-
హెచ్సీఎల్ టెక్ లాభం 2,925 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) తొలి త్రైమాసిక కాలంలో 32 శాతం ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం (2019–20) క్యూ1లో రూ.2,220 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.2,925 కోట్లకు పెరిగిందని హెచ్సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది. ఆదాయం రూ.16,425 కోట్ల నుంచి 9 శాతం వృద్ధితో రూ.17,841 కోట్లకు పెరిగిందని పేర్కొంది. సీక్వెన్షియల్గా చూస్తే, మాత్రం 4 శాతం క్షీణించిందని పేర్కొంది. పటిష్టమైన డీల్స్ సాధించామని రానున్న క్వార్టర్లలో మంచి వృద్ధినే సాధించగలమన్న ధీమాను వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులకు ఎలాంటి వేతన పెంపు లేదని స్పష్టం చేసింది. ఒక్కో ఈక్విటీ షేర్కు రూ.2 డివిడెండ్ ప్రకటించింది. మరిన్ని వివరాలు... ► స్థిర కరెన్సీ ధరల్లో కంపెనీ ఆదాయం క్యూ1లో 1 శాతం మేర వృద్ధి చెందింది. ► రానున్న మూడు క్వార్టర్లలో ఒక్కో క్వార్టర్కు 1.5–2.5 శాతం మేర వృద్ధి సాధిస్తామని కంపెనీ అంచనా వేస్తోంది. ► మార్చి క్వార్టర్తో పోల్చితే డీల్స్ 40 శాతం పెరిగాయి. ► ఈ క్యూ1లో స్థూలంగా 7,005 ఉద్యోగాలిచ్చింది. జూన్ క్వార్టర్ చివరి నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,50,287కు పెరిగింది. మొత్తం ఉద్యోగుల్లో 96 శాతం మంది ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నారు. ఆట్రీషన్ రేటు (ఉద్యోగుల వలస)14.6 శాతంగా ఉంది. ఆర్థిక ఫలితాలు ప్రకటించిన తర్వాత హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్ 3 శాతం లాభంతో రూ.644కు ఎగసింది. చివర్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 1 శాతం నష్టంతో రూ.623 వద్ద ముగిసింది. ఇప్పటి నుంచి అంతా సానుకూల వృద్ధే.... ప్రపంచమంతా తీవ్రమైన ఆరోగ్య సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో ఈ ఆర్థిక సంవత్సరాన్ని ఆరంభించాం. ఈ క్యూ1లో అంచనాలకనుగుణంగానే ఓ మోస్తరు వృద్ధి మాత్రమే సాధింగలిగాం. అధ్వాన పరిస్థితులను అధిగమించాం. ఇక ఇప్పటి నుంచి అంతా సానుకూల వృద్ధే. హెచ్1 బీ వీసాలపై నిషేధం దురదృష్టకరం. అయితే ఈ ప్రభావం మా కంపెనీపై పెద్దగా ఉండదు. అమెరికాలో 67 శాతం మంది ఉద్యోగులు అక్కడి స్థానికులే. –విజయకుమార్, ప్రెసిడెంట్, సీఈఓ, హెచ్సీఎల్ టెక్ -
ఇన్ఫోసిస్ లాభం 4,335 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం, ఇన్ఫోసిస్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో 6 శాతం పెరిగింది. కరోనా వైరస్ కల్లోలం కారణంగా వ్యాపార అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2020–21) ఆదాయ, మార్జిన్ల అంచనాలను వెల్లడించడం లేదని ఇన్ఫోసిస్ పేర్కొంది. పరిస్థితులు మెరుగుపడ్డాక ఈ అంచనాలను వెల్లడిస్తామని వివరించింది. కాగా గత ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అంచనాలను ఈ కంపెనీ అందుకోలేకపోయింది. ఇక ఒక్కో ఈక్విటీ షేర్కు రూ.9.50 తుది డివిడెండ్ను ప్రకటించింది. మరిన్ని వివరాలు... ► అంతకుముందటి ఆర్థిక సంవత్సరం(2018–19) క్యూ4లో రూ.4,078 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2019–20) క్యూ4లో రూ.4,335 కోట్లకు పెరిగింది. అయితే గత క్యూ3 నికర లాభంతో పోల్చితే 3 శాతం క్షీణత నమోదైంది. ఇతర ఆదాయం 26 శాతం తగ్గడం, అంతకు ముందటి క్వార్టర్లో పన్ను రాయితీలు లభించడంతో నికర లాభం ఈ క్యూ4లో ఈ స్థాయికే పరిమితమైంది. ► ఆదాయం రూ.21,539 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.23,267 కోట్లకు చేరింది. ► డాలర్ల పరంగా చూస్తే, గత క్యూ4లో (సీక్వెన్షియల్గా)నికర లాభం 6 శాతం తగ్గి 59 కోట్ల డాలర్లకు, ఆదాయం 1.4 శాతం తగ్గి 320 కోట్ల డాలర్లకు తగ్గింది. ► గత క్యూ4లో 165 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంది. దీంతో మొత్తం డీల్స్ విలువ పూర్తి ఆర్థిక సంవత్సరానికి 900 కోట్ల డాలర్లకు చేరాయి. ► ఇక పూర్తి ఏడాది పరంగా చూస్తే, 2019–20లో నికర లాభం 8% వృద్ధితో రూ.16,639 కోట్లకు, ఆదాయం 9.8 శాతం పెరిగి రూ.90,791 కోట్లకు చేరాయి. ఆదాయం 10–10.5% రేంజ్లో పెరగగలదన్న అంచనాలను కంపెనీ అందుకోలేకపోయింది. ► ఈ ఏడాది మార్చి చివరికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.27,276 కోట్లుగా ఉన్నాయి. ఎలాంటి రుణ భారం లేదు. ► ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,42,371కు చేరింది. గత క్యూ4లో ఉద్యోగుల వలస(అట్రిషన్ రేటు) 21 శాతంగా ఉంది. ► ప్రపంచవ్యాప్తంగా కొంతమంది ఉద్యోగులకు కరోనా వైరస్ సోకిందని ఇన్ఫోసిస్ తెలిపింది. వారు కోలుకోవడానికి తగిన తోడ్పాటునందిస్తామని పేర్కొంది. జాబ్ ఆఫర్లు ఇచ్చిన వారందరికీ కొలువులు ఇస్తామని భరోసా ఇచ్చింది. అయితే, వేతనాల పెంపు, అలాగే ప్రమోషన్లు కూడా ఉండవని తెలిపింది. ► మార్కెట్ ముగిసిన తర్వాత కంపెనీ ఫలితాలను వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఇన్ఫోసిస్ షేర్ 3.7 శాతం లాభంతో రూ.653 వద్ద ముగిసింది. కాగా అమెరికా స్టాక్ మార్కెట్లో లిస్టైన ఇన్ఫోసిస్ ఏడీఆర్ మాత్రం 1 శాతం లాభంతో 8.68 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సమస్యల నుంచి గట్టెక్కుతాం... గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 10 శాతం వృద్ధి, 21.3 శాతం నిర్వహణ లాభ మార్జిన్ సాధించాం. సమీప భవిష్యత్తులో మా వ్యాపారంపై ప్రభావం ఉంటుంది. రికవరీ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేం. నాణ్యమైన సేవలందించగలగడం, పుష్కలంగా నిధుల దన్నుతో సమస్యలను అధిగమించగలం. –సలిల్ పరేఖ్, సీఈఓ, ఎమ్డీ, ఇన్ఫోసిస్ ఫలితాలు సంతృప్తికరం... వివిధ విభాగాల్లో, దేశాల్లో మంచి వృద్ధిని సాధించాం. భారీ డీల్స్ పెరిగాయి. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరం సంతృప్తికరమైన ఫలితాలిచ్చింది. –ప్రవీణ్ రావ్, సీఓఓ, ఇన్ఫోసిస్ -
టీసీఎస్ లాభం 8,049 కోట్లు
ముంబై: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.8,049 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్)సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ4లో ఆర్జించిన నికర లాభం (రూ.8,126 కోట్లు)తో పోల్చి తే 1 శాతం మేర తగ్గిందని టీసీఎస్ తెలిపింది. ఆదాయం మాత్రం రూ.38,010 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ.39,946 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, నికర లాభం 3 శాతం వృద్ధితో రూ.32,340 కోట్లకు, ఆదాయం 7 శాతం ఎగసి రూ.1,56,949 కోట్లకు పెరిగాయి. ఒక్కో ఈక్విటీ షేర్కు రూ.6 తుది డివిడెండ్ను(600 శాతం) ప్రకటించింది. మరిన్ని వివరాలు... ► ఇతర ఆదాయం తక్కువగా రావడం, అధిక వడ్డీ వ్యయాలు, లాక్డౌన్ విధింపు(దేశీయంగా, అంతర్జాతీయంగా) లాభదాయకతపై ప్రభావం చూపాయి. ► డాలర్ల పరంగా చూస్తే, ఆదాయం 3 శాతం తగ్గి 544 కోట్ల డాలర్లకు తగ్గింది. స్థిర కరెన్సీ పరంగా చూస్తే, ఆదాయం 3 శాతం పెరిగింది. ఆదాయం అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో 13 శాతం, గత క్యూ3లో 7 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ► గత క్యూ4లో ఎబిట్ అర శాతం వృద్ధితో (సీక్వెన్షియల్గా) రూ.10,025 కోట్లకు పెరిగింది. మార్జిన్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 25.1 శాతానికి చేరింది. ► పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2019–20) ఎబిట్ 3 శాతం వృద్ధితో రూ.38,580 కోట్లకు పెరగ్గా, మార్జిన్ మాత్రం 1 శాతం మేర తగ్గి 24.58 శాతానికి చేరింది. ► గత క్యూ4లో మొత్తం 1,789 మందికి ఉద్యోగాలిచ్చింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి 24,179 మందికి కొలువులిచ్చింది. దీంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,48,464కు పెరిగింది. ఉద్యోగుల వలస (అట్రిషన్ రేటు) 12.1 శాతంగా ఉంది. ► గత ఆర్థిక సంవత్సరంలో నికరంగా రూ.37,702 కోట్ల మేర డివిడెండ్లు చెల్లించింది. ఈ మార్చి క్వార్టర్లో ఒక్కో షేర్కు రూ. 12 మధ్యంతర డివిడెండ్ను ఇచ్చింది. తాజాగా ప్రకటించిన రూ.6 తుది డివిడెండ్ను కూడా కలుపుకుంటే, ఈ మార్చి క్వార్టర్లో కంపెనీ మొత్తం డివిడెండ్ ఒక్కో షేర్కు రూ.18కు పెరుగుతుంది. మార్కెట్ ముగిసిన తర్వాత టీసీఎస్ ఫలితాలు వచ్చాయి. ఫలితాలపై అనిశ్చితితో బీఎస్ఈలో టీసీఎస్ షేర్ 1 శాతం నష్టంతో రూ. 1,715 వద్ద ముగిసింది. ఉద్యోగాల కోత ఉండదు.. కరోనా ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఉద్యోగాల్లో కోత విధించే యోచనేదీ లేదని టీసీఎస్ ఎండీ రాజేశ్ గోపీనాథన్ వెల్లడించారు. అయితే, ఈ ఏడాది జీతాల పెంపు మాత్రం ఉండదని తెలిపారు. మరోవైపు, ముందుగా ఆఫర్లు ఇచ్చిన సుమారు 40,000 మందిని రిక్రూట్ చేసుకుంటామని స్పష్టం చేశారు. కరోనా కాటేసింది.... మార్చి క్వార్టర్ మొదట్లో చాలా వ్యాపార విభాగాలు శుభారంభం చేశాయి. కానీ ఆ సానుకూలతలన్నింటినీ కరోనా మహమ్మారి ధ్వంసం చేసింది. గుడ్డిలో మెల్లలా కొన్ని భారీ డీల్స్ను సాధించగలిగాం. కంపెనీ చరిత్రలోనే అత్యధిక ఆర్డర్లను ఈ క్వార్టర్లోనే సాధించాం. –రాజేశ్ గోపీనాథన్, టీసీఎస్ సీఈఓ, ఎమ్డీ సంతృప్తికరంగానే సేవలు... కార్యకలాపాల నిర్వహణలో కరోనా వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ, క్లయింట్లకు సంతృప్తికరమైన స్థాయిల్లోనే ఐటీ సేవలందిస్తున్నాం. అత్యవసర సేవలే కాక, అన్ని విభాగాల సేవలను అందిస్తున్నాం. –ఎన్. గణపతి సుబ్రహ్మణ్యం, టీసీఎస్ సీఓఓ, ఈడీ -
అపోలో హాస్పిటల్స్ లాభం 80 శాతం అప్
న్యూఢిల్లీ: అపోలో హాస్పిటల్స్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం(2019–20) డిసెంబర్ క్వార్టర్లో 80% ఎగసింది. గతేడాది (2018–19) క్యూ3లో రూ.50 కోట్లుగా ఉన్న లాభం ఈ క్యూ3లో రూ.90 కోట్లకు పెరిగిందని అపోలో హాస్పిటల్స్తెలిపింది. అన్ని విభాగాలు మంచి పనితీరు కనబరచడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపనీ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు. కార్యకలాపాల ఆదాయం రూ.2,495 కోట్ల నుంచి రూ.2,912 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేర్కు రూ.3.25 డివిడెండ్ను ఇవ్వనున్నామని తెలిపారు. -
క్యూ3లో అదరగొట్టిన ఇన్ఫీ
సాక్షి, ముంబై : ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. 2019-20 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్ కాలం) అంచనాలనుకుమించి లాభాలను నమోదు చేసింది. క్యు3లో 24 శాతం ఎగిసి 4457 కోట్ల రూపాయల లాభాలను సాధించింది. అంతకుముందు త్రైమాసికంలో కంపెనీ 3,609 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించింది. 4200 కోట్ల రూపాయల లాభం రానుందని విశ్లేషకులు అంచనా వేశారు. గతేడాది క్యూ3తో పోలిస్తే లాభం 23.5 శాతం పుంజుకున్న లాభాలను నమోదు చేసిన ఇన్ఫోసిస్ ఆదాయంలోనూ వృద్ధిని సాధించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ రూ. 23092 కోట్లుగా ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే రెవెన్యూ 7.9 శాతం పెరిగింది. అయితే మార్జిన్లు మాత్రం అంచనాల కన్నా కాస్త తక్కువగా వచ్చాయి. దీంతో పాటు 2019-20 ఆర్థిక గైడెన్స్ను కంపెనీ పెంచింది. స్థిర కరెన్సీ రెవెన్యూ గ్రోత్ అంచనాలను 10-10.5 శాతంగా ప్రకటించింది. గతంలో ఈ గైడెన్స్ 9-10 శాతం మాత్రమే. లాభాల మార్జిన్లు 21- 23 శాతం ఉంటాయని తెలిపింది. మూడో త్రైమాసికంలో కంపెనీ 180 కోట్ల డాలర్ల భారీ ఒప్పందాలను గెలుచుకుంది. కొత్తగా 84 మంది క్లయింట్లు వచ్చారని తెలిపింది. ఈత్రైమాసికంలో మొత్తం పనితీరు సంతృప్తికరంగా ఉందనీ, బడాడీల్స్ను సాధించామని ఇన్ఫోసిస్ సీవోవో ప్రవీణరావు అన్నారు. డిజిటల్ పరివర్తన యుగం, క్లయింట్లతో తమ ప్రయాణంలో తాము స్థిరంగా ఉన్న సంగతిని క్యూ 3 ఫలితాలు నొక్కిచెప్పాయని ఇన్ఫీ సీఎండీ సలీల్ పరేఖ్ అన్నారు. ఆపరేటింగ్ మార్జిన్లు విస్తరించడంతో, రెండంకెల వృద్ధిలోకి వచ్చాయని, రెవెన్యూ గ్రోత్ అంచనాల పెంపునకు దారితీసిందని పేర్కొన్నారు. -
భెల్ లాభం 42 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్ సంస్థ, భెల్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) సెప్టెంబర్ క్వార్టర్లో 42 శాతం ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ2లో రూ.85 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ క్యూ2లో రూ.121 కోట్లకు పెరిగినట్లు భెల్ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.6,934 కోట్ల నుంచి రూ.6,360 కోట్లకు తగ్గింది. ఆరు నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ కంపెనీకి నష్టాలొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్– సెప్టెంబర్ కాలానికి రూ.125 కోట్ల నికర లాభం రాగా, ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.98 కోట్ల నికర నష్టాలు (కన్సాలిడేటెడ్) వచ్చాయని భెల్ తెలిపింది. మొత్తం ఆదాయం కూడా రూ.13,050 కోట్ల నుంచి రూ.11,033 కోట్లకు తగ్గిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో భెల్ షేర్ 4 శాతం నష్టంతో రూ.54.55 వద్ద ముగిసింది. -
సన్ ఫార్మా లాభం రూ.1,064 కోట్లు
న్యూఢిల్లీ: సన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ1,064 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.270 కోట్ల నికర నష్టాలు వచ్చాయని సన్ఫార్మా తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.6,938 కోట్ల నుంచి రూ.8,123 కోట్లకు ఎగసిందని పేర్కొంది. స్పెషాల్టీ వ్యాపారంలో పురోగతి...: వ్యయాల ఆదా, సామర్థ్యాల మెరుగుదలపై దృష్టి సారించడం కొనసాగిస్తున్నామని సన్ ఫార్మా ఎమ్డీ దిలీప్ సంఘ్వి పేర్కొన్నారు. మారుతున్న పరిశ్రమ తీరు తెన్నులకు అనుగుణంగా జనరిక్ వ్యాపారంలో కూడా మార్పులు, చేర్పులు చేస్తున్నామని వివరించారు. గ్లోబల్ స్పెషాల్టీ వ్యాపారంలో కూడా మంచి పురోగతి సాధిస్తున్నామన్నారు. 35% పెరిగిన భారత అమ్మకాలు.. భారత్ అమ్మకాలు 35% వృద్ధితో రూ.2,515 కోట్లకు చేరగా, అమెరికా విక్రయాల్లో పెద్దగా పురోగతి లేదన్నారు. వర్థమాన దేశాల్లో అమ్మకాలు 3% వృద్ధితో 20 కోట్ల డాలర్లకు, మిగిలిన దేశాల్లో విక్రయాలు 49% వృద్ధితో 16 కోట్ల డాలర్లకు పెరిగాయి. రూ.1,616 కోట్ల నిర్వహణ లాభం.... పరిశోధన, అభివృద్ధిపై ఈ క్యూ2లో రూ.488 కోట్లు పెట్టుబడులు పెట్టింది. ఇది అమ్మకాల్లో 6 శాతానికి సమానం. నిర్వహణ లాభం 22 శాతం వృద్ధితో రూ.1,616 కోట్లకు పెరిగింది. నిర్వహణ మార్జిన్ మాత్రం 21 శాతం నుంచి 20 శాతానికి తగ్గింది. నికర లాభం రూ.వెయ్యి కోట్లకు పైగా రావడంతో బీఎస్ఈలో సన్ ఫార్మా షేర్ 3 శాతం లాభంతో రూ.440 వద్ద ముగిసింది. -
రికార్డుల హోరు
స్టాక్ మార్కెట్లో రికార్డుల మోత మోగుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్లను నెలకొల్పింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన స్థాయి, 11,900 పాయింట్ల ఎగువకు ఎగబాకింది. కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాలు అంచనాలను మించి పోతుండటం, సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు....వీటన్నింటి ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా ఏడో ట్రేడింగ్ సెషన్లోనూ లాభాల్లోనే ముగిశాయి. మార్చి తర్వాత సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా ఇన్ని రోజులు లాభపడటం ఇదే మొదటిసారి. డాలర్తో రూపాయి మారకం విలువ 4 పైసలు పుంజుకొని 70.77 కు చేరడం సానుకూల ప్రభావం చూపించింది. అయితే సెన్సెక్స్ రికార్డ్ లాభాల కారణంగా పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ఇంట్రాడే లాభాలు తగ్గాయి. లోహ, టెలికం, ఐటీ షేర్లు లాభపడగా, వాహన షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. రికార్డ్ బ్రేక్... బీఎస్ఈ సెన్సెక్స్ 137 పాయింట్ల లాభంతో 40,302 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది సెన్సెక్స్కు జీవిత కాల గరిష్ట స్థాయి ముగింపు దీంతో ఈ ఏడాది జూన్ 3 నాటి ఆల్టైమ్ క్లోజింగ్ రికార్డ్, 40,268 పాయింట్ల రికార్డ్ బద్దలైంది. ఇక ఇంట్రాడేలో కూడా సెన్సెక్స్ జీవిత కాల గరిష్ట స్థాయి, 40,483 పాయింట్లను తాకింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 51 పాయింట్లు పెరిగి 11,941 పాయింట్ల వద్ద ముగిసింది. ఆల్టైమ్ హై (12,103 పాయింట్లు)కు 162 పాయింట్ల దూరంలో నిఫ్టీ ఉంది. లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్ రోజంతా అదే జోరు చూపించింది. లాభాల స్వీకరణ కారణంగా ఆరంభ లాభాలు ఆవిరైనా, చివరకు లాభాల్లోనే ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 318 పాయింట్లు, నిఫ్టీ 98 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. అన్నీ శుభ శకునములే... విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం, అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ రిస్క్లు తగ్గుముఖం పట్టటం, వృద్ధి జోరు పెంచడం లక్ష్యంగా మరిన్ని సంస్కరణలకు కేంద్రం తెరతీయనున్నదన్న వార్తలు... ఇవన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్కు జోష్నిస్తున్నాయి. ఈ నెలలో విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటిదాకా మన క్యాపిటల్ మార్కెట్లో రూ.16,464 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. విదేశీ ఇన్వెస్టర్లు నికర కొనుగోళ్లు జరపడం ఇది వరుసగా రెండో నెల. చైనా–అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారు దశకు రావడంతో ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు కూడా లాభాల్లోనే ముగిశాయి. ► అవకతవకలు చోటు చేసుకున్నాయనడానికి ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని కంపెనీ స్పష్టతనివ్వడంతో ఇన్ఫోసిస్ షేర్ 3 శాతం లాభంతో రూ.709 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా పెరిగిన షేర్ ఇదే. ► ఈ క్యూ2లో రూ.629 కోట్ల నికర నష్టాలు రావడంతో యెస్ బ్యాంక్ షేర్ ఇంట్రాడేలో 10 శాతం మేర పతనమై రూ.60ను తాకింది. ఆ తర్వాత రికవరీ అయి 0.75 శాతం నష్టంతో రూ.66 వద్ద ముగిసింది. ఒక దశలో ఈ షేర్ 8 శాతానికి పైగా లాభంతో రూ.71ను తాకడం విశేషం. ► సెన్సెక్స్తో పాటు పలు షేర్లు కూడా ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ హోల్డింగ్స్, అబాట్ ఇండియా, అదానీ గ్రీన్, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ బ్యాంక్, ఐనాక్స్ లీజర్, మణప్పురం ఫైనాన్స్, మెట్రోపొలిస్ హెల్త్కేర్, మిధాని, ఎమ్ఎస్టీసీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
మెప్పించిన ఇన్ఫీ!
న్యూఢిల్లీ/బెంగళూరు: దేశీయంగా రెండో అతి పెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్.. మార్కెట్ వర్గాల అంచనాలకు అనుగుణమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. శుక్రవారం వెల్లడైన గణాంకాల ప్రకారం నికర లాభం స్వల్పంగా 2.2 శాతం క్షీణించి రూ. 4,019 కోట్లుగా నమోదైంది. మార్కెట్ వర్గాలు ఇది సుమారు రూ. 4,040 కోట్లు ఉంటుందని అంచనా వేశాయి. గతేడాది ఇదే వ్యవధిలో లాభం రూ. 4,110 కోట్లు. మరోవైపు, రెండో త్రైమాసికంలో ఆదాయం 9.8% వృద్ధితో రూ. 20,609 కోట్ల నుంచి రూ. 22,629 కోట్లకు పెరిగింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన 11.4 శాతం వృద్ధి నమోదైంది. 2019–20 ఆర్థిక సంవత్సర ఆదాయ గైడెన్స్ను ఇన్ఫోసిస్ పెంచింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన 9–10 శాతానికి సవరించింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో రెవెన్యూ వృద్ధి 7.5–9.5 శాతంగా ఉండొచ్చంటూ గైడెన్స్ ఇచ్చిన ఇన్ఫోసిస్ తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో దీన్ని 8.5–10 శాతానికి పెంచింది. తాజాగా కనీస ఆదాయ వృద్ధి గైడెన్స్ను మరింత పెంచింది. సెప్టెంబర్ త్రైమాసికంలో షేరు ఒక్కింటికి రూ. 8 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. టీసీఎస్ లాభంలో స్వల్ప వృద్ధి సాధించగా, ఇన్ఫీ లాభాలు స్వల్పంగా తగ్గడం గమనార్హం. 2.8 బిలియన్ డాలర్ల డీల్స్.. మరో త్రైమాసికంలో అన్ని విభాగాల్లోనూ, ప్రాంతాలవారీగాను ఆల్ రౌండ్ వృద్ధి సాధించగలిగాం. క్లయింట్లకు మాపై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం. 2.8 బిలియన్ డాలర్ల విలువ చేసే డీల్స్ కుదుర్చుకోగలిగాం. ఉద్యోగులకు మరింత ప్రయోజనాలు చేకూర్చేందుకు తీసుకుంటున్న చర్యలతో అట్రిషన్ రేటును తగ్గించుకోగలిగాం‘. – ప్రవీణ్ రావు, సీవోవో బహుముఖ వృద్ధి.. నిర్వహణ మార్జిన్లు, సామర్ధ్యాలు, ఆదాయాలు, డిజిటల్ విభాగం మెరుగుపడటంతో పాటు భారీ డీల్స్ కుదుర్చుకోగలిగాం. ఆట్రిషన్ తగ్గింది. దీంతో అన్ని విభాగాల్లోనూ మెరుగైన పనితీరు సాధించగలిగాం. వాటాదారులకు మరింత విలువ చేకూర్చడంతో పాటు క్లయింట్లకు అవసరమైన సేవలపై మరింతగా దృష్టి పెట్టే దిశగా కంపెనీ పురోగతి సాధిస్తోందనడానికి ఇవన్నీ స్పష్టమైన సంకేతాలు’. – సలిల్ పరేఖ్, ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ 14% అదనంగా డివిడెండ్ నిర్వహణపరంగా అన్ని అంశాలను మెరుగుపర్చుకోవడంతో పాటు వ్యయాలు నియంత్రించుకోవడంతో రెడో త్రైమాసికంలో నిర్వహణ మార్జిన్లు పెంచుకోగలిగాం. నిధులను మెరుగ్గా వినియోగించుకునే∙దిశగా మధ్యంతర డివిడెండ్ను గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 14 శాతం పెంచగలిగాం’. – నీలాంజన్ రాయ్, సీఎఫ్ఓ మరిన్ని విశేషాలు.. ► సెప్టెంబర్ త్రైమాసికంలో డాలర్ మారకంలో నికర లాభం 569 మిలియన్ డాలర్లు కాగా ఆదా యం 3.21 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ► సీక్వెన్షియల్గా నికర లాభం 6 శాతం, ఆదాయం 3.8 శాతం పెరిగింది. ► డిజిటల్ విభాగం ఆదాయాలు 38.4 శాతం వృద్ధి చెంది 1.23 బిలియన్ డాలర్లకు చేరాయి. మొత్తం ఆదాయంలో ఈ విభాగం వాటా 38.3 శాతానికి చేరింది. ► 21–23 శాతం శ్రేణిలో ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్ యథాతథం. ► రూ. 8,260 కోట్ల విలువ చేసే షేర్ల బైబ్యాక్ కార్యక్రమం ఆగస్టు 26తో ముగిసింది. ► రెండో త్రైమాసికంలో నికరంగా 7,457 మంది నియామకాలు జరిగాయి. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.36 లక్షలకు చేరింది. ► ఆట్రిషన్ రేటు జూన్ ఆఖరు నాటికి 23.4 శాతంగా ఉండగా, సెప్టెంబర్ క్వార్టర్లో 21.7 శాతానికి తగ్గింది. స్టాక్ మార్కెట్ ముగిసిన తర్వాత ఇన్ఫోసిస్ ఫలితాలు వెల్లడయ్యాయి. బీఎస్ఈలో సంస్థ షేరు 4.19% పెరిగి రూ. 815.70 వద్ద ముగిసింది. -
ఇండస్ఇండ్ లాభం రూ.1,401 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఇండస్ఇండ్ బ్యాంక్ నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 52 శాతం ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ2లో రూ.920 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) క్యూ2లో రూ.1,401 కోట్లకు పెరిగిందని ఇండస్ఇండ్ బ్యాంక్ తెలిపింది. అయితే సీక్వెన్షియల్గా చూస్తే, నికర లాభం స్వల్పంగా తగ్గిందని బ్యాంక్ సీఈఓ రమేశ్ సోబ్తి చెప్పారు. కేటాయింపులు పెరగడం, నికర వడ్డీ మార్జిన్ తక్కువ వృద్ధిని నమోదు చేయడం దీనికి కారణాలని వివరించారు. మొత్తం ఆదాయం రూ.6,755 కోట్ల నుంచి రూ.8,878 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నికర వడ్డీ మార్జిన్ 4.1 శాతం నికర వడ్డీ ఆదాయం 32 శాతం వృద్ధితో రూ.2,909 కోట్లకు పెరిగిందని రమేశ్ సోబ్తి తెలిపారు. సీక్వెన్షియల్గా చూస్తే, నికర వడ్డీ మార్జిన్ మెరుగుపడి 4.1 శాతానికి ఎగసిందని వివరించారు. 21 శాతం రుణ వృద్ధి సాధించామని, ఇది బహుళ సంవత్సరాల కనిష్ట స్థాయి అని, మందగమనం ప్రభావం మరో ఆరు నెలల పాటు ఉండగలదని అంచనా వేస్తున్నామన్నారు. ఎగబాకిన మొండిబకాయిలు... నికర లాభం, ఆదాయాలతో పాటు బ్యాంక్ మొండి బకాయిలు కూడా పెరిగాయి. రుణ నాణ్యత వార్షికంగా, సీక్వెన్షియల్గా చూసినా క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 1.09 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో 2.19 శాతానికి పెరిగాయని రమేశ్ సోబ్తి వెల్లడించారు. అలాగే నికర మొండి బకాయిలు 0.48 శాతం నుంచి 1.12 శాతానికి పెరిగాయని పేర్కొన్నారు. తాజా మొండి బకాయిలు ఈ క్యూ1లో రూ.725 కోట్లుగా ఉండగా, ఈ క్యూ2లో రూ.1,102 కోట్లకు పెరిగాయని తెలిపారు. దీంట్లో కంపెనీల తాజా మొండి బకాయిలు 174 శాతం, రిటైల్ రుణాలకు సంబంధించిన తాజా మొండి బకాయిలు 13 శాతం చొప్పున పెరిగాయని వివరించారు. ఇక కేటాయింపులు రూ.590 కోట్ల నుంచి 71 శాతం వృద్ధితో రూ.738 కోట్లకు చేరాయని వివరించారు. ఈ క్యూ1లో 43 శాతంగా ఉన్న ప్రొవిజన్ కవరేజ్ రేషియో ఈ క్యూ2లో 50 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. నికర లాభం, ఆదాయం పెరిగినా, మొండి బకాయిలు రెట్టింపై రుణనాణ్యత క్షీణించడంతో ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు 6.1 శాతం నష్టంతో రూ. 1,229 వద్ద ముగిసింది. -
బుల్.. ధనాధన్!
ఆరు రోజుల పతనం కారణంగా భారీగా నష్టపోయి ఆకర్షణీయంగా ఉన్న షేర్లలో కొనుగోళ్లు జరగడం(వేల్యూ బయింగ్)తో బుధవారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. కంపెనీల ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి నేటి(గురువారం) నుంచి ఆరంభం కానున్నది. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు కారణంగా కంపెనీల నికర లాభాలు పెరిగే అవకాశాలున్నాయన్న అంచనాలతో ఈ క్యూ2 ఫలితాలు బాగానే ఉండగలవన్న ఆశావహంతో కొనుగోళ్ల సునామీ చోటు చేసుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ 38,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,300 పాయింట్లపైకి ఎగబాకాయి. కేంద్ర ప్రభుత్వం డీఏను పెంచడం పండుగ డిమాండ్కు మరింత జోష్నివ్వగలదన్న అంచనాలు నెలకొన్నాయి. ముడి చమురు ధరలు తగ్గడం, డాలర్తో రూపాయి మారకం విలువ నష్టాల నుంచి రికవరీ కావడం, నేడు(గురువారం) నిప్టీ వీక్లీ ఆప్షన్లు ఎక్స్పైరీ కానుండటంతో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు చోటు చేసుకోవడం సానుకూల ప్రభావం చూపించాయి. బ్యాంక్, ఆర్థిక, టెలికం షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 646 పాయిం ట్లు లాభపడి 38,178 పాయింట్ల వద్ద, నిఫ్టీ 187 పాయింట్లు లాభపడి 11,313 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ, కన్సూమర్ డ్యూరబుల్స్, టెక్నాలజీ సూచీలు మినహా మిగిలిన అన్ని సూచీలు లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ ఐటీ సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి. క్యూ2 ఫలితాలే దిక్సూచి.... ఆరు రోజుల నష్టాల నుంచి మార్కెట్ రికవరీ అయిందని జియోజిత్ ఫైనాన్షియల్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. ఆర్బీఐ మరోసారి రేట్లు తగ్గించే అవకాశాలున్నాయన్న అంచనాలతో బాండ్ల రాబడులు తగ్గాయని, దీంతో బ్యాంక్ షేర్లు పెరిగాయని వివరించారు. రేట్ల తగ్గింపు కారణంగా మరిన్ని నిధులు వ్యవస్థలోకి వస్తాయని, దీంతో డిమాండ్ పుంజుకోగలదన్న ఆశావహంతో కొనుగోళ్లు జోరుగా సాగాయని విశ్లేషించారు. రానున్న క్యూ2 ఫలితాలు మార్కెట్ గతిని నిర్దేశిస్తాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం తర్వాత లాభాలు..... దసరా సందర్భంగా మంగళవారం సెలవు. ఒక రోజు విరామం తర్వాత సెన్సెక్స్ స్వల్ప లాభాలతో ఆరంభమైంది. మధ్యాహ్నం వరకూ పరిమిత శ్రేణి లాభాల్లో కదలాడింది. ఆ తర్వాత కొనుగోళ్లు జోరందుకోవడంతో భారీ లాభాల దిశగా కదిలింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 678 పాయింట్లు, నిఫ్టీ 196 పాయింట్ల మేర లాభపడ్డాయి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం విషయమై అనిశ్చితి చోటు చేసుకోవడంతో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. కంపెనీల ఆర్థిక ఫలితాలపై ఆశావహ అంచనాలు, చైనా అమెరికాతో పరిమిత వాణిజ్య ఒప్పందానికి ఒప్పుకోగలదన్న వార్తల (ఆసియా మార్కెట్లు ముగిశాక ఈ వార్తలు వచ్చాయి)కారణంగా యూరప్ మార్కెట్లు లాభాలతో ఆరంభమై, లాభాల్లోనే ముగిశాయి. బ్యాంక్ షేర్ల జోరు పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్(పీఎమ్సీ), లక్ష్మీ విలాస్ బ్యాంక్ల్లో అవకతవకలు వెలుగులోకి రావడంతో గత 6 ట్రేడింగ్ సెషన్లలో బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లు నష్టపోయాయి. ఈ నష్టాల కారణంగా పలు బ్యాంక్ షేర్లు ఆకర్షణీయ ధరల్లో లభిస్తున్నాయి. మరోవైపు నేడు(గురువారం) వెల్లడి కానున్న ఇండస్ఇండ్ బ్యాంక్ క్యూ2 ఫలితాలపై పలు బ్రోకరేజ్ సంస్థలు ఆశావహ అంచనాలను వెలువరించాయి. దీంతో బ్యాంక్ షేర్లు జోరుగా పెరిగాయి. నిఫ్టీ బ్యాంక్ సూచీ 1,018 పాయింట్లు (3.6%) మేర ఎగసింది. ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 5.4% లాభంతో రూ.1,310 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా లాభపడిన షేర్ ఇదే. మరిన్ని విశేషాలు... ► యస్ బ్యాంక్ షేర్ 5.2% నష్టంతో రూ.43 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► ప్రమోటార్ల షేర్ల వాటాను డిపాజిటరీ సంస్థ, సీడీఎస్ఎల్ స్తంభింపజేయడంతో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(డీహెచ్ఎఫ్ఎల్) షేర్ 10 శాతం లోయర్ సర్క్యూట్తో పదేళ్ల కనిష్ట స్థాయి, రూ.26కు పడిపోయింది. ► షేర్ల బైబ్యాక్ వార్తలతో ఇండియాబుల్స్ వెంచర్స్ 9 శాతం లాభంతో రూ.109కు, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ 5 శాతం లాభంతో రూ.43కు పెరిగాయి. ► ఇండియామార్ట్ ఇంటర్మెష్ మెరుపులు కొనసాగుతున్నాయి. 20% లాభంతో జీవిత కాల గరిష్ట స్థాయి, 2,304ను తాకి.. చివరకు 18% లాభంతో రూ.2,264 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్ల సంపద 1.66 లక్షల కోట్లు అప్ స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.66 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.66 లక్షల కోట్లు పెరిగి రూ.1,43,92,456 కోట్లకు చేరింది. లాభాలు ఎందుకంటే... ► వేల్యూ బయింగ్: గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 4 శాతం మేర నష్టపోయాయి. ఈ ఆరు రోజుల నష్టాల కారణంగా బ్యాంక్, ఆర్థిక, లోహ, వాహన, రియల్టీ రంగ షేర్ల ధరలు తగ్గి ఆకర్షణీయంగా ఉండటంతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. ► కరువు భత్యం(డీఏ) పెంపు: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏను 12 శాతం నుంచి 17 శాతానికి,.. 5 శాతం మేర పెంచింది. ఫలితంగా 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 62 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనున్నది. డీఏ పెంపు కారణంగా కేంద్రంపై రూ.16,000 కోట్ల భారం పడనున్నప్పటికీ, ఆ మేరకు ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ పెరిగి, కొనుగోళ్లు చోటు చేసుకుంటాయని, వినియోగం పుంజుకుంటుందన్న అంచనాలున్నాయి. దీంతో మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు జోష్ రాగలదన్న ఆశాభావంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ► చల్లబడ్డ చమురు ధరలు: అమెరికా... ఇతర దేశాలపై సుంకాలు విధిస్తున్న కారణంగా అంతర్జాతీయంగా వృద్ధి కుంటుపడుతుందన్న ఆందోళనతో ముడి చమురు ధరలు పతనమయ్యాయి. గత మూడు రోజులుగా చమురు ధరలు తగ్గుతున్నాయి. 80 శాతానికి పైగా చమురును దిగుమతి చేసుకుంటున్న మన దేశానికి చమురు ధరలు తగ్గడం సానుకూల ప్రభావం చూపుతుంది. అయితే మన మార్కెట్ ముగిసిన తర్వాత చమురు ధరలు పెరిగాయి. ► రూపాయి రికవరీ: ఫారెక్స్ మార్కెట్లో రోజులో ఎక్కువ భాగం నష్టాల్లో ట్రేడైన డాలర్తో రూపాయి మారకం విలువ స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి 8 పైసలు పుంజుకోవడం సానుకూల ప్రభావం చూపించింది. -
ఎస్బీఐ లాభం 2,312 కోట్లు
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.2,312 కోట్ల నికర లాభాన్ని (స్టాండ్ అలోన్)సాధించింది. గత క్యూ1లో రూ.4,876 కోట్ల నికర నష్టాలు వచ్చాయని ఎస్బీఐ తెలిపింది. వడ్డీ ఆదాయం అధికంగా రావడం, మొండిబకాయిలు తగ్గిన కారణంగా కేటాయింపులు తక్కువగా ఉండటంతో ఈ క్యూ1లో లాభాలు వచ్చాయని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ వివరించారు. మొత్తం ఆదాయం రూ.65,493 కోట్ల నుంచి రూ.70,653 కోట్లకు పెరిగింది. ఆర్థిక ఫలితాలకు సంబంధించి ఇతర వివరాలు... నికర వడ్డీ ఆదాయం 5 శాతం అప్... బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 5 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.21,798 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం ఈ క్యూ1లో రూ.22,939 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ 2.95 శాతం నుంచి 3.01 శాతానికి ఎగసింది. బ్యాంక్ రుణ నాణ్యత మెరుగుపడింది. గత క్యూ1లో 9.95 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 7.53 శాతానికి తగ్గాయి. అలాగే నికర మొండి బకాయిలు 4.84% నుంచి 3.07 శాతానికి తగ్గాయి. మొండిబకాయిలు తగ్గడం తో కేటాయింపులు కూడా తగ్గాయి. గత క్యూ1లో రూ.16,849 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ1లో 35 శాతం తగ్గి రూ.10,934 కోట్లకు పరిమితమయ్యాయి. ప్రొవిజన్ కవరేజ్ రేషియో 79.34 శాతంగా ఉంది. అయితే తాజా మొండిబకాయిలు ఈ క్యూ1లో భారీగా, రూ.16,212 కోట్లకు పెరిగా యి. ఒక మహారత్న కంపెనీకి చెందిన రూ.2,000 కోట్ల రుణం ఎన్పీఏగా మారడం, వ్యవసాయ, ఎస్ఎంఈ రుణాలు ఎన్పీఏలుగా మారడంతో ఈ క్యూ1లో తాజా మొండి బకాయిలు పెరిగాయి. రూ. 5,769 కోట్ల రికవరీలు... మొండి బకీలకు సంబంధించి రికవరీలు, అప్గ్రేడ్లు రూ.5,769 కోట్లకు పెరిగాయి. దివాలా ప్రక్రియ నడుస్తున్న ఎస్సార్, భూషణ్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్ల కేసులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఈ ఖాతాల నుంచి రూ.16,000 కోట్ల రుణాలు రికవరీ అవుతాయి. బ్యాంక్ క్యాపిటల్ అడెక్వసీ రేషియో 12.89% నుంచి 12.83 శాతానికి మెరుగుపడింది. రూ.7,000 కోట్ల సమీకరణ.... అదనపు టైర్–1 బాండ్ల జారీ ద్వారా రూ.7,000 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నామని బ్యాంక్ తెలిపింది. మరో రూ.20,000 కోట్ల నిధులు సమీకరించాలని కూడా ఆలోచిస్తున్నామని, అయితే దీనికి సమయం పడుతుందని బ్యాంక్ చైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు. మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడేదాకా వేచి చూస్తామని పేర్కొన్నారు. ఈ నాలుగో క్వార్టర్లో ఎస్బీఐ కార్డ్ ఐపీఓ ఉంటుందని, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఐపీఓ వచ్చే ఏడాది ఉంటుందని ఆయన తెలిపారు. రూ.2,312 కోట్ల నికర లాభం రావడం, రుణ నాణ్యత మెరుగుపడటం వంటి సానుకూలతలున్నా, బీఎస్ఈలో ఎస్బీఐ షేర్ నష్టపోయింది. తాజా మొండి బకాయిలు పెరగడంతో ఎస్బీఐ షేర్ 3 శాతం నష్టంతో రూ.308 వద్ద ముగిసింది. రోజూ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.... వరుసగా నాలుగో క్వార్టర్లోనూ లాభాలు సాధించామని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. క్రమక్రమంగా మెరుగుపడుతున్నామని పేర్కొన్నారు. సిబ్బంది, ఇతర వ్యయాలు నియంత్రణలోనే ఉన్నాయని, ఆదాయానికి, వ్యయానికి గల నిష్పత్తి అర శాతం తగ్గి 2.03 శాతానికి చేరిందని వివరించారు. నిర్వహణ లాభం పెంచుకోవడంపై దృష్టి పెట్టామని, ఈ క్యూ1లో నిర్వహణ లాభం 11 శాతం వృద్ధితో రూ.13,246కు పెరిగిందని పేర్కొన్నారు. రుణ వృద్ధి అంతంతమాత్రంగానే ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో నికర వడ్డీ మార్జిన్ పెంచుకోవడం కష్టమైన పనేనని అంగీకరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 శాతం రుణ వృద్ధి, 3.1 శాతం నికర వడ్డీ మార్జిన్ సాధించగలమని పేర్కొన్నారు. మొండిబకాయిలు వసూలు కావాలని ప్రతి రోజూ దేవుడ్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు. వాహన రంగంలో మందగమనం చోటు చేసుకోవడం వల్ల తామెలాంటి ఆందోళన చెందడం లేదని పేర్కొన్నారు. మొత్తం రిటైల్ వాహన రుణాలు రూ.71,000 కోట్లుగా ఉన్నాయని, వీటిల్లో వాహన డీలర్ల రుణాలు రూ.11,500 కోట్లని రజనీష్ కుమార్ తెలిపారు. -
అలహాబాద్ బ్యాంక్ లాభం 128 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అలహాబాద్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ క్వార్టర్లో రూ.128 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ1లో రూ.1,944 కోట్ల నికర నష్టాలు వచ్చాయని అలహాబాద్ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు తగ్గడంతో ఈ క్యూ1లో లాభాల బాట పట్టామని అలహాబాద్ బ్యాంక్ తెలిపింది. అంతకు ముందటి క్వార్టర్(గత క్యూ4లో) రూ.3,834 కోట్ల నికర నష్టాలు వచ్చాయని పేర్కొంది. ఇక గత క్యూ1లో రూ.4,794 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.4,747 కోట్లకు తగ్గిందని తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.2,590 కోట్ల నుంచి రూ.1,102 కోట్లకు తగ్గాయని వివరించింది. మిశ్రమంగా రుణ నాణ్యత.. బ్యాంక్ రుణ నాణ్యత మిశ్రమంగా నమోదైంది. స్థూల మొండి బకాయిలు పెరగ్గా, నికర మొండి బకాయిలు తగ్గాయి. గత క్యూ1లో 15.97 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 17.43 శాతానికి పెరిగాయి. నికర మొండి బకాయిలు 7.32% నుంచి 5.71%కి చేరాయి. సీక్వెన్షియల్గా చూస్తే, గత క్యూ4లో స్థూల మొండి బకాయిలు 17.55%, నికర మొండి బకాయిలు 5.22%గా ఉన్నాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంక్ షేర్ 5.6% నష్టంతో రూ.36.85 వద్ద ముగిసింది. -
బీఓబీ లాభం రూ.826 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ క్వార్టర్కు రూ.826 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.646 కోట్ల నికర లాభం ఆర్జించామని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ల విలీనం తర్వాత తాము వెల్లడిస్తున్న తొలి ఆర్థిక ఫలితాలు ఇవని, అందుకని గత క్యూ1, ఈ క్యూ1 ఆర్థిక ఫలితాలను పోల్చడానికి లేదని పేర్కొంది. గత క్యూ1లో రూ.13,730 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.22,057 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం 2.6 శాతం వృద్ధితో రూ.6,496 కోట్లకు పెరిగిందని తెలిపింది. గత క్యూ4లో 2.78 శాతంబ ఉన్న నికర వడ్డీ మార్జిన్ ఈ క్యూ1లో 2.73 శాతానికి తగ్గిందని పేర్కొంది. 4 శాతం పెరిగిన నిర్వహణ లాభం స్టాండ్అలోన్ పరంగా చూస్తే, ఈ క్యూ1లో నికర లాభం రూ.709 కోట్లు, మొత్తం ఆదాయం రూ.20,861 కోట్లని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. గత క్యూ1లో రూ.528 కోట్ల నికర లాభం, రూ.12,788 కోట్ల ఆదాయం వచ్చాయని పేర్కొంది. స్టాండ్అలోన్ నిర్వహణ లాభం 4 శాతం వృద్ధితో రూ.4,276 కోట్లకు పెరిగిందని పేర్కొంది. సీక్వెన్షియల్గా చూస్తే, 34 శాతం వృద్ధి సాధించామని పేర్కొంది. తగ్గిన తాజా మొండి బకాయిలు.... ఈ క్యూ1లో స్థూల మొండి బకాయిలు 10.28 శాతంగా, నికర మొండిబకాయిలు 3.95 శాతంగా ఉన్నాయని బ్యాంక్ తెలిపింది. గత క్యూ1లో స్థూల మొండి బకాయిలు 12.46 శాతమని, నికర మొండి బకాయిలు 5.4 శాతమని వెల్లడించింది. ఈ క్యూ1లో తాజా మొండి బకాయిలు రూ.5,583 కోట్లని, సీక్వెన్షియల్గా చూస్తే, తాజా మొండి బకాయిలు తగ్గాయని తెలిపింది. ఈ క్యూ1లో రూ.3,168 కోట్ల కేటాయింపులు జరిపామని తెలిపింది. రిటైల్ రుణాలు 21 శాతం వృద్ధి చెందడంతో మొత్తం రుణాలు 5 శాతం ఎగసి రూ.5.33 లక్షల కోట్లకు పెరిగాయని పేర్కొంది. దేశీయ డిపాజిట్లు 9 శాతం పెరిగి రూ.7.85 లక్షల కోట్లకు చేరాయని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్ 0.68 శాతం నష్టంతో రూ.110 వద్ద ముగిసింది. -
విప్రో లాభం 2,388 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో 12 శాతం వృద్ధితో రూ.2,388 కోట్లకు పెరిగింది. అయితే సీక్వెన్షియల్గా చూస్తే, (గత క్యూ4లో వచ్చిన నికర లాభం రూ.2,484 కోట్లుతో పోల్చితే) 4 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.13,978 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.14,716 కోట్లకు పెరిగిందని విప్రో కంపెనీ తెలిపింది. సీక్వెన్షియల్గా చూస్తే, 9% తగ్గింది. సెప్టెంబర్ క్వార్టర్లో ఆదాయం 2% మేర పెరగగలదని ఈ కంపెనీ అంచనా వేస్తోంది. కాగా ఇటీవలే ఫలితాలు వెల్లడించిన టీసీఎస్, ఇన్ఫోసిస్ల కంటే విప్రో ఆదాయం విషయంలో వెనకబడిపోయింది. టీసీఎస్ ఆదాయం 11% వృద్ధితో రూ.38,172 కోట్లకు, ఇన్ఫోసిస్ ఆదాయం 14% వృద్ధితో రూ.21,803 కోట్లకు పెరిగాయి. నిర్వహణ లాభం 6 శాతం డౌన్... కంపెనీకి కీలకమైన ఐటీ సర్వీసుల విభాగం ఆదాయం 2 శాతం తగ్గి 203 కోట్ల డాలర్లకు చేరిందని విప్రో వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో ఈ విభాగం ఆదాయం 204–208 కోట్ల డాలర్ల(0–2% వృద్ధి)రేంజ్లో ఉండగలదని పేర్కొంది. సీక్వెన్షియల్గా చూస్తే, ఈ విభాగం నిర్వహణ లాభం 6% తగ్గి రూ.2,652 కోట్లకు చేరిందని, మార్జిన్ 1% తగ్గి 18.4 శాతానికి చేరిందని తెలిపింది. వేతనాల వ్యయం అధికంగా ఉండటం, రూపాయి బలపడటం దీనికి కారణాలని వివరించింది. పరిస్థితులు మెరుగుపడతాయ్...! 10 కోట్ల డాలర్లకు మించిన డీల్స్ మూడు సాధించామని విప్రో కంపెనీ విప్రో సీఈఓ ఈడీ, అబిదాలి నీమూచ్వాలా పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ నిలకడగానే ఉందన్నారు. అయితే ఆర్థిక వ్యవస్థ మందగమనంగా ఉండటం వల్ల బ్యాంకింగ్, ఆర్థిక, బీమా రంగ కంపెనీలు నిర్ణయాలు తీసుకునే విషయంలో వెనకాడుతున్నాయని వివరించారు. ఇది తాత్కాలికంగానే ఉంటుందని, రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితులు మెరుగుపడగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. షేర్ల బైబ్యాక్ పూర్తి చేస్తాం... సెబీ ఆమోదం రాగానే రూ.10,500 కోట్ల షేర్ల బైబ్యాక్ను పూర్తి చేస్తామని విప్రో తెలిపింది. ఈ షేర్ల బైబ్యాక్లో భాగంగా ఈ కంపెనీ ఒక్కో షేర్ను రూ.325 ధరకు మొత్తం 32.31 కోట్ల షేర్లను బైబ్యాక్ చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మందగమనంగానే మొదలైందని విప్రో సీఎఫ్ఓ జతిన్ దలాల్ చెప్పారు. భవిష్యత్తులో మంచి వృద్ధి సాధన దిశగా ప్రతిభ, సామర్థ్యాలపై పెట్టుబడులు కొనసాగిస్తామన్నారు. మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత కంపెనీ ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలపై అనిశ్చితి కారణంగా బీఎస్ఈలో విప్రో షేర్ 0.13 శాతం నష్టంతో రూ.260 వద్ద ముగిసింది. -
38 శాతం ఎగిసిన ఇండస్ ఇండ్ లాభం
సాక్షి,ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్ క్యూ1 ఫలితాల్లో అదరగొట్టింది. శుక్రవారం విడుదల చేసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికం నికర లాభాలు 38 శాతం ఎగిసాయి. రూ. 1432 కోట్ల లాభాలను వెల్లడించింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) సైతం 34 శాతం పెరిగి రూ. 2844 కోట్లకు చేరింది. త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) స్వల్పంగా ఎగిసి 2.15 శాతంగా ఉన్నాయి. నికర ఎన్పీఏలు సైతం 1.2 శాతం నుంచి 1.23 శాతానికి చేరాయి. అలాగే ప్రొవిజన్లు కూడా తగ్గాయి. మైక్రో ఫైనాన్స్ రంగ సంస్థ భారత్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ను విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే. బీఎఫ్ఐఎల్తో విలీనంతో విలీనాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నామనీ, ఈ త్రైమాసికంలో, బ్యాంక్ తన టాప్ లైన్ గ్రోత్తోపాటు ఆపరేటింగ్ లాభాలలో ఆరోగ్యకరమైన వృద్ధిని సాధించిందని బ్యాంకు సీఎండీ రొమేష్ సోబ్టి తెలిపారు. తరువాతి త్రైమాసికాల్లో ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలో కొత్త అవకాశాలపై దృష్టిపెడతామని చెప్పారు. ఈ ఫలితాల నేపథ్యంలో ఇండస్ ఇండ్ బ్యాంకు షేరు తీవ్ర ఒడిదుడకులకు లోనై చివరికి 2 శాతం నష్టంతో ముగిసింది. -
రిలయన్స్ ‘రికార్డ్’ లాభం
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో రికార్డ్ స్థాయిలో రూ.10,362 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్)ఆర్జించింది. రిటైల్, టెలికం విభాగాలు మంచి పనితీరు సాధించడంతో రిలయన్స్ నికర లాభం ఈ స్థాయిలో పెరిగింది. కంపెనీకి కీలకమైన చమురు శుద్ధి, పెట్రో కెమికల్ విభాగాలు బలహీనంగా ఉన్నప్పటికీ, రిటైల్, టెలికం విభాగాల జోరు కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్కు రికార్డ్ స్థాయి లాభం వచ్చిందని నిపుణులు పేర్కొన్నారు. భారత్లోనే ఏ ప్రైవేట్ కంపెనీ కూడా ఇప్పటివరకూ ఈ స్థాయి లాభాలను ప్రకటించలేదు. రిటైల్ వ్యాపారం 52 శాతం, డిజిటల్ సర్వీసుల వ్యాపారం 62 శాతం చొప్పున వృద్ధి చెందాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలియజేసింది. పెట్రో కెమికల్ విభాగం అమ్మకాలు అధికంగా ఉండటం కూడా కలసివచ్చిందని పేర్కొంది. ఆదాయం జోరుగా పెరగడానికి ఇవే ముఖ్య కారణాలని వివరించింది. 10 శాతం పెరిగిన లాభం.... అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) నాలుగో త్రైమాసిక కాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నికరలాభం రూ.9,438 కోట్లుగా ఉంది. దీంతో పోలిస్తే తాజా నాలుగో క్వార్టర్లో (2018–19) నికర లాభం 10 శాతం పెరిగి రూ.10,362 కోట్లు చేరింది. షేర్ పరంగా చూస్తే, ఒక్కో షేరు వారీ నికర లాభం రూ.15.9 నుంచి రూ.17.5కు ఎగసింది. స్టాండ్ఎలోన్ ప్రాతిపదికన చూస్తే మాత్రం నికర లాభం తగ్గింది. స్థూల రిఫైనింగ్, పెట్రో కెమికల్స్ మార్జిన్ తగ్గడంతో నికర లాభం 2 శాతం తగ్గి రూ.8,556 కోట్లకు పరిమితమైంది. ఇక ఆదాయం 19 శాతం పెరిగి రూ.1,54,110 కోట్లకు చేరిందని కంపెనీ తెలిపింది. క్యూ4 మొత్తం ఆదాయం సీక్వెన్షియల్గా చూస్తే, 10 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఆదాయం రూ.1,70,709 కోట్లుగా ఉంది. వడ్డీ వ్యయాలు రూ.2,566 కోట్ల నుంచి రూ.4,894 కోట్లకు పెరిగాయి. రిటైల్ వ్యాపారం ఎబిటా 77 శాతం ఎగసి రూ.1,923 కోట్లకు చేరగా, టెలికం విభాగం లాభం 65 శాతం పెరిగింది. క్వార్టర్లీ ఎబిటా 13 శాతం వృద్ధితో రూ.20,832 కోట్లకు పెరిగింది. ఆపరేటింగ్ మార్జిన్ 15 శాతం సాధించామని తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, కంపెనీ ఆదాయం 45 శాతం వృద్ధితో రూ.6.22 లక్షల కోట్లకు పెరిగింది. నికర లాభం రూ.39,588 కోట్లుగా ఉంది. ఈ ఏడాది మార్చినాటికి కంపెనీ మొత్తం రుణ భారం రూ.2.87 లక్షల కోట్లుగా ఉంది. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.1,33,027 కోట్లకు పెరిగాయి. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్కు పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను రూ.6.50 డివిడెండ్ను కంపెనీ ప్రకటించింది. పెట్రో కెమికల్స్ విభాగం.. తగ్గిన జీఆర్ఎమ్! గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో పెట్రో కెమికల్స్ విభాగం ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.42,414 కోట్లకు పెరిగింది. రియలైజేషన్లు పెరగడం దీనికి ప్రధాన కారణం. ఇక ఎబిట్ 24 శాతం వృద్ధితో రూ.7,975 కోట్లుగా నమోదైంది. ఎబిట్ మార్జిన్ 19 శాతంగా నమోదైంది. అయితే స్థూల రిఫైనింగ్ మార్జిన్ (జీఆర్ఎమ్) తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో 11 డాలర్లుగా ఉన్న జీఆర్ఎమ్(ఒక్కో బ్యారెల్కు) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 8.2 డాలర్లకు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో జీఆర్ఎమ్ 8.8 డాలర్లుగా ఉంది. రిఫైనింగ్, మార్కెటింగ్ సెగ్మెంట్ ఆదాయం 6 శాతం తగ్గి రూ.87,844 కోట్లకు చేరింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్రో కెమికల్స్ వ్యాపారంలో సౌదీ ఆరామ్కో కంపెనీ 25 శాతం వాటా కొనుగోలు చేయనున్నదన్న వార్తలు, ఫలితాలు సానుకూలంగా ఉండగలవన్న అంచనాల కారణంగా ఈ షేర్ పెరిగింది. బీఎస్ఈలో 2.7 శాతం లాభంతో రూ.1,383 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసినప్పటికీ, సెన్సెక్స్లో అత్యధికంగా పెరిగిన షేర్ ఇదే. ఈ ఏడాదిలో ఈ షేర్ ఇప్పటివరకూ 20 శాతం లాభపడింది. రిలయన్స్ జియో...జిగేల్! టెలికం విభాగం రిలయన్స్ జియో నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 65 శాతం వృద్ధి చెందింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.510 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.840 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ.7,128 కోట్ల నుంచి 56 శాతం వృద్ధితో రూ.11,106 కోట్లకు పెరిగింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.723 కోట్లుగా ఉన్న నికర లాభం 2018–19 ఆర్థిక సంవత్సరంలో 309 శాతం వృద్ధితో రూ.2,964 కోట్లకు పెరిగింది. దాదాపు నాలుగు రెట్లు వృద్ధి నమోదైంది. ఆదాయం 93 శాతం వృద్ధితో రూ.38,838 కోట్లకు పెరిగింది. రిలయన్స్ జియో వినియోగదారుల సంఖ్య 30 కోట్లను దాటింది. తక్కువ సమయంలోనే ఈ స్థాయి వినియోగదారులను సాధించిన కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఇదే. కంపెనీ ఏఆర్పీయూ (ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు రాబడి) రూ.126.2గా ఉంది. ఏఆర్పీయూ గత క్యూ3లో రూ.130గా ఉంది. రిటైల్ వ్యాపారం... లక్ష కోట్ల మైలురాయి ! గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రిటైల్ వ్యాపారం ఆదాయం 52% పెరిగి రూ.36,663 కోట్లకు పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఆదాయం రూ.24,183 కోట్లుగా ఉంది. ఎబిటా 77 శాతం వృద్ధితో రూ.1,923 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం ఆదాయం 89 శాతం వృద్ధితో రూ.1,30,566 కోట్లకు పెరిగింది. ఎబిటా 145 శాతం వృద్ధితో రూ.6,201 కోట్లకు పెరిగింది. ఆదాయం, లాభాల వృద్ధి పరంగా గత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం రికార్డ్లు సృష్టించింది. అంతర్జాతీయ టాప్ 100 కంపెనీల జాబితాలో చోటు సాధించిన ఏకైక భారత కంపెనీ ఇదే. ‘గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించాం. రిలయన్స్ భవిష్యత్తు కోసం చెప్పుకోదగిన ప్రయత్నాలు చేశాం. రిలయన్స్ రిటైల్ ఆదాయం రూ. లక్ష కోట్లను దాటేసింది. రిలయన్స్ జియో చందాదారుల సంఖ్య 30 కోట్లకు పెరిగింది. పెట్రో కెమికల్స్ విభాగం ఎన్నడూ లేనంత లాభాన్ని సాధించింది’. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ సీఎండీ -
రెండు రెట్లు పెరిగిన మహీంద్రా ఫైనాన్షియల్స్ లాభం
న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్నకు చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రెండు రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.164 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.381 కోట్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం, ఇతర ఆదాయం కూడా పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో ఎగసిందని పేర్కొంది. గత క్యూ2లో రూ.1,540 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ2లో 40 శాతం వృద్ధితో రూ.2,148 కోట్లకు పెరిగింది. 39 శాతం అప్... ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో రూ.21,194 కోట్ల రుణాలిచ్చామని, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఇచ్చిన రుణాలు(రూ.15,206 కోట్లు)తో పోల్చితే 39 శాతం వృద్ధి సాధించామని మహీంద్రా ఫైనాన్స్ తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్ 30 నాటికి రూ.47,213 కోట్లుగా ఉన్న నిర్వహణ ఆస్తులు ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి 26 శాతం వృద్ధితో రూ.59,473 కోట్లకు పెరిగాయని పేర్కొంది. తమ మొత్తం ఖాతాదారుల సంఖ్య 56 లక్షలకు పెరిగిందని వివరించింది. గ్రామీణ, చిన్న పట్టణాల్లో వినియోగదారులకు ఈ కంపెనీ ఆర్థిక సేవలను అందిస్తోంది. వాహనాలు, ట్రాక్టర్ల కొనుగోళ్లకు రుణాలను, చిన్ని, మధ్య తరహా వాణిజ్య సంస్థలకు కూడా రుణాలందిస్తోంది. మహీంద్రా ఇన్సూరెన్స్ బ్రోకర్స్, మహీంద్రా రూరల్ హౌసింగ్ ఫైనాన్స్, మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, మహీంద్రా ఫైనాన్స్... ఈ అనుబంధ సంస్థలతో ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. నికర లాభం రెండు రెట్లు పెరగడంతో బీఎస్ఈలో మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ 7.5 శాతం లాభంతో రూ.401 వద్ద ముగిసింది. -
లాభాలే లాభాలు : ఇక జియో కస్టమర్లకు పండగే!
ముంబై : ఆయిల్ నుంచి టెలికాం వరకు వ్యాపారాల్లో తిరుగు లేకుండా దూసుకుపోతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డు లాభాల పంట పండించింది. నేడు ప్రకటించిన తొలి క్వార్టర్ ఫలితాల్లో నికర లాభాలు రూ.9,459 కోట్లగా రికార్డు చేసింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ లాభాలు రూ.9,108 కోట్లగా ఉన్నాయి. నిర్వహణ నుంచి కంపెనీకి వచ్చిన కన్సాలిడేటెడ్ రెవెన్యూలు ఏడాది ఏడాదికి 56.5 శాతం పెరిగి, రూ.1.41 లక్షల కోట్లగా నమోదైనట్టు వెల్లడించింది. ఈ రెవెన్యూలు గతేడాది ఇదే సమయంలో రూ.90,537 కోట్లగా ఉన్నాయని కంపెనీ తెలిపింది. టెలికాం మార్కెట్లో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో వరుసగా మూడు క్వార్టర్లు నికర లాభాలను ఆర్జించినట్టు కంపెనీ ప్రకటించింది. దీంతో కస్టమర్లకు మరికొంత కాలం పాటు కూడా టారిఫ్ ధరలు తగ్గనున్నట్టు తెలిసింది. మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవడానికి టారిఫ్లను తగ్గిస్తామని కంపెనీ తెలిపింది. ఈ క్వార్టర్ ముగింపు నాటికి రిలయన్స్ జియో రూ.612 కోట్ల నికర లాభాలను నమోదు చేసినట్టు ప్రకటించింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ లాభాలు రూ.510 కోట్లగా ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాల్లో ముఖ్య విషయాలు.. కంపెనీ గ్రాస్ రెవెన్యూ మార్జిన్లు ఒక్కో బ్యారల్కు 10.5 డాలర్లగా నమోదయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్లో ఒక్కో బ్యారల్ గ్రాస్ రెవెన్యూ మార్జిన్ 11.90 డాలర్లుగా ఉంది. రిఫైనింగ్, మార్కెటింగ్ సెగ్మెంట్లో జూన్ క్వార్టర్ రెవెన్యూలు ఏడాది ఏడాదికి 42.9 శాతం పెరిగి రూ.95,646 కోట్లగా ఉన్నాయి. రిలయన్స్ జియో ఆర్పూ(యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్) రూ.134.50కి పడిపోయింది. జియో ఈబీఐటీడీఏలు క్వార్టర్ క్వార్టర్కు 16.80 శాతం పెరిగి రూ.3,147 కోట్లకు ఎగిశాయి. జియో ఈబీఐటీడీఏ మార్జిన్లు క్వార్టర్ క్వార్టర్ బేసిస్లో 37.80 శాతం నుంచి 38.80 శాతం పెరిగాయి. సబ్స్క్రైబర్ వృద్ధిలో జియో ట్రెండ్ కొనసాగుతోంది. నెట్ అడిక్షన్ 28.7 మిలియన్లగా నమోదైంది. కంపెనీ కమర్షియల్గా సర్వీసులు లాంచ్ చేసినప్పటి నుంచి ఇదే అత్యధిక అడిక్షన్. మా వ్యాపారాల పోర్టుఫోలియోలో కార్యాచరణ శ్రేష్టత ద్వారా బలమైన డెలివరీని అందించేందుకు దృష్టి సారిస్తూనే ఉంటాం. మా పెట్రోకెమికల్స్ వ్యాపారాలు రికార్డు ఈబీఐటీడీఏలను జనరేట్ చేశాయి. కాలానుగుణ బలహీనత ఉన్నప్పటికీ, రిఫైనింగ్ వ్యాపారాల ప్రదర్శన స్థిరంగా ఉంది. ఆయిల్ ఉత్పత్తుల్లో గ్లోబల్గా డిమాండ్ కొనసాగింది. మా రిఫైనింగ్ వ్యాపారాల్లో, సముద్ర ఇంధనాల్లో పర్యావరణానికి అనుకూలంగా కఠినమైన చర్యలను అమలు చేశాం - రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ -
అంచనాలను తప్పిన టెక్ దిగ్గజం
ముంబై : దేశీయ రెండో అతిపెద్ద టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ అంచనాలను తప్పింది. కంపెనీ నేడు ప్రకటించిన క్యూ1 ఫలితాల్లో కేవలం రూ.3,612 కోట్ల నికర లాభాలను మాత్రమే ఆర్జించింది. గత త్రైమాసికంలో ఇవి రూ.3,690 కోట్లగా ఉన్నాయి. విశ్లేషకులు అంచనాల ప్రకారం ఇన్ఫోసిస్ రూ.3,731.80 కోట్ల నికర లాభాలను ఆర్జిస్తుందని భావించారు. కానీ వీరి అంచనాలను కూడా ఈ టెక్ దిగ్గజం తప్పింది. అయితే ఏడాది ఏడాదికి కంపెనీ లాభాలు 3.7శాతం పెరిగాయి. టీసీఎస్ ఫలితాల ప్రకటన అనంతరం ఇన్ఫోసిస్ తన ఫలితాలను నేడు విడుదల చేసింది.ఈ క్వార్టర్లో కంపెనీ రెవెన్యూలు ఏడాది ఏడాదికి 12 శాతం పెరిగి రూ.19,128 కోట్లగా రికార్డయ్యాయి. మార్చి క్వార్టర్లో ఈ రెవెన్యూలు రూ.18,083 కోట్లగా ఉన్నాయి. జూన్తో ముగిసిన ఈ క్వార్టర్లో బేసిక్ ఈపీఎస్ 16.62 రూపాయలుగా ఉందని ఇన్ఫోసిస్ తెలిపింది. స్థిరమైన కరెన్సీ విలువల్లో 2019 ఆర్థిక సంవత్సరపు రెవెన్యూ గైడెన్స్ 6 శాతం నుంచి 8 శాతం మధ్యలోనే ఉంచింది. ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్ను కూడా 22 శాతం నుంచి 24 శాతంగానే నిర్ణయించింది. మొత్తం రెవెన్యూల్లో డిజిటల్ రెవెన్యూలు 28.4 శాతంగా 803 మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు కంపెనీ తన ఫలితాల్లో వెల్లడించింది. ప్రస్తుతం పనాయా కోసం జరుగుతున్న చర్చలు తమ లాభాలపై ప్రభావం చూపాయని ఇన్ఫోసిస్ చెప్పింది. గత క్వార్టర్లో ఈ ఇజ్రాయెల్ సాఫ్ట్వేర్ కంపెనీని చెందిన పలు ఆస్తులను కంపెనీ అమ్మకానికి ఉంచింది. అమ్మకానికి ఉంచిన ఆ ఆస్తుల ఫెయిర్ వాల్యును కంపెనీ తగ్గించడంతో, ఈ ప్రభావం నికర లాభాలపై చూపిందని ఇన్ఫోసిస్ పేర్కొంది. పనాయాను కొనుగోలు చేసేటప్పుడు కూడా కంపెనీలో పలు పరిణామాలు ఎదరయ్యాయి. ఈ డీల్ వ్యవహారం కాస్త రచ్చకే దారితీసింది. -
మారుతీ అంచనాలు మిస్, అయినా...
దేశీయ అతిపెద్ద కారు తయారీదారి మారుతీ సుజుకీ విశ్లేషకుల అంచనాలను మిస్ చేసింది. అయినప్పటికీ నేడు ప్రకటించిన క్యూ4 ఫలితాల్లో కంపెనీ నికర లాభాలు 10శాతం పైకి ఎగిశాయి. ఈ క్వార్టర్లో కంపెనీ లాభాలు రూ.1,882 కోట్లగా నమోదయ్యాయి. విశ్లేషకుల ప్రకారం మారుతీ సుజుకీ రూ.2,087 కోట్ల లాభాలను నమోదు చేస్తుందని అంచనాలు వెలువడ్డాయి. కానీ అంచనాల కంటే కాస్త తక్కువగా లాభాలను మారుతీ సుజుకీ ప్రకటించింది. గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ లాభాలు రూ.1,710.50 కోట్లగా ఉన్నాయి. మొత్తం ఆదాయం ఈ క్వార్టర్లో 2 శాతం పెరిగి రూ.21,760.60 కోట్లగా ఉంది. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీ 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో షేరుపై రూ.80 డివిడెండ్ ప్రకటించింది. ఎక్కువ పన్ను రేటు తమ క్యూ4 ప్యాట్ గణాంకాలపై ప్రభావం చూపిందని, అంతేకాక మెటల్ వ్యయాలు కూడా ఈ ఏడాది రూ.700 కోట్లు పెరగడంతో లాభాలు కాస్త తగ్గినట్టు పేర్కొంది. తమ పాపులర్ కారుగా ‘మారుతీ 800’ ఉన్నట్టు కంపెనీ ప్రకటించింది. మొత్తంగా జనవరి-మార్చి క్వార్టర్లో కంపెనీ 4,61,773 వాహనాలు విక్రయించినట్టు మారుతీ సుజుకీ తెలిపింది. గతేడాది ఇదే క్వార్టర్ కంటే ఇవి 11.4 శాతం పెంపుగా వెల్లడించింది. దేశీయ మార్కెట్లో 4,27,082 యూనిట్లను విక్రయించినట్టు, విదేశాలకు 34,691 యూనిట్లు ఎగుమతి చేసినట్టు పేర్కొంది. -
అంచనాలు బీట్ చేయలేకపోయిన విప్రో
న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం విప్రో స్ట్రీట్ అంచనాలను అందుకోలేకపోయింది. ఏడాది ఏడాదికి కన్సాలిడేట్ నికర లాభాల్లో విప్రో 21 శాతం క్షీణించింది. నేడు ప్రకటించిన మార్చి క్వార్టర్ ఫలితాల్లో విప్రో నికర లాభం రూ.1,800.80 కోట్లగా నమోదైంది. గతేడాది ఇదే క్వార్టర్లో విప్రో లాభం రూ.2,267 కోట్లు. ఈటీనౌ పోల్ అంచనాల్లో విప్రో రూ.2,140 కోట్లు ఆర్జిస్తుందని అంచనావేశారు. కానీ ఈ అంచనాలను కూడా విప్రో అందుకోలేకపోయింది. సీక్వెన్షియల్ బేసిస్లో కంపెనీ లాభాలు 6.7 శాతం పడిపోయాయి. ఆపరేషన్స్ నుంచి వచ్చిన రెవెన్యూలు ఈ క్వార్టర్లో రూ.13,768.6 కోట్లగా ఉన్నాయి. గతేడాది ఇదే క్వార్టర్లో ఇది రూ.13,987.5 కోట్లుగా రికార్డయ్యాయి. ఒక్కో షేరుపై వచ్చిన రెవెన్యూలు 4 రూపాయలుగా నమోదైనట్టు కంపెనీ తెలిపింది. విప్రో ఎయిర్పోర్ట్ ఐటీ సర్వీసుల్లో కంపెనీ ఈక్విటీ హోల్డింగ్ 74 శాతం నుంచి 11 శాతానికి తగ్గించుకున్నట్టు పేర్కొంది. కంపెనీ మొత్తం ఆదాయం రూ.14,304.6 కోట్లగా ఉన్నట్టు వెల్లడించింది. గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ మొత్తం ఆదాయం రూ.15,045.5 కోట్లగా ఉంది. మొత్తంగా ఇవి అంత మంచి ఫలితాలు కావని, కొన్ని కారణాల వల్ల తమ ఫలితాలపై ప్రభావం చూపుతుందని అంతకమందే కంపెనీ సంకేతాలు ఇచ్చిన స్వతంత్ర మార్కెట్ విశ్లేషకుడు పంకజ్ శర్మ చెప్పారు. కానీ ఆ సవాళ్లను పరిగణలోకి తీసుకున్నప్పటికీ ఇవి అంతమంచి ఫలితాలు కావని పేర్కొన్నారు. రేపు విప్రో స్టాక్ కరెక్షన్ గురయ్యే అవకాశముందని, కనీసం 2 శాతం నుంచి 4 శాతం కిందకి పడిపోతుందని శర్మ అంచనావేస్తున్నారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు భారీ డివిడెంట్
ఆస్తుల పరంగా రెండో అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఫలితాల్లో అదరగొట్టింది. నేడు(శనివారం) వెల్లడించిన మార్చి క్వార్టర్ ఫలితాల్లో బ్యాంకు నికర లాభాలు 20 శాతం జంప్ చేసి రూ.4799 కోట్లగా రికార్డైనట్టు వెల్లడించింది. కాగ గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ లాభాలు రూ.3990 కోట్లగా ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు భారీ డివిడెంట్ ప్రకటించింది. 2 రూపాయల గల ఒక్కో షేరుకు 13 రూపాయల డివిడెంట్ ఇచ్చేందుకు బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ప్రతిపాదించినట్టు పేర్కొంది. ఇది షేర్ల ఫేస్ విలువకు 650 శాతం అధికం. గతేడాది ఇదే క్వార్టర్లో 11 రూపాయల డివిడెంట్ ప్రకటించింది. వచ్చే వార్షిక సాధారణ సమావేశంలో పెట్టుబడిదారులు దీన్ని ఆమోదించనున్నారు. విశ్లేషకుల అంచనాల ప్రకారం హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ.4,838 కోట్ల లాభాలను ఆర్జిస్తుందని తెలిసింది. కానీ విశ్లేషకుల అంచనాలకు కాస్త దగ్గర్లోనే బ్యాంకు తన ఫలితాలను ప్రకటించింది. బ్యాంకు నికర ఆదాయాలు ఏడాది ఏడాదికి 17.7 శాతం పెరిగి రూ.10,657.71 కోట్లగా ఉన్నాయి. బ్యాంకుల ఆస్తుల నాణ్యత స్థిరంగా ఉన్నట్టు హెచ్డీఎఫ్సీ తెలిపింది. స్థూల నిరర్థక ఆస్తులు 1.30 శాతంగా ఉన్నాయి. అంతేకాక నికర ఎన్పీఏలు గత డిసెంబర్ క్వార్టర్లో 0.44 శాతంగా ఉంటే, ఈ మార్చి క్వార్టర్లో 0.40 శాతంగా నమోదయ్యాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా శుక్రవారం హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు 0.98 శాతం పెరిగి, రూ.1,960.95 వద్ద ముగిశాయి. -
జెట్ ఎయిర్వేస్ లాభం 91 శాతం డౌన్
ముంబై: ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్వేస్’ నికర లాభం (స్డాండోలోన్) ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో 91 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.549 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.50 కోట్లకు తగ్గిందని జెట్ ఎయిర్వేస్ తెలిపింది. ఇతర ఆదాయం భారీగా పడిపోవడంతో నికర లాభం ఈ స్థాయిలో క్షీణించిందని జెట్ ఎయిర్వేస్ సీఈఓ వినయ్ దుబే చెప్పారు. మొత్తం అమ్మకాలు రూ.5,773 కోట్ల రూ.5,758 కోట్లకు తగ్గాయని తెలిపారు. ఇతర ఆదాయం రూ.320 కోట్ల నుంచి రూ.132 కోట్లకు తగ్గిందని పేర్కొన్నారు. ఈ క్యూ2లో తమ విమాన సర్వీసుల ద్వారా ప్రయాణించిన వారి సంఖ్య 8 శాతం వృద్ధితో 73 లక్షలకు పెరిగిందని తెలిపారు. -
అదరగొట్టిన ఇన్ఫోసిస్
న్యూఢిల్లీ : ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వరుస లాభాలతో దూసుకెళ్తోంది. విశ్లేషకుల అంచనాలను అధిగమిస్తూ ఇన్ఫోసిస్ మెరుగైన ఫలితాను నమోదు చేసింది. నాలుగో త్రైమాసిక గణాంకాలను శుక్రవారం విడుదల చేసింది. గత త్రైమాసికం కంటే అధికంగా 3.9శాతం లాభాలను ఆర్జించిన ఇన్ఫోసిస్, ఈ నాలుగో త్రైమాసికంలో రూ.3597 కోట్ల నికర ఆదాయాన్ని నమోదు చేసింది. చివరి త్రైమాసికంలో ఈ కంపెనీ నికర ఆదాయం రూ.3465 కోట్లగా ఉంది. కంపెనీ సీఈవో గా విశాల్ సిక్కా పదవి బాధ్యతలు చేపట్టాక ఇన్ఫోసిస్ లాభాల బాట పట్టింది. బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ వరుసగా నాలుగుసార్లు లాభాలనే నమోదు చేయడం విశేషం. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు సెలవులను పాటిస్తుండటంతో, సోమవారం రోజు ప్రారంభమయ్యే ట్రేడింగ్ లో ఇన్ఫోసిస్ షేర్లు లాభాల బాట పట్టే అవకాశం ఉంటుందని నిపుణులంటున్నారు. దీని ప్రభావం ఇతర ఐటీ కంపెనీలపై కూడా ఉండి, లాభాలను నమోదుచేస్తాయని అంచనావేస్తున్నారు.