![- - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2024/04/14/siddam1_mr_0.jpg.webp?itok=8dz2M4Rl)
ఇక్కడి ఓటర్లు.. అక్కడికెళ్లేలా
● ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న పార్టీలు
● మేము సిద్ధం పేరిట సమావేశాలు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరం ఎందరెందరికో ఉపాధి కల్పిస్తున్న నగరం. వివిధ రాష్ట్రాల వారు వృత్తి వ్యాపారాలు నిర్వహిస్తున్న నగరం. పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న మహానగరం. ముఖ్యంగా రాష్ట్రం వేరు పడ్డప్పటికీ ఇక్కడ ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వచ్చిన ఏపీ ప్రజలు లక్షల సంఖ్యలో ఉన్నారు. వీరిలో చాలామందికి తమ స్వస్థలాల్లోనే ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న ఏపీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి. ఆత్మీయ సమ్మేళనాలు, సమావేశాలతో మద్దతు కూడగట్టే దిశగా వ్యూహారచన చేస్తున్నాయి. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఎల్బీనగర్, తదితర నియోజకవర్గాల్లో ఆంధ్రా ఓటర్లు ఎక్కువసంఖ్యలో ఉండటంతో ఆయా నియోజకవర్గాల్లోని వారితో ఇప్పటికే సంప్రదింపులు మొదలు పెట్టారు. రవాణా ఏర్పాట్లు, తదితరమైన వాటికి భరోసా ఇస్తున్నారు. ఖచ్చితంగా వచ్చి ఓటేయమని అభ్యర్థిస్తున్నారు. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన పార్టీకి మనం ఓటేయాలని వివరిస్తున్నారు. ముఖ్యంగా అక్కడ పోటీలో ఉన్న అభ్యర్థులు, నియోజకవర్గాల ఇన్ఛార్జులు తమ నియోజకవర్గానికి చెందిన ప్రజలు హైదరాబాద్లో ఎక్కడ ఎక్కువగా ఉన్నారో గుర్తించి వారున్న ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత రెండు నెలల నుంచే ప్రారంభమైన ఈ కార్యక్రమాలు ఈ నెలలో ఇంకా ఎక్కువగా జరగనున్నాయి. వచ్చే నెల 13వ తేదీన పోలింగ్ ఉండటంతో మే మొదటి వారం వరకు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగనున్నట్లు తెలుస్తోంది. గిద్దలూరు నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం గత ఫిబ్రవరి 25న ఎల్బీనగర్లోని అనంతుల ధర్మారెడ్డి గార్డెన్లో నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆ కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు నాగార్జునరెడ్డి తదితర నేతలు పలువురు పాల్గొన్నారు. అలాగే నరేన్గార్డెన్లో జరిగిన మరో సమావేశంలో సత్తెనపల్లి అభ్యర్థి అంబటి రాంబాబు, మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావు పేట ఎంపీ అభ్యర్థి అనిల్కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ ప్రచార నినాదం ‘మేమంతా సిద్ధం’ పేరిట ఆదివారం నరసరావుపేట నియోజకవర్గ నేతలు, వైఎస్సార్సీపీ అభిమానులు, తదితరులు నిజాంపేటలోని కొలను రాఘవరెడ్డి ఫంక్షన్ గార్డెన్స్లో సమావేశం నిర్వహిస్తున్నారు. వీటిల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతోపాటు పలువురు ముఖ్యనేతలు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. మరోవైపు కూకట్పల్లిలోని ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్లో ఏపీలో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన పలువురు అభ్యర్థులతో ఇక్కడి పార్టీ అభిమానులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఎం.గురుమూర్తి, వై శివరామిరెడ్డి, కాకాని గోవర్ధన్రెడ్డి, రాచమల్లు శివప్రసాద్రెడ్డి, ఎస్.రఘురామిరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, అనంత వెంకటరామిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అనిల్కుమార్ యాదవ్, మెరిగ మురళీధర్, బైరెడ్డి సిద్ధార్థ్రెడ్డి, మెరుగ నాగార్జున తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల గాలి హైదరాబాద్లోనూ వీస్తోందని వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. మరోవైపు ప్రత్యర్థి పార్టీలు కూడా మద్దతు కూడగట్టేందుకు ఆత్మీయ సమ్మేళనాలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment