-
ISRO: సముద్రంలోకి కార్టోశాట్–2
బెంగళూరు: పాత ఉపగ్రహాలతో ఆయా కక్ష్యల్లో పెరిగిపోతున్న అంతరిక్ష చెత్తను కాస్తయినా తగ్గించే లక్ష్యంతో ఇస్రో మరో అడుగు ముందుకేసింది. దాదాపు 17 సంవత్సరాల క్రితం ప్రయోగించాక చాలా ఏళ్లు దేశానికి సేవలందించిన కార్టోశాట్–2 ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా భూవాతావరణంలోకి తీసుకొచ్చి హిందూ మహాసముద్రంలో పడేలా చేసింది. ఫిబ్రవరి 14వ తేదీ మధ్యాహ్నం 3.48 గంటలకు ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని ఇస్రో శుక్రవారం ప్రకటించింది. పట్టణ ప్రణాళికలకు సాయపడేలా అత్యంత స్పష్టమైన హై రెజల్యూషన్ ఇమేజీలు తీసేందుకు 2007 జనవరి పదో తేదీన 680 కేజీల ఇస్రో కార్టోశాట్–2 ఉపగ్రహాన్ని 635 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో విజయవంతంగా పంపింది. ఇది 2019 ఏడాదిదాకా పనిచేసింది. తర్వాత కక్ష్య తగ్గించుకుంటూ క్రమంగా భూవాతావరణంలోకి ప్రవేశించి అత్యంత వేగంగా తిరుగుతూ మండి, ధ్వంసమై అతి చిన్న ముక్కలుగా మారిపోనుంది. అలా కావడానికి సాధారణంగా 30 సంవత్సరాల సమయం పడుతుంది. ఈలోపు ఉపగ్రహాలుండే కక్ష్యల్లో అంతరిక్ష చెత్తను తగ్గించేందుకు ముందుగానే దీనిని భూవాతావరణంలోకి రప్పించారు. -
రేపు జీఎస్ఎల్వీ ఎఫ్–14 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): స్థానిక భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్ఎల్వీ ఎఫ్–14 రాకెట్ను ప్రయోగించనున్నారు. షార్లోని బ్రహ్మప్రకాష్ హాలులో గురువారం మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్ఆర్) సమావేశం నిర్వహించిన తర్వాత ప్రయో గ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యా బ్) వారికి అప్పగించారు. అనంతరం లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ ఆర్ముగం రాజ రాజన్ ఆధ్వర్యంలో మరోసారి ల్యాబ్ సమావేశం నిర్వహించారు.శుక్రవా రం మధ్యాహ్నం 2.05 గంటల నుంచి 27.30 గంటల కౌంట్డౌన్ అనంతరం జీఎస్ఎల్వీ ఎఫ్–14 రాకెట్ను ప్రయోగిస్తారు. మొత్తం 2,272 కిలోలు బరువు కలిగిన ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టేలా ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని డిజైన్ చేశారు. ఇది షార్ కేంద్రం నుంచి 92వ ప్రయోగం కాగా, జీఎస్ఎల్వీ సిరీస్లో 16వ ప్రయోగం పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజనిక్ ఇంజిన్లు తయారు చేసుకుని చేస్తున్న 10వ ప్రయోగం కావడం విశేషం. -
స్పేస్ రిఫార్మ్ ఇయర్గా 2024–25
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్), ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్–స్పేస్) ఆధ్వర్యంలో రాబోయే 14 నెలల్లో 30 ప్రయోగాలను నిర్వహించనున్నారు. 2024–25 ఆర్థిక ఏడాదిని గగన్యాన్ సంవత్సరంగా ప్రకటించి 7 గగన్యాన్ ప్రయోగాత్మక పరీక్షలను నిర్వహించేందుకు ప్రణాళిక రచించారు. అలాగే, స్కైరూట్ ఎయిరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్కి చెందిన విక్రమ్–1టీబీడీ పేరుతో 4 ప్రయోగాలు, అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్కి చెందిన అగ్నిబాన్–టీబీడీ పేరుతో 3 ప్రయోగాలు చేయనున్నారు. ఇస్రో పీఎస్ఎల్వీ సిరీస్లో 8 ప్రయోగాలు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటికే ఈ ఏడాది జనవరి 1న పీఎస్ఎల్వీ సీ57 ప్రయోగాన్ని పూర్తి చేశారు. వీటి తరువాత పీఎస్ఎల్వీ సీ58, సీ59, సీ61, సీ62, సీ63, పీఎస్ఎల్వీ ఎన్1, ఎన్2 పేరుతో 8 ప్రయోగాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. జీఎస్ఎల్వీ సిరీస్లో ఈ నెల 17న జీఎ‹Üఎల్వీ ఎఫ్14, తరువాత ఎఫ్15, ఎఫ్16, ఎఫ్17 ప్రయోగాలను చేయడానికి సంసిద్ధమవుతున్నారు. ఎ‹Üఎస్ఎల్వీ సిరీస్లో డీ3, ఎస్1, ఎస్2 పేరుతో 3 ప్రయోగాలు, ఎల్వీఎం3–ఎం5 రాకెట్ ద్వారా ఒక ప్రయోగంతో కలిసి ఈ ఏడాదిలో 30 ప్రయోగాలు చేయనున్నారు. కాబట్టి ఈ ఏడాదిని ‘స్పేస్ రిఫార్మ్ ఇయర్’గా ఇస్రో ప్రకటించింది. 2023–24 ఆర్థిక ఏడాదిలో భాగంగా మార్చిలోపు అగ్నిబాన్, ఎస్ఎస్ఎల్వీ డీ3 ప్రయోగాలు చేయనున్నారు. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి దాకా 26 ప్రయోగాలు చేయడానికి ఇస్రో ప్రణాళిక రచించింది. ఈ ఏడాది గగన్యాన్ ప్రాజెక్టుకు సంబంధించిన 7 ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతమైతే 2025 ఆఖరికి మానవుడిని అంతరిక్షంలోకి పంపించి క్షేమంగా భూమికి తీసుకువచ్చేందుకు ఇస్రోసమాయత్తమవుతోంది. -
డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ ఇచ్చేందుకు ఇస్రో అనుబంధ ‘నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)’తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ (టీఎస్ఏఏ) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ల సమక్షంలో టీఎస్ఏఏ సీఈవో ఎస్ఎన్ రెడ్డి, ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ ప్రకాశ్ చౌహాన్లు దీనిపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ఎన్ఆర్ఎస్సీ శాస్త్రవేత్తలు డ్రోన్ పైలటింగ్, డ్రోన్ డేటా మేనేజ్మెంట్, డేటా అనాలసిస్, ప్రాసెసింగ్, మ్యాపింగ్లపై ఏవియేషన్ అకాడమీలో శిక్షణ పొందుతున్న డ్రోన్ పైలట్లకు 15 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వ అధికారులకు కూడా శిక్షణ: సీఎం అన్ని రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరిగిందని, పొలాల్లో ఎరువులు, పురుగుమందులు చల్లేందుకు రైతులు డ్రోన్లను వినియోగిస్తున్నారని ఈ భేటీలో అధికారులు వివరించారు. కొన్నిచోట్ల స్వయం సహాయక సంఘాలు డ్రోన్లను ఉపాధి మార్గంగా ఎంచుకున్నాయని తెలిపారు. దీంతో ఉన్నతస్థాయి నుంచి తహసీల్దార్ల వరకు ప్రభుత్వ అధికారులకు కూడా డ్రోన్లపై అవగాహన కలిగేలా శిక్షణను ఇవ్వాలని రేవంత్ సూచించారు. ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ.. దేశంలోనే వినూత్నంగా తెలంగాణలో డ్రోన్లపై శిక్షణ కోర్సు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. శాటిలైట్, రిమోట్ సెన్సింగ్, అంతరిక్ష వ్యవహారాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఎన్ఆర్ఎస్సీ.. డ్రోన్ టెక్నాలజీని సాంకేతికపరంగా మరింత పకడ్బందీగా వినియోగించుకునేందుకు శిక్షణలో భాగస్వామ్యం అవుతోందని వివరించారు. దేశంలో 12సార్లు బెస్ట్ ఏవియేషన్ అవార్డు అందుకున్న తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సేవలను కొనియాడారు. శిక్షణకు స్థలం కేటాయించండి ప్రస్తుతం ఎయిర్పోర్ట్లోనే డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇస్తున్నామని, అక్కడ నెలకొన్న రద్దీ దృష్ట్యా హైదరాబాద్ పరిసరాల్లో ప్రత్యేకంగా డ్రోన్ పైలట్ల శిక్షణ కోసం స్థలం కేటాయించాలని ఏవియేషన్ అకాడమీ అధికారులు సీఎం రేవంత్ను కోరారు. దీనిపై స్పందించిన సీఎం.. డ్రోన్ పోర్టు ఏర్పాటుకు ఎంత స్థలం అవసరం? ఏమేం నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందనే వివరాలు తెలుసుకున్నారు. పైలట్ల శిక్షణతోపాటు డ్రోన్ తయారీ కంపెనీలు ట్రయల్స్ నిర్వహించుకునేందుకు డ్రోన్ పోర్టు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. డ్రోన్ పోర్టుకు అవసరమైన 20 ఎకరాలను ఫార్మాసిటీ వైపు అన్వేíÙంచాలని అధికారులను ఆదేశించారు. ఏవియేషన్ నిబంధనల ప్రకారం అభ్యంతరం లేని ప్రాంతంలో ఈ స్థలం కేటాయించాలని సూచించారు. వరంగల్ ఎయిర్పోర్టు పునరుద్ధరణ వరంగల్ ఎయిర్పోర్ట్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని.. పాడైన పాత రన్వేలను కొత్తగా నిర్మించాలని అధికారులను సీఎం ఆదేశించారు. వరంగల్ ఎయిర్పోర్టు నుంచి వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని.. ఏవైనా అడ్డంకులు ఉంటే పరిష్కరించాలని సూచించారు. కొత్తగూడెం, భద్రాచలం పరిసర ప్రాంతంలోనూ ఎయిర్పోర్టు ఏర్పాటుకు అనువుగా ఉంటుందని, అక్కడున్న అవకాశాలను పరిశీలించి ఎయిర్పోర్టు అథారిటీతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. సీఎంతో నెదర్లాండ్స్ రాయబారి భేటీ సాక్షి, హైదరాబాద్: భారత్లో నెదర్లాండ్స్ రాయబారి మెరిసా గెరార్డ్స్ బుధవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు. ఇరుదేశాల సంబంధాలపై మాట్లాడుకున్న ఇద్దరూ తెలంగాణలో అభివృద్ధికి ఉన్న అవకాశాలపై చర్చించారని సీఎంవో వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో వ్యవసాయ రంగాభివృద్ధికి అపార అవకాశాలు, అగ్రికల్చర్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటు, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో నెదర్లాండ్స్ భాగస్వామ్యం తదితర అంశాలు వీరిద్దరి భేటీలో చర్చకు వచ్చాయి. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
గోబర్గ్యాస్తో అంతరిక్షంలోకి.. ‘జీరో’తో సాధ్యం
గోబర్ గ్యాస్ తెలుసుకదా.. అదేనండి వంట వండటానికి ఉపయోగిస్తుంటాం. దాంతో వంట చేసుకోవటం పాత విషయమే కానీ తాజాగా గోబర్గ్యాస్తో రాకెట్లనూ నడపొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే. జపాన్కు చెందిన ఒక అంతరిక్ష సంస్థ ఏకంగా గోబర్గ్యాస్తో పనిచేసే రాకెట్ ఇంజిన్ను రూపొందించింది. రాకెట్ ఇంజిన్లలో రకరకాల ఇంధనాలు వాడుతుంటారు. చాలావరకు బాగా శుద్ధి చేసిన కిరోసిన్ను ఉపయోగిస్తారు. దీనికి భిన్నంగా జపాన్కు చెందిన ఇంటర్స్టెల్లార్ టెక్నాలజీస్ అనే అంకుర సంస్థ పర్యావరణహిత రాకెట్ ఇంజిన్ను రూపొందించింది. దీని పేరు ‘జీరో’. ఇది ఆవు పేడ నుంచి తీసిన బయోమీథేన్ వాయువు సాయంతో పనిచేస్తుంది. ఈమధ్యనే దీన్ని విజయవంతంగా పరీక్షించారు. చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించడమే ‘జీరో’ ఇంజిన్ ఉద్దేశం. వాతావరణంలోకి అదనంగా కార్బన్ డయాక్సైడ్ను వెదజల్లకుండా దీన్ని తయారుచేశారు. నిజానికి బయోమీథేన్ పూర్తిగా ఉద్గార రహితమేమీ కాదు. ఇది మండినప్పుడూ బొగ్గుపులుసు వాయువు విడుదలవుతుంది. కానీ సాధారణ శిలాజ ఇంధనాలతో పోలిస్తే ఇందులో వెలువడే కార్బన్ డయాక్సైడ్ మోతాదును చాలా పరిమితం. సహజంగా ఉత్పత్తి అయ్యే కార్బన్ డయాక్సైడ్కు ఇది అదనపు వాయువునేమీ జోడించదు. ఇదీ చదవండి: భారత్లో ఐకియా విస్తరణ.. కొత్త స్టోర్ నిర్మాణం.. ఎక్కడంటే.. పెరుగుతున్న సాంకేతిక, వివిధ రిమోట్ సెన్సింగ్ వస్తువుల వాడకం, ఇతర కారణాల వల్ల రాకెట్ ప్రయోగాలు ఊపందుకుంటున్నాయి. పర్యావరణం మీద వీలైనంత తక్కువ దుష్ప్రభావం పడేలా చూడటానికి ప్రాధాన్యం పెరుగుతోంది. మున్ముందు అంతరిక్ష పర్యటనలు కొనసాగాలంటే ఇది మరింత అవసరం. ఈ నేపథ్యంలో వినూత్న జీరో రాకెట్ ఆసక్తి కలిగిస్తోంది. నిశ్చల ప్రయోగ పరీక్షలో మంచి సామర్థ్యాన్ని కనబరచింది. ఇది 10 సెకండ్ల పాటు నీలి మంటను వెలువరించింది. -
ఇస్రో కీర్తి కిరీటంలో మరో ఉపగ్రహం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ కీర్తి కిరీటంలో మరో ఉపగ్రహం ప్రకాశించనుంది. వాతావరణ రంగంలో సేవలందించేందుకు ప్రత్యేకంగా ఉద్దేశించిన ఇన్శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని త్వరలో శ్రీహరికోట నుంచి రోదసికి ప్రయోగించేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం కక్ష్యలో పరిభ్రమిస్తూ ఇన్శాట్-3డీ, ఇన్శాట్-3డీఆర్ ఉపగ్రహాలు అందిస్తున్న సేవలకు కొనసాగింపుగా ఇన్శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని త్వరలో జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ సాయంతో నింగికి ప్రయోగించనున్నారు. కేంద్రప్రభుత్వ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ కోసం ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. ఫిబ్రవరి 17-మార్చి 17 తేదీల మధ్య ఎప్పుడైనా దాన్ని ప్రయోగించేలా లాంచ్ విండోను ఇస్రో నిర్ణయించింది. ఆ తేదీల మధ్య కాలంలో రాకెట్ గమన మార్గానికి అవాంతరాలు కలుగకుండా ముందుజాగ్రత్త చర్యగా వైమానిక సంస్థలకు ఇస్రో ఇప్పటికే నోటమ్ (నోటీస్ టు ఎయిర్ మిషన్స్) జారీ చేసింది. అంతా సవ్యంగా ఉంటే, వీలు కుదిరితే ఫిబ్రవరి మాసం మధ్యలోనే ఉపగ్రహాన్ని రోదసిలో ప్రవేశపెట్టాలని ఇస్రో యోచిస్తోంది. బెంగళూరులోని ప్రొఫెసర్ యు.ఆర్.రావు శాటిలైట్ సెంటరులో ఇప్పటికే అసెంబ్లింగ్, ఇంటిగ్రేషన్ కార్యక్రమాలతోపాటుగా కీలక పరీక్షలన్నిటినీ విజయవంతంగా పూర్తిచేసుకున్న ఇన్శాట్-3డీఎస్ ఉపగ్రహం శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటోంది. వాతావరణ సంబంధమైన అధ్యయనం నిర్వహించే ఈ ఉపగ్రహం బరువు ప్రయోగ సమయంలో 2,275 కిలోలు ఉంటుంది. వాతావరణ అంచనాలు రూపొందించడానికి, విపత్తుల గురించి ముంచే హెచ్చరించడానికి వీలుగా తనలోని అత్యాధునిక శాస్త్రీయ పరికరాలతో భూ, సముద్ర ఉపరితలాలను ఇన్శాట్-3డీఎస్ ఉపగ్రహం పరిశీలిస్తుంది. ఇమేజర్లు, డేటా రిలే ట్రాన్స్పాండర్ (డీఆర్టీ), శాటిలైట్ ఎయిడెడ్ సర్చ్ అండ్ రెస్క్యూ (ఎస్ఏఎస్ & ఆర్) ట్రాన్స్పాండర్ తదితర పరికరాలను దానిలో అమర్చారు. మార్చిలో నింగికి ‘నిసార్’… ఇస్రో ఆధ్వర్యంలో ఈ ఏడాది మార్చి నెలలో ‘నిసార్’ ఉపగ్రహ ప్రయోగం జరగనుంది. ‘నిసార్’ అంటే నాసా-ఇస్రో సింథటిక్ ఆపెర్చర్ రాడార్. ఇదొక భూ పరిశీలక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం. ఈ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’, మన ఇస్రోల సంయుక్త ప్రాజెక్టు. ‘నిసార్’ ప్రయోగంలో వాడే ఉపగ్రహ వాహక నౌక (జీఎస్ఎల్వీ)కు తాజా ఇన్శాట్-3డీఎస్ ప్రయోగం అర్హతా పరీక్ష లాంటిదని అంతరిక్ష రంగ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే... ‘నిసార్’ అనేది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.12,500 కోట్లు. సింథటిక్ అపెర్చర్ రాడార్ (సార్) అమర్చిన ‘నిసార్’… భూమి సంబంధ మార్పుల్ని పరిశీలిస్తుంది. చిత్తడి నేలల స్థితిగతులు, అగ్నిపర్వతాల కారణంగా నేల రూపురేఖల్లో సంభవించే మార్పులను గమనిస్తుంది. అలాగే భూమిపై శీతలావరణం (క్రయోస్ఫియర్)కు సంబంధించి మంచు పలకలు, హిమనీనదాలు, సముద్ర మంచులో కలిగే మార్పులను క్షుణ్ణంగా శోధిస్తుంది. :::: జమ్ముల శ్రీకాంత్ -
‘గగన్యాన్’కు రెడీ
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఏడాదిని గగన్యాన్ ప్రాజెక్టు సంవత్సరంగా పరిగణిస్తోందని, మరిన్ని ప్రయోగాలు చేపట్టనున్నామని సతీశ్ధవన్ స్పేస్ సెంటర్ (షార్) డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ తెలిపారు. శుక్రవారం షార్లో 75వ గణతంత్ర దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2025 నాటికి మానవ సహిత ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. చంద్రయాన్–3, ఆదిత్య ఎల్–1 ప్రయోగాలతో 2023 ఇస్రో చరిత్రలో గుర్తుండిపోతుందన్నారు. ఈ ప్రయోగాలకు సంబంధించి ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్కు మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడం ఇస్రోకు గిఫ్ట్ అని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్డే ఉత్సవాల్లో చంద్రయాన్–3 ఉపగ్రహాన్ని పంపిన ఎల్వీఎం మార్క్–3 రాకెట్, ల్యాండర్, రోవర్ను ప్రదర్శించడం అభినందనీయ మన్నారు. కొత్త ఏడాదికి కానుకగా పీఎస్ఎల్వీ సీ58 ప్రయోగం నిర్వహించామని తెలిపారు. ఫిబ్రవరి రెండోవారంలో ఇన్శాట్–3 డీఎస్ ప్రయోగం నిర్వహించనున్నామని, ఈ ఏడాది మరో పది ప్రయోగాలకు సిద్ధమవుతున్నామని చెప్పారు. విద్యార్థులంతా స్పేస్ సైన్స్పై అవగాహన పెంచుకుని ఉన్నత చదువులు చదువుకోవాలని ఆకాంక్షించారు. దేశంలో సామాన్యులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞా నాన్ని, సైన్యానికి విలువైన సమాచారాన్ని అందజేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఇస్రో ఈ ఏడాది నుంచి వాణిజ్యపరంగానే కాకుండా ప్రైవేట్ స్పేస్ సంస్థలకు చెందిన ప్రయోగాలూ చేపడుతుందని రాజరాజన్ వెల్లడించారు. -
రిపబ్లిక్ డే పరేడ్లో చరిత్ర సృష్టించిన మన ‘రాకెట్ గర్ల్స్'
#RepublicDay2024-ISRO Tableau 75వ రిపబ్లిక్ డే పరేడ్లో సగర్వంగా కవాతు నిర్వహించి భారతదేశపు రాకెట్ అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. 'చంద్రయాన్-3 - ఎ సాగా ఇన్ ది ఇండియన్ స్పేస్ హిస్టరీ' కర్తవ్య పథంలోకి దూసుకెళ్లి రికార్డు క్రియేట్ చేశారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఆధ్వర్యంలోని శకటంపై చంద్రయాన్ -3 మిషన్ సాధించిన విజయాలను, ఆదిత్య ఎల్ వన్ ప్రాజెక్ట్ వివరాలు, 'బాహుబలి రాకెట్' లాంచ్ వెహికల్ మార్క్ 3 నమూనా తదితర వివరాలను ప్రదర్శించింది. అలాగే అంతరిక్ష పితామహులు, ఖగోళ శాస్త్రవేత్తలు ఆర్యభట్ట , వరాహమిహిరులు కూడా ఈ శకటంలో దర్శనిమచ్చారు. చంద్రుని దక్షిణ ధ్రువంలో విజయవంతంగా దిగిన ల్యాండింగ్ సైట్ను శివ శక్తి పాయింట్తోపాటు విక్రమ్ ల్యాండర్ , ప్రజ్ఞాన్ రోవర్ వివరాలను ప్రదర్శించింది. బెంగుళూరు, అహ్మదాబాద్, తిరువనంతపురం, శ్రీహరికోటలోని వివిధ ఇస్రో కేంద్రాలకు చెందిన ఎనిమిది మంది మహిళా శాస్త్రవేత్తల బృందం ఆహూతులను ఆకట్టుకున్నారుఇస్రో షీరోలైన ఆదిత్య L1 మిషన్ డైరెక్టర్ నిగర్ షాజీ ,చంద్రయాన్-2 మిషన్కు నాయకత్వం వహించిన ఎం వనిత, ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహం ఓషన్శాట్ తయారీ మిషన్ హెడ్ శ్రీమతి తేన్మొళి సెల్వి కె , చంద్రయాన్-3 మిషన్కు డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కల్పన తదితరులు దీనికి నాయకత్వం వహించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మరో 220 మంది మహిళా శాస్త్రవేత్తలు కవాతు చేశారు. రెండు చారిత్రాత్మక విజయాల తర్వాత ఇస్రో ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్లో పాల్గొంది. Happy Republic Day🇮🇳#ISRO’s #RepublicDay tableau led on Kartavya Path by Bharat’s #NariShakti. pic.twitter.com/XP2g6bAuJY — ISRO InSight (@ISROSight) January 26, 2024 దేశ రాజధాని నగరంలో ఢిల్లీలోని కర్తవ్యపథ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ ఏడాది వేడుకల్లో త్రివిధ దళాల్లో అందరూ మహిళలే ఉండటం విశేషం. కర్తవ్య పథ్లో త్రివిధ దళాల మహిళా అధికారుల నేతృత్వంలో మహిళాబృందం తొలిసారిగా మార్చ్ చేసి రికార్డు క్రియేట్ చేశారు. ఆర్మీ డెంటల్ కార్ప్స్ నుండి కెప్టెన్ అంబా సమంత్, ఇండియన్ నేవీ నుండి సర్జ్ లెఫ్టినెంట్ కాంచన,ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన లెఫ్టినెంట్ దివ్య ప్రియతో కలిసి మేజర్ సృష్టి ఖుల్లర్ నేతృత్వంలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్కు చెందిన పూర్తి మహిళా బృందం కర్తవ్యపథ్లో నారీ శక్తి పేరుతో విన్యాసాలను ప్రదర్శించడం విశేషంగా నిలిచింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. Happy Republic Day to all Indians and #ISRO lovers 🇮🇳 The #RepublicDayParade today featured a Chandrayaan-3/ISRO tableau!! Here's the video of that:pic.twitter.com/6blzAUj8nn — ISRO Spaceflight (@ISROSpaceflight) January 26, 2024 -
Isro: భారత్ స్పేస్ స్టేషన్.. ఇస్రో చైర్మన్ కీలక ప్రకటన
చండీగఢ్: భారత్ సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపై ఇస్రో చైర్మన్ సోమనాథ్ కీలక విషయం వెల్లడించారు. భారత స్పేస్ స్టేషన్ ప్రాథమిక వెర్షన్ 2028లో నింగిలోకి వెళుతుందని తెలిపారు. హర్యానాలోని ఫరీదాబాద్లో గురువారం జరిగిన ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ కార్యక్రమం సందర్భంగా సోమనాథ్ మాట్లాడారు. ‘భారత్ స్పేస్ స్టేషన్కు సంబంధించి వచ్చే ఏడాదికల్లా తొలి రౌండ్ పరీక్షలు నిర్వహిస్తాం. స్పేస్ స్టేషన్ బేసిక్ మోడల్ను 2028లో కక్ష్యలోకి పంపి 2035కల్లా దానికి పూర్తిస్థాయి రూపు తీసుకువస్తాం. స్పేస్ స్టేషన్ క్రూ కమాండ్ మాడ్యూల్, నివాస మాడ్యూల్, ప్రొపల్షన్ మాడ్యూల్, డాకింగ్ పోర్ట్ అనే విభాగాలు కలిగి ఉంటుంది. ఈ మొత్తం స్టేషన్ 25 టన్నుల బరువు ఉంటుంది. అవసరమైతే తర్వాత దీనిని విస్తరిస్తాం. స్పేస్ స్టేషన్ ద్వారా మైక్రో గ్రావిటీ పరిశోధనలు చేస్తాం’ అని సోమనాథ్ తెలిపారు. కాగా, ఇప్పటివరకు నింగిలో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్) మాత్రమే ఉంది. దీనిని అమెరికా, కెనడా, జపాన్, యూరప్ సంయుక్తంగా నిర్మించాయి. 1984నుంచి 1993 మధ్య ఐఎస్ఎస్ను డిజైన్ చేశారు. ఇదీచదవండి.. అయోధ్య వాతావరణం.. ఐఎండీ ప్రత్యేక వెబ్పేజీ -
Aditya-L1: లగ్రాంజ్ పాయింట్లోకి ఆదిత్య
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సూర్యునిపై సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇస్రో గత ఏడాది ప్రయోగించిన సోలార్ అబ్జర్వేటరీ వ్యోమనౌక ఆదిత్య ఎల్1 ఎట్టకేలకు తన తుది కక్ష్యలోకి చేరుకుంది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు వ్యోమనౌక తన గమ్యస్థానాన్ని చేరుకోవడంతో ఇస్రో తన అంతరిక్ష ప్రయోగాల్లో మరో మైలురాయిని దాటింది. భూమి నుంచి సూర్యునివైపుగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని కక్ష్య(ఎల్1 పాయింట్)లోకి శనివారం ఆదిత్య వ్యోమనౌక చేరుకుందని ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. గ్రహణాల వంటి సందర్భాల్లోనూ ఎలాంటి అడ్డూలేకుండా నిరంతరంగా సూర్యుడిని చూసేలా అనువైన ఎల్1 పాయింట్లో ఉంటూ ఆదిత్య ఎల్1 అధ్యయనం చేయనుంది. చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్–3 సాఫ్ట్ల్యాండింగ్ విజయవంతమైన కొద్దినెలలకే సూర్యుడి సంబంధ ప్రయోగంలోనూ భారత్ ఘన విజయం సాధించడం విశేషం. భూమికి సూర్యునికి మధ్య దూరం 15 కోట్ల కిలోమీటర్లుకాగా అందులో ఒక శాతం అంటే 15 లక్షల కిలోమీటర్ల దూరాన్ని లగ్రాంజ్ పాయింట్(ఎల్1)గా గణిస్తున్నారు. ఈ పాయింట్ ఉన్న హాలో కక్ష్యలో వ్యోమనౌక ఉంటే సూర్యగ్రహణం వంటి సందర్భాల్లోనూ నిరంతరంగా శూన్యంలో అంతరిక్ష వాతావరణంలో సూర్య సంబంధ శోధన చేసే సువర్ణావకాశం చిక్కుతుంది. మూన్వాక్ నుంచి సన్డ్యాన్స్ దాకా.. ‘‘ భారత్ మరో మైలురాయిని చేరుకుంది. భారత తొలి సోలార్ అబ్జర్వేటరీ తన కక్ష్యను చేరుకుంది. సంక్లిష్టమైన అంతరిక్ష ప్రయోగాలను సఫలం చేస్తూ మన శాస్త్రవేత్తలు అంకితభావానికి ఈ సంఘటనే చక్కని తార్కాణం. వీరి అసాధారణ ప్రతిభకు దేశం గరి్వస్తోంది. మానవాళి సంక్షేమం కోసం నూతన శాస్త్రీయ పరిశోధనలు ఇకమీదటా ఇలాగే కొనసాగాలి’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ట్వీట్ చేశారు. ‘‘ఇస్రో మరో ఘనత సాధించింది. ఈ మిషన్తో యావత్ మానవాళికి ఎంతో మేలు చేకూరుతుంది. ఈ మిషన్తో సూర్యుడు–భూమి మధ్య మనకున్న జ్ఞానాన్ని మరింత పెంచుతుంది. గొప్ప విజయం సాధించిన భారత శాస్త్రవేత్తలకు నా అభినందనలు’’ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇస్రో శాస్త్రవేత్తలను ప్రశంసించారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ సైతం ఆనందం వ్యక్తంచేశారు. ‘‘మూన్ వాక్ నుంచి సన్ డ్యాన్స్ వరకు..!. భారత్కు ఎంతటి ఉజ్వల సంవత్సరమిది’’ అని ట్వీట్చేశారు. ‘‘ అంతరిక్షంలోనూ భారత జైత్రయాత్ర కొనసాగుతోంది’ అని హోం మంత్రి అమిత్ షా ట్వీట్చేశారు. ► గత ఏడాది సెపె్టంబర్ రెండో తేదీన ఆదిత్యను మోస్తూ పీఎస్ఎల్వీ–సీ57 రాకెట్ శ్రీహరికోట ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. ► దాదాపు 63 నిమిషాల తర్వాత 235 ్ఠ19,500 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. తర్వాత దాని కక్ష్యలను ఇస్రో పలుమార్లు మార్చుతూ చివరకు శనివారం తుదికక్ష్యలోకి చేర్చింది. ► దీని బరువు దాదాపు 1500 కేజీలు. విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్, సోలార్ అల్ట్రావాయిలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పారి్టకల్ ఎక్స్పరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, హైఎనర్జీ ఎల్–1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, మ్యాగ్నెటోమీటర్ అనే పేలోడ్లను ఈ ఉపగ్రహంలో అమర్చారు. -
ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సైంటిస్టులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 అద్భుత విజయంపై సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఇస్రో మరిన్ని విజయాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 మిషన్ శనివారం అద్భుత విజయం సాధించింది. ఆదిత్య వ్యోమనౌక సాయంత్రం 4 గంటలకు సూర్యుడికి అతి సమీపంలో లాంగ్రేజియన్ పాయింట్లోకి ప్రవేశించింది. ఈ వ్యోమనౌక అంతరిక్షంలో 127 రోజుల పాటు 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి ఎల్-1 పాయింట్లోకి ప్రవేశించింది. చదవండి: Aditya-L1 Mission: ఆదిత్య ఎల్-1 సంపూర్ణ విజయం.. ఎల్ 1 పాయింట్లోకి ప్రవేశించిన వ్యోమనౌక -
Aditya-L1 Mission: ఇస్రో చరిత్రలో మరో మైలురాయి.. ఆదిత్య ఎల్-1 సంపూర్ణ విజయం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలో మరో మైలురాయిని చేరింది. సూర్యుని అధ్యయనం చేసేందుకు భారత్ తొలిసారి ప్రయోగించిన ప్రతిష్టాత్మక ఆదిత్య ఎల్- 1 మిషన్ సంపూర్ణ విజయాన్ని అందుకుంది. ఆదిత్య వ్యోమనౌక తన ప్రయాణంలో తుది ఘట్టాన్ని పూర్తి చేసుకొని నేడు నిర్దేశిత గమ్యానికి చేరుకుంది. సాయంత్రం 4 గంటలకు సూర్యుడికి అతి సమీపంలోని లాంగ్రేజియన్ పాయింట్లోకి ప్రవేశించింది. ఈ ఉపగ్రహం హాలో కక్ష్య నుంచి సూర్యుడిని పరిశీలించనుంది. ఐదేళ్లపాటు భారత్కు తన సేవలును అందించనుంది. కాగా గతేడాది సెప్టెంబర్ 2వ తేదీన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదిత్య ఎల్- 1 మిషన్ ప్రయోగించారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ వ్యోమనౌక భూమి నుంచి అంతరిక్షంలో 127 రోజుల పాటు 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి ఎల్-1 పాయింట్లోకి ప్రవేశించింది. భారత్ తరఫున సూర్యుడిని పరిశోధించేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఇదే. సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం ఆదిత్య ఎల్ 1 లక్ష్యం. ఈ వ్యోమనౌక మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లింది. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇవి కీలకమైన సమాచారాన్ని అందించనున్నాయి. India creates yet another landmark. India’s first solar observatory Aditya-L1 reaches it’s destination. It is a testament to the relentless dedication of our scientists in realising among the most complex and intricate space missions. I join the nation in applauding this… — Narendra Modi (@narendramodi) January 6, 2024 ఆదిత్య ఎల్-1 మిషన సక్సెస్పై ప్రధానమంత్రి మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్ మరో మైలురాయిని సాధించిందని పేర్కొన్నారు. ఆదిత్య ఎల్ 1 విజయంపై ఇస్రో శాస్త్రవేత్తలు ట్వీట్ చేశారు. ఆదిల్య ఎల్-1 మిషన్ సంపూర్ణ విజయం సాధించినట్లు చెప్పారు. చదవండి: Aditya-1 mission: ఏ పరికరాలు ఏం చేస్తాయి? -
గమ్యస్థానం చేరనున్న ఆదిత్య-L1 మిషన్
-
ఫ్యూయల్ సెల్ పరీక్ష సక్సెస్: ఇస్రో
బెంగళూరు/హైదరాబాద్: భవిష్యత్తులో అంతరిక్షంలో ఉపగ్రహాలు తదితరాలకు నిరంతర ఇంధన సరఫరాలో కీలకం కాగల ప్యూయల్ సెల్ పనితీరును విజయవంతంగా పరీక్షించినట్టు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో పేర్కొంది. ‘‘జనవరి 1న పీఎస్ఎల్వీ–సి58 ద్వారా భూ దిగవ కక్ష్యలోకి చేర్చిన ఫ్యూయల్ సెల్ ఆధారిత ఇంధన వ్యవస్థ (ఎఫ్సీపీఎస్)లోని పాలీమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ పరీక్ష విజయవంతమైంది. దీనిద్వారా కొద్ది సమయం పాటు 180 వాట్ల విద్యుదుత్పత్తి జరిగింది’’ అని శుక్రవారం తెలిపింది. సంప్రదాయ బ్యాటరీ సెల్స్తో పోలిస్తే ఈ ఫ్యూయల్ సెల్స్కు చాలా తక్కువ ఖర్చవుతుంది. పైగా ఇవి అధిక సామర్థ్యంతో పని చేస్తాయి. పూర్తిగా పర్యావరణహితం కూడా. వీటిని అంతరిక్షంతో పాటు భూమిపై కూడా పలురకాలుగా వాడుకోవచ్చు’’అని వివరించింది. భావి అంతరిక్ష ప్రయోగాలకు అవసరమైన డిజైన్లపై అవగాహనకు వచ్చేందుకు తాజా పరీక్ష దోహదపడుతుందని చెప్పింది. కృష్ణబిలాలపై పరిశోధనల నిమిత్తం జనవరి 1న ప్రయోగించిన ఎక్స్పోశాట్ బాగా పని చేస్తోందని ఇస్రోర చైర్మన్ ఎస్.సోమనాథ్ ప్రకటించారు. -
Isro: ఫ్యూయెల్ సెల్ టెస్ట్ సక్సెస్
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కొత్త(ఇస్రో) ఏడాదిలోనూ దూసుకుపోతోంది. కొత్త సంవత్సరం తొలిరోజున పీఎస్ఎల్వీ-సీ58తోపాటు గగనతలంలోకి పంపిన ఫ్యుయల్ సెల్ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. అంతరిక్షంలో దాని పని తీరుకు సంబంధించిన డేటాను సేకరించింది. ఈ డేటాతో ఫ్యుయెల్ సెల్ పనితీరును పూర్తిస్థాయిలో విశ్లేషించనుంది. ఈ విషయాన్ని ఇస్రో శుక్రవారం ‘ఎక్స్’లో ప్రకటించింది. భవిష్యత్తులో అంతరిక్ష కేంద్రాల్లో వాడే విద్యుత్ ఉత్పత్తి కోసం ఇస్రో ఫ్యుయెల్ సెల్ను రూపొందించింది. వంద వాట్ల క్లాస్ పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ ఫ్యుయెల్సెల్ను విజయవంతంగా పరీక్షించి విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు ఇస్రో తెలిపింది. ఈ రసాయన చర్యలో ఫ్యుయెల్ సెల్ కేవలం నీటిని మాత్రమే బై ప్రోడక్ట్గా విడుదల చేసింది. ఇదే లాంచ్ వెహికిల్లలో ఇస్రో ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహం ఎక్స్పోశాట్ను కూడా నింగిలోకి తీసుకెళ్లింది. దీంతో పాటు మరో 10 పరికరాలను కూడా నింగిలోకి మోసుకెళ్లింది. అంతరిక్షంలో వెలువడే ఎక్స్-రే కిరణాల మూలాలపై పరిశోధించేందుకు ఎక్స్పోశాట్ను ఇస్రో నింగిలోకి పంపింది. నాసా తర్వాత అంతరిక్షంలో వెలువడే ఎక్స్రే కిరణాలపై పరిశోధన చేస్తున్నది ఇస్రోనే కావడం విశేషం. ఎక్స్రే కిరణాల మీద పరిశోధనకుగాను అమెరికా 2021లో ఐఎక్స్పీఈ శాటిలైట్ను నింగిలోకి పంపింది. POEM-3 on PSLV-C58: VSSC/ISRO successfully tests a 100 W class Polymer Electrolyte Membrane Fuel Cell on PSLV-C58's orbital platform, POEM3.https://t.co/f5SGqh1ZUR Powering missions with efficiency and emitting only water, these fuel cells are the future for power production in… pic.twitter.com/lCbsZF9UIB — ISRO (@isro) January 5, 2024 ఇదీచదవండి..15 మంది భారతీయులున్న షిప్ హైజాక్.. రంగంలోకి ‘ఐఎన్ఎస్ చెన్నై’ -
Aditya L1: భారత తొలి సన్ మిషన్లో రేపు కీలక పరిణామం
బెంగళూరు: సూర్యునిపై పరిశోధనలకు భారత్ తొలిసారి ప్రయోగించిన ఆదిత్య ఎల్1 వ్యోమనౌక శనివారం(జనవరి 6)వ తేదీన ఉదయం నిర్దేశించిన కక్ష్యలోకి చేరనుంది. ఇక్కడికి చేరిన తర్వాత ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆదిత్య ఎల్1 నిరంతరం సూర్యునిపై అధ్యయనం చేయగలుగుతుంది. సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ఆదిత్య ఎల్1 నాలుగు దశలు దాటి ఇప్పటికే భూమికి,సూర్యునికి మధ్యలో ఉన్న లాగ్రాంజియన్ పాయింట్కు చేరుకుంది. అయితే శనివారం మరో 63 నిమిషాల 20 సెకన్లు ప్రయాణించి నిర్దేశిత కక్ష్యలోకి చేరుతుంది.లాంగ్రాంజియన్ పాయింట్లో భూమి,సూర్యుని గురత్వాకర్షణ శక్తి బలాలు ఒకదానికొకటి క్యాంసిల్ అయి దాదాపు జీరో స్థితికి చేరుకుంటాయి. అంటే ఇక్కడ గ్రావిటీ ఉండదు. దీంతో సూర్యుని చుట్టూ తిరిగేందుకుగాను ఈ పాయింట్లో ఉన్న వ్యోమనౌకలకు పెద్దగా ఇంధనం అవసరం ఉండదు. ఈ కారణం వల్లే పరిశోధనలకు ఎల్1 పాయింట్ అనుకూలంగా ఉంటుంది. ఆదిత్య ఎల్1లో ఏడు సైంటిఫిక్ పేలోడ్లు ఉంటాయి. సూర్యునిపై ఉండే ఫొటోస్పియర్, క్రోమో స్పియర్, కరోనా పొరలను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో ఏడు పేలోడ్లు నిరంతరం అధ్యయనం చేసి డేటాను భూమికి పంపిస్తుంటాయి. ఇదీచదవండి..టెట్రిస్ గేమ్ను జయించిన బాలుడు -
తొలిసారిగా ఫాల్కన్ రాకెట్లో ఇస్రో శాటిలైట్
న్యూఢిల్లీ: సమయానికి వేరే రాకెట్ అందుబాటులోలేని కారణంగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్ సేవలను వినియోగించుకోనుంది. 4,700 కేజీల బరువైన భారీ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ఆ సంస్థకు చెందిన ఫాల్కన్ రాకెట్ను వాడుకోనుంది. విదేశీ ఫాల్కన్ రాకెట్ను ఇస్రో వాడటం ఇదే తొలిసారి. సంబంధిత వివరానలను ఇస్రో వాణిజ్యవిభాగమైన న్యూస్పేస్ ఇండియ లిమిటెడ్(ఎన్ఎస్ఐఎల్) బుధవారం వెల్లడించింది. ఇస్రోకు చెందిన జీఎస్ఎల్వీ–ఎంకే3 రాకెట్ దాదాపు 4,000 కేజీల పేలోడ్లనే మోసుకెళ్లగలదు. అంతకుమించి బరువున్న కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్–20ని మోసుకెళ్లే రాకెట్ అందుబాటులోలేని కారణంగా స్పేస్ఎక్స్ను ఇస్రో సంప్రదించింది. ఫాల్కన్ రాకెట్ ఏకంగా 8,300 కేజీల పేలోడ్ను మోసుకెళ్లగలదు. -
Next Generation Launch Vehicle: ఇస్రో అమ్ములపొదిలో ఎన్జీఎల్వీ!
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సమీప భవిష్యత్తులో భారీ ప్రయోగాలకు తెర తీస్తున్న ఇస్రో, అందుకు తగ్గట్టుగా అత్యాధునిక రాకెట్ తయారీ ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ రాకెట్కు న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ (ఎన్జీఎల్వీ)గా నామకరణం చేశారు. తొలి నాళ్లలో చేపట్టిన రోహిణి సౌండింగ్ రాకెట్ల ప్రయోగాల తరువాత 40 కిలోల నుంచి 5,000 కిలోల ఉపగ్రహాలను మోసుకెళ్లే ఎస్ఎల్వీ, ఏఏస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, ఎల్వీఎం03, ఎస్ఎస్ఎల్వీ... ఇలా ఆరు రకాల రాకెట్లను ఇప్పటిదాకా ఇస్రో అభివృద్ది చేసింది. గగన్యాన్ ప్రయోగంలో భాగంగా త్వరలో మానవసహిత అంతరిక్ష ప్రయోగంతో పాటు చంద్రుడిపై వ్యోమగాములను తీసుకెళ్లి సురక్షితంగా తీసుకొచ్చే ప్రయోగాన్నీ చేపట్టాలని భావిస్తోంది. వీటితో పాటు అత్యంత బరువుండే సమాచార ఉపగ్రహాలను జీటీఓ కక్ష్యలోకి పంపే సాంకేతిక పరిజ్ఞానాన్నీ సమకూర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఏకంగా 20 వేల కిలోల బరువున్న ఉపగ్రహాలను భూమికి సమీపంలోని లియో అర్బిట్లోకి, 10 వేల కిలోల ఉపగ్రహాలను జీటీఓ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టే సామర్థ్యంతో ఎన్జీఎల్వీ తయారీకి ఇస్రో తెర తీసింది. రూ.1,798 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టును 2008లోనే కేంద్రం ఆమోదించింది. సెమీ క్రయోజనిక్ దశను అభివృద్దితో పాటు రాకెట్ విడి భాగాలను దేశీయంగానే రూపొందించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. 6న ‘ఎల్పీ1’ వద్దకు ఆదిత్య ఎల్1: సౌర ప్రయోగాల నిమిత్తం గత సెపె్టంబర్ 2న ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్1 ఉపగ్రహం జనవరి 6 సాయంత్రం సూర్యుడికి సమీపంలోని లాంగ్రేజియన్ పాయింట్ 1ను చేరనుంది. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఈ పాయింట్ను చేరాక సూర్యుని రహస్యాలను అధ్యయనం చేయనుంది. సౌర తుఫాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీటితో పాటు ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యు డి వెలుపలి వలయమైన కరోనాపై అధ్యయనాలు చేయనున్నారు. ఎన్జీఎల్వీ విశేషాలు... ► ఎన్జీఎల్వీ రాకెట్ ఎత్తు 75 మీటర్లు ► వెడల్పు 5 మీటర్లు. ► పీఎస్ఎల్వీ ఎక్స్ఎల్ తరహాలోనే దీనికీ ఆరు స్ట్రాపాన్ బూస్టర్లుంటాయి. ► ప్రయోగ సమయంలో 600 టన్నుల నుంచి 770 టన్నులు ► రాకెట్ను మూడు దశల్లో ప్రయోగిస్తారు. ► ఇది ఫాల్కన్, అట్లాస్–వీ, ప్రొటాన్–ఎం, లాంగ్ మార్చ్–58 రాకెట్లకు దీటుగా ఉంటుంది. ► ఇస్రో ౖచైర్మన్ సోమ నాథ్ ఇటీవలే ఎన్జీఎల్వీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ► 2030–35 నాటికి మానవ అంతరిక్ష యానం, అత్యంత బరువైన ఉపగ్రహ ప్రయోగాలకు ఇది వీలుగా ఉంటుందని వివరించారు. -
ISRO: మన బాహుబలికి అంత బలం లేదట!
అంతరిక్ష పరిశోధనల్లో వరుస సక్సెస్లతో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో(ISRO) ఎదురేలేకుండా దూసుకుపోతోంది. కొత్త ఏడాది ఆరంభం రోజే చేపట్టిన ప్రయోగమూ విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు.. మరింత జోష్తో తదుపరి ప్రయోగాలకు సిద్ధం అవుతున్నారు. అయితే.. తన తదుపరి శాటిలైట్ లాంఛ్ కోసం విదేశీ రాకెట్ను ఇస్రో ఆశ్రయిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారత్ తరఫున తర్వాతి తరం భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-20 (GSAT-20)ని స్పేస్ఎక్స్కు చెందిన రాకెట్ ద్వారా ప్రయోగించబోతోంది. అయితే దీనిని స్వదేశీ రాకెట్తో కాకుండా.. విదేశీ రాకెట్తో ప్రయోగించబోతోంది. ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీలో ఫాల్కన్-9 రాకెట్కు భారీ లాంఛర్గా పేరున్న సంగతి తెలిసిందే. ఫ్లోరిడాలోని లాంఛింగ్ స్టేషన్ నుంచి ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఫాల్కన్ రాకెట్తో భారత శాటిలైట్ ప్రయోగం జరగనుంది. ఇస్రో ఏమందంటే.. గతంలో భారీ ఉపగ్రహాల ప్రయోగం కోసం ఇస్రో కమర్షియల్ విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్.. ఫ్రాన్స్కు చెందిన ఏరియన్స్పేస్ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకునేది. కానీ, ఇప్పుడు స్పేస్ఎక్స్తో ఒప్పందం కుదుర్చుకోవడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే.. ఈ ప్రయోగంపై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ స్పందించారు. నిర్ణీత సమయానికి రాకెట్ అందుబాటులో లేనందునే స్పేస్ఎక్స్ను ఆశ్రయించినట్లు స్పష్టం చేశారు. మన బాహుబలి ఉంది కదా! జీశాట్-20 ఉపగ్రహం అత్యంత శక్తివంతమైంది. దీనిని తయారు చేయడానికి ప్రధాన ఉద్దేశం.. మారుమూల ప్రాంతాలకు సేవలు అందించడం. ఇది ఎంత శక్తివంతమైందంటే.. హార్మోనైజ్డ్ టారిఫ్ షెడ్యూల్ (HTS) సామర్థ్యం 48 జీపీబీఎస్. అంతేకాదు.. 32 బీమ్స్ సామర్థ్యంతో అండమాన్ నికోబార్ దీవులు, జమ్ము కశ్మీర్, లక్షదీవులు.. ఇలా పాన్ ఇండియా కవరేజ్ చేయగలిగే సత్తా ఉంది. GSAT-N2గా దీనికి నామకరణం కూడా చేశారు. అయితే ఆ శాటిలైట్ బరువు.. 4,700 కేజీలు. భారత్లో ఇస్రో తరఫున ఇప్పటిదాకా ఉన్న లాంఛ్ వెహికిల్ మార్క్ 3(LVM3)నే అత్యధిక బరువు ఉన్న ఉపగ్రహాల్ని మోసుకెళ్తోంది. అందుకే ఇస్రో బాహుబలిగా దానికి పేరు ముద్రపడింది. కానీ, దాని సామర్థ్యం 4 వేల కిలోగ్రాముల దాకానే ఉంది. అందుకే అంతకు మించిన శాటిలైట్ ప్రయోగాల కోసం విదేశీ రాకెట్లపైన ఆధారపడాల్సి వస్తోంది. ఇస్రో ప్రయోగాలకు.. 10 వేల కేజీల రాకెట్లను సైతం మోసుకెళ్లగలిగే తర్వాతి తరం లాంచ్ వెహికిల్స్ (NGLV)రూపకల్పన అవసరం ఉందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో బాహుబలిని మించిన రాకెట్ డిజైన్ రూపకల్పన జరిగిపోయిందట. అయితే.. అది ప్రత్యక్ష రూపంలోకి రావడానికి ఇంకా కొన్నేళ్లు పట్టొచ్చని సోమనాథ్ అంటున్నారు. -
గగనాంతర గవేషణ
కొత్త ఏడాది మొదలవుతూనే భారత్ మరో మైలురాయికి చేరుకుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన అంతరిక్ష ప్రయోగవాహక నౌక పీఎస్ఎల్వీ–సీ58 సోమవారం విజయవంతంగా నింగిలోకి దూసుకుపోవడంతో రోదసీ శోధనలో మన దేశం మరో ముందడుగు వేసింది. ‘ఎక్స్–రే పోలారిమీటర్ శాటిలైట్’ (ఎక్స్పో శాట్)నూ, మరో 10 ఇతర ఉపగ్రహాలనూ మోసుకుంటూ నింగిలోకి సాగిన ఈ ప్రయోగం అనేక విధాల ప్రత్యేకమైనది. ఖగోళంలోని కృష్ణబిలాలను (బ్లాక్ హోల్స్) అధ్యయనం చేసి, కొత్త అంశాల్ని వెలికితీసేందుకు ‘ఎక్స్పోశాట్’ ఉపకరిస్తుంది. ఈ తరహా శాస్త్రీయ శోధనకే పూర్తిగా అంకితమైన ఉపగ్రహాన్ని ఇస్రో పంపడం ఇదే తొలిసారి. దీంతో, అమెరికా తర్వాత రోదసిలోని ఇలాంటి దృగ్విషయాలపై ప్రయోగాలు జరుపుతున్న రెండో దేశమనే ఖ్యాతి భారత్కు దక్కింది. ఇక, వివిధ ప్రైవేట్ సంస్థల, విద్యార్థుల, ఇస్రో కేంద్రాలకు చెందిన మిగతా ఉపగ్రహాలు మన శాస్త్రవేత్తల, ప్రైవేట్ రంగ ఆలోచనలనూ, ఆకాంక్షలనూ ప్రతిబింబిస్తున్నాయి. గత ఏడాది చరిత్రాత్మక చంద్రయాన్3 మిషన్తో మనం చంద్రునిపై జెండా పాతాం. చంద్ర యాన్3 విజయం తర్వాత గత అయిదు నెలల్లో ఇస్రో విజయవంతం చేసిన రెండు మిషన్లూ శాస్త్రీయ స్వభావమున్నవే కావడం గమనార్హం. సూర్యుడి అధ్యయనానికి ముందుగా ఆదిత్య ఎల్1ను నింగిలోకి పంపింది. తాజాగా ఖగోళ–భౌతిక శాస్త్ర ఘటనలో భాగంగా వెలువడే ధ్రువీకృత ఎక్స్రేల అధ్యయనానికి ఈ ‘ఎక్స్పో శాట్’ను తెచ్చింది. ‘ఆదిత్య ఎల్1’ లాగా ‘ఎక్స్పో శాట్’ సైతం పూర్తిగా అంతరిక్ష పరిశోధన–ప్రయోగశాలే. ఇది రెండు పేలోడ్లను నింగిలోకి మోసుకుపోయింది. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూపొందించిన ‘పోలిక్స్’ పేలోడ్ రాగల అయిదేళ్ళలో దాదాపు 50 మూలాల నుంచి వచ్చే ఉద్గారాలను పరిశీలిస్తుంది. 8 నుంచి 30 కిలో ఎలక్ట్రాన్ ఓల్ట్ (కేఈవీ) శక్తి పరిధిలోని ఎక్స్రేల గమనాన్ని గమనిస్తుంది. ఇక, ఇస్రోకు చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ రూపొందించిన ‘ఎక్స్పెక్ట్’ అనే రెండో పేలోడ్ 0.8 నుంచి 15 కేఈవీల శక్తి గల ఎక్స్రేలను పరిశీలిస్తుంది. నిరంతర ఎక్స్రే ఉద్గారాల్లోని మార్పులను అధ్యయనం చేస్తుంది. వెరసి రెండు పేలోడ్లూ ప్రబల మైన ఎక్స్రేస్కు ఉత్పత్తిస్థానాలైన కృష్ణబిలాలు, పల్సర్ల విషయంలో కొత్త అంశాల్ని వెలికి తీస్తాయి. గగనాంతర సీమలో మన తాజా గవేషణ... అమెరికా, చైనా, రష్యాలదే ఆధిపత్యమైన అంతరిక్ష యాన రంగంలో భారత్ స్థానాన్ని సుస్థిరం చేస్తుంది. 2021 డిసెంబర్లోనే అమెరికా ‘నాసా’ చేసిన ఈ తరహా ఐఎక్స్పీఈ మిషన్కు ఏకంగా 188 మిలియన్ డాలర్లయితే, మన తాజా ఎక్స్పో శాట్ కేవలం 30 మిలియన్ డాలర్ల (రూ. 250 కోట్ల)కే సిద్ధమవడం విశేషం. అమెరికా ఉపగ్రహ జీవిత కాలం రెండేళ్ళే. మనది అయిదేళ్ళు. ఇలా అగ్రరాజ్యంతో పోలిస్తే అతి తక్కువ బడ్జెట్లో మరింత సమర్థమైన రాకెట్లు, ఉపగ్రహాలు రూపొందించి మన ‘ఇస్రో’ మరోసారి సత్తా చాటింది. మిగతా దేశాల్ని ఆశ్చర్యపరిచింది. నిజానికి ఎక్స్కిరణాల ధ్రువీభవనాన్ని కొలిచేందుకు సాగుతున్న ప్రయత్నాలు తక్కువ. ‘నాసా’ చేస్తున్నవీ బెలూన్ ఆధారిత, స్వల్పకాలిక ప్రయోగాలే. 2015 సెప్టెంబర్లో మనం ప్రయోగించిన ఆస్ట్రోశాట్ ద్వారానే భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు గతంలో ఎక్స్రే ఉత్పత్తి స్థానాల బ్రాడ్బ్యాండ్ వర్ణపటమాపనం చేస్తూ వచ్చారు. అతి సున్నితమైన, కచ్చితమైన ఉపకరణాలు అవసరం గనక ఎక్స్రేల ధ్రువీభవనాన్ని కొలిచే ప్రయత్నాలెప్పుడూ పెను సవాలే. ఇస్రో చేసిన ఎక్స్పో శాట్ ప్రయోగం ఆ సవాలుకు సరైన జవాబవుతుందని ఆశంస. ఇలాంటి అనేక సవాళ్ళను ఇస్రో భుజానికెత్తుకుంది. పలు అంతరిక్ష ప్రయోగాలు, మిషన్లతో ఈ ఏడాది పొడుగూతా ఇస్రో క్యాలెండర్ నిండిపోయి ఉంది. సగటున నెలకు కనీసం ఒక అంతరిక్ష ప్రయోగమో, ప్రయత్నమో చేయనుంది. ఈ జోరు ఇలాగే సాగితే, ఈ జోరులో ఇస్రో ఈ ఏడాది జరిపే ప్రయోగాల సంఖ్య డజను దాటేసినా ఆశ్చర్యం లేదు. వాణిజ్య విభాగమైన ‘న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్’ (ఎన్ఎస్ఐఎల్) కోసం రెండు పీఎస్ఎల్వీ వాణిజ్య మిషన్లను సైతం ఇదే ఏడాది ఇస్రో చేపడుతోంది. అలాగే, నిరుడు చేసిన పునర్వినియోగ ప్రయోగవాహక నౌక ప్రయోగాన్ని మరింత కఠోర పరిస్థితుల మధ్య విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొన్నేళ్ళ క్రితం హైడ్రోజన్ను ఇంధనంగా చేసుకొని శ్క్రామ్జెట్ ప్రయోగాత్మక పరీక్ష చేసిన ఇస్రో ఈసారి కిరోసిన్ వాడి, పరీక్షించనుంది. అలాగే, నిరుడు సెప్టెంబర్ 2న ఆరంభమైన భారత తొలి సౌరయాత్ర ‘ఆదిత్య ఎల్1’ సైతం తుది విన్యాసం అనంతరం ఈ జనవరి 6 నాటికి లక్షిత ఎల్1 గమ్యానికి చేరుకోనుంది. మొత్తం మీద ఈ కొత్త ఏడాది అంతా ఇస్రో తీరిక లేకుండా ప్రయోగాలు చేయనుంది. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాటల్లో చెప్పాలంటే ఈ 2024 ‘గగన్యాన్’ సన్నాహక సంవత్సరం. అంతేకాదు... తాజా రోదసీ ప్రయోగంలో భాగంగా నింగిలోకి పంపిన ఇతర ఉపగ్రహాలలో ‘ఉయ్ శాట్’ పూర్తిగా కేరళలోని మహిళలే తీర్చిదిద్దినది కావడం విశేషం. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళల ముందంజకు అది ఓ ప్రతీక. ఇతర ప్రైవేట్ ఉపగ్రహాల వ్యవహారం అంతరిక్ష రంగంలో వస్తున్న సంస్కరణల్ని ప్రతిఫలిస్తోంది. ఈ ఆవిష్కరణలు, అతి తక్కువ ఖర్చు ప్రయోగాలు ప్రైవేట్ రంగానికి రోదసి తలుపుల్ని బార్లా తీస్తున్న భారత్కు కలిసొచ్చే అంశం. ఇప్పటికే దేశంలోని అంకుర సంస్థలు విదేశీ సంస్థలతో జత కలిసి ఉపగ్రహ నిర్మాణ వ్యాపారంలో దూసుకొస్తున్నాయి. ఖగోళ శోధనలో పురోగతికీ, ఉపగ్రహ నిర్మాణ సాధనలో భారత్ కేంద్రంగా మారడానికీ ఇవన్నీ శుభ శకునాలే! నూతన సంవత్సరం తొలి రోజున సాగిన విజయవంతమైన ప్రయోగం అందులో ఒకటి. -
సైన్సులో మన ఘన విజయాలు
చంద్రయాన్ –3 విజయవంతం కావడం శాస్త్రరంగంలో భారత్ 2023లో సాధించిన అతిగొప్ప విజయం. ఏళ్లపాటు శ్రమించిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల విజయమిది. చంద్రయాన్ సక్సెస్ తరువాత కొంత కాలానికే భారతదేశపు ప్రతిష్ఠాత్మక ఆదిత్య–ఎల్1 ప్రయోగం కూడా విజయవంతంగా ముగియడం హైలైట్లలో మరొకటి. ‘లిగో ఇండియా’ ప్రాజెక్టుకు మన దేశం అంగీకరించడం ఒక మేలి మలుపు. మహారాష్ట్రలోని హింగోలి ప్రాంతంలో లిగో ఇండియా నిర్మాణం ప్రారంభమైంది. నేషనల్ క్వాంటమ్ మిషన్ కు కూడా 2023లోనే శ్రీకారం పడింది. అయితే, సెన్స్ రంగంలో ఇచ్చే పలు అవార్డులను రద్దు చేయడం, జీవ పరిణామ క్రమాన్ని వివరించే పాఠాలను పుస్తకాల్లోంచి తొలగించడం ఆందోళన రేకెత్తించిన కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ లను జాబిల్లి పైకి మోసుకెళ్లిన అపోలో–11 లూనార్ మాడ్యూల్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ కెమెరా ఉండేది. ఆ ఇద్దరు వ్యోమగాములు చందమామపై మొదటిసారి అడుగుపెట్టిన చారిత్రక ఘట్టపు లైవ్ ప్రసారం ఈ కెమెరా ద్వారానే జరిగింది. అప్పట్లో ఈ ప్రసారాన్ని 53 కోట్ల మంది వీక్షించారు. అంతరిక్ష పరిశోధనల్లో 1969 జూలై 20 నాటి ఈ ఘటన అత్యంత కీలకమైందనడంలో సందేహం లేదు. అలాగే టెలివిజన్ ప్రసారాల్లోనూ ఓ మైలురాయిగా నిలిచింది. యాభై ఏళ్ల తరువాత 2023 ఆగస్టు 23న కూడా దాదాపు ఇలాంటి చారిత్రక ఘటనే భారత్ లోనూ నమోదైంది. చంద్రయాన్ –3 జాబిల్లిపై అడుగుపెట్టిన ఘట్టాన్ని యూట్యూబ్లోనే 80.9 లక్షల మంది వీక్షించారు. యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్కు సంబంధించి ఇదో రికార్డు. చంద్రయాన్ –3 విజయవంతం కావడం శాస్త్రరంగంలో భారత్ 2023లో సాధించిన అతిగొప్ప విజయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏళ్లపాటు శ్రమించిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల విజయ మిది. చంద్రయాన్ ప్రయోగం సక్సెస్ తరువాత కొంత కాలానికే భారతదేశపు ప్రతిష్ఠాత్మక ఆదిత్య–ఎల్1 ప్రయోగం కూడా విజయవంతంగా ముగియడం హైలైట్లలో మరొకటిగా చెప్పుకోవచ్చు. కొత్త సంవత్సరం తొలివారంలో ఈ అంతరిక్ష నౌక సూర్యుడిని పరిశీలించేందుకు అనువైన స్థానానికి చేరుకోనుంది. ఈ రెండు ప్రయోగాలు మాత్రమే కాకుండా 2023లో ‘ఇస్రో’ ఖాతాలో పలు కీలకమైన ప్రాజె క్టులను అమలు చేసిన ఖ్యాతి చేరింది. రీయూజబుల్ లాంచ్ వెహికల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించడం, రెండోతరం నావిగేషన్ ఉప గ్రహాల్లో తొలి ప్రయోగం, మానవ సహిత ప్రాజెక్టు ‘గగన్యాన్ ’లో క్రూ ఎస్కేప్ మోడల్ పరీక్ష ఈ జాబితాలో కొన్ని మాత్రమే. అంతరిక్ష ప్రయోగాలకు ఆవల... దేశం శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో అంతరిక్ష ప్రయోగాలకు ఆవల కూడా మన దేశం పలు విజయాలను నమోదు చేసింది. లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ (లిగో ఇండియా)కి ప్రభుత్వం అంగీకరించడం ఒక మేలి మలుపు. మహారాష్ట్రలోని హింగోలి ప్రాంతంలో లిగో ఇండియా ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. ప్రపంచంలోనే అరుదైన గురుత్వ తరంగాల వేధశాలగా, అతి సున్నితమైన నాలుగు కిలోమీటర్ల పొడవైన ఇంటర్ఫెరోమీటర్ సొరంగం ఉన్నదిగా ఇది రికార్డులకు ఎక్కింది. కృష్ణ బిలాలు, న్యూట్రాన్ నక్షత్రాల వంటివి కలిసిపోయినప్పుడు పుట్టే గురుత్వ తరంగాలను గుర్తించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. అమెరికాలో ఇప్పటికే పని చేస్తున్న లిగో వేధశాలలతో కలిసి హింగోలి వేధశాల పనిచేస్తుంది. నేషనల్ క్వాంటమ్ మిషన్కు కూడా 2023లోనే అడుగు పడింది. సూపర్ కండక్టింగ్, ఫొటోనిక్ ప్లాట్ఫామ్ల సాయంతో మధ్యమ స్థాయి క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. దీంతోపాటే కృత్రిమ మేధ ద్వారా దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను గుర్తించేందుకు కూడా జాతీయ స్థాయి కార్య క్రమం ఒకటి ఈ ఏడాది మొదలైంది. కృత్రిమ మేధను బాధ్యతా యుతమైన టెక్నాలజీగా అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. పరిశోధనల్లోనూ ఉన్నత స్థితిలో... భారతదేశంలో ప్రచార ఆర్భాటాలకు చిక్కని, అత్యుత్తమ, అంత ర్జాతీయ స్థాయి పరిశోధనలు ఎన్నో నమోదయ్యాయి. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి హైదరాబాద్లోని లాకోన్స్లో ఒక పర్యావరణ వ్యవస్థలో జీవవైవిధ్యతను గుర్తించేందుకు అభివృద్ధి చేసిన పద్ధతి. సీసీఎంబీ అనుబంధ సంస్థ అయిన లాకోన్స్లో ఎస్. మను, జి.ఉమాపతి ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. నీరు, మట్టి, గాలుల్లోని డీఎన్ ఏ పోగుల ఆధారంగా జీవవైవిధ్యతను కొలవడం ఈ పద్ధతి ప్రత్యేకత. కర్నాల్(హరియాణా)లోని నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు దేశీ గిర్ జాతి ఆవును క్లోనింగ్ పద్ధతి ద్వారా సృష్టించడం 2023 విశేషాల్లో ఇంకోటి. బనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన జ్ఞానేశ్వర్ చౌబే నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దక్షిణాసియా జన్యుక్రమాల్లో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. సింహళీయులకు, శ్రీలంకలోని తమిళులకు మధ్య దగ్గరి జన్యు సంబంధాలు ఉన్నట్లు పరిశోధన పూర్వకంగా నిర్ధారించింది. ఆసక్తికరమైన ఇంకో విషయం ఏమిటంటే, ఈ రెండు వర్గాల ప్రజలకూ మరాఠా జనాభాకూ మధ్య సంబంధాలు ఉండటం! కోవిడ్ విషయానికి వస్తే, పుణె కేంద్రంగా పనిచేస్తున్న జెన్నోవా బయో ఫార్మాస్యూటికల్స్ దేశీయంగా తయారు చేసిన ఎంఆర్ఎన్ ఏ టీకాను విడుదల చేసింది. ఒమిక్రాన్ వైరస్ నియంత్రణకు పనికొస్తుందీ టీకా. విధాన నిర్ణయాలను పరిశీలిస్తే... దేశం మొత్తమ్మీద శాస్త్ర పరిశోధనలకు అవసరమై నిధుల కేటా యింపును పర్యవేక్షించేందుకు ‘నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ’ ఒకదాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చట్టం చేసింది. వివరాలు పూర్తిగా బహిరంగం కాలేదు. ఇదిలా ఉంటే దశాబ్దాలుగా పనిచేస్తున్న విజ్ఞాన్ ప్రసార్ను 2023లో మూసివేశారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ (ఐఎస్సీఏ)కు నిధుల కేటాయింపులు తగ్గించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ఏటా జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతాయి. సైన్స్ రంగంలో ఇచ్చే పలు అవార్డులను రద్దు చేయడం, జీవ పరిణామ క్రమాన్ని వివరించే పాఠాలను పుస్తకాల్లోంచి తొలగించడం ఆందోళన రేకెత్తించిన కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు. కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో జనవరిలో సైన్స్ కాంగ్రెస్ జరిగే అవకాశాలు లేవు. డీఎస్టీ తమ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా వ్యవహరించిందని ఐఎస్సీఏ ఆరోపిస్తోంది. సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను లక్నోలో కాకుండా జలంధర్ సమీపంలోని పగ్వారాలో నిర్వహించాలన్న ఐఎస్సీఏ నిర్ణయం డీఎస్టీకి రుచించలేదు. 2023లో సైన్స్ కాంగ్రెస్ను నాగ్పూర్లో నిర్వహించారు. మరోవైపు పలు శాస్త్ర సంబంధిత విభాగాలు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ విజ్ఞాన్ భారతి ప్రాయో జకత్వం వహిస్తున్న వార్షిక్ సైన్స్ ఫెస్టివల్కు పెద్ద ఎత్తున ఆర్థిక సహకారం అందిస్తూండటం గమనార్హం. దురదృష్టవశాత్తూ చాలా సంస్థలు రాజకీయ పెద్దల అడుగులకు మడుగులొత్తే స్థితికి చేరిపోయాయి. లక్నోలోని నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ 108 రేకులున్న కమలాన్ని అభివృద్ధి చేసి దానికి ‘నమో 108’ అని నామకరణం చేసింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖల మంత్రి జితేంద్ర సింగ్ ‘నమో 108’ను ఆవిష్కరిస్తూ ‘మతపరంగా కమలానికి, 108 సంఖ్యకు ఉన్న ప్రాముఖ్యతలను దృష్టిలో ఉంచుకుంటే ఈ కొత్త రకం కమలం చాలా ప్రత్యేకమైన గుర్తింపుని ఇస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ‘నిరంతర కృషీవలుడు నరేంద్ర మోదీ అంతః సౌందర్యానికి ఈ కమలం ఓ గొప్ప బహుమానం’ అని కూడా అన్నారు. ఇంకో సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ నికోటిన్ మోతాదు తక్కువగా ఉన్న పొగాకు వంగడాన్ని అభివృద్ధి చేసింది. ఈ వంగడం అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తి అని సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ ఎన్ .కళైసెల్వి వ్యాఖ్యానించారు. ఇంకో పక్క ఎన్సీఈఆర్టీ చంద్రయాన్ ప్రయోగ కీర్తి ప్రధానికి దక్కుతుందని పొగడటం ప్రస్తావనార్హం. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ వంటి స్వతంత్ర సంస్థలు ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలోనూ నిశ్శబ్దంగా ఉండటం ఆశ్చర్య పరు స్తోంది. 2023లో భారతదేశం సాధించిన అతి గొప్ప విజయం చంద్రయాన్ అనుకుంటే... సైన్స్ సంస్థల రాజకీయీకరణ అత్యంత దురదృష్టకరమైనదిగా చెప్పాలి. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలి: గవర్నర్ అబ్దుల్ నజీర్
సాక్షి, విజయవాడ: భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఇస్రోకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. కాగా, పీఎస్ఎల్వీ-సీ58పై గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పందించారు. ఈ సందర్బంగా రాకెట్ విజయవంతంగా ప్రయోగించినందుకు అభినందనలు చెప్పారు. అమెరికా తర్వాత బ్లాక్ హోల్స్ను అధ్యయనం చేయడానికి అబ్జర్వేటరీ ఉపగ్రహాన్ని కలిగి ఉన్న రెండవ దేశంగా భారతదేశం అవతరించడంపై హర్షం వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరం రోజున మిషన్ను విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రో భారతదేశ పతాకాన్ని ఎగుర వేసిందన్నారు. పీఎస్ఎల్వీ-సీ58 విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రో మరో శిఖరం చేరింది. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని అని ఆకాంక్షించారు. ఇది కూడా చదవండి: పీఎస్ఎల్వీ సీ-58 ప్రయోగం విజయవంతం -
PSLV-C58 XPoSat: ఇస్రో పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్ ప్రయోగం విజయవంతం (ఫొటోలు)
-
నింగిలోకి దూసుకెళ్లిన PSLV C58 రాకెట్
-
పీఎస్ఎల్వీ సీ-58 ప్రయోగం విజయవంతం
Live Updates.. పీఎస్ఎల్వీ సీ-58 విజయవంతపై సీఎం జగన్ హర్షం ►ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ► నూతన సంవత్సరంలో మంచి విజయాన్ని సాధించారు ►అనుకున్న రీతిలోనే ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టటం సంతోషకరం ►భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలి ►పీఎస్ఎల్వీ సీ-58 ప్రయోగం విజయవంతం. ►2021లో IXPE పేరిట ఈ తరహా ప్రయోగం నిర్వహించిన అమెరికా ►అమెరికా తర్వాత ఇలాంటి ప్రయోగం చేసిన దేశంగా ఘనత దక్కించుకున్న భారత్ ►కొత్త ఏడాదిలో ఇస్రో తొలి ప్రయోగం సక్సెస్ ►శ్రీహరికోటలో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు ►శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ 58. #WATCH | PSLV-C58 XPoSat Mission launch | ISRO launches X-Ray Polarimeter Satellite (XPoSat) from the first launch-pad, SDSC-SHAR, Sriharikota in Andhra Pradesh. (Source: ISRO) pic.twitter.com/ua96eSPIcJ — ANI (@ANI) January 1, 2024 ►ఎక్స్పోశాట్ ఉపగ్రహ జీవితకాలం ఐదేళ్లు. ఎక్స్-రే మూలాలను అన్వేషించడమే ప్రధాన లక్ష్యంగా ప్రయోగం. ►2024 నూతన సంవత్సరం ప్రారంభం రోజునే ఇస్రో తొలి ప్రయోగానికి కౌంట్డౌన్ మొదలుపెట్టింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నిర్వహించనున్న పీఎస్ఎల్వీ-సీ58 ప్రయోగానికి కౌంట్డౌన్ ఆదివారం ఉదయం 8:10 గంటలకు ప్రారంభమైంది. ఇస్రో ఎక్స్ రే పొలారి మీటర్ శాటిలైట్(ఎక్స్పో శాట్)ను ప్రయోగించనుంది. ఇది భారత అంతరిక్ష చరిత్రలో తొలి పొలారిమీటర్ మిషన్ కావడం విశేషం. ►కౌంట్డౌన్ అనంతరం సోమవారం ఉదయం 9:10 గంటలకు షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందులో మన దేశానికి చెందిన 480 కిలోల బరువు గల ఎక్స్పోశాట్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపుతున్నారు. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్పోశాట్ నిర్ణీత కక్ష్యలోకి చేరుకోనుంది. ►అనంతరం రాకెట్లో నాలుగో స్టేజ్ అయిన పీఎస్4 అక్కడి నుంచి దిగువ కక్ష్యకు వస్తుంది. ఇందులో తిరువనంతపురం ఎల్బీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కాలేజ్ విద్యార్థినులు తయారుచేసిన విమెన్ ఇంజినీర్డ్ శాటిలైట్ సహా వివిధ ఉపకరణాలు ఉంటాయి. వీటి సాయంతో శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు. #WATCH | PSLV-C58 XPoSat Mission launch | Sriharikota, Andhra Pradesh: The launch of the X-Ray Polarimeter Satellite (XPoSat) is set for today at 09:10 am from the first launch-pad, SDSC-SHAR, Sriharikota in Andhra Pradesh. (Visuals from Satish Dhawan Space Centre) pic.twitter.com/c5LkajQEpU — ANI (@ANI) January 1, 2024 ►కాంతివంతమైన అంతరిక్ష ఎక్స్రే కిరణాల మూలాల సంక్లిష్టతను, అసాధారణ పరిస్థితుల్లో వాటి ప్రభావాన్ని ఎక్స్ పో శాట్ అధ్యయనం చేయనుంది. ఈ అధ్యయనానికిగాను ఎక్స్పోశాట్లో రెండు అత్యాధునిక సాంకేతికత కలిగిన పేలోడ్లను అమర్చారు. ఇవి తక్కువ ఎత్తులో గల భూ కక్ష్య నుంచి అధ్యయనాన్ని కొనసాగిస్తాయి. ►ఎక్స్పోశాట్లోని ప్రాథమిక పరికరం పోలిక్స్ మధ్యతరహా ఎక్స్రే కిరణాలను వెదజల్లే మూలాలపై పరిశోధన చేస్తుంది. ఇక మిగిలిన ఎక్స్స్పెక్ట్ పేలోడ్ అంతరిక్షంలోని బ్లాక్హోళ్లు, న్యూట్రాన్ నక్షత్రాలు, యాక్టివ్ గలాటిక్ న్యూక్లై, పల్సర్ విండ్, నెబ్యులా తదితరాల నుంచి వెలువడే ఎక్స్రే కిరణాల స్పెక్ట్రోస్కోపిక్ సమాచారాన్ని అందించనుంది. గడిచిన ఏడాది 2023లో ఇస్రో చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్ 1 ప్రయోగాలతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.