![Delhi Man Saves Life Of Fellow Biker Injured In Accident Loses His Own - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2023/11/22/crimenews.jpg.webp?itok=Jal8J76G)
ఎవరికి ఏమైతే నాకేంటిలే అని అనుకోకుండా తోటి మనిషికి సాయం చేయాలని ప్రయత్నించిన వ్యక్తి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదంలో చిక్కుకున్న మనషికి సాయం చేయాలని ప్రయత్నించి తానే ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది.
నైరుతి ఢిల్లీలోని కార్గిల్ చౌక్ సమీపంలో నవంబర్ 3న ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ప్రమాదంలో గాయపడిన తోటి బైకర్ను రక్షించి, ఆ ప్లేస్ నుంచి బయలుదేరుతున్న సమయంలో వాటర్ ట్యాంక్ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొనడంతో షంషేర్ సింగ్ అనే వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదైంది.
అమర్జీత్ సింగ్ నవంబర్ 3వ తేదీ రాత్రి 10.20 గంటల సమయంలో గురుగ్రామ్కు వెళుతుండగా, అతని కారును వెనుక నుంచి మోటార్ సైకిల్ ఢీకొట్టింది. అతను మద్యం సేవించి ఉండటంతో నియంత్రణ కోల్పోయి కారును ఢీకెట్టాడు. ఫలితంగా అతని తలకు గాయం అయింది. ఈ క్రమంలో కొంతమంది వ్యక్తులు సహాయం కోసం ఆగారు. వారిలో షంషేర్ కూడా ఉన్నారు. పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో మరొక వ్యక్తి గాయపడిన బైకర్ను తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ముందుకొచ్చాడు. దీంతో అమర్జీత్, షంషేర్ కలిసి గాయపడిన వ్యక్తిని కారులోకి ఎక్కించారు.
అనంతరం అక్కడినుంచి షంషేర్ బయలుదేరుతుండగా వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ అతడిని బలంగా ఢీకొట్టింది. దీంతో షంషేర్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. దీంతో అమర్జీత్ ఆ వాహనాన్ని వెంబడించి, దాన్ని ఓవర్టేక్ చేయగలిగాడు. కానీ డ్రైవర్ అప్పటికే అక్కడినుంచి పారాపోయాడు. వాటర్ ట్యాంకర్ డ్రైవర్పై కేసు నమోదు చేశామనీ, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు అధికారి చెప్పారు. అలాగే షంషేర్ సాయం చేసిన బైకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాదని ద్వారకా నార్త్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment