-
ఆర్బీఐ గవర్నర్గా 'రఘురామ్ రాజన్' జీతం ఎంతంటే?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ 'రఘురామ్ రాజన్' ఇటీవల తాను గవర్నర్గా పనిచేస్తున్నప్పుడు ఎంత జీతం తీసుకునే వారనే విషయాలను అధికారికంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రాజ్ షమానీ నిర్వహించిన ఓ పాడ్కాస్ట్లో RBI గవర్నర్ల జీతాలు ఎలా ఉండేవని ఆర్బీఐ మాజీ గవర్నర్ 'రఘురామ్ రాజన్' (Raghuram Rajan)ను అడిగిన ప్రశ్నకు, తాను గవర్నర్గా పనిచేసిన రోజుల్లో ఏడాదికి రూ. 4 లక్షలను జీతభత్యాలను పొందినట్లు వివరించారు. అయితే ప్రస్తుతం గవర్నర్ల జీతాలు ఎలా ఉంటాయనే విషయం తనకు తెలియదని స్పష్టం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉన్నపుడు ధీరూభాయ్ అంబానీ నివాసానికి దగ్గరగా ఉన్న 'మలబార్ హిల్స్' అనే పెద్ద ఇంట్లో తనకు నివాసం కల్పించినట్లు వెల్లడించారు. అది కేంద్రం నాకు అందించిన అతిపెద్ద ప్రయోజనం అని చెప్పారు. 2013 నుంచి 2016 మధ్య RBI గవర్నర్గా పనిచేసిన రఘురామ్ రాజన్ క్యాబినెట్ సెక్రటరీతో సమానమైన జీతాన్ని పొందినట్లు వెల్లడిస్తూ.. గవర్నర్ పదవి నుంచి బయటకు వచ్చిన తరువాత పెన్షన్ వంటివి రాలేదని వెల్లడించారు. పెన్షన్ రాకపోవడానికి కారణం, తాను సివిల్ సర్వెంట్లు కావడం వల్ల, సివిల్ సర్వీస్ నుంచి అప్పటికే పెన్షన్ రావడం అని కూడా వివరించారు. ఇదీ చదవండి: నష్టాల్లో ఇన్ఫోసిస్.. ఆ ఒక్కటే కారణమా..! రఘురామ్ రాజన్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేసి బయటకు వచ్చిన తరువాత షికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఫుల్టైమ్ ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలే ఈయన 'బ్రేకింగ్ ది మౌల్డ్: రీఇమేజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్' అనే పేరుతో ఓ బుక్ కూడా లాంచ్ చేశారు. -
250 గజాల స్థలం.. వడ్డీలేని రుణం
సింగరేణి (కొత్తగూడెం): సింగరేణి కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. కార్మికుల సొంతింటి కల సాకారం చేసేందుకు ఒక్కొక్కరికి 250 గజాల స్థలం ఇవ్వడంతో పాటు గృహ నిర్మాణానికి రూ.20 లక్షల వడ్డీలేని రుణం అందజేస్తామని ప్రకటించారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, సత్తుపల్లి ఏరియాల్లోని బొగ్గు గనుల వద్ద జరిగిన సభల్లో మాట్లాడారు. సింగరేణి డే రోజున కార్మికులకు సెలవు దినంగా ప్రకటిస్తామని, మహిళా ఉద్యోగులకు అండర్ గ్రౌండ్లో కాకుండా సర్ఫేస్ విధులు కేటాయించేలా ఆధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. కొత్తగూడెం ఏరియాలో రాంపూర్ భూగర్భ గని, వీకే– 7తో పాటు మరో ఓసీ ఏర్పాటుకు కృషి చేస్తామని, గత ప్రభుత్వ నిర్వాకంతో తగ్గిన కార్మికుల సంఖ్యను గణనీయంగా పెంచుతామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో మెడికల్ ఇన్వాలిడిటేషన్ కోసం కార్మికులు రూ.6 నుంచి రూ.8 లక్షలు వెచ్చించాల్సి వచ్చేదని, ఈ ప్రభుత్వంలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అర్హులందరికీ అవకాశం కలి్పస్తామని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి అందరి నాయకుడని, కార్మికుల సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. మాయమాటలు చెప్పి రెండుసార్లు కార్మికుల ఓట్లతో గెలుపొందిన బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్.. ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, రాహుల్గాంధీ ప్రధానమంత్రి కాగానే, సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఇచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈనెల 27న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో గడియారం గుర్తుపై ఓటు వేసి ఐఎన్టీయూని గెలిపించాలని పొంగులేటి కోరారు. ఆయా కార్యక్రమాల్లో పినపాక, అశ్వారావుపేట, ఇల్లెందు, సత్తుపల్లి ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, కోరం కనకయ్య, మట్టా రాగమయి తదితరులు పాల్గొన్నారు. -
నెలసరి లీవ్ అవసరం లేదు
న్యూఢిల్లీ: ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు నెలసరి రోజుకు వేతనంతో కూడిన సెలవుదినంగా కొన్ని దేశాల్లో పాటిస్తున్నారు. భారత్లోనూ మహిళా ఉద్యోగులకు నెలసరికి పెయిడ్ లీవ్ ఇవ్వాలన్న డిమాండ్ పెరిగిన నేపథ్యంలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మహిళా మంత్రి స్మృతి ఇరానీ ఒక స్పష్టతనిచ్చారు. జనతాదళ్(యూ) సభ్యుడు మనోజ్ కుమార్ ఝా రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా స్మృతి వివరణ ఇచ్చారు. ‘‘ నెలసరి అనేది మహిళల జీవితంలో ఒక సహజ ప్రక్రియ. అదేం వైకల్యం కాదు. దీనికి ప్రత్యేకంగా వేతనంతో కూడిన సెలవు దినం ప్రకటించాల్సిన అవసరం లేదు. నెలసరిని ప్రత్యేక సెలవు ఇవ్వాల్సిన సందర్భంగా పరిగణించకూడదు. నెలసరిని ఒక ఆటంకంగా కూడా భావించకూడదు. ఒకవేళ ఉద్యోగినులకు ఒక పెయిడ్ లీవ్ ఇస్తే తోటి పురుషులు తమకు ఒక సెలవు లభించలేదే అని భావించి పని ప్రదేశాల్లో వివక్షపూరిత వాతావరణం నెలకొనే ప్రమాదం ఉంది’’ అని ఇరానీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా నెలసరి శుభ్రత విధాన ముసాయిదాను కేంద్రం తీసుకొచి్చందని ఆమె గుర్తుచేశారు. 10–19 ఏళ్ల టీనేజర్లలో నెలసరి శుభ్రతపై అవగాహన పెంచేందుకు కేంద్రం ఇప్పటికే ప్రత్యేక పథకాన్ని అమలుచేస్తోందని ఆమె వెల్లడించారు. మరోవైపు, ‘‘నెలసరి రోజుల్లో చాలా మంది ఉద్యోగినులు ఇబ్బందులు పడుతూ అది పని ప్రదేశాల్లో ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. వీరికి నెలసరి సెలవు లేదా సిక్ లీవ్ లేదా నెలకో సంవత్సరానికో సగం వేతనంతో కూడిన సెలవు ఇవ్వొచ్చు’’ అని సిబ్బంది, శిక్షణ వ్యవహారాలు, న్యాయ, సాధికారత వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఒక నివేదికలో పేర్కొనడం గమనార్హం. -
ఆ గనిలో మహిళలకే పని.. కారణమిదే!
సాధారణంగా గనుల్లో పనిచేసేందుకు పురుషులనే నియమిస్తుంటారు. గనుల్లోని పనులు ఎంతో కష్టమైనందున వాటిని పురుషులతోనే చేయిస్తుంటారు. అయితే ఆఫ్రికాలోని ఒక దేశంలో దీనికి విరుద్ధమైన పనితీరు కలిగిన ఒక గని ఉంది. దీనిలో మహిళలు మాత్రమే పని చేస్తుంటారు. దీని వెనుకగల కారణం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అంతే కాదు ఈ గనిలో పని చేసే మహిళలకు భారీ వేతనం కూడా లభిస్తుంది . ఐక్యరాజ్యసమితితో సహా ప్రపంచంలోని పలు దేశాలు ఆ గనిలో జరిగే పనితీరును ప్రశంసిస్తుంటాయి. ఉత్తర జింబాబ్వేలోని డుంగుజా నది వద్ద మైనింగ్ జరుగుతుంటుంది. ‘జింబాకువా’ లాంటి అనేక కంపెనీలు ఇక్కడ రత్నాల కోసం వెదుకులాట సాగిస్తుంటాయి. ఇక్కడ పనిచేసేందుకు మహిళలను మాత్రమే తీసుకుంటారు. డ్రిల్లింగ్ అయినా, సుత్తితో కొట్టే పని అయినా, పెద్ద పెద్ద రాళ్లను రవాణా చేయడమైనా.. ప్రతీపనిని మహిళలే చేస్తుంటారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ గనిలో పేలుళ్లు లాంటి పనులు చేయరు. జాతి రాళ్లు, రత్నాలు భూమి లోపలి పొరలలో కనిపిస్తాయి. ఉలి, సుత్తి సహాయంతోనే ఇక్కడ తవ్వకాల పనులు చేపడతారు. ఈ విధమైన పనితీరుతో పర్యావరణానికి హాని కలగదు. ఈ ప్రక్రియలో రసాయనాలు ఉపయోగించరు. నీటిని కూడా తక్కువగానే ఉపయోగిస్తారు. ఇక్కడ పనిచేసే మహిళలకు ప్రతినెలా 180 (ఒక యూరో రూ.91) యూరోలు అందుతుంటాయని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. ఇక్కడ పనిచేసే మహిళలు తమ తీరిక సమయంలో కూరగాయలు పండిస్తూ, వాటిని విక్రయిస్తుంటారు. ఇక్కడి గనుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైనింగ్ కంపెనీలు మహిళా సాధికారతను కాంక్షిస్తూ, వారికే ఉపాధి కల్పిస్తున్నట్లు చెబుతున్నాయి. ఇక్కడి మహిళలు తమ పిల్లల చేత ఉన్నత చదువులు చదివిస్తున్నారు. నిరుద్యోగ భర్తలకు అండగా నిలుస్తున్నారు. మగవారి కంటే తామేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నారు ఇక్కడి మహిళలు. ఇది కూడా చదవండి: కోతకొచ్చిన పంటల్లో నక్కిన పులులు.. వణుకుతున్న కూలీలు! -
ఇషా అంబానీ రైట్ హ్యాండ్ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే..
Reliance First Employee: భారతదేశంలో అత్యంత సంపన్నుడు, రిలయన్స్ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబం గురించి మాత్రమే అందరికి తెలుసు. కానీ ఆ సంస్థ ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి దోహదపడిన చాలా మంది సన్నిహితుల గురించి బహుశా తెలియకపోవచ్చు. ఈ కథనంలో రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ మొదటి ఉద్యోగి ఎవరు? ప్రస్తుతం ఆయన జీతం ఎంత? అనే మరిన్ని ఆసక్తికర విషయాలు చూసేద్దాం.. 'దర్శన్ మెహతా' (Darshan Mehta).. ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు, కానీ రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ (RBL) మొదటి ఉద్యోగి ఇతడే అంటే చాలా మంది ఆశ్చర్యపోవచ్చు, ఆ సంస్థ ఉన్నతికి పాటుపడిన కొంతమంది వ్యక్తులలో ఈయన ఒకరు కావడం గమనార్హం. మెహతా ప్రస్తుతం RBL ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2007లో ముఖేష్ అంబానీ స్థాపించిన రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ మొదటి ఉద్యోగి అయిన దర్శన్ మెహతా 'చార్టర్డ్ అకౌంటెంట్'. చదువు పూర్తయిన తరువాత త్రికాయా గ్రే అడ్వర్టైజింగ్ (Trikaya Grey Advertising)లో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా అడ్వర్టైజింగ్లో కెరీర్ ప్రారంభించాడు. భారతదేశానికి టామీ హిల్ఫిగర్, గాంట్ మరియు నౌటికా వంటి స్పోర్ట్స్వేర్ బ్రాండ్లను తీసుకురావడంలో ఈయన కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. దర్శన్ మెహతా జీతం ప్రతిరోజూ కొత్త శిఖరాలను తాకుతున్న కంపెనీని నిర్వహించడం అంత సులభం కాదు. కంపెనీ కోసం కీలక నిర్ణయాలు తీసుకునే దర్శన్ మెహతా.. ఇషా అంబానీకి సన్నిహిత సహాయకుడు, రైట్ హ్యాండ్ కూడా. 2020-2021లో ఈయన వార్షిక వేతనం రూ. 4.89 కోట్లు అని తెలుస్తోంది. ఇదీ చదవండి: చిన్న గదిలో మొదలైన వ్యాపారం.. నేడు రూ.4000 కోట్ల సామ్రాజ్యంగా..!! రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ 2007లో ప్రారంభమైన రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ అంబానీ కుమార్తె 'ఇషా అంబానీ' నేతృత్వంలో ఉంది. 125 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కలిగిన ఈ సంస్థ జిమ్మీ చూ, ఎర్మెనెగిల్డో జెగ్నా, బొట్టెగా వెనెటా, జార్జియో అర్మానీ, బర్బెర్రీ, సాల్వటోర్ ఫెర్రాగామో వంటి సుమారు 50 కంటే ఎక్కువ ప్రముఖ బ్రాండ్లతో కలిసి పనిచేసింది. ఈ కంపెనీ ఇప్పటికి వేలసంఖ్యలో రిటైల్ అండ్ ఆన్లైన్ స్టోర్లను కలిగి ఉంది. 2022 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో RBL ఏకంగా రూ. 67,634 కోట్ల అమ్మకాలను పొందినట్లు సమాచారం. -
వచ్చే ఏడాది ఈ రంగాల్లో 9.8 శాతం జీతాలు పెరగనున్నాయ్..
2024లో భారతీయ ఉద్యోగుల జీతాలు పెరగనున్నట్లు 'డబ్ల్యుటీడబ్ల్యు శాలరీ బడ్జెట్ ప్లానింగ్ రిపోర్ట్' (WTW Salary Budget Planning Report) వెల్లడించింది. వచ్చే ఏడాది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అధికంగా జీతాల పెంపు భారతదేశంలోనే జరగబోతోందని కూడా నివేదికలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతీయ ఉద్యోగుల జీతం 2024లో 9.8 శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ 2024లో భారతీయ కంపెనీలు ఉద్యోగుల జీతాలను పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. భారతీయ సంస్థలు టెక్నాలజీ వైపు వేగంగా అడుగులు వేస్తున్న క్రమంలో, ఉద్యోగుల ప్రతిభకు తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది, తద్వారా జీతాల పెరుగుదల జరుగుతుంది. 2024లో ఉద్యోగుల జీతం వియత్నాంలో 8%, చైనా 6%, ఫిలిప్పీన్స్ 5.7%, థాయిలాండ్ 5% వరకు పెరగనుంది. ఈ దేశాలతో పోల్చితే భారత్ (9.8%) ముందు వరుసలో ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఇదీ చదవండి: 81.5 కోట్ల భారతీయుల ఆధార్ వివరాలు లీక్ - అమ్మడానికి సిద్దమైన హ్యాకర్! రాబోయే రోజుల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (61%), ఇంజనీరింగ్ (59.8%), సేల్స్ (42.9%), టెక్నికల్ స్కిల్స్ ట్రేడ్ (38.6%), ఫైనాన్స్ (11.8%) ), మార్కెటింగ్ (10.6%), హ్యూమన్ రీసోర్స్ (3.1%) విభాగాల్లో ఉద్యోగాలు, జీతాలు పెరగనున్నాయి. అంతే కాకుండా టెక్నాలజీ, మీడియా, గేమింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రిటైల్ రంగాల్లో కూడా జీతాలు పెరుగుదల ఉంటుంది. -
రూ.6.5 కోట్ల జాబ్ వదులుకున్న మెటా ఉద్యోగి - రీజన్ తెలిస్తే..
ఎవరైనా ఎక్కువ శాలరీ వచ్చే జాబ్.. లేదా ప్రసిద్ధి చెందిన కంపెనీలో ఉద్యోగం చేయాలనుకుంటారు. ఫేస్బుక్లో జాబ్ సంపాదించి రూ.6.5 కోట్ల వేతనం తీసుకునే ఒక టెకీ ఉద్యోగం వదిలి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇంతకీ అతడెవరు, ఉద్యోగం వదిలేయడానికి కారణం ఏంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మెటాలో టెక్ లీడ్ అండ్ మేనేజర్గా ఐదేళ్లపాటు పనిచేసిన 'రాహుల్ పాండే' 2022లో తన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. అప్పటికి అతని శాలరీ రూ. 6.5 కోట్లు కంటే ఎక్కువ. జాబ్ వదిలేసిన తరువాత ఫేస్బుక్లో పనిచేసిన అనుభవం గురించి వివరిస్తూ లింక్డ్ఇన్ పోస్ట్ చేసాడు. ఫేస్బుక్లో చేరిన ప్రారంభంలో సీనియర్ ఇంజనీర్గా ఎంతో ఆత్రుతగా పనిచేసాని, కంపెనీ స్టాక్ పడిపోవడంతో నైతికతకు దెబ్బ తగిలిందని, అర్హత లేని వ్యక్తిగా చేసిందని, దీంతో పనితీరును మరింత మెరుగుపరచుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేసి రెండు సంవత్సరాల్లో మంచి స్థాయికి చేరుకున్నానని వెల్లడించాడు. ఇదీ చదవండి: సరికొత్త అధ్యాయానికి నాంది.. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకం! మెటాను మించిన ప్రపంచం కోసం.. ఫేస్బుక్లో నా చివరి సంవత్సరం మేనేజర్ బాధ్యతలు స్వీకరించి.. అదే సంస్థలో మంచి పురోగతి పొందాను. 2021 తరువాత మెటాను మించిన ప్రపంచాన్ని అన్వేషించడం ప్రారంభించాను. దాదాపు పదేళ్లపాటు టెక్లో పనిచేసిన తర్వాత, కొంతవరకు ఆర్థిక స్వేచ్ఛను సాధించాను, ఇంజినీరింగ్కు మించి ఇంకా ఎంత నేర్చుకోవాలో పూర్తిగా గ్రహించానని వెల్లడించాడు. -
‘అసలే ఎన్నికలు’, బ్యాంకు ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పనుందా?
ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వారానికి ఐదు రోజుల పని దినాలను కేంద్ర ఆర్థిక శాఖ అతి త్వరలోనే అమలు చేయనున్నట్లు సమాచారం. దీంతో పాటు వేతనాల్ని సగటున 15 శాతం పెంపుపై బ్యాంకులు - బ్యాంకు యూనియన్ సంఘాలు చర్చిస్తున్నాయి. ఐదు రోజుల పనిదినాలను కల్పించేందుకు భారత బ్యాంకుల సంఘం (ఐబీఏ) కేంద్రానికి ఓ ప్రతిపాదన పంపింది. తాజాగా, ఉద్యోగులు వేతనాల్ని 15 శాతం పెంపును ప్రతిపాదించింది. అయితే, పనిదినాల మార్పులతో పాటు వేతనాల శాతాన్ని మరింత పెంచాలని బ్యాంకు యూనియన్లు కోరుతున్నాయి. ఇప్పటికే పీఎన్బీ వంటి కొన్ని బ్యాంకులు వేతనాల పెంపుకు పెద్దమొత్తంలో కేటాయింపులు జరుపుతున్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో ఉద్యోగుల వేతనం 10 శాతం పెరిగేలా బడ్జెట్ కేటాయించడానికి బదులుగా, 15శాతం పెరుగుదల కోసం నిధులను కేటాయించింది. నిశితంగా పరిశిలీస్తున్న కేంద్రం ‘ఇటీవలి కాలంలో బ్యాంకుల లాభాలు బాగా పెరిగాయని, కొవిడ్ సమయంలో పనిచేయడం, ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు రుణదాతలను తిరిగి గాడిలో పెట్టడానికి ఉద్యోగులు చేసిన కృషిని పరిగణనలోకి తీసుకుంటే తమకు మెరుగైన పరిహారం లభిస్తుందని’ ఉద్యోగులు, యూనియన్లు వాదించుకుంటున్నాయి. ఈ చర్చలను ఆర్థిక మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. అసలే ఎన్నికలు అధిక సంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు ఉన్నందున వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు కంటే ముందే వేతన సెటిల్ మెంట్తో పాటు వారానికి ఐదురోజుల పనికి కేంద్రం ఆమోదం తెలుపుతుందని బ్యాంక్ ఉద్యోగులు, యూనియన్ సంఘాలు అంచనా వేస్తున్నాయి. -
మెక్రోసాఫ్ట్ శాలరీ లీక్, ఏడాది జీతం కోసం..మనమైతే జీవితాంతం కష్టపడాల్సిందే!
ఆర్ధిక మాంద్యం భయాలు, పెరిగిపోతున్న ఖర్చులు. వెరసి పునర్నిర్మాణం పేరుతో ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇప్పటికే వేలాది మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపింది తాజాగా, ఆ సంస్థకు చెందిన సోషల్ నెట్వర్క్ లింక్డిన్లోనూ 600 మందికి పింక్ స్లిప్లు జారీ చేసింది. అయితే, ఖర్చులు తడిచి మోపెడవుతున్నాయని చెబుతూనే, ఉద్యోగులకు కళ్లు చెదిరే శాలరీ ప్యాకేజీలిస్తూ చర్చాంశనీయంగా మారింది. ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ శాలరీలను ఎంత మొత్తంలో చెల్లింస్తుందనే డేటా లీకైంది. ఇన్సైడర్ రిపోర్ట్ ప్రకారం.. ఈ ఏడాది ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ ఏయే డిజిగ్నేషన్కు ఎంత వేతనం చెల్లించాలని తెలిపేలా కొన్ని గైడ్లైన్స్ను తయారు చేసింది. ఈ గైడ్లైన్స్ ఆధారంగా ఆయా డిపార్ట్మెంట్లలో కొత్తగా నియమించుకునే ఉద్యోగులకు ఎంత జీతాలు ఇవ్వాలనేది మేనేజర్లు నిర్ణయిస్తారు. ఇప్పుడు అదే జీతాల డేటా ఆన్లైన్లో చక్కెర్లు కొడుతుంది. ప్రాంతాన్ని బట్టే జీతాలు దీంతో పాటు సిబ్బందికి అందించే కాంపన్షేషన్ సైతం ప్రాంతాన్ని బట్టి అందిస్తుంది. మిగిలిన ఉద్యోగులతో పోలిస్తే న్యూయార్క్,శాన్ ఫ్రాన్సిస్కోలో నివసించే ఉద్యోగులకు కాంపన్షేషన్ కాస్త ఎక్కువ అందిస్తున్నట్లు శాలరీలను వెలుగులోకి తెచ్చిన నివేదికలు చెబుతున్నాయి. ర్యాంకుల్ని బట్టి శాలరీలు లీకైనా వేతన మార్గదర్శకాల ప్రకారం మైక్రోసాఫ్ట్లో పనిచేసే ఉద్యోగుల ర్యాంకులు బట్టి సంస్థ అందించే జీతాలు అంత ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు మైక్రోసాఫ్ట్లో మీ ర్యాంక్ (leval) 70 ఉంటే మీకు కంపెనీ ఇచ్చే బేసిక్ పే 231,700 డాలర్ల నుంచి 361,500 డాలర్ల వరకు ఉంటుంది. ఇదే ర్యాంక్లో ఖచ్చితమైన శాలరీ అంటే 310,000 నుండి 1.2 మిలియన్ల డాలర్లలోపు పెరగొచ్చు, లేదంటే తగ్గొచ్చు. 68 ర్యాంక్ ఉన్న వారిని సీనియర్ ఉద్యోగిగా, లెవల్ 63, లెవల్ 65 వరుసగా సీనియర్, ప్రిన్సిపల్ ఉద్యోగులుగా పరిగణించబడతారని నివేదిక హైలెట్ చేసింది. అత్యల్ప స్థాయి అదే కంపెనీలో అతి తక్కువ స్థాయి ఉద్యోగి జీతం 42,500 డాలర్ల జీతం తీసుకుంటారు. ఈ స్థాయిలో ఉన్న ఉద్యోగులు హైరింగ్ బోనస్ లేదా స్టాక్ అవార్డుకు అర్హులు కాదు. ఫీల్డ్ను బట్టి ర్యాంక్లు మారతాయ్ అన్ని రకాల డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగుల ర్యాంకులు 70 వరకు వెళ్లవు. ఈ రంగంలో ఉన్నత స్థాయి ఉద్యోగిని ప్రత్యేక ఇంజనీర్గా భావిస్తారు. అదే సమయంలో, ఇతర ఫీల్డ్లో పనిచేస్తున్న ఉద్యోగుల ర్యాంక్లు 80కి పైగా ఉంటాయి. చదవండి👉 ఇంట్లో ఇల్లాలు.. 200 కోట్ల ఆస్తికి యజమానురాలు -
హోంగార్డులు.. ఎన్ని పాట్లు!
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో పని చేస్తున్న హోంగార్డులకు సెప్టెంబర్ నెల గౌరవ వేతనం ఆదివారానికీ అందలేదు. ప్రతి నెలా ఒకటి–రెండు తారీఖుల్లో వచ్చే జీతం కొన్ని నెలలుగా ఆలస్యం అవుతోంది. ఈసారి 8వ తేదీ వచ్చినా ఇప్పటికీ అందకపోవడంతో ఈ చిరుద్యోగులు బ్యాంక్ ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా తమ సిబిల్ స్కోరు దెబ్బతింటోందని గగ్గోలు పెడుతున్నారు. రాజధానిలో క్షేత్రస్థాయిలో పని చేస్తున్న పోలీసుల సంఖ్యకు సమానంగా హోంగార్డులు ఉన్నారు. పోలీసుస్టేషన్ల వారీగా హోంగార్డ్స్ జీతాల చెల్లింపునకు సంబంధించి బిల్లులు ప్రతి నెలా హోంగార్డ్స్ కమాండెంట్ కార్యాలయానికి చేరుతాయి. ఈ బిల్లుల తయారీ మొత్తం ఇప్పటికీ మాన్యువల్గానే జరుగుతోంది. ఆ మధ్యన కొన్నాళ్ళు బయోమెట్రిక్ వ్యవస్థ ప్రవేశపెట్టినా.. అనివార్య కారణాలతో తొలగించారు. హోంగార్డులు పని చేసే ఠాణాలు, కార్యాలయాల్లో ఉండే అటెండెన్స్ రిజిస్టర్లలో సంతకాలతోనే ప్రస్తుతం వీరి హాజరు గణిస్తున్నారు. ప్రతి నెలా 20వ తేదీ నుంచి మరుసటి నెల్లో 19వ తేదీ వరకు పరిగణలోకి తీసుకుంటున్న అధికారులు దీనికి సంబంధించి హాజరుపట్టీ తయారు చేస్తుంటారు. పోలీసు స్టేషన్లు, ప్రత్యేక విభాగాలు, ఇతర కార్యాలయాల నుంచి నుంచి హెడ్–క్వార్టర్స్ లేదా అడ్మిన్ అధికారులకు వెళ్లే ఈ హాజరు ఫైల్ అక్కడ అప్రూవ్ అయ్యాక మాత్రమే హోంగార్డ్స్ కమాండెంట్ కార్యాలయానికి చేరుతుంది. అక్కడ నుంచి సంబంధిత కమిషనర్ ఆఫీస్కు వచ్చిన తర్వాతే జీతాలు లెక్కించి బ్యాంకు ద్వారా హోంగార్డుల ఖాతాలో పడాల్సి ఉంది. గతంలో ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు నెలగా పరిగణించే వాళ్ళు. మాన్యువల్గా జరుగుతున్న పనుల కారణంగా కొన్నేళ్ళ క్రితం వరకు జీతాల చెల్లింపు ఆలస్యమై ప్రతినెలా 15వ తేదీ తరవాతే హోంగార్డులకు అందేవి. అయితే దీనిపై దృష్టి పెట్టిన ఉన్నతాధికారులు నెల లెక్కింపును 20 నుంచి 19వ తేదీ వరకు మార్చారు. అయినప్పటికీ గడిచిన కొన్ని నెలలుగా కాస్త ఆలస్యంగానే జీతాలు వస్తున్నాయని హోంగార్డ్స్ వాపోతున్నారు. ఈ విభాగంలో గడిచిన కొన్నేళ్ళలో అనేక కుంభకోణాలు వెలుగుచూశాయి. వీటికి చెక్ చెప్పడంతో పాటు హోంగార్డులకూ ప్రతి నెలా ఒకటి–రెండు తేదీల్లో జీతాలు ఇచ్చేందుకు అవసరమైన ఆధునిక టెక్నాలజీ వినియోగంపై అధికారులు దృష్టి పెట్టట్లేదు. గతంలో వెలుగులోకి వచ్చిన కుంభకోణాలన్నీ హోంగార్డుల ‘హాజరు’ ఆధారంగా జరిగినవే. హోంగార్డుల హాజరును నమోదు చేయడానికి పోలీసుస్టేషన్ల వారీగా మరోసారి బయోమెట్రిక్ వ్యవస్థను ఏర్పాటు చేసి, లోపాలకు అధిగమిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కుంభకోణాలకు ఆస్కారం లేకుండా పోవడంతో పాటు జీతాల బిల్లుల తయారీ పేపర్తో పని లేకుండా వేగంగా జరుగుతుంది. ఈ బయోమెట్రిక్ సర్వర్ కమాండెంట్ కార్యాలయంలో ఉంచితే... హాజ రు అక్కడే నమోదు అవుతుంది. ఫలితంగా కచ్చితత్వం ఉండటంతో పాటు జీతా ల బిల్లులు సైతం ఆలస్యం కావు. కేవలం పర్మిషన్లు, ఆన్డ్యూటీల్లో ఉన్న హోంగార్డుల వివరాలను మాత్రం ఈ కార్యాలయానికి మాన్యువల్గా, నేరుగా పంపితే సరిపోతుంది. ఉన్నతాధికారులు ఈ కోణంపై దృష్టి పెడుతున్న దాఖలాలు కనిపించట్లేదు. ఆలస్యానికి కారణాలు ఏవైనా ఇబ్బందులు పడుతున్నది మాత్రం పోలీసుశాఖలో ‘బడుగు జీవులు’ అయిన హోంగార్డులే. తమకు గృహరుణాలు, ఇతర లోన్లు ఉన్నాయని, వీటి ఈఎంఐలు ప్రతి నెలా మొదటి వారంలోనే కట్ అ వుతాయని చెప్తున్నారు. జీతాల ఆలస్యం కారణంగా ఇది సాధ్యంకాక తమ సిబిల్ స్కోర్లు కూడా దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు కలగజేసుకుని తమ బాధలు తీర్చాలని హోంగార్డులు వేడుకోంటున్నారు. -
బిలియనీర్ వివేక్ రామస్వామి ఇంట్లో ‘నానీ’ జాబ్: జీతం తెలిస్తే షాకవుతారు
Vivek Ramaswamy wants to hire nanny అమెరికా అధ్యక్ష పదవి రేసులో దూసుకుపోతున్న భారతీయ సంతతికి చెందిన వ్యాపారవేత్త, బిలియనీర్ వివేక్ రామస్వామి తన పిల్లలను చూసుకునేందుకు నానీ కోసం వెతుకు తున్నట్లు సమాచారం. ఇందుకోసం భారీగా జీతాన్ని ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రిక్రూట్మెంట్ స్టాఫింగ్ వెబ్సైట్లోని జాబ్ లిస్టింగ్ ప్రకారం రామస్వామి తన పిల్లల్ని చూసుకునే నానీ (ఆయా)కోసం లక్ష డాలర్లు (రూ.80 లక్షల కంటే ఎక్కువ) లేదా అంతకంటే ఎక్కువ జీతాన్ని ఆందించనున్నారు. వివేక్ రామస్వామి అపూర్వ తివారీకి దంపతులకు కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు మగ పిల్లలున్నారు. వృత్తిరీత్యా అపూర్వ స్వరపేటిక నిపుణురాలు. (మరో వివాదంలో బిగ్ బీ అమితాబ్: ఇంత దారుణమా అంటూ తీవ్ర ఆగ్రహం) EstateJobs డాట్ కామ్ అనే వెబ్సైట్ ఉద్యోగ ప్రకటన ప్రకారం ఇది ఒక హై ప్రొఫైల్ ఫ్యామిలీలో చేరడానికి ఒక అసాధారణమైన అవకాశం, ప్రత్యేకమైన కుటుంబ సాహసాలలో పాల్గొంటూ వారి పిల్లల పెరుగుదల, అభివృద్ధికి దోహదపడాలి అని ఎస్టేట్ జాబ్స్ ఉద్యోగ ప్రకటన పేర్కొంది. ఈ యాడ్లో క్లయింట్ పేరు ప్రస్తావించక పోయినప్పటికీ, ఇది రామస్వామి కుటుంబానికి సంబంధించిందనే అంచనాలు భారీగా ఉన్నాయి. (2023 ఐసీసీ వరల్డ్ కప్: ప్రకటనల ఆదాయం ఎంతో తెలుసా?) ఈ ఉద్యోగానికి వారానికి 84 నుండి 96 గంటల పని అవసరం, ఆ తర్వాత వారం మొత్తం సెలవు ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఎంపికైన నానీ ఇతర చెఫ్, నానీలు, హౌస్ కీపర్, ప్రైవేట్ సెక్యూరిటీతో సహా ఇతర కీలకమైన టీంతో కలిసి పనిచేయాలి. అలాగే అబ్బాయిల ఆటలు, బొమ్మలు, దుస్తులను ఒక క్రమ పద్ధతిలో నిర్వహించాల్సి ఉంటుంది. (ఐటీ దిగ్గజాల కీలక నిర్ణయం: ఆందోళనలో టెకీలు) కాగా 2024 ఎన్నికల్లో జో బిడెన్తో తలపడేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు భారతీయ సంతతికి చెందిన రిపబ్లికన్ అభ్యర్థి రామస్వామి ముందు వరుసలో ఉన్న సంగతి తెలిసిందే. (హ్యుందాయ్ కీలక నిర్ణయం: తొలి బ్రాండ్గా రికార్డ్) -
పాక్ ప్రధాని జీతం ఎంత? అదనపు సౌకర్యాలు ఏముంటాయి?
పాకిస్తాన్ భారతదేశానికి పొరుగు దేశం. అయితే పాక్- భారత్ సంబంధాలు ఎప్పుడూ స్నేహపూర్వకంగా లేవు. దీని వెనుక ఉన్న ముఖ్య కారణం ఏమిటంటే.. పాకిస్తాన్కు ఏనాడూ బలమైన ప్రధాని లేకపోవడమేనని విశ్లేషకులు చెబుతుంటారు. అయితే ఇప్పుడు మనం ఈ రెండు దేశాల మధ్య సంబంధాల గురించి కాకుండా పాక్ ప్రధాని జీతం, అతనికి కల్పించే సౌకర్యాల గురించి తెలుసుకుందాం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సమర్పించిన డేటా ఆధారంగా ది న్యూస్ ఇంటర్నేషనల్ ఇటీవల పాకిస్తాన్ ప్రధానమంత్రి, ఎంపీలు, మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జీతభత్యాల సమాచారాన్ని బహిరంగపరిచింది. దీనిలోని వివరాల ప్రకారం పాకిస్తాన్ ప్రధానికి 2,01,574 పాకిస్తానీ రూపాయల జీతం లభిస్తున్నది. (1 పీకేఆర్ = రూ. 0.287429) ఇక ప్రధానికి కల్పించే సౌకర్యాల విషయానిక వస్తే ఒక విలాసవంతమైన ఇంటితో పాటు, భద్రత, సేవకులు లాంటి సౌకర్యాలను కల్పిస్తారు. అయితే పాక్లో పీఎంకు ఎన్ని సౌకర్యాలు కల్పించినా వాటి పర్యవేక్షణ బాధ్యత అక్కడి సైన్యం చేతిలో ఉంటుంది. పాకిస్తాన్ ఎంపీల జీతం విషయానికి వస్తే వారికి 1,88,000 పీకేఆర్ జీతం లభిస్తుంది. అయితే భారత ఎంపీలకు లభించినన్ని ప్రత్యేక సదుపాయాలు పాక్ ఎంపీలకు లభించడం లేదు. అక్కడి సీనియర్ ఆఫీసర్ల విషయానికివస్తే వారికి కూడా ఎంపీలకు లభించినంత జీతం లభిస్తుంది. పాక్ ప్రధాన న్యాయమూర్తికి 15,27,399 పాకిస్తానీ రూపాయల జీతం అందుతుంది. మంత్రులు 3,38,125 పాకిస్తానీ రూపాయల జీతం అందుకుంటారు. అయితే గ్రేడ్-2 అధికారులు 5,91,475 పాకిస్తానీ రూపాయల జీతం పొందుతారు. పాకిస్తానీ రూపాయలను భారతీయ రూపాయలతో పోల్చిచూస్తే, వారి జీతం చాలా తక్కువని చెప్పవచ్చు. ఇది కూడా చదవండి: XL, XXLలను వినే ఉంటారు.. X ఏమి సూచిస్తుంది? -
అంగన్వాడీల సమ్మె యథాతథం
సాక్షి, హైదరాబాద్, ముషీరాబాద్: అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె య«థాతథంగా కొనసాగుతుందని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రానందువల్లే సమ్మెను కొనసాగిస్తున్నామని, సామాజిక మాధ్యమాల్లో సమ్మె విరమించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని పేర్కొంది. ఈ మేరకు జేఏసీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆయన వేతనాలను ఏమేరకు పెంచుతామనే అంశాన్ని స్పష్టం చేయలేదని పేర్కొంది. వేతనాల అంశాన్ని సీఎం కేసీఆర్తో మాట్లాడి ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించినప్పుడు అంగన్వాడీలకు కూడా పెంచుతామని హామీ ఇచ్చారని వివరించింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్కు సంబంధించి టీచర్కు రూ.2 లక్షలు, హెల్పర్కు రూ.లక్ష ఇస్తామన్న మంత్రి సత్యవతి రాథోడ్ ప్రతిపాదనలు అమలు చేయాలని కోరితే మంత్రి హరీశ్రావు పరిశీలిస్తామని చెప్పారని, స్పష్టతనివ్వలేదని జేఏసీ నేతలు తెలిపారు. గ్రాట్యుటీ అంశాన్ని సాధ్యం కాదని మంత్రి తేల్చి చెప్పారని పేర్కొన్నారు. సమ్మె విరమించాలని మంత్రి హరీశ్రావు కోరారని, కానీ జేఏసీ మంత్రికి నిర్ణయాన్ని వెల్లడించలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో సమ్మె విరమిస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. ఈ నెల 4న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి హరీశ్తో భేటీ అయిన వారిలో సీఐటీయూ నేతలు పి.జయలక్ష్మి, సునీత, ఏఐటీయూసీ నేతలు ఎన్.కరుణకుమారి, ఎం.సాయిశ్వరి, కె.చందన, జేఏసీ నేతలు భూపాల్, ఓ.ఈశ్వరరావు, ఏఐటీయూసీ కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య ఉన్నారు. మరింత పట్టుదలతో సమ్మె: ఏఐటీయూసీ నేత విజయలక్ష్మి అంగన్వాడీలు మరింత పట్టుదలతో సమ్మె కొనసాగించాలని ఏఐటీయూసీ జాతీయ నాయకురాలు బి.వి.విజయలక్ష్మి, ఏఐటీయూసీ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎం.డీ.యూసఫ్, ఎస్.బాలరాజులు పిలుపునిచ్చారు. వేతనాల పెంపుపై ప్రభుత్వం నుంచి సరిగ్గా హామీ రాకపోవడం, మిగిలిన డిమాండ్లపైనా స్పష్టత లేకపోవడంచో సమ్మె కొనసాగించాలని నిర్ణయించామని చెప్పారు. సోషల్ మీడియాలో సమ్మె విరమిస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని పిలుపునిచ్చారు. -
అంగన్వాడీలకూ పీఆర్సీ ఫలాలు
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాన్ని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా స్థిరీకరిస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు స్పష్టం చేశారు. త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటిస్తామని, ఇందులో భాగంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనాలు పెరుగుతాయన్నారు. ఆదివారం అంగన్వాడీ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు, సీఐటీయూ, ఏఐటీయూసీ ప్రతినిధులు మంత్రి హరీశ్రావును ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల డిమాండ్లు, ఇతర సమస్యలను మంత్రి ముందు ఉంచారు. దీనిపై హరీశ్ సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు త్వరలో ప్రభుత్వం ఇవ్వనున్న పీఆర్సీలో అంగన్వాడీలను చేర్చుతామని,ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జీతాలను కూడా పెంచుతామని భరోసానిచ్చారు. ఇతర డిమాండ్లపై సానుకూలంగా స్పందించి వాటిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, ఈ డిమాండ్లపై నివేదికను సమర్పించాల్సిందిగా మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి భారతి హోలికేరినీ ఆయన ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకం బిల్లులను కూడా ప్రభుత్వం విడుదల చేసిందని, రెండు రోజుల్లో ఆయా ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి హరీశ్ వెల్లడించారు. -
ఉద్యోగుల జీవన ప్రమాణాలను పెంచేందుకు భారీగా జీతాలు పెంచాం - మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
-
మనసున్న సీఈవో! ఉద్యోగుల కోసం ఏం చేశాడో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా ఓవైపు లేఆఫ్లు.. మరోవైపు తక్కువ జీతాలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా కంపెనీల్లో జీతాల పెంపు లేక ఎంప్లాయీస్ అవస్థలు పడుతున్న తరుణంలో ఓ కంపెనీ సీఈవో తీసుకున్న నిర్ణయం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఇంతకీ ఆయన తీసుకున్న నిర్ణయం ఏమిటో తెలుసుకుందాం.. సతీష్ మల్హోత్రా (Satish Malhotra).. అమెరికన్ స్పెషాలిటీ రిటైల్ చైన్ కంపెనీ ‘ది కంటైనర్ స్టోర్’కు సీఈవో (CEO). తమ కంపెనీలోని ఇతర ఉద్యోగులకు వేతనాల పెంపునకు, ఖర్చులను తగ్గించడంలో సహాయపడటానికి తన జీతాన్ని స్వచ్ఛందంగా 10 శాతం తగ్గించుకున్నారు. సతీష్ 2021 ఫిబ్రవరి నుంచి కంపెనీ సీఈవోగా ఉన్నారు. గతంలో ఆయన ప్రపంచ ప్రఖ్యాత కాస్మెటిక్స్ చైన్ సెఫోరాలో 20 ఏళ్లు పనిచేశారు. ఫార్చ్యూన్ నివేదిక ప్రకారం.. ఆరు నెలల కాలానికి మల్హోత్రా వార్షిక జీతం 925,000 డాలర్ల (రూ. 7.68 కోట్లు) నుంచి 8,32,500 డాలర్లకు (రూ. 6.9 కోట్లు) తగ్గుతుందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఫైలింగ్లో కంపెనీ పేర్కొంది. కాగా గత సంవత్సరం మల్హోత్రా 2.57 మిలియన్ డాలర్ల (రూ. 21.35 కోట్లు) వేతన పరిహారాన్ని అందుకున్నారు. అయితే ఉద్యోగులకు సగటు పెంపుదల ఎంత ఉంటుందనేది కంపెనీ స్పష్టం చేయలేదు. కంటైనర్ స్టోర్ దాని ఇటీవలి త్రైమాసిక ఫలితాలలో 10.1 మిలియన్ డాలర్ల సర్దుబాటు చేసిన నికర నష్టాన్ని నివేదించింది. గూగుల్, యాపిల్ సీఈవోల సరసన.. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ (Apple CEO Tim Cook), గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (Google CEO Sundar Pichai)తో పాటు ఈ ఏడాది భారీగా వేతనాలు తగ్గించుకున్న సీఈవోల జాబితాలో సతీష్ మల్హోత్రా కూడా చేరారు. ఈ ఏడాది జనవరిలో 12,000 తొలగింపులను ప్రకటించిన 10 రోజుల తర్వాత తనతో సహా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయి కంటే పైస్థాయి ఎగ్జిక్యూటివ్లందరూ తమ వార్షిక బోనస్ను గణనీయంగా తగ్గించుకుంటున్నట్లు సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ఇక యాపిల్ సీఈవో టిమ్ కుక్ 2023 సంవత్సరానికి తన వేతన పరిహారాన్ని 50 శాతం తగ్గించుకున్నారు. -
హర్ష గొయెంకా ట్వీట్.. హాట్ టాపిక్గా ఇస్రో చైర్మన్ జీతం..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్పోగుతుంది. ఇందుకు కారణం ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్పీజీ గ్రూప్ అధినేత హర్ష గోయెంకా. అవును సోమనాథ్ జీతం విషయాన్ని ట్విటర్ వేదికగా హర్ష గోయెంకా ప్రస్తావించడంతో ఇస్రో చైర్మన్ పేరు తీవ్ర చర్చకు దారితీసింది. ఇస్రో చైర్మన్ సోమనాథ్ నెల జీతంగా రెండున్నర లక్షలు సంపాదిస్తున్నారని తెలిపిన గోయింకా.. ఇది ఆయనకు తగిన జీతమేనా అని ప్రశ్నించారు. శాస్త్రీయ విజ్ఞానం, పరిశోధనలపై సోమనాథ్కు ఉన్న ఆసక్తి, నిబద్ధతను వివరిస్తూ ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తారు. Chairman of ISRO, Somanath’s salary is Rs 2.5 lakhs month. Is it right and fair? Let’s understand people like him are motivated by factors beyond money. They do what they do for their passion and dedication to science and research, for national pride to contribute to their… — Harsh Goenka (@hvgoenka) September 11, 2023 ఆయన తన ట్వీట్లో ‘ఇస్రో చైర్మన్ సోమనాథ్ నెల జీతం రూ. 2.50 లక్షలు. ఈ జీతం ఆయనకు సరైనదేనా? న్యాయమేనా? సోమనాథ్ లాంటి వాళ్లు డబ్బుల కోసం కాదు.. అంతకు మించిన మంచి, దేశ ప్రగతి కోసం పనిచేస్తారని అర్థం చేసుకోవచ్చు. వారు సైన్స్, పరిశోధనల పట్ల అభిరుచి, నిబద్ధతతో జాతిని గర్వింపజేసేలా.. దేశ అభివృద్ధికి తోడ్పడతారు. వారి లక్ష్యాన్ని సాధించడంలో వ్యక్తిగత ప్రయోజనాలను త్యాగం చేస్తారు. ఆయనలాంటి అంకితభావం గల వ్యక్తులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను!’ అని పేర్కొన్నారు. హర్ష గోయెంకా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనేకమంది నెటిజన్లు తమ స్పందన తెలియజేస్తున్నారు. సోమనాథ్కు ఎక్కువ సాలరీ ఇవ్వాలని.. ఆయనలాంటి వాళ్ల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని పేర్కొంటున్నారు. మరికొంతమంది.రెండున్నర లక్షలు అనేది ప్రాథమిక వేతనం అయి ఉండవచ్చని, ఇతర అలవెన్సన్లు కూడా కలపాలని కామెంట్ చేస్తున్నారు. చదవండి: ఎట్టకేలకు భారత్ వీడిన కెనడా ప్రధాని.. రెండు రోజులు ఆలస్యంగా ‘ఇస్రోకు సోమనాథ్ లాంటి వ్యక్తుల నిబద్ధత, ఎనలేనిది. డబ్బులతో పోల్చలేనిది. సైన్స్, రీసెర్చ్ పట్ల ఆయనకున్న అంకితభావం దేశాన్ని మరింత ముందుకు నడపుతోంది. ఆయనలాంటి వారు ఎంతో మందికి ఆదర్శం. సమాజానికి ఆయన చేస్తున్న సేవలు అమూల్యమైనది’ అని ఓ యూజర్ పేర్కొనగా.. ‘ ఇస్రో చ్మైర్మన్కు నెలకు 25 లక్షలు ఇవ్వాలి. తన ప్రతిభను గుర్తించి రివార్డ్ ఇవ్వాలని మరొకరు చెప్పారు. కాగా ఇటీవల రెండు గొప్ప ప్రయోగాలను ఇస్రో చేపట్టిన విషయం తెలిసిందే. చంద్రుడిపై పరిశోధనలకు చంద్రయాన్-3 పేరుతో ఉపగ్రహాన్ని ప్రవేశించింది. ఇది జాబిల్లి ఉపరితలంపై మట్టి స్వభావం, వాతావరణం, ఖనిజాలు వంటి విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేసింది. అదే విధంగా సూర్యుడి గుట్టు తెలుసుకునేందుకు తొలిసారి ఆదిత్య ఎల్ల్1 పేరుతో అంతరిక్ష్యంలోకి మరో స్పేస్ క్రాఫ్ట్ను నింగిలోకి ప్రవేశపెట్టింది. 125 రోజులపాటు 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది సోలార్ మిషన్అనంతరం భూమికి సూర్యుడికి మధ్యనున్న లాంగ్రేజ్ పాయింట్ 1 వద్దకు చేరుకొని సూర్యుడిపై ప్రయోగాలు చేయనుంది. -
షారుఖ్ ఖాన్ మేనేజర్ ఎవరో తెలుసా? జీతం తెలిస్తే షాకవ్వాల్సిందే!
సినిమా ఇండస్ట్రీలో మేనేజర్లని కీలక పాత్ర. నటీనటులకు, నిర్మాతలకు వాళ్లు వారధుల్లా పని చేస్తుంటారు. హీరో హీరోయిన్ల డేట్స్ మొదలు.. పారితోషికం వరకు అన్ని వాళ్లే దగ్గర ఉండి చూసుకుంటారు. యాక్టర్స్ కూడా మేనేజర్లు ఏది చెబితే అది ఫాలో అవుతుంటారు. అందుకే దర్శక నిర్మాతలు మేనేజర్ల వెంబడి పడుతుంటాడు. మీ హీరోతో మా సినిమా సెట్ చేయడంటూ విజ్ఞప్తులు చేస్తుంటారు. అయితే ఇక్కడ ప్రతీది మేనేజర్లే చూసుకోవాలని కాబట్టి.. స్టార్ హీరోహీరోయిన్లు చాలా నమ్మకస్తులను మేనేజర్లుగా నియమించుకుంటారు. వారితో ఏళ్లతరబడి స్నేహబంధాన్ని కొనసాగిస్తారు. అలాంటి వారిలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ ఒకరు. షారుఖ్ ఫ్యామిలీతో మంచి అనుబంధం 2012 నుంచి షారుఖ్కు మేనేజర్గా పూజా దద్లానీ పని చేస్తుంది. షారుఖ్ సినిమా వ్యవహారాలే కాకుండా పర్సనల్ విషయాలలో ఆమె సలహాలు ఇస్తుంటారట. దశాబ్ద కాలానికి పైగా షారుఖ్తో కలిసి పనిచేయడంతో వారి ఫ్యామిలీతో ఆమెకు మంచి అనుబంధం ఏర్పడింది. షారుఖ్ భార్య గౌరీఖాన్... పూజాను సొంత ఇంటి మనిషిలా చూసుకుంటుంది. పలువురి సెలబ్రిటీల పార్టీలకు పూజాతో కలిసి వెళ్లింది. పూజ కూడా ఆ ఫ్యామిలీ కష్ట, సుఖాల్లో మోరల్ సపోర్ట్ గా నిలుస్తూ ఉంటుంది. ఇటీవల విడుదలైన ‘జవాన్’ చిత్ర ప్రమోషన్ల విషయంలో కూడా పూజా దద్లానీ కీలకంగా వ్యవహరించింది. భారీ వేతనం షారుఖ్ ఖాన్ సంపాదన గురించి అందరికి తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నటుల్లో షారూఖ్ ఖాన్ ఒకరు. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగాను రాణిస్తున్నాడు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అనే బ్యానర్ని స్థాపించి పలు సినిమాలను నిర్మిస్తున్నాడు. ఆయన భార్య గౌరీ ఖాన్ కూడా సెలబ్రిటీ ఇంటీరియర్ డిజైనర్ గా భారీగానే ఆర్జిస్తోంది. షారుఖ్ ఫ్యామిలీ వార్షిక ఆదాయం దాదాపు 500 కోట్ల వరకు ఉంటుందట. తమ ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకునే పూజా దాద్లానీకి షారుఖ్ భారీ వేతనాన్ని అందిస్తున్నాడట. ఏడాదికి రూ.7 కోట్ల నుంచి 9 కోట్ల వరకు పూజా వేతనం ఉంటుందని బాలీవుడ్ టాక్. పూజ కేవలం మేనేజర్గానే కాకుండా ఇతర వ్యాపారాలు కూడా చేస్తుంటారట.ఆమె సంపాదన నికర విలువ దాదాపు రూ.50 కోట్ల వరకు ఉటుందని సమాచారం. ముంబైలోని లిస్టా జ్యువెల్స్ డైరెక్టర్ హితేష్ గుర్నానీని పూజా వివాహం చేసుకుంది. వీరికి రేనా దద్లానీ అనే కూతురు కూడా ఉంది. -
అవమానించడంతోనే పెట్రోల్ పోసుకున్నా
అఫ్జల్గంజ్/సంతోష్నగర్: న్యాయంగా రావాల్సిన జీతాన్ని అడిగేందుకు వెళ్లిన తనను హోంగార్డు కార్యాలయ సిబ్బంది దూషించడంతోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు హోంగార్డు రవీందర్ తెలిపారు. చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న రక్షాపురం నివాసి రవీందర్ తనకు రావాల్సిన జీతం కోసం గోషామహల్లోని హోంగార్డు కార్యాలయానికి మంగళవారం వెళ్లారు. అక్కడి సిబ్బంది అసభ్య పదజాలంతో దూషించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రగాయాలు కాగా వైద్య చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న రవీందర్ బుధవారం మీడియాతో మాట్లాడారు. హోంగార్డు అంటే ప్రతి నెలా 1వ తారీఖునే జీతాలిచ్చేయాలా అని చిన్నచూపు చూశారని ఆవే దన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అవమానం రాష్ట్రంలోని ఏ హోంగార్డుకూ జరగకూడదన్నారు. కాగా ఉస్మానియాలో చికిత్స పొందుతున్న రవీందర్ను రాష్ట్ర హోంగార్డు జేఏసీ చైర్మన్ నారాయణ పరామర్శించారు. రవీందర్ భార్య సంధ్యతో మాట్లాడి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం అపోలో డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. రవీందర్కు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామన్నారు. హోంగార్డుల సమస్యల పరిష్కారానికై ఈ నెల 16 వరకు విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. నిరసన తెలిపిన హోంగార్డులు..: సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం హోంగార్డులను వెంటనే పర్మనెంట్ చేయాలని కోరుతూ బుధవారం సాయంత్రం అపోలో డీఆర్డీఓ ఆసుపత్రి ఆవరణలో హోంగార్డులు ఆందోళనకు దిగారు. రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలనీ, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. సీఎందే బాధ్యత: కేంద్రమంత్రి కిషన్రెడ్డి సాక్షి, హైదరాబాద్: రవీందర్ ఆత్మహత్యాయ త్నా నికి కేసీఆరే బాధ్యత వహించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా 2017లో సీఎం కేసీఆర్ హోంగార్డులను పర్మనెంట్ చేస్తానని మాట ఇచ్చి తప్పారని మండిపడ్డారు. హోంగార్డులకు బీజేపీ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. సీసీ టీవీ ఫుటేజీ బయటపెట్టాలి: బండి అమెరికా పర్యటనలో ఉన్న ఎంపీ బండి సంజయ్ బుధవారం రాత్రి (భారత సమయం) హోంగార్డు కుటుంబ సభ్యులతోపాటు హోంగార్డ్ అసోసియేష న్ జేఏసీ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ వీడియోకాల్ చేసి మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీ దృశ్యాలను వెంటనే బయటపెట్టాలని సంజయ్ డిమాండ్ చేశారు. -
పాన్కార్డు పనిచేయడం లేదా? మరి జీతం అకౌంట్లో పడుతుందా?
PAN - Aadhar link: ప్రతిఒక్కరి దైనందిన జీవితంలో పాన్ కార్డ్ ఓ భాగమైపోయింది. ఆర్థిక లావాదేవీలన్నింటికీ పాన్ కార్డ్ చాలా అవసరం. ఈ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీనికి గడువు 2023 జూన్ 30తో ముగిసింది. ఆ తర్వాత ఆధార్తో లింక్ చేయని పాన్ కార్డులు పనిచేయకుండా (ఇనాపరేటివ్) పోయాయి. ఇప్పటికీ పాన్-ఆధార్ లింక్ చేయనివారు కొంతమంది ఉన్నారు. దీంతో వారి పాన్ కార్డులు ఇనాపరేటివ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అలాంటి పాన్ కార్డులున్నవారికి జీతం అకౌంట్లో క్రెడిట్ అవుతుందా అనే సందేహం తలెత్తింది. (ఎస్బీఐలో అద్భుత పథకం! గడువు కొన్ని రోజులే...) ఆధార్తో లింక్ చేయకపోవడంతో పాన్ కార్డులు ఇనాపరేటివ్గా మారడం వల్ల ఆర్థిక లావాదేవీల్లో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ జీతం బ్యాంక్ ఖాతాకు జమ కాకుండా ఆపదు. అయితే ఈ పనిచేయని పాన్ కార్డును ఎక్కడా ఉపయోగించడానికి వీలుండదు. కానీ జీతాలు జమ చేసేది యాజమాన్యాలు కాబట్టి బ్యాంకులు ఎలాంటి ఆంక్షలు పెట్టలేవు. ఇదీ చదవండి: నిమిషాల్లో లోన్.. ఆర్బీఐ ప్రాజెక్ట్ అదుర్స్! ఆనంద్ మహీంద్రా ప్రశంస మొదట ఉచితంగా పాన్-ఆధార్ లింకింగ్కి 2022 మార్చి 31 వరకు ప్రభుత్వం గడవు విధించింది. ఆ తర్వాత రూ. 500 జరిమానాతో 2022 జూన్ 30 వరకు గడువును పొడిగించింది. అనంతరం రూ. 1000 జరిమానాతో 2023 మార్చి 31 వరకు, చివరిసారిగా 2023 జూన్ 30 వరకు గడవులు పొడిగించుకుంటూ వచ్చింది. తర్వాత మరోసారి గడువును ప్రభుత్వం పొడించలేదు. దీంతో 2023 జూన్ 30 తర్వాత ఆధార్తో లింక్ చేయని పాన్ కార్డులు ఇనాపరేటివ్గా మారిపోయాయి. -
ప్రతి నెలా 14న అంగన్వాడీ టీచర్లకు వేతనాలు
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్లకు ప్రతినెలా 14వ తేదీన వేతనాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. అదేవిధంగా వీరికి ఇన్సూరెన్స్ సౌకర్యంతో పాటు హెల్త్ కార్డుల జారీపైనా దృష్టి సారించామని, ఇందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి వెల్లడించా రు. శుక్రవారం సచివాలయంలోని తన చాంబర్లో ఆమె అంగన్వాడీ యూనియన్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల్లో త్వరలో బ్రిడ్జికోర్సును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. అంగన్వాడీ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేసే విధంగా చర్య లు తీసుకుంటామన్నారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులు, ఇతర సమస్యలను త్వరలో పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి భారతి హోలికెరి, జేడీ సునంద, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్ప ర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి, టీఎన్జీవో ప్రతినిధి నిర్మల, మినీ అంగన్వాడీ అధ్యక్షురాలు వరలక్ష్మి ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
జీతం 17 లక్షలు..13 ఉద్యోగాల్ని రిజెక్ట్ చేసిన 21 ఏళ్ల యువతి!
కోవిడ్ -19, లేఆఫ్స్ వంటి కఠిన సమయాల్లో మీకొక జాబ్ ఆఫర్ వస్తే ? ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 కంపెనీలు మిమ్మల్ని ఆహ్వానిస్తే. అందులో టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్లాంటి సంస్థలుంటే! ఏం చేస్తారు? ఏం కంపెనీలో చేరాలో నిర్ణయించుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతారు. కానీ బెంగళూరుకు చెందిన ఈ టెక్కీ వచ్చిన ఆఫర్స్ అన్నింటిని తిరస్కరించింది. ఎందుకో తెలుసా? ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరుకు చెందిన రితి కుమారి (21). ఇప్పటి వరకు 13 కంపెనీల నుంచి ఆఫర్స్ వచ్చాయి. జీతం కూడా ఏడాదికి రూ.17లక్షలు పైమాటే. ఇంత శాలరీ వస్తుంటే ఎవరు కాదంటారు? చెప్పండి. కానీ రితి మాత్రం వద్దనుకుంది. తన మనసుకు నచ్చిన జాబ్ చేయాలని భావించింది. బదులుగా వాల్మార్ట్లో ఇంటర్న్షిప్ చేసేందుకు మొగ్గుచూపానంటూ జీవితంలో ఎల్లప్పుడూ కఠిన నిర్ణయాలు తీసుకోవాలంటూ తనకు ఎదురైన అనుభవాల్ని నెటిజన్లతో పంచుకున్నారు. అన్నట్లు ఇంటర్న్ షిప్ పూర్తి చేసిన ఆమె ఏడాదికి రూ. 20 లక్షల వేతనం తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు వచ్చిన జాబ్ ఆఫర్లు మంచివే. అందులో ఏదో ఒకటి సెలక్ట్ చేసుకోవాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు. కానీ సోదరి ప్రేరణతో అన్నీ ఉద్యోగాల్ని కాదనుకున్నాను. మనసు మాట విని చివరికి వాల్మార్ట్ని ఎంచుకున్నారు. 6 నెలల ఇంటర్న్షిప్లో నెలకు స్టైఫండ్ రూ.85,000 సంపాదించారు. ‘నేను వాల్మార్ట్ ఇంటర్న్షిప్ ఆఫర్ను స్వీకరించినందుకు సంతోషంగా ఉన్నాను. నాకొచ్చిన జాబ్ ఆఫర్స్లో పొందే నెలవారీ వేతనం కంటే వాల్ మార్ట్ ఇచ్చే జీతం చాలా తక్కువ .ఈ విషయంలో నా తల్లిదండ్రులు సంతోషంగా లేరు. కఠినమైన సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్ధం గాక ఆందోళన చెందా. ఎవరూ ఎలాంటి మద్దతు ఇవ్వలేదు. అప్పుడే నా సోదరి ప్రీతి కుమారి ఓ మాట చెప్పింది. ముందు నువ్వు నీ మనసు మాట విను. అది ఏం చెబితే అదే చేయి అంటూ ప్రోత్సహించింది. ప్రస్తుతం, ధన్బాద్లోని ఐఐటీలో పీహెచ్డీ చదువుతున్న నా సోదరి ప్రీతి కుమారి తల్లిదండ్రుల నిర్ణయాన్ని వ్యతిరేకించి గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)లో పాల్గొనేందుకు వచ్చిన జాబ్ ఆఫర్స్ను తిరస్కరించారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఐఐటీలో పీహెచ్డీ చేస్తూ ఆమె తీసుకున్న నిర్ణయం సరైందేనని నిరూపించారు. కాబట్టే, నేను వాల్మార్ట్లో ఇంటర్న్షిప్ ఆఫర్ తీసుకున్నాను.కష్టపడి నా ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ ఇంటర్వ్యూలు ఇచ్చాను. చివరికి వాల్మార్ట్ నుండి జాబ్ ఆఫర్ పొందాను అని కుమారి చెప్పారు. ఇప్పుడు తన కెరీర్ విషయంలో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాను తీసుకున్న నిర్ణయంపై స్కూల్ టీచర్గా పనిచేస్తున్న తన తండ్రిని సహచర ఉపాధ్యాయులు సైతం అభినందించడం సంతోషంగా ఉందని అన్నారు. రితి లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం.. జనవరి 2022 నుండి జూలై 2022 వరకు వాల్మార్ట్లో ట్రైనింగ్ తీసుకుంది. ఆపై వాల్మార్ట్ గ్లోబల్ టెక్ ఇండియా (బెంగళూరు)లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ -2గా చేరింది. చదవండి👉 యాపిల్ కీలక నిర్ణయం.. చైనా గొంతులో పచ్చి వెలక్కాయ?! -
ముఖేష్ అంబానీ వేతనం ఎంతో తెలుసా? మరో ఐదేళ్లూ అదే జీతం!
Mukesh Ambani Salary Details: భారతదేశంలో అత్యంత సంపన్నుడెవరు అంటే అందరూ ఏకకంఠంతో చెప్పే మాట 'ముఖేష్ అంబానీ' (Mukhes Ambani) అని, కావున ఇందులో ప్రస్తుతానికి ఎటువంటి సందేహం లేదు. అయితే ఈయన వార్షిక వేతనం ఎంత? ఇతర సౌకర్యాలు ఏవి ఉంటాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రిలయన్స్ సంస్థకు చైర్మన్గా కొనసాగుతున్న 'ముఖేష్ అంబానీ' పదవీకాలం మరో ఐదేళ్లు కొనసాగటానికి వాటాదార్ల ఆమోదం కోరుతున్నట్లు సమాచారం. నిజానికి 224 ఏప్రిల్ 19 నాటికి ఆయన పదవి కాలం పూర్తవుతుంది. మరో ఐదేళ్లు పొడిగిస్తే పదవి 2029 వరకు కొనసాగుతుంది. ఆరు పదుల వయసులో కూడా అపర చాణక్యుడుగా కంపెనీ అభివృద్ధికి పాటుపడుతున్న ఈయన 2022లో ధీరూభాయ్ అంబానీ మరణానంతరం చైర్మన్ పదవి పొందారు. ఇప్పటి వరకు అది అలాగే కొనసాగుతూ ఉంది. 2022 నుంచి ఎన్నోన్నో కొత్త ఆలోచనలతో కంపెనీని అత్యన్నత శిఖరాలకు తీసుకెళ్లాడు. ఈ కారణంగా మరో ఐదేళ్లు కంపెనీకి చైర్మన్గా నిర్వర్తించనున్నారు. అయితే ఈ సమయంలో ఆయన వార్షిక వేతనం శూన్యం అని తెలుస్తోంది. అంటే మరో ఐదేళ్ల కాలం పాటు ఆయన జీతం సున్నా రూపాయలు. ఇదీ చదవండి: సీఎం చేతుల మీదుగా గోల్డ్ మెడల్.. టాటా కంపెనీలో అది ఈమెవల్లే సాధ్యమైంది! 2019-20 వరకు వార్షిక వేతనం.. నివేదికల ప్రకారం, 2008-09 నుంచి 2019-20 వరకు ముఖేష్ అంబానీ వేతనం రూ. 15 కోట్లు ఉండేది, ఆ తరువాత కరోనా మహమ్మారి సమయంలో జీతం తీసుకోవడం పూర్తిగా మానేసాడు. అందులోనూ 2021లో అయన ఏ మాత్రం జీతం తీసుకోకపోవడం గమనార్హం. జీతం మాత్రమే కాకుండా 2021 నుంచి 2023 వరకు ఎలాంటి అలవెన్సులు తీసుకోలేదని తెలుస్తోంది. ఆ తరువాత శాలరీ అస్సలు తీసుకోనని బోర్డుకి రిక్వెస్ట్ చేసినట్లు.. అదే ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఎంతమంది ఉద్యోగాలు పోయినా వీరు చాలా సేఫ్.. జీతాలు కోట్లలో! ఇతర అలవెన్సులు.. దిగ్గజ కంపెనీ అయిన రిలయన్స్ సంస్థకు అధినేతగా ఉన్నా.. జీతం తీసుకోకున్నా. ఆయనకు కొన్ని ప్రత్యేకమైన అలవెన్సులు ఉంటాయి. ఇందులో ట్రావెలింగ్, బిజినెస్ ట్రిప్స్, ఫోన్ బిల్స్ వంటి వాటితో పాటు తన కుటుంబానికి అయ్యే భద్రతా ఖర్చు కూడా కంపెనీ భరించనుంది. -
బాబు ఫ్రెండ్ ఈశ్వరన్కు మరో షాక్.. జీతంలో భారీ కోత
చంద్రబాబు స్నేహితుడు, భారతీయ మూలాలున్న సింగపూర్ మాజీ మంత్రి ఎస్ ఈశ్వరన్కు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే పీకల్లోతు అవినీతి ఉచ్చులో చిక్కుకున్న ఈశ్వరన్ జీతంలో కోత విధిస్తున్నట్లు తాజాగా సింగపూర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈశ్వరన్ అవినీతి, అక్రమాస్తులపై దర్యాప్తు జరుగుతోందని సింగపూర్ ప్రధాని లీసీన్ లూంట్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ.. ఈశ్వరన్ జీతంలో 82 శాతం కోత విధించినట్లు పేర్కొన్నారు. తదుపరి నోటీసు వచ్చే వరకు ఎస్ ఈశ్వరన్ జీతం నెలకు 8,500 డాలర్లకు పరిమితం చేసినట్లు తెలిపారు. బాధ్యతాయుత మంత్రి పదవిలో ఉంటూ అవినీతికి పాల్పడ్డారని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉన్నందున మరిన్ని వివరాలు వెల్లడించలేకపోతున్నానని తెలిపారు. చదవండి: ఇంటిదొంగ – ఈశ్వరన్! ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వేతనం పొందేవారిలో సింగపూర్ రాజకీయ నాయకులు ముందు వరుసలో ఉంటారు. సింగపూర్ ప్రజా సేవల విభాగం 2023 ఏడాది గణాంకాల ప్రకారం ఒక మంత్రికి జీతభత్యంగా నెలకు 41వేల డాలర్లు(సుమారు రూ.34 లక్షలు) చెల్లిస్తారు. అంటే సంవత్సరానికి 8,20,000 డాలర్లు(సుమారు రూ.6.8 కోట్లు) జీతంగా పొందుతారు. ఈశ్వరన్ వేతనం 46,750 సింగపూర్ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 29 లక్షలు) కాగా.. 82% తగ్గిన తర్వాత 8,500 సింగపూర్ డాలర్లకు(రూ. 5,24,338) పరిమితం అయ్యింది. ఇదిలా ఉండగా అవినీతి ఆరోపణల కేసులో జూలై 11న ఈశ్వరన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. సింగపూర్ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐబీ ఆయన్ను అదుపులోకి తీసుకుంది. సింగపూర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్న ఎస్. ఈశ్వరన్ తీసుకున్న నిర్ణయాల వల్ల దేశానికి భారీ ఎత్తున నష్టం వాటిల్లినట్లు సీపీఐబీ గుర్తించింది. అనంతరం మంత్రి పదవి బాధ్యతల నుంచి ఆయన్ను సింగపూర్ ప్రధాని తప్పించారు. దీంతో బెయిల్పై ఉంటూ విచారణకు హాజరవుతున్నారు. అయితే 650 మిలియన్ డాలర్ల కుంభకోణంలో ఈశ్వరన్ ప్రధాన పాత్ర వహించారని విపక్షాల ఆరోపిస్తున్నాయి. చదవండి: ఈశ్వరన్.. అమరావతి స్టార్టప్ ఏరియాలో రూ.లక్ష కోట్ల దోపిడీకి స్కెచ్ -
టాప్ ఐటీ కంపెనీ సీఈవో జీతం ఢమాల్! ఏకంగా 80 శాతం..
HCL Tech CEO Vijayakumar Pay Drops: దేశంలోనే మూడో అతి పెద్ద ఐటీ కంపెనీ హెచ్సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ సి.విజయకుమార్ వేతనం 2023 ఆర్థిక సంవత్సరంలో భారీగా పడిపోయింది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం.. సీఈవో విజయకుమార్ 2023 ఆర్థిక సంవత్సరంలో 3.46 మిలియన్ డాలర్లు (రూ. 28.4 కోట్లు) అతి తక్కువ వేతనాన్ని పొందారు. ఇందులో మూల వేతనం 2 మిలియన్ డాలర్లు, పర్ఫామెన్స్ బోనస్ 1.43 మిలియన్ డాలర్లు, ఇతర ప్రయోజనాలు, అలవెన్సులు 0.03 మిలియన్ డాలర్లు ఉన్నాయి. ఇది 2022 ఆర్థిక సంవత్సరంలో ఆయన అందుకున్న 16.5 మిలియన్ డాలర్లు (రూ. 130 కోట్లు) కంటే దాదాపు 80 శాతం తక్కువ గమనార్హం. కారణం ఇదే.. హెచ్సీఎల్ కంపెనీ సీఈవో విజయ్కుమార్ వేతనం ఈ ఏడాది భారీగా తగ్గిపోవడానికి కారణం దీర్ఘకాలిక ప్రోత్సాహకాలు లేదా ఎల్టీఐ లేకపోవడం అని తెలుస్తోంది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం ఈ దీర్ఘకాలిక ప్రోత్సాహకాలను ఎల్టీఐని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మైలురాళ్లు లేదా బోర్డు నిర్దేశించిన లక్ష్యాల సాధన ఆధారంగా చెల్లిస్తారు. 2022 ఆర్థిక సంవత్సరంలో విజయకుమార్ ఎల్టీఐ రూపంలో 12.50 మిలియన్ డాలర్లు సంపాదించారు. ఇదీ చదవండి: ఆ బ్యాంకు ఉద్యోగులు ఇక ఇంటికే..! అయితే 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎల్టీఐని ఆయన 2024లో అందుకోనున్నారు. అయినప్పటికీ సీఈవో విజయకుమార్ 2023లో అందుకున్న జీతం అదే కంపెనీలో మొత్తం ఉద్యోగుల సగటు వేతనం కంటే 253.35 రెట్లు ఎక్కువ. గత మార్చి 31 నాటికి హెచ్సీఎల్ కంపెనీకి చెందిన 60 దేశాల్లోని 210 డెలివరీ కేంద్రాలలో మొత్తం 2,25,944 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇతర కంపెనీల సీఈవోల జీతాలు.. గత ఏడాది వరకు భారతదేశ ఐటీ రంగంలో అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓగా ఉన్న విజయకుమార్.. ఈ ఏడాది ఇతర కంపెనీల సీఈవోలతో పోల్చితే చాలా తక్కువ వేతనం పొందారు. 2023 ఆర్థిక సంవత్సరంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ మాజీ సీఈవో రాజేష్ గోపీనాథన్ రూ.29.16 కోట్లు, టెక్ మహీంద్రా అవుట్గోయింగ్ సీఈవో సీపీ గుర్నానీ రూ.30.14 కోట్లు, ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ 56.44 కోట్లు, విప్రో సీఈవో థియరీ డెలాపోర్టే రూ.82 కోట్లు వేతనాలు అందుకున్నట్లు ఆయా కంపెనీల వార్షిక నివేదిక ద్వారా తెలుస్తోంది.