అగ్రికల్చర్ డెప్యూటీ డైరెక్టర్ ఎస్వీవైఎస్ మనోహర్
గుడివాడరూరల్: త్వరలో మొదలు కానున్న ఖరీఫ్ సాగులో రైతులకు వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది మెరుగైన సేవలు అందించాలని జిల్లా అగ్రికల్చర్ డెప్యూటీ డైరెక్టర్ ఎస్వీవైఎస్ మనోహర్ సూచించారు. స్థానిక వ్యవసాయశాఖ ఏడీఏ కార్యాలయంలో గుడివాడ డివిజన్ వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బందితో ఏడీఏ నిమ్మగడ్డ రమాదేవి అధ్యక్షతన సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఖరీఫ్లో విత్తనాల పంపిణీ, మట్టి నమూనాల సేకరణ, పీఎం కిసాన్ తదితర అంశాలపై అధికారులు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలను వివరించారు. రైతు భరోసా కేంద్రాల్లోని సిబ్బంది ప్రతిరోజు గ్రామాల్లో రైతులకు అందుబాటులో ఉండి సాగులో యాజమాన్య పద్ధతుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించే విధంగా సిబ్బంది కృషి చేయాలని ఆయన సూచించారు. ఖరీఫ్ సాగులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే అన్ని చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. సమావేశంలో జిల్లా కార్యాలయ ఏవోలు సి.శాంత, బి.సురేష్బాబు నాయక్, జి.సురేఖ, వ్యవసాయశాఖ అధికారులు బి.అనంతలక్ష్మి, త్రినాథ ఆంజనేయరావు, ఎన్.భానుప్రకాష్, పి.ప్రియాంక, సబ్ డివిజన్లోని వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment