-
తైవాన్ వ్యక్తికి పద్మభూషణ్ - ఎవరీ యంగ్ లియు!
Foxconn CEO Young Liu: 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. అవార్డు గ్రహీతలలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయడు, మెగాస్టార్ చిరంజీవితో పాటు తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ కంపెనీ సీఈఓ 'యంగ్ లియు' (Young Liu) ను కూడా పద్మభూషణ్ వరించింది. 66 ఏళ్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO).. తైవాన్కు చెందిన హాన్ హై టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్కాన్) చైర్మన్ 'యంగ్ లియు' నాలుగు దశాబ్దాల కాలంలో మూడు కంపెనీలను స్థాపించారు. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో యంగ్ లియుకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించింది. యంగ్ లియు స్థాపించిన మూడు కంపెనీలలో యంగ్ మైక్రో సిస్టమ్స్ అని పిలువబడే మదర్బోర్డ్ కంపెనీ (1988), నార్త్బ్రిడ్జ్ అండ్ సౌత్బ్రిడ్జ్ ఐసీ డిజైన్ కంపెనీ (1995), ఐటీఈ టెక్ అండ్ ఏడీఎస్ఎల్ ఐసీ డిజైన్ కంపెనీ (1997) ఉన్నాయి. తైవాన్కు చెందిన యంగ్ లియు 1978లో తైవాన్లోని నేషనల్ చియావో తుంగ్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రోఫిజిక్స్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి, ఆ తరువాత సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. భారతదేశంలో ఫాక్స్కాన్ ఉనికి భారతదేశంలో.. ముఖ్యంగా దక్షిణ ప్రాంతంలో గణనీయమైన పెట్టుబడులు, వెంచర్లతో తన ఉనికిని వేగంగా విస్తరిస్తున్న కంపెనీల జాబితాలో ఫాక్స్కాన్ ఒకటిగా ఉంది. ఈ సంస్థ తమిళనాడులో ఐఫోన్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసింది. ఇందులో సుమారు 40000 మంది పనిచేస్తున్నారు. ఫాక్స్కాన్ సంస్థ బెంగళూరు శివార్లలో యూనిట్ను నెలకొల్పడానికి కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా సుముఖత చూపిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా కొత్త నిర్మాణ ప్రాజెక్టుల కోసం 1.6 బిలియన్ డాలర్ల గణనీయమైన పెట్టుబడితో భారతదేశంలో తన ఉనికిని విస్తృతం చేయబోతున్నట్లు ఫాక్స్కాన్ సీనియర్ అధికారి గత సంవత్సరం తెలిపారు. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో ఫాక్స్కాన్ దేశంలో విస్తృత సేవలను అందించనున్నట్లు సమాచారం. పద్మ అవార్డ్స్ 2024 కేంద్రం ప్రకటించిన మొత్తం పద్మ అవార్డులలో 5 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డు గ్రహీతలలో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు / NRI / PIO / OCI వర్గానికి చెందిన వారు, 9 మంది మరణానంతర అవార్డు గ్రహీతలు ఉన్నారు. విదేశీయులకు పద్మ అవార్డులు ఎందుకిస్తారంటే! కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న పద్మ అవార్డ్స్ వెబ్సైట్ ప్రకారం.. ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను కేవలం భారతీయులకు మాత్రమే ఇవ్వాలనే నిబంధన లేదు. దేశంలో కళలు, సాహిత్యం, విద్య, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, క్రీడలు, వైద్యం, పౌర సేవ, వాణిజ్యం, పరిశ్రమలతో సహా అనేక రంగాలలో విశిష్టమైన, అసాధారణమైన సేవలందించిన ఎవరికైనా పద్మ అవార్డులు ప్రకటిస్తారు. ఈ ఏడాది ఈ విభాగంలో 8 మంది ఉన్నట్లు తెలుస్తోంది. -
రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రకటించారు. పారిశ్రామికరంగ అభివృద్ధిలో భాగంగా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు సులభంగా లభించేలా చూస్తామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ సంస్థ ఫాక్స్కాన్కు చెందిన హాన్హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధి వీ లీ నేతృత్వంలోని బృందం మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్ను కలిసింది. ఈ భేటీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఫాక్స్కాన్ చేపట్టిన ప్రాజెక్టు పురోగతిపై చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా రేవంత్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధిని వేగవంతం చేస్తామని, అన్ని రంగాలను ప్రోత్సహించేందుకు స్నేహపూర్వక విధానాలు అవలంబిస్తామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు. కొంగరకలాన్లో ఫాక్స్కాన్ ఉత్పాదక కేంద్రం నిర్వహణకు, ఫాక్స్కాన్ రాష్ట్రంలో చేపట్టే భవిష్యత్తు ప్రాజెక్టులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. రెండేళ్లలో 25 వేల ఉద్యోగాలు... ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థగా పేరొందిన ఫాక్స్కాన్కు యాపిల్ ఐఫోన్తోపాటు గూగుల్, షియోమీ, అమెజాన్, హ్యూలెట్ పాకర్డ్, అలీబాబా, సిస్కో, ఫేస్బుక్, సోనీ, మైక్రోసాఫ్ట్, నోకియా వంటి దిగ్గజ కంపెనీలు కస్టమర్లుగా ఉన్నాయి. చైనా, వియత్నాం, థాయ్లాండ్, మలేసియా, అమెరికా, యూరప్, భారత్ సహా 24 దేశాల్లో ఫాక్స్కాన్ కార్యకలాపాలు సాగిస్తోంది. భారత్లో శ్రీసిటీ (ఏపీ), శ్రీపెరంబదూర్ (తమిళనాడు), బెంగళూరు (కర్ణాటక)తోపాటు తెలంగాణ (కొంగరకలాన్)లో ఉత్పాదక కేంద్రాలు ఉన్నాయి. యాపిల్ ఐఫోన్లకు ఇయర్పాడ్స్ తయారీకి సంబంధించి తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహించేందుకు ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వంతో ఫాక్స్కాన్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్లాంటు నిర్మాణం కోసం ఈ ఏడాది మే 15న శంకుస్థాపన చేసింది. కొంగరకలాన్ ప్లాంటు ద్వారా దశలవారీగా లక్ష ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే రెండేళ్లలో ఫాక్స్కాన్ కొంగరకలాన్ యూనిట్ ద్వారా 25 వేల ఉద్యోగాల కల్పన జరగనుంది. -
దేశంలో నిలిచిన ఐఫోన్ల తయారీ.. కారణం చెప్పిన ఫాక్స్కాన్
ప్రపంచ దిగ్గజ సంస్థ యాపిల్ తన ఐఫోన్ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని చైనా నుంచి ఇండియాకు మార్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దాంతో చైనా తర్వాత ఇతర దేశాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్న గ్లోబల్ కంపెనీలకు భారత్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అందువల్లే యాపిల్ సంస్థ దేశంలోని చెన్నైలో తైవాన్ కంపెనీ ఫాక్స్కాన్ ద్వారా ఐఫోన్లు తయారుచేస్తోంది. కానీ ప్రస్తుతం అది నిలిచిపోయింది. అందుకుగల కారణాలు ఎంటో ఈ కథనంలో తెలుసుకుందాం. తైవాన్ టెక్ కంపెనీ ఫాక్స్కాన్ యాపిల్ ఐఫోన్లను మన దేశంలోని చెన్నైలో తయారు చేస్తోంది. అయితే తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కంపెనీ తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. అక్కడి పరిస్థితులు ఇంకా కొలిక్కి రాకపోవటంతో ఐఫోన్ల నిలిపివేత ఇంకా కొనసాగుతోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించాక ఉత్పత్తి తిరిగి ప్రారంభిస్తామని సంస్థ వర్గాలు తెలిపాయి. తమిళనాడు వ్యాప్తంగా మిచౌంగ్ తుపాను వల్ల కురుస్తోన్న కుండపోత వర్షాలతో చెన్నైలోని ఫాక్స్కాన్ ప్లాంట్ వరదల్లో మునిగిపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఫాక్స్కాన్, పెగాట్రాన్ చెన్నై సమీపంలోని తమ ఫ్యాక్టరీల్లో ఐఫోన్ ఉత్పత్తిని నిలిపివేసాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీళ్లు చేరుకోవడంతో రవాణాకు తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇదీ చదవండి: తగ్గిన డీజిల్ అమ్మకాలు.. కారణం ఇదే.. చైనా నుంచి ఐఫోన్ తయారీని మార్చాలనే క్రమంలో యాపిల్ తన ఉత్పత్తిని 2020లో ఇండియాకు షిఫ్ట్ చేసింది. ఇప్పుడు భారతదేశం ఐఫోన్ ఉత్పత్తిలో సుమారు 7 శాతం వాటాను కలిగి ఉంది. అయితే 2025 నాటికి కంపెనీ తన ఉత్పత్తిని 25 శాతానికి పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ లక్ష్యాన్ని అందుకునే దిశగా కంపెనీ తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ప్రస్తుతం కంపెనీలో దాదాపు 35,000 ఉద్యోగులు పనిచేస్తున్నారు. గడిచిన రెండో త్రైమాసికం(సెప్టెంబర్)లో 25 లక్షల యూనిట్లను తయారుచేసినట్లు తెలిసింది. -
భారత్లో మరో 1.6 బిలియన్ డాలర్లు
ముంబై: ఐఫోన్ల కాంట్రాక్ట్ తయారీ సంస్థ, తైవాన్కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్కాన్ భారత్లో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై దృష్టి పెడుతోంది. ఈ క్రమంలో తాజాగా మరో 1.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 13 వేల కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు తైవాన్లోని స్టాక్ ఎక్స్చేంజీలకు సంస్థ తెలియజేసింది. భారత్లోని తమ అనుబంధ సంస్థ హోన్ హాయ్ టెక్నాలజీ ఇండియా మెగా డెవలప్మెంట్ ద్వారా పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొంది. చైనాకు మాత్రమే పరిమితం కాకుండా కార్యకలాపాలను ఇతర దేశాలకు కూడా మళ్లించే వ్యూహంలో భాగంగా (చైనా ప్లస్ వన్) కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటం తరచుగా సమస్యలకు దారి తీస్తున్న నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. ఫాక్స్కాన్ ఇప్పటికే భారత్లో దాదాపు 8 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. భారత మార్కెట్లో అవకాశాల రీత్యా ఇక్కడ తమ పెట్టుబడులను గతేడాదితో పోలిస్తే మరింతగా పెంచుకునే అవకాశం ఉందని కంపెనీ చైర్మన్ యంగ్ లియు ఇటీవలే తెలిపారు. ఐఫోన్ల తయారీలో టాప్.. అమెరికా టెక్ దిగ్గజం యాపిల్కు అత్యధికంగా ఐఫోన్లను సరఫరా చేసే కాంట్రాక్ట్ తయారీ సంస్థల్లో ఫాక్స్కాన్ది అగ్రస్థానం. భారత్లోనూ పోటీ సంస్థలైన టాటా, పెగాట్రాన్కు మించి ఉత్పత్తి చేస్తోంది. ఫాక్స్కాన్ ఆదాయంలో దాదాపు సగభాగం ఐఫోన్ల తయారీ ద్వారానే ఉంటోంది. కంపెనీకి భారత్లో 40,000 మంది పైగా వర్కర్లు ఉన్నారు. ఇక్కడ మొత్తం 30 ఫ్యాక్టరీలు ఉండగా, ఏటా దాదాపు 10 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తోంది. 2022లో ఫాక్స్కాన్ ఆదాయం 216 బిలియన్ డాలర్లు కాగా అందులో భారత విభాగం వాటా 4.6%గా నమోదైంది. అంతక్రితం ఏడాది 2021లో ఇది 2%గా ఉండేది. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఎల్రక్టానిక్ పరికరాల తయారీ కోసం మరో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఫాక్స్కాన్ యోచిస్తోంది. అటు కర్ణాటకలో రూ. 8,800 కోట్లతో ఐఫోన్ విడిభాగాల యూనిట్ నెలకొల్పే యోచన కూడా ఉంది. ఇందుకు తుమకూరులోని జపాన్ ఇండస్ట్రియల్ టౌన్షిప్లో స్థలాన్ని కూడా అధికారులు పరిశీలించినట్లు సమాచారం. కొత్తగా ప్రతిపాదించిన 1.6 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికల్లోనే ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా భాగంగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీతో కొత్తగా 14,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగవచ్చని అంచనా. ఇందులో ఫోన్ స్క్రీన్లు, వెలుపలి కవరింగ్లు తయారు చేసే అవకాశం ఉంది. సెమీకండక్టర్లపైనా దృష్టి.. భారత్లో తొలి సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు ఫాక్స్కాన్ సైతం పోటీపడుతోంది. ఇందుకోసం ముందుగా వేదాంత సంస్థతో జట్టు కట్టినప్పటికీ, తర్వాత ఆ జాయింట్ వెంచర్ నుంచి పక్కకు తప్పుకుంది. భారతీయ భాగస్వామి అవసరం లేకుండా సొంతంగానే ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ఇందుకు సంబంధించి తమ ఫ్యాబ్ యూనిట్ ప్లాన్కి ఆమోదం పొందేందుకు ప్రభుత్వంతో చర్చలు కూడా జరుపుతున్నట్లు కంపెనీ గతంలో తెలిపింది. -
27 సంస్థలకు ఐటీ హార్డ్వేర్ పీఎల్ఐ స్కీము
న్యూఢిల్లీ: దేశీయంగా ఐటీ హార్డ్వేర్ తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీము కింద 27 సంస్థలు ఎంపికయ్యాయి. అనుమతి పొందిన వాటిలో డెల్, హెచ్పీ, ఫ్లెక్స్ట్రానిక్స్, ఫాక్స్కాన్ మొదలైన కంపెనీలు ఉన్నాయి. ఈ సంస్థల్లో 95 శాతం కంపెనీలు (23) ఇప్పటికే తయారీకి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మిగతా నాలుగు కంపెనీలు వచ్చే 90 రోజుల్లో ఉత్పత్తి ప్రారంభించగలవని ఆయన వివరించారు. ‘ఈ 27 దరఖాస్తులతో దాదాపు రూ. 3,000 కోట్ల మేర పెట్టుబడులు రాగలవు. అంతకన్నా ముఖ్యంగా విలువను జోడించే ఉత్పత్తుల తయారీ వ్యవస్థ భారత్ వైపు మళ్లగలదు‘ అని మంత్రి పేర్కొన్నారు. పీసీలు, సర్వర్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు వంటి ఐటీ హార్డ్వేర్ తయారీలో భారత్ దిగ్గజంగా ఎదిగేందుకు ఇది తోడ్పడగలదని వివరించారు. అదనంగా రూ. 3.5 లక్షల కోట్ల విలువ చేసే ఉత్పత్తుల తయారీకి, ప్రత్యక్షంగా 50,000 మంది .. పరోక్షగా 1.5 లక్షల మంది ఉపాధి పొందడానికి స్కీము దోహదపడగలదని మంత్రి చెప్పారు. -
మోదీజీ..వచ్చే ఏడాదికి గొప్ప బర్త్డే గిఫ్ట్: ఫాక్స్కాన్ పోస్ట్ వైరల్
యాపిల్ ఐఫోన్ తయారీదారు తైవాన్కు చెందిన పాక్స్కాన్(Foxconn) దేశంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించనుంది. భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలలో దాని తయారీ సౌకర్యాలను వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భారీగా ఉద్యోగావకాశాలను కల్పించనుంది. భారతదేశంలో తన ఉద్యోగులను రెట్టింపు చేయాలని నిర్ణయించింది ఫాక్స్కాన్ ప్రతినిది లింక్డ్ఇన్ ఖాతా ద్వారా ఈవిషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఆదివారం ప్రధానమంద్రి నరేంద్ర మోదీ 73వ పుట్టినరోజు సందర్భంగా ఫాక్స్కాన్ ప్రతినిధి వి లీ ఈ విషయాన్నిఅధికారికంగా ప్రకటించారు. "హ్యాపీ బర్త్డే, గౌరవ ప్రధానమంత్రి. మీ నాయకత్వంలో ఫాక్స్కాన్ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందింది. వచ్చే ఏడాది గొప్ప బహుమతి అందించేలా మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, దేశంలో వ్యాపార వృద్ధితోపాటు, రెట్టింపు ఉపాధిని అందించే లక్ష్యంతో మరింత కష్టపడి పని చేస్తామంటూ ప్రకటించారు. చైనాఆంక్షల నేపథ్యంలో అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ ఇండియాపై దృష్టిపెడుతోంది. తద్వారా ఐఫోన్ విక్రయాలకు పెద్ద మార్కెట్గా ఉన్న చైనాపై ఆధార పడటాన్ని తగ్గించాలని కంపెనీ చూస్తోంది. తమిళనాడు ప్లాంట్లో ఇప్పటికే 40వేల మంది ఉద్యోగులను నియమించుకుంది. (మ్యూచువల్ ఫండ్స్లో ఎన్నో అవకాశాలు..కానీ వాటిని నమ్మొద్దు!) ఫాక్స్కాన్ ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్లో ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ తయారీదారుగా ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టులో, ఫాక్స్కాన్ రాష్ట్రంలోని రెండు ప్రాజెక్టులలో 600 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కర్ణాటక ప్రకటించింది. ఇక్కడ ఐఫోన్ల కేసింగ్ కాంపోనెంట్స్ , చిప్ తయారీకి సంబంధించిన పరికరాల ఉత్పత్తికానున్నాయి. మరోవైపు తెలంగాణలోఇటీవల మరో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. దీంతో ఆ సంస్థ మొత్తం 550 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనుంది. (గణేష్ చతుర్థి: ఈ మూడు రోజులు సెలవులేనా? ఇవిగో వివరాలు) గత నెలలో ఎర్నింగ్స్ బ్రీఫింగ్ సందర్భంగా, ఫాక్స్కాన్ ఛైర్మన్ లియు యంగ్-వే ఇండియా మార్కెట్పై భారీ ఆశలే ప్రకటించారు. మల్టీ బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రారంభం మాత్రమేనని పేర్కొనడం గమనార్హం. -
భారత్లో ఫాక్స్కాన్ ఈవీ ప్లాంట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తైవాన్కు చెందిన చిప్ తయారీ సంస్థ ఫాక్స్కాన్ భావిస్తోంది. అయితే ఫాక్స్కాన్ ఇతర ఈవీ కంపెనీల కోసం కాంట్రాక్ట్ తయారీ చేపడుతుందా లేదా సొంత బ్రాండ్ కింద మోడళ్లను విక్రయించబోతోందా అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి తమిళనాడును తమ స్థావరంగా ఉపయోగించుకోవాలని ఫాక్స్కాన్ చైర్మన్ చర్చించినట్లు తెలుస్తోంది.ఫాక్స్కాన్ మాతృ సంస్థ హాన్ హాయ్ టెక్నాలజీ గ్రూప్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యంగ్ లేయో యూఎస్లోని ఓహియోతోపాటు థాయ్లాండ్లో ఈవీ ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అలాగే అతి త్వరలో భారత్లో కూడా ఈవీ ఫ్యాక్టరీని నిర్మిస్తాం అని తెలిపారు. -
చైనాకు షాకిచ్చిన యాపిల్ సంస్థ..భారత్ లో ఐఫోన్15 సిరీస్ ఫోన్ల తయారీ..
-
యాపిల్ కీలక నిర్ణయం.. చైనా గొంతులో పచ్చి వెలక్కాయ?!
ప్రపంచ వ్యాప్తంగా 85 శాతం ఐఫోన్ల తయారీతో గుత్తాదిపత్యం వహిస్తున్న డ్రాగన్ కంట్రీకి భారీ షాక్ తగలనుందా? తాజాగా, యాపిల్ తీసుకున్న నిర్ణయం చైనా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయ్యిందా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. ఐఫోన్ల తయారీలో ప్రధాన దేశమైన చైనాకు, యాపిల్ ప్రొడక్ట్ల తయారీ, సరఫరా, అమ్మకాలు, సర్వీసింగ్ వంటి విభాగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న భారత్కు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. చైనాను కాదనుకొని భారత్లో ఐఫోన్ 15ను భారీ ఎత్తున తయారు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో తమిళనాడు పెరంబదూర్ కేంద్రంగా ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్కు ప్లాంట్లో గతంలో కంటే ఎక్కువగానే ఈ లేటెస్ట్ ఐఫోన్లను తయారు చేయనుంది. చైనాలో తయారైన యాపిల్ ప్రొడక్ట్లు ఇతర దేశాలకు దిగుమతి చేసిన వారం రోజుల తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్రమత్తమైన టిమ్కుక్ యాపిల్ సంస్థ గత కొన్నేళ్లుగా చైనాలో తన ఉత్పత్తుల్ని తయారీ, అమ్మకాలు నిర్వహిస్తుంది. అయితే, డ్రాగన్ కంట్రీలో సప్లయి చైన్ సమస్యలు, అమెరికా - చైనాల మధ్య తగ్గిపోతున్న వ్యాపార సత్సంబంధాలు, అదే సమయంలో తయారీ కేంద్రంగా ఎదిగేందుకు ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా అమెరికాతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకుని, తనను తాను తయారీ కేంద్రంగా మార్చుకోవాలని కోరింది. ఇలా వరుస పరిణామాలతో యాపిల్ సీఈవో టిమ్కుక్ అలెర్ట్ అయ్యారు. చైనాలో వ్యాపారం ఎప్పటికైనా ప్రమాదమనే ఓ అంచనాకు వచ్చిన యాపిల్ గత కొన్నేళ్లుగా తన వ్యాపారాన్ని ప్రపంచ దేశాలకు విస్తరిస్తుంది. ఇందులో భాగంగా భారత్లో ఐఫోన్ 15 తయారీని ప్రారంభించనుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. చైనా నుంచి భారత్కు చైనాలో సప్లయి చైన్ సమస్యలతో యాపిల్ తన తయారీని భారత్కు తరలించాలని భావించింది. కాబట్టే గత ఏడాది భారత్లో తయారైన యాపిల్ ఐఫోన్ షిప్మెంట్ విలువ 65 శాతం పెరిగింది. ఐఫోన్ల విలువ 162 శాతం పెరిగిందంటూ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. ఆ నివేదికను ఊటంకిస్తూ ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ మరో రిపోర్ట్ను వెలుగులోకి తెచ్చింది. 2022లో భారత్లో మొత్తం స్మార్ట్ఫోన్ షిప్మెంట్ విలువలో యాపిల్కు 25 శాతం వాటాను కలిగి ఉందని వెల్లడించింది. ఈ వృద్ది రేటు 2021లో 12 శాతం నుండి పెరిగినట్లు మరికొన్ని సంస్థలు నివేదించాయి. ప్రమాదం అంచున చైనా ఆధిపత్యం ప్రపంచ వ్యాప్తంగా 85 శాతం ఐఫోన్లను చైనానే తయారు చేస్తుందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదికలో టెక్నాలజీ రిపోర్టర్ జిన్మీ షెన్ తెలిపారు. అయినప్పటికీ, యాపిల్ తన తయారీని చైనా నుంచి బయట (ముఖ్యంగా భారత్కు) దేశాలకు తరలించాలని భావిస్తున్నందున బీజింగ్ తన ఆధిపత్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 ప్రపంచ చరిత్రలో నష్ట జాతకుడు ఇతనే! -
ఎయిర్పాడ్స్ ఇక మేడ్ ఇన్ ఇండియా.. హైదరాబాద్లోనే తయారీ
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ కోసం వైర్లెస్ ఇయర్బడ్స్ (ఎయిర్పాడ్స్)ను ఫాక్స్కాన్ తమ హైదరాబాద్ ప్లాంటులో తయారు చేయనుంది. 2024 డిసెంబర్ నాటికి భారీ స్థాయిలో వీటి ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ ప్లాంటుపై ఫాక్స్కాన్ దాదాపు 400 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తోంది. ఐఫోన్ల తర్వాత యాపిల్ పోర్ట్ఫోలియోలో అత్యధికంగా అమ్ముడయ్యే ఉత్పత్తుల్లో ఎయిర్పాడ్లు రెండో స్థానంలో ఉన్నాయి. ట్రూ వైర్లెస్ స్టీరియో (టీడబ్ల్యూఎస్) మార్కెట్లో 36 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. మరోవైపు, తమ ప్రణాళికలను సక్రమంగా అమలు చేయగలిగితే భారత్లో బిలియన్ల కొద్దీ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయని కంపెనీ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా హోన్ హాయ్ టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్కాన్) చైర్మన్ యంగ్ లియు తెలిపారు. వార్షిక ప్రాతిపదికన భారత్లోని తమ విభాగం 10 బిలియన్ డాలర్ల పైగా టర్నోవరు సాధించినట్లు వివరించారు. -
భారత్లో ఫాక్స్కాన్.. 500 మిలియన్ల పెట్టుబడికి గ్రీన్ సిగ్నల్
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్కు ఐఫోన్లను తయారీ చేసి సరఫరా చేసే ఫాక్స్కాన్ టెక్నాలజీ సంస్థ భారత్ రెండు మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లను నిర్మించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా 500 మిలియన్ల పెట్టుబడి పెట్టే యోచనలో ఉందంటూ బ్లూమ్బెర్గ్ నివేదించింది. ఫాక్స్కాన్ ఈ తయారీ యూనిట్లను కర్ణాటకలో నిర్మించనుండగా..ఒక ఫ్యాక్టరీ ఐఫోన్ల తయారీ, రెండో ఫ్యాక్టరీలో యాపిల్కు విడిభాగాలు ఉత్పత్తి చేయనుందని నివేదిక పేర్కొంది. అయితే, ఏ రాష్ట్రంలో ఫ్యాక్టరీలను నిర్మించాలనే అంశంపై ఫాక్స్కాన్ స్పష్టత ఇచ్చినప్పటికీ.. ప్రాంతం ఎక్కడనేది నిర్ణయించలేదు. ఈ వారంలో ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సిన అనువైన ప్రాంతంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ ఏడాది మార్చిలో కర్నాటకలో ఫాక్స్ కాన్ యూనిట్ కోసం 80 బిలియన్ రూపాయల ($972.88 మిలియన్లు) పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది. చైనా కంటే భారత్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్కాన్ కంపెనీ సిద్ధమైంది. తమిళనాడులో ఎలక్ట్రానిక్ వస్తువుల విడిభాగాల తయారీ కేంద్రంలో 16 బిలియన్లను పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదర్చుకుంది. తద్వారా 6,000 మందికి ఉపాధి కలగనుంది. కాగా, ఫాక్స్ కాన్ తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలోని కాంచీపురం జిల్లాలో నిర్మించనుందని తెలుస్తోంది. దీనిపై ఫాక్స్కాన్, తమిళనాడు ప్రభుత్వాలు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇదీ చదవండి : చైనాను వద్దనుకొని వచ్చేస్తోంది?.. భారత్లో ఫాక్స్కాన్ 700 మిలియన్ డాలర్ల పెట్టుబడులు -
సెమీకండక్టర్ ప్లాంటు.. వారి ప్రతిపాదనలు వేర్వేరుగా పరిశీలిస్తాం...
న్యూఢిల్లీ: భారత్లో సెమీకండక్టర్ ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి వేదాంత, ఫాక్స్కాన్ సంస్థలు వేర్వేరుగా ప్రతిపాదనలను సమర్పించేంత వరకు ప్రభుత్వం వేచి చూస్తుందని, తర్వాత తగు విధంగా వాటిని మదింపు చేస్తుందని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. గతంలో ఇరు సంస్థలు జాయింట్ వెంచర్గా ప్రతిపాదనలు ఇచ్చాయని, ప్రస్తుతం అవి వేర్వేరుగా ప్రపోజల్స్ ఇచ్చే యోచనలో ఉన్నాయని పేర్కొన్నారు. సెమీకాన్ ఇండియా 2023 కార్యక్రమంలో భాగంగా అధునాతన సెమీకండక్టర్ టెక్నాలజీల ఎగ్జిబిషన్ ప్రారంభంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. సెమీకండక్టర్ రంగంలో 70 ఏళ్లలో లేనంత పురోగతిని గత 15 నెలల్లో సాధించగలిగామని పేర్కొన్నారు. -
‘సెమీ’ ఆశలకు సడన్ బ్రేకులు!
ఆశించిన పురోగతికి అర్ధంతరంగా బ్రేకులు పడినప్పుడు నిరాశ సహజమే! అందులోనూ అది సాక్షాత్తూ ప్రధాని గొప్పగా చెప్పిన ఆత్మనిర్భర ఆశయాలకు భంగకరమని అనిపించినప్పుడు నిరుత్సాహం మరీ ఎక్కువే! భారత దేశ సెమీ కండక్టర్ల (చిప్ల) తయారీ ఆకాంక్షలకు ఇప్పుడు అలాంటి అవరోధాలే వచ్చాయి. సెమీ కండక్టర్ల తయారీకి కలసి కృషి చేసేందుకు ఒక్కటైన తైవాన్కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ ‘ఫాక్స్కాన్’, భారత సంస్థ ‘వేదాంత’ ఇప్పుడు దేని దారి అది చూసుకోవడం అలాంటి పరిణామమే. దీనివల్ల భారత చిప్ లక్ష్యాలకు ఇబ్బంది ఏమీ ఉండదని కేంద్రం చెబుతున్నప్పటికీ అది సంపూర్ణ సత్యమేమీ కాదు. చిప్ల తయారీ నిమిత్తం వేదాంత– ఫాక్స్కాన్లు గత ఏడాది ఉమ్మడి భాగస్వామ్యానికి దిగి, గుజరాత్ ప్రభుత్వంతో 19.5 బిలియన్ డాలర్ల విలువైన సెమీ కండర్ల కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నాయి. తీరా పట్టుమని పది నెలలకే ఆ గ్రూపు నుంచి వైదొలగుతున్నట్టు ఫాక్స్కాన్ ప్రకటించడం ఒక విధంగా ఆకస్మిక బ్రేకనే చెప్పాలి. ఎలక్ట్రానిక్స్ తయారీ, డిజైన్ రంగంలో ప్రపంచ కేంద్రంగా మన దేశం ఆవిర్భవించేందుకు తగిన వాతావరణ పరికల్పనే లక్ష్యంగా పెట్టుకున్న భారత సెమీ కండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)కు ఇది శుభవార్త కానే కాదు. ‘సెమీ కండక్టర్ల ఆలోచనను నిజం చేయడానికి’ వేదాంత సంస్థతో కలసి ఏడాది పైగా కృషి చేసిన ఫాక్స్కాన్ పరస్పర అంగీకారంతో, ఈ ఉమ్మడి భాగస్వామ్య ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సోమవారం ప్రకటించింది. అంటే ఇక ఆ బృహత్ ప్రయత్నంలో ఫాక్స్కాన్ పేరు ఉండదు. ప్రాజెక్ట్ పూర్తిగా వేదాంత సంస్థకే సొంతమన్నమాట. తొలి ప్రకటన వచ్చిన 24 గంటలలోపే ఇటు ఫాక్స్కాన్ సైతం విడిగా తగిన సాంకేతిక భాగస్వామిని చేర్చుకొని, తనదైన వ్యూహంతో ముందుకు నడుస్తుందన్న సంకేతాలొచ్చేశాయి. కలసి అడుగులేసిన సంస్థలు ఏడాదికే ఇలా వేరు కుం పట్లయిన పరిణామానికి కారణాలేమిటన్నది అవి చెప్పలేదు. గుజరాత్లో చిప్ల తయారీకి కావాల్సిన లైసెన్స్తో కూడిన సాంకేతిక పరిజ్ఞానంకోసం వేదాంత, ఫాక్స్కాన్లు ఎస్టీమైక్రోను ఆసరాగా బరిలోకి దింపాయి. కానీ, ప్రభుత్వం మాత్రం సదరు యూరోపియన్ చిప్ తయారీ సంస్థ కూడా నిష్పూచీగా మిగలక, ఒప్పందంలో భాగస్వామిగా ఉండాల్సిందే అనడంతో చిక్కొచ్చినట్టుంది. ప్రపంచంలో 37 శాతం చిప్లు తైవాన్వే! భారత ఎలక్ట్రానిక్ చిప్ అవసరాలన్నీ ప్రధానంగా దిగుమతి ద్వారానే తీరుతున్నాయి. కొన్నేళ్ళుగా ఏటా దాదాపు 1000 కోట్ల డాలర్ల విలువైన చిప్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అందులో సుమారు 70 శాతం చైనా నుంచి వస్తున్నవే. చిప్ల తయారీలోని ఈ అంతరాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఐఎస్ఎం ప్రారంభమైంది. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, అనేక ఐరోపా దేశాలు చిప్ల తయారీ సత్తా పెంచుకుంటున్నాయి. తాజాగా భారత్ ఆ పరుగులో చేరింది. దేశంలో చిప్ల తయారీ కేంద్రాల్ని నెలకొల్పాలని వచ్చేవారికి పెట్టుబడి రూపంలో ప్రోత్సాహకాలిచ్చేందుకు సిద్ధపడింది. అమెరికా చిప్ తయారీ సంస్థ మైక్రాన్ ఇటీవలే భారత్లో చిప్ కేంద్రానికి ఆమోదం పొందింది. కేంద్ర, గుజరాత్ సర్కార్లు దానికి గణనీయంగా పెట్టుబడి సాయం చేస్తున్నాయి. ఆత్మ నిర్భరతకై ఇలాంటి యత్నాలు జరుగుతున్న వేళ భారీ ఒప్పందమైన వేదాంత – ఫాక్స్కాన్ చిక్కుల్లో పడడమే విచారకరం. కారణాలేమైనా గత ఏడాది ఫిబ్రవరి 14న ఫాక్స్కాన్– వేదాంతల మధ్య మొలకెత్తిన ప్రేమ మూణ్ణాళ్ళ ముచ్చటైంది. గుజరాత్లో చిప్ల తయారీ కేంద్రాల ఏర్పాటుకై గత సెప్టెంబర్లో చేసుకున్న రూ. 1.54 లక్ష కోట్ల మేర ఒప్పందాలు ఇరుకునపడ్డాయి. ఏ సంస్థకు ఆ సంస్థ విడివిడిగా ముందుకు పోయినా భారత సెమీ కండక్టర్ల మిషన్లో జాప్యం తప్పదనిపిస్తోంది. చిప్ల తయారీకి తగ్గ పునాది లేకున్నా చిప్ డిజైన్లో మాత్రం మన దేశం ముందంజలో ఉంది. దాన్ని ఆయుధంగా మలుచుకోవాలి. సొంత తయారీతో పదునుపెట్టుకోవాలి. పైగా, కరోనాతో సరఫరా వ్యవస్థలకు అంతరాయం, రష్యా – ఉక్రెయిన్ యుద్ధంతో వచ్చిపడ్డ అనివార్యతల రీత్యా రక్షణ, ఎలక్ట్రానిక్స్ తదితర కీలక రంగాల్లో భారత్ ఎంత త్వరగా సొంతకాళ్ళపై నిలబడగలిగితే వ్యూహాత్మకంగా అంత మంచిది. ఆ మాటకొస్తే, ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికా పైచేయి సాధించగలిగిందీ ఈ చిప్ల వల్లేనంటారు విశ్లేషకులు. అమెరికా, చైనాల మధ్య ఇప్పుడు నడుస్తున్న భౌగోళిక రాజకీయాల తోపులాటలోకూ ఇవే కారణం. ఇవాళ దేశాలన్నీ తమ గడ్డపైనే అన్ని రకాల చిప్ల రూపకల్పనకు అత్యంత ప్రాధాన్యమిస్తోందీ, ప్రోత్సాహకాలిస్తున్నదీ అందుకే. కాబట్టి, మనకు అవసరమైన చిప్ల డిజైనింగ్ నుంచి తయారీ దాకా అన్నీ మన చేతుల్లోనే ఉండడం పోటీలో ముందు ఉండడానికో, ఆర్థిక ప్రయోజనాల రీత్యానో కాకున్నా... వ్యూహాత్మకంగా భారత్కు అత్యంత కీలకం. అందుకే, వేదాంత – ఫాక్స్కాన్ల బంధం విచ్ఛిన్నమైందన్న నిరాశను పక్కనపెట్టి, సెమీ కండక్టర్ల రంగాన్ని దృఢంగా నిర్మించేందుకు మరింతగా కృషి చేయాలి. చైనా లాంటివి పడనివ్వకుండా చేసినా పట్టుదలతో సాగాలి. వేదాంత – ఫాక్స్కాన్లకు ఇరుకున పెట్టిన ఆర్థిక, సాంకేతిక అంశాలనూ క్షుణ్ణంగా పరిశీలించాలి. భవిష్యత్తులో ఇలాంటి మరో ప్రయత్నానికి ఆ చిక్కులు రాకుండా నివారించాలి. సెమీ కండక్టర్ల రంగంలో సాంకేతిక విజ్ఞాన బదలీని ప్రోత్సహించాలి. పరిశోధన, అభివృద్ధిలో దేశ, విదేశీ సంస్థల మధ్య సహకారాన్నీ పెంచిపోషించడమూ అంతే ముఖ్యం. ఎందుకంటే, ఐఎస్ఎం కింద రూ. 76 వేల కోట్ల కేటాయింపుతో నాలుగు పథకాలు ప్రవేశపెట్టామంటున్న ప్రభుత్వం సంస్థలకు తగిన వాతావరణం కల్పిస్తేనే ఫలితం. మేకిన్ ఇండియాకు బ్రేకులు పడకూడదంటే అది అత్యంత కీలకం. -
అనిల్ అగర్వాల్కు మరో దెబ్బ? టాటా గ్రూపుతో ఫాక్స్కాన్ చర్చలు?
తైవాన్కు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్కాన్ రూ.1.6 లక్షల కోట్ల(19.5 బిలియన్ల డాలర్ల) ప్రాజెక్టును వెనక్కి తీసుకుని చైర్మన్ అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత గ్రూపునకు భారీ షాక్ ఇచ్చింది. భారతదేశంలో సెమీకండక్టర్ ఉత్పత్తి కోసం జాయింట్ వెంచర్ (జేవీ) నుండి వైదొలగాలని సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించిన సంస్థ దేశీయంగా మరో టాప్ కంపెనీతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. టాటా గ్రూప్తో సంభావ్య టై-అప్ కోసం ఫాక్స్కాన్ అన్వేషిస్తోందని సీఎన్బీసీ ఆవాజ్ రిపోర్ట్ చేసింది. ముఖ్యంగా, టాటా గ్రూప్ ఇటీవలి సెమీకండక్టర్ ప్రయత్నాలలో ఉంది. మరోవైపు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రాజెక్టుకు ఫాక్స్కాన్ కట్టుబడి ఉందనీ, దేశం ఒక బలమైన సెమీకండక్టర్ తయారీ పర్యావరణ వ్యవస్థను విజయవంతంగా స్థాపించాలని చూస్తోందని ఫాక్స్కాన్ మంగళవారం మరోసారి స్పష్టం చేసింది. సరైన భాగస్వాముల కోసం సమీక్షిస్తున్నామని, దేశీయ, అంతర్జాతీయ వాటాదారులను స్వాగతించడానికి సిద్ధంగా ఉందని కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించి అప్లికేషన్ను సమర్పించే దిశగా పని చేస్తోందని ప్రకటించడం ఈ వార్తలు ఊతమిస్తోంది. (వేదాంత చిప్ ప్లాంటుకు బ్రేక్ ) తరువాతి తరం వృద్ధిని ప్రారంభించే క్రమంలో దేశంలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన ఈ మెగా ప్రాజెక్టును కోసం వేదాంత ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ రాయితీలను అందిపుచ్చుకునేందుకు ఫాక్స్ కాన్-వేదాంత జాయింట్ వెంచర్గా గుజరాత్ లో సెమీ కండక్టర్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించాయి. అయితే పరస్పర అంగీకారంతో ఈ డీల్ నుంచి తప్పుకుంటున్నట్టు ఫాక్స్కాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (90 శాతం ఉద్యోగాలు ఫట్: సిగ్గూ, శరం, మానవత్వం లేదా? సీఈవోపై పైర్) -
వేదాంత చిప్ ప్లాంటుకు బ్రేక్
న్యూఢిల్లీ: భారత్లో సెమీకండక్టర్ల ప్లాంటు నెలకొల్పేందుకు దేశీ దిగ్గజం వేదాంతతో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ (జేవీ) నుంచి హోన్ హయ్ టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్కాన్) తప్పుకుంది. మరిన్ని వైవిధ్యమైన అవకాశాలను అన్వేషించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ‘పరస్పర అంగీకారం మేరకు, వేదాంతతో జాయింట్ వెంచర్ విషయంలో ముందుకు సాగరాదని నిర్ణయించుకున్నాం. వేదాంత యాజమాన్యంలోని సంస్థకు మాకు ఎటువంటి సంబంధం ఉండదు. మా పేరును జోడించి ఉంచడం వల్ల గందరగోళానికి దారి తీస్తుంది కాబట్టి దాన్ని తొలగించుకునే ప్రయత్నాల్లో ఉన్నాం‘ అని ఫాక్స్కాన్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, భారత ప్రభుత్వ మేకిన్ ఇండియా ఆకాంక్షల సాకారానికి పూర్తి తోడ్పాటు అందిస్తామని, స్థానిక అవసరాల మేరకు భాగస్వామ్యాలు కుదుర్చుకుంటామని పేర్కొంది. తైవాన్కు చెందిన కాంట్రాక్ట్ ఎల్రక్టానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్కాన్, వేదాంత .. గుజరాత్లో దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడితో దేశీయంగా తొలి సెమీకండక్టర్ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు గతేడాది జేవీ కుదుర్చుకున్నాయి. ఏడాది పైగా దీనిపై కసరత్తు చేశాయి. సాంకేతిక భాగస్వామిగా యూరప్ సంస్థ ఎస్టీ మైక్రోఎలక్ట్రానిక్స్తో జట్టు కట్టేందుకు ప్రయత్నించినా చర్చలు ముందుకు సాగలేదు. దీంతో ప్రస్తుతం వేదాంత–ఫాక్స్కాన్ జేవీకి బ్రేక్ పడింది. ఫోన్లు, ఫ్రిజ్లు, కార్లలో ఉపయోగించే చిప్లు కేవలం కొన్ని దేశాల్లోనే తయారవుతున్నాయి. భారత్ కూడా చిప్ల తయారీలోకి ప్రవేశించడంపై దృష్టి పెట్టి ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీనికి స్పందనగా వేదాంత–ఫాక్స్కాన్, ఐఎస్ఎంసీ, ఐజీఎస్ఎస్ దరఖాస్తు చేసుకున్నాయి. అయితే, వేదాంత జేవీ మినహా మిగతా రెండింటి విషయంలో పెద్దగా పురోగతి లేదు. ప్రాజెక్టుకు కట్టుబడి ఉన్నాం.. కాగా సెమీకండక్టర్ ప్రాజెక్టుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని వేదాంత స్పష్టం చేసింది. చిప్ ప్లాంటు ఏర్పాటులో భాగస్వాములయ్యేందుకు పలు సంస్థలు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ‘సెమీకండక్టర్ల విషయంలో ప్రధాని విజన్ను సాకారం చేసేందుకు, మరింతగా కృషి చేస్తాం’ అని వేదాంత పేర్కొంది. సైయంట్ డీఎల్ఎం లిస్టింగ్ భళా ఎల్రక్టానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్విసుల కంపెనీ సైయంట్ డీఎల్ఎం భారీ లాభాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 265తో పోలిస్తే బీఎస్ఈలో 51 శాతం ప్రీమియంతో రూ. 401 వద్ద లిస్టయ్యింది. ఆపై ఒక దశలో 61% దూసుకెళ్లి రూ. 426ను అధిగమించింది. చివరికి 59 శాతం(రూ. 156) లాభంతో రూ. 421 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో సైతం రూ. 403 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. తదుపరి రూ. 427 వరకూ ఎగసి చివరికి రూ. 422 వద్ద స్థిరపడింది. వెరసి రూ. 157 లాభంతో ముగిసింది. భారత్ లక్ష్యాలపై ప్రభావం ఉండదు వేదాంతతో జేవీ నుంచి ఫాక్స్కాన్ వైదొలగడమనేది భారత్ నిర్దేశించుకున్న చిప్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటు ఏర్పాటు లక్ష్యాలపై ప్రభావం చూపబోదు. – రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర ఐటీ మంత్రి -
ఫాక్స్కాన్ సంచలన నిర్ణయం: లక్షల కోట్ల ప్రాజెక్ట్ నుంచి వెనక్కి
తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ ఫాక్స్కాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశీయ మెటల్స్-టు-ఆయిల్ వేదాంత కంపెనీతో 19.5 బిలియన్ డాలర్ల సెమీ కండక్టర్ జాయింట్ వెంచర్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ఫాక్స్కాన్ నిర్ణయించుకున్నట్టు తెలిపింది. ఈ మేరకు సంస్థ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది దీనికి గల కారణాలను వివరించలేదు. (మ్యారేజ్ డే ఏమోగానీ, 24 లక్షల ఉబెర్ బిల్లు చూసి గుడ్లు తేలేసిన జంట) గ్లోబల్ కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఫాక్స్కాన్ , వేదాంత గత ఏడాది గుజరాత్లో సెమీకండక్టర్. డిస్ప్లే ప్రొడక్షన్ ప్లాంట్లను నిర్మించడానికి సుమారు రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడితో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కానీ ప్రాజెక్ట్పై ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పనిచేసినప్పటికీ ఈ జాయింట్ వెంచర్ను ముగించాలని ఇరుపక్షాలు పరస్పరం నిర్ణయించుకున్నాయన్న తాజా ప్రకటన సంచలనం రేపుతోంది. ఆ కంపెనీతో ఫాక్స్కాన్కు ఎలాంటి సంబంధం లేదని, భవిష్యత్లో భాగస్వాములు ఎలాంటి గందరగోళానికి గురవ్వకుండా ఒరిజినల్ పేరునే కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు హోన్ హయ్ టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్కాన్) ప్రకటించింది. ఈ ఒప్పందం 'మేక్ ఇన్ ఇండియా' పుష్కు ఖచ్చితంగా ఎదురుదెబ్బ అని కౌంటర్పాయింట్లోని రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ నీల్ షా వ్యాఖ్యానించారు. (ITR Filing: గడువు సమీపిస్తోంది! ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ జాగ్రత్తలు, లాభాలు) కాగా 2026 నాటికి సెమీకండక్టర్ మార్కెట్ విలువ 63 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా వేస్తున్న కేంద్రం, గతేడాది 10 బిలియన్ డాలర్ల ప్రోత్సాహక పథకం కింద ప్లాంట్ల ఏర్పాటుకు మూడు దరఖాస్తులు అందుకుంది. ఇందలో వేదాంత-ఫాక్స్కాన్ జాయింట్ వెంచర్ ఒకటి, సింగపూర్కు చెందిన IGSS వెంచర్స్ , టవర్ సెమీకండక్టర్ను టెక్ భాగస్వామిగా పరిగణించే గ్లోబల్ కన్సార్టియం ఐఎస్ఎంసీ నుండి వచ్చాయి. -
చిప్ ప్లాంట్కు వేదాంత ఫాక్స్కాన్ మళ్లీ దరఖాస్తు
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్లకు సంబంధించి కేంద్రం కొత్త మార్గదర్శకాలను ప్రకటించిన నేపథ్యంలో దానికి అనుగుణంగా తమ దరఖాస్తును మళ్లీ దాఖలు చేసినట్లు వేదాంత ఫాక్స్కాన్ జాయింట్ వెంచర్ సంస్థ వెల్లడించింది. 2027 నాటికి ఉత్పత్తి ప్రారంభించేలా రూ. 1.5 లక్షల కోట్లతో ఎలక్ట్రానిక్ చిప్ ప్లాంటును నెలకొల్పనున్నట్లు కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశీయంగా చిప్ తయారీని ప్రోత్సహించే దిశగా సెమీకండక్టర్ ఫ్యాబ్ల ఏర్పాటుకు ఇచ్చే ఆర్థిక ప్రోత్సాహకాలను కేంద్రం 30 శాతం నుంచి 50 శాతానికి ఇటీవల పెంచింది. దీంతో గతంలో సమర్పించిన దరఖాస్తును ఉపసంహరించుకుని వేదాంత ఫాక్స్కాన్ తాజాగా మరోసారి దాఖలు చేసింది. 2027 ప్రథమార్ధంలో 5,000 వేఫర్లతో ప్రారంభించి .. నెలకు 40,000 వేఫర్ల స్థాయికి ఉత్పత్తిని పెంచుకోనున్నట్లు వేదాంత ఫాక్స్కాన్ సంస్థ సీఈవో డేవిడ్ రీడ్ వెల్లడించారు. -
విబేధాలే కారణమా? గుజరాత్లో 1.54 లక్షల కోట్ల ప్రాజెక్ట్కు అడ్డంకి!
మైనింగ్ కంపెనీ వేదాంతా లిమిటెడ్కు భారీ షాక్ తిగిలింది.సెమీకండక్టర్ల తయారీ కోసం వేదాంతాతో కదుర్చుకున్న ఒప్పందం నుంచి తైవాన్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారు ఫాక్స్కాన్ తప్పుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. రెండేళ్ల క్రితం ఫాక్స్కాన్ భారత్లో సెమీ కండక్టర్ తయారీ విభాగంలో అడుగు పెట్టాలని అనుకుంది. ఇందుకోసం వేదాంతాతో చేతులు కలిపింది. 67శాతం షేరుతో వేదాంత - ఫాక్స్కాన్ జాయింట్ వెంచ్ర్లో గుజరాత్ దోలేరా ప్రాంతంలో వెయ్యి ఎకరాల్లో రూ.1.54 లక్షల కోట్లతో సెమీకండక్టర్ తయారీ ప్లాంట్ను నెలకొల్పేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నాయి. తాజాగా, ఫాక్స్కాన్క, వేదాంతా సెమీ కండక్టర్ ప్రాజెక్ట్కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఇరు సంస్థల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా సెమీ కండక్టర్ల తయారీ కోసం వేదాంతాను వద్దనుకొని కొత్త భాగస్వామి కోసం ఫాక్స్కాన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వేదాంత గ్రూప్ ఆర్థిక ఇబ్బందులతో ఫాక్స్కాన్ వేరే భాగస్వామిని చూసుకోవాలని సూచించిందని నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. దీంతో, ఫాక్స్కాన్ మరో భాగస్వామికోసం ఇప్పటికే అనధికారిక చర్చలు జరిపినట్లు సమాచారం. వాటిల్లో రెండు కార్పొరేట్ దిగ్గజాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆ రెండు కంపెనీలు ఏంటీ? ఫాక్స్కాన్కు, వేదాంతాల మధ్య ఎందుకు విబేధాలు తలెత్తాయనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. చదవండి👉 భారత్లో ఆఫీస్ను అమ్మేస్తున్న ఇంటెల్.. వేలాది మంది ఉద్యోగుల్ని.. -
ఫాక్స్కాన్ రంగంలోకి: రాయిల్ ఎన్ఫీల్డ్, ఓలా ఏమైపోవాలి?
ప్రపంచంలోనే అతిపెద్ద యాపిల్ ఐఫోన్ తయారీ ఫాక్స్కాన్ భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని యోచిస్తోందట. ఈమేరకు ప్రస్తుతం పలు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీంతో ఈ-బైక్ మార్కెట్లో రానున్నకాలంలో కొత్త ఎలక్ట్రిక్ బైక్లను రిలీజ్ చేయాలని భావిస్తున్న ఓలా ఎలక్ట్రిక్, రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థలకు గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, యాపిల్ ఐఫోన్ తయారీదారు తన వార్షిక నివేదికలో ఆగ్నేయాసియాలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ప్లాంట్ను స్థాపించడానికి కంపెనీకి సహాయం చేస్తుందని పేర్కొంది. దీనిపై ఫాక్స్కాన్ ఎగ్జిక్యూటివ్లతో చర్చించడానికి భారతీయ ప్రతినిధి బృందం త్వరలో తైవాన్ను సందర్శించాలని యోచిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. అయితే పలు బ్రాండ్ ఎలక్ట్రిక్ టూవీలర్స్ను తయారు చేస్తుందా లేదా జాయింట్ వెంచర్ ద్వారా ఒకే బ్రాండ్కు పరిమితమవుతుందా అనేది స్పష్టత లేదు. (టీసీఎస్కు భారీ ఎదురుదెబ్బ: బిగ్ డీల్ నుంచి ట్రాన్సామెరికా ఔట్!) కాగా ఇప్పటికే తమిళనాడులో పెద్ద ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్న ఫాక్స్కాన్ మహారాష్ట్రలో కూడా ఈవీ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ఆసక్తిగా ఉంది. అటు తెలంగాణపై కూడా దృష్టి సారిస్తోన్న సంగతి తెలిసిందే. (అమెరికా గుడ్ న్యూస్: వీలైనన్ని ఎక్కువ వీసాలిచ్చేందుకు తీవ్ర కృషి!) -
రానున్న 10 ఏళ్లలో 15 లక్షల ఉద్యోగ అవకాశాలు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రానున్న 10 సంవత్సరాలలో 15 లక్షల ఉద్యోగ అవకాశాలను ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ శివారు కొంగరకలాన్లో ఫాక్స్కాన్ ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీకి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఫాక్స్కాన్ ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ చైర్మన్ యాంగ్ లియూ, సీఈవోలు, ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణను తమ తయారీ కేంద్రంగా ఎంచుకున్న ఫాక్స్ కాన్ కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. కంపెనీ నిర్మాణం, తయారీ ప్లాంట్లను విస్తరించడంలో తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. ఫాక్స్కాన్ రంగారెడ్డి జిల్లాకు రావడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలోలో కొంగరకలాన్ గుర్తు పట్టలేనంతగా మారబోతున్నదని చెప్పారు. రూ. 4 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఫాక్స్కాన్ పరిశ్రమతో 35 వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని ఫాక్స్కాన్ హామీ ఇచ్చిందని తెలిపారు. అటు కంపెనీ నిర్మాణం జరుగుతుంటే మరోవైపు యువతకు శిక్షణ ఇస్తామన్నారు. యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ రోజు తెలంగాణకు చరిత్రాత్మక సందర్భమని కేటీఆర్ అన్నారు. గత తొమ్మిది సంవత్సరాల్లో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని. దేశంలోనే ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని పేర్కొన్నారు . చిన్న రాష్ట్రమైనా 30 శాతం కంటే అధిక అవార్డులను సాధించిందన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. దేశంలోని ఐటీ ఉద్యోగాల్లో ప్రతి మూడింట్లో ఒక ఉద్యోగం మనదేనని చెప్పారు చదవండి: కర్ణాటక ఫలితం.. తెలంగాణలో ఇప్పుడెలా?.. బీజేపీ బేజార్, 'కారు'కు ఫియర్.. -
రూ. 300 కోట్లతో 300 ఎకరాలు! కర్ణాటకలో ఫాక్స్కాన్ మాస్టర్ ప్లాన్ ఏంటంటే?
గత కొంతకాలంగా ఫాక్స్కాన్ భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి యోచిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ సంస్థ ఇప్పుడు బెంగళూరు ఎయిర్ పోర్ట్ సమీపంలో రూ. 300కోట్ల పెట్టుబడితో 300 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. యాపిల్ కాంట్రాక్ట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో దీని కోసం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో కంపెనీ బెంగళూరు ఎయిర్ పోర్ట్ సమీపంలోని దేవనహళ్లి వద్ద 300 ఎకరాల భూమిని సొంతం చేసుకుంది. ఫాక్స్కాన్ హాన్ హై టెక్నాలజీ కోసం ఈ స్థలం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నిజానికి యాపిల్ కంపెనీకి ఫాక్స్కాన్ అనేది అతి పెద్ద సప్లయర్. కర్ణాటక ఎన్నికలు ముగిసిన తరువాత ఈ స్ధలం కంపెనీ స్వాధీనం చేసుకోనున్నట్లు గతంలో కర్నాటక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కమీషనర్ గుంజన్ కృష్ణ చెప్పారు. ఇక ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. కావున సంస్థ భూమిని త్వరలోనే స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలా? ఒక్క నిముషం.. ఇవి తెలుసుకోండి!) కర్నాటక రాష్ట్రంలో రూ. 8 వేల కోట్లతో మొబైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు కోసం ఫాక్స్కాన్తో మార్చి 20 వ తేదీన అక్కడి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఫెసిలిటీలో సుమారు 50 వేల మందికి ఉపాథి లభిస్తుందని అంచనా. అంతే కాకుండా రానున్న మరో పది సంవత్సరాల్లో మరిన్ని ఉద్యోగాలు ఇందులో లభించే అవకాశం ఉందని భావిస్తున్నాము. ఇక తెలంగాణాలో కూడా ఫాక్స్కాన్ భూమిని కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. హైదరాబాద్ శివారులోని కొంగరకలాన్లోని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టిఎస్ఐఐసి) పార్క్లో సుమారు 186 ఎకరాలను రూ.196 కోట్లకు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లుగా ప్రచారం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇక ఎయిర్ప్యాడ్స్ కూడా తక్కువ ధరకే: రూ. 1,654 కోట్లతో ఫాక్స్కాన్ ఫ్యాక్టరీ!
సాక్షి, ముంబై: ప్రపంచంలోని అతిపెద్ద కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు, యాపిల్ ఐఫోన్ మేకర్ ఫాక్స్కాన్ భారత్లో మరో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి వేల కోట్ల రూపాయల ఆర్డర్ను సాధించింది. దీంతో ఇప్పటివరకు ఐఫోన్ మేకర్గా ఉన్న తైవాన్కు మేకర్ ఇపుడు తొలిసారి ఎయిర్పాడ్స్ను కూడా ఉత్పత్తి చేయనుంది. దాదాపు 70శాతం ఐపోన్ల అసెంబ్లర్ ఫాక్స్కాన్ కొత్త ప్లాంట్లో ఎయిర్ప్యాడ్స్ ఉత్పత్తి షురూ అయితే తక్కువ ధరకే లభ్యం కానున్న యాపిల్ ఉత్పత్తుల జాబితాలో ఇవి కూడా చేరనున్నాయి. (లగ్జరీ ఫ్లాట్లకు ఇంత డిమాండా? మూడు రోజుల్లో రూ. 8 వేల కోట్లతో కొనేశారు!) రాయిటర్స్ అందిచిన రిపోర్ట్ ప్రకారం దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఇండియా ఎయిర్ప్యాడ్ ప్లాంట్లో ఫాక్స్కాన్ 200 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 1,654 కోట్లు) పైగా పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్లాంట్ ద్వారా 2024 చివరి నాటికి తయారీని ప్రారంభించాలనే ఫాక్స్కాన్ లక్క్ష్యం. గత కొంతకాలంగా యాపిల్ భారత్లో తన కార్యకలాపాలని విస్తరించాలని యోచిస్తోంది. అయితే తక్కువ లాభాలు ఉన్నందున ఎయిర్పాడ్లను తయారు చేయాలని అనేదానిపై ఫాక్స్కాన్ తీవ్రం చర్చిస్తోందని చివరికి ఒప్పందంతో ముందుకు సాగాలని నిర్ణయించుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ ఊహాగానాలపై వ్యాఖ్యానించిందేకు నిరాకరించిన ఫాక్స్కాన్ కస్టమర్ డిమాండ్ను తీర్చడానికి, ఉత్పత్తి కోసం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి చైనా వెలుపల పెట్టుబడులను పెంచుతామని ఫాక్స్కాన్ బుధవారం తెలిపింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఎయిర్ప్యాడ్స్ సరఫరా చేస్తున్న చైనా కంపెనీలను కాదని, భారత్లో కాంట్రాక్ట్ ఉన్న ఫాక్స్కాన్తో యాపిల్ ఒప్పందం చేసుకున్నట్టు అంచనా. మరోవైపు ఈ వార్తలపై యాపిల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీ యాపిల్ నుండి మరిన్ని ఆర్డర్లను గెలుచుకోవడానికి Wistron Corp, Pegatron Corp వంటి తైవానీస్ ప్రత్యర్థులతో ఫాక్స్కాన్ పోటీపడుతున్న సంగతి తెలిసిందే. (‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా!) -
హైదరాబాద్కు ఐఫోన్ తయారీ సంస్థ ఫాక్స్కాన్!
తైవాన్కు చెందిన యాపిల్ ఐఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్కాన్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో.. తయారీ పరిశ్రమలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నాయి. యాపిల్ ఫోన్లను తయారు చేసే తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ సంస్థ..తమ ఐఫోన్ల తయారీ యూనిట్ను భారత్లో నెలకొల్పేందుకు ప్రణాళికలు రచించింది. ఈ తరుణంలో ఫాక్స్కాన్ టెక్నాలజీ చైర్మన్ యంగ్ లియూ మార్చి 2న సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో తాను మాటిచ్చినట్లుగానే..రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్ ఫాక్స్కాన్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ను నెలకొల్పేందుకు సిద్ధమైనట్లు కేసీఆర్కు లేఖ రాశారు. తద్వారా లక్షమందికి ఉపాధి కలుగుతుందని అందులో పేర్కొన్నారు. కొంగరకలాన్ లో ప్లాంట్ సీఎం కేసీఆర్పై ప్రశంసలు కురిపించారు యంగ్ లియూ. రాష్ట్రాభివృద్ధి పట్ల కేసీఆర్ కు ఉన్న విజన్ తనకు నచ్చిందన్నారు లియూ. వీలైనంత త్వరగా కొంగర కలాన్లో ఫాక్స్కాన్ను ఏర్పాటు చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా వ్యక్తిగతంగా సీఎం కేసీఆర్ను తైవాన్కు ఆహ్వానించారు. తమ ఆతిథ్యం స్వీకరించాలని కోరారు. రూ.3500 కోట్ల పెట్టుబడులు రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో రూ.3500 కోట్ల పెట్టుబడితో ఫాక్స్కాన్ ఎలక్ట్రానిక్ కంపెనీని నెలకొల్పనుంది. ఇందుకోసం ఈ కంపెనీకి 250 ఎకరాలు అవసరం కాగా.. ఇప్పటికే సర్వే నం.300లో 187 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వ కేటాయించినట్లు సమాచారం. కర్ణాటకలో ఒక ప్లాంటు తెలంగాణలో పెట్టుబడులపై ప్రకటన వెలువరించకముందు కర్ణాటకలో మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ను నెలకొల్పేందుకు ఫాక్స్కాన్ ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది. చర్చలు సఫలం కావడంతో అక్కడ కూడా తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తామని మాటిచ్చింది. ఈ ప్రకటన వచ్చిన తర్వాతే కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై మాట్లాడుతూ.. ఫాక్స్కాన్ సంస్థ తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతుందని, ఆ పెట్టుబడుల కారణంగా రాష్ట్రంలో లక్ష మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు. ఎంఓయూ (MOU) కూడా పూర్తయిందని చెప్పిన బొమ్మై.. ఫాక్స్ కాన్ ప్లాంట్ కోసం బెంగళూరు ఎయిర్పోర్ట్ సమీపంలో దొడ్డబల్లాపూర్, దేవంగల్లి తాలూకా ప్రాంతంలో 300 ఎకరాల భూమిని గుర్తించినట్లు తెలిపారు. Chairman, @HonHai_Foxconn Mr. Young Liu, in a letter addressed to CM Sri KCR, has stated that he was inspired by the vision and efforts of the #Telangana CM towards transformation and development of the State. pic.twitter.com/dJ82MinS14 — Telangana CMO (@TelanganaCMO) March 6, 2023 -
భారీ పెట్టుబడులు, ఒప్పందాలు: ఫాక్స్కాన్ షాకిచ్చిందిగా!
సాక్షి,ముంబై: తైవాన్ కు చెందిన ఫాక్స్కాన్ సంస్థ ఇండియాలో కొత్త పెట్టుబడులపై క్లారిటీ ఇచ్చింది. తమ ఛైర్మన్ ఇండియాను సందర్శించి నప్పటికీ దేశంలోఎలాంటి కచ్చితమైన ఒప్పందాలు కుదుర్చుకోలేదని వెల్లడించింది. యాపిల్ ఐఫోన్ల తయారీలో అగ్రగామి ఫాక్స్కాన్ దేశంలో భారీ పెట్టుబడులు పెడుతోందంటూ మీడియాలో వచ్చిన వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను సంస్థ శనివారం తోసిపుచ్చింది. దీంతో ఇకపై తక్కువ ధరకే మేడిన్ ఇండియా ఐఫోన్లు అందుబాటులోకి వస్తాయని ఆశలపై ఒక్కసారిగా నీళ్లు చల్లినట్లైంది. కర్ణాటకలో ఏర్పాటు కానున్న భారీ ప్లాంట్లో ఐఫోన్ల విడిభాగాల తయారీకి 700 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టాలన్న యోచనలో ఉందని బ్లూమ్ బెర్గ్ నివేదించింది. ఈ విషయంలో మీడియా వచ్చినట్టుగా చర్చలు,అంతర్గత సమీక్షలు, భారీ పెట్టుబడులు అనేది ఫాక్స్కాన్ అందించిన సమాచారం కాదని తేల్చి పారేసింది. అయితే భారీ పెట్టుబడి కోసం ఫాక్స్కాన్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై గతంలో చెప్పారు.యంగ్ లియుతో వివరణాత్మక చర్చల తర్వాత రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ మేజర్ ఫాక్స్కాన్తో ఒప్పందం కుదిరిందనీ, ఇది 1 లక్ష ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని ఆయన ట్వీట్ చేశారు. విమానాశ్రయానికి సమీపంలో 300 ఎకరాల భూమి కేటాయించినట్టుగా కూడా బొమ్మై ట్వీట్ చేశారు. దీంతోపాటు లక్షమందికి ఉపాధి కల్పించేలా రాష్ట్రంలో పెట్టుబడుల నిమిత్తం ఫాక్స్కాన్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ట్వీట్ చేశారు. కాగా ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లియు గత ఫిబ్రవరి 27 నుంచి ఈ నెల (మార్చి) 4 వరకు ఇండియాలో పర్యటించారు. సెమి కండక్టర్ల వంటి నూతన రంగాల్లో సహకారాన్ని కోరేందుకు ఉద్దేశించిందని అధికారికంగానే ప్రకటించారు. అలాగే కంపెనీ అభివృద్ధి అవకాశాలను దృష్టిలో నుంచుకొని స్థానిక ప్రభుత్వాలతో సంబంధాలను కొనసాగిస్తామని కూడా ఆయన ప్రకటించిన సంగతి విదితమే. -
చైనాను వద్దనుకొని భారత్కు వచ్చేస్తోంది?
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్కు చెందిన ఐఫోన్లను తయారు చేసే ఫాక్స్కాన్ టెక్నాలజీ సంస్థ చైనాను విడిచేసేందుకు సిద్ధమైంది. భారత్లో మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ను ప్రారంభించనుంది. ఇందుకోసం ఆ సంస్థ సుమారు 700 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా-చైనా మధ్య అసలే అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు మరింత దిగజారేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే స్పై బెలూన్ కూల్చేవేతతో అమెరికాపై చైనా మండిపడుతుంటే .. ఉక్రెయిన్పై యుద్ధం విషయంలో రష్యాకు సాయం చేస్తే చైనాపై ఆంక్షలు విధించేందుకు అమెరికా రెడీ అవుతోంది. దీంతో రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య వివాదం తమ వ్యాపారానికి ఆటంకం కలిగే అవకాశం ఉందని పలు దిగ్గజ సంస్థలు భావిస్తున్నాయి. అందుకే చైనాలో ఉండి వ్యాపారం చేయడం ఏమాత్రం మంచిది కాదన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నాయి. చైనాలో ఉంటే అన్నీ ఆటంకాలే ఈ తరుణంలో చైనాలో మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు దిగ్గజ కంపెనీలు డ్రాగన్ కంట్రీని విడిచి పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. వరల్డ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ సంస్థగా ఫాక్స్గాన్కు పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. చైనాలో పరిస్థితులు, ఇతర దేశాలతో వైరం కారణంగా ఆ సంస్థకు తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడమే గాక.. భారీగా నష్టాల్ని మూటగట్టుకుంటుంది. అందుకే చైనా నుంచి మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ను భారత్కు తరలించాలని చూస్తోంది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు ఎయిర్ పోర్ట్ సమీప ప్రాంతంలో 300 ఎకరాల్లో ఐఫోన్ విడి భాగాల తయారీ యూనిట్ను నెలకొల్పే యోచనలో ఉందంటూ ఎకనమిక్స్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. లక్షమందికి ఉపాధి యాపిల్తో పాటు ఇతర అమెరికన్ బ్రాండ్లు చైనాకు గుడ్బై చెప్పి ప్రత్యామ్నాయంగా ఉన్న భారత్తో పాటు ఏసియన్ కంట్రీ వియాత్నంలలో తన కార్యకలాపాలు కొనసాగించాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇక భారత్లో ఫాక్స్కాన్ నెలకొల్పబోయే తయారీ యూనిట్ కారణంగా లక్ష మంది ఉపాధి కలగనుంది. ప్రస్తుతం ఆ సంస్థ చైనా నగరం జెంగ్జౌ ఫాక్స్కాన్కు చెందిన ఐఫోన్ల తయారీ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లో 2లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా..ప్రత్యేక సందర్భంగాల్లో తయారీని పెంచేందుకు భారీ ఎత్తున ఉద్యోగుల్ని నియమించుకుంటుంది. పునరాలోచనలో యాపిల్ ప్రస్తుతం వైరస్ విజృంభణతో కోవిడ్-19 ఆంక్షలు విధించింది చైనా ప్రభుత్వం. దీంతో జెంగ్ జౌ ఫాక్స్కాన్ ప్లాంట్ తయారీలో ఉద్యోగులు సెలవులో ఉండగా.. చైనాలో ఐఫోన్లను తయారు చేసే విషయంలో యాపిల్ పునఃపరిశీలిస్తుంది. అక్కడి నుంచి బయటకు వచ్చేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.యాపిల్ నిర్ణయానికి కొనసాగింపుగానే ఐఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్కాన్ ఎంత వీలైతే అంత తొందరుగా భారత్లో ప్లాంట్ నెలకొల్పనున్నట్లు సమాచారం. కాగా, ఫాక్సాకాన్ను చైనా నుంచి భారత్కు తరలించే విషయంలో ఇప్పటి వరకు ఆ సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటనలేదు. ఫాక్సాకాన్, యాపిల్ తోపాటు ఇటు కర్ణాటక ప్రభుత్వం సైతం మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ల తయారీపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.