-
అయ్యయ్యో..ఎంత విషాదం: మంచికోసం వెళ్లి..మృత్యు ఒడిలోకి!
ఎవరికి ఏమైతే నాకేంటిలే అని అనుకోకుండా తోటి మనిషికి సాయం చేయాలని ప్రయత్నించిన వ్యక్తి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదంలో చిక్కుకున్న మనషికి సాయం చేయాలని ప్రయత్నించి తానే ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. నైరుతి ఢిల్లీలోని కార్గిల్ చౌక్ సమీపంలో నవంబర్ 3న ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ప్రమాదంలో గాయపడిన తోటి బైకర్ను రక్షించి, ఆ ప్లేస్ నుంచి బయలుదేరుతున్న సమయంలో వాటర్ ట్యాంక్ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొనడంతో షంషేర్ సింగ్ అనే వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదైంది. అమర్జీత్ సింగ్ నవంబర్ 3వ తేదీ రాత్రి 10.20 గంటల సమయంలో గురుగ్రామ్కు వెళుతుండగా, అతని కారును వెనుక నుంచి మోటార్ సైకిల్ ఢీకొట్టింది. అతను మద్యం సేవించి ఉండటంతో నియంత్రణ కోల్పోయి కారును ఢీకెట్టాడు. ఫలితంగా అతని తలకు గాయం అయింది. ఈ క్రమంలో కొంతమంది వ్యక్తులు సహాయం కోసం ఆగారు. వారిలో షంషేర్ కూడా ఉన్నారు. పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో మరొక వ్యక్తి గాయపడిన బైకర్ను తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ముందుకొచ్చాడు. దీంతో అమర్జీత్, షంషేర్ కలిసి గాయపడిన వ్యక్తిని కారులోకి ఎక్కించారు. అనంతరం అక్కడినుంచి షంషేర్ బయలుదేరుతుండగా వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ అతడిని బలంగా ఢీకొట్టింది. దీంతో షంషేర్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. దీంతో అమర్జీత్ ఆ వాహనాన్ని వెంబడించి, దాన్ని ఓవర్టేక్ చేయగలిగాడు. కానీ డ్రైవర్ అప్పటికే అక్కడినుంచి పారాపోయాడు. వాటర్ ట్యాంకర్ డ్రైవర్పై కేసు నమోదు చేశామనీ, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు అధికారి చెప్పారు. అలాగే షంషేర్ సాయం చేసిన బైకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాదని ద్వారకా నార్త్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. -
మనిషికి చిరాయువు ఇక సాధ్యమే?
సాధారణంగా ఎవరైనా ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షు కోరుకుంటారు. ఇందుకోసం అనేక ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. శాస్త్రవేత్తలు, వైద్య పరిశోధకులు కూడా మనిషి జీవిత కాలం పొడిగించేందుకు పలు పరిశోధనలు సాగిస్తుంటారు. ఈ నేపధ్యంలో అనేక సిద్ధాంతాలు, ప్రక్రియలు పుట్టుకొచ్చాయి. అయితే అవేవీ ఆశించినంత ఫలితాన్ని అందించలేదు. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తల నూతన పరిశోధనలు మనిషి దీర్ఘాయువుకు గట్టి హామీని ఇచ్చేలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు యాంటీ ఏజింగ్ డ్రగ్ కోసం పలు పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో వారు మనిషి దీర్ఘాయువుకు దోహదపడేలా పలు పరిష్కార మార్గాలను కనుగొంటున్నారు. వృద్ధాప్య కణాలను తొలగించి, అదే సమయంలో వాటి స్థానంలో కొత్త కణాలను సృష్టించడం ద్వారా దీర్ఘాయువు పొందవచ్చని చాలామంది భావిస్తుంటారు. తాజాగా బక్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఏజింగ్ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు కెనోరబ్డిటిస్ ఎలిగాన్స్ అనే నెమటోడ్లు (నీటిలో నివసించే సూక్ష్మజీవులు)లను ఎలుకలలో ప్రవేశపెట్టి వాటి జీవితకాలాన్ని పొడిగించడంలో విజయం సాధించారు. ఈ ప్రయోగాలు మనిషికి దీర్ఘాయువును అందించేందుకు చేస్తున్న పరిశోధనలకు దోహదపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కెనోరబ్డిటిస్ ఎలిగాన్స్ నెమటోడ్లు పుష్కలంగా మైక్రోఫాగీలను కలిగివుంటాయి. మైక్రోఫాగీ అనేది ఒకరరమైన తెల్లరక్త కణం. ఇది మనిషి రోగ నిరోధకశక్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మృత కణాలను తొలగించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. మైక్రోఫాగీ అనేది యాంటీఆక్సిడెంట్ కావడానికి తోడు న్యూరోప్రొటెక్టివ్ ప్రయోజనాలను అందిస్తుంది. కెనోరబ్డిటిస్ ఎలిగాన్స్ నెమటోడ్లు అందించే ప్రయోజనాలను కొమారిన్లో కూడా ఉన్నాయని కనుగొన్నారు. ఇవి మొక్కలలో కనిపిస్తాయి. ముఖ్యంగా దాల్చినచెక్కలో అధికంగా ఉంటాయి. దాల్చిన చెక్క అనేది సెల్యులార్ ఆటోఫాగి, లైసోసోమల్ ఫంక్షన్లను నిర్దేశించడంలో కీలకంగా ఉండే ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ కార్యాచరణను ప్రోత్సహిస్తున్నదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కొమారిన్ అనేది శరీరంలో కణాంతర రీసైక్లింగ్ వ్యవస్థను చక్కగా నిర్వహిస్తుంది. దీని కారణంగా వయస్సు పెరిగే ప్రక్రియ మందగించడం ప్రారంభమవుతుంది. శాస్త్రవేత్త, పరిశోధకులు శంకర్ చింతా.. న్యూరోనల్ కణాలపై సహజ సమ్మేళనాల ప్రభావం గురించి అధ్యయనం సాగిస్తున్నారు. ఈ పరిశోధనలు ఆశాజనకంగా ఉన్నాయని ఈ అధ్యయనానికి సారధ్యం వహిస్తున్న శాస్త్రవేత్త జూలీ ఆండర్సన్ చెప్పారు. మైక్రోఫాగీ ప్రేరేపిత సమ్మేళనాలు యాంటీ ఏజింగ్ థెరపీకి కీలకంగా ఉపయుక్తమవుతాయి. ఇవి ఎలుకల కండరాల కణాలలో మైటోకాన్డ్రియల్ పనిచేయకపోవడాన్ని కూడా నిరోధించాయని పరిశోధనల్లో తేలింది. మైటోకాండ్రియా అనేది ఆరోగ్యానికి, దీర్ఘాయువుకు దోహదపడుతుంది. లోపభూయిష్టమైన మైటోకాన్డ్రియల్ ఫంక్షన్ పార్కిన్సన్స్, అల్జీమర్స్ , అనేక హృదయ సంబంధ వ్యాధులు, ఊబకాయం, టైప్ 2 మధుమేహం, జీవక్రియ వ్యాధులు, వయసు సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. మైటోకాన్డ్రియల్ కార్యకలాపాలు సవ్యంగా సాగాలంటే మైక్రోఫాగీ ప్రేరేపిత సమ్మేళనాలు అవసరం అవుతాయి. సమర్థవంతమైన మైటోఫాగి.. జీవుల జీవితకాలం పొడిగించిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిపై జరుగుతున్న పరిశోధనలు మనిషికి చిరాయువును ప్రసాదించే దిశగా ముందుకు సాగుతున్నాయి. ఇది కూడా చదవండి: రికార్డు ధరకు నెపోలియన్ టోపీ -
నాకు కొత్తగా అనిపించింది
‘‘స్పార్క్’ సినిమా యాక్షన్ థ్రిల్లర్గా రూపొందింది. ఈ మూవీలో నేను లేఖ పాత్రలో కనిపిస్తాను. ఎంతోప్రాధాన్యత ఉన్న రోల్ నాది. సినిమా నాతోనే ప్రారంభం అవుతుంది.. నాతోనే ముగుస్తుంది.. ఇలాంటి థ్రిల్లర్ మూవీలో నటించటం నాకు కూడా కొత్తగా అనిపించింది. ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని హీరోయిన్ మెహరీన్ అన్నారు. విక్రాంత్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్ లైఫ్’. మెహరీన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లుగా నటించారు. డెఫ్ ఫ్రాగ్ ప్రోడక్షన్సపై లీల నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మెహరీన్ పంచుకున్న విశేషాల.. ► కొత్తవాళ్లు, అనుభవం ఉన్న నటీనటులతో పని చేసే క్రమంలో చాలా విషయాలు నేర్చుకుంటాం. ‘స్పార్క్’ సినిమాతో హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న విక్రాంత్ ఓ రోజు ఫోన్ చేసి, ‘మీతో కలిసి నటించాల నుంది’ అన్నారు. కథ నాకు నచ్చడంతో ఓకే చెప్పాను. విక్రాంత్గారు ఈ మూవీ కోసం చేసిన పరిశోధన నన్ను ఆకట్టుకుంది. నా పాత్ర, లుక్ కొత్తగా ఉంటుందని చెప్పారు.. నా లుక్, పాటలు తెరకెక్కించిన విధానం నన్నెంతో ఆకట్టుకుంది. విక్రాంత్ చెప్పిన మాటను నిలబెట్టుకున్నారని నాకు అర్థమైంది. లీల గారు ఎక్కడా రాజీపడకుండా ఈ మూవీ తీశారు. ► విక్రాంత్ అమెరికాలో మంచి స్థాయిలో స్థిరపడ్డారు. అయితే సినిమా చేయాలనే కలని పూర్తి చేసుకోవటానికి ఇక్కడకు వచ్చారు. అమెరికాలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల నేపథ్యంలో ‘స్పార్క్’ కథను తయారు చేసుకున్నారు విక్రాంత్. ఈ కథకి కమర్షియల్ అంశాలు జోడించి థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. తొలిసారి హీరోగా చేస్తూనే డైరెక్షన్ చేయటం ఎంతో కష్టం. కానీ, విక్రాంత్ ఎంతో కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశాడు. తను ఓ డెబ్యూ హీరోగా, డెబ్యూ డైరెక్టర్గా మెప్పిస్తాడు. ►జీవితంలో ఉన్నతి స్థాయికి ఎదగాలని ప్రతి మనిషి కలలు కంటుంటారు.. నేను కూడా అంతే. నా కలలను నిజం చేసుకునే క్రమంలోనే ముందుకు వెళుతున్నాను. ఈ సినిమాలో నేను చేసిన లేఖ పాత్ర కూడా అలాగే ఉంటుంది.. అందుకే ఈ పాత్రకు నేను కనెక్ట్ అయ్యాను. నటిగా ప్రతి సినిమా నాకెంతో ప్రత్యేకమైనదే. కథ, నా పాత్ర నచ్చితేనే చేస్తాను.. లేకుంటే చేయను. అది నా కెరీర్కి ఎంతో సాయపడుతోంది. నన్ను ఇష్టపడేవారు, ప్రేక్షకులే నాలో స్ఫూర్తి నింపుతుంటారు. పాత్ర ఏదైనా నటిగా రెండు వందల శాతం న్యాయం చేయటానికి ప్రయత్నిస్తాను. ∙నేను ఏదైనా వేడుకలకి వెళ్లినప్పుడు, నా సినిమా ప్రమోషన్స్లో ఉన్నప్పుడు ఎవరైనా నేను చేసిన పాత్ర పేరుతో పిలిస్తే నాకెంతో సంతోషంగా ఉంటుంది. చాలా మంది ఇప్పటికీ నా తొలి చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ లోని మహాలక్ష్మి పాత్ర పేరుతో పిలుస్తుండటం హ్యాపీ. -
అంబులెన్స్కి కాల్ చేసి.. పోయే ప్రాణాలను నిలబెట్టిన స్మార్ట్వాచ్!
యాపిల్ స్మార్ట్వాచ్ పోయే ప్రాణాల్ని నిలబెట్టింది. ఓ వ్యక్తి అనారోగ్యం కారణంగా ఇంట్లో అచేతన స్థితిలో పడిపోయినట్లు యాపిల్వాచ్ గుర్తించింది. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎమర్జెన్సీ నెంబర్కి కాల్ చేసి ప్రమాదంలో ఉన్న బాధితుడి ప్రాణాలు కాపాడి ప్రాణదాతగా నిలిచింది. ఇంతకి ఏం జరిగిందంటే? అమెరికాకు చెందిన జోష్ ఫర్మాన్ టైప్ 1 డయాబెటిస్తో బాధపడుతున్నాడు. ఈ తరుణంలో ఓ రోజు ఇంట్లో ఉన్న ఫర్మాన్లో బ్లడ్ షుగర్ లెవల్స్ పూర్తిగా తగ్గి నిలుచున్న చోటే కుప్పకూలిపోయాడు. నోటి నుంచి మాటలేదు. శరీరంలో చలనం లేదు. ఆ సమయంలో అతనిని రక్షించేందుకు ఇంట్లో ఎవరూ లేరు. కానీ ఆయన ఇష్టపడి చేతికి పెట్టుకున్న యాపిల్వాచ్ ప్రాణాల్ని నిలబెడుతుందని ఊహించలేకపోయాడు. ఫర్మాన్ కింద పడిపోవడంతో అప్రమత్తమైన యాపిల్వాచ్ వెంటనే 911కి (ఎమర్జెన్సీ నెంబర్)కి కాల్ చేసింది. అవతలి నుంచి 911 ఆపరేటర్ ఏం జరిగిందని అడిగే ప్రయత్నం చేస్తున్నా ఫలితం లేకపోయింది. యాపిల్వాచ్లో ఉన్న జీపీఎస్ ట్రాకర్ సాయంతో అంబులెన్స్ సిబ్బంది స్వల్ప వ్యవధిలో ఫర్మాన్ ఇంటికి చేరుకున్నారు. అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలపగా.. ప్రాణపాయ స్థితిలో ఉన్న తనని యాపిల్వాచ్ కాపాడిందని సంతోషం వ్యక్తం చేశాడు. అంతా రెప్పపాటులో ఈ సందర్భంగా తనకు ఎదురైన ఘటనని మీడియాతో పంచుకున్నాడు. ‘ఫోన్లో మా అమ్మతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఫోన్నెంబర్లని స్టోర్ చేశా. నేను ఆపస్మారక స్థితిలో పడిపోవడంతో ముందుగా 911కి కాల్ చేసింది. నేను ప్రమాదంలో ఉన్నానని మా అమ్మకి సమాచారం వెళ్లడం, ఆమె కూడా అంబులెన్స్కి కాల్ చేసి ఆరోగ్యం గురించి చెప్పడం.. వైద్యులు నా ప్రాణాలు కాపాడడం అంతా ఇలా రెప్పపాటులో జరిగిపోయింది’ అని అన్నారు. ప్రాణపాయ స్థితిలో ఉంటే ఫర్మాన్లా ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే కాపాడడంలో స్మార్ట్వాచ్లు ఎప్పుడూ ముందుంటాయని మరోసారి నిరూపించాయి. యాపిల్తో పాటు ఇతర స్మార్ట్వాచ్లలో గుండె లయ తప్పడం, ఇతర అత్యవవసర వైద్య సేవలు అందేలా చూడడం, వినియోగదారులు స్వయంగా ఆపరేట్ చేయకపోయినా.. స్మార్ట్వాచ్లు వాటి పనిని సక్రమంగా నిర్వర్తిస్తాయి. ప్రాణాంతకమైన అనారోగ్య సమస్యల్ని గుర్తించి దీంతో పాటు వాచ్లలో ఉన్న ఫాల్ డిటెక్షన్ ఫీచర్తో పాటు రక్తంలో షుగర్ లెవెల్స్ను ట్రాక్ చేయడానికి, ఇన్సులిన్ ఇంజెక్షన్ల కోసం రిమైండర్లను సెట్ చేయడానికి, ప్రాణాంతకమైన డయాబెటిక్ కీటోయాసిడోసిస్ సంకేతాలను పర్యవేక్షించడానికి ఉపయోగపడుతుంది. చదవండి👉 కోడింగ్ పోటీల్లో 67,000 మందిని ఓడించి.. మైండ్ బ్లోయింగ్ ప్యాకేజీ ఆఫర్తో! -
చదువు ఎలా మొదలయ్యింది? ఎందుకు అవసరమయ్యింది?
నేటి యుగంలో ప్రతి ఒక్కరికీ విద్య అనేది చాలా ముఖ్యం. మనిషి ఆకలితో ఉండగలడు కానీ చదువు లేకుండా ఉండలేడని కొందరు అంటారు. నేటి రోజ్లులో అన్నింటికన్నా ముఖ్యమైనది ఏదైనా ఉందంటే అది విద్యే అవుతుంది. ఇప్పుడు మనం అసలు ప్రశ్నలోకి వస్తే ఈ పఠన కళ మనుషులలో ఎలా అభివృద్ధి చెందింది? మనిషిని విద్యలో ముందుకు నడిపించిన విషయం ఏమిటనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. చదువుకు సంబంధించిన చరిత్ర శతాబ్దాల క్రితం నాటిది. అయితే విద్య విషయంలో సైన్స్ భిన్నమైన వాదనలను వినిపిస్తుంది. బీబీసీ నివేదిక ప్రకారం రీసెర్చ్ స్కాలర్ మరియాన్ వోల్ఫ్ మాట్లాడుతూ, అధ్యయనం అనేది ఆరు వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైన కళ. ఎన్ని మద్యం పాత్రలు లేదా గొర్రెలు ఉన్నాయో లెక్కించడం కోసం ఇది మొదలయ్యిందని ఆమె తెలిపారు. వర్ణమాల ఏర్పరిచిన తరువాత దాని సాయంతో మనుషులు ఏదైనా చదవడం ద్వారా సమాచారాన్ని గుర్తుంచుకోవడం, అవగాహన కల్పించుకోవడం మొదలైనవి చేసేవారు. చదువులో ఎవరైనా రాణించినప్పుడు వారిని చురుకైనవారని అంటారు. చదువులో వెనుకబడినవారిని మందబుద్ధి గలవారని అభివర్ణిస్తారు. నిజానికి విద్యకు, మనసుకు చాలా దగ్గరి సంబంధం ఉంది. చదవడం లేదా నేర్చుకోవడం అనేది మనసు ద్వారానే జరుగుతుంది. మెదడులో పది బిలియన్లకు మించిన న్యూరాన్లు ఉన్నాయి. వాటి ద్వారా మెదడు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటుంది. విషయాలను అధ్యయనం చేయడంలో, గుర్తుంచుకోవడంలో ఈ న్యూరాన్లు కీలకంగా వ్యవహరిస్తాయి. ఇది కూడా చదవండి: ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ ఎలా జరుగుతుంది? -
రూట్స్ అఫ్ లైఫ్ ఫోటో గ్యాలరీ
-
నిదురించని తోటలోకి
ఒక రాత్రి గజదొంగ ఒక ఇంట్లో ప్రవేశించాడు. అలికిడికి ఇంట్లో ఉన్న ముసలామె లేచింది. ‘ఎవరూ?’ అని గద్దించింది. ‘నేను దొంగని’ అన్నాడు దొంగ. ‘ఆరి బడవా... నువ్వు రీతి జాతి ఉన్న దొంగవైతే ఇలా ఒంటరి ముసల్ది ఉన్న ఇంట్లో జొరబడతావా? నా కొడుకు పహిల్వాను. పక్క ఊరికి కుస్తీకి వెళ్లాడు. నీకు దమ్ముంటే రేపు నా కొడుకున్నప్పుడు వచ్చి దొంగతనం చెయ్యి’ అంది. దొంగకు పౌరుషం వచ్చింది. ‘అలాగే. నా రోషం నువ్వెరగవు. కాచుకో’ అని వెళ్లిపోయాడు. మరుసటి రోజు కొడుకు వచ్చాడు. తల్లి భోజనం పెడుతూ జరిగింది చెప్పింది. కొడుకు తింటున్న వాడల్లా ముద్ద విడిచి విచారంగా కూచున్నాడు. ‘ఏమి నాయనా?’ అంది ముసలామె. ‘అది కాదమ్మా... నువ్వెలా అలా సవాలు విసిరావు. వాడు దొంగ. ముందు దెబ్బ తీస్తాడో, వెనుక దెబ్బ తీస్తాడో, మత్తుమందు జల్లుతాడో, కొంపకు నిప్పెడతాడో ఎలా తెలుసు? నేరుగా వస్తే పోరాడి గెలుస్తానుగాని దొంగదెబ్బ తీస్తే ఏం చేయను? అవన్నీ కాదు. నిద్రనేది ఒకటి ఉంది కదా... నేను గుర్రు పెట్టి నిద్రపోతున్నప్పుడు వాడు బండరాయి తెచ్చి నెత్తినేస్తే ఏం చేయను’ అన్నాడు. ముసలామె తెల్లముఖం వేసింది. మనిషికి నిద్ర ముంచుకొచ్చే రోజుల్లో పుట్టిన కథ ఇది. ప్రేమ్చంద్ రాసిన ‘ఫూస్ కీ రాత్’ అనే కథ ఉంది. అందులో ఒక నిరుపేద రైతు తన పొలానికి గడ్డకట్టే చలికాలంలో కాపలా కాయాల్సి వస్తుంది. అతనికి కంబళి ఉండదు. పెళ్లాం, అతను కలిసి కంబళి కోసం మూడు రూపాయలు జమ చేస్తారు కాని ఎవరో అప్పులోడు వచ్చి ఆ డబ్బు పట్టుకెళతాడు. పేదరైతు ప్రతి రాత్రి చలిలో వణుకుతూ నిద్ర పట్టక పొలంలో నానా అవస్థలు పడతాడు. రోజంతా నిద్ర అతడి కనురెప్పల మీదే ఉంటుంది. నిద్ర కావాలి! ఆ రోజు పొలానికి వెళ్లి చలిమంట వేసుకుంటాడు. పక్కనే నడుము వాలుస్తాడు. ఎన్నాళ్లుగా ఆగి ఉందో నిద్ర... కమ్ముకుంది. ఒళ్లెరక్క నిద్ర పోయాడు. మంచును లెక్క చేయక నిద్ర పోయాడు. చలిమంట వ్యాపించి పంటంతా తగలబడినా అలాగే పడి నిద్ర పోయాడు. తెల్లారి భార్య వచ్చి గుండెలు బాదుకుంటూ ‘పొలం తగలబడింది’ అంటే రైతు లేచి చూసి ‘దరిద్రం వదిలింది. ఇప్పుడైనా నిద్రపోని’ అని నిద్ర పోతాడు. కష్టం చేసే వాడు నిదురకు పడే కష్టం గురించి ప్రేమ్చంద్ రాసిన కథ అది. నిద్రంటే మనకు చప్పున గుర్తుకొచ్చే జంట ఊర్మిళ, లక్ష్మణస్వామి. అన్నతో పాటు లక్ష్మణుడు అడవికి పోతే పద్నాలుగేళ్లు ఊర్మిళ నిద్ర పోయింది. నిద్ర ఆమెను తన ఒడిలోకి తీసుకుంది. నిద్ర ఆమెను వాస్తవ కలతల నుంచి, భర్త ఎడబాటు దుఃఖం నుంచి, పోచికోలు కబుర్ల నుంచి, ఆరాల నుంచి కాపాడింది. ఊర్మిళకు నిద్ర పట్టకపోయి ఉంటే ఏమై ఉండేదో! శ్రీరాముడి పట్టాభిషేకఘట్టంలో లక్ష్మణుడు హఠాత్తుగా నవ్వడం చూసి ఎవరి వ్యాఖ్యానాలు వారు చేశారు. ‘ఎందుకు నవ్వావు లక్ష్మణా’ అనంటే ‘పద్నాలుగేళ్లు కంటికి రెప్పలా అన్నా వదినలను కాచుకున్నప్పుడు ఒక్కసారి కూడా నిద్ర రాలేదు. తీరా ఇప్పుడు ఇంత గొప్పగా పట్టాభిషేకం జరుగుతుంటే ఈ మోసకారి నిద్ర ముంచుకొస్తున్నదే అని నవ్వాను’ అంటాడు. ‘కలలు కూడా దోచుకునే దొరలు ఎందుకు?’ అంటాడు ఆత్రేయ ఏదో పాటలో. పేదవాడికి ఐశ్వర్యం, వైభోగం లేకపోవచ్చు. ఆరు రకాలుగా తినే వీలు లేకపోవచ్చు. కాని వాడు తుండు తల కింద పెట్టుకున్నాడంటే నిద్రలోకి జారుకుంటాడు. కలల్లో మునిగిపోతాడు. విన్సెంట్ వాన్ గో గీసిన ‘నూన్ – రెస్ట్ ఫ్రమ్ వర్క్’ అనే ప్రఖ్యాత చిత్రం ఉంటుంది. కూలిపని చేసి మధ్యాహ్నం భోజన వేళ గడ్డివాములో కునుకు తీస్తున్న జంటను వేస్తాడు. ఆ క్షణంలో ఆ జంటను చూస్తే వారికి మించిన ఐశ్వర్యవంతులు లేరనిపిస్తుంది. విశ్రాంతినిచ్చే నిద్ర ఎంత పెద్ద లగ్జరీ. కుంభకర్ణుడొక్కడే జీవితమంటే ఉరుకులు పరుగులు కాదని మొదట గ్రహించినవాడు. అతడు ఆరునెలలు నిద్ర పోయేవాడంటే అర్థం– వెకేషన్ లో ఉండేవాడని! తింటూ నిద్రపోతూ. ఆర్నెల్లు మాత్రమే పని. నెలలో రెండు వారాలు పని చేసి రెండు వారాలు విశ్రాంతి తీసుకునే నాగరిక సమాజం ఎప్పుడో వచ్చే తీరుతుంది. ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది’ అని రాశాడు శేషేంద్ర. ఇప్పుడు మొక్కలు, పూలు ప్రతి ఇంటా ఉన్నా నిదురకు బీడువారిన కళ్లే చాలా ఇళ్లల్లో. కుక్కి మంచంలో సుఖంగా నిద్రపోయే కాలం నుంచి వేల రూపాయల పరుపు మీద కూడా సరిగా నిద్ర పట్టని మనుషుల సంఖ్య చాప కింద నీరులా పెరుగుతోంది. నిద్ర పట్టక, నిద్ర పోలేక, రాత్రి ఎంతకీ గడవక, నిద్ర మాత్రలు మింగలేక, మింగినా నిద్ర రాక... ఒక గొప్ప వైభోగమయ జీవన క్రియను కోల్పోయిన తాజా నిరుపేదలు. ప్రపంచంలో జపాన్ తర్వాత నిద్ర పట్టని వాళ్లు ఎక్కువ ఉన్న దేశం మనదే. నిదుర ఎందుకు పట్టదు? లక్ష కారణాలు. కాని ఏది నిశ్చింత బతుకు అనేది ఎవరికి వారు వ్యాఖ్యానించుకుని అంతకు సంతప్తి పడటం నేర్చుకుంటే అదిగో బెడ్లైట్ స్విచ్చంత దూరంలో నిద్ర కాచుకుని ఉంటుంది. మీ జీవనంలోనే నిద్ర మాత్ర ఉంటుంది. వెతకండి. గాఢనిద్ర ప్రాప్తిరస్తు! -
గాజాకు భారత్ మానవతా సాయం!
పాలస్తీనా మిలిటెంట్లు హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గాజాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తెలిసిందే. ఈ భీకర యుద్ధంలో వేలాది మంది సాధారణ పాలస్తీనీయన్లు ప్రాణాలు కోల్పాయారు. హమస్ మిలిటెంట్లను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయల్ సైన్యం గాజాపై విధ్యంసకరంగా విరుచుపడింది. ఈ దాడులతో గాజా చిగురుటాకులా వణికిపోయింది. ఈ నేపథ్యంలో భారత్ నేడు గాజాలోని పాలస్తీనియన్లకు వైద్య సహాయం, విపత్తు సహాయ సామగ్రిని పంపింది. అంతేగాక యుద్ధంలో తీవ్రంగా గాయపడిన వారి ప్రాణాలను రక్షించే మందులు, శస్త్రచికిత్స వస్తువులు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, టార్పాలిన్లు, శానిటరీ యుటిలిటీలు తదితరాల తోపాటు ఇతర అత్యవసర వస్తులు, నీటి శుద్దీకరణ మాత్రలు గాజాకు పంపిచినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్లో పేర్కొన్నారు. గాజా ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రకారం ఇప్పటి వరకు ఈ దాడుల్లో దాదాపు 4,300 మంది పాలస్తనీయన్లు మరణించారని, ప్రధానంగా పౌరులే ఎక్కువుగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. అలాగే వేలాదిమందికి పైగా ప్రజలు క్షతగ్రాతులుగా మారారని పేర్కొంది. ఇదిలా ఉండగా, భారత ప్రధాని మోదీ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్తో గాజాలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ఈ వారం ప్రారంభంలోనే చర్చించిన సంగతి తెలిసిందే. పైగా భారత్ పాలస్తీనియన్ల కోసం తన వంతుగా మానవతా సాయాన్ని అందిస్తూనే ఉంటుందని మోదీ పాలస్తీనా అధ్యక్షుడుకి హామీ కూడా ఇచ్చారు. ఈ ఘర్షణలో పౌరుల మరణాలే అధికంగా ఉండటం బాధకరం అన్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడినవారు తప్పక దీనికి బాధ్యత వహించక తప్పదని ఫైర్ అయ్యారు. మరోవైపు ఈ జిప్టు శిఖరాగ్ర సమావేశంలో యూఎన్ చీఫ్ ఆంటోనియా గుటెర్రెస్ కూడా మానవతావాద దృక్పథంతో కాల్పులు విరమించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం గాజాలో తాగునీరు, ఆహరం, పెట్రోలు వంటివి లేక తీరని మానవతా పరిస్థితితో అట్టుడుకుతోందన్నారు. గాజా పరిస్థితిని చక్కబడేలా ప్రపంచ దేశాలన్ని తమవంతుగా సాయం అందించేలా మరింత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాగా, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సంస్థ ప్రయత్నాలు ఫలితంగా ఇజ్రాయెల్ కూడా గాజాకు మానవతా సాయం అందించేందుకు అంగీకరించింది 🇮🇳 sends Humanitarian aid to the people of 🇵🇸! An IAF C-17 flight carrying nearly 6.5 tonnes of medical aid and 32 tonnes of disaster relief material for the people of Palestine departs for El-Arish airport in Egypt. The material includes essential life-saving medicines,… pic.twitter.com/28XI6992Ph — Arindam Bagchi (@MEAIndia) October 22, 2023 (చదవండి: గాజాకు స్వల్ప ఊరట.. అమెరికా మాటతో వెనక్కి తగ్గిన ఇజ్రాయెల్) -
యూదుడైన ఐన్స్టీన్.. హిట్లర్ బారి నుంచి ఎలా తప్పించుకున్నాడు?
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే దానిపై ప్రస్తుతానికి ఎవరి దగ్గరా సమాధానం లేదు. ఈ ఉగ్రవాద సంస్థను తుడిచిపెట్టితీరుతామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. ఈ నేపధ్యంలో జరుగుతున్న పోరులో ఇప్పటికే వేలాది మంది మరణించారు. నిజానికి ఇజ్రాయెల్ ఒక చిన్న దేశం. ఇక్కడ యూదులు అత్యధిక సంఖ్యలో నివసిస్తున్నారు. అంటే ఇది యూదుల దేశం. ఈ యుద్ధం నేపధ్యంలో యూదులకు సంబంధించి అనేక విషయాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత మేధావిగా గుర్తింపు పొందిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ యూదు అనే విషయం చాలామందికి తెలియదు. హిట్లర్ పాలనకాలంలో ఐన్స్టీన్ తన ప్రాణాలను కాపాడుకునేందుకు జర్మనీ నుంచి పారిపోవాల్సి వచ్చింది. పూర్వం రోజుల్లో యూరప్లో యూదులు జనాభా అత్యధికంగా ఉండేది. జర్మనీలో లక్షలాది మంది యూదులు ఉండేవారు. వారిలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఒకరు. అడాల్ఫ్ హిట్లర్ ఎన్నికైన తరువాత జర్మనీలో జాతీయవాద భావన తీవ్రతరం అయ్యింది. ఈ నేపధ్యంలో ఐరోపాయేతర ప్రజలపై నిరసనలు మొదలయ్యాయి. జర్మనీలో యూదులపై ద్వేషం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. దీనికి ప్రధానకారణం క్రైస్తవులకు, యూదులకు మధ్య వీపరీతమైన ఘర్షణలు జరిగాయి. యూరప్ లో ఉన్న క్రైస్తవులు బలంగా నమ్మేదేంటంటే.. క్రీస్తును శిలువ వేయడంలో యూదుల పాత్ర ఉందని నమ్మేవారట. దాంతో పాటు యూదులు వ్యాపారంలో బలంగా ఉండడం, ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉండడంతో.. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి యూరోపియన్లు ఎక్కువగా యూదులను ద్వేషించేవారట. చరిత్రలో రకరకాల కారణాలు పేర్కొన్నప్పటికీ.. యూదులను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారన్నదానికి మతపరమైన బేధమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. జర్మనీలో హిట్లర్ మారణహోమం సృష్టించడంతో చాలా మంది యూదులు తమ ప్రాణాలను అరచేతపట్టుకుని ఇతర దేశాలకు పారిపోయారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్లో కూడా ఇదే భయం నెలకొంది. తాను జర్మనీలో ఉంటే ముప్పు తప్పదని భావించి, అమెరికా వెళ్లి, అక్కడ ఆశ్రయం పొందారు. అయితే అప్పటికే ఐన్స్టీన్పేరు విజ్ఞాన ప్రపంచంలో మారుమోగితోంది. ఇతనే కాకుండా జర్మనీకి చెందిన ఎందరో మేథావులు, శాస్త్రవేత్తలు కూడా అమెరికాలో తలదాచుకున్నారు. 1941 నుంచి 1945 వరకు జరిగిన మారణహోమంలో హిట్లర్ దాదాపు 60 లక్షల మంది యూదులను హత్య చేయించాని, వీరిలో ఎక్కువ మంది యూదులని చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం యూదుల జనాభా ప్రపంచవ్యాప్తంగా 2 కోట్లకు తక్కువగానే ఉంది. వీరిలో ఎక్కువ మంది ఇజ్రాయెల్లో నివసిస్తున్నారు. అలాగే యూదులు అమెరికా, కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్లలో కూడా ఉంటున్నారు. ఇజ్రాయెల్ ప్రస్తుత జనాభా 93 లక్షల 60 వేలు. అంటే మన హైదరాబాద్ కంటే తక్కువ జనాభా ఉంది. ఇందులో యూదుల సంఖ్య 72 లక్షల 48వేల మంది. ఇతరులు వేర్వేరు మతాలకు సంబంధించిన వారు ఇజ్రాయెల్ లో స్థిరపడి ఉన్నారు. 2020 జనగణన ప్రకారం అమెరికాలో దాదాపు 80 లక్షల మంది యూదులున్నారు. పైగా అమెరికాలో అత్యున్నత వర్గంలో ఒకరిగా యూదులు ఉన్నారు. రాజకీయాలు, వర్తక, వాణిజ్యంలలో అత్యంత ప్రభావశీలురుగా యూదులున్నారు. ఇది కూడా చదవండి: భారత్ చర్యతో వారి జీవితాలు దుర్భరం: ట్రూడో -
భారత్ చర్యతో లక్షల మంది జీవితాలు దుర్భరం: ట్రూడో
కెనడా దౌత్యవేత్తలకు రక్షణ కల్పించడాన్ని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. 41 మంది కెనడా దౌత్యవేత్తలపై భారత్ అనుసరించిన వైఖరి ఈ రెండు దేశాల్లోని లక్షలాది మంది జీవితాల్ని దుర్భరం చేస్తున్నదని ట్రూడో ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ నుంచి కెనడాకు చెందిన 41 మంది దౌత్యవేత్తలను వెనక్కి పంపిస్తున్నన్నట్టు భారత్ ప్రకటించిన నేపధ్యంలో జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కెనడా దౌత్యవేత్తల అధికారిక హోదాను ఏకపక్షంగా రద్దు చేస్తామని భారత ప్రభుత్వం బెదిరించిందని ఆయన ఆరోపించారు. భారత్ చర్య కారణంగా కెనడా, భారతదేశంలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజలు సాధారణ జీవితాన్ని భారత ప్రభుత్వం కష్టతరం చేసిందని ట్రూడో పేర్కొన్నారు. ఇది దౌత్య విధానంలోని ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించడమేనని అన్నారు. భారత్లో ఉంటున్న కెనడియన్ల సంక్షేమంపై తనలో ఆందోళన నెలకొన్నదన్నారు. వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్లు కెనడా చేసిన ఆరోపణలపై భారత ప్రభుత్వం స్పందించింది. భారతదేశంలోని కెనడియన్ దౌత్యవేత్తలకు సంబంధించి కెనడా ప్రభుత్వం అక్టోబర్ 19న చేసిన ప్రకటనను గమనించామని, ఇరు దేశాల్లోని దౌత్యవేత్తల సంఖ్యలో సమానత్వం గురించి చర్చించామని పేర్కొంది. భారతదేశంలో కెనడా దౌత్యవేత్తల సంఖ్య అధికంగా ఉందని, అందుకే భారతదేశ అంతర్గత వ్యవహారాల్లోనూ కెనడా జోక్యం పెరిగిపోయిందని భారత ప్రభుత్వం ఆరోపించింది. కెనడియన్ దౌత్యవేత్తలు వెనక్కి రావడం గురించి కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ మాట్లాడుతూ .. అక్టోబర్ 20 తర్వాత 21 మంది కెనడియన్ దౌత్యవేత్తలు మినహా మిగిలిన దౌత్యవేత్తల దౌత్యపరమైన అధికారాలను రద్దు చేయాలనే నిర్ణయాన్ని భారతదేశం తెలియజేసిందని అన్నారు. ఈ మేరకే తాము దౌత్యవేత్తలందరి భద్రతను దృష్టిలో ఉంచుకుని, వారిని భారతదేశం నుండి సురక్షితంగా వెనక్కి పిలిపించామన్నారు. భారత్ చేపట్టిన ఈ చర్యను తాము ఊహించలేదని అన్నారు. ఇలాంటి ఘటన గతంలో ఎప్పుడూ జరగలేదని, ఏ దేశంలోనైనా దౌత్యవేత్తల అధికారాలను ఏకపక్షంగా రద్దు చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనన్నారు. ఇటువంటి చర్య కారణంగా ఏ దౌత్యవేత్త అయినా భారత్లో పనిచేయడం కష్టమని అన్నారు. అయితే దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, గత నెల రోజులుగా ఈ అంశంపై కెనడా ప్రభుత్వంతో కలిసి భారత ప్రభుత్వం చర్చిస్తున్నదని తెలిపింది. ఈ నిర్ణయాలు వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 11.1కు కట్టుబడి ఉన్నాయని తెలిపింది. దౌత్యవేత్తల విషయంలో సమానత్వాన్ని అమలు చేయాలనే నిర్ణయం వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లుగా భారత్ పరిగణించదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది కూడా చదవండి: కాన్సులేట్ సేవలు నిలిపేసిన కెనడా -
అలాంటి వాళ్లతో స్నేహం, విరోధం రెండూ వద్దు
దుర్మార్గులతో స్నేహం చేయకూడదు. వాళ్ళతో విరోధం కూడా కూడదు. వారిని పట్టించుకోకుండా ఉండడమే మేలు. నిప్పును పట్టుకుంటే కాలుతుంది. చల్లారిన తర్వాత పట్టుకున్నా మసి అవుతుంది. కనుక దాని జోలికి పోకపోవడమే మేలు. విలువలేని దుమ్ము కూడా ఒక్కోసారి నీ కంట్లో పడి విలవిలలాడేలా చేస్తుంది. విలువ లేని కొందరు మనుషులు కూడా చాలాసార్లు తమ మాటలతో బాధపెడతారు. ఊదేసుకుని ముందుకు వెళ్ళడమే ఉత్తముల లక్షణం. నమ్మకం అనేది గాజు పాత్ర లాంటిది. గాజు పాత్ర ఒక్కసారి చేతి నుండి కింద పడితే దాన్ని అతికించడం ఎలా అసాధ్యమో, ఒకసారి మనం ఒక వ్యక్తి దగ్గర నమ్మకాన్ని కోల్పోతే మళ్ళీ తిరిగి ఆ నమ్మకాన్ని సంపాదించడం అలా అసాధ్యం... అసంభవం. కాబట్టి కలుషితమైన ఈ రోజుల్లో కల్మషం లేకుండా నిన్ను ఎవరైనా నమ్మితే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం నీ ప్రాణాన్ని అయినా పణంగా పెట్టు తప్పులేదు కానీ నమ్మకాన్ని కోల్పోకు... -
పైసా లేకుండా జీవించడం ఎలా? 15 ఏళ్లుగా ‘మార్క్ బాయిల్’ ఏం చేస్తున్నాడు?
ప్రపంచంలో అధికశాతం మంది జీవితంలో వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించి, సుఖంగా జీవించాలని కలలు కంటారు. పేదరికంలో మగ్గిపోవాలని ఎవరూ కోరుకోరు. ఉన్నత చదువులు చదువుకుని, మంచి ఉద్యోగం చేస్తూ, అధికంగా సంపాదించగలిగే అర్హత కలిగిన ఒక వ్యక్తి భిన్నమైన నిర్ణయం తీసుకుని, ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ కథ యునైటెడ్ కింగ్డమ్ నివాసి మార్క్ బాయిల్కి సంబంధించినది. 2008లోనే బాయిల్ డబ్బును వినియోగించడం మానుకుని ఆనందంగా కాలం వెళ్లదీస్తున్నాడు. సాంకేతికతలాంటి విషయాల జోలికి వెళ్లకుండా ప్రకృతితో మమేకమై జీవించడాన్ని అలవర్చుకున్నాడు. మార్క్ బాయిల్.. బిజినెస్ అండ్ ఎకనామిక్స్లో డిగ్రీ తీసుకున్నాడు. చదువు పూర్తయిన వెంటనే బ్రిస్టల్లోని ఒక ఫుడ్ కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం సంపాదించాడు. జీవితంలో విజయం సాధించేందుకు ఏళ్ల తరబడి కష్టపడ్డాడు. అయితే 2007లో ఒకరోజు రాత్రి అకస్మాత్తుగా జరిగిన సంఘటన బాయిల్ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. హౌస్బోట్లో కూర్చున్న బాయిల్ అక్కడున్నవారు మాట్లాడుకున్న మాటలను విన్నాడు. అందరూ డబ్బు గురించే మాట్లాడుకుంటున్నారు. దీంతో అన్ని సమస్యలకు ఏకైక మూలం డబ్బు అని బాయిల్ గ్రహించాడు. అందుకే తాను డబ్బుకు అతీతంగా జీవించాలని, డబ్బు సంపాదించకూడదని, అలాగే ఖర్చు పెట్టకూడదని కఠినంగా నిర్ణయించుకున్నాడు. దీంతో మార్క్ బాయల్ తన ఖరీదైన హౌస్బోట్ను విక్రయించి, తన పాత కారవాన్లో నివసించడం మొదలుపెట్టాడు. డబ్బు లేకుండా జీవితాన్ని గడపసాగాడు. ఈ నేపధ్యంలో కొన్ని నెలలు పలు సమస్యలను ఎదుర్కొన్నాడు. టీ, కాఫీలతో పాటు ఇతర సౌకర్యాలను వదులుకున్నాడు. ప్రకృతి అందించేవాటిని మాత్రమే ఉపయోగించసాగాడు. ఇటువంటి ప్రకృతి సహజ జీవనం ప్రారంభించినప్పటి నుంచి తాను అనారోగ్యం బారిన పడలేదని, తనకు ఆరోగ్య రక్షణ అవసరం లేదని బాయిల్ తెలిపాడు. బాయిల్ జీవితాన్ని చూసిన చాలామంది అతనికి స్నేహితులుగా మారారు. తాను 2017లో టెక్నాలజీ జోలికి వెళ్లడాన్ని పూర్తిగా వదులుకున్నానని, సాంకేతికతతో ముడిపడిన పాత జీవితం కాకుండా, సహజసిద్దంగా ప్రకృతితో గడిపే భావి జీవితం గురించి నిరంతరం ఆలోచిస్తుంటానని బాయిల్ తెలిపాడు. ఇది కూడా చదవండి: ఎస్క్లేటర్పై నిషేధమున్న నగరం ఏది? గణాంకాలు ఎందుకు బెంబేలెత్తిస్తున్నాయి? -
గాంధీ వాడిన ఊతకర్ర కథ ఏమిటి? ఇప్పుడు ఎక్కడుంది?
దండి మార్చ్కు ముందు.. ఆ తరువాత గాంధీ ఫోటోల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. అదే ఊతకర్ర. గాంధీ 1930లో దండి మార్చ్తో శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు చేతిలో ఊతకర్ర చేరింది.ఇంతకీ ఈ ఊతకర్ర కథ ఏమిటి? దీనిని ఎవరు గాంధీకి ఇచ్చారు? 1930, మార్చి 12న తన 60 ఏళ్ల వయసులో మహాత్మా గాంధీ అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమం నుండి ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడానికి చారిత్రాత్మక యాత్రకు బయలుదేరారు. అప్పుడు గాంధీ సహచరుడు, స్నేహితుడు కాకా కలేల్కర్ మహాత్మునికి ఊతమిచ్చేందుకు ఒక కర్ర అవసరమని భావించారు. గాంధీ సాగించే అంత సుదీర్ఘ నడకలో ఆ కర్ర ఉపయోగకరంగా ఉండవచ్చనుకున్నారు. ఈ ఊతకర్రను తీసుకుని గాంధీ 24 రోజుల పాటు ప్రతిరోజూ పది మైళ్లు నడిచేవారు. ఈ నేపధ్యంలోనే ఆ ఊతకర్రకు అంత ప్రాధాన్యత ఏర్పడింది. కాగా గాంధీ తన జీవితంలో అనేక ఊతకర్రలను ఉపయోగించారు. అయితే ఆయన దండి మార్చ్లో ఉపయోగించిన ఊతకర్ర ఆ ఉద్యమానికి ప్రతీకగా మారింది. ఇది గాంధీ ఊతకర్రగా ప్రసిద్ధి చెందింది. ఈ కర్ర బలంగా ఉంటుంది. 54 అంగుళాల ఎత్తు కలిగిన వెదురు కర్ర ఇది. ఈ ప్రత్యేకమైన వెదురు కర్ణాటక తీర ప్రాంతంలోని మల్నాడులో మాత్రమే పెరుగుతుంది. 1948 జనవరి 30వ తేదీ వరకు అంటే గాంధీ హత్యకు గురయ్యే వరకు ఈ ఊతకర్ర గాంధీ దగ్గరే ఉంది. ప్రస్తుతం ఈ ఊతకర్ర న్యూఢిల్లీలోని రాజ్ఘాట్లో ఉన్న నేషనల్ గాంధీ మ్యూజియంలో ఉంది. ఇది కూడా చదవండి: ఏ రాష్ట్రంలో మహిళలకు రిజర్వేషన్లలో పెద్దపీట? -
సారా జీవితం.. ఆ వించిస్టర్ హౌస్ నిర్మాణం నేటికి మిస్టరీలే!
ఊహో..? అపోహో..? అంతకు మించిన అభూతకల్పనో..? తేల్చుకోలేని స్థితే అశాంతికి ఆలవాలం. అంధవిశ్వాసానికి ఆధ్యం. వాటి మధ్య నలిగిన జీవితాలు.. వాళ్లు వదిలి వెళ్లిన ఆనవాళ్లు.. తర్వాత తరాలను ఇట్టే బెదరగొడతాయి. అలాంటి ఉదంతమే ఇది. 1881 తర్వాత మొదలైంది ఈ కథ. అది అమెరికా, న్యూ హెవెన్ సమీపంలోని ఒక పెద్ద విల్లా. అందులో నివసించే 44 ఏళ్ల సారా వించిస్టర్కు పడుకునే ముందు పియానో వాయించి నిద్రపోవడం అలవాటు. ఆ రాత్రి అదే చేసింది. అయితే పన్నెండు దాటాక.. అదే పియానో మ్యూజిక్ అస్పష్టంగా వినిపించడం మొదలైంది. తుళ్లిపడి నిద్ర లేచిన సారా.. వెంటనే హాల్లోకి వెళ్లిచూడగానే.. ఆ మ్యూజిక్ ఆగిపోయింది. కానీ ఆ ఇంట్లో ఆమె తప్ప ఎవరూ లేరు. ‘ఎవరది?’ అనే అరుపు ఆమెలోని భయాన్ని మభ్యపెట్టింది. అప్పుడే.. చిమ్మచీకటిలో హాల్కి ఆనుకుని ఉన్న స్టోర్ రూమ్ డోర్ చిన్నగా ఓపెన్ అయ్యింది. ఆ అలికిడికి తిరిగి చూసిన సారా.. ధైర్యం తెచ్చుకుని.. దగ్గరకు వెళ్లి తలుపు క్లోజ్ చేయబోతుంటే.. అందులో ఉన్న ఊయల ఊగుతూ కనిపించింది. పసిపాప ఏడుపు, విచిత్రమైన ఓ నవ్వు ఆమెను వణికించాయి. అప్పటి నుంచి ప్రతిరాత్రి అదే ఉలికిపాటు. కొన్ని రోజులకు పియానో వాయించే మనిషి కూడా స్పష్టంగా కనిపించడం మొదలైంది. కొన్నిసార్లు అది కలో.. నిజమో ఆమెకు అర్థమయ్యేది కాదు. అప్పటికే ఆమె జీవితంలో ఎన్నో విషాదాలు ముసురుకున్నాయి. ∙∙ 1862లో ‘విలియమ్ విర్ట్ వించిస్టర్’ అనే ధనికుడ్ని వివాహం చేసుకున్న సారా.. తన మామగారు ఆలివర్ వించిస్టర్కి వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉండేది. మొదట షర్ట్స్ కంపెనీ నడిపించే వించిస్టర్ కుటుంబం.. తర్వాత కాలంలో రైఫిల్స్ కంపెనీ (తుపాకుల వ్యాపారం) పెట్టి.. రెట్టింపు లాభాలు గడించసాగింది. గవర్నమెంట్ పర్మిషన్స్తో అఫీషియల్గానే కాదు.. రహస్యంగా కూడా చాలా గన్స్ అమ్మేది. సుఖశాంతులతో సాగిపోతున్న ఆ కుటుంబంలోకి సారా మరో శుభవార్తను మోసుకొచ్చింది.. తాను తల్లిని కాబోతున్నా అంటూ! పెళ్లి అయిన చాలా ఏళ్లకు కలగబోతున్న సంతానం కావడంతో.. ఆ ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. సారాకు ఆడపిల్ల పుట్టింది. పాపకి యానీ వించిస్టర్ అని పేరు పెట్టుకున్నారు. కానీ నెల రోజులకే ఆ పాప చనిపోయింది. ఆ విషాదం వించిస్టర్ కుటుంబాన్ని కోలుకోనివ్వలేదు. కొన్ని రోజులకే ఆలివర్ మరణించాడు. ఇంటి పెద్ద మరణించడంతో సారా, విలియమ్ కుంగిపోయారు. కొన్నాళ్లకు రైఫిల్ కంపెనీ లాభాలు తగ్గాయి. వ్యాపారం పతనం దిశగా సాగింది. కంపెనీ బాధ్యతలందుకున్న విలియమ్.. ఏడాది గడవకముందే (1881లో) మరణించాడు. దాంతో సారా మరింత కుంగిపోయింది. నిజానికి అక్కడితోనే ఆ కుటుంబంలో విషాదాలు ఆగిపోలేదు. విలియమ్ తర్వాత.. సారా అత్త, సారా తల్లి, సారా సోదరి ఇలా పలు కుటుంబ సభ్యులు, సమీప బంధువులు చాలామంది మరణించారు. దాంతో సారాలో భయం రెట్టింపు అయ్యింది. ఈ క్రమంలోనే సారాకు ఆత్మలు కనిపించడం మొదలుపెట్టాయి. తనకు ఎదురవుతున్న వింత అనుభవాల గురించి.. కొందరు శ్రేయోభిలాషులతో పంచుకుని, వారి సాయంతో.. పరిష్కారం కోసం కొంతమంది మాంత్రికుల్ని కూడా ఆశ్రయించింది. వారు ఆ ఇంటిని పరిశీలించి.. ఇక్కడ అతీంద్రియ శక్తులు ఉన్నాయని.. ఇందులో నివసించడం మంచిది కాదని తేల్చేశారు. కొన్నినెలల పాటు శాంతిపూజలు చేయించినా ఫలితం లేదు. అసలు ట్విస్ట్ ఏంటంటే.. స్టోర్ రూమ్లో ఊగే ఊయల సారా పాపదే. ప్రతిరాత్రి పియానో వాయించేది సారా భర్తే. తనకు ఎదురుపడే అస్పష్టమైన ఆకారం తన భర్తేదేనని గ్రహించిన రాత్రే.. సారాకి చాలా విషయాలు తెలిశాయి. ఆ రాత్రి విలియమ్.. సారాను తీవ్రంగా హెచ్చరించాడట. ‘మనం అమ్మిన రైఫిల్స్ (తుపాకీలు) కారణంగా చనిపోయిన వారి ఆత్మలు మన ఇంటిని చుట్టుముట్టాయి. ఆత్మలన్నీ కలసి.. వించిస్టర్ కుటుంబాన్ని నాశనం చేయాలని తీర్మానించుకున్నాయి. ఇప్పటి దాకా జరిగిన మరణాలన్నీ (నాతో సహా) ఆ ఆత్మల వల్లే జరిగాయి. ఈ ఇల్లు వదిలి పారిపో.. మరెక్కడైనా ఇల్లు కట్టుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించు. అయితే ఆ నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాకుండా చూసుకో.. ఎప్పుడైతే ఇంటి నిర్మాణం పూర్తవుతుందో ఆ రోజే నీకు మరణం సంభవిస్తుంది’ అని చెప్పి విలియమ్ మాయమయ్యాడట. దాంతో సారా ‘న్యూ హెవెన్ను విడిచిపెట్టి.. కాలిఫోర్నియా వెళ్లిపోయింది. అక్కడ ఇల్లు కట్టుకోవడానికి అనువైన స్థలం కోసం వెతకడం మొదలుపెట్టింది. ఓ మూడేళ్లకు.. తనకు వారసత్వంగా వచ్చిన డబ్బుతో కాలిఫోర్నియాలోని శానోస్ సమీపంలో ఓ విశాలమైన స్థలాన్ని కొనుక్కున్నది. అక్కడ ఏడంతస్తుల భవనానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంది. సుమారు పదహారుసార్లు.. కట్టిన గదులను కూలుస్తూ మళ్లీ మళ్లీ కట్టించింది. ఆ ఇల్లు.. ఆత్మలను గందరగోళంలోకి నెట్టేలా ఉండాలనేది సారా ఉద్దేశమట. 1906 నాటికి ఇంటికి ఓ అందమైన రూపం వచ్చినా.. ఆమె శాంతించలేదు. ఆ ఇల్లు కొన్నిసార్లు భూకంప ప్రభావాలకు కూలితే.. ఎక్కువ సార్లు సారా అభీష్టానికి కూలిపోయింది. గదులు, కిటికీలు, తలుపులు ఇలా అన్నీ పగిలేవి, విరిగేవి. సుమారు ఆమె మరణం వరకూ అంటే 1922 సెప్టెంబర్ దాకా ఆ ఇంటి నిర్మాణం జరుగుతూనే ఉంది. స్వయంగా తనే ఎప్పటికప్పుడు నిర్మాణాల్లో పలు మార్పులు చేసేదట. సుమారు 36 ఏళ్ల పాటు ఆ ఇంట్లో రకరకాల మార్పుచేర్పులు జరిగాయి. కొన్ని మెట్లు పైకప్పుకి మార్గమైతే.. కొన్ని తలుపులు కేవలం అడ్డు గోడల్ని చూపెడుతుంటాయి. అంటే మెట్లు ఎక్కి మరో అంతస్తుకు వెళ్తాం అనుకుంటే అక్కడ ఇంటి పైకప్పు తప్ప ఏం ఉండదు. కొన్ని చోట్ల తలుపులు తెరిస్తే అడ్డంగా నిర్మించిన గోడలు తప్ప మార్గం కనిపించదు. కొన్ని కిటికీలు గోడలకు కాకుండా సీలింగ్కి ఉంటాయి. సారా స్వయంగా ఆత్మలతో మాట్లాడేదని.. వాటికి క్షమాపణలు చెప్పేదని.. వాటిని శాంతపరచడానికే ఇంటికి పదే పదే మార్పుచేర్పులు చేసేదని ఆ ఇల్లు కట్టిన కార్మికులు కొందరు ప్రచారం చేశారు. భర్త, బిడ్డ చనిపోవడంతో ఆమెకు పిచ్చి పట్టిందని.. ఆస్తులుండటంతో అలా ఇష్టమొచ్చినట్లు ఖర్చుచేసిందని కొందరి అభిప్రాయం. అయితే వించిస్ట్టర్ బంధువులు మాత్రం.. ‘ఆమెకు ఆర్కిటెక్చర్ మీదున్న ఆసక్తికారణంగానే అన్నిసార్లు భవన నిర్మాణంలో మార్పులు చేసిందని.. ఆత్మలు వంటి పుకార్లను నమ్మొద్దు’ అని ప్రపంచానికి వెల్లడించారు. ఏది ఏమైనా సారా జీవితం.. ఆ వించిస్టర్ హౌస్ నిర్మాణం రెండూ నేటికీ మిస్టరీలే. అంతేగాదు మిస్టరీ హౌస్లో.. ప్రస్తుతం నాలుగు అంతస్తుల నిర్మాణం మిగిలింది. 500లకు పైగా గదులు, 2 వేలకు పైగా తలుపులు, 10 వేలకు పైగా కిటికీలు, 50కి పైగా బెడ్ రూమ్స్, 13 బాత్ రూమ్స్, ఆరు కిచెన్ రూమ్స్, చాలా బాల్కనీల సువిశాలమైన ఆ భవనం.. ఇప్పుడు పర్యాటక కేంద్రంగా ఔత్సాహికులను ఆకట్టుకుంటోంది. సంహిత నిమ్మన (చదవండి: ఆరుగంటలకు పైగా మంచులో కూరుకుపోయింది! బతికే ఛాన్స్ లేదు కానీ..) -
బెడ్ రూమ్లోని ఫ్రిజ్ ప్రాణాంతకమా? నిపుణులు ఏమంటున్నారు?
కొందరు అర్ధరాత్రి సమయంలోనూ ఆహారం తినాలని అనుకుంటారు. అలాంటివారు రిఫ్రిజిరేటర్ను పడకగదికి సమీపంలో ఉంచడానికి ఇష్టపడతారు. మరికొందరు బెడ్రూమ్లోనే ఫ్రిజ్ పెట్టుకుంటారు. బెడ్రూమ్లో ఫ్రిజ్ని పెట్టుకున్న వారి లిస్ట్లో మీరు కూడా ఉంటే ఈ వార్త మీకోసమే. బెడ్రూమ్లో ఫ్రిజ్ ఉంచడం అత్యంత ప్రమాదకరమని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పడకగదిలో రిఫ్రిజిరేటర్ ఉంచడం సురక్షితం కాదనడానికి పూర్తి స్థాయిలో శాస్త్రీయ ఆధారాలు లభించకపోయినా, ప్రమాదం పొంచివుండవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ఫ్రిజ్ నుండి వెలువడే రేడియేషన్ గురించి చాలామంది ఆందోళన చెందుతుంటారు. వాస్తవానికి దీని నుంచి వచ్చే రేడియేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే రిఫ్రిజిరేటర్లోని గ్యాస్ కంప్రెసర్లోనే ఉంటుంది. అందువల్ల అది లీకయ్యే ఛాన్స్ ఉండదని నిపుణులు చెబుతున్నారు. రిఫ్రిజిరేటర్ పాడైపోయినప్పుడు ఈ రేడియేషన్లో కొంత గదిలోకి లీక్ అయ్యే అవకాశం ఉంది. మరో ఆందోళన కలిగించే అశం ఏమంటే రిఫ్రిజిరేటర్ అగ్ని ప్రమాదాలకు తావిస్తుందని చాలామంది అంటారు. అయితే ఇందుకు చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది. కొత్త మోడళ్ల ఫ్రిజ్లలో అనేక భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. రిఫ్రిజిరేటర్ అదనపు వేడిని కలిగిస్తుంది. ఫ్రిజ్ నుండి వచ్చే వేడి పడకగది ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఫ్రిజ్ని బెడ్రూమ్లో ఉంచాలని నిర్ణయించుకుంటే, దాని నుంచి వచ్చేవేడిని బయటకు పంపడానికి దానిని కిటికీ దగ్గర ఉంచాలి. ఆహారాన్ని చల్లగా, తాజాగా ఉంచడానికి రిఫ్రిజిరేటర్ రోజంతా పని చేస్తుంది. కాగా ఫ్రీయాన్ వాయువు ద్రవ రూపంలోకి మారి లీక్ అయితే పలు వ్యాధులకు కలిస్తుంది. అయితే ఇది చాలా అరుదుగా జరుతుంది. దీనిని పీల్చినట్లయితే, ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకే రిఫ్రిజిరేటర్ను ఎప్పటికప్పుడు సాంకేతిక నిపుణులతో చెక్ చేయించాలి. ఇది కూడా చదవండి: వీధి కుక్కలను చంపడం తప్పుకాదని గాంధీ ఎందుకన్నారు? -
కుమార్తెకు డర్టీ వాటర్ బాటిల్ గిఫ్ట్.. తండ్రి చెప్పే ‘జీవిత సత్యం’ ఇదేనట!
ఒక యువతి తన పుట్టినరోజున తన తండ్రి ఎటువంటి విచిత్రమైన బహుమతి ఇచ్చాడో ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. తన తండ్రి తనకు మురికి నీటితో నిండిన బాటిల్ను బహుమతిగా ఇచ్చాడని తెలిపింది. అలాంటి బహుమతి ఇవ్వడానికి గల కారణాన్ని కూడా ఆమె వివరించింది. ట్వట్టర్(ఎక్స్) యూజర్ ప్యాట్రిసియా మౌ తన పోస్టులో ‘ఈ సంవత్సరం నా పుట్టినరోజున, మా నాన్న నాకు మురికి నీటి బాటిల్ను బహుమతిగా ఇచ్చారు. నేను తమాషాకు చెప్పడం లేదు’ అని పేర్కొంది. ఇలాంటి బహుమతి పొందడం ఇదేమీ మొదటిసారి కాదని కూడా ఆమె చెప్పింది. ఇంతకు ముందు కూడా మా నాన్న నాకు అనేక బహుమతులు ఇచ్చారు. వాటిలో ప్రథమ చికిత్స కిట్, పెప్పర్ స్ప్రే, ఎన్సైక్లోపీడియా, కీ చైన్ మొదలైనవి ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం ఇచ్చిన బహుమతి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే దానిని డబ్బుతో కొనలేం. ఆ మురికి నీటి బాటిల్ జీవితంలో ఒక విలువైన పాఠాన్ని నేర్పుతుంది. మురికి నీటితో కదులుతున్న బాటిల్ మన జీవితం లాంటిది. అయితే జీవితంలో మనం మన మనసును స్థిమితపరచుకున్నప్పుడు మనలోని మలినాలు 10 శాతం కంటే దిగువకు చేరుతాయి. మురికితో నిండిన బాటిల్ను స్థిరంగా ఉంచినప్పుడు ఇదే తెలుస్తుంది. సరిగ్గా ఇటువంటి దృక్ఫధాన్ని మనం కలిగివుండటం అవసరం అని ఆమె పేర్కొంది. ఆమె ఈ పోస్ట్ను అక్టోబర్ 2 న పోస్టు చేశారు. వైరల్గా మారిన ఈ పోస్టు ఇప్పటివరకూ 1.2 మిలియన్కు మించిన వీక్షణలు దక్కించుకుంది. ఈ పోస్ట్కు 5,900కు పైగా లైక్లు వచ్చాయి. ఈ పోస్టు చూసిన ఒక యూజర్ ‘ఈ జీవిత పాఠాన్ని సేవ్ చేసుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: పాకిస్తాన్కు భారీ భూకంపం ముప్పు? వణికిపోతున్న జనం? For my birthday this year, my dad gifted me a dirty bottle of water. Not kidding. In the past he’s gifted me: a first aid kit, pepper spray, an encyclopedia, a key chain, dedicated a book he wrote to me, etc. good ol dad gifts. He told me this years gift was extra special as… pic.twitter.com/N56AiGgErJ — Patricia Mou (@patriciamou_) October 2, 2023 -
హిట్లర్ విషాహార భయాన్ని ఎలా దాటాడు? చివరికి ఎలా మరణించాడు?
ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన నియంతగా అడాల్ఫ్ హిట్లర్ పేరుగాంచాడు. హిట్లర్ అనేక దేశాలలో విధ్వంసం సృష్టించాడు. లక్షలాది మందిని పొట్టనపెట్టుకున్నాడు. హిట్లర్ నియంతృత్వం ఎంతగా పెరిగిందంటే అతని కారణంగా ఒక దేశంతో మరో దేశం పోరాడేందుకు సిద్ధం అయ్యింది. అలాంటి హిట్లర్ చొరవతోనే రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఇప్పుడు మనం హిట్లర్ జీవితంలోని ఒక రహస్యం గురించి తెలుసుకుందాం. ప్రపంచమంతా హిట్లర్ నియంతృత్వానికి ఆందోళన చెందింది. ఈ నేపధ్యంలోనే అతన్ని చంపడానికి నిరంతర ప్రయత్నాలు జరిగాయి. ఎవరికీ ఇది అంత సులభం కాలేదు. హిట్లర్ను వెన్నంటి ఉండే నాజీ సైన్యం అతనిని అనుక్షణం కంటికిరెప్పలా కాపాడేది. ఆహారంలో విషం కలిపి, తనను ఎవరైనా చంపేస్తారేమోనని హిట్లర్ నిత్యం భయపడేవాడు. దీనిని తప్పించుకునేందుకు ఒక మార్గాన్ని కూడా అనుసరించాడు. హిట్లర్కు సన్నిహితులైన 15 మంది మహిళలు ఆయనకు వడ్డించే ఆహారాన్ని మొదట రుచి చూసేవారు. ఎప్పుడైనా ఆహారంలో విషం కలిపితే, దానిని రుచి చూసే మహిళ చనిపోతుంది. అప్పుడు హిట్లర్ ప్రాణాలకు రక్షణ ఏర్పడుతుంది. హిట్లర్ ఆహారం తీసుకునే ప్రతిసారీ ఈ మహిళలు తమ ప్రాణాలను పణంగా పెట్టేవారు. హిట్లర్ తినే ఆహార పదార్థాలు అధికంగా ఉండటం వలన వాటిని పలువురు మహిళలు రుచి చూసేవారు. హిట్లర్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి పలు పద్ధతులను ఉపయోగించేవాడు. ఎటువంటి దాడికి గురికాని సైనిక బంకర్లలో తల దాచుకునేవాడు. భారీ స్థాయిలో ఉన్న నాజీ సైన్యం అతనిని నిరంతరం కాపాడుతుండేది. ప్రాణాలు కాపాడుకునేందుకు ఇంతలా తాపత్రయపడిన హిట్లర్ చివరికి విషాహారం కారణంగానే మృతి చెందాడు. ఇది కూడా చదవండి: ఆత్మగౌరవం గురించి బాపూజీ ఏమన్నారు? -
గాంధీ హత్యకు బ్రిటీష్ అధికారి కుట్ర? ఒక వంటవాడు ఎలా భగ్నం చేశాడు?
అది 1917.. బీహార్లోని బెట్టియా జిల్లా గౌనాహాలోని పర్సౌని గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మహాత్మా గాంధీ ప్రాణాలను కాపాడాడు. ఈ విషయం చరిత్ర తెలిసిన చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మహాత్ముని ప్రాణాలను కాపాడిన ఆ దేశభక్తుని పేరు బత్తక్ మియా. ఆయన బ్రిటీష్ వారి కుట్రను భగ్నం చేసి, జాతిపిత ప్రాణాలను కాపాడారు. నేడు ఆ దేశభక్తుని మూడవతరం వారు కటికపేదరికంలో జీవించవలసి వస్తున్నది. వారి కుటుంబం మరో రాష్ట్రానికి వెళ్లి కూలీ పనులు చేసుకునే దీనపరిస్థితి నెలకొంది. కాగా గాంధీజీ ప్రాణాలను కాపాడినందుకు గాను అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్.. బత్తక్ మియా పేరిట అందించిన రివార్డు కూడా వీరి కుటుంబానికి పూర్తిస్థాయిలో అందలేదు. 1917లో మోతీహరిలో ఉంటున్న బ్రిటిష్ ఇండిగో ఫ్యాక్టరీ మేనేజర్ ఇర్విన్.. మహాత్మా గాంధీ హత్యకు కుట్ర పన్నాడు. గాంధీజీని భోజనానికి ఆహ్వానించి, ఆయనకు అందించే పాలలో విషం కలపాలని ఇర్విన్ ప్లాన్ చేశాడు. ఆ సమయంలో బత్తక్ మియా.. ఇర్విన్ దగ్గర వంటవానిగా పనిచేసేవాడు. బత్తక్ మియా మనుమడు కలాం అన్సారీ తెలిపిన వివరాల ప్రకారం అతను తన తాతను చూడలేకపోయినప్పటికీ, అతని తండ్రి జాన్ అన్సారీ తెలిపిన వివరాలను గుర్తుచేసుకున్నాడు. గాంధీజీ 1917లో చంపారన్కు వచ్చినప్పుడు, ఒక బ్రిటిష్ అధికారి.. గాంధీజీకి పాలలో విషం ఇవ్వాలని బత్తక్ మియాను ఆదేశించాడు. అయితే ఆ అధికారి బెదిరింపులకు బత్తక్ మియా లొంగలేదు. అయినా ఆ అధికారి పట్టువీడక బత్తక్ మియాను విషం కలిపిన పాలతో గాంధీ వద్దకు పంపించాడు. బత్తక్ మియా.. మహాత్మాగాంధీకి పాలు ఇస్తూ.. అందులో విషం ఉందని చెప్పడంతో గాంధీజీ వాటిని తాగకుండా పారేశారు. ఆ తర్వాత ఒక పిల్లి ఆ పాలు తాగి చనిపోయింది.ఈ సంఘటనకు నాటి స్వాతంత్ర్య సమరయోధుడు రాజేంద్ర ప్రసాద్తో పాటు మరికొందరు సాక్షులగా నిలిచారు. ఈ సంఘటన తర్వాత బత్తక్ మియాను ఆ బ్రిటీష్ అధికారి జైలుకు పంపించాడు. దీనితోపాలు అతనికి చెందిన 5 గేదెలతో పాటు పలు భూములను వేలం వేసి విక్రయించాడు. దీంతో బత్తక్ మియా ఇంటి ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. 1950లో డాక్టర్ రాజేంద్రప్రసాద్ మోతీహరి వచ్చినప్పుడు బత్తక్ మియాకు 24 ఎకరాల భూమి అందిస్తామని ప్రకటించారు. అయితే ఇలా అతనికి కేటాయించిన భూమిని తదనంతర కాలంలో అటవీశాఖ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం బత్తక్ మియా వారసులు అత్యంత దీనస్థినతిలో బతుకువెళ్లదీస్తున్నారు. ఇది కూడా చదవండి: టైమ్ ట్రావెల్ నిజమేనా? ఈ ఫొటో దానికి సాక్ష్యమా? -
సహజ జీవన గమనం! అదే అత్యంత శుభదాయకం
మనిషి ఆనందంగా ఉండాలంటే ఎలా ఉండాలి. ఏవిధంగా ప్రవర్తించాలి అని తెలిపే జైన్ కథలు మానావళి ఓ గోప్ప వరం. అవి మనిషి బుద్ధిని వికసింప చేసి ఆలోచింప చేసేవిగా ఉంటాయి. ధర్మా ధర్మాలని చాలా చక్కగా విపులీకరించి ఎంతటి చిన్నపిల్లవాడికైన సులభంగా అర్థమవుతాయి. ఇలాంటి ఉరుకుల పరుగుల జీవితంలో ఈ కథలు మనస్సు ప్రశాంతతకు ఓ చక్కటి ఔషధంలా ఆహ్లాదాన్ని ఇస్తాయి ఈ జైన్ కథలు. ఈ రోజు చెప్పే జైన్ కథ దేని గురించి తెలుసా..! అసలైన మహత్యం అంటే.. జెన్ గురువు ‘బన్కెయి’ ఓ నాడు బౌద్ధ విహారంలో ప్రవచనం చేస్తుండగా వేరే బౌద్ధ శాఖకు చెందిన ఒకాయన అక్కడకు వచ్చి సభలో పెద్దగా మాట్లాడుతూ అలజడి సృష్టించాడు. బన్కెయికి వచ్చిన మంచిపేరంటే అతడికి అసూయ. బన్కెయి మాట్లాడటం ఆపి గొడవకు కారణం ఏమిటని అడిగాడు. వచ్చిన ఆ ఆగంతకుడు అన్నాడు: ‘మా శాఖను స్థాపించిన గురువు ఎటువంటి గొప్ప మాహాత్మ్యాలు చెయ్యగలడంటే, నదికి ఇవతల గట్టు మీద కుంచె పుచ్చుకొని ఉండి, అవతల గట్టుమీద ఎవరైనా అట్ట పుచ్చుకొని ఉంటే, దానిమీద ఆ కుంచెతో బొమ్మ గీయగలడు. నీవు అలాంటి మహత్తు చెయ్య గలవా?’ బన్కెయి సమాధానం చెప్పాడు: ‘అలాంటి తంత్రం మీ గురువు చెయ్యగలడేమో కాని, అది జెన్ పద్ధతి కాదు. నేను చేసే మహత్తు ఏమిటంటే, నాకు ఆకలైనప్పుడు తింటాను. దాహమైనప్పుడు తాగుతాను.’ అదే అత్యంత శుభదాయకం ఓ ధనవంతుడు, జెన్ గురువు ‘సెన్గయి’ని అడిగాడు, తన వంశాభివృద్ధికి శుభదాయకమైన వాక్యం ఒకటి వ్రాసివ్వమనీ, దాన్ని తరతరాలుగా దాచి ఉంచుకొంటామనీ! సెన్గయి పెద్ద కాగితం ఒక దాన్ని తెప్పించుకొని, దాని మీద ఇలా రాశాడు: ‘తండ్రి చనిపోతాడు, కొడుకు చనిపోతాడు, మన వడు చనిపోతాడు. ’ధనవంతుడికి కోపం వచ్చింది. ‘నేను నిన్ను నా కుటుంబం ఆనందంగా ఉండటానికి ఏదైనా రాసివ్వమని అడిగాను. నీవేంటి ఇలా నన్ను ఎగతాళి పట్టిస్తున్నావు?’ ‘ఇందులో ఎగతాళి ఏం లేదు’ వివరించాడు సెన్గయి. ‘నీవు చనిపోకముందే నీ కొడుకు చనిపోయినాడనుకో. అది నిన్ను ఎంతగానో బాధిస్తుంది. నీకంటే, నీ కొడుకు కంటే ముందే, నీ మనవడు చనిపోయినాడనుకో, మీ ఇద్దరి గుండె పగిలిపోతుంది. అలా కాకుండా, నీ కుటుంబం తరతరాలుగా నేను పేర్కొన్న వరుసలో గతించినారనుకో, అది సహజమైన జీవన గమనం అవుతుంది. దీన్ని నేను శుభదాయకం అంటాను.’ – దీవి సుబ్బారావు -
ఎదురయ్యే అనుభవాన్ని ఏవిధంగా తీసుకుంటావనే దానిపైనే..
చదువు వేరు జీవితం వేరు. చాలామంది అంత చదువుకున్నాడు అలా ఎలా నిర్ణయం తీసుకున్నాడు. పెద్ద పెద్ద చదువులు చదివి కూడా ఇలా ఎలా ఆలోచిస్తున్నాడు. వంటి మాటలు తరుచు వింటుంటాం. నిజానికి చదువుకి చాలా తేడా ఉంది. చదువులో రాజీ పడకుండా చదివితేనే గెలుపుని అందుకోగలం. అదే జీవితంలో బంధాలు నిలవాలన్న, కాపాడుకోవాలన్న రాజీపడాలి. అంటే ఇక్కడ ప్రతిసారి గమ్మని కూర్చొమని కాదు. తగ్గాల్సిన చోట తగ్గాలి పెదవి విప్పి గట్టిగా చెప్పాల్సినప్పుడూ చెప్పాలి. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ఏది మాట్లాడితే సమస్య రాదో ఎవ్వరికి గాయం కాకుండా సూటిగా విషయం అవగతమయ్యేలా చెప్పే నేర్పు, ఓర్పు కావాలి లేదంటే జీవితాలు తలకిందులవ్వుతాయి. ముందుకు అసలు జీవితంలో జరిగే ప్రతికూలతల విషయాలను ఎలా స్వీకరించాలో చూద్దాం!. జీవితంలో ఏం కావాలను కుంటారో అది చాలామందికి దక్కదు. దక్కకపోవడం సహజంగా బాధను కలిగిస్తుంది. దక్కినదాంట్లోనే ఆనందం వెతుక్కునేవారు మరోరకం. తృప్తి, అసంతృప్తి అనేవి మనుషుల ఆలోచనా విధానంలో ఉంటాయి. కొందరు నిరంతరం కావాల్సిన దానికోసం ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటారు. ఏ పద్ధతిలో అన్నది ముఖ్యం. అన్నీ కలిసివస్తే అదృష్టవంతుడిగా చలామణీ అయ్యే మనిషి గెలుపును కేవలం తన ప్రతిభగా ప్రకటించుకోవడం ఎంతవరకు సమంజసం? కోరిక ఉండాలి. దాన్ని నెరవేర్చుకునేందుకు కృషి జరగాలి. ఫలితం ఎలా ఉన్నా ప్రయత్నంలో మాత్రం ఆనందం పొందాలి. లక్ష్యసాధనలో రాజీ పడకూడదు. జీవితం ఎలా రూపుదిద్దుకుంటుందో, ఎక్కడెక్కడ మలుపులు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. మనం చేసే మంచి పనులే మన అదృష్టాన్ని నిర్ణయిస్తాయని భావించేవారు కొందరైతే, మనం గతంలో చేసుకున్నదాన్ని బట్టే ఈ స్థితి అని విశ్వసించేవారు మరికొందరు. ఎదురయ్యే అనుభవాన్ని ఏ విధంగా తీసుకుంటామన్నదే ముఖ్యం. అదే జీవితసత్యం. (చదవండి: ఆ పార్కులో మాటల్లేవ్! కేవలం నిశబ్దమే..మనుషులంతా విగ్రహాలే!) -
విశిష్టుడు, సర్వలోకహితుడైన "కృష్ణుడు" ధర్మపక్షపాతి
కృష్ణుడు పుట్టినరోజును కృష్ణజన్మాష్టమి, గోకులాష్టమి అని పిలుస్తారు. దేవకి, వసుదేవులకు ఎనిమిదవ సంతానంగా శ్రావణ మాసంలో కృష్ణపక్షమి, అష్టమితిధి రోజు పుట్టినట్లుగా పురాణాలు,ఇతిహాసాలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కృష్ణభక్తులంతా వేడుకలు జరుపుకొనే విశిష్టమైన రోజు కృష్ణాష్టమి. 'భగవద్గీత' ద్వారా లోకానికి గొప్ప ఉపదేశం చేసిన మూలంగా కృష్ణుడిని 'జగద్గురువు'గా భావిస్తారు, కృష్ణం వందే జగద్గురుమ్... అంటూ పూజిస్తారు. శ్రీకృష్ణుడి లీలలు అనంతం. అవన్నీ ఆనందదాయకం, జ్ఞానప్రదాయకం. మానవ జీవన క్రమంలో సుఖవంతంగా, జయప్రదంగా జీవించాలంటే కృష్ణతత్త్వాన్ని అర్థం చేసుకొని ఆచరించాలని పెద్దలు చెబుతారు. నర-నారాయణ (అర్జునుడు-కృష్ణుడు) సంవాదంలో నరునికి బోధించినట్లుగా కనిపించే 'భగవద్గీత' నరలోకం మొత్తానికి నారాయణుడు (కృష్ణుడు) చేసిన జ్ఞానబోధగా భావించాలని పండితులు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. మనిషి మరణించినప్పుడు తల దగ్గర పెట్టి వినిపించే విషాదగీతం కాదు భగవద్గీత. మానవులకు కర్తవ్య బోధ చేస్తూ కార్యోన్ముఖులను చేసే 'విజయగీత'. వ్యక్తిత్వ వికాసానికి ఇంతకు మించిన ఉద్గ్రంథం ఇంకొకటి లేదని ప్రపంచ మేధావులంతా ఏకమై చెప్పారు. అందుకే, 'గీత' భారతీయ భాషలతో పాటు అనేక అంతర్జాతీయ భాషలలో అనువాదమైంది. అది చదివిన పిమ్మట అనేక దేశాలవారు కృష్ణతత్త్వం వెంట పరుగులు తీస్తున్నారు. భారతదేశానికి తరలి వస్తున్నారు. ధర్మం, వృత్తిధర్మం, స్వధర్మం వైపు నడవండని గీతాచార్యుడైన కృష్ణుడు చెప్పాడు. స్వధర్మం ఏంటో తెలుసుకోవడంలోనే జ్ఞాన వికాసం దాగివుంది. తెలుసుకున్న తర్వాత ఆచరించడంలో వివేకం దాగివుంటుంది. ఈ మనోయోగం పట్టాలంటే భగవద్గీతను చదివి తీరాల్సిందే. కౌరవ-పాండవ యుద్ధంలో కృష్ణుడు పాండవుల వైపు నిలుచున్నాడు. అది అధర్మానికి - ధర్మానికి మధ్య జరిగిన యుద్ధం కాబట్టి వివేకవంతుడు, విశిష్టుడు, సర్వలోకహితుడైన కృష్ణుడు ధర్మపక్షపాతిగా పాండవుల వైపే నిల్చొని, వారికి విజయం కలిగించాడు. అధర్ములకు అపజయాన్ని చూపించి గుణపాఠం నేర్పాడు. కృష్ణాష్టమి నాడు కృష్ణుడిని తలుచుకోవడం, కొలుచుకోవడమంటే? కృష్ణతత్త్వాన్ని తెలుసుకోవడమే. కృష్ణతత్త్వం తెలియాలంటే జయదేవుడు రచించిన అష్టపదులు, లీలాశుకుడి 'శ్రీకృష్ణ కర్ణామృతం', నారాయణతీర్ధుడి తరంగాలు చదివి, అనుభవించండని మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య తెలియజేశారు. 'జగదాష్టమి'గా గుజరాతీయులు కృష్ణజన్మాష్టమిని విశిష్టంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజు ప్రపంచంలోని భక్తులంతా నాట్యం, నాటకం (రూపకం),ఉపాసన,ఉపవాసాలు మొదలైన వివిధ మార్గాల్లో తమ భక్తిని చాటుకుంటారు. ఇది తరతరాల నుంచి వైభవంగా సాగుతున్న సంప్రదాయం. ఉట్టికొట్టడం గొప్ప ఆసక్తిగా సాగే క్రీడ. మన తిరుమల ఆలయంలో శ్రీ వేంకటేశ్వరుని పక్కనే రజితమూర్తిగా శ్రీకృష్ణుడు విరాజిల్లుతుంటాడు. వెయ్యేళ్ళపై నుంచే ఈ విగ్రహం అక్కడ ఉన్నట్లు చెబుతారు. శ్రీకృష్ణుడి బాల్యక్రీడలకు సంబంధించిన విశేషాలు ప్రతిస్పందించేలా తిరుమల మాడ వీధుల్లో పెద్ద కోలాహలం జరుగుతుంది. ఈ ఉత్సవం చాలా ప్రాచీనమైందని తెలుస్తోంది.1545 నాటి శాసనాల ఆధారంగా ఈ వివరాలు తెలుస్తున్నాయి.తాళ్లపాకవారే ఈ వేడుకలను ఏర్పాటు చేసినట్లు చెప్పుకుంటారు. శ్రీకృష్ణుడు గొప్ప రాజనీతి చతురుడు.ఎంతటి చతురుడో అంతటి రసికుడు.ఎంతటి రసికుడో అంతటి అప్తజన రక్షకుడు. సౌందర్యవిలాసుడు, విలక్షణ వాగ్భూషణుడు. అందుకే "నల్లనివాడు, పద్మ నయనంబులవాడు, కృపారసంబు పై చల్లెడివాడు" అన్నాడు మన పోతన్న. తనను నమ్ముకున్నవారిపై దయారసాన్ని గొప్పగా కురిపించే కరుణాసముద్రుడని భావం. కేవలం పాండవులపైనే కాదు, ధర్మమూర్తులందరిపైనా తన దయను విశేషంగా చూపించి విజయులను చేశాడు. కృష్ణుడిని అర్థం చేసుకుంటే ఆత్మజ్ఞానం కలిగినట్లే. -మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్ (చదవండి: భావోద్వేగాలను కట్టడి చేసే మహత్తరమైన శక్తి వాటికే ఉంది!) -
మురళీధరన్ అదే చేశాడు! – సచిన్ టెండూల్కర్
‘‘1993లో మురళీధరన్ని కలిశాను. అప్పట్నుంచి మా స్నేహం అలాగే ఉంది. ఎంతో సాధించినా సాధారణంగా ఉంటాడు. అతను ఏదైనా అడిగితే కుదరదని చెప్పడం కష్టం.. అందుకే పిలవగానే ఈ వేడుకకి వచ్చాను’’ అన్నారు భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘800’. మురళీధరన్ పాత్రలో మధుర్ మిట్టల్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో వివేక్ రంగాచారి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ముంబైలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ‘800’ ట్రైలర్ని సచిన్ టెండూల్కర్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఆటలో గెలు పోటములు ఉంటాయి. మళ్లీ నిలబడి పోటీ ఇవ్వడమే నిజమైన ఆటగాడి లక్షణం. మురళీధరన్ అదే చేశాడు.. అతని జీవితం గురించి ప్రజలు తెలుసుకోవాలి’’ అన్నారు. ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ– ‘‘నేను సచిన్ ఫ్యాన్ని. మరో వందేళ్ల తర్వాత కూడా సచిన్ లాంటి క్రికెటర్, వ్యక్తి రాలేరు’’ అన్నారు. ‘‘ఈ సినిమాను విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్. ‘‘800’ మానవత్వంతో కూడిన కథ’’ అన్నారు ఎంఎస్ శ్రీపతి. ‘‘మురళీధరన్గారి పాత్ర చేయడం ఓ పెద్ద బాధ్యత’’ అన్నారు మధుర్ మిట్టల్. -
ఈ ఐదుగురు.. స్కూలు టీచర్లు కాదు.. కానీ ఉత్తమ ఉపాధ్యాయులు!
నిరుపేదలకు ఆర్ధిక సహాయం చేయడం, వారికి ఆహారం ఇవ్వడం లాంటివి చాలామంది చేస్తుంటారు. కానీ వీటన్నింకంటే గొప్ప దానం విద్యాదానం. చదువుకునేందుకు తాపత్రయ పడేవారికే విద్యకున్న నిజమైన ప్రాముఖ్యత బాగా తెలుస్తుంది. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తమ జ్ఞానాన్ని తమ వద్దే ఉంచుకోవడమే కాకుండా ఇతరులకు పంచే బాధ్యతను కూడా తీసుకున్న కొంతమంది ఉపాధ్యాయుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖేష్ పిథోరా: విద్య విలువ తెలుసుకుని.. ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్కు చెందిన ముఖేష్ పిథోరా పేద, నిస్సహాయస్థితిలో ఉన్న పిల్లల కోసం తన సమయాన్ని, జీవితాన్ని అంకితం చేస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు ముఖేష్. నిరుపేద కుటుంబం నుండి వచ్చిన ముఖేష్ అనేక సమస్యలను ఎదుర్కొంటూనే విద్యను అభ్యసించారు. పలువురు పేద పిల్లలు విద్యను అభ్యసించడానికి తగిన వనరులు లేని కారణంగా విద్యారంగంలో ముందుకు సాగలేకపోతున్న విషయాన్ని ఆయన గమనించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఉచిత విద్యను అందించాలని ముఖేష్ నిర్ణయించుకున్నారు. ఫిరోజాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తన వద్దకు వచ్చే పేద, నిస్సహాయ పిల్లలకు విద్యా తరగతులు నిర్వహిస్తుంటారు. ఇందుకోసం వారినుంచి ఎటువంటి రుసుము వసూలు చేయరు. అరుప్ ముఖర్జీ: సొంత సొమ్ముతో పాఠశాల ట్రాఫిక్ కానిస్టేబుల్ అరూప్ ముఖర్జీ 1999లో కోల్కతా పోలీస్ ఫోర్స్లో చేరారు. తన చిన్ననాటి కలను నెరవేర్చుకునేందుకు పొదుపు చేయడం మొదలుపెట్టారు. తన 6 సంవత్సరాల వయస్సులోనే పాఠశాల ప్రారంభించాలని కలలు కన్నారు. 43 ఏళ్ల అరూప్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద తన డ్యూటీ చేయడమే కాకుండా, పేద గిరిజన పిల్లలకు పునరావాసం కూడా కల్పిస్తున్నారు. ముఖర్జీ ఏర్పాటు చేసిన పుంచ నబాదిశ మోడల్ స్కూల్ 126 మంది సబర్ పిల్లలకు వసతి, ఆహారం, ప్రాథమిక విద్యను ఉచితంగా అందిస్తుంది. ముఖర్జీ ఈ పాఠశాలను 2011లో నిర్మించారు. కోల్కతాకు 280 కి.మీ దూరంలో ఉన్న పుంచ గ్రామంలోని ఈ పాఠశాలకు రూ.2.5 లక్షల ప్రాథమిక నిధి తన సొంత పొదుపు నుంచి ముఖర్జీ వెచ్చించారు. దాతలు విరాళంగా ఇచ్చిన స్థలంలో ఈ పాఠశాలను నిర్మించారు. అరూప్ తన జీతంలో ప్రతీనెల రూ.20 వేలు స్కూల్ కోసం వెచ్చిస్తున్నారు. వ్యవసాయంతో వచ్చే ఆదాయంతో అతని కుటుంబం బతుకుతోంది. డాక్టర్ భరత్ శరణ్: వైద్యులను తీర్చిదిద్దుతూ.. రాజస్థాన్కు చెందిన డాక్టర్ భరత్ శరణ్ ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ను నడుపుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారు. ఈ కోచింగ్ సెంటర్లో 11వ తరగతికి చెందిన వెనుకబడిన 25 మంది విద్యార్థులకు, 12వ తరగతి చదువుతున్న 25 మంది విద్యార్థులకు ఉచితంగా విద్యనందిస్తున్నారు. డాక్టర్ శరణ్ మీడియాతో మాట్లాడుతూ తాను గత 7 సంవత్సరాలుగా ఈ కోచింగ్సెంటర్ నడుపుతున్నానని తెలిపారు. అతని ఇన్స్టిట్యూట్లో చదివిన 30 మందికి పైగా విద్యార్థులు ఎంబీబీఎస్లో అడ్మిషన్ పొందారు. ఐదుగురు ఎయిమ్స్లో పనిచేస్తున్నారు. కొందరు వెటర్నరీ మెడిసిన్లో ఉన్నారు. మరికొందరు ఆయుర్వేద రంగంలో కొనసాగుతున్నారు. కానిస్టేబుల్ వికాస్ కుమార్: గ్రామంలోని పేద పిల్లలకు.. ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ వికాస్ కుమార్ దేశ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. తన డ్యూటీకి సమయం కేటాయిస్తూనే, పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. 2014 నుంచి తన గ్రామంలోని పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. తనకు 18 ఏళ్లు ఉన్నప్పటి నుంచి ఆయన ఈ మహోత్కార్యం చేస్తున్నారు. తల్లిదండ్రుల పేదరికం కారణంగా పిల్లలు చదువుకోలేకపోతున్నారని, ఇలాంటి పిల్లలకు చదుపు చెప్పించే బాధ్యతను తీసుకున్నానని వికాస్ కుమార్ తెలిపారు. కానిస్టేబుల్ మహ్మద్ జాఫర్: తన కలను స్టూడెంట్స్ నెరవేరుస్తారని.. ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాకు చెందిన కానిస్టేబుల్ మహ్మద్ జాఫర్ తన డ్యూటీ ముగియగానే రోజూ పేద పిల్లలకు ఉచితంగా చదువు చెబుతుంటారు. జాఫర్ తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న చెట్టుకింద పాఠశాల నడుపుతున్నారు. ఈ పోలీస్ స్కూల్కు ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుకునే పిల్లలు ట్యూషన్ కోసం వస్తుంటారు. నవోదయ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవడానికి సిద్ధమవుతున్న పిల్లలు కూడా ఈ స్కూల్లో కోచింగ్ తీసుకుంటారు. జాఫర్ సైన్స్ గ్రాడ్యుయేట్, సివిల్ సర్వీసెస్లో చేరాలనేది అతని కల. కానీ అతని కల నెరవేరలేదు. తాను చదువు నేర్పుతున్న పిల్లల్లో ఎవరో ఒకరు తన కలను నెరవేర్చుకుంటారని జాఫర్ చెబుతుంటారు. ఇది కూడా చదవండి: ‘డూమ్స్డే క్లాక్’ అంటే ఏమిటి? 1947లోనే యుగాంతానికి దూరమెంతో తెలిసిపోయిందా? -
10 అనవసర విషయాలు.. వీటి జోలికి వెళ్లకపోవడమే శ్రేయస్కరం!
మనిషి ప్రశాంతంగా ఉండాలంటే తప్పనిసరిగా కొన్ని పరిధులను కల్పించుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటే లేని పోని సమస్యలు ఎదురవుతాయి. అవమానాలు కూడా ఎదురయ్యే ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఈ 10 అనవసర విషయాలు మనిషికి ముప్పును తెచ్చిపెడతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. సమయం, శక్తి వృథా: మీకు అవసరం లేని చోటికి వెళ్లడం వలన లేదా అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వలన మీ విలువైన సమయం, శక్తి వృథా అవుతాయి. దీనికి బదులుగా మీ నైపుణ్యాలను అవసరమయ్యే విషయాలపైనే కేంద్రీకరించండి. తద్వారా మీ శక్తిసామర్థ్యాలు సద్వినియోగం అవుతాయి. 2. గుర్తింపునకు దూరం కావడం: మీరు అవసరం లేని చోటికి వెళ్లినప్పుడు, లేదా మీ సామర్థ్యాన్ని అనవసరం లేని విషయాలపై కేంద్రీకరించినప్పుడు మీకు తగిన గుర్తింపు, ప్రశంసలు అందకపోవచ్చు. ఇటువంటి సందర్భాల్లో మీకు సహకారం అందకపోగా, మీ గుర్తింపు కూడా మరింత తగ్గే అవకాశం ఉంది. 3. ఇతరుల వ్యక్తిగతాల్లోకి తొంగిచూడటం: మీకు అవసరం లేనప్పుడు ఇతరుల వ్యక్తిగతాల్లోకి చొరబడకపోవడమే ఉత్తమం. ఇతరుల వ్యక్తిగతాలను గౌరవించండి. ఎదుటివారు మీ సహాయం కోసం ప్రత్యేకంగా అడగనంత వరకు వారి వ్యక్తిగత వ్యవహారాల జోలికి వెళ్లకండి. 4. ఇతరుల సామర్థ్యాలను అణగదొక్కడం: మీరు ఉద్దేశ్యపూర్వకంగా ఇతరుల సామర్థ్యాలను అణగదొక్కే ప్రయత్నం చేయకండి. వారి నైపుణ్యాలపై నమ్మకం ఉంచండి. వారి బాధ్యతలను వారు స్వతంత్రంగా నిర్వహించేలా చూడండి. ఇందుకు అవసరమైతేనే సహకారం అందించండి 5. ఉనికికే ప్రమాదం: మీరు అవసరం లేని విషయాల్లో జోక్యం చేసుకుని, ఇతరులు మీ ఉనికిపై ఆధారపడే భావాన్ని వారిలో కల్పించవద్దు. ఇది ఇతరుల ఎదుగుదలకు, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. ఎందుకంటే వారు తమ స్వంత నైపుణ్యాలను, సమస్యల పరిష్కార సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి బదులు మీపై ఆధారపడే స్వభావాన్ని ఏర్పరుచుకోవచ్చ. తద్వారా మీ ఉనికికే ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. 6. లక్ష్యానికి దూరం కావడం: మీరు అవసరం లేని విషయాలలో అతిగా జోక్యం చేసుకుంటే మీ ఆసక్తులు, లక్ష్యాలకు దూరమై అన్ని అవకాశాలను కోల్పోయే పరిస్థితులు ఏర్పడవచ్చు. మీ వ్యక్తిగత ఎదుగుదలకు ప్రాధాన్యత ఇవ్వడం, మీకు నిజమైన ప్రయోజనాలను అందించగల ప్రయత్నాలను కొనసాగించడం ఎవరికైనా చాలా అవసరం. 7. అతిశయోక్తులకు దూరంగా ఉండటం: మిమ్మల్ని మీరు అతిగా ఊహించుకోవడం, వర్ణించుకోవడం వలన మీ అత్యవసరాలను, శ్రేయస్సును నిర్లక్ష్యం చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఆరోగ్యకరమైన పనితీరు, జీవిత సమతుల్యతను కాపాడుకునేందుకు మనం ఏమిటో మనం తెలుసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. 8. వనరుల దుర్వినియోగం: మీరు మీ దగ్గరున్న వనరులను మీకు అవసరం లేని అంశాలపై మళ్లించినప్పుడు.. అది సమయం అయినా, డబ్బు అయినా వృథాకు దారితీస్తుంది. మీ దగ్గరున్న వనరులను ద్విగుణీకృతం చేసుకునేందుకు, వాటిని సమర్థవంతంగా ఉపయోగించడం చాలా ముఖ్యం. 9. కార్యకలాపాలకు అంతరాయం: మీరు లేనిపోని విషయాల్లో జోక్యం చేసుకోవడం వలన మీ కార్యకలాపాలకు, ఇతరుల కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుంది. మీరు కోరుకునే మార్పు, మెరుగుదల కోసం ఇప్పటికే ఉన్న ప్రక్రియలను కొనసాగించాలి. సంబంధిత ప్రోటోకాల్లను గౌరవించడం కూడా అవసరమే. 10. చివరికి మిగిలేది: మీరు అవసరం లేని విషయాల్లో తరచూ జోక్యం చేసుకోవడం వల్ల అది నిరాశకు దారితీస్తుంది. మీ ప్రయత్నాలను అనవసరమైన విషయాలపై పెట్టి, సమయం వృథా చేసుకోకుండా, విలువైన, అర్ధవంతమైన మార్పును కలిగించగల అంశాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఇది కూడా చదవండి: ‘నాలుగు కాళ్ల’ వింత కుటుంబం.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు -
‘శాంతి లైఫ్’ ఎన్నో గ్రామాల ముఖచిత్రాన్ని మార్చింది!
‘ఎవరైనా సరే నిద్రలేస్తూనే నేను ఉద్యోగం కోసం ఎదురు చూడడం లేదు. పదిమందికి ఉపాధి కల్పించడం కోసం ఎదురుచూస్తున్నాను’ అనుకోవాలి. ‘ఆశాపూరిత ప్రపంచాన్ని ఊహించుకున్నప్పుడే, దాన్ని నిజంగా సృష్టించగలం. నీ మార్గం ఏమిటి అనే విషయంలో స్పష్టత ఉంటేనే అక్కడికి చేరుకుంటావు. అలా చేరుకోవడానికి నీలోని ఉత్సాహం, అంకితభావం ఇంధనంలా ఉపయోగపడతాయి’...‘మైక్రోఫైనాన్స్ దారిదీపం’గా ప్రసిద్ధుడైన మహ్మద్ యూనస్ చెప్పిన ఇలాంటి మాటలెన్నో శాన్ఫ్రాన్సిస్కోలోని షీతల్ మెహతా వాల్ష్కు ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను యూనస్ బాటలో నడిపించి ‘శాంతి లైఫ్’కు శ్రీకారం చుట్టేలా చేసింది. సూక్ష్మారుణ సంస్థగా మొదలైన ‘శాంతి లైఫ్’ ఎన్నో గ్రామాల ముఖచిత్రాన్ని మార్చింది.. శాంతి లైఫ్ కెనడాలో పెరిగిన షీతల్ అక్కడి గుజరాతీ అసోసియేషన్లో భాగం కావడంతో ఎన్నోకుటుంబాలతో పరిచయం ఏర్పడింది. కమ్యూనిటీ లైఫ్లో భాగం కావడం ద్వారా పాశ్చాత్యజీవన విధానానికి భిన్నమైన భారతీయ జీవన విధానాన్ని చూసింది. ఎన్నో విలువలు నేర్చుకుంది. వెంచర్–క్యాపిటల్ ఫండింగ్ సెక్ట్చ్డర్లో రెండు దశాబ్దాల అనుభవాన్ని సంపాదించిన షీతల్ బంగ్లాదేశ్ సోషల్ ఎంటర్ప్రెన్యూర్ మహ్మద్ యూనస్ స్ఫూర్తితో అహ్మదాబాద్ కేంద్రంగా ‘శాంతి లైఫ్’ అనే సూక్ష్మారుణ సంస్థను ప్రారంభించింది. ఇది పేద మహిళల జీవితాల్లో వెలుగులు నింపింది. గతంలో ఎలా ఉండేదంటే... పేద మహిళలకు రుణాలు లభించడం కష్టం. ఒకవేళ లభించినా బారెడు వడ్డీ కట్టలేక అష్టకష్టాలు పడేవాళ్లు. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ వడ్డీతో ‘శాంతి లైఫ్’ రుణాలు ఇవ్వడం మొదలు పెట్టింది. ఎన్నో గ్రామాల్లో ఎంతోమంది మహిళలు రుణాలు తీసుకొని వ్యాపారాలు చేస్తూ సొంతకాళ్ల మీద నిలబడ్డారు. కేవలం రుణాలు ఇవ్వడమే కాకుండా గ్రామీణప్రాంత మహిళలకు స్కిల్స్ ట్రైనింగ్, ఫైనాన్షియల్ లిటరసీ... మొదలైన వాటిలో శిక్షణ ఇస్తోంది శాంతి లైఫ్. క్షేత్రస్థాయిలో పనిచేయడం ద్వారా అక్కడి పరిస్థితులపై స్పష్టమైన అవగాహన రావడానికి షీతల్కు అవకాశం ఏర్పడింది. ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాటిని దూరం చేయాలంటే ఏంచేయాలి... మొదలైన విషయాలను తెలుసుకుంది షీతల్. ‘శాంతి లైఫ్’ ఎన్నో గ్రామాలను దత్తత తీసుకుంది. పారిశుద్ధ్య లోపం వల్ల గ్రామీణ ప్రాంతాలలో మహిళలు అనారోగ్యానికి గురవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘సేఫ్ శానిటేషన్’ నినాదంతో గ్రామీణప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ అవగాహనతో వారు డబ్బు పొదుపు చేసి మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. ‘రుణం తీసుకోవడం అనేది ఆర్థిక వ్యవహారమే కాదు. ఒక బాధ్యతను నిరంతరం గుర్తు చేస్తుంది. శాంతి లైఫ్ ద్వారా రుణం తీసుకున్న ఒక మహిళ రిక్షా కొనుగోలు చేసింది. ఈ రిక్షాను ఆమె భర్త నడిపేవాడు. గతంలో అతడి ప్రవర్తన ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం క్రమశిక్షణతో నడుచుకుంటున్నాడు. ఏరోజు డబ్బును ఆరోజే భార్యకు ఇస్తుంటాడు. భార్య పేరు మీద లోన్ ఉంది కాబట్టి ఆమెకు చెడ్డ పేరు రావద్దని అనుకునేవాడు భర్త. ఇలాంటి భర్తలు ఎందరో! రుణసహాయం మాత్రమే కాదు క్రమశిక్షణ పాదుకొల్పడంలో ‘శాంతి లైఫ్’ తనదైన పాత్ర నిర్వహిస్తోంది. గ్రామీణ వృత్తికళాకారులు తయారు చేసిన యోగా బ్యాగులు, చీరెలు, దుప్పట్లను ఆన్లైన్ ద్వారా అమ్మడం మొదలుపెట్టింది. ‘ప్రతి ఒక్కరికీ తమదైన నైపుణ్యం ఉంటుంది. అది ఇతరుల కంటే ఏ రకంగా భిన్నమైనది, ఆ నైపుణ్యం సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది ఆలోచించాలి. నైపుణ్యాలను ఉపయోగించి క్షేత్రస్థాయిలో పనిచేయడం ద్వారానే పేదరికాన్ని దూరం చేయవచ్చు’ అంటుంది షీతల్. లాభాలు గడించాలనే దృష్టితో కాకుండా సమాజానికి తిరిగి ఇవ్వాలి అనే అవహగానతో ‘శాంతి లైఫ్’కు శ్రీకారం చుట్టింది షీతల్. సామాజిక నిబద్ధతతో మొదలైన ‘శాంతి లైఫ్’ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుందా అని ప్రశ్నించుకుంటే ‘అంతకంటే ఎక్కువే’ అని జవాబు చెప్పుకోవచ్చు. ఎంటర్ప్రెన్యూర్షిప్, ఫైనాన్స్, టెక్నాలజీలకు సంబంధించి నైపుణ్యాల శిక్షణ ద్వారా గుజరాత్లోని ఎన్నోగ్రామాల ముఖచిత్రాన్ని‘శాంతి లైఫ్’ మార్చింది. (చదవండి: తండ్రికి కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందే! హైకోర్టు జస్టిస్ ఆదేశం! )