పిట్లం(జుక్కల్) : కేరళ రాష్ట్రంలోని జూబ్లి మెమోరియల్ హాల్, త్రివేండ్రంలో ఈనెల 7, 8, 9వ తేదీల్లో నిర్వహించిన 12వ చెస్ బాక్సింగ్ జాతీయ చాంపియన్షిప్లో పిట్లం ప్రతిభ హైస్కూల్ నిర్వాహకులు నర్సింగ్రావ్ కూతురు ప్రతిభ సీనియర్ మహిళా విభాగంలో 3 బంగారు పతకాలు సాధించగా ఆమె తమ్ముడు విజయ్ రాఘవేంద్ర రాపు సీనియర్ పురుషుల విభాగంలో వెండి పతకంను సాధించాడు. ఈ సందర్భంగా వారిని గురువారం నారాయణ్ ఖేడ్లోని ఎంపీ నివాసంలో ఎంపీ సురేశ్షెట్కార్ ప్రత్యేకంగా సన్మానించారు.
సరైన జీవన విధానానికి యోగా అవసరం
భిక్కనూరు: మానవుడి సరైన జీవన విధానానికి యోగా ఎంతగానో ఉపకరిస్తుందని తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి అన్నారు. గురువారం తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్లో యోగ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ యోగాకు సమయం కేటాయించాలన్నారు. ఎన్ఎస్ఎస్ యూనిట్ సమన్వయకర్తలు డాక్టర్ అంజయ్య, డాక్టర్ హరిత, అధ్యాపకులు మోహన్బాబు, లలిత పాల్గొన్నారు.
దర్జాగా నకిలీ విత్తనాల అమ్మకాలు
పిట్లం(జుక్కల్) : మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన రైతు రామరావ్ పిట్లంలోని ఎరువుల దుకాణంలో ఈనెల 13న రూ. 3,500తో 25 కేజీల సోయా విత్తనాలు కొన్నాడు. సరైన సమయానికి ట్రాక్టర్ దొరకకపోవడంతో ఇంట్లోనే విత్తనాల సంచీ ఉంచాడు. ఈ గురువారం ట్రాక్టర్ దొరకడంతో సంచీ విప్పి చూడగా విత్తనాలకు ఫంగస్ వచ్చింది. దీంతో సదరు దుకాణాదారుడికి విత్తనాలు చూపించగా వేరే విత్తనాలు అందజేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపాడు. నకిలీ విత్తనాలు విక్రయించవద్దని అధికారులు పేర్కొంటున్నప్పటికీ కొన్ని మండలాల్లో దర్జాగా నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు.
ఎల్హెచ్పీఎస్ జిల్లా
ఉపాధ్యక్షుడి నియామకం
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి జిల్లా లంబాడ హక్కుల పోరాట సమితి (ఎల్హెచ్పీఎస్) జిల్లా ఉపాధ్యక్షులుగా రోతహన్ మోహన్ నాయక్ను నియమితులయ్యారు. జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు తేజావత్ బెల్లయ్య నాయక్ బుధవారం నియామకపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కోటియా నాయక్, ప్రధాన కార్యదర్శి రాణాప్రతాప్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
సెంట్రల్ లైటింగ్,
డ్రెయినేజీలు నిర్మించాలి
మాచారెడ్డి : నాలుగు లైన్ల రోడ్డు నిర్మించారు కానీ సెంట్రల్ లైటింగ్, డ్రెయినేజీ నిర్మించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని స్థానికులు గురువారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి మొరపెట్టుకున్నారు. ఈ మేరకు 50 స్థానికుల సంతకాలతో వినతి పత్రాన్ని అందజేశారు. ఓ మోస్తరు వర్షం పడినా ఇళ్ళలోకి నీళ్ళు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ సానుకూలంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment