![కల్యాణోత్సవాన్ని జరిపిస్తున్న అర్చకులు - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2024/04/18/17viw52a-310144_mr_0.jpg.webp?itok=5NH4qmvz)
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీరామచంద్రుడి దర్శనం.. జన్మధన్యం అంటూ భక్తజనం రఘురాముడిని మనసారా కొలిచారు. శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై శ్రీరామ నవమి వేడుకలను బుధవారం అంగ రంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ధర్మపథం వేదికపై శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. తొలుత అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టు వద్ద ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి సన్నిధి నుంచి హనుమత్ సమేత సీతారామలక్ష్మణస్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై ఊరేగింపుగా ఆలయ ఈవో కె.ఎస్.రామరావు, వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు పల్లకీని మోసుకుంటూ కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. వేద పండితులు సీతారామ కల్యాణ విశిష్టతను వివరిస్తుండగా, అభిజిత్ లగ్నంలో స్వామి వారు అమ్మవారికి మాంగల్యధారణ చేశారు. ఆలయ ఈవో రామరావు స్వామివారికి, సీతాదేవికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. కల్యాణోత్సవాన్ని వీక్షించడానికి పెద్ద ఎత్తున భక్తులు వేదిక వద్దకు తరలిరాగా, వారికి అవసరమైన ఏర్పాట్లను దేవస్థానం చేసింది. చలువ పందిరి కింద కూలర్లు, మంచినీటి సదుపాయాన్ని కల్పించారు. కల్యాణోత్సవం అనంతరం భక్తులకు స్వామి వారి తలంబ్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు శ్రీనివాసశాస్త్రి, యజ్ఞనారాయణ మూర్తి, కోట ప్రసాద్, లింగంభోట్ల బద్రీనాఽథ్బాబు, ఇతర అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రిపై సీతారాముల కల్యాణం
వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు
![ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు ఉత్సవమూర్తులు](/sites/default/files/gallery_images/2024/04/18/17viw52-310144_mr.jpg)
ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు ఉత్సవమూర్తులు
Comments
Please login to add a commentAdd a comment