ఈ వయసులోనే పెళ్లి వద్దని మందలించడంతో.. విద్యార్థి విషాదం! | - | Sakshi
Sakshi News home page

ఈ వయసులోనే పెళ్లి వద్దని మందలించడంతో.. విద్యార్థి విషాదం!

Published Fri, Jan 26 2024 8:30 AM | Last Updated on Fri, Jan 26 2024 11:21 AM

- - Sakshi

అనంతపురం: ప్రేమించిన బాలికతో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఓ విద్యార్థి (మైనర్‌) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... కుందుర్పి మండలం కరిగానిపల్లికి చెందిన సోమనాథ్‌, రుక్మిణమ్మ దంపతుల పెద్ద కుమారుడు అభిషేక్‌ (17) కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి సమీపంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో తనకు పరిచయమైన ఓ బాలికతో ప్రేమలో పడ్డాడు.

రెండు నెలలుగా ఈ వ్యవహారం కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి తన ప్రేమ విషయం తల్లిదండ్రులకు తెలిపి పెళ్లి చేయాలని పట్టుబడ్డాడు. ఈ వయసులోనే పెళ్లి వద్దని బాగా చదువుకుని ఉద్యోగం వచ్చిన తర్వాత అదే అమ్మాయితో పెళ్లి చేస్తామని, అప్పటి వరకూ బుద్ధిగా చదువుకోవాలని తండ్రి సోమనాథ్‌ తెలిపాడు. ఇందుకు అభిషేక్‌ అంగీకరించలేదు. తనకిప్పుడే పెళ్లి చేయాలని పట్టుబడ్డాడు. దీంతో అసహనానికి గురైన తల్లిదండ్రులు.... మైనారిటీ తీరకముందే పెళ్లి చేస్తే జరిగే అనర్థాలను కుమారుడికి వివరించారు.

తాము చెప్పినట్లు నడుచుకోవాలన్నారు. దీంతో మనస్తాపం చెందిన అభిషేక్‌ గురువారం తెల్లవారుజామున తమ తోటలోకి వెళ్లి చింతచెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం పొలానికి వెళ్లిన తండ్రి సోమనాథ్‌... చెట్టు వేలాడుతున్న కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యలు, పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ వెంకటస్వామి తెలిపారు.

ఇవి చదవండి: ‘టౌన్‌ ప్లానింగ్‌’ శివబాలకృష్ణ అరెస్టు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement