-
భారత్-చైనా యుద్ధం కాస్తలో తప్పింది..!
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లో భారత్-చైనాల మధ్య గత తొమ్మిది నెలలుగా తీవ్ర ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. సరిహద్దు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య పలు దఫాలుగా చర్చలు నడిచాయి. తాజాగా సరిహద్దులో ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్నాయి. గతేడాది జూన్లో ఇరు దేశాల మధ్య మొదలైన ప్రతిష్టంభన ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది. అయితే ఈ తొమ్మిది నెలల కాలంలో సరిహద్దులో ఇరు దేశాల మధ్య కొన్ని సార్లు యుద్ధ వాతావరణం నెలకొన్నదని.. ఒకానొక సమయంలో ఇక యుద్ధ భేరి మోగించడమే తరువాయి అనే పరిస్థితులు తలెత్తాయి అని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి తెలిపారు. ఈ సందర్భంగా వైకే జోషి మాట్లాడుతూ.. ‘‘గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య ఎర్ర గీత గీశారు. దీని తర్వాత కేంద్రం మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. డ్రాగన్ తోక జాడిస్తే.. దాన్ని ఎదుర్కొనేందుకు ఎలాంటి ఆపరేషన్ అయినా చేపట్టవచ్చని మాకు ఆదేశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో గతేడాది ఆగస్టు 29, 30న మన సైన్యం దక్షిణాన ఉన్న కైలాష్ రేంజ్ శిఖరాలను స్వాధీనం చేసుకుంది. ఈ చర్యలను చైనా ఏ మాత్రం ఊహించలేకపోయింది.. సహించలేకపోయింది. దీనికి ప్రతీకారంగా కౌంటర్ ఆపరేషన్ మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఆగస్టు 31న పీఎల్ఏ దళాలు మనకు అతి సమీపంలోకి వచ్చాయి. పరిస్థితి చూస్తే ఏ క్షణంలోనైనా యుద్ధం తప్పదన్నట్లుగా ఉంది’’ అన్నారు. ‘‘ఇక ఇటువైపు మన ట్యాంక్ మ్యాన్, గన్నర్, రాకెట్ లాంచర్ అందరూ సిద్ధంగా ఉన్నారు. ట్రిగ్గర్ వదిలితే చాలు.. దీనికి ధైర్యంతో పని లేదు. ఇక్కడ అత్యంత కష్టమైన పని ఏంటంటే కాల్పులు జరగకుండా చూడటం.. రక్తం చిందకుండా.. ప్రాణాలు కోల్పోకుండా చూడటం. ఈ పరిస్థితి తలెత్తకుండా చూడాలంటే ఎంతో ధైర్యం కావాలి. మాకు స్పష్టంగా అర్థం అవుతుంది యుద్ధం చేసే సందర్భం వచ్చిందని. మన జవాన్లు చాలా నిబద్ధతతో వ్యవహరించారు. మొత్తానికి డ్రాగన్ను కట్టడి చేయగలిగాం. యుద్ధం తప్పించగలిగాం’’ అని నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు’’ వైకే జోషి. 45 మంది చనిపోయి ఉండొచ్చు గల్వాన్ ఘర్షణ సందర్భంగా 45 మంది చైనా జవాన్లు మరణించారని ఓ రష్యన్ ఏజెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. జోషి కూడా నేరుగా నంబర్ చెప్పకపోయినా.. అదే అయి ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. చైనా వైపు చనిపోయిన వాళ్ల గురించి మన ఆర్మీ నుంచి ఇలాంటి ప్రకటన రావడం ఇదే తొలిసారి. ‘‘గల్వాన్ ఘర్షణలో ఎంత మంది మరణించి ఉంటారనే దాని గురించి నేను ఎలాంటి అంచనా వేయను. కానీ ఆ ఘటన జరిగినప్పుడు మా వైపు ఆబ్జర్వేషన్ పోస్ట్లు ఉన్నాయి. చాలా మందిని స్ట్రెచర్లలో తీసుకెళ్లడం కనిపించింది. 60మందికి పైగానే ఇలా తీసుకెళ్లారు. అందులో అందరూ చనిపోయారా లేదా తెలియదు. రష్యన్ ఏజెన్సీ చెప్పినట్లు మరణించిన చైనా సైనికుల సంఖ్య 45 లేదా అంతకంటే ఎక్కువే ఉండొచ్చు’’ అన్నారు జోషి. చైనాకు కార్గిల్ హీరో సలహా కార్గిల్ యుద్ధ హీరో అయిన జోషి.. తన కెరీర్లో చాలా వరకూ లద్ధాఖ్ శిఖరాల్లోనే గడిపారు. ఆయనకు చైనా భాష మాండరిన్ చాలా బాగా తెలుసు. ఇక గల్వాన్ ఘర్షణ వల్ల చైనాకు చెడ్డపేరు రావడం తప్ప వాళ్లు సాధించింది ఏమీ లేదన్నారు జోషి. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రముఖ మాండరిన్ సామెతను గుర్తు చేసుకున్నారు. ‘‘దూరంగా ఉన్న బంధువు, దగ్గరగా ఉన్న పొరుగువారు ఎప్పటికీ సమానం కారు’’ అనే సామెత చెప్పారు. అంటే పొరుగు వాళ్లతో మంచి సంబంధాలు నెలకొల్పడం ముఖ్యం కానీ.. దూరంగా ఉన్న బంధువుపై ఆధారపడటం సరికాదు అని దీని అర్థం అన్నారు జోషి. ఇదే సామెతను తాను చైనాకు చెబుతానని అన్నారు. ‘‘మేము(భారత్) వాళ్లతో మంచి పొరుగువారిగా ఉంటాము కానీ రెండు వైపులా ఆ నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకాన్ని కలిగించే బాధ్యత ఇప్పుడు చైనాపైనే ఉంది’’ అని జోషి స్పష్టం చేశారు. చదవండి: మాటకి కట్టుబడి వెనుదిరిగిన చైనా సైన్యం గల్వాన్ ఘర్షణపై సంచలన విషయాలు బహిర్గతం.. -
హర్షించదగ్గ పరిణామం
భారత్–చైనాల మధ్య వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద సరిహద్దు తగాదా మొదలై పది నెలలు కావస్తుండగా ఇరు దేశాలూ వివాదం తలెత్తిన ప్రాంతాల్లోవున్న తమ తమ దళాలను వెనక్కి పిలవాలని నిర్ణయించుకున్నాయి. ఈ విషయంలో ఒప్పందం కుదిరిందని గురువారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. వివాదాలపై పరస్పరం చర్చించుకోవటం, సామరస్యంగా పరిష్కరించుకోవటం మంచిదే. ఘర్షణ వాతావరణం దీర్ఘకాలం కొనసాగితే ఏదో ఒకరోజు అది కట్టుదాటే ప్రమాదం వుంటుంది. అయితే వైరి పక్షాలు హేతుబద్ధంగా వాదనలు వినిపించాలి. వాస్తవాలను అంగీకరించాలి. అప్పుడే ఆ చర్చలు ఫలవంతమవుతాయి. గత నెలలో అరుణాచల్ ప్రదేశ్కు అయిదు కిలోమీటర్ల దూరంలోని నిర్మానుష్య ప్రాంతాల్లో హఠాత్తుగా మూడు గ్రామాలు వెలిశాయి. ఒకపక్క లద్దాఖ్లో రేగిన వివాదం గురించి అంతకు ఏడెనిమిది నెలల ముందు నుంచీ సైనిక కమాండర్ల స్థాయి చర్చలు జరుగుతున్నాయి. మన దేశం తన వాదనకు మద్దతుగా పాత, కొత్త ఉపగ్రహ ఛాయా చిత్రాలను చైనాకు ఇచ్చింది. ఇరు దేశాల విదేశాంగ మంత్రులు కూడా మాట్లాడుకున్నారు. అయినా చైనా వెనక్కు తగ్గిన దాఖలా కనబడలేదు. సరిగదా... రెచ్చ గొట్టేవిధంగా గ్రామాలే నిర్మించింది. పొరుగు దేశాన్ని రెచ్చగొట్టి, దాంతో గిల్లికజ్జాలు పెట్టు కోవాలన్న ఉద్దేశం తప్ప ఇందులో వేరే పరమార్థం కనబడదు. ఎందుకంటే చైనా ఆక్రమణలో వున్న ప్రాంతం... ప్రత్యేకించి కొత్తగా వెలిసిన గ్రామాలున్న ప్రాంతం సాధారణ జన జీవనానికి పనికొచ్చేది కాదు. దశాబ్దాలుగా అక్కడ లాంఛనంగా కొనసాగే సైనిక దళాల గస్తీ తప్ప మరేమీ లేదు. 3,440 కిలోమీటర్ల నిడివున్న ఎల్ఏసీ వద్ద ఇరు దేశాల మధ్యా ఇంతవరకూ సరిహద్దులు ఖరారు కాలేదు. అందుకే అక్కడక్కడ తమ దళాలను అవి వున్న చోటు నుంచి ముందుకు తోయటం... ఆ ప్రాంతం తనదేనని వాదనకు దిగటం చైనాకు అలవాటుగా మారింది. వెనక్కి వెళ్లాలని కోరినా కదలకపోవటం రివాజైంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ తీరువల్ల మనదైన 38,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఇప్పుడు చైనా దురాక్రమణలో వున్నదని సైనిక నిపుణులు చెబుతున్నారు. ఇందుకు ప్రతిగా చైనా ఏకంగా తమకు చెందిన 90,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం భారత్ స్వాధీనంలో వున్నదని చెప్పుకుంటోంది. ఇరు దేశాల మధ్యా 1962లో జరిగిన యుద్ధం తర్వాత చాన్నాళ్లు దౌత్య, వాణిజ్య సంబంధాలు నిలిచిపోయాయి. పొరపొచ్చాలకు సరిహద్దు తగాదా కారణమన్న అభిప్రాయం అందరికీ కలుగుతున్నా, నిజానికి అంతకన్నా లోతైన సమస్యలున్నాయని తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఒకసారి అన్నారు. ఆసియాలో రెండూ రెండు పెద్ద దేశాలు కావటంతో... అంత ర్జాతీయంగా తమను అవతలి పక్షం అధిగమిస్తుందేమోనన్న శంకతోనే చైనా ఈ వృధా వివాదాన్ని పదే పదే తెరపైకి తెస్తోందని ఆయన అభిప్రాయం. ఏమైతేనేం చైనాలో డెంగ్ జియావో పెంగ్ పెత్తనం వచ్చాక రెండు దేశాల మధ్యా స్నేహపూర్వక భేటీలుగా మొదలై దౌత్య సంబంధాల వరకూ వచ్చాయి. వివాదాలను ఒకపక్క చర్చించుకుంటూనే, వాటి పర్యవసానాలతో సంబంధం లేకుండా వాణిజ్య సంబంధాలను నెలకొల్పుకుందామన్న ప్రతిపాదన చైనాయే చేసింది. అందుకు మన దేశం కూడా అంగీకరించింది. వాణిజ్య, ద్వైపాక్షిక సంబంధాలు పెరగవలసినంతగా పెరగ కపోయినా క్రమేపీ మెరుగుపడుతున్న సూచనలైతే కనబడేవి. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చాక చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ రెండుసార్లు ఇక్కడికి రావటం, మోదీ అక్కడకు వెళ్లటం జరిగాయి. బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్(బీఆర్ఐ) పేరిట బృహత్తరమైన ఆధునిక సిల్క్ రూట్ను నిర్మించి సెంట్రల్ ఆసియా, యూరప్, ఆఫ్రికాలతో పటిష్టమైన వాణిజ్య బంధాన్ని ఏర్పర్చుకోవాలన్న చైనా ప్రతిపాదనకు మన దేశం పెద్దగా సుముఖత చూపలేదు. బీఆర్ఐలో భాగంగా నిర్మించ తలపెట్టిన చైనా–పాక్ ఆర్థిక కారిడార్ ప్రాజెక్టులో ఆక్రమిత కశ్మీర్ భూభాగం వుండటం అందుకు ఒక కారణం. మరోపక్క అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో మన దేశానికి బల పడుతున్న బంధం... దాని పర్యవసానంగా రూపుదిద్దుకుంటున్న క్వాడ్ తనకు వ్యతిరేకంగా ఎక్కు పెట్టిందే నన్న శంక చైనాకుంది. వీటన్నిటివల్లా సరిహద్దుల్లో మనల్ని చికాకు పరిచేందుకు చైనా ప్రయ త్నించింది. ఏమైతేనేం ఇరు దేశాల మధ్యా ఇప్పటికి ఎనిమిది దఫాలు చర్చలు జరిగాయి. గతంలో వేరే దేశాలతో వున్న తగాదాల విషయంలో వ్యవహరించిన తీరుకు భిన్నంగా చైనా వెనక్కి తగ్గటం సంతోషించదగ్గదే. అయితే గత అనుభవాలరీత్యా మన దేశం జాగ్రత్తగా వ్యవహరించక తప్పదు. నిరుడు జూన్లో ఎల్ఏసీ వద్ద గల్వాన్ లోయలో చొరబడి, ఆ తర్వాత రెండు పక్షాలూ వెనక్కి తగ్గాలన్న అవగాహన కుదిరాక హఠాత్తుగా దాడికి తెగబడి కల్నల్ సంతోష్బాబుతో సహా 20 మంది భారత జవాన్ల ప్రాణాలు బలితీసుకున్న ఉదంతాన్ని మరిచిపోలేం. ప్యాంగాంగ్ సో సరస్సు ప్రాంతం నుంచి బలగాల ఉపసంహరణ సజావుగా ముగిసి, అక్కడ ఉద్రిక్తతలు సడలాలని కోరుకుంటూనే సమస్యాత్మకంగా వున్న ఇతర ప్రాంతాల విషయంలో కూడా చర్చలు ఫలించి, సాధ్యమైనంత త్వరగా యధాపూర్వ స్థితి ఏర్పడాలని ఆశించాలి. ఈ మొత్తం వ్యవహారంలో చైనా తన తీరు తెన్నులను సమీక్షించుకుని లోటుపాట్లను సరిదిద్దుకోవాలి. -
చైనా వక్రబుద్ధి: భారత జవాన్లకు గాయాలు
గ్యాంగ్టక్: సందు దొరికితే చాలు భారత భూభాగంలో చొచ్చుకొచ్చేందుకు సిద్ధంగా ఉంటుంది చైనా. కన్ను మూసి తెరిచేలోగా దొరికిన కాడికి దోచుకునేందుకు గుంటనక్కలా కాచుకుని కూర్చుంటుంది. భారత సైన్యం ఎన్నిసార్లు హెచ్చరించినా డ్రాగన్ ఆర్మీ తన వక్రబుద్ధిని పోనిచ్చుకోలేదు. తాజాగా చైనా సైనికులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా అలర్ట్ అయిన భారత సైనికులు వారిని వెనక్కు వెళ్లగొట్టి డ్రాగన్ తోక ముడిచేలా చేశారు. గతవారం సిక్కింలోని నాకులా లోయలో సుమారు 20 మంది చైనా సైనికులు సరిహద్దు దాటి రహస్యంగా భారత్లోకి వచ్చేందుకు కుట్ర పన్నారు. వీరి ఎత్తుగడ అర్థమైన జవాన్లు వెంటనే వారిని వెళ్లిపొమ్మని హెచ్చరించారు. మాట చెవికెక్కించుకోని డ్రాగన్ ఆర్మీ ఆయుధాలు బయటకు తీసింది. (చదవండి: 63 సంవత్సరాల మహిళకు 43 ఏళ్ల జైలు శిక్ష..!) ఈ క్రమంలో భారత్-చైనా సైనికుల మధ్య మరోసారి ఘర్షణ జరగ్గా సైనికులు ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకున్నారు. ఈ దాడిలో నలుగురు భారత జవాన్లు గాయాలపాలయ్యారు. పైగా అక్కడి వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ తీవ్రంగా పోరాడిన సైనికులు వారిని విజయవంతంగా వెనక్కు వెళ్లగొట్టారు. జనవరి 20న జరిగిన ఈ ఘర్షణ లోకల్ కమాండర్ల చర్చలతో సద్దుమణిగిందని ఇండియన్ ఆర్మీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా భారత్- చైనా ఆర్మీ అధికారులు సమావేశమైన మరుసటి రోజే ఈ ఘర్షణ జరగడం గమనార్హం. గతేడాది జూన్ 15న కూడా లద్దాఖ్లోని గల్వాన్ లోయలో భారత్-చైనా మధ్య ఘర్షణ తలెత్తగా.. 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. (చదవండి: బలగాల మోహరింపు.. ఒప్పందానికి చైనా తూట్లు) -
చైనాకు గట్టి కౌంటరిచ్చిన భారత్..!
న్యూఢిల్లీ : చైనా పౌరులను భారత్ విమానాల్లోకి అనుమతించవద్దని అన్ని విమానయాన సంస్థలను కేంద్రం అనధికారికంగా కోరింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనధికారిక ఆదేశాన్ని అందుకున్నట్లు విమానయాన వర్గాలు ధృవీకరించాయి. కాగా గతంలో కరోనా వైరస్ వ్యాప్తిస్తున్న తరుణంలో భారత్ చైనాతో విమాన సర్వీసులను నిలిపివేసింది. అయితే కరోనా లాక్డౌన్ తర్వాత అంతర్జాతీయ విమాన ప్రయాణాల కోసం పలు దేశాలతో భారత్ 2ఎయిర్ బబూల్స్’ తెరచడంతో ఆ దేశాల్లో నివసించే చైనా పౌరులు వ్యాపార, ఉద్యోగ పనుల కోసం భారత్ రావడానికి అవకాశం ఏర్పడింది. దీంతో చైనా పౌరులు భారతదేశంతో ఎయిర్ బబుల్ ఉన్న దేశాల ద్వారా పర్యాటక వీసాలను మినహాయించి నిర్దిష్ట రకాల వీసాలపై ఇండియకు రాకపోకలను కొనసాగిస్తున్నారు. నవంబర్ నుంచి భారత పౌరులను తమ దేశంలోకి ప్రవేశించకుండా చైనా కూడా నిషేధం విధించింది. కరోనా కారణంగా భారత్ సహా విదేశీ పౌరులకు వీసాలను నిలిపివేస్తూ అప్పటికే మంజూరు చేసిన వాటిని రద్దుచేసింది. ‘చైనా రాయబార కార్యాలయం / కాన్సులేట్లలో పైన పేర్కొన్న వర్గాలకు వీసా లేదా నివాస అనుమతులకు సంబంధించి ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయబోం’ అని భారత్లోని చైనా రాయబార కార్యాలయం నవంబర్ 5న తన వెబ్సైట్లో పేర్కొంది. చదవండి: 2021 నుంచి అయినా ఫిట్గా ఉందాం : రాష్ట్రపతి మరో వైపు చైనా పౌరులు తమ విమానాల్లో భారత్లోకి ప్రయాణించవద్దని గతవారం రోజులుగా స్వదేశీ, విదేశీ విమానయాన సంస్థలు చెబుతున్నాయి. టూరిస్ట్ వీసాలను తాత్కాలికంగా రద్దు చేయగా.. వ్యాపార, ఇతర విభాగాలకు చెందిన విదేశీ వ్యక్తులను నాన్-టూరిస్ట్ వీసాలపై అనుమతిస్తోంది. ఐరోపాలోని ఎయిర్ బబూల్స్ దేశాల నుంచి చాలా మంది చైనీయులు భారత్కు వస్తున్నట్టు విమానయా సంస్థ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం భారత్కు టిక్కెట్లు బుక్ చేసుకున్న చైనా పౌరులకు బోర్డింగ్ నిరాకరించడానికి కారణం చెప్పడానికి తమకు లిఖితపూర్వకంగా ఏదో ఒక ఉత్తర్వులు ఇవ్వాలని కొన్ని విమానయాన సంస్థలు అధికారులను కోరుతున్నాయి. అయితే ఇటీవల చైనాలోని వివిధ ఓడరేవులలో భారతీయులు చిక్కుకున్నప్పుడు, వారిని తమ తీరంలో దిగడానికి చైనా ప్రభుత్వం నిరాకరించింది. దీంతో అంతర్జాతీయ వాణిజ్య ఓడల్లో పనిచేస్తున్న దాదాపు 1,500 మంది భారతీయ సిబ్బంది స్వదేశానికి చేరుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో చైనా పాల్పడుతున్న చర్యలకు ధీటుగా సమాధానం చెప్పాలని భావిస్తోన్న భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: దేశంలో విస్తరిస్తున్న కొత్తరకం కరోనా -
పథకం ప్రకారమే గల్వాన్ ఘర్షణలు
న్యూఢిల్లీ: భారత్ను లక్ష్యంగా చేసుకొని చైనా చేసే కుట్రలు, కుతంత్రాలు మరోసారి బట్టబయలయ్యాయి. గత జూన్లో భారత్కు చెందిన 20 మంది సైనికుల్ని బలి తీసుకున్న గల్వాన్ ఘర్షణల్ని డ్రాగన్ దేశం పక్కాగా కుట్ర పన్ని పాల్పడినట్టుగా అమెరికా–చైనా ఆర్థిక, భద్రత రివ్యూ కమిషన్ అమెరికన్ కాంగ్రెస్కి సమర్పించిన నివేదికలో వెల్లడించింది. దీనికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది. భారత్, చైనా వాస్తవాధీన రేఖ వెంబడి ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు గత కొన్ని దశాబ్దాలుగా సరిహద్దుల్లో నెలకొన్న అత్యంత తీవ్రమైన సంక్షోభాల్లో ఒకటిగా అభివర్ణించింది. లద్దాఖ్లోని గల్వాన్ లోయలో జూన్ 15న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ), భారత సైనికుల మ««ధ్య హోరాహోరీ జరిగిన పోరులో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోతే, చైనా తరఫున ఎంత ప్రాణ నష్టం జరిగిందో డ్రాగన్ దేశం ఇప్పటికీ వెల్లడించలేదు. చైనా ఒక పథకం ప్రకారమే సరిహద్దుల్లో భారత్తో కయ్యానికి కాలు దువ్విందని ఆ నివేదిక స్పష్టం చేసింది. వారాల ముందు నుంచే... గల్వాన్ ఘర్షణలకు కొద్ది వారాల ముందే చైనా రక్షణ మంత్రి తమ సైన్యం సరిహద్దుల్లో ఘర్షణలకు దిగేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకే చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్.. అమెరికా, చైనా మధ్య జరిగే పోరులో భారత్ కల్పించుకుంటే చైనాతో ఆర్థిక, వాణిజ్య బంధాలు తెగిపోతాయని హెచ్చరించింది. ఘర్షణకు ముందే చైనా ఆర్మీకి చెందిన వెయ్యి మంది సైనికులు గల్వాన్ లోయను చుట్టుముట్టడం శాటిలైట్ ఇమేజ్లో కనిపించింది. భారీగా ఆయు«ధాల మోహరింపు దృశ్యాలు కూడా ఆ చిత్రాల్లో కనిపించాయని ఆ నివేదిక ప్రస్తావించింది. -
చైనాతో ఉద్రిక్తతలకు చెక్!
న్యూఢిల్లీ: భారత్–చైనాల సరిహద్దుల్లో 6 నెలలుగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభన త్వరలోనే ముగింపునకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్రిక్తతలను తొలగించుకునే క్రమంలో ఇరు దేశాల సైనికాధికారులు ఇప్పటి వరకు 8 దఫాలుగా చర్చలు జరిపారు. వారం క్రితం కోర్ కమాండర్ల స్థాయిలో జరిగిన 8వ విడత చర్చల్లో సరిహద్దుల్లో శాంతి స్థాపన సాధన దిశగా కీలక ముందడుగు పడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీటిపై త్వరలోనే జరిగే 9వ విడత కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల సందర్భంగా సంతకాలు జరిగే అవకాశం ఉంది. ఇందులో భాగంగా, ఘర్షణాత్మక ప్రాంతాల్లో మోహరించిన సైన్యాన్ని, ఆయుధ సామగ్రిని నిర్ణీత కాల వ్యవధిలో మూడు విడతలుగా ఉపసంహరించుకునేందుకు స్థూలంగా ఒక అంగీకారం కుదిరింది. ఇది అమల్లోకి వస్తే వాస్తవ ఆధీన రేఖ(ఎల్ఏసీ) వెంట తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఏప్రిల్ నాటి పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయని బుధవారం అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనల ప్రకారం మొదటి దశలో ఒప్పందం కుదిరిన మూడు రోజుల్లోనే రోజుకు 30 శాతం చొప్పున బలగాలను రెండు దేశాలు ఉపసంహరించుకోవాలి. -
అరుణాచల్ సరిహద్దులో చైనా కొత్త రైల్వేలైన్
బీజింగ్: సరిహద్దు విషయంలో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే.. మరోవైపు భారత్ను రెచ్చగొట్టే చర్యలకు చైనా పాల్పడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తోంది. సిచువాన్–టిబెట్ రైల్వే మార్గంలో భాగంగా నైరుతి సిచువాన్ ప్రావిన్స్లోని యాన్ నుంచి టిబెన్లోని లింజీ వరకు ఈ కొత్త లైన్ నిర్మిస్తారు. ఇది సరిగ్గా అరుణాచల్ సరిహద్దు నుంచే వెళ్లనుంది. చదవండి: పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉంది.. ఈ రైల్వే లైన్లో రెండు సొరంగాలు, ఒక బ్రిడ్జి, ఒక విద్యుత్ సరఫరా ప్రాజెక్టు తదితరాలు నిర్మిస్తారు. ఈ మేరకు బిడ్డింగ్ ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు చైనా రైల్వే వర్గాలు తెలిపాయి. నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నాయి. సిచువాన్–టిబెట్ రైల్వే లైన్ చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ రాజధాని చెంగ్డూలో మొదలవుతుంది. లాసాలో ముగుస్తుంది. ఈ రైల్వేలైన్తో రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం చాలా తగ్గిపోతుంది. చదవండి: చైనా వెళ్లిన భారతీయుల్లో 19 మందికి పాజిటివ్ -
సరిహద్దు సమస్యను గమనిస్తున్నాం!
వాషింగ్టన్: భారత్, చైనా మధ్య జరుగుతున్న సరిహద్దు సమస్యను నిశితంగా గమనిస్తున్నామని, ఈ సమస్య ముదరకూడదని కోరుతున్నామని ట్రంప్ ప్రభుత్వంలో సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. భారత్కు తమ ప్రభుత్వం ఆయుధాల విక్రయాలు, సంయుక్త మిలటరీ విన్యాసాలు, సమాచార పంపిణీలాంటి పలు రూపాల్లో సహకరిస్తోందన్నారు. కేవలం హిమాలయ ప్రాంత సమస్యల విషయంలోనే కాకుండా భారత్కు అన్ని అంశాల్లో తాము సహకరిస్తున్నామని చెప్పారు. లద్దాఖ్ తదితర సరిహద్దు ప్రాంతాల్లో భారత్, చైనా మధ్య టెన్షన్లు పెరిగిన సంగతి తెలిసిందే. ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో అన్ని వ్యవహారాల్లో భారత్ మరింత పాత్ర పోషించాలని తాము భావిస్తున్నట్లు అమెరికా అధికారి చెప్పారు. ఈ ప్రాంతంలో చైనా దూకుడుకు అడ్డుకట్టవేసేందుకు క్వాడ్ పేరిట భారత్, యూఎస్తోపాటు ఆస్ట్రేలియా, జపాన్లు జట్టుకట్టాయి. చైనా ఇటీవల కాలంలో దక్షిణ, తూర్పు సముద్రాల్లో అన్ని పొరుగుదేశాలతో వివాదాలు పడుతోంది. తన ద్వీపాల్లో భారీగా మిలటరీ మోహరింపులు చేస్తోంది. ఈ సముద్ర జలాల్లో యూఎస్కు ఎలాంటి వాటా లేకున్నా, చైనా ఆధిపత్యం పెరగకుండా ఉండేందుకు ఆయా దేశాలకు సాయం చేస్తోంది. చైనాకు సవాలు విసురుతున్నట్లుగా ఈ సముద్ర జలాల్లో అమెరికా వార్షిప్పులు, ఫైటర్ జెట్లను మోహరిస్తోంది. అంతర్జాతీయ స్వేచ్ఛా నౌకాయానానికి భంగం కలగకుండా ఉండేందుకే తాము ఈ జలాల్లో ప్రవేశిస్తున్నామని అమెరికా చెబుతోంది. -
మలబార్ డ్రిల్లో ఆస్ట్రేలియా
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లో భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం రగులుతున్న నేపథ్యంలో ఇదొక అత్యంత కీలక పరిణామం. కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు చెక్ పెట్టడానికి భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు ఒక్కతాటిపైకి వస్తున్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో నవంబర్లో జరగనున్న మలబార్ విన్యాసాల్లో అమెరికా, జపాన్తోపాటు ఆస్ట్రేలియా పొల్గొంటుందని భారత్ సోమవారం ప్రకటించింది. ఉమ్మడి శత్రువైనా చైనాకు వ్యతిరేకంగా భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు చతుర్భుజ కూటమి(క్వాడ్) పేరిట జట్టు కట్టిన సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం జరిగే ఈ విన్యాసాల్లో భారత్, అమెరికా, జపాన్ నావికా దళాలు పాల్గొనడం పరిపాటి. తాజాగా ఇందులో ఆస్ట్రేలియా కూడా చేరింది. క్వాడ్లోని నాలుగు సభ్య దేశాలు సైనిక స్థాయిలో ఒకే వేదికపైకి రానుండడం ఇదే మొదటిసారి. తూర్పు లద్దాఖ్లో భారత్లో చైనా తరచుగా ఘర్షణకు దిగుతున్న నేపథ్యంలో నాలుగు దేశాల డ్రిల్ ప్రాధాన్యం సంతరించుకుంది. దీని ద్వారా చైనాకు బలమైన హెచ్చరికలు పంపినట్లవుతుందని నిపుణులు చెబుతున్నారు. మలబార్ ఎక్సర్సైజ్ ద్వారా నాలుగు దేశాల నావికా దళాల మధ్య సహకారం మరింత పెరుగుతుందని భారత రక్షణశాఖ పేర్కొంది. -
యుద్ధానికి సిద్ధంకండి!
వాషింగ్టన్: భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సైన్యాన్ని యుద్ధానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మీకున్న శక్తియుక్తులన్నింటినీ యుద్ధంపైనే నిమగ్నం చేయండని చైనా ఆర్మీతో జిన్పింగ్ చెప్పినట్టుగా సీఎన్ఎన్ ఒక కథనాన్ని ప్రచురించింది. గాంగ్డాంగ్లో మంగళవారం ఒక సైనిక స్థావరాన్ని సందర్శించిన జిన్పింగ్ అక్కడ సైనికులతో మాట్లాడుతూ దేశం పట్ల విశ్వసనీయంగా వ్యవహరించండంటూ వారికి హితబోధ చేశారు. ‘‘మీకున్న శక్తిని, మేధస్సుని యుద్ధ వ్యూహ రచనపై కేంద్రీకరించండి. అందరూ అత్యంత అప్రమత్తంగా ఉండండి. యుద్ధానికి సిద్ధంగా ఉండండి ’’అని జిన్పింగ్ చెప్పినట్టుగా సీఎన్ఎన్ తన కథనంలో పేర్కొంది. అయితే ఏ దేశంపైన, ఎప్పుడు దండెత్తడానికి జిన్పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారన్న దానిపై స్పష్టత లేదు. తూర్పు లద్దాఖ్లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్తో ఉద్రిక్తతలు, అగ్రరాజ్యం అమెరికాతో విభేదాలతో పాటుగా దక్షిణ చైనా సముద్ర ప్రాంతానికి సంబంధించి ఇతర దేశాలతో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) నావికాదళ జవాన్లతో జిన్పింగ్ మాట్లాడారు. మరోవైపు చైనా మీడియా మాత్రం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మరింత బలోపేతం కావడానికి, సైనికుల్లో ఆత్మ విశ్వాసాన్ని నెలకొల్పడానికి జిన్పింగ్ సైనిక స్థావరాన్ని సందర్శించారని చెబుతోంది. ఇప్పటివరకు భారత్, చైనా ఏడు రౌండ్లు చర్చలు జరిగినప్పటికీ ఉద్రిక్తతల నివారణకు చర్యలు అమలు చేయడంలో చైనా వెనుకడుగ వేస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో జిన్పింగ్ నోటి వెంట యుద్ధం ప్రస్తావన తేవడం మరింత ఆందోళనని పెంచుతోంది. -
చర్చలతో చైనా దారికి రాదు
వాషింగ్టన్: భారత్, చైనా మధ్య గత అయిదారు నెలలుగా నెలకొన్న ఉద్రిక్తతలకు చర్చలతో పరిష్కారం లభించదని అమెరికా అభిప్రాయపడింది. డ్రాగన్ దేశంతో చర్చలు జరిపి ఇక లాభం లేదని భారత్కు హితవు పలికింది. ఇరుదేశాల మధ్యనున్న వాస్తవాధీన రేఖను చైనా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందని స్పష్టం చేసింది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ బ్రియెన్ చైనాతో ఒప్పందాలు, చర్చలు అంటూ కాలయాపన చేయొద్దని, చర్చలతో పరిష్కారం దొరకదన్న విషయాన్ని భారత్ అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా చైనా వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు. భారత్ సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉత్తరంగా చైనా 60 వేల మందికి పైగా సైనికుల్ని మోహరించి కయ్యానికి కాలు దువ్వుతోందని అన్నారు. చైనాది దురాక్రమణ బుద్ధి కమ్యూనిస్టు పార్టీ దురాక్రమణ బుద్ధితో భారత్, తైవాన్ దేశాల సరిహద్దుల్ని ఆక్రమించుకోవడానికి కుట్రలు పన్నుతోం దని రాబర్ట్ ఓ బ్రియెన్ అన్నారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తైవాన్ సరిహద్దుల్లో నిరంతరాయంగా సైనిక విన్యాసాలకు దిగుతోందని అన్నారు. చైనా వన్ బెల్ట్ వన్ రోడ్ (ఓబీఓఆర్) ప్రాజెక్టు కూడా ఇతర దేశాల ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని దెబ్బ తీయడానికేనని ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యులైన కంపెనీలకు చైనా బలవంతంగా రుణాలు తీసుకునే పరిస్థితి కల్పిస్తుందని వాటిని చెల్లించలేక అవన్నీ డ్రాగన్ దేశానికి దాసోహం అంటాయని అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కల్పించే మౌలిక సదుపాయాలు అంతిమంగా చైనాకే ప్రయోజనం చేకూరుస్తున్నాయని ఆయన అన్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని భారత్ ఇకనైనా చర్చలతో చైనా దారికి రాదు అన్న విషయాన్ని గ్రహించుకోవాలన్నారు. క్వాడ్ దేశాలకు డ్రాగన్తో ముప్పు డ్రాగన్ దేశం అత్యంత హీనంగా వ్యవహరిస్తూ క్వాడ్ దేశాలకు ముప్పుగా మారిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ సరిహద్దుల్లో 60 వేల మందికి పైగా సైనికుల్ని మోహరించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంద న్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో చైనాకు చెక్ పెట్టడానికి ఇండో పసిఫిక్ దేశాలు అమెరికా, జపాన్, భారత్, ఆస్ట్రేలియా క్వాడ్ గ్రూపుగా ఏర్పడ్డాయి. ఇటీవల ఈ దేశాల విదేశాంగ మంత్రులు టోక్యోలో సమావేశమై చర్చించారు. భారత్ విదేశాంగ మంత్రి జై శంకర్తో ఫలప్రదమైన చర్చలు జరిపానని టోక్యో నుంచి వాషింగ్టన్కు తిరిగి వచ్చిన అనంతరం ఒక టీవీ చానెల్కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. -
చైనాకు మరోసారి గట్టి హెచ్చరికలు పంపిన భారత్
-
సయోధ్య దిశగా...
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఉద్రిక్తతల నివారణకు భారత్, చైనా మధ్య బుధవారం జరిగిన మరో దఫా చర్చల్లో ముందడుగు పడింది. ఇరు పక్షాలు అపార్థాలను, అనుమానాలను పక్కన పెట్టి సుస్థిరత నెలకొల్పే దిశగా సామరస్యంగా అడుగులు ముందుకు వేయాలని నిర్ణయించాయి. అయిదు నెలలుగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్ని నివారించడానికి సెప్టెంబర్ 10న మాస్కోలో ఇరు దేశాల విదేశాంగ శాఖ మంత్రుల మధ్య కుదిరిన అయిదు అంశాల ఒప్పందం అమలుకు సంబంధించి చర్చలు జరిపారు. సరిహద్దు వ్యవహారాలపై వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (డబ్ల్యూఎంసీసీ) మార్గదర్శకాలకు అమలుకి చేపట్టాల్సిన చర్యలపై ఇరు దేశాలకు చెందిన దౌత్య ప్రతినిధులు ఆన్లైన్ ద్వారా చర్చించారు. వాస్తవాధీన రేఖ వెంబడి సైన్యాన్ని వెంటనే ఉపసంహరించడం, సరిహద్దు నిర్వహణలో అన్ని ప్రోటోకాల్స్ని పాటించడం, శాంతి స్థాపన వంటి అంశాలపై దృష్టి సారించారు. సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితుల్ని కూడా సమీక్షించారు. ఈ చర్చల అనంతరం విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. -
సరిహద్దుల్లో క్షిపణుల మోహరింపు
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, చైనాలు ఆధునిక ఆయుధ వ్యవస్థలను సిద్ధం చేస్తున్నాయి. 2 వేల కి.మీల వరకు లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను, భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణులను జిన్జియాంగ్, టిబెట్ ప్రాంతాల్లో చైనా మోహరించింది. ప్రతిగా బ్రహ్మోస్, నిర్భయ్, భూమి నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించగల ఆకాశ్ క్షిపణులను భారత్ సిద్ధం చేసింది. బ్రహ్మోస్ది 500 కి.మీల రేంజ్ కాగా, నిర్భయ్ది 800 కి.మీ.ల రేంజ్. 40 కి.మీ.ల దూరంలోని శత్రు లక్ష్యాలను ఆకాశ్ ఛేదించగలదు. చైనా తన ఆయుధ వ్యవస్థలను ఆక్రమిత అక్సాయ్ చిన్ ప్రాంతంలోనే కాకుండా, వాస్తవాధీన రేఖ వెంట కస్ఘర్, హోటన్, లాసా, నింగ్చి.. తదితర ప్రాంతాల్లోనూ మోహరించింది. ఆకాశం నుంచి ఆకాశంలో ఉన్న లక్ష్యాలను, ఆకాశం నుంచి భూమిపైన ఉన్న లక్ష్యాలను ఛేదించగల అత్యంత శక్తివంత బ్రహ్మోస్ క్షిపణి 300 కి.మీ.ల వార్హెడ్ను మోసుకుని వెళ్లగలదు. టిబెట్, జిన్జియాంగ్ల్లోని చైనా వైమానిక స్థావరాలను బ్రహ్మోస్ క్షిపణి లక్ష్యంగా చేసుకోగలదు. లద్దాఖ్ ప్రాంతంలో ఈ క్షిపణులను అవసరమైనంత సంఖ్యలో భారత్ సిద్ధంగా ఉంచింది. ఎస్యూ30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి దీన్ని ప్రయోగించవచ్చు. హిందూ మహా సముద్రంలోని కార్ నికోబార్ ద్వీపంలో ఉన్న భారత వైమానిక కేంద్రం నుంచి కూడా దీన్ని ప్రయోగించే వీలుంది. కార్నికోబార్లోని వైమానిక కేంద్రం నుంచి బ్రహ్మోస్, నిర్భయ్ క్షిపణులను ప్రయోగించి మలక్కా జలసంధి నుంచి లేదా సుందా జలసంధి నుంచి వచ్చే చైనా యుద్ధ నౌకలను సమర్ధంగా ఎదుర్కోవచ్చు. ప్రస్తుతం భారత్ వద్ద నిర్భయ్ క్షిపణుల సంఖ్య పరిమితంగా ఉంది. నిర్భయ్ క్షిపణి భూమిపై నుంచి భూమిపై ఉన్న లక్ష్యాలను మాత్రమే ఛేదించగలదు. లద్దాఖ్ ప్రాంతంలో ఆకాశ్ క్షిపణులను కూడా అవసరమైన సంఖ్యలో భారత్ మోహరించింది. భూమి నుంచి ఆకాశంలోని లక్ష్యాలను చేధించే ఈ క్షిపణి వాస్తవాధీన రేఖ దాటి వచ్చే చైనా విమానాలను లక్ష్యంగా చేసుకోగలదు. ఆకాశ్ క్షిపణిలోని రాడార్ ఏకకాలంలో 64 లక్ష్యాలను గుర్తించగలదు. అందులో 12 లక్ష్యాలపై దాడి చేయగలదు. ఆకాశంలోనే శత్రుదేశ యుద్ధవిమానాలు, క్రూయిజ్ మిస్సైల్స్, బాలిస్టిక్ మిస్సైల్స్ను కూల్చివేయగలదు. ఈ మధ్యకాలంలో అక్సాయ్చిన్ ప్రాంతంలో చైనా వైమానిక దళ విమానాల కార్యకలాపాలు కొంత తగ్గాయి కానీ, కారాకోరం పాస్ దగ్గరలోని దౌలత్బేగ్ ఓల్డీ ప్రాంతంలో పెరిగాయి. రూ. 2,290 కోట్లతో రక్షణ కొనుగోళ్లు డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ను ఆవిష్కరించిన రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల కోసం రూ. 2,290 కోట్ల విలువైన ఆయుధాలు, ఇతర సాయుధ వ్యవస్థల కొనుగోలు ప్రతిపాదనకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో అమెరికా నుంచి కొనుగోలు చేసే 72 వేల ఎస్ఐజీ సావర్ తుపాకులు ఉన్నాయి. ఆర్మీ కోసం వీటిని రూ. 780 కోట్లతో కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రక్షణ శాఖకు చెందిన అత్యున్నత నిర్ణయ మండలి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సోమవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన సమావేశమై ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ రూ. 2,290 కోట్లలో రూ. 970 కోట్లతో నౌకాదళం, వైమానిక దళం కోసం ‘స్మార్ట్ ఎయిర్ఫీల్డ్ వెపన్(ఎస్ఏఏడబ్ల్యూ)’ వ్యవస్థలను కొనుగోలు చేయనున్నారు. ఆర్మీ, ఎయిర్ఫోర్స్ క్షేత్రస్థాయి దళాల మధ్య అడ్డంకులు లేని సమాచార పంపిణీ కోసం రూ. 540 కోట్లతో హెచ్ఎఫ్ రేడియో సెట్స్ను సమకూర్చాలని నిర్ణయించారు. భారత్ను అంతర్జాతీయ మిలటరీ వ్యవస్థల తయారీ కేంద్రంగా మార్చడం, సాయుధ సామగ్రిని సమకూర్చుకోవడంలో అనవసర జాప్యాలను నివారించడం, అత్యవసర కొనుగోలు నిర్ణయాలను త్రివిధ దళాలే సులభమైన విధానం ద్వారా తీసుకునే అవకాశం కల్పించడం.. లక్ష్యాలుగా ‘డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్(డీఏపీ)’ని రాజ్నాథ్ ఆవిష్కరించారు. ఈ కొత్త విధానం ప్రకారం, భారత్లో ఉత్పత్తి చేసే సంస్థలకు డిఫెన్స్ కొనుగోళ్లలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆధునిక సమాచార సాంకేతికతల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలైన డీఆర్డీఓ, డీపీఎస్యూలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని డీఏపీని రూపొందించామని రాజ్నాథ్ చెప్పారు. -
ప్రతికూల వాతావ‘రణ’మైనా రెడీ!
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు చెలరేగుతున్న తూర్పు లద్దాఖ్లో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి భారత్ సమాయత్తమైంది. చైనా కవ్వింపు చర్యల్ని దీటుగా ఎదుర్కోవడానికి గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేని విధంగా భారీగా యుద్ధ ట్యాంకులను, ఇతర సామగ్రిని తరలించింది. వచ్చే నాలుగు నెలలు శీతాకాలంలో ఎత్తయిన పర్వత ప్రాంతమైన లద్దాఖ్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొని ఉంటాయి. అక్టోబర్ నుంచి జనవరి మధ్య కాలంలో చలి మైనస్ 25 డిగ్రీల వరకు వెళుతుంది. ఆ సమయంలో డ్రాగన్ దేశం ఎలాంటి కుయుక్తులు పన్నినా దీటుగా ఎదుర్కోవడానికి ఇండియన్ ఆర్మీ ఈ భారీ తరలింపు ప్రక్రియ చేపట్టింది. యుద్ధ ట్యాంకులు, భారీగా ఆయుధాలు, ఇంధనాన్ని తరలించినట్టు ఆర్మీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. వాటితో పాటు సైనికులకు అవసరమైన ఆహారం దుస్తులు, బూట్లు తదితర సామగ్రిని చేరవేయడం దాదాపుగా పూర్తయింది. ఈ భారీ తరలింపు కసరత్తుని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎంఎం నారవాణే, మరికొందరు కమాండర్లతో బృందంగా ఏర్పడి స్వయంగా పర్యవేక్షించారు. జూలై నుంచి మొదలు పెట్టిన ఈ ప్రక్రియని పకడ్బందీ ప్రణాళికతో నరవాణె రూపొందించి అమలయ్యేలా చూశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా ఆయుధాలు తూర్పు లద్దాఖ్లోని సమస్యాత్మక ప్రాంతాలైన చుషుల్, డెమ్చోక్లకు టీ–90, టీ–72 ట్యాంకులు, గన్స్, పదాతిదళానికి అవసరమయ్యే వాహనాలు ఇప్పటికే చేరుకున్నాయి. ఈ ఆపరేషన్లో భాగంగా 16 వేల అడుగుల ఎత్తైన పర్వత ప్రాంతంలోని శిబిరాల్లో ఉండే జవాన్ల కోసం భారీగా ఆహార పదార్థాలు, దుస్తులు, టెంట్లు, కమ్యూనికేషన్ పరికరాలు, చమురు, చలి నుంచి రక్షణకి హీటర్లు తరలించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత లద్దాఖ్లో సైనిక శిబిరాలకు ఈ స్థాయిలో సామగ్రిని చేరవేయడం ఇదే మొదటిసారి. ఈ తరలింపు అత్యంత భారీ స్థాయిలో జరిగింది’’అని ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. రక్తం గడ్డ కట్టే చలి నుంచి రక్షణ కోసం యూరప్ దేశాల నుంచి దుస్తుల్ని తెప్పించి ఇప్పటికే సైనికులకి అందించారు. ఈ సామగ్రిని తరలించడానికి వైమానిక దళానికి చెందిన సి–130జే సూపర్ హెర్క్యులస్, సీ–17 గ్లోబ్మాస్టర్ హెలికాప్టర్లను వినియోగించారు. తూర్పు లద్దాఖ్లో ఉద్రిక్తతల నివారణ కోసం చైనాతో జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి రాకపోవడం, సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవడానికి ఆ దేశం అంగీకరించకపోవడంతో ముందు జాగ్రత్తగా భారత్ అన్ని రకాలుగా సిద్ధమైంది. అదనంగా మూడు సైనిక శిబిరాలను ఏర్పాటు చేసింది. అక్కడ సైనికులకి అన్ని సదుపాయాలు కల్పించింది. -
చైనా కుట్రతో పాక్ కుతంత్రం..
జమ్మూ కశ్మీర్: భారత్-చైనా సరిహద్దు ప్రతిష్టంభన కొనసాతున్న నేపథ్యంలో డ్రాగన్ దేశం దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. లద్దాఖ్ సరిహద్దు వద్ద భారత వ్యకతిరేక కార్యకాలాపాలు, అశాంతిని రెచ్చగొట్టడానికి పాకిస్తాన్తో పన్నాగం పన్నుతున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. జమ్మూ కశ్మీర్లో పెద్ద ఎత్తును ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పెలుడు పదార్థాలను మోహరించాలని చైనా పాకిస్తాన్కి ఆదేశించినట్లు తెలిపారు. జమ్మూకు పెద్ద ఎత్తును ఆయుధాలు తరలించాలనే ప్రణాళికను అమలు చేయాలని డ్రాగన్ దేశం పాక్కి సూచించిందని భారత ప్రభుత్వానికి ఇంటలిజెన్స్ వర్గాలు నివేదికలు అందించాయి. ఇటీవల భద్రతా ధళాలు స్వాధీనం చేసుకున్న ఆయుధాల ద్వారా భారత్లో హింస, ఆశాంతిని పెంచడానికి చైనా పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఆయుధాలపై చైనా దేశానికి సంబంధించిన గుర్తులు ఉన్నట్లు గుర్తించారు. (దక్షిణ కొరియాకు సారీ చెప్పిన కిమ్) భారత భద్రతా దళాలు ఏర్పాటు చేసిన చొరబాటు నిరోధక గ్రిడ్ కారణంగా కశ్మీర్ లోయలో పాకిస్తాన్ ఉగ్రవాదులు, ఆయుధాల మోహరింపు తగ్గిందని తెలిపారు. ఇంటలిజెన్స్ నివేదికలు వెలువడిన నేపథ్యంలో భారత భద్రతా దళాలు నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు నిరోధక గ్రిడ్ను మరింత బలోపేతం చేశాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చీఫ్ రాకేశ్ అస్థానా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ చీఫ్ ఏపీ మహేశ్వరి, భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్లో పర్యటించి గత పది రోజుల నుంచి చోటుచేసున్న పరిస్థితులను సమీక్షించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆర్మీ చీఫ్ ఎంఎం నారావణే ఆదేశించారు. (భారత్కు భయపడుతున్న చైనా జవాన్లు!) రెండు రోజుల క్రితం జమ్మూ నుంచి దక్షిణ కాశ్మీర్కు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అనుమానితులను భద్రతా దళాలు అరెస్టు చేశారు. వారి వద్ద చైనా గుర్తులు ఉన్న నోరిన్కో / ఈఎంఇఐ టైప్ 97 ఎన్ఎస్ఆర్ రైఫిల్, 190 రౌండ్లతో నాలుగు మ్యాగజైన్స్, 21 ఎ రౌండ్లు, మూడు గ్రెనేడ్లతో నాలుగు మ్యాగజైన్స్ కలిగిన ఏకే 47 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత భద్రతా బలగాలు సరిహద్దు వద్ద అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. -
విస్తృత బంధాల్లో సరిహద్దు ఒక భాగం
న్యూఢిల్లీ: భారత్, చైనాలు పరస్పరం మునుపెన్నడూ ఎరగని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని సరిహద్దు వివాదాన్ని ప్రస్తావిస్తూ విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. అయితే, ఇరుదేశాల మధ్య ఉన్న విస్తృత ద్వైపాక్షిక సంబంధాల్లో సరిహద్దు సమస్య ఒక భాగం మాత్రమేనని స్పష్టం చేశారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో గురువారం వర్చువల్గా ఆయన పాల్గొన్నారు. అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో రెండు దేశాలు సర్దుబాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే వివాద పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. ‘మునుపెన్నడూ లేని పరిస్థితిని రెండు దేశాలు ఎదుర్కొంటున్నాయన్నది వాస్తవం. అయితే, దీర్ఘకాలిక దృష్టితో చూస్తే.. ఇరు దేశాల మధ్య నెలకొన్న విస్తృత ద్వైపాక్షిక సంబంధాల్లో సరిహద్దు సమస్య ఒక భాగం మాత్రమేనని అర్థమవుతుంది’ అని జైశంకర్ వ్యాఖ్యానించారు. మరోవైపు, చైనాతో సరిహద్దు వివాదం ముగిసేందుకు ముందుగా, క్షేత్రస్థాయిలో శాంతి, సుస్థిరత నెలకొనాల్సిన అవసరం ఉందని భారత్ స్పష్టం చేసింది. తూర్పు లద్దాఖ్లోని సరిహద్దుల్లో ఉన్న అన్ని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ ప్రక్రియ కొంత సంక్లిష్టమైందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం పేర్కొన్నారు. ఇందుకు పరస్పర ఆమోదనీయ నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే ప్రయత్నాలను విరమించుకోవాల్సి ఉందన్నారు. ఇరు దేశాల మధ్య ‘వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్’ కింద మరో విడత చర్చలు త్వరలో జరుగుతాయని తెలిపారు. తదుపరి రౌండ్ కమాండర్ స్థాయి చర్చల కన్నా ముందే అవి ఉంటాయన్నారు. ఇరుదేశాల కమాండర్ స్థాయి 6వ విడత చర్చలు సోమవారం జరిగిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లోని పరస్పర సమీప ప్రాంతాల వద్దకు మరిన్ని బలగాలను పంపకూడదని, ఉద్రిక్తతలు పెరిగే చర్యలు చేపట్టవద్దని ఆ చర్చల్లో నిర్ణయించారు. చైనా ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతోంది: తైవాన్ తైపీ: తమ దేశ ఎయిర్ డిఫెన్సు జోన్లోకి చైనా నిఘా విమానాలు అక్రమంగా ప్రవేశించడంతో తైవాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా తమను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతోందని తైవాన్ డిప్యూటీ మినిస్టర్ చియ్ చుయ్ షెంగ్ వ్యాఖ్యానించారు. తమకు వ్యతిరేకంగా సైనిక శక్తిని ప్రయోగించాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. భావసారుప్యత ఉన్నదేశాలతో కలిసి పని చేస్తామని అన్నారు. ద్వీప దేశమైన తైవాన్కు స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. కానీ, తైవాన్ తమ దేశంలో అంతర్భాగమేనని చైనా వాదిస్తోంది. -
చైనాకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్-చైనాల మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఆరవ రౌండ్ కార్పస్ కమాండర్-స్థాయి చర్చలు చైనా భూభాగంలోని మోల్డోలో సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మొదలై రాత్రి 9 గంటల వరకు కొనసాగాయి. దాదాపు 12 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ చర్చల్లో భారత్ ప్రధానంగా ఘర్షణాత్మక ప్రాంతాల్లో నుంచి చైనా బలగాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. రెండు దేశాల మధ్య కుదిరిన ఐదు అంశాల ఒప్పందం అమలు లక్ష్యంగా చర్చలు జరిగాయి. చైనా మొదట తన దళాలను వెనక్కి రప్పించాలని భారత్ కోరినట్లు సమాచారం. చైనానే మొదట చొరబాటుకు ప్రయత్నించింది కనుక.. ముందు అదే వెనక్కి తగ్గాలని భారత్ ఆశిస్తున్నట్లు తెలిసింది. (చదవండి:అంతర్జాతీయ సంకేతాలే కీలకం...) ప్యాంగ్యాంగ్ త్సో, హాట్స్ప్రింగ్స్, డెప్సాంగ్, ఫింగర్ ఏరియాలో తక్షణమే చైనా దళాలు ఉపసంహరించుకోవాలని భారత్ డిమాండ్ చేసింది. ఒకవేళ చైనా యథాతథ స్థితిని పునరుద్ధరించకపోతే.. భాతర దళాలు సుదీర్ఘకాలం మోహరిస్తాయని హెచ్చరించింది. ఇప్పటి వరకు జరిగిన ఐదు దఫాలుగా సుదీర్ఘ చర్చలు జరిగినా చెప్పుకోదగ్గ పురోగతి ఏమీ లేకుండానే ముగిసిన విషయం తెలిసిందే. ఇక నిన్నటి చర్చల్లో భారత ప్రతినిధి బృందానికి లేహ్ ఆధారిత 14 కార్పస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నాయకత్వం వహించగా.. చైనా వైపు సౌత్ జిన్జియాంగ్ మిలిటరీ కమాండర్ మేజర్ జనరల్ లియు లిన్ నేతృత్వం వహించినట్లు తెలిసింది. -
భారత్, చైనా సుదీర్ఘ చర్చలు
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్, చైనాల మధ్య చర్చలు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. చైనా భూభాగంలోని మోల్డోలో ఉదయం 9 గంటల ప్రాంతంలో మొదలైన ఆరో విడత చర్చలు రాత్రి 9 గంటల తర్వాత కూడా ఒక కొలిక్కి రాలేదు. రెండు దేశాల మధ్య కుదిరిన ఐదు అంశాల ఒప్పందం అమలే లక్ష్యంగా జరుగుతున్న ఈ చర్చల్లో భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్తోపాటు మొదటిసారిగా విదేశాంగ శాఖ తరఫున జాయింట్ సెక్రటరీ నవీన్ శ్రీవాస్తవ కూడా పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీన మాస్కోలో రెండు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య కుదిరిన ఒప్పందంలోని ఐదు అంశాల అమలుకు కాలపరిమితిని ఖరారు చేయడంపైనే భారత బృందం దృష్టి పెట్టిందని అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఘర్షణాత్మక ప్రాంతాల్లో మోహరించిన చైనా బలగాలను సాధ్యమైనంత త్వరలో, పూర్తిగా వెనక్కి తీసుకోవాలని ఈ బృందం కోరుతోంది. ఇప్పటి వరకు జరిగిన ఐదు దఫాలుగా సుదీర్ఘ చర్చలు జరిగినా చెప్పుకోదగ్గ పురోగతి ఏమీ లేకుండానే ముగిసిన విషయం తెలిసిందే. -
అంతర్జాతీయ సంకేతాలే కీలకం...
ప్రధాన ఆర్థిక గణాంకాలేమీ లేకపోవడంతో ఈ వారం మార్కెట్కు అంతర్జాతీయ సంకేతాలే కీలకమని నిపుణులంటున్నారు. వీటితో పాటు చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు, కరోనా కేసులు, కరోనా టీకా సంబంధిత వార్తలు, డాలర్తో రూపాయి మారకం విలువ, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి... ఈ అంశాలు కూడా తగినంత ప్రభావం చూపుతాయని వారంటున్నారు. సెప్టెంబర్ సిరీస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) కాంట్రాక్టులు ఈ వారమే ముగియనున్నందున ఒడిదుడుకులు తప్పవని విశ్లేషకులంటున్నారు. దేశీయంగా ప్రధాన ట్రిగ్గర్లు ఏమీ లేకపోవడంతో అనిశ్చితి కొనసాగుతుందని, అందుకే ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని వారు సూచిస్తున్నారు. ప్రపంచ పీఎమ్ఐ గణాంకాలు.... అమెరికా ఫెడరల్ రిజర్వ్ తక్షణ తాయిలాలేమీ ఇవ్వకపోవడం గత వారం ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ను కూడా దెబ్బతీసింది. సున్నా స్థాయి రేట్లు మరో మూడేళ్ల పాటు కొనసాగుతాయని సంకేతాలిచ్చిన ఫెడరల్ రిజర్వ్ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ రికవరీపై అనిశ్చితిని వ్యక్తం చేయడం ప్రతికూల ప్రభావం చూపింది. ఇక అంతర్జాతీయంగా చూస్తే, అమెరికా, ఇంగ్లాండ్, యూరోజోన్ల పీఎమ్ఐ(పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) గణాంకాలు ఈ వారం విడుదలవుతాయి. ఈ వారం మూడు ఐపీఓలు.... ఈ వారంలో మూడు కంపెనీల ఐపీఓలు వస్తున్నాయి. క్యామ్స్(కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్), కెమ్కాన్ స్పెషాల్టీ కెమికల్స్, ఏంజెల్ బ్రోకింగ్ కంపెనీలు తమ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)లతో సందడి చేయనున్నాయి. విదేశీ పెట్టుబడులు రూ.3,944 కోట్లు పెట్టుబడులకు ఆకర్షణీయంగా ఉండటంతో ఈ నెలలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) మన క్యాపిటల్ మార్కెట్లో రూ.3,944 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. వీటిల్లో నికర పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్లో రూ.1,766 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.2,178 కోట్ల చొప్పున ఉన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ జోరుగా బాండ్లను కొనుగోలు చేస్తుండటంతో బాండ్ల రాబడులు తక్కువగా ఉండటం, అంతర్జాతీయంగా అధికంగా లభిస్తున్న లిక్విడిటీ... ఈ కారణాల వల్ల మన మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వస్తున్నాయని నిపుణులంటున్నారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను సున్సా స్థాయిల్లోనే మరో మూడేళ్ల పాటు కొనసాగించాలని ఫెడరల్ రిజర్వ్ సంకేతాలివ్వడంతో భారత్ వంటి వర్ధమాన మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల జోరు కొనసాగుతుందని వారంటున్నారు. ఐపీఓల సందడి చాలా రోజుల తర్వాత ఈ నెలలో ప్రైమరీ మార్కెట్లో ఐపీఓల సందడి కనిపిస్తోంది. ఇప్పటికే ఈ నెలలో హాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్, రూట్ మొబైల్స్ తమ ఐపీఓలతో దుమ్ము రేపాయి ఇక ఈ వారం మూడు కంపెనీలు–క్యామ్స్(కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్), కెమ్కాన్ స్పెషాల్టీ కెమికల్స్, ఏంజెల్ బ్రోకింగ్ కంపెనీలు తమ ఐపీఓలతో సందడి చేయనున్నాయి. ఈ ఐపీఓలకు సంబంధించిన తేదీలు, ప్రైస్బాండ్, జీఎమ్పీ తదితర వివరాలు..... -
తూర్పులద్దాఖ్లో పీఎల్ఏపై ఆర్మీ పైచేయి
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లోని సరిహద్దుల్లో భారత ఆర్మీ చైనా పీఎల్ఏపై పైచేయి సాధించింది. ఒక వైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే గడిచిన మూడు వారాల్లో కీలకమైన 20 పర్వత ప్రాంతాలను భారత సైన్యం ఆధీనంలోకి తీసుకుంది. భారత్ ఇచ్చిన షాక్తో దిమ్మెర పోయిన చైనా ఆర్మీ అరుణాచల్ప్రదేశ్తో గల సరిహద్దుల్లో మోహరింపులు పెంచి, కయ్యానికి కాలుదువ్వుతోంది. ఈ నేపథ్యంలో భారత్, చైనా కమాండర్ స్థాయి ఆరో విడత చర్చలు సోమవారం జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ సమావేశంలో భారత బృందంలో విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారి కూడా పాలు పంచుకునే అవకాశముంది. ఈ చర్చలు తూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖకు చైనావైపున్న మోల్దోలో జరగనున్నాయి. లద్దాఖ్ గగనతలంపై రఫేల్ యుద్ధ విమానాలు పహారా కాస్తున్నాయి.‘ఆగస్టు 29 మొదలు సెప్టెంబర్ రెండో వారం వరకు భారత సైన్యం 20 ప్రధాన పర్వత ప్రాంతాలను ఆక్రమించింది. ఆర్మీ ఆధీనంలోకి తీసుకున్న వాటిలో మగార్ హిల్, గురుంగ్ హిల్, రెచెన్ లా, రెజంగ్ లా, మొఖ్పరితోపాటు ఫింగర్ 4కు సమీపంలోని పర్వతప్రాంతం ఉన్నాయి’ ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. ‘ఇంతకుముందు ఈ ప్రాంతాల్లో చైనా ఆర్మీ పీఎల్ఏ ఆధిపత్యం ఉండేది. తాజా పరిణామంతో మన బలగాలు ఈ ప్రాంతంలో శత్రువుపై పైచేయి సాధించినట్లయింది’అని ఆ వర్గాలు తెలిపాయి. భారత భూభాగం వైపున పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణం వైపు ఉన్న ఈ పర్వత భాగాలను ఆక్రమించుకునే క్రమంలో చైనా ఆర్మీ ప్రతిఘటించిందనీ, ఈ సందర్భంగా మూడు పర్యాయాలు గాల్లోకి కాల్పులు కూడా జరిగాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత ఆర్మీ కదలికలతో ఇప్పటికే ఉన్న బలగాలకు తోడు మరో 3,000 బలగాలను చైనా అదనంగా రెజంగ్ లా, రెచెన్ లా పర్వత ప్రాంతాలకు సమీపంలోకి రప్పించిందని తెలిపాయి. దీంతోపాటు మోల్డో సైనిక స్థావరంలోకి అదనపు బలగాలను తరలించిందని వివరించాయి. అరుణాచల్ సరిహద్దుల్లో చైనా కుట్ర తూర్పు లద్దాఖ్ అనంతరం చైనా దృష్టి అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులపై పడింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆదేశాలతో అప్పర్ సుబన్సిరిలోని అసపిలా, లాంగ్జు, బిసా, మఝా ప్రాంతాల్లోకి పీఎల్ఏ మోహరింపులు పెరిగాయి. దీంతోపాటు ఎల్ఏసీకి సమీపంలోని బిసాలో ఒక రోడ్డును కూడా నిర్మించింది. భారత సైన్యం కూడా దీటుగా స్పందించింది. ఆరు సమస్యాత్మక ప్రాంతాలు, 4 సున్నిత ప్రాంతాల్లో గస్తీని పెంచింది. ఎలాంటి దురాక్రమణనైనా తిప్పికొట్టేందుకు సర్వం సన్నద్ధమైంది. -
మన గస్తీని ఏ శక్తీ అడ్డుకోలేదు
న్యూఢిల్లీ: భారత సైన్యం లద్దాఖ్ ప్రాంతంలో సరిహద్దు గస్తీ నిర్వహించకుండా ఏ శక్తీ అడ్డుకోలేదని రక్షణ మంత్రి రాజ్నాథ్æ స్పష్టం చేశారు. తూర్పులద్దాఖ్లో పరిస్థితిపై గురువారం రక్షణ మంత్రి రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. చైనా తన సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించిందని, భారత్ తదనుగుణంగా బలగాలను సిద్ధంగా ఉంచిందని తెలిపారు. చైనా చెప్పే మాటలకు, చేతలకూ పొంతన ఉండటం లేదని అన్నారు. గల్వాన్ లోయపై గతంలో ఎన్నడూ చైనాతో వివాదం తలెత్తలేదని, ఫింగర్ పాయింట్–8 వరకు మన బలగాలు గస్తీ చేపట్టేవని రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ అన్నారు. ఆయన ప్రశ్నకు రాజ్నాథ్ వివరణ ఇస్తూ.. చైనాతో గొడవంతా గస్తీ విషయంలోనేనని తెలిపారు. గస్తీ విధానం విస్పష్టంగా ఉందని, చాలా కాలంగా కొనసాగుతున్నదేనని చెప్పారు. సరిహద్దు వివాదాల్లాంటి సున్నితమైన అంశాలపై చర్చ వద్దన్న అంశంపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు అంగీకరించిన తరువాత రాజ్నాథ్æ రాజ్యసభలో ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో సభ్యులు కొన్ని అంశాలపై కోరిన వివరణకు రక్షణ మంత్రి స్పందించారు. చైనా సరిహద్దుల్లో ఏప్రిల్ నాటి పరిస్థితులను పునరుద్ధరించాలని అంతకుముందు ప్రతిపక్షం డిమాండ్ చేసింది. తూర్పు లద్దాఖ్లో చైనా సైన్యంతో ప్రతిష్టంభన కొనసాగుతున్న ఈ సమయంలో పార్టీల కతీతంగా సభ సైన్యానికి మద్దతు, సంఘీభావం ప్రకటించింది. భారత భూభాగాన్ని ఆక్రమించింది లద్దాఖ్ ప్రాంతంలో సుమారు 38 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుందని, పాక్ ఆక్రమిత కశ్మీర్లోనూ 5,180 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కలిగి ఉందని రాజ్నాథ్ తెలిపారు. భారత్, చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి అతితక్కువ సైనిక బలగాల మోహరింపు ఉండాలని 20 ఏళ్ల క్రితమే ఒప్పందాలు జరిగాయని గుర్తు చేశారు. పార్లమెంట్ ఆవరణలో రైతు బిల్లు ప్రతులు దహనం కేంద్రం ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదించిన రైతుల బిల్లులపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో నిరసన తెలిపారు. పంజాబ్కు చెందిన ఆ పార్టీ ఎంపీలు బిల్లుల ప్రతులను పార్లమెంట్ ఆవరణలో తగులబెట్టి, మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. కేంద్రం తప్పుడు విధానాల కారణంగా రైతులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని లోక్సభలో కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌధురి ఆరోపించారు. సాయుధ సంపత్తికి బిలియన్ డాలర్లువాస్తవాధీన రేఖ వెంట ప్రస్తుతం మోహరించిన బలగాలను చలికాలం ముగిసేవరకు కొనసాగించాలని చైనా నిర్ణయించిన నేపథ్యంలో.. ఈ నెలాఖరులో జరగనున్న ఇరుదేశాల మిలటరీ స్థాయి చర్చల్లో ప్రాదేశిక మార్పులకు సంబంధించి గొప్ప ఫలితాలేవీ రాకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింతకాలం కొనసాగే పరిస్థితి కనిపిస్తుండటంతో.. సుమారు బిలియన్ డాలర్ల(రూ. 7,361 కోట్లు) విలువైన మిలటరీ సాయుధ సంపత్తిని అత్యవసరంగా సమకూర్చుకునేందుకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వెల్లడించాయి. ఒకవేళ నెలరోజులకు పైగా యుద్ధం కొనసాగే పరిస్థితే ఉంటే.. అందుకు అవసరమైన సాయుధ సంపత్తిని సమకూర్చుకోవాలని నిర్ణయించినట్లు తెలిపాయి. ఇందులో టీ–72, టీ–90 యుద్ధ ట్యాంకులకు అవసరమైన పేలుడు పదార్ధాలు, ఇజ్రాయెల్ తయారీ క్షిపణులు, హెరోన్ డ్రోన్లు, ఎస్ఐజీ 716 రైఫిల్స్, ఇతర యుద్ధ సామగ్రి ఉన్నాయని వెల్లడించాయి. అలాగే, సుమారు 50 వేల మంది జవాన్లకు అవసరమైన.. తీవ్ర చలిని తట్టుకోగల దుస్తులు, హీటర్లు, టెంట్స్ను సమకూర్చుకోవాల్సి ఉందని తెలిపాయి. మరోవైపు, చైనా పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధపడకపోవచ్చని, భారత దళాలను నెలలు, లేదా సంవత్సరాల తరబడి సరిహద్దుల్లో ఎంగేజ్ చేయడం ద్వారా భారత్ను దెబ్బతీయాలనే లక్ష్యంతో పనిచేయవచ్చని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు మనోజ్ జోషి వ్యాఖ్యానించారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలను దృష్టిలో పెట్టుకుంటే, భారత్కు ఇది భారమే అవుతుందన్నారు. మరోవైపు, ఆర్మీ చీఫ్ నరవాణే గురువారం శ్రీనగర్కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కశ్మీర్లోని సరిహద్దు వెంట పరిస్థితులను స్వయంగా సమీక్షిస్తున్న ఆర్మీ చీఫ్ నరవాణే -
ఉద్రిక్తంగానే సరిహద్దు.. రాజ్నాథ్ ప్రకటన
న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దు వివాదంపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో గురువారం మరోసారి ఆసక్తికర ప్రకటన చేశారు. సరిహద్దు వివాదంపై ఎంపీలు లేవనెత్తిన ప్రశ్నలకు రాజ్నాథ్ సమాధానమిచ్చారు. చైనాతో ఎలాంటి పరిస్థితులున్నా తాము ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లు మరోసారి స్పష్టం చేశారు. మన సాయుధ బలగాలతో చైనాకు ఇప్పటికే గట్టిగా సమాధానమిచ్చామని.. ఇరుదేశాల మధ్య ఉన్న ఒప్పందాలను చైనా బహిరంగంగానే ఉల్లఘింస్తుందని మరోసారి గుర్తుచేశారు. కాగా మంగళవారం చైనా సరిహద్దు వివాదంపై రాజ్నాథ్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయని సమస్య ఇంకా పరిష్కారం కాలేదని స్పష్టం చేశారు. మన బలగాలు దేశ గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నాయని, చైనా దూకుడుకు చెక్ పెట్టేందుకు భారత దళాలు అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. చైనా మొండిగా వ్యవహరిస్తోందని, ఈ ఏడాది మే నుంచి సరిహద్దుల్లో భారీగా సాయుగాధ బలగాలను మొహరించిందని వివరించారు. (చదవండి : సరిహద్దు వివాదం : రక్షణ మంత్రి కీలక ప్రకటన) -
చైనా నుంచి చొరబాట్లు లేవు
న్యూఢిల్లీ: చైనా సరిహద్దుల నుంచి గత ఆరునెలల్లో ఎలాంటి చొరబాట్లు లేవని ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో పాక్ సరిహద్దుల నుంచి 47 చొరబాటు యత్నాలు చోటు చేసుకున్నాయని బుధవారం రాజ్యసభకు తెలిపింది. గత మూడేళ్లలో పాక్ నుంచి కశ్మీర్లోకి జరిగిన చొరబాటు యత్నాల సంఖ్య 594 అని, వాటిలో 312 విజయవంతమయ్యాయని వెల్లడించింది. మూడేళ్లలో అక్కడ 582 మంది ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయని హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఆరు నెలలుగా చైనా సరిహద్దుల్లో ఎలాంటి చొరబాట్లు లేవని ప్రభుత్వం ప్రకటించడంపై కాంగ్రెస్ మండిపడింది. ఆ ప్రకటన గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో ప్రాణాలర్పించిన వీర జవాన్లను అవమానించడమేనని పేర్కొంది. చైనా దురాక్రమణపై ప్రధాని మోదీ, రక్షణ మంత్రి చేసిన వేర్వేరు ప్రకటనలను వరుసగా ప్రస్తావిస్తూ.. ‘మోదీ ప్రభుత్వం మన సైనికుల పక్షాన ఉందా? లేక చైనా వైపు ఉందా?’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. నేడు రాజ్నాథ్ ప్రకటన తూర్పు లద్దాఖ్లో చైనాతో సరిహద్దుల వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై నేడు రక్షణ మంత్రి రాజ్నాథ్ రాజ్యసభలో ప్రకటన చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజ్నాథ్ ప్రకటన అనంతరం, విపక్ష సభ్యులను మాట్లాడే అవకాశం ఇస్తారని, ఆ తరువాత అవసరమైతే, రాజ్నాథ్ సభ్యుల అనుమానాలకు వివరణ ఇస్తారని వెల్లడించాయి. రాష్ట్రపతి, ప్రధాని కూడా.. చైనా టెక్నాలజీ కంపెనీ డేటా చౌర్యం అంశాన్ని బుధవారం కాంగ్రెస్ పార్లమెంట్ ఉభయసభల్లో లేవనెత్తింది. దాదాపు 10 వేల మంది ప్రముఖుల సమాచారంపై నిఘా వేశారన్న వార్త ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీతో, చైనా ప్రభుత్వంతో సంబంధాలున్న షెంజెన్ కేంద్రంగా ఉన్న ఒక టెక్నాలజీ కంపెనీ 10 వేల మంది భారతీయ ప్రముఖుల డిజిటల్ డేటాను ట్రాక్ చేస్తోందని పత్రికల్లో కథనం వచ్చిందని కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ వివరించారు. ఆ ప్రముఖుల్లో భారత రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, ఆర్మీ చీఫ్, ముఖ్యమంత్రులు ఉండడం షాక్కు గురిచేస్తోందన్నారు. డేటా చౌర్యంపై నిపుణుల కమిటీ భారత్లోని దాదాపు 10 వేల మంది ప్రముఖులపై చైనా టెక్నాలజీ సంస్థ నిఘాపెట్టి డేటా చౌర్యం చేస్తోందన్న ఆరోపణలపై కేంద్రం ఒక నిపుణుల కమిటీని నియమించింది. నేషనల్ సైబర్ సెక్యూరిటీ కో ఆర్డినేటర్ నేతృత్వంలో ఈ కమిటీ ఈ ఆరోపణల్లోని నిజానిజాలను నిర్ధారిస్తుంది. -
మళ్లీ చైనా కాల్పులు
న్యూఢిల్లీ/జమ్మూ: భారత సైనికులను బెదిరించే ఉద్దేశంతో ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర తీరం వద్ద చైనా సైనికులు గతవారం మరోసారి గాలిలో కాల్పులు జరిపారు. భారత్, చైనా దేశాల విదేశాంగ మంత్రులు జైశంకర్, వాంగ్ యిల మధ్య రష్యా రాజధాని మాస్కోలో చర్చలు జరగడానికి ముందు ఫింగర్ 4 రిడ్జ్లైన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. వ్యూహాత్మకంగా కీలకమైన ఆ ప్రాంతంలో ఉన్న భారత జవాన్ల వైపు భారీ సంఖ్యలో చైనా సైనికులు దూకుడుగా వచ్చారని, అయితే, భారత జవాన్లు దీటుగా ఎదుర్కోవడంతో వెనక్కు వెళ్లారని వివరించాయి. వెనక్కు వెళ్తూ.. భారత సైనికులను బెదిరించేందుకు గాలిలో 100 నుంచి 200 రౌండ్లు కాల్పులు జరిపారని వెల్లడించాయి. 45 ఏళ్ల తరువాత తొలిసారి సెప్టెంబర్ 7న తూర్పు లద్దాఖ్లోని చైనా సరిహద్దుల్లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలోని రెజాంగ్ లా రిడ్జ్లైన్ వద్ద ఉన్న భారత జవాన్లను బెదిరించే లక్ష్యంతో చైనా సైనికులు గాలిలో పలు రౌండ్లు కాల్పులు జరిపారు. మనవాళ్లే మెరుగు తూర్పు లద్దాఖ్లో ప్రతికూల వాతావరణం ఉండే చలి కాలంలో కూడా.. చైనాతో పూర్తి స్థాయి యుద్ధానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ రిటైర్డ్ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. యుద్ధం తప్పని పరిస్థితులనే చైనా కల్పిస్తే.. సుశిక్షితులైన, సంసిద్ధంగా ఉన్న, మానసికంగా ధృఢంగా ఉన్న భారత బలగాలను వారు ఎదుర్కోవాల్సి ఉంటుందని బ్రిగేడియర్(రిటైర్డ్) హేమంత్ మహాజన్ హెచ్చరించారు. మానసికంగా, శారీరకంగా చైనా సైనికుల కన్నా.. భారత జవాన్లు దృఢమైనవారన్నారు. చైనా సైనికులు ప్రధానంగా పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన సున్నితమైన వారని, విధుల్లో భాగంగా సంక్లిష్ట క్షేత్ర పరిస్థితుల్లో ఎక్కువకాలం ఉన్నవారు కాదని వివరించారు. మొదట బుధవారం ఉదయం ఈ ప్రకటన భారత సైన్యం నార్తర్న్ కమాండ్ ప్రజా సంబంధాల అధికారి(పీఆర్ఓ) నుంచి మీడియాకు వచ్చింది. కానీ, ఆ తరువాత ఆ ప్రకటనలోని అంశాలు నార్తర్న్ కమాండ్ లేదా ఇండియన్ ఆర్మీ అభిప్రాయాలు కావని ఆ పీఆర్ఓ వివరణ ఇచ్చారు. ఈ వివరాలన్నీ పదవీ విరమణ చేసిన బ్రిగేడియర్ హేమంత్ మహాజన్వని వివరించారు. శాంతి, సుస్థిరతకు కట్టుబడి ఉన్నాం భారత్ సరిహద్దుల్లో శాంతి, సుస్థిరతకు కట్టుబడి ఉన్నామని చైనా ప్రకటించింది. భారత్తో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలను గౌరవిస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో తమ దేశ సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లోక్సభలో చేసిన ప్రకటనపై స్పందించాలన్న మీడియా ప్రశ్నకు.. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ బుధవారం పై విధంగా స్పందించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు తాము కారణంకాదని చైనా తెలిపింది. దీర్ఘకాల మోహరింపునకు సిద్ధం బ్రిగేడియర్(రిటైర్డ్) హేమంత్ మహాజన్ వాదన ప్రకారం.. సరిహద్దుల్లో దీర్ఘకాలం మోహరించేందుకు భారత దళాలు సిద్ధమై ఉన్నాయి. లద్దాఖ్ అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలున్న ప్రాంతం. ఇక్కడ నవంబర్ తరువాత 40 అడుగుల వరకు మంచు పేరుకుపోయే పరిస్థితి ఉంటుంది. మైనస్ 30 నుంచి మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఇక్కడ సర్వసాధారణం. దానికి తోడు చలిగాలులు పరిస్థితిని మరింత దిగజారుస్తాయి. రోడ్లను మంచు కమ్మేస్తుంది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ.. భారత్కు ఉన్న సానుకూల అంశం సుశిక్షితులైన మన సైనికులే. చలి కాలంలో యుద్ధం సాగించేందుకు అవసరమైన అనుభవం మన సైనికులకు ఉంది. స్వల్ప వ్యవధిలోనే రంగంలోకి దిగగల మనోస్థైర్యం కూడా మనవారికి ఉంది. చైనా సరిహద్దుల కన్నా దారుణమైన వాతావరణ పరిస్థితులు ఉండే సియాచిన్లో నెలల తరబడి ఉన్న అనుభవం మన సైనికులకు ఉంది. లద్దాఖ్కు చేరుకునేందుకు ఇప్పటివరకు రెండు మార్గాలు ఉన్నాయి. తాజాగా ‘దార్చా టు లేహ్’ మార్గం అందుబాటులోకి రావడంతో యుద్ధ, సహాయక సామగ్రి తరలింపు మరింత సులభమైంది.పెద్ద సంఖ్యలో ఎయిర్బేస్లు ఉండటం భారత్కు కలసివచ్చే అంశం.