-
సంయుక్త నిసార్ ఇస్రో చేతికి
బెంగళూరు: అమెరికాకు చెందిన నాసా, భారత్కు చెందిన ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన నిసార్ ఉపగ్రహం ఇస్రో చెంతకు చేరింది. నాసా–ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్(నిసార్)ను అమెరికాలోని కాలిఫోర్నియాలో తయారుచేయగా ఆ దేశ వాయుసేనకు చెందిన సీ–17 విమానం దానిని బెంగళూరుకు తీసుకొచ్చింది. ‘ నిసార్ భారత్కు బుధవారం వచ్చేసింది. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిౖలైట్ తుది ఇంటిగ్రేషన్ మొదలైంది’ అని చెన్నైలోని అమెరికా కాన్సులేట్ జనరల్ బుధవారం ట్వీట్ చేసింది. వ్యవసాయ సంబంధ మ్యాపింగ్, కొండచరియలు విరిగే ప్రమాదమున్న ప్రాంతాల గుర్తింపు తదితరాల కోసం నిసార్ను వినియోగించనుంది. ఏపీలోని సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి వచ్చే ఏడాదిలో ఈ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించనుంది. -
ఇస్రో సరికొత్త ప్రయోగం.. భూమిపైకి ‘మేఘాట్రోఫిక్–1’ పునరాగమనం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): నియంత్రిత పునరాగమన పద్ధతిలో సరికొత్త ప్రయోగానికి ‘ఇస్రో’ సిద్ధమైంది. 2011 అక్టోబర్ 12న పీఎస్ఎల్వీ–సీ18 రాకెట్ ద్వారా పంపించిన మేఘాట్రోఫిక్ ఉపగ్రహం కాలపరిమితికి మించి పనిచేసి, ప్రస్తుతం అంతరిక్షంలో నిరుపయోగంగా మారింది. దాదాపు 1,000 కిలోల బరువైన మేఘాట్రోఫిక్–1 (ఎంటీ–1) ఉపగ్రహాన్ని ఉçష్ణమండలంలోని వాతావరణం, వాతావరణ పరిస్థితులపై అధ్యయనం కోసం ఇస్రో, ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థ (సీఎన్ఈఎస్) సంయుక్తంగా తయారుచేసి ప్రయోగించాయి. దీని కాలపరిమితి మూడేళ్లు. కానీ, 2021 దాకా సేవలందించింది. ప్రస్తుతం వ్యర్థంగా మారిన ఈ ఉపగ్రహంలో 125 కిలోల ద్రవ ఇంధనముంది. ఇది అంతరిక్షంలో పేలిపోయి ఇతర ఉపగ్రహాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని ఇస్రో అంచనా వేసింది. ఈ నేపథ్యంలో దానిని సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చి, పసిఫిక్ మహాసముద్రంలో కూల్చేందుకు మంగళవారం సరికొత్త ఆపరేషన్కు శ్రీకారం చుట్టనున్నారు. భూమిపైకి మేఘాట్రోఫిక్–1 రీఎంట్రీ కోసం అందులో ఉన్న ఇంధనం సరిపోతుందని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు. 26న ఎల్వీఎం3–ఎం3 ప్రయోగం లాంచ్ వెహికల్ మార్క్3–ఎం3 (ఎల్వీఎం3–ఎం3) ప్రయోగాన్ని ఈ నెల 26న నిర్వహించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. యునైటెడ్ కింగ్డమ్కు చెందిన నెట్వర్క్ యాక్సెస్ అసోసియేట్ లిమిటెడ్, ఇండియన్ భారతి ఎంటర్ప్రైజెస్ సంయుక్త భాగస్వాములుగా వన్వెబ్ ఇండియా–2 పేరుతో 5,796 కిలోల బరువైన 36 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను రెండోసారి వాణిజ్యపరంగా ప్రయోగిస్తున్నాయి. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ ‘షార్’లోని రెండో ప్రయోగ వేదిక దీనికి వేదిక కానుంది. షార్లోని వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్లో రెండు దశల రాకెట్ అనుసంధానం పూర్తి చేశారు. క్రయోజనిక్ దశ మాత్రమే పెండింగ్లో ఉంది. ప్రయోగించబోయే 36 ఉపగ్రహాలు ఇప్పటికే షార్కు చేరుకున్నాయి. వీటికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. హీట్షీల్డ్లో అమర్చే పనులు జరుగుతున్నాయి. -
డిజిటల్ టీవీ రిసీవర్లకు నాణ్యతా ప్రమాణాలు
న్యూఢిల్లీ: మూడు రకాల ఎలక్ట్రానిక్ డివైజ్లకు (డిజిటల్ టీవీ రిసీవర్లు, యూఎస్బీ టైప్–సీ చార్జర్లు, వీడియో నిఘా వ్యవస్థలు –వీఎస్ఎస్) సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నాణ్యతా ప్రమాణాలను రూపొందించింది. బిల్ట్ఇన్ శాటిలైట్ ట్యూనర్లు ఉన్న డిజిటల్ టీవీ రిసీవర్ల కోసం ఐ 18112:2022 స్పెసిఫికేషన్ను కేటాయించింది. ఈ ప్రమాణాలతో తయారైన టెలివిజన్లు .. కేవలం డిష్ యాంటెనాను కనెక్ట్ చేయడం ద్వారా ఉచిత టీవీ, రేడియో చానల్స్ను అందుకోవచ్చని వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది. ప్రస్తుతం టీవీ వీక్షకులు వివిధ పెయిడ్, ఉచిత చానల్స్ను (ఆఖరికి దూరదర్శన్ ఛానళ్లు) చూడాలంటే సెట్–టాప్ బాక్సులను కొనుగోలు చేయాల్సి ఉంటోంది. అటు సీ–టైప్ యూఎస్బీలు, కేబుల్స్ మొదలైన వాటికి (IS/IEC62680&1&3:2022) స్పెసిఫికేషన్ కేటాయించారు. -
భూమ్మీద పడనున్న నాసా పాత ఉపగ్రహం
కేప్ కెనావెరల్ : అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన 38 ఏళ్ల నాటి పాత ఉపగ్రహం ఒకటి అంతరిక్షం నుంచి భూమ్మీద పడబోతోంది. అయితే దీనివల్ల వచ్చే ముప్పు అత్యంత తక్కువని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. 2,450 కేజీలున్న ఈ ఉపగ్రహం సేవా కాలం ముగిసిపోయింది. దీనిని అంతరిక్షంలో మండిస్తారు. అయినప్పటికీ ఆ ఉపగ్రహం శిథిలాలు చిన్న చిన్నవి భూమిపై పడే అవకాశాలున్నాయి. 9,400 శిథిలాల ముక్కల్లో ఒక్క దాని ద్వారా మాత్రమే ప్రమాదం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి ది ఎర్త్ రేడియేషన్ బడ్జెట్ శాటిలైట్ (ఈఆర్బీఎస్) భూమిపైకి పడిపోనుంది. 1984లో ప్రయోగించిన ఈ ఉపగ్రహం రెండేళ్లు సేవలు అందించింది. సూర్యుడి నుంచి రేడియో ధార్మిక శక్తిని భూమి ఎలా గ్రహిస్తుందన్న దానిపై ఈ ఉపగ్రహం సేవలు చేసింది. 2005 నుంచి దీని సేవలు నిలిచిపోయాయి. -
పదేళ్ళకు ఎంఎస్వోల రిజిస్ట్రేషన్ రెన్యువల్
న్యూఢిల్లీ: శాటిలైట్ టీవీ ఎంఎస్వోల (మల్టీ–సిస్టం ఆపరేటర్లు) రిజిస్ట్రేషన్ను 10 ఏళ్ల వ్యవధికి రెన్యువల్ చేయాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కేంద్రానికి సూచించింది. ఇందుకోసం ప్రాసెస్ ఫీజును రూ. 1 లక్షగా నిర్ణయించాలని సిఫార్సు చేసింది. కేబుల్ టీవీ నెట్వర్క్స్ నిబంధనల్లో ఎంఎస్వోల రిజిస్ట్రేషన్ల రెన్యువల్ నిబంధనలు లేకపోవడంతో తగు సూచనలు చేయాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ కోరిన మీదట ట్రాయ్ ఈ మేరకు సిఫార్సులు చేసింది. రెన్యువల్కి దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరిగేలా చూడాలని, బ్రాడ్కాస్ట్ సేవా పోర్టల్ ద్వారా పత్రాలన్నీ డిజిటల్ విధానంలో అప్లోడ్ చేసే వెసులుబాటు కల్పించాలని పేర్కొంది. అలాగే రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ కోసం పెండింగ్లో ఉన్న ఎంఎస్వోల జాబితాను, నిర్దిష్ట గడువులోగా దరఖాస్తు చేసుకోని వాటి లిస్టును పోర్టల్లో పొందుపర్చాలని సూచించింది. ఒకవేళ దరఖాస్తు పరిశీలనలో ఉన్నా, నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో ఉంచినా తుది నిర్ణయం తీసుకునే వరకూ సదరు ఎంఎస్వోలకు పొడిగింపునివ్వాలని పే ర్కొంది. గడువు తేదీ ముగియడానికి ఏడు నుంచి రెండు నెలల ముందు వరకూ రెన్యువల్ కోసం దరఖాస్తులను స్వీకరించవచ్చని ట్రాయ్ సూచించింది. రెండు నెలల కన్నా తక్కువ సమయంలో దరఖాస్తు చేసుకుంటే జాప్యానికి చూపిన కారణాలను పరిశీలించి శాఖ తగు నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. -
ఎంటీఏఆర్, ఇన్–స్పేస్ జోడీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రక్షణ, అంతరిక్ష రంగానికి అవసరమైన ఉత్పత్తుల తయారీలో ఉన్న ఎంటీఏఆర్ టెక్నాలజీస్ తాజాగా ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్, ఆథరైజేషన్ సెంటర్తో (ఇన్–స్పేస్) ఒప్పందం కుదుర్చుకుంది. ఎంవోయూ కాలపరిమితి మూడేళ్లు. ఇందులో భాగంగా రెండు దశల నుండి భూమికి తక్కువ కక్ష్య వరకు ప్రయాణించే సెమి క్రయోజనిక్ సాంకేతికత ఆధారిత పూర్తి ద్రవ చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం రూపకల్పన, అభివృద్ధి బాధ్యతలను ఎంటీఏఆర్ చేపడుతుంది. 500 కిలోల బరువు మోయగల సామర్థ్యంతో ఈ వాహనాన్ని రూపొందిస్తారు. -
సొంతానికి ఓ శాటిలైట్.. మనకు మనమే సమాచారం తెలుసుకునే వీలు!
రమేష్ హైదరాబాద్లో ఉంటున్నాడు. వచ్చే వారం రోజులు వర్షాలు అనే సమాచారం ఉంది. అయితే, తాను ఉంటున్న ప్రాంతంలో వర్షాలు పడతాయో లేదో తెలుసుకునేందుకు తాను పంపిన ప్రైవేటు శాటిలైట్ ద్వారా వర్షం పడుతుందా? లేదా చూశాడు. వర్షం పడదని నిర్ధారించుకుని తన పనిలో మునిగిపోయాడు. ఒక ప్రైవేటు విద్యా సంస్థ.. దేశవ్యాప్తంగా ఉన్న తన నెట్వర్క్లోని అన్ని విద్యా సంస్థల్లో ఒకేసారి ఆన్లైన్లో పాఠాలు బోధించేందుకు ఎవరిపై ఆధారపడాల్సిన అవసరంలేకుండా తమ విద్యార్థి ప్రయోగించిన శాటిలైట్ ద్వారా నేరుగా సేవలను ఉపయోగించుకుంటోంది. అదీ తక్కువ ఖర్చుతోనే.. ఒక ప్రైవేటు సంస్థ మారుమూల ప్రాంతాల్లో పనులను చేపడుతోంది. దేశవ్యాప్తంగా అటు కశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించేందుకు తాను సొంతంగా నిర్వహిస్తున్న శాటిలైట్ ఆధారంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆదేశాలు జారీచేస్తోంది. ..అవును కేంద్రం కొత్తగా అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తూ తీసుకున్న నిర్ణయంతో మనమూ సొంతంగా ఒక ప్రైవేటు శాటిలైట్ను ప్రయోగించుకుని సేవలను పొందే రోజు దగ్గర్లోనే ఉంది. ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ సొంతంగా ఏర్పాటుచేసుకున్న అంతరిక్ష రవాణా కంపెనీ ‘స్పేస్ ఎక్స్’ తరహాలో కాకపోయినా.. ప్రైవేటు పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు, మెడికల్ సంస్థలు మొదలైనవి తమ సొంత శాటిలైట్ ద్వారా నెట్వర్క్ను ఏర్పాటుచేసుకునే వీలు కలగనుంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు ఎప్పుడో తలుపులు తెరిచారు. కానీ, భారత్లో మాత్రం కేంద్రం ఇటీవలే ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వేతర ప్రైవేటు సంస్థలు (ఎన్జీపీఈ).. అంతరిక్ష పరిశోధనలను తమ సొంత అవసరాలకు స్వయంగా చేసుకునేందుకు వీలుగా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. తద్వారా విద్యా సంస్థలు, స్టార్టప్స్, పరిశ్రమలకు ఎండ్ టు ఎండ్ (నేరుగా సమాచారం చేరే విధంగా) అంతరిక్ష కార్యక్రమాల నిర్వహణకు అవకాశం కల్పించాలని సంకల్పించింది. ఇందుకోసం ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్–స్పేస్)ను ఏర్పాటుచేసింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)తో అనుసంధానం చేసుకుంటూ ప్రైవేటు సంస్థలకు సహాయ సహకారాలతో పాటు నియంత్రణ కూడా చేస్తుంది. కేంద్రం తాజా నిర్ణయంతో ఇస్రోకు చెందిన సాధన సంపత్తిని ప్రధానంగా రాకెట్ లాంచింగ్ కేంద్రాలతో పాటు ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రైవేటు సంస్థలూ వినియోగించుకునే వెసులుబాటు లభించింది. ఇక బోలెడు అవకాశాలు.. ప్రైవేటు పెట్టుబడులను అనుమతించడంతో అంతరిక్ష రంగంలో అనతికాలంలోనే భారత్ గొప్ప ముందడుగు వేసే అవకాశాలున్నాయని అంతరిక్ష పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు వారు ఒక ఉదాహరణ చెబుతున్నారు. వాస్తవానికి మార్స్ (అంగారకుడు)లో అడుగుపెట్టేందుకు భారత్ కేవలం 75 బిలియన్ డాలర్లు మాత్రమే వెచ్చించింది. మిగిలిన పాశ్చాత్య దేశాల కంటే చాలా తక్కువ ఖర్చుతో మనం అంగారకుడిపై అడుగు పెట్టగలిగామనేది వారి అభిప్రాయం. అంతేకాక.. భారత్లో ఉన్న నిపుణులైన యువత ఈ అవకాశాలను మరింత త్వరగా అందిపుచ్చుకునే అవకాశం ఉందనేది వారి అంచనా. ప్రైవేటు సంస్థలకు అవకాశమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత మొట్టమొదటగా విశాఖ, హైదరాబాద్కు చెందిన యువకులు.. స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ద్వారా దేశంలోనే మొదటి ప్రైవేట్ రాకెట్ను శ్రీహరికోట నుంచి 2022 నవంబరు 18న విజయవంతంగా ప్రయోగించారు. అవకాశాలు అందుబాటులోకి వస్తే భారత యువత రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్లి ప్రపంచ మార్కెట్లో త్వరలోనే పాగావేసే అవకాశం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 2019 నాటికి భారత అంతరిక్ష మార్కెట్ విలువ 7 బిలియన్ డాలర్లు కాగా... ఇది కాస్తా 2025 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. స్టార్టప్స్ షురూ.. ప్రపంచ అంతరిక్ష మార్కెట్ విలువ 2020 నాటికి 447 బిలియన్ డాలర్లు కాగా.. 2025 నాటికి ఇది 600 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. వాస్తవానికి అంతర్జాతీయంగా ఇప్పటికే స్పేస్ ఎయిర్క్రాఫ్ట్ ఎక్విప్మెంట్, శాటిలైట్ కమ్యూనికేషన్స్లో ప్రైవేటు సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. రష్యా దాడి తర్వాత ఉక్రెయిన్లో దెబ్బతిన్న సమాచార వ్యవస్థ పునరుద్ధరణలో స్టార్ లింక్ ప్రధాన పాత్ర పోషించింది. ‘స్పేస్ ఎక్స్’ సంస్థ అంతరిక్షంలో ఏకంగా 3,271 శాటిలైట్స్ను ప్రయోగించింది. ఇందులో 3,236 శాటిలైట్స్ ప్రస్తుతం పనిచేస్తున్నాయి. అయితే, భారత్లో కూడా అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడుల క్రమం ఇప్పుడే మొదలవుతోంది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే అంతరిక్ష రంగ పరిశోధనలకు మనం వెచ్చిస్తున్న మొత్తం తక్కువే. అమెరికా అంతరిక్ష బడ్జెట్ 41 బిలియన్ డాలర్లు కాగా.. ఇందులో నాసా ప్రాజెక్టుల మీద 23.3 బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతున్నారు. మరోవైపు.. భారత్ అంతరిక్ష బడ్జెట్ రూ.13,700 కోట్లు మాత్రమే. అయితే, ఎవరి ప్రమేయం లేకుండా ఎండ్ టు ఎండ్ సర్వీసులను ప్రైవేటు సంస్థలు పొందేందుకు వీలుగా జూన్ 2022లో ప్రైవేటు రంగాన్ని ఆహ్వానిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో భారత్లోనూ వేగం పుంజుకునే అవకాశాలున్నాయి. భారత్లో ఇప్పటికే ఇస్రో వద్ద 60 స్టార్టప్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. సమాచారం మరింత ఖచ్చితంగా.. అంతరిక్షంలో మరిన్ని శాటిలైట్లను ప్రయోగించడం ద్వారా మారుమూల ప్రాంతాల సమాచారాన్ని కూడా మరింత సమగ్రంగా, ఖచ్చితంగా విశ్లేషించే అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. నిజానికి.. ఇంట్లో కూర్చుని మనం వివిధ సినిమాలు, న్యూస్, సీరియల్స్, గేమ్స్ చూస్తున్నామంటే అందుకు కారణం శాటిలైట్సే. ఎక్కడో దూరాన ఉన్న మన వారితో ఫోన్లో వీడియో కాల్లో మాట్లాడుతున్నామన్నా.. మనం ఉన్న చోటునుంచే ఎక్కడో ఉన్న వారి బ్యాంకు అకౌంట్లోకి నగదు బదిలీ చేస్తున్నామన్నా.. ఎక్కడెక్కడో ఉన్న కంపెనీల ప్రతినిధులు ఆన్లైన్లో సమావేశం కావడం, ఫలానా తేదీన, ఫలానా ప్రాంతాల్లో వర్షాలు పడతాయన్న సమాచారం కానీ.. మనం ఉన్న ప్రాంతం నుంచి ఫలానా ప్రదేశం ఎంతదూరం ఉందన్న సమాచారం కానీ మనకు వస్తోందంటే శాటిలైట్స్ ఎప్పటికప్పుడు అందిస్తున్న సమాచారమే కారణం. ఇక అంతరిక్షంలోకి మరిన్ని శాటిలైట్లను ప్రయోగిస్తే ఏయే లాభాలు కలుగుతాయంటే.. వాతావరణంలో వచ్చే మార్పులను మరీ సూక్ష్మంగా విశ్లేషించొచ్చు. తద్వారా ఆయా సమాచారాన్ని రైతులకు, సంస్థలకు అందించడం ద్వారా నష్టాన్ని నివారించే వీలు కలుగుతుంది. స్టూడెంట్ శాటిలైట్స్ ద్వారా మారుమూలప్రాంతాలకు చెందిన సమాచారాన్ని తక్కువ ఖర్చుతో సేకరించొచ్చు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్స్కు కనెక్ట్ కాని 49 శాతం మంది ప్రజలు వీటి ద్వారా సమాచారాన్ని చేరవేసేందుకు అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో తక్కువ ఖర్చుతో తయారుచేసే చిన్నచిన్న శాటిలైట్లు ప్రధానపాత్ర పోషించనున్నాయి. తక్కువ ఖర్చుతో ఆయా సంస్థలు అంతరిక్ష నెట్వర్క్ను ఏర్పాటుచేసుకోవడం ద్వారా ఇతరులకు తమ సమాచారమేదీ పొక్కకుండా కాపాడుకోవచ్చు. మెడికల్ రంగంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశముంది. మన భూమిని ప్రకృతి వైపరీత్యాల నుంచి, వాతావరణ మార్పుల నుంచి కాపాడుకునే వీలుంది. -
NASA's DART Mission: నాసా ప్రయోగం దిగ్విజయం.. గ్రహశకలాల్ని ఇక దారి మళ్లించగలం!
వాషింగ్టన్: అంతరిక్ష సవాళ్లను దీటుగా ఎదుర్కొనే దిశగా కీలక ముందడుగు పడింది. భూమిని ఢీకొట్టే ఆస్కారమున్న గ్రహశకలాలను దారి మళ్లించి మానవాళికి ముప్పును తప్పించగలమన్న భరోసా ఏర్పడింది. భూమికి సుదూరంగా ఉన్న ఓ గ్రహశకలాన్ని ఉపగ్రహంతో ఢీకొట్టించే లక్ష్యంతో నాసా చేపట్టిన డబుల్ ఆస్టిరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డార్ట్) విజయవంతమైంది. ఇందుకోసం 10 నెలల క్రితం ప్రయోగించిన 570 కిలోల ఉపగ్రహం లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. భూమికి 108 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న డైమోర్ఫస్ అనే బుల్లి గ్రహశకలాన్ని ముందుగా నిర్దేశించిన మేరకు మంగళవారం తెల్లవారుజామున గంటకు 22,530 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టింది. దాంతో నాసా ప్రధాన కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. శాస్త్రవేత్తలంతా పరస్పరం అభినందనలు తెలుపుకుంటూ సందడి చేశారు. అన్ని అంచనాలనూ అధిగమిస్తూ ప్రయోగం దిగ్విజయంగా ముగిసిందని నాసా ప్రకటించింది. అంతరిక్షంలో అతి చిన్న శకలాన్ని కూడా అత్యంత కచ్చితత్వంతో ఢీకొట్టేలా ఉపగ్రహాలను సంధించగలమని రుజువైందని నాసా సైన్స్ మిషన్ డైరెక్టరేట్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ థామస్ జుర్బచెన్ అన్నారు. కెనైటిక్ ఇంపాక్ట్ టెక్నిక్ సాయంతో జరిగిన ఈ ప్రయోగం భూగోళ పరిరక్షణలో అతి పెద్ద ముందడుగని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ చెప్పారు. ‘‘నిన్నామొన్నటిదాకా శాస్త్ర సాంకేతిక కల్పనగా తోచిన విషయం ఒక్కసారిగా వాస్తవ రూపు దాల్చింది. నమ్మకశ్యం కానంతటి ఘనత ఇది. భావి అంతరిక్ష ప్రమాదాల బారినుంచి భూమిని కాపాడుకోవడానికి ఒక చక్కని దారి దొరికినట్టే’’ అంటూ హర్షం వెలిబుచ్చారు. ప్రభావం తేలేందుకు మరికాస్త సమయం... డిడిమోస్ అనే మరో చిన్న గ్రహశకలం చుట్టూ డైమోర్ఫస్ తిరుగుతోంది. దాని వేగాన్ని తగ్గించడం ద్వారా కక్ష్యలో కొద్దిపాటి మార్పు తీసుకురావడం ఈ ప్రయోగ ప్రధాన లక్ష్యం. అది నెరవేరిందీ లేనిదీ నిర్ధారించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల నుంచి శక్తిమంతమైన టెలిస్కోప్ల ద్వారా నాసా బృందం డైమోర్పస్ను కొద్ది వారాల పాటు నిరంతరం గమనిస్తుంది. డార్ట్క్రాఫ్ట్ ఢీకొట్టడం వల్ల డైమోర్ఫస్ కక్ష్య కనీసం ఒక్క శాతం కుంచించుకుపోతుందని అంచనా వేస్తోంది. ఆ లెక్కన డిడిమోస్ చుట్టూ అది పరిభ్రమించే సమయం 10 నిమిషాల దాకా తగ్గాలి. డిడిమోస్ జోలికి వెళ్లకుండా డైమోర్ఫైస్ను మాత్రమే అత్యంత కచ్చితత్వంతో ఢీకొట్టడం మామూలు విజయం కాదని థామస్ చెప్పారు. ఇందుకోసం అత్యాధునిక డ్రాకో నావిగేషన్ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. నియో... డార్ట్ వారసుడు డార్ట్ ప్రయోగం సఫలమవడంతో భూమికి అంతరిక్ష ముప్పును పసిగట్టి నివారించే ప్రయోగాల పరంపరలో తదుపరి దశకు నాసా తెర తీస్తోంది. డార్ట్ ప్రాజెక్టుకు కొనసాగింపుగా నియర్ అర్త్ ఆబ్జెక్ట్ (నియో) సర్వేయర్ పేరుతో రెండో దశ ప్లానెటరీ డిఫెన్స్ మిషన్ను రూపొందిస్తోంది. దీన్ని త్వరలో పట్టాలపైకి ఎక్కించనున్నట్టు నాసా ప్లానెటరీ డిఫెన్స్ ఆఫీసర్ లిండ్లీ జాన్సన్ ప్రకటించారు. భూమికి సమీపంలో ఉన్న ప్రమాదకర గ్రహశకలాలను కనిపెట్టి వాటితో భవిష్యత్తులో ముప్పు రాకుండా ముందే జాగ్రత్త పడటం దీని లక్ష్యమన్నారు. డైమోర్ఫస్ను ఉపగ్రహం ఢీకొట్టేందుకు కేవలం 43 సెకన్ల ముందు తీసిన ఫొటో -
రికార్డు ధరకు షారుక్ 'జవాన్' డిజిటల్ రైట్స్.. ఎన్ని కోట్లో తెలుసా?
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం'జవాన్'. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ చిత్రం డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ చేజిక్కించుకోగా.. శాటిలైట్ హక్కులను జీ నెట్వర్క్ కొనుగోలు చేసింది. (చదవండి: Shahrukh And Salman Khan: ఒకే సినిమాలో ఖాన్ త్రయం !.. సౌత్ డైరెక్టర్తో చిత్రం) సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి నాన్ థియేట్రికల్ హక్కులే షాకింగ్ ధర పలికినట్లు సమాచారం. ఓటీటీ హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్.. శాటిలైట్ హక్కులు సొంతం చేసుకున్న జీ దాదాపు రూ.250 కోట్లు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మూవీ మేకర్స్ నుంచి మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రంలో షారుక్ ఖాన్కు జంటగా నయనతార నటిస్తోంది. -
అంతరిక్షంలో... ఆర్మగెడాన్!
1998లో వచ్చిన సూపర్హిట్ హాలీవుడ్ మూవీ ఆర్మగెడాన్ గుర్తుందా? భూమిని ఢీకొట్టేందుకు శరవేగంగా దూసుకొచ్చే గ్రహశకలం బారి నుంచి మానవాళిని కాపాడే ఇతివృత్తంతో రూపొందింది. అంతరిక్షంలో సోమవారం అచ్చంగా అలాంటి ప్రమాదమే ఒకటి జరగనుంది. కాకపోతే రివర్సులో! ఏడాది క్రితం నాసా ప్రయోగించిన ఉపగ్రహం ఒకటి గంటకు ఏకంగా 24 వేల కిలోమీటర్ల వేగంతో ఓ గ్రహశకలాన్ని ఢీకొట్టనుంది! కాకపోతే, భూమికి 108 కోట్ల కిలోమీటర్ల దూరంలో జరగనున్న ఈ ప్రమాదం యాదృచ్చికం కాదు. నాసా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదే! అంతరిక్ష రక్షణ పరీక్షల్లో భాగంగా డబుల్ ఆస్టిరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డార్ట్) పేరుతో నాసా తొలిసారిగా ఇలాంటి ప్రయోగానికి తెర తీసింది. ఈ ప్రయోగం అనుకున్నట్టుగా సఫలమైతే ఎప్పుడైనా గ్రహశకలాలు భూమిని ఢీకొట్టే ముప్పు ఎదురైతే దాన్ని తప్పించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని నాసా భావిస్తోంది. 32.5 కోట్ల డాలర్ల ఖర్చుతో దాదాపు ఏడాది క్రితం నాసా ఈ డార్ట్ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా గత నవంబర్లో డార్ట్క్రాఫ్ట్ పేరుతో ఓ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. అది సోమవారం (భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 4.44 గంటలకు) డైమోర్ఫస్ అనే ఓ బుల్లి గ్రహశకలాన్ని ఢీకొట్టనుంది. ఇది తనకన్నా పెద్దదైన డిడిమోస్ అనే గ్రహశకలం చుట్టూ పరిభ్రమిస్తోంది. ఈ రెండు శకలాలూ సోమవారం భూమికి అత్యంత సమీపానికి, అంటే 108 కోట్ల కిలోమీటర్ల దూరంలోకి రానున్నాయి. అందుకే ఈ ముహూర్తాన్ని నాసా ఎంచుకుంది. ఈ ప్రయోగాన్ని నాసా యూట్యూబ్ చానళ్లో లైవ్లో చూడొచ్చు కూడా. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఉపగ్రహం ఢీకొన్నాక గ్రహశకలం కాంతిలో వచ్చే మార్పులను స్పష్టంగా చూడొచ్చని అంతరిక్ష శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏం జరగనుంది? ► డైమోర్ఫస్ కేవలం 525 అడుగుల వెడల్పున్న బుల్లి గ్రహశకలం. ► డార్ట్క్రాఫ్ట్ గంటకు 24 వేల కి.మీ. బ్రహ్మాండమైన వేగంతో వెళ్లి దాన్ని ఢీకొంటుంది. ► తద్వారా డైమోర్ఫస్ తాలూకు వేగాన్ని కాస్త తగ్గించి దాని కక్ష్యలో కొద్దిగా మార్చడం ఈ ప్రయోగం ప్రధానోద్దేశం! ► డైమోర్ఫస్ కక్ష్యలో చోటుచేసుకునే మార్పును శక్తిమంతమైన టెలిస్కోపుల ద్వారా పరిశీలిస్తారు. ► డైమోర్ఫస్ ప్రస్తుతం డిడిమోస్ గ్రహశకలం చుట్టూ 11 గంటల 55 సెకన్లకు ఒకసారి చొప్పున తిరుగుతోంది. ► డార్ట్క్రాఫ్ట్ ఢీకొట్టి ఆ వేగంలో కనీసం 73 సెకన్ల మార్పయినా వస్తే ప్రయోగం సక్సెస్ అయినట్టు. లాభమేమిటి? ► భూమిని ఢీకొట్టగల గ్రహశకలాల వంటివాటిని ముందే గుర్తించే పరిజ్ఞానం ఇప్పటికే మనకు అందుబాటులో ఉంది. ఈ ప్రయోగం గనుక విజయవంతమైతే అలాంటి వాటిని ముందే ఏ డార్ట్క్రాఫ్ట్తోనో ఢీకొట్టించడం ద్వారా వాటి ప్రయాణ మార్గాన్ని మార్చవచ్చు. తద్వారా భూమి అంతరించిపోగల పెను ప్రమాదాన్ని తప్పించవచ్చు. ► నాసా నిర్వచనం ప్రకారం 460 అడుగుల కంటే పెద్దదైన అంతరిక్ష శకలం ఏదైనా భూమికి 46 లక్షల మైళ్ల కంటే సమీపానికి వస్తే దానితో భూమికి డేంజరని భావిస్తారు. ► భూమికి సమీపంలో ఇప్పటిదాకా 27 వేలకు పైగా గ్రహశకలాలను గుర్తించారు. కానీ ప్రస్తుతానికైతే వీటిలో మనకు ప్రమాదకరమైనవి లేవు. ► చివరగా, ఈ ప్రయోగంతో భూమికి వచ్చిన ముప్పేమీ లేదని నాసా భరోసా ఇస్తోంది! – సాక్షి, నేషనల్డెస్క్ -
ఇంజిన్లో సాంకేతిక సమస్య.. ఆర్టెమిస్ ప్రయోగం వాయిదా
కేప్ కెనావెరాల్: చంద్రుడిపైకి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ చేపట్టిన ఆర్టెమిస్–1 ప్రయోగం సోమవారం వాయిదా పడింది. ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో మూన్ మిషన్ను నిలిపివేస్తున్నట్లు నాసా ప్రకటించింది. ఇంజిన్ నుంచి ఇంధనం లీక్ అయినట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం కౌంట్డౌన్ ప్రారంభమైనప్పటికీ చివరి గంటలో నాసా శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని నిలిపివేశారు. మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారన్న విషయాన్ని వెల్లడించలేదు. సెప్టెంబర్ మొదటి వారంలో ఉండవచ్చని సమాచారం. ఆర్టెమిస్–1 ప్రయోగంలో భాగంగా రాకెట్లో 10 లక్షల గ్యాలన్ల అతిశీతల హైడ్రోజన్, ఆక్సిజన్ నింపాల్సి ఉంది. 4 ఇంజిన్లు ఉన్న ఈ రాకెట్లో ఒకదాంట్లో ఇంధనం లీక్ అవుతున్నట్లు గుర్తించారు. లాంచ్ప్యాడ్పై రాకెట్ ఉన్నచోట పిడుగు పడడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైనట్లు భావిస్తున్నారు. సమస్యను సరిదిద్దడానికి కొంత సమయం పట్టొచ్చు. 2024లో ఆర్టెమిస్–2, 2025లో ఆర్టెమిస్–3 ప్రయోగాలు చేపట్టేందుకు నాసా సన్నద్ధమవుతోంది. చందమామపైకి వ్యోమగాములను పంపించడమే కాదు, అక్కడ మానవుల శాశ్వత నివాసానికి పునాదులు వేయడమే ఈ ప్రయోగాల లక్ష్యం. -
సూర్యుడిపై ఇస్రో గురి: ‘ఆదిత్య ఎల్1’ ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో), అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సంయుక్తంగా సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు 2023 జనవరి నెలాఖరులోపు ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. 2018లోనే దీనిపై ఇస్రో, నాసా చర్చలు జరిపాయి. 2020లోనే ఈ ప్రయోగం చేయాల్సి ఉంది. కానీ కోవిడ్ వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు మళ్లీ ఈ ప్రయోగం తెర పైకి వచ్చింది. దీనికి భారత ప్రభుత్వం నుంచి కూడా అనుమతి వచ్చింది. దీంతో 2023 జనవరిలో శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ–సీ56 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ విషయాన్ని షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ మీడియాకు వెల్లడించారు. మరో ఘనత దిశగా.. బెంగళూరులోని యు.ఆర్.రావు స్పేస్ సెంటర్లో ఈ ఉపగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే చంద్రుడిపై పరిశోధనలకు చంద్రయాన్–1, చంద్రయాన్–2, అంగారకుడిపై పరిశోధనలకు మంగళ్యాన్–1 అనే మూడు ప్రయోగాలను అతి తక్కువ వ్యయంతో మొదటి ప్రయత్నంలోనే ప్రయోగించి ఇస్రో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఇదే క్రమంలో ఇప్పుడు సూర్యుడి పైకి ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నారు. ఈ ఉపగ్రహం 1,475 కిలోల బరువు ఉంటుంది. ఇందులో పేలోడ్స్ బరువు 244 కిలోలు కాగా, ద్రవ ఇంధనం బరువు 1,231 కిలోలుంటుంది. సూర్యుడి వైపు తీసుకెళ్లడం కోసం ఎక్కువ ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తున్నారు. తొలుత ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టిన తర్వాత.. ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజియన్ బిందువు–1(ఎల్–1)లోకి చేరవేయడానికి 177 రోజుల సమయం పడుతుంది. అక్కడి నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా సూర్యుడిపై మార్పులను నిరంతరం పరిశోధించేందుకు వీలవుతుందని అంచనా వేస్తున్నారు. ఉపగ్రహంలో ఆరు పేలోడ్స్ అమర్చి పంపిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను అధ్యయనం చేసేందుకు.. సూర్యుడి వెలుపలి వలయాన్ని కరోనా అంటారు. సౌర గోళానికి వేల కిలోమీటర్ల దూరం వరకు ఇది విస్తరించి ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత దాదాపు పది లక్షల డిగ్రీల కెల్విన్ వరకు ఉంటుంది. సూర్యుడి అంతర్భాగ ఉష్ణోగ్రత ఆరు వేల కెల్విన్ డిగ్రీల వరకు ఉంటుంది. కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి కారణం అంతు చిక్కడం లేదు. దీనిపైన ఆదిత్య–ఎల్1 ద్వారా పరిశోధనలు చేయనున్నారు. అలాగే సౌర తుపాన్ సమయంలో భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని అంచనా వేశారు. ఈ ప్రయోగం ద్వారా ఫొటో స్పియర్, క్రోమో స్పియర్లపై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
ISRO: మరో ప్రయోగానికి ఇస్రో రెడీ..
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సూళ్లూరుపేటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ మొదటి ప్రయోగ వేదిక నుంచి ఆదివారం ఉదయం 9.18 గంటలకు స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ డీ1)ను ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ప్రయోగాన్ని 13.2 నిమిషాల్లోనే పూర్తి చేయనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు మిషన్ సంసిద్ధత సమావేశం నిర్వహించి ప్రయోగ తేదీని అధికారికంగా ప్రకటిస్తారు. ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో రాకెట్కు తుది విడత తనిఖీలు నిర్వహించి ప్రయోగానికి 7 గంటల ముందు.. అంటే ఆదివారం రాత్రి 2.18 గంటలకు కౌంట్డౌన్ను ప్రారంభిస్తారు. ప్రయోగంలోని మూడు దశలను ఘన ఇంధనం సాయంతో నిర్వహించనున్నారు. చదవండి: టీచర్లకు గుడ్న్యూస్.. ప్రమోషన్లకు విద్యాశాఖ గ్రీన్సిగ్నల్! సమాచారం ఎప్పటికప్పుడు చేరవేసేలా.. చిన్నచిన్న ఉపగ్రహాలతో అంతరిక్షంలోకి దూసుకెళ్లేలా ఎస్ఎస్ఎల్వీ డీ1ను ఇస్రో రూపొందించింది. 34 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువు ఉండే ఈ రాకెట్ ద్వారా రెండు ఉపగ్రహాలను రోదసీలోకి పంపిస్తున్నారు. ఇందులో దేశ అవసరాలకు సంబంధించిన 135 కేజీల మైక్రోశాట్–2ఏ(ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్) ఉపగ్రహంతో పాటు దేశంలోని 75 జిల్లా పరిషత్ హైస్కూల్స్కు చెందిన 750 మంది గ్రామీణ విద్యార్థినులు తయారు చేసిన ‘ఆజాదీ శాట్’ను ప్రయోగిస్తున్నారు. 8 కిలోల ఆజాదీశాట్ ఉపగ్రహం ఇస్రో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన భూ పరిశీలన ఉపగ్రహమే మైక్రోశాట్ 2ఏ. అధిక రిజల్యూషన్తో కూడిన ప్రయోగాత్మక ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఇది. ఈ ఉపగ్రహం భూమికి తక్కువ ఎత్తులో ఉండి అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో భూమి మీద ఉన్న వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి సమాచారాన్ని చేరవేస్తుంటుంది. విద్యార్థినులు తీర్చిదిద్దిన బుల్లి ఉపగ్రహం.. బుల్లి ఉపగ్రహమైన ఆజాదీ శాట్ బరువు 8 కేజీలు. ఇందులో 75 పే లోడ్స్ను ఏకీకృతం చేశారు. ఉష్ణోగ్రత సెన్సార్లు, రేడియేషన్ కౌంటర్లు, సోలార్ ప్యానల్ సహాయంతో ఫొటోలు తీయడానికి సెల్ఫీ కెమెరాలు, దీర్ఘ శ్రేణి కమ్యూనికేషన్ ట్రాన్స్పాండర్లు అమర్చారు. ఈ ఉపగ్రహం 6 నెలలు మాత్రమే సేవలందిస్తుంది. ఈ ఏడాదిని ‘అంతరిక్షంలో అతివ’గా పరిగణిస్తున్న నేపథ్యంలో ‘సైన్స్ అండ్ టెక్నాలజీ–ఇంజనీరింగ్ మ్యాథమేటిక్స్’లో మహిళలను ప్రోత్సహించేందుకు దీనిని మొదటి అంతరిక్ష మిషన్గా ప్రయోగిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్కు రిఫాత్ షరూక్ అనే మహిళ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా విద్యార్థులతో ఈ ఉపగ్రహాన్ని తయారు చేయించారు. -
స్మార్ట్ఫోన్ యూజర్లకు ఎలాన్ మస్క్ బంపరాఫర్!
స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల విషయంలో మరో అడుగు ముందుకు వేశారు. స్టార్ లింక్ శాటిలైట్ సేవల్ని అందిస్తున్న మస్క్ ఇకపై అమెరికాకు చెందిన మొబైల్ యూజర్లకు శాటిలైట్ సాయంతో నేరుగా హై స్పీడ్ ఇంటర్నెట్ను వాడుకలోకి తేనున్నారు. మస్క్ ప్రపంచవ్యాప్తంగా 2,600కు పైగా స్టార్ లింక్ శాటిలైట్ల సాయంతో శాటిలైట్ ఇంటర్నెట్ను అందిస్తున్నారు. ఇప్పుడు మొబైల్స్లో సైతం శాటిలైట్ ఇంటర్నెట్ను అందించనున్నారు.మొబైల్ యూజర్లకు శాటిలైట్ సర్వీస్ అందిస్తామని, ఇందుకోసం 2జీహెచ్జెడ్ స్పెక్ట్రమ్ను ఉపయోగించేలా అనుమతి ఇవ్వాలని కోరుతూ యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమీషన్ (ఎఫ్సీసీ)కి దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఎఫ్సీసీకి తమ సంస్థ మొబైల్ శాటిలైట్ సర్వీస్ ను సులభతరం చేయడానికి 2జీహెచ్జెడ్ రేడియో బ్యాండ్ని ఉపయోగించగల సామర్థ్యం ఉన్న స్టార్లింక్ ఉపగ్రహాలకు "మాడ్యులర్ పేలోడ్"ని జోడించేందుకు , ఉపయోగించేందుకు అనుమతిని కోరినట్ల స్పేస్ ఎక్స్ పేర్కొంది. తద్వారా అమెరికన్లు ఎప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ హై స్పీడ్ ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు' అని స్పేస్ ఎక్స్ తన ఎఫ్సీసీ ఫైలింగ్లో నివేదించింది. -
యూటెల్శాట్తో వన్వెబ్ విలీనం
న్యూఢిల్లీ: ఫ్రాన్స్కి చెందిన ఉపగ్రహాల ఆపరేటర్ యూటెల్శాట్, కమ్యూనికేషన్స్ నెట్వర్క్ వన్వెబ్ విలీనం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ డీల్ పూర్తిగా షేర్ల మార్పిడి రూపంలో ఉండనుంది. ఇరు సంస్థల సంయుక్త ప్రకటన ప్రకారం వన్వెబ్ విలువను 3.4 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 27,000 కోట్లు) లెక్కకట్టారు. ప్రస్తుతం వన్వెబ్లో కీలక భాగస్వామి అయిన దేశీ టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ .. డీల్ పూర్తయిన తర్వత యూటెల్శాట్లో అతి పెద్ద వాటాదారుగా ఉండనుంది. విలీన సంస్థకు ఎయిర్టెల్ చీఫ్ సునీల్ భారతి మిట్టల్ కో–చైర్మన్గాను, ఆయన కుమారుడు శ్రావిన్ భారతి మిట్టల్ .. డైరెక్టరుగా ఉంటారు. యూటెల్శాట్ ప్రస్తుత చైర్మన్ డొమినిక్ డి హినిన్ .. విలీన సంస్థకు చైర్మన్గా వ్యవహరిస్తారు. డీల్ ప్రకారం వన్వెబ్ షేర్హోల్డర్లకు యూటెల్శాట్ కొత్తగా 23 కోట్ల షేర్లను జారీ చేస్తుంది. తద్వారా పెరిగిన షేర్ క్యాపిటల్లో ఇరు సంస్థల షేర్హోల్డర్ల వాటా చెరి 50 శాతంగా ఉండనుంది. వన్వెబ్లో 100 శాతం వాటాలు యూటెల్శాట్కు దఖలుపడతాయి. 2023 ప్రథమార్ధంలో ఈ డీల్ పూర్తి కావచ్చని అంచనా. యూటెల్శాట్కు 36 జియోస్టేషనరీ ఆర్బిట్ (జియో) ఉపగ్రహాలు ఉండగా, వన్వెబ్కు 648 లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 428 ఉపగ్రహాలు కక్ష్యలో ఉన్నాయి. -
శాటిలైట్ సర్వీసుల కోసం 27.5 గిగాహెట్జ్ స్పెక్ట్రం!
త్వరలో నిర్వహించబోయే వేలంలో 27.5–28.5 గిగాహెట్జ్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రంను ప్రభుత్వం విక్రయించకపోవచ్చని తెలుస్తోంది. దీన్ని శాటిలైట్ సర్వీసుల (టీవీ,రేడియో, ఇంటర్నెట్) కోసం పక్కన పెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఫ్రీక్వెన్సీని మొబైల్, శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు కూడా ఉపయోగించుకోవచ్చని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కేంద్రానికి సూచించింది. అయితే, 5జీ, శాటిలైట్ ట్రాన్స్మిటర్లు పక్కపక్కనే పని చేయడం కుదరదని, ఫలితంగా ఒకే ఫ్రీక్వెన్సీని రెండు రకాల సర్వీసుల కోసం షేర్ చేసుకోవడం కష్టంగా ఉంటుందని టెలికం శాఖ భావిస్తున్నట్లు ఇద్దరు అధికారులు తెలిపారు. అయితే, ఇవన్నీ వదంతులేనని టెలికం శాఖ వర్గాలు కొట్టిపారేశాయి. దీనిపై డిపార్ట్మెంట్లో పలు అభిప్రాయాలు ఉన్నాయని, ఇంకా తుది నిర్ణయమేదీ తీసుకోలేదని వివరించాయి. 5జీ తదితర సేవల కోసం వివిధ ఫ్రీక్వెన్సీల్లోని స్పెక్ట్రంను దాదాపు 7.5 లక్షల కోట్లకు వేలం వేయవచ్చంటూ ట్రాయ్ సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. అయితే, స్పెక్ట్రం ధర చాలా ఎక్కువగా ఉందంటూ టెల్కోలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. -
రష్యా దూకుడు: నేల మీదే కాదు, నింగిలో కూడా.. తగ్గేదేలే!
ఉక్రెయిన్ రష్యా యుద్ధం భూమ్మీదే కాదు.. అంతరిక్షంలోనూ ప్రభావం చూపిస్తోంది. తమపై ఆంక్షలు విధించిన దేశాలపై ప్రతీకారానికి దిగిన రష్యా.. వన్వెబ్ శాటిలైట్ ప్రాజెక్ట్ను అర్థాంతరంగా నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. అసలేంటీ ప్రాజెక్ట్..? రష్యా చర్యతో ఎవరికి నష్టం..?. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం వన్వెబ్ సంస్థను కష్టాల్లోకి నెట్టింది. ఇంటర్నెట్ ప్రసార ఉపగ్రహాల ప్రయోగాన్ని రష్యా నిలిపివేసింది. రష్యా నిర్మించిన సోయజ్ రాకెట్ ద్వారా శుక్రవారం 36 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపాల్సి ఉంది. కజకిస్థాన్లో రష్యాకు చెందిన బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి ఈ ప్రయోగం జరగాలి. అయితే తమ దేశంపై బ్రిటన్ విధించిన ఆంక్షలకు ప్రతిగా.. వన్బెబ్ ఉపగ్రహాల ప్రయోగానికి నిరాకరిస్తామని రష్యా స్పేస్ ఏజెన్సీ డైరెక్టర్ దిమిత్రి రోగోజిన్ ప్రకటించారు. ఉపగ్రహాల నుంచి నేరుగా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఉద్దేశించినదే వన్వెబ్ ప్రాజెక్ట్. ఇందుకోసం తొలి దశలో 150 కిలోల బరువున్న 648 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఇప్పటికే 428 ఉపగ్రహాలు కక్ష్యను చేరుకొన్నాయి. రెండో దశలో దాదాపు 1900కి పైగా ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఈ ఉపగ్రహాలను ఫ్లోరిడాలోని ఒక కంపెనీ తయారు చేస్తోంది. ఫ్రాన్స్కు చెందిన ఏరియన్ స్పేస్ కంపెనీ రష్యా సోయజ్ రాకెట్ల సాయంతో వీటిని అంతరిక్షంలోకి చేరుస్తోంది. ఆంక్షల నేపథ్యంలో ఇప్పుడీ ప్రాజెక్ట్కు రష్యా అడ్డుపుల్ల వేసింది. లండన్ కేంద్రంగా పనిచేసే వన్వెబ్ కంపెనీలో.. భారత్కు చెందిన భారతీ ఎంటర్ప్రైజెస్ 42.2శాతం వాటా కొనుగోలు చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సహకారం ఉపసంహరించుకొంటామని ఇప్పటికే రష్యా బెదిరింపులకు దిగింది. ఐఎస్ఎస్ నిర్వహణలో రష్యా తమ సహకారాన్ని ఉపసంహరించుకుంటే.. యూఎస్, ఇతర దేశాలు దానిని నియంత్రించలేవని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. తాజాగా ఉపగ్రహ ప్రయోగాలకూ మోకాలడ్డుతోంది. అంతేకాదు వన్వెబ్ రాకెట్పై నుంచి అమెరికా, బ్రిటన్, జపాన్ జాతీయ జెండాలను రష్యా తొలగించింది. భారత జాతీయ జెండాను మాత్రమే రాకెట్పై ఉంచింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం అంతరిక్షంపైనా ప్రభావం చూపిస్తోందని టెక్నాలజీ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పీఎస్ఎల్వీ– సీ53 ప్రయోగానికి ‘షార్’ సిద్ధం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఏడాదిలో రెండో ప్రయోగానికి సిద్ధమవుతోంది. కరోనా పూర్తిగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రయోగాల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ మొదటి వారంలో పీఎస్ఎల్వీ–సీ53 ప్రయోగం ఉండే అవకాశం ఉంటుందని సమాచారం. ఈ ప్రయోగంలో ఈవోఎస్ (అకా ఓషన్శాట్–3) అనే ఉపగ్రహంతో పాటు మరో 5 చిన్న ఉపగ్రహాలను పంపనున్నారు. ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తోన్న స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) ప్రయోగాన్ని మార్చి 15న ప్రయోగాత్మకంగా నిర్వహించి నిర్థారించుకున్న తరువాత మార్చి 25 నుంచి 31 లోపు ఎస్ఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాన్ని కూడా చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. -
రోదసిలోకి భూ పరిశీలన ఉపగ్రహం
సూళ్లూరుపేట: భూ పరిశీలన ఉపగ్రహం రాడర్ ఇమేజింగ్ శాటిలైట్ (ఈఓఎస్–4)ను ఇస్రో సోమవారం రోదసిలోకి ప్రవేశపెట్టనుంది. పీఎస్ఎల్వీ – సి 52 ద్వారా 1710 కిలోల బరువు కలిగిన ఈఓఎస్–4తో పాటు భారత దేశంలోని ఐఐటీ కళాశాల విద్యార్థులు తయారు చేసిన రెండు చిన్న ఉపగ్రహాల (ఇన్స్పైర్ శాట్–1, ఐఎన్ఎస్–2టీడీ)ను కూడా రోదసీలోకి పంపుతున్నారు. శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి సోమవారం ఉదయం 5.59 గంటలకు పీఎస్ఎల్వీ–సి 52ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. షార్లోని బ్రహ్మప్రకాష్ హాలులో శనివారం ఎంఆర్ఆర్ (మిషన్ రెడీనెస్ రెవ్యూ) సమావే శం నిర్వహించారు. రాకెట్కు అన్ని పరీక్షలు నిర్వహించి ప్రయోగాన్ని లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ రాజరాజన్కు అప్పగించారు. ఆయన ఇతర శాస్త్రవేత్తలతో లాంచ్ సమావేశం నిర్వహించి ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఆదివారం ఉదయం 4.29 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 25.35 గంటల కౌంట్డౌన్ అనంతరం సోమవారం ఉదయం 5.59 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్తుంది. ఉపగ్రహాలను 529 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రసన్ కక్ష్యలో ప్రవేశపెడుతుంది. ఈఓఎస్–4 ఉపగ్రహం వ్యవసాయం, అటవీ ప్లాంటేషన్, భూమిపై జరిగే మార్పులు, వరదలు, వాతావరణం వంటి అనువర్తనాల కోసం అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ అత్యంత నాణ్యమైన ఛాయా చిత్రాల ద్వారా సమాచారాన్ని అందిస్తుంది. శ్రీవారి వద్ద పీఎస్ఎల్వీ – సి52 నమూనాకు ప్రత్యేక పూజలు తిరుమల: పీఎస్ఎల్వీ – సి52 నమూనాకు శనివారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నమూనాను ఇస్రో శాస్త్రవేత్తల బృందం తిరుమలకు తీసుకువచ్చింది. వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. నమూనాను శ్రీవారి మూల విరాట్ పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. మరిన్ని ప్రయోగాలకు సిద్ధం: – ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండటంతో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతున్నామని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. చంద్రయాన్–3, గగన్యాన్–1కు సంబంధించి పలు ప్రయోగాత్మక పరీక్షలు చేపడతామన్నారు. పీఎస్ఎల్వీ– సి 52 ప్రయోగం విజయవంతం కావాలని శనివారం సాయంత్రం సూళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఆయన విలేకరుతో మాట్లాడుతూ గత రెండేళ్లుగా కరోనా కారణంగా ప్రయోగాలకు అంతరాయం కలిగిందన్నారు. ఇస్రో చైర్మన్గా తనకు ఇది తొలి ప్రయోగం కావడంతో విజయవంతం కావాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ దేశంలో ఉన్న సామాన్యుడికి కూడా దీర్ఘకాలిక సేవలందిస్తుందని తెలిపారు. పీఎస్ఎల్వీ సీ–53 ప్రయోగానికి కూడా సిద్ధమవుతున్నామని తెలిపారు. ఆయన వెంట షార్ అధికారి గోపీకృష్ణ తదితరులు ఉన్నారు. -
పీఎస్ఎల్వీ సీ53 అనుసంధాన పనులు ప్రారంభం
సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగం నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. షార్లోని మొదటి ప్రయోగ వేదికపై రాకెట్ అనుసంధాన పనులు ప్రారంభమయ్యాయి. రెండు, మూడుదశల పరీక్షలు జరుగు తున్నాయి. ఈ నెల 20న ఈ ప్రయోగాన్ని నిర్వహిం చాలని నిర్ణయించారు. అయితే ఉపగ్రహం రావడంలో జాప్యం జరిగితే ప్రయోగం ఫిబ్రవరికి వాయిదా పడే అవకాశముందని సమాచారం. పీఎస్ఎల్వీ సీ53 ద్వారా ఈఓఎస్–6(ఓషన్శాట్–3) అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించనున్నారు. -
ఏంటీ.. ఈ టెక్నాలజీతో రేపు ఏం జరుగుతుందో తెసుకోవచ్చా!
గతంలో ఏం జరిగింది. ప్రజెంట్ ఏం జరుగుతుందో అందరికి తెలిసిందే. అదే భవిష్యత్ లో ఖచ్చితంగా ఏం జరుగుతుందో ముందే తెలుసుకుంటే ఎలా ఉంటుంది?! ఇది కొంచెం కష్టమే అయినా దాన్ని సుసాధ్యం చేసేందుకు అమెరికా పావులు కదుపుతోంది. టెక్నాలజీని ఉపయోగించి భవిష్యత్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ ప్రయోగాలు చేస్తోంది. గ్లోబల్ ఇన్ఫర్మేషన్ డామినాన్స్ ఎక్స్పెరిమెంట్స్ యుద్ధాలు జరిగే సమయంలో సైలెంట్ గా ఉండకుండా శుత్రు దేశాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎలాంటి వ్యూహరచనలు చేస్తున్నాయి. ఇలా తదితర అంశాల గురించి తెలుసుకునేందుకు రక్షణ సంస్థ పెంటగాన్ మోడ్రన్ టెక్నాలజీ, శాటిలైట్స్, నెట్వర్క్స్ లను వినియోగించుకుంటున్నాయి. తద్వారా మిగిలిన దేశాలకంటే తామే ముందజలో ఉండాలనేది తాపత్రయం. ఇందులో భాగంగా గ్లోబల్ ఇన్ఫర్మేషన్ డామినాన్స్ ఎక్స్పెరిమెంట్స్ (gide) అనే పేరుతో ప్రయోగాలు ప్రారంభించింది. శాటిలైట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రాడార్ల నుంచి రోజూ వచ్చే డేటాను తీసుకొని ప్రపంచం నలుమూలలా ఏం జరుగుతుందో వేగంగా కనిపెట్టేస్తుంది. టెక్నాలజీ ద్వారా వచ్చే డేటా పర్ఫెక్ట్గా ఉంటుందని, దేశం మరో దేశంపై యుద్ధానికి రెడీ అవుతుంటే ఆ వివరాల్ని అమెరికా టెక్నాలజీ గైడ్కి చేరవేస్తుంది. తద్వారా యుద్ధం ఎక్కడ జరుగుతుందో అమెరికా ముందే కనిపెట్టేస్తుంది. ఆ తర్వాత అంతా తన కంట్రోల్లోకి తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. -
శాటిలైట్ ఇమేజింగ్తో సరిహద్దుల నిర్ణయం
న్యూఢిల్లీ/గువాహటి/ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రాల మధ్య తరచూ తలెత్తుతున్న సరిహద్దు వివాదాలు, ఒక్కోసారి అవి హింసాత్మక రూపంగా మారుతుండటంపై కేంద్రం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఇటువంటి పరిణామాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ఆయా రాష్ట్రాల హద్దులను శాటిలైట్ ఇమేజింగ్ సాయంతో నిర్ణయించనుంది. ఈ బాధ్యతను నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్(ఎన్ఈఎస్ఏసీ, నెశాక్)కి అప్పగించినట్లు కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు వెల్లడించారు. రాష్ట్రాల సరిహద్దులను శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా శాస్త్రీయంగా ఖరారు చేయాలన్న ఆలోచనను హోంమంత్రి అమిత్ షా కొన్ని నెలల క్రితం తెరపైకి తెచ్చారని ఆ అధికారులన్నారు. శాస్త్రీయంగా చేపట్టే సరిహద్దుల విభజన కచ్చితత్వంతో ఉంటుందనీ, దీని ఆధారంగా చూపే పరిష్కారం రాష్ట్రాలకు ఎక్కువ ఆమోదయోగ్యంగా ఉంటుందని ఆ అధికారులు పేర్కొన్నారు. నెశాక్ నుంచి అందే శాటిలైట్ మ్యాపింగ్ ప్రకారం ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల నిర్ణయం జరుగుతుందనీ, ఈ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందని వారు చెప్పారు. అస్సాం, మిజోరం సరిహద్దుల్లో జూలై 26వ తేదీన జరిగిన ఘర్షణల్లో ఇటీవల ఐదుగురు అస్సాంకు చెందిన పోలీసులు ప్రాణాలు కోల్పోగా, 60 మంది వరకు గాయపడటంతో ఈ ప్రాంత రాష్ట్రాల మధ్య సరిహద్దు పంచాయితీలు మరోసారి తెరపైకి వచ్చాయి. నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్(ఎన్ఈసీ), కేంద్ర ప్రభుత్వ అంతరిక్ష శాఖ సంయుక్త ఆధ్వర్యంలో షిల్లాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న నెశాక్ ప్రస్తుతం ఈశాన్య ప్రాంతంలో వరద హెచ్చరికలు జారీ చేస్తోంది. ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నెశాక్ సాంకేతిక సాయాన్ని అందజేస్తోంది. కాగా, 1875లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఆధారంగా సరిహద్దుల్లోని రిజర్వు ఫారెస్టులో ఉన్న 509 చదరపు మైళ్ల ప్రాంతం తమదేనని మిజోరం వాదిస్తుండగా, అదేం కాదు, 1993లో నిర్ణయించిన ప్రస్తుత సరిహద్దునే గుర్తిస్తామని అస్సాం చెబుతోంది. ఇద్దరు సీఎంలతో మాట్లాడిన అమిత్ షా అస్సాం, మిజోరం రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హిమంత బిశ్వ శర్మ, జొరంతంగాలతో ఫోన్లో మాట్లాడారు. సమస్యకు అర్థవంతమైన, ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్లు అనంతరం జొరంతంగా ట్విట్టర్లో వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేయవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇలా ఉండగా, జూలై 26వ తేదీన జరిగిన ఘర్షణలకు సంబంధించి అస్సాం సీఎం హిమంతపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకునే అవకాశముందని మిజోరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లాల్నున్మావియా చువాంగో వెల్లడించారు. ఈ విషయమై అధికారులతో చర్చిస్తామన్నారు. అరెస్టుకయినా సిద్ధం: సీఎం హిమంత సరిహద్దు ఘర్షణలపై నోటీసులు అందితే మిజోరం పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతారని అస్సాం సీఎం హిమంత చెప్పారు. అరెస్టయినా అవుతాను గానీ, తనతోపాటు కేసులు నమోదైన రాష్ట్ర అధికారులను మాత్రం విచారణకు పంపేది లేదన్నారు. అరెస్టును తప్పించుకునేందుకు కోర్టు నుంచి బెయిల్ కూడా కోరనన్నారు. చర్చలే సమస్యకు పరిష్కారమని హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. ఈశాన్య ప్రాంత స్ఫూర్తిని సజీవంగా ఉంచటమే తమ ప్రధాన ధ్యేయమని అన్నారు. -
ఎట్టకేలకు తిరిగి ప్రారంభంకానున్న ఇస్రో ప్రయోగం..!
బెంగుళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది.ఆగస్టు 12 న జిఎస్ఎల్వి-ఎఫ్ 10 రాకెట్ ద్వారా జియో ఇమేజింగ్ ఉపగ్రహం జిశాట్ -1 కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని ఇస్రో భావిస్తోంది. ఈ ప్రయోగం 2021 వ సంవత్పరంలో ఇస్రో జరపబోయే రెండో ప్రయోగం. బ్రెజిల్కు చెందిన ఎర్త్ ఆబ్సర్వేషన్ శాటిలైట్ అమెజోనియా -1తో పాటుగా మరో 18 శాటిలైట్లను పీఎస్ఎల్వీ- సీ51 రాకెట్ తో ఫిబ్రవరి 28 రోజున ప్రయోగించింది. ఈ ప్రయోగంలో కొంతమంది విద్యార్థులు తయారుచేసిన శాటిలైట్లు కూడా ఉన్నాయి. 2,268 కిలోల బరువున్న జిశాట్-1 ఉపగ్రహాన్ని గత ఏడాది మార్చి 5 న ప్రయోగించాలని నిర్ణయించినప్పటికీ సాంకేతిక కారణాలతో ప్రయోగాన్ని నిలిపివేశారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించడంతో జీశాట్-1 ప్రయోగం ఆలస్యమైంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఆగస్టు 12 న ఉదయం 05.43 గంటలకు జీఎస్ఎల్వి-ఎఫ్ 10 లాంచ్ వెహికిల్తో జీశాట్-1ను ప్రయోగిస్తామని ఇస్రో అధికారులు శనివారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు. GISAT-1 ప్రయోగంతో భారత ఉపఖండ పరిశీలనకు దోహదపడుతుందని తెలిపారు. GISAT-1 ను GSLV-F10 రాకెట్తో జియోసింక్రోనస్ కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్రహం దేశ సరిహద్దుల రియల్ టైం చిత్రాలను అందిస్తోంది. అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాలను త్వరగా పర్యవేక్షించటానికి వీలు కల్పిస్తుంది. ఆన్బోర్డ్ హై రిజల్యూషన్ కెమెరాలతో, భారతీయ భూభాగం, మహాసముద్రాలను, ముఖ్యంగా దాని సరిహద్దులను నిరంతరం పర్యవేక్షించడానికి ఈ ఉపగ్రహం ఉపయోగపడుతోందని ఇస్రో అధికారులు పేర్కొన్నారు. -
అర్థరాత్రి ఆకాశంలో వింత కాంతి.. ఆందోళనలో జనాలు
గాంధీనగర్: గుజరాత్ జునాగఢ్లో రాత్రి, ఆకాశంలో మెరుస్తున్న ప్రకాశవంతమైన లైట్ల వరుసలు జనాలను భయభ్రాంతులకు గురి చేశాయి. జనాలు వీటిని యూఎఫ్ఓలు అని అనుమానించి.. తీవ్రంగా కంగారు పడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వీటిలో, సుమారు నాలుగు నుంచి ఏడు ప్రకాశవంతమైన మెరిసే లైట్లు ఒకదాని వెంట లైన్గా పయనించడం గమనించవచ్చు. ఈ సందర్భంగా గుజరాత్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (గుజ్కోస్ట్) సలహాదారు నరోత్తం సాహూ మాట్లాడుతూ.. ‘‘అసహజమైన కాంతి దృశ్యాలను జనాలు యూఎఫ్ఓలుగా భావిస్తున్నారు. కానీ ఇది నిజం కాదు.. ఇవి శాటిలైట్లు. భూమికి తక్కువ ఎత్తులో పయనించే ఈ శాటిలైట్లు ఇలా కనిపించి జనాలను భయభ్రాంతులకు గురి చేశాయి తప్పి ఇవి యూఎఫ్ఓలు కాదు’’ అన్నారు. "సౌరాష్ట్ర ప్రాంతంలో జనాలు జూన్ 22 తెల్లవారుజామన ఆకాశంలో అనుమానాస్పద రీతిలో 30-40 కాంతి పుంజాలు సరళ రేఖలో పయనించడం గమనించారు. జనాల్లో గూడు కట్టుకున్న సందేహాలు, మూఢనమ్మకాల వల్ల వీటిని యూఎఫ్ఓలుగా భావించారు. అయితే, అంతరిక్ష శాస్త్రం ప్రకారం, ఇటువంటి కాంతి మూడు సందర్భాలలో కనిపిస్తుంది. ఒక ఉల్కకు సంబంధించిన చిన్న భాగం భూమి ఉపరితలంలోకి ప్రవేశించినప్పుడు ఇలా కాంతి కనిపిస్తుంది. దీన్ని షూటింగ్ స్టార్’’ అంటారు అని గుజ్కోస్ట్ సలహాదారు సాహు తెలిపారు. UFOs again in #Rajkot? Even few months back these types of lights were seen in many cities of #Gujarat pic.twitter.com/v5GokrUpVC — Divyesh Trivedi (@DivyeshTrivedi_) June 21, 2021 "కానీ, ఇక్కడ కనిపించిన ఈ ప్రత్యేక దృశ్యంలో ఎక్కువ లైట్లు కనిపించాయి. దీనికి కారణం భూమికి తక్కువ ఎత్తు కక్ష్యలో పయనించే ఉపగ్రహాలు అయి ఉంటాయి. ప్రస్తుతం భూమి దిగువ కక్ష్యలో 3000 కి పైగా ఉపగ్రహాలు పనిచేస్తున్నాయి" అని తెలిపారు. ఎలోన్ మస్క్ స్పేస్ఎక్స్ ఫాల్కన్ రాకెట్ను ప్రయోగించినప్పుడు అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఇలా లైట్లు కనిపించాయని సాహూ తెలిపారు. ఈ లైట్లు కచ్చితంగా ఉపగ్రహాలే. వీటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నారు. చదవండి: అమెరికన్ యుద్ధ నౌకను చుట్టుముట్టిన యూఎఫ్ఓలు -
SpaceX Starlink: ఇంటర్నెట్ షట్డౌన్.. సింపుల్గా పరిష్కరించిన యువకుడు..!
వాషింగ్టన్: మమూలుగా మన దగ్గర ఉండే ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ బాగా వేడెక్కితే ఏం చేస్తాం. కొద్ది సేపు వాటిని ఆఫ్ చేసి తిరిగి మళ్లీ ఆన్ చేస్తాం. ఆరిజోనాకు చెందిన యువకుడు మాత్రం అసాధారణ పద్దతి ఉపయోగించి తిరిగి ఇంటర్నెట్ వచ్చేలా చేశాడు. వివరాలోకి వెళ్లేే.. ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ స్టార్లింక్తో అమెరికాలో ఇంటర్నెట్ను ప్రవేశపెట్టింది. భూమిపై ఏర్పాటుచేసిన డిష్ ఆంటెన్నాతో యూజర్లు ఇంటర్నెట్ సేవలను పొందుతారు. కాగా అప్పుడప్పుడు డిష్ ఆంటెన్నాలు ఎక్కువగా వేడెక్కడంతో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని స్టార్లింక్ తన వినియోగదారులకు ముందుగానే తెలిపింది. డిష్ ఆంటెన్నాలు తిరిగి కూల్ డౌన్ అయ్యే వరకు ఇంటర్నెట్ సేవలను పొందలేరని పేర్కొంది స్టార్లింక్. ప్రస్తుతం అమెరికాలోని ఆరిజోనా స్టేట్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ ప్రాంతంలో సుమారు 44 డిగ్రీల నుంచి 55 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో ఆరిజోనాలో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. కాగా ఈ సమస్య ఆరిజోనాకు చెందిన యువకుడికి రావడంతో స్టార్లింక్ కస్టమర్ సర్వీస్ను సంప్రదించడంతో కంపెనీ ముందుగానే చెప్పిన విషయానే చెప్పింది. దీంతో విసుగు చెందిన యువకుడు ఇంటర్నెట్ డిష్పై నీళ్లను స్ప్రే చేశాడు. వాటర్ పోయడంతో డిష్ ఆంటెన్నా త్వరగా కూల్ డౌన్ అయ్యింది. తిరిగి ఇంటర్నెట్ సేవలను అతడు పొందగల్గిగాడు. ప్రస్తుతం ఈ చర్య చర్చనీయాంశంగా మారింది. ఇకపై ఇంటర్నెట్ షట్డౌన్ అవ్వకుండా ఉండాలంటే డిష్ ఆంటెన్నాపై ఒక చిన్న ఫౌంటెన్ను ఏర్పాటు చేస్తే అసలు అంతరాయం ఉండదని ఓ నెటిజన్ వ్యంగ్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చదవండి: జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం.. నాసాపై..