![Man Family Members Attacked Young Woman House In Vijayawada - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2022/05/27/Young-Woman.jpg.webp?itok=SQVS-3Xq)
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): నిశ్చితార్థం జరిగి ఏడాదిన్నర అయినా పెళ్లి గురించి మాట్లాడకుండా దాటవేస్తుండటమే కాక పెళ్లెప్పుడు చేసుకుందామని యువతి అడిగినందుకు యువకుడి కుటుంబసభ్యులు ఆమె ఇంటిపై దాడి చేశారు. ఈ ఘటన కొత్తపేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం పాయకాపురం సుందరయ్య నగర్కు చెందిన మునపర్తి రమ్యదుర్గ, ఆమె సమీప బంధువైన భాస్కర్ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన రమ్య, భాస్కర్ కుటుంబ సభ్యులు 2020 నవంబర్ 25వ తేదీన ఇద్దరికీ నిశ్చితార్ధం చేశారు.
చదవండి: ట్యూషన్కు వచ్చిన విద్యార్థినిపై లైంగిక దాడి.. వీడియోలు తీసి..
అయితే భాస్కర్ అక్కకు వివాహం చేయాల్సి ఉందని చెప్పి ఏడాది గడువు అడిగారు. దీనికి రమ్య కుటుంబ సభ్యులు అంగీకరించారు. అది జరిగి ఏడాదిన్నర అయినా భాస్కర్ అక్కకు పెళ్లి చేయలేదు. విసిగి వేసారిన రమ్యదుర్గ ఈ నెల 24వ తేదీన పెళ్లి ఎప్పుడు చేసుకుందామని భాస్కర్కు మెసేజ్ పెట్టింది. అప్పటి నుంచి భాస్కర్ కనిపించకుండా పోయాడు. సెల్కు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని వస్తోంది. ఈ నేపథ్యంలో భాస్కర్ తల్లిదండ్రులు, మరికొంత మంది కలసి బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో రమ్య ఇంటిపై దాడి చేశారు. ఈ ఘటనలో రమ్య తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. రమ్యదుర్గ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment