-
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
ప్రముఖ నటుడి భార్య మోసపోయింది. తెలిసి తెలిసి లక్షల రూపాయలు పోగొట్టేసుకుంది. అయితే కొన్ని నెలల ముందు భర్త ఇలానే మోసపోగా.. ఇప్పుడు అతడి భార్యకు ఇలానే జరిగింది. అయితే తెలిసి మరీ ఇలా జరగడం నెటిజన్లు అవాక్కయ్యేలా చేస్తోంది. ఇంతకీ ఎవరా నటుడు? అసలేం జరిగింది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)బాలీవుడ్లో నటుడిగా తనకుంటూ గుర్తింపు తెచ్చుకున్న రాకేశ్ బేడీ.. 1979 నుంచి సినిమాలు, 1984 నుంచి సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఓటీటీల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి పలు వెబ్ సిరీసుల్లోనూ యాక్ట్ చేశాడు. అయితే గతేడాది డిసెంబరులో ఈ నటుడిని ఓ వ్యక్తి మోసం చేశాడు. ఆర్మీ ఉద్యోగి అని తనని తాను పరిచయం చేసుకున్నాడు. రాకేశ్కి చెందిన ఫ్లాట్ కొంటానని నమ్మబలికాడు. మాటల్లో పెట్టి రూ.85 వేలు డబ్బు తన అకౌంట్లోకి వచ్చేలా చేసి మోసం చేశాడు.ఇప్పుడు నటుడు రాకేశ్ బేడీ భార్యకు అలాంటి అనుభవమే ఎదురైంది. పొరపాటున తన బ్యాంక్ ఖాతాలోని రూ.5 లక్షలు.. మీ ఖాతాలో జమ అయ్యాయని ఓ అజ్ఞాత వ్యక్తి ఆరాధనకు చెప్పాడు. మొబైల్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్తే ఆ డబ్బులు తిరిగి తన ఖాతాలో జమ అయిపోతాయని అన్నాడు. ఇదేదో తేడాగా ఉందని గ్రహించిన ఈమె ఫోన్ కట్ చేసేసింది. కానీ ఈమె ఖాతాలో నుంచి డబ్బులు కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో ఈమె సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించింది. అయితే ఇలా నెలల వ్యవధిలో ప్రముఖ నటుడి దంపతులు సైబర్ మోసానికి గురవడం చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్) -
ఐపీఎల్ టికెట్ల పేరిట మోసం!
సాక్షి, హైదరాబాద్: ఇప్పుడంతా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. క్రికెట్ అభిమానులు వారి అభిమాన జట్ల ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు అమిత ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు తక్కువ ధరకే ఐపీఎల్ టికెట్లు అంటూ సరికొత్త మోసానికి తెరతీశారు. నకిలీ వెబ్సైట్లు, యాప్లు సృష్టించి ప్రకటనలు ఇస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇదే తరహాలో సైబర్ నేరగాళ్ల మోసానికి చిక్కిన బెంగళూరుకు చెందిన మహిళ రూ.86 వేలు పోగొట్టుకున్నారు. మార్చి 29న జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ చూసేందుకు సదరు మహిళ ఫేస్బుక్లో ‘ఐపీఎల్ క్రికెట్ టికెట్’ అనే అకౌంట్ ద్వారా టికెట్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించగా సైబర్ నేరగాళ్లు మోసగించారు. సైబర్ నేరగాళ్లు ఐపీఎల్ టికెట్ల విక్రయం పేరిట మోసగించే ప్రమాదం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరించారు. ఆ వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఐపీఎల్ టికెట్లను బుక్ మైషోలో అధికారికంగా విక్రయిస్తున్నారు. అచ్చం బుక్ మై షో మాదిరిగానే సైబర్ నేరగాళ్లు ఫేక్ వెబ్సైట్లను క్రియేట్ చేసి నట్టు పోలీసులు గుర్తించారు. బుక్మై షో తరహాలో దగ్గరగా ఉండే పేర్లతో వీటిని తయారు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదే తరహాలో మోసగిస్తున్న ’book. myshow&premium.net', 'bookmyshow. cloud' అనే వెబ్సైట్లను పోలీసులు మూసివేయించారు. నకిలీ వెబ్సైట్లో ఎర్లీబర్డ్, స్పెషల్ డిస్కౌంట్, పది టికెట్లు కొంటే కొంత డిస్కౌంట్ ఇలా ఆఫర్లను పెడుతూ మోసగిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఫోన్పే, గూగుల్పే వంటి యూపీఐ విధానంలోనే పేమెంట్లు వసూలు చేస్తున్నట్టు తెలిపారు. మరికొన్ని కేసులలో సైబర్ నేరగాళ్లు టికెట్కు అయ్యే మొత్తంలో కొంత డబ్బులు ఆన్లైన్లో చెల్లించి బుక్ చేసుకోండి..తర్వాత స్టేడియం వద్ద మిగిలిన సొమ్ము చెల్లించి టికెట్లు పొందండి అంటూ బురిడీ కొట్టిస్తున్నట్టు తెలిపారు. ఆ వెబ్సైట్లలోనే కొనండి కేవలం అధికారిక వెబ్సైట్లలో మాత్రమే ఐపీఎల్ టికెట్లు కొనాలని, ఫేక్ వెబ్సైట్ల మోసాలకు గురి కా వొద్దని తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరించారు. ఐపీఎల్ సీజన్ ఇంకా నడుస్తున్నందున టికెట్ల కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. టికెట్ కొనుగోలు చేసేందుకు వ్యక్తిగత, బ్యాంకు ఖాతా, ఏటీఎం, క్రెడిట్ కార్డు నంబర్లు, పిన్ నంబర్లు అడిగితే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వవద్దని, అది సైబర్ మోసంగా గుర్తించాలని వారు పేర్కొంటున్నారు. సైబర్ మో సాలపై సైబర్ క్రైం పోలీసులకు 1930 టోల్ఫ్రీ నంబర్లో లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. -
పెద్ద సమస్యగా మారుతున్న USB ఛార్జర్ స్కామ్: నివారణ మార్గాలివే..
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సైబర్ నేరగాళ్లకు ఏ చిన్న అవకాశం దొరికినా చేతివాటం చూపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అనేకరకాలైన సైబర్ స్కామ్లలో USB ఛార్జర్ స్కామ్ కూడా ఒకటి. ఇది నేడు పెద్ద సమస్యగా అవతరిస్తోంది. దీంతో విమానాశ్రయాలు, కేఫ్లు, హోటళ్లు, బస్టాండ్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో ఫోన్ ఛార్జింగ్ పోర్టల్లను ఉపయోగించవద్దని కేంద్రం పౌరులను హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడానికి విమానాశ్రయాలు, కేఫ్లు, హోటళ్లు మరియు బస్టాండ్ల వంటి బహిరంగ ప్రదేశాల్లో USB ఛార్జింగ్ పోర్ట్లను ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. USB స్టేషన్లలో పరికరాలను ఛార్జింగ్ చేయడం వలన వినియోగదారులు జ్యూస్-జాకింగ్ సైబర్ దాడులకు గురవుతారు. పబ్లిక్ ప్రదేశాల్లోని USB స్టేషన్లలో పరికరాలను ఛార్జింగ్ చేసినప్పుడు సైబర్ నేరగాళ్లు అందులోని డేటాను దొంగలించవచ్చు. లేదా డివైజ్లలో మాల్వేర్ని ఇన్స్టాల్ చేయడం వంటివి చేస్తారు. ఇలా ఒకసారి చేసిన తరువాత వ్యక్తిగత సమాచారం దొంగలించి బ్లాక్ మెయిల్ చేయడం వంటి వాటికి పాల్పడతారు. దీని ద్వారా వినియోగదారులు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సైబర్ దాడుల నుంచి తప్పించుకోవడం ఎలా? పబ్లిక్ ప్రదేశాల్లో ఇన్స్టాల్ చేసిన USB ఛార్జింగ్ పోర్ట్లను ఎలాంటి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. వ్యక్తిగత కేబుల్లు లేదా పవర్ బ్యాంక్లను మీ వద్ద ఉంచుకోవాలి తెలియని డివైజ్లతో ఏమాత్రం ఛార్జ్ చేసుకోకూడదు, డివైజ్లను ఎప్పుడూ లాక్ చేసి ఉంచాలి. మొబైల్ ఫోన్ ఆఫ్ చేసి ఉన్నప్పుడే ఛార్జ్ చేసుకోవడం ఉత్తమం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సైబర్ మోసాలకు గురైతే.. సైబర్ క్రైమ్ అధికారిక వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలి. లేదా 1930కి కాల్ చేయాలి. Safety tip of the day: Beware of USB charger scam.#indiancert #cyberswachhtakendra #staysafeonline #cybersecurity #besafe #staysafe #mygov #Meity #onlinefraud #cybercrime #scam #cyberalert #CSK #cybersecurityawareness pic.twitter.com/FBIgqGiEnU — CERT-In (@IndianCERT) March 27, 2024 -
ప్రేమికులూ జరభద్రం!
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ప్రేమికులపై ఫోకస్ పెట్టారు. వాలెంటైన్స్ డే దగ్గర పడుతుండడంతో డిస్కౌంట్లు, ఆఫర్లు, సర్ఫ్రైజ్ గిఫ్ట్ లు, గిఫ్ట్ కూపన్లు అంటూ సరికొత్త మోసాలకు తెరతీస్తున్నారు. ఏటా ఈ తరహా మోసాలు షరామామూలే అయినా.. ఎప్పటికప్పుడు సైబర్ నేరగాళ్ల బారిన పడే బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉందని సైబర్ భద్రత నిపుణులు పేర్కొంటున్నారు. సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో మోసాలకు తెరతీ స్తున్నారు. మీకు అత్యంత సన్నిహితులు వాలెంటైన్స్ డే సందర్భంగా మీకు సర్ఫ్రైజ్ గిఫ్ట్ పంపారు.. దాన్ని పొందాలంటే మేం చెప్పిన ఖాతాకు కస్టమ్స్ చార్జి కోసం కొంత మొత్తం పంపండి అంటూ వల వేస్తున్నారని పోలీసులు పేర్కొంటున్నారు. ప్రధానంగా చేస్తున్న మోసాలు చూస్తే.. షాపింగ్ ఫ్రాడ్స్..: ఆన్లైన్ షాపింగ్, బెస్ట్ ఆఫర్స్, గిఫ్ట్లు, డిన్నర్లు అంటూ సోషల్మీడియా ఖాతాల్లో మోసపూరిత యాడ్స్ ఇస్తు న్నారు. ఈ ఆఫర్ల కోసం సంప్రదించే వారి నుంచి వ్యక్తిగత, బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుని మోసం చేస్తున్నారు. ఫిషింగ్ ఈమెయిల్స్.. సైబర్ నేరగాళ్లు వాలెంటైన్స్ డేకు సంబంధించి ప్రత్యేక కొటేషన్లు, మెసేజ్లు, ఎమోజీలు, గ్రాఫిక్ వీడియోలు అంటూ ఫిషింగ్ లింక్లను ఈమెయిల్స్కు పంపుతున్నారు. వీటిపై క్లిక్ చేసిన వెంటనే మన మొబైల్, ల్యాప్టాప్లోకి మాల్వేర్ వచ్చేలా చేస్తూ మోసాలకు తెరతీస్తున్నారు. ఈ విషయాలు మరవొద్దు..: ► ఆన్లైన్లో వాలెంటైన్స్ డే గిప్ట్లు కొనాలంటే నమ్మదగిన ఈ కామర్స్ వెబ్సైట్లనే ఉపయోగించాలి. కొత్త యాప్స్ వినియోగించాల్సి వస్తే వాటి రేటింగ్ తప్పక చూసుకోవాలి. వాలెంటైన్స్ డే ప్యాకేజీలు, గిఫ్ట్ల పేరిట నమ్మశక్యం కాని ఆఫర్లు ఉంటే అది సైబర్ మోసగాళ్ల అనుమానాస్పద ప్రకటనగా గుర్తించాలి. ►అనుమానాస్పద మెసేజ్లు,ఈ మెయిల్స్లోని లింక్లపై క్లిక్ చేయవద్దు. మీ వ్యక్తిగత, బ్యాంకు ఖాతా నంబర్లు, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు, పిన్ నంబర్లు, సీవీవీ నంబర్లు ఎవరితోనూ పంచుకోవద్దు. -
దేశం మొత్తం ఇవే స్కాములు, ‘పిగ్ బుచరింగ్’పై నితిన్ కామత్!
ప్రముఖ ఆన్లైన్ ట్రేడింగ్ సంస్థ జిరోదా వ్యవస్థాపకుడు, సీఈఓ నితిన్ కామత్ సోషల్ మీడియా యూజర్లకు హెచ్చరికలు జారీ చేశారు.‘పిగ్ బుచరింగ్’ స్కామ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ పిగ్ బుచరింగ్ స్కామ్లు వందల నుంచి కోట్లలో జరుగుతున్నాయని ఎక్స్ (ట్వీట్టర్)లో పోస్ట్ చేశారు. పిగ్ బుచరింగ్ అంటే? పిగ్ బుచరింగ్ అనేది ఓ సైబర్ స్కామ్. ఆన్లైన్లో ఫేక్ మెసేజ్లు, యూజర్లను నమ్మించేలా ఫేక్ పేమెంట్లతో బురిడి కొట్టించి సొమ్ము చేసుకునే లాంటింది. ఈ కుంబకోణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కామత్ పలు జాగ్రత్తలు చెప్పారు. పిగ్ బుచర్స్ ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లను క్రియేట్ చేసుకుంటారు. ఆన్లైన్లో యాక్టీవ్గా ఉండే యూజర్ల నమ్మకాన్ని గెలుచుకునేలా ఆ ఫేక్ ప్రొఫైల్తో ప్రేమ, ఫ్రెండ్షిప్ పేరుతో దగ్గరవుతారు. ఒక్కసారి యూజర్లు పిగ్ బుచర్స్ను నమ్మితే చాలు. ఇక వాళ్ల పని మొదలు పెడతారు.ఫేక్ జాబ్స్, అధికమొత్తంలో డబ్బులు సంపాదించుకునే అవకాశాల్ని కల్పిస్తున్నామంటూ ఆశచూపిస్తారు. ఆపై యూజర్ల అకౌంట్లలో ఉన్న మొత్తాన్ని దోచుకుంటారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని కామత్ చెప్పారు. ఇలాంటి వాటిని ఎవరూ ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని సలహా ఇచ్చారు. ఈ స్కాములు ఏ స్థాయిలో ఉంటాయంటే? ఈ తరహా సైబర్ స్కాములు ఏ స్థాయిలో ఉంటాయంటే.. సైబర్ నేరస్తుల చేతుల్లో మోసపోతున్నామని తెలియకుండా.. మరో స్కామ్లో ఇరుక్కుపోతారని కామత్ తన పోస్ట్లో చెప్పారు. ఎక్కువ మంది బాధితులు అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాల ఉన్నాయంటూ ఫేక్ కంపెనీల నుంచి వచ్చే కాల్స్ను నమ్మి మోసపోతున్నారని తెలిపారు. అంతేకాదు యూజర్లను నమ్మించేలా జెండర్ మార్చి మారుపేర్లతో సోషల్ మీడియా అకౌంట్లను ఉపయోగిస్తారని జిరోధా సీఈఓ చెప్పారు. మయన్మార్ కేంద్రంగా ఏర్పాటు చేసిన ఓ ఫేక్ కంపెనీ చేసిన పిగ్ బుచర్స్ స్కామ్లో 16 మంది భారతీయులు మోసపోయినట్లు వెలుగులోకి వచ్చిన కథనాల్ని సైతం షేర్ చేశారు. పిగ్ బుచర్స్తో అప్రమత్తం ►వాట్సప్, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు, డేటింగ్ యాప్లలో అనుమానాస్పద మెసేజ్లకు రిప్లయి ఇవ్వకూడదు ►ఎవరైనా మిమ్మల్ని కొత్త యాప్లను డౌన్లోడ్ చేయమని లేదా లింక్లను క్లిక్ చేయమని అడిగితే వెంటనే వాటిని డిలీట్ చేయండి, లేదంటే నెంబర్ను బ్లాక్ చేయండి. ► స్కామర్లు యూజర్ల ఆశలు, భయాలు, కలలు, దురాశ వంటి భావోద్వేగాలతో ఆడుకుంటారు. ఎప్పుడూ తొందరపడి స్పందించొద్దు ► భయపడవద్దు. తొందర పడి తీసుకునే నిర్ణయాలతో ఇబ్బందులకు గురవుతుంటారు. ►అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, లాయర్లను సంప్రదించండి. ►ఎవరైనా ఉద్యోగం లేదా అధిక మొత్తంలో డబ్బులు సంపాదించుకునే అవకాశాలున్నాయని, ఇందుకోసం డబ్బులు కట్టాలని అడిగితే అది మోసంగా భావించాలి. ►ఆధార్, పాస్పోర్ట్ వంటి వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, పెట్టుబడి వివరాలు ఇతర ఆర్ధిక పరమైన విషయాల్ని ఎవరితో పంచుకోవద్దని జిరోధా సీఈవో నిఖిల్ కామ్ యూజర్లను కోరారు. -
లైక్ కొడితే రూ.50...కామెంట్ పెడితే రూ.100
కూర్చున్నచోటే రోజుకు రూ.వేల సంపాదన మీ సొంతం.. మీరు చేయాల్సిందల్లా మేం పంపే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను ఓపెన్ చేసి వాటిలోని వీడియోలు, ఫొటోలకు లైక్ కొట్టడమే.. అలా లైక్ కొట్టిన స్క్రీన్షాట్ మాకు పంపితే ఒక్కో అకౌంట్ స్క్రీన్షాట్కు రూ.100 చొప్పున మీ ఖాతాలో జమ చేస్తాం... మేం చెప్పిన యూట్యూబ్ వీడియోకు లైక్ కొడితే రూ.50... మేం చెప్పిన సినిమా రివ్యూకు ఐదు పాయింట్లు ఇస్తే.. మీ ఖాతాల్లో రూ.150 వేస్తాం.... ఏంటి ఇదంతా నిజం అనుకుంటున్నారా..? ఇదో సరికొత్త సైబర్ మోసం.. టెలిగ్రామ్ వేదికగా జరుగుతున్న ఈ తరహా మోసాలు ఇప్పుడు పెరిగాయని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. టాస్క్బేస్డ్ స్కాం అంటే.. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుకుతూనే ఉన్నారు. టెలిగ్రామ్ యూజర్లను టార్గెట్ చేసుకుని టాస్క్బేస్డ్ స్కాంలు చేస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. టెలిగ్రామ్ యూజర్లకు సైబర్ నేరగాళ్లు కొన్ని మెసేజ్లు పంపుతూ అందులో పేర్కొన్న టాస్క్పూర్తి చేస్తే డబ్బులు మీ ఖాతాలో వేస్తామని చెప్పే మోసాన్నే టాస్క్బేస్డ్ స్కాంగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టాస్క్బేస్డ్ మోసాలు చూస్తే... ఈ ఖాతాలు ఫాలోకండి.. టెలిగ్రామ్ యూజర్లకు పంపే మెసేజ్లలో మేం పంపే లింక్ ఓపెన్ చేసి ఈ ఇన్స్టాగ్రామ్ ఖాతా లను ఫాలో అవుతూ, వాటిని ఓపెన్ చేసి స్క్రీన్షాట్ తీసి పంపితే డబ్బులు పంపుతామంటారు. రోజుకు 30 నుంచి 50 ఖాతాలు ఫాలో కావాలని చెబుతారు. యూ ట్యూబ్ వీడియోలకు లైక్లు..: సైబర్ మోసగాళ్లు పంపే మెసేజ్లలో కొన్ని యూట్యూబ్ వీడియోల లింక్లు పెడతారు. వాటిని ఓపెన్ చేసి ఆ వీడియోకు కాసేపు వాచ్ చేయడంతోపాటు లైక్ కొడితే మీ ఖాతాలో డబ్బులు వేస్తామని నమ్మబలుకుతారు. హోటళ్లు, రెస్టారెంట్లకు రేటింగ్ పేరిట..: ఫలానా హోటల్, లేదంటే ఒక ఏరియాలోని రెస్టారెంట్లో సదుపాయాలు చాలా బాగున్నాయని, ఫుడ్ ఐటమ్స్ బాగున్నాయని, ఆఫర్లు బాగున్నాయని..ఇలాంటి రివ్యూలు, రేటింగ్ ఇచ్చినందుకు డబ్బులు ఇస్తామని చెబుతుంటారు. సినిమా రివ్యూలకు రేటింగ్.. మేం పంపే లింక్ ఓపెన్ చేసి అందులోని వెబ్సైట్లో ఉన్న సినిమా రివ్యూలకు రేటింగ్ ఇవ్వాలని టాస్క్ ఇస్తారు..ఇలా ఒక్కో రివ్యూకు రేటింగ్ ఇస్తే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తామని టాస్క్ ఇస్తారు. మోసానికి తెరతీస్తారు ఇలా.. ముందుగా ఇచ్చిన టాస్క్పూర్తి చేసిన తర్వాత, మీ బ్యాంకు ఖాతాలోకి డబ్బులు జమ చేస్తామంటూ పేరు, వయస్సు, వృత్తి, వాట్సాప్ నంబర్, ఏ ప్రాంతంలో ఉంటారు..విద్యార్హతలు, బ్యాంకు ఖాతా నంబర్, బ్యాంకు పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఇలా పూర్తి వివరాలు సేకరిస్తారు. మొదట ఒకటి రెండు సార్లు మన బ్యాంకు ఖాతాలోకి చిన్నచిన్న మొత్తాలు జమ చేసి నమ్మకాన్ని పెంచుతారు. ఆ తర్వాత మన బ్యాంకు ఖాతాలోంచి ఆన్లైన్లో డబ్బులు కొల్లగొట్టే మోసానికి తెరతీస్తారు. మన పూర్తి వివరాలతోపాటు, మన ఫోన్, కంప్యూటర్ను వారి అ«దీనంలోకి తీసుకుని ఓటీపీలను సైతం తెలుసుకుని, మన బ్యాంకు ఖాతాలు లూటీ చేస్తారని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఇలాంటి మెసేజ్లు చూస్తే అనుమానించాల్సిందే.. ఆన్లైన్లో సైబర్ మోసాలు పెరుగుతున్నందున వీలైనంత వరకు అనుమానాస్పద మెసేజ్లలోని లింక్లపై ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు. అడ్డగోలు లాభాలు ఇస్తామని ఊదరగొడుతున్నారంటే అది కచ్చితంగా సైబర్ మోసమని గ్రహించాలి. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు అడుగుతున్నట్టు గమనిస్తే జాగ్రత్తపడాలి. అపరిచిత వ్యక్తులు ఆన్లైన్లో మనకు పంపే మెసేజ్లను నమ్మవద్దు. -
మంగళగిరిలో ‘ఐపీజీ’ బాధితులు 700 మందికిపైనే!
మంగళగిరి: సైబర్ మోసగాళ్ల ఐపీజీ రెంట్ యాప్ ఉచ్చులో మంగళగిరికి చెందిన 700 మందికిపైగా చిక్కి విలవిల్లాడుతున్నారు. పెట్టుబడికి వారం రోజుల్లో రెట్టింపు ఆదాయం వస్తుందని ఆశ చూపడంతో వీరు కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోయారు. వీరు సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయడంతోపాటు రెండురోజుల కిందట పట్టణ పోలీసులను ఆశ్రయించారు. ప్రారంభంలో ఒకరిద్దరుగా ఉన్నప్పుడు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు డబ్బులు తిరిగి ఇచ్చిన యాప్ నిర్వాహకులు తరువాత క్రమంగా చెల్లింపులు నిలిపేశారు. నిదానంగా ముఖం చాటేసిన నిర్వాహకులు ఫోన్ లిఫ్ట్ చేయకపోగా యాప్లోను సమాధానం చెప్పకపోవడం, ఐపీజీ రెంట్ కామ్ యాప్ను సైతం మూసేయడంతో పెట్టుబడిదారులు మోసపోయామని గ్రహించారు. తొలుత కిషోర్కు అతడి స్నేహతుడు ఐపీజీ యాప్ లింక్ పంపారు. తన స్నేహితులు చాలామంది ఆ యాప్లో పెట్టుబడి పెట్టారని, మంచి ఆదాయం వస్తుందని అతడు చెప్పడంతో కిషోర్ ఆ యాప్లో నమోదు చేసుకున్నారు. మొదట రూ.800 పెట్టుబడి పెట్టగా వారానికి రూ.1,600 ఆదాయం వచ్చింది. రెండుమూడుసార్లు పెట్టుబడికి రెట్టింపు ఆదాయం రావడంతో కిషోర్ తన స్నేహితులకు యాప్ లింక్ పంపి రెట్టింపు ఆదాయం గురించి చెప్పారు. కిషోర్ స్నేహితులు, బంధువులతోపాటు చైన్లింక్గా మారి ఒక్క మంగళగిరిలోనే 700 మందికిపైగా ఈ యాప్లో నమోదు చేసుకున్నారు. రూ.800, రూ.1,200 నుంచి రూ.లక్ష, రూ.2 లక్షలు, రూ.5 లక్షలు.. ఇలా శక్తిమేర పెట్టుబడులు పెట్టారు. మార్చి నెలాఖరు కావడంతో యాప్ ఆఫర్ ప్రకటించిందని చెప్పి రూ.30 వేలు పెట్టుబడి పెట్టినవారికి అదనంగా ఆదాయంతోపాటు వారం రోజులకు వడ్డీ రూ.27 వేలు కలిపి రూ.80 వేలు వస్తాయని ఆశచూపారు. దీంతో పలువురు ఎక్కువ సొమ్ము యాప్లో పెట్టుబడి పెట్టారు. బాధితుల్లో అత్యధికంగా మహిళలున్నారు. వారం రోజుల తర్వాత మోసగాళ్లు యాప్ను మూసేయడంతో కిషోర్ ఆన్లైన్లో సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేశారు. మరికొందరు బాధితులతో కలిసి ఈ నెల 7వ తేదీన పట్టణ పోలీసులను ఆశ్రయించారు. బాధితులు తమకు ఫిర్యాదు చేసినట్లు పట్టణ సీఐ బి.అంకమ్మరావు చెప్పారు. సైబర్ క్రైమ్ కావడంతో దర్యాప్తు చేయాల్సిందిగా సైబర్ క్రైమ్కు అప్పగించామని తెలిపారు. -
కొలువని చెప్పి.. స్కాం కేఫ్లో ఖైదు చేసి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఆరుగురు యువకులు ఉపాధి పేరుతో వెళ్లి కంబోడియా సైబర్ స్కాం గ్యాంగ్ చేతిలో చిక్కుకున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామన్న దళారుల మాటలు నమ్మి వెళ్లి.. క్రిప్టోకరెన్సీ, క్రెడిట్కార్డ్, హనీట్రాప్ పనులు చేయిస్తుండటంతో ఆందోళనలో పడ్డారు. ఆ పనులు చేయలేక, చేయబోమంటే వారు పెడుతున్న చిత్ర హింసలు భరించలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అసలు ఏం జరిగింది? కరీంనగర్లోని గాంధీరోడ్ చౌరస్తా సమీపంలో ఓ కన్సల్టెన్సీ ఉంది. కంబోడియాలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయని, మంచి జీతం వస్తుందని కన్సల్టెన్సీ నిర్వాహకుడు స్థానిక ముస్లిం యువకులకు చెప్పాడు. దీనితో కొందరు యువకులు రూ.2 లక్షల చొప్పున అతడికి చెల్లించారు. కన్సల్టెన్సీ నిర్వాహకుడు ఈ ఏడాది ఆగస్టు చివర్లో, సెప్టెంబరు మొదటివారంలో ఆరుగురు యువకులను కంబోడియాకు పంపాడు. అక్కడికెళ్లాక ఓ కంపెనీ వాళ్లు ఆ యువకులను చుట్టూ ఎత్తయిన గోడలు, విద్యుత్ కంచె లు, సాయుధ పహారాతో ఉన్న ఓ టౌన్షిప్కు తీసుకెళ్లారు. అమెరికా, యూరప్ వాసుల నంబర్లు ఇచ్చి.. వారిని వాట్సా ప్ ద్వారా సంప్రదించి క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెడితే బాగా డబ్బులు వస్తాయంటూ ఒప్పించాలని చెప్పారు. ఆ పని చేయలేమంటే.. పాస్పోర్టులు ఇవ్వబోమని, జైల్లో పెట్టిస్తామని బెదిరిస్తున్నారని యువకులు వాపోతున్నారు. నేరాలు ఇలా చేయిస్తూ.. కరీంనగర్కు చెందిన బాధిత యువకుడు షాబాజ్ఖాన్ చెప్పిన వివరాల మేరకు.. ఈ యువకులు అమెరికా, యూరోపియన్ కస్టమర్లను వాట్సాప్లో, ఫోన్లలో సంప్రదించాలి. సాఫ్ట్వేర్ సాయంతో మహిళల్లా గొంతు మార్చి మాట కలపాలి. బాగా డబ్బులు వస్తాయని మెల్లగా వారిని ఒప్పించి ఓ క్రిప్టోకరెన్సీ యాప్లో కనీసం 100 డాలర్లు పెట్టుబడి పెట్టించాలి. రెండు, మూడు రోజుల్లో.. లాభం వచ్చి ఆ సొమ్ము 1000 డాలర్లకు పెరిగినట్టు చూపిస్తుంది. ఇది చెప్పి.. వారిని మరింత ఆశపెట్టి భారీగా డబ్బు పెట్టుబడి పెట్టించాలి. తర్వాత ఫోన్ స్విచాఫ్. ఆ సొమ్మంతా ఈ సైబర్ నేర గ్యాంగ్ కాజేస్తుంది. తర్వాత మరొకరికి గాలం వేయాలి. తమకు రోజూ ఇదే పని అని షాబాజ్ఖాన్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విలపిస్తూ చెప్పాడు. తనను వదిలేయాలంటే 3,000 డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.2.4 లక్షలు) చెల్లించాలని, లేదా తనకు బదులు మరో యువకుడిని అక్కడికి పిలిపించాలని ముఠా సభ్యులు తేల్చిచెబుతున్నారని వివరించాడు. తనతోపాటు సిరిసిల్ల, చింతకుంట, వేములవాడ, మానకొండూరుకు చెందిన యువకులు కూడా బందీగా ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం తమను కాపాడాలని వేడుకున్నాడు. అయితే వారిని ఫోన్లో సంప్రదించేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. అక్కడి ప్రజాప్రతినిధుల అండదండలతోనే.. కాంబోడియాలో సైబర్ మాఫియా ముఠాలు విచ్చలవిడిగా వ్యవహరిస్తాయని.. మాఫియా నిర్వాహకుల్లో కొందరు అక్కడ ప్రజాప్రతినిధులు కూడా అని ప్రచారం ఉంది. ఆ ముఠాలు క్యాసినోలు, సైబర్ స్కాం కేఫ్లు నిర్వహిస్తూ డబ్బులు దండుకుంటుంటాయి. స్థానికులు తిరగబడే అవకాశం ఉంటుందని.. మలేసియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, భారత్ తదితర దేశాల నుంచి యువతీ యువకులను ఉద్యోగాల పేరిట వల వేసి రప్పించుకుంటాయి. సైబర్ నేరాల్లో శిక్షణ ఇచ్చి పని చేయించుకుంటాయి. ఇచ్చిన టార్గెట్ చేరకపోతే కొట్టడం, కరెంటు షాక్లు ఇవ్వడం వంటివి చేస్తుంటాయి. చిత్ర హింసలు భరించలేని విదేశీయులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. ఇలాంటి ఘటనలు, అక్కడి అకృత్యాలపై ఇంటర్నెట్లోనూ వార్తలు ఉన్నాయి. బాధితులు ముందుకురావాలి కంబోడియాలో చిక్కుకున్న యువకుల గురించి మాకు ఎలాంటి సమాచారం రాలేదు. వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఫిర్యాదు చేస్తే న్యాయం చేకూర్చేందుకు ప్రయత్నిస్తాం. – సత్యనారాయణ, కరీంనగర్ పోలీస్ కమిషనర్ -
ఆన్లైన్ ట్రేడింగ్: మోసాల నుంచి తప్పించుకోండి ఇలా..
సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను స్క్రోల్ చేస్తున్నప్పుడు అనేక ప్రకటనలు పాప్ అప్ అవుతూ ఉంటాయి. కానీ, అవి ఎలాంటి రిజిస్టర్ కాని వాణిజ్య పోర్టల్స్. ఎవరైనా నమ్మి వీటిలో మెంబర్స్గా చేరితే, అధిక మొత్తంలో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. గృహిణులను లక్ష్యం చేసుకునే ఈ మోసాలు జరుగుతుంటాయి. ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడులు కోసం చూస్తున్న వ్యక్తులను మోసం చేయడానికి స్కామర్లు కొత్తమార్గాలను ఎంచుకుంటుంటారు. ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తప్పక తెలిసుండాలి. అప్పుడే మోసాల బారిన పడకుండా ఉండగలం. ఇంటర్నెట్ ఆధారిత సమాచారం రోజు రోజుకూ పెరుగుతున్న ఈ కాలంలో ఎక్కువ మంది వ్యక్తులు తమ పెట్టుబడి నిర్ణయాలను తీసుకోవడానికి ఆన్లైన్, సోషల్ మీడియాపై అధికంగా ఆధారపడుతున్నారు. ఎందుకంటే ప్రతిదీ ఫింగర్ టిప్స్ మీద లభిస్తుండటమే కారణం. అందుకే, స్కామర్లు కూడా ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడుల కోసం చూస్తున్న వ్యక్తులను మోసం చేయడానికి వేగవంతంగా కొత్త మార్గాలను అమలు చేస్తుంటారు. ► ఫ్యాన్సీ ప్రకటనలు చాలావరకు ఆన్లైన్ ప్రకటనలన్నీ ఆకర్షణీయంగా ఉంటాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ల ద్వారా సమాచారం కోసం స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు అనేక ప్రకటనలు కనిపిస్తూ ఉంటాయి. అవి అలా కుప్పలు తెప్పలుగా ఆన్లైన్లోకి రావడం కూడా బ్రోకరేజీ రహితంగా ఉండటం, సులభమైన వాణిజ్య పోర్టల్, తక్షణ పరిష్కారాలు ఉండటం వల్లనే. వీటిలో చాలా ఏజెన్సీలు రిజిస్టర్ చేసి ఉండవు. కానీ ప్రముఖ అధికారిక కార్పొరేట్ ట్రేడింగ్ కంపెనీల కంటే మరింత శక్తిమంతమైన ఫ్యాన్సీ ప్రకటనలను ఉంచుతుంటారు. స్కామర్లు ఆకర్షణీయంగా ఉన్న ప్రకటనలను ఎర వేసి ఈ బోగస్ యాప్లు, వెబ్సైట్లలో తమ వివరాలతో రిజిస్టర్ చేసుకున్న వారికి మొదట్లో కొంత మొత్తంలో డబ్బులు జమ చేస్తుంటారు. ఈ విధానం ద్వారా డబ్బు సంపాదించినట్లు చెప్పుకునే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వీరు అనుసరిస్తారు. పాయింట్లకు బదులుగా వారు యాప్ వాలెట్లో డబ్బును డిపాజిట్ చేయమని అడుగుతారు, అది తర్వాత ట్రేడింగ్ కోసం ఉపయోగిస్తారు. మోసగాళ్లు ఉపయోగించే కొన్ని పథకాలు ► పోంజీ పథకం ఇది కొత్త పెట్టుబడిదారుల నుండి సేకరించిన డబ్బుతో చేసే మోసం. ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులకు కొంత మొత్తం చెల్లిస్తూ వారి ద్వారా మరిన్ని పెట్టుబడులను రాబట్టడం. ► పంప్, డంప్ స్కీమ్ ఇది ఒక పెట్టుబడి మోసం. ఇక్కడ సలహాదారులు పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించేలా సమాచారాన్ని అందించి, షేర్ల ధరను బంప్ చేయడానికి (పెంచడానికి) ప్రయత్నిస్తారు. అప్పుడు ఈ పెట్టుబడిదారులు సలహాదారులను నమ్మి తమ షేర్లను (అవి మంచి విలువ కలిగినప్పుడు) అమ్మేస్తారు. ► యాప్ ఆధారిత స్కీమ్లు పెట్టుబడిదారులకు మోసగాళ్లు తరచు వాలెట్ బ్యాలెన్స్ల నకిలీ చిత్రాలను చూపుతూ ఫిషింగ్ ఇ–మెయిల్స్ను పంపుతారు. సాధారణంగా క్రిప్టో కరెన్సీలు స్టాక్లు లేదా ఈ కామర్స్ ఉత్పత్తులు.. వీటిలో భాగంగా ఉంటాయి. ► తప్పుదారి పట్టించడానికి.. పెట్టుబడి పోకడలు, పరిశోధన స్టాక్లపై సమాచారాన్ని సేకరించడానికి, ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా వేగవంతంగా ఆదాయ అవకాశాలను చర్చించడానికి పెట్టుబడిదారులు ఫేస్బుక్, ట్విటర్, టీమ్ వ్యూవర్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్.. వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను ఉపయోగిస్తారు. స్కామర్లు నకిలీ సిఫారసులు చేస్తారు. అయాచిత పెట్టుబడి చిట్కాలు ఇస్తారు. వీటిలో నకిలీ గుర్తింపు లేదా తప్పుదారి పట్టించే సమాచారం ద్వారా పెట్టుబడిదారులను ఒప్పించే కొన్ని పద్ధతులు ఉంటాయి. ► పెట్టుబడిని ఎరగా వేస్తారు చాలా మంది పెట్టుబడిదారులు మొదట్లో సంస్థ నుండి కొంత రాబడిని పొందుతారు. దీంతో ఇన్వెస్టర్ల ట్రేడింగ్ విజయవంతమైందని స్కామర్లు అనుకుంటారు. స్కామర్లు ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి శిష్యుడిని లేదా స్నేహితుడిని పరిచయం చేయడానికి మరింత ప్రోత్సహిస్తారు. డబ్బులు వస్తాయి కదా అని తమకు తెలిసినవారికి సదరు యాప్ లేదా వెబ్సైట్ వివరాలు ఇచ్చి వారిని కూడా చేరమని అంటారు. అయితే, చివరికి రిటర్న్లు ఆగిపోతాయి, కస్టమర్ ఖాతా సస్పెండ్ చేయబడుతుంది. డబ్బు వాలెట్లో ఇరుక్కుపోయి ఉంటుంది. సంస్థతో తదుపరి ఎలాంటి పరిచయం ఉండకపోవడంతో తాము పెట్టిన పెట్టుబడిని ఎలా పొందాలో తెలియక చాలా ఇబ్బంది పడతారు. ► అవకాశాల కోసం 7 రకాల వలలు దశ 1: ముందుగా బాధితులను వాట్సాప్ / టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరమని అభ్యర్థిస్తారు. దశ 2: లింక్ల ద్వారా యాప్లను డౌన్లోడ్ చేయమని అడుగుతారు. ఈ కొత్త సభ్యులందరికీ మొదట్లో జాయినింగ్ బోనస్ లభిస్తుంది. అయితే అది వారి వాలెట్లో మాత్రమే కనిపిస్తుంది. దశ 3: ట్రేడింగ్ జరుగుతుంది (బాధితులు విధులు నిర్వర్తించమని అడుగుతారు), అంటే, షేర్ల అమ్మకం/కొనుగోలు, లేదా కొన్నిసార్లు బాధితులు ఇ–కామర్స్ ఉత్పత్తులను కొనుగోలు చేయమని లేదా విక్రయించమని అడుగుతారు. దశ 4: బాధితులను సిస్టమ్కి కొత్త వ్యక్తులను పరిచయం చేయమని అడుగుతారు. ఇది నిజమని, తమకూ కొంత పెట్టుబడి చేరుతుందన్న ఆశతో మంచి పార్టీలను పరిచయం చేస్తారు. అలా పరిచయం చేసిన వ్యక్తి ద్వారా స్కామర్లు వారి వాలెట్కి డబ్బు చేరేలా చేస్తారు. దశ 5: చేసిన పనుల ఆధారంగా వాలెట్ డబ్బును కూడగట్టుకుంటుంది. దశ 6: బాధితుడు వారి వాలెట్ల నుండి తమ ఆదాయాన్ని ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించినప్పుడు వీలుపడదు. ఒక్కోసారి వీలున్నా ఆదాయపు పన్ను, ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ రుసుము మొదలైనవి చెల్లించాల్సి ఉంటుంది. దశ 7: కోరిన ఫీజు చెల్లించిన తర్వాత, యాప్లు పని చేయవు. అవి ఏదో ఒక సాంకేతిక లోపాన్ని చూపుతాయి. కస్టమర్ సేవను చేరుకోవడానికి చేసే ప్రయత్నాలూ ఫలించవు. మోసానికి మార్గాలు ► స్కామర్లు తాము విజయవంతమైన వ్యాపారులుగా, గ్యారెంటీ రిటర్న్ ఇస్తున్నట్టుగా, ట్రేడింగ్ సలహాలను అందిస్తున్నట్లు క్లెయిమ్ చేసుకుంటారు ∙ఇందుకోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చేసిన ఫోనీ టెస్టిమోనియల్ యూట్యూబ్ వీడియోలను ఉపయోగిస్తారు ∙‘పంప్ అండ్ డంప్‘ కార్యకలాపాలను నిరోధించడానికి ట్విట్టర్, ఫేస్బుక్ వంటి ప్లాట్ఫారమ్ల ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తారు ∙నకిలీ సమాచారంతో ఆన్లైన్ పెట్టుబడి చిట్కాలు, నకిలీ ఎండార్స్మెంట్లను పంపుతుంటారు ∙స్టాక్ సిఫార్సులు లేదా పెట్టుబడి సలహాలకు బదులుగా సబ్స్క్రిప్షన్ రుసుమును సేకరించేందుకు ఉద్దేశించిన స్టాక్ పోర్ట్ ఫోలియో స్క్రీన్షాట్లను ప్రదర్శిస్తుంది ∙పెట్టుబడిదారులను టెక్నికల్ అనలిస్ట్లు లేదా ట్రేడింగ్ నిపుణులను చేస్తానని నమ్మబలికి స్కామర్లు వర్క్షాప్ల కోసం రిజిస్ట్రేషన్ ఫీజులను తీసుకుంటారు కానీ వారికి హోస్ట్ చేయరు. పెట్టుబడులకు డేంజర్ సిగ్నల్స్ బాధితుల ఆశను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన విభిన్న పద్ధతులతో మోసగాళ్లు వారి లక్ష్యాన్ని ఛేదిస్తారు. అలా కాకుండా మనల్ని మనం కాపాడుకోవా లంటే.. ► అసాధారణంగా అధిక హామీతో కూడిన రాబడిని వాగ్దానం చేస్తారు, గమనించాలి. ► అధిక ప్రారంభ పెట్టుబడిని అభ్యర్థిస్తారు. ► సంక్లిష్టమైన, నిలకడలేని వ్యాపార నమూనా ఉంటుంది. ► నష్టాలను తిరిగి చెల్లిస్తామని వాగ్దానం చేస్తారు. ► వెంటనే డబ్బు పెట్టుబడిగా పెట్టమని ఒత్తిడి చేయచ్చు. ► యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్లలో లిస్ట్లో లేని యాప్లలో పెట్టుబడి పెట్టమని కోరతారు. ► అధిక రాబడిని పొందినట్లు పేర్కొంటూ సోషల్మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మద్దతును కోరుతారు. ► స్కామర్ల కార్యాలయాలు మన దేశం లోపల ఉన్నాయా, వెబ్సైట్, యాప్లలో ఉండే చిరునామాలను చూపుతున్నాయా అనేది చెక్ చేసుకోవాలి. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
SHE Teams: ఏడేళ్లుగా ‘ఆమె’కు నిరంతరం రక్షణగా..
సంతోషకరమైన జీవనం వైపుగా అడుగులు వేయడానికి భద్రమైన మార్గంలో పయనించడానికి సమాజం మనందరికీ చేదోడు వాదోడుగా నిలుస్తుంది. కానీ, ఈ సమాజంలో మహిళ రక్షణ ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉంటోంది. దీనికి సమాధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైంది ‘షీ టీమ్’. ఉమెన్ సేఫ్టీ వింగ్ కార్యక్రమాల్లో భాగంగా స్త్రీల రక్షణ కోసం 24 గంటలూ పనిచేస్తూ మహిళా నేస్తంగా మారిన ‘షీ టీమ్’ సేవలకు ఏడేళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో మహిళల భద్రత ఏవిధంగా ఉంది? పెరుగుతున్న నేరాలు, మారుతున్న విధానాలు తీసుకుంటున్న చర్యల గురించి పూర్తి సమాచారంతో మన ముందుంచింది తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్. వేధింపులకు చెక్పెట్టడమే లక్ష్యం – స్వాతి లక్రా ► తెలంగాణలో ‘షీ టీమ్’ ఏర్పాటై ఏడేళ్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన ఫలితాలను చూసినప్పుడు మీకేమనిపించింది? ‘షీ టీమ్’ గురించి 90 శాతం ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో అవగాహన రావడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇదే విషయం మీద సర్వే చేశాం. దాంట్లో మంచి రేటింగ్ వచ్చింది. ప్రజలకు ‘షీ టీమ్’ సేవలు బాగా నచ్చాయి. మంచి ఫలితాలు వచ్చాయి. ప్రతి యేటా 5 వేలకు పైగా ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నాం. మహిళల రక్షణ, వారి భద్రతకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఒక వేదిక ఉండాలనుకుని ప్రభుత్వం అక్టోబర్ 24, 2014లో హైదరాబాద్లో షీ టీమ్ను ప్రారంభించింది. ఏప్రిల్, 2015లో తెలంగాణ మొత్తంగా షీ టీమ్ సేవలను విస్తృతం చేసింది. ► ఇన్నేళ్లుగా వచ్చిన మహిళలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇటీవల మహిళలపై నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు ఎలాంటివి? గతంలో భౌతిక దాడులు, లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్కు సంబంధించినవి మొదటి జాబితాలో ఉండేవి. దాదాపు వందలో 60 శాతం ఫోన్ వేధింపులు, సామాజిక మాధ్యమాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉంటున్నాయి. ఈ ఫిర్యాదుల్లో వాట్సప్ ద్వారా వచ్చేవి ఎక్కువ ఉండగా, డయల్ –100, ఫేస్బుక్, హ్యాక్ ఐ యాప్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్ నుంచి కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. ► సామాజిక మాధ్యమాల ద్వారా పెరిగే వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి తీసుకుంటున్న చర్యలు? మహిళలు చాలా మంది వేధింపుల బారిన పడుతున్నామని తెలిసినా ఫిర్యాదు చేయడానికి ఇంకా ముందుకు రావడం లేదు. ముందు వాళ్లలో చాలా మార్పు రావాలి. ఏ వేధింపులైనా వెంటనే మాకు తెలియజేయడం ద్వారా సత్వర పరిష్కారం లభిస్తుంది. ఉమన్ సేఫ్టీ వింగ్లో ప్రత్యేకంగా సైబర్ క్రైమ్కు సంబంధించి ‘షీ ల్యాబ్’ను కూడా ప్రారంభిస్తున్నాం. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ వేధింపులను సైబర్ నిపుణుల ద్వారా కనిపెట్టి, వీటికి అడ్డుకట్ట వేస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచీ సైబర్ నేరస్తులు ఉంటున్నారు. ఇలాంటప్పుడు వారిని పట్టుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసుల సాయమూ తీసుకుంటున్నాం. ఏఅగిఓ ఉ్గఉ మొబైల్ అప్లికేషన్ ఉంది. ఇది ఇప్పటికే 30 లక్షల మందికి పైగా రీచ్ అయ్యింది. మా వెబ్సైట్లో సోషల్మీడియాలో మహిళలు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిపే విధానాలపై పూర్తి సమాచారం ఉంచాం. వాటిని చదివి తెలుసుకోవచ్చు. ‘షీ టీమ్’ సమావేశం అనంతరం సభ్యులతో స్వాతి లక్రా ► షీ టీమ్లో మహిళా భద్రత కోసం ఎంత మంది వర్క్ చేస్తుంటారు? 33 శాతం మహిళలకు రిజర్వేషన్ వచ్చాక మహిళలు అధిక సంఖ్యలో పోలీసు విభాగంలోకి వస్తున్నారు. కానీ, ఇంకా తక్కువమంది మహిళా పోలీసులు ఈ విభాగంలో ఉండటం ఆలోచించ వలసిన విషయం. షీ టీమ్ బృందాలుగా రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తారు. ఒక బృందంలో 5 గురు సభ్యులు, ప్రతి బృందంలో తప్పనిసరిగా ఒక మహిళ ఉంటారు. వీళ్లు యూనిఫామ్లో కాకుండా సివిల్ డ్రెస్లో డిప్యూటీ సూపరిండెంట్ ఆఫీసర్ పర్యవేక్షణలో విధులను నిర్వర్తిస్తుంటారు. ఇదే విధానం తెలంగాణ మొత్తం ఉంటుంది. సుశిక్షితులైన వారే ఈ టీమ్లో ఉంటారు. అలాగే, సమాజంలో మహిళల స్థానం పట్ల అవగాహన, వారి పట్ల నడుచుకునే విధానం, ఆపరేషన్ నైపుణ్యాలు, పద్ధతులు, సాంకేతిక నైపుణ్యం, న్యాయపరమైన, చట్టపరమైన నిబంధనల పట్ల పూర్తి సమాచారం కలిగి ఉంటారు. ► మన సమాజ మూలాల్లోనే కుటుంబాల్లోనూ అమ్మాయిల పట్ల ఒక వివక్ష ఉంది. షీ టీమ్ ఏర్పాటై ఇన్నేళ్ల తర్వాత ఈ విధానంలో ఏమైనా మార్పు వచ్చిందంటారా? చాలా మార్పు వచ్చింది. వివక్ష లేకపోలేదు. కానీ, వివక్ష తీవ్రత తగ్గింది. 2016–17 సమయంలో అమ్మాయిలను వేధించేవారిలో చాలా మంది మైనర్ అబ్బాయిలను మేం పట్టుకున్నాం. వారికి కౌన్సెలింగ్ చేస్తూ వచ్చాం. దీంతో వారిలో మార్పు తీసుకురావడానికి జూనియర్, డిగ్రీ స్థాయి కాలేజీల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రోగ్రామ్లు చేశాం. ఇప్పుడు సర్వే చేస్తే మైనర్ అబ్బాయిలు వేధింపులకు పాల్పడటం లేదని తెలిసింది. అవగాహన కావచ్చు. కౌన్సెలింగ్ కావచ్చు. అన్నీ దోహదం చేస్తున్నాయి. కాలేజీల్లో అబ్బాయిలు కూడా షీ టీమ్ కార్యక్రమాల సమయంలో పాల్గొనడానికి స్వచ్ఛందంగా ముందుకువస్తున్నాయి. అమ్మాయిలను ఎలా చూడాలనే ఆలోచనల్లో మార్పు రావడానికి మేం చేస్తున్న కార్యక్రమాలు దోహదం చేస్తున్నాయి. ఇళ్లలో చూస్తే ఈ మార్పు చాలా నెమ్మదిగా ఉంది. మరొక బాధాకరమైన విషయం ఏంటంటే.. బధిరులను వేధించడం, వారిపై లైంగిక దాడులకు పాల్పడటం వంటివి జరుగుతున్నాయి. బధిరుల పట్ల ఎలా నడుచుకోవాలనే విషయాల పట్ల కుటుంబాల నుంచే అబ్బాయిల్లో అవగాహన పెంచితే మరింత బాగుంటుంది. ► ఇటీవల చిన్నపిల్లలపై లైంగిక దాడుల సంఘటనలు ఎక్కువ వింటున్నాం. తెలిసినవారే నిందితులుగా ఉంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? నిజమే, పిల్లలపై దాడులు చేసేవారు 90 శాతం కంటే ఎక్కువ ఆ కుటుంబాలకు తెలిసినవారే ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే కుటుంబాల నుంచి ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇంట్లో, ఇంటి చుట్టుపక్కల ఉండే ‘అంకుల్స్’ వల్ల ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. పిల్లలపై లైంగిక దాడి జరిగిందని తెలిసినప్పుడు తప్పనిసరిగా ఫిర్యాదు చేయాలి. ఆ నేరాన్ని దాచిపెట్టాలని చూసినా అది నేరమే. ఈ విషయాలు పిల్లలకు కూడా తెలియాలని పాఠశాలల్లో ‘సేఫ్–అన్ సేఫ్ టచ్’ పట్ల అవగాహన కల్పిస్తున్నాం. సమస్య తెలిసినప్పుడు టీచర్లు కూడా ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత గురించి తెలియజేస్తున్నాం. ► మహిళకు సమస్య వచ్చి, మిమ్మల్ని కలిసిన తర్వాత ఆమె జీవితంలో నిలదొక్కుకోవడానికి ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు? బాధితుల్లో ఎలాంటి అండ లేనివారికి ప్రభుత్వం నుంచి పరిహారం ఉంటుంది. వారు నిలదొక్కుకోవడానికి చదువు, జీవననైపుణ్యాలను కల్పించేందుకు తగిన శిక్షణ కూడా ఉంటుంది. ► చాలా వరకు మహిళా బాధితుల్లో ఇప్పటికీ పోలీసు స్టేషన్కి రావాలంటే ఒక తెలియని సందిగ్ధత ఉంటుంది. షీ టీమ్ వచ్చాక ఈ విధానంలో మార్పు వచ్చిందంటారా? గత పోలీసు స్టేషన్లు, నేటి పోలీసు స్టేషన్లను చూస్తే ఆ తేడా మీకే అర్థమవుతుంది. ఒక మంచి వాతావరణంలో మా సిబ్బంది పనిచేస్తున్నారు. ముఖ్యంగా లింగసమానతలు, సున్నితమైన విషయాల గురించిన అవగాహనతో పనిచేస్తున్నారు. ఒక మహిళ పోలీస్ స్టేషన్కు వస్తే ఆమెతో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలనే విషయాల పట్ల మార్పు వచ్చింది. అలాగే, ప్రతీ పోలీసు స్టేషన్ రిసెప్షన్లో ఒక మహిళ ఉంటుంది. దీని వల్ల మంచి మార్పుతోపాటు గతంలో ఉన్న సందిగ్ధతలు చాలా వరకు తగ్గాయి. ఒక మహిళ ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేస్తే, మేం వారిని నేరుగా సంప్రదించి వివరాలన్నీ తీసుకుంటున్నాం. అంటే, మహిళ పోలీసు స్టేషన్కు రాకుండానే ఆమెకు న్యాయం జరిగేలా చూస్తున్నాం. ► ఇతర రాష్ట్రాల్లో ‘షీ టీమ్’ లాంటి మహిళా రక్షణ కోసం చేస్తున్నæ విభాగాలున్నాయా? మనం వారి నుంచి స్ఫూర్తి పొందినవి ఉన్నాయా? తప్పకుండా ఉంటాయి. మన సెంటర్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసు విభాగం నుంచి వచ్చి చూస్తుంటారు. మేం కూడా మహిళా రక్షణలో ఇతర రాష్ట్రాల పోలీసు విభాగం చేస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకుంటుంటాం. ఇది రెండువైపులా ఉంటుంది. ► ఇక్కడి మహిళలు వేరే దేశాల్లో వేధింపులకు గురైన సందర్భాల్లో వచ్చిన ఫిర్యాదులు.. ఈ విధానంలో ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి? ఉమెన్ సేఫ్టీ వింగ్లోనే ‘ఎన్ఆర్ఐ సెల్’ కూడా ఏర్పాటు చేశాం. ఎన్ఆర్ఐ లను పెళ్లి చేసుకున్న మహిళలు విదేశాలకు వెళ్లిన తర్వాత వారిని వదిలేయడం, అదనపు కట్నం కోసం వేధించడం వంటి సంఘటనలు చూస్తున్నాం. ఇలాంటి వారి కోసం ఒక టీమ్ పని చేస్తుంది. లాయర్ ద్వారా, స్వచ్ఛంద సంస్థల నుంచి, ఎంబసీస్, విదేశీ మంత్రిత్వ శాఖ, ఆర్పీఓ .. అందరినీ సంప్రదించి ఆ సదరు మహిళకు ఎలా సాయం అందించాలో చూస్తున్నాం. కొన్ని విషయాల్లో టైమ్ పడుతుంది కానీ, మంచి ఫలితాలు వస్తున్నాయి. ► మహిళా రక్షణ విషయంలో ఇప్పటి వరకు ఉన్న చట్టాలు సరిపోతాయా? అదనంగా కొత్త చట్టాలను చేర్చాల్సిన అవసరం ఉందా? చట్టాలు చాలా ఉన్నాయి. వాటిని అమల్లో పెట్టడం ముఖ్యం. ఈ విషయంపైనే మేం దృష్టి పెడుతున్నాం. విచారణ త్వరగా పూర్తి చేయాలి. చార్జ్షీట్ ఫైల్ చేశాక త్వరగా బాధితులకు న్యాయం జరగాలి.. ఈ విధానంలోనే మేం పనిచేస్తున్నాం. ► సమాజంలో చోటు చేసుకోవాలనుకుంటున్న మార్పుల గురించి? దేశవ్యాప్తంగా పోలీసు విభాగంలో మహిళల సంఖ్య తక్కువే ఉంది. ఇప్పుడిప్పుడే మహిళా పోలీసుల సంఖ్య పెరుగుతోంది. మన సమాజంలో 50 శాతం మహిళలు ఉంటే అంత శాతం పోలీసు విభాగంలోనూ ఉండాలి. దీనివల్ల సమాజంలో ఉన్న మహిళలకు మరింత మేలు జరుగుతుంది. ఏ సమయంలోనైనా మహిళ ధైర్యంగా తన పనుల నిమిత్తం వెళ్లగలిగే పరిస్థితి రావాలనుకుంటున్నాను. ఆ రోజు తప్పక వస్తుంది అన్న నమ్మకమూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మహిళల రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న ‘షీ టీమ్’, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇన్చార్జ్, అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా, డిఐజీ సుమతి ఇంటర్వ్యూలతో షీ టీమ్ గురించిన సమగ్ర సమాచారం. ఎంబీయే చేస్తున్న నాకు మా కాలేజీలో చదువుతున్న సురేష్ (పేరు మార్చడమైనది) ప్రేమిస్తున్నానంటూ దగ్గరయ్యాడు. ఏడాదిగా బాగానే ఉన్న సురేష్ అనుమానంతో విసిగిస్తుండటంతో భరించలేక బ్రేకప్ చెప్పేశాను. ఆనాటి నుంచి తన దగ్గరున్న ఫొటోలతో నన్ను బెదిరించడం మొదలుపెట్టాడు. నా ఫోన్లో ఉన్న మా బంధుమిత్రుల నెంబర్లన్నీ ట్యాప్చేసి, తీసుకొని వారందరికీ మా ప్రేమ గురించి, ఫొటోల గురించి చెబుతానని బెదిరించేవాడు. ఇది నా భవిష్యత్తుకే ప్రమాదం అనుకున్నాను. మా ఫ్రెండ్ ఇచ్చిన సలహాతో ‘షీ టీమ్’ను వాట్సప్ నెంబర్ ద్వారా సంప్రదించాను. పోలీసులు సురేష్ను హెచ్చరించి, అతని వద్ద నాకు సంబంధించి ఉన్న ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయించారు. ఇక నుంచి ఎలాంటి వేధింపు చర్యలకు పాల్పడబోనని రాతపూర్వకంగా రాయించుకొని, అతని మీద నిఘా పెట్టారు. రెండు నెలలుగా ఈ సమస్యతో నరకం చూసిన నాకు, షీ టీమ్ ద్వారా ఒక్క రోజులోనే పరిష్కారం దొరికింది. ఇప్పుడు హాయిగా ఉన్నాను. – బాధితురాలు మా అమ్మాయి ఏడవ తరగతి చదువుతుంది. సెలవులకు మా అమ్మ వాళ్ల ఊరు వెళ్లింది. అదే ఊళ్లో ఉంటున్న తెలిసిన వ్యక్తే మా అమ్మాయి పట్ల దారుణంగా ప్రవర్తించడమే కాకుండా, ఫొటోలు, వీడియోలు తీసి మమ్మల్ని మానసికంగా వేధించేవాడు. భరించలేక షీ టీమ్ను ఫోన్ ద్వారా సంప్రదించాం. షీ టీమ్ సదరు వ్యక్తి నుంచి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సరైన విధంగా బుద్ధి చెప్పారు. ఏడాది నుంచి సమస్యేమీ లేకుండా మనశ్శాంతిగా ఉన్నాం. – మరో బాధితురాలి తల్లి అవగాహన తీసుకొస్తున్నాం– బి. సుమతి ► మహిళల వేధింపులకు సంబంధించి రోజూ ఎన్ని కేసులు ఫైల్ అవుతుంటాయి? రోజూ దాదాపు 20 నుంచి 25 కేసుల వరకు ఉంటాయి. వీటిలో లైంగిక వేధింపులు ఎక్కువ. స్నేహం, ప్రేమ పేరుతో దగ్గరయ్యి ఫొటోలు, వీడియోలు నలుగురిలో పెట్టి పరువు తీస్తామనే బెదిరింపులూ ఎక్కువే. పదేళ్ల లోపు చిన్నపిల్లలకు సంబంధించిన కేసులు కూడా ఉంటున్నాయి. వీటిలో తీవ్రత శాతాన్ని బట్టి మానిటరింగ్ ఉంటుంది. ప్రధానంగా నేరాల తీవ్రతను బట్టి ఒక షెడ్యూల్ను రూపొందించాం. పిల్లలు, మహిళలపై పబ్లిక్గా జరిగే దాడులు, లైంగిక హింస, మనుషుల అక్రమరవాణా, సైబర్క్రైమ్, గృహహింస ప్రధానమైనవి. ► షీ టీమ్ ఆధ్వర్యంలో పిల్లల భద్రత కోసం చేస్తున్న కార్యక్రమాలు గురించి? చిన్న పిల్లల్లో అవగాహన కల్పించడానికి రాష్ట్రస్థాయిలో స్కూళ్లను ఎంచుకున్నాం. షీ టీమ్, సైబర్ నిపుణులు, స్వచ్ఛంధ సంస్థ భాగస్వామ్యంతో ఇప్పటికి 1650 స్కూళ్లలో ‘సైబర్ కాంగ్రెస్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశాం. తెలంగాణలోని 33 జిల్లాల్లోనూ ప్రతి స్కూల్ నుంచి విద్యార్థులు పాల్గొనేలా చూస్తున్నాం. ► టీనేజర్లు, యువతలో మహిళల భద్రతకు సంబంధించి చేస్తున్న కార్యక్రమాలు? యువతలో 19 నుంచి 25 ఏళ్ల లోపు అమ్మాయిలపై వేధింపులు ఎక్కువున్నాయి. అందుకని, కాలేజీల్లో ‘గర్ల్ సేఫ్టీ క్లబ్స్’ ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో 25 మంది విద్యార్థులను తీసుకుంటే సగం అమ్మాయిలు, సగం అబ్బాయిలు ఉండేలా చూస్తున్నాం. ఒక కాలేజీలో 25 మంది సేఫ్టీ క్లబ్గా ఉంటే వారి చుట్టుపక్కల, కాలేజీలో ఏదైనా సమస్య వస్తే ఎలా స్పందించాలి, అనే విషయాల పట్ల శిక్షణ ఇస్తాం. వాళ్లు పరిష్కరించలేని సమస్యలను మా దగ్గరకు తీసుకువచ్చేలా శిక్షణ ఇస్తున్నాం. ► ఆన్లైన్ మోసాలకు గురయ్యేవారిలో గృహిణులూ ఉంటున్నారు. వీరి రక్షణ కోసం చేస్తున్న కార్యక్రమాలు? గృహిణులు సైబర్ మోసాల బారినపడకుండా, అవగాహన కల్పించేందుకు ‘సైభర్’ కార్యక్రమం రూపొందించాం. ఆన్లైన్ మాధ్యమంగానే చేసిన ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 50 లక్షల మందికి రీచ్ అయ్యాం. స్లమ్స్లలో కూడా అక్కడి అమ్మాయిల భాగస్వామ్యంతో గృహిణుల రక్షణ కోసం అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నాం. వీటి విస్తృతి పెంచేందుకు మరికొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ► గ్రామస్థాయిల్లో మహిళలకు రక్షణ కల్పించేందుకు, అవగాహన పెంచేందుకు చేస్తున్న కృషి? పట్టణ, గ్రామీణ స్థాయిలోనూ షీ టీమ్ ద్వారా నేరుగా దాదాపు 30 లక్షల మందికి రీచ్ అయ్యాం. స్థానిక జానపద కళాకారులతో కలిసి గ్రామస్థాయిలో కార్యక్రమాలు చేశాం. వీటిని మరింతగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. షీ టీమ్ మీ కోసమే.. ► పబ్లిక్ ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు (ఈవ్ టీజింగ్.. వంటివి) జరిగినా ► ఫోన్కాల్, మెసేజ్లు, ఇ–మెయిల్స్, సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురిచేసినా ► మహిళ ఒంటరిగా ప్రయాణించే సందర్భాలలో వెంటనే పోలీసు సాయం అందాలన్నా షీ టీమ్ వెంటనే స్పందిస్తుంది. ► మహిళలపై తీవ్రమైన నేరాలను అరికట్టడానికి నిరోధక శక్తిగా పనిచేస్తుంది. ► తప్పుదారి పట్టిన యువతను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి నిపుణులచే కౌన్సెలింగ్ ద్వారా అవగాహన కల్పింస్తుంది. వారిని తమ నిఘానేత్రంతో నిశితంగా గమనింఇస్తుంది. ► మహిళకు హక్కుల పట్ల షీ టీమ్ వివిధ వేదికల ద్వారా అవగాహన కలిగిస్తుంది. భద్రత... సురక్షితం ► బృందాలుగా తెలంగాణ వ్యాప్తంగా ‘షీ టీమ్’ పనిచేస్తుంది. ప్రతి టీమ్లో ఒక మహిళా పోలీస్ అధికారి ఉంటారు. ► బస్స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, స్కూళ్లు–కాలేజీలు, లేడీస్ హాస్టల్స్, పార్కులు, ఆసుపత్రుల చుట్టుపక్కల ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించి నిఘాను ఉంచుతుంది. ► చట్టం, న్యాయం, సాంకేతిక విషయాల్లో సుశిక్షితులైన వారు ఈ బృందంలో తమ విధులను నిర్వర్తిస్తుంటారు. ఎప్పటికప్పుడు షీ టీమ్కు నిఘా విభాగం నుంచి సమాచారం చేరుతూనే ఉంటుంది. ► మహిళలు ఆన్లైన్ వేదికల ద్వారా తమ ఫిర్యాదులను అందజేయవచ్చు. షీ టీమ్ బృందం సివిల్ డ్రెస్సులో బాధితులను నేరుగా కలిసి, తదుపరి విచారణ కొనసాగిస్తుంది. ► ఒకసారి ఒక వ్యక్తిపై మొదటిసారి నేరారోపణ వస్తే సుమోటోగా బుక్ చేసి, తగిన చర్యలు తీసుకుంటారు. అదే నేరసుడిపై మరోసారి ఫిర్యాదు వస్తే.. ఆ కేసును నిర్భయ యాక్ట్ కింద బుక్ చేసి, మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటారు. అందుకని, బాధితులు వెనుకంజ వేయకుండా తమ సమస్యను నివేదించి, సరైన పరిష్కారం పొందవచ్చు. ► సమాజంలో మహిళలకు సంబంధించిన సమస్యలను పరువుగా చూస్తారు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఆ వివరాలు బయటకు వచ్చి, తమ కుటుంబ పరువు పోతుందేమో అని భయపడతారు. షీ టీమ్ లోబాధితుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతారు. సామాజిక మాధ్యమాలు, ఫోన్ నెంబర్, నేరుగా.. ఫిర్యాదులను స్వీకరించడమే కాకుండా, అత్యంత వేగంగా పరిష్కారం చూపుతారు. అందుకని మహిళలు తమను వేధించేవారిని ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే వారికై వారుగా ముందుకు రావాలి. ► మహిళా రక్షణ కోసం షీ టీమ్ వివిధ వేదికల ద్వారా ప్రజలలో అవగాహన కలుగజేస్తుంది. ఆ కార్యక్రమాలలో పాల్గొని తమ అభిప్రాయాలనూ పంచుకోవచ్చు. ఫిర్యాదులకు వేదికలు తెలంగాణ మొత్తానికి మహిళకు రక్షణకవచంలా ఉంది షీ టీమ్. సమస్య వచ్చినప్పుడు సందేహించకుండా సత్వర పరిష్కారం కోసం సంప్రదించాల్సిన వేదికలు.. ఇన్స్టాగ్రామ్:telanganasheteams ఫేస్బుక్, ట్విటర్:@ts-womensafety మెయిల్: womensafety-ts@tspolice.gov.in య్యూట్యూబ్: Women Safety Wing Telangana Police వాట్సప్ నెం. 944 166 9988 క్యూ ఆర్ కోడ్.. వంటి వేదికల ద్వారా ఫిర్యాదు చేయచ్చు. లైంగిక వేధింపులు, దాడులు, సైబర్ నేరాల నుంచి ‘ఆమె’ను రక్షించడానికి నిరంతరాయంగా కృషి చేస్తున్న షీ టీమ్కు ‘సాక్షి’ సెల్యూట్. – నిర్మలారెడ్డి, ఫొటోలు: నోముల రాజేష్రెడ్డి -
ఆదమరిచి క్లిక్ చేస్తే.. బ్లాక్ మెయిల్ చేసి..
బనశంకరి: స్మార్ట్ ఫోన్ వినియోగదారులనే టార్గెట్గా చేసుకున్న సైబర్ కేటుగాళ్లు, ఎస్కార్ట్స్, లోకాంటో వెబ్ లింక్లు పంపించి బ్లాక్మెయిల్ చేసి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు మొదట మొబైల్ ఫోన్కు మోసపూరిత వెబ్సైట్ లింక్ తో కూడిన మెసేజ్ పంపిస్తారు. లేదా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం లో పరిచయం పెంచుకుని మొబైల్ నంబర్లను సేకరించి పలు రకాల ప్రలోభాలతో ఊరిస్తారు. వారు పంపిన లింక్పై క్లిక్ చేయమంటారు. క్లిక్ చేస్తే చాలు.. వీడియో కాల్లో నగ్న దృశ్యాలు కనిపించి క్షణాల్లో రికార్డు, స్క్రీన్ షాట్లను తీసుకుంటారు. మరో పక్క బాధితుని బంధుమిత్రుల ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాలు, ఫోన్నంబర్లనూ సేకరిస్తారు. వారికి మీ చిత్రాలను, వీడియోలను ట్యాగ్చేస్తామని, వాట్సప్కు పంపుతామని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ రకంగా పెద్దమొత్తంలో డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇలాంటి కేసులు తరచూ బెంగళూరు నగర సీఇఎన్ పోలీస్స్టేషన్లో నమోదు అవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అపరిచిత వీడియో కాల్స్కు, వెబ్ లింక్లకు స్పందించరాదని పోలీసులు సలహా ఇచ్చారు. -
రూ.1,130 కోట్ల ‘సైబర్ స్కామ్’!
బ్రిటన్ కేంద్రంగా పాక్కు చెందిన ఫిజాన్ నేతృత్వంలో దందా కీలకపాత్ర పోషించిన పలువురు ‘తెలుగువారు’ శిక్షపడ్డాక తప్పించుకువచ్చిన కరీంనగర్ జిల్లా వాసి దర్యాప్తు దశలోనే పారిపోయిన ఖమ్మం జిల్లా వ్యక్తి ఇంటర్పోల్ సాయంతో భారత్కు లండన్ పోలీసులు సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్కు చెందిన ఓ వ్యక్తి లండన్ కేంద్రంగా భారీ ‘సైబర్ స్కామ్’కు పాల్పడ్డాడు. పదుల సంఖ్యలో ముఠా సభ్యుల్ని ఏర్పాటు చేసుకుని వివిధ బ్యాంకులకు చెందిన కస్టమర్ల నుంచి రూ.1,130 కోట్లు(113 మిలియన్ పౌండ్లు) కాజేశాడు. ఈ ఘరానా మోసానికి పాల్పడ్డ అంతర్జాతీయ ముఠాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారూ ఉన్నారు. కరీంనగర్ వాసి ముఠా నాయకుడికి కుడి భుజంగా వ్యవహరిస్తే.. ఖమ్మం, రాజమండ్రి యువకులు ‘మనీ మ్యూల్స్’ను ఏర్పాటు చేసే పని చేశారు. సొలిసిటరీ ఖాతాలే టార్గెట్... పాక్కు చెందిన ఫిజాన్ హమీద్ చౌదరి బ్రిటన్లో 20 మందితో ముఠా ఏర్పాటు చేశాడు. వివిధ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు ఎరవేసి ఏజెంట్లుగా మార్చుకున్నాడు. వీరి ద్వారానే ఆయా బ్యాంకు కస్టమర్లుగా ఉన్న సొలిసిటర్ కంపెనీ(న్యాయవాదులు)ల లావాదేవీలు, కాంటాక్ట్ నంబర్లు తెలుసుకునే వాడు. లండన్లో స్థిరాస్తి కొనుగోళ్లన్నీ సొలిసిటరీ కంపెనీల ద్వారానే జరుగుతాయి. ఓ ఆస్తిని విక్రయిస్తున్న వ్యక్తి, ఖరీదు చేస్తున్న వ్యక్తి.. తరఫునా ఈ సొలిసిటర్లు ఉంటారు. వారు ఆస్తి పూర్వాపరాలు పరిశీలించి ఖరీదు ఖరారు చేస్తారు. ఆపై ఆస్తిని ఖరీదు చేస్తున్న వ్యక్తి ఆ మొత్తాన్ని తన సొలిసిటర్ కంపెనీ ఖాతాలో జమ చేస్తారు. ఈ నగదు కంపెనీ ద్వారానే ఆస్తిని విక్రయించే వ్యక్తి సొలిసిటరీ కంపెనీ ఖాతాలోకి వెళ్తుంది. బ్రిటన్లో బ్యాంకు రుణంపై వడ్డీ రేట్లు తక్కువ కావడంతో ప్రతి ఒక్కరూ రుణంపైనే ఆస్తులు కొంటారు. బ్యాంకు రుణాలు సైతం సొలిసిటరీ కంపెనీ ఖాతాల్లోకే వెళ్తాయి. ఈ నేపథ్యంలోనే ఫిజాన్ గ్యాంగ్ ఈ ఖాతాలను టార్గెట్ చేసుకుంది. బ్యాంకు డేటాతో... సొలిసిటరీ కంపెనీల ఖాతాల వివరాలు, కాంటాక్ట్ నంబర్లు సేకరించే ఫిజాన్.. గ్యాంగ్ మెంబర్ల ద్వారా ఆయా కంపెనీలకు ఫోన్లు చేయించేవాడు. ఇంటర్నెట్ ఆధారంగా స్ఫూఫింగ్ పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ కాల్స్ చేయడంతో రిసీవ్ చేసుకునే వ్యక్తికి సదరు బ్యాంకు నంబరే డిస్ప్లే అయ్యేది. సదరు కంపెనీ చేసిన రెండు లావాదేవీలను చెప్పి వారికి నమ్మకం కలిగించే వారు. ఆపై వారు చేయని లావాదేవీ ఒకటి చెప్పి, పేమెంట్ ప్రాసెసింగ్లో ఉందని సదరు లావాదేవీ మీరే చేశారా? అని అడిగే వారు. దీంతో కంపెనీ వారు ఆ లావాదేవీతో తమకు సంబంధం లేదని చెప్పగా.. దాన్ని రద్దు చేయడానికని ఓ కోడ్ నంబర్ చెప్పేవారు. బ్యాంక్ ఫ్రాడ్స వింగ్కు కాల్ చేసి ఈ నంబర్ చెప్పాలని, ఆపై వారు చెప్పిన విధంగా చేస్తే సదరు లావాదేవీ క్యాన్సిల్ అవుతుందని నమ్మబలికేవారు. పరారీలో తెలుగు రాష్ట్రాల వ్యక్తులు ఈ పంథాలో ఫిజాన్ ముఠా కొన్ని నెలల్లోనే 750 కంపెనీల నుంచి రూ.1,130 కోట్ల వరకు స్వాహా చేసింది. లండన్ చరిత్రలోనే అతిపెద్ద సైబర్ స్కామ్గా రికార్డుకెక్కిన ఈ కేసును స్కాట్ల్యాండ్ యార్డ్, యూకే మెట్రోపాలిటన్ పోలీసులు గత ఏడాది ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో ఛేదించారు. ఫిజాన్తో పాటు లండన్లోని అనేక ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు వారిని పట్టుకున్నారు. గత నెల్లో అక్కడి న్యాయస్థానం నిందితులను దోషులుగా నిర్థారించింది. అయితే దర్యాప్తు నుంచి దోషిగా తేలే వరకు వివిధ దశల్లో ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారు పారిపోయి వచ్చారు. వీరి కోసం గాలిస్తున్న అక్కడి పోలీసులు ఇంటర్పోల్ సాయంతో ఓ ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్ పంపడానికి సన్నాహాలు చేస్తున్నారు. రద్దు చేస్తామంటూ అన్నీ తెలుసుకుని... సైబర్ నేరగాళ్లు వినియోగించే ప్రత్యేక పరిజ్ఞానం కారణంగా వాళ్లు ఫోన్ పెట్టేసినా.. కాల్ కనెక్టయ్యే ఉండేది. దీంతో సొలిసిటరీ కంపెనీ వాళ్లు బ్యాంక్ ఫ్రాడ్ వింగ్తో పాటు ఎవరికి కాల్ చేసినా.. అది నేరగాళ్లకే చేరేది. అలా కాల్ను రిసీవ్ చేసుకునే సైబర్ నేరగాళ్లు బ్యాంకు అధికారుల మాదిరిగా మాట్లాడేవారు. లావాదేవీ క్యాన్సిల్ చేయడానికి అవసరమంటూ వినియోగదారుడి యూజర్ నేమ్, పాస్వర్డ్తో పాటు కస్టమర్ నుంచే కార్డ్ రీడర్ జనరేటెడ్ కోడ్ సైతం తీసుకుని నిమిషాల్లో వారి ఖాతాలు ఖాళీ చేసేవారు. ఈ నిధుల్ని ‘మనీ మ్యూల్స్’ ఖాతాల్లోకి మళ్లించి తక్షణం డ్రా చేయించేవారు. కమీషన్ తీసుకుని తమ ఖాతాలను సైబర్ నేరగాళ్లకు అప్పగించే వారిని మనీ మ్యూల్స్ అంటారు. మనీ మ్యూల్స్ను ఏర్పాటు చేసిన వారిలో కరీంనగర్, ఖమ్మంతో పాటు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన వారూ ఉన్నారు. వీరిని ఏర్పాటు చేసే బాధ్యతల్ని కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తే ఎక్కువగా నెరిపేవాడు.