మండి బిర్యానీ తిని తిరిగొస్తూ.. two died in road accident At hyderabad | Sakshi
Sakshi News home page

మండి బిర్యానీ తిని తిరిగొస్తూ..

Published Sat, Jun 22 2024 9:02 AM | Last Updated on Sat, Jun 22 2024 9:03 AM

two died in road accident At hyderabad

అతివేగంతో డివైడర్‌ను ఢీకొన్న బైక్‌ 

ఇద్దరు యువకులు మృతి 

చికిత్స పొందుతున్న మరొకరు  

చాంద్రాయణగుట్ట: బైక్‌పై ట్రిబుల్‌ రైడింగ్‌ చేసుకుంటూ వచ్చి అదుపు తప్పిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో యువకుడు తీవ్ర గాయాలకు గురయ్యాడు. ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్రినాక జయప్రకాష్‌ నగర్‌కు చెందిన అమర్‌సింగ్‌ కుమారుడు ఠాకూర్‌ రాధాకిషన్‌(24) ఏసీ మెకానిక్‌. స్నేహితుడి బర్త్‌డే వేడుకలకు వెళ్లేందుకు స్నేహితుడైన రోహన్‌ చౌకట్‌ వద్ద శుక్రవారం తెల్లవారుజామున బైక్‌ తీసుకున్నాడు.

అనంతరం ఇదే ప్రాంతానికి చెందిన వైజనాథ్‌ ఇంగ్లే అలియాస్‌ సోను(30), మక్దూంపురాకు నిఖిల్‌(18)తో కలిసి బైక్‌పై త్రిబుల్‌ రైడింగ్‌ చేసుకుంటూ చాంద్రాయణగుట్టలో మండి బిర్యానీ తినేందుకు వెళ్లారు. బిర్యానీ తిన్న తర్వాత తిరిగి వస్తుండగా రాధాకిషన్‌ బైక్‌ నడుపుతుండగా, మధ్యలో సోను, వెనుక భాగంలో నిఖిల్‌ కూర్చున్నారు. తెల్లవారుజామున 3.30 గంటలకు కందికల్‌ ఆర్‌వోబీ(రైల్వే ఓవర్‌ బ్రిడ్జి)పై అతివేగంగా బైక్‌ నడపడంతో డివైడర్‌కు తాకుతూ, ఆపై స్తంభానికి ఢీకొట్టారు. 

ఈ ఘటనలో వైజనాథ్‌ ఇంగ్లే అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన రాధాకిషన్‌ను ఎల్‌బీ నగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయాలతో నిఖిల్‌ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇద్దరు యువకుల మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా ఎవరి పుట్టిన రోజు లేదని, కేవలం బిర్యానీ తినేందుకు వెళ్లామని క్షతగాత్రుడు నిఖిల్‌ తెలిపాడని పోలీసులు వెల్లడించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement