-
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్కు చివరి చాన్స్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి ఈ నెల 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కన్వినర్ సీటు కౌన్సెలింగ్ ద్వారా పొందడానికి ఇదే చివరి అవకాశం. ఇప్పటివరకూ సీటు కోసం ప్రయత్నించని వారు ఉంటే ఈ నెల 18న సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరవ్వాలని సాంకేతిక విద్య కమిషనర్ వాకాటి కరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక కౌన్సెలింగ్కు రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 17 నుంచి 19 వరకూ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ నెల 23వ తేదీన ప్రత్యేక దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రెండు రోజుల్లో సీటు వచ్చిన అభ్యర్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత కూడా మిగిలిపోయిన సీట్లను ఈ నెల 25న స్పాట్ అడ్మిషన్ల పేరిట ఆన్లైన్లో కాకుండా నేరుగా కాలేజీల్లోనే భర్తీ చేస్తారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సాంకేతిక విద్య విభాగం విడుదల చేయాల్సి ఉంది. అందుబాటులో 19 వేల సీట్లు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ 19,049 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కంప్యూటర్ కోర్సులకు సంబంధించిన సీట్లు దాదాపు 4 వేలకు పైనే ఉన్నాయి. ఒక్క సీఎస్సీలోనే 3,034 సీట్లు మిగిలాయి. సివిల్ ఇంజనీరింగ్లో 2,505, ఈసీఈలో 2,721, ఈఈఈలో 2,630, ఐటీలో 1,785, మెకానికల్లో 2,542 సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది పలు కాలేజీలు సివిల్, మెకానికల్ సీట్లు రద్దు చేసుకుని, ఆ స్థానంలో కంప్యూటర్ సైన్స్ సీట్లు పెంచుకున్నాయి. వీటితో పాటు మరో 7 వేల సీట్లు కొత్తగా కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలో పెరిగాయి. మొత్తంగా కంప్యూటర్ సైన్స్ సీట్లు 14 వేల వరకు పెరిగాయి. అయితే గ్రామీణ ప్రాంతాలకు చేరువలో ఉండే కాలేజీల్లో కంప్యూటర్ కోర్సులు అందుబాటులో ఉన్నా అక్కడ చేరేందుకు విద్యార్థులు ఇష్టపడటం లేదు. ఆయా కాలేజీల్లో మౌలిక వసతులు, సరైన ఫ్యాకల్టీ లేదని విద్యార్థులు భావిస్తున్నారు. కాగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో సీట్లు 90 శాతం వరకూ భర్తీ అయ్యాయి. లక్షకు చేరువలో చేరికలు ఈ ఏడాది ఇంజనీరింగ్లో కన్వీనర్, యాజమాన్య కోటా కలిపి లక్ష మంది వరకు చేరే వీలుందని తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 174 కాలేజీలుంటే, వీటిలో 83,766 కన్వినర్ కోటా సీట్లు, మరో 33 వేలు యాజమాన్య కోటా సీట్లు ఉన్నాయి. కన్వీనర్ కోటాలో ఇప్పటికే 65 వేల మంది వరకూ చేరారు. ప్రత్యేక కౌన్సెలింగ్, స్పాట్ అడ్మిషన్ల ద్వారా మరో 6 వేల మంది వరకూ చేరే వీలుందని అంచనా వేస్తున్నారు. ఇక యాజమాన్య కోటా కింద దాదాపు 30 వేల వరకూ భర్తీ అయ్యే వీలుందని భావిస్తున్నారు. -
అభిమానులకు గుడ్న్యూస్.. వన్డే వరల్డ్ కప్ టికెట్లు రెడీ! ఆన్లైన్లో ఇలా
దుబాయ్: ఎట్టకేలకు వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లను ప్రత్యక్షంగా చూడాలనుకునే అభిమానులకు తీపి కబురు! టోర్నీ తొలి మ్యాచ్కంటే కేవలం 41 రోజుల ముందునుంచి ప్రేక్షకుల కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టికెట్లను అమ్మకానికి ఉంచనుంది. మ్యాచ్ల తేదీలనే బాగా ఆలస్యంగా (100 రోజుల ముందు) ప్రకటించిన ఐసీసీ ఇప్పుడు వేర్వేరు కారణాలతో వాటిని సవరించి బుధవారం తుది షెడ్యూల్ను విడుదల చేసింది. దీంతో పాటు ఫ్యాన్స్ తమ ప్రణాళికలు రూపొందించుకునేందుకు వీలుగా టికెట్ల అమ్మకాల వివరాలను కూడా ఐసీసీ వెల్లడించింది. ‘భారత్ ఆడే వామప్, ప్రధాన మ్యాచ్లు’... ‘భారత్ ఆడని ఇతర మ్యాచ్లు’ అంటూ రెండు రకాలుగా టికెట్ల అమ్మకాలను ఐసీసీ విభజించింది. భారత్ ఆడే 9 లీగ్ మ్యాచ్ల టికెట్లను కూడా ఆరు వేర్వేరు దశల్లో (వేదికల ప్రకారం) అమ్మకానికి అందుబాటులో ఉంచుతారు. అయితే ఇతర ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్ల తరహాలో నేరుగా అమ్మకపు తేదీ నుంచి టికెట్లు కొనేందుకు అవకాశం ఉండదు. వరల్డ్ కప్ టికెట్ల కోసం అభిమానులు ఆన్లైన్లో ముందుగా వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారమే ఆ తర్వాత కేటాయింపులు జరుగుతాయి. ఆగస్టు 15 నుంచి అభిమానులు https://www.cricketworldcup.com/register లో తమ వివరాలు నమోదు చేయాలి. టికెట్ల అమ్మకపు తేదీల వివరాలు 25 ఆగస్టు నుంచి: భారత్ మినహా ఇతర జట్ల వామప్ మ్యాచ్లు/ప్రధాన మ్యాచ్లు 30 ఆగస్టు నుంచి: భారత్ ఆడే రెండు వామప్ మ్యాచ్లు (గువహటి, తిరువనంతపురం) 31 ఆగస్టు నుంచి: చెన్నై (ఆస్ట్రేలియాతో), ఢిల్లీ (అఫ్గానిస్తాన్తో), పుణే (బంగ్లాదేశ్తో)లలో భారత్ ఆడే మ్యాచ్లు 1 సెప్టెంబర్ నుంచి: ధర్మశాల (న్యూజిలాండ్తో), లక్నో (ఇంగ్లండ్తో), ముంబై (శ్రీలంకతో)లలో భారత్ మ్యాచ్లు 2 సెప్టెంబర్ నుంచి: బెంగళూరు (నెదర్లాండ్స్తో), కోల్కతా (దక్షిణాఫ్రికాతో)లలో భారత్ ఆడే మ్యాచ్లు 3 సెప్టెంబర్ నుంచి: అహ్మదాబాద్లో (పాకిస్తాన్తో) భారత్ ఆడే మ్యాచ్ 15 సెప్టెంబర్ నుంచి: సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లు -
రెరాతో రియల్ దందాకు చెక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రియల్ దందాలకు ఆస్కారం లేకుండా టీఎస్ రెరా (తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అధారిటీ) కృషి చేస్తుందని ‘రెరా’ చైర్మన్ సత్యనారాయణ వెల్లడించారు. ’’ రాష్ట్రంలో 598 చదరపు మీటర్ల విస్తీర్ణం దాటిన ఏ రియల్ ఎస్టేట్ వెంచర్ అయినా, 8 ఫ్లాట్లను మించి నిర్మించే ఏ అపార్ట్మెంట్కు అయినా... రెరా రిజిస్ట్రేషన్, అనుమతి తప్పనిసరి చేయనున్నారు. ‘ఏ వెంచర్ కోసం కొనుగోలు దారుల నుంచి వసూలు చేశారో.. ఆ మొత్తంలో 70 శాతం అదే వెంచర్లో ఖర్చు చేయాలి. ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం మాత్రమే అగ్రిమెంట్ సమయంలో చెల్లించాలి. ప్రాజెక్టు ప్లాన్ మార్చాలన్నా... కొనుగోలు దారుల్లో మూడింట రెండొంతుల మంది అనుమతి తప్పనిసరి’... ఇలాంటి నిబంధనలన్నింటినీ తప్పనిసరి చేసేందుకు ‘రెరా’ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది.’’ అని ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ‘రెరా’ నిబంధనలకు లోబడే.. ప్రతీ ప్రాజెక్టు రియల్ వెంచర్ అయినా, భారీ అపార్ట్మెంట్ అయినా.. ఒప్పందాన్ని ఉల్లంఘించి, ముందుగా చెప్పిన దానికి భిన్నంగా నిర్మాణం జరిపినా, పూర్తిస్థాయిలో అనుమతులు లేకపోయినా, సౌకర్యాలు కల్పించకపోయినా ‘రెరా’ చర్యలకు ఉపక్రమిస్తుంది. రాష్ట్రంలో ఏమూలన రియల్ ఎస్టేట్ వెంచర్ చేసినా, అపార్ట్మెంట్ కట్టినా ‘రెరా’ వద్ద ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయించాలి. దీంతో కొనుగోలుదారుడికి, రియల్ వ్యాపారికి అనుసంధానంగా ఈ సంస్థ పనిచేస్తుంది. 2017లో రెరా అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 6,805 వెంచర్లు, ఫ్లాట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం ‘రెరా’ వద్దకు రాగా, అందులో 6,770కి అనుమతులు లభించాయి. మరో 35 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, నిర్ణీత గడువులోగా ఈ దరఖాస్తులను కూడా పరిశీలించి అనుమతులు ఇవ్వనున్నట్లు సత్యనారాయణ తెలిపారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు సైతం రిజిస్ట్రేషన్ చేయాల్సిందే ‘రెరా’ చట్టం ప్రకారం రియల్ వెంచర్లు, ఫ్లాట్లతో పాటు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు (బ్రోకర్లు) కూడా ‘రెరా’ వద్ద రిజిస్టర్ అయి ఉండాల్సిందే. ఇప్పటి వరకు 2,912 మంది ఏజెంట్లు రిజిస్టర్ కాగా, మిగతా వారిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చైర్మన్ సత్యనారాయణ సూచించారు. కాగా, గతంలో జరిగిన రియల్ దందాలకు సంబంధించి ఫిర్యాదులు వస్తే ఆ లావాదేవీలపైనా విచారించి తప్పు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
అక్కడ తగ్గుముఖం పట్టిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు
న్యూఢిల్లీ: హైదరాబాద్ ప్రాంత పరిధిలో మే నెలలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు 7 శాతం తగ్గాయి. మొత్తం 5,877 ఇళ్ల రిజిస్ట్రేషన్లను నమోదైనట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. హైదరాబాద్తోపాటు, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో రిజిస్ట్రేషన్ల వివరాలు ఈ గణాంకాల్లో కలసి ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నమోదైన రిజిస్ట్రేషన్లతో పోలిస్తే మే నెలలో 31 శాతం పెరిగాయి. కాకపోతే క్రితం ఏడాది మే నెలలో రిజిస్ట్రేషన్ల గణాంకాలతో పోలిస్తే 7 శాతం తగ్గాయి. మే నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లు జరిగిన ఇళ్ల విలువ రూ.2,994 కోట్లుగా ఉంది. మొత్తం రిజిస్ట్రేషన్లలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అత్యధికంగా 45 శాతం నమోదయ్యాయి. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా పరిధిలోని రిజిస్ట్రేషన్ల వాటా 39 శాతంగా ఉంది. ఇక హైదరాబాద్ రిజిస్ట్రేషన్ల వాటా 16 శాతంగా ఉంది. రూ.25–50 లక్షల బడ్జెట్ మే నెలలో హైదరాబాద్ ప్రాంతంలో రిజిస్టర్ అయిన ఇళ్లలో ఎక్కువ శాతం రూ.25–50 లక్షల బడ్జెట్ మధ్య ఉన్నాయి. ఆ తర్వాత రూ.25 లక్షల్లోపు ఇళ్లు 17 శాతంగా ఉన్నాయి. రూ.కోటి రూపాయాలు అంతకుమించి విలువైన ఇళ్ల రిజిస్ట్రేషన్లు 9 శాతంగా ఉన్నాయి. క్రితం ఏడాది మే నెలలో ఈ విభాగం రిజిస్ట్రేషన్లు 6 శాతంతో పోలిస్తే 50 శాతం పెరిగాయి. 1,000–2,000 చదపు అడుగుల ప్రాపర్టీల వాటా 70 శాతంగా ఉంది. (ఇదీ చదవండి: భారతదేశంలో ఫస్ట్ బిలీనియర్ ఇతడే.. సంపద ఎంతో తెలుసా?) సగటు లావాదేవీ విలువ క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 3 శాతం పెరిగింది. ‘‘హైదరాబాద్ నివాసిత మార్కెట్ ఆశావహంగా ఉంది. ఇళ్ల కొనుగోదారుల నుంచి బలమైన డిమాండ్ కనిపిస్తోంది. 1,000–2,000 చదరపు అడుగుల ఇళ్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపును నిలిపివేయడం కూడా సెంటిమెంట్ను బలపరిచింది’’అని నైట్ఫ్రాంక్ ఇండియా సీనియర్ బ్రాంచ్ డైరెక్టర్ శామ్సన్ ఆర్థర్ తెలిపారు. -
2023 మిస్ వరల్డ్ పోటీలు.. పాల్గొనాలనుందా? అయితే ఇలా చేయండి!
Miss World 2023: ప్రతిభావంతులైన ఫ్యాషన్ ప్రియులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే మిస్ వరల్డ్ పోటీలు ఈ సారి ఇండియాలో జరగనున్న సంగతి తెలిసిందే. 27 సంవత్సరాల తరువాత మళ్లీ భారత్ ఈ అందాల పోటీలను నిర్వహిస్తుండడం విశేషం. 71వ మిస్ వరల్డ్ పోటీలు ఈ ఏడాది నవంబర్లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 1996 తరువాత మిస్ వరల్డ్ పోటీలు భారతదేశంలో జరగడం ఇదే మొదటి సారి. ఈ పోటీలను గురించి మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ సీఈవో 'జూలియా మోర్లే' (Julia Morley) వెల్లడించారు. భారతదేశంలో జరగనున్న ఈ పోటీలలో మన దేశం తరపున మిస్ వరల్డ్ 'సినీ శెట్టి' (Sini Shetty) ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇందులో మొత్తం 130 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పోటీలలో భాగంగా పాల్గొనే అందగత్తెల ప్రతిభ, సేవా దృక్పథం, క్రీడలలో వారికున్న ప్రతిభను ఆధారంగా చేసుకుని రౌండ్స్ నిర్వహిస్తారు. అన్ని రౌండ్స్లో ముందున్న వారు మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకుంటారు. భారతదేశం ఇప్పటి వరకు ఆరు సార్లు మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. 1966లో మొదటి సారి ఇండియాకి చెందిన 'రీటా ఫరియా' మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంది. ఆ తరువాత 1994లో ఐశ్వర్యారాయ్ బచ్చన్, 1997లో డయానా హైడెన్, 1999 యుక్తాముఖి, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ విశ్వసుందరి కిరీటాలను సొంతం చేసుకున్నారు. ఇక ఈ సారి జరగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో కిరీటాన్ని దక్కించుకునే విశ్వ సుందరి ఎవరో తెలియాల్సి ఉంది. భారతదేశం ఆథిత్యమివ్వనున్న మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనాలంటే ఏం చేయాలి? నియమాలు ఏంటి? రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత అనే మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం.. నిజానికి మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనాలనుకునే వారు స్థానిక లేదా జాతీయ అందాల పోటీలలో పాల్గొని ఉండాలి. ఈ పోటీకి సన్నద్ధం కావడానికి ఒక కోచ్ని ఎంచుకోవాలి. మిస్ వరల్డ్లో ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారనేది ముందుగానే అప్లై చేసుకోవాలి. ఆ తరువాత ప్రిలిమినరీ ఇంటర్వ్యూలో అర్హత సాధించాలి. (ఇదీ చదవండి: వేల కోట్లు వద్దనుకుని చిన్న అపార్ట్మెంట్లో రతన్ టాటా తమ్ముడు - ఎందుకిలా..) నియమాలు మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనాలనుకునే వారు అవివాహితులై ఉండాలి. వయసు 17 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాంటి వారు ఈ పోటీలకు అప్లై చేసుకోవచ్చు. అయితే దేశాన్ని బట్టి మారే కట్-ఆఫ్ తేదీలను ఖచ్చితంగా ద్రువీకరించాలి. పోటీలు జరిగే నాటికి మీకు నిర్దేశించిన వయసు తప్పకుండా ఉండాలి. జరిగే పోటీలు 'మిస్' అని ఉంటాయి కావున వివాహితులు పోటీ చేయడానికి అనర్హులు. మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనే వ్యక్తికి గతంలో ఎటువంటి నేర చరిత్ర ఉండకూడదు. ఏ దేశం నుంచి పోటీ చేస్తున్నారో ఆ దేశం పౌరసత్వం ఖచ్చితంగా ఉండాలి. 'బ్యూటీ విత్ ఏ పర్సన్' అనే దాన్ని బట్టి బాహ్య సౌందర్యమే కాదు, అంతః సౌందర్యం కూడా చాలా ప్రధానం. కావున ప్రపంచ సుందరి పోటీలో పాల్గొనే మహిళలు ప్రపంచవ్యాప్తంగా వెనుకబడిన వ్యక్తుల కోసం డబ్బు లేదా అవగాహన పెంచడానికి ప్రాజెక్ట్లను నిర్వహించి ఉండాలి. డ్యాన్స్ మీద కూడా మంచి పట్టు ఉండాలి. మోడలింగ్ పోటీలలో పాల్గొనే వారు వస్త్ర ధారణ, ర్యాంప్ వాక్ వంటివి ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి. ఫిజికల్ ఫిట్నెస్ చాలా ముఖ్యమని మర్చిపోకూడదు. అన్ని అంశాలలోనే ఉత్తమ ప్రతిభను కనపరచిన వారిని విజేతగా న్యాయ నిర్ణేతలు ప్రకటిస్తారు. (ఇదీ చదవండి: పిట్ట కొంచెం.. కూత ఘనం అంటే ఇదేనేమో - 19 ఏళ్లకే కోట్లు విలువైన కంపెనీ) రిజిస్ట్రేషన్ ప్రక్రియ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం క్లోజ్ అప్, మిడ్ లెంత్, ఫుల్ లెంత్ & మేకప్ లేకుండా ఉండే నాలుగు పోటోలను సిద్ధంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత రుజువు కోసం పాస్పోర్ట్ ప్రధానం. లేకుంటే ఆధార్ కార్డు, ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటివి ఉండాలి. మీ ఎత్తుకి సంబంధించిన ఖచ్చితమైన కొలతల కోసం VLCC కేంద్రాన్ని సందర్శించాలి. మీ ఇమెయిల్ ID లేదా మొబైల్ నంబర్తో సైన్ ఇన్ చేయాలి సైన్ ఇన్ చేసుకున్న తరువాత 2 వేర్వేరు ఆడిషన్ టాస్క్ వీడియోలను అప్లోడ్ చేయండి (పరిచయానికి సంబంధించిన వీడియో & రాంప్వాక్ వీడియో). వీడియో పరిమితి 60 సెకన్లు వరకు మాత్రమే ఉండాలి. మొదటి మూడు దశలలో మీ ఫోటోలను, కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అప్లై చేసుకోవడానికి రూ. 2999 + ట్యాక్స్ వంటివి చెల్లించాలి. ఆతరువాత మీరు రిజిస్టర్ చేసుకున్న ఈ మెయిల్ అందుకున్న కోడ్ ఎంటర్ చేసుకోవాలి. అన్ని వివరాలను ఫిల్ చేసిన తరువాత T&Cలను అంగీకరించి సబ్మిట్ చేయాలి. ఇవన్నీ పూర్తయిన తరువాత మీకు ఒక ఈ మెయిల్ వస్తుంది. అప్లై చేసుకోవంలో ఎలాంటి సందేహం ఉన్నా ఉదయం 11 నుంచి సాయంత్రం 7 గంటల మధ్య +91 9619937295 / +91 7039464909 నెంబర్కి కాల్ చేయవచ్చు, లేదా missindiaorg@timesgroup.comని సంప్రదించాలి. -
ఇ-స్టాంపింగ్ సేవలను వర్చువల్ గా ప్రారంభించిన సీఎం జగన్
-
రిజిస్ట్రేషన్ సేవలు ఇక సులభతరం
సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్లను సులభతరం చేసే ఇ–స్టాంపింగ్ సేవలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా సురక్షితంగా రూపొందించిన ఇ–స్టాంపింగ్ విధానం వల్ల ప్రజలకు అనేక ప్రయోజనాలు అందనున్నాయి. www. shcilestamp. com వెబ్సైట్, ఇ–స్టాంపింగ్ మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో ఇ–స్టాంపులను పొందవచ్చు. నగదు, చెక్కు, ఆన్లైన్ (నెఫ్ట్, ఆ ర్టీజీఎస్, పీఓఎస్, యూపీఐ) ద్వారా సులభంగా చెల్లింపులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎస్బీఐ, ఆప్కాబ్, యూనియన్ బ్యాంకులకు చెందిన ఎంపిక చేసిన బ్రాంచిలు, సీఎస్సీ కేంద్రాలు, స్టాంప్ అమ్మకందార్లు, స్టాక్ హోల్డింగ్ బ్రాంచ్లు కలిపి మొత్తం 1400 పైగా కేంద్రాల వద్ద ఇ–స్టాంపింగ్ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చారు. మరో వెయ్యికిపైగా కేంద్రాల వద్ద త్వరలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో ఆస్తుల క్రయవిక్రయాలు నిర్వహించే పౌరులందరూ 1400 పైగా ఎంపిక చేసిన కేంద్రాల్లో ఇ–స్టాంపింగ్ ద్వారా స్టాంప్ పేపర్లు కొనుగోలు చేసి సులభంగా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీలను చెల్లించవచ్చు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సెంట్రల్ రికార్డు నిర్వహించే ఏజెన్సీ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సులభంగా సేవలందించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ విధానంలో వినియోగదారులే స్వయంగా తమ డాక్యుమెంట్లను తయారు చేసుకుని ఇ–స్టాంపింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఐటీ సలహాదారు శేషిరెడ్డి, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ రామకృష్ణ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గుంటూరు డీఐజీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మోటారు వాహనాల చట్ట సవరణ అమలులోకి.. పెరగనున్న లైఫ్ టాక్స్
సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి వాహనాల ఎక్స్షోరూమ్ ధరల మీదనే జీవిత పన్ను విధిస్తారు. ఇంతకాలం వాహనం కొనుగోలుపై షోరూమ్ నిర్వాహకులు ఇచ్చే డిస్కౌంట్ పోను, మిగతా మొత్తం మీద మాత్రమే పన్ను విధించేవారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోటారు వాహనాల చట్ట సవరణ ఇప్పుడు అమలులోకి వచ్చింది. చట్ట సవరణ బిల్లుకు గత నెల చివరలో గవర్నర్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చట్టం అమలుకు వీలుగా ప్రభుత్వం గెజిట్ విడదుల చేసి, అమలు ప్రారంభించింది. మార్చికి ముందు కారుకొన్నా.. ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ చేస్తే కొత్త విధానమే.. చట్ట సవరణ నేపథ్యంలో అమలుపై రవాణాశాఖ స్పష్టతనిచ్చింది. కారు ఏప్రిల్కు ముందు కొన్నా, రిజిస్ట్రేషన్ ఇప్పుడు జరిగితే, కొత్త విధానమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ కొత్త విధానం అమలులోకి రావటానికి ముందు గత నెలలో కార్లు కొన్నవాళ్లు చాలామంది ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే కారు కొన్నందున తమకు కొత్త విధానం వర్తించదన్న ధీమాతో ఉన్నారు. కానీ, కారు ఎప్పుడు కొన్నా.. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కొత్త విధానమే వర్తిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. పెరగనున్న పన్ను.. ధర ఎక్కువ కార్లపైనే ఈ కొత్త విధానం ప్రభావం ఉండనుంది. కారు కొన్నప్పుడు ఎక్స్షోరూం ధరపైన షోరూం నిర్వాహకులు డిస్కౌంట్ ఇవ్వటం సహజమే. ధర ఎక్కువగా ఉండే కార్లపై ఈ మొత్తం ఎక్కువగా ఉంటుంది. ఈ డిస్కౌంట్ను సాకుగా చూపి చాలామంది కొంతమేర పన్ను ఎగవేస్తున్నారు. ఇప్పుడు దానికి అవకాశం లేదు. రూ.5 లక్షల ధర ఉన్న కార్లపై 13 శాతం, రూ.5 లక్షలు దాటి రూ.10 లక్షల లోపు ఉండే కార్లపై 14 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉండే కార్లపై 17 శాతం, రూ.20 లక్షలకంటే ఎక్కువ ధర ఉండే కార్లపై 18 శాతం చొప్పున జీవిత పన్నును సవరిస్తూ గతేడాది రవాణాశాఖ ఉత్తర్వు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజా సవరణ ప్రకారం.. డిస్కౌంట్ మొత్తం మినహాయించక ముందు ఉండే ఎక్స్షోరూం ధరలపై పైన పేర్కొన్న నిర్ధారిత శాతంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తుల పేరు మీద కాకుండా సంస్థలు, కంపెనీల పేరుతో ఉండే కార్లపై అదనంగా రెండు శాతం, రెండో కారు తీసుకునేవారు అదనంగా 2 శాతం చెల్లించాల్సి ఉంటుంది. -
హైదరాబాద్లో ఏ మూలైతే ఏంటి? ఎక్కడా తగ్గేదెలే!
సాక్షి, హైదరాబాద్: గృహ కొనుగోలు నిర్ణయంలో ధర, ప్రాంతం, వసతులతో పాటు వాస్తు కూడా ప్రధానమైనదే. భారతీయ గృహ కొనుగోలుదారులైతే వాస్తు తర్వాతే మిగతా అంశాలను ఎంపిక చేస్తుంటారు. అయితే హైదరాబాద్లోని సెంట్రల్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ జోన్లలో ఏ దిక్కున ఎంత అభివృద్ధి చెందుతుంది? ఏడాది కాలంలో నగరంలో గృహ కొనుగోళ్ల విలువ, ధరల వృద్ధి తదితర అంశాలపై నైట్ఫ్రాంక్ ఇండియా నివేదికను వెలువరించింది. గత నెలలో హైదరాబాద్లో రూ. 3,352 కోట్ల విలువ చేసే ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్ జరిగాయి. అంతకుముందు నెలతో పోలిస్తే మార్చిలో నగరంలో 12 శాతం వృద్ధి రేటుతో 6,414 అపార్ట్మెంట్లు రిజిస్టేషన్స్ అయ్యాయి. ఇందులో 53 శాతం ప్రాపర్టీలు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ధర ఉన్న గృహాలే రిజిస్టేషన్స్ కాగా.. 70 శాతం 1,000 నుంచి 2,000 చ.అ. ప్రాపర్టీలే ఉండటం గమనార్హం. పశ్చిమం.. సరఫరా అయిన గృహాల విలువ: 85 వేల కోట్లు ఏడాది సగటున విక్రయమయ్యే ఇళ్ల విలువ: 7,700 కోట్లు ప్రాపర్టీ ధరల వృద్ధి: 19 % టాప్–5 మైక్రో మార్కెట్లు: తెల్లాపూర్, కొండాపూర్, మణికొండ, గచ్చిబౌలి, నార్సింగి ఉత్తరం.. సరఫరా అయిన గృహాల విలువ: 26 వేల కోట్లు ఏడాది సగటున విక్రయమయ్యే ఇళ్ల విలువ: 1,900 కోట్లు ప్రాపర్టీ ధరల వృద్ధి: 22 శాతం టాప్ - 5 మైక్రో మార్కెట్లు: కొంపల్లి, సైనిక్పురి, పోచారం, బాచుపల్లి, మియాపూర్ (ఇదీ చదవండి: షాకింగ్ రిపోర్ట్..! మొబైల్ ఛార్జ్ తక్కువున్నప్పుడు ఉబర్ ఛార్జ్ ఎక్కువవుతుందా?) దక్షిణం.. సరఫరా అయిన గృహాల విలువ: 3,400 కోట్లు ఏడాది సగటున విక్రయమయ్యే ఇళ్ల విలువ: 310 కోట్లు ప్రాపర్టీ ధరల వృద్ధి: 20 శాతం టాప్ - 5 మైక్రో మార్కెట్లు: రాజేంద్రనగర్, మహేశ్వరం, శంషాబాద్, ఆదిభట్ల, షాద్నగర్ తూర్పు.. సరఫరా అయిన గృహాల విలువ: 3,200 కోట్లు ఏడాది సగటున విక్రయమయ్యే ఇళ్ల విలువ: 230 కోట్లు ప్రాపర్టీ ధరల వృద్ధి: 20 శాతం టాప్ - 5 మైక్రో మార్కెట్లు: ఉప్పల్, ఘట్కేసర్, హబ్సిగూడ, నాగోల్, ఎల్బీనగర్ (ఇదీ చదవండి: భారత్లో లభించే టాప్ 5 బెస్ట్ సీఎన్జీ కార్లు - ధర తక్కువ & ఎక్కువ మైలేజ్!) సెంట్రల్.. సరఫరా అయిన గృహాల విలువ: 2,200 కోట్లు ఏడాది సగటున విక్రయమయ్యే ఇళ్ల విలువ: 180 కోట్లు ప్రాపర్టీ ధరల వృద్ధి: 20% టాప్ 5 మైక్రో మార్కెట్లు: అమీర్పేట, ఖైరతాబాద్, సోమాజిగూడ, హిమాయత్నగర్, మెహిదీపట్నం -
జూలై ఒకటి నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూ: హిమాలయాల్లో కొలువైన అమర్నాథ్ ఆలయ వార్షిక యాత్ర జూలై ఒకటో తేదీ నుంచి మొదలుకానుంది. ఆగస్ట్ 31 దాకా కొనసాగనుంది. ఈ నెల 17వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన ఆలయ బోర్డు భేటీలో ఈ మేరకు నిర్ణయించినట్టు అధికారులు చెప్పారు. యాత్రకు వివరాల కోసం గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. -
26న పనిచేయనున్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు
సాక్షి, అమరావతి: ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఈ నెల 26వ తేదీన ఆదివారం కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ రామకృష్ణ తెలిపారు. ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయించుకునే వారి సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల ఛార్జీలు, ఇతర చలానాలను ఆ రోజు రాష్ట్రంలోని 51 ఎస్బీఐ బ్రాంచిల్లో కట్టవచ్చని తెలిపారు. -
సహజీవనానికి రిజిస్ట్రేషనా?.. సుప్రీం ఘాటు స్పందన
న్యూఢిల్లీ: దేశంలో సహజీవనం చేసే జంట.. తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకుని గుర్తింపు పొందాలని, ఈ మేరకు నిబంధనల రూపకల్పన జరగాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టేసింది. దీన్నొక మూర్ఖపు ఆలోచనగా అభివర్ణిస్తూ పిటిషన్ కొట్టేశారు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్. దేశంలో సహజీవనానికి గుర్తింపు ఉండాలని, ఈ మేరకు రిలేషన్షిప్లో ఉండే ప్రతీజంట రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని, అలాగే.. ఆ జంటలకు సామాజిక భద్రత కల్పించాలంటూ ఓ న్యాయవాది ప్రజాప్రయోజన వ్యాజ్యం(PIL) దాఖలు చేశారు. ఆ ఆలోచన ద్వారా సహజీవనంలో జరుగుతున్న నేరాల సంఖ్య తగ్గుతుందని అభిప్రాయపడ్డారు ఆ న్యాయవాది. అయితే.. ఈ పిటిషన్పై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఘాటుగా స్పందించారు. ఎలాంటి విషయంతోనైనా ఇక్కడికి వస్తున్నారు. ఇలాంటి వాటిల్లో ఇకపై జరిమానాలు విధించడం మొదలుపెడతాం. ఏంటిది?.. రిజిస్ట్రేషనా? ఎవరితో? కేంద్ర ప్రభుత్వంతోనా? సహజీనవంలో ఉన్న జంటలతో కేంద్రం ప్రభుత్వానికి ఏం పని? ఏం సంబంధం అసలు? అంటూ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఏ ఉద్దేశంతో పిటిషన్ వేశారని న్యాయవాదిని సీజేఐ ప్రశ్నించగా.. సోషల్ సెక్యూరిటీ అనే సమాధానం ఇచ్చారాయన. ఒకానొక తరుణంలో న్యాయవాదిపై ఆగ్రహం వెల్లగక్కిన సీజేఐ.. పిటిషన్ను డిస్మిస్ చేశారు. ఢిల్లీలో శ్రద్ధా వాకర్ ఘటన.. ఆపై వరుసగా మరో నాలుగైదు సహజీవన జంటల తాలుకా నేరాలు వెలుగులోకి రావడంతో కేంద్రం తరపు నుంచి లివింగ్ రిలేషన్షిప్లపై రిజిస్ట్రేషన్, గైడ్లైన్స్ల కోసం తాను సుప్రీంను ఆశ్రయించినట్లు చెప్పారా న్యాయవాది. ఇదీ చదవండి: ఓటీటీ కంటెంట్పై కేంద్రం సీరియస్! -
ప్రతి సచివాలయం రిజిస్ట్రేషన్ కార్యాలయంగా మారబోతోంది : ధర్మాన
-
పదేళ్ళకు ఎంఎస్వోల రిజిస్ట్రేషన్ రెన్యువల్
న్యూఢిల్లీ: శాటిలైట్ టీవీ ఎంఎస్వోల (మల్టీ–సిస్టం ఆపరేటర్లు) రిజిస్ట్రేషన్ను 10 ఏళ్ల వ్యవధికి రెన్యువల్ చేయాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కేంద్రానికి సూచించింది. ఇందుకోసం ప్రాసెస్ ఫీజును రూ. 1 లక్షగా నిర్ణయించాలని సిఫార్సు చేసింది. కేబుల్ టీవీ నెట్వర్క్స్ నిబంధనల్లో ఎంఎస్వోల రిజిస్ట్రేషన్ల రెన్యువల్ నిబంధనలు లేకపోవడంతో తగు సూచనలు చేయాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ కోరిన మీదట ట్రాయ్ ఈ మేరకు సిఫార్సులు చేసింది. రెన్యువల్కి దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరిగేలా చూడాలని, బ్రాడ్కాస్ట్ సేవా పోర్టల్ ద్వారా పత్రాలన్నీ డిజిటల్ విధానంలో అప్లోడ్ చేసే వెసులుబాటు కల్పించాలని పేర్కొంది. అలాగే రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ కోసం పెండింగ్లో ఉన్న ఎంఎస్వోల జాబితాను, నిర్దిష్ట గడువులోగా దరఖాస్తు చేసుకోని వాటి లిస్టును పోర్టల్లో పొందుపర్చాలని సూచించింది. ఒకవేళ దరఖాస్తు పరిశీలనలో ఉన్నా, నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో ఉంచినా తుది నిర్ణయం తీసుకునే వరకూ సదరు ఎంఎస్వోలకు పొడిగింపునివ్వాలని పే ర్కొంది. గడువు తేదీ ముగియడానికి ఏడు నుంచి రెండు నెలల ముందు వరకూ రెన్యువల్ కోసం దరఖాస్తులను స్వీకరించవచ్చని ట్రాయ్ సూచించింది. రెండు నెలల కన్నా తక్కువ సమయంలో దరఖాస్తు చేసుకుంటే జాప్యానికి చూపిన కారణాలను పరిశీలించి శాఖ తగు నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. -
పవన్ కల్యాణ్ కొత్త వాహనాల రిజిస్ట్రేషన్.. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్..
సాక్షి, హైదరాబాద్: సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. కొత్తగా కొనుగోలు చేసిన ఆరు వాహనాలను ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాటిలో ఒకటి బెంజ్, మరో రెండు స్కార్పియో కార్లు ఉ న్నాయి. టయోటా వైల్ఫైర్ వాహనంతో పాటు ఒక జీప్ ర్యాంగ్లర్, ఒక టాటా యోధ ట్రాన్స్పోర్టు వాహనం పవన్కల్యాణ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలాగే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ తీసుకున్నారు. ఉపరవాణా కమిషనర్ పాపారావు, ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా అధికారి రాంచందర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: (కైకాల సత్యనారాయణ మృతి.. తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం) -
ఆహార కల్తీకి చెక్! అధికారుల కొత్త రూల్స్.. లైసెన్స్ తీసుకుంటేనే సరి.. లేదంటే?
ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి జిల్లాలో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఆహార పదార్థాల తయా రీ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వందల సంఖ్యలో చిన్నచిన్న బండ్లపై, రోడ్డు పక్కన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అధికంగా ఏర్పాటవుతున్నాయి. పెద్దపెద్ద హోటళ్ల నుంచి చిన్నచిన్న టిఫిన్ సెంటర్లు నిర్వహిస్తున్న వ్యాపారులు కనీస నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఆహార పదార్థాల విక్రయాల్లో కనీస నాణ్యత పాటించడం లేదని ప్రజలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఆహార పదార్థాలు కల్తీకి గురవుతున్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ ఆహార కల్తీని కట్టడి చేయడంతో పాటు ప్రజలకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులు, భోజనం అందించేలా వ్యాపారులు నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో లైసెన్స్లు, రిజిస్ట్రేషన్ లేని టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలు, హోటళ్లపై అధికారులు దృష్టి సారించారు. వాటిని నిర్వహించే వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండడంతో పాటు చిరు వ్యాపారులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అందులో భాగంగా ప్రతి శనివారం లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించేందుకు నిర్ణయించారు. లైసెన్స్, రిజిస్ట్రేషన్లు లేనివే ఎక్కువ.. ఉమ్మడి జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం హోటళ్లు, బేకరీలు, టిఫిన్ సెంటర్లు, ఆహార పదార్థాల తయారీ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, దాల్ మిల్లులు తదితర ఆహార ఉత్పత్తుల కేంద్రాలు 5 వేలకు పైగానే ఉన్నాయి. వాటిలో లైసెన్స్, రిజిస్ట్రేషన్ కలిగిన హోటళ్లు, రెస్టారెంట్లు 886 వరకు ఉండగా, చిన్నచిన్న టిఫిన్ సెంటర్లు, ఇతర ఫుడ్ కోర్టులు ఖమ్మం జిల్లాలో 1400, కొత్తగూడెంలో 700 ఉన్నాయి. మిగిలిన వాటికి లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు లేకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. రోజుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వ్యాపారం చేసే టిఫిన్ సెంటర్లు, బేకరీలు, ఇతర ఫుడ్ కోర్టులు తప్పనిసరిగా తమ వ్యాపారాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. ఆపైన వ్యాపారం చేసే వారు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం లైసెన్స్ పొంది ఉండాలి. రిజిస్ట్రేషన్, లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహించే వారిపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. రిజిస్ట్రేషన్, లైసెన్స్ ఉండి నిబంధనలు పాటించకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులకు వీలుంటుంది. సిబ్బంది కొరత.. ఉమ్మడి జిల్లాలో వేల సంఖ్యలో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, ఆహార పదార్థాల తయారీ సెంటర్లు ఉన్నప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో తనిఖీ చేసేందుకు అధికారులు, సిబ్బంది సరిపడా లేరు. ఉమ్మడి జిల్లాలో ఖమ్మంలో ఒక గెజిటెడ్ అధికారితో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో మరో అధికారి మాత్రమే ఉన్నారు. దీంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. ఆహార పదార్థాలు కల్తీ జరిగినా గుర్తించేందుకు సిబ్బంది లేక తనిఖీలు చేయలేకపోతున్నారు. రోజుకు ఒకటి రెండు హోటళ్లను కూడా అధికారులు తనిఖీ చేయలేని పరిస్థితి ఉంది. ప్రతి శనివారం మేళా.. లైసెన్స్లు, రిజిస్ట్రేషన్ లేకుండా భోజన వ్యాపారం నిర్వహిస్తున్న వారికి చెక్ పెట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి శనివారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో మేళా ద్వారా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, ఖరఖానాలు, దాల్ మిల్లులు, పిండి మిల్లులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఫుడ్ కోర్టులకు లైసెన్స్లు ఇవ్వడంతో పాటు రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించారు. వ్యాపారులకు అవగాహన కల్పించడంతో పాటు నాణ్యత పాటించకపోతే చట్టపరంగా తీసుకునే చర్యలను ఈ మేళా ద్వారా వివరిస్తున్నారు. ఈ నెల 1వ తేదీన నిర్వహించిన తొలి మేళాలో 11 లైసెన్స్లు జారీ చేయగా, 20 మంది వ్యాపారులు తమ వ్యాపారాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. లైసెన్స్లు తప్పనిసరి.. ఉమ్మడి జిల్లాలో ఉన్న హోటళ్లు, దాల్ మిల్లులు, బేకరీలు, ఆహార పదార్థాల తయారీ కేంద్రాలు లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేయవద్దు. చిన్నచిన్న టిఫిన్ సెంటర్లు, ఫుడ్ కోర్టులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు తమ వ్యాపారాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్, లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేస్తే చర్యలు తీసుకుంటాం. నాణ్యత లేకుండా, కల్తీ వ్యాపారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రతి శనివారం రిజిస్ట్రేషన్, లైసెన్స్ మేళా కేఎంసీలో ఉంటుంది. – కిరణ్కుమార్, జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, ఖమ్మం -
గుడ్ న్యూస్: కాకినాడ సెజ్ భూములు.. రైతులకు రీ రిజిస్ట్రేషన్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: గత పాలకులు స్వలాభంతో అవసరానికి మించి కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (కేఎస్ఈజెడ్) కోసం బలవంతంగా సేకరించిన భూములను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి రైతులకు ఇచ్చేస్తోంది. ఇలా సెజ్ కోసం సేకరించిన భూములను రైతులకు తిరిగి ఇవ్వడమనేది దేశంలోనే ఇది మొదటిసారి. కేఎస్ఈజెడ్ అవసరం మేరకు ఉంచి, బలవంతంగా సేకరించిన భూములను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వమే భూ యజమానుల పేరుతో తిరిగి రిజిస్ట్రేషన్ చేస్తోంది. నిజానికి.. నాడు భూసేకరణ వద్దని ఎదురుతిరిగిన రైతులను చంద్రబాబు సర్కారు వారిని గృహ నిర్బంధంలో పెట్టి భూములను బలవంతంగా లాగేసుకుంది. ఆ సమయంలో నాటి విపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కేఎస్ఈజెడ్ బాధితుల గ్రామాల్లో పర్యటించారు. బలవంతంగా సేకరించిన భూములను అధికారంలోకి రాగానే తిరిగి ఇచ్చేస్తామని మాట ఇచ్చారు. ఆయన సీఎం అయ్యాక ఆ మాటను నిలబెట్టుకుంటున్నారు. రైతుల పేరుతో తిరిగి రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియకు ప్రభుత్వం ఇటీవలే శ్రీకారం చుట్టింది. దీనిపై బాధిత రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ప్లేటు ఫిరాయించిన ‘బాబు’ కాకినాడ తీరంలో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటుచేసేందుకు అవసరమైన భూముల సేకరణకు చంద్రబాబు సర్కార్ 2002లో నోటిఫికేషన్ ఇచ్చింది. 2006 నుంచి 2011 మధ్య భూ సేకరణ జరిగింది. ప్రభుత్వం 3,400.13 ఎకరాలు కొనుగోలు చేసి, కేఎస్ఈజెడ్కు ఇవ్వగా, 4,558.39 ఎకరాలను సెజ్ యాజమాన్యం కొనుగోలు చేసింది. ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమిలో 2,180 ఎకరాలకు చెందిన 1,307 మంది రైతులు అవార్డు తీసుకోలేదు.. భూములూ ఇవ్వలేదు. రైతులకు ఇబ్బంది కలగకూడదన్న వైఎస్సార్ 2004లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యారు. ఆయన రైతులకు ఇబ్బందిలేని రీతిలో భూ సేకరణ జరగాలని ఆదేశించారు. కానీ, అధికారంలో ఉన్నప్పుడు రైతుల నోట మట్టికొట్టిన చంద్రబాబు.. అధికారం కోల్పోయేసరికి ప్లేటు ఫిరాయించారు. అక్రమంగా భూములు దోచుకుంటున్నారని, సెజ్ను రద్దుచేసే వరకూ నిద్రపోనని, అధికారంలోకి వచ్చాక సెజ్ భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. భూములను వైఎస్ కుటుంబమే కొనుగోలు చేసిందనే దుష్ప్రచారం చేశారు. 2014లో చంద్రబాబు తిరిగి అధికారంలోకి రాగానే మళ్లీ మాట మార్చారు. తన బినామీలకు లబ్ధిచేకూర్చేందుకు అక్రమ కేసులు, గృహ నిర్బంధాలతో రైతుల నుంచి భూములను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక.. సెజ్ బాధిత గ్రామాలపై పోలీసులు ఉక్కుపాదం మోపి, అనేకమందిపై అక్రమ కేసులు పెట్టారు. ఆ సమయంలో ప్రజాసంకల్ప యాత్ర కోసం వైఎస్ జగన్ కేఎస్ఈజెడ్ గ్రామమైన పెరుమాళ్లపురంలో పర్యటించారు. ‘సెజ్ భూములు నావేనని చంద్రబాబు అంటున్నారు. అదే నిజమైతే భూములన్నీ మీరే తిరిగి తీసేసుకోవచ్చు’ అని జగన్ ప్రకటించారు. అవసరానికి మించి చంద్రబాబు బలవంతంగా సేకరించిన భూములను ఆయా రైతులకు తిరిగి ఇచ్చేస్తామని కూడా హామీ ఇచ్చారు. నాడు ఇచ్చిన మాటను అమలుచేసేందుకు సీఎం జగన్ ఇప్పుడు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా.. కొత్తపల్లి, తొండంగి మండలాల్లో 148 ఎకరాలను 478 మంది రైతుల పేరుతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేశారు. ఈ రెండు మండలాల్లో 597 ఎకరాలను భూమికి భూమి పద్ధతిలో కొనుగోలు చేసి రైతులకు ఇచ్చారు. ఇది కూడా చదవండి: ఎంఎల్హెచ్పీలకు జోన్–2లోనే ఎక్కువ ఖాళీలు -
గుడ్న్యూస్! రైతు బీమా నమోదు గడువు 13 వరకు పెంపు
సాక్షి, హైదరాబాద్: రైతు బీమా నమోదు గడువును ఈ నెల 13 వరకు పొడిగిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి గత నెల 15 నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకే రైతు బీమా రెన్యువల్, కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి గడువు విధించింది. గత నెల 15న మార్గదర్శకాలు జారీ చేసినా సైట్ తెరుచుకోడానికే మూడు రోజులు పట్టింది. పాత రెన్యువల్స్ 38.98 లక్షల ఎల్ఐసీ ఐడీలున్న రైతుల వెరిఫికేషన్తోపాటు, కొత్తగా అప్లోడ్ చేయాల్సిన 11.83 లక్షల మంది రైతుల వివరాలు ఇచ్చినా గడువులో పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది. గడువు కేవలం 15 రోజులే ఇవ్వడం, గత నెలలో వర్షాల నేపథ్యంలో అర్హులైన 50.82 లక్షల మంది రైతు బీమా నమోదు పూర్తి స్థాయిలో కాలేదు. తాజా గడువు తేదీ ఈనెల 13 సాయంత్రం 6 గంటల వరకు ఏఈవోలు రైతు బీమా నమోదు చేయడానికి అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు నమోదు చేసుకోని రైతులు స్థానిక ఏఈవోలను సంప్రదించాలని వ్యవసాయశాఖ సూచించింది. (చదవండి: డిప్యుటేషన్ ఇష్టారాజ్యం.. ఇదేమని ప్రశ్నిస్తే ఆకాశ రామన్నల ఫిర్యాదులు తెరపైకి!) -
విలువైన భూమిపై ‘సూరి’ కన్ను
సాక్షి, పుట్టపర్తి: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత వరదాపురం సూరి అలియాస్ గోనుగుంట్ల సూర్యనారాయణ అనంతపురం నగరంలో రూ. 129 కోట్ల విలువైన 6.35 ఎకరాల స్థలంపై కన్నేశారు. నవోదయ కాలనీ 80 అడుగుల రోడ్డు పక్కనే ఈ స్థలం ఉంది. ఇక్కడ సెంటు రూ.20 లక్షలకు పైనే. అత్యంత విలువైన ఈ స్థలాన్ని నకిలీ పత్రాలతో భూమి తనదని చెప్పుకుంటున్న వ్యక్తి నుంచి తన కుమారుడు, అనుచరుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. సూరి అనుచరులు భూమి అసలు హక్కుదారులను ఖాళీ చేయాలంటూ బెదిరించారు. కబ్జాకు యత్నించారు. హక్కుదారుల ఫిర్యాదు మేరకు సబ్రిజిస్ట్రార్ను అధికారులు సస్పెండ్ చేశారు. సూరి కుమారుడు నితిన్సాయి, అనుచరుడు రాజుపై క్రిమినల్ చర్యలకు ఆదేశించారు. మోసం చేశారిలా.. రాళ్లపల్లి నారాయణప్ప 1929లో గుండూరావు నుంచి 301 సర్వే నంబర్లో 7.77 ఎకరాలు కొని, పెద్ద మనవడు పెద్ద ఉలిగప్పకు 1933లో హక్కు ఇచ్చారు. 1935లో బ్యాంకులో తనఖా పెట్టి రుణం తీసుకున్నారు. అయితే.. దొడ్డమనేని మాలతేష్ అనే వ్యక్తి గుండూరావు తన చిన్నాన్న అంటూ 1985 నవంబర్ 19 తేదీతో అన్రిజిస్టర్డ్ వీలునామా సృష్టించారు. 1929 నాటికే గుండూరావు పింఛన్ తీసుకుంటున్నారు. అంటే అప్పటికే 60 ఏళ్లు పూర్తయి ఉంటాయి. దీన్నిబట్టి 1985 నాటికి గుండూరావు వయస్సు 116 సంవత్సరాలు. ఇంత వయస్సు ఉన్న వ్యక్తితో అన్ రిజిస్టర్డ్ వీలునామా ఎలా రాయిస్తారన్నది ప్రశ్నార్థకం. 2018లో 301–3 సర్వే నంబర్తో 4.46 ఎకరాలు మాలతేష్ పేరిట వెబ్ల్యాండ్లో నమోదు చేశారు. దీనిపై రాళ్లపల్లి వంశస్తులు ఆర్డీవో కోర్టుకు వెళ్లారు. మాలతేష్ సమర్పించిన వీలునామా ఫోర్జరీ అని ఆర్డీవో ధ్రువీకరించారు. వెబ్ల్యాండ్ నుంచి మాలతేష్ పేరు తొలగించారు. రాళ్లపల్లి వంశస్తుల పేర్లు నమోదు చేశారు. 1933లో రాళ్లపల్లి వంశస్తులు ఆస్తి పన్ను చెల్లించిన పత్రాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ మాలతేష్ సర్వే నంబర్ 301ను 301–3గా చూపించి నితిన్ సాయి ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ, వరదాపురం సూరి కుమారుడు గోనుగుంట్ల నితిన్సాయి పేరు మీద 4.30 ఎకరాలు, సూరి అనుచరుడు, ధర్మవరానికి చెందిన యంగలశెట్టి రాజు పేరిట 2.05 ఎకరాల స్థలాన్ని 2021 డిసెంబర్ 23న రిజిస్ట్రేష¯Œ చేశారు. నితిన్సాయి రూ.6 కోట్లు, రాజు రూ.1.50 కోట్లకు కొన్నట్లు చూపారు. వాస్తవానికి రాళ్లపల్లి వంశస్తుల వద్ద ప్రస్తుతం 3.57 ఎకరాలే ఉంది. వారి భూమిలో కొంత గతంలోనే వేరే వారికి అమ్మారు. 1982లో కొంత లేఅవుట్ వేశారు. మునిసిపాలిటీకి ఆస్తిపన్ను కూడా చెల్లిస్తున్నారు. దీనిని ప్లాట్ల వారీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కానీ సూరి కుమారుడు, అనుచరుడి పేరిట 6.35 ఎకరాలు మాలతేష్ రిజిస్ట్రేషన్ చేశారు. ఇందులో మునిసిపల్ కార్పొరేషన్ 80 అడుగుల రోడ్డుకు సేకరించిన 0.66 ఎకరాల స్థలం, వార్డు సచివాలయమూ ఉన్నాయి. వెబ్ల్యాండ్లో మాలతేష్ పేరుపై భూమి లేకపోయినా, అన్ రిజిస్టర్డ్ వీలునామాకు ఎలాంటి విశ్వసనీయత లేనప్పటికీ, సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేశారు. సబ్ రిజిస్ట్రార్, వరదాపురం సూరిది ఒకే ఊరని, అందువల్లే అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందనే విమర్శలున్నాయి. అనంతరం సూరి అనుచరులు ఆ భూమి తమకు అప్పగించాలని రాళ్లపల్లి వంశస్తులను బెదిరించారు. ఈ వ్యవహారంపై రాళ్లపల్లి వంశస్తులు ఫిర్యాదు చేయడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ మాధవి ఆదివారం అనంతపురం సబ్ రిజిస్ట్రార్ హరికృష్ణను సస్పెండ్ చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వరదాపురం సూరి కుమారుడు నితిన్ సాయి, రాజు మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ అంశంపై డీఆర్వో నేతృత్వంలో విచారణకు కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. డిప్యూటీ కలెక్టర్, అనంతపురం కార్పొరేషన్ కమిషనర్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. చర్యలు తీసుకుంటాం – గాయత్రీదేవి డీఆర్వో, అనంతపురం ఈ అక్రమ రిజిస్ట్రేషన్పై విచారణ జరుగుతోంది. కమిటీ సభ్యుల్లో ఒకరు నివేదిక ఇచ్చారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో వెబ్ల్యాండ్లోకి ఎక్కించారని, వెంటనే తొలగించామని ఆర్డీవో చెప్పిన విషయాలను నివేదికలో పొందుపరిచారు. మరొక అధికారి నివేదిక ఇచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటాం. -
సెలవు దినాలైనా నేడు, రేపు పనిచేయనున్న 52 ఎస్బీఐ బ్రాంచ్లు
సాక్షి, అమరావతి: ఈ నెల 26, 27 తేదీలు (నేడు, రేపు) సెలవు దినాలైనప్పటికీ రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి.రామకృష్ణ తెలిపారు. ఈ రెండు రోజులు రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంపు ఫీజుల చలానాలు కట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 52 ఎస్బీఐ బ్రాంచ్లు ప్రత్యేకంగా పని చేయనున్నట్లు పేర్కొన్నారు. చదవండి: 29న కొత్త జిల్లాలకు తుది రూపు? ఆర్థిక సంవత్సరం చివరి రోజులు కావడంతో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ఏర్పాటు చేసింది. ఎస్బీఐ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి సెలవు రోజుల్లో రిజిస్ట్రేషన్ ఫీజుల చలానాలు కట్టించుకునేలా ఒప్పించారు. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కమిషనర్ రామకృష్ణ కోరారు. -
‘రియల్’ మోసాలకిక కళ్లెం
సొంతిల్లు కట్టుకోవడానికి తొలుత కాసింత స్థలం సమకూర్చుకోవాలన్నది సగటు మధ్యతరగతి కుటుంబం కల. ఈ కలను ఆసరాగా తీసుకుని కొందరు అక్రమార్కులు అక్రమ లే అవుట్లతో అందినకాడికి దోచుకుని, అమాయక ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. ఇలాంటి పరిస్థితి నగరాలు, పట్టణాలను ఆనుకుని ఉన్న గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. సరైన అనుమతులు లేని ప్లాట్లు కొనుగోలు చేసిన వారు అందులో ఇల్లు కట్టుకోలేక, ఆ స్థలాన్ని తిరిగి అమ్ముకోలేక పడరాని పాట్లు పడుతున్నారు. ఈ కష్టాలకు చెక్ పెట్టాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లోనూ కొన్నేళ్లుగా సాగుతున్న రియల్ ఎస్టేట్ మోసాలను కట్టడి చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఏ సౌకర్యం లేని చోట ప్లాట్ కొని ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అక్రమ లే అవుట్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా కట్టడికి ఉపక్రమించింది. కనీసం రోడ్డు, కరెంటు లైన్, మంచి నీటి వసతి కూడా లేని అక్రమ లే అవుట్లలో ఇంటి స్థలం కొని సామాన్య ప్రజలు మోసపోకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అక్రమ లే అవుట్లలో రిజిస్ట్రేషన్లపై ఆంక్షలు విధిస్తూ తాజాగా ఆదేశాలుగా జారీ చేసింది. మరోవైపు ఒక వేళ ఇప్పటికే ఆ అక్రమ లే అవుట్లలో ఇంటి స్థలం కొన్న వారు సైతం నష్టపోకుండా.. ఈ అంశంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై కసరత్తు చేస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అక్రమ లే అవుట్లను నియంత్రించడంతో పాటు వాటిలో ఇళ్ల ప్లాట్లను కొనుగోలు చేసే వారు మోసపోకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో తగిన సూచనలు చేయాలంటూ ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలోని మంత్రుల కమిటీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పుట్టగొడుగుల్లా అక్రమ లేఅవుట్లు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో ఎలాంటి అనుమతులు లేకుండానే వ్యవసాయ భూముల్లో ఇళ్ల ప్లాట్ల లే అవుట్లు వేయడం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. గత పదేళ్ల కాలంలో.. రాష్ట్ర వ్యాప్తంగా 431 మండలాల పరిధిలోని 3,716 గ్రామ పంచాయతీల పరిధిలో దాదాపు 78,303 ఎకరాల వ్యవసాయ భూముల్లో ఇళ్ల నిర్మాణం కోసం 15,783 లే అవుట్లు కొత్తగా వెలిశాయి. అందులో 37,684 ఎకరాల్లో వేసిన 10,169 లే అవుట్లు అక్రమంగా వేసినవని పంచాయతీరాజ్ శాఖ ఇటీవల నిర్ధారించింది. ఇలాంటి అక్రమ లే అవుట్లలో 2,54,854 ఇళ్ల ప్లాట్లు ఉన్నాయి. 2015 నాటికే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 6,049 అక్రమ లే అవుట్లు ఉన్నాయని అప్పటి అధికారులు గుర్తించి, వాటిపై చర్యలు తీసుకోకుంటే ఆ ప్లాట్లు కొనుగోలు చేసిన వారు నష్టపోయే ప్రమాదం ఉందని నివేదికలు ఇచ్చినప్పటికీ ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఆ తర్వాత కూడా గ్రామాల్లో అక్రమ లే అవుట్ల దందా యధావిధిగా కొనుసాగింది. పర్యవసానంగా 2019 నాటికి అక్రమ లే అవుట్ల సంఖ్య 9,422కు పెరిగింది. 90 శాతం వాటిలో కరెంటు లైను కరువు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 10,169 అక్రమ లే అవుట్లలో కేవలం 4,179 లే అవుట్లకు మాత్రమే రోడ్డు వసతి ఉంది. కేవలం 362 లేఅవుట్లకు మాత్రం మంచి నీటి సరఫరా సౌకర్యం అందుబాటులో ఉంది. 814 లే అవుట్లకు కరెంటు లైను వసతి ఉన్నట్టు అధికారులు తేల్చారు. అంటే 9,355 అక్రమ లే అవుట్లకు కరెంటు లైను కూడా లేదు. నిబంధనల ప్రకారం.. అనుమతులు పొందిన లే అవుట్లకు మాత్రమే కొత్తగా రోడ్డు వసతితోపాటు కరెంటు లైను, మంచి నీటి పైపులైను ఏర్పాటుకు ప్రభుత్వం, అర్బన్ డెవలప్మెంట్ అధారిటీలు, గ్రామ పంచాయతీలు ముందుకొస్తాయి. అనుమతులు పొందని వాటికి ఆ వసతుల కల్పనకు ఆటంకాలు ఉంటాయి. ఇళ్ల కోసం కొత్తగా ఎలాంటి లే అవుటు ఏర్పాటు చేయాలన్నా, ముందుగా సంబంధిత గ్రామ పంచాయతీ అనుమతి పొందడంతో పాటు లే అవుటు ప్లానింగ్కు సంబంధించి డీటీసీపీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. వ్యవసాయ భూమిలో లే అవుటు ఏర్పాటు చేస్తుంటే దానికీ వేరుగా అనుమతులు తీసుకోవాలి. ఈ సమయంలో లే అవుట్ల విస్తీర్ణం ప్రకారం నిబంధనల మేరకు వెడల్పైన అంతర్గత రోడ్లు ఏర్పాటు చేయాలి. మొత్తం లే అవుట్ల విస్తీర్ణంలో పది శాతం భూమిని సంబంధిత గ్రామ పంచాయతీకి బదలాయించాల్సి ఉంటుంది. ఆ ప్రాంత స్థానికుల అవసరాల మేరకు భవిష్యత్లో అక్కడ పాఠశాల, పార్కు, మంచి నీటి ట్యాంకు వంటి వాటి ఏర్పాటుకు వీలుంటుంది. నగరాలు, పట్టణాల పక్కన ఉండే గ్రామాల్లోనే.. నగరాలు, పెద్ద పట్టణాలను ఆనుకొని ఉండే గ్రామాల్లోనే అక్రమ లే అవుట్ల దందా పెద్ద ఎత్తున సాగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 37,684 ఎకరాల్లో అక్రమ లే అవుట్లు విస్తరించి ఉండగా, అందులో నగరాలు, పెద్ద పట్టణాలు ఆనుకొని ఉన్న గ్రామాల్లోనే 29,075 ఎకరాల్లో అక్రమ లే అవుట్లు ఉన్నాయని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. మిగిలిన గ్రామాల్లో కేవలం 8,609 ఎకరాల్లో ఈ అక్రమ లే అవుట్లు ఉన్నాయి. -
ఆదాయం పెరగాలి
సాక్షి, అమరావతి: రాష్ట్ర సొంత ఆదాయం పెరగడానికి తగిన ఆలోచనలు చేయడంతో పాటు ఆ ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురావడానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అదనపు ఆదాయాల కోసం వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. ఎస్ఓఆర్ (రాష్ట్రాల సొంత ఆదాయం)ను పెంచుకోవడానికి ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి పద్ధతులు, విధానాలు పాటిస్తున్నారో పరిశీలించాలని చెప్పారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఆదాయ ఆర్జన శాఖల మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదాయ ఆర్జనకు సంబంధించి ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించుకోవడానికి సంబంధిత శాఖల అధికారులు క్రమం తప్పకుండా సమావేశం కావాలని సూచించారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకురావడంలో కలెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు. పారదర్శక విధానాలను పాటిస్తూ ముందుకు సాగాలని సూచించారు. రాబడులను పెంచుకునే క్రమంలో అధికారులు తమ విచక్షణాధికారాలను వాడేటప్పుడు కచ్చితమైన ఎస్ఓపీలను పాటించాలని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న వ్యాట్ కేసులను పరిష్కరించడం ద్వారా బకాయిలను రాబట్టడంపై దృష్టి సారించాలని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వీలైనంతగా వేగవంతం చేయాలని సూచించారు. 51 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే అందుతున్న రిజిస్ట్రేషన్ సేవలను సమీక్షించి.. తగిన మార్పులు, చేర్పులు చేయాలన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వెలుగు చూసిన అవినీతి ఘటనలు, లోపాలు తిరిగి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రవేశించ కూడదని, ఆ మేరకు పటిష్టమైన ఎస్ఓపీలను అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ) ధర్మాన కృష్ణదాస్, ఉప ముఖ్యమంత్రి (ఎక్సైజ్) కె.నారాయణస్వామి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యుత్, అటవీ పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉచిత రిజిస్ట్రేషన్ల వల్ల పేదలకు భారీగా లబ్ధి ► ఇదివరకెన్నడూ లేని విధంగా ఓటీఎస్ పథకం ద్వారా ఉచిత రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ మినహాయింపు రూపేణా పేదలకు ఇప్పటి వరకు రూ.400.55 కోట్లు, టిడ్కో ఇళ్ల ఉచిత రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ మినహాయింపు రూపేణా మరో రూ.1,230 కోట్ల మేర (మొత్తంగా రూ.1630.55 కోట్లు) లబ్ధి చేకూరిందని అధికారులు వెల్లడించారు. ► గతంలో ఎన్నడూ ఇలా పేదల ఇళ్లకు ఉచిత రిజిస్ట్రేషన్లు, స్టాంపు డ్యూటీ మినహాయింపులు జరగలేదు. చంద్రబాబు ప్రభుత్వంలో కేవలం కార్పొరేట్ కంపెనీలకు కేటాయించే స్థలాలకు మాత్రమే స్టాంపు డ్యూటీ మినహాయింపులు ఇచ్చారు. ► ఇప్పటి వరకు 3.70 లక్షల ఓటీఎస్ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ పూర్తయింది. 51 గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. -
సంపూర్ణ హక్కుతో సంతోషం
ఫొటోలో కనిపిస్తున్న కంచెర్ల కృష్ణవేణిది తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం. చాలా ఏళ్ల క్రితం గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం తీసుకుని ఇల్లు నిర్మించుకుంది. రుణం చెల్లించకపోవడంతో ఇంటి పత్రాలు తనఖాలోనే ఉండిపోయాయి. గత ఏడాది సీఎం జగన్ ప్రభుత్వం ఇంటి రుణాలపై రాయితీ ఇస్తూ, నిర్దేశించిన మొత్తం చెల్లిస్తే ఇంటిపై సంపూర్ణ హక్కులు కల్పిస్తామని ప్రకటించింది. దీంతో తన అప్పు వడ్డీ, అసలు కలిపి రూ. 50,620కు చేరిందని తెలుసుకుంది. అయితే, రూ.10 వేలు చెల్లిస్తే చాలని అధికారులు సూచించడంతో.. ఆ మొత్తాన్ని చెల్లించింది. సర్కారు సర్వహక్కులతో ఇంటిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడంతో ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న జి. వాణిప్రియది శ్రీకాకుళం జిల్లా రాజాం. రోజూ కూలి పనికి వెళ్తేగానీ పూట గడవని పరిస్థితి. ఈమెకు భర్త కూడా లేడు. రుణం తీసుకుని ఇల్లు నిర్మించుకుంది. ఆ ఇంటికి హక్కు పత్రాలు లేవు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో రుణం కోసం బ్యాంకుకు వెళ్తే అప్పు కూడా పుట్టదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రవేశపెట్టడంతో వాణిప్రియ రూ.10వేలు కట్టేసి ఇంటిపై సంపూర్ణ హక్కులు పొందింది. దీంతో ఆ ఆస్తి విలువ ఇప్పుడు రూ.10 లక్షలకు పెరిగిందని ఆనందోత్సాహాలు వ్యక్తంచేస్తోంది. భవిష్యత్తులో బ్యాంకు రుణం వస్తుందని ధీమాగా ఉంది. .. ఇలా కృష్ణవేణి, వాణిప్రియ తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది పేదలు ఈ పథకం కింద ఇళ్లపై సర్వహక్కులు పొందుతున్నారు. సాక్షి, అమరావతి: ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం’ (జేఎస్జీహెచ్పీ) కింద 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకూ గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం పొంది, లేదా రుణం పొందకుండా నిర్మించిన ఇళ్లకు ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 52 లక్షల మంది ఇళ్లు నిర్మించుకోగా వీరిలో 96% మందికి ఇళ్లలో నివసించే హక్కులు తప్ప, ఆస్తులపై ఇతర హక్కులు లేవు. దీంతో సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం లబ్ధిదారులకు వరంలా మారింది. ఎంతో సంతోషంతో వారు ఈ సదవకాశాన్ని వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నారు. కానీ, టీడీపీ, దాని అనుకూల పచ్చమీడియా ప్రభుత్వ నిర్ణయాన్ని చూసి ఓర్చుకోలేకపోతున్నాయి. ఈ పథకంపై ఎక్కడలేని దుష్ప్రచారం చేస్తున్నాయి. నిజానికి.. 2000 సంవత్సరం నుంచి ప్రభుత్వాలు ఓటీఎస్ను అమలుచేస్తూ వస్తున్నప్పటికీ 2014–2019 మధ్య టీడీపీ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. ఓటీఎస్ అమలుచేయాలని ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, గృహ నిర్మాణ సంస్థ పాలకవర్గం కోరినా చంద్రబాబు కనికరించలేదు. జగన్ సీఎం అయ్యాక జేఎస్జీహెచ్పీ ప్రవేశపెట్టడంతో ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 9,69,786 మంది ముందుకొచ్చారు. వీరిలో 3,69,139 మంది పేర్లపై ఆస్తుల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. రూ.16 వేల కోట్ల మేర లబ్ధి 1983 నుంచి 2011 మధ్య గృహ నిర్మాణ సంస్థకు ఇళ్ల లబ్ధిదారులు పడిన బకాయి వడ్డీతో కలిపి రూ.14,400 కోట్లుగా ఉంది. ప్రస్తుతం జేఎస్జీహెచ్పీ ద్వారా ఓటీఎస్ రూపంలో ప్రభుత్వం రూ.10 వేల కోట్లు మాఫీ చేసింది. అంతేకాక.. రిజిస్ట్రేషన్ సమయంలో చార్జీలు, ఫీజులను ఎత్తివేస్తూ రూ.6 వేల కోట్లు పేదలపై భారం పడకుండా చూసింది. ఇలా మొత్తంగా రూ.16 వేల కోట్ల మేర పేదలకు లబ్ధిచేకూర్చింది. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, మున్సిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్లలో రూ.20వేలు చెల్లిస్తే ఇంటిపై ప్రభుత్వం సర్వ హక్కులు కల్పిస్తోంది. ఇక నిర్దేశించిన మొత్తం కన్నా అప్పు తక్కువగా ఉంటే లబ్ధిదారులు ఆ మొత్తాన్నే చెల్లించుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించింది. ఓటీఎస్ అమలుకు 03–11–2017న గృహ నిర్మాణ సంస్థ ఎండీ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన. ఈ తరహాలో 2014–19 మధ్యలో గత టీడీపీ ప్రభుత్వానికి గృహ నిర్మాణ సంస్థ ఐదుసార్లు ప్రతిపాదనలు పంపింది. అయినా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వడ్డీతో సహా వసూలుకే అప్పట్లో బాబు ప్రభుత్వం మొగ్గు చూపింది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంతో ప్రయోజనాలివే.. ► పూర్తి యాజమాన్య హక్కులు రావడంవల్ల ఆస్తులను తనఖా పెడితే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. ► డీ పట్టా, పొజిషన్ సర్టిఫికెట్ స్థలాలకు మార్కెట్లో విలువ తక్కువగా ఉంటుంది. రిజిస్ట్రర్ ఆస్తులతో పోలిస్తే ప్రాంతాలను బట్టి 20 నుంచి 50 శాతానికిపైగా విలువ తక్కువే. ఈ వ్యత్యాసం లేకుండా ఆస్తుల విలువ పెరుగుతుంది. ► డీ పట్టా, పొజిషన్ సర్టిఫికెట్లను వారసుల పేర్లపై బదలాయించడానికి ఆస్కారంలేదు. ఈ పథకం ద్వారా ఆస్తులను బదలాయించుకోవడంతో పాటు అమ్ముకోవచ్చు. రుణం రూ.51 వేలు.. కట్టింది రూ.10 వేలు 17 ఏళ్ల క్రితం ప్రభుత్వ రుణంతో ఇల్లు నిర్మించుకున్నాం. వడ్డీతో కలిపి రుణం రూ.51 వేలకు చేరుకుంది. ఇంటిపై అధికారికంగా మాకు ఎలాంటి హక్కులు లేవు. సీఎం వైఎస్ జగన్ ఎంత అప్పు ఉన్నా, కేవలం ఒకేసారి రూ.10 వేలు కడితే అప్పును పూర్తిగా రద్దుచేయడంతో, పాటు ఇంటి పత్రాలు ఇస్తామని చెప్పడంతో వెంటనే కట్టేశా. ఇల్లు నా పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. డాక్యుమెంట్లు తీసుకున్నా. – పి. అనంతమ్మ, పగిడిరాయి గ్రామం, తుగ్గలి మండలం, కర్నూలు జిల్లా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓటీఎస్ అమలుకు గృహ నిర్మాణ సంస్థ బోర్డు మీటింగ్ లో చేసిన తీర్మానంకు సంబంధించిన ప్రతి ఇన్నేళ్లకు సొంతింటి కల నేరవేరింది ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు నిర్మించుకున్నాం. ఇందులో మాకు నివసించే హక్కు తప్ప మా వారసులకు దీనిని బదలాయించే హక్కులేదు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా ఆ బెంగ తీరింది. ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పుడు బ్యాంకు రుణాలు పుట్టవు. ఇది మాలాంటి వాళ్లకి పెద్ద సమస్య. మా సమస్యకు సీఎం జగన్ శాశ్వత పరిష్కారం చూపారు. చాలా ఏళ్లుగా సొంతింటిలో ఉంటున్నప్పటికీ ఇప్పటికి నా సొంతింటి కల వాస్తవ రూపం దాల్చింది. – జంగాల నాగమ్మ, జయంతి కాలనీ, రాజుపాలెం గుంటూరు జిల్లా దుష్ప్రచారం మానుకోవాలి గతంలో వడ్డీ రాయితీ ఇచ్చేందుకు ముందుకు రాని చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వ చర్యను తప్పుపడుతున్నారు. బాబుకు పేదలు బాగుపడటం ఇష్టం ఉండదు. ప్రస్తుత ప్రభుత్వం అసలు, వడ్డీలో రాయితీ ఇచ్చి, ఇళ్లపై సంపూర్ణ హక్కులు కల్పిస్తుండడాన్ని చూసి జీర్ణించుకోలేకపోతున్నాడు. లబ్ధిదారులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి బాబు బుద్ధి మార్చుకోవాలి. – దావులూరు దొరబాబు, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ మా ఆస్తి విలువ పెరిగింది 15 ఏళ్ల క్రితం ఇల్లు నిర్మించుకున్నాం. మాది ప్రభుత్వం ఇచ్చిన స్థలం. డీ పట్టా ఉండటంతో మార్కెట్ ధరలతో పోలిస్తే మా ఆస్తి విలువ 50 శాతం తక్కువే పలుకుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేస్తుండటంతో ఇకపై మాది ప్రైవేట్ ఆస్తితో సమానం. దీంతో భవిష్యత్లో మేం అమ్మాలనుకున్నా కొనుగోలుకు ఎంతోమందిముందుకు వస్తారు. మాకు దిగులుండదు. ఇప్పుడు మా ఇల్లు రూ.35 లక్షల వరకు పలకనుంది. – కోనేటి రాజ్యలక్ష్మి, రమణయ్యపేట, కాకినాడ ఇంటి పత్రాన్ని అధికారులు ఇంటికి తెచ్చిచ్చారు సొంత ఇంట్లో ఉన్నా ఇంటిపై యాజమాన్య హక్కులు లేవని లోటు ఉండేది. 2007లో తీసుకున్న రుణం వడ్డీతో రూ.30 వేలు అయింది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం గురించి వలంటీర్ చెప్పగానే ఎవరి ప్రోద్బలం లేకుండా రూ.10 వేలు చెల్లించాం. సర్వహక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ పత్రాన్ని అధికారులు ఇంటికి తెచ్చిచ్చారు. – కోకిల, పలమనేరు, చిత్తూరు జిల్లా ఇంటి విలువ పెరిగింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన సంపూర్ణ గృహ హక్కు పథకం పేద, మధ్య తరగతి వర్గాలకు ఎంతో ఉపయోగపడుతోంది. నేను 2010లో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు నిర్మించుకున్నాను. ఇప్పటివరకు అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.28 వేలకు చేరుకుంది. ప్రభుత్వం ఓటీఎస్ ప్రవేశపెట్టడంతో వెంటనే రూ.10 వేలు చెల్లించా. నా ఇంటికి సంబంధించిన రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను అందించారు. ఇప్పటివరకు ఇల్లు నాదైనా, దానికి ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడంవల్ల ఎంతో ఇబ్బందిపడ్డాం. ప్రస్తుతం డాక్యుమెంట్లు పక్కాగా రావడంవల్ల నా ఇంటి విలువ ఇప్పుడు రూ.20 లక్షలకు చేరుకుంది. – అల్లాబకాష్, నెరవాడ, కల్లూరు మండలం, కర్నూలు జిల్లా -
స్థిరాస్తి ప్రాజెక్టులపై ‘రెరా’ కన్ను
సాక్షి, అమరావతి: సొంత ఇల్లు అనేది ప్రతిఒక్కరి కల. అన్ని వర్గాల వారు దీనిని సమకూర్చుకోవాలనుకుంటారు. అయితే, కొన్న ఫ్లాట్లకు ప్రభుత్వ అనుమతులు లేకుంటే బ్యాంకు రుణాలు రావు.. అలాగే, ఓపెన్ ప్లాట్ అయితే నిర్మాణానికి స్థానిక సంస్థల అనుమతులు తప్పనిసరి. ఈ రెండు రకాల అనుమతులు ఉన్న ఫ్లాట్ కొనుగోలు చేసినప్పటికీ కొన్ని కొన్ని నిర్మాణ సంస్థలు కొనుగోలుదారులను ఇబ్బంది పెట్టొచ్చు. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ స్థిరాస్తి ప్రాధికార సంస్థ (ఏపీ రెరా) బాధితులకు అండగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలుదారులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఓపెన్ ప్లాట్లు, బహుళ అంతస్తుల నిర్మాణలు చేపట్టే కంపెనీలు లేదా బిల్డర్లు, డెవలపర్లు తమ ప్రాజెక్టులను తప్పనిసరిగా ఏపీ రెరాలో రిజిస్టర్ చేయించాలని, లేదంటే వారికి న్యాయపరమైన చిక్కులు తప్పవని హెచ్చరిస్తోంది. రెరాలో నమోదైనవి 2,900 ప్రాజెక్టులే.. రాష్ట్రంలో స్థిరాస్తి వ్యాపారం పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది డెవలపర్లు స్థానిక సంస్థల నుంచిగాని, మున్సిపాలిటీలు, టౌన్ప్లానింగ్ విభాగం నుంచిగాని ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్లు వేస్తున్నారు. సదరు సంస్థలు బోర్డు తిప్పేస్తే ఇలాంటి వాటిలో స్థలాలు, ఫ్లాట్లు కొనేవారికి రక్షణ ఉండదు. ఇవిగాక మున్సిపాలిటీలు, టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి అనుమతి తీసుకున్న ప్రాజెక్టులు దాదాపు ఏడువేలకు పైగా ఉన్నట్లు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం లెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి వీటన్నిటికీ ‘రెరా’ అనుమతి తప్పనిసరి. కానీ, రాష్ట్రంలో ‘రెరా’ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి కేవలం 2,900 ప్రాజెక్టులు మాత్రమే ‘రెరా’లో నమోదయ్యాయి. ఈ ప్రాధికార సంస్థ అనుమతిలేకుంటే ఆ ప్రాజెక్టులకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో పాటు నిర్మాణదారుల వివరాలు నమోదు చేయిస్తున్నారు. ఇప్పటిదాకా తమ ప్రాజెక్టుల వివరాలు నమోదు చేయించకుంటే ‘రెరా’ చట్టంలోని సెక్షన్–3 ప్రకారం 10 శాతం వరకు పెనాల్టీ విధిస్తామని ‘రెరా’ పాలకవర్గం ప్రాజెక్టుల యజమానులకు సమాచారం పంపిస్తోంది. అప్పటికీ స్పందించకుంటే అలాంటి ప్రాజెక్టుల వివరాలను బ్యాంకులు, సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపించి వాటి రుణ, రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపివేయించే యోచనలో కూడా ఉన్నట్లు తెలిసింది. కొనుగోలుదారులకు నష్టం జరగకుండా.. కొనుగోలుదారులు ఓపెన్ ప్లాట్ లేదా అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుగోలుకు వెళ్తే.. అన్ని అనుమతలు ఉన్నాయని, స్థానిక సంస్థల నుంచి, టౌన్ప్లానింగ్ నుంచి అనుమతి ఉన్నట్లు చెబుతారు. వీటితో పాటు రెరాలో రిజిస్టర్ అయ్యిందో లేదో చూసుకోవాలి. 500 చ.మీ. విస్తీర్ణంలో దాటిన వెంచర్లు, డెవలపర్లు నిర్మించే ఫ్లాట్ల సంఖ్య 8 మించి ఉంటే తప్పనిసరిగా ‘రెరా’లో నమోదు చేయించడంతో పాటు ప్రతి మూడు నెలలకోసారి పనుల పురోగతిని ‘రెరా’లో నమోదు చేయాలి. అలా చేయని పక్షంలో ఆయా నిర్మాణ సంస్థలకు నోటీసులు ఇవ్వడంతో పాటు అవసరమైతే బ్లాక్లిస్ట్లో ఉంచే అధికారం ‘రెరా’కు ఉంది. కొనుగోలు ఒప్పందంలో పేర్కొన్నట్లుగా నిర్మాణం లేకున్నా.. మరేదైనా పెద్ద లోపాలు తలెత్తినా ఐదేళ్ల వరకు సదరు నిర్మాణదారుడే బాధ్యత వహించాలి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చిన ఐదేళ్ల వరకు నిర్మాణంలో తలెత్తే పెద్ద సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత సదరు బిల్డరుదే. ఆయా సమస్యలపై కొనుగోలుదారులు ‘రెరా’కు ఫిర్యాదు చేయవచ్చని పాలక మండలి చెబుతోంది. -
కేంద్రం కీలక సంస్కరణ.. దేశంలో ఏకరీతిగా భూ రిజిస్ట్రేషన్..!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ 2022లో నూతన భూ సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఒకే దేశం - ఒకే రిజిస్ట్రేషన్ కి సంబంధించిన విషయాన్ని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. 'ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్' సాఫ్ట్వేర్తో నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(NGDRS)తో ఏకీకరణను అమలులోకి తీసుకోవడం, డీడ్స్, డాక్యుమెంట్లను ఎక్కడైనా ఏకరీతిగా నమోదు చేయడానికి ప్రోత్సహించబడుతుంది. "మెరుగైన జీవన సౌలభ్యం కోసం, దేశంలో సులభంగా వ్యాపారం చేయడానికి వీలుగా వన్ నేషన్ - వన్ రిజిస్ట్రేషన్ విధానం ఏర్పాటు చేయనున్నట్లు" సీతారామన్ తెలిపారు. అలాగే, దేశంలో సులభంగా వ్యాపారం చేయడానికి 25,000 ఒప్పందాలు తొలగించామని, 1,486 యూనియన్ చట్టాలను కూడా రద్దు చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. చెల్లింపులలో జాప్యాన్ని తగ్గించడానికి ఆన్ లైన్ బిల్లు చెల్లింపు వ్యవస్థ గురించి అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలతో మాట్లాడినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే, ఎంటర్ప్రైజ్, హబ్ల అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొని రావాలని ఆమె తన బడ్జెట్ 2022 ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కొత్త చట్టం ఇప్పటికే ఉన్న పారిశ్రామిక ప్రాంతాలను కవర్ చేస్తుందని, ఎగుమతులలో పోటీతత్వాన్ని పెంపొందిస్తుంది అని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. 'ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్' సాఫ్ట్వేర్తో నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్తో ఏకీకరణను అమలులోకి తీసుకోవడం, డీడ్స్, డాక్యుమెంట్లను ఎక్కడైనా ఏకరీతిగా నమోదు చేయడానికి ప్రోత్సహించబడుతుంది. - కేంద్రమంత్రి @nsitharaman #Budget2022 #AatmaNirbharBharatKaBudget pic.twitter.com/VbvRmJ8t71 — PIB in Telangana 🇮🇳#AmritMahotsav (@PIBHyderabad) February 1, 2022 (చదవండి: బడ్జెట్ 2022: పెరిగేవి..తగ్గేవి ఇవే..!)