-
Osmania University: గ్లోబల్ ఓయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం.. ఎప్పుడంటే..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని జనవరి 3, 4 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఓయూ ఉపకులపతి ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ వెల్లడించారు. గురువారం ఓయూ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేళంలో ఆయన మట్లాడారు. ఓయూ క్యాంపస్ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే ఉస్మానియా గ్లోబల్ అలుమ్నీ మీట్–23లో హాజరయ్యేందుకు ఇప్పటికే వెయ్యి మంది పూర్వ విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. విశ్వవిద్యాలయం చరిత్రలో విభాగాల వారీగా పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారని వివరించారు. రెండు రోజుల పాటు సమ్మేళనం ఇలా.. గ్లోబల్ అలుమ్ని మీట్ జనవరి 3న మధ్యాహ్నం ప్రారంభమవుతుందన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివృద్ధి, ఇతర అంశాలపై విశిష్ట పూర్వ విద్యార్థులతో పలు బృందలతో చర్చలు ఉంటాయన్నారు. సాయంత్రం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లోని లాన్లో సాంస్కతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. రెండో రోజున పూర్వ విద్యార్థులు ఆయా విభాగాలను సందర్శించి, అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంటారన్నారు. మధ్యాహ్నం వివిధ అంశాలపై ఉపన్యాసాలుంటాయని వివరించారు. (క్లిక్ చేయండి: ప్రయాణికులకు ఊరట.. పోలీసుల కీలక ఆదేశాలు) -
ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడిగా సాను
సాక్షి, హైదరాబాద్: భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జాతీయ అధ్యక్షుడిగా వీపీ సాను, ప్రధాన కార్యదర్శిగా మయూక్ బిశ్వాస్ తిరిగి ఎన్నికయ్యారు. మొత్తం 83 మందితో కొత్త కమిటీ ఎన్నిక కాగా, వారిలో 19 మందితో కార్యదర్శి వర్గం (ఆఫీస్ బేరర్స్) ఎన్నికైంది. జాతీయ కమిటీలో తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీ నుంచి నలుగురికి అవకాశం వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో మంగళవారం ప్రారంభమైన ఎస్ఎఫ్ఐ 17వ జాతీయ మహాసభలు, శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నేషనల్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఉపాధ్యక్షుడు, ప్రెసిడెంట్లుగా నితీశ్ నారాయణ్ (ఢిల్లీ సెంటర్), ప్రతికుర్ రహమన్ (బెంగాల్), తాళ్ల నాగరాజు (తెలంగాణ), అశోక్ (ఏపీ), అనుశ్రీ (కేరళ), సంగీతాదాస్ (అసోం), సహాయ కార్యదర్శులుగా దినిత్ డెంట, దీప్సితాధర్ (ఢిల్లీ సెంటర్), శ్రీజన్ భట్టాచర్య (బెంగాల్), పీఎం అశ్రో (కేరళ), సందీపన్ దాస్ (త్రిపుర), ఆదర్శ్ ఎం.సాజీ (సెంటర్) ఎన్నికయ్యారు. కార్యదర్శి వర్గ సభ్యులుగా నిరుబన్ చక్రవర్తి (తమిళనాడు), ఐషీఘోష్ (ఢిల్లీ), సుభాష్ జక్కర్ (రాజస్థాన్), అమత్ ఠాకూర్ (హిమాచల్ప్రదేశ్)ను ఎన్నుకున్నారు. తెలంగాణ నుంచి నాగరాజు, ఆర్.ఎల్.మూర్తి, ఎం.పూజ, మమత, శివదుర్గారావు (హెచ్సీయూ)లకు కమిటీలో చోటు లభించింది. (చదవండి: ఇప్పుడేం చేద్దాం? ఢిల్లీ వెళ్లాలా? లేఖ రాయాలా) -
అ‘న్యాయం’గా ఫీజులు పెంపు!
సాక్షి, హైదరాబాద్: పేదవిద్యార్థులకు న్యాయవిద్య ఫీజులు భారంగా మారాయి. ఫలితంగా వారు న్యాయవిద్యకు దూరమవుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ మునుపెన్నడూ లేనంతగా ఫీజులు పెంచిందని న్యాయశాస్త్ర విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా వర్సిటీ పరిధిలో ఐదేళ్ల న్యాయవిద్య కోర్సు వార్షిక ఫీజును రూ.5,460 నుంచి రూ.16 వేలకు పెంచారు. రెండేళ్ల కాలపరిమితి ఉండే ఎల్ఎల్ఎం ఫీజును రూ.4,500 నుంచి రూ.20,100కు పెంచారు. ఎంఎల్ఎం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజులు రెండింతలు పెరిగాయి. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజు రూ.15 వేల నుంచి రూ.33,000 పెంచారు. ప్రభుత్వ అధీనంలో ఉండే ఉస్మానియా లా కోర్సుల్లో ఫీజులు ఇప్పుడు ప్రైవేటు కాలేజీలతో సమానంగా ఉన్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజుల బెంబేలుతో చేరని విద్యార్థులు లా కోర్సు చదువుదామనుకున్న విద్యార్థులు భారీ ఫీజుల కారణంగా కాలేజీల్లో చేరడం లేదు. ముఖ్యంగా పేద విద్యార్థులు వెనక్కు తగ్గుతు న్నారు. ఈ విద్యాసంవత్సరం 6,724 సీట్లు అందుబాటులో ఉండగా, 12,301 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. అందులో మొదటి విడతలో 5,747 మంది మాత్రమే కౌన్సెలింగ్లో సీట్లు పొందారు. మూడేళ్ల ఎల్ఎల్బీలో 4,064 సీట్లు అందుబాటులో ఉండగా, 3,598 సీట్లు కేటాయించారు. ఐదేళ్ల ఎల్ఎల్బీలో 1,784 సీట్లకు 1,440 సీట్లు కేటాయించారు. 876 ఎల్ఎల్ఎం సీట్లకు 709 మంది అభ్యర్థులు సీట్లు పొందారు. గడువు ముగిసే నాటికి దాదాపు వెయ్యి మంది వరకూ కాలేజీల్లో చేరేందుకు ఇష్టపడలేదని అధికారులు చెబుతున్నారు. ప్రకటన లేకుండానే పెంపు వర్సిటీ అధికారులు ఇష్టానుసారంగా ఫీజుల పెంచారనే విమర్శలొస్తున్నాయి. కోవిడ్ తర్వాత కాలేజీలకు ఖర్చు పెరిగిందని, ప్రభుత్వం నుంచి ఇందుకు తగ్గట్టుగా నిధులు రావడం లేదని, అందుకే ఫీజులు పెంచాల్సి వచ్చిందని అధికారులు అంటున్నారు. లాసెట్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు మాత్రమే ఓయూ న్యాయ కళాశాలలో సీట్లు పొందుతారు. ఇప్పుడు సాధారణ ర్యాంకులతో ప్రైవేట్ కాలేజీల్లో చేరినవారు, ఓయూ కళాశాలలో సీట్లు పొందినవారు దాదాపు సమానంగా ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఉస్మానియా వర్సిటీ న్యాయ కళాశాలల్లో రెగ్యులర్ కోర్సుల ఫీజు పెరగడాన్ని ఓయూ జేఏసీ అధ్యక్షుడు కురవ విజయ్కుమార్ ఖండించారు. ఫీజులపెంపు వల్ల ప్రతిభ గల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు న్యాయవిద్యకు దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన లా కోర్సుల ఫీజులను తగ్గిస్తూ ఓయూ పాలకవర్గం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
‘జింబో’ రాజేందర్కు ఉస్మానియా పీహెచ్డీ
సాక్షి, హైదరాబాద్: మాజీ జడ్జి, రచయిత మంగారి రాజేందర్ (జింబో) ‘పోలీసు అధికారాలు–సమన్యాయ పాలన– ఎన్కౌంటర్ మరణాలు’ అంశంపై సమర్పించిన పరిశోధన పత్రానికి ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీని ప్రకటించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడకు చెందిన మంగారి రాజేందర్ జిల్లా సెషన్స్ జడ్జిగా, జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా, టీఎస్పీఎస్సీ సభ్యుడిగా పనిచేశారు. కవిత్వం, కథలతోపాటు, యాభై వరకు ‘లా’ పుస్తకాలను తెలుగులో అనువదించారు. లా సంబంధిత వ్యాసాలు రాశారు. ప్రజలకు అర్థమయ్యేలా కోర్టు తీర్పులను తెలుగులో వెలువరించారు. ‘మా వేములవాడ కథలు, జింబో’ కథలతో తనదైన ముద్ర వేశారు. -
రావినూతల శశిధర్కు న్యాయశాస్త్రంలో పీహెచ్డీ డాక్టరేట్
ఉస్మానియా యూనివర్సిటి న్యాయశాఖ విభాగంలో ‘‘యాంటి టెర్రరిజం లాస్ ఇన్ పోస్ట్ 9/11 వరల్డ్ అండ్ ఇండియన్ లాస్ - ఎ కంపారేటివ్ స్టడీ’’ అనే అంశంపై ప్రొఫెసర్ ఎస్. బీ. ద్వారకానాథ్ గారి పర్యవేక్షణలో పరిశోధన చేసిన రావినూతల శశిధర్కు ఉస్మానియా యూనివర్సిటి డాక్టరేట్ను ప్రదానం చేసింది . అమెరికా జంట టవర్ల పేలుళ్ళ అనంతరం తీవ్రవాదాన్ని అణిచివేయడానికి వివిధ ప్రపంచ దేశాలు చేసిన తీవ్రవాద వ్యతిరేఖ చట్టాలు మరియు వాటి పనితీరు, ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలు వాటి ప్రభావం , ఐక్య రాజ్య సమితి వివిధ విభాగాల ఏర్పాటు మరియు వాటి పనితీరు, భారత దేశంలో వివిధ రూపాలలో ఉన్న తీవ్రవాద మూలాలు, తీవ్రవాదాన్ని అణిచివేయడంలో భారత్ లో ప్రస్తుతం ఉన్న చట్టాల పనితీరు, నూతన చట్టాల ఆవశ్యకత, తీవ్రవాద వ్యతిరేఖ చట్టాల అమలులో భారతదేశ కోర్టుల పాత్ర, కఠిన చట్టాల ఆవశ్యకత - మానవ హక్కులు రక్షణ తదితర అంశాలపై లోతైన అధ్యయనంతో కూడిన పరిశోధన థిసిస్ను రావినూతల శశిధర్ సమర్పించారు. ఈ పరిశోధనకు సంబంధించిన పలు అంశాలపై రావినూతల శశిధర్ వ్రాసిన పలు ఆర్టికల్స్ను ప్రముఖ లీగల్ జర్నల్స్ ప్రచురించాయి, పరిశోధనలో భాగంగా జాతీయ భద్రతకు సంబంధించిన పలు జాతీయ స్థాయి సెమినార్లలో కూడా శశిధర్ పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య తీవ్రవాదాన్ని అణిచివేయడంలో ప్రస్తుత చట్టాల పనితీరుపై విస్తృత పరిశోధన చేసి అంతర్జాతీయ స్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై మరియు భారత దేశంలోని చట్టాలలో రావాల్సిన మార్పులపై ఈ పరిశోధనలో చేసిన పలు సూచనలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని పలువురు న్యాయ నిపుణులు శశిధర్ ను అభినందిస్తున్నారు. రాష్ట్రంలో అనేక విద్యార్థి ఉద్యమాలకు మరియు సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించిన రావినూతల శశిధర్.. తీవ్రవాద వ్యతిరేఖ చట్టాలపై విస్తృత పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అవార్డు సాధించడం పై పలువురు అభినందించారు. -
ఓటర్ల కాళ్లు మొక్కుతూ.. మునుగోడులో ఓయూ విద్యార్థుల ప్రచారం
సాక్షి, మునుగోడు: టీఆర్ఎస్ను ఓడించాలని కోరుతూ మునుగోడులో ఓయూ జేఏసీ విద్యార్థులు వినూత్న ప్రచారం నిర్వహించారు. ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసగిస్తున్న టీఆర్ఎస్కు ఓటు వేయొద్దంటూ మెడకు ఉరితాళ్లు బిగించుకుని, ఓటర్ల కాళ్లు మొక్కారు. చండూరులో ఆదివారం ఈ వినూత్న ప్రచారం కనిపించింది. ‘సాలు దొర ఇక సెలవు..’, ‘కేసీఆర్ను ఓడిద్దాం.. నిరుద్యోగుల జీవితాలను కాపాడుకుందాం’ అనే నినాదాలతో నియోజకవర్గంలో 9 రోజుల పాటు ప్రచారం నిర్వహించినట్లు విద్యార్థి జేఏసీ నాయకులు తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మాట తప్పడంతో రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు అనేక హామీలు ఇస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని, ఓటర్లు మేల్కొనాలని పిలుపునిచ్చారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిస్తే ఉరే శరణ్యమని వాపోయారు. రొట్టె చేస్తా.. ఓట్లు అడుగుతా.. మంత్రి సత్యవతి రాథోడ్ మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం సంస్థాన్ నారాయణపురం మండలం గరకతండాలోని ఓ గిరిజన ఇంట్లో రొట్టె చేశారు. వారితో కలిసి రొట్టెతిన్నారు. కారు గుర్తుకు ఓటు వేయాలని వారిని కోరారు. -
Osmania University: ఓయూలో దసరా సెలవులు ఇలా
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీకు దసరా సెలవులను ప్రకటించారు. వివిధ పీజీ కోర్సుల కాలేజీలకు శనివారం నుంచి వచ్చే నెల 9 వరకు, ఎల్ఎల్ఎం విద్యార్థులకు అక్టోబరు 2 నుంచి 8 వరకు సెలవులను ప్రకటించారు. పండుగ సెలవుల కారణంగా విద్యార్థులు లగేజితో హాస్టల్ గదులను ఖాళీ చేయాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. 26న పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూలు ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి విడత ఆన్లైన్ కౌన్సెలింగ్ షెడ్యూలు ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు సీపీజీఈసెట్–2022 కన్వీనర్ ప్రొ.పాండురంగారెడ్డి శుక్రవారం తెలిపారు. ఓయూతో పాటు రాష్ట్రంలోని ఇతర వర్సిటీలలో 2022–23 విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంఈడీ, ఎంపీడీ, ఎంసీజే, లైబ్రరీ సైన్స్లతో పాటు ఐదేళ్ల పీజీ, పీజీ డిప్లొమాలో ప్రవేశాలకు మొదటి విడత ఆన్లైన్ కౌన్సెలింగ్ వచ్చే వారం నుంచి ప్రారంభంకానున్నట్లు వివరించారు. పీజీ ప్రవేశ పరీక్షలో (సీపీజీఈసెట్–2022) అర్హత సాధించిన విద్యార్థులు డిగ్రీ సర్టిఫికెట్లతో పాటు టీసీ, కులం, ఆదాయం సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. సర్టిఫికెట్లు లేని పక్షంలో అడ్మిషన్ తిరస్కరించనున్నట్లు కన్వీనర్ పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: టీహబ్–2లో 200 స్టార్టప్ల కార్యకలాపాలు ప్రారంభం) -
Hyderabad: ఆన్లైన్లో బిట్స్ పిలానీ బీఎస్సీ డిగ్రీ
సాక్షి, హైదరాబాద్: జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని బిట్స్ క్యాంపస్ లో ‘కొర్సెరా’ భాగస్వామ్యంతో మొట్టమొదటి ఆన్లైన్ కోర్సు (బీఎస్సీ కంప్యూటర్స్) సోమవారం ప్రారంభమైంది. ఈ కోర్సులో చేరడానికి ఎలాంటి ప్రవేశ పరీక్ష రాయాల్సిన అవసరంలేదని క్యాంపస్ డైరెక్టర్ జి.సుందర్ తెలిపారు. 12వ తరగతి లేదా దానికి సమాన అర్హత ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆన్లైన్ డిగ్రీకి ప్రపంచంలో ఏ మూలనుంచైనా పరీక్ష రాయొచ్చన్నారు. బిల్స్ పిలానీతో కలిసి ఆన్లైన్ డిగ్రీ కోర్సును ప్రారంభించడం పట్ల కొర్సెరా చీఫ్ కంటెంట్ ఆఫీసర్ బెట్టీ వాండెన్ బోష్ హర్షం వ్యక్తం చేశారు. అర్హత గల విద్యార్థులు నేటి నుంచి నవంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాల కోసం బిట్స్ వెబ్సైట్లో సంప్రదించవచ్చు. ఓయూ పీజీ కోర్సుల పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెలలో జరిగే వివిధ పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఎలాంటి అపరాధ రుసుము లేకుండ ఈ నెల 16 వరకు, రూ.300 అపరాధ రుసుముతో 19 వరకు పొడిగించినట్లు సోమవారం అధికారులు తెలిపారు. వివిధ పీజీ కోర్సులతో పాటు ఐదేళ్ల ఎమ్మెస్సీ కెమిస్ట్రీ 1, 3, 4, 5, 7, 9 బ్యాక్లాగ్, ఇంప్రువ్మెంట్కు ఫీజు చెల్లించవచ్చు. పూర్తి వివరాలను ఉస్మానియా యూనివర్సిటీ వెబసైట్లో చూడవచ్చు. (క్లిక్: 833 ఇంజనీర్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల) -
12, 13న నిరుద్యోగుల నిరాహార దీక్ష
ఉస్మానియా యూనివర్సిటీ: రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుకోసం సీఎం కేసీఆర్ మెడలు వంచేందుకు ఎస్సీ, బీసీ నిరుద్యోగులు ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పిలుపునిచ్చారు. ఎస్సై, కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కటాఫ్ మార్కు లు తగ్గించి రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యపై 11న ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇస్తామని, ఈ నెల 12, 13 తేదీల్లో ఇందిరాపార్కు వద్ద సామూహిక నిరాహార దీక్ష చేపడతామని ప్రకటించారు. ఓయూలోని ఐసీఎస్ఎస్ఆర్ సెమినార్ హాల్లో శనివారం జరిగిన విద్యార్థి సంఘాల రౌండ్టేబుల్ సమావేశంలో మంద కృష్ణ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ అభ్యర్థులకు ద్రోహం చేయాలనే ఎస్సై, కానిస్టేబుల్ నోటిఫికేషన్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని, టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ శ్రీనివాసరావును తొలగించాలని డిమాండ్ చేశారు. -
సీనియర్ జర్నలిస్టు నాగేశ్వర్రావుకు డాక్టరేట్
సాక్షి, హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు నాగేశ్వర్రావుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. ఆధునిక తెలుగు సాహిత్యం–లౌకిక వాదం అంశంపై సమర్పించిన సిద్ధాంత గ్రంథానికి ఆయనకు ఈ డాక్టరేట్ లభించింది. ఆచార్య చంద్రశేఖర్రెడ్డి పర్యవేక్షణలో నాగేశ్వర్రావు సిద్ధాంత గ్రంథాన్ని విశ్వవిద్యాలయానికి సమర్పించారు. రంగారెడ్డి జిల్లా కోహెడ గ్రామానికి చెందిన అండాలు, నర్సింహ దంపతులకు 1964లో జన్మించిన నాగేశ్వర్రావు.. గత 33 ఏళ్లుగా పలు దినపత్రికల్లో పనిచేస్తూ 6 దేశాల్లో పర్యటించారు. ప్రారంభం నుంచి వార్త దినపత్రికలో పని చేస్తున్న ఆయన ప్రస్తుతం స్టేట్ బ్యూరో చీఫ్గా విధులు నిర్వహిస్తున్నారు. నాగేశ్వర్రావుకు ఓయూ డాక్టర్ డిగ్రీ లభించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. -
వైవిధ్యాన్ని కొనసాగిస్తూనే విలువలు కాపాడుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచీకరణతో ప్రపంచ సంస్కృతి వైపు మనం వెళుతున్నామని, ప్రపంచ సంస్కృతి యావత్తు ప్రపంచాన్ని చుట్టుముడుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. ఈ వైవిధ్యాన్ని కొనసాగిస్తూనే మన విలువలను కాపాడుకోవాల్సిన అవసరముందని చెప్పారు. శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీ 82వ స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్, వర్సిటీ చాన్స్లర్ తమిళిసై సౌందర రాజన్.. సీజేఐ రమణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన స్నాతకోత్సవ ఉపన్యాసం చేశారు. నేటి యువత అనేక సవాళ్లను ఎదర్కొంటోందని, మన జీవన విధానం భారీ పరివర్తనకు గురయ్యిందని జస్టిస్ రమణ పేర్కొన్నారు. మన తిండి, భాష, బట్టలు, ఆటలు, పండుగలు వగైరాలు మన గతంతో పెనవేసుకుపోయాయన్నారు. సగం భాషలు కనుమరుగయ్యే ప్రమాదం యునెస్కో 2021 నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచంలోమాట్లాడే 7 వేల భాషల్లో సగం భాషలు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని, దీంతో భాష, సాహిత్యాన్ని కోల్పోవడంతో పాటు, జానపద కథలు, తరాల వారసత్వంగా లభించిన విజ్ఞానాన్ని కోల్పోతామని జస్టిస్ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. జీవ వైవిధ్యం క్రమంగా మారుతోందని, కొత్త వంగడాల రాకతో అనేక మార్పులొచ్చాయని అన్నారు. ఆర్థిక వ్యవస్థ మార్పులకు లోనవడంతో పంటలు మార్పులకు గురవుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యార్థులు ప్రాథమిక చట్టాలు, సూత్రాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలని సూచించారు. రాజ్యాంగం, పరిపాలనపై సబ్జెక్టులను ప్రవేశపెట్టాల్సిన అవసరముందన్నారు. పౌరులు రాజ్యాంగంతో అనుసంధానించబడాలని, రాజ్యాంగమే మనకు అంతిమ రక్షణ కవచమని చెప్పారు. విద్యార్థులంతా ఉత్తరాలు రాయాలని, పుస్తకాలు చదవాలని సీజేఐ రమణ ఉద్బోధించారు. ఉత్తరాలు రాస్తే మీలో ఉన్న కవులు బయటకు వస్తారని ఆయన సూచించారు. పీవీ, కేసీఆర్ ఓయూ ప్రొడక్ట్లే.. ఉస్మానియా యూనివర్సిటీ దక్షిణ భారతదేశంలోనే మూడో పురాతన విశ్వవిద్యాలయమని, హైదరాబాద్ రాష్ట్రంలో మొదటిదని గుర్తుచేశారు. బ్రిటిష్ వలస పాలన, ఆంగ్లభాష ఆధిపత్యం కొనసాగుతున్న కాలంలో ప్రాంతీయ భాషల్లో బోధనను ఓయూ ప్రారంభించి ఉన్నత విద్యలో కొత్త యుగానికి నాంది పలికిందన్నారు. బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్ర భారత్గా అవతరించే వరకు వెలుగురేఖలు పంచిందన్నారు. ఎంతో మంది దార్శనికులను తయారు చేసిందని, సాధారణ వ్యక్తిని అసాధారణ వ్యక్తిగా తీర్చిదిద్దడం ఓయూ ప్రత్యేకత అని కొనియాడారు. రాజనీతిజ్ఞుడు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, తెలంగాణ సీఎం కేసీఆర్లు ఓయూ ప్రొడక్ట్లేనని గుర్తు చేశారు. ఓయూలో చేరాలనుకున్నా.. ఆధునిక భారతదేశాన్ని నిర్మించడంలో ఓయూ పాత్ర గణనీయమైందన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్, రాజగోపాలాచారి, నెహ్రూ, డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్, అంబేడ్కర్ వంటి 42 మంది మహనీయులు ఓయూ నుంచి గౌరవ డాక్టర్ను స్వీకరించారని చెప్పారు. ఓయూ కాలేజీలో చేరాలనుకున్నా తనకా అవకాశం దక్కలేదని, కోరిక నెరవేరలేదని గత స్మృతులను నెమరేసుకున్నారు. ఈ సందర్భంగా కాళోజీ, దాశరథి కవితలు చదివి జస్టిస్ రమణ మాతృ భాషపై గల మమకారాన్ని చాటుకున్నారు.. హైకోర్టు సీజే ఉజ్జల్ భూయాన్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఓయూ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం 44 గోల్డ్మెడల్స్, 211 పీహెచ్డీ అవార్డులను విద్యార్థులకు ప్రదానం చేశారు. లక్ష్యాన్ని చేరుకునేలా కష్టపడాలి విజయానికి సత్వర మార్గాలు ఉండవని, లక్ష్యాన్ని చేరుకునేలా కష్టపడాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ విద్యార్థులకు సూచించారు. చిన్నచిన్న లక్ష్యాలు కాకుండా పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాలన్నారు. సమస్యలు వచ్చినప్పుడు ఎదురుకోవాల్సిందేన్నారు. కచ్చితంగా సమయ పాలన పాటించాలని, సాధారణంగానే ఉండాలని, అసాధారణ పనులు చేయాలన్నారు. ప్రస్తుతం ఐదు నిమిషాలు కూడా మొబైల్ని పక్కకు పెట్టే పరిస్థితి లేదని, ఫోన్లను దూరంగా పెట్టే ప్రయత్నం చేయాలని హితవు పలికారు. -
నేడు జస్టిస్ ఎన్వీ రమణకు ఓయూ గౌరవ డాక్టరేట్
ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను శుక్రవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు ప్రదానం చేయనున్నట్లు వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు. గురువారం ఆయన వర్సిటీ గెస్ట్హౌస్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర గవర్నర్, ఓయూ చాన్స్లర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అధ్యక్షతన వర్సిటీ క్యాంపస్లోని ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే 82వ స్నాతకోత్సవంలో ఈ డాక్టరేట్ను అందజేయనున్నట్లు చెప్పారు. ఇది ఓయూ 48వ గౌరవ డాక్టరేట్ అని, 21 ఏళ్ల అనంతరం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా దానిని ప్రదానం చేస్తున్నామని వివరించారు. 361 మందికి పీహెచ్డీ డిగ్రీలు, వివిధ కోర్సుల్లో అత్యధిక మార్కులు సాధించిన 31 మంది విద్యార్థులకు 55 బంగారు పతకాలు అందచేయనున్నట్లు వీసీ తెలిపారు. సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొ.లక్ష్మీనారాయణ, ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ.శ్రీనగేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఓయూలో పీహెచ్డీ పర్యవేక్షణకు ప్రొఫెసర్ల కొరత
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ పర్యవేక్షణకు (గైడ్) ప్రొఫెసర్ల తీవ్ర కొరత నెలకొంది. గత 10 సంవత్సరాలుగా నియామకాలు చేపట్టకపోవడంతో అధ్యాపకుల సంఖ్య 1254 నుంచి 362కు తగ్గింది. తాత్కాలికంగా అధ్యాపకులను నియమించి బోధనను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం క్యాంపస్ కాలేజీలతో పాటు అనుబంధ కాలేజీల్లో 362 మంది పర్మనెంట్ అధ్యాపకులు పని చేస్తున్నారు. ఓయూ పరిధిలోని ఐదు జిల్లాల పీజీ కేంద్రాలను కాంట్రాక్టు అధ్యాపకులతోనే నిర్వహిస్తున్నారు. ఓయూలో కాంట్రాక్టు 430, పార్టుటైం అధ్యాపకులు 260 మంది పని చేస్తున్నారు. కాంట్రాక్టు, పార్టుటైం అధ్యాపకులతో పాటు సుమారు 200 మంది పర్మనెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పీహెచ్డీ గైడ్షిప్ అర్హత లేదు. గైడ్షిప్ గల 162 మంది పర్మనెంట్ అధ్యాపకుల వద్ద గతంలో ప్రవేశం పొందిన విద్యార్థులు పీహెచ్డీలో కొనసాగుతుండగా కొత్త వారికి అవకాశం దక్కడం లేదు. ఆరేళ్ల తర్వాత.. ఓయూలో ఆరు సంవత్సరాల తర్వత పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఆరేళ్లలో ఓయూనే పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు 50 వేలకు పైగా ఉండగా ఇతర వర్సిటీలకు చెందిన వారు మరో 15 వేల మంది ఉన్నారు. గతంలో ఓయూలో 1254 పర్మనెంట్ అధ్యాపకులు పనిచేయగా వారిలో సగం మందికి పీహెచ్డీ గైడ్షిప్ అర్హత ఉండేది. ఒక్క అధ్యాపకుని వద్ద 8 మంది విద్యార్థులకు పరిశోధనలకు అవకాశం కల్పిస్తారు. దీంతో ఏటా పార్ట్టైం, ఫుల్టైం పీహెచ్డీలో సుమారు 4 వేల మందికి ప్రవేశాలు లభించేవి. అయితే అధ్యాపకుల కొరత కారణంగా ప్రస్తుతం వేయి మందికి కూడా పీహెచ్డీ అవకాశం దక్కేలా లేదు. ప్రైవేటు కాలేజీలకు పీహెచ్డీ అధ్యాపకుల ఉద్యోగ విరమణ తర్వాత కొత్త వారిని నియమించకపోవడంతో బోధనకు, పరిశోధనకు కొరత ఏర్పడింది. 105 ఏళ్ల ఓయూ చరిత్రలో తొలిసారిగా ఈ విద్య సంవత్సరం నుంచి ప్రైవేటు కాలేజీల్లో పీహెచ్డీ కోర్సులకు అనుమతినిచ్చారు. ఓయూ పరిధిలోని దరఖాస్తు చేసుకున్న 15 అటానమస్ కాలేజీల్లో పని చేసే అర్హత గల అధ్యాపకులకు పీహెచ్డీ గైడ్షిప్ అవకాశాలను కల్పించారు. ఓయూలో పని చేసే పార్టుటైం, కాంట్రాక్టు అధ్యాపకులు బోధనకే పరిమితం. రెండేళ్ల క్రితం వరకు అర్హత గల కాంట్రాక్టు అధ్యాపకులకు పీహెచ్డీ గైడ్షిప్ అవకాశం ఉండేది. అయితే వివిధ కారణాల నేపథ్యంలో వారికి గైడ్షిప్ను రద్దు చేశారు. (క్లిక్: ఉద్యోగ నోటిఫికేషన్లో ట్విస్ట్.. అభ్యర్థులకు షాక్!) పాత పద్ధతిలోనే పీహెచ్డీ ప్రవేశాలు కొనసాగించాలి ఓయూలో పాత పద్దతిలోనే పీహెచ్డీ ప్రవేశాలు కల్పించాలి. కొత్త పద్ధతిలో అడ్మిషన్లకు పీహెచ్డీ నోటిఫికేషన్ను విడుదల చేశారు. దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కొత్త విధానంలో అడ్మిషన్లతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు, యూజీసీ నెట్, జేఆర్ఎఫ్ సాధించిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. వీసీ ప్రొ.రవీందర్ సొంత నిర్ణయాలు పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తాయి. కాకతీయ వర్సిటీ తరహాలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పని చేసే అర్హత గల అసిస్టెంట్ ప్రొఫెసర్లకు గైడ్షిప్ ఇవ్వాలి. కొత్త విధానంతో పీహెచ్డీ ప్రవేశాలను చేపడితే అడ్డుకుంటాం. – కొర్ర శరత్నాయక్ పరిశోధనలు కుంటుపడతాయి ప్రైవేటు కాలేజీల్లో పీహెచ్డీ చదివితే హాస్టల్ వసతి, ఫెలోషిప్లకు అవకాశం ఉండదు. సంపాదించే వయస్సులో పీహెచ్డీ చేయడమే ఎక్కువ.. పరిశోధనలకు రూ.లక్షలు ఖర్చు చేయాలంటే పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు ఆర్థిక భారం అవుతుంది. గ్రామీణ ప్రాంతాలు, పేద కుటుంబాల విద్యార్థులకు సొంతంగా ఖర్చుపెట్టుకుని పీహెచ్డీ చదివే ఆర్థిక స్థోమత ఉండదు. ప్రైవేటు కాలేజీలకు పీహెచ్డీ అనుమతితో అధిక శాతం మంది పరిశోధనలు చేయలేరు. దీంతో పరిశోధనలు కుంటుపడతాయి. ఓయూలో 25 సంవత్సరాలుగా పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల్లో అర్హత గల వారికి గైడ్షిప్కు అవకాశం కల్పించాలి లేదా ఖాళీగా ఉన్న అధ్యాపక ఉద్యోగాలను భర్తీ చేయాలి. – బైరు నాగరాజుగౌడ్ ఓయూ విద్యార్థులపై టాస్క్ఫోర్స్ పోలీసుల దాడి పాత పద్ధతిలోనే పీహెచ్డీ ప్రవేశాలు కల్పించాలని ఆందోళన చేస్తున్న ఓయూ జేఏసీ నాయకులపై టాస్క్ఫోర్స్ పోలీసులు పిడిగుద్దుల వర్షం కురిపించారు. బుధవారం ఓయూ పాలన భవనం ప్రవేశ ద్వారం వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థులు వీసీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిపై టాస్క్ఫోర్స్ పోటీసులు విరుచుకుపడ్డారు. విద్యార్థులపై దాడి చేసి వారిని చెల్లాచెదురు చేశారు. టాస్క్ఫోర్స్ పోలీసుల దాడిలో నవ తెలంగాణ విద్యార్థి సంఘం (ఎన్టీవీఎస్) రాష్ట్ర అధ్యక్షులు బైరు నాగరాజుగౌడ్ సృహ తప్పి పడిపోగా అతడిని ఆసుపత్రికి తరలించారు. ధర్నాలో పాల్గొన్న 27 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి మలక్పేట పోలీస్ స్టేషన్కు తరలించారు. విద్యార్థుల పై టాస్క్ఫోర్స్ పోలీసుల దాడిని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. కొత్త విధానంతో విద్యార్థులు నష్టపోతారని పాత పద్ధతిలోనే పీహెచ్డీ ప్రవేశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. (క్లిక్: హైదరాబాద్ నగరం నలుచెరుగులా ఐటీ విస్తరణ) -
ఓయూ పరీక్షలు వాయిదా
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఇప్పటి వరకు జరుగుతున్న, జూలై 11న జరగనున్న పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ ఆదివారం తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా సీఎం కేసీఆర్ విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవు ప్రకటించినందున ఓయూలో జరగనున్న వివిధ కోర్సుల సెమిస్టర్ పరీక్షలతో పాటు పీజీ ఇంటర్నల్ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. తిరిగి పరీక్షలను నిర్వహించనున్న తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ తేదీలు, ఇతర వివరాలకు విద్యార్థులు రోజూ ఓయూ వెబ్సైట్ను చూడాలని ఆయన సూచించారు. -
‘ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా తప్పుడు సమాచారం’
ఉస్మానియా యూనివర్శిటీ: తప్పుడు సమాచారం ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా పరిణమించిందని హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ డేవిడ్ మోయర్ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా అందించిన సమాచారం అధారంగా ప్రజలు అభిప్రాయాలను ఏర్పాటు చేసుకుంటారు గనుక.... కలుషితం లేని వాస్తవిక సమాచారాన్ని ప్రజలకు అందించాలని జర్నలిస్టులకు పిలుపునిచ్చారు. తప్పుడు సమాచారం, నకిలీ వార్తల గుర్తింపు కోసం జర్నలిస్టులు వినియోగించాల్సిన సాంకేతిక పరిజ్ఞానంపై… యూఎస్ కాన్సులేట్ జనరల్, ఉస్మానియా జర్నలిజం విభాగం సంయుక్తంగా ఓయూ సీఎఫ్ఆర్డీ లో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో పాల్గొని డేవిడ్ మోయర్ ప్రసంగించారు. దురుద్దేశం లేకపోయినా... దురదృష్టవశాత్తు కొన్ని సార్లు చట్టబద్దమైన మీడియా సంస్థల నుంచే తప్పుడు సమాచారం వ్యాప్తి జరుగుతుందని అన్నారు. సమాచార సముద్రంలో ఈదుతున్న పాత్రికేయులు ఒక్కో సందర్భంలో అబద్ధానికి వాస్తవానికి వ్యత్యాసాన్ని గుర్తించలేకపోతున్నారని.... ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇలాంటి పరిస్థితిని కట్టడి చేసుకోవాలని హితవు పలికారు. ఇందుకోసం అందరం కష్టించి పనిచేయాలని చెప్పారు. తెలుగు రాష్ట్రాల జర్నలిస్టులకు తప్పుడు సమాచారాన్ని ఎదుర్కొనే నైపుణ్యాలను అందించేందుకు ముందుకు వచ్చిన ఉస్మానియా యూనివర్శిటీ జర్నలిజం విభాగాన్ని ఈ సందర్భంగా మోయర్ అభినందించారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవటం అత్యవసరమని ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. జర్నలిజంలో వస్తున్న ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని... ఇందుకు ఉస్మానియా జర్నలిజం విభాగం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ఇలాంటి సెషన్స్ ద్వారా బాధ్యతాయుతమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాచార వరద నుంచి వాస్తవాలను జల్లెడ పట్టడానికి క్లిష్టమైన ఆలోచనా పద్దతులను వర్తింపజేయాలని డేటాలీడ్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ సయ్యద్ నజాకత్ అన్నారు. టెక్నికల్ టూల్స్ పై అతిగా ఆధారపడటం కన్నా... పరిశీలనా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటం మంచిదని బూమ్ లైవ్ దక్షిణాది న్యూస్ ఎడిటర్ నివేదిత నిరంజన్ కుమార్ జర్నలిస్టులకు సూచించారు. తప్పుడు సమాచారం, అభిప్రాయం, హాస్యాలకు వ్యత్యాసం ఏమిటో గుర్తించాలని చెప్పారు. ఏదైనా సమాచారానికి సంబంధించి అది అబద్ధమా, లేదా సందర్భం మారిందా, వ్యంగమా గమనించాలని స్పష్టం చేశారు. కేవలం వైరల్ అయిన సమాచారానికి మాత్రమే కాకుండా ప్రతి చిన్న సమాచారానికి కూడా ఫ్యాక్ట్ చెక్ అవసరమని వివరించారు. ఓయూ సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ కె. నరెందర్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ కె. స్టీవెన్ సన్, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ జర్నలిస్టులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రముఖ జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి, ప్యాక్ట్ చెకర్ సత్యప్రియ రచించిన ఫ్యాక్ట్ చెకింగ్ పుస్తకాన్ని డేవిడ్ మోయర్తో కలిసి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ విడుదల చేశారు. -
భర్త ఆటో డ్రైవర్.. భార్యకు డాక్టరేట్
బంజారాహిల్స్ (హైదరాబాద్): భర్త ఆటో డ్రైవర్.. అయితేనేం అతని భార్య పట్టుదలతో డాక్టరేట్ సాధించారు. మహబూబ్నగర్ జిల్లా బొడ్డెమ్మ పాటలు, జనజీవన చిత్రన అనే అంశాన్ని పరిశోధనాంశంగా తీసుకుని తగిలి శ్యామల ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ సంపాదించారు. మహబూబ్నగర్ జిల్లా తెల్కపల్లి మండలం పెద్దూరు గ్రామానికి చెందిన శ్యామల బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని ఇందిరానగర్లో నివాసం ఉంటున్నారు. ఓయూ ఓరియంటల్ విభాగం తెలుగు శాఖ నుంచి డాక్టరేట్ పొందారు. శ్యామల ఆంధ్రసారస్వత పరిషత్లో డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. బతుకమ్మ వేడుకల్లో భాగంగా బొడ్డెమ్మ ఆటలో పాటలను ముందు తరాల వారికి లిఖితరూపకంగా అందించాలనుకున్నారు. బొడ్డెమ్మ పాటలను పరిశోధనాంశంగా తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. తన పీహెచ్డీ సిద్ధాంత గ్రంథానికి సహకరించిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తనకు పర్యవేక్షకులుగా వెంకట్రెడ్డి, సిల్మా నాయక్ సహకరించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా శ్యామల భర్త చెరుకు రాంచందర్ ఆటో నడుపుతూ తనను చదివించారని ఆయన కష్టాన్ని వృథా చేయకుండా ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధించినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. (క్లిక్: 80వ పుట్టినరోజు.. కేజీల విత్తనాలు) -
డిగ్రీ ఫీజు గడువుపై వీసీని ఒప్పించా: ఆర్. కృష్ణయ్య
ముషీరాబాద్: ఈ నెల 10న ముగిసిన డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును వర్సిటీ 14వ తేదీ సాయంత్రం వరకు పొడిగించినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఆ మేరకు అమెరికాలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ రవీందర్తో ఫోన్లో మాట్లాడి ఒప్పించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బడ్జెట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ట్యూషన్ ఫీజు, స్పెషల్ ఫీజులు కట్టే వరకు కాలేజీ యాజమాన్యాలు పరీక్ష ఫీజులు తీసుకోవడం లేదన్నారు. సర్దుబాటు చేసి కట్టేలోగా ఫీజు గడువు ముగిసిందని, దీంతో తమ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోందని వందలాది మంది విద్యార్థులు బీసీ భవన్కు వచ్చి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారని కృష్ణయ్య తెలిపారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, ఉస్మానియా వీసీలతో ఫోన్లో మాట్లాడి విద్యార్థులకు ఓ అవకాశం ఇవ్వాలని తాను కోరగా, వారు సానుకూలంగా స్పందించారన్నారు. రేపు హాల్టికెట్లు: రిజిస్ట్రార్ ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే బీఏ, బీకాం, బీఎ స్సీ, బీబీఏ, బీఎస్డబ్ల్యూ కోర్సుల రెగ్యులర్, బ్యాక్లాగ్ సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రూ.500 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించేందుకు నేడు(జూన్14) అవకాశం కల్పించినట్లు రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ తెలిపారు. విద్యార్థుల విజ్ఞప్తి మేర కు ఫీజు చెల్లింపు గడువును సడలిస్తూ ఒక్కరోజు అవకాశమిచ్చినట్లు చెప్పారు. బుధవా రం (15న) నుంచి హాల్టికెట్లు జారీ చేయనున్నట్లు చెప్పారు. -
ఓయూలో అడోబ్ పరిశోధనాకేంద్రం
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా క్యాంపస్లో అత్యాధునిక సమీకృత పరిశోధన, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రముఖ అంతర్జాతీయ సంస్థ అడోబ్ ముందుకొచ్చిందని ఉస్మానియా యూని వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ తెలిపారు. ఈ మేరకు ఆ సంస్థ సీఈవో, ఉస్మానియా పూర్వవిద్యార్థి శంతను నారాయణ్ హామీ ఇచ్చినట్టు చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న రవీందర్ అక్కడ ప్రవాస భారతీయులతో భేటీ అయ్యారు. ఈ వివరాలను శుక్రవారం ఆయన ‘సాక్షి’తో ఫోన్ ద్వారా పంచుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో శంతను నారాయణ్తో భేటీ అయినట్టు తెలిపారు. ఆర్టిఫీషి యల్ ఇంటెలిజెన్స్లో భాగంగా మెషిన్ లెర్నింగ్ సాంకేతికతతో విద్యార్థులు, పరిశోధకులకు ఉప యోగపడేలా ప్రతిపాదనలు రూపొందించాలని అడోబ్ సీఈవో కోరినట్టు తెలిపారు. శాన్ఫ్రాన్సి స్కోలో పలువురు పూర్వ విద్యార్థులను కలసి ఓయూ నిధుల సమీకరణపై చర్చించినట్టు చెప్పా రు. ఎంఐటీ, హార్వర్డ్ సహా ఇతర అమెరికన్ వర్సిటీలు ఆర్థిక సమీకరణ కోసం ఉపయోగించే ఎండోమెంట్లను అధ్యయనం చేయాలని, ఉస్మాని యాకు సైతం ఓ క్రమబద్ధమైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలని శంతను నారాయణ్ ప్రతి పాదించినట్టు రవీందర్ చెప్పారు. ఓయూ మరో పూర్వవిద్యార్థి, ప్రఖ్యాత అప్లైడ్ మెటీరియల్ శాస్త్ర వేత్త, అప్లైడ్ వెంచర్స్ ప్రెసిడెంట్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఓంకారం నలమాసతో కూడా చర్చించి నట్టు తెలిపారు. 21–పాయింట్స్ అజెండా, క్లస్టర్ సిస్టమ్, ఫ్యాకల్టీ పబ్లికేషన్లకు వీసీ అవార్డును ప్రవేశపెట్టడం, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు, సంక్రమిత త్రీడీ తయారీ కేంద్రం ఏర్పాటు సహా వివిధ సంస్కర ణల గురించి వివరించినట్టు చెప్పారు. సిలికాన్ వ్యాలీలో పన్నెండు మంది పూర్వ విద్యార్థులు, వివిధ కంపెనీల సీఈవోలతో భేటీ అయినట్టు చెప్పారు. ఓయూకు సహకరించేందుకు వారు సమ్మతిం చినట్టు తెలిపారు. -
14న చికాగోలో ఓయూ ఫౌండేషన్ డే
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని చికాగో నగరంలో ఈ నెల 14న ఉస్మానియా యూనివర్సిటీ ఫౌండేషన్ డే నిర్వహించనున్నట్లు అధికారులు ఆదివారం తెలిపారు. ఓయూ అలూమ్ని ఆఫ్ చికాగో ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి అమెరికా పర్యటనలో ఉన్న వీసీ ప్రొఫెసర్ రవీందర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు. శనివారం ఉత్తర అమెరికా ఉస్మానియా అలూమ్ని బోస్టన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీసీ రవీందర్ పాల్గొని 21 అంశాలతో ఓయూలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించినట్లు అధికారులు విడుదల చేసి ప్రకటనలో పేర్కొన్నారు. (క్లిక్: పంచతత్వ పార్కు.. ఆకర్షణ, ఆరోగ్యం దీని ప్రత్యేకత) -
ఓయూ ప్రైవేట్ కాలేజీల్లో పీహెచ్డీ కోర్సులు
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ ప్రైవేట్, అటానమస్ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి పీహెచ్డీ కోర్సులకు అనుమతి ఇవ్వనున్నారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం, జర్నలిజం, లైబ్రరీ సైన్స్, న్యాయశాస్త్రం, వ్యాయామ విద్య, ఎడ్యుకేషన్ తదితర కోర్సుల్లో పీహెచ్డీ ప్రవేశాలకు ఆయా కాలేజీల్లో రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇంత కాలం కేవలం ఓయూ కాలేజీలకే పరిమితమైన పీహెచ్డీ కోర్సు కొత్తగా ఏర్పాటు చేసిన రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటుతో ఇక నుంచి ప్రైవేట్, అటానమస్ కాలేజీల్లో కూడా కొనసాగనుంది. రీసెర్చ్ సెంటర్ల అనుమతికి ఆన్లైన్ దరఖాస్తులకు ఈనెల 10 వరకు అవకాశం కలి్పంచారు. యూనివర్సిటీలో అధ్యాపకుల కొరత వలన క్యాంపస్, అనుబంధ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో పీహెచ్డీ సీటు ఒక్కటి కూడా లేదు. దీంతో ఐదేళ్లుగా పీహెచ్డీ కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలు నిలిచిపోయాయి. వర్సిటీ అభివృద్ధికి చేపట్టిన పలు సంస్కరణల్లో భాగంగా పరిశోధన విద్యార్థుల సంఖ్యను పెంచి నాణ్యత ప్రమాణాలతో కూడిన పరిశోధనల కోసం పీహెచ్డీ ప్రవేశాలకు రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. గత నెలలో జరిగిన పాలక మండలి సమావేశంలో రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటుకు సభ్యుల ఆమోదం లభించినందున ప్రైవేట్, అటానమస్ కాలేజీల్లో కూడా పీహెచ్డీ కోర్సులకు అనుమతించాలని నిర్ణయించారు. ఓయూ పరిధిలో పలు పీజీ కోర్సులు నిర్వహిస్తున్న కాలేజీల్లో పరిశోధనలకు కావాల్సిన మౌలిక వసతులు, ప్రయోగశాలలు, గైడ్íÙప్ అర్హత గల ఇద్దరు అధ్యాపకులు ఉన్న కాలేజీలకు రీసెర్చ్ సెంటర్కు అనుమతి ఇవ్వనున్నారు. ఓయూ ద్వారానే పీహెచ్డీ ప్రవేశాలు, పరీక్షలు: రిజి్రస్టార్ రీసెర్చ్ సెంటర్లకు అనుమతి లభించిన ప్రైవేట్, అటానమస్ కాలేజీల్లో పీహెచ్డీ ప్రవేశాలతో పాటు ప్రీ పీహెచ్డీ పరీక్షలు, వైవా (సెమినార్) ఓయూ చేపడుతుందని రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ తెలిపారు. పీహెచ్డీలో ప్రవేశం పొందిన విద్యార్థి ఆయా ప్రైవేట్, అటానమస్ కాలేజీల అధ్యాపకుల పర్యవేక్షణలో పరిశోధనలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రవేశం పొందిన విద్యార్థులు పీహెచ్డీ ఫీజులు కూడా ప్రైవేట్, అటానమస్ కాలేజీలకు చెల్లించాలని సూచించారు. ప్రైవేట్, అటానమస్ కాలేజీల్లో పీహెచ్డీ చేసే విద్యార్థులకు ఓయూ క్యాంపస్లో హాస్టల్ వసతి ఉండదని లక్ష్మీనారాయణ స్పష్టంచేశారు. -
కోఠి మహిళా కళాశాల అధ్యాపకుడి అరాచకాలు.. ఫొటోలు మార్ఫింగ్ చేసి..
సాక్షి, కరీంనగర్: సోషల్ మీడియాలో ప్రేమ పేరుతో యువతిని, ఆమె కుటుంబ సభ్యులను తీవ్రంగా వేధిస్తోన్న యువకుడిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కోటి ఉమెన్స్ కళాశాలలో సంస్కృత అధ్యాపకుడిగా పనిచేస్తోన్న ఆదిత్య భరద్వాజ్, కరీంనగర్లోని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి కుమార్తె ఉస్మానియా యూనివర్సిటీలో 2019 నుంచి 2021 వరకు పీజీ కలిసి చదువుకున్నారు. కొద్దిరోజుల స్నేహం తర్వాత యువతిని ప్రేమిస్తున్నానని తెలుపగా ఆమె నిరాకరించింది. అప్పటి నుంచి కక్ష పెంచుకున్న భరద్వాజ్ యువతిని, ఆమె కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టాడు. స్నేహంగా ఉన్న రోజుల్లో యువతి కుటుంబ సభ్యులతో తీయించుకున్న పాత ఫొటోలను మార్ఫింగ్ చేసి వేధించసాగాడు. వీలైన ప్రతి చోటా ఆన్లైన్లో యువతికి, కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవాడు. పెళ్లి చేసుకోకుంటే యాసిడ్పోస్తానని బెదిరింపులకు గురిచేసేవాడు. తెలంగాణ మోడల్ స్కూల్ గంగాధర సోషల్ మీడియా అకౌంట్ను ట్యాగ్ చేస్తూ ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టేవాడు. అతడి వేధింపులు భరించలేని యువతి ఈ నెల 10న గంగాధర పోలీసులకు ఫిర్యాదు చేసింది. లోతుగా విచారించిన పోలీసులు ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. భరద్వాజ్ కదలికలపై దృష్టి పెట్టారు. వనపర్తిలోని ఓ ఫంక్షన్కు వెళ్లగా అక్కడే అరెస్టు చేశారు. వేములవాడ కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. పోలీసులు అరెస్టు చేయగా కొందరు వీడియో తీసినవి సోషల్ మీడియాలో రావడంతో కిడ్నాప్ అంటూ వార్తలు వచ్చా యి. దీనిపై వనపర్తిలోని ఒక పోలీసు అధికారి కిడ్నాప్ కాదు ఓ కేసులో అరెస్టు చేసినట్లు వివరించారు. చదవండి: Crime News: ఆమెకు పెళ్ళైంది కానీ.. -
విద్యార్థిగా చేరి.. నాయకుడిగా వెళ్లండి
సాక్షి, హైదరాబాద్: వినూత్న ఆలోచనలతో, ఆధునిక సంస్కరణలతో ఉస్మానియా యూనివర్సిటీ కీర్తిప్రతిష్టలను పెంచేందుకు కృషి చేస్తున్నామని ఓయూ ఉప కులపతి దండెబోయిన రవీందర్ అన్నారు. సంస్కరణలు, పనితీరు, రూపాంతరం అనే నినాదంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. విశ్వవిద్యాలయ చరిత్రలో తొలిసారిగా క్లస్టర్ విధానాన్ని తీసుకొచ్చి నిజాం కాలేజీ, విశ్వవిద్యాలయ మహిళా కళాశాల సహా 9 కళాశాలలను ఎంపిక చేసి ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఓయూ వీసీగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన నేపథ్యంలో రవీందర్ శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఓయూ పురోగతిని ఆయన వివరించారు. ఆయన చెప్పిందేంటంటే... సివిల్ సర్వీస్ అకాడమీ.. ♦హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశాం. దీనివల్ల ఉద్యోగాల కల్పన తేలికవుతుంది. కంపెనీలకు అనుగుణమైన నైపుణ్యాలను విద్యార్థులకు తర్ఫీదునిచ్చే అవకాశం ఏర్పడింది. అంతర్జాతీయ విద్యా అవకాశాలపట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం సహా ఉద్యోగ అవకాశాల సమాచారాన్ని అందించేందుకు ఈ కేంద్రం పనిచేస్తోంది. ♦పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు సివిల్ సర్వీసెస్ అకాడమీ ఏర్పాటు చేశాం. విద్యార్థిగా ఓయూలో చేరి నాయకత్వ లక్షణాలతో బయటకు వెళ్లాలన్నదే ఈ అకాడమీ లక్ష్యం. విద్యార్థి సమన్వయ కేంద్రం, గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు సత్ఫలితాలనిస్తుంది. ♦సెమినార్లు, సమావేశాలు, చర్చాగోష్టులు, ప్రదర్శనలు సహా ఇతర ప్రజాస్వామ్య పద్ధతిలో విద్యార్థులు కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా స్టూడెంట్ డిస్కోర్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. క్యాంపస్లో రాజకీయ కార్యకలాపాలకు అవకాశం లేకుండా వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులోనూ ఇది అమలులో ఉంటుంది. విద్యార్థులకు యునీక్ ఐడీ.. ♦సెంటినరీ హాస్టల్ విద్యార్థులకు యునీక్ ఐడెంటిటీ సంఖ్యను కేటాయించి ప్రతి ఒక్కరికీ వైఫై సౌకర్యం అందుబాటులోకి తెచ్చాం. సెంటినరీ హాస్టల్ బిల్డింగ్ చుట్టూ 120 సీసీ కెమెరాలు అమర్చి విద్యార్థుల రక్షణకు పెద్దపీట వేశాం. క్యాంపస్లో ప్రశాంత వాతావరణం కల్పించి శాంతిభద్రతలను కట్టుదిట్టం చేసే బాధ్యతను విశ్రాంత ఆర్మీ ఉద్యోగులకు అప్పగించాం. ♦రూ. 11 కోట్లతో 300 మంది నిజాం కళాశాల విద్యార్థినుల కోసం నూతన హాస్టల్ భవనాన్ని నిర్మించాం. రూ.26 కోట్లతో 500 మంది బాలుర కోసం నిర్మించిన హాస్టల్ భవనాన్ని విద్యార్థినుల కోసం కేటాయించాం. మరిన్ని బాలికల నూతన హాస్టల్ భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. విద్యార్థినులకు ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభించాం. ♦క్యాంపస్లోని ఓయూ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్లోనే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండో పసిఫిక్ స్టడీస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. సోషల్ సైన్సెస్లో పరిశోధనలకు ఊతమిచ్చేలా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రీసెర్చ్ సెంటర్, సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ కేంద్రాలు నెలకొల్పాం. ♦‘ఆరోగ్యం, సౌందర్య సాధనాలలో సహజ పదార్థాల వాడకం’ హైబ్రిడ్ మాస్టర్ ప్రోగ్రామ్ను నిర్వహించడానికి ఫ్రాన్స్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ బోర్డియాక్స్తో ఎంఓయూ కుదుర్చుకున్నాం. వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో నేషనల్ సెంటర్ ఫర్ ఆడిటివ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకున్నాం. -
తెలంగాణ విద్య, ఉద్యోగ సమాచారం
ఓయూ దూరవిద్య డిగ్రీ పరీక్షలు 18 నుంచి ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ దూరవిద్య బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల పరీక్షలు ఈ నెల 18 నుంచి వచ్చే నెల 17 వరకు జరగనున్నట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల టైంటేబుల్ వివరాలను ఉస్మానియా వెబ్సైట్లో చూడవచ్చన్నారు. గూప్స్పై రేపు 21వ సెంచరీ అవగాహన సదస్సు సాక్షి, హైదరాబాద్: గ్రూప్స్కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఆదివారం ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణప్రదీప్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8న ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ అశోక్నగర్లోని తమ అకాడమీలో ఈ కార్యక్రమం ఉంటుందని, సిలబస్, ప్రిపరేషన్, వ్యూహాలు, నోట్స్ తయారీ, సమయపాలన వంటి అంశాలపై నిష్ణాతులైన అధ్యాపకులు అవగాహన కల్పిస్తారని వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు 9133237733 లో సంప్రదించవచ్చని సూచించారు. పీజీ సెమిస్టర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఈ నెల 10నుంచి ప్రారంభంకానున్న వివిధ రెగ్యులర్ పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు అడిషనల్ కంట్రోలర్ ప్రొ.అంజయ్య శుక్రవారం పేర్కొన్నారు. ఎం.ఎ, ఎం.కాం, ఎమ్మెస్సీ, ఇతర పీజీ కోర్సులు చదివే ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు నేటి నుంచి ఆయా కాలేజీల్లో హాల్ టిక్కెట్లను పొందవచ్చన్నారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్సైట్లో చూడవచ్చని తెలిపారు. జూలై 23న డీసెట్ సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి జూలై 23న ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు డీసెట్ కన్వీనర్ శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ ద్వారా ఈ నెల 9 నుంచి జూన్ 30 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు డీసెట్ వెబ్సైట్కు లాగిన్ కావాలని సూచించారు. ‘మనూ’లో యూజీ కోర్సుల దరఖాస్తు 22 వరకు గచ్చిబౌలి: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ (మనూ)లో అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) కోర్సులకు దరఖాస్తు చేసుకునే గడువు తేదీని పెంచారు. శుక్రవారంతో ముగియనున్న గడువు తేదీని మే 22 వరకు పెంచారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) ద్వారా అన్ని సెంట్రల్ యూనివర్సిటీలకు కలిపి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రకారం ఆన్లైన్ ద్వారానే దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు దారులు సీయూఈటీ వెబ్సైట్ను పరిశీలించి దరఖాస్తులు పంపించాలి. దరఖాస్తులు ఉర్దూ యూనివర్సిటీ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటాయి. కాగా, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో ఆన్లైన్ అడ్మిషన్స్ రెగ్యులర్ మోడ్ కింద ఎంట్రన్స్ ఆధారంగా సీట్లు కేటాయించే కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 1 చివరి తేదీగా ప్రకటించారు. అలాగే మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించే వాటికి దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 30 చివరి తేదీగా పేర్కొన్నారు. దరఖాస్తులు యూనివర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయన్నారు. సింగరేణిలో గిరిజన బ్యాక్లాగ్ పోస్టుల ఫలితాలు సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో 665 గిరిజన బ్యాక్లాగ్ పోస్టుల పరీక్షాఫలితాలను యాజమాన్యం విడుదల చేసింది. 2017 జూలైలో నోటిఫికేషన్ జారీ చేసిన ఈ పోస్టులకు 60 వేల మందికి పైగా దర ఖాస్తు చేసుకున్నారు. 2018 జూన్ 10న నిర్వహించిన పరీక్షలో 27,279 మంది అభ్యర్థులు హాజర య్యారు. అన్ని విధాలుగా అర్హులైన 665 మందికి నెలరోజుల్లోగా నియామక ఉత్తర్వులు అందజేస్తామని సింగరేణి డైరెక్టర్ ఎన్.బలరామ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని యాజమాన్యం భావించినప్పటికీ కోర్టు కేసుల కారణంగా జాప్యం జరిగిందన్నారు. గిరిజనులకు ఉద్యోగాలు కల్పించాలన్న సంకల్పంతో కేసుల పరిష్కారానికి యాజమాన్యం కృషి చేయడం హర్షణీయమని పలువురు పేర్కొన్నారు. మే 7న బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీ సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల వెబ్ కౌన్సెలింగ్కు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దంత కళాశాలల్లో బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు ఇప్పటికే మూడు విడతల కౌన్సెలింగ్ పూర్తయిందని తెలిపింది. కన్వీనర్ కోటాలో ఇంకా మిగిలిపోయిన ఖాళీలను ఈ అడిషనల్ మాప్ అప్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నామని వెల్లడించింది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అదే రోజు రాత్రి 8 గంటల వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చునని సూచించింది. గత విడత కౌన్సెలింగ్లో సీట్ పొంది చేరకపోయినా, చేరి మధ్యలో మానేసినా, అల్ ఇండియా కోటాలో ఇప్పటికే సీటు పొందిన అభ్యర్థులూ ఈ కౌన్సెలింగ్కు అనర్హులని స్పష్టం చేసింది. -
7న ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్/ ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి రాహుల్ గాంధీ టూర్ టెన్షన్ పట్టుకుంది. రాహుల్గాంధీని ఎట్టి పరిస్థితుల్లో ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకెళ్లాలనే పట్టుదలతో ఉన్న నేతలు.. హైకోర్టును ఆశ్రయిం చినప్పటికీ ఊరట లభించలేదు. తొలుత.. రాహుల్గాంధీ ఓయూ సందర్శనకు అనుమతి ఇవ్వాల్సిందిగా వీసీని కోర్టు ఆదేశించిందంటూ వచ్చిన వార్తలతో సంబరపడిన నేతలు.. ఆ తర్వాత పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసిందని తేలడంతో నిరాశలో మునిగిపోయారు. రాహుల్ సందర్శనను అనుమతిం చాల్సిందిగా ఓయూ వీసీని ఆదేశించలేమని హైకోర్టు చెప్పడం, రాహుల్ టూర్ దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. ఏడో తేదీన రాహుల్ షెడ్యూల్పై మల్లగుల్లాలు పడుతోంది. మరోమారు వీసీని కలిసి విజ్ఞప్తి చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ వర్గాలున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ను ఓయూ కు తీసుకెళ్లాలా వద్దా అన్న అంశంపై గురువారం తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు మార్పులతో గురువారం నాడే పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ప్రస్తుతమున్న షెడ్యూల్ ప్రకారం ఈనెల 6న వరంగల్ రైతు సంఘర్షణ సభలో పాల్గొననున్న రాహుల్ ఏడో తేదీన ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్లో పర్యటిస్తారు. ముందుగా పలువురు ప్రముఖులు, అమరవీరుల కుటుం బాలతో సమావేశం కానున్నారు. తర్వాత గాంధీభవన్కు వచ్చి పార్టీ నేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత ఉస్మానియాకు వెళ్తారని, లేదంటే నేరుగా చంచల్గూడ జైలుకు వెళ్లి ఎన్ఎస్యూఐ నాయకులతో ములాఖత్ అవుతారని తెలుస్తోంది. చలో ప్రగతి భవన్ను అడ్డుకున్న పోలీసులు రాహుల్ ఓయూ సందర్శనకు మంగళవారం వరకు అనుమతి రాకపోవడం, వీసీ, గవర్నర్లు అందుబాటులో లేని నేపథ్యంలో బుధవారం చలో ప్రగతి భవన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు సాయంత్రం ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేతృత్వంలో ఓయూ విద్యార్థి సంఘాల నేతలు, ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్ నుంచి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జగ్గారెడ్డి బృందం గాంధీభవన్ ప్రాంగణంలోనే నిరసనకు దిగింది. తమను అనుమతించేంతవరకు అక్కడే ఉంటామని చెప్పి లోపల బైఠాయించారు. ఈ సమయంలో కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినట్టు సమాచారం రావడంతో ఆందోళన విరమించుకున్నారు. అనంతరం ఓయూ విద్యార్థి నాయకులతో కలిసి జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాహుల్ను ఓయూకి అనుమతించకుండా ఇబ్బంది పెట్టడం ద్వారా తెలంగాణ ఇచ్చిన సోనియా కుటుంబం పట్ల కేసీఆర్కు కృతజ్ఞతాభావం లేదని అర్థమయిందని చెప్పారు. ఓయూలో కొనసాగుతున్న ఆందోళనలు రాహుల్ సందర్శనకు అనుమతి ఇవ్వాలంటూ ఓయూలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ ఫ్రంట్ చైర్మ న్ చనగాని దయాకర్గౌడ్, ఎన్టీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు బైరు నాగరాజు ఆధ్వర్యంలో చేపట్టిన మహార్యాలీని పోలీసులు అడ్డుకోవడం ఉద్రికత్తకు దారి తీసింది. మరోవైపు వామపక్ష విద్యార్థి నేతలు ఆర్ఎన్ శంకర్, రవినాయక్, నాగేశ్వర్రావు, శరత్నాయక్, స్వాతిలను పోలీసులు అరెస్ట్ చేసి ఓయూ పీఎస్కు తరలించారు. ఓయూలో ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదని సీఐ రమేష్నాయక్ చెప్పారు. -
Rahul Gandhi: హైకోర్టులో కాంగ్రెస్కు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ముఖాముఖి కార్యక్రమానికి అనుమతి విషయంలో తాము జోక్యం చేసుకోలేమని, నిర్ణయం తీసుకోవాల్సింది వైస్ చాన్స్లరేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఉస్మానియా రిజిస్ట్రార్.. రాహుల్ పర్యటనకు అనుమతి నిరాకరించడంపై మానవతారాయ్ సహా మరో ముగ్గురు లంచ్ మోషన్ను పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విజయ్సేన్రెడ్డి విచారణ చేపట్టారు. రాజకీయ పార్టీలు, మతపరమైన కార్యక్రమాలు, సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వరాదని 2021లో వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం తీర్మానం చేసిందని, దీని ప్రకారం రాహుల్గాంధీ నిర్వహించే రాజ కీయ కార్యక్రమానికి అనుమతి సాధ్యం కాదని యూనివర్సిటీ రిజిస్ట్రార్ తరఫు న్యాయవాది వాదించారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీర్మానాన్ని పిటిషనర్లు సవాల్ చేయలేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఆ తీర్మానానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేయడానికి వీల్లేదని చెప్పారు. రాహుల్గాంధీతో ముఖాముఖి కార్యక్రమానికి అనుమతి కోరుతూ పిటిషన్లు దాఖలు చేసిన వారెవ్వరూ వర్సిటీలో చదివే రెగ్యులర్ విద్యార్థులు కాదన్నారు. ఇలాంటి వాళ్లు కోరే సమావేశానికి అనుమతిస్తే బయట వ్యక్తులు కూడా ముఖాముఖికి హాజరయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. అంతేకాకుండా సిబ్బంది ఎన్నికలు కూడా జరగనున్నాయని చెప్పారు. పిటిషనర్లు నిర్వహిస్తామని చెబుతున్న ఠాగూర్ ఆడిటోరియానికి, ఎంబీఏ పరీక్షలు నిర్వహించే కేంద్రాలకు కేవలం రెండు కిలోమీటర్లలోపే దూరమని, పిటిషన్ను అనుమతిస్తే దాని ప్రభావం పరీక్షలు రాసే విద్యార్థులపై ప్రతికూలంగా పడే అవకాశం ఉంటుందన్నారు. రాహుల్గాంధీతో విద్యార్థుల ముఖాముఖీకి అనుమతి ఇవ్వాలన్న పిటిషన్ను కొట్టేయాలని కోరారు. అనంతరం ఈ అభ్యంతరాలపై పిటిషనర్ల తరుఫు అడ్వొకేట్లు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ, ఎమ్మెస్సీ, ఎంకాం పరీక్షలు నడుస్తున్నాయని.. రాహుల్ పర్యటనతో శాంతిభద్రతల సమస్యలు వస్తాయన్న వీసీ స్టాండింగ్ కౌన్సిల్ వాదనలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చిచెబుతూ పిటిషన్ను కొట్టివేసింది. అయితే దీనిపై రిట్ పిటిషన్ దాఖలు చేయవచ్చని చెప్పారు.