-
మారీచులపై నిరుపేదల విజయమిది
మంగళగిరి, తాడికొండ నియోజక వర్గాల పరిధిలో 1,402 ఎకరాల్లో 25 లే అవుట్లలో 50,793 మంది నా పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు అందజేసే కార్యక్రమం వారం పాటు పండుగ వాతావరణంలో కొనసాగుతుంది. ప్రతి అక్కచెల్లెమ్మను లే అవుట్ వద్దకు తీసుకెళ్లి, అక్కడే ఇంటి పత్రాలు అంద జేస్తారు. ఆ స్థలంలో ఫొటో తీసుకుని, జియో ట్యాగింగ్ కూడా పూర్తయ్యాక ఇళ్లు కట్టించే కార్యక్రమానికి బీజం పడుతుంది. –ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడైనా సరే పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కావాలని ధర్నాలు చేసే వారిని చూశామని.. రాష్ట్రంలో మాత్రం పేదలకు వాటిని ఇవ్వొద్దని ధర్నాలు చేస్తున్న చంద్రబాబు ముఠాను చూస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తోంటే తట్టుకోలేక గజ దొంగల ముఠా అడ్డు పడుతోందని చెప్పారు. ఈ మారీచులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, సుప్రీంకోర్టు వరకు వెళ్లి.. న్యాయ పోరాటం చేసిమరీ పేదలకు ఇళ్ల పట్టాలిస్తున్న చారిత్రక ఘట్టాన్ని అమరావతిలో చూస్తున్నామని తెలిపారు. ఇది మారీచులపై నిరుపేదల విజయమని, దేశ చరిత్రలోనే ఇది సువర్ణాధ్యాయమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన 50,793 మంది నిరుపేద అక్కచెల్లెమ్మలకు సీఆర్డీఏ పరిధిలో కేటాయించిన ఇళ్ల స్థలాల పట్టాలను శుక్రవారం ఆయన పంపిణీ చేశారు. దీంతోపాటు ఇక్కడ నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్ల పత్రాలను సైతం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సీఆర్డీఏ పరిధిలోని వెంకటపాలెం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఇలాంటి పోరాటాలు వందలు, వేలు చూశామన్నారు. పేదలకు మేలు జరుగుతుంటే మారీచు, సుభాహులు అడ్డు పడుతున్నారని, వారెన్ని కుయుక్తులు పన్నినా తన పయనం ధర్మం వైపే ఉంటుందని, ప్రభుత్వం నిరుపేదల పక్షానే పని చేస్తుందని స్పష్టం చేశారు. ఇప్పుడు పంపిణీ చేసిన స్థలాల్లో ఇళ్లు మంజూరు చేసి.. జూలై 8.. నాన్నగారి (దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి) జయంతి రోజున ఇళ్ల నిర్మాణాలు మొదలు పెడతామని చెప్పారు. ఇప్పటికే ల్యాండ్ లెవలింగ్ పూర్తి చేసి, ప్లాట్లలో సరిహద్దు రాళ్లు కూడా ఏర్పాటు చేశారని, దాదాపు 232 కి.మీ మేర అంతర్గత గ్రావెల్ రోడ్ల నిర్మాణం కూడా పూర్తయిందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ఈ ఇళ్ల పట్టాలు.. సామాజిక న్యాయ పత్రాలు ♦ ఇక్కడ ఈ రోజు జరుగుతున్న సభకు, ఈ సందర్భానికి మన రాష్ట్ర చరిత్రలోనే కాకుండా, దేశ చరిత్రలోనే ఒక ప్రత్యేకత ఉంది. పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలన్న ప్రభుత్వ తాపత్రయం ఒకవైపు.. దాన్ని అడ్డుకునేందుకు మారీచులు, రాక్షసులు ఏకంగా సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లి ఇవ్వకూడదని అడ్డుపడుతున్న పరిస్థితులు ఇంకోవైపు.. బహుశా ఇటువంటి ఘటన ఎక్కడా జరిగి ఉండదు. ♦ ఈ రోజు 50,793 మంది అక్కచెల్లెమ్మలకు వారి పేరు మీద ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్న గొప్ప సందర్భం. నా అక్కచెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వులు చూసే ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి రుణపడి ఉంటాను. ♦మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణ, మంత్రి సురేష్ను.. ఈ ప్రాంతంలో గజం రేటు ఎంతుంటుందని అడిగాను. ఈ మధ్య కాలంలో జరిగిన వేలంలో గజం రూ.17 వేలకు అమ్ముడుపోయిందని.. కనీసం రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్యలో గజం ధర ఉంటుందన్నారు. అంటే రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు విలువ చేసే ఇంటి స్థలం నా పేద అక్కచెల్లెమ్మల పేర్లమీద రిజిస్ట్రేషన్ జరగబోతుంది. పేద అక్కచెల్లెమ్మలకు ఇస్తున్న ఇళ్ల స్థలాల పత్రాలు వారికిస్తున్న హక్కులు కావు.. వారికిస్తున్న సామాజిక న్యాయ పత్రాలు కూడా. ఇకపై ఇదే అమరావతి ఇకపై సామాజిక అమరావతి అవుతుంది. మనందరి అమరావతి అవుతుంది. అక్కచెల్లెమ్మల చేతిలో రూ.3 లక్షల కోట్లు ♦ అక్కచెల్లెమ్మలకు ఇళ్ల నిర్మాణంపై మూడు ఆప్షన్లు ఇస్తాం. మొదటి ఆప్షన్లో సొంతంగా తామే కట్టుకుంటామంటే అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో రూ.1.80 లక్షలు వేస్తాం. రెండో ఆప్షన్గా వారి ఇంటి నిర్మాణానికి కావాల్సిన సిమెంటు, ఇసుక, స్టీల్ లాంటి నిర్మాణ సామగ్రి అందిస్తాం. నిర్మాణ కూలి మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తాం. ఇవన్నీ మేం చేసుకోలేం అన్న వాళ్లకు మూడో ఆప్షన్గా ప్రభుత్వమే ఆ ఇళ్లను నిర్మించి ఇస్తుంది. ఇందులో అక్క చెల్లెమ్మలు ఏ ఆప్షన్ తీసుకున్నా పర్వాలేదు. ♦ ఇప్పటికే రాష్ట్రంలో అన్ని చోట్ల చేస్తున్నట్టే.. ఈ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఉచితంగా అందిస్తాం. సిమెంటు, స్టీల్, డోర్ ఫ్రేములు అన్నీ మార్కెట్ రేట్ల కంటే తక్కువకే ప్రభుత్వం అందిస్తుంది. నాణ్యత విషయలో రాజీ పడేది లేదు. దీంతో పాటు రూ.35 వేలు చొప్పున పావలా వడ్డీకే లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తున్నాం. దీనివల్ల ఇళ్లు కట్టే కార్యక్రమం వేగవంతం అవుతుంది. ♦ మన ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరిట ఇళ్ల స్థలాలు ఇచ్చాం. వీరిలో 21 లక్షల మందికి ఇళ్లు కూడా మంజూరు చేశాం. ప్రతి అక్కచెల్లెమ్మకు చెపుతున్నా.. 30.75 లక్షల ఇంటి స్థలాల్లో దాదాపు రూ.2.50 లక్షల కోట్లు విలువ చేసే ఇళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. ఇల్లు పూర్తయిన తర్వాత ఇంటి విలువ.. ప్రాంతాన్ని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. ♦ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లు.. మీ అన్నగా, మీ బిడ్డగా అక్క చెల్లెమ్మల చేతిలో పెడుతున్నా. గత ప్రభుత్వంలో పాలకులు ఇలాంటి ఆలోచన చేసే సాహసమైనా చేశారా? గతానికీ, ఇప్పటికీ మధ్య ఎంత తేడా ఉందో గమనించండి. సీఆర్డీయే పరిధిలో 5,024 మందికి టిడ్కో ఇళ్లు ♦ఈ 50,793 ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు సీఆర్డీఏ పరిధిలో 8 చోట్ల జగనన్న కాలనీల్లో పీఎంఏవై కింద జీ ప్లస్ 3 విధానంలో నిర్మించిన 5,024 మందికి టిడ్కో ఇళ్లను కూడా అందిస్తున్నాం. వారం రోజుల్లో వారితో కూడా గృహ ప్రవేశాలు చేయించి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అందిస్తాం. టిడ్కో ఇళ్ల నిర్మాణం విలువ రూ.443 కోట్లు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఫ్లాట్పై రూ.1.50 లక్షలు చొప్పున సబ్సిడీగా రూ.75 కోట్లు ఇస్తే.. మనసున్న ప్రభుత్వంగా, పేదల ప్రభుత్వంగా, మన బాధ్యతగా ఈ 5024 ప్లాట్ల మీద మన ప్రభుత్వం మరో రూ.251 కోట్లు ఖర్చు చేసింది. ♦ టిడ్కో ఇళ్ల ప్రస్తావన వచ్చినప్పుడు చంద్రబాబు నోటి నుంచి ఆశ్చర్యకరమైన మాటలు వస్తుంటాయి. అయ్యా మీరు టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తే వాటిని పేదలకు ఇవ్వడానికి జగన్కు నాలుగేళ్లు ఎందుకు పడుతుంది? అని చంద్రబాబునాయుడుని అడుగుతున్నాను. 300 చదరపు అడుగుల ఫ్లాట్ కట్టడానికి అయ్యే విలువ అడుగుకి రూ.2 వేలు వేసుకుంటే.. దాదాపు రూ.5.75 లక్షలు అవుతుంది. మౌలిక సదుపాయాల కోసం రూ.లక్ష అవుతుంది. ♦ అంటే రూ.6.65 లక్షలు ఖర్చయ్యే ప్లాట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1.50 లక్షల చొప్పున రూ.3 లక్షలు సబ్సిడీ ఇస్తే మిగిలిన రూ.3 లక్షల డబ్బును బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకుని 20 ఏళ్లపాటు ఆ పేదవాడు ప్రతి నెలా రూ.3 వేలు చొప్పున కట్టాలి. 20 ఏళ్లలో పేదవాడి మీద పడే అప్పు వడ్డీతో తడిసి మోపెడై మొత్తం రూ.7.20 లక్షలు చెల్లించాలి. మరి ఇది పేదవాడికి ఇచ్చినట్టేనా? కానీ మీ బిడ్డ ఈ ఫ్లాట్ను అక్కచెల్లెమల పేరుపై రూ.1కే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాడు. అయితే చంద్రబాబు, వారి గజ దొంగల ముఠా, ఎల్లో మీడియా వక్రభాష్యాలు చెబుతూనే ఉంది. మేనిఫెస్టోనే భగవద్గీత, బైబిల్, ఖురాన్ ♦ రెండేళ్లు కోవిడ్ కష్టాలు రాష్ట్రాన్ని వెంటాడినా, రాష్ట్రానికి వచ్చే వనరులు తగ్గినా మాకున్న కష్టం కన్నా మీ కష్టమే ఎక్కువ అని భావించి మీ బిడ్డ పరుగెత్తాడు. కోవిడ్ సమయంలో కూడా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఆర్థికంగా ఎన్ని సవాళ్లు ఎదురైనా రైతులకు, అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, పిల్లలకు, సామాజిక వర్గాలకు నవరత్నాల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాం. ♦మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించాం. మేనిఫెస్టోలో 98 శాతం వాగ్దానాలను అమలు చేశాం. ఇళ్ల స్థలాల పంపిణీలో మరో రెండడుగులు ముందుకు వేసి ఇళ్ల నిర్మాణాలను దశల వారీగా చేపడుతూ పరిగెత్తిస్తున్నాం. ♦ఈ నాలుగేళ్ల మీ బిడ్డ పరిపాలనలో ఎక్కడా ఒక్క రూపాయి అవినీతి, లంచం, వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా రూ.2.11 లక్షల కోట్లు జమ చేశాం. మీ బిడ్డ బటన్ నొక్కగానే ఆ డబ్బులు వారి ఖాతాల్లో జమ అయింది. ఒక్కో ఇంటి స్థలం రూ.2.50 లక్షలు చొప్పున 30 లక్షల ఇళ్ల విలువ రూ.75 వేల కోట్లు అవుతుంది. మిగిలిన గోరుముద్ద, సంపూర్ణ పోషణ వంటివి కలిపి అక్షరాలా రూ.3 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు చేర్చాం. మంచి జరుగుతుంటే తట్టుకోలేక.. ♦ ఇంత మంచి జరుగుతుంటే తట్టుకోలేని దుష్టచతుష్టయం, గజదొంగల ముఠా.. అంటే చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 వీరందరికీ తోడు దత్తపుత్రుడు కలిసి చంద్రబాబు ఐదేళ్ల పాలనలో దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం చూశాం. అప్పుడూ.. ఇప్పుడూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్. అప్పులు కూడా అప్పటి కన్నా ఇప్పుడే తక్కువ. అప్పుల పెరుగుదల కూడా ఇప్పుడే తక్కువ. ♦లంచాలు, వివక్ష లేకుండా మరి ఇన్ని లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇప్పుడు ఎలా వెళ్లింది? చంద్రబాబు హయాంలో అలా ఎందుకు జరగలేదని ఆలోచించండి. వారికి మంచి చేసే ఉద్దేశం లేదు. వారి తపన, తాపత్రయం అంతా దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికి అధికారంలోకి రావడం మాత్రమే. వారి దారుణాలను ఎవరూ రాయరు, చూపరు. ప్రశ్నిస్తామన్న వాళ్లు ప్రశ్నించరు. ఇదీ చంద్రబాబు హయాంలో మాయ. ♦ చంద్రబాబు తన పాలనలో 2014–2019 మధ్య ఏ ఒక్క పేదవాడికీ సెంటు భూమి, కనీసం ఒక ఇంటి పట్టా ఇచ్చిన పాపానపోలేదు. ఇదే చంద్రబాబు 2014 ఎన్నికల్లో 600 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసి.. రైతులను, అక్కచెల్లెమ్మలను, నిరుద్యోగులతో సహా అందర్నీ మోసం చేశాడు. ఎన్నికలు సమీపిస్తుంటే కొత్త మోసాలతో ముందుకొస్తారు జాగ్రత్త. రాష్ట్రంలో క్లాస్ వార్ ♦ ఇప్పుడు రాష్ట్రంలో కులాల మధ్య యుద్ధం జరగడంలేదు. ఇక్కడ జరుగుతోంది క్లాస్ వార్. ఒకవైపు పేదవాడు ఉంటే.. మరోవైపు పేదవాళ్లకు మంచి జరగకూడదన్న పెత్తందార్లు ఏకమై యుద్ధం చేస్తున్నారు. పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇస్తామంటే కోర్టుల వరకూ వెళ్లి అడ్డుకుంటున్నారు. ♦ ఈ అమరావతిలో పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. కోర్టులకు వెళ్లి సామాజిక సమతుల్యం దెబ్బ తింటుందని వాదించారు. అంటే పేదవాడు ఇక్కడికి వచ్చి ఉంటే పెత్తందార్లు జీర్ణించుకోలేక హైకోర్టులో కేసులు వేశారు. అక్కడ ఓడిపోతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. అక్కడా ఓడిపోయినా ఇప్పటికీ ఈ పెద్దమనిషి చంద్రబాబు ఏదో ఒక రూపేణా అడ్డుకుంటూనే ఉన్నారు. ♦ పేదవాడు చదవాలి, ఎదగాలి అని మనం తాపత్రయపడుతుంటే గవర్నమెంటు బడుల్లో ఇంగ్లిష్ మీడియం ఉండడానికే వీల్లేదని అడ్డుకుంటున్నారు. మనం వేసే ప్రతి మంచి అడుగులోనూ పేదవాడికి అన్యాయం చేస్తున్నారు. కానీ మీ జగన్ మాత్రం మీ వెంటే ఉన్నాడు. అమ్మఒడి, ఆసరా, చేయూతతో నా అక్కచెల్లెమ్మలు వారి కాళ్ల మీద వాళ్లు నిలబడగలుగుతున్నారు. వాళ్ల పిల్లలను గొప్పగా చదివించగలుగుతున్నారు. ♦ జగన్ మాదిరిగా పాలన చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాస్తారు. వాళ్ల టీవీల్లో డిబేట్లు పెడతారు. రాబోయో రోజుల్లో పేదలకు ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ♦ మీరు ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం.. జూలై 8న ఇళ్లు కట్టించే కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ 50 వేల మంది అక్కచెల్లెమ్మలకు, 25 కాలనీల్లో ప్రతి కాలనీలోనూ అంగన్వాడీ, ప్రైమరీ స్కూల్, విలేజ్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, పార్కులు కూడా వస్తాయి. ఇక్కడే నవులూరిలో లేక్ను కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఈ పెద్దమనిషి చంద్రబాబు మళ్లీ ఒక మేనిఫెస్టో అంటాడు. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటూ మోసపూరిత ప్రేమ చూపిస్తాడు. సామాజిక వర్గాల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో అని అంటాడు. మోసం చేసేవాడిని ఎప్పుడూ నమ్మకండి. నరకాసురుడినైనా నమ్మొచ్చేమో గాని, నారా చంద్రబాబునాయుడిని మాత్రం నమ్మొద్దు. – సీఎం వైఎస్ జగన్ -
51,392 మంది పేదలకు ‘పట్టా’భిషేకం రేపు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఒకటీ రెండూ కాదు.. వందా ఐదు వందలూ అసలే కాదు.. అక్షరాలా 51,392 నిరుపేదల కుటుంబాలు.. ప్రభుత్వం చొరవతో సొంతింటికి హక్కుదారులు అవుతున్నాయి. శుక్రవారం ఉదయం తుళ్లూరు మండలం వెంకటాయపాలెం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ ప్రాంతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా సీఎం వైఎస్ జగన్ లబ్ధిదారులకు అందజేయనున్నారు. సీఆర్డీఏ పరిధిలోని నిడమర్రు, కృష్ణాయపాలెం, నవులూరు, ఐనవోలు, మందడం, కురగల్లు, యర్రబాలెం, పిచ్చుకలపాలెం, బోరుపాలెం.. నెక్కల్లు, అనంతవరం గ్రామాల్లో ‘నవరత్నాలు – పేదలంరికీ ఇళ్లు’ పథకంలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన లబ్ధిదారుకులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం 1402.58 ఎకరాల్లో ఒకొక్కరికి సెంటు చొప్పున 25 లేఅవుట్లలో 51,392 కుటుంబాలకు ప్లాట్లు సిద్ధం చేసింది. అయితే, అమరావతి ప్రాంతం పెద్దలదని, అక్కడ పేదలకు చోటులేదని ప్రతిపక్ష టీడీపీ నాయకులు, మరికొందరు రైతుల ముసుగులో అనేక అడ్డంకులు సృష్టించారు. కోర్టులకు కూడా వెళ్లారు. దేశంలోనే అతి ఖరీదైన న్యాయవాదులను పెట్టుకుని వ్యాజ్యాలు వేశారు. సీఆర్డీఏ ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్లు ఇస్తే సామాజిక సమతౌల్యం దెబ్బతింటుందని చెప్పి కోర్టులను అడ్డుపెట్టుకుని చోటు లేకుండా చేయాలకున్నారు. ఎల్లో మీడియా ఎంత రాద్ధాంతం చేసినా ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని కోర్టులు కూడా సమర్ధించాయి. దీంతో ఉద్యమం పేరుతో అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం వీటన్నింటినీ అధిగమించి పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసింది. 1,402.58 ఎకరాల్లో 51,392 ప్లాట్లు సీఆర్డీఏ ప్రాంతంలో నిరుపేదలకు ఇస్తున్న 1402.58 ఎకరాల్లో ఎన్టీఆర్ జిల్లాకు కేటాయించిన 751.93 ఎకరాల్లో 14 లేఅవుట్లను వేసి 27,532 మందికి ప్లాట్లు కేటాయించారు. గుంటూరు జిల్లాకు కేటాయించిన 650.65 ఎకరాల్లో 11 లేఅవుట్లలో 23,860 ప్లాట్లు వేశారు. ఈ లేఅవుట్లలో 67,700 హద్దు రాళ్లు వేసి ప్లాట్లకు పొజిషన్ ఇచ్చారు. ఇళ్ల స్థలాల మార్కింగ్, నంబరింగ్ పూర్తి చేశారు. 76.28 కిలోమీటర్ల గ్రావెల్ రోడ్లు నిర్మించారు. నిడమర్రు, మందడం, అనంతవరం, దొండపాడు, ఐనవోలు, పెనుమాక, తుళ్లూరు, నవులూరులో అన్ని వసతులతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా సీఎం జగన్ పంపిణీ చేయనున్నారు. తక్కువ సమయంలోనే పూర్తి సీఆర్డీఏ పరిధిలో 1402.58 ఎకరాల్లో 51,392 ప్లాట్లు సిద్ధం చేశాం. అన్ని ప్లాట్లకు నంబర్లు కేటాయించి మార్కింగ్ కూడా పూర్తిచేశాం. శుక్రవారం ఉదయం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేస్తారు. అందుకోసం వెంకటాయపాలెంలో వేదికను సిద్ధం చేస్తున్నాం. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమన్వయంతో తక్కువ సమయంలోనే అన్ని పనులు పూర్తి చేశాం. ఇక్కడి నుంచే టిడ్కో లబిద్ధదారులకు కూడా రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేస్తాం. – వివేక్ యాదవ్, ఏపీసీఆర్డీఏ కమిషనర్ పేదలకు పట్టాలివ్వకుండా ఎన్నెన్నో కుట్రలు సీఆర్డీయే పరిధిలో పేదలకు ఇళ్ల పట్టాలివ్వకుండా తెలుగుదేశం పార్టీ, కొందరు వ్యక్తులు రైతుల ముసుగులో అనేక కుట్రలు పన్నారు. రైతుల పేరుతో ఆ ప్రాంతంలో నిరసనలకు దిగారు. జగనన్న లేఅవుట్లలో పనులు జరగకుండా అడ్డుకొన్నారు. కొందరు పెట్రోలు పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరించారు. పోలీసులపైనా దాడులకు దిగారు. కొందరు హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్లారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందేనన్న కృత నిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. కోర్టుల్లోనూ సమర్ధంగా వాదనలు వినిపించింది. కోర్టులు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించడంతో ఇప్పుడు సీఆర్డీఏ ప్రాంతంలో ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. తొలుత పేదలకు ఇళ్ళ స్థలాలే వద్దన్న బాబు అండ్ కో సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఆర్ 5 జోన్లో కాకుండా ఆర్–3 జోన్లో ఇస్తే ఇబ్బంది లేదని, సెంటు కాకుండా ఐదు సెంట్లు ఇవ్వాలంటూ మరో రాగం అందుకున్నారు. సెంటు భూమి సమాధులు కట్టుకోవడానికి తప్ప ఎందుకూ పనికి రాదంటూ చంద్రబాబు పేదలను అవహేళన చేసేలా మాట్లాడారు. తాజాగా దళిత జేఏసీ పేరుతో జడ శ్రావణ్కుమార్ తదితరులు తుళ్లూరులో 144 సెక్షన్ అమల్లో ఉన్నా లెక్కచేయకుండా బుధవారం అక్కడ అశాంతిని సృష్టించే ప్రయత్నం చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకొనేందుకు దీక్ష పేరుతో ఆయన తుళ్లూరు దీక్షా శిబిరానికి దొడ్డిదారిలో చేరుకున్నారు. వెంటనే పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి, విజయవాడకు తరలించారు. -
త్వరితగతిన సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల నిర్మాణం
సాక్షి, అమరావతి: క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) పరిధిలో పేదలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు వేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తి కాగానే నిర్మాణాలు మొదలు పెట్టాలన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి, పక్కా ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో అధికారులు పేదల ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పేదలకు ఎంత త్వరగా పక్కా ఇళ్లను సమకూరిస్తే వారి జీవితాలు అంత త్వరగా బాగు పడతాయన్నారు. సీఆర్డీఏ పరిదిలో పేదలకు పంపిణీ చేస్తున్న స్థలాల్లో వేగంగా పనులు చేపట్టాలని చెప్పారు. రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలందరికీ సాధ్యమైనంత త్వరగా ఇళ్లు కట్టించి అప్పగించడమే లక్ష్యంగా కృషి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం గత 45 రోజుల్లో రూ.1,085 కోట్లు ఖర్చు చేసిందని, ఇప్పటికే 3.69 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. రూఫ్ లెవల్, ఆపై దశలో ఉన్న ఇళ్ల త్వరలోనే పూర్తి అవుతాయన్నారు. మరో 8.64 లక్షల ఇళ్లు బేస్మెంట్ ఆపై దశల్లో ఉన్నాయన్నారు. వీటి పనులనూ వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. గత సమీక్షలో సీఎం జారీ చేసిన ఆదేశాలను అమలు చేశామని తెలిపారు. ‘జగనన్నకు చెబుదాం’ స్పెషల్ ఆఫీసర్లను కూడా వైఎస్సార్, జగనన్న కాలనీల్లో నియమించి, ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఇళ్ల నిర్మాణానికి వాడే వస్తువుల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తున్నామని వివరించారు. బ్యాంకుల నుంచి త్వరితగతిన రుణాలు ఇళ్ల లబ్ధిదారులైన మహిళలకు మరింత భరోసాగా బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం అందేలా చూస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఇలా ఇప్పటి వరకూ 11.03 లక్షల మందికి పావలా వడ్డీతో రూ.35 వేల చొప్పున రుణాలిప్పించామని.. రూ.3,886.76 కోట్ల మేర రుణాలు మంజూరు అయ్యాయని తెలిపారు. సీఆర్డీఏలో ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, భూమి చదును చేసే పనులు చేశామన్నారు. ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటు అన్ని మౌలిక సదుపాయాలతో నిర్మాణం పూర్తయిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్న కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అజయ్ జైన్, శ్రీలక్ష్మి, విజయానంద్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ సాయి ప్రసాద్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ, సీసీఎల్ఏ సెక్రటరీ ఇంతియాజ్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ లక్ష్మిషా, మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఇది పేదల విజయం
పేదలు మరింత నిరుపేదలుగా మారాలి.. పెత్తందార్లకు జీ హుజూర్ అంటూ బతకాలి.. పేదల పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదవరాదు.. ఇంగ్లిష్ చదువులు అసలే చదవకూడదు.. కనీసం వారికి నిలువ నీడ కూడా లేకుండా ఉంటేనే తమ ఆటలు సాగుతాయన్నది చంద్రబాబు అండ్ కో మానసిక పరిస్థితి. అమరావతి ప్రాంతంలో వారికి ప్రభుత్వం సెంటు భూమి ఇస్తామంటే ఇదే పచ్చ గ్యాంగ్, ఎల్లో మీడియాతో కలిసి గగ్గోలు పెట్టింది. బాబు 3డి గ్రాఫిక్స్ రాజధానిలోని సింగపూర్, మలేషియా, జపాన్లు మురికి కూపాలైపోతాయని ఆందోళనలు, చర్చోపచర్చలతో ప్రజల్లో విష బీజాలు నింపడానికి విఫలయత్నం చేసింది. నిస్సిగ్గుగా కోర్టులకూ ఎక్కింది. ‘రాజధాని అయినంత మాత్రాన అక్కడ పేదలు ఉండకూడదంటే ఎలా?’ అని హైకోర్టు తలంటినప్పటికీ ఈ పచ్చ గ్యాంగ్కు బుద్ధి రాలేదు. రైతుల పేరుతో సుప్రీంకోర్టులోనూ వంకర బుద్ధి చూపించబోయింది. ‘పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఏ విధంగా అన్యాయం? రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టలేం’ అని తాజాగా గడ్డి పెట్టింది. అయినా వీళ్లలో మార్పు వస్తుందని ఆశించలేం. ఈ పెత్తందార్ల యుద్ధాన్ని ఎదిరిస్తూ.. వారి కుట్రలను సమర్థవంతంగా తిప్పికొడుతూ సీఎం వైఎస్ జగన్ గట్టిగా నిలవడం వల్లే పేదలకు న్యాయం జరిగింది. ఇది పేదల కోసం నిలబడ్డ ప్రభుత్వ ఘన విజయం. సాక్షి, అమరావతి: రాజధానిలో పేదలకు స్థానమే లేకుండా చేసేందుకు తెలుగుదేశం పార్టీ పన్నిన కుట్రలు, కుతంత్రాలను సుప్రీంకోర్టు పటాపంచలు చేసింది. రాజధాని ప్రాంతంలో పేదలకు 5 శాతం భూమి కేటాయించాలన్న సీఆర్డీఏ చట్ట నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని అడ్డుకునేందుకు శక్తివంచన లేకుండా తెలుగుదేశం పార్టీలు పెద్దలు చేసిన యత్నాలను సుప్రీంకోర్టు తిప్పికొట్టింది. పేదలకు ఇళ్ల స్థలాలు రాకుండా చేసేందుకు న్యాయవాదులకు కోట్ల రూపాయలను వెదజల్లినా టీడీపీ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. పేదలకు వ్యతిరేకంగా రైతుల ముసుగులో పిటిషన్లు దాఖలు చేయించి, వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరోధించాలన్న అభ్యర్థనలను సుప్రీంకోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చింది. చట్ట ప్రకారం రాజధాని ప్రాంతంలో వేలాది మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిచ్చింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వాన్ని నిరోధించేందుకు నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులు రాజధాని ప్రధాన కేసులో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ అరవింద్ కుమార్ల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకోండి రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు 1,134 ఎకరాల భూమిని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదలాయించేందుకు సీఆర్డీఏకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 45ను సవాలు చేస్తూ అమరావతి రైతులు హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలు చేశారు. జీవో 45 అమలును నిలుపుదల చేయడంతో పాటు పేదలకు ఎలాంటి ఇళ్ల స్థలాలు కేటాయించకుండా ప్రభుత్వాన్ని నిరోధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం ఇటీవల విచారణ జరిపి వాటిని కొట్టేసింది. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని ధర్మాసనం తన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ అమరావతి రైతులు కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై బుధవారం జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, సీఆర్డీఏ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి, పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు శ్యాం దివాన్, రంజిత్ కుమార్ తదితరులు వాదనలు వినిపించారు. ఈ విచారణకు హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి కూడా హాజరయ్యారు. ఎలా చూసినా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ, పిటిషన్లు దాఖలు చేసిన పిటిషన్లకు ఎలాంటి విచారణ అర్హత లేదన్నారు. వేలాది మంది రైతుల్లో కనీసం పది మంది కూడా కోర్టుకు రాలేదన్నారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం కూడా ఐదు శాతం భూమి ఈడబ్ల్యూఎస్ (ఎకనామికల్లీ వీకర్ సెక్షన్) వర్గాలకు ఇవ్వాల్సి ఉందన్నారు. దాని ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తోందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. రాజధాని ప్రధాన కేసులో అనుకూలంగా తుది తీర్పు రాకపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. ఒకవేళ అలా జరిగినా ప్రస్తుతం పేదలకు చేస్తున్న కేటాయింపులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఎందుకంటే సీఆర్డీఏ చట్టమే పేదలకు ఐదు శాతం భూమి ఇవ్వాలని చెబుతోందని తెలిపారు. కాని ఇప్పుడు పేదలకు ప్రభుత్వం ఇస్తున్నది కేవలం 3.1 శాతం భూమి మాత్రమేనన్నారు. 34 వేల ఎకరాల్లో సుమారు 1,200 ఎకరాలు మాత్రమే పేదలకు కేటాయించామని తెలిపారు. సీఆర్డీఏ చట్టంలో సెక్షన్ 53 డీ ప్రకారం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. ఆర్–5 జోన్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం వల్ల ఎలక్ట్రానిక్ సిటీ (ఈ–సిటీ)కి వచ్చిన ఇబ్బందేంటో తెలియడం లేదన్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇచ్చిందని తుది విచారణ జరగాల్సి ఉందన్నారు. కోర్టులో దాఖలు అవుతున్నవన్నీ వ్యక్తిగత పిటిషన్లేనని, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కాదని వివరించారు. ఈ పది మంది వెనుక ఎవరున్నారో పరిశీలించండి వేల మంది భూములిచ్చిన రైతులుండగా, కేవలం పది మందే కోర్టుకు ఎందుకొచ్చారో, దీని వెనుక ఎవరున్నారో పరిశీలించాలన్నారు. ప్రస్తుతం పేదలకు కేటాయించిన స్థలాల వల్ల పిటిషనర్లకు చెందిన రిటర్నబుల్ ప్లాట్లకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని సింఘ్వి తెలిపారు. పేదలకు ప్రస్తుతం కేటాయించిన స్థలాలు ఈ–సిటీ దగ్గర్లో ఉన్నాయని, 6,500 ఎకరాల ఈ–సిటీలో ప్రభుత్వం పేదలకు కేటాయించిన స్థలం చాలా తక్కువని చెప్పారు. అసలు ఆర్–5 జోన్లోనే ఎందుకు.. మరెక్కడైనా ఇవ్వొచ్చుగా అని ప్రశ్నించినా సమాధానం చెప్పగలమన్నారు. ప్రస్తుతం ఉన్న నాలుగు జోన్లలో జోన్–1ను ప్రస్తుతం ఉన్న గ్రామాల కారణంగా ముట్టుకునే పరిస్థితి లేదని, జోన్–2 స్పెషల్ ఏరియా అని.. ఢిల్లీలో లుటియన్స్ ఢిల్లీ మాదిరి అని తెలిపారు. జోన్–3 భూములిచ్చిన వారికి ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు ఉన్న ప్రాంతమని, జోన్–4 హై డెన్సిటీ ప్రాంతం అని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అందుకే పేదల కోసం ఆర్–5 జోన్ను సృష్టించామని తెలిపారు. రిటర్నబుల్ ప్లాట్లు ఒక చోట, ఈ–సిటీ మరో చోట అని తెలిపారు. ఒకవేళ పిటిషనర్లు హైకోర్టులో గెలిచినా కూడా సీఆర్డీఏ చట్టం ప్రకారం పేదలకు ఐదు శాతం భూమి కేటాయించాల్సిందేన్నారు. రాజధాని ప్రధాన వ్యాజ్యాలు జూలైలో విచారణకు రానున్నాయని, ఒకవేళ పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు వచ్చినా రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిందేనని, అప్పుడు కూడా ఐదు శాతం ఈడబ్ల్యూఎస్కు కేటాయించాల్సి ఉంటుందని వివరించారు. మాస్టర్ ప్లాన్ను మార్చలేదు సీఆర్డీఏ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మాస్టర్ ప్లాన్లో ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేశారు. కేటాయించిన స్థలాల్లో నివాసాలు కట్టుకోవడానికి కూడా ప్రభుత్వం మద్దతు ఇస్తుందన్నారు. చట్ట ప్రకారం పేదలకు ఐదు శాతం స్థలాలు కేటాయించాల్సి ఉందన్నారు. భూసేకరణ అనేది ప్రభుత్వం ప్రజల కోసమే చేస్తుందని, దాన్ని ఇతరత్రా ప్రజా ప్రయోజనాల కోసం కూడా వినియోగిస్తుందని తెలిపారు. ఈడబ్ల్యూఎస్ వర్గాలకు స్థలాల కేటాయింపు ప్రజా ప్రయోజనం కాదని అనడం ఎంత మాత్రం సబబు కాదన్నారు. అంతకు ముందు పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు శ్యాం దివాన్, రంజిత్ కుమార్ తదితరులు వాదనలు వినిపిస్తూ.. 29 గ్రామాలకు చెందిన 33 వేల మంది రైతులు భూ సమీకరణ కింద ప్రభుత్వానికి రాజధాని కోసం భూములు ఇచ్చారన్నారు. అమరావతిలో మీడియా సిటీ, నాలెడ్జి సిటీ, జస్టిస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ ఇలా తొమ్మిది రకాల సిటీలు అభివృద్ధి చేయాలని మాస్టర్ ప్లాన్లో ఉందన్నారు. ఒరిజినల్ మాస్టర్ ప్లాన్లో 5 శాతం పేదలకు ఇళ్ల స్థలాలను తొమ్మిది సిటీలకు విస్తరించాలన్నారు. మాస్టర్ ప్లాన్లో 17 వేల ఎకరాలు రెసిడెన్షియల్ జోన్లకు కేటాయించారని పేర్కొన్నారు. జూలైలో తుది తీర్పు రానుందని, అంతకు ముందుగానే పట్టాలు కేటాయించడం సబబు కాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరుపక్షాల వాదనల అనంతరం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. అటు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో, ఇటు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. -
ఆత్మ గౌరవంతో ‘లక్ష’ణంగా..!
సాక్షి, అమరావతి: పట్టణ పేదలు ఆత్మ గౌరవంతో సగర్వంగా జీవించేలా తీర్చిదిద్దిన టిడ్కో ఇళ్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. మొదటి విడతగా ఇప్పటికే 48,416 టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రెండో దఫాలో మరో 40 వేలకు పైగా యూనిట్లను పట్టణ పేదలకు అందచేసేందుకు సిద్ధమైంది. జూన్ నాటికి మొత్తం లక్ష టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించేలా కార్యాచరణ రూపొందించారు. దశాబ్దాలుగా అద్దె ఇళ్లలో భారంగా గడిపిన బడుగు జీవులు అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దిన టిడ్కో గృహాలకు యజమానులుగా మారుతుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం కావలి నుంచి మొదలయ్యే టిడ్కో ఇళ్ల పంపిణీ ప్రక్రియ జూన్ చివరి వరకు కొనసాగనుంది. కావలి మున్సిపాలిటీలో అన్ని వసతులతో పూర్తి చేసిన 2,112 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఈ నెల 29వతేదీన శ్రీకాకుళంలో 1,280 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. సీఆర్డీఏ పరిధిలో 5,024 యూనిట్లు సీఆర్డీఏ పరిధిలో 5,024 యూనిట్ల టిడ్కో ఇళ్ల పంపిణీ మే నెల మొదటి వారంలో మొదలు కానుంది. మే రెండో వారంలో పొన్నూరు, గుంటూరు యూఎల్బీలోని వెంగళాయపాలెం, అడవి తక్కెళ్లపాడుతోపాటు ఆళ్లగడ్డ, డోన్, విశాఖపట్నం, గుడివాడ, మచిలీపట్నం, పిఠాపురం, యలమంచిలి, కందుకూరు యూఎల్బీల్లో ఇళ్లను అందజేయనున్నారు. గుడివాడలో భారీ స్థాయిలో నిర్మించిన 8,912 టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని యోచిస్తున్నారు. అనకాపల్లి యూఎల్బీలో.. అనకాపల్లి యూఎల్బీలో జూన్ మొదటి వారంలో టిడ్కో ఇళ్ల పంపిణీ ప్రారంభించనున్నారు. సత్యనారాయణపురం(అనకాపల్లి)లో 3,256 యూనిట్లు, చిత్తూరులో 2,832, పుంగనూరులో 1,536, నరసరావుపేటలో 1,504 యూనిట్లను లబ్ధిదారులకు అందచేస్తారు. రిజిస్ట్రేషన్లు సైతం ఉచితంగానే.. మున్సిపాలిటీల పరిధిలో నివసించే నిరుపేదలు, దిగువ మధ్య తరగతి వర్గాలకు అనువుగా జీ+3 అంతస్తుల్లో 300, 365, 430 చ.అడుగుల్లో టిడ్కో ఫ్లాట్లను ప్రభుత్వం నిర్మించి ఇస్తోంది. లబ్ధిదారులపై ఏమాత్రం భారం పడకుండా వారి పేరిట ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈమేరకు నివాస ప్రాంగణాల్లో అన్ని వసతులు కల్పించిన అనంతరం లబ్ధిదారుల పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి పూర్తి హక్కు పత్రాలు, ఇంటి తాళాలను అధికారులు అందజేస్తున్నారు. ఈ దఫాలో 17 ప్రాంతాల్లో మొత్తం 40,728 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. మొత్తం 88 యూఎల్బీల్లో 163 ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను నిర్మిస్తున్నారు. వీటిలో ఇప్పటికే 24 ప్రాంతాల్లో నూరు శాతం ఇళ్ల పంపిణీ పూర్తైంది. కావలి, పాత్రునివలస (శ్రీకాకుళం)లో కూడా శుక్ర, శనివారాల్లో నూరు శాతం పంపిణీ పూర్తవుతుందని టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ తెలిపారు. పేదల ఆత్మ గౌరవాన్ని పెంచారు రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా సొంత ఇల్లంటూ లేని నిరుపేదల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 21.25 లక్షల గృహాలను నిర్మిస్తున్నారు. ఈ స్థాయిలో ఇళ్లు ఇచ్చిన ముఖ్యమంత్రి దేశంలో మరొకరు లేరు. ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేస్తూ పేదల ఆత్మ గౌరవాన్ని పెంపొందిస్తున్నారు. దేశవ్యాప్తంగా హౌసింగ్ విధానాలపై ఇటీవల కేంద్ర పట్టణ గృహ నిర్మాణ శాఖ నిర్వహించిన సర్వేలో అంధ్రప్రదేశ్లోని టిడ్కో హౌసింగ్కు అరుదైన గౌరవం దక్కింది. ఇది సీఎం జగన్ చొరవ వల్లే సాధ్యమైంది. నిర్దేశించిన లక్ష్యం మేరకు జూన్ నాటికి లక్ష టిడ్కో ఇళ్లు ఇస్తాం. శుక్రవారం నుంచి మలి విడతగా 40,728 ఇళ్లు పంపిణీ చేయనున్నాం. – జమ్మాన ప్రసన్న కుమార్, టిడ్కో చైర్మన్ -
సామాజిక న్యాయమే పరమావధి
సాక్షి, అమరావతి: ప్రపంచ స్థాయి రాజధాని కంటే కూడా పేదల సంక్షేమమే తమకు ముఖ్యమని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. తమది సామాజిక న్యాయమే పరమావధిగా పని చేస్తున్న ప్రభుత్వమని స్పష్టం చేసింది. రాజధాని ప్రాంతంలోని మొత్తం విస్తీర్ణంలో కనీసం 5 శాతం భూమిని పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని సీఆర్డీఏ చట్టం స్పష్టంగా చెబుతున్నా, గత ప్రభుత్వం మాత్రం ధనికుల కోసం ని ర్మిస్తున్న రాజధానిలో పేదలు ఉండకూడదన్న ఉద్దేశంతో ఆ చట్టాన్ని అమలు చేయలేదని తెలిపింది. కేవలం 44 ఎకరాలను మాత్రమే పేదల కోసం కేటాయించిందని, అలాంటి తప్పిదం పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతోనే సీఆర్డీఏ చట్టాన్ని సవరించి.. మాస్టర్ ప్లాన్లో ఆర్ 5 జోన్ను సృష్టించామని చెప్పింది. ‘ఈ జోన్లో పేదలకు 1,134 ఎకరాల భూమిని కేటాయించాం. ఈ భూమిని ఇళ్ల స్థలాల కింద పేదలకు పంచాలని నిర్ణయించాం. ఇది ఓర్వలేని గత ప్రభుత్వ పెద్దలు హైకోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు వేయించి పేదలకు ఇళ్ల స్థలాలు దక్కకుండా చేసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం పాపమన్నట్లు ప్రభుత్వ తీరును అమరావతి రైతుల పేరుతో తప్పు పడుతున్నారు. సీఆర్డీఏ నుంచి ఈ 1,134 ఎకరాలను రూ.1,100 కోట్లకు పైగా మొత్తాన్ని వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. దీని వల్ల సీఆర్డీఏకు రూ.1,100 కోట్లపైగా మొత్తం సమకూరుతుంది. సీఆర్డీఏకు డబ్బు వస్తేనే రాజధాని అభివృద్ధి సాధ్యమవుతుంది’ అని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. హైకోర్టు విస్తృత ధర్మాసనం సైతం తన తీర్పులో ఇదే విషయాన్ని చెప్పిందని తెలిపారు. అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలివ్వొద్దు రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు 1,134 ఎకరాల భూమిని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదలాయించేందుకు సీఆర్డీఏకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో 45 జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ అమరావతి రైతులు రకరకాల ఎత్తుగడలతో పిటిషన్లు దాఖలు చేశారు. జీవో 45 అమలును నిలుపుదల చేయడంతో పాటు పేదలకు ఎలాంటి ఇళ్ల స్థలాలు కేటాయించకుండా ప్రభుత్వాన్ని నిరోధిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలంటూ అనుబంధ వ్యాజ్యాలు వేశారు. ఈ వ్యాజ్యాలపై శుక్రవారం సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పేదలకు ఇవ్వకుంటే వచ్చే నష్టమేమీ లేదు.. పిటిషనర్ల తరఫున తొలుత దేవ్దత్ కామత్ వాదనలు వినిపిస్తూ.. పేదలకు ఇప్పటికిప్పుడు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే మిన్ను విరిగి మీద పడదన్నారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం సీఆర్డీఏ వద్ద ల్యాండ్ బ్యాంక్ ఉందని, అందులో నుంచి ఇళ్ల స్థలాలు ఇచ్చుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు. మరో సీనియర్ న్యాయవాది వీఎస్సార్ ఆంజనేయులు వాదనలు వినిపిస్తూ, మాస్టర్ ప్లాన్లో చాలా మార్పులు చేశారన్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారం హైకోర్టులో పెండింగ్లో ఉండగా, క్షేత్ర స్థాయిలో పనులు ప్రారంభించడం కోర్టు ధిక్కారం కిందకే వస్తుందన్నారు. సీఆర్డీఏ ప్రతిపాదనలను రైతులు గ్రామ సభల్లో తిరస్కరించారని, అయినా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని అనుమోలు జ్యోతిరత్న వివరించారు. అభివృద్ధిలో భాగంగానే ఇళ్ల స్థలాలు ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పాండవుల కోసం శ్రీకృష్ణుడు ఉన్నట్లు పేదల కోసం జగన్ ఉన్నారన్నారు. పేదల నివాసానికి కనీసం 5 శాతం భూములు ఇవ్వాలని సీఆర్డీఏ చట్టంలో స్పష్టంగా ఉండగా, మాస్టర్ ప్లాన్లో మాత్రం దానికి స్థానం కల్పించలేదన్నారు. ఈ తప్పును సరిదిద్ది చట్ట ప్రకారం పేదల నివాసం కోసం 5 శాతం భూమిని కేటాయిస్తున్నామని తెలిపారు. నిర్ధిష్టంగా ఫలానా చోటే ఇవ్వాలని చట్టంలో ఎక్కడా లేదన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని ఓర్చుకోలేక హైకోర్టు, తరువాత సుప్రీంకోర్టు, మళ్లీ హైకోర్టు.. అడ్డుకునేందుకు ఇలా తిరుగుతూనే ఉన్నారన్నారు. ఇటీవల సుప్రీంకోర్టుకెళ్లగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఎలా తప్పు అవుతుందంటూ రైతులను నిలదీసిందని, దీంతో వాళ్లు అక్కడ తమ పిటిషన్లను ఉపసంహరించుకున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని హైకోర్టు విస్తృత ధర్మాసనం చెప్పిందని, అందులో భాగంగానే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామన్నారు. అభివృద్ధి చేయకుంటే చేయలేదంటున్నారని, చేస్తుంటే ఎలా చేస్తారంటూ కోర్టులకెక్కుతున్నారని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. లిఖితపూర్వక వాదనలు ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చునని స్పష్టం చేసింది. నవ్వుల పువ్వులు హైకోర్టులో న్యాయవాదులకు మౌలిక సదుపాయాలు లేవని ధర్మాసనం నవ్వుతూ వ్యాఖ్యానించింది. సీఆర్డీఏ తరఫు న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి స్పందిస్తూ.. 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉందని, అయితే ఓ పెద్ద మనిషి తనపై క్రిమినల్ కేసు నమోదు కాగానే భయపడి అప్పటికప్పుడు రాజధానిని అమరావతికి మార్చారని తెలిపారు. దీంతో కోట్ల రూపాయల విలువైన ఆస్తులను వదులుకుని అందరూ హడావుడిగా అమరావతికి వచ్చారన్నారు. దాని పర్యవసానమే సౌకర్యాల కొరత అని వివరించారు. ‘ఆ కోట్ల రూపాయల కోసమే అందరూ ప్రతి శుక్రవారం హైదరాబాద్ వెళుతున్నారా? అంటూ ధర్మాసనం నవ్వుతూ వ్యాఖ్యానించింది. -
రాజధాని అందరిదీ.. అందులో అందరూ ఉండాలి: ఏపీ హైకోర్టు
అమరావతి: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కల్పించేందుకు ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల కలెక్టర్లకు భూమిని బదిలీ చేసేందుకు సీఆర్డీఏ కమిషనర్ కు అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 45ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం సీజే జస్టిస్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలోనే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా.. రాజధాని అందరిదీ అని, అందులో అందరూ ఉండాలని వ్యాఖ్యానించారు. అదే సమయంలో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. కౌంటర్ను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నా ప్రధాన న్యాయమూర్తి.. తదుపరిఇ విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేశారు. కాగా, సీఆర్డీఏ చట్ట నిబంధనల ప్రకారం రాజధాని ప్రాంతంలో పేదలకు నివాసాలు కల్పించేందుకు 1,134 ఎకరాల భూమిని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదిలీ చేసేందుకు సీఆర్డీఏ కమిషనర్కు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 31న జారీ చేసిన జీవో 45ను సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. -
పేదలకిచ్చే స్థలాలపై అమరావతి రైతుల పిటిషన్లు
సాక్షి, అమరావతి: సీఆర్డీఏ చట్ట నిబంధనల ప్రకారం రాజధాని ప్రాంతంలో పేదలకు నివాసాలు కల్పించేందుకు 1,134 ఎకరాల భూమిని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదిలీ చేసేందుకు సీఆర్డీఏ కమిషనర్కు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 31న జారీ చేసిన జీవో 45ను సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. లంచ్మోషన్ రూపంలో అత్యవసరంగా దాఖలైన ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్రాయ్ విచారణ జరిపారు. విచారణ సందర్భంగా ఇదే అంశానికి సంబంధించిన వ్యాజ్యాలను ఇప్పటికే ప్రధాన న్యాయమూర్తి (సీజే) నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోందని, మంగళవారం విచారణకు అదనపు ఏజీ అందుబాటులో ఉంటారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. అదనపు ఏజీ కార్యాలయం సైతం త్రిసభ్య ధర్మాసనం ముందు ఇదే అంశానికి సంబంధించిన వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్నందున, తాజా వ్యాజ్యాలను కూడా త్రిసభ్య ధర్మాసనమే విచారించడం సబబుగా ఉంటుందంటూ అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి కార్యాలయం రాతపూర్వకంగా కోర్టు ముందు మెమో దాఖలు చేసింది. తాజా వ్యాజ్యాలను ఇప్పటికే త్రిసభ్య ధర్మాసనం ముందున్న వ్యాజ్యాలతో జత చేయాలని అదనపు ఏజీ ఆ మెమోలో కోర్టును కోరారు. ద్విసభ్య ధర్మాసనం విచారణకు ఆదేశాలిచ్చిన సీజే అటు ఏజీ వాదనలను, ఇటు ఏఏజీ మెమోను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ రాయ్ సైతం ఈ వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనమే విచారించడం మేలని అభిప్రాయపడ్డారు. అయితే, తమ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని అమరావతి రైతుల తరఫు న్యాయవాదులు కోరడంతో.. ఈ వ్యాజ్యాలు మంగళవారం విచారణకు వచ్చే విషయంలో తగిన నిర్ణయం తీసుకునేందుకు కేసు ఫైళ్లను (సీజే) ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ రిజిస్ట్రీని ఆదేశించారు. దీంతో రిజిస్ట్రీ ఈ వ్యాజ్యాలను సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్మిశ్రా ముందుంచింది. వీటిని పరిశీలించిన సీజే మంగళవారం ద్విసభ్య ధర్మాసనం విచారణకు వేయాలని ఉత్తర్వులిచ్చారు. దీంతో ఈ వ్యాజ్యాలపై మంగళవారం సీజే జస్టిస్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. -
అమరావతిలో పేదల ఇళ్లకుసీఆర్డీఏ ఆమోదం
సాక్షి, అమరావతి: నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం మూడో విడత కింద అమరావతి ప్రాంతంలో 48,218 మంది పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించేలా కార్యాచరణ రూపొందించాలని అధికార యంత్రాంగానికి సూచించారు. మే నెల మొదటి వారం నాటికి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. ఇళ్లులేని పేదల చిరకాల వాంఛ నెరవేర్చే ఈ కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ జీవో జారీ చేసిన నేపథ్యంలో సీఎం జగన్ అధ్యక్షతన సోమవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన సీఆర్డీఏ 33వ సమావేశంలో ఈమేరకు ఆమోద ముద్ర వేశారు. 20 లేఅవుట్లు.. అమరావతి ప్రాంతంలో మొత్తం 20 లేఅవుట్లలో 1,134.58 ఎకరాల భూమిని పేదల ఇళ్ల కోసం కేటాయించారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 48,218 మంది పేదలు ఉచితంగా ఇళ్ల పట్టాలు పొందనున్నారు. ఐనవోలు, మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, కురగల్లు, నిడమానూరు ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసింది. సీఆర్డీఏ చట్టం సెక్షన్ 41(3), (4) ప్రకారం ఆర్–5 జోన్ ఏర్పాటు చేసి భూములను ఆ పరిధిలోకి తెచ్చింది. గత ఏడాది అక్టోబరులో అభ్యంతరాలు, సలహాలను స్వీకరించి సీఆర్డీఏ బహిరంగ విచారణ నిర్వహించింది. అనంతరం గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇళ్ల పట్టాల లబ్ధిదారుల జాబితాతో డీపీఆర్లు తయారు చేయాలని గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. న్యాయపరమైన చిక్కులను పరిష్కరించి పేదలకు ఇళ్ల పట్టాలు అందించేలా ప్రభుత్వం సన్నద్ధమైంది. సీఎం సమీక్షలో పురపాలక శాఖ మంత్రి సురేష్, సీఎస్ జవహర్రెడ్డి, పురపాలక శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్, ఆర్అండ్బీ శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, సీఆర్డీఏ కమిషనర్ వివేక్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
గత ప్రభుత్వం పేదలను గాలికొదిలేసింది
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలోని మొత్తం విస్తీర్ణంలో ఐదు శాతం భూమిని పేదల నివాసాల నిమిత్తం కేటాయించాలని సీఆర్డీఏ చట్టం స్పష్టంగా చెబుతోందని, అయితే గత ప్రభుత్వం మాత్రం పేదలను గాలికొదిలేసిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. పేదల కోసం రాజధాని ప్రాంతంలో సెంటు భూమి కూడా కేటాయించలేదని, ఆ తప్పును తాము ఇప్పుడు సరిచేసి, చట్టానికి అనుగుణంగా 5 శాతం భూమిని పేదల నివాసకల్పన కోసం కేటాయించామని చెప్పారు. చట్ట ప్రకారం వ్యవహరించడం కూడా తప్పు అంటూ పిటిషన్ దాఖలు చేశారని ఆయన వివరించారు. పేదలులేని ప్రపంచస్థాయి రాజదాని కావాలని రాజధాని రైతులు కోరుకుంటున్నారని, తాము మాత్రం పేదలు సైతం రాజధానిలో ఇళ్లు కట్టుకుని ఉండాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే పేదల కోసం ఆర్ 5 జోన్ను ఏర్పాటుచేసి, వందల ఎకరాల భూమిని కేటాయించామన్నారు. రాజధాని రైతుల వాదనను పరిగణనలోకి తీసుకోవద్దని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ అంటరానితనం ఆలోచనలు ఉండటం దురదృష్టకరమని సుధాకర్రెడ్డి తెలిపారు. సీఆర్డీఏ తరఫు న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్–57 ప్రకారం పూలింగ్ ద్వారా సమీకరించిన భూమిపై సర్వహక్కులు సీఆర్డీఏకే ఉంటాయన్నారు. ఆ భూమి సీఆర్డీఏ ఆస్తి అవుతుందే తప్ప, రైతులది కాదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, ఇప్పటికే ఇదే అంశంపై దాఖలైన వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోందని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పడంతో ఈ వ్యాజ్యాన్ని సైతం త్రిసభ్య ధర్మాసనానికి నివేదిస్తున్నట్లు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వుల నిమిత్తం ఈ వ్యాజ్యాన్ని ఆయన ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇళ్లు కావాలని ఎవరూ అడగలేదు.. రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా ఆర్ 5 జోన్ను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ను సవాలు చేస్తూ గుంటూరు జిల్లా, కృష్ణాయపాళెం గ్రామానికి చెందిన రైతు అవల నందకిషోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం జస్టిస్ కృష్ణమోహన్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ వాదనలు వినిపిస్తూ, రాజధాని ప్రాంతంలో తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రజలెవ్వరూ కోరలేదన్నారు. గ్రామసభల్లో రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. పేదల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చట్ట ప్రకారం చేయాల్సిన పనిని గత ప్రభుత్వం విస్మరించిందని, ఆ తప్పును సరిదిద్ది మాస్టర్ ప్లాన్కు ఓ విలువను తీసుకొచ్చామని, దాన్ని కూడా పిటిషనర్ తప్పుపడుతున్నారని తెలిపారు. పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే రాజధాని ప్రాంతంలో 900 ఎకరాలను పేదల కోసం కేటాయించామని చెప్పారు. ప్రజలు తమకు ఫలానాది కావాలని అడిగేంత వరకు ప్రభుత్వాలు ఎదురుచూడవని.. వారి అవసరాలను గుర్తించడమే ప్రభుత్వ విధి అన్నారు. ఇదే అంశంపై త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది.. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని, తరువాత పూర్తిస్తాయిలో విచారణ జరుపుతామన్నారు. ఈ సమయంలో ఇంద్రనీల్.. ఇదే అంశంపై దాఖలైన వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోందని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. తమకు ఏ ధర్మాసనమైనా ఒక్కటేనని, తాము చట్ట ప్రకారమే ఆర్ 5 జోన్ను ఏర్పాటుచేశామని సుధాకర్రెడ్డి చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ వ్యాజ్యాన్ని త్రిసభ్య ధర్మాసనానికి నివేదించారు. దీనిపై తగిన ఉత్తర్వులు జారీచేసేందుకు ఈ వ్యాజ్యాన్ని సీజే ముందుంచాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు. -
మా భూమి.. మాకే కౌలు
సాక్షి, అమరావతి: టీడీపీ పెద్దలు తమను మభ్యపెట్టి కాజేసిన అసైన్డ్ భూములను తిరిగి దక్కించుకునేందుకు రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు గతంలోనే పలువురు అసైన్డ్ రైతులు రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు సమర్పించగా మంగళవారం విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయానికి చేరుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు అక్రమంగా దక్కించుకున్న తమ అసైన్డ్ భూములను తిరిగి ఇప్పించాలని కోరారు. అసైన్డ్ భూములకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా గత ప్రభుత్వం తీసుకుంటుందని బెదిరించి తమ వద్ద నుంచి కాజేశారని సీఆర్డీఏ అధికారుల దృష్టికి తెచ్చారు. తమ భూములను కారుచౌకగా తీసుకున్న తరువాత టీడీపీ సర్కారు వాటికి ప్యాకేజీని ప్రకటించిందన్నారు. ఇప్పటికీ అవి రెవెన్యూ రికార్డుల్లో తమ పేరిటే ఉన్నాయని గుర్తుచేశారు. టీడీపీ నేతలు వాటిని భూసమీకరణ కింద సీఆర్డీఏకు ఇచ్చినట్లు చూపటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అసైన్డ్ భూములకు సీఆర్డీఏ ఇస్తున్న కౌలును తమకే చెల్లించాలని వినతిపత్రం అందించారు. భూసమీకరణ కింద అసైన్డ్ రైతులకు అందిస్తున్న ప్యాకేజీ తమకే ఇవ్వాలని, లేదంటే తమ భూములు తమకు తిరిగిస్తే సాగు చేసుకుంటామని విజ్ఞప్తి చేశారు. ఇకనైనా న్యాయం చేయాలి ‘టీడీపీ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. న్యాయం చేయాలని గతంలో అధికారులను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని సీఆర్డీయే అధికారులకు వినతి పత్రం సమరి్పంచాం. ప్రభుత్వం స్పందించి మా భూముల కౌలు మాకే ఇప్పించాలని కోరుతున్నాం. – టి.బాబూరావు, అసైన్డ్ రైతు, రాయపూడి బెదిరించి తీసుకున్నారు.. అసైన్డ్ భూమికి పరిహారం ఇవ్వరని టీడీపీ సర్కారు ప్రచారం చేసి మమ్మల్ని మోసం చేసింది. దీంతో భయపడి టీడీపీ నేతలకు అమ్మేందుకు ఒప్పుకున్నాం. కానీ తరువాత మా నిర్ణయం మార్చుకున్నాం. ఇప్పటికీ ఆ భూములు మాపేరునే రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. సీఆర్డీయే రికార్డుల్లో కూడా వాటిని మా పేరిట మార్చాలని కోరాం. – ఆర్.పున్నారావు, అసైన్డ్ రైతు, రాయపూడి మా భూములిస్తే సాగు చేసుకుంటాం ‘అసైన్డ్ భూమికి ప్రభుత్వం పరిహారం ఇవ్వదని టీడీపీ నేతలు, దళారులు మమ్మల్ని ఆందోళనకు గురి చేశారు. ఎకరం రూ.కోటి పలికే భూమికి మాకు కేవలం రూ.6 లక్షలే ఇచ్చారు. మేం సంతకాలు చేసిన తరువాత టీడీపీ ప్రభుత్వం అసైన్డ్ భూములకు ప్యాకేజీ ప్రకటించింది. టీడీపీ పెద్దలు మోసం చేశారు. మా భూములు రిజిస్ట్రే షన్ కాలేదు కాబట్టి ప్యాకేజీ మాకే ఇవ్వాలి. లేదా మా భూములు మాకు తిరిగిస్తే సాగు చేసుకుంటాం. – రేమర్ల కోటేశ్వరరావు, అసైన్డ్ రైతు, వెంకటపాలెం ప్యాకేజీ, కౌలు ఇప్పించండి ‘మా భూమి పెండింగ్ రిజిస్ట్రేషన్లో ఉంది. సీఆర్డీయే రికార్డుల్లో మాత్రం టీడీపీ నేతల పేరిట ఉంది. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలి. భూసమీకరణ ప్యాకేజీ, కౌలు మాకే ఇప్పించాలి’ – వి.నరసింహారావు, అసైన్డ్ రైతు, రాయపూడి -
ఆ వ్యాజ్యాలనూ మేమే విచారిస్తాం
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి సైతం ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా సీఆర్డీఏ చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి, అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, మరికొందరు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ద్విసభ్య ధర్మాసనం ముందున్న ఆ వ్యాజ్యాలను సైతం తామే విచారిస్తామని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.ఆ వ్యాజ్యాలను తమ ముందుంచాలని సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం హైకోర్టు రిజిస్ట్రీని సోమవారం ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 27వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలావుంటే రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని 6 నెలల్లో అభివృద్ధి చేయాలంటూ ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర అధికారులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారని, వీరి చర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించి, వారిని శిక్షించాలంటూ రాజధాని రైతులు దోనె సాంబశివరావు, తాటి శ్రీనివాసరావు, మరికొందరు దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యాలపై విచారణను కూడా ఫిబ్రవరి 27కి వాయిదా వేసింది. రాజధాని వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై తాము ఇప్పుడు విచారణ జరపడం సబబు కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్రాయ్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని 6 నెలల్లో అభివృద్ధి చేయాలంటూ ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర అధికారులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారని, వీరి చర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించి, వారిని శిక్షించాలంటూ రాజధాని రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యాలు సోమవారం విచారణకు వచ్చాయి. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ.. అమరావతి రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిందని తెలిపారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రాజధాని అభివృద్ధి విషయంలో హైకోర్టు నిర్ధేశించిన కాల పరిమితులపై స్టే విధించిందన్నారు. ఈ నెల 31న సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై మరోసారి విచారణ జరపనున్న దృష్ట్యా విచారణను ఫిబ్రవరికి వాయిదా వేయడం మేలన్నారు. అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి, సీఆర్డీఏ తరఫు న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి తమ వాదనలు వినిపిస్తూ.. రాజధాని ప్రాంతంలో ఇతరులకు సైతం ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా ప్రభుత్వం చట్ట సవరణ చేసిందన్నారు. ఈ నేపథ్యంలో ఆ వ్యాజ్యాలన్నీ నిరర్థకం అవుతాయని, ఆ మేరకు మెమో కూడా దాఖలు చేశామన్నారు. ఈ మెమోకు కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లను ధర్మాసనం ఆదేశించిందని, అయినప్పటికీ కౌంటర్ దాఖలు చేయలేదని తెలిపారు. కౌంటర్ దాఖలు చేయకపోవడమే కాక, ప్రధాన అభ్యర్థనను సవరిస్తూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారన్నారు. అంతేకాక చట్ట సవరణను సవాల్ చేస్తూ పిటిషనర్లు ద్విసభ్య ధర్మాసనం ముందు పిటిషన్లు దాఖలు చేశారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ వ్యాజ్యాలను జీవో 107ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాలతో జత చేయాలని వారు త్రిసభ్య ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీంతో ద్విసభ్య ధర్మాసనం ముందున్న వ్యాజ్యాలను తమ ముందుంచాలంటూ త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ విషయం మాకెందుకు చెప్పలేదు పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన సాయిసంజయ్ సూరనేని వాదనలు వినిపిస్తూ.. చట్ట సవరణపై తాము దాఖలు చేసిన వ్యాజ్యాలపై ద్విసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోందన్నారు. విచారణ ముగిసేంత వరకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయబోమంటూ ద్విసభ్య ధర్మాసనం ముందు ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ హామీని గతంలో దాఖలైన వ్యాజ్యాలకు సైతం వర్తింప చేయాలని కోరారు. దీనిపై త్రిసభ్య ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఇదే అంశంపై ద్విసభ్య ధర్మాసనం ముందు పిటిషన్లు దాఖలు చేసిన విషయాన్ని తమ దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత పిటిషనర్లపై ఉందని తేల్చి చెప్పింది. ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారంపై త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయాన్ని ద్విసభ్య ధర్మాసనానికి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించింది. ద్విసభ్య ధర్మాసనం ముందున్న వ్యాజ్యాలను కూడా తామే విచారిస్తామని స్పష్టం చేసింది. -
ఎంఐజీ ప్లాట్ల బుకింగ్కు గడువు పెంపు
సాక్షి, అమరావతి: మంగళగిరిలోని ‘జగనన్న స్మార్ట్ టౌన్షిప్’లో ప్లాట్ల కొనుగోలు కోసం ఆన్లైన్లో బుకింగ్కు డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ఏపీ సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ–వేలంలో ప్లాట్ల కొనుగోలుకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు శనివారంతో ముగిసిందని, అయితే, కొనుగోలుదారుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు గడువు పొడిగించినట్లు వివరించారు. ఇక్కడి ఎంఐజీ లే అవుట్–2లో 200 చ.గ. ప్లాట్లు 68, 240 చ.గ. ప్లాట్లు 199, మొత్తం 267 ఉన్నాయని తెలిపారు. చదరపు గజం ధర రూ.17,499గా నిర్ణయించామని, కొనుగోలుదారులకు రాయితీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానికంగా నివసిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు 10% ప్లాట్లు రిజర్వు చేయడంతోపాటు 20% రాయితీ ఇస్తున్నామని, స్థానిక విశ్రాంత ఉద్యోగులకు 5% ప్లాట్లను రిజర్వు చేసినట్లు తెలిపారు. ఈ–వేలంలో ప్లాట్లు పొందినవారు సులభ వాయిదాల్లో డబ్బులు చెల్లించే సౌకర్యం కూడా ఉందన్నారు. ఆన్లైన్ బుకింగ్ అనంతరం ఈ–వేలం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎంఐజీలో ప్లాట్లు కొనుగోలు చేసేవారికి ప్రభుత్వం మరో మంచి అవకాశం కల్పిస్తోందని, ప్లాట్ నికర అమ్మకపు ధరలో 60% మీద మాత్రమే రిజిస్ట్రేషన్ చార్జీలు ఉంటాయని, మిగిలిన 40 శాతం మీద మినహాయించినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు https://migapdtcp.ap.gov.in, https://crda. ap. gov. in వెబ్సైట్, లేదా 0866– 2527124 నంబర్లో గానీ సంప్రదించవచ్చు. -
సీఆర్డీఏ చట్టసవరణపై విచారణ 9కి వాయిదా
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి కూడా ఇళ్లస్థలాలు కేటాయించేందుకు వీలుగా ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని సవరించడంపై రాజధాని రైతుపరిరక్షణ సమితి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. ఇదే అంశంపై దాఖలైన మరో వ్యాజ్యాన్ని ప్రస్తుత వ్యాజ్యానికి జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉపమాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. తాజా సవరణ చట్టం ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉందన్నారు. అందువల్ల మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని, వీలైనంత త్వరగా ఈ వ్యాజ్యంపై విచారణ జరపాలని కోరారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి స్పందిస్తూ.. ఇదే అంశంపై మరో వ్యాజ్యం దాఖలైందని తెలిపారు. దాన్ని కూడా ప్రస్తుత వ్యాజ్యంతో జతచేయాలని అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను వాయిదా వేసింది. -
ఇన్సూరెన్స్ రంగంలో ‘బీమా సుగమ్’ గేమ్ చేంజర్
న్యూఢిల్లీ: బీమా సుగమ్ అన్నది బీమా రంగం స్వరూపాన్నే మార్చేస్తుందని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) చైర్మన్ దేవాశిష్ పాండా అన్నారు. బీమా పాలసీల విక్రయం, కొనుగోలు, రెన్యువల్ (పునరుద్ధరణ), క్లెయిమ్ల పరిష్కారం సహా అన్ని రకాల సేవలను అందించే ఏకీకృత ప్లాట్ఫామ్గా ఉంటుందన్నారు. దేశంలో బీమా వ్యాప్తి విస్తరణకు ఈ టెక్నాలజీ పోర్టల్ సాయంగా నిలుస్తుందన్నారు. కస్టమర్లకు సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇస్తుందన్నారు. యూపీఐ విప్లవం వంటిది... బీమా రంగానికి బీమా సుగమ్ అన్నది యూపీఐ విప్లవం వంటిదని వ్యాఖ్యానించారు. బీమా కంపెనీలు ఈ ప్లాట్ఫామ్లో భాగం కావాలని పిలుపునిచ్చారు. బీమా ఏజెంట్లు, వెబ్ అగ్రిగేటర్లు సహా అన్ని రకాల మధ్యవర్తులకూ ఈ పోర్టల్ యాక్సెస్ ఉంటుందని చెప్పారు. పాలసీదారులు ఈ పోర్టల్ నుంచి నేరుగా ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవచ్చన్నారు. బీమాకు సంబంధించి దీన్నొక షాపింగ్ మాల్గా పాండా అభివర్ణించారు. -
అమరావతిలో అందరికీ ఆవాసం
సాక్షి, అమరావతి: సామాన్యులకూ ఇకపై అమరావతి ప్రాంతంలో ఇల్లు కట్టుకుని స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం చట్ట ప్రకారం కల్పించింది. అక్కడ బయటి వారు నివసించకుండా న్యాయ వివాదాలతో అడ్డుకుంటున్న విపక్షాల కుట్రలను ఛేదిస్తూ మంగళగిరి, తుళ్లూరు మండలాల్లోని 5 గ్రామాల్లో 900.97 ఎకరాలను ఆర్–5 జోన్గా చట్ట ప్రకారం ఏర్పాటు చేసింది. ఆర్థికంగా వెనుకబడ్డ ప్రజలంతా ఎలాంటి ఆంక్షలు లేకుండా గృహాలను నిర్మించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చట్టం చేసింది. ఈ మేరకు కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఇనవోలు గ్రామాలను కొత్త జోన్ పరిధిలోకి తెచ్చింది. 2020లోనే ఈ ప్రాంతంలో సామాన్యులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం కాగా విపక్షాలు న్యాయ వివాదాలు సృష్టించాయి. చట్ట ప్రకారమే 5 శాతం సీఆర్డీఏ చట్టం 2014 సెక్షన్–53 (డి) ప్రకారం మొత్తం విస్తీర్ణంలో ఐదు శాతం భూమిని ల్యాండ్ పూలింగ్ కింద పేదల నివాసాలకు కేటాయించవచ్చు. అందుకోసం స్థానిక సంస్థలు లేదా ప్రత్యేకాధికారుల అనుమతితో మాస్టర్ ప్లాన్ లేదా జోనల్ డెవలప్మెంట్ ప్లాన్కు తగినట్లుగా మార్పులు చేయవచ్చు. ఆ ప్రకారమే ఆర్–5 జోన్ ఏర్పాటు కానుంది. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు 15 రోజులు గడువిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు, కాలుష్య రహిత కార్యకలాపాలు లాంటి వాటిని పది అంతర్గత జోన్లుగా పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో పాటించే నిబంధనలను గెజిట్లో పొందుపరిచింది. పేదలకు మేలు జరిగితే సహించని ‘ఈనాడు’ నిరుపేదలు, ఆర్థికంగా వెనుబడినవారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 35 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలను అందచేసింది. సొంతిల్లు లేనివారు ఉండరాదనే ఉద్దేశంతో అన్ని నియోజకవర్గాలు, పట్టణాలు, పంచాయితీల్లో సైతం ల్యాండ్ పూలింగ్ విధానాన్ని తెచ్చింది. ఆయా ప్రాంతాల్లో సొంతిల్లు లేనివారు దరఖాస్తు చేసుకుంటే ఎప్పుడైనా నిబంధనల మేరకు స్థలం కేటాయించేలా ఉత్తర్వులిచ్చింది. ఇదే విధానాన్ని అమరావతి ప్రాంతంలోనూ అనుసరించనుంది. శాసన రాజధానిలో సామాన్యులు సైతం కాలు మోపేలా అవకాశం కల్పిస్తుంటే సహించలేని ‘ఈనాడు’ విషం కక్కుతోంది. సీఎం జగన్ పేదల పక్షపాతి పేదలు నివసించలేని రాజధాని అందరి రాజధాని ఎలా అవుతుంది? రాజధాని గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ సీఆర్డీఏ చట్టానికి సవరణ చేయడం అభినందనీయం. అన్ని వర్గాలకు చోటు కల్పించినప్పుడే అది అందరి రాజధాని అవుతుంది. ముఖ్యమంత్రి జగన్ ఎల్లప్పుడూ పేదల పక్షాన ఉంటానని మరోసారి నిరూపించారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను అడ్డుకుంటే అది మూర్ఖత్వమే. – రేటూరి కిషోర్, సీనియర్ న్యాయవాది (మంగళగిరి) సామాజిక న్యాయం అంటే ఇదీ.. రాజధాని అంటే అన్ని వర్గాల ప్రజలు నివసించేదిలా ఉండాలి. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందని అనడం ఒక్క వర్గం ప్రజలపై వివక్ష చూపడమే అవుతుంది. సీఎం జగన్ ప్రభుత్వం అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ చట్ట సవరణ చేయడం గొప్ప పరిణామం. సామాజిక న్యాయం అంటే ఇదీ. – మునగాల మల్లేశ్వరరావు, రాజకీయ నేత, మంగళగిరి అన్ని వర్గాలుండాలి ప్రజా రాజధాని అంటే అన్ని వర్గాల ప్రజలుండాలి. కోటీశ్వరుడి నుంచి కూటి కోసం తిప్పలు పడే వారి వరకు అందరికీ చోటివ్వాలి. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్కతాలో అన్ని వర్గాల ప్రజలున్నారు. అమరావతిలో మాత్రం పేదలు వద్దని టీడీపీ నేతలు అనడం అన్యాయమే. ఆర్–5 జోన్ ఏర్పాటు మంచి నిర్ణయం. – వై.జయరాజు, న్యాయవాది (కర్నూలు) గొప్ప విషయం.. అమరావతి ప్రాంతంలో బయటివారు నివాసాలు ఏర్పాటు చేసుకోరాదని టీడీపీ కోర్టుల్లో కేసులు పెట్టింది. రాష్ట్రంలో ప్రజలు ఎక్కడైనా స్వేచ్ఛగా స్థలం కొని ఇల్లు కట్టుకునేలా జగనన్న ప్రభుత్వం అవకాశం కల్పించింది. సీఎం జగన్ గొప్ప పని చేశారు. ప్రతిపక్షం కోర్టులకు వెళ్లడం సిగ్గుచేటు. – రామాంజనేయులు, డీసీసీబీ డైరెక్టర్, బ్రహ్మసముద్రం సముచిత నిర్ణయం పేదల కోసం సీఆర్డీఏ చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నాం. ప్రాంతం ఏదైనా అన్నిచోట్లా అందరికీ జీవించే హక్కు ఉంటుంది. ఆర్థిక స్తోమతను బట్టి ఫలానా వ్యక్తులు మాత్రమే ఉండాలనడం సరికాదు. రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన ఆలోచించి సముచిత నిర్ణయం తీసుకుంది. – ఏలూరి సుబ్రహ్మణ్యం, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, కాకినాడ పేదల పక్షపాతి అర్హులైన పేదలకు అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించడం సరైన నిర్ణయం. దీన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ కోర్టులకెక్కి అడ్డుకుంది. పేదలకు న్యాయం చేకూర్చాలనే దృఢసంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ ముందడుగు వేశారు. పేదల పక్షపాతిగా మరోసారి రుజువు చేసుకున్నారు. – కాపు రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్(రాయదుర్గం) హర్షిస్తున్నాం.. అమరావతిని ఒక సామాజిక వర్గానికే పరిమితం చేస్తూ టీడీపీ సర్కారు సీఆర్డీఏ చట్టంలో పలు నిబంధనలు పెట్టి స్వార్ధపూరితంగా వ్యవహరించింది. సీఎం జగన్ 900.97 ఎకరాలను పేదల నివాసానికి కేటాయించడం హర్షించదగ్గ విషయం. పేద ప్రజలకు మేలు చేసే అమరావతిలో మరిన్ని సంస్కరణలు తేవాలి. – చింతా కృష్ణయ్య, సీనియర్ న్యాయవాది, ధర్మవరం తప్పిదాన్ని సరిదిద్దారు.. రాజధాని ప్రాంతంలో పేదలకు చోటు కల్పించకుండా కులవాదులు అంతా ఏకమయ్యారు. పేదలకు స్థలాలిస్తే సామాజిక అసమతుల్యత ఏర్పడుతుందని కోర్టుల్లో కేసులు వేశారు. చారిత్రక తప్పిదాన్ని సీఎం జగన్ సరిచేశారు. పేదలు, బడుగులకు 900 ఎకరాలు కేటాయించడం గొప్ప విషయం. అసమానతలు లేని సమాజ నిర్మాణానికి ఇది దారి తీస్తుంది. – మాదిగాని గురునాథం, సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు (విజయవాడ) (తుళ్లూరులో ముడు రాజధానుల శిబిరం నిర్వాహక నాయకులు) సామాజిక సమత్యులత సాకారం అమరావతిలో టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే సీఎం జగన్ పేదలకు 900 ఎకరాలకుపైగా కేటాయించటం సంతోషకరం. ఇకపై పేదలు, మధ్య తరగతి, సామాన్య వర్గాలు సైతం అమరావతి మా రాజధాని అనే చెప్పుకునేలా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది. సామాజిక సమతుల్యత స్పష్టంగా కనిపిస్తోంది. –– పోలూరి వెంకటరెడ్డి, బార్ అసోసియేషన్, మాజీ అధ్యక్షుడు అణగారిన వర్గాలకు పెద్దపీట.. అణగారిన వర్గాలకు పెద్దపీట వేసేలా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతం. టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం, దోపిడీ కోసమే వేలాది ఎకరాలను లాక్కున్నారు. కనీసం సాగు భూమిని వదిలివేయాలన్న ఆలోచన కూడా లేకుండా భూ దాహంతో వ్యవహరించారు. రాజధాని అంటే సంపన్న వర్గాలకే కాకుండా అణగారిన వర్గాలకు కూడా చోటు కల్పించాలి. ––– చెన్నంశెట్టి చక్రపాణి (విశ్రాంత ఎస్పీ, న్యాయవాది) -
పచ్చ గద్దల భూ దందాపై ‘అసైన్డ్’ తిరుగుబాటు
సాక్షి, అమరావతి: పచ్చ గద్దల భూ దందాపై అసైన్డ్ రైతులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అమరావతిలో టీడీపీ పెద్దలు కాజేసిన తమ అసైన్డ్ భూములు తిరిగి దక్కించుకునేందుకు ఉద్యుక్తులమవుతున్నారు. రిజిస్ట్రేషన్ చేయని ఆ భూముల ప్యాకేజీ తమకే దక్కాలని, వాటిని వెనక్కి ఇస్తే సాగు చేసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. 964 ఎకరాల అసైన్డ్ భూ దోపిడీపై ‘సాక్షి’కథనాలతో చైతన్యమైన అసైన్డ్ రైతులు రెవెన్యూ కార్యాలయాల తలుపుతడుతున్నారు. అమరావతిలో పలు గ్రామాల రైతులు రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. ఇది 29 గ్రామాలకూ విస్తరిస్తుండటంతో టీడీపీ పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తప్పుడు రికార్డులు సవరించాలి అమరావతి గ్రామాల్లో అసైన్డ్ రైతులు సంఘటితమవుతున్నారు. చిన్న పాయగా మొదలైన ఈ ఉద్యమం ఊపందుకుంటోంది. నవులూరు, కురగల్లు, ఎరబాలెం తదితర గ్రామాలకు చెందిన అసైన్డ్ రైతులు రెండు రోజులుగా మంగళగిరి తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములు తమవేనని, వాటిని ఎవరికీ విక్రయించలేదని పేర్కొంటున్నారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతలు పోలీసులతో బెదిరించి రాత్రికి రాత్రి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తరలించి బలవంతంగా సంతకాలు చేయించారని వెల్లడించారు. ఆ భూములను రిజిస్ట్రేషన్ చేసేందుకు చట్టం సమ్మతించకపోవడం తమకు కాస్త ఊరట నిచ్చిందన్నారు. ఆ భూములు ఇప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో తమ పేరిటే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. వాటిని టీడీపీ నేతలు భూసమీకరణ కింద సీఆర్డీఏకు ఇచ్చినట్లు తప్పుగా చూపటాన్ని సరిచేయాలని డిమాండ్ చేస్తున్నారు. భూసమీకరణ కింద అసైన్డ్ భూములకు చెల్లించిన ప్యాకేజీ తమకే ఇవ్వాలని, అందుకు సమ్మతించకుంటే తమ భూములు తమకు తిరిగిస్తే సాగు చేసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. రూ.కోటి భూమికి రూ.6 లక్షలే మాకు కురగల్లులో 3.36 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. టీడీపీ నేతలు, దళారులు మమ్మల్ని ఆందోళనకు గురి చేసి ఎకరం రూ.కోటి పలికే భూమిని రూ.6 లక్షలకే కాజేశారు. మేం సంతకాలు చేశాక టీడీపీ ప్రభుత్వం అసైన్డ్ భూములకు ప్యాకేజీ ప్రకటించింది. మమ్మల్ని టీడీపీ పెద్దలు మోసం చేశారు. మా భూములు రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి వాటి ప్యాకేజీ మాకే ఇవ్వాలి. లేదా మా భూములు మాకు తిరిగిస్తే సాగు చేసుకుంటాం. – మార్కంపూడి అశోక్, అసైన్డ్ రైతు, కురగల్లు అసైన్డ్ ఖాతాలో పట్టా భూమి మా కుటుంబానికి ఐదెకరాల పట్టా భూమి ఉంది. రాజధాని ప్రకటించిన తరువాత అది అసైన్డ్ భూమి అని బెదిరించడంతో భయపడి టీడీపీ నేతలకు విక్రయించేందుకు ఒప్పుకున్నాం. తరువాత నిర్ణయం మార్చుకోవడంతో పోలీస్ స్టేషన్కు పిలిచి బెదిరించారు. మా భూమి మాకు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – దావు బిచ్చారావు, రైతు, ఎర్రబాలెం న్యాయం చేయాలి.. మాకు 1.10 ఎకరాల భూమి ఉంది. టీడీపీ నేతలు, పోలీసులు మమ్మల్ని బెదిరించి తక్కువ ధరకు విక్రయించేలా ఒప్పించారు. బలవంతంగా అర్థరాత్రి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తరలించి సంతకాలు తీసుకున్నారు. మా భూమి పెండింగ్ రిజిస్ట్రేషన్లో ఉంది. సీఆర్డీఏ రికార్డుల్లో మాత్రం టీడీపీ నేతల పేరిట ఉంది. మాకు న్యాయం చేయాలి. భూసమీకరణ ప్యాకేజీ, కౌలు మాకే ఇప్పించాలి. – నాగేశ్వరరావు, అసైన్డ్ రైతు, ఎర్రబాలెం -
పత్రాలు మార్చి అసైన్డ్ అరాచకం.. బాబు హయాంలో భారీ భూ కుంభకోణం!
సాక్షి, అమరావతి: వడ్డించేవాడు మనోడైతే కడ బంతిలో కూర్చున్నా ఫర్వాలేదంటారు! పాలకుడు తమవాడైతే బరితెగించి భూదోపిడీకి పాల్పడవచ్చని టీడీపీ పెద్దలు నిరూపించారు! అమరావతి ముసుగులో ఏకంగా 964 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టిన భారీ కుంభకోణం వెనక చంద్రబాబు సర్కారు పన్నాగం తాజాగా వెలుగు చూసింది. నిబంధనలు ఉల్లంఘించి.. పత్రాలు మార్చి.. అందర్నీ ఏమార్చి ప్రత్యేకంగా జీవోలు జారీ చేసి చట్టబద్ధంగా భూ దోపిడీకి వేసిన స్కెచ్ బహిర్గతమైంది. అమరావతిలో అసైన్డ్ భూములను కాజేసేందుకు టీడీపీ పెద్దలు రెండంచెల వ్యూహం వేశారు. అయితే సాంకేతికపరమైన అంశాలు ప్రతిబంధకంగా మారడంతో మూడో ఎత్తుగడగా భూ దోపిడీకి రాజముద్ర వేస్తూ జీవోలు జారీ చేశారు. రూ.4 వేల కోట్ల విలువైన భూ దోపిడీ కోసం చంద్రబాబు సర్కారు అమలు చేసిన పన్నాగం ఇదిగో.. రెండంచెల్లో అసైన్డ్ భూ దోపిడీ అమరావతి కోర్ క్యాపిటల్ పరిధిలోని 29 గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు చెందిన 964 ఎకరాల అసైన్డ్ భూములను సొంతం చేసుకునేందుకు టీడీపీ పెద్దలు తొలుత రెండంచెల పన్నాగాన్ని అమలు చేశారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అసైన్డ్ భూములను ప్రభుత్వం తీసుకుంటుందంటూ రెవెన్యూ, సీఆర్డీఏ అధికారుల ద్వారా విస్తృత ప్రచారం చేశారు. అనంతరం టీడీపీ ముఖ్య నేతల దళారీలు గ్రామాల్లో వాలిపోయారు. ప్రభుత్వానికి అప్పగిస్తే పరిహారం ఏమీ రాదని ఆందోళనకు గురి చేయడంతో పేద అసైన్డ్ రైతులు చేసేదిలేక వారికే విక్రయించేలా ఒప్పందం చేసుకున్నారు. ఇలా అసైన్డ్ భూ దోపిడీ వ్యవహారాన్ని 2014 జూన్ నుంచి 2015 డిసెంబరులోగా పూర్తి చేశారు. ఆ భూములన్నీ టీడీపీ నేతలు, వారి బినామీల గుప్పిట్లోకి వచ్చిన తరువాత అసైన్డ్ భూములకు కూడా పరిహారం ఇస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం 2016 ఫిబ్రవరి 17న జీవో 41 జారీ చేసింది. రూ.4 వేల కోట్ల విలువైన అసైన్డ్ భూములు తమ హస్తగతమయ్యాయని భావించింది. అసైన్డ్ భూములను టీడీపీ నేతలకు విక్రయించినట్లు మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేసేందుకు యత్నించారు. అయితే వీటిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పెండింగ్ రిజిస్ట్రేషన్లుగా నమోదు చేశారు. మరోవైపు ఆ భూములను రాజధాని కోసం భూ సమీకరణ కింద టీడీపీ నేతలు, వారి బినామీలు ఇచ్చినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో నమోదు చేయడం గమనార్హం. సబ్ రిజిస్ట్రార్ రికార్డుల్లో భూములు అసైన్డ్ రైతుల పేరున ఉండగా సీఆర్డీఏ రికార్డుల్లో మాత్రం టీడీపీ నేతలు, బినామీలు ఇచ్చినట్లు చూపించారు. ఏమార్చిన విధానం ఇలా.. టీడీపీ నేతల పేరిట అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్కు నిబంధనలు అడ్డంకిగా మారడంతో చంద్రబాబు ప్రభుత్వం భూ కుంభకోణంలో మూడో అంకానికి తెర తీసింది. 2018 మే 18న జీవో 258, నవంబరు 16న జీవో 575, 580 జీవోలు జారీ చేసింది. 1954 జూన్కు ముందు కేటాయించిన అసైన్డ్ భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు అందులో ప్రకటించింది. 22 ఏ జాబితా నుంచి తొలగించింది. టీడీపీ నేతలు దక్కించుకున్న అసైన్డ్ భూములన్నీ 1954 జూన్కు ముందే రైతులకు కేటాయించినవిగా చూపించి అధికారికంగా కాజేసే ఎత్తుగడ వేసింది. ఆమేరకు తహశీల్దార్ కార్యాలయాల్లో రికార్డులను తారుమారు చేశారు. అనంతరం జీవోలు 258, 575, 580 ద్వారా సీఆర్డీఏ కార్యాలయంలో కథ నడిపించారు. అయితే అమరావతిలో అసైన్డ్ భూములన్నీ 1970 నుంచి 1995 మధ్యలో కేటాయించినవే కావడం గమనార్హం. ఈ క్రమంలో అసైన్డ్ భూములన్నీ 1954కు ముందే కేటాయించినట్లుగా చూపిస్తూ వాటిని సొంతం చేసుకున్న టీడీపీ నేతలు భూ సమీకరణ కింద సీఆర్డీఏకు ఇవ్వడాన్ని క్రమబద్ధీకరించే ప్రక్రియ చేపట్టారు. 2019లో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చేసరికి దాదాపు 400 పెండింగ్ రిజిస్ట్రేషన్లను సీఆర్డీఏ రికార్డుల్లో ఇలా క్రమబద్ధీకరించేశారు. భూ సమీకరణ ప్యాకేజీ కింద ఇచ్చే నివాస, వాణిజ్య స్థలాలతోపాటు ఏటా పంట పరిహారం టీడీపీ పెద్దల బినామీలకే దక్కేలా స్కెచ్ వేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను నిండా ముంచారు. 2019లో మళ్లీ అధికారంలోకి వస్తే మొత్తం 964 ఎకరాలను టీడీపీ పెద్దల పేరిట క్రమబద్ధీకరించాలని భావించారు. కానీ చంద్రబాబు ఒకటి తలిస్తే దైవం మరోలా తలచింది. టీడీపీ ఘోర పరాజయంతో చంద్రబాబు అసైన్డ్ భూముల కుంభకోణం కథ అడ్డం తిరిగింది. జీవోలిచ్చి క్రమబద్ధీకరణ.. ► కురగల్లులో సర్వే నంబరు 538, 316/2, 534తో ఉన్న 2.46 ఎకరాల అసైన్డ్ భూములను టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న నారాయణకు సన్నిహితుడైన తేళ్ల శ్రీనివాసరావు (మైత్రి ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్) కొనుగోలు చేశారు. 2015 సెప్టెంబరు 4న ఆ లావాదేవీని సబ్ రిజిస్ట్రార్ పెండింగ్ రిజిస్ట్రేషన్ నంబర్ 593/2015గా నమోదు చేశారు. టీడీపీ ప్రభుత్వం 2018లో జీవోలు 258, 575, 580 జారీ చేసిన తరువాత 2019 మార్చి 5న వాటిని 4420/2019 నంబరుతో క్రమబద్ధీకరించేశారు. ► ఇదే తరహాలో 3534/2015 పెండింగ్ రిజిస్ట్రేషన్ను 2018 డిసెంబరులో 14113/18 నంబరుతో క్రమబద్ధీకరించేశారు. ఇంకేం రుజువులు కావాలి? మా కుటుంబానికి ప్రభుత్వం 1987లో రెండు ఎకరాల అసైన్డ్ భూమి కేటాయించింది. ఇదిగో ఆ పత్రం. అయితే మాకు అసైన్డ్ భూమిని 1954 కంటే ముందే కేటాయించినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో నమోదు చేశారు. మా భూమిని టీడీపీ నేతలు పంపిన దళారులు సీఆర్డీఏకి ఇచ్చినట్లుగా రికార్డుల్లో చేర్చి క్రమబద్ధీకరించేశారు. ప్యాకేజీ కింద స్థలాలు, కౌలు పరిహారం వారికే ఇస్తున్నారు. మేం కనీసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కూడా వెళ్లకున్నా టీడీపీ నేతల పేరిట క్రమబద్ధీకరించి మోసగించారు. – దావు మోహన్రావు, అసైన్డ్ రైతు, కురగల్లు -
తగ్గిన సీఆర్డీఏ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ధరలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీ సీఆర్డీఏ) ఎన్టీఆర్ , గుంటూరు జిల్లాల పరిధిలోని నాలుగు టౌన్షిప్ లలో ఉన్న ప్లాట్ల రిజిస్ట్రేషన్ ధరలను భారీగా తగ్గించింది. గతంలో నిర్ణయించిన ధరలు అధికంగా ఉండడంతో కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో అధికారులు ఆ ప్లాట్లకు అమ్మకపు ధర, అభివృద్ధి చార్జీలను వేర్వేరుగా విభజించారు. అందులో అమ్మకపు ధరకే రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించేలా మార్పు చేశారు. ప్లాట్ ధరలో నికర ధర 60 శాతంగా, అభివృద్ధి చార్జీలు 40 శాతంగా నిర్ణయించారు. ప్లాట్ నికర ధర 60 శాతానికి రిజిస్ట్రేషన్ ఫీజు ఎంతయితే అంత చెల్లిస్తే సరిపోతుంది. గతంలో ప్లాట్ ధర మొత్తానికి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి వచ్చేది. ఇది కొనుగోలుదారులకు భారంగా ఉండేది. దీంతో ఈ మార్పు చేశారు. పైగా, నికర ధరను ప్లాట్ పొందిన మూడు రోజుల్లో పది శాతం మాత్రమే చెల్లించాలి. మిగిలిన నికర ధర, అభివృద్ధి చార్జీలను ఏడాదిలో నాలుగు వాయిదాలుగా చెల్లించే అవకాశం కూడా కల్పించింది. కొనుగోలుదారులు ఒప్పందం కుదిరిన 5 నెలల లోపు మొత్తం ప్లాట్ ధరను ఒకేసారి చెల్లిస్తే అదనంగా 5 శాతం రాయితీ కూడా సీఆర్డీఏ ప్రకటించింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకుని రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు చేసినట్లు సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. నగరం మధ్యలో, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉన్న ఈ ప్లాట్లను ఇప్పుడు సామాన్యులు సైతం కొనేలా మార్పులు చేశామని, సులభమైన వాయిదా పద్ధతుల్లో నగదు చెల్లించేందుకు కూడా అవకాశం కల్పించినట్టు చెప్పారు. ఫోన్ ఓటీపీ ద్వారా ప్లాట్ల కొనుగోలుకు పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. విజయవాడ పాయకాపురం టౌన్షిప్, ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్, తాడేపల్లి–మంగళగిరి కార్పొరేషన్ పరిధిలోని అమరావతి టౌన్షిప్, తెనాలి చెంచుపేటలో నివాస, వాణిజ్య అవసరాలకు అనుగుణంగా మొత్తం 424 ప్లాట్లు ఉన్నాయి. ప్లాట్లు, ధరల వివరాలు సోమవారం నుంచి ఆన్లైన్లో ఉంటాయని, ఆసక్తి గలవారు https:// konugolu.ap.gov.in,, లేదా https://crda.ap.gov.in వెబ్సైట్లో అక్టోబర్ 10వ తేదీలోగా వన్టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు 10 శాతం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. ప్లాట్లకు అక్టోబర్ 13న ఈ–వేలం నిర్వహిస్తామన్నారు. ఇతర వివరాలకు 0866–2527124 నంబర్లో సంప్రదించవచ్చని చెప్పారు. ఈ ప్లాట్ల అమ్మకం ద్వారా వచ్చే మొత్తాన్ని అమరావతి ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధికి వెచ్చిస్తామని తెలిపారు. -
3 రాజధానులపై హైకోర్టు తీర్పును రద్దు చేయండి
సాక్షి, అమరావతి: మూడు రాజధానుల ఏర్పాటు నిమిత్తం చట్టం చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదంటూ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ ఏడాది మార్చి 3న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలంటూ స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేసింది. రాజధాని నగరాన్ని మార్చే లేదా రాజధానిని విభజించే లేదా మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో తీర్మానం, చట్టం చేసే శాసనాధికారం రాష్ట్రానికి లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని పిటిషన్లో పేర్కొంది. రాజ్యాంగం ప్రకారం ప్రతి రాష్ట్రానికీ తన రాజధానిని నిర్ణయించుకునే స్వతఃసిద్ధ అధికారం ఉంటుందని తెలిపింది. సీఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ చట్టాలను ఉపసంహరించిన తరువాత రాజధాని వ్యవహారంలో దాఖలైన వ్యాజ్యాలన్నీ నిరర్థకం అవుతాయని, అయినప్పటికీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆ వ్యాజ్యాలపై విచారణ జరిపి తీర్పు వెలువరించిందని ప్రభుత్వం తన పిటిషన్లో నివేదించింది. రాజ్యాంగంలోని అధికరణలు 3, 4లను అనుసరించి కేంద్రం తీసుకొచ్చిన చట్టం ద్వారా రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రానికి లేదని చెప్పడం లౌకిక సూత్రాలకు విరుద్ధమని తెలిపింది. రాజ్యాంగంలోని అధికరణ 258 ద్వారా కేంద్రం బదలాయించిన అధికారంతో రాష్ట్ర ప్రభుత్వం సీఆర్డీఏ చట్టం తెచ్చిందని హైకోర్టు తన తీర్పులో చెప్పిందని, వాస్తవానికి రాజ్యాంగంలోని లిస్ట్ రెండు 5వ ఎంట్రీలోని అధికారాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని తెచ్చిందని ప్రభుత్వం వివరించింది. అటు రాష్ట్రం గానీ, ఇటు కేంద్రం గానీ కేంద్రం బదలాయించిన అధికారం ద్వారా సీఆర్డీఏ చట్టాన్ని చేసినట్లు ఎక్కడా చెప్పలేదని నివేదించింది. పైపెచ్చు రాజధాని వ్యవహారం రాష్ట్రాల పరిధిలోనిదంటూ కేంద్రమే లిఖితపూర్వకంగా అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు నివేదించిందని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో గుర్తు చేసింది. ► అధికరణ 258 కింద ఉన్న కార్యనిర్వాహక, పాలన అధికారాలను మాత్రమే బదలాయించడం జరుగుతుంది కానీ శాసనాధికారాన్ని కాదని పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్లో తెలిపింది. సీఆర్డీఏ చట్టాన్ని కేంద్రం బదలాయించిన అధికారం ద్వారానే చేశామని అనుకుంటే, ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం ఏర్పాటైన కమిటీ చేసిన సిఫారసులకు విరుద్ధంగా అమరావతిని రాజధానిగా నిర్ణయించారని భావించాల్సి ఉంటుందని వివరించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేయడానికి ఇది ఓ ప్రధాన కారణమని నివేదించింది. కేంద్రం ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా తీసుకున్న నిర్ణయం కేంద్ర చట్టానికి విరుద్ధమైనప్పుడు దాన్ని హైకోర్టు సమర్థించగలదా? అన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న అని తెలిపింది. ► ల్యాండ్ పూలింగ్ స్కీం కింద నిర్వర్తించాల్సిన బాధ్యతలను నిర్వర్తించలేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో ప్రస్తావించింది. ల్యాండ్ పూలింగ్ స్కీం అమలుకు నిర్దేశించిన కాల పరిమితిని 2024 వరకు సీఆర్డీఏ ఇప్పటికే పొడిగించిందని, అందువల్ల ఈ వ్యవహారంపై హైకోర్టు విచారణ జరపాల్సిన ఎంత మాత్రం లేదని నివేదించింది. ఒప్పందాలకు అనుగుణంగా సీఆర్డీఏ, ల్యాండ్ పూలింగ్ నిబంధనల ప్రకారం ఆరు నెలల్లో రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని నిర్మించి, అభివృద్ధి చేయాలన్న హైకోర్టు ఆదేశాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో ప్రశ్నించింది. సీఆర్డీఏ చట్టం సెక్షన్ 58, ల్యాండ్ పూలింగ్ నిబంధనల ప్రకారం రాజధాని ప్రాంతంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ తదితర ప్రాథమిక మౌలిక సదుపాయాలతో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించటాన్ని ప్రభుత్వం సవాల్ చేసింది. రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలతో నివాసయోగ్యమైన రీతిలో ప్లాట్లను అభివృద్ధి చేసి వాటిని మూడు నెలల్లో ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన యజమానులకు అప్పగించాలన్న హైకోర్టు ఆదేశాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్లో సవాల్ చేసింది. సమగ్ర బిల్లుతో మళ్లీ ముందుకు వస్తాం ► శాసనసభకు చట్టం చేసే హక్కు లేదన్న అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి: మంత్రి గుడివాడ ► తన రియల్ఎస్టేట్ బినామీల కోసం విద్వేషాలు సృష్టిస్తున్న చంద్రబాబు సాక్షి, విశాఖపట్నం: రాజ్యాంగ పరంగా శాసనసభకు ఉన్న హక్కులను సాధించుకోవడం కోసమే రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసినట్లు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. వికేంద్రీకరణ ద్వారా జరిగే అభివృద్ధిని దీన్ని ద్వారా సుప్రీంకు తెలియజేశామన్నారు. శాసనసభకు చట్టంచేసే హక్కు లేదనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. మూడు రాజధానులపై మళ్లీ అసెంబ్లీలో సమగ్ర బిల్లుతో ముందుకు వెళతామని ప్రకటించారు. శనివారం విశాఖలోని సర్క్యూట్ హౌస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ► హైకోర్టు తీర్పుపై ఇప్పటికే అసెంబ్లీలో చర్చించామని, శాసనసభకు రాజధానిని నిర్ణయించే అధికారం లేదంటూ ఇచ్చిన తీర్పు ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బ తీసేవిధంగా ఉంది. ఆర్టికల్–3, 4 ప్రకారం రాజధాని ఎంపిక హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని గతంలో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు న్యాయం చేయాలన్నది ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం. ► శాసనసభ ఉనికినే ప్రశ్నించే విధంగా తీర్పులు వస్తే రాష్ట్ర ప్రగతికి విఘాతం కలుగుతుంది. ► రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలనే తపనతో ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తుంటే, 29 గ్రామాల కోసం, తన రియల్ ఎస్టేట్ బినామీల కోసం చంద్రబాబు చిచ్చు, విద్వేషాలను రేకెతిస్తున్నారు. ► అమరావతితో పాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. అమరావతిని పూర్తిగా అభివృద్ధి చేయడానికి 2024 వరకు ప్రభుత్వానికి సమయం ఉంది. -
మరిన్నిచోట్ల జగనన్న స్మార్ట్ టౌన్షిప్లు
సాక్షి, అమరావతి: మధ్య ఆదాయ వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్ల స్థలాలను అందించే జగనన్న స్మార్ట్ టౌన్షిప్లకు మంచి స్పందన లభిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని ప్రాంతాల్లో స్మార్ట్ టౌన్షిప్లు ఏర్పాటు చేసి ఎంఐజీ లేఅవుట్లను సిద్ధం చేస్తోంది. ప్రతి నియోజకవర్గంలో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ఏర్పాటు చేయాలని గతంలో ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో సీఎం జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే. సీఆర్డీఏ పరిధిలోని ఆరు జిల్లాల్లో జగనన్న స్మార్ట్ టౌన్షిప్లను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో అమరావతి ప్రాంతంలోని మంగళగిరిలో 80.46 ఎకరాల్లో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ఎంఐజీ ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చింది. ఇందులో 614 ప్లాట్లు వేశారు. ఇటీవల మొదటి విడతగా 119 ప్లాట్లను ఈ–లాటరీ ద్వారా కొనుగోలుదారులకు కేటాయించారు. ఈ ప్లాట్లకు మంచి డిమాండ్ ఉండడంతో అధికారులు మిగిలిన 495 ప్లాట్లను సిద్ధం చేస్తున్నారు. సీఆర్డీఏ పరిధిలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఏలూరు జిల్లాల్లోని 27 నియోజకవర్గాల్లో ఎంఐజీ ప్లాట్ల ఏర్పాటు ప్రక్రియను కూడా ప్రారంభించారు. గుంటూరు జిల్లా నారాకోడూరులో 97 ఎకరాల సేకరణకు ప్రభుత్వం ఇటీవల రూ.20 కోట్లు మంజూరు చేసింది. గుడివాడ నియోజకవర్గంలో 400 ఎకరాలను గుర్తించి దస్త్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలనకు పంపారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం, గుడివాడ, పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లో, ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల్లో మూడు ప్రాంతాల్లో 776.8 ఎకరాలను గుర్తించారు. గుంటూరు జిల్లాలోని నారాకోడూరు, అంకిరెడ్డిపాలెం, నేలపాడు, జొన్నలగడ్డ, నిడుబ్రోలు సమీపంలో మొత్తం 474.7 ఎకరాలు గుర్తించారు. పల్నాడు జిల్లాలో ఆరు నియోజకవర్గాలకు గాను, మూడింట్లో భూమిని గుర్తించాల్సి ఉంది. బాపట్లలోని రేపల్లె వద్ద 243.86 ఎకరాలను గుర్తించి జిల్లా కలెక్టర్కు నివేదించారు. ఏలూరు నియోజకవర్గంలో నూజివీడు వద్ద 40.78 ఎకరాలకు నివేదికను సిద్ధం చేస్తున్నారు. మధ్య తరగతికి మేలు చేసేలా.. తక్కువ, మధ్య ఆదాయ వర్గాల ప్రజలు పట్టణానికి సమీపంలో ఇంటి స్థలం కొనాలని అనుకుంటారు. వీరి అవసరాన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేటు రియల్టర్లు పలువురు మోసాలకు పాల్పడుతున్నారు. వారి వెంచర్లకు అనుమతులు లేకున్నా.. ఉన్నట్టు నమ్మించి అంటగడుతున్నారు. ఈ వెంచర్లలో మాస్టర్ ప్లాన్తో సంబంధం లేనివి, రెరా అనుమతులు లేనివే అధికంగా ఉంటున్నాయి. వీటికి అన్ని రకాల అనుమతులు తెచ్చుకోవడం ప్లాట్లు కొన్నవారికి తలకు మించిన భారమే. కొన్నిసార్లు ఈ తరహా ప్లాట్లకు ప్రభుత్వ అనుమతులు మంజూరుకావు. మధ్య తరగతి ప్రజలు ఇటువంటి మోసాల బారిన పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే అన్ని అనుమతులతో, మార్కెట్ ధరకంటే తక్కువలో ఎంఐజీ ప్లాట్లను జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పేరుతోఅందుబాటులోకి తెస్తోంది. క్లియర్ టైటిల్ డీడ్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం అనుమతితో పాటు అన్ని వసతులతో వీటిని అందిస్తోంది. -
సీఆర్డీఏ ప్లాట్ల వేలం గడువు పెంపు
సాక్షి, అమరావతి: ఆస్పత్రి, సినిమా థియేటర్, పాఠశాల వంటి వివిధ వాణిజ్య అవసరాలు, నివాసాల నిర్మాణానికి ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) కేటాయించిన ప్లాట్ల వేలం గడువును ఆగస్టు 1న వరకు పొడిగించింది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలోని 5 లాట్లలో ఉన్న 100 ప్లాట్లను వేలం వేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది. తొలుత ఈ నెల 28న ఈ–వేలం నిర్వహించాలని నిర్ణయించగా..ఎక్కువ మంది వేలంలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఆగస్టు 1వరకు పొడిగించింది. వేలం వేసే ప్లాట్ల వివరాలివీ.. ► తెనాలి నగరం చెంచుపేటలో లాట్–1లో 250 నుంచి 5,372 చ.గ విస్తీర్ణంలో మొత్తం 15 ప్లాట్లు ఉన్నాయి. వీటిలో సినిమా థియేటర్, హెల్త్ సెంటర్, ప్రాథమిక పాఠశాల కోసం మూడు ప్లాట్లు, మిగిలినవి వాణిజ్య సముదాయాల కోసం కేటాయించారు. ఇక్కడ చ.గ. ధర రూ.35,200గా నిర్ణయించారు. ► తాడేపల్లి–మంగళగిరి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని నవులూరు వద్ద ఉన్న లాట్–2లోని అమరావతి టౌన్షిప్లో 500 నుంచి 4,065 చ.గ. విస్తీర్ణం వరకు మొత్తం 18 ప్లాట్లను అభివృద్ధి చేశారు. వీటిలో 14 వాణిజ్య ప్లాట్లకు చ.గ. రూ.17,600 గాను.. ఆస్పత్రి, సినిమా థియేటర్, పాఠశాలలకు కేటాయించిన ప్లాట్లలో చ.గ. రూ.16 వేలుగాను ధర నిర్ణయించారు. ► విజయవాడ పాయకాపురం టౌన్షిప్లోని లాట్–3లో 550 చ.గ. నుంచి 3 వేల చ.గ. వరకు మొత్తం 10 ప్లాట్లు ఉన్నాయి. వీటిని ప్రాథమిక పాఠశాల, ఆరోగ్య కేంద్రం, స్థానిక షాపింగ్ కోసం కేటాయించారు. ఇదే ప్రాంతంలోని లాట్–4లో 100 నుంచి 744 చ.గ. వరకు 29 ప్లాట్లు ఉన్నాయి. వీటిని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, అల్పాదాయ వర్గాలకు, నివాస అవసరాలకు కేటాయించారు. ఈ రెండు ప్రాంతాల్లోను చ.గ. ధర రూ.25 వేల నుంచి రూ.27,500 వరకు ఉంది. ► ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్లోని లాట్–5లో 150 నుంచి 1000 చ.గ. వరకు ఉన్న మొత్తం 28 ప్లాట్లు ఉన్నాయి. వీటిని దుకాణాలు, కార్యాలయాలు, నివాసానికి కేటాయించారు. వీటిలో మూడు ప్లాట్లకు చ.గ. ధర రూ.11 వేలుగా, మిగిలిన ప్లాట్లలో చ.గ. రూ. 10 వేలుగా నిర్ణయించారు. పూర్తి వివరాలను https:// konugolu.ap.gov.in/,https://crda.ap.gov.in/లో పొందవచ్చు. ఫోన్ ఓటీపీతో రిజిస్ట్రేషన్ పైన పేర్కొన్న ప్లాట్ల కొనుగోలుకు ఫోన్ ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, ఈ–వేలం సేవలను ప్రజలు సులభంగా పొందేందుకు కొత్తగా ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చామని సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. కొనుగోలుదారులెవరూ అమ్మకందారును కలిసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోనవసరం లేకుండా, ఇంటివద్దే ఫోన్ సహాయంతో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. తమ సందేహాల నివృత్తి కోసం 0866–2527124 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో జగనన్న స్మార్ట్ టౌన్షిప్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మధ్య ఆదాయ వర్గాలు (ఎంఐజీ) కోరుకునే ఇంటి నిర్మాణం కోసం అవసరమైన ప్లాట్లను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన జగనన్న స్మార్ట్ టౌన్షిప్లను పూర్తి ప్రభుత్వ హామీతో అభివృద్ధి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. వాటిని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. స్మార్ట్ టౌన్షిప్ల అభివృద్ధి మార్గదర్శకాలు, పాటించాల్సిన నిబంధనలపై చర్చించేందుకు శనివారం సీఆర్డీఏ కార్యాలయంలో రియల్ ఎస్టేట్ డెవలపర్స్తో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సీఆర్డీఏ అదనపు కమిషనర్ అలీంబాషా, డెవెలప్మెంట్ ప్రమోషన్ డైరెక్టర్ ఎం.వెంకటసుబ్బయ్య, క్రెడాయ్ అధ్యక్షుడు కె.రాజేంద్ర, సభ్యులు, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నెరెడ్కో) సభ్యులు, వాటి పరిధిలోని రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో కమిషనర్ డెవలపర్స్ సందేహాలకు సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. సీఆర్డీఏ పరిధితో పాటు ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో స్మార్ట్ టౌన్షిప్లను చేపట్టనున్నామని, ప్రాజెక్టు అమలుకు జిల్లా స్థాయి కమిటీ (డీఎల్సీ) నేతృత్వం వహిస్తుందని వివరిచారు. ప్రాజెక్టుకు 20 ఎకరాలు తప్పనిసరి డెవలపర్ సంస్థ కనీసం 20 ఎకరాల భూమిని లే అవుట్గా అభివృద్ధి చేయాలని, యజమాని పేరుతోనే భూమి ఉండాలని కమిషనర్ సూచించారు. లే అవుట్ అభివృద్ధికి ముందుకు వచ్చేవారికి ప్రభుత్వం వేగంగా అన్ని అనుమతులు ఇస్తుందని వివరించారు. లే అవుట్లను మౌలిక సదుపాయాలతో సహా 150, 200, 240 గజాల విస్తీర్ణంలో మూడు రకాల ప్లాట్లను అభివృద్ధి చేయాలని, డెవలపర్ భూమి ఇచ్చినప్పటి నుంచి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు అన్ని అభివృద్ధి పనులపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుందని కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. భూమి యజమానికి, ఎంఐజీల్లో ప్లాట్లు కొనుగోలు చేసేవారికి వారధిగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందన్నారు. ఈ నెల 20 నుంచి ఎంఐజీ లే అవుట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, డెవలపర్స్ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా డెవలప్స్ అడిగిన సందేహాలను వివేక్ యాదవ్తో పాటు, ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్సెట్ మేనేజ్మెంట్కు చెందిన డొమైన్ ప్రాజెక్ట్ మేనేజర్ సిద్ధార్థ నివృత్తి చేశారు. అలాగే సీఆర్డీఏ ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలోని పాయకాపురం, తెనాలిలోని చెంచుపేట, మంగళగిరి, ఇబ్రహీంపట్నంలోని ట్రక్ టెర్మినల్ ప్రాంతాల్లో ప్లాట్లను ఈ–వేలం ద్వారా అమ్మకానికి ఉంచామని, రియల్ ఎస్టేట్ డెవలపర్స్ తోడ్పాటునందించాలని కోరారు. ఎంఐజీ నిబంధనలు ఇవీ.. ► రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 88లోని నిబంధనలకు అనుగుణంగా ఎంఐజీ లే అవుట్లు ఉండాలి ► లే అవుట్లో పట్టణాభివృద్ధి సంస్థ (యూడిఏ) వాటాగా 40 శాతం కంటే ఎక్కువ విస్తీర్ణాన్ని ఎంఐజీ దరఖాస్తుదారులకు ఇచ్చేందుకు ప్రాజెక్టు అభివృద్ధి సంస్థ ముందుకొస్తే దాన్ని తిరస్కరణ లేదా అంగీకరించే అధికారం జిల్లాస్థాయి కమిటీకి ఉంటుంది ► దరఖాస్తుదారులకు అనువైన ప్రాంతంలో ఎలాంటి వ్యాజ్యాలు, తాకట్టులు లేని కనీసం 20 ఎకరాల భూమిలో మాత్రమే వీటిని ఏర్పాటు చేయాలి ► ఎంఐజీ ప్లాట్ల అనుమతులు, మార్కెట్ విలువ, అమ్మకం ధర వంటి అంశాలు ఎలా ఉండాలో జిల్లా కమిటీ సూచిస్తుంది. ► ప్రాజెక్టు ఏర్పాటు చేసే ఒక ప్రాంతం నుంచి ఒకటికి మించి దరఖాస్తులు వస్తే మార్గదర్శకాలకు అనుగుణంగా అభివృద్ధి సంస్థలను జిల్లా కమిటీ ఎంపిక చేస్తుంది ► ఎంఐజీ ప్లాట్ల అమ్మకపు ధర ఎప్పుడూ మార్కెట్ ధర కంటే కనీసం 10 నుంచి 20 శాతం తక్కువగా ఉండేలా కమిటీ చూడాలి ► లే అవుట్లలో అంతర్గత రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, పార్కులు, ఫుట్పాత్ తదితర ముఖ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి ► ఎంఐజీలో ప్లాట్లు కావాలనుకునేవారు దరఖాస్తుతో పాటు ప్లాట్ ధరలో 10 శాతం, ఒప్పదం చేసుకునే సమయంలో మరో 10 శాతం, ప్రాజెక్టు పూర్తయ్యాక ప్లాట్ల రిజిస్ట్రేషన్ సమయంలో మిగిలిన 80 శాతం మొత్తాన్ని చెల్లించాలి. -
అమరావతిలో అభివృద్ధి పనులు ప్రారంభం
సాక్షి, అమరావతి: ల్యాండ్ పూలింగ్ కింద అమరావతికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం కేటాయించిన ప్లాట్ల అభివృద్ధికి ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) చర్యలు చేపట్టింది. రైతులకు కేటాయించిన స్థలాల్లో మౌలిక వసతులు కల్పించాలని ఇటీవల పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆమేరకు సీఆర్డీఏ చర్యలు చేపట్టింది. ఇక్కడ రైతులకు కేటాయించిన ప్లాట్లను 12 జోన్లుగా విభజించగా, వాటిలో జోన్–4లోని పిచ్చుకలపాలెం, తుళ్లూరు, అనంతవరం గ్రామాల్లో ఉన్న ప్లాట్లలో పనులు ప్రారంభించారు. సోమవారం పిచ్చుకలపాలెం వద్ద రహదారి నిర్మాణాన్ని సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్పీఎస్ ప్లాట్లను పూర్తి కమర్షియల్ విధానంలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. జోన్–4లో మొత్తం 1358.42 ఎకరాల్లో 4,551 ప్లాట్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రూ.192.52 కోట్లతో రహదారులు, వంతెనలు, తాగు నీటి సరఫరా వ్యవస్థ, వరద నీటి కాలువలు, మురుగునీటి వ్యవస్థ, మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు) వంటి మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. రైతులు కోరుకున్న విధంగా ప్లాట్లను తీర్చిదిద్దుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఆర్డీఏ అదనపు కమిషనర్ షేక్ అలీంబాషా, చీఫ్ ఇంజినీర్లు టి.ఆంజనేయులు, సీహెచ్ ధనుంజయ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శరవేగంగా అభివృద్ధి పనులు ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఆర్డీఏ అమరావతిలో దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టింది. రైతులకు ఇచ్చిన ప్లాట్లతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను శరవేగంగా చేపడుతోంది. అసెంబ్లీ, సచివాలయాలకు వెళ్లేందుకు ప్రధాన మార్గమైన కృష్ణా నది కరకట్ట రోడ్డును రూ.150 కోట్లతో విస్తరిస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు అధికారులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది నివాస సముదాయాల పనులు దాదాపు పూర్తయ్యాయి. నవంబర్ నాటికి వీటిని అందుబాటులోకి తెచ్చేలా పనులు చేస్తున్నారు. అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల సమీకరణకు చర్యలు చేపట్టామని వివేక్ యాదవ్ తెలిపారు. నిబంధనలకు లోబడి అమరావతి ప్రాంతంలో టౌన్షిప్లను అన్ని వసతులతో అభివృద్ధి చేసి ప్లాట్లను ఆన్లైన్ వేలం ద్వారా విక్రయిస్తున్నట్టు చెప్పారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టి పూర్తిచేస్తామన్నారు. రైతులకు కౌలు డబ్బును కూడా సకాలంలో చెల్లిస్తున్నట్టు వివరించారు. -
మధ్యతరగతి వర్గాలకు భరోసా జగనన్న స్మార్ట్ టౌన్షిప్
సాక్షి,గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): మధ్యతరగతి ఆదాయ వర్గాల ప్రజల అభ్యున్నతికి జగనన్న స్మార్ట్ టౌన్షిప్ చక్కటి భరోసాను కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్డీఏ) కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. సీఆర్డీఏ ఆధ్వర్యంలో తాడేపల్లి–మంగళగిరి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని నవులూరు ఎంఐజీ లేఔట్లో ప్లాట్ల కొనుగోలుకు దరఖాస్తు చేసుకున్నవారికి శనివారం విజయవాడలో ఈ–లాటరీ నిర్వహించారు. వివేక్ యాదవ్ మాట్లాడుతూ.. ఎంఐజీ ప్లాట్లకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. ఇందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి మున్ముందు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. లేఔట్లో 60, 80 అడుగుల అనుసంధాన రహదార్లతోపాటు 40 అడుగులతో అంతర్గత సీసీ రహదార్లను కూడా నిర్మిస్తున్నామన్నారు. కాగా, నవులూరు ఎంఐజీ లేఔట్లో మొత్తం 147 మంది ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. 104 మందిని అర్హులుగా ఎంపిక చేశామని చెప్పారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ ఆన్లైన్ ర్యాండమ్ లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు పత్రాలను అందజేశారు. చదవండి: ఎనీ డౌట్? కలామ్ పేరును చంద్రబాబు సూచించారనేది కేవలం భ్రమ