-
భారత్ Vs మాల్దీవులు: ముయిజ్జు మరో సంచలన నిర్ణయం
మాలె: డ్రాగన్ కంట్రీ చైనా అండతో మాల్దీవుల ప్రభుత్వం భారత వ్యతిరేక కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు మరోసారి భారత వ్యతిరేకతను వెళ్లగక్కారు. క్రమంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాల్దీవులకు భారత్ అందజేసిన హెలికాప్టర్, దాన్ని నిర్వహిస్తున్న సిబ్బందిపై పూర్తి నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్లు మాల్దీవుల జాతీయ రక్షణ దళం ప్రకటించింది. వివరాల ప్రకారం.. మాల్దీవుల ప్రభుత్వం భారత్కు వ్యతిరేకంగా మరో నిర్ణయం తీసుకుంది. చైనా అండతో భారత వ్యతిరేక చర్యలకు పదునుపెడుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే తమ భూభాగం నుంచి భారత సైనికులను పంపించేయాలని నిర్ణయించగా తాజాగా మరో ముందడుగు వేసింది. భారత్ అందజేసిన హెలికాప్టర్, దాన్ని నిర్వహిస్తున్న సిబ్బందిపై పూర్తి నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్లు మాల్దీవుల జాతీయ రక్షణ దళం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక, భారత దళాల ఉపసంహరణపై చర్చలు కొనసాగుతున్నాయని ఎంఎన్డీఎఫ్లోని ప్లాన్స్, పాలసీ, రీసోర్సెస్ విభాగం డైరెక్టర్ కర్నల్ అహ్మద్ ముజుథబ మహమ్మద్ తెలిపారు. మే 10 తర్వాత మాల్దీవుల భూభాగంపై విదేశీ దళాలు ఉండొద్దని అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఆదేశించినట్లు గుర్తుచేశారు. దీంతో, సైనిక సిబ్బంది నుంచి ఆ కేంద్రాల బాధ్యతలను చేపట్టేందుకు భారత్ నుంచి పౌర సిబ్బందితో కూడిన మరో బృందం అక్కడికి చేరుకుంది. కాగా, మాల్దీవుల్లో భారత్ మూడు వైమానిక కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
భారత బలగాలు మా భూభాగంపై వద్దేవద్దు
మాలె: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు మరోసారి భారత వ్యతిరేకతను వెళ్లగక్కారు. సాధారణ పౌర దుస్తుల్లోనైనా సరే భారత సైనిక సిబ్బంది తమ భూభాగంలో మే 10వ తేదీ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరాదని అన్నారు. మాల్దీవుల్లో భారత్ మూడు వైమానిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడి ప్రభుత్వం మార్చి 10వ తేదీ కల్లా భారత సైనిక సిబ్బంది వాటిని విడిచి వెళ్లిపోవాలని గడువు ప్రకటించింది. దీంతో, సైనిక సిబ్బంది నుంచి ఆ కేంద్రాల బాధ్యతలను చేపట్టేందుకు భారత్ నుంచి పౌర సిబ్బందితో కూడిన మరో బృందం అక్కడికి చేరుకున్న నేపథ్యంలో చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధ్యక్షుడు ముయిజ్జు మళ్లీ తన బుద్ధిని బయటపెట్టారు. భారతీయ సిబ్బంది ఏ రూపంలోనైనా సరే తమ దీవిలో ఉండరాదన్నారు. -
అధ్యక్షుడు ముయిజ్జుపై అవిశ్వాసం
మాలె: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ (ఎండీపీ) సిద్ధమవుతోంది. ఎండీపీకి పార్లమెంట్లో మెజారిటీ ఉంది. చైనా అనుకూల అధ్యక్షుడు ముయిజ్జు కేబినెట్లోకి నలుగురు మంత్రులను చేర్చుకునే అంశంపై ఆదివారం పార్లమెంట్లో ఓటింగ్ జరిగింది. నలుగురిలో ఒక్కరికి మాత్రమే పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ముగ్గురిని తిరస్కరించింది. ఇందుకు ఆగ్రహిస్తూ అధికార పక్షం ఎండీపీకి చెందిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్లపై అవిశ్వాసం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రతిపక్ష ఎంపీలు బాహాబాహీకి దిగారు. ఇద్దరు గాయపడ్డారు. ఈ పరిణామాలతో ఎండీపీ, మిత్రపక్షం డెమోక్రాట్లతో కలిసి ముయిజ్జుపై అవిశ్వాసం పెట్టాలని సోమవారం నిర్ణయించింది. పార్లమెంట్లో మొత్తం 80 మంది సభ్యులకు గాను ఎండీపీకి 45 మంది, డెమోక్రాట్లకు 13 మంది ఉన్నారు. -
మాల్దీవుల్లో విదేశీ జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నాం: చైనా
బీజింగ్: మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నామని చైనా పేర్కొంది. మాల్దీవుల సార్వ భౌమత్వం, స్వాతంత్య్రాలకు తమ మద్దతు ఉంటుందని తెలిపింది. మాల్దీవుల అధ్యక్షు డు ముయిజ్జు చైనాలో అయిదు రోజుల పర్యటన శుక్రవారంతో ముగియ నుంది. ఈ సందర్భంగా రెండు దేశాలు తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు పరస్ప రం మద్దతుగా నిలవాలంటూ ఒక ప్రకటన విడుదలైంది. ‘మాల్దీవుల సార్వభౌమాదికారం, స్వాతంత్య్రం, జాతి గౌరవాన్ని నిలబెట్టడంలో చైనా గట్టిగా మద్దతిస్తుంది. మాల్దీవుల విధానాలను గౌరవిస్తుంది, మద్దతు ఇస్తుంది. మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో బాహ్య జోక్యాన్ని వ్యతిరే కిస్తుంది’అని అందులో పేర్కొంది. భారత ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను అధ్యక్షుడు ముయిజ్జు తొలగించడం, ఈ వ్యవహారం ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తలు పెంచడం తెలిసిందే. ఈ సమయంలోనే చైనా అనుకూలుడిగా పేరున్న ముయిజ్జు బీజింగ్ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. పర్యటన అనంతరం చైనాపై ప్రకటన విడుదల చేయడం గమనార్హం. -
భారత దళాలు వైదొలగాలి
మాలె: మాల్దీవుల నుంచి భారత సైనిక దళాలు వైదొలగాలని ఆ దేశాధ్యక్షునిగా ఎన్నికైన మహమ్మద్ ముయ్జ్జు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే చైనా దళాలను కూడా తమ భూభాగంపైకి అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. భారత దళాలను వెనక్కు పంపుతానని ఎన్నికల సందర్భంగా ఆయన వాగ్దానం చేశారు. మాల్దీవుల్లో 70 మంది భారతసైనిక సిబ్బంది ఉన్నారు. భారత్ అందజేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తుంటారు. ఆ ప్రాంతంలో సైనికంగా ప్రభావం చూపేందుకు, ముఖ్యంగా మాల్దీవులపై పట్టు కోసం భారత్, చైనా దశాబ్దాలుగా పోటాపోటీగా ప్రయతి్నస్తూ వస్తున్నాయి. -
ప్రేరేపిత ఉగ్రవాదంతో ముప్పు
మాలి: ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమే ప్రపంచానికి అతిపెద్ద ముప్పుగా మారిందని, దీనిపై పోరాటం సాగించేందుకు అందరూ ఏకం కావాలని భారత ప్రధాని మోదీ ప్రపంచ నేతలకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మాల్దీవుల పార్లమెంట్ మజ్లిస్నుద్దేశించి ప్రసంగించారు. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ ‘పొరుగుకే మొదటి ప్రాధాన్యం’అన్న ప్రభుత్వ విధానంలో భాగంగా మొట్టమొదటి పర్యటన మాల్దీవులతో ప్రారంభించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మాల్దీవుల రాజధాని మాలీకి చేరుకున్న మోదీకి విమానాశ్రయంలో విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ ఘన స్వాగతం పలికారు. అనంతరం రిపబ్లిక్ స్క్వేర్ వద్ద అధ్యక్షుడు సోలిహ్ సాదర స్వాగతం పలికారు. మోదీ సైనిక దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అధ్యక్షుడు మొహమ్మద్ సోలిహ్ ఆయనకు విదేశీ ప్రముఖులకిచ్చే అత్యున్నత పురస్కారం రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్జుద్దీన్తో గౌరవించారు. మోదీ భారత క్రికెట్ జట్టు సభ్యుల సంతకాలతో కూడిన క్రికెట్ బ్యాట్ను సోలిహ్కి బహూకరించారు. రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు క్రికెట్ దోహదపడుతుందని, మాల్దీవుల్లో క్రికెట్ అభివృద్ధికి సాయపడతామని తెలిపారు. అనంతరం ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య ఫెర్రీ సేవలను ప్రారంభించడం వంటి పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఉగ్రవాదంపై అంతర్జాతీయ సదస్సు జరగాలి చరిత్రకు పూర్వం నుంచే భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయని భారత ప్రధాని మోదీ అన్నారు. మాల్దీవుల పార్లమెంట్లో ఆయన ప్రసంగిస్తూ..స్పీకర్గా ఎన్నికైన మొహమ్మద్ నషీద్ మజ్లిస్మొదటి సమావేశానికి తనను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ చర్య ప్రతి భారతీయుడిని కదిలించి, ఇక్కడి ప్రజల పట్ల గౌరవాన్ని పెంచిందన్నారు. మాల్దీవుల్లో ప్రజాస్వామ్యం బలపడేందుకు ప్రతి భారతీయుడూ వెన్నంటి ఉంటారని భరోసా ఇచ్చారు. ‘ఉగ్రవాదం ఏదో ఒక దేశానికే పరిమితమైంది కాదు, అది నాగరికతకే పెనుముప్పు. ప్రపంచ దేశాలన్నీ కలిసి వాతావరణ మార్పులపై సమావేశాలు, చర్చలు జరిపిన విధంగానే ఉగ్రవాదం అంశంపైనా అంతర్జాతీయ సదస్సు జరపాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. ఉగ్రవాదుల్లో మంచి వారు, చెడ్డ వారు ఉన్నారంటూ కొందరు తేడా చూపుతూ పొరపాటు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వాల ప్రేరేపిత ఉగ్రవాదం ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలని ఆయన పరోక్షంగా పాకిస్తాన్ను ఉద్దేశించి పేర్కొన్నారు. ఈ తరహా ఉగ్రవాదం తీవ్ర ప్రమాదకరంగా మారిన ప్రస్తుత తరుణంలో ప్రపంచ నేతలంతా ఏకం కావాలని ఆయన కోరారు. ఇద్దరు నేతల ఉమ్మడి ప్రకటన రెండు దేశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కలిసికట్టుగా సమర్థంగా ఎదుర్కోవాలని ప్రధాని మోదీ, అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ నిర్ణయించారు. ఈ మేరకు వారిద్దరూ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ‘రెండు దేశాల ఉమ్మడి భద్రతా పరమైన అంశాల గుర్తించి, ఈ ప్రాంతంలో సుస్థిరత సాధించేందుకు పరస్పరం సహకరించుకోవాలి. రెండు దేశాల్లోనూ ఎటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు జరగనివ్వరాదు. హిందూమహా సముద్ర ప్రాంతంలో శాంతి, సుస్థిరత నెలకొల్పేందుకు సహకారం బలోపేతం చేసుకోవాలి. సమన్వయంతో కూడిన గస్తీ, నిఘా, సమాచార మార్పి, బలగాల పెంపు తదితర అంశాల ద్వారా సముద్ర ప్రాంత రక్షణను బలోపేతం చేసుకోవాలి. మెరుగవుతున్న సంబంధాలు గత ఏడాది నవంబర్లో సోలిహ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు. భారత ప్రధాని మాల్దీవులు సందర్శించడం ఎనిమిదేళ్లలో అదే ప్రథమం. గత ఏడాది ఫిబ్రవరిలో అప్పటి అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ చైనా పరోక్ష జోక్యం ప్రభావం ఫలితంగా దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించడం వంటి పలు చర్యలతో రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దిగజారిన విషయం తెలిసిందే. సోలిహ్ అధికారంలోకి వచ్చాక భారత్–మాల్దీవుల సంబంధాలు తిరిగి గాడినపడ్డాయి. ఈ ఏడాది ఏప్రిల్లో భారత్లో పర్యటించిన సందర్భంగా బెంగళూరులో జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ను మాల్దీవుల అధ్యక్షుడు సోలిహ్ వీక్షించారు. అనంతరం ఆయన తమ దేశంలో క్రికెట్ అభివృద్ధికి భారత్ సాయం కోరారు. కేరళ నాకెంతో ప్రియమైనది తిరువనంతపురం: లోక్సభ ఎన్నికల్లో గెలచాక మోదీ తొలిసారిగా కేరళలో పర్యటించారు. కేరళ బీజేపీ విభాగం ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్న ప్రధాని.. తన సొంత నియోజకవర్గం వారణాసి మాదిరిగానే కేరళ తనకెంతో ప్రియమైనదని చెప్పారు. బీజేపీకి అద్భుత విజయాన్ని అందించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ ఈ ఎన్నికలు వ్యతిరేక శక్తుల్ని తిరస్కరించాయి. చెడుపై మంచి విజయం సాధించింది. ఇదే స్ఫూర్తితో నవ భారత నిర్మాణానికి అందరం కలసికట్టుగా పనిచేయాలి‘‘ అని మోదీ పిలుపునిచ్చారు. కేరళలో మాకు ఒక్క సీటు రాకపోయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలపై ఎంతో గౌరవం ఉంది. ఇక్కడ ప్రజలు ఎంతో అద్భుతమైనవారు. వారితో బంధం మరింత దృఢపడాలని కోరుకుంటున్నాను‘‘ అని అన్నారు. గురువాయూర్లో మోదీ తులాభారం కేరళ పర్యటనలో భాగంగా మోదీ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శిం చుకున్నారు. స్వామివారి సమక్షంలో తామరపూలతో తులాభారం నిర్వహించారు. తామరపూలతో మోదీ శ్రీకృష్ణుడికి మొక్కును చెల్లించుకున్నారు. గురువాయూర్ ఆలయం పరమపవిత్రమైనది. కృష్ణ భగవానుడికి అరటిపళ్లు, తామరపూలు, నెయ్యి సమర్పించారు. ప్రధాని మోదీ శ్రీకృష్ణ ఆలయంలో దాదాపుగా 20 నిముషాల సేపు గడిపారు. కేరళ సంప్రదాయం ప్రకారం పూర్ణ కుంభాలతో శ్రీకృష్ణ ఆలయ అధికారులు ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేరళ సంప్రదాయ వస్త్రధారణ అయిన తెలుపు రంగు ముండు(ధోతీ), కుర్తాతో పాటు శాలువాను మోదీ ధరించారు. గురువాయూర్లో పంచెకట్టులో ప్రధాని అభివాదం. తామరపుష్పాలతో తులాభారం దృశ్యం -
పేగు బంధం ‘ఫిదా’
మదనపల్లె టౌన్ (చిత్తూరు జిల్లా): మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ వహీద్ హసన్, ఆయన భార్య ఇలహం దంపతులు ఆదివారం భారత్కు వచ్చారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఉంటున్న కుమార్తె ఫిదా, అల్లుడు కొప్పల జనార్దన్రెడ్డి, మనవడు గోపాల్రెడ్డిలను చూడటానికి వారు సముద్రాలు దాటి వచ్చారు. అల్లుడు జనార్దన్రెడ్డి పెదతల్లి దేవనమ్మ మదనపల్లెలో మదర్ మీరా పేరిట ఆశ్రమ పాఠశాల నెలకొల్పారు. ఆ పనులపై ఆమె తరచూ జర్మనీ వెళ్లి వస్తుండేవారు. ఒక సందర్భంలో ఆమె సుమారు పదేళ్లపాటు అక్కడి ఆశ్రమంలో ఉండాల్సి వచ్చింది. ఆశ్రమ పాఠశాల నిర్వహణ బాధ్యతలు చూస్తున్న జనార్దనరెడ్డి పెదతల్లిని చూడటానికి 2015లో జర్మనీ వెళ్లారు. అదే సమయంలో మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ వహీద్ హసన్ భార్య ఇలహం జర్మనీ ఆశ్రమంలోనే ఉన్నారు. ఆమెను చూడటానికి కుమార్తె ఫిదా మాల్దీవుల నుంచి వచ్చింది. ఒకే సమయంలో తల్లిని చూడటానికి వెళ్లిన ఫిదా, పెద తల్లిని చూడటానికి వెళ్లిన జనార్దన్రెడ్డి ప్రేమలో పడ్డారు. ఆ తరువాత జనార్దన్రెడ్డి స్వదేశానికి వచ్చేశారు. జనార్దన్ను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్న ఫిదా.. తల్లిదండ్రులను ఒప్పించింది. 2016లో చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం హార్సిలీ హిల్స్ సమీపంలోని కాండ్లమడుగు క్రాస్లో గల వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఇరువర్గాల తల్లిదండ్రులు జనార్దన్, ఫిదాలకు హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. అప్పటినుంచి జనార్దన్, ఫిదా దంపతులు మదనపల్లెలోనే నివాసం ఉంటున్నారు. ఆ దంపతులకు ఏడాదిన్నర క్రితం కుమారుడు గోపాల్రెడ్డి జన్మించగా, ఫిదా ప్రస్తుతం 7 నెలల గర్భిణి. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు మహమ్మద్ వహీద్ హసన్, ఇలహం ఆదివారం మదనపల్లెకు వచ్చారు. అల్లుడు, కుమార్తె, మనవడితోపాటు వారి బంధువులను కలుసుకున్నారు. సోమవారం కూడా వీరు ఇక్కడే ఉంటారు. మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మదనపల్లెకు వస్తున్నారని తెలిసి.. జిల్లా ఎస్పీ విక్రాంత్పాటిల్, డీఎస్పీ చిదానందరెడ్డి ప్రోటోకాల్ ప్రకారం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రూరల్ ఎస్ఐ దిలీప్కుమార్ దగ్గరుండి పర్యవేక్షించారు. -
మాల్దీవులకు భారత్ 10వేల కోట్ల సాయం
న్యూఢిల్లీ: చైనా రుణ భారం నుంచి విముక్తి కల్పించేందుకు మాల్దీవులకు భారత్ సాయం అందించనుంది. దీంతోపాటు దెబ్బతిన్న సంబంధాలను తిరిగి బలోపేతం చేసుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్ చేరుకున్న మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్తో సోమవారం భారత ప్రధాని నరేంద్రమోదీ చర్చలు జరిపారు. అధ్యక్షుడు యమీన్ హయాంలో చైనా నుంచి తీసుకున్న రుణ భారం నుంచి బయటపడేందుకు వీలుగా మాల్దీవులకు రూ.10వేల కోట్ల రుణ సాయం అందజేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ సందర్భంగా రెండు దేశాల నేతలు నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేశారు. హిందూమహా సముద్ర ప్రాంతంలో భద్రతను మరింత పెంచేందుకు సహకరించుకోవాలని ఇద్దరు నేతలు అంగీకరించారు. -
సంబంధాలు పునర్నిర్మించుకుందాం!
మాలె: మాల్దీవుల నూతన అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలితో కలసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల్ని పునర్నిర్మించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. శనివారం సోలి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన మోదీ.. ఆ వెంటనే ఆయనతో సమావేశమై చర్చలు జరిపారు. అభివృద్ధి, శాంతి కోసం మాల్దీవులు చేస్తున్న ప్రతి ప్రయత్నానికి అండగా ఉంటామని మోదీ హామీ ఇచ్చారు. హిందూ మహా సముద్ర తీర ప్రాంతంలో శాంతి, భద్రతల పరిరక్షణకు, ఒకరి ఆశయాలు, ప్రయోజనాల్ని మరొకరు గౌరవించుకునేందుకు ఇద్దరు నేతలు అంగీకరించారు. మాల్దీవుల్లో అధికార మార్పిడి అనంతరం ఇరు దేశాల సంబంధాలు తిరిగి పూర్వ స్థితికి చేరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉగ్రపోరులో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. దేశం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సమస్యల్ని సోలి మోదీ దృష్టికి తీసుకొచ్చారు. గృహ, మౌలిక వసతుల అభివృద్ధితో పాటు తాగు నీరు, మురుగు నీటి నిర్వహణ తదితర సౌకర్యాల్ని వెంటనే మెరుగుపరచాల్సి ఉందని చెప్పారు. పదవి నుంచి దిగిపోయిన అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ హయాంలో రెండు దేశాల సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. చైనాకు అనుకూల వ్యక్తిగా పేరొందిన యామీన్.. ఆ దేశంలో అత్యవసర పరిస్థితి విధించడాన్ని భారత్ వ్యతిరేకించింది. విమానాశ్రయంలో ఘన స్వాగతం.. అంతకుముందు, మాల్దీవుల రాజధాని మాలె చేరుకున్న ప్రధాని మోదీకి విమానాశ్రయంలో రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. సోలి ప్రమాణస్వీకారం సందర్భంగా మాల్దీవుల మాజీ అధ్యక్షులు అబ్దుల్ గయూమ్, మహ్మద్ నషీద్ల మధ్య కూర్చున్న మోదీ..వారిని హత్తుకున్నారు. శ్రీలంక మాజీ అధ్యక్షురాలు చంద్రికా కుమారతుంగతోనూ ముచ్చటించారు. సోలి ప్రమాణానికి హాజరైన అత్యున్నత స్థాయి ప్రభుత్వాధినేత మోదీనే కావడం గమనార్హం. ప్రధాని హోదాలో మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. -
ఓటమిని అంగీకరిస్తున్నా
కొలంబో: మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు, భార త్ విరోధిగా పేరుపడ్డ అబ్దుల్లా యామీన్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని ఎట్టకేలకు అంగీకరించారు. మాల్దీవులతో సాన్నిహిత్యం కోసం భారత్, చైనాల మధ్య పోరు సాగుతున్న ప్రస్తుత తరుణంలో.. ఫలితాన్ని యామీన్ అంగీకరిం చపోవచ్చన్న సందేహాలకు ఆయన తెరదిం చారు. ‘మాల్దీవుల ప్రజలు వారికి కావాల్సింది నిర్ణయించారు. నేను ఫలితాల్ని అంగీకరిస్తు న్నాను’ అని దేశ ప్రజల్ని ఉద్దేశించి యామీన్ ప్రసంగించారు. ఎన్నికల్లో విజయం సాధించిన విపక్షాల అభ్యర్థి ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ను కలిసి అభినందించానని ఆయన తెలిపారు. 2013లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యామీన్ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన అభిసంశనకు ప్రయత్నించిన ప్రతిపక్ష నేతల్ని, వ్యతిరేకంగా తీర్పునిచ్చిన జడ్జీల్ని జైలుకు పంపారు. భారత్ వ్యతిరేకిగా మారి చైనాతో దోస్తీకి ప్రాధాన్యతని చ్చారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన సోలిహ్ భారత్ అనుకూలవాది పేరుపడ్డారు. భారత్తో సంబంధాలకు ప్రాధాన్యం ఆదివారం వెలువడ్డ అధ్యక్ష ఫలితాల్లో మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన సోలిహ్కు 58.3 శాతం ఓట్లు దక్కగా.. యామీన్కు 41.7 శాతం ఓట్లే వచ్చాయి. సోలిహ్ విజయం సాధించారని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించడంతో పాటు, ప్రభుత్వ మీడియా కూడా ప్రసారం చేయడంతో యామీన్ తప్పుకోవడం ఖాయమని ముందుగానే తెలిసిపోయింది. సోలిహ్కు భారత్ అభినందనలు తెలిపింది. ‘ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య శక్తుల విజయానికి సంకేతమే కాదు. ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధ పాలన అవసరాన్ని ప్రతిఫలించాయి’ అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. యామీన్ను దెబ్బకొట్టిన చైనాతో దోస్తీ భారత్ ఎత్తుగడ పనిచేసింది. పొరుగునే ఉన్న మాల్దీవుల్లో ఈ ఏడాది రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడు సైన్యాన్ని పంపకుండా సంయమనం పాటించడం ఇప్పుడు కలిసొచ్చింది. తమ దేశంలో భారత్ సైనిక జోక్యం చేసుకుంటే చైనా సహాయం కోరదామన్న యామీన్ పన్నిన వ్యూహం పారలేదు. కొన్ని దశాబ్దాలుగా స్నేహహ స్తాన్ని అందిస్తున్న భారత్ను కాదని, చైనాకు దగ్గర కావడమే కాకుండా తమ దేశాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసిన యామీన్పై ప్రజల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమైంది. చైనా నుంచి 130 కోట్ల డాలర్ల రుణాలు తీసుకోవడంతో దేశం అప్పుల ఊబిలో కూరుకుని ఆర్థిక సంక్షోభంలో పడింది. దీంతో పాటు మౌలికసదుపాయాలు, ఇతర ప్రాజెక్టులపై చైనా 200 కోట్ల డాలర్ల వరకు ఖర్చుచేసింది. అభివృద్ధి ప్రాజెక్టులను చైనీస్ కంపెనీలకు అప్పగించారు. చైనా చేపట్టిన సిల్క్రోడ్డు, భారత్ వ్యతిరేకిస్తున్న బెల్ట్రోడ్డుకు యామీన్ మద్దతు ప్రకటించారు. 2013లో అధికా రాన్ని చేపట్టాక యామీన్ తన రాజకీ య ప్రత్యర్థులను ఖైదు చేయడం లేదా ఇతర దేశాలకు ప్రవాసం వెళ్లేలా చేశారు. రాజకీయ వివాదాలు ముదరడంతో ఈ ఏడాది ఫిబ్రవ రిలో అబ్దుల్ యామీన్ 45 రోజుల పాటు దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. -
మాల్దీవులు మాజీ ఉపాధ్యక్షుడికి జైలు
మాలె: మాల్దీవులు అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ను హత్య చేసేందుకు కుట్రపన్నిన కేసులో ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్కు 15 ఏళ్ల జైలు శిక్షపడింది. గత సెప్టెంబర్లో స్పీడ్ బోటులో బాంబు పెట్టి అబ్దుల్లాను చంపేందుకు అదీబ్ కుట్రపన్నినట్టు నేరం రుజువైంది. అదీబ్తో పాటు ఆయన బాడీగార్డులు ఇద్దరిని కోర్టు దోషులుగా ప్రకటించింది. వీరికి ఒక్కొక్కరికి పదేళ్ల జైలు శిక్షపడింది. గురువారం తీర్పు వెలువరించిన న్యాయస్థానం ఈ రోజు శిక్షను ఖరారు చేసింది. తాజా తీర్పుతో యమీన్ శత్రువులు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయారు. కొందరు దేశ బహిష్కరణకు గురికాగా, మరికొందరు జైలుపాలయ్యారు.