రుణమాఫీ తర్వాతే పంచాయతీ ఎన్నికలు! | Telangana CM Revanth Reddy Sensational Comments On EVM, More Details Inside | Sakshi
Sakshi News home page

రుణమాఫీ తర్వాతే పంచాయతీ ఎన్నికలు!

Published Fri, Jul 5 2024 6:08 AM | Last Updated on Fri, Jul 5 2024 10:13 AM

CM Revanth Reddy Sensational Comments on EVM

అలాగైతేనే మాక్కూడా ప్రయోజనం 

ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: రైతు రుణమాఫీ తర్వాతే పంచాయతీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అలా అయితేనే తమకు కూడా ప్రయోజనం ఉంటుందనే ఆలోచన ఉందన్నారు. మూసీ పరీవాహాక ప్రాంతాన్ని 55 కి.మీ. మేర అభివృద్ధి చేస్తున్నామని, కింద రోడ్డు మార్గం, సైక్లింగ్, పైన మెట్రో వెళ్లేలా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. ఏపీ రాజధాని అమరావతి హైదరాబాద్‌కు ఎంతమాత్రం పోటీ కాదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

అమరావతిలో రాజధాని నిర్మాణం, భవనాల నిర్మాణం తర్వాత 10 వేల ఎకరాలే రియల్‌ ఎస్టేట్‌కు ఉంటుందని, అందులోనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడం కష్టమనేది తన ఆలోచన అని అన్నారు. అక్కడ పెట్టుబడి పెట్టేకన్నా హైదరాబాద్‌ శివారు ప్రాంతాలు, వరంగల్‌లో పెట్టుబడి పెట్టడం మంచిదని సలహా ఇస్తున్నట్లు చెప్పారు. లేదా పక్క రాష్ట్రాలైన బెంగళూరు, చెన్నైలలోనూ పెట్టుబడి పెట్టుకోవచ్చని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సమావేశమైన సీఎం రేవంత్‌.. మీడియా సమావేశంలో వివరాలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు.  

మూసీ అభివృద్ధి.. నా మార్క్‌ 
‘మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, కేసీఆర్‌ హైదరాబాద్‌లో చేసిన అభివృద్ధికి ఓ మార్క్‌ ఉంది. ఇలా నా మార్క్‌ ఏంటనేది చెప్పాల్సి వస్తే మూసీ నది అభివృద్ధేనని చెప్తా. మూసీ పరీవాహక ప్రాంతం పరిధిలో 10 వేలకుపైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. వారందరికీ డబుల్‌ బెడ్రూం ఫ్లాట్లు లేదా లేదా నష్టపరిహారం చెల్లిస్తాం.

మధ్యమధ్యలో ఎస్టీపీలు కట్టి నీటిని శుద్ధి చేసి మూసీలోకి వదిలేలా చేస్తున్నాం. 36 నెలల్లో పూర్తి చేయాలనేది నా ఉద్దేశం. 12–15 కీ.మీ.లకు ఒక క్లస్టర్‌ లెక్కన 4 కస్టర్లుగా విభజించి 4 కంపెనీలకు ఇద్దామనే ఆలోచన చేస్తున్నాం. మూసీ ప్రాజెక్టును మరింత హుందాగా డిజైన్‌ చేసేందుకు ఆగస్టులో దక్షిణ కొరియా, జపాన్‌ వెళ్లి అక్కడి రివర్‌ డెవలప్‌మెంట్‌ మోడల్‌ను చూసి మరిన్ని ఆలోచనలు చేస్తాం. మొత్తం మూసీ నది అభివృద్ధే రేవంత్‌ మార్క్‌ అనేలా అభివృద్ధి చేసి చూపిస్తా’అని రేవంత్‌ వివరించారు. 

గండిపేటకు ట్రంక్‌ లైన్‌.. 
‘మంచినీటి నిల్వ కోసం గోదావరి, కృష్ణా నుంచి గండిపేటకు ట్రంక్‌ లైన్‌ వేస్తున్నాం. త్వరలో టెండర్లు పిలుస్తాం. అలాగే రీజనల్‌ రింగ్‌ రోడ్డు కూడా నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టుపై కూడా కేంద్రంతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాల్సి ఉన్నందున రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అవసరాల గురించి ప్రధాని మొదలు కేంద్ర మంత్రులందరినీ నేను, నాతో పాటు మంత్రులు కలుస్తున్నాం. కేంద్రం తెలంగాణకు సాయం చేస్తుందనే నమ్మకం ఉంది. ఎన్నికలు అయిపోయినందున ఇప్పుడు రాష్ట్రాభివృద్ధే మా ధ్యేయం. అందుకే అందరినీ కలుస్తున్నాం..’అని సీఎం చెప్పారు. 

మరికొన్ని అంశాలపై 
వివాదం లేకుండా పోటీ పరీక్షలన్నీ నిర్వహించామని సీఎం అన్నారు. తమకు మంచి పేరు వస్తుందనే గ్రూప్‌–1 విషయంలో బీఆర్‌ఎస్‌ అనవసర రచ్చకు తెరలేపి నిరుద్యోగుల్ని ఉసిగొల్పుతోందని రేవంత్‌ ఆరోపించారు. అయితే గ్రూప్‌–1 గురించి ఎవరో ఏదో చెప్పారని చేసుకుంటూ వెళ్లలేమని.. అలా వెళ్తే కోర్టులు ఆక్షేపిస్తాయని చెప్పారు. 

⇒ లోక్‌సభ ఎన్నికలకు ముందే రాష్ట్రానికి ఎక్కువ సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్‌లు కావాలని ప్రధానిని కోరానని.. ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో త్వరలో కొత్త బ్యాచ్‌కు చెందిన వారిని కేంద్రం తెలంగాణకు కేటాయించే అవకాశం ఉందన్నారు. 

⇒ కత్తి పట్టుకున్న వాడు కత్తికే బలైనట్లు కేసీఆర్‌ పరిస్థితి ఉందని రేవంత్‌ వ్యాఖ్యానించారు. ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డ వ్యక్తి ఆ కేసుకే పట్టుబడేలా ఉన్నారని పేర్కొన్నారు. తనకు ఎవరి ఫోన్లు ట్యాప్‌ చేయాల్సిన అవసరం లేదని.. తన ప్రభుత్వానికి ఢోకా లేదన్నారు.

పదేళ్లు నేనే సీఎం..
ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో పదేళ్లకు ఒకమారు, ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారే ట్రెండ్‌ కొనసాగుతోందని, ఈ లెక్కన పదేళ్లపాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగతానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పదేళ్లపాటు కాంగ్రెస్‌కు వచ్చే ఢోకా ఏమీ లేదని చెప్పారు. ‘తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల మార్పు విషయంలో భిన్నమైన ట్రెండ్‌ నడుస్తోంది. తెలంగాణలో పదేళ్లకు ఒకమారు ప్రభుత్వాలు మారి తే, ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లకు ఒకమారు ప్రభు త్వం మారుతోంది. ఈ లెక్కన తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం పదేళ్లపాటు కచ్చి తంగా కొనసాగుతుంది. నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా’అని రేవంత్‌ వ్యాఖ్యానించారు.

ఈవీఎంలపై అప్పుడు టీడీపీయే ప్రశ్నించింది
సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్ల (ఈవీఎంల) ట్యాంపరింగ్‌కు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌కు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో వాటి ట్యాంపరింగ్‌ జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈవీఎం ట్యాపరింగ్‌లు జరిగినట్లు వస్తున్న వార్తలపై అభిప్రాయం ఏమిటని మీడియా అడగ్గా సీఎం రేవంత్‌ వివరంగా బదులిచ్చారు. ‘2009లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ట్యాంపరింగ్‌ జరుగుతోందని ప్రశ్నించిందే టీడీపీ (అప్పుడు నేను ఆ పారీ్టలోనే ఉన్నా). ఢిల్లీలోని కానిస్టిట్యూషనల్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియాలో దీనిపై సెమినార్‌ నిర్వహించి అవగాహన కలి్పంచాం. అప్పట్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌కు సంబంధించి అరెస్టులు కూడా జరిగాయి..’అని అన్నారు. 

ఎలా జరగొచ్చంటే.. 
‘ఎన్నికలకు ముందురోజు ప్రతి నియోజకవర్గానికి ఈవీఎంలను తీసుకొచ్చి పంపినీ కేంద్రంలో ఉంచుతారు. పోలింగ్‌కు అవసరమైన ఈవీఎంల కంటే 15 శాతం ఈవీఎలను ఎక్కువగానే కేటాయిస్తారు. ఎన్నికల రోజు ఎక్కడైనా ఈవీఎంలు మొరాయిస్తే ఆ ఈవీఎంల స్థానంలో వాటిని ఉపయోగించుకోవడానికి ఆ 15 శాతం ఈవీఎంలను అదనంగా ఇస్తారు. ఈవీఎంల పంపిణీ కేంద్రం నుంచి పోలింగ్‌ రోజు ఈవీఎంలను పోలింగ్‌ బూత్‌లకు తరలిస్తారు.

అదనంగా తెచి్చన 15 శాతం ఈవీఎంలను మాత్రం డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లోనే ఉంచుతారు. పోలింగ్‌ ముగిశాక ఈవీఎంలన్నీ స్ట్రాంగ్‌ రూమ్‌కు కాకుండా తొలుత డి్రస్టిబ్యూషన్‌ సెంటర్‌కే వస్తాయి. అక్కడే రాత్రంతా ఉంచుతారు. ఆ రాత్రి ఈవీఎంలను అటుఇటూ మార్చేలా ఏదైనా జరగొచ్చు కదా? పంపిణీ కేంద్రం బయట పోలీసులు కాపలాగా ఉంటే లోపల ఇంటర్, డిగ్రీ చేసిన వాళ్లు వాటిని తనిఖీ చేయడానికి ఉంటారు. మన చేతిలో అధికారం, బలం ఉంటే మనకు ఇష్టమైన వ్యక్తుల్ని అక్కడ డ్యూటీకి వేసుకొనే అవకాశం కూడా ఉంది. పోలింగ్‌ ముగిసిన మర్నాడు ఈవీఎంలు స్ట్రాంగ్‌ రూమ్‌కు వెళ్తున్నాయి..’అని రేవంత్‌ తెలిపారు. 

ట్యాంపరింగ్‌ ఏ రకంగా చేస్తారో చెప్పలేం
‘ఈవీఎంల ట్యాంపరింగ్‌ను ఎక్కడో కూర్చుని చేశారా లేక చిప్‌లలోకి ఏదైనా ఫ్రీక్వెన్సీని పంపారా అనేది మనం చెప్పలేము. చిప్‌లోకి లోఫ్రీక్వెన్సీ అయితే ఒకలాగా, హైఫ్రీక్వెన్సీ అయితే మరోలాగా ఈవీఎంలను ఆపరేట్‌ చేయొచ్చు. కంపెనీ తయారు చేసే ప్రొగ్రామ్‌నిబట్టే ఈవీఎం పనిచేస్తుంది. ప్రోగ్రాం రీరైడ్‌ చేయాలంటే మిషన్‌ చేతికి రావాల్సి ఉంటుంది. అయితే సిగ్నల్‌ ద్వారా ట్యాంపరింగ్‌ చేస్తున్నారా లేదా అనేది నాకు తెలియదు.

ఫ్రీక్వెన్సీ ఉంటే ఒకలా, లేకపోతే ఇంకోలా దేనికి దానికే ట్యాంపరింగ్‌ చేసే అవకాశం ఉంటుంది. గెలుపోటముల కోసం 100 శాతం మెషీన్లను ట్యాంపరింగ్‌ చేయాల్సిన అవసరం లేదు. జనరల్‌గా 10 శాతం ట్యాంపరింగ్‌ చేసే అవకాశం ఉండొచ్చు. అంటే 10 వేల ఓట్ల వ్యవధిలోనే గెలుపోటములను డిసైడ్‌ చేయొచ్చు కదా’అని రేవంత్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement