చాంద్రాయణగుట్ట: గత కొన్ని రోజులుగా పాతబస్తీలో వరుస హత్యలు స్థానికులను కలవరానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఫలక్నుమా, ఛత్రినాక ఏసీపీ డివిజన్ల పరిధిలో వరుసగా దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. శాలిబండ, ఛత్రినాక పోలీస్స్టేషన్ల పరిధిలో వారం వ్యవధిలో జరిగిన ఘటనలు మరువక ముందే తాజాగా ఫలక్నుమా ఠాణా పరిధిలో ఓ యువకుడి హత్యోదంతం చర్చనీయాంశంగా మారింది.
వివాహేతర సంబంధంతో పాటు మహిళను వేధింపులకు గురి చేస్తుండడంతో బాధితురాలు సోదరుడు ఓ యువకుడిని హతమార్చిన ఘటన ఫలక్నుమా పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బహదూర్పురా హసన్నగర్కు చెందిన డ్రైవర్ జాకీర్ అలీ (29)కి అయిదేళ్ల క్రితం ఫలక్నుమా అచ్చిరెడ్డి నగర్కు చెందిన ఓ మహిళతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. సదరు మహిళకు అప్పటికే భర్త, అయిదుగురు పిల్లలు సైతం ఉన్నారు.
ఇటీవల కాలంలో జాకీర్ అలీ వేధింపులను తట్టుకోలేకపోయిన బాధితురాలు ఈ విషయాన్ని తన సోదరుడు షఫీ దృష్టి తీసుకెళ్లింది. షఫీ పలుమార్లు హెచ్చరించినా జాకీర్ తన ప్రవర్తనలో మార్పు రాలేదు. శుక్రవారం అర్ధరాత్రి వివాహిత భర్త లేని సమయంలో ఇంటికి చేరుకొని ఆమెను వేధించసాగాడు. దీంతో సదరు మహిళ తన సోదరుడికి ఫోన్ చేసి చెప్పింది. ఆగ్రహానికి గురైన షఫీ అక్కడికి చేరుకొని అతన్ని మందలించే క్రమంలో ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. షఫీ వెంటనే జాకీర్ తలపై ఇనుప రాడ్తో బాదడంతో పాటు, గడ్డపారతో అతని ముఖంపై కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment