష్టమైన కొండలు తీవ్రవాదుల కొత్త కేంద్రాలయ్యాయి. అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకొని, గుహల్లో దాక్కొని వారు తమ ఉనికి, బలం పెంచుకున్నారు. తాజాగా నాలుగు రోజుల్లో నాలుగు చోట్ల దాడులు జరగడం, అందులోనూ రియాసీ జిల్లాలో జూన్ 9న యాత్రికుల బస్సుపై అమానుష దాడితో ఒక్కసారిగా దేశమంతా ఉలిక్కిపడింది. ప్రభుత్వం హడావిడిగా క్షేత్రస్థాయి పరిస్థితులపై మళ్ళీ దృష్టి పెట్టింది. 2021 జనవరి నుంచే వాస్తవాధీన రేఖ వెంట జమ్మూలోకి చొరబడడానికి విదేశీ తీవ్రవాద బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అప్పట్లో జమ్మూలోని అఖ్నూర్లో మన సైన్యం ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టి, ముగ్గురిని హతమార్చింది. అదే ఏడాది జూన్లో భారత వైమానిక దళ స్థావరంపై డ్రోన్ దాడి ఘటనల నుంచి జమ్మూ ప్రాంత సరిహద్దు జిల్లాల్లో తీవ్రవాద కార్యకలపాలు పెరిగాయి. 2021 నుంచి ఇప్పటి వరకు ఒక్క జమ్మూ ప్రాంతంలోనే 29 తీవ్రవాద హింసాత్మక ఘటనలు జరిగాయి. జమ్మూ కశ్మీర్లో దాదాపు 100 మందికి పైగా తీవ్రవాదులు క్రియాశీలంగా ఉన్నారట. వారిలో తీవ్రవాద బాట పట్టిన స్థానికుల కన్నా విదేశీ తీవ్రవాదులే ఎక్కువ. ఇది తీవ్రమైన అంశం. ఒకప్పటి భారీ వ్యవస్థీకృత హింసాకాండ నుంచి ఇప్పుడు పొరుగునున్న శత్రువుల అండతో పరోక్ష యుద్ధంగా మారిన ఈ బెడదపై సత్వరమే కార్యాచరణ జరగాలి.నిజం చెప్పాలంటే, జమ్మూ కశ్మీర్, మణిపుర్లు రెండూ ఇప్పటికీ అట్టుడుకుతూనే ఉన్నాయి. మోదీ 3.0 సర్కార్ ముందున్న ప్రధానమైన సవాళ్ళు ఇవి. ప్రభుత్వ పెద్దలు వీటిని అశ్రద్ధ చేయడానికి వీలు లేదు. అందులోనూ ఈ జూన్ 29 నుంచి అమరనాథ్ యాత్ర మొదలు కానున్న వేళ జమ్మూలో భద్రత కీలకం. గతంలో సాంప్రదాయికంగా తీవ్రవాదులకు పెట్టనికోట అయిన కశ్మీర్ లోయలో ఆ పరిస్థితిని మార్చడంలో భద్రతాదళాలు విజయం సాధించాయి. నిరుడు ఏకంగా 2.11 కోట్ల మంది సందర్శకులతో కశ్మీర్లో పర్యాటకం తిరిగి పుంజుకొంది. మొన్న లోక్సభ ఎన్నికల్లోనూ జనం ఉత్సాహంగా పాల్గొన్నారు. గత 35 ఏళ్ళలో ఎన్నడూ లేనంతగా మొత్తం కేంద్రపాలిత ప్రాంతంలో 58.46 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. తీవ్రవాదం పీచమణిచి సాధించిన అలాంటి విజయాలు జమ్మూలోనూ పునరావృతం కావాలని హోమ్ మంత్రి ఆదేశిస్తున్నది అందుకే. తీవ్రవాదులు ప్రధానంగా అంతర్జాల ఆధారిత వ్యవస్థల ఆధారంగా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. విదేశీ సిమ్ కార్డులతో, పాకిస్తానీ సర్వీస్ ప్రొవైడర్లతో సాగుతున్న ఈ వ్యవహారానికి సాంకేతికంగా అడ్డుకట్ట వేయాలి. ప్రజలు, పోలీసులు, స్థానిక రక్షణ దళ సభ్యులతో సహా అందరినీ కలుపుకొనిపోతూ దేశంలో చేరిన ఈ కలుపు మొక్కల్ని ఏరిపారేయాలి. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించాలని చూస్తున్న ఈ దుష్టశక్తుల పాచిక పారనివ్వరాదు. ప్రభుత్వం వెనక్కి తగ్గక సెప్టెంబర్లో జరగాల్సిన జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను నిరాటంకంగా జరిపించాలి. పాక్ పాలకులు పైకి మెత్తగా మాట్లాడుతున్నా, అక్కడి సైన్యాధ్యక్షుడు, సైనిక గూఢచారి వ్యవస్థ ఐఎస్ఐ చేసే కుటిల యత్నాలకు సర్వదా కాచుకొనే ఉండాలి. అప్రమత్తత, సత్వర సన్నద్ధతే దేశానికి శ్రీరామరక్ష. -
విభజన... అసమాన అంతరాలు పెంచడానికా?
రాష్ట్ర విభజన జరిగి జూన్ 2 నాటికి పదేళ్లు గడిచాయి. పాలకుల వైఫల్యం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాంతాల మధ్య ఏర్పడిన అసమాన అభివృద్ధి విధానాలు విభజన తర్వాత కూడా కొనసాగుతున్నాయి. దశాబ్దా్దలుగా జరిగిన పోరాటాలు, ఉద్యమాలు, అమరవీరుల త్యాగాల నెత్తుటి మరకలను పాలకులు తమ తిరోగమన విధానాలతో తుడిపేస్తున్నారు. ఈ పదేళ్ల కేంద్ర ప్రభుత్వ పోకడ భారత రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తికి గండి కొట్టేలా వెళ్లింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసిన తర్వాత ఏర్పడే రెండు తెలుగు రాష్ట్రాలకు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చకుండా తన పబ్బం గడుపుకోవడం మీదనే కేంద్రం దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి చివరికి ఎగ్గొట్టారు. తెలంగాణకు స్పెషల్ ప్యాకేజీ ప్రకటిస్తామని మొండిచేయి చూపించారు.ఇక, విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కూడా పాక్షికంగానే అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో రాజధాని పూర్తి కావడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా ప్రేక్షక పాత్ర వహించింది. ఒక్క మాటలో చెప్పాలంటే రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేశారు కానీ కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు, నిర్వహించాల్సిన బాధ్యతలను నిర్వహించలేదు. పదేళ్ల పాటు చేతులు దులుపుకునే ప్రయత్నమే జరిగింది. కృష్ణా, గోదావరీ నదీజలాల వ్యవహారంలో ఎటూ తేల్చకపోగా, కేంద్రమే స్వయంగా గొడవలు పెడుతోంది. విద్యుత్ బకాయిల చెల్లింపులు, ఉద్యోగుల విభజన లాంటి ముఖ్యమైన అంశాలను కూడా తేల్చలేదు. ద్రవ్యలోటు పూడ్చే విధంగా ఆర్థికంగా ఆదుకోవాల్సిన కేంద్రం అసలు తాను ఇవ్వాల్సిన నిధులను కూడా ఇవ్వడం లేదు. సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించకపోగా, సాగునీటి రంగానికి ఉపయోగపడే విధంగా ఎలాంటి నిధులు ఇవ్వడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలను ఉపయోగించుకోవడమే తప్ప ఎనిమిది కోట్ల తెలుగు ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు. మలివిడత ఉద్యమంలో పాల్గొన్న వారెవరూ నాటి టీఆర్ఎస్ (నేటి బీఆర్ఎస్) పార్టీ అధికారంలో వుండగా ప్రాతినిధ్యంలోకి రాలేదు. చివరికి తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ కుటుంబ కృషిగానే మలిచే ప్రయత్నం చేశారు. దీని ఫలితమే టీఆర్ఎస్ గడిచిన 10 ఏళ్ల పాలన ఏకఛత్రాధిపత్యంగా సాగడానికి కారణమైంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమి కోసం, దోపిడి, పీడనకు వ్యతిరేకంగా జరిగింది. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యాన్నీ, స్వేచ్ఛనూ, ప్రశ్నించే గొంతులనూ అణచివేస్తూ కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరించారు. పార్లమెంటులో విభజన చట్టంపై చర్చ జరుతున్న సందర్భంలో ప్రతిపక్షం (బీజేపీ) నుండి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ విభజన హామీగా రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించాలన్నారు. పోలవరం, ప్రాణహిత, చేవెళ్ళ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించి పూర్తి చేయాలన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా ప్రధాన బాధ్యతలు చేపట్టి తను డిమాండ్ చేసిన ప్రత్యేక హోదాలు ఈ 10 ఏండ్లలో పట్టించుకోకుండా గాలికొదిలేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ నీటి యుద్ధం కొనసాగుతూనే వుంది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీకి నీటిని క్రమబద్ధీ్దకరించటం, రివర్ బోర్డు ఏర్పాటు, ద్రవ్యలోటు పూడ్చడం, ఉద్యోగులను సొంత రాష్ట్రాలకు పంపడం, ఆంధ్రలో కలిపిన ఏడు తెలంగాణ గ్రామాల ఉమ్మడి సమస్యలు వంటివి పరిష్కారం కాలేదు. తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, ఎన్టీపీసీలో మిగిలివున్న 3 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి ముఖ్యమైన హామీలు అమలు జరుగలేదు. 9, 10 షెడ్యూల్లో వున్న 91 ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లలో 71 సంస్థలను విభజించినట్లు ప్రకటించి, నేటికీ ఉమ్మడిగానే కొసాగిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు పాలకుల విధానాల వల్ల ప్రాంతాలు, ప్రజల మధ్య ఏర్పడిన ఆర్థిక, సామాజిక అంతరాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. ప్రజలకు దీర్ఘకాలిక అభివృద్ధికి ఉపకరించే భూమి, ఉపాధి, నీటి వనరులు, ఉద్యోగాలు, వేతనాలు వంటి అంశాలను పట్టించుకోలేదు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం గడిచినా ప్రజల జీవితాల్లో అభివృద్ధి భూమిక ఏర్పడలేదు. భూములు పంచుతామన్న పాలకులు ఉన్న భూములను బినామీ పేర్లతో ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మారారు. వ్యవసాయానికి ప్రోత్సాహం లేక చిన్న, మధ్యతరగతి రైతులు వ్యవసాయాన్ని వదులుకొని కార్పొరేట్ సంస్థల వద్ద అతితక్కువ వేతనాలకు వాచ్మెన్లుగా, గార్డెన్లలో పనిచేసే కూలీలుగా మారినారు.తెలంగాణ ఏర్పడితే ఈ పరిస్థితులు వస్తాయని ప్రజలు భావించలేదు. ఉద్యోగాలు వస్తాయనీ, ఉపాధి సౌకర్యాలు మెరుగుపడుతాయనీ, అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి అయితే స్థానికంగా ఉపాధి పొందుతామనీ భావించారు. కానీ, వారి ఆశలు అడియాసలయ్యాయి. ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య తీవ్రమైన అంతరాలు పెరుగుతూనే వున్నాయి. ఇది సామాజిక దోపిడి, వివక్షకు దారితీసింది. దీని ఫలితమే బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో గద్దెదించి, ప్రత్యామ్నాయంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టంగట్టారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజారంజక పాలన కొనసాగించవలసిన అవసరం వున్నది. రాష్ట్రంలో, దేశంలో అస్తిత్వ రాజకీయాల ప్రభావం పెరుగుతున్నది. ప్రజల ప్రధాన సమస్యలైన భూమి, కూలి, ఉద్యోగ సమస్యలను తీర్చాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సమర్థవంతంగా అమలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఏ ప్రయోజనాల కొరకైతే రాష్ట్రం ఏర్పడిందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చాలి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, వివిధ వర్గాల ప్రజల మధ్య అంతరాలు తగ్గించే విధంగా ప్రతిపక్షాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణ అభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు తీసుకొని పరిపాలన సాగించాలి. రాష్ట్రాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి వైపు నడిపించాల్సిన బాధ్యత అధికార పార్టీపై వుంది. రెండు రాష్ట్రాల ప్రజలు ఆశించినట్టు ఇప్పటి నుంచైనా అధికారంలోకి వచ్చే, వచ్చిన పార్టీల ప్రభుత్వాలు, కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షలను నెరవేర్చేందుకు చిత్తశుద్ధి కనబరచాలి.జూలకంటి రంగారెడ్డి వ్యాసకర్త మాజీ శాసన సభ్యులు(నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం) -
విభజన హామీలు ఎప్పుడు నెరవేరేను?
ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ 2014లో రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగింది. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకోకుండా, హడావిడిగా, తెలంగాణ రాష్ట్రానికి అనుకూల ఫలితాలను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతికూల ఫలితాలను ఇచ్చే విధంగా ఇది జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రధాన లక్ష్యం రెండు రాష్ట్రాలు విడివిడిగా సర్వతోముఖాభివృద్ధి సాధించడం. మరి అది జరుగుతోందా?పునర్విభజన అనంతరం ఏర్పడిన అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థికపరమైన, సంస్థాగతమైన మద్దతు ఇవ్వవలసి ఉండగా, కేంద్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి సరైన శ్రద్ధచూపకపోవడం వల్ల అనేక వివాదాలు, న్యాయపరమైన చిక్కులు తలెత్తాయి.చట్టంలోని సెక్షన్ 93 లోని షెడ్యూల్ 13 ప్రకారం... 8 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది. వాటిలో 4 ప్రాజెక్టులు ఏర్పాటు చేయలేదు. 1. దుగరాజపట్నం ఓడరేవు ఏర్పాటు 2. సమగ్రమైన ఉక్కు కర్మాగారం ఏర్పాటు, 3. గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్, పెట్రోకెమికల్ కాంప్లెక్సు ఏర్పాటు, 4. విశాఖపట్టణంలోనూ, విజయవాడ–గుంటూరు–తెనాలి నగరాలలోనూ మెట్రోరైలు ఏర్పాటు చేయడం. ఇంకా మిగిలిన 4 ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి.విశాఖపట్టణం–చెన్నె పారిశ్రామిక కారిడార్, ప్రస్తుతం ఉన్న విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి విమానాశ్రమాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త రైల్వేజోన్ ఏర్పాటు, కొత్తగా ఏర్పాటు చేయబడే రాజధానికి మంచి రోడ్డు, రైలు రవాణా సదుపాయాలను కల్పించడం వంటివి నెరవేర్చవలసి ఉంది. విశాఖపట్టణంలో క్రొత్త రైల్వేజోన్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని వారి ప్రకటనలను బట్టి అర్థమవుతోంది.ఇది వరలో పునర్విభజన చట్టాలలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పన్నుల విషయంలో కొన్ని అసాధారణతలు చోటు చేసుకొన్నాయి. వాటిని సరిదిద్దడానికి చట్టంలో అవసరమైన సవరణలు చేయమని లేదా వాటివల్ల కలుగుతున్న నష్టం రూ. 3,820 కోట్లను మంజూరుచేయమని ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయం ఇంకా కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగానే ఉంది. ఏపీలో పారిశ్రామికీకరణ, ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడానికి అవసరమైన రాయితీలతో కూడిన ప్రత్యేక ప్యాకేజీ ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 94(1) సెక్షన్ క్రింద కేంద్రప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఆ ప్రతిపాదనలు ఇంకా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలోనే ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా, రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకం పూర్తవకపోవడం మరో ఇబ్బంది. పై విషయాలన్నింటినీ సూక్ష్మంగా పరిశీలిస్తే, కేంద్ర ప్రభుత్వానికి పునర్విభజన చట్టం అమలుకు సంబంధించి, తన బాధ్యతలను నెరవేర్చే విషయంలో పూర్తి చిత్తశుద్ధి లేదనే విషయం అర్థమౌతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దానిలోని అనేక కార్పొరేషన్లు వాటి హక్కుల సాధన నిమిత్తం తెలంగాణ ప్రభుత్వంపై కోర్టులో అనేక వ్యాజ్యాలు (కేసులు) వేశాయి. ఆ కేసులన్నింటిలోనూ, ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా తీర్పులు వచ్చినప్పటికీ, తెలంగాణ రాష్ట్రం ఒక్క తీర్పును కూడా అమలు పరచలేదు. తెలంగాణ రాష్ట్రం, శ్రీశైలం ప్రాజెక్టు నీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క తాగునీరు, సాగునీటి అవసరాలకు నిర్లక్ష్యం చేస్తూ జలవిద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తోంది. ఈ పరిస్థితులలో గౌరవ సుప్రీంకోర్టు భారత రాజ్యాంగంలోని 3, 4 ఆర్టికల్స్ ప్రకారం సమగ్రమైన సూచనలను ఇవ్వాలనీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటువంటి సమస్యలను భవిష్యత్తులో కూడా ఎదుర్కొనే పరిస్థితిని నివారించాలని ఆశిద్దాం.కొవ్వూరి త్రినాథరెడ్డి వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ రిసోర్స్ పర్సన్ -
పేదల ఊసు పెద్దలకు పట్టదా?
భారతదేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. పౌష్టికాహార లోపంతో పిల్లలు, స్త్రీలు, బాలింతలు బాధపడుతున్నారు. కోట్లాది కార్మికులకు పనిలేదు. ఉద్యోగాలు లేక యువతకు పెళ్లిళ్ళు కూడా జరగడం లేదు. ఇదొక సామాజిక సమస్యగా రూపుదిద్దుకుంటోంది. బీజేపీ ఇచ్చిన ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ అడ్రస్ గల్లంతైంది. మతం మనిషికి తిండి పెట్టదు అని ప్రజలు తెలుసుకుంటున్నారు. అలాంటి పార్టీతో చంద్రబాబు అంటకాగు తున్నారు. దేశంలో తమ పేరు మీద సాగుభూమి లేనివారు ఎందరో! ఊరు పేరేగాని ఊరిలో సెంటు భూమి లేదు. ‘ఇండియా’ కూటమి కూడా తన ప్రణా ళికలో భూమి పంపకాన్ని గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భూమి పంపకాన్ని నిరాకరించటం అంటే సామ్యవాదాన్ని నిరాకరించటమే!18వ సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు ఏడు విడతలుగా జరుగుతున్నాయి. తిరిగి మళ్లీ మూడోసారి అధికారంలోనికి రావడానికి మోదీ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఉత్తరప్రదేశ్ మీద అయితే వాళ్లు ఎక్కువ ఆధారపడి ఉన్నారో అక్కడ సామాజిక రాజకీయ చైతన్యం పెల్లుబికింది. ముఖ్యంగా ముస్లింలలో ఎంతో మార్పు రావడం వల్లే రాయబరేలీలో రాహుల్ గాంధీ నిలబడటానికి పూనుకున్నారు. మతోన్మాద దాడులు, మహిళా సాధికారతను పునాదులతో తొలిచే భావజాలం, కార్పొరేట్ శక్తులకు దేశాన్ని తాకట్టు పెడుతున్న బీజేపీ విధానాలు లౌకికవాదులను, ఓబీసీలను, దళితులను, స్త్రీలను ఆలో చింపజేస్తున్నాయని చెప్పక తప్పదు. ముఖ్యంగా 370 ఆర్టికల్ రద్దు ద్వారా జమ్మూ కశ్మీర్ శాసనసభను రద్దుచేసి, ఆ రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విడగొట్టిన ఉదంతాన్ని ప్రజాస్వామిక వాదులు అర్థం చేసుకుంటున్నారు. రాష్ట్రాల ఆదాయాన్ని తగ్గించి, జీఎస్టీ ద్వారా కేంద్రీకృత ఆర్థిక పెత్తనాన్ని పెంచి, రాష్ట్రాల ఉనికిని నామమాత్రం చేయా లని చేస్తున్న ప్రయత్నాలను కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రాలకు ప్రత్యేక హక్కులు కలిగిన భాష, సంస్కృతి, విద్య, విద్యుత్, మానవ వనరులపై కూడా కేంద్ర ప్రభుత్వమే పెత్తనం చేయాలనే చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాలు చైతన్యవంతంగా ఆలోచిస్తు న్నాయి. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన పత్రికల మీద చేస్తున్న దాడి బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా జరగలేదని జర్నలిస్టు మేధావులు వాపోతున్నారు.ఏప్రిల్ చివరి వారంలో వచ్చిన ‘గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్’ ప్రకారం, భారతదేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. పౌష్టికాహార లోపంతో పిల్లలు, స్త్రీలు, బాలింతలు బాధపడుతు న్నారు. అత్యధిక స్త్రీలు రక్తలేమితో ఇబ్బంది పడుతున్నారు. కోట్లాది మంది కార్మికులకు పనిలేదు. భారతదేశం మొత్తం వలసలతో అన్నా ర్తులై పొట్ట చేత పట్టుకుని నగర శివారుల్లోని మురికివాడలలో జీవిస్తు న్నారు. నిజానికి పంజాబ్ రైతులు చేసిన రైతు ఉద్యమ ప్రభావం భారతదేశం మొత్తం మీద ఉంది. సంయుక్త కిసాన్ మోర్చా హోరా హోరీ రైతు ఉద్యమాన్ని నడిపింది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టా లను రద్దు చేయాలనే డిమాండ్పై రాజీలేని పోరాటం చేసింది.ముఖ్యంగా అడవుల నరికివేత వల్ల, నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రోత్సాహం ఇవ్వకపోవడం వల్ల దేశంలో తీవ్రంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మండుటెండల్లో ప్రజలు ఆహారం కోసం పని చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. మతం మనిషికి అన్నం పెట్టదు అని ప్రజలు తెలుసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా భారతదేశంలో 75 సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత కూడా గ్రామాలలో మంచి నీళ్ళు దొరకడం లేదు. మద్యాన్ని అందించటంలో సఫలమైన ప్రభు త్వాలు, మంచినీళ్లు అందించడంలో విఫలమయ్యాయి.ఇకపోతే దేశంలో నిరుద్యోగం విలయ తాండవం చేస్తోంది. ఉద్యో గాలు లేక యువతకు పెళ్లిళ్ళు కూడా జరగడం లేదు. ఇదొక సామాజిక సమస్యగా రూపుదిద్దుకుంటోంది. కాగా ఎన్నికల నేపథ్యంలో నిరు ద్యోగం ప్రధాన అంశంగా చర్చకొస్తోంది. ప్రతిపక్ష నేతలు నిరుద్యోగ సమస్యపై నిలదీస్తుండగా అధికార బీజేపీ నేతలు సమస్యను పూర్తిగా పక్కన పెట్టేశారు. ప్రధాని మోదీ ప్రసంగాలు, బీజేపీ మేనిఫెస్టో యువతకు భరోసా కల్పించలేదు. పైగా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ అడ్రస్ గల్లంతైంది. నిరుద్యోగ రేటు పెరగడం ఆందోళన కలిగించే విషయం. ఇకపోతే ‘ఇండియా’ కూటమి కూడా తన ప్రణాళికలో భూమి పంపకాన్ని గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో కోట్లాది మందికి సాగుభూమి సెంటు కూడా లేదు. ఊరు పేరేగాని ఊరిలో సెంటు భూమి లేదు. ఇంటి స్థలం లేదు. మంచినీళ్ల వసతి లేదు. చనిపోతే పాతిపెట్టడానికి శ్మశానం లేదు. దేశంలోని సుమారు 7 లక్షల గ్రామాల్లో అంటరానితనం కొనసాగు తూనే వుంది. భారతదేశంలో దళితులు ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయం లేక పేదరికంలో, అస్పృశ్యతలో, అవిద్యలో మగ్గిపోతున్నారు. బీటెక్లు, ఎంటెక్లు, బీఏలు, ఎంఏలు చదివినా నిరుద్యోగు లుగా, ఉపాధి హామీ కూలీలుగా జీవిస్తున్నారు. ఈ రోజున దళిత వాడల్లో విద్యార్థులు, స్త్రీలు నిరాశా నిస్పృహలలో జీవిస్తున్నారు. వారి కుటుంబానికి తలా రెండెకరాల భూమి ఇవ్వటం ద్వారా ఆర్థిక సాధికారతను కల్గిస్తాం అని ఏ ప్రభుత్వమూ చెప్పటం లేదు. రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు అంబేడ్కర్ ఆలోచనకు భిన్నంగా ఉన్నాయి.భూమి పంపకాన్ని నిరాకరించటం అంటే సామ్యవాదాన్ని నిరాకరించటమే. ఇప్పుడు ఎన్నికల్లో ప్రకటించిన ఏ మేనిఫెస్టోలో కూడా భూమి పంపకం గురించి రాయక పోవటం, అస్పృశ్యతా నివా రణ ఒక ఎన్నికల ఎజెండాగా లేకపోవటం, కుల నిర్మూలన కార్యక్రమం ఎవరి లక్ష్యంగా లేకపోవటాన్ని దళిత మేధావులు, ఆలోచనాపరులు అర్థం చేసుకుంటున్నారు. రాజ్యాధికారమే వీటన్ని టికీ పరిష్కారం అని ఆలోచిస్తున్నారు. నిజానికి ప్రసిద్ధమైన కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో, ఐఐటీల్లో, వైద్య విశ్వవిద్యాలయాల్లో, అన్ని కళా శాలల్లో దళిత విద్యార్థులు ఎంతో వివక్షకు గురి అవుతున్నారు.మోదీ ఇంత తిరోగమన చర్యలతో ముందుకు వెళ్తుంటే, నారా చంద్రబాబు నాయుడు ఎన్డీయే కూటమిలో చేరటం ఆయనకున్న దళిత వ్యతిరేకతనూ, హిందూ మతోన్మాద భావజాలాన్నీ, కులాధి పత్య వైఖరినీ, మైనారిటీల పట్ల ద్వేషాన్నీ తెలియజేస్తున్నాయి. చంద్రబాబు నాయుడుకూ, మోదీకీ మధ్య భావజాలంలో, దళితులు, స్త్రీల పట్ల వ్యతిరేకతలో ఏ విధమైన తేడాలేదు అని అర్థం అవుతోంది. ముఖ్యంగా మోదీ యూనివర్సిటీల్లో జీవపరిణామ, మానవ పరిణామ చారిత్రక సిద్ధాంతాల బోధనకు భిన్నంగా మతవాద భావజాలాన్ని ప్రోత్సహించటం లౌకిక భావజాల వ్యాప్తికి గొడ్డలి పెట్టు అవుతుంది.ఇకపోతే అంబేడ్కర్ భావజాల ప్రచారంలో తమిళనాడు ముందుంది. తమిళనాడులోని అన్ని థియేటర్లలో సినిమా ప్రారంభంలో అంబేడ్కర్ జీవిత పోరాటం గురించి ఐదు నిమిషాల నిడివిగల డాక్యుమెంటరీ ప్రదర్శించాలని అక్కడి ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఆదేశించారు. అంబేడ్కర్ ఆ రాజ్యాంగం ద్వారానే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ముఖ్యమంత్రులు ప్రధానులు, రాష్ట్రపతులు అవుతున్నారని గ్రహించాలి.అంబేడ్కర్ రాజ్యాంగం భారతదేశ పునర్ నిర్మాణానికి ఆయువు పోసింది. ఏ దేశంలో స్త్రీ వ్యక్తిత్వంతో జీవిస్తుందో, ఏ దేశంలోకుటుంబ వ్యవస్థ బలంగా నిలబడుతుందో, ఏ దేశంలో స్త్రీ ఉత్పత్తి శక్తి దేశ సౌభాగ్యానికి ఊపిరి పోస్తుందో ఆ దేశం ఆర్థిక సంపదవున్న ప్రపంచ పంక్తిలో నిలబడగలుగుతుంది. నిజానికి అంబేడ్కర్ అడుగు అడుగులో స్త్రీ సమానత్వం కోసం పోరాడారు. వారి అభ్యున్నతి కోసం, వారి విద్యాభ్యాసం కోసం, వారి సాధికారిత కోసం, వారి భావ చైతన్యం కోసం, వారి రాజకీయ హక్కుల కోసం పోరాడారు. హిందూ కోడ్ బిల్లు విషయంలో మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా రాజీనామా చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి హిందూ కోడ్ బిల్లును సాధించారు. ఈనాడు ప్రభుత్వాలు స్త్రీ సాధికారితను నిలబెట్టాలి అంటే నిరుద్యోగులయిన స్త్రీలకు ఉద్యోగ వసతి కల్పించాలి. విధవరాండ్రకు నెలకు పది వేల రూపాయల పింఛన్ ఇవ్వ గలిగిన స్థాయికి రావాలి. ప్రతి దళిత స్త్రీకి రెండు ఎకరాల భూమి ఇచ్చి భారతదేశంలో వ్యవసాయ విస్తృతికి కృషి చేయాలి. ఇంటింటికీ మంచినీటి వసతి, విద్యుత్ వసతి కల్పించి, ఆరోగ్య సంరక్షణ కోసం పౌష్టికాహారాన్ని అందించి స్త్రీ శారీరక మానసిక శక్తిని పెంచి దేశ సౌభాగ్యానికి బాటలు వేయాలి. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
ఇరాన్-ఇజ్రాయెల్ హై టెన్షన్.. భారతీయులకు కేంద్రం అలర్ట్
న్యూఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లవద్దని భారతీయులకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ మేరకు శుక్రవారం(ఏప్రిల్ 12) ఒక అడ్వైజరీ జారీ చేసింది. రానున్న 48 గంటల్లో ఇజ్రాయెల్పై ఇరాన్ ఏ క్షణాన్నైనా దాడి చేయొచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో భారత్ తన పౌరులను అలర్ట్ చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్లో ఇప్పటికే ఉన్న భారతీయలు అక్కడున్న భారత రాయబార కార్యాలయాలను సంప్రదించాలని కోరింది. రెండు దేశాల్లో ఉన్న భారత పౌరులు తమ భద్రత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతేనే బయట తిరగాలని సూచించింది. డజన్ల కొద్దీ క్రూయిజ్ మిసైళ్లు, వందల కొద్దీ డ్రోన్లతో ఇరాన్, ఇజ్రాయెల్పై విరుచుకుపడే అవకాశాలున్నాయని మీడియా కథనాలు వెలువడుతుండటం ప్రపంచవ్యాప్తంగా కలవరం రేపుతోంది. ఇటీవల సిరియాలోని ఇరాన్ కాన్సులేట్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఆ దేశ ఆర్మీ టాప్ కమాండర్తో పాటు మొత్తం ఏడుగురు అధికారులు మృతి చెందారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై దాడి చేయక తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రకటించారు. అనవసర ప్రయాణాలు చేయవద్దని ఇప్పటికే ఇజ్రాయెల్లోని అమెరికన్ ఎంబసీ తన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను కోరింది. ఇదీ చదవండి.. ఇజ్రాయెల్కు టెన్షన్.. ఇరాన్ సంచలన ప్రకటన -
కేజ్రీవాల్ అరెస్టు.. జర్మనీ ప్రకటనపై భారత్ నిరసన
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) చీఫ్ కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ స్పందించిన తీరు పట్ల భారత ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడమేనని మండిపడింది. ఈ మేరకు ఢిల్లీలోని జర్మనీ రాయబారిని పిలిచి ఆ దేశం చేసిన ప్రకటనపై విదేశీ వ్యవహారాల శాఖ తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. ‘భారత్ ఒక ప్రజాస్వామ్య దేశం. న్యాయవ్యవస్థ స్వయంతప్రతిపత్తి, కనీస ప్రజాస్వామ్య సూత్రాలు ఇండియాకూ వర్తిస్తాయి. అందరిలానే నిష్పక్షపాత, న్యాయబద్ద విచారణకు కేజ్రీవాల్ అర్హుడు. అరెస్టు చేయకుండా కూడా అతడిని విచారించవచ్చు. దోషిగా తేలనంత వరకు నేరం చేయనట్లే భావించాలనే సూత్రం కేజ్రీవాల్కు కూడా వర్తిస్తుంది’అని జర్మనీ కేజ్రీవాల్ అరెస్టుపై వివాదాస్పద ప్రకటన చేసింది. ఇదే కేంద్ర ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మార్చ్ 21న అరెస్టు చేసింది. కోర్టు కేజ్రీవాల్ను ఆరు రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చింది. దీనిపై ఆప్ నేతలు దేశంతో పాటు విదేశాల్లోనూ నిరసన ప్రదర్శనలు చేశారు. 26న ప్రధాని మోదీ ఇంటిని కూడా ముట్టడిస్తామని ఆప్ ఇప్పటికే ప్రకటించింది. ఇదీ చదవండి.. బీజేపీ ఖాతాల్లోకే లిక్కర్ సొమ్ము -
మరికొంతకాలం ‘ఈవీ’లకు ఊరట
సాక్షి, అమరావతి: ఎలక్ట్రిక్ వెహికల్స్(ఈవీ)ను కొనాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరుతో ఫేమ్–2 పథకం ముగుస్తున్న తరుణంలో మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ పేరుతో తీసుకువచ్చిన ఈ పథకానికి రూ.500 కోట్లు కేటాయించింది. మార్చి 31తో ఫేమ్–2 పూర్తవగానే ఏప్రిల్ 1 నుంచి కొత్త పథకం అమలులోకి వస్తుందని కేంద్ర పునరుత్పాదక విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ పథకం ఈ ఏడాది జూలై చివరి వరకూ అమలులో ఉండనుంది. దీని ప్రకారం కొత్తగా విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే వారికి టూ వీలర్లకు కిలోవాట్కు రూ. 10 వేలు చొప్పున గరిష్టంగా రూ. 25 వేలు, త్రీ వీలర్లకు రూ. 50 వేల వరకూ ప్రయోజనం చేకూరనుంది. విద్యుత్ వాహనాల కోసం కేంద్రం ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఎఫ్ఏఎంఈ) పథకాన్ని 2019లో తీసుకువచ్చింది. నిజానికి ఈవీలపై ప్రోత్సాహకాలను కేంద్రం తగ్గిస్తూ వస్తోంది. గతేడాది మే వరకూ 15 శాతం నుంచి 40 శాతం వరకూ సబ్సిడీ ఇచ్చేది. జూన్ తర్వాత వాహన ధరలో కేవలం 15 శాతం గానీ లేదా కిలోవాట్ హవర్ (కెడబ్ల్యూహెచ్)కు రూ. 10 వేలుగానీ ఏది తక్కువైతే అది మాత్రమే సబ్సిడీ ఇవ్వడం ప్రారంభించారు. రానున్న మూడేళ్లలో 1 మిలియన్ ఈవీ అమ్మకాల లక్ష్యాన్ని చేరుకోనున్నామని, ఆ తర్వాత సబ్సిడీని కొనసాగించలేమని కూడా కేంద్రం తేల్చేసింది. ఆదర్శంగా ఏపీ ‘ఈవీ’ ప్రోత్సాహం మన రాష్ట్రం ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రోత్సహించడానికి ప్రత్యేక విధివిధానాలను రూపొందించింది. అవి దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యుత్ వాహనాలకు ఏపీ అందిస్తున్న తోడ్పాటు భేష్ అని ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ రౌండప్ 2023 నివేదిక కొనియాడింది. 2030 నాటికి 30 శాతం ఈవీ కార్లు, 80 శాతం ఈవీ టూ వీలర్లు, 70 శాతం ఈవీ కమర్షియల్ వెహికిల్స్ ప్రవేశపెట్టాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించింది. ఇందుకు తోడ్పాటునందిస్తున్న నాలుగు రాష్ట్రాల్లో ఏపీ ముందు వరుసలో ఉందని నివేదిక తెలిపింది. 2030 నాటికి మొత్తం పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాహనాల్లో సగం విద్యుత్ వాహనాలే ఉండాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకున్న ఏపీ చొరవను ఆదర్శంగా తీసుకోవాలని ఇతర రాష్ట్రాలకు ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు సూచించాయి. ఈవీ ప్రమోషన్కు వివిధ విధానాల ద్వారా సహకరిస్తూ, ప్రోత్సాహకాలను అందించడంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని ఎనర్జీ సొల్యూషన్స్ సంస్థ వెల్లడించింది. కాగా ఏపీలో ప్రస్తుతం దాదాపు 65 వేల విద్యుత్ వాహనాలున్నాయి. భవిష్యత్తులో విద్యుత్ వాహనాల వినియోగం రాష్ట్రంలో భారీగా పెరగనుందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అభిప్రాయపడింది. 2034 నాటికి దాదాపు 10.56 లక్షల వాహనాలు రాష్ట్ర రోడ్లపై తిరిగే అవకాశం ఉందని, వీటన్నిటి కోసం 677 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ప్రణాళిక (ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ ప్లాన్)లో వెల్లడించింది. దీనికి తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో సుమారు 400 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు వంటి ప్రయోజనాలను కల్పిస్తోంది. లక్ష మంది ఉద్యోగులకు ఈవీలను వాయిదా పద్ధతిలో ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. -
అసంపూర్ణ చట్టం
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), 2019కి జవసత్వాలు అందించే 39 పేజీల నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర పాలనా యంత్రాంగం ఓటర్లను విభజించాలని చూస్తోందంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్న తరుణంలో లోక్సభ ఎన్నికలకు కొన్ని వారాల ముందుగా చోటు చేసుకున్న ఈ పరిణామం వివాదాన్ని రేకెత్తించింది. కాగా, మరో ఎన్నికల హామీని తాను నెరవేర్చినట్లు బీజేపీ చెప్పుకొంది. పౌరసత్వాన్ని హరించడానికే సీఏఏని ఉపయోగిస్తారనే భయాలు కేవలం నిరాధారమైనవని తిప్పికొట్టింది. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో హింసాత్మక చర్యల కారణంగా పారిపోయి భారతదేశంలో అక్రమంగా లేదా అనధికారికంగా స్థిరపడిన ఆరు మతా లకు చెందిన మైనారిటీలకు పౌరసత్వం అందించడం ఈ చట్టం ప్రధాన లక్ష్యం. ఈ ఆరు మత బృందాలు ఆ దేశాలకు చెందిన హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, పార్సీలు, జైనులు. ఆ దేశాలకు చెందిన ముస్లింలను సీఏఏ నుంచి మినహాయించారు. ఈ దేశాలకు చెందిన ముస్లింలను పై చట్టం నుంచి మినహాయించడానికి హేతువు ఏమిటంటే... ఆ మూడు దేశాలూ ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ఇస్లామిక్ దేశాలు. కాబట్టి వారు తమతమ దేశాలలో తగు న్యాయం పొందగలరని ఇది సూచిస్తుంది. దరఖాస్తులను పర్యవేక్షించడానికి కేంద్ర అధికా రులతో కూడిన కమిటీలను రూపొందించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియపై నియంత్రణను కలిగి ఉంది. పాత విధానంలో జిల్లా అధికారులే అభ్యర్థ నలను స్వీకరించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశం ప్రకారం పౌరసత్వం కోసం దరఖాస్తు చేసు కోవడంలో నిరీక్షణ వ్యవధిని, సీఏఏ 11 నుండి ఐదు సంవత్సరాలకు తగ్గిస్తుంది. అయితే దరఖాస్తుదా రులు వారి మాతృభూమి నుండి అధికారిక పత్రాలను సమర్పించాలి. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాలలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నప్పటికీ, 2019– 20లో భారతదేశం అంతటా ఈ సవరణ చట్టంపై వీచిన తుపానుతో పోలిస్తే ఇవి పెద్దగా సద్దులేనివి గానే కనిపిస్తాయి. అయితే, రాబోయే కొద్ది వారాల్లో అభ్యంతరాలు పెరిగే అవకాశం ఉంది. ఈ అంశంలో మరొక పెద్ద సమస్య దాగి ఉంది. ముఖ్యంగా రాజ్యాంగబద్ధతను వ్యతిరేకిస్తున్న సీఏఏకి సంబంధించిన అనేక చట్టపరమైన సవాళ్లను సుప్రీంకోర్టు ఇంకా వినలేదు, తీర్పు ఇవ్వలేదు. ఇక్కడ కీలకమైన వాదన ఏమిటంటే, మతాన్ని పౌరసత్వానికి గుర్తుగా ప్రతిష్టించడం ద్వారా, రాజ్యాంగానికి చెందిన ప్రాథమిక స్వరూపాన్నే పౌరసత్వ సవరణ చట్టం ఉల్లంఘిస్తుందన్నదే. అదే సమయంలో భారత రాజ్యాంగం మతపరమైన వివక్షను నిషేధిస్తుంది. చట్టం ముందు ప్రజలందరికీ సమానత్వం, చట్టం ద్వారా సమాన రక్షణకు హామీ ఇస్తుంది. ఈ చట్టంపై తొలి సవాలు 2020లో వచ్చింది. సుప్రీంకోర్టు ఈ అభ్యంతరాలను ఇంకా వినలేదు. అయితే, ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం, గత ఏడాది డిసెంబర్లో పౌరసత్వ చట్టం, 1955లోని సెక్షన్ 6ఏ చెల్లుబాటుకు సంబంధించిన మరో కేసులో తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నిర్దిష్ట సవరణ 1985లో కుదిరిన అస్సాం ఒప్పందం నాటిది. ఇది బంగ్లాదేశ్ నుండి అక్రమ వలసలకు సంబంధించిన శాశ్వత సవాలుపై రాష్ట్రంలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నించింది. చట్టవిరుద్ధంగా వచ్చిన వారిని భారతీయ పౌరులుగా గుర్తించడానికి ఇది ఒక యంత్రాంగాన్ని అందించింది. అస్సాంలో బంగ్లాదేశ్ వలసదారులకు పౌరసత్వం మంజూరు చేయడానికి 1971 మార్చి 25ని కటాఫ్ తేదీగా నిర్ణయించడమైంది. పౌరసత్వ సవరణ చట్టం భారతదేశం అంతటా ఒకే విధంగా వర్తించదు. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, ప్రత్యేక రాజ్యాంగ రక్షణ ఉన్న అస్సాం (తక్కువ జనాభాతో), త్రిపురలోని మూడు గిరిజన ప్రాబల్య ప్రాంతాలలో ఈ చట్టం అమలు కాదు. 2019లో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ)ని తీసుకురావడం ద్వారా అస్సాంలో పరిస్థితి క్లిష్టంగా మారింది. 19 లక్షల దరఖాస్తుదారులు దీనికి వెలుపలే ఉండిపోయారు. వీరిలో ఎక్కువమంది హిందువులు, స్థానిక సంఘాల సభ్యులే ఉన్నారు తప్పితే, ముస్లింలు కాదు. ఇది బీజేపీనీ, దాని మిత్ర పక్షాలనూ ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటి నుంచి వారు ఈ చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. అస్సాంలో అక్రమ వలసలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్యకర్తలు కూడా సీఏఏని వ్యతిరేకించారు. మతం పౌరసత్వాన్ని నిర్ణయించకూడదని వాదించారు. సహాయాన్ని పొందవలసిన సామాజిక బృందాల జాబితా కూడా అసంపూర్ణంగా కనిపిస్తోంది. ఇందులో శ్రీలంకలోని తమిళ హిందువులు, క్రైస్తవులు వంటి సమూహాలు లేవు. వీరిలో 90,000 మందికి పైగా భారత్లో శరణార్థులుగా ఉన్నారు. మయన్మార్ నుండి వచ్చిన చిన్ క్రైస్తవులు కూడా జాబితాలో లేరు. వీరిలో 45,000 మందికి పైగా ఒక్క మిజోరంలోనే ఉన్నారు. ఒక మతానికి చెందినవారైనప్పటికీ, ఆ మతంలోని మైనారిటీ శాఖలపై వేధింపుల ప్రమాదం తగ్గదు. అయినా పాకిస్తాన్ లోని అహ్మదీయులు, అఫ్గానిస్తాన్లోని హజారాలు వంటి బలహీనమైన ముస్లిం సమూహాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం సీఏఏకి కనిపించలేదు. సంజయ్ హజారికా వ్యాసకర్త రచయిత, కాలమిస్ట్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
భారత ప్రభుత్వంపై మస్క్ కంపెనీ వ్యతిరేక స్వరం
తమ ప్లాట్ఫామ్లోని కొన్ని ఖాతాలు, పోస్ట్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఎలాన్ మస్క్కు చెందిన సోషల్ మీడియా దిగ్గజం ‘ఎక్స్’ (గతంలో ట్విటర్) పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాలను తాము పాటిస్తాం కానీ, వారి చర్యలతో ఏకీభవించబోమని ప్రకటించింది. అయితే కంపెనీ ఆరోపణలపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. ‘ఎక్స్’కు సంబంధించిన గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ హ్యాండిల్లో ఈ మేరకు పోస్ట్లో వివరాలను కంపెనీ వెల్లడించింది. భారత ప్రభుత్వ చర్యలతో తాము ఏకీభవించడం లేదని, భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ పోస్ట్లను తొలగించడం సరికాదని అభిప్రాయపడింది. అయితే భారత ప్రభుత్వ ఆదేశాలకు కట్టుబడి ఉంటామని తెలిపింది. "ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా భారత్లో మాత్రమే ఈ ఖాతాలు, పోస్ట్లను నిలిపివేస్తాం. అయినప్పటికీ మేము ఈ చర్యలతో విభేదిస్తున్నాం. ఈ పోస్ట్లకు భావప్రకటనా స్వేచ్ఛను కొనసాగిస్తున్నాం" అని పేర్కొంది. ప్రభుత్వ ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ఇంకా పెండింగ్లో ఉందని ‘ఎక్స్’ తెలిపింది. ప్రభావిత యూజర్లకు కూడా ఈ చర్యల నోటీసును అందించినట్లు పేర్కొంది. గత ఏడాది జూన్లో నిర్దిష్ట సోషల్ మీడియా ఖాతాలు, ట్వీట్లను బ్లాక్ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా ‘ఎక్స్’ వేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. భారత ప్రభుత్వ ఆదేశాలను పాటించనందుకు కంపెనీకి హైకోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని హైకోర్టు సమర్థించిందని, దేశ చట్టాన్ని కంపెనీ తప్పక పాటించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. -
వెంకయ్యనాయుడు, చిరంజీవి ‘విభూషణులు’.. సీఎం జగన్, సీఎం రేవంత్ హర్షం
సాక్షి, న్యూఢిల్లీ/ సాక్షి నెట్వర్క్: తెలుగు ప్రముఖులను దేశ అత్యున్నత పౌర పురస్కారాలు వరించాయి. ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవి, మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్కు ఎంపిక చేసినట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2024 సంవత్సరానికిగాను మొత్తం 132 పద్మ పురస్కారాలను ప్రకటించారు. వీటిలో ఐదు పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, మిగతా 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రమణ్యం, సామాజికవేత్త, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్, అలనాటి బాలీవుడ్ నటి వైజయంతిమాల బాలిని కూడా పద్మ విభూషణ్ వరించింది. పద్మభూషణ్ ప్రకటించిన వారిలో సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవీ, సినీనటుడు విజయ్కాంత్, ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, నేపథ్య గాయని ఉషా ఉతుప్, ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్యారేలాల్ శర్మ తదితరులున్నారు. వీరిలో ఫాతిమా, పాఠక్, విజయ్కాంత్ సహా 9 మందికి మరణానంతరం పురస్కారాలు దక్కాయి. తెలంగాణ, ఏపీల నుంచి ఆరుగురికి.. తెలంగాణ నుంచి ఐదుగురికి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. వీరిలో తెలంగాణ నుంచి బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, కూరెళ్ల విఠలాచార్య, కెతావత్ సోమ్లాల్, ఎ.వేలు ఆనందచారి, ఏపీ నుంచి హరికథా కళాకారిణి డి.ఉమా మహేశ్వరి ఉన్నారు. పద్మశ్రీ గ్రహీతల్లో 34 మందికి ‘అన్సంగ్ హీరోస్’ పేరిట పురస్కారం దక్కింది. క్రీడారంగం నుంచి టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న, స్క్వాష్ ప్లేయర్ జోష్నా చినప్ప, హాకీ క్రీడాకారుడు హర్బిందర్ సింగ్ సహా ఏడుగురికి పద్మశ్రీ లభించింది. పురస్కార గ్రహీతల్లో మొత్తం 30 మంది మహిళలున్నారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను నాలుగేళ్ల విరామం అనంతరం బిహార్ దివంగత ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్కు మంగళవారం ప్రకటించడం తెలిసిందే. పద్మ అవార్డుల వివరాలివీ.. పద్మ విభూషణ్ (ఐదుగురికి): వైజయంతిమాల బాలి (కళారంగం–తమిళనాడు), కొణిదెల చిరంజీవి (కళారంగం–ఆంధ్రప్రదేశ్), ఎం.వెంకయ్యనాయుడు (ప్రజావ్యవహారాలు–ఆంధ్రప్రదేశ్), బిందేశ్వర్ పాఠక్ (సామాజిక సేవ–బిహార్), పద్మా సుబ్రమణ్యం (కళారంగం–తమిళనాడు). పద్మభూషణ్ (17 మందికి): ఫాతిమా బీవీ (మరణానంతరం–ప్రజా వ్యవహారాలు–కేరళ), హోర్మూస్ జీ ఎన్.కామా (సాహిత్యం, విద్య, జర్నలిజం–మహారాష్ట్ర), మిథున్ చక్రవర్తి (కళారంగం–పశ్చిమబెంగాల్), సీతారాం జిందాల్ (వర్తకం–పరిశ్రమలు–కర్నాటక), యంగ్ లియు (వర్తకం–పరిశ్రమలు–తైవాన్), అశ్విన్ బాలచంద్ మెహతా (వైద్యం–మహారాష్ట్ర), సత్యబ్రత ముఖర్జీ (మరణానంతరం–ప్రజా వ్యవహారాలు–పశి్చమ బెంగాల్), రాంనాయక్ (ప్రజా వ్యవహారాలు–మహారాష్ట్ర), తేజస్ మధుసూదన్ పటేల్ (వైద్యం–గుజరాత్), ఓలంచెరి రాజగోపాల్ (ప్రజా వ్యవహారాలు–కేరళ), దత్తాత్రేయ్ అంబాదాస్ మయలూ అలియాస్ రాజ్ దత్ (కళారంగం–మహారాష్ట్ర), తోగ్డన్ రింపోచే (ఆధ్యాత్మికత–లద్దాఖ్), ప్యారేలాల్ శర్మ (కళారంగం–మహారాష్ట్ర), చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్ (వైద్యం–బిహార్), ఉషా ఉతుప్ (కళారంగం–మహారాష్ట్ర), విజయ్కాంత్ (మరణానంతరం–కళారంగం–తమిళనాడు), కుందన్ వ్యాస్ (సాహిత్యం, విద్య, జర్నలిజం–మహారాష్ట్ర) – పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన 110 మందిలో గోండా చిత్రకార దంపతులు శాంతిదేవీ పాశ్వాన్, శివన్ పాశ్వాన్ తదితరులున్నారు. బాధ్యతను పెంచింది ‘‘దేశం అమృత కాలం దిశగా అభివృద్ధి పథంలో సాగుతున్న తరుణంలో ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నా. ఇది నా బాధ్యతను మరింతగా పెంచింది. రైతులు, యువత, మహిళలు సహా నవభారత నిర్మాణంలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికీ పురస్కారాన్ని అంకితం చేస్తున్నా’’ – ఎం.వెంకయ్యనాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి సంస్కృతిని, కళలను చాటి చెప్పారు: రేవంత్రెడ్డి తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అభినందనలు తెలిపారు. వివిధ రంగాల్లో నైపుణ్యం, కృషితో వారు ఉన్నత అవార్డులకు ఎంపికయ్యారని.. సంస్కృతిని, కళలను దేశమంతటికీ చాటిచెప్పారని ప్రశంసించారు. తెలుగువారికి పద్మాలు గర్వకారణం: ఏపీ సీఎం జగన్ తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైనవారిని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ నటుడు చిరంజీవిలకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాలను ప్రకటించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ‘పద్మ’ అవార్డులను దక్కించుకున్న వారిని అభినందించారు, వారు మనకు గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. తెలుగు వెలుగులకు శనార్తులు: బండి సంజయ్ పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వెలుగులకు తెలంగాణ శనార్తులు చెబుతోందని పేర్కొన్నారు. -
మెగాస్టార్.. ఇకపై పద్మ విభూషణ్ చిరంజీవి
టాలీవుడ్ మెగాస్టార్కు మరో అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ వరించింది. ఇప్పటికే అవార్డుల రారాజుగా నిలిచిన మెగాస్టార్కు మరో అత్యున్నతమైన ఘనతను సొంతం చేసుకున్నారు. సినీ ప్రియులు, అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్న చిరును పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు సొంతం చేసుకున్నారు. నటుడిగా 1978లో కెరీర్ ప్రారంభించిన ఆయన అలుపెరగకుండా సినిమాలు చేశారు. అందులో భాగంగానే ఆయన ఎన్నో అవార్డులను కూడా సాధించారు. మెగాస్టార్కు పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ఆయనకు దక్కిన అవార్డులపై ఓ లుక్కేద్దాం. సినీ రంగానికి మెగాస్టార్ చేసిన సేవలకు గాను 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ భూషణ్ అవార్డు ఇచ్చింది. ఇక 1987లో స్వయం కృషి సినిమా, 1992లో ఆపద్బాంధవుడు, 2002లో ఇంద్ర సినిమాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా నంది అవార్డులను అందుకున్నారు. అలాగే శుభలేఖ (1982), విజేత (1985), ఆపద్బాంధవుడు (1992), ముఠామేస్త్రి (1993), స్నేహంకోసం (1999), ఇంద్ర (2002), శంకర్ దాదా ఎంబీబీఎస్ (2004) చిత్రాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. 2006లో సౌత్ ఫర్ హానరరీ లెజెండరీ యాక్టింగ్ కెరీర్ పేరిట చిరంజీవి స్పెషల్ అవార్డును ఫిలింఫేర్ అవార్డుల్లో భాగంగా అందుకున్నారు. అంతే కాకుండా 2010లో ఆయనకు ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు దక్కింది. తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆయనకు 2016లో రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2006లో చిరంజీవికి ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. అంతేకాకుండా 1987లో దక్షిణ భారతదేశం నుంచి ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైన ఏకైక నటుడు చిరంజీవి కావడం విశేషం. -
కర్పూరి ఠాకూర్కు భారతరత్న.. ప్రధాని మోదీ, సీఎం జగన్ హర్షం
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కర్పూరి ఠాకూర్ను కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’తో గౌరవించింది. నేడు ఆయన వందో జయంతి. ఠాకూర్ శతాబ్ది జయంతి ఉత్సవాల ప్రారంభానికి ఒకరోజు ముందే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం ఈ ప్రకటన వెలువరించడం విశేషం. జననాయకుడిగా అందరికీ చిరపరిచితుడైన ఠాకూర్ బిహార్లో ఓబీసీ రాజకీయాలకు నాంది పలికారు. భారతరత్న పొందిన వారిలో ఠాకూర్ 49వ వ్యక్తి. చివరిసారిగా 2019 ఏడాదిలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రదానం చేసింది. బిహార్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న తొలి కాంగ్రెసేతర సోషలిస్ట్ నేతగా చరిత్ర సృష్టించారు. బిహార్కు ఆయన రెండుసార్లు సీఎంగా సేవలందించారు. తొలిసారిగా సీఎంగా 1970 డిసెంబర్ నుంచి 1971 జూన్ వరకు పనిచేశారు. 1977 డిసెంబర్ నుంచి 1979 ఏప్రిల్ వరకు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. గతంలో డెప్యూటీ సీఎంగానూ చేశారు. ‘ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయానికి ప్రతిరూపం ఠాకూర్. అణగారిన వర్గాల తరఫున పోరాడి వారిలో మార్పు రావడానికి ఎంతగానో కృషిచేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని జీవన విధానంగా మార్చుకున్న మహానుభావుడు. ఈ పురస్కారం ఆయన చేసిన కృషికి మాత్రమే కాదు భావితరాలకు స్ఫూర్తిగా, గొప్ప ప్రేరణగా నిలుస్తుంది’ అని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. విద్యార్థి దశలోనే స్వతంత్రపోరాటంలోకి.. ఠాకూర్ బిహార్లోని సమస్తీపూర్ జిల్లాలో కర్పూరిగ్రామ్లో 1924 జనవరి 24వ తేదీన జన్మించారు. ఈ గ్రామం పూర్వం బ్రిటిష్ ఇండియా పాలనలో బిహార్–ఒడిశా ప్రావిన్స్లో పితౌజియా పేరుతో పిలవబడేది. పితౌజియా గ్రామం పేరును ఈయన పేరిట కర్పూరిగ్రామ్గా మార్చారు. అతి సామాన్య నాయీ బ్రాహ్మణ రైతు కుటుంబంలో కర్పూరి ఠాకూర్ జన్మించారు. ఠాకూర్కు చిన్నప్పటి నుంచి విప్లవభావాలు ఎక్కువే. కాలేజీ విద్యను మధ్యలోనే వదిలేసి భారత స్వతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఠాకూర్ను 1942, 1945లో అరెస్ట్చేసి జైలులో పడేసింది. స్వాతంత్య్రం సిద్ధించాక మొదట్లో గ్రామంలోని పాఠశాలలో టీచర్గా పనిచేశారు. రామ్ మనోహర్ లోహియాకు ప్రభావితులై రాజకీయాల్లో చేరారు. జయప్రకాశ్ నారాయణ్కు సన్నిహితంగా మెలిగేవారు. ఎమర్జెన్సీ కాలంలో ఆయనతో కలసి పోరాటం చేశారు. జననాయకుడు బిహార్లో బీసీలకు 26 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న మంగేరీ లాల్ కమిషన్ సిఫార్సులను 1978లో అమలుచేశారు. మండల్ కమిషన్కు ఈ సిఫార్సులే ప్రేరణగా నిలిచాయి. అత్యంత వెనుకబడిన కులాలు అనే భావనను తొలిసారిగా మంగేరీ కమిషనే తీసుకొచ్చింది. 1952లో తొలిసారిగా సోషలిస్ట్ పార్టీ తరఫున తేజ్పూర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి బిహార్ శాసనసభకు ఎన్నికయ్యారు. తుదిశ్వాస విడిచేదాకా ఎమ్మెల్యేగానే కొనసాగారు. 1970లో బిహార్ రాష్ట్రవ్యాప్తంగా మద్యపాన నిషేధం అమలుచేసి అందరి మన్ననలు పొందారు. రాష్ట్రంలో ఓబీసీలు రాజకీయాల్లో కీలకంగా మారడం వెనక ఈయన పాత్ర ఉంది. జేడీ(యూ) అధ్యక్షుడు నితీశ్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్లకు ఠాకూర్ రాజకీయ గురువు. 1988లో తుదిశ్వాస విడిచారు. ఈయన కుమారుడు ప్రస్తుతం రామ్నాథ్ ఠాకూర్ రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. అణగారిన వర్గాల పెన్నిధి: మోదీ ఠాకూర్కు భారతరత్న ప్రకటించడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తంచేశారు. ‘ పేద, అణగారిన, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా అంకితభావంతో పనిచేశారు. సమాజంలోని వివక్ష, అసమానతలు పారద్రోలి వెనకబడిన వర్గాలకు అన్నింటి అవకాశాలు దక్కేందుకు జీవితాంతం కృషిచేశారు. ఆయన నాయకత్వ దార్శనికత భారత సామాజిక, రాజకీయ ముఖచిత్రంపై చెరగని ముద్ర వేసింది. ఈ పురస్కారం ఆయన కృషి మాత్రమేకాదు సమున్నతమైన సమసమాజ స్థాపన కోసం మనం చేసే ప్రయత్నాలకు చక్కని ప్రేరణ’’ అని మోదీ శ్లాఘించారు. సీఎం జగన్ హర్షం సామాజిక న్యాయం, వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన సోషలిస్టు నేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్కు ఆయన మరణానంతరం భారతరత్న ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. -
Goldy Brar: ఇక ఉగ్రవాదిగా గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్
ఢిల్లీ: ఉగ్రవాద నిర్మూలన, తీవ్రవాద కార్యకలాపాల కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాలో ఆశ్రయం పొందుతున్న గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ను ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ మేరకు అతడిని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేరుస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం కెనడాలో ఉంటున్న గోల్డీ బ్రార్కు నిషేధిత ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్తో సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. గోల్డీ బ్రార్కు ఉగ్రవాద సంస్థలతోపాటు పలు హత్యలతో సంబంధం ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), 1967 ప్రకారం గోల్డీ బ్రార్ను ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్లు హోంశాఖ తెలిపింది. దేశంలోని పలువురు ప్రముఖులను హత్య చేసేందుకు కొన్ని హంతక ముఠాలకు డ్రోన్ల ద్వారా అక్రమంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను రవాణా చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. తన అనుచరులతో పంజాబ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించాలని గోల్డీ బ్రార్ ప్రయత్నిస్తున్నట్లు కేంద్రం భావిస్తోంది. అతడిపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు కేంద్రం ఈ సందర్భంగా తెలిపింది. గోల్డీ బ్రార్ నేపథ్యం.. సతీందర్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ పంజాబ్లోని శ్రీ ముక్త్సార్ సాహిబ్లో 1994లో జన్మించాడు. ఇతడి తండ్రి పోలీస్ ఇన్స్పెక్టర్. తొలిసారిగా సిద్ధూ మూసేవాలా హత్య కేసు దర్యాప్తులో ఇతడి పేరు వెలుగులోకి వచ్చింది. మూసేవాలా హత్య కేసులో అరెస్టయిన లారెన్స్ బిష్ణోయ్తో ఇతడికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ హత్య గురించి గోల్డీ బ్రార్కు ముందే తెలుసని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. -
ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్త సబ్సిడీ విధానం.. కేంద్ర ప్రభుత్వం కసరత్తు!
ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీకి సంబంధించిన ఫేమ్ పథకం మూడో విడత (ఫేమ్ 3)పై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మీడియా నివేదికల ప్రకారం ఈ సారి ఈ పథకాన్ని కింద ఎలక్ట్రిక్ వాహనాలతోపాటు ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలకు కూడా వర్తింపజేయాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకం మొదటి విడతలో కేవలం ద్విచక్ర వాహనాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఆయా వాహనాల ధరలపై అత్యధికంగా 40 శాతం సబ్సిడీ అందించేది. తర్వాత రెండో విడత (ఫేమ్ 2)లో ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలపై సబ్సిడీని 15 శాతానికి తగ్గించింది. తాజా నివేదికల ప్రకారం.. మూడో విడతలో ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలను చేర్చనుంది. ఇక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీని తగ్గించి త్రిచక్రవాహనాలకు సబ్సిడీని పెంచే అవకాశం ఉంది. కాగా కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 3 పథకాన్ని ఇంకా రూపొందించనప్పటికీ ఇందుకోసం ఆయా పరిశ్రమల వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. కొత్త సబ్సిడీ విధానం వెల్లడైతే ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ కొనసాగుతుందా? -
ముడి చమురు ఉత్పత్తిపై ఇక జీరో విండ్ఫాల్ ట్యాక్స్
భారత ప్రభుత్వం ముడి చమురు ఉత్పత్తిపై విండ్ఫాల్ పన్నును పూర్తిగా తొలగించింది. టన్నుకు రూ. 3,500 (42.56 డాలర్లు) ఉన్న పన్నును సున్నాకు తగ్గించింది. అంటే దేశీయ ముడి చమురు ఉత్పత్తిపై ఎలాంటి విండ్ఫాల్ పన్ను ఉండదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. (వామ్మో రూ. 35 వేల కోట్లా.. బ్యాంకులు ఏం చేశాయో తెలుసా?) అలాగే డీజిల్పై గతంలో ఉన్న విండ్ఫాల్ పన్నును ప్రభుత్వం లీటరుకు రూపాయి నుంచి 50 పైసలకు తగ్గించింది. ఇక పెట్రోలియం, ఏటీఎఫ్పై ఎలాంటి విండ్ఫాల్ పన్ను లేదు. విండ్ఫాల్ టాక్స్ అనేది కొన్ని పరిశ్రమలు తమ సగటు ఆదాయం కంటే ఎక్కువ ఆర్జించినప్పుడు విధించే పన్ను. ఒక పరిశ్రమ ఊహించని విధంగా భారీ లాభాలను ఆర్జించినప్పుడు ప్రభుత్వానికి ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అధిక ఇంధన ధరలు చమురు ఉత్పత్తిదారులకు అధిక లాభాలను తెచ్చిపెట్టడంతో గత ఏడాది జూలైలో ప్రభుత్వం ఈ పన్నును ప్రవేశపెట్టింది. (పిట్ట పోయి కుక్క వచ్చె.. ట్విటర్ లోగోను మార్చిన మస్క్!) అప్పటి నుంచి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా 2022 జూలైలో ముడి చమురుపై విండ్ఫాల్ పన్నులు టన్నుకు రూ. 23,250 నుంచి 2023 మార్చి 21 నాటికి టన్నుకు రూ. 3,500కి తగ్గాయి. ఇటీవల పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి (ఒపెక్) ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ చర్య కారణంగా ఏప్రిల్ 3న బ్రెంట్ ధర దాదాపు 6 శాతం పెరిగి బ్యారెల్కు 84.58 డాలర్లకు చేరుకుంది. -
బంగారు నగలపై కేంద్రం కొత్త రూల్.. ఇకపై ఇది తప్పనిసరి!
బంగారు నగలు కొనేవారికి ముఖ్యమైన వార్త ఇది. బంగారు ఆభరణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకపై హాల్మార్క్ లేని ఆభరణాలు విక్రయించేందుకు వీలు ఉండదు. బంగారు ఆభరణాలకు హాల్మార్కింగ్ను తప్పనిసరి చేయాలనే ఆలోచనను ప్రభుత్వం 18 నెలల క్రితమే బయటపెట్టింది. తాజాగా మార్చి 31 తర్వాత హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్యూఐడీ) లేని బంగారు ఆభరణాలను విక్రయించేందుకు అనుమతించబోమని వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. నాలుగు అంకెలు, ఆరు అంకెలు ఇలా హాల్మార్కింగ్ విషయంలో ఉన్న గందరగోళాన్ని తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి ఆరు అంకెల ఆల్ఫా న్యూమరిక్ హాల్మార్కింగ్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఇది లేకుండా బంగారం లేదా బంగారు నగలు విక్రయించేందుకు వీలుందడదు. చదవండి: మైక్రోసాఫ్ట్ కిచిడీ రెడీ! బిల్ గేట్స్కు స్మృతి ఇరానీ వంట పాఠాలు హెచ్యూఐడీ అంటే ఏమిటంటే.. హెచ్యూఐడీ అంటే హాల్మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్. ఇది ఆరు అంకెల ఆల్ఫా న్యూమరిక్ కోడ్. ఈ అంకెల్లో ఇంగ్లష్ అక్షరాలతో పాటు సంఖ్యలు కూడా ఉంటాయి. దీంతో మనం కొలుగోలు చేసిన బంగారం ప్రామాణికత, స్వచ్ఛత తెలుస్తుంది. హెచ్యూఐడీ కోడ్ ఉంటే నగల వ్యాపారులు వినియోగదారులను మోసం చేయలేరు. ప్రస్తుతం దేశంలో 1338 హాల్మార్కింగ్ కేంద్రాలు ఉన్నాయి. -
Women Army Officers: నెరవేరిన దశాబ్దాల కల.. ఆమె కమాండ్లో...
ఆకాశంలో సగం కాదు... నింగి నేల నీరు దేనినైనా పూర్తిగా కమాండ్ చేస్తామంటోంది మహిళాలోకం కఠోరమైన శారీరక శ్రమ చేయాల్సిన కదనరంగాన్ని కూడా నడిపించడానికి ముందుకొచ్చింది.. దశాబ్దాలుగా ఎందరో మహిళా అధికారుల కల ఎట్టకేలకు నెరవేరింది. 100 మందికిపైగా మహిళలు పదోన్నతులు పొంది కల్నల్ స్థాయికి ఎదిగారు. భారత ఆర్మీలో చరిత్రాత్మక ముందడుగు పడింది. సియాచిన్ సహా వివిధ కమాండ్ యూనిట్లను మహిళలు కూడా ముందుండి నడిపించనున్నారు. ఇన్నాళ్లూ పురుషులకు మాత్రమే పరిమితమైన ఈ బాధ్యతల్ని మొట్టమొదటి సారిగా మహిళలు కూడా నిర్వర్తించనున్నారు. రెజిమెంట్లు, బెటాలియన్లకు అధికార పదవుల్లో మహిళల నియామకానికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ ఈ నెల 9 నుంచి 22 వరకు జరిగింది. దాదాపుగా 108 మంది మహిళా అధికారులు కల్నల్గా పదోన్నతులు పొందారు. 1992 నుంచి 2006 బ్యాచ్కు చెందిన మహిళా అధికారులకు పదోన్నతులు ఇవ్వడానికి ప్రత్యేక కమిటీ ఎంపిక ప్రక్రియ పూర్తి చేసింది. వీరంతా ఇంజనీర్స్, సిగ్నల్స్, ఆర్మీ ఎయిర్ డిఫెన్స్, ఇంటెలిజెన్స్ కోర్, ఆర్మీ సర్వీస్ కోర్, ఆర్మీ ఆర్డన్స్ కోర్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీర్స్ వంటి విభాగాలకు అధికారులుగా సేవలందిస్తారు. భారత సాయుధ బలగాల్లో 1992 నుంచి మహిళా అధికారులు ఉన్నారు. అయితే వారంతా షార్ట్ సర్వీసు కమిషన్ (ఎస్ఎస్సీ) అధికారులుగానే ఇన్నేళ్లుగా కొనసాగుతున్నారు. ఇంజనీర్లు, న్యాయవాదులు, వంటి అడ్మినిస్ట్రేటివ్ పాత్రలే పోషిస్తున్నారు. యుద్ధ క్షేత్రాల్లో గాయపడ్డ జవాన్లకి చికిత్స అందించే వైద్యులు, నర్సులుగా కూడా ఉన్నారు. 16–18 ఏళ్లు సర్వీసు ఉంటేనే కమాండర్ పదవికి అర్హత సాధిస్తారు. ఇప్పుడు కోర్ ఆఫ్ ఆర్టిలరీ, కంబాట్ సపోర్ట్ ఆర్మ్లలో మహిళా అధికారుల్ని నియమించనున్నారు. భారత వాయుసేన, నావికాదళంలో అన్ని విభాగాల్లో మహిళా అధికారులు ఉన్నారు. వారికి శాశ్వత కమిషన్లు కూడా ఉన్నాయి. యుద్ధ విమానాలను, యుద్ధ నౌకల్ని నడిపించే మహిళలూ ఉన్నారు. త్రివిధ బలగాల్లో అతి పెద్దదైన పదాతి దళంలో మాత్రమే మహిళల పట్ల ఇన్నాళ్లూ వివక్ష కొనసాగుతూ వచ్చింది. ఎందుకీ వివక్ష పురుషులతో పోలిస్తే మహిళల శారీరక దారుఢ్యంపైనున్న సందేహాలే ఇన్నాళ్లూ వారికి అవకాశాల్ని దూరం చేశాయి. మాతృత్వం, పిల్లల పోషణ, ప్రసూతి సెలవులు వంటివి మహిళలకు తప్పనిసరిగా ఇవ్వాలని, యుద్ధం ముంచుకొచ్చే నేపథ్యాల్లో అది సాధ్యం కాదనే వాదన వినిపించింది. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తోంది. మహిళలకు ఎక్కడైనా పని చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్లు వినిపించాయి. భారత వాయుసేన, నావికాదళంతో పోలిస్తే ఆర్మీలో వివక్ష ఎక్కువగా ఉంది. యుద్ధభూమిలో నేరుగా మహిళలుంటే శత్రు దేశానికి చిక్కితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో ఇప్పటికీ పోరాట క్షేత్రాల్లో మహిళా కమాండర్లను నియమించడానికి భారత సైన్యం ఇంకా సిద్ధంగా లేదు. సుప్రీం తీర్పుతో నెరవేరిన కల భారత సైన్యంలో పనిచేస్తున్న మహిళా అధికారులకు శాశ్వత కమిషన్, కమాండింగ్ పదవులు ఇవ్వాల్సిందేనని 2020 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు చెప్పింది. వారు ఎన్ని సంవత్సరాలుగా సర్వీసులో ఉన్నారనే విషయంతో సంబంధం లేకుండా అందరికీ శాశ్వత కమిషన్ వర్తింపచేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో ఆర్మీలో మహిళలు పురోగతి సాధించడానికి, నాయకత్వ సామర్థ్యాలను ప్రదర్శించడానికి, పదోన్నతులకు మార్గం సుగమమైంది. యూనిట్ను కమాండ్ చేయడమంటే..? పదాతి దళంలో క్షేత్రస్థాయిలో సైనికులందరికీ నేరుగా ఆదేశాలు ఇస్తూ వారిని ముందుకు నడిపించే కీలక బాధ్యత. ఇప్పటివరకు పురుషులు మాత్రమే నిర్వహించిన ఈ బాధ్యతల్ని మహిళలు కూడా అందుకున్నారు. సైన్యంలో కల్నల్ పదవి మహిళకి లభిస్తే ఆమె కనుసన్నల్లోనే సైన్యం నడుస్తుంది. బ్రిగేడర్, మేజర్ జనరల్, లెఫ్ట్నెంట్ జనరల్ వంటి ఉన్నతాధికారులు నేరుగా సైనికులతో సంబంధాలను కొనసాగించరు. ఇలాంటి పదవుల్లోనే ఎన్నో సవాళ్లను మహిళలు ఎదర్కోవాల్సి ఉంటుంది. అప్పుడే మహిళల్లో నాయకత్వ సామర్థ్యం బయట ప్రపంచానికి తెలుస్తుంది. ‘‘సియాచిన్లో మొట్టమొదటి మహిళా అధికారిగా శివ చౌహాన్ను నియామకం మాలో కొత్త ఉత్సాహాన్ని పెంచింది. స్త్రీ, పురుషులన్న భేదం లేకుండా ప్రతీ ఒక్కరికీ వారికి మాత్రమే సొంతమయ్యే సామర్థ్యాలుంటాయి. ఆర్మీలో మహిళలకు మంచి భవిష్యత్ ఉంది. శారీరక దారుఢ్యం ఉన్నవారు కూడా ఇన్నాళ్లూ వివక్ష కారణంగా పదవులకి దూరమయ్యారు. ఇక ఆ రోజులు పోయాయి’’ – దీక్షా ధామిన్, ఆర్మీకి శిక్షణ పొందుతున్న యువతి ‘‘ఆర్మీలోకి రావాలనుకునే మహిళల సంఖ్య ఇంకా పెరుగుతుంది. పోరాట క్షేత్రాలకు సంబంధించిన విభాగాల్లో కూడా మహిళా అధికారులు రావాలి. ఎందుకంటే మహిళలు ఎంతో చురుగ్గా, త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంతో ఉంటారు’’ – దీప్నూర్ సహోతా, ఆర్మీకి శిక్షణ పొందుతున్న యువతి – సాక్షి, నేషనల్ డెస్క్ -
మోదీపై డాక్యుమెంటరీ దుమారం! రిషి సునాక్ స్పందన
న్యూఢిల్లీ/లండన్: భారత ప్రధాని నరేంద్ర మోదీపై.. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ తీసిన ఓ డాక్యుమెంటరీ పెను దుమారాన్ని రేపుతోంది. ‘ఇండియా ది మోదీ క్వశ్చన్’ పేరుతో రెండు పార్ట్ల సిరీస్గా డాక్యుమెంటరినీ రూపొందించింది బీబీసీ. అయితే ఈ సిరీస్పై భారత ప్రభుత్వం, మరోవైపు ప్రవాస భారతీయులు తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. డాక్యుమెంటరీ.. దానిని రూపొందించిన ఏజెన్సీకి ప్రతిబింబంగా ఉంది. అపఖ్యాతి పాలుజేసేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రచార భాగం అని మేము భావిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ వెల్లడించారు. పక్షపాతం, నిష్పాక్షికత లేకపోవడం, వలసవాద మనస్తత్వం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి చేష్టలను గౌరవించలేం అని బాగ్చీ పేర్కొన్నారు. ఈ సిరీస్ను ప్రసారం చేయడంలో ఎజెండా ఏమిటని బీబీసీని నిలదీశారు. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీ (BBC) మోదీపై రెండు భాగాలుగా ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. 2002 అలర్లకు సంబంధించిన మోదీ పాత్ర అంటూ డాక్యుమెంటరీలో హైలైట్ చేసింది బీబీసీ. ఆ టైంలో మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్తూ విమర్శలు గుప్పించింది. మోదీ, భారతదేశంలోని ముస్లిం మైనారిటీల మధ్య ఉద్రిక్తతలను పరిశీలించడం, వెయ్యి మంది వరకు మరణించిన గుజరాత్ 2002 అల్లర్లలో ప్రధాని మోదీ పాత్ర గురించి వాదనలను పరిశీలించడం లాంటి ఉద్దేశాలను ప్రముఖంగా చూపించడంతో.. దుమారం మొదలైంది. భారత సంతతి మండిపాటు అపఖ్యాతిపాలు చేసే కథనాన్ని ప్రచారం చేయడం కోసమే ఈ విశ్వసనీయత లేని డాక్యుమెంటరీని ప్రసారం చేశారని బీబీసీని భారత ప్రభుత్వం దుయ్యబట్టింది. బ్రిటన్లోని అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో వలసవాద మనస్తత్వం, ఆలోచనా ధోరణి కనిపిస్తోందని పేర్కొంది. మరోవైపు భారతీయ మూలాలుగల బ్రిటన్ పౌరులు ఈ డాక్యుమెంటరీని తీవ్రంగా ఖండించారు. లార్డ్ రమి రేంజర్ మాట్లాడుతూ, 100 కోట్ల మందికిపైగా గల భారతీయుల మనోభావాలను బీబీసీ తీవ్రంగా గాయపరిచిందన్నారు. వలసవాద ఆలోచనా ధోరణిని ప్రతిబింబించే డాక్యుమెంటరీ అంటూ బీజేపీ శ్రేణులు సైతం మండిపడుతున్నాయి. రిషి సునాక్ స్పందన మోదీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పార్లమెంట్లో స్పందించారు. పాక్ సంతతికి చెందిన ఎంపీ ఇమ్రాన్ హుస్సేన్ బ్రిటన్ పార్లమెంట్లో ఈ డాక్యుమెంటరీపై మాట్లాడుతూ.. మోదీపై విమర్శలు గుప్పించారు. అయితే.. హుస్సేన్కు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వెంటనే కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీకి మద్ధతుగా స్పందించారు. ‘‘దీనిపై UK ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉంది. దీర్ఘకాలంగా ఉన్న ఆ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. అలాగని ఎక్కడైనా హింసను సహించబోం.’’ అంటూ రిషి సునాక్ పాక్ సంతతి ఎంపీ నోరు మూయించారు. UK PM #RishiSunak dismisses Pak-origin #British MP's statement about #PMModi's leadership during 2002 Gujarat riot over BBC documentary#Pakistan #NewsUpdate #ModiGovt @PMModiNews @rishisunakmp1 @PMModiArmy #RIOT @PmModiFanClub1 @rishisunak_66 Video Credit: @kapilkumaron pic.twitter.com/uFhN8gOTMw — News9 (@News9Tweets) January 19, 2023 ఆ కామెంట్లపై అభ్యంతరాలు ఈ డాక్యుమెంటరీలో బ్రిటన్ మాజీ సెక్రటరీ జాక్ స్ట్రా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. జాక్ స్ట్రా ఏదో అంతర్గత బ్రిటన్ నివేదికను ప్రస్తావించినట్లు కనిపిస్తోందని, అది తనకు ఏవిధంగా అందుబాటులో ఉంటుందని ప్రశ్నలు తలెత్తుతోంది. పైగా అది ఇరవయ్యేళ్ళ క్రితంనాటి నివేదిక అని, దానిపైన ఇప్పుడు ఎందుకు స్పందించాలని, జాక్ చెప్పినంత మాత్రానికి అది సరైనదని బీబీసీ ఎలా ప్రసారం చేసిందని అభ్యంతరాలతో ఏకిపడేస్తున్నారు కొందరు. గుజరాత్ అల్లర్ల నేపథ్యం 2002 ఫిబ్రవరి నెలలో అయోధ్య నుంచి తిరిగి వస్తున్న సబర్మతి ఎక్స్ ప్రెస్ రైలులో కరసేవకులు ఉన్న బోగీకి గోద్రా రైల్వేస్టేషన్ లో నిప్పు పెట్టడంతో 59 మంది చనిపోయారు. ఈ ఘటనతో గుజరాత్ వ్యాప్తంగా హిందూ-ముస్లింల మధ్య ఘర్షణలు తలెత్తాయి. మూడు నెలల పాటు గుజరాత్ రాష్ట్రం అట్టుడికింది. ఈ ఘర్షణలో వెయ్యి మరణించారు. ఆ సమయంలో గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. సీఎంగా నరేంద్ర మోదీ ఉన్నారు. అయితే ఈ అల్లర్లపై ఏర్పాటు చేసిన సిట్ 2012లో ప్రధాని మోదీకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ అల్లర్లలో ప్రభుత్వ ప్రమేయం లేదని చెప్పింది. కొంతమంది మాత్రం నరేంద్రమోదీ పాత్ర ఉందని తప్పుడు ఆరోపణలు చేశారని వెల్లడించింది. ఇక తీస్తా సెతల్వాడ్ అనే హక్కుల కార్యకర్త నరేంద్ర మోదీని తప్పుడు ఆరోపణలతో ఇరికించే ప్రయత్నం చేసినట్లు తేలింది. దీనికి కాంగ్రెస్ పార్టీ, దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ప్లాన్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కిందటి ఏడాది.. గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గతంలో హైకోర్టు ఇచ్చిన క్లీన్ చిట్ను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ మేరకు ఆ హింసాకాండలో మరణించిన కాంగ్రెస్ ఎంపీ ఈషాన్ జఫ్రీ భార్య జాకియా జఫ్రీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు అర్హత లేనిదిగా పేర్కొంది కూడా. -
సొంత ఓఎస్పై ప్రభుత్వ భారీ కసరత్తు: ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఖేల్ ఖతం?
న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ యూజర్లకు భారత ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించనుందా? సొంతంగా ఒక దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ను రూపొందించి, వినియోగదారులకు మరింత సురక్షితమైన అనుభవాన్ని అందించే ప్రాజెక్ట్పై పని చేస్తోందని విశ్వసనీయంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారిక ప్రకటనపై ఆసక్తి నెలకొంది. ఇండ్ ఓఎస్ పేరుతో తీసుకురానుంది. ప్రభుత్వం, స్టార్టప్లు , విద్యాసంస్థల చొరవతో దీన్ని రూపొందిస్తోంది. ఎపుడు, ఎలా లాంచ్ చేస్తుందనే దానిపై స్పష్టతేదు. ఇది యూజర్లకు ఒక కొత్త భారతీయ OS సురక్షితమైన అనుభవాన్ని అందించడమే కాకుండా Google, Appleకి దీటుగా గట్టి పోటీ ఇస్తుందని అంచనా. కాగా ప్రస్తుతం, గూగుల్ ఆండ్రాయిడ్ 97 శాతం వాటాతో టాప్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటుండగా, ఐఫోన్కోసం రూపొందించిన ఆపిల్ ఐఓఎస్ వాటా పరిమితంగానే ఉంది. మరోవైపు నోకియా, శాంసంగ్, బ్లాక్బెర్రీ నోకియా, మైక్రోసాప్ట్ ,ఫైర్ఫాక్స్ లాంటి దిగ్గజాల ఆపరేటింగ్ సిస్టమ్స్ పెద్దగా ఆదరణకు నోచుకోలేకపోయాయి. ఈ క్రమంలో ఇండ్ఓఎస్ ఆవిష్కారంపై భారీ అంచనాలే ఉన్నాయి. -
భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్లపై పీసీబీ కొత్త చీఫ్ కీలక వాఖ్యలు
ప్రపంచ క్రికెట్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్లకు ఎనలేని క్రేజ్ ఉంటుదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా చాలా ఏళ్ల నుంచి ద్వైపాక్షిక సిరీస్లు లేవు. ఈ క్రమంలో భారత్-పాక్ జట్లు ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్ వంటి ఈవెంట్లలో మాత్రమే ముఖాముఖి తలపడుతున్నాయి. అయితే ఇరు దేశాల అభిమానులు మాత్రం చిరకాల ప్రత్యర్ధిలు ద్వైపాక్షిక సిరీస్లలో తలపడితే చూడాలని భావిస్తున్నారు. ఇక 2012-13లో చివరగా ద్వైపాక్షిక సిరీస్లో పాక్తో భారత్ తలపడింది.కాగా భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్ల నిర్వహణపై పీసీబీ కొత్త చీఫ్ నజామ్ సేథీ కీలక వాఖ్యలు చేశాడు. రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ల విషయంలో ఇరు దేశాల ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని నజామ్ సేథీ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా బోర్డు ప్యానెల్ మార్పుకు ముందు న్యూజిలాండ్తో జరగనున్న టెస్టు సిరీస్కు పీసీబీ జట్టును ఎంపిక చేయడాన్ని అతడు తప్పు బట్టాడు. "ప్రస్తుతం పాక్ జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం ఉందో లేదో నాకు తెలియదు. అయితే ప్యానల్ మార్పుకు ముందు కివీస్ సిరీస్కు జట్టును ప్రకటించకుండా ఉంటే బాగుండేది. కానీ పాకిస్తాన్లో అన్ని ప్రధాన జట్లు పర్యటించడం చాలా సంతోషంగా ఉంది. న్యూజిలాండ్ సిరీస్ మాకు చాలా ముఖ్యమైనది. దేశవాళీ క్రికెట్ నుంచి మంచి ప్రతిభ ఉన్న ఆటగాళ్లను గుర్తించి జాతీయ జట్టులో అవకాశం కల్పిస్తాము" అని విలేకరుల సమావేశంలో సేథీ పేర్కొన్నాడు. కాగా స్వదేశంలో వరుసగా సిరీస్లు ఓడిపోవడంతో రమీజ్ రజాను పీసీబీ చైర్మెన్ పదవి నుంచి పాక్ ప్రభుత్వం తొలిగించింది. ఈ క్రమంలో అతడి స్థానంలో సేథీ పీసీబీ కొత్త బాస్గా బాధ్యతలు చేపట్టాడు. చదవండి: IPL 2023 Auction: గ్రీన్కు 20, కర్రన్కు 19.5, స్టోక్స్కు 19 కోట్లు..! -
భలే మంచి చౌక బేరము
సాక్షి, అమరావతి: సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం, ఇంధన భద్రతను సాధించడం కోసం రూఫ్టాప్ సోలార్ యోజన స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2026 మార్చి 31 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ పథకం కింద 3 కిలోవాట్ల రూఫ్టాప్కు దాదాపు రూ.43 వేల వరకూ సబ్సిడీ అందించనుంది. 3 కిలోవాట్ల సోలార్ ప్యానెల్తో ఇంట్లో ఏసీ, ఫ్రిజ్, కూలర్, టీవీ, మోటార్, ఫ్యాన్ మొదలైన వాటిని నడపవచ్చు. దీని కోసం నెలనెలా ఎలాంటి బిల్లు చెల్లించాల్సిన అవసరం ఉండదు. మిగులు విద్యుత్ను ఇంల్లో అద్దెకున్న వారికి, పొరుగింటి వారికి విక్రయించడం ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు. అదనపు చార్జీలతో పనిలేదు సోలార్ ప్యానెల్స్ను అమర్చడానికి ఎటువంటి అదనపు చార్జీలు చెల్లించవద్దని న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ వినియోగదారులను కోరింది. తమ ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను అమర్చుకోవాలనుకునే వినియోగదారులు నేషనల్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, ఇందుకోసం ఏ కంపెనీకి అదనంగా ఎలాంటి చార్జీలు చెల్లించవద్దని, అలాగే మీటర్, టెస్టింగ్ కోసం సంబంధిత పంపిణీ సంస్థ నిర్ణయించిన మొత్తం కంటే ఎక్కువ చెల్లించవద్దని గృహ విద్యుత్ వినియోగదారులకు సూచించింది. ఎవరైనా అదనపు రుసుము కోరితే ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయాల్సిందిగా తెలిపింది. సబ్సిడీ మినహాయించి చెల్లిస్తే చాలు ఒక కిలోవాట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే 100 చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఎన్ని కిలోవాట్లు పెట్టాలనుకుంటే అన్ని వందల చదరపు అడుగులు అవసరం. బెంచ్మార్క్ ధరలపై సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ (సీఎఫ్ఏ) 3 కిలోవాట్ల వరకూ 40 శాతం, 3 కిలోవాట్లపైన 10 కిలోవాట్ల కంటే ఎక్కవ సోలార్ రూఫ్టాప్ వ్యవస్థలపై 20 శాతం సబ్సిడీ లభిస్తుంది. గృహ విద్యుత్ వినియోగదారులు సోలార్ రూఫ్టాప్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే 1 కిలోవాట్కు అయ్యే రూ.50 వేల ఖర్చులో రూ.18,800 సబ్సిడీ వస్తుంది. అదే 10 కిలోవాట్ల ప్లాంట్ అయితే రూ.4.40 లక్షల్లో రూ.1,06,600 సబ్సిడీ లభిస్తుంది. వీటికి తోడు దరఖాస్తు రుసుం 5 కిలోవాట్ల వరకూ రూ.1,000, ఆ పైన రూ.5 వేల చొప్పున చెల్లించాలి. మీటరింగ్ చార్జీలు అదనం. ఈ ధరలు చెల్లించిన వారికి సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్ల రూపకల్పన, సరఫరా, ఏర్పాటు చేసి ఇవ్వడంతో పాటు బీమాతో సహా 5 ఏళ్ల వారంటీ లభిస్తుంది. ఈ మేరకు నగదును తగ్గించుకుని సంబంధిత ఏజెన్సీకి మిగతా ధర చెల్లిస్తే సరిపోతుంది. అయితే రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, అపార్ట్మెంట్లకు 20 శాతం మాత్రమే సీఎఫ్ఏ వస్తుంది. -
పాకిస్థాన్ ఓటీటీపై నిషేధం.. ఎందుకంటే?
పాకిస్థాన్కు చెందిన ఓటీటీ ఫ్లాట్ఫామ్పై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్కు చెందిన 'విడ్లీ టీవీ' అనే ఓటీటీ ఫ్లామ్ఫామ్ను నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో పాటు మరో రెండు మొబైల్ అప్లికేషన్లు, నాలుగు సోషల్ మీడియా ఖాతాలు, స్మార్ట్ టీవీ యాప్లపై కూడా నిషేధం విధించింది. ఇటీవల విడ్లీ టీవీ ఓటీటీలో విడుదలైన 'సేవక్: ది కన్ఫెషన్స్' అనే వెబ్ సిరీస్లో భారతదేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి, భద్రతకు ముప్పు తెచ్చేలా కంటెంట్ ఉందని కేంద్రం వెల్లడించింది. ఓటీటీలో విడుదలైన మూడు ఎపిసోడ్లు దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంది. వెబ్ సిరీస్లో ప్రసారమవుతున్న కంటెంట్ భారత చారిత్రక ఘటనలపై వ్యతిరేకతను పెంచేలా ఉందని.. పూర్తి అవాస్తవాలతో ప్రసారం చేస్తున్నారని భారత సీనియర్ అధికారి కంచన్ గుప్తా తన ట్విటర్లో వెల్లడించారు. IMPORTANT Ministry of Information & Broadcasting, using emergency powers under IT Rules 2021, has issued directions on 12 December 2022 for immediate blocking of the website, 2 mobile apps, 4 social media accounts, and one smart TV app of #Pakistan-based OTT Platform Vidly TV. n1 — Kanchan Gupta 🇮🇳 (@KanchanGupta) December 12, 2022