-
వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చు
వాషింగ్టన్: ఆర్థిక సంక్షోభ భయాలతో అమెరికాలో టెక్ కంపెనీలు హెచ్–1బీ వీసాదారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్న తరుణంలో వారి జీవితభాగస్వామి అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చని అమెరికా న్యాయమూర్తి ఒకరు తీర్పు చెప్పారు. దీంతో అమెరికాలో టెక్నాలజీ రంగంలో ఉద్యోగాలు పోయి ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొంటున్న వేలాది మంది భారతీయ టెకీలకు పెద్ద ఊరట లభించినట్లయింది. అమెరికాలో ప్రత్యేక ఉపాధి, నైపుణ్య వృత్తుల్లోకి తీసుకునేందుకు అక్కడి కంపెనీలు నాన్ ఇమిగ్రెంట్ హెచ్–1బీ వీసాలతో భారత్వంటి దేశాలకు చెందిన విదేశీ నిపుణులకు కొలువులు కల్పిస్తున్న విషయం విదితమే. అయితే ఇలా ఏటా వేలాదిగా తరలివస్తున్న హెచ్–1బీ వీసాదారులు, వారి భాగస్వాముల కారణంగా స్థానిక అమెరికన్లు ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని సేవ్ జాబ్స్ యూఎస్ఏ అనే సంస్థ వాషింగ్టన్లోని జిల్లా కోర్టులో దావా వేసింది. హెచ్–1బీ వీసాదారుల జీవితభాగస్వాములూ జాబ్ కార్డ్ సాధించి ఉద్యోగాలు చేసేందుకు వీలు కల్పిస్తున్న ఒబామా కాలంనాటి నిబంధనలను కొట్టేయాలని సంస్థ కోరింది. ఈ దావాను అమెజాన్, ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బడా కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇప్పటికే అమెరికా ప్రభుత్వం హెచ్–1బీ వీసాదారుల దాదాపు లక్ష మంది జీవితభాగస్వాములకు పని చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ కేసును మార్చి 28వ తేదీన జిల్లా మహిళా జడ్జి తాన్య చుత్కాన్ విచారించారు. ‘అమెరికా ప్రభుత్వం పూర్తి బాధ్యతతోనే వారికి వర్క్ పర్మిట్ ఇచ్చింది. వీరితోపాటే వేర్వేరు కేటగిరీల వారికీ తగు అనుమతులు ఇచ్చింది. విద్య కోసం వచ్చే వారికి, వారి జీవిత భాగస్వామికి, వారిపై ఆధారపడిన వారికి హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఉపాధి అనుమతులు కల్పించింది. విదేశీ ప్రభుత్వాధికారులు, అంతర్జాతీయ సంస్థల అధికారులు, ఉద్యోగుల జీవితభాగస్వాములకూ అనుమతులు ఉన్నాయి’ అంటూ సేవ్ జాబ్స్ యూఎస్ఏ పిటిషన్ను జడ్జి కొట్టేశారు. అయితే తీర్పును ఎగువ కోర్టులో సవాల్ చేస్తామని సంస్థ తెలిపింది. అభినందనీయం ‘ఉద్యోగాలు పోయి కష్టాల్లో ఉన్న హెచ్–1బీ హోల్డర్ల కుటుంబాలకు ఈ తీర్పు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. వలసదారుల హక్కుల సమానత్వ వ్యవస్థ సాధనకు ఇది ముందడుగు’ అని వలసదారుల హక్కులపై పోరాడే భారతీయ మూలాలున్న అమెరికా న్యాయవాది అజయ్ భుటోరియా వ్యాఖ్యానించారు. గత ఏడాది నవంబర్ నుంచి చూస్తే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమెజాన్సహా అమెరికాలోని చాలా ఐటీ కంపెనీలు దాదాపు 2,00,000 మంది ఉద్యోగులను తొలగించాయని ‘ది వాషింగ్టన్ పోస్ట్’ తన కథనంలో పేర్కొనడం తెల్సిందే. ఇలా ఉద్యోగాలు పోయిన వారిలో 30–40 శాతం మంది భారతీయ ఐటీ నిపుణులే కావడం విషాదం. -
ఇండియన్ టెక్కీలకు ఊరట.. హెచ్-1బీ వీసాలపై యూఎస్ కోర్ట్ కీలక తీర్పు
అమెరికాలోని ఇండియన్ టెక్కీలకు ఊరట నిస్తూ హెచ్-1బీ వీసాలపై యూఎస్ కోర్ట్ కీలక తీర్పు ఇచ్చింది. యూఎస్ టెక్ సెక్టార్లోని విదేశీ ఉద్యోగులకు పెద్ద ఉపశమనంగా హెచ్-1బి వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములు అమెరికాలో పని చేయవచ్చని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. కొన్ని వర్గాల హెచ్-1బీ వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములకు ఉపాధి అధికార కార్డులను ఇచ్చే ఒబామా కాలం నాటి నిబంధనలను కొట్టివేయాలని సేవ్ జాబ్స్ యూఎస్ఏ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టివేసింది. (ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. ఇక పదేళ్లూ అంతంతే!) సేవ్ జాబ్స్ యూఎస్ఏ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని అమెజాన్ , యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ కంపెనీలు కూడా వ్యతిరేకించాయి. హెచ్-1బీ వర్కర్ల జీవిత భాగస్వాములకు యూఎస్ ఇప్పటివరకు దాదాపు లక్ష వర్క్ ఆథరైజేషన్ కార్డులు జారీ చేసింది, వీరిలో గణనీయమైన సంఖ్యలో భారతీయులు ఉన్నారు. హెచ్-1బీ వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములు ఉద్యోగాలు చేసుకునేలా కోర్టు ఇచ్చిన తీర్పుపై అక్కడి ప్రముఖ కమ్యూనిటీ నాయకుడు, వలసదారుల హక్కుల కోసం పోరాడే న్యాయవాది అజయ్ భూటోరియా హర్షం వ్యక్తం చేశారు. అయితే కోర్టు తీర్పుపై అప్పీల్ వెళ్లనున్నట్లు సేవ్ జాబ్స్ యూఎస్ఏ తెలిపింది. (గంగూలీ ముద్దుల తనయ.. అప్పుడే ఉద్యోగం చేస్తోంది.. జీతమెంతో తెలుసా?) -
పర్యాటక వీసాతోనూ ఉద్యోగ దరఖాస్తులు: అమెరికా
వాషింగ్టన్: మాంద్యం దెబ్బకు అమెరికాలో ఉద్యోగం కోల్పోయి కొత్త కొలువు దొరక్క దేశం వీడాల్సి వస్తుందేమోనని ఆందోళన పడుతున్న హెచ్–1బి వీసాదారులకు, ముఖ్యంగా భారత టెకీలకు భారీ ఊరట! బిజినెస్ (బి–1), పర్యాటక (బి–2) వీసాదారులు కూడా అమెరికాలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకూ హాజరు కావచ్చని ఆ దేశ పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్సీఐఎస్) పేర్కొంది. ‘‘అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన వారు 60 రోజుల్లోపు మరో ఉద్యోగం చూసుకోలేని పక్షంలో అమెరికా వీడటం తప్ప మరో మార్గంలేదనే అపోహలో ఉన్నారు. మరింత కాలం దేశంలో ఉండేందుకు వారికి పలు మార్గాలున్నాయి. 60 రోజుల్లోపు వీసా స్టేటస్ను (బి–1, బి–2కు) మార్చుకుంటే ఆ గ్రేస్ పీరియడ్ ముగిశాక కూడా అమెరికాలో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలను కొనసాగించుకోవచ్చు’’ అని వివరించింది. అయితే ఉద్యోగం దొరికాక అందులో చేరేలోపు వీసా స్టేటస్ను తదనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ విషయమై పలువురు వెలిబుచ్చిన పలు సందేహాలకు సమాధానంగా సంస్థ ఈ మేరకు ట్వీట్ చేసింది. బి–1 వీసాను స్వల్పకాలిక బిజినెస్ ప్రయాణాలకు, బి–2ను ప్రధానంగా పర్యాటక అవసరాలకు అమెరికా జారీ చేస్తుంటుంది. మాంద్యం దెబ్బకు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా పలు దిగ్గజ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఇలా గత నవంబర్ నుంచి అమెరికాలోనే 2 లక్షల మందికి పైగా నిరుద్యోగులయ్యారు. వీరిలో కనీసం లక్ష మంది భారతీయులేనని అంచనా! -
అమెరికాలో మన టెకీల మెడపై... ‘గడువు’ కత్తి!
వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన హెచ్–1బీ ప్రొఫెషనల్స్ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోందని ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పొరా స్టడీస్ (ఎఫ్ఐఐడీఎస్) ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘సదరు కుటుంబాలకు ఇది పెను సంక్షోభం. వారికి చూస్తుండగానే సమయం మించిపోతోంది. అమెరికాలో పుట్టిన తమ పిల్లలను వెంటపెట్టుకుని వారి త్వరలో దేశం వీడాల్సిన పరిస్థితులు దాపురించాయి’’ అంటూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉద్యోగం పోయిన 60 రోజుల గ్రేస్ పీరియడ్లోగా మరో ఉద్యోగం గానీ, ఉపాధి గానీ చూసుకోని పక్షంలో అమెరికా వీడాల్సి ఉంటుంది. జాబ్ మార్కెట్ అత్యంత ప్రతికూలంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అంత తక్కువ సమయంలో మరో ఉద్యోగం వెతుక్కోవడం చాలామందికి దాదాపుగా అసాధ్యంగా మారుతోంది. దొరికినా అత్యంత సంక్లిష్టంగా ఉన్న హెచ్–1బీ మార్పు తదితర నిబంధనల ప్రక్రియను గ్రేస్ పీరియడ్లోపు పూర్తి చేయడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో దాన్ని కనీసం 180 రోజులకు పెంచాలంటూ ఆసియా అమెరికన్ల వ్యవహారాలకు సంబంధించిన అధ్యక్షుని సలహా కమిటీ ఇటీవలే సిఫార్సు చేయడం తెలిసిందే. ‘‘దీనిపై ప్రభుత్వం తక్షణం స్పందించి చర్యలు తీసుకున్నా అవి ఆమోదం పొంది అమల్లోకి రావడానికి సమయం పడుతుంది. ఈలోపు 60 రోజుల గ్రేస్ పీరియడ్ పూర్తయ్యే వారికి నిస్సహాయంగా దేశం వీడటం మినహా మరో మార్గం లేదు’’ అంటూ ఎఫ్ఐఐడీఎస్ ఆవేదన వెలిబుచ్చింది. ఈ నేపథ్యంలో గ్రేస్ పీరియడ్ పెంపు సిఫార్సును పరిశీలించి నిర్ణయం తీసుకునే ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసింది. భారీగా ఉద్వాసనలు...: గూగుల్, మైక్రోసాఫ్ట్ మొదలుకుని పలు దిగ్గజ కంపెనీలు కొన్నాళ్లుగా భారీగా ఉద్యోగుల తొలగింపు బాట పట్టడం తెలిసిందే. దాంతో గత నవంబర్ నుంచి అమెరికాలో కనీసం 2.5 లక్షల మందికి పైగా ఐటీ తదితర ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. ‘‘వీరిలో దాదాపు లక్ష మంది దాకా భారతీయులేనని అంచనా. ఆదాయ పన్ను చెల్లించే హెచ్–1బి ఇమిగ్రెంట్లయిన వీరు 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగం వెదుక్కుని సదరు కంపెనీ ద్వారా హెచ్–1బికి దరఖాస్తు చేసుకోలేని పక్షంలో దేశం వీడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు’’ అని ఎఫ్ఐఐడీఎస్ పేర్కొంది. -
గ్రేస్ పీరియడ్: హెచ్1బీ వీసాదారులకు భారీ ఊరట!
వాషింగ్టన్: మాంద్యం దెబ్బకు అమెరికాలో వరుసపెట్టి ఉద్యోగాలు కోల్పోతున్న హెచ్-1బి ఉద్యోగులకు ఊరట. ఉద్యోగం పోయిన రెండు నెలల్లోపే కొత్త కొలువు వెతుక్కోవాలన్న నిబంధనను సడలించి గ్రేస్ పీరియడ్ను ఆర్నెల్లకు పెంచాలని అధ్యక్షుని సలహా సంఘం సిఫార్సు చేసింది. తద్వారా కొత్త ఉపాధి అవకాశం వెతుక్కునేందుకు వారికి తగినంత సమయం దొరుకుతుందని అభిప్రాయపడింది. దీనికి అధ్యక్షుని ఆమోదం లభిస్తే కొన్నాళ్లుగా అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్న వేలాది భారత టెకీలకు భారీ ఊరట కలగనుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్తో పాటు పలు దిగ్గజ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత నిబంధనల మేరకు వారంతా 60 రోజుల్లోగా మరో ఉపాధి చూసుకోలేని పక్షంలో అమెరికా వీడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గ్రేస్ పీరియడ్ను 180 రోజులకు పెంచాల్సిందిగా సిఫార్సు చేసినట్టు ఆసియా అమెరికన్లు తదితరులపై అధ్యక్షుని సలహా సంఘం సభ్యుడు అజన్ జైన్ భుటోరియా వెల్లడించారు. అమెరికాలో 2022 నవంబర్ నుంచి రెండు లక్షలకు పైగా ఐటీ నిపుణులు ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో ఏకంగా 80 వేల మంది భారతీయులేనని అంచనా! గ్రీన్కార్డు దరఖాస్తుదారులకు ఊరట! మరోవైపు, ఈబీ-1, ఈబీ-2, ఈబీ-3 కేటగిరీల్లో ఆమోదిత ఐ-140 ఉపాధి ఆధారిత వీసా పిటిషన్లుండి, ఐదేళ్లకు పైగా గ్రీన్కార్డు దరఖాస్తు పెండింగ్లో ఉన్నవారికి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్లు (ఈఏడీ) జారీ చేయాలని అధ్యక్షుని సలహా కమిటీ తాజాగా ప్రతిపాదించింది. ఇందుకు ఆమోదం లభిస్తే ఇమిగ్రెంట్ వారి వీసా దరఖాస్తులపై తుది నిర్ణయం వెలువడేదాకా అమెరికాలో వృత్తి, ఉద్యోగాలు కొనసాగించుకునేందుకు వీలు కలుగుతుందని కమిటీ సభ్యుడు అజన్ జైన్ భుటోరియా తెలిపారు. -
ఉద్యోగం ఒక్కటే కాదు.. అమెరికాలో అసలుకే మోసం
గత కొద్ది రోజులుగా అమెరికాలో ఉద్యోగాలు పోగోట్టుకున్న వారికి ఎలాంటి ఊరట లేదని యూఎస్సీఐఎస్(USCIS), మరియు అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ( US Department of Homeland Security) తేల్చిచెప్పింది. హెచ్1బీ(H1B) వీసా మీద అమెరికాకు వచ్చి ఉద్యోగం చేస్తున్న వాళ్లు ఎవరైనా లేఆఫ్ కింద ఉద్యోగం పోతే కేవలం 60 రోజులు మాత్రమే వారు ఆ దేశంలో ఉండవచ్చు. ఒక వేళ 60 రోజుల్లో మరో ఉద్యోగం రాకపోతే.. తక్షణం అమెరికా వీడాల్సి ఉంటుంది. ఒక వేళ అమెరికా వదలి వెళ్లకపోతే వాళ్లు చట్ట విరుద్ధంగా ఉన్నారన్నముద్ర పడుతుంది. ఈ మేరకు యూఎస్ హౌజ్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ (US House of Representatives) కు సిటిజన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తరపున ఆ సంస్థ డైరెక్టర్ జడ్డో ఒక లేఖ రాశారు. 60 రోజుల గ్రేస్ పీరియడ్ను యూఎస్సీఐఎస్ అమెరికా ప్రభుత్వం పెంచవచ్చన్న ఊహాగానాలకు ఇప్పుడు తెరపడినట్టయింది. -
హెచ్–1బీ, ఎల్1 రెన్యువల్ ఇక అమెరికాలోనే
వాషింగ్టన్: ‘డొమెస్టిక్ వీసా రీవాలిడేషన్’ ప్రక్రియను పునఃప్రారంభించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అమెరికాలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, ప్రధానంగా భారతీయులకు ఎక్కువ మేలు జరుగనుంది. హెచ్–1బీ, ఎల్1 వంటి నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాల గడువు ముగిస్తే స్వదేశానికి తిరిగి వెళ్లి, రెన్యువల్ చేసుకోవాల్సిన పని ఉండదు. అమెరికాలోనే ఆ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. 2004 వరకూ నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాల రెన్యువల్, ఎక్సటెన్షన్ స్టాంపింగ్ను అమెరికాలోనే చేసేవారు. తర్వాత ఈ విధానాన్ని రద్దుచేశారు. ఇప్పుడు పునరుద్ధరించబోతున్నారు. త్వరలోనే ఇది అమల్లోకి రాబోతోంది. -
అమెరికాలో నివసిస్తున్న ఇండియన్ ఐటీ ఉద్యోగులకు శుభవార్త!
ఆర్ధిక మాంద్యం దెబ్బకు చేస్తున్న ఉద్యోగాలకు గ్యారెంటీ లేదు. దీంతో బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్న భారతీయులకు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు అమెరికా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ‘దేశీయ వీసా రీవాలిడేషన్’ పేరుతో హెచ్-1బీ, ఎల్1 వీసాలను అమెరికాలోనే పునరుద్దరించే అవకాశం కల్పించింది. ఈ నిర్ణయం అమెరికాలో లేఆఫ్స్కు గురై.. కొత్త జాబ్ కోసం అన్వేషిస్తున్న వారికి భారీ ఊరట కలగనుంది. 2004 కి ముందు వీసా పునరుద్ధరణ లేదా స్టాంపింగ్ కోసం అమెరికాను విడిచి బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారడం, మార్పులు చేయడంతో హెచ్-1బీ వీసా దారులు రెన్యువల్ కోసం తమ సొంత దేశానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి యూఎస్ కాన్సులేట్ కార్యాలయాల్లో వీసా పొడిగింపు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనివల్ల నెలల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. ముఖ్యంగా ఉద్యోగుల తొలగింపులతో ఈ సమస్యను పరిష్కరించాలని జోబైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. వీసా ఉంటేనే ఎంట్రీ లేఆఫ్స్ గురైన ఉద్యోగులు వీసా పునరుద్దరించేందుకు సమయం పడుతుంది. ఆ లోగా వీసా గడువు దాటితే దేశం వదిలి వెళ్లి పోవాలి. లేదంటే కొత్త ఉద్యోగం వెతుక్కొని వీసా రెన్యూవల్ చేయించుకోవాలి. అక్కడే వీసా లబ్ధి దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు వీసా రెన్యూవల్, ఉన్న ఉద్యోగం పోయి కొత్త ఉద్యోగం దొరుకుతుందా? లేదా? అన్న సందిగ్ధంతో ఆందోళన చెందుతున్నారు. జోబైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి ఈ ఆందోళనలపై అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు జోబైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. వీసాల రెన్యూవల్ విషయంలో మార్పులు చేయాలని కోరుతున్నారు. ఈ తరుణంలో వీసాల విషయంలో జోబైడెన్ ప్రభుత్వం విధించిన నిబంధనల్ని సడలించింది. వీసా రెన్యూవల్ కోసం కొత్త కొత్త పథకాల్ని అందుబాటులోకి తెస్తుంది. తాజాగా అమెరికా ప్రభుత్వం వీసా రెన్యూవల్ను చేసేందుకు పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించనున్నట్లు తెలిపింది. విదేశీ ఉద్యోగులు వీసా రెన్యూవల్లో ఇబ్బందులు పడకుండా వీసాల పునరుద్దరణ (రెన్యూవల్), స్టాంపింగ్ చేసేందుకు సిద్ధమైంది. ఇబ్బందుల్ని తొలగించాలనే సాధారణంగా ఆయా రంగాల్లో నిపుణులైన భారతీయులు అమెరికాలో ఉద్యోగం చేయాలంటే వారికి హెచ్-1బీ వీసా తప్పని సరి. ఆ వీసాలను అమెరికన్ కంపెనీలు అభ్యర్ధులు అందిస్తాయి. అందుకే ఆ వీసాలకు భారీ ఎత్తున డిమాండ్ ఉంది. ప్రతి ఏడాది ఆ వీసాలు పొందిన చైనా, భారతీయులు వేలల్లో అమెరికాకు వెళుతుంటారు. అక్కడి వెళ్లిన వారు వీసా గడువు ముగిసి.. రెన్యూవల్ చేయించుకునే సమయంలో అష్టకష్టాలు పడుతున్నారు. ఆ సమస్యల్ని అధిగమించేందుకు జోబైడెన్ ప్రభుత్వం నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా (ఎన్ఐవీ) కేటగిరీల వీసా సేవల్ని పునఃప్రారంభించే ప్రణాళికలపై తీవ్రంగా కృషి చేస్తుంది.ఈ ఏడాది చివర్లో పైలట్ను ప్రాజెక్ట్ను ప్రారంభిస్తాం. వీసాలను పునరుద్ధరించడానికి దరఖాస్తుదారులు విదేశాలకు వెళ్లే అవసరాన్ని తగ్గిస్తుంది’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఎన్ని వీసాలో చెప్పలేం వీసాలను ఎన్ని పునరుద్దరిస్తారని విషయంపై యూఎస్ కాన్సులేట్ అధికారులు మాట్లాడుతూ.. వీసా రెన్యూవల్ ప్రాజెక్ట్ ప్రారంభంలో ఎంత మంది వీసా హోల్డర్లు అర్హులు అవుతారనే దానిపై స్పష్టత ఇవ్వలేం. తక్కువ సంఖ్యలో ప్రారంభించింది. దశల వారీ వీసాల జారీని పెంచుకుంటూ వెళతామని అన్నారు. -
మార్చి 1 నుంచి హెచ్1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ
వాషింగ్టన్: భారతీయ ఐటీ నిపుణులకు శుభవార్త. 2023–24 సంవత్సరానికి గాను మార్చి ఒకటో తేదీ నుంచి హెచ్1బీ వీసాలకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అమెరికా ఇమిగ్రేషన్ విభాగం ఆదివారం తెలిపింది. మార్చి 17వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం ఉంటుందని, మార్చి 31కల్లా వీసా హోల్డర్ల పేర్లను ప్రకటిస్తామని పేర్కొంది. అమెరికా కంపెనీల్లో పనిచేసే విదేశీ సాంకేతిక నిపుణులకు ఇచ్చే నాన్–ఇమిగ్రాంట్ వీసా హెచ్1బీ. ఏడాదికి 85 వేల వరకు హెచ్1బీ వీసాలను మంజూరు చేస్తుంటారు. ఇందులో అత్యధికంగా లాభపడేది భారత్, చైనా దేశస్తులే. టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి రంగాలకు చెందిన ఈ వీసా దారులు ఆరేళ్ల వరకు అమెరికాలో ఉండి పని చేసుకునేందుకు వీలుంటుంది. ఆరేళ్ల తర్వాత శాశ్వత నివాసం లేదా గ్రీన్కార్డుకు అర్హులవుతారు. -
హెచ్1బీ వీసా ఫీజుల బాదుడు !
వాషింగ్టన్: హెచ్–1బీ వీసా దరఖాస్తు సహా అన్ని ఇమిగ్రేషన్ ఫీజుల మోత మోగించేందుకు అమెరికా సిద్ధమైంది. సంబంధిత ప్రతిపాదనలను అమెరికా ఇమిగ్రేషన్ విభాగం ప్రచురించింది. 460 డాలర్లుగా ఉన్న హెచ్–1బీ వీసా దరఖాస్తు ధరను ఏకంగా 780 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించారు. వలసేతర వీసాల్లో భారతీయులు అధికంగా పొందే హెచ్–1బీ వీసా దరఖాస్తు ధరను భారీగా పెంచడంపై విమర్శలొస్తున్నాయి. మిగతా ఫీజులూ దాదాపు ఇలాగే భారీగా ఉన్నాయి. ఓ–1 దరఖాస్తు ధర 460 డాలర్ల నుంచి 1,055 డాలర్లకు పెంచనున్నారు. అంటే ఒక్కసారిగా 229 శాతం పెంపు అన్నమాట. ఎల్–1 ధరను 460 డాలర్ల నుంచి ఏకంగా 1,385 డాలర్లకు పెంచేయనున్నారు. అంటే ఏకంగా 332 శాతం పెరుగుదల. హెచ్–2బీ దరఖాస్తుల ధర 460 డాలర్ల నుంచి ఒకేసారి 1,080 డాలర్లకు చేరుకోనుంది. అయితే, ఇవి ప్రతిపాదనలు మాత్రమేనని మార్చి ఏడో తేదీలోపు వచ్చే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ధరలు మారుస్తామని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వివరణ ఇచ్చింది. ఒకవేళ ఈ ఫీజులు అమలైతే అదనంగా తీసుకునే బయోమెట్రిక్ సేవల ఫీజును రద్దుచేస్తామని ప్రతిపాదించింది. 2016 ఏడాది నుంచి ఇప్పటివరకు ఫీజులు పెంచలేదని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వాదిస్తోంది. వీసా ఎదురుచూపులు తగ్గించేందుకు కృషి భారత్లో వీసా దరఖాస్తు దారులు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా చేస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ చెప్పారు. సుదీర్ఘకాలం వీసా కోసం ఎదురుచూస్తున్న వారి ఆందోళనను తాము అర్థం చేసుకుంటామన్నారు. వీసా దరఖాస్తుల పరిశీలనను చకచకా పూర్తి చేసేందుకుగాను విదేశాంగ శాఖ సిబ్బంది పెంచామన్నారు. -
Surbhi Gupta: ‘మీ ఉద్యోగం పోయింది కదా..మీకెలా అనిపిస్తుంది?’
అమెరికాతో పాటు అనేక దేశాల్లో ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఆయా సంస్థలు పొదుపు మంత్రం జపిస్తున్నాయి. అమెరికా టెక్ సంస్థలు ఉద్యోగులతో పాటు వలసేతర హెచ్1బి వీసా హోల్డర్లని విధుల నుంచి తొలగిస్తున్నాయి. వారిలో మెటాలో ప్రొడక్ట్ మేనేజర్ పనిచేస్తున్న సురభిగుప్తా ఒకరు. తాజాగా మెటాలో ఉద్యోగం కోల్పోవడంపై జర్నలిస్ట్ సవితా పటేల్తో మాట్లాడారు. మెటాలో ఉద్యోగం, లేఫ్స్పై హెచ్ 1 బీ వీసాపై ఆమె మనోగతం ఏంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ఆ రోజు మా అమ్మ పుట్టిన రోజు. ఆమెకు శుభాకాంక్షలు చెప్పేందుకు ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో మెటా ఉద్యోగుల్ని తొలగించడం ప్రారంభించింది. లేఆఫ్స్పై నాతో పాటు నా సహచర ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మరుసటి రోజు ఉదయం 6 గంటల (స్థానిక కాలమానం) మెటా నుంచి మెయిల్. ఉద్యోగం నుంచి నన్ను తొలగించారని. ఈ ఏడాది ప్రారంభంలో మెటాలో ప్రొడక్ట్ మేనేజర్గా చేరాను. నా విధుల్ని నేను చక్కగా నిర్వర్తిస్తా. నా ఉద్యోగం పోయిందని తెలిసి నా టీమ్ సభ్యులు షాక్గురయ్యారు. ఉద్యోగం కోల్పోయారు కదా మీకెలా అనిపించింది నా స్కూల్ డేస్లో ఓ టీచర్ ఎప్పుడూ ఒక మాట చెప్పే వారు. వర్క్ ఈజ్ వర్షిప్. అదే మోటోతో పనిచేస్తున్నాను. కానీ నా ఉద్యోగం పోయిందని తెలిసి టైటానిక్ షిప్లా మునిపోతున్నట్లు అనిపించింది. మెయిల్, ఆ తర్వాత ల్యాప్టాప్ యాక్సెస్ కోల్పోయాను. అందుకు విరుద్ధంగా లింక్డ్ ఇన్లో చాలా మంది సహోద్యోగులు, మాజీ సహోద్యోగులు, స్నేహితులు ఇలా చాలా మంది నాకు మద్దతుగా నిలిచారు. నాకు అప్పుడే అనిపించింది నా అనేవాళ్లు ఈ దేశంలో చాలా మంది ఉన్నారని. మార్చి వరకే డెడ్లైన్ ఇక మెటాలో నా లాస్ట్ వర్క్ డే జనవరి వరకు ఉంది. నాకు హెచ్1 -బీ వీసా (అమెజరికాలోని సంస్థలు ఆరు సంవత్సరాల వరకు విదేశీయులను నియమించుకోవడానికి అనుమతించే నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా) తో మరో 60 రోజులు యూఎస్లో ఉండొచ్చు. కాబట్టి మార్చి ప్రారంభం వరకు మరో ఉద్యోగం వెతుక్కునేందుకు సమయం ఉంది. ఉద్యోగం వెతుక్కోవడం కొంచెం కష్టమే డిసెంబరులో సెలవుల కారణంగా ఉద్యోగం వెతుక్కోవడం కొంచెం కష్టమే. కానీ మరో ఉద్యోగంలో చేరే విషయంలో చాలా పట్టుదలతో ఉన్నాను. అనుకున్నది సాధిస్తా. ‘ఔర్ కుచ్ అచ్చా మిల్ జాయేగా’ జీవితంతో ఎప్పుడు రాజీ పడకూడదు. అనుకున్నది సాధించేలా సంక్షోభంలోనూ అవకాశాల్ని ఎలా చేజిక్కించుకోవాలి నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు. అంతేకాదు ఇప్పుడు మనం ఒకటి కోల్పోయామంటే భవిష్యత్లో ('ఔర్ కుచ్ అచ్చా మిల్ జాయేగా') ఇంతకంటే మంచి అవకాశం దొరుకుతుందని చెప్పేవారు. మెటా నన్ను ఫైర్ చేసిన తర్వాత మరో జాబ్ కోసం ప్రయత్నాలు ప్రారంభించా. హెచ్1-బీ వీసాపై ఆధారపడి ఉంది కానీ అమెరికాలో పని చేయడం, ఇక్కడ ఉండే హక్కు నా హెచ్1-బీ వీసాపై ఆధారపడి ఉంటుంది. నేను 2009లో యుఎస్కి వచ్చా. ఎవరి ప్రోత్సాహాం లేకుండా స్వశక్తి, తెలివి తేటలతో నా కెరియర్ను నిలబెట్టుకున్నాను. అందుకోసం ఏళ్ల తరబడి కష్టపడ్డాను. టెస్లా, ఇన్ట్యూట్ (Intuit) వంటి కంపెనీల్లో పనిచేశా. మంచి మంచి ప్రొడక్ట్లను తయారు చేశా. టాప్ రేటింగ్లో పనిచేశా. పన్నులు చెల్లించా. ఇక్కడి (యూఎస్) ఆర్థిక వ్యవస్థకు 15 సంవత్సరాలకు పైగా సహకరించాను. ఇక్కడే పర్మినెంట్ నివసించే హక్కు పొందాను. నేను మిస్ భారత్ కాలిఫోర్నియా అందాల పోటీల్లో నా ఆరాధ్య, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ చేతుల మీదిగా కిరీటం పొందాను. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్లో ర్యాంప్పై నడిచాను. టెక్ కంపెనీల ఉద్యోగాల తొలగింపుపై అమెరికా టెక్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు భారతీయుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయినా సరే మెటా, అమెజాన్, ట్విట్టర్ లే ఆఫ్లు భారతీయులు అమెరికాకు రావాలని, ఇక్కడే స్థిరపడాలన్న కలల్ని నాశనం చేయవు’ అంటూ సురభిగుప్తా తన మనోగతాన్ని వివరించారు. చదవండి👉 ప్చ్, పాపం..మెటాలో ‘సురభిగుప్తా’ ఉద్యోగం ఊడింది! -
రూ.13 వేలు కడితే అమెరికా హెజ్1బీ వీసా..! ఇలాంటి స్కామర్లతో జర భద్రం..
ఆన్లైన్లో సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలతో మోసాలకు పాల్పడుతూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా ఓ లింక్డ్ఇన్ యూజర్ స్కామర్లు వీసాలు ఇప్పిస్తామని రూ.లక్షలు కాజేస్తున్న విషయాన్ని వెల్లడించాడు. అమెరికా హెచ్1బీ వీసా ఇప్పిస్తామని 160 డాలర్లు(రూ.13వేలు) కడితే దరఖాస్తు ప్రక్రియ మొదలు పెడుతామని సందేశాలు పంపుతున్నారని పేర్కొన్నాడు. ఓ టాప్ సోడా కంపెనీల పేరుతో ఈ ఆఫర్ లెటర్ పంపుతున్నారని చెప్పాడు. మొదట రూ.13వేలే అని చెప్పినా ఆ తర్వాత ఆశావాహుల నుంచి లక్షలు కాజేస్తున్నారని వివరించాడు. ఈ స్కామర్లు పంపే ఈ-మెయిళ్లు ప్రపంచంలోని టాప్ 500 కంపెనీల పేరుతో కూడా ఉంటాయని సదరు వ్యక్తి వివరించాడు. మీకు నమ్మకం కల్పించేందుకు వాళ్లు డమ్మీ ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తారని పేర్కొన్నాడు. ఇలాంటి స్కామర్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. నిజంగా జాబ్ ఆఫర్ ఇచ్చే ఏ సంస్థ అయినా డబ్బులు వసూలు చేయదు. కాబట్టి ఇలాంటి ఆన్లైన్ మోసగాళ్ల చేతిలో మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని లింక్డ్ఇన్ యూజర్ సూచించాడు. చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. వాటికి చెక్, ఈ–కామర్స్ కంపెనీలు ఇలా చేయాల్సిందే! -
హెచ్ - 1బీ వీసా: భారతీయులకు భారీ ఉపశమనం
అమెరికా వీసాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న భారతీయులకు భారీ ఉపశమనం కలగనుంది. వచ్చే ఏడాది జూన్ లేదా జులై తర్వాత వీసాల మంజూరుకయ్యే రోజులు బాగా తగ్గిపోతాయని, నెలకి లక్ష వీసాలు మంజూరు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయంలో మినిస్టర్ కాన్సులర్ డాన్ హెఫ్లిన్ తెలిపారు. ఇక వీసాల అనుమతులు,స్లాట్ల గురించి వెల్లడించారు. అవేంటో తెలుసుకుందాం. ♦ రాయబార కార్యాలయంలో లక్ష హెచ్ - 1బీ వీసాలకు డ్రాప్బాక్స్ను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇప్పటికే 26 వేల స్లాట్స్ బుక్ చేసుకునే అవకాశం ఉంది ♦ హెచ్-1బీ, బీ1/ బీ2 డ్రాప్ బాక్స్ కోసం వేచి ఉండే సమయాన్ని 9 నెలలకు తగ్గించగలిగాం. ♦ ఎంబసీ ఉద్యోగులు, ఇతర ఉన్నతాధికారులు వీసాల అనుమతి కోసం సంబంధిత అధికారులకు అప్లికేషన్లను నిర్విరామంగా పంపిస్తున్నారు. ♦ వచ్చే ఏడాది మే నెల నుంచి హెచ్-1బీ వీసా డ్రాప్ బాక్స్కోసం వేచి చూసే సమయం 9 నెలల నుంచి 4 లేదా 5 నెలలకు తగ్గుతుందని, దశల వారిగా 3 నెలలు ఇలా సమయం తగ్గించే ప్రయత్నం చేస్తామని మినిస్టర్ కాన్సులర్ డాన్ హెఫ్లిన్ వివరించారు. #CNBCTV18Exclusive | #DropBox cases in categories of #student visas, H-1B & L visa & B1/B2 visas are a priority. 1,28,000 H-1B applicants in the queue for H-1B Drop Box applications, says Don Heflin, Minister Counselor for Consular Affairs pic.twitter.com/WapB7vPdtV — CNBC-TV18 (@CNBCTV18Live) November 22, 2022 -
మెటాలో వేల మందికి ఉద్వాసన: హెచ్1బీ వీసా హోల్డర్లలో కలవరం
న్యూఢిల్లీ: టెక్నాలజీ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. టెక్ పరిశ్రమకు సవాళ్లు పెరుగుతుండటం, ఆదాయాలు పడిపోతుండటం వంటి పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ మాతృసంస్థ మెటా 11,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. మెటా మొత్తం సిబ్బంది సంఖ్యలో ఇది 13 శాతం. ఉద్యోగులకు రాసిన లేఖలో సంస్థ సీఈవో మార్క్ జుకర్బర్గ్ ఈ విషయాలు వెల్లడించారు. ‘కోవిడ్ మహమ్మారి తర్వాత కూడా భారీ వృద్ధి ఉంటుందనే అంచనాతో పెద్ద యెత్తున ఉద్యోగులను తీసుకున్నాం. దురదృష్టవశాత్తు నేను ఊహించిన విధంగా జరగలేదు. (రూ.2 వేల నోట్లు: షాకింగ్ ఆర్టీఐ రిప్లై) ఆన్లైన్ కామర్స్ మళ్లీ పాత స్థాయికి వచ్చేసింది. స్థూల ఆర్థిక మందగమనం, పెరిగిన పోటీ, ప్రకటనలు తగ్గడం వంటి కారణాలతో ఆదాయాలు నేను ఊహించిన దానికన్నా తగ్గాయి. నేను పరిస్థితిని తప్పుగా అంచనా వేశాను. దీనికి బాధ్యుణ్ని నేనే‘ అని ఆయన పేర్కొన్నారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో కూడా కోతల పర్వం నడుస్తున్న నేపథ్యంలో మెటాలోనూ ఉద్వాసనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ మొదలైనవి మెటాలో భాగంగా ఉన్నాయి. తీసివేస్తున్న ఉద్యోగులకు ఈమెయిల్స్ వస్తాయని, వారికి కంపెనీ సిస్టమ్స్ ఇక అందుబాటులో ఉండవని జుకర్బర్గ్ తెలిపారు. మాజీ ఉద్యోగులకు 16 వారాల బేసిక్ పేతో పాటు కంపెనీలో పని చేసిన ప్రతి ఏడాదికిగాను 2 వారాల జీతం లభిస్తుంది. 6 నెలల పాటు వారితో పాటు వారి కుటుంబ సభ్యులకూ హెల్త్ ఇన్సూరెన్స్ పని చేస్తుంది. ఇదీ చదవండి: క్యూ కడుతున్న టాప్ కంపెనీలు: అయ్యయ్యో ఎలాన్ మస్క్! టెక్ సంస్థలకు సవాళ్లు.. కోవిడ్ సమయంలో లాక్డౌన్ల వల్ల ఇళ్లకే పరిమితం కావడంతో ప్రజలు సోషల్ మీడియాను గణనీయంగా ఉపయోగించారు. దీంతో ఆయా కంపెనీలకూ భారీగా ఆదాయాలు వచ్చాయి. అయితే, లాక్డౌన్లు ముగిసి, ప్రజలు తిరిగి దైనందిన జీవితాల్లో పడిపోయిన తర్వాత వాటి ఆదాయాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రత్యేకంగా మెటా విషయానికొస్తే.. డిజిటల్ యూనివర్స్ ’మెటావర్స్’ పై భారీగా పెట్టుబడులు పెడుతుండటం ఇన్వెస్టర్లను కలవరపరుస్తోంది. అటు టెక్ దిగ్గజం యాపిల్ ప్రైవసీ టూల్స్ సైతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు సమస్యగా మారుతున్నాయి. వీటి వల్ల యూజర్ల అనుమతి లేకుండా వారిని ట్రాక్ చేయడం, ప్రత్యేకంగా టార్గెట్ చేసే ప్రకటనలు చూపడం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్ లాంటి సంస్థలకు కష్టతరమవుతోంది. అలాగే యువత ఎక్కువగా టిక్టాక్ వైపు మళ్లుతుండటం ఇన్స్టాగ్రామ్పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. భారత్లోని ఉద్యోగుల్లో కలవరం.. ఏయే దేశాల్లో ఏ మేరకు కోతలు ఉంటాయనేది తెలియకపోవడంతో భారత్లోని మెటా ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, వాట్సాప్లకు సంబంధించి మెటాకు భారత్లో 300–400 మంది ఉద్యోగులు ఉన్నారు. వీటిలో 60 మంది సిబ్బంది గల వాట్సాప్ బృందమే చిన్నది. మెటా ఇండియా హెడ్ అజిత్ మోహన్ ఇటీవలే రాజీనామా చేసి పోటీ సంస్థ స్నాప్లో చేరారు. హెచ్1బీ వీసా హోల్డర్లకు సహకారం ఉద్వాసనకు గురైన వారిలో హెచ్1బీ వీసాహోల్డర్లు ఉంటే ఇమ్మిగ్రేషన్ పరంగా వారికి అవసరమైన పూర్తి సహాయ, సహకారాలను కంపెనీ అందిస్తుందని జుకర్బర్గ్ తెలిపారు. తమ దేశంలో పని చేసేందుకు విదేశీయులకు అమెరికా ఈ వీసాలు జారీ చేస్తుంది. అకస్మాత్తుగా ఉద్యోగం పోతే, తమ వీసాను స్పాన్సర్ చేసే మరో కంపెనీలో ఉద్యోగాన్ని 60 రోజుల్లోగా చూసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే వీసా గడువు ముగిసిపోతుంది. పలు అమెరికన్ కంపెనీల్లో భారత్, చైనా నుంచి చాలా మటుకు ఉద్యోగులు ఉన్నారు. ప్రధానంగా ఫేస్బుక్లో వీరి సంఖ్య 15శాతం పైనే. ఉద్యోగాల్లో కోతల వల్ల ఇలాంటి హెచ్1బీ వీసాహోల్డర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. -
ట్విటర్ తొలగింపులు, మాజీ ఉద్యోగులకు కొత్త చిక్కులు
ఎలన్ మస్క్ తొలగించిన ట్విటర్ ఉద్యోగులకు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవని తెలుస్తోంది. వీలైనంత త్వరగా మరో సంస్థలో ఉద్యోగం పొందితే సురక్షితంగా ఉండొచ్చని, లేదంటే దేశ వదిలి వెళ్లాల్సి ఉంటుందని అమెరికన్ చట్టాలు చెబుతున్నాయి. మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్లో ఉద్యోగం కోల్పోవడంతో పాటు..చట్టాల ప్రకారం అమెరికాలో నివసించేందుకు అనర్హులుగా పరిణగణలోకి తీసుకునే అవకాశం ఉంది. యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ (యూఎస్సీఐఎస్) డేటా ప్రకారం.. అమెరికన్ వర్క్ వీసాలైన హెచ్-1బీ, ఎల్-1లతో ఉద్యోగులు ట్విటర్లో పనిచేస్తున్నారు. ఎలన్ మస్క్ తొలగించిన ఉద్యోగుల్లో పైన పేర్కొన్న వీసా లబ్ధిదారులైతే మరిన్ని ఇబ్బందులు పడనున్నారు. వాటి నుంచి సురక్షితంగా ఉండేందుకు సదరు ఉద్యోగులు 60 రోజుల్లో మరో కొత్త జాబ్, లేదంటే అమెరికన్ సంస్థల నుంచి స్పాన్సర్ షిప్ పొందాల్సి ఉంది. ఆ రెండు అంశాల్లో విఫలమైతే..తమ దేశంలో నివసించేందుకు అమెరికా ప్రభుత్వం ఒప్పుకోదు. కాగా, ట్విటర్ మొత్తం ఉద్యోగుల్లో 8శాతం (625 నుంచి 670) మంది హెచ్-1బీ వీసా హోల్డర్స్ ఉన్నారు. హెచ్-1బీ వీసా హోల్డర్లు హెచ్-1బీ వీసాదారులకు 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఉన్నప్పటికీ, ఎల్-1, ఓ-1 వీసాలపై పనిచేసే కార్మికులకు ఇది చాలా కష్టం. అరుదైన పరిస్థితుల్లో తప్ప, వారు ఉద్యోగం కోల్పోయిన వెంటనే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని లాక్వెస్ట్ మేనేజింగ్ పార్టనర్ పూర్వీ ఛోతాని తెలిపారు. సాధారణంగా ఒక హెచ్-1బి ఉద్యోగిని తొలగిస్తే.. మరో సంస్థలో ఉద్యోగం పొందందేకు సుమారు 60రోజుల గ్రేస్ పిరియడ్ ఉంటుంది. ఖచ్చితమైన గ్రేస్ పీరియడ్ సదరు కార్డు హోల్డర్లను ఎంపిక చేసుకునే సంస్థపై ఆధారపడి ఉంటుంది. ఇక మస్క్ తొలగించిన ఉద్యోగులు హెచ్-1 బీ వీసా వచ్చే ఏడాది సెప్టెంబర్ 30,2023 వరకు సమయం ఉంది. 60 రోజుల్లో మరో జాబ్ పొందడం పెద్ద కష్టమేమి కాదని ఛోతాని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే గత ఆరేళ్లలో హెచ్-1బీ క్యాప్ లాటరీలో ఎంపికైన హెచ్-1బీ వర్కర్లు వచ్చే లాటరీ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. 60 రోజుల గ్రేస్ పీరియడ్ లో మరో స్పాన్సర్ను పొందలేకపోతే వారు తమ సొంత దేశం నుంచి అమెరికాలో జాబ్ కోసం ప్రయత్నించవచ్చు. ఎల్-1 వీసా హోల్డర్ల ఎన్-1ఏ వీసా అటే అమెరికా ప్రభుత్వం జారీ చేసిన నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా. యూఎస్ పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సేవలు విదేశీ డైరెక్టర్లు లేదా మేనేజర్లను యూఎస్లో ఉన్న వారి కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఈ తరహా వీసాను జారీ చేస్తుంది. ఈ తరహా వీసాపై ఉద్యోగం చేసేవారు..జాబు కోల్పోతే వెంటనే దేశం నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. మరి ట్విటర్ తొలగించిన ఎల్-1ఏ వీసా ఉద్యోగులకు భవిష్యత్ ఎలా ఉంటుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. చదవండి👉 ‘ట్విటర్లో నా ఉద్యోగం ఊడింది’, 25 ఏళ్ల యశ్ అగర్వాల్ ట్వీట్ వైరల్ -
భారతీయులకు గుడ్ న్యూస్.. ఇంటర్వ్యూ లేకుండానే అమెరికా వీసా!
వాషింగ్టన్: భారతీయులకు బీ1, బీ2 వంటి సాధారణ వీసాల జారీ ప్రక్రియ పునర్ప్రారంభమైన తరుణంలో అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే వీసాలు మంజూరు చేయాలని కాన్సులర్ అధికారులను విదేశాంగ శాఖ ఆదేశించింది. అయితే డిసెంబర్ 31వరకు దరఖాస్తు చేసుకున్న నిర్దిష్ట కేటగిరీల దరఖాస్తుదారులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. ఎఫ్, హెచ్-1,హెచ్-3, హెచ్-4, నాన్ బ్లాంకెట్ ఎల్,ఎం, ఓ, పీ, క్యూ, అకాడమిక్ జే విసాలకు ఈ కొత్త నిబంధన వర్తిస్తుందని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. వీసా గడువు ముగిసిన తర్వాత 48 నెలల లోపు రెనివల్ చేయించుకునే వారికి కూడా ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. కానీ గతంలో వీసాలు తిరస్కరణకు గురైన వారికి ఇది వర్తించదని స్పష్టం చేసింది. ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ నాన్ఇమిగ్రాంట్ వీసా అపాయింట్మెంట్ల వెయిటింగ్ పీరియడ్ మాత్రం ఎక్కువ కాలం ఉండనుంది. కరోనా సమయంలో కలిగిన ఇబ్బందులే ఇందుకు కారణమని అమెరికా చెప్పింది. ఇప్పటికే వీసా దరఖాస్తు రుసుం చెల్లించిన వారు వీసాల జారీకీ ఆలస్యం అవుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికా ఎంబసీ పేర్కొంది. కరోనా సమయంలో పేమెంట్ చేసిన వారి వ్యాలిడిటీని 2023 సెప్టెంబర్ 23వరకు పొడిగించనున్నట్లు తెలిపింది. చదవండి: పరాన్నజీవులూ, వెళ్లిపొండి -
వర్క్పర్మిట్లపై యూఎస్ కీలక నిర్ణయం
వాషింగ్టన్: గ్రీన్కార్డు దరఖాస్తుదారులు, హెచ్1బీ వీసా హోల్డర్ల జీవితభాగస్వాములు సహా కొన్ని ఇమ్మిగ్రెంట్ కేటగిరీలకు చెందినవారి వర్క్ పర్మిట్ కాలపరిమితిని 18నెలలు పొడిగిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. దీంతో యూఎస్లో పనిచేస్తున్న పలువురు భారతీయ ఐటీ ఉద్యోగులకు ఊరట లభించనుంది. కాలపరిమితి ముగిసిన వర్క్పర్మిట్లకు 18నెలల పొడిగింపు ఇచ్చే వెసులుబాటు ఈనెల 4నుంచి అమలవుతుంది. ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉన్న వీరి వర్క్పర్మిట్ కాలపరిమితి ఆటోమేటిగ్గా 180 నుంచి 540 రోజులకు పెరుగుతుందని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ శాఖ తెలిపింది. పెండింగ్లో ఉన్న ఈఏడీ దరఖాస్తులతో పనిభారం పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత కాలపరిమితిని పొడిగించాలని నిర్ణయించినట్లు యూఎస్సీఐఎస్ (అమెరికా ఇమ్మిగ్రేషన్ సేవల శాఖ) డైరెక్టర్ జడోయ్ చెప్పారు. ఇప్పటివరకు ఉన్న నియమాల ప్రకారం యూఎస్ పౌరులు కానివారు వర్క్పర్మిట్ కాలపరిమితి ముగిశాక మరో 180 రోజుల పొడిగింపు ఆటోమేటిగ్గా వస్తుంది. ఈ గడువులో వాళ్లు పర్మిట్ రెన్యువల్కు దరఖాస్తు చేసుకోవాలి. తాజా నిర్ణయం దాదాపు 87వేల మంది ఇమ్మిగ్రెంట్లకు ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు తెలిపారు. తాజా నిర్ణయాన్ని ఇండో అమెరికన్ సంఘాలు స్వాగతించాయి. -
2022కు హెచ్1బీ వీసా కోటా పూర్తి
వాషింగ్టన్: ఈ సంవత్సరానికి హెచ్1బీ వీసా పరిమితి 65,000కు సరిపడా దరఖాస్తులు అందాయని అమెరికా మంగళవారం ప్రకటించింది. విదేశీ ఉద్యోగస్తులు అమెరికాలో పనిచేసేందుకు ఈ వీసాను కేటాయిస్తారు. టెక్ కంపెనీలకు ఈ వీసా చాలా అవసరం. అమెరికా చట్ట సభలు విధించిన ప్రకారం ఏటా 65వేల వరకు గరిష్టంగా ఈ వీసాలను కేటాయిస్తారు. మరో 20వేల వీసాలను యూఎస్ అడ్వాన్స్డ్ డిగ్రీ ఎగ్జెంషన్ కింద కేటాయిస్తారు. ఈ రెండు కేటగిరీలకు సరిపడా దరఖాస్తులు తమకు ఇప్పటికే అందాయని యూఎస్ పౌర, వలస సేవల సంస్థ (యూఎస్సీఐఎస్) తెలిపింది. ఈ వీసా దరఖాస్తుల పరిశీలన, ఆమోదం తదితర ప్రక్రియలను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది. -
మార్చి 1 నుంచి హెచ్1–బీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
వాషింగ్టన్: భారత టెకీలు ఎంతో ఆత్రంగా ఎదురుచూసే హెచ్1–బీ వీసాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. అత్యున్నత సాంకేతిక నైపుణ్యం ఉన్నవారిని అమెరికా కంపెనీలు ఈ వీసాల కింద ఉద్యోగాల్లో నియమించుకుంటాయి. 2023 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 1 నుంచి మార్చి 18 వరకు జరుగుతుందని అమెరికా సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) ఒక ప్రకటనలో వెల్లడించింది. హెచ్1–బీ వీసాలను ఆశించే వారు, కంపెనీ ప్రతినిధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ రిజిస్ట్రేషన్కు 10 డాలర్ల రుసుము (రూ.750) చెల్లించాలి. ఆ తర్వాత లాటరీ విధానం ద్వారా ఎంపిక చేసి మార్చి 31లోగా వీసా వచ్చిన వారికి తెలియజేస్తామని స్పష్టం చేసింది. ప్రతీ ఏడాది టెక్నాలజీ కంపెనీలు భారత్, చైనా నుంచి వేలాది మంది ఉద్యోగుల్ని హెచ్1–బీ వీసా ద్వారా ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి. అమెరికా కాంగ్రెస్ చేసిన చట్టం ప్రకారం ప్రతీ ఏడాది యూఎస్సీఐఎస్ 65 వేల హెచ్1–బీ వీసాలను మంజూరు చేస్తుంది. అవే కాకుండా అమెరికా యూనివర్సిటీ నుంచి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్ సబ్జెక్టుల్లో) అంశాలలో ఉన్నత విద్యను అభ్యసించిన విదేశీ విద్యార్థులకు మరో 20 వేల హెచ్1–బీ వీసాలను ఏటా మంజూరు చేస్తుంది. ఈ వీసాల్లో అగ్రభాగం భారతీయ టెక్కీలకే దక్కుతుంటాయి. -
హెచ్-1బి వీసా దరఖాస్తు దారులకు శుభవార్త..!
2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్-1బి వీసాల ప్రాథమిక రిజిస్ట్రేషన్లు మార్చి 1 నుంచి మార్చి 18 వరకు కొనసాగనున్నాయి. ఈ మధ్య కాలంలో దరఖాస్తుదారులు, ప్రతినిధులు(పిటిషనర్ తరఫున వీసాకోసం అప్లయ్ చేసే వారు) ఆన్లైన్ ద్వారా హెచ్-1బీ వీసాకోసం రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) తాజాగా విడుదల చేసిన ప్రెస్ రిలీజ్లో పేర్కొంది. 2023 ఆర్థిక సంవత్సరం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి హెచ్-1బీ క్యాప్ కోసం ఓ ప్రత్యేక సంఖ్యను కేటాయించనున్నట్లు యూఎస్సీఐఎస్ తెలిపింది. ఈ నంబర్ను ఉపయోగించి రిజిస్ట్రేషన్ను ట్రాక్ చేయొచ్చని పేర్కొంది. దరఖాస్తు స్టేటస్ను మాత్రం ఈ నంబర్ ద్వారా ట్రాక్ చేయలేరని స్పష్టం చేసింది.అమెరికాలో పని చేయాలంటే విదేశీయులకు హెచ్-1బీ విసా తప్పనిసరి. పరిమితకాలంతో ఈ వీసాను అమెరికా ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లోని టెక్ నిపుణులు హెచ్-1బీ వీసా కోసం ఎదురు చూస్తుంటారు. వారిలో ఇండియా మొదటి స్థానంలో ఉంటుంది. ఆ తర్వాతి స్థానంలో చైనా ఉంది. ఈ వీసా కార్యక్రమం ద్వారా యుఎస్ కంపెనీలు భారతీయులను నియమించుకోవచ్చు. అమెరికాలో అక్టోబర్ నెలలో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో 65,000 హెచ్-1బి వీసాలు జారీ చేయగా, 20,000 వీసాలు యుఎస్ మాస్టర్స్ డిగ్రీ హోల్డర్ల కోసం రిజర్వ్ చేశారు. 2021 ఆర్థిక సంవత్సరంలో హెచ్-1బి వీసాలను అందుకున్న వారిలో అమెజాన్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కాగ్నిజెంట్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. హెచ్-1బీ వీసా కోసం పిటిషనర్లు, వారి తరఫు ప్రతినిధులు మైయూఎస్సీఐఎస్ ఆన్లైన్ అకౌంట్ను వినియోగించాలని తెలిపింది. రిజిస్ట్రేషన్ కోసం ఒక్కో అభ్యర్థి 10 డాలర్ల రుసుము చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. స్వియ రిజిస్ట్రేషన్ చేసుకునే వారు.. ఫిబ్రవరి 21 నంచి మైయూఎస్సీఐఎస్ ఆకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చని వివరించింది. మార్చి 31 నాటికి ఎంపిక దరఖాస్తుకు ఎంపికైన వారి వివరాలు.. మైయూఎస్సీఐఎస్ అకౌంట్కు అందుతాయని పేర్కొంది. దరఖాస్తు యాదృచ్ఛికంగా ఎంపిక చేయనున్నట్లు తెలిపింది. కరోనా మహమ్మారి వల్ల హెచ్-1బి వీసా దరఖాస్తుదారులకు నిర్వహించే వ్యక్తిగత ఇంటర్వ్యూను అమెరికా రద్దు చేసింది. (చదవండి: 5 నిమిషాల్లో పాన్కార్టులోని పేరు, పుట్టిన తేదీని మార్చుకోండి ఇలా..!) -
హెచ్-1బీ వీసాలపై అమెరికా కీలక నిర్ణయం
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వీసాల జారీ విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 2022 సంవత్సరానికి గానూ..హెచ్-1బీ, ఎల్-1, ఓ-1 వీసాలకోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వ్యక్తిగత ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. తాజా నిర్ణయంతో.. వర్క్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవారు కాన్సులేట్కు వెళ్లి భౌతికంగా ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. హెచ్-2 వీసా, ఎఫ్-ఎమ్ వీసా, ఎకాడమిక్ జే వీసాలపై ఇప్పటికే అమల్లో ఉన్న ఈ నిబంధనను.. 2022 డిసెంబర్ 31 వరకు పొడగిస్తూ కాన్సులర్ అధికారులకు విదేశాంగమంత్రి ఆంటోని బ్లింకెన్ ఆదేశాలు జారీ చేశార. అయితే స్థానిక పరిస్థితులు, అవసరాల మేరకు కాన్సులేట్ అధికారులు ఇన్పర్సన్ ఇంటర్వ్యూలకు పిలిచే అవకాశముంది. అందువల్ల సంబంధిత వెబ్సైట్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని విదేశాంగశాఖ సూచించింది. చదవండి: విషాదం: నౌకలో భారీ అగ్ని ప్రమాదం.. 32 మంది సజీవ దహనం -
హెచ్1–బి వీసాలకు మళ్లీ ‘లాటరీ’యే
వాషింగ్టన్: వృత్తి నిపుణులకు మంజూరు చేసే హెచ్1–బి వీసాల కేటాయింపును పాత పద్దతిలో ‘లాటరీ’ విధానంలోనే కొనసాగించాలని అమెరికా నిర్ణయించింది. అమెరికా ప్రతి ఏటా 85 వేల హెచ్1– బి వీసాలను (నిర్ణీత కోటా 65 వేలు,, అమెరికా వర్శిటీల్లో పీజీ.. ఆపై కోర్సులు చేసిన వారికి అదనంగా 20 వేల హెచ్1–బి వీసాలు) జారీ చేస్తోంది. టెక్ కంపెనీలు, ఇతర సంస్థలు ఈ కోటాకు మించి హెచ్1–బి వీసా దరఖాస్తులు సమర్పిస్తే... లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి వీసాలను కేటాయించేవారు. 2022 ఆర్థిక సంవత్సరానికి గాను అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్కు 3 లక్షలకు పైగా దరఖాస్తులు అందిన విషయం గమనార్హం. అత్యంత ప్రతిభావంతులనైన వృత్తి నిపుణులనే అమెరికాలోకి అనుమతించాలనే ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం లాటరీ పద్దతికి స్వస్తి పలికి ఈ ఏడాది జనవరి 8న కొత్త విధానాన్ని తెచ్చింది. వేతనాల ఆధారంగా హెచ్1–బి వీసాలను జారీ చేయాలని నిర్ణయించింది. అత్యధిక వేతనాలు పొందుతున్న వారికే ప్రాధాన్యత క్రమంలో మొదట వీసాలు దక్కుతాయి. ఈ ఏడాది మార్చి 9 నుంచి దీన్ని అమలు చేయాలని భావించినా... అది ఆలస్యమైంది. మరోవైపు సెప్టెంబరులో వేతనాల ఆధారిత వీసా కేటాయింపు విధానాన్ని కాలిఫోర్నియా ఉత్తర జిల్లా కోర్టు కొట్టివేసింది. దాంతో లాటరీ విధానాన్నే కొనసాగించాలని జో బైడెన్ సర్కారు నిర్ణయించింది. అత్యధిక వేతనాల ఆధారంగా హెచ్1–బి వీసాలను జారీచేస్తే ఇతర దేశస్తుల కంటే భారత టెకీలకు అధిక ప్రయోజనం చేకూరేది. -
భారీగా తగ్గిన హెచ్1–బీ వీసాలు
వాషింగ్టన్: అమెరికా కలల ప్రయాణానికి కరోనా మహమ్మారి అడుగడుగునా అడ్డు పడుతోంది. భారతీయ టెక్కీల్లో అత్యధిక డిమాండ్ ఉండే హెచ్1–బీ వీసాల సంఖ్య గత దశాబ్దంలో ఎన్నడూ లేని విధంగా తగ్గిపోయింది. ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగాలకి కొరత లేదు. జాబ్ ఓపెనింగ్స్ భారీ సంఖ్యలో ఉన్నాయి. కానీ హెచ్1–బీ ఉద్యోగస్తుల సంఖ్య పడిపోయింది. కోవిడ్ నేపథ్యంలో అమెరికా ప్రయాణాలపై, వీసాలపై ఆంక్షలు విధించడంతో ఈ వలసేతర వీసాలు తగ్గాయి. రెండేళ్లలో 19 శాతం తగ్గిపోయిన ఉద్యోగులు అమెరికా కార్మిక శాఖ వెల్లడించిన గణాంకాలను బ్లూమ్బర్గ్ న్యూస్ విశ్లేషించింది. గత ఏడాదితో పోల్చి చూస్తే సెప్టెంబర్ 2021 నాటికి హెచ్–1బీ కేటగిరి కింద విదేశీ ఇంజనీరింగ్, మ్యాథ్మేటిక్స్ ఉద్యోగస్తులు 12.6% తగ్గిపోయారు. కరోనా ముందు అంటే 2019లో పోల్చి చూస్తే ఇదే కేటగిరిలో 19% హెచ్1–బీ వీసాలు తగ్గిపోయాయి. కరోనా కారణంగా లాక్డౌన్లు విధించడం, వీసాల జారీ ప్రక్రియ మందగించడం, కోవిడ్ ముప్పుతో అమెరికాకు వెళ్లడానికి ఇష్టపడకపోవడం వంటి కారణాలతోనే హెచ్–1బీ వీసాల సంఖ్య తగ్గిపోయిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘2020 మార్చి నుంచి కొత్త వీసాల జారీ ప్రక్రియ బాగా నెమ్మదించింది. లాక్డౌన్ ఆంక్షలతో ఒకానొక దశలో కొన్నాళ్ల పాటు దాదాపు నిలిచింది. స్టెమ్ (సైన్స్, సాంకేతికం, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) కేటగిరీలో ఉద్యోగులు తగ్గిపోయాయి. కొన్ని కంపెనీలు విదేశాల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్కి అనుమతినివ్వడంతో హెచ్–1బీ వీసాల సంఖ్య తగ్గిపోయింది’ అని కాలిఫోర్నియా యూనిర్సిటీ ప్రొఫెసర్ పేరి గోవణ్ణ చెప్పారు. ప్రతీ ఏడాది కొత్తగా 85 వేల హెచ్1బీ వీసాలు జారీ చేస్తుంటారు. స్టెమ్లో గత ఏడాది మార్చి, ఏప్రిల్లో కరోనా కారణంగా ఉద్యోగాలు పోయాయి. కానీ త్వరగానే ఆయా రంగాలు కోలుకోవడంతో ఈ ఏడాది రికార్డు స్థాయిలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టుగా అమెరికా కార్మిక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 4,97,000 ఉద్యోగాలు ఉన్నాయని 2020 నుంచి పోల్చి చూస్తే 9% తగ్గిందని, 2019తో పోల్చి చూస్తే 17% తగ్గిందని బ్లూమ్బర్గ్ న్యూస్ వెల్లడించింది. -
హెచ్1బీ భాగస్వాములకు భారీ లబ్ధి
వాషింగ్టన్ : భారత్ నుంచి వచ్చే వారితో సహా వలసదారులకి ప్రయోజనం చేకూరేలా అమెరికాలోని బైడెన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వామ్యులకు (భర్త/భార్య) ఆటోమేటిక్గా వర్క్ ఆథరైజేషన్ కల్పించడానికి అంగీకరించింది. అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే ఐటీ నిపుణుల భార్యలకి ఈ నిర్ణయంతో ఎంతో ఊరట లభించింది. అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) హెచ్–1బీ వీసా కలిగిన వారి కుటుంబ సభ్యులు (భార/భర్త, 21 ఏళ్ల వయసులోపు పిల్లలు)కి హెచ్–4 వీసా జారీ చేస్తుంది. ఈ వీసాదారులు అమెరికాలో ఉద్యోగం చేయాలనుకుంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) కలిగి ఉండాలి. దీనిని ఎప్పటికప్పుడు వారు పొడిగించుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇకపై అలాంటి బాధ లేకుండా ఉద్యోగం చేయడానికి వీలుగా ఆటోమేటిక్ వర్క్ ఆథరైజేషన్తో కూడిన హెచ్–4 వీసాను మంజూరు చేయడానికి బైడెన్ సర్కార్ పచ్చ జెండా ఊపింది. ఈ నిర్ణయంతో భారత్ నుంచి వెళ్లే మహిళలకే అత్యధికంగా లబ్ధి చేకూరనుంది. ఈఏడీని పొడిగించుకోవడాన్ని సవాల్ చేస్తూ హెచ్–4 వీసాదారుల తరఫున అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ (ఏఐఎల్ఏ) కోర్టులో పిటిషన్ వేసింది. ‘హెచ్–4 వీసాదారులు తరచూ రెగ్యులేటరీ పరీక్ష ఎదుర్కోవాలి. అయితే గతంలో హోంల్యాండ్ ఏజెన్సీ వారికి ఉద్యోగం రాకుండా నిషేధం విధించింది. దీంతో రీ ఆథరైజేషన్ కోసం ఎందరో ఎదురు చూస్తున్నారు. ఎలాంటి చట్టపరమైన కారణాలు లేకుండా వారు అత్యధిక వేతనాలు వచ్చే ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తోంది’అని ఏఐఎల్ఏ లాయర్ జాన్ వాస్డెన్ చెప్పారు. దీనిపై బైడెన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రస్తుతం 90 వేలమందికి పైగా హెచ్–4 వీసాదారులకు వర్క్ ఆథరైజేషన్ ఉంది. -
ఉద్యోగాల్లో వివక్ష.. భారీ మూల్యం చెల్లించనున్న ఫేస్బుక్
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ నెత్తిన మరోపిడుగు పడింది. ఉద్యోగుల విషయంలో వివక్ష ప్రదర్శిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో భారీ పెనాల్టీ విధించింది అమెరికా న్యాయ విభాగం. 14.5 మిలియన్ డాలర్లు(మన కరెన్సీలో సుమారు 107 కోట్ల రూపాయల దాకా) పెనాల్టీకి ఆదేశించింది. ఈ మేరకు ఫేస్బుక్ ఒక మెట్టు కిందకు దిగి.. ఒప్పందానికి రావడంతో వాదప్రతివాదనలకు ఆస్కారం లేకుండా వివాదం ఓ కొలిక్కి వచ్చింది. ఉద్యోగుల విషయంలో వివక్షతో పాటు ఫెడరల్ రిక్రూట్మెంట్ రూల్స్ను ఉల్లంఘించిందనే ఆరోపణల ఆధారంగా ఫేస్బుక్ మీద అమెరికా న్యాయ విభాగం గత డిసెంబర్లో ఒక కేసు నమోదు చేసింది. ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు బదులు తాత్కాలిక ఉద్యోగులకు(విదేశీ ఉద్యోగులు, హెచ్ 1-బీ వీసాదారులు తదితరులు) ప్రాధాన్యత ఇవ్వడంలాంటి చర్యలకు పాల్పడింది ఫేస్బుక్. ఇది ఫెడరల్ రిక్రూట్మెంట్ రూల్స్ నిబంధనలకు విరుద్దమేనని లేబర్ విభాగం సైతం వాదించింది. ఈ తరుణంలో సెటిల్మెంట్కు ముందుకొచ్చిన ఫేస్బుక్.. భారీ పెనాల్టీ చెల్లింపునకు అంగీకరించింది. ఇక ఫేస్బుక్తో జరిగిన ఈ సెటిల్మెంట్ చరిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు అమెరికా అటార్నీ జనరల్(సహాయక) క్రిస్టన్ క్లార్క్ . 35 ఏళ్లలో ఇదే అతిపెద్ద సివిల్ రైట్స్ విభాగపు సెటిల్మెంట్గా పేర్కొన్నారు. స్వదేశీ ఉద్యోగులకు బదులు.. తాత్కాలిక వీసాదారులకు పీఈఆర్ఎం కింద (permanent labor certification program) ఫేస్బుక్ ఉద్యోగాలు ఇవ్వడంపైనే ప్రధాన అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. సివిల్ పెనాల్టీ కింద 4.75 మిలియన్ డాలర్లు, ఉద్యోగ నియామకాల్లో వివక్ష చూపించినందుకు మరో 9.5 మిలియన్ డాలర్లు పెనాల్టీ చెల్లించాలని ఒప్పందం చేసుకుంది ఫేస్బుక్. చదవండి: మాజీ ఉద్యోగి చిచ్చు..వందల కోట్లు ఖర్చుకు సిద్ధమైన జుకర్బెర్గ్ ఇదీ చదవండి: జుకర్బర్గ్ కలత.. రాజీనామా?