-
Faisal Khan: ఇటు సోషల్ మీడియా.. అటు సోషల్ యాక్టివిటీస్లోనూ ఖాన్ సర్ ఫస్టే!
అసలు పేరు ఫైసల్ ఖాన్. టీచర్, యూట్యూబర్. ఖాన్ సర్, ఖాన్ సర్ పట్నాగా పాపులర్. సొంతూరు.. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్. అలహాబాద్ యూనివర్సిటీలో సైన్స్లో మాస్టర్ డిగ్రీ చేశాడు. 2019లో ‘ఖాన్ జీఎస్ రీసెర్చ్ సెంటర్’ పేరుతో యూట్యూబ్ చానెల్ను స్టార్ట్ చేశాడు.స్కూళ్లు, కాలేజీలు బంద్ అయిన కరోనా లాక్డౌన్ టైమ్లో అకడమిక్స్ని టీచ్ చేస్తూ ఖాన్ చేసిన వీడియోలు ఇటు యూట్యూబ్లో అటు ఇన్స్టాలో వైరలై అతనికి బోలెడంత మంది ఫాలోవర్స్ని.. సబ్స్క్రైబర్స్ని సంపాదించి పెట్టాయి. ఎంతటి కష్టమైన, క్లిష్టమైన సబ్జెక్ట్ని అయినా అరటి పండు మింగినంత అలవోకగా ఎక్స్ప్లెయిన్ చేయడం ఖాన్ సర్ యూఎస్పీ. అందుకే అతని యూట్యూబ్ చానెల్కి స్టూడెంట్సే కాదు వరుణ్ ధవన్ లాంటి సినిమా యాక్టర్స్ కూడా సబ్స్క్రైబర్సే!సోషల్ మీడియాలోనే కాదు సోషల్ యాక్టివిటీస్లోనూ ఖాన్ సర్ ఫస్టే! స్కూల్కి వెళ్లలేని పేద పిల్లలకు ఫ్రీగా టీచ్ చేస్తాడు. ఆర్థికావసరాల్లో ఉన్న వాళ్లకు తనకు తోచిన హెల్ప్ చేస్తాడు. యూట్యూబ్ ద్వారా ఖాన్ సర్ నెలకు 15 లక్షల రూపాయలు సంపాదిస్తాడని అంచనా! ఆర్జనే కాదు సాయమందించే మనసూ ముఖ్యమే అని ప్రూవ్ చేస్తున్నాడు ఖాన్ సర్!ఇవి చదవండి: Pooja Singh: పూజా సింగ్ టు.. రింకీ దూబే.. బై శాన్వికా..! -
కారు కనిపించని ఊరు.. ఎక్కడుందో తెలుసా!?
స్పెయిన్లోని అతి చిన్న నగరం ‘సిటీ ఆఫ్ ఫ్రియాస్’. స్పెయిన్కు వచ్చే పర్యాటకులు దీనిని పెద్దగా పట్టించుకోరు గాని, ఈ ఊరికి చాలా విశేషాలే ఉన్నాయి. పదో శతాబ్దికి చెందిన ఈ నగరంలో ఆనాటి రాజు రెండో జువాన్ నిర్మించిన రాతికోట ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. మునిసిపాలిటీ నిర్వహణలో ఉన్న ఈ ఊరు సాంకేతికంగా పట్టణమే అయినా, పేరులో మాత్రం ‘సిటీ’ ఉండటంతో స్పెయిన్లోని అతి చిన్న నగరంగా గుర్తింపు పొందింది.చిన్నా చితకా పట్టణాల్లోనే కాదు, పల్లెల్లో కూడా కార్లు విరివిగా తిరిగే పరిస్థితులు ఉన్నా, ఈ ఊర్లో మాత్రం కార్లు కనిపించవు. ఇక్కడి ప్రజలు తమ ఊరిలో కార్లను నిషేధించారు. అందువల్ల మోటారు శబ్దాల రొద లేకుండా ఈ ఊరు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఊరి జనాభా దాదాపు మూడువందల మంది మాత్రమే! ఈ విశేషాలు తెలిసిన కొద్దిమంది పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. ఈ ఊళ్లోని పురాతనమైన ‘ఇగ్లేషియా డి సాన్ విన్సెంటె మార్టిర్’ కేథలిక్ చర్చి, ‘ఫ్యూంటే డి లాస్ తేజాస్’ ఫౌంటెన్ ప్రత్యేక ఆకర్షణలు.ఈ ఫౌంటెన్ నుంచి నీరు కిందకు పడేటప్పుడు సంగీత స్వరాలు వినిపిస్తాయి. ఈ ఊళ్లో చిన్న చిన్న రెస్టారెంట్లు, హోటళ్లు, సెలూన్లు, మాంసం కొట్లు, ఫ్యాన్సీ దుకాణాలు, బేకరీ, ఫార్మసీ దుకాణాలు వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడి ‘హోటల్ రూరల్ ఫ్రియాస్’ పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది. పురాతన యూరోపియన్ విశేషాలను తిలకించాలనుకునే పర్యాటకులు ఇక్కడ బస చేయవచ్చు. ఈ హోటల్లో బస చేయడానికి రోజుకు 79 పౌండ్లు (రూ.8,411) చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ యూరోపియన్ హోటళ్లతో పోల్చుకుంటే ఈ ధర తక్కువే!ఇవి చదవండి: అబ్బే! ప్రాణహాని ఉందని కాదు! -
Alia Al Rufai: తానొక.. అందమైన ఫ్యాషన్ లేడీ!
బాలీవుడ్లో అనుష్కా శర్మకు మంచి నటిగానే కాదు స్టయిల్ ఐకాన్గానూ పేరుంది. ఎయిర్ పోర్ట్ లుక్ నుంచి రెడ్కార్పెట్ వాక్ దాకా సందర్భానికనుగుణంగా ఆమె «ధరించే కాస్ట్యూమ్స్కి వీర ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ఫ్యాషనిస్టా వెనుక స్టయిలిస్ట్ అలియా అల్ రుఫై కృషి ఉంది. ఆమె ఎవరో తెలుసుకుందాం..అలియా అల్ రుఫై.. వాళ్లమ్మ ఇండియన్. నాన్న అరబ్. అందుకే తనను తాను హాఫ్ ఇండియన్, హాఫ్ అరబ్గా అభివర్ణించుకుంటుంది అలియా. పన్నెండవ ఏట నుంచే ఆమెకు ఫ్యాషన్ మీద ఆసక్తి ఏర్పడింది. కారణం వాళ్లమ్మే. వింటేజ్ స్టయిల్కి కంటెంపరరీ టచ్నిచ్చి క్రియేట్ చేసుకునే ఆమె డ్రెస్లు, బ్లౌజెస్ అలియాను అమితంగా ఆకట్టుకునేవట. ఆ ఆకర్షణే తన చుట్టూన్న వాళ్ల డ్రెస్ సెన్స్ని, కల్చర్స్ని గమనించే గుణాన్ని పెంచిందట అలియాలో. ఆ తపనే ఆమెకు ఫ్యాషన్ మ్యాగజైన్స్నీ పరిచయం చేసింది. వాటి ప్రభావంతో తన డైలీ రొటీన్ డ్రెసెస్లోనే ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చేది.తన ఫ్రెండ్ సర్కిల్లో కాంప్లిమెంట్స్ అందుకునేది. ఒకసారి బాల్యంలోనే.. ఇతిహాద్ ఎయిర్వేస్లో బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తున్నప్పుడు.. ఒక బ్లాంకెట్ని ఇంటికి పట్టుకొచ్చేసిందిట దొంగతనంగా! తర్వాత దాన్ని స్కర్ట్గా మలచుకుందట. అలా ఆమెకు ఫ్యాషన్ మీదున్న శ్రద్ధ తనతో పాటే పెరుగుతూ వచ్చింది. ముంబై యూనివర్సిటీలో ఏంబీఏ పూర్తి చేసింది. అయినా ఏదో వెలితి. తనకు జాబ్ శాటిస్ఫాక్షన్ దొరికేది ఫ్యాషన్ రంగంలోనే అని ఆమె ప్రగాఢ విశ్వాసం. అందుకే ‘హార్పర్స్ బజార్’లో జూనియర్ ఫ్యాషన్ ఎడిటర్గా ఆఫర్ వస్తే.. రెండో ఆలోచన లేకుండా అందులో చేరింది.అక్కడ పనిచేస్తున్నప్పుడే అనుకోకుండా బాలీవుడ్ నుంచి కాల్ అందుకుంది.. ‘మధుర్ భండార్కర్ తీస్తున్న ‘ఫ్యాషన్’ సినిమాకి స్టయిలిస్ట్గా ఉన్న రీతా ధోడీకి అసిస్టెంట్ కావాలి. రాగలరా?’ అంటూ! ‘వై నాట్.. అఫ్కోర్స్’ అంటూ వెంటనే రీతా ధోడీ స్టయిల్ టీమ్లో మెంబర్ అయింది. ‘తొలి అవకాశమే కంగనా రనౌత్, ప్రియంకా చోప్రాలతో కలసి పనిచేయడం.. నా అదృష్టం! వాళ్ల దగ్గర చాలా నేర్చుకున్నాను. ఇంకా చెప్పాలంటే ‘ఫ్యాషన్’ సినిమా ఫ్యాషన్ ప్రపంచం గురించి నాకెన్నో విషయాలను తెలియజెప్పింది. ఎన్నో మెలకువలనూ నేర్పింది’ అని చెబుతుంది అలియా.ఆ సినిమా ఆమె కెరీర్కి మైలు రాయి అనుకోవచ్చు. అక్కడి నుంచి ఆమె ప్రయాణం ముందుకే సాగింది. పలు ఫ్యాషన్ షోలకు పనిచేసింది. ఎన్నో ఫ్యాషన్ మ్యాగజైన్స్కి ఆర్టికల్స్ రాసింది. అలా ఆమె నైపుణ్యం చూసిన అనుష్కా శర్మ .. అలియాను తన పర్సనల్ స్టయిలిస్ట్గా నియమించుకుంది. ఆమె అనుష్కా దగ్గర చేరగానే అనుష్కా తీరుతెన్నులే మారిపోయాయి. ఏ డ్రెస్ అయినా అనుష్కా కోసమే డిజైన్ అయిందేమో అన్నంత ఆప్ట్గా.. ఏ యాక్ససరీకైనా ఆమె వల్లే అందం వస్తుందేమో అన్నంత గ్రేస్ఫుల్గా కనిపించసాగింది ఆ నటి.దీన్ని బాలీవుడే కాదు యూరప్ ఫ్యాషన్ ప్రపంచమూ గమనించింది. అలియాకు చాన్స్ల వరద కురిపించింది. సెలబ్స్ ఎవరైనా రెడ్కార్పెట్ మీద కాలు పెట్టాలంటే అలియా స్టయిలింగ్ చేయాల్సిందే అన్నంత పాపులర్ అయిపోయింది. అలా దీపికా పదుకోణ్, ఆలియా భట్, కియారా ఆడ్వాణీ, యామీ గౌతమ్, నర్గిస్ ఫక్రీ, శ్రద్ధా కపూర్ వంటి వాళ్లందరికీ అలియా పర్సనల్ స్టయిలిస్ట్గా పనిచేసింది.ఫ్యాషన్లో మరింత స్కిల్ సంపాదించుకునేందుకు 2018లో మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఫ్యాషన్ రంగంలో పట్టభద్రురాలైంది."అంకితభావం, హార్డ్వర్కే నన్నీ రోజు ఇండస్ట్రీలో ఈ స్థాయికి చేర్చాయి. బ్యూటీ అంటే నా దృష్టిలో సింప్లిసిటీ! మీ స్కిన్తో మీరు ఎంత కంఫర్టబుల్గా ఉంటే అంత అందంగా కనపడతారు. నా వింటేజ్ ఫ్యాషన్కి ఇన్స్పిరేషన్ మా అమ్మే అని చెబుతాను. సందర్భానికి తగ్గట్టు ఆమె రెడీ అయ్యే తీరే నాలో ఫ్యాషన్ సెన్స్ని పెంచింది. సీజన్స్ మారుతుంటాయి. ఫ్యాషన్ మాత్రం ఇవాల్వ్ అవుతూంటుంది. ఈ సత్యాన్ని గమనిస్తే స్టయిలిస్ట్లకు తిరుగులేదు.నేర్చుకోవడానికి బాలీవుడ్ని మించిన ఇండస్ట్రీ లేదు. మెంటర్ కన్నా రెండడుగులు ముందుండాలి ఎప్పుడూ! ఫలానా పని చేయండి అని మెంటర్ ఆర్డర్ వేయగానే ఆల్రెడీ డన్ అనే ఆన్సర్ ఉండాలి మన దగ్గర. నా ఫిలాసఫీకి వస్తే.. ఈ క్షణంలో బతకడాన్ని మించిన ఆనందంలేదు అంటాను. అదే అందం. చిన్న చిన్న విషయాల్లో ఆనందం వెదుక్కుంటాను!" – అలియా అల్ రుఫైఇవి చదవండి: తను.. గూంగీ గుడియా కాదు.. ఉక్కు మహిళ! -
ప్రస్తుతం ఇంట్లో గోడలకు.. ట్రెండ్గా మారిన వాల్పేపర్ డిజైన్స్..!
భారతీయ కళా సంస్కృతుల నుంచి ప్రేరణ పొందిన వాల్పేపర్ డిజైన్స్, అలనాటి ఐశ్వర్యాన్ని నేడు కళ్ల ముందు నిలిపినట్లు అనిపించకమానదు. ఈ వాల్పేపర్స్లోని ప్రతి డిజైన్ ఒక కళాఖండంలా ఉంటుంది. ఈ వాల్పేపర్లు ఇంటి ఆకర్షణను ఇనుమడింపజేస్తాయి.ఒకప్పటి మొఘల్ రాజభవనాల వైభవాలు, రాజస్థానీ ప్రకృతి దృశ్యాలతో కూడిన వాల్పేపర్లు; వాటికి తోడుగా రోమన్ థీమ్, యురోపియన్ శైలితో ఉండే వాల్పేపర్లను ప్రజలు ఇష్టపడుతున్నట్టు చెబుతున్నారు ‘లైఫ్ ఎన్ కలర్’ నిర్వాహకురాలు అపూర్వ శర్మ.పరిశోధనతో ప్రారంభం..‘మధ్యయుగ కాలంలో భారతీయ కళారూపాలు, భారతీయ పురాణ గాథల చిత్రాలతో çకూడిన డిజైన్లు ఇటీవలి కాలంలో ట్రెండ్గా మారాయి. జనాల అభిరుచిలోని మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఈ డిజైన్లను వీలైనంత కొత్తగా రూపొందిస్తుంటాం’ అని చెబుతారామె.పెయింటింగ్స్ మరిపించేలా..భారతీయ పురాణాల చిత్రాలతో పాటు ఆధునిక అలంకరణలను అనుసరించి పేస్టల్ కలర్స్తో సృష్టించిన డిజైన్లను ఎంచుకోవచ్చు. ఆకర్షణీయమైన కథలను వివరించే డిజైన్లను ఎంచుకోవచ్చు. గోడలపైన సాధారణంగా పురాణాలు, ఇతిహాసాలు, చారిత్రక డిజైన్లను పెయింటింగ్స్లో చూస్తుంటాం. అయితే, ఈ డిజైన్లతో కూడిన వాల్పేపర్లు ఇంటిగోడలకు మరింతగా వన్నె తేగలవని ఇంటీరియర్ డెకరేషన్ నిపుణులు చెబుతున్నారు.ఇవి చదవండి: గర్భవతులు మరింత బరువు పెరిగితే..? -
ఈ 'తియా శిలాఫలకాలు'.. ఏ కాలంనాటివో తెలుసా!?
ఇథియోపియా, అడిస్ అబాబాకు దక్షిణంగా ఉన్న సోడో ప్రాంతంలోని తియా పురావస్తు ప్రదేశం.. ప్రపంచాన్నే ఆకట్టుకుంటుంది. ఇక్కడ పదుల సంఖ్యలో మెగాలిథిక్ స్తంభాలు.. 12 లేదా 14వ శతాబ్దాల నాటి ఎన్నో కథలను.. ఊహించి చెబుతుంటాయి. అందుకే అవన్నీ మార్మిక సంకేతాలతో మానవ చరిత్రకు వారసత్వ సంపదగా చరిత్రలో నిలిచాయి.సంక్లిష్టమైన సామాజిక–మతపరమైన పద్ధతుల్లో కొన్ని రకాల చిహ్నాలు.. ఆ శిలాఫలకాలపై చెక్కి ఉన్నాయి. కత్తులు, బొమ్మలు ఇలా ఎన్నో భావనలతో చెక్కిన ఆ స్తంభాలు.. యునెస్కో గుర్తింపును కూడా పొందాయి. అందుకే ఇవన్నీ.. శాస్త్రవేత్తలను, పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. పురాతన ఇథియోపియన్ సంస్కృతికి చెందిన ఆచారాలకు, నమ్మకాలకు ఇవి నిశ్శబ్ద సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. ఈ అమూల్యమైన ప్రదేశాన్ని సంరక్షించడానికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. ఈ శిలాఫలకాలు, వాటిపైనున్న మార్మిక చిహ్నాలు పురాతన రాతియుగం నాటి పరిస్థితుల్ని సూచిస్తాయి. కానీ ఆ సూచనలు నేటి తరాలకు ఏ మాత్రం అర్థం కాకుండా ఉన్నాయి.ఇక్కడ మొత్తంగా 36 మెగాలిథిక్ స్తంబాలు ఉన్నాయి. వాటి మీదున్న కత్తుల బొమ్మలు ఏదైనా దైవ శక్తిని లేదా సైనిక శక్తిని సూచిస్తూ ఉండవచ్చని నిపుణుల అంచనా. కానీ దానిపై స్పష్టత లేదు. ఇక ఇతర బొమ్మల విషయానికి వస్తే ఆనాటి జ్యోతిష వివరాలను, ఆనాటి నాగరికత వివరాలను తెలుపుతున్నట్లుగా అనిపిస్తున్నాయని కొందరు పరిశోధకులు అభిప్రాయపడ్డారు. 1930ల వరకు ఈ పురావస్తు ప్రదేశం వెలుగులోకి రాలేదు. ఇథియోపియా ప్రాంతీయ సర్వేల సమయంలో ఫ్రెంచ్ పరిశోధకులు వీటి ప్రాముఖ్యతను గుర్తించి, వీటి వివరాలను ప్రపంచానికి వెల్లడించారు.ఆ రాతిస్తంభాలన్నీ పురాతన యుగంలో.. అంటే 12 లేదా 14 శతాబ్దంలోని చనిపోయిన పూర్వీకుల జ్ఞాపకార్థం కావచ్చని కొందరు లేదంటే అప్పటి సమూహానికి నాయకుడిగా ఉన్న నాయకుడి గౌరవార్థం కావచ్చని మరికొందరు అంచనా వేశారు. ఆ లెక్కన చూస్తే.. ఇది పురాతన శ్మశానవాటిక కావచ్చని కూడా కొందరి అభిప్రాయం. అయితే ఈ స్తంభాలు వెనుకున్న అసలు కథ ఏమిటి? అన్నది మాత్రం నేటికీ మిస్టరీనే! – సంహిత నిమ్మన -
గుర్తుందా..!? వానల కోసం పిల్లుల ఊరేగింపు.. ఈసారీ వింతగా..
వానలు కురవడం ఆలస్యమైతే కప్పల పెళ్లిళ్లు జరిపించడం మనవాళ్లకు తెలిసిన ఆచారం. వానలు కురవడం ఆలస్యమై, కరవు దాపురించే పరిస్థితులు ఎదురైతే పిల్లుల ఊరేగింపు జరపడం కంబోడియా, థాయ్లాండ్, మయాన్మార్, వియత్నాం తదితర ఆగ్నేయాసియా దేశాలలో చిరకాలంగా కొనసాగుతున్న ఆచారం. ఇవన్నీ ప్రధానంగా వ్యవసాయాధారిత దేశాలే! ఈ దేశాలలో వరి ప్రధానమైన పంట.వరి బాగా పండాలంటే వర్షాలు కీలకం. వర్షాలు సకాలంలో కురవకుంటే, దేవతల ప్రీతి కోసం ఇక్కడి జనాలు ఊరూరా పిల్లుల ఊరేగింపు జరుపుతారు. వానల కోసం పిల్లుల ఊరేగింపు జరిపే ఈ వేడుకను ‘హే న్యాంగ్ మ్యావ్’ అంటారు. ఆడపిల్లులను, ముఖ్యంగా నల్లపిల్లులను, ప్రస్ఫుటమైన నల్లని మచ్చలు ఉన్న పిల్లులను ఎంపిక చేసుకుని, వాటిని వెదురు బుట్టల్లో కూర్చుండబెట్టి ఊళ్లోని ప్రతి ఇంటి వద్ద ఆగుతూ ఊరేగింపు జరుపుతారు.ఈ ఊరేగింపులో ఉపయోగించడానికి సయామీస్ జాతికి చెందిన పిల్లులు శ్రేష్ఠమైనవని భావిస్తారు. అసలు పిల్లులతో పాటు బుట్టల్లో పిల్లుల బొమ్మలను కూడా పెట్టి జనాలు ఊరేగింపులో పాల్గొంటారు. ఆడపిల్లుల ‘మ్యావ్’ రావాలకు వానదేవుడు కరుణిస్తాడని జనాల నమ్మకం. పిల్లుల ఊరేగింపులో ఊళ్లలోని పిల్లా పెద్దా ఉత్సాహంగా పాల్గొంటారు. సంప్రదాయ వాద్యాలను వాయిస్తూ, పాటలు పాడుతూ ఊరంతా తిరుగుతారు. ఊరేగింపు తర్వాత ప్రార్థనలు జరిపి, సామూహికంగా విందు భోజనాలు చేస్తారు.ఇవి చదవండి: ఈ గొడుగు ఖరీదు వింటే.. వ్హా.. అంటూ నోరెల్లబెట్టాల్సిందే!! -
ఈ గొడుగు ఖరీదు వింటే.. వ్హా.. అంటూ నోరెల్లబెట్టాల్సిందే!!
ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గొడుగు. పురుషుల ఫ్యాషన్ వస్తువులను తయారు చేసే ఇటాలియన్ కంపెనీ ‘బిలియనీర్ కూటూర్’ దీనిని ప్రత్యేకంగా మొసలి తోలుతో రూపొందించింది. దీనిని కొనుగోలు చేయాలంటే, ముందుగా ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్డర్ల ఒత్తిడి పెరిగితే, ఈ గొడుగు చేతికి అందడం కొంత ఆలస్యం కూడా కావచ్చు.‘బిలియనీర్ కూటూర్’ తయారు చేసే విలాసవంతమైన వస్తువుల కోసం పోటీపడే అపర కుబేరులు ఈ గొడుగు కోసం కూడా పోటీ పడుతున్నారు. దీని ధర 50 వేల డాలర్లు (రూ.41.54 లక్షలు). అత్యంత ఖరీదైన గొడుగుల్లో ఇప్పటి వరకు ఈ మొసలి తోలు గొడుగుదే రికార్డు. ఫార్ములా వన్ రేసింగ్ దిగ్గజం ఫ్లావియో బ్రియాటోర్ వంటి అతి కొద్దిమంది అపర కుబేరులు మాత్రమే ఇప్పటి వరకు ఈ మొసలితోలు గొడుగును కొనుగోలు చేశారు.ఇవి చదవండి: ఇదేంటో తెలుసా? దీనిని తాకితే.. ప్రాణాలకే? -
పిల్లల కథ.. కోయిలమ్మ కొత్తగూడు!
గోదావరికి ఈవల ఉన్న వసంత విహారం అనే అడవికి కొత్తగా వచ్చింది కోయిలమ్మ. దాని దరికి చేరాయి మిగిలిన పక్షులన్నీ! అందులో నెమలి, పావురాలు, గోరువంకలు, గువ్వలు, వడ్రంగి పిట్టలు, పాలపిట్టలు, కాకులూ న్నాయి. వాటిని చూడగానే వినయంగా నమస్కరించింది కోయిల. ‘నేను ఇంతకు ముందు కృష్ణ తీరాన వున్న అడవిలో ఉండే దాన్ని. నా జోడీ ఒక ప్రమాదంలో మరణించడంతో ఇక అక్కడ ఉండలేక ఇలా వచ్చాను.మీరు ఆదరిస్తే ఇక్కడే ఉండి పోతాను. ఇప్పుడు నాకు గుడ్లు పెట్టే సమయం నన్ను ఆదరించండి’ అంటుంది కోయిల. ‘నీవు ఇక్కడ ఉండడానికి మాకే అభ్యంతరమూ లేదు’ అన్నాయి ఆ పక్షులు. ‘చాలా సంతోషం. అలాగే నాకు గుడ్లు పెట్టుకోవడానికి ఓ గూడు చూపించండి’ అని కోరింది కోయిల. ‘వేరే గూడు ఎందుకు? మా కాకమ్మ గూడు ఉందిగా’ అన్నది గోరువంక. ‘అయ్యో.. నా గూడు చాలా చిన్నది. ఇప్పటికే నేను నాలుగు గుడ్లు పెట్టున్నాను. ఖాళీ లేదు’ నొచ్చుకుంది కాకి. ‘అయితే.. వేరే పెద్ద గూడు కట్టుకుంటే సరి’ సలహా ఇచ్చింది గువ్వ. ‘ఇప్పటికిప్పుడు వేరే గూడు అంటే మాటలా?’ ఆందోళన చెందింది కాకి. ‘పని కోయిలమ్మది కనుక తాను సహాయ పడుతుంది’ తీర్మానించాయి మిగిలిన పక్షులు. ‘తనకి కొత్త కనుక మేం కూడా సహాయ పడతాం’ చెప్పాయి గువ్వ, గోరింకలు.గూడు కట్టడం మొదలయింది. ఎండిన పుల్లలు, నార, ఈనులను కోయిలమ్మ తీసుకురాగా.. కొత్త గూడు కట్టసాగింది కాకి. నాలుగు రోజుల్లోనే కోయిల గుడ్లు కోసం కొత్త గూడు తయారయింది. ‘నువ్వు వేరే చోట ఉండడం ఎందుకు ఈ కొత్త గూటిలోనే నీ గుడ్లనూ పొదుగు’ అంది కోయిల. దాంతో కాకమ్మ తన గుడ్లను కొత్త గూటికి చేర్చింది. కోకిల గుడ్లు, తన గుడ్లని తేడా లేకుండా రెండిటినీ పొదిగింది కాకి. నాలుగు కాకి పిల్లలు, మూడు కోయిల పిల్లలతో గూడు కళకళలాడింది.తన పిల్లలను చూసుకుంటూ మురిసిపోయింది కోయిల. పిల్లలన్నీ కాస్త పెరిగాక.. కాకి పిల్లలకి.. కోయిల పిల్లలు తమ జాతివి కావని తెలిసింది. ఒకరోజు అమ్మ లేని సమయంలో తెలిసీతెలియని వయసున్న కాకి పిల్లలన్నీ కోయిల పిల్లల్ని బయటకి నెట్టేశాయి. పాపం కోయిల పిల్లలు గూడు నుంచి కిందపడ్డాయి. చెట్టు కింద మెత్తని మట్టి ఉండటం వలన వాటికేమీ కాలేదు. తిరిగి వచ్చిన కాకి జరిగింది తెలుసుకుని తన పిల్లలని మందలించింది.కాకి పిల్లలు తల్లికి ఎదురు తిరిగాయి.. ‘ఎవరి పిల్లలనో మనమెందుకు ఆదరించాలి?’ అని! పిల్లల అమాయకత్వాన్ని చూసి ఏమీ మాట్లాడలేకపోయింది కాకి. కిందపడిన తన పిల్లలను చూసి కన్నీరు పెట్టుకుంది కోయిల. పక్కనే ఉన్న మర్రి చెట్టు తొర్రలోకి వాటిని చేర్చింది. ఎదుగుతున్న కోయిల పిల్లలు కొత్త రాగాలు ఆలపించసాగాయి. కోయిలా వాటితో జత కలిపింది. వాటి పాటలు వినడానికి పక్షులన్నీ అక్కడికి వచ్చేవి. కొన్ని తమ పిల్లలకి పాటలు నేర్పమని కోయిలని బతిమాలాయి. అలా కోయిల పక్షులకి పాటలు నేర్పడం మొదలుపెట్టింది.కాకి పిల్లలూ పాటలు నేర్చుకోవాలని అనుకున్నాయి. కోయిలమ్మతో మాట్లాడి తమకు పాటలు నేర్పించమని తల్లిని పోరాయి. ‘ఏ మొహం పెట్టుకుని అడగాలి మీరు చేసిన పనికి?’ అని పిల్లల్ని కోప్పడింది కాకి. ‘తెలియక చేసిన తప్పు అది. నువ్వా రోజు మా తప్పును సరిదిద్ది ఉండాల్సింది’ అన్నాయి తల్లితో. ‘నిజమే.. అప్పుడు మీ మీద మమకారంతో నా కళ్లుమూసుకుపోయాయి. అందుకే నాకిప్పుడు మొహం చెల్లడం లేదు కోయిల దగ్గరకు వెళ్లడానికి!’ అని బాధపడింది కాకి.‘సరే అయితే.. మేమే అడుగుతాం.. మమ్మల్ని క్షమించమని’ అన్నాయి ఆ పిల్లలు ముక్త కంఠంతో! ‘శభాష్.. ఇప్పుడు నా పిల్లలు అనిపించుకున్నారు మీరు. చేసిన తప్పుని గ్రహించి.. క్షమాపణ అడగాడానికి సిద్ధమయ్యారు’ అంటూ పిల్లల పరిణతికి సంతోషపడింది కాకి. ఆ కొమ్మకు కాస్త దూరంలో ఉన్న కోయిల ఆ సంభాషణనంతా విన్నది. వెంటనే తన పిల్లల్ని పిలిచి కాకి పిల్లలను వెంటబెట్టుకుని రమ్మనమని వాటిని కాకి గూటికి పంపింది. అవి కాకి గూటికి వెళ్లి.. ‘మా అమ్మ మిమ్మల్ని మా గూటికి రమ్మంటోంది.మా గూడు కోసం మీ అమ్మ మాకు చాలా సాయం చేసిందట కదా.. అసలు మమ్మల్ని మీ అమ్మే పొదిగిందట కదా మా అమ్మ చెప్పింది. మనం అన్నదమ్ములమనీ.. పోట్లాడుకోకూడదనీ చెప్పింది’ అంటూ కాకి పిల్లలను తమ వెంట తీసుకెళ్లాయి. వాటి మాటలకు అబ్బురపడింది కాకి. ‘ఎంత మంచిదానవు కోయిలా.. పిల్లల్ని ఎంత బాగా పెంచావు!’ అంటూ కోయిలను ప్రశంసించింది. ‘ఊరుకో కాకమ్మా.. నువ్వు చేసిన సాయం గురించి చెప్పానంతే! మీ సహవాసం వల్ల నాకూ కాసింత మంచితనం అబ్బినట్టుందిలే. ఈ పొగడ్తలకేం కానీ.. పిల్లలకు పాటలు నేర్పనివ్వూ..’ అంటూ కాకిపిల్లలతో సాధన మొదలుపెట్టించింది కోయిల. – కూచిమంచి నాగేంద్ర -
బ్రహ్మ నారదుల పరస్పర శాపాలు..
శ్రీమన్నారాయణుడి నాభి కమలం నుంచి ఉద్భవించిన బ్రహ్మదేవుడు నారాయణుడి ఆజ్ఞ మేరకు సకల చరాచర జగత్తును సృష్టించే పని ప్రారంభించాడు. బ్రహ్మదేవుడి వెనుక భాగం నుంచి అధర్ముడు, వామ భాగం నుంచి అలక్ష్మి అనే దారిద్య్రదేవత, నాభి నుంచి విశ్వకర్మ, ఆ తర్వాత అష్టవసువులు ఉద్భవించారు.బ్రహ్మ మనసు నుంచి సనక, సనందన, సనాతన, సనత్కుమారులనే నలుగురు పుత్రులు ఉదయించారు. ‘మీరంతా భూమ్మీదకు వెళ్లి సృష్టి చేయండి’ అని వారిని ఆజ్ఞాపించాడు బ్రహ్మదేవుడు.తమకు సంసార వ్యామోహం లేదని చెప్పి, ఆ నలుగురు మానస పుత్రులూ తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయారు. బ్రహ్మ ముఖం నంచి స్వాయంభువ మనువు, అతడి భార్య శతరూప ఆవిర్భవించారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడి భృకుటి నుంచి కాలాగ్ని, మహాన్, మహాత్మ, మతిమాన్, భీషణ, భయంకర, రుతుధ్వజ, ఊర్ధ్వకేశ, పింగళాక్ష, రుచి, శుచి అనే ఏకాదశ రుద్రులు ఉద్భవించారు. వీరిలో కాలాగ్ని రుద్రుడు ప్రళయకాలంలో సృష్టిని సంహరిస్తాడు.ఏకాదశ రుద్రుల ఆవిర్భావం తర్వాత బ్రహ్మదేవుడి కర్ణేంద్రియాల నుంచి పులస్త్యుడు, పులహుడు, కుడికంటి నుంచి అత్రి, ఎడమకంటి నుంచి క్రతు, నాసిక నుంచి అరణి, ముఖం నుంచి అంగిరస, ఎడమభాగం నుంచి భృగువు, కుడిభాగం నుంచి దక్షుడు, ఆయన నీడ నుంచి దక్షుడు, కంఠభాగం నుంచి నారదుడు, స్కంధభాగం నుంచి మరీచి, గొంతు నుంచి అపాంతరతమ, నాలుక నుంచి వశిష్ఠ, పెదవుల నుంచి హంస మహర్షి, కుడి పార్శ్వం నుంచి యతి తదితర మహర్షులు ఉద్భవించారు.బ్రహ్మదేవుడు వారందరినీ పిలిచి, ‘మీరంతా నేటి నుంచి సృష్టికార్యం చేయండి’ అని ఆజ్ఞాపించాడు. నారదుడికి బ్రహ్మదేవుడి ఆజ్ఞ రుచించలేదు. ‘తండ్రీ! మాకంటే ముందుగా పుట్టిన మా సోదరులు సనక సనందాదులకు ముందుగా వివాహం చేసి, వారిని సృష్టికార్యానికి వినియోగించు. ఆ తర్వాత మమ్మల్ని గురించి ఆలోచించవచ్చు. వారేమో తపస్సు చేయడానికని వెళ్లిపోయారు. వారినేమీ అనకుండా, మమ్మల్ని సంసార నరకకూపంలోకి తోసేయాలని అనుకోవడం ఏమి న్యాయం? సంసారకూపంలో చిక్కుకున్నవాళ్లు ఎంతటివారైనా దాని నుంచి బయట పడలేరు కదా! మాకు కూడా సంసారం చేసి, సృష్టికార్యాన్ని కొనసాగించాలనే ఇచ్ఛ లేదు. తపోవృత్తిని ఆశ్రయించి జీవించాలనేదే మా కోరిక’ అన్నాడు నారదుడు. నారదుడి నిష్ఠురానికి బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది.‘నన్ను ధిక్కరించడమే కాకుండా, ఎదురు సమాధానం చెబుతావా? అందుకే నిన్ను శపిస్తున్నాను. నేటి నుంచి నీ జ్ఞానం అంతరిస్తుంది. త్వరలోనే నువ్వు గంధర్వుడిగా జన్మిస్తావు. ఆ జన్మలో నువ్వు స్త్రీలోలుడివి అవుతావు. ఎందరో స్త్రీలతో విషయ భోగాలను అనుభవిస్తావు. ఆ జన్మ చాలించిన తర్వాత ఒక దాసికి పుత్రుడిగా జన్మిస్తావు. ఆ జన్మలో విష్ణుకథలను వినడం వల్ల, విష్ణుభక్తులను సేవించడం వల్ల తర్వాత జన్మలో తిరిగి నా పుత్రుడిగా జన్మిస్తావు. నువ్వు చేసిన అపరాధానికి ఇదే తగిన శిక్ష’ అని కఠినంగా పలికాడు.బ్రహ్మ శాపంతో నారదుడికి దుఃఖం ముంచుకొచ్చింది. ‘తండ్రీ! నా మీద కోపాన్ని ఉపసంహరించుకో! ఎందరినో సృష్టించే నీకు కోపం తగదు. అయినా, నేనేం తప్పు చేశానని? నేను చెడుమార్గంలో సంచరిస్తూ ఉంటే నన్ను దండించవచ్చు గాని, నేను తపస్సు చేసుకుంటానంటే అకారణంగా శపించావే! ఇదేమైనా న్యాయమా? భావ్యమా? శపిస్తే శపించావు గాని, ఎన్ని జన్మలు ఎత్తినా హరిభక్తి విడవకుండా ఉండేలా నన్ను అనుగ్రహించు. బ్రహ్మపుత్రుడైనా సరే హరిభక్తి లేనివాడు సూకరంతో సమానుడు’ అన్నాడు నారదుడు.అప్పటికి కాస్త శాంతించిన బ్రహ్మ ‘అన్ని జన్మలలోనూ నువ్వు హరిభక్తుడిగానే ఉంటావు’ అన్నాడు.‘తండ్రీ! ఏ యజమాని అయినా తన భార్యకు, సంతానానికి, బంధువులకు, సేవకులకు సన్మార్గాన్ని చూపిస్తే అతడు ఉత్తమ గతులు పొందుతాడు. అలా కాకుండా, చెడుమార్గాన్ని చూపిన వాడు నరకానికి పోతాడు. శ్రీహరి మీద భక్తిప్రపత్తులను పెంచుకున్నవాడిని తిరస్కరిస్తే, అతడు గురువైనా, తండ్రి అయినా, కొడుకు అయినా, యజమాని అయినా దుర్మార్గుడే అవుతాడు. అందువల్ల తండ్రీ! నా తప్పు లేకపోయినా నువ్వు నన్ను శపించావు. కాబట్టి నువ్వు కూడా శాపానికి అర్హుడివే!సకల సృష్టికీ కారకుడివి అయినప్పటికీ నీకు మంత్రం, స్తోత్రం, పూజ అనేవి లోకంలో లేకుండా పోతాయి. నీకు భూమ్మీద ఆలయాలు కూడా ఉండవు. నిన్ను ప్రత్యేకంగా ఆరాధించే భక్తులెవరూ ఉండరు. నా శాప ప్రభావం మూడు కల్పాల వరకు ఉంటుంది. మూడు కల్పాలు గడచిన తర్వాత మాత్రమే నీకు ఇతర దేవతలతో సమానమైన పూజలు అందుతాయి’ అని శపించాడు నారదుడు. నారదుడి శాపం కారణంగానే బ్రహ్మదేవుడికి ఎక్కడా ఆలయాలు లేవు. బ్రహ్మదేవుడికి ప్రత్యేకమైన మంత్ర స్తోత్రాలేవీ లేవు. – సాంఖ్యాయన -
పంఘాల్ పంచ్..
అమిత్ పంఘాల్ ఎత్తు 5 అడుగుల 2 అంగుళాలు మాత్రమే. బాక్సింగ్ ఆటపరంగా చూస్తే ఇది ఒక రకంగా ‘పొట్టి’ కిందనే లెక్క. అతని కెరీర్లో పెద్ద సంఖ్యలో తనకంటే ఎంతో ఎత్తయిన బాక్సర్లనే ఎదుర్కోవాల్సి వచ్చింది. సాధారణంగా రింగ్లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యంతో పంచ్లు విసిరేందుకు ఎత్తు కూడా కీలకంగా పని చేస్తుంది. ఇక్కడే అమిత్లో లోపం కనిపించింది. ‘చిన్నప్పటి నుంచి నాకు ఇదే సమస్య. కొన్నిసార్లు నేను పూర్తిగా ఆకాశంలోకి చూస్తూ ప్రత్యర్థితో తలపడుతున్నానేమో అనిపించేది’ అని అమిత్ చెప్పుకున్నాడు కానీ తన పట్టుదలతో అతను దానిని అధిగమించాడు.అసాధారణంగా, మెరుపు వేగంతో పంచ్లు విసరడాన్ని సాధన చేసిన అతను అందులో ఆరితేరాడు. ప్రాక్టీస్లో కూడా కావాలనే తనకంటే ఎత్తు ఎక్కువ ఉన్న బాక్సర్లతోనే అతను పోటీ పడేవాడు. కెరీర్ ఎదుగుతున్న దశలో అదే అతడి బలంగా మారి అమిత్ను పెద్ద బాక్సర్ను చేసింది.అన్న అండగా నిలవడంతో...హరియాణాలోని రోహ్టక్ పట్టణానికి సమీపంలో ఉన్న ఊరు ‘మేనా’ అమిత్ స్వస్థలం. రైతు కుటుంబం నుంచి వచ్చాడు. అతని పెద్దన్న అజయ్ పంఘాల్ ముందుగా బాక్సింగ్లోకి వచ్చాడు. అతని ద్వారానే అమిత్కూ ఆటపై ఆసక్తి పెరిగింది. ముందుగా ఫిట్నెస్ మెరుగుపరచుకోవడం కోసమనే బాక్సింగ్లో చేరినా, ఆ తర్వాత పూర్తి స్థాయిలో బాక్సింగ్పై దృష్టి పెట్టాడు. అనిల్ ధన్కర్ అనే రాష్ట్ర స్థాయి కోచ్ రోహ్టక్లో శిక్షణ ఇచ్చేవాడు. ఇద్దరూ అక్కడే కోచింగ్ తీసుకున్నారు.అయితే అజయ్ ఆశించిన రీతిలో పెద్ద స్థాయికి చేరలేకపోయాడు. కానీ జాతీయ స్థాయిలో కొన్ని చక్కటి ప్రదర్శనలతో ఆర్మీలో హవల్దార్గా ఉద్యోగం మాత్రం పొందగలిగాడు. మరో వైపు అమిత్ పంచ్లు, అతని శైలి మాత్రం కోచ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టేలా చేశాయి. దాంతో అజయ్కు మున్ముందు తాను ఏం చేయాలో అర్థమైంది. తను పూర్తిగా ఆట నుంచి తప్పుకొని తమ్ముడిని తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టాడు.2018 ఆసియన్ గేమ్స్ స్వర్ణ పతకంతో, తల్లిదండ్రులతో..తన ఉద్యోగం కారణంగా ఆర్థికపరంగా కూడా చేయూత ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ తప్ప మరో ప్రపంచం లేకుండా కష్టపడాలని హితబోధ చేశాడు. దీనిని చిన్న వయసులోనే అర్థం చేసుకున్న అమిత్ 24 గంటలూ బాక్సింగ్నే తన భాగస్వామిగా మార్చుకున్నాడు. ఇప్పటికీ, ఏ స్థాయికి చేరినా తన సోదరుడు తన కోసం చేసిన త్యాగాలను అతను గుర్తు చేసుకుంటాడు. ప్రతి మ్యాచ్కు ముందు అన్న సూచనలను తీసుకునే అమిత్.. అతడిని బెస్ట్ కోచ్ అంటూ పిలుస్తాడు.జాతీయ స్థాయిలో మెరిసి...అమిత్కు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతని బరువు 24 కిలోలే! బక్కగా, బలహీనంగా కనిపించేవాడు. కానీ పట్టుదల, పోరాటానికి ఏమాత్రం లోటు లేదు. అందుకే నన్ను చూసి కాదు నా ఆటను చూసి తలపడండి అంటూ బరిలోకి దిగేవాడు. చాలా సందర్భాల్లో తనకంటే ఎక్కువ వయసు ఉన్న ఎంతో బలమైన ఆటగాళ్లను అతను పడగొట్టాడు. ఈ క్రమంలో 14 ఏళ్ల వయసులోనే జాతీయ సబ్ జూనియర్ చాంపియన్గా అమిత్ నిలిచాడు. అన్న అండ, ప్రోత్సాహంతో మరింత దూసుకుపోయిన అమిత్ గుర్గావ్లోని కాంబాట్ బాక్సింగ్ క్లబ్లో చేరాడు. అక్కడి అతని బాక్సింగ్ మరింత పదునెక్కింది.కాంబాట్ క్లబ్లో శిక్షణ తర్వాత జూనియర్ స్థాయిలో వరుసగా విజయాలు వచ్చాయి. ఈ క్రమంలో 2017లో అతడిని కోచ్లు సీనియర్ స్థాయికి ప్రమోట్ చేశారు. అతను ఆ స్థాయికి తగినవాడా అనే సందేహాలు వచ్చిన నేపథ్యంలో అమిత్ పట్టుదలగా ఆడి తానేంటో నిరూపించుకున్నాడు. వారు తీసుకున్న నిర్ణయానికి న్యాయం చేస్తూ సీనియర్ జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్లో స్వర్ణం సొంతం చేసుకున్నాడు.2019 ఆసియన్ చాంపియన్ షిప్ స్వర్ణ పతకంతో, 2024 పారిస్ ఒలింపిక్స్కు ఎంపికైన అమిత్..ప్రపంచ వేదికలపై...జాతీయ విజేతగా మారిన తర్వాత అవకాశాలు వరుసగా రావడంతో పాటు మరింత స్థాయికి ఎదిగేందుకు దోహదం చేశాయి. 2017లో ఆసియా చాంపియన్షిప్ కాంస్యం గెలుచుకోవడంతో అతని సత్తా ఏమిటో అందరికీ తెలిసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే 22 ఏళ్ల వయసులో అమిత్ తొలిసారి వరల్డ్ చాంపియన్షిప్లో కూడా పాల్గొన్నాడు. అక్కడ పతకం గెలవకపోయినా ఆ అనుభవం పెద్ద స్థాయిలో రాటుదేలేందుకు ఎంతో పనికొచ్చింది.క్వార్టర్ ఫైనల్లో తలవంచినా, ఆ మ్యాచ్లో రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ఉజ్బెకిస్తాన్కు చెందిన హసన్బయ్ దుస్మతోవ్ను అతను నిలువరించిన తీరు అందరీ ఆకట్టుకుంది. ఇదే జోరులో 2018 కామన్వెల్త్ చాంపియన్షిప్లో బరిలోకి దిగే అవకాశం లభించింది. లైట్ ఫ్లయ్వెయిట్ కేటగిరీలో వరుస విజయాలతో సత్తా చాటిన అతను ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అయితే బ్రిటిష్ బాక్సర్ గలాల్ యాఫైతో జరిగిన ఫైనల్లో హోరాహోరీగా పోరాడి చివరకు తలవంచాడు. దాంతో ఈ క్రీడల్లో రజతపతకం దక్కింది.అయితే సరిగ్గా నాలుగేళ్ల తర్వాత జరిగిన 2022 కామన్వెల్త్ క్రీడల్లో తన స్థాయిని అమిత్ పెంచుకున్నాడు. ఆ పోటీల్లో అదే విభాగంలో అతను స్వర్ణం సాధించడం విశేషం. అంతకు ముందు 2018లోనే జరిగిన ఆసియా క్రీడల్లో కూడా అమిత్ స్వర్ణపతకంతో మెరిశాడు. దీంతో పాటు ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్లో వరుసగా మూడుసార్లు అతను పతకంతో తిరిగి రావడం పంఘాల్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. 2017లో కాంస్యం, 2019లో స్వర్ణం గెలిచిన అతను.. 2021లో రజత పతకాన్ని అందుకున్నాడు.వరల్డ్ నంబర్వన్గా...2019లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్ అమిత్ను అగ్రశ్రేణి బాక్సర్ల జాబితాలో చేర్చింది. ఈ టోర్నీకి కొద్ది రోజుల ముందే ఆసియా చాంపియన్షిప్లో పసిడి గెలిచిన ఊపులో అమిత్ ఉన్నాడు. అప్పటి వరకు ప్రపంచ చాంపియన్షిప్లో భారత్ నుంచి ఐదుగురు పతకాలు సాధించగా, వీరంతా కాంస్యానికే పరిమితమయ్యారు. కానీ వీరందరినీ అధిగమించి అమిత్ రజతపతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయుడిగా నిలిచాడు. ఆ సమయంలో అద్భుత ఫామ్లో ఉన్న అమిత్ ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య ప్రకటించిన వరల్డ్ ర్యాంకింగ్స్లో 52 కేజీల విభాగంలో నంబర్వన్గా నిలవడంతో అతని కెరీర్ శిఖరానికి చేరింది. ప్రస్తుతం భారత ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్గా అతను పని చేస్తున్నాడు.2019 ప్రపంచ చాంపియన్ షిప్ రజత పతకంతో.., కామన్ వెల్త్ స్వర్ణ పతకంతో అమిత్ (2022)ప్రతికూల పరిస్థితి దాటి...అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాల తర్వాత బాక్సింగ్ సమాఖ్య అమిత్ పంఘాల్ పేరును ప్రతిష్ఠాత్మక ఖేల్రత్న పురస్కారం కోసం సిఫారసు చేసింది. అంతకు ముందు వరుసగా మూడేళ్లు అర్జున అవార్డు కోసం సిఫారసు చేసినా, అతడి పేరును కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఒకప్పుడు డోపింగ్లో పట్టుబడ్డాడనేది దానికి కారణంగా చెప్పింది. అయితే నిజానికి అమిత్ 2012లో 17 ఏళ్ల వయసులో యూత్ స్థాయిలో ఆడుతున్నప్పుడు ఇది జరిగింది.తాను ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్ తీసుకోలేదని, చికెన్ పాక్స్ కోసం చికిత్స చేయిస్తుండగా వాడిన మందుల్లో నిషేధక ఉత్ప్రేరకం ఉన్నట్లు తేలింది. దీనిపై అతను చాలా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. యూత్ స్థాయిలో చేసిన తప్పులను ఎవరైనా మన్నిస్తారని, అయినా కూడా దానికి తాను తగిన శిక్ష కూడా అనుభవించానని అతను చెప్పాడు. భారత్ తరఫున తన ఘనతలను పరిగణించాలని పంఘాల్ కోరాడు. చివరకు 2022లో కేంద్రం అమిత్ను ‘అర్జున’ అవార్డుతో గౌరవించింది.‘ఒలింపిక్ పతకం సాధించిన రోజే బాక్సింగ్లో నా ప్రయాణం మొదలైనట్లుగా భావిస్తాను’... అమిత్ చేసిన ఈ వ్యాఖ్య ఒలింపిక్ మెడల్ విలువేంటో చెబుతుంది. టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్నా, అనూహ్య రీతిలో అతను విఫలమైన నిష్క్రమించాడు. కానీ ఇప్పుడు మరో ఒలింపిక్స్కు అమిత్ సిద్ధమయ్యాడు. 2024 పారిస్ ఒలింపిక్స్లో పతకం సాధించాలనే పట్టుదలతో శ్రమిస్తున్న ఈ బాక్సర్ కల నెరవేరాలని ఆశిద్దాం. – మొహమ్మద్ అబ్దుల్ హాది -
చూడటానికి ఇది సాదాసీదా సైకిల్ కానేకాదు..
చూడటానికి ఇది సాదాసీదా సైకిల్లాగానే కనిపించినా, నిజానికిది ఫాస్ట్ ఫోల్డింగ్ ఈ–బైక్. ఇప్పటికే కొన్ని ఫోల్డింగ్ ఈ–బైక్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిని మడతపెట్టడానికి రెండు మూడు నిమిషాల సమయం పడుతుంది.బ్రిటిష్ కంపెనీ ‘డికాథ్లాన్’ తాజాగా మార్కెట్లోకి ‘బీటీవిన్ ఈ–ఫోల్డ్–900’ పేరుతో తీసుకు వచ్చిన ఈ ఎలక్ట్రిక్ బైక్ను కేవలం ఒక సెకండులోనే మడతపెట్టి కోరుకున్న చోటుకు తేలికగా తీసుకుపోవచ్చు. ఇది 252 డబ్ల్యూహెచ్ సామర్థ్యం గల రీచార్జ్ బ్యాటరీతో పనిచేస్తుంది. బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేశాక 55 కిలోమీటర్ల వరకు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది.బ్రష్లెస్ మోటారుతో తయారైన దీని గరిష్ఠ వేగం గంటకు 25 కిలోమీటర్లు. నగరాలు, పట్టణాల రహదారుల్లోనే కాకుండా ఎగుడు దిగుడు కొండ దారుల్లో కూడా సునాయాసంగా ప్రయాణించేలా దీనిని తీర్చిదిద్దడం విశేషం. ప్రస్తుతం దీనిని యూరోప్ మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చారు. దీని ధర 1499 పౌండ్లు (రూ.1.59 లక్షలు).ఇవి చదవండి: ఇది డబుల్ డెక్కర్ బస్సు.. అలాగే రెస్టారెంట్ కూడా! -
ఇది డబుల్ డెక్కర్ బస్సు.. అలాగే రెస్టారెంట్ కూడా!
నగర సంచారం చేస్తూ, నోరూరించే రుచులను ఆస్వాదించే అనుభవాన్ని ప్రయాణికులకు అందిచాలనే ఉద్దేశంతో డబుల్ డెక్కర్ బస్సును రెస్టారెంట్గా మార్చేశారు. ‘బస్ట్రోనోమ్’ పేరుతో ప్రారంభించిన ఈ రెస్టారంట్ బస్సులు లండన్, పారిస్ నగరాల్లో పర్యాటక ఆకర్షణగా నిలుస్తున్నాయి.ఫ్రాన్స్కు చెందిన జీన్ క్రిస్టోఫ్ ఫార్నీర్, బెర్ట్రాండ్ మాథ్యూ అనే మిత్రులు 2013లో బస్సులో రెస్టారంట్ను ప్రారంభించాలని తలపెట్టారు. సరికొత్త డబుల్ డెక్కర్ బస్సును కొనుగోలు చేసి, దానిని పూర్తి స్థాయి రెస్టారెంట్లా మార్చారు. బస్సు కింది భాగంలో వంట గది, వంట సామగ్రి, సిబ్బంది ఉండటానికి వీలుగా తయారు చేసి, పైభాగాన్ని రెస్టారంట్గా తీర్చిదిద్దారు.ఇందులో 38 మంది కూర్చుని, విందు భోజనాలు ఆరగిస్తూ, పరిసరాలను పరిశీలిస్తూ నగర సంచారం చేయవచ్చు. తొలుత ‘బస్ట్రోనోమ్’ సేవలను పారిస్లో ప్రారంభించారు. పర్యాటకుల నుంచి విపరీతమైన స్పందన రావడంతో ఇటీవల లండన్లో కూడా మరో బస్సును రెస్టారంట్గా మార్చి పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చారు. -
ఈ చెట్టుని కోతులు కూడా ఎక్కలేవు! ఎందుకో తెలుసా?
కోతులు ఏ చెట్టు మీదకైనా ఇట్టే ఎక్కేస్తాయి. ఈ చెట్టు మీద మాత్రం కోతులు అడుగుపెట్టవు. దీనిని ‘శాండ్బాక్స్ ట్రీ’ అంటారు. దీని కాండం నిండా పదునైన విషపు ముళ్లు ఉంటాయి.దాదాపు రెండువందల అడుగు ఎత్తు వరకు పెరిగే ఈ చెట్ల ఆకులు రెండడుగుల పరిమాణంలో ఉంటాయి. ఈ చెట్లకు చిన్నసైజు గుమ్మడికాయల వంటి కాయలు కాస్తాయి. ఇవి పూర్తిగా పండిపోయాక పేలిపోతాయి. ఈ పండ్ల పేలుడు ధాటికి వాటి నుంచి గింజలు 250 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తాయి. ఈ చెట్లు ఉష్ణమండల ప్రాంతాల్లోని తడినేలల్లో పెరుగుతాయి.ఇవి చదవండి: ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా.. -
Nidhi Mohan Kamal: తాను.. ఒక 'ఆల్ ఇన్ వన్'!
ఫుడ్ సైంటిస్ట్, ‘NidSun వెల్నెస్’కి డైరెక్టర్, పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్, అష్టాంగ యోగా టీచర్ కూడా! ఢిల్లీలో పుట్టిపెరిగింది. ఫుడ్ అండ్ కెమికల్ ఇంజినీరింగ్ రెండిట్లో గ్రాడ్యుయేషన్ చేసింది.బాడీ షేపింగ్ ఇండస్ట్రీలోకి 2007లో ఎంటర్ అయింది. న్యూట్రిషన్ ఫుడ్కి సంబంధించి ఆమె ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా మొదలు పలు వెబ్సైట్స్కీ ఆర్టికల్స్ రాస్తుంటుంది. ఆమె చేసిన హోమ్ వర్కవుట్ వీడియో సిరీస్ WION news అనే చానెల్లో ‘ద బ్రేక్ఫస్ట్ షో’ పేరుతో ప్రసారమైంది. వాటిని ఆమె తన యూట్యూబ్ చానెల్లోనూ పోస్ట్ చేసింది. స్పోర్ట్స్ న్యూట్రిషన్లోనూ నిధికి స్పెషలైజేషన్ ఉంది. పుమాకి అంబాసిడర్గా కూడా వ్యవహరించింది.ఇవి చదవండి: ప్రపంచంలోనే అతిచిన్న జైలు.. ఖైదీలు ఎందరో తెలుసా? -
ప్రపంచంలోనే అతిచిన్న జైలు.. ఖైదీలు ఎందరో తెలుసా?
ఇది ప్రపంచంలోనే అతిచిన్న చెరసాల. ఇద్దరు ఖైదీల సామర్థ్యం మాత్రమే గల ఈ జైలు బ్రిటన్లోని సార్క్ దీవిలో ఉంది. ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఇంగ్లిష్ చానల్లోని చానల్ దీవుల ద్వీపసమూహంలో ఒకటైన సార్క్ దీవి విస్తీర్ణం 5.4 చదరపు కిలోమీటర్లు మాత్రమే! ఈ దీవి జనాభా 562 మంది.ఈ దీవిలో 1856లో ఈ జైలును నిర్మించారు. చెక్కపీపాను దీనికి పైకప్పుగా ఏర్పాటు చేయడం ఇందులోని మరో విశేషం. తొలిరోజుల్లో ఈ జైలుకు విద్యుత్ సౌకర్యం కూడా ఉండేది కాదు. జైలు నిర్మించిన దాదాపు శతాబ్దం తర్వాత మాత్రమే దీనికి విద్యుత్తు సౌకర్యం వచ్చింది. ఇందులో ఇద్దరు ఖైదీల కోసం రెండు గదులు, రెండు గదుల మధ్య సన్నని నడవ మాత్రమే ఉంటాయి. ఈ జైలు ఇప్పటికీ వినియోగంలో ఉండటం విశేషం.అయితే, ఈ జైలులో ఖైదీలను ఎక్కువకాలం నిర్బంధంలో ఉంచరు. ఏదైనా నేరారోపణతో పట్టుబడిన నిందితులను ఈ జైలులో రెండు రోజుల వరకు ఉంచుతారు. కోర్టులో హాజరుపరచిన తర్వాత ఇక్కడి నుంచి గ్రంజీ దీవిలోని పెద్ద జైలుకు తరలిస్తారు. సార్క్ దీవి అధికార యంత్రాంగానికి బ్రిటిష్ రాచరికం పరిమితంగా మాత్రమే న్యాయవిచారణ అధికారాలను ఇచ్చింది.ఇక్కడ పట్టుబడిన ఖైదీలను రెండు రోజులకు మించి నిర్బంధించరాదని, అంతకు మించిన శిక్ష విధించాల్సిన నేరానికి పాల్పడినట్లయితే వారిని గ్రంజీ జైలుకు తరలించాలని 1583లో అప్పటి బ్రిటిష్ రాచరికం ఆదేశాలు జారీచేసింది. ఆనాటి ఆదేశాలే ఇక్కడ ఈనాటికీ అమలులో ఉన్నాయి. అయితే, ఈ జైలుకు తరచు ఖైదీల రాక ఉండదు. తక్కువ జనాభా గల ఈ దీవిలో నేరాలు కూడా చాలా తక్కువ.ఇవి చదవండి: 'అపార్ట్మెంట్ 66బి’ గురించి.. కనీసం మాట్లాడాలన్నా ధైర్యం చాలదు! -
Beauty Tips: మీ ముఖంపై బ్లాక్హెడ్స్ తొలగించాలంటే..??
ముఖాన్ని కళావిహీనం చేసే సమస్యల్లో బ్లాక్హెడ్స్ మహా మొండివి. గడ్డం, ముక్కు, నుదురు సహా ముఖం మీద పలు భాగాల్లో కనిపించే ఈ బ్లాక్హెడ్స్ తొలగించడమంటే .. కాస్త నొప్పితో కూడిన పనే. అయితే చిత్రంలోని ఈ మెషిన్.. హై–డెఫినిషన్ పిక్సెల్ 20గీ మాగ్నిఫికేషన్ టెక్నాలజీతో ఎలాంటి నొప్పి లేకుండా బ్లాక్హెడ్స్ను తొలగించి ముఖాన్ని నీట్గా మారుస్తుంది.ఈ డివైస్లో మొత్తం ఐదు లెవెల్స్ ఉంటాయి. దీని పైన.. వాక్యూమ్ హెడ్స్ని బిగించే భాగంలో చిన్న కెమెరా ఉంటుంది. ఈ డివైస్ని స్మార్ట్ఫోన్కి కనెక్ట్ చేసుకుంటే, చర్మాన్ని స్కాన్ చేసి ఎక్కడెక్కడ డ్యామేజ్ అయ్యిందో, ఎక్కడెక్కడ బ్లాక్హెడ్స్ ఉన్నాయో చూపెడుతుంది. కింది భాగంలో హీటింగ్ మసాజర్ హెడ్ ఉంటుంది. దీన్ని వినియోగించడం చాలా తేలిక. మొదటి లెవెల్ ఆప్షన్తో.. చర్మపు తీరుతెన్నులను పరిశీలించుకోవచ్చు.రెండో లెవల్ ఆప్షన్తో సెన్సిటివ్ స్కిన్కి, మూడో లెవెల్ ఆప్షన్తో జిడ్డు చర్మానికి, నాల్గవ లెవెల్ ఆప్షన్తో మరింత జిడ్డు చర్మానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఐదవ లెవెల్ ఆప్షన్తో మొండి రంధ్రాలకు సైతం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ తీసుకునే సమయంలో 3 సెకన్ల కంటే ఎక్కువసేపు ఒకే స్థలంలో క్లీన్ చేయకూడదు. దీని ధర 169 డాలర్లు. అంటే 14,036 రూపాయలు.ఇవి చదవండి: ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా.. -
ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
ప్రపంచంలో తేయాకు రకాలు ఎన్నో ఉన్నాయి. అరుదైన రకాల తేయాకుకు, అలాంటి రకాల తేయాకు తయారు చేసిన తేనీటికి ధర ఎక్కువగా ఉంటుంది. చైనాకు చెందిన ఊలాంగ్ టీ చూడటానికి బంగారు రంగులో ఉంటుంది. అంతమాత్రాన అది బంగారు తేనీరు కాదు. సింగపూర్లోని టీడబ్ల్యూజీ కంపెనీ మాత్రం అచ్చంగా బంగారు తేయాకు విక్రయిస్తోంది.నాణ్యమైన తేయాకులను పొడవుగా కత్తిరించి, ఆరబెట్టిన తర్వాత ఆ తేయాకులకు 24 కేరట్ల బంగారు పూత పూసి కళ్లు చెదిరే ప్యాకింగ్తో అందిస్తోంది. బంగారు పూత పూసిన ఈ తేయాకును 50 గ్రాముల మొదలుకొని 1 కిలో వరకు ప్యాకెట్లలో అమ్ముతోంది. ఈ తేయాకు తయారు చేసిన తేనీరు బంగారు రంగులో ధగధగలాడుతూ కళ్లు చెదరగొడుతుంది.ప్రస్తుతం దీని ధర కిలో 12,830 డాలర్లు (రూ.10.70 లక్షలు) మాత్రమే! టీడబ్ల్యూజీ కంపెనీ సింగపూర్లో రెస్టారంట్ను కూడా నిర్వహిస్తున్నా, అక్కడ ఈ బంగారు తేనీటిని అందించరు. కావలసిన వారు ఈ తేయాకు ప్యాకెట్లను కొని తీసుకువెళ్లాల్సిందే!ఇవి చదవండి: ఈ 'ట్రే గార్డెన్' ని ఎప్పుడైనా చూశారా? -
ఈ 'ట్రే గార్డెన్' ని ఎప్పుడైనా చూశారా?
చిన్న చిన్న ఎడ్లబండ్లు వాటిలో గ్రామీణ మహిళల బొమ్మలు, చెక్క కుర్చీలు వాటి ముందు చిట్టి చిట్టి బొమ్మలు, హంసలు, పక్షులు, గూళ్లు, గుడిసెలు.. ఇలా ముచ్చటైన వస్తువుల కూర్పుతో ట్రే గార్డెన్ను ఎవరికి వారు తయారు చేసుకోవచ్చు. ఇంట్లో చిన్నపాటి స్థలంలో కూడా వీటిని అందంగా అలంకరించవచ్చు.ఈ విషయాన్ని తన కళతో నిరూపిస్తోంది హర్యానాలోని ఫరీదాబాద్ వాసి యాభై ఐదేళ్ల శారదా గోదారా. తోటలు, పార్కులను పోలిన మినియేచర్ ట్రే గార్డెన్స్ను రూపొందిస్తోందామె. నడివయసులో ఒంటరితనం పోగొట్టుకోవడానికి చేసిన ఆలోచన ఆమెను ఇలా అందమైన లోకంలో విహరించేలా చేసింది. తన ఇంటిలో వెయ్యి మొక్కలతో మినీ జంగిల్ను క్రియేట్ చేసింది.‘మా ఇంటి బయట, మెట్లు, బాల్కనీలు, పెరడు వరకు రకరకాల అందమైన మొక్కలతో నింపేశా. ఆ తర్వాత చిన్న ట్రే గార్డెన్ల తయారీని మొదలుపెట్టాను. అభిరుచి ఉంటే చాలు ఒంటరితనానికి ఎదర్కోవడానికి, ఇంటిని అందంగా అలంకరించడానికి ఇదొక మంచి మార్గం. ఒక గంటలోపు ఒక మినీ ట్రే గార్డెన్ను రూపొందించుకోవచ్చు. రంగు రంగుల గులకరాళ్లు, చిట్టి పొట్టి మొక్కలు, చిన్న చిన్న మెట్లు, గుడిసెలు.. ఇతర అలంకరణ వస్తువులతో తయారైన ఈ మినీ ట్రే గార్డెన్లను చూస్తుంటే ఎంతో ఆనందంగా కలుగుతుంది’ అని తన గార్డెన్ పెంపకం విషయాలను ఆనందంగా చెబుతుందామె.ట్రే గార్డెన్ని మీరూ ఇలా సృష్టించుకోవచ్చు...ముందుగా గార్డెన్ థీమ్ను దృష్టిలో ఉంచుకొని, కాగితం మీద స్కెచ్ వేసుకోవాలి. పరిమాణం, ఆకారం, మట్టి, ఇతర అలంకార వస్తువులను బట్టి తగిన సిరామిక్ ట్రేని ఎంచుకోవాలి.గార్డెన్కు బేస్ను సృష్టించడానికి పాటింగ్ మిక్స్తో ట్రేని నింపాలి. సారవంతమైన మట్టిలో 15 శాతం ఆవుపేడ, 15 శాతం కోకోపిట్ కలపాలి.వీటిలో స్నేక్ప్లాంట్, స్పైడర్ వంటి చిన్న చిన్న మరుగుజ్జు మొక్కలను నాటాలి. పైనుంచి మట్టిని గట్టిగా నొక్కి, నీళ్లు పోయాలి. తర్వాత రంగు రంగుల గులకరాళ్లు, గంటలు, బొమ్మలు వంటి అలంకరణ వస్తువులతో ట్రే తోటను అలంకరించాలి. స్ప్రే బాటిల్ను ఉపయోగించి ట్రేలోని మొక్కలకు నీళ్లు పోయాలి.ఫంగల్ దాడుల నుంచి మొక్కలను కాపాడుకోవడానికి అరటి, వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ తొక్కలు.. వంటి వంటగది వ్యర్థాలను ఉపయోగించి చేసే ద్రవ కంపోస్ట్ను పిచికారీ చేసుకోవచ్చు..ఇవి చదవండి: ఫోటోగ్రాఫర్..! -
ఇది.. 'మట్టిదిబ్బ' అనుకుంటున్నారా!?
దూరం నుంచి చూస్తే భారీ మట్టిదిబ్బలా కనిపిస్తుంది గాని, ఇది పురాతన రాతి కట్టడం. ఇది సామూహిక సమాధి. కొత్తరాతి యుగం నాటి ఈ భారీ సమాధి ఐర్లండ్లోని డ్రోహడా పట్టణానికి చేరువలో బోయన్ నదీ తీరాన ఉంది. దీనిని క్రీస్తుపూర్వం 3200 ప్రాంతంలో నిర్మించి ఉంటారని అంచనా.ఈ పురాతన నిర్మాణాన్ని యునెస్కో చారిత్రక వారసత్వ కట్టడంగా గుర్తించింది. న్యూగ్రేంజ్ మాన్యుమెంట్ పేరుతో ప్రసిద్ధి పొందిన ఈ కట్టడాన్ని 1.1 ఎకరాల విస్తీర్ణంలో 39 అడుగుల ఎత్తున నిర్మించారు. దీని లోపలకు చేరుకోవడానికి ప్రవేశ ద్వారం, అక్కడి నుంచి అరవై అడుగుల నడవ దారి ఉంటాయి. లోపలి భాగంలో ఉన్న మూడు గదుల్లో పురాతన మానవ అస్థికలు కనిపిస్తాయి.ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆ కాలంలోనే నిట్టనిలువుగా రాళ్లను నిలిపి, వాటిని కలుపుతూ వృత్తాకారంలో ఈ సమాధిని నిర్మించడం విశేషం. పురాతత్త్వ శాస్త్రవేత్తలు దీనిలోపల జరిపిన తవ్వకాల్లో దహనం చేసిన మానవ అస్థికలు, దహనం చేయని మానవ అస్థికలు కూడా దొరికాయి. వాటితో పాటు ఆనాటి మానవులు ఉపయోగించిన పలు వస్తువులు కూడా దొరికాయి.ఇవి చదవండి: పూర్వం 'ధ్రువసంధి' అయోధ్యకు.. రాజుగా.. -
పూర్వం 'ధ్రువసంధి' అయోధ్యకు.. రాజుగా..
పూర్వం ధ్రువసంధి అయోధ్యకు రాజుగా ఉండేవాడు. అతడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య మనోరమ, రెండో భార్య లీలావతి. సద్గుణ సంపన్నుడైన ధ్రువసంధి యజ్ఞయాగాదికాలు చేస్తూ, బ్రాహ్మణులకు, సాధు సజ్జనులకు, పేదసాదలకు విరివిగా దానాలు చేస్తుండేవాడు.ధ్రువసంధికి మనోరమ ద్వారా సుదర్శనుడు, లీలావతి ద్వారా శత్రుజిత్తు అనే కొడుకులు కలిగారు. వారిద్దరూ గురుకులవాసంలో సకల శాస్త్రాలు, అస్త్రశస్త్ర విద్యలు నేర్చి, అన్ని విద్యల్లోనూ ఆరితేరారు. ధ్రువసంధి పెద్దకొడుకు సుదర్శనుడికి త్వరలోనే పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. వినయశీలుడు, వీరుడు అయిన సుదర్శనుడికి ప్రజామోదం కూడా ఉండేది. అయోధ్య ప్రజలందరూ సుదర్శనుడే తదుపరి రాజు కాగలడని అనుకునేవారు.సుదర్శనుడికి పట్టాభిషేకం చేయడానికి ధ్రువసంధి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుసుకుని, అతడి రెండో భార్య లీలావతి తండ్రి, శత్రుజిత్తు మాతామహుడు యుధాజిత్తు సహించలేకపోయాడు. తన మనవడినే రాజుగా చేయాలని ధ్రువసంధిని కోరాడు. పెద్దకొడుకుకే పట్టాభిషేకం చేయడం ధర్మమని తేల్చి చెప్పిన ధ్రువసంధి అతడి కోరికను నిరాకరించాడు.సుదర్శనుడిపై అసూయతో రగిలిపోతున్న యుధాజిత్తు ఒకనాడు అకస్మాత్తుగా తన సేనలతో అయోధ్యపై విరుచుకుపడ్డాడు. ధ్రువసంధిని చెరసాలలో పెట్టి, తన మనవడైన శత్రుజిత్తుకు రాజ్యాభిషేకం చేసి, తానే అధికారం చలాయించడం మొదలుపెట్టాడు. తన సేనలతో ఎలాగైనా సుదర్శనుడిని, అతడి తల్లి మనోరమను బంధించడానికి ప్రయత్నించాడు.అయితే, ప్రమాదాన్ని శంకించిన మనోరమ కొందరు మంత్రులు, ఆంతరంగికుల సాయంతో కొడుకు సుదర్శనుడితో కలసి అరణ్యాల్లోకి వెళ్లిపోయింది. అరణ్యమార్గంలో ముందుకు సాగుతుండగా, మార్గమధ్యంలో కనిపించిన భరద్వాజ మహర్షి ఆశ్రమంలో తలదాచుకుంది. భరద్వాజ మహర్షి వారికి జరిగిన అన్యాయం తెలుసుకుని, జాలితో తన ఆశ్రమంలోనే వారికి వసతి కల్పించాడు.మనోరమ, సుదర్శనులను ఎలాగైనా పట్టి బంధించి, చెరసాల పాలు చేయాలని భావించిన యుధాజిత్తు వారిని వెదకడానికి రాజ్యం నలుమూలలకు, పొరుగు రాజ్యాలకు వేగులను పంపాడు. కొన్నాళ్లు గడిచాక వారు భరద్వాజ మహర్షి ఆశ్రమంలో తలదాచుకుంటున్నట్లు సమాచారం తెలుసుకున్నాడు.సైన్యాన్ని, పరివారాన్ని వెంటబెట్టుకుని యుధాజిత్తు ఒకనాడు భరద్వాజుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. ‘ఓ మునీ! నువ్వు అన్యాయంగా సుదర్శనుడిని, మనోరమను నీ ఆశ్రమంలో బంధించి ఉంచావు. వాళ్లను వెంటనే నాకు అప్పగించు’ అని దర్పంగా ఆదేశించినట్లు పలికాడు. అతడి మాటలకు భరద్వాజుడు కన్నెర్రచేసి కోపంగా అతడివైపు చూశాడు.భరద్వాజ మహర్షి ఎక్కడ శపిస్తాడోనని యుధాజిత్తు మంత్రులు భయపడ్డారు. వెంటనే యుధాజిత్తును వెనక్కు తీసుకుపోయారు. ‘మళ్లీ ఈ పరిసరాల్లో కనిపిస్తే నా క్రోధాగ్నికి నాశనమవుతారు’ అని హెచ్చరించాడు భరద్వాజుడు. ఆ మాటలతో యుధాజిత్తు పరివారమంతా వెనక్కు తిరిగి చూడకుండా అయోధ్యకు పరుగు తీశారు.భరద్వాజుడి ఆశ్రమంలో ఒక మునికుమారుడు మనోరమకు క్లీబ మంత్రాన్ని ఉపదేశిస్తుండగా, సుదర్శనుడు విన్నాడు. ఆ శబ్దం అతడికి ‘క్లీం’ అని వినిపించింది. క్లీంకారం దేవీమంత్రం. సుదర్శనుడు తదేక దీక్షతో క్లీంకారాన్ని జపించసాగాడు. సుదర్శనుడి నిష్కల్మష భక్తికి అమ్మవారు సంతసించి, అతడి ముందు ప్రత్యక్షమైంది. అతడికి ఒక దివ్యాశ్వాన్ని, గొప్ప ధనువును, అక్షయ తూణీరాలను ఇచ్చింది. ‘నువ్వు తలచినంతనే నీకు సాయంగా వస్తాను’ అని పలికి అదృశ్యమైంది.ఆనాటి నుంచి సుదర్శనుడు, మనోరమ నిరంతరం భక్తిగా దేవిని పూజించసాగారు. కొన్నాళ్లకు ఒకనాడు ఒక నిషాదుడు సుదర్శనుడిని చూడవచ్చాడు. అతడు ఒక రథాన్ని సుదర్శనుడికి కానుకగా సమర్పించాడు. అమ్మవారు ఇచ్చిన అస్త్రశస్త్రాలు ధరించి, నిషాదుడు బహూకరించిన రథంపై సుదర్శనుడు యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధంలో అతడికి అమ్మవారి శక్తి తోడుగా నిలిచింది.సుదర్శనుడి ధాటికి యుధాజిత్తు సేనలు కకావిలకమయ్యాయి. అతడి ధనుస్సు నుంచి వెలువడుతున్న బాణాలు తరుముకొస్తుంటే, వారంతా భీతావహులై పలాయనం చిత్తగించారు. యుద్ధంలో ఘనవిజయం సాధించిన సుదర్శనుడు తన రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. – సాంఖ్యాయన -
Tanya Ghavri: స్టయిలింగ్లో తనతో పోటీ అంటే.. కొంచెం కష్టమే!
స్టయిలింగ్లో తాన్యా ఘావ్రీతో పోటీ అంటే కొంచెం కష్టమే! శాంపుల్కి జాన్వీ కపూర్, అనన్య పాండేలను చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది! అందుకే తాన్యాను ఇండియన్ స్టయిలింగ్ ఇండస్ట్రీ డ్రైవింగ్ ఫోర్స్గా కొనియాడుతుంటారు.తాన్యా ఘావ్రీ.. మాజీ టెస్ట్ క్రికెటర్ కర్షణ్ ఘావ్రీ కూతురు. ముంబైలో పుట్టిపెరిగింది. ఇంటర్ అయిపోయాక.. చాలామంది విద్యార్థుల్లాగే తాన్యా కూడా చదువుల చౌరస్తాలో నిలబడిపోయింది అయోమయంగా.. ఏ దారిన వెళ్లాలో తెలియక! తన బలాబలాలను బేరీజువేసుకుందోసారి. తనకు క్రియేటివ్ బోన్ ఉన్నట్లు అర్థమైంది. అందుకే ఫ్యాషన్ వైపు మళ్లింది. న్యూయార్క్, పార్సన్స్ ఆఫ్ స్కూల్లో ఫ్యాషన్ డిజైనింగ్లో డిగ్రీ చేసింది.ఇండియా తిరిగొచ్చాక ఎస్ఎన్డీటీ (శ్రీమతి నాథీబాయీ దామోదర్ ఠాకర్సీ) యూనివర్సిటీలో దుస్తుల తయారీ డిజైన్కి దరఖాస్తు పెట్టుకుంది. ఆ కోర్స్ అయిపోగానే అవకాశాలు క్యూ కడతాయనే ఉద్దేశంతో! కానీ చదువైపోయిన రెండున్నరేళ్లకు వచ్చింది ఒక చాన్స్.. ‘ఆయశా’ అనే హిందీ సినిమాకు అసిస్టెంట్ స్టయిలిస్ట్గా! ఆ చిత్రానికి స్టయిలిస్ట్ పర్నియా కురేశీ. ఆమెకు సహకారం అందించడమే తాన్యా పని. దానికి ముందు ఆ రెండున్నరేళ్లు.. ఫ్యాషన్ మ్యాగజైన్ వోగ్లో, స్టయిలిస్ట్లు అనాయితా ష్రాఫ్, అర్చనా వాలావల్కర్లాంటి వాళ్ల దగ్గర ఇంటర్న్షిప్ చేసింది.ఆమె స్టయిలింగ్ జర్నీ మొదలైంది మాత్రం ‘ఆయశా’ సినిమాతోనే! అందులోని కథానాయిక సోనమ్ కపూర్కి తాన్యా పనితనం నచ్చింది. తన పర్సనల్ స్టయిలిస్ట్గా అపాయింట్ చేసుకుంది. తాన్యా స్టయిలింగ్తో సోనమ్ ఫ్యాషన్ ఐకాన్ అయింది. అది గమనించిన ఐశ్వర్యా రాయ్ బచన్.. తనకూ స్టయిలింగ్ చేసిపెట్టమని తాన్యాను కోరింది. ఆ అపురూప సౌందర్యరాశికి అప్ టు డేట్ ఫ్యాషన్ని టచప్ చేసి.. అక్కాచెల్లెళ్లు కరిష్మా, కరీనా కపూర్ల దృష్టిలో పడింది తాన్యా. వాళ్ల నుంచీ సేమ్ రిక్వెస్ట్ అందుకుంది. ఫిజిక్ని బట్టే ఫ్యాషన్, సౌకర్యాన్ని బట్టే స్టయిల్ అని నమ్మే తాన్యా ఆ సూత్రాన్నే అప్లయ్ చేసి కపూర్ సిస్టర్స్ అపియరెన్స్నే మార్చేసింది.వాళ్ల వయసులో చెరో పదేళ్లు తగ్గించేసింది. ఆశ్చర్యపోయింది కరిష్మా, కరీనాల ఆప్తురాలు మలైకా అరోరా! సీక్రేట్ ఏంటని అడిగింది. తాన్యా అడ్రస్ చెప్పారు వాళ్లు. వెళ్లి వాలింది మలైకా! తాన్యాకు మారు మాట్లాడే చాన్స్ ఇవ్వకుండా తన వెంట రమ్మంది. అప్పటి నుంచి మలైకాకూ స్టయిలింగ్ సర్వీస్ ఇవ్వడం మొదలుపెట్టింది తాన్యా. ఆ డిమాండ్ను కత్రినా కైఫ్ కూడా గుర్తించింది. ఉఫ్.. ఇలా చెప్పుకుంటూ పోతే మాధురీ దీక్షిత్, సారా అలీఖాన్, జాన్వీ కపూర్, అనన్యా పాండే, దిశా పాట్నీ, శ్రద్ధా కపూర్, కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, ఫ్రీదా పింటోలూ చేరి ఆ జాబితా పెరిగిపోతుంది.తాను ఎస్ఎన్డీటీలో జాయిన్ అయ్యేముందు ఊహించుకున్నట్టే తనను అవకాశాల వెల్లువ ముంచెత్తుతోంది. ఈ అచీవ్మెంట్ వయసు పదిహేనేళ్లు. స్టార్స్కి మెరుగులు అద్దుతూనే అంట్రప్రెన్యూర్షిప్ గురించీ ఆలోచించింది. పెళ్లిళ్లు, పేరంటాలు, పండగలు, పబ్బాలకు డిజైనర్ దుస్తులను అందించే ‘ధూమ్ ధామ్ వెడ్డింగ్స్’ అనే కంపెనీనీ స్థాపించి అంట్రప్రెన్యూర్గానూ మారింది."నా వర్క్ని రొటీన్గా ఎప్పుడూ ఫీలవను. ఏ రోజుకు ఆ రోజు కొత్తగా ఫీల్డ్లోకి వచ్చినట్టు భావిస్తాను. అందుకే వర్క్ని బాగా ఎంజాయ్ చేస్తాను. నేనెప్పటికీ మరచిపోలేని ఈవెంట్.. ఆస్కార్ పార్టీ కోసం ఫ్రీదా పింటోకి స్టయిల్ చేయడం. నా పర్సనల్ స్టయిల్ విషయానికి వస్తే జీన్స్, స్కర్ట్స్, షర్ట్స్, బ్లౌజెస్.. ఏ డ్రెస్ అయినా నాకు ఓకే. అయితే ఏదైనా ఓవర్ సైజ్డ్ స్టఫ్నే ఇష్టపడతా. నేను షార్ట్గా ఉంటాను కాబట్టి.. షార్ట్ డ్రెస్లు వేసుకుని ఓవర్ సైజ్డ్ షర్ట్తో కానీ జాకెట్తో కానీ నా హైట్ని బ్యాలెన్స్ చేస్తా"! – తాన్యా ఘావ్రీ -
'అపార్ట్మెంట్ 66బి’ గురించి.. కనీసం మాట్లాడాలన్నా ధైర్యం చాలదు!
దేవుడు విడిచిపెట్టిన ప్రదేశాలలో మాత్రమే దయ్యాలు కనిపిస్తాయనేది నానుడి. అలాగే, ‘నిర్మానుషమైన ప్రదేశాల్లో చీకటి వేళల్లో మాత్రమే దయ్యాలు కనిపిస్తాయనుకుంటే పొరబాటే’ అంటారు చాలామంది. అందుకే కాబోలు.. మహారాష్ట్ర రాజధాని ముంబై పరిసర ప్రాంతాలు ఎంత రద్దీగా ఉన్నా.. ఎంత జన సందోహంతో నిండి ఉన్నా.. అక్కడ వెంటాడే భయానక కథలు కోకొల్లలుగా వినిపిస్తుంటాయి. అలాంటి కథల్లో బృందావన్ సొసైటీ హారర్ స్టోరీ ఒకటి.ముంబై, థానే ప్రాంతంలో ‘బృందావన్ సొసైటీ’ హడలెత్తించే కథలకు బాగా ఫేమస్. అందులో పదుల సంఖ్యలో బిల్డింగ్స్, వందల సంఖ్యలో అపార్ట్మెంట్స్ ఉంటాయి. అయితే అక్కడ నివసించే వారితో పాటు.. కాపలాకి వచ్చే వాచ్మన్, ఇంటి పని, వంట పని చేయడానికి వచ్చే పనివాళ్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్ ఇలా ప్రతి ఒక్కరూ ‘అపార్ట్మెంట్ 66బి’ గురించి కనీసం మాట్లాడాలన్నా భయపడతారు. అటు వైపు తేరిపార చూడాలన్నా వణికిపోతారు. అందులో దయ్యం ఉందని అక్కడివారి నమ్మకం. అందుకే ఆ దరిదాపుల్లోకి కూడా చాలామంది అడుగుపెట్టరు.ఆ అపార్ట్మెంట్లో ఉన్న దయ్యం తనకు ఎవరి వల్లనైనా ఇబ్బంది కలిగితే, వారిని లాగిపెట్టి కొడుతుందట! ఆ దయ్యం కొట్టిన చెంపదెబ్బకు గూబ గుయ్యిమంటుందట! అంతేకాదు, ఆ భవనం కారిడార్లలో ఏవేవో వింతస్వరాలు ప్రతిధ్వనిస్తుంటాయట! బెడ్ రూముల్లో ఏవో గుసగుసలు చెవిన పడతుంటాయట!ఆ చుట్టుపక్కల నివసించేవారిలో కొందరు మాత్రం ఆ 66బిలో కచ్చితంగా ఏదో ప్రేతాత్మ ఉందని, అటుగా వెళ్లినా, ఆ వైపు పరిశీలనగా చూసినా ఎవరో వేగంగా తమవైపు వస్తున్నట్లుగా అనిపిస్తుంటుందని చెబుతారు.అయితే అపార్టమెంట్ 66బి చరిత్రను తవ్వితే ఒక విషాదగాథ వినిపిస్తుంది. చాలా ఏళ్ల కిందట ఆ ఇంట్లో ఒంటరిగా ఉండే ఓ పెద్దాయన జీవితం మీద విరక్తితో, మానసిక ఒత్తిడితో బాల్కనీలోంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి బలవన్మరణం పోలీసు రికార్డుల్లో కూడా నమోదైంది. అయితే అప్పటి నుంచి అతని ఆత్మ ఆ పరిసరాల్లోనే తిరుగాడుతుందని, తనకు చిరాకు తెప్పించేవారిని కొట్టి భయభ్రాంతులను చేస్తుందని స్థానికుల్లో చాలామంది నమ్ముతారు.స్థానికుల నమ్మకానికి తగినట్లుగానే ఆ 66బి ఫ్లా్లట్ ఇప్పటికీ ఖాళీగా ఉంది. కొంతమంది నివాసితులు భవనంలో దయ్యం ఉండే అవకాశమే లేదని కొట్టిపారేస్తుంటే, మరికొందరు మాత్రం స్వయంగా తాము దయ్యం నీడను చూశామని, దాని గొంతును విన్నామని, దయ్యం చేతిలో దెబ్బలు కూడా తిన్నామని చెబుతుంటారు. ఇంకొందరైతే ఆ అపార్ట్మెంట్లో ఆ చుట్టు ప్రక్కల కేవలం ఒక్క దయ్యమే లేదని, చాలా దయ్యాలు ఉన్నాయని హడలెత్తిస్తారు. ఆ మాట విన్న కొందరు మాత్రం.. ‘ఇక్కడ చాలా దయ్యాలేమీ లేవు.. కొట్టే దయ్యం ఒక్కటే ఉంది. దానితో జాగ్రత్తగా ఉంటే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు’ అని చెబుతారు.ఏది ఏమైనా, ఆ సొసైటీకి వెళ్లిన కొత్తవారు ఈ వింత అనుభవాన్ని చవిచూడక మానరట! ఎందుకంటే కొత్తవారిని అక్కడి దెయ్యం ఈజీగా గుర్తుపడతుందట! తన దెబ్బను రుచి చూపిస్తుందట! పాతవారైనా సరే ఆ దయ్యానికి ఇబ్బంది కలిగిస్తే లాగిపెట్టి ఒక్కటి ఇచ్చి పోతుందట. మరి నిజంగానే అక్కడ ఆ పెద్దాయన ఆత్మ ఉందా? అసలు అది ఆ అపార్ట్మెంట్ యజమాని ఆత్మేనా? అసలు అక్కడుండేవారిని, అక్కడికి కొత్తగా వచ్చేవారిని కొడుతున్న అదృశ్య శక్తి ఏమిటి? ఆ ఆత్మతో పాటు మరికొన్ని అతీంద్రియశక్తులు అక్కడ గుమిగూడాయా? అనేది మాత్రం నేటికీ మిస్టరీనే! – సంహిత నిమ్మనఇవి చదవండి: దేవుళ్ల పండగ అంటే తెలుసు..! మరి దెయ్యాల పండగ? -
దేవుళ్ల పండగ అంటే తెలుసు..! మరి దెయ్యాల పండగ?
దేవుళ్లకు పండగలు చేసుకోవడం ఎక్కడైనా మామూలే! దయ్యాల పండగ మాత్రం థాయ్లాండ్కు మాత్రమే ప్రత్యేకం. ఏటా జూన్ నెలలో మూడు రోజుల పాటు జరిగే ఈ పండగలో జనాలు దయ్యాల బొమ్మలను చిత్రించిన ముసుగులను ధరించి, వీథుల్లోకి వచ్చి, సంప్రదాయ నృత్య గానాలతో భారీ ఊరేగింపులు జరుపుతారు. దయ్యాల ముసుగులను వెదురుతోను, పలచని కలపతోను తయారు చేస్తారు. పెద్దపెద్ద ముక్కులు, చెవులతో తయారుచేసే ఈ ముసుగులు వినోదభరితంగా ఉంటాయి.థాయ్లాండ్లోని లోయీ ప్రావిన్స్ డాన్సాయ్ పట్టణంలో ఈ వేడుకలను తిలకించడానికి దేశ విదేశాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ‘ఫి టా ఖోన్ ఘోస్ట్ ఫెస్టివల్’గా పిలుచుకునే ఈ మూడు రోజుల పండుగ మొత్తం కార్యక్రమాన్ని ‘బున్ లువాంగ్’ అంటారు. ఇందులో భాగంగా మున్ నది అవతారంగా భావించే బౌద్ధ సన్యాసి ఫ్రా ఉపాకుత్ ఆత్మశక్తిని ఆహ్వానించి, ప్రజల రక్షణ కోసం ప్రార్థనలు జరుపుతారు. ఈ ఏడాది జూన్ 7 నుంచి 9 వరకు డాన్సాయ్ పట్టణంలో ఈ దయ్యాల పండగ సంప్రదాయ రీతిలో అట్టహాసంగా జరుగుతోంది.‘ఫి టా ఖోన్’ పండగ నేపథ్యానికి సంబంధించిన గాథ బౌద్ధ జాతక కథల్లో ఉంది. దీనికి సంబంధించిన జాతక కథ ప్రకారం.. బుద్ధుడు తన ఒకానొక పూర్వ జన్మలో యువరాజుగా పుట్టాడట. ప్రజల బాగోగులను స్వయంగా తెలుసుకోవడానికి దేశాటనకు వెళ్లాడట. ఎన్నాళ్లు గడిచినా రాజధానికి తిరిగి రాకపోవడంతో అతడు మరణించి ఉంటాడని భావించిన రాజబంధువులు సంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారట.ఆ యువరాజు ఆత్మను ఆహ్వానించడానికి ఈ వేడుకను జరుపుకోవడం అప్పటి నుంచి సంప్రదాయంగా మారిందట. మొదటిరోజు దయ్యాల ముసుగులు ధరించి ఊరేగింపులు జరిపే వేషదారులు సందర్శకులను కట్టెలతో భయపెడుతుంటారు. రెండోరోజు తారాజువ్వలను ఎగరేస్తారు. మూడోరోజు స్థానిక బౌద్ధ ఆలయానికి చేరుకుంటారు. ముగింపు కార్యక్రమంలో ఆలయంలోని బౌద్ధ సన్యాసులు శాంతి ప్రార్థనలు చేస్తారు.ఇవి చదవండి: పిల్లలూ గుర్తుందా!? వేసవి సెలవులు అయిపోవచ్చాయి..! -
తరచూ ఇన్ఫెక్షన్.. ప్రమాదం కాదా?
నాకిప్పుడు నలభై ఏళ్లు. ఏడాదికి 3–4 సార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తోంది. అన్నన్నిసార్లు యాంటీబయాటిక్స్ వాడితే ప్రమాదం కాదా? ఇలా తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – పేరు, ఊరు వివరాలు రాయలేదు.మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ సర్వసాధారణం. యూరినరీ ఓపెనింగ్ అంటే యురేత్రా అనేది.. మోషన్ ఓపెనింగ్ అంటే మలద్వారానికి దగ్గరగా ఉండటం వల్ల బ్యాక్టీరియా ఈజీగా వెజైనా,యురేత్రా, బ్లాడర్లోకి ప్రవేశిస్తుంది. మహిళల్లో యురేత్రా షార్ట్గా ఉండటం వల్ల మరింత త్వరగా బ్యాక్టీరియా బ్లాడర్లోకి వెళ్తుంది. తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రాన్ని ఆపుకోలేకపోవడం, అర్జెన్సీ ఫీలవడం, మూత్రంలో మంట, దుర్వాసన వేయడం, మూత్రంలో రక్తం ఆనవాళ్లు వంటివి ఉన్నాయంటే యూరిన్ ఇన్ఫెక్షన్ మొదలైందని అర్థం.ఆడవాళ్లలో 40–50 ఏళ్ల మధ్య ఎక్కువసార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే చాన్సెస్ ఉంటాయి. దీనికి ఈస్ట్రజన్ హార్మోన్ లోపం ఒక కారణం. కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారిలో యూరినరీ ట్రాక్ట్లో బ్లాక్స్తో కూడా తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్కి గురవుతుంటారు. రోగనిరోధక శక్తి తక్కువున్నవారిలోనూ యూరిన్ ఇన్ఫెక్షన్ చాన్సెస్ పెరుగుతాయి. ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకున్నవారిలోనూ బ్యాక్టీరియా రెండింతలయ్యే చాన్సెస్ ఎక్కువై తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు.కొన్ని సింపుల్ మెథడ్స్తో ఈ ఇన్ఫెక్షన్ని నివారించవచ్చు. యూరిన్, మోషన్ పాస్ చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో ముందు నుంచి వెనక్కి క్లీన్ చేసుకోవాలి. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవద్దు. రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల మంచినీరు తాగాలి. కాఫీ, సుగర్ లోడెడ్ డ్రింక్స్కి దూరంగా ఉండాలి. టైట్ ఇన్నర్వేర్స్, డ్రాయర్స్ అవాయిడ్ చేయాలి. కాటన్ లోదుస్తులనే వాడాలి. స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్, సబ్బులను వెజైనా ప్రాంతంలో వాడకూడదు. స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్ ఎక్కువసార్లు వాడటం వల్ల అవి పనిచేయడం మానేస్తాయి.అందుకే యూరిన్ కల్చర్, సెన్సిటివిటీ టెస్ట్ చేసి ఏయే యాంటీబయాటిక్స్ సెన్సిటివిటీ ఉందో చూసి అది వాడటం మంచిది. కొంతమందికి రికరెంట్ ఇన్ఫెక్షన్ వస్తూంటే ఏ మెడిసిన్ లేదా ప్రివెంటివ్ మెథడ్ పనిచేయనప్పుడు యూరాలజిస్ట్ కన్సల్టేషన్తో ప్రొఫిలాక్టిక్ లో డోస్ యాంటీబయాటిక్స్ని ఇస్తారు. ఏ ప్రాబ్లమ్ వల్ల తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్కి గురవుతున్నారో కనిపెట్టడం కొంతమందిలో సాధ్యమవుతుంది.అంటే సుదీర్ఘ ప్రయాణాలు, లైంగిక సంపర్కం వంటివాటితో యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇలాంటి వారికి ఒక డోస్ యాంటీబయాటిక్ టాబ్లెట్ని ఇస్తారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ని చెక్ చెయ్యాలి. మెనోపాజ్ వయసులో ఈస్ట్రజన్ క్రీమ్తో కూడా ఇన్ఫెక్షన్ని నివారించవచ్చు. ఆరునెలల కాలంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువసార్లు ఇన్ఫెక్షన్స్ ఉన్నా.. ఏడాదిలో మూడుసార్లు ఇన్ఫెక్షన్స్ ఉన్నా దానిని రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్ అంటారు. తొలిదశలోనే గుర్తిస్తే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్సను అందించవచ్చు.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ఇవి చదవండి: బుల్లీయింగ్ను నిర్లక్ష్యం చేయొద్దు.. -
బుల్లీయింగ్ను నిర్లక్ష్యం చేయొద్దు..
రేచల్ చురుకైన విద్యార్థిని. ఆటల్లో, పాటల్లో, చదువులో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుంటుంది. స్కూల్లో ఏ ఫంక్షన్ ఉన్నా తనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అయితే గత ఏడాదిగా తన ప్రవర్తన ఒక్కసారిగా మారిపోయింది. 15ఏళ్ల టీనేజర్లో ఉండే చురుకుదనం కనిపించడంలేదు. టీచర్లు గుర్తించి అడిగారు, ఏమీ చెప్పలేదు. దాంతో పేరెంట్స్ను పిలిపించి చెప్పారు. వాళ్లు అడిగినా ఏమీ చెప్పలేదు. మరోవైపు టెస్టుల్లో మార్కులు తగ్గుతున్నాయి. ఏం చేయాలో అర్థంకాక కౌన్సెలింగ్కు తీసుకువచ్చారు.రేచల్ ఆందోళగా కనిపించింది. ఐ కాంటాక్ట్ ఇవ్వడంలేదు. వినిపించీ వినిపించకుండా మాట్లాడుతోంది. నెమ్మదిగా తనను మాటల్లో పెట్టాను. ఫాదర్కు ట్రాన్స్ఫర్ కావడంతో రెండేళ్ల కిందటే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చామని చెప్పింది. సిటీకి రావడం మొదట్లో తనకు ఉత్సాహంగా ఉన్నా పాత స్నేహితులకు, సుపరిచితమైన వాతావరణానికి దూరంకావడం తనకు బాధగా ఉందని, తరచుగా కడుపునొప్పి కూడా వస్తోందని చెప్పింది. అది యాంగ్జయిటీ వల్ల వచ్చే సొమాటిక్ సింప్టమ్ అని అర్థమైంది. సైకోడయాగ్నసిస్ ద్వారా ఆమె తీవ్ర ఆందోళన, డిప్రెషన్తో బాధపడుతోందని నిర్ధారణైంది.కొత్త స్కూల్లో ఒక బ్యాచ్ తన మాటలు, ఉచ్చారణ, డ్రెస్సుల గురించి ఎగతాళి చేస్తోందని ఆ తరువాతి సెషన్లో చెప్పింది. ఆమె గురించి పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని, తన సోషల్ మీడియా పోస్టులను అపహాస్యం చేస్తున్నారని చెప్పింది. ఇటీవల నేరుగానే బెదిరిస్తున్నారని, ఏం చేయాలో అర్థం కావడంలేదని కంటనీరు పెట్టుకుంది. రేచెల్లానే దాదాపు 20 శాతం మంది విద్యార్థులు, విద్యార్థినులు బుల్లీయింగ్ బాధితులవుతున్నారు. అది వారిని మానసికంగా, విద్యాపరంగా చాలా దెబ్బతీస్తుంది. కొన్ని సెషన్ల థెరపీ అనంతరం రేచల్ బుల్లీయింగ్ నుంచి బయటపడి, తిరిగి తన సంతోషాన్ని వెనక్కు తెచ్చుకోగలిగింది.ఎలా ఎదుర్కోవాలి?బుల్లీయింగ్ ఎదురైనప్పుడు పిల్లలు కొన్ని చిట్కాలు పాటించాలి. పేరెంట్స్ అండగా నిలవాలి. అవసరమైతే సైకాలజిస్టుల సహాయం తీసుకోవాలి. – మీ బలాలు, ప్రతిభను గుర్తించండి. పాజిటివ్ సెల్ఫ్ టాక్ను ప్రాక్టీస్ చేయండి. అవి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. – ఒత్తిడి, ఆందోళనను నియంత్రించుకునేందుకు బ్రీతింగ్, రిలాక్సేషన్, మైండ్ ఫుల్నెస్ టెక్నిక్స్ను ప్రాక్టీస్ చేయండి. – మీ భావాలను, అవసరాలను స్పష్టంగా వ్యక్తపరచడం నేర్చుకోండి. – మీకు మద్దతుగా ఉండే స్నేహితుల సహాయం తీసుకోండి. – బుల్లీయింగ్ జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలు, పరిస్థితులకు దూరంగా ఉండండి. – తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సైకాలజిస్ట్ సహాయం తీసుకోండి.పేరెంట్స్ ఏం చేయాలి?– మీ పిల్లలు అన్ని ఫీలింగ్స్, అభిప్రాయాలు స్వేచ్ఛగా మాట్లాడేలా, పంచుకునేలా ప్రోత్సహించండి.– శారీరక, మౌఖిక, సైబర్ బుల్లీయింగ్ గురించి అవగాహన కల్పించండి. – బుల్లీయింగ్ జరిగినప్పుడు ఎలా స్పందించాలో పిల్లలతో ప్రాక్టీస్ చేయించండి. – కాన్ఫ్లిక్ట్ మేనేజ్ మెంట్ టెక్నిక్ట్స్ ప్రాక్టీస్ చేయించండి. – తమ సమస్యలను తామే పరిష్కరించుకునేలా ప్రోత్సహించండి. – బుల్లీయింగ్ గురించి టీచర్స్తో, స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడండి. – బుల్లీయింగ్ వల్ల మీ బిడ్డ ఎమోషనల్గా బాధపడుతుంటే వెంటనే సైకాలజిస్ట్ సహాయం తీసుకోండి. – కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ), ఫ్యామిలీ థెరపీ ద్వారా సైకాలజిస్ట్ మీకు సహాయం చేస్తారు.ఎందుకు బెదిరిస్తారు? ప్రతి వ్యక్తీ గుర్తింపును కోరుకుంటారు. ఆటలు, మాటలు, పాటలు, ప్రవర్తన లేదా ప్రతిభ ద్వారా గుర్తింపును సాధించుకుంటారు. అవేమీ లేనివారు ఇతరులను ఏడిపించడం ద్వారా గుర్తింపును సాధించాలనుకుంటారు. అయితే ఎవ్వరూ అలా పుట్టరు. రెండు మూడేళ్ల వయసులో పిల్లల దూకుడు ప్రవర్తనను నియంత్రించకపోతే వారు పెద్దయ్యాక ఇతరులను బెదిరించేవారిగా మారవచ్చు. వారిని అలాగే వదిలేస్తే వారిలో నేరప్రవృత్తి పెరిగి భార్యాపిల్లలను కొట్టడం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం చేస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలాంటి పిల్లలకు కూడా ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం.ఎందుకు ఆపరు?బుల్లీయింగ్ను చాలామంది గమనించినా ఆపే ప్రయత్నం చేయరు. ఆపితే తమను కూడా టార్గెట్ చేస్తారని భయపడతారు. కొందరు తాము చేయలేనిదాన్ని వాళ్లు చేస్తున్నారని చూసి ఆనందిస్తారు. మరికొందరు దాన్ని ఫన్లా తీసుకుని నవ్వుతారు. ఈ మౌనం, నవ్వు ఎగతాళి చేసేవారికి ప్రోత్సాహకంగా మారుతుంది. ఇక సైబర్ బుల్లీయింగ్ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ట్రోల్ చేయడమే ప్రధానంగా సోషల్ మీడియా పేజీలు, వీడియోలు రావడం, వాటిని పలువురు షేర్ చేయడం గమనించవచ్చు.– సైకాలజిస్ట్ విశేష్ (psy.vishesh@gmail.com)