సత్యదేవుని చిన్నరథం
నిర్మాణ వ్యయం రూ.34 లక్షలు. రథం ఎత్తు 14 అడుగులు. వెడల్పు 6.3 అడుగులు. పొడవు 7.5 అడుగులు. ఈ రథం గత మార్చి రెండో తేదీ, రథసప్తమి నాడు లాంఛనంగా ప్రారంభించారు. ప్రతీ ఆదివారం రత్నగిరి ఆలయ ప్రాకారంలో స్వామి, అమ్మవారిని ఊరేగిస్తున్నారు.
సత్యదేవుని పెద్ద రథం
నిర్మాణ వ్యయం రూ.1.08 కోట్లు. ఎత్తు 34 అడుగులు. వెడల్పు 14 అడుగులు. పొడవు 23.5 అడుగులు. గత మే నెలలో జరిగిన సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల ఐదో రోజు అనగా మే 22 వ తేదీన అన్నవర పుర వీధుల్లో ఈ రథంపై స్వామిని ఘనంగా ఊరేగించారు. చిన్న రథానికి రత్నగిరిపై ఆలయ ప్రాంగణంలో షెడ్డు నిర్మిస్తుండగా, పెద్ద రథానికి కొండ దిగువన షెడ్డు నిర్మిస్తున్నారు.
అన్నవరం: ‘శిలలపై శిల్పాలు చెక్కినారు..మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు...’ అంటూ హంపి విజయనగరంలో గల శిల్పకళ అందాల గురించి వర్ణించే సినిమా పాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే ఈ శిల్పుల పనితనం చూస్తే చెక్కతో రథాలు చేసినారు...వారు దేవతామూర్తులకే కొత్త సొబగులు అద్దినారు’ అని పాడాల్సి వస్తుంది. శిల్పకళను తలదన్నేలా చెక్కపై కూడా అందమైన శిల్పాలు, దేవతామూర్తులు, దేవుళ్లను చెక్కే శిల్పులతో బాటు, దేవతామూర్తులను ఊరేగించే ఎత్తయిన రథాలను రూపొందించే శిల్పులు కూడా ఉన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మురమండకు చెందిన శ్రీ మాణిక్యాంబ శిల్పకళా వుడ్ వర్క్స్ అఽధినేతలు కొల్లాటి కామేశ్వరరావు, కొల్లాటి శ్రీనివాస్ ఆ కోవకు చెందినవారే. పది అడుగుల ఎత్తు కలిగిన చిన్నరథంతో బాటు 36 అడుగుల ఎత్తయిన రథాలు కూడా నిర్మించిన చరిత్ర వారిది. వీటితోబాటు ఇంకా దేవతామూర్తుల విగ్రహాలు, వస్తువులు, కళాఖండాలు కూడా తయారు చేసి అందరితో శభాష్ అనిపించుకున్న పనితనం వీరిది.
MýS$Ìê-°MìS AW²MýS$ÌS „ýS{†Ä¶æ¬Ë$...-˘
వృత్తికి శిల్పకారులు
అలాగని వారేమి అనాదిగా చెక్కతో వస్తువులు, బొమ్మలు, గృహోపకరణాలు తయారు చేసే కులవృత్తి కలిగిన వడ్రంగులో, విశ్వబ్రాహ్మణులో కాదు. కులానికి సముద్రంలో చేపలు పట్టే అగ్నికుల క్షత్రియులు. అయితే గత నాలుగు తరాలుగా దేవతా విగ్రహాలు, రథాలు , ఇతర కళాఖండాలు తయారు చేయడాన్ని వృత్తిగా స్వీకరించినట్టు కొల్లాటి కామేశ్వరరావు, ఆయన కుమారుడు శ్రీనివాస్ తెలిపారు. సుమారు ఎనిమిది నెలల నుంచి వారు అన్నవరంలోనే ఉండి సత్యదేవుని ఊరేగించేందుకు 14 అడుగుల ఎత్తయిన చిన్న రథం, 34 అడుగుల పెద్ద రథం తయారు చేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి తమ అనుభవాలను వివరించారు.
రథాల తయారీ చాలా కష్టం
దేవుళ్లను ఊరేగించే రథాలు తయారు చేయడం చాలా కష్టమైన పని. అందులో 20 అడుగుల కన్నా ఎత్తు రథం తయారు చేయాలంటే చాలా విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. రథాలు, దేవతామూర్తుల విగ్రహాలు, మందిరాలు, దేవుళ్లని ఊరేగించేందుకు వివిధ వాహనాల నిర్మాణంలో నాణ్యమైన బస్తరు టేకునే వాడతాం. కర్ర నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడం. చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ రథం నిర్మించాలి. నిర్మాణ సమయంలో చాలా నిష్టగా కూడా ఉండాలి.
– కొల్లాటి కామేశ్వరరావు, ప్రధాన శిల్పి
రథాలు, దేవతామూర్తుల తయారీలో
సిద్ధహస్తులు కొల్లాటి వంశస్తులు
ఇప్పటి వరకు 82 రథాలను
రూపొందించి మన్ననలు పొందిన వైనం
సత్యదేవునికి రెండు రథాలు
అందించిన కామేశ్వరరావు,
శ్రీనివాస్ బృందం
పడవల తయారీ నుంచి దేవుళ్ల రథాల వరకు...
మా తాత కొల్లాటి వీర్రాజు తొలుత చేపలు పట్టే బోట్లు, పడవలు తయారు చేసేవారు. అలా చిన్న చిన్న గృహోపకరణాలు, దేవతామూర్తుల విగ్రహాలు, రథాల తయారీ ప్రారంభించారు. మా నాన్న కొల్లాటి కామేశ్వరరావు పెద్ద పెద్ద రథాలు తయారు చేయడంలో నిపుణులు. ఆయన వద్ద నుంచి నేను ఈ వృత్తి నేర్చుకున్నాను. నాతో పాటు మరో 20 మంది శిల్పులు దేవతా రథాలు తయారు చేస్తున్నాం. ఇప్పటి వరకు 82 రథాలు తయారు చేశాం. వాటిలో 43 అడుగుల ఎత్తు కలిగిన అంతర్వేది దేవస్థానం రథం పెద్దది. ఆ తరువాత యానాంలోని మీసాల వేంకటేశ్వరస్వామి దేవస్థానం రథం ఎత్తు 38 అడుగులు. అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారికి సుమారు రూ.1.40 కోట్ల వ్యయంతో 14 అడుగుల ఎత్తు కలిగిన చిన్నరథం, 34 అడుగుల ఎత్తు కలిగిన పెద్ద రథం తయారు చేశాం. ఇవి కాకుండా పలు ప్రముఖ దేవస్థానాలకు రథాలు తయారు చేశాం. రథాలే కాకుండా చెక్కతో వివిధ దేవతామూర్తులు, ఇతర గృహోపకరణాలు కూడా తయారు చేశాం. నూతనంగా లోవకొత్తూరులో నిర్మించిన తలుపులమ్మ తల్లి ఆలయం తలుపులు కూడా మేమే తయారు చేశాం.
– కొల్లాటి శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment