ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు 10,306.. బకాయిల రద్దు 10 లక్షల కోట్లు | 10 lakh crore arrears will be canceled in five years | Sakshi
Sakshi News home page

ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు 10,306.. బకాయిల రద్దు 10 లక్షల కోట్లు

Published Wed, Aug 3 2022 5:17 AM | Last Updated on Wed, Aug 3 2022 7:43 AM

10 lakh crore arrears will be canceled in five years - Sakshi

న్యూఢిల్లీ: గత ఐదేళ్లలో దేశంలోని బ్యాంకులు రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దు చేసినట్లు కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.2,36,265 కోట్లుండగా, 2021–22లో రద్దైన మొండి బకాయిలు రూ.1,57,096 కోట్లకు తగ్గినట్లు వివరించింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగత్‌ ఈ మేరకు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.

ఆర్‌బీఐకి అందిన డేటాను అనుసరించి గత నాలుగేళ్లలో ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల సంఖ్య 10,306గా ఉందని ఆయన చెప్పారు. ఇందులో అగ్రభాగాన.. పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్‌ రూ.7,110 కోట్లు, ఈరా ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్‌ రూ.5,879 కోట్లు, కాన్‌కాస్ట్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ రూ.4,107 కోట్ల మొండి బకాయిలు ఉన్నాయని వెల్లడించారు.

46% తగ్గిన ఎయిడ్స్‌
­
2021 నివేదిక ప్రకారం దేశంలో సుమారు 24.01 లక్షల మంది ఎయిడ్స్‌ బాధితులు ఉన్నట్లు కేంద్రం రాజ్యసభకు తెలిపింది. వీరిలో 45% మంది అంటే 10.83 లక్షల మంది మహిళలు కాగా 2% మంది 12 ఏళ్లలోపు చిన్నారులు సుమారు 51 వేల మంది ఉన్నట్లు పేర్కొంది. అయితే, అత్యధికంగా మహారాష్ట్రలో 3.94 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో 3.21 లక్షల కేసులుండగా తెలంగాణలో 1.56 లక్షల కేసులు నమోదైనట్లు వివరించింది. మొత్తమ్మీద చూస్తే 2010 నుంచి ఎయిడ్స్‌ కేసుల్లో తగ్గుదల ప్రపంచవ్యాప్తంగా 32%, దేశంలో 46% నమోదైందని తెలిపింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement