-
పడగొడతామంటే.. తొడగొట్టలేమా?: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలరోజులైనా కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటే.. మేం తొడగొట్టలేమా? ఎవరెవరు ఎప్పుడు కాంగ్రెస్లో చేరతారనేది ఇప్పుడే చెప్పలేం. అసలు పార్టీ ఫిరాయింపులకు పునాదులు వేసింది కేసీఆరే..’’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విషయంలో టీపీసీసీ సమన్వయలోపంతో గందరగోళం ఏర్పడిందని చెప్పారు. త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్ నియామకం, మంత్రివర్గ విస్తరణ ఉంటాయని వెల్లడించారు. రేవంత్ గురువారం మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్సీ జీవన్రెడ్డిలతో ఢిల్లీలోని తన నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. వివరాలు రేవంత్ మాటల్లోనే..‘‘రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో కూలిపోతుందని కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు అంటే.. దానికి బీజేపీ వంత పాడింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మూడు నెలల్లో పడగొడతామంటూ రోడ్ల మీద పడి రంకెలేస్తున్న బీఆర్ఎస్, బీజేపీలను గాలికి వదిలేస్తే ఎలా? బీఆర్ఎస్కు ఓట్లు వేయకపోవడం ప్రజల తప్పు అన్నట్టుగా కేసీఆర్ వ్యవహారం ఉంది. ఎన్నికల్లో కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయి. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందన్నట్టు.. అసలు పార్టీ ఫిరాయింపులకు పునాదులు వేసింది కేసీఆరే. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మొత్తం 61 మందిని తీసుకున్న కేసీఆర్ తప్పులు క్షమించాలంటూ.. అమర వీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలి.మీరు అడిగితేనే కమిషన్ వేశాం..కేసీఆర్ గత 10 ఏళ్లలో ఒక్కసారైనా రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ప్రతిపక్షాలను పిలిచారా? మేం అధికారికంగా ఆహ్వానం పంపాం. విద్యుత్పై విచారణ కమిషన్ వేయాలని మేం అడగలేదు. మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా విద్యుత్ కొనుగోళ్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ కోరారు. మరి మా ప్రభుత్వం విచారణ కమిషన్ వేయడం తప్పా? వివరణ ఇవ్వాలని కేసీఆర్ను అడగటం తప్పా? కమిషన్కు జస్టిస్ నరసింహారెడ్డి అధ్యక్షత వహిస్తుండడాన్ని తప్పు పడుతున్నారా?.. దీనిపై కేసీఆర్, జగదీశ్రెడ్డి సమాధానం చెప్పాలి.రాజకీయాలు అయిపోయాయి!రాష్ట్రంలో అన్ని పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాం. ఏ కార్యాచరణ కూడా వాయిదా పడలేదు. గత ప్రభుత్వంలో విద్యాశాఖ చేసిన పనులను, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులను పోల్చిచూడాలి. మా ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం జరుగుతోంది. రాజకీయాలు అయిపోయాయి. ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడమే లక్ష్యం.ఏపీ భవన్ సమస్యను పరిష్కరించుకున్నాంఏపీ సీఎంగా వైఎస్ జగన్ ఉన్నప్పుడే ఢిల్లీలోని ఏపీ భవన్ సమస్యను పరిష్కరించుకున్నాం. విభజన సమస్యల పరిష్కారంపై ఇప్పటికే కేబినెట్లో చర్చించాం. త్వరలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తాం. పునర్విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సిన అనుమతులు, నిధులు, పొరుగు రాష్ట్రంతో సమస్యల పరిష్కారం కోసం చర్చలు నిరంతర ప్రక్రియ కొనసాగుతాయి. కేంద్రం ద్వారా విభజన సమస్యలు పరిష్కారం కాకపోతే కోర్టులను ఆశ్రయిస్తాం. ఆస్తుల పంపకం జరిగిపోయింది. ఇక నిర్మాణం, నిర్వహణ ఎలాగన్న దానిపై దృష్టిపెట్టాం. త్వరలో కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టబోతుండటంతో.. రాష్ట్రం తరఫున మంత్రులంతా వచ్చి కేంద్ర మంత్రులను కలసి విజ్ఞప్తులు, ప్రతిపాదనలు ఇచ్చాం. త్వరలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కూడా కలుస్తాం.వేరేవారికి పీసీసీ ఇవ్వాలని కోరా..కాంగ్రెస్ అధిష్టానం నన్ను పీసీసీ అధ్యక్షుడిగా 2021 జూన్ 21న నియమించగా జూలై 7న బాధ్యతలు తీసుకున్నాను. ఈ ఏడాది జూలై 7న నా పదవీకాలం పూర్తవుతుంది. పీసీసీ బాధ్యతల నుంచి నన్ను తప్పించి సామాజిక న్యాయం పాటిస్తూ, సమర్థుడైన నాయకుడికి పీసీసీ బాధ్యతలు అప్పగించాలని అధిష్టానానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశాను. త్వరలో అధిష్టానం దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేస్తా..’’ అని రేవంత్ చెప్పారు.త్వరలో మంత్రి వర్గ విస్తరణరాష్ట్రంలో త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుంది. నా జీవితాశయం నెరవేరింది. కేసీఆర్ను ఓడిస్తానని, ముఖ్యమంత్రిని అవుతానని చెప్పాను. అయ్యాను. రేవంత్రెడ్డి సీఎం అని 30 సెకన్లలో అధిష్టానం డిసైడ్ చేసింది. కేసీఆర్ను దింపాలనేది నా మొదటి లక్ష్యం. దానిని గుర్తించి ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. కేసీఆర్ దిగిపోవడం, నేను గద్దెనెక్కడమే ఆయనకు పెద్ద గాయం. అంతకు మించింది ఏముంటుంది?జీవన్రెడ్డి విషయంలో సమన్వయలోపంఎమ్మెల్సీ జీవన్రెడ్డి మనస్తాపం చెందడానికి సమన్వయ లోపం, పీసీసీ తరఫున ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణం. దీనితో కొంత గందరగోళం ఏర్పడింది. మంత్రి శ్రీధర్బాబు చొరవతో అధిష్టానం పార్టీకి ఎలాంటి నష్టం కలగకుండా చూసింది. హైకమాండ్ ఆదేశాలతో.. జీవన్రెడ్డి గౌరవాన్ని కాపాడుతూ, ఆ ప్రాంత కార్యకర్తలను ఆదుకోవాలని నిర్ణయించుకున్నాం. జీవన్రెడ్డి అనుభవాన్ని, శక్తి సామర్థ్యాలను పార్టీ వినియోగించుకుంటుంది. జీవన్రెడ్డి వ్యవహారంలో ఏదైనా జరిగితే బాగుండునని కొన్ని గోతికాడి నక్కలు ఎదురు చూశాయి. కానీ జీవన్రెడ్డి ఆ అవకాశం ఇవ్వలేదు.టీఆర్ఎస్ ఖతం కావాలన్నదే హరీశ్ కోరికకేసీఆర్ పార్టీని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో పనిచేస్తే నిలబెట్టుకుంటారు. కానీ ఆయన ఆ మూడ్లో లేరు. హరీశ్రావు డిస్టర్బ్ చేస్తున్నారు. కేసీఆర్ను బయటికి రానివ్వడం లేదు. హరీశ్ ట్రాప్లో కేసీఆర్ ఉన్నారు కాబట్టి పార్టీ బతకడం కానీ, కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవడంగానీ జరగవు. కేసీఆర్ ఉన్నంత సేపు హరీశ్ ఏమీ చేయలేడు. చేసినా సమాజం ఒప్పుకోదు. అందుకే బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలని హరీశ్ అనుకుంటున్నారు. పార్టీ ఖతమైతే హరీశ్ ఒక కొత్త లైన్ తీసుకుంటారు. గతంలో ఈటల రాజేందర్ను మెడపట్టి బయటకు పంపింది హరీశ్రావు కాదా? నరేంద్ర, విజయశాంతిలను బయటికి పంపింది హరీశ్ కాదా? ఎప్పుడూ ఒక సమస్యను సృష్టించి.. తనకంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకుంటారు. నాకు నచ్చలేదు కాబట్టి కేసీఆర్ చిన్నోడేమీ అయిపోడు. అసెంబ్లీలోకి వచ్చి నిలుచుంటే ఆయనకు ఉండే మర్యాద ఆయనకు ఉంటుంది. -
బీఆర్ఎస్ కార్యకర్తలు బుల్లెట్లు
మర్కూక్ (గజ్వేల్)/ సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్కు బుల్లెట్ల వంటి కార్యకర్తలు ఉన్నారని, వారే రేపటి నాయకులని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. కొంతమంది స్వార్థపరులు పోయినంత మాత్రాన బీఆర్ఎస్కు నష్టమేమీ లేదన్నారు. పార్టీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానం కొనసాగుతుందని, భవిష్యత్ బీఆర్ఎస్దేనని ధీమా వ్యక్తం చేశారు. గురువారం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో హుజూరాబాద్, ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఆరు దశాబ్దాలపాటు దిక్కూమొక్కూ లేక కొట్టుమిట్టాడిన తెలంగాణను ఓ దరికి చేర్చేందుకు గులాబీ జెండా ఉద్యమ కేతనమై ఎగిరింది. తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యాన్ని సాధించేందుకు ఎన్నో పదవులను త్యాగం చేసిన చరిత్ర మనది. తెలంగాణ సాధించిన ఘనత కన్నా నాకు సీఎం పదవి పెద్ద విషయం కాదు. ప్రజలు మోసపోయారు ప్రత్యేక రాష్ట్రం సాధించే నాటికి సమైక్య పాలనలో తెలంగాణది దిక్కూమొక్కూ లేని పరిస్థితి. రాష్ట్ర పాలన పగ్గాలు చేపట్టి సాగునీరు, తాగునీరు, కరెంటు వంటి అనేక కీలక వసతులు కల్పించుకున్నాం. అన్ని రంగాల్లో తెలంగాణను తీర్చిదిద్దుకున్నాం. పదేళ్ల స్వల్పకాలంలోనే అద్భుత ప్రగతి సాధించుకున్నాం. ఇటువంటి సమయంలో ప్రజలు ఊహించని తీర్పునిచ్చారు. కొన్ని కొన్ని సార్లు ఇలాంటి తమాషాలు జరుగుతుంటాయని చరిత్రలోకి వెళితే అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అలవిగాని హామీలను నమ్మి ప్రజలు మోసపోయారు. పాలిచ్చే బర్రెను వదిలి దున్నపోతును తెచ్చుకున్నట్లు అయిందంటూ ఇప్పుడు బాధపడుతున్నారు. బీఆర్ఎస్ సర్కారులో అందిన లబ్ధి ఇప్పుడు రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఎంతో కష్టపడి దరికి తెచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పాలనలో దారి తప్పింది. పార్టీ యే నాయకులను సృష్టిస్తుంది ఎప్పుడూ పార్టీ నాయకులను సృష్టిస్తుంది. నాయకులు పార్టీ లోకి వచ్చిపోతుంటారు. కొందరు నాయకులు వీడినంత మాత్రాన పార్టీ కి ఎటువంటి నష్టం రాదు. బీఆర్ఎస్ పార్టీ కి బుల్లెట్ల వంటి కార్యకర్తలున్నారు. వారినే నాయకులుగా తీర్చిదిద్దుకుందాం. పార్టీ బీఫారం ఇచ్చి అవకాశమిస్తే.. ఎవరైనా సిపాయిలుగా తయారవుతారు. ప్రజల్లో చైతన్యం వచ్చి కాంగ్రెస్ చేసిన మోసాన్ని గుర్తిస్తారు. తిరిగి బీఆర్ఎస్ను ఆదరిస్తారు. అప్పటిదాకా ఓపికతో ప్రజాసమస్యలపై దృష్టి సారించాలి..’’అని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రశాంత్రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, కందాల ఉపేందర్రెడ్డి, సీనియర్ నాయకులు జహంగీర్, దుండిగల రాజేందర్, చైర్మన్లు, సర్పంచులు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ను మించి ప్రజలు మనకు మద్దతిస్తారు తెలంగాణ కోసం సాగిన మన 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ఆగలేదు, అయిపోలేదు. ఒకసారి ఓడగొట్టిన ఎనీ్టఆర్ను తిరిగి ఎలాగైతే ప్రజలు గద్దె మీద కూర్చోబెట్టారో అంతకన్నా గొప్పగా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరిగి ఆదరిస్తారు. అంతకంటే రెట్టింపు మద్దతుతో మనను గద్దె మీద కూర్చుండబెట్టే రోజు త్వరలోనే వస్తుంది. కాంగ్రెస్ పాలన రోజురోజుకూ దిగజారుతోంది.స్టీరింగ్ పట్టిన కేసీఆర్ ఫామ్హౌజ్లో మినీ వ్యాన్ నడిపిన బీఆర్ఎస్ అధినేత మర్కూక్ (గజ్వేల్): బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్టీరింగ్ పట్టారు. గురువారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో కాసేపు మినీ వ్యాన్ నడిపారు. అందులో ఎమ్మెల్యేలు, నేతలను కూర్చోబెట్టుకుని ఫామ్హౌజ్లో కలియదిరిగారు. కొన్నినెలల క్రితం కేసీఆర్కు తుంటి ఎముక విరగడంతో, శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. తర్వాత చాలా రోజులు చేతికర్ర సాయంతో నడిచిన ఆయన.. ఇటీవలే వైద్యుల సూచన మేరకు చేతికర్ర వదిలేసి నడవడం మొదలుపెట్టారు. తాజాగా తన ఫామ్హౌజ్లో ఓమ్నీ వ్యాన్ నడుపుతూ కనిపించారు. వ్యాన్లో కేసీఆర్తోపాటు ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి తదితరులు ఉన్నారు. కవితా సంకలనాన్ని అందజేసిన కవయిత్రి మహెజబీన్ బేగ్ ప్రముఖ స్త్రీవాద కవయిత్రి మహెజబీన్ బేగ్ గురువారం ఎర్రవల్లిలో కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా తన కవితా సంకలనం ం‘ఆకులురాలు కాలం’ంపుస్తకాన్ని కేసీఆర్కు అందజేశారు. -
ఆ ప్రస్తావన ఎందుకు?: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: పార్లమెంట్ తొలి సెషన్ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ‘ఎమర్జెన్సీ’ని ప్రస్తావిస్తూ తీర్మానం చేయడాన్ని విపక్షనేత రాహుల్ గాంధీ మరోమారు తీవ్రంగా తప్పుబట్టారు. బిర్లాను గురువారం మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాజకీయ అంశమైన ‘ఎమర్జెన్సీ’ని ప్రస్తావించకుండా ఉండాల్సింది అన్నారు. ‘‘రాహుల్, ఇండియా కూటమి నేతలు స్పీకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నేతలంతా పార్లమెంటరీ వ్యవహారాలు మాట్లాడుకున్నారు. అందులో భాగంగానే ఎమర్జెన్సీ అంశమూ ప్రస్తావనకు వచి్చంది.రాహుల్ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. రాజకీయ అంశాన్ని సభలో లేవనెత్తకుండా నివారిస్తే బాగుండేదన్నారు’’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ వెల్లడించారు. ఈ అంశంపై కేసీ వేణుగోపాల్ విడిగా స్పీకర్కు ఒక లేఖ రాశారు. ‘పార్లమెంట్ విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీసే అంశమిది. స్పీకర్గా మిమ్మల్ని ఎన్నుకున్న శుభతరుణంలో అర్ధశతాబ్దకాలంనాటి ఎమర్జెన్సీ అంశాన్ని మీరు సభ ముందుకు తేవడం విపక్షాలన్నింటినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. స్పీకర్ ఎన్నిక, బాధ్యతల స్వీకరణ వేళ రాజకీయాలు మాట్లాడటం పార్లమెంట్ చరిత్రలో ఇదే తొలిసారి.నూతన స్పీకర్గా ఎన్నికయ్యాక చేపట్టాల్సిన తొలి విధులకు ఇలాంటి చర్యలు తీవ్ర విఘాతం కల్గిస్తాయి. పార్లమెంటరీ సంప్రదాయాలను అపహాస్యం చేస్తూ సాగిన ఈ ఉదంతంపై మేం ఆందోళన చెందాం’’ అని వేణుగోపాల్ ఆ లేఖలో పేర్కొన్నారు. ‘‘1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ‘అత్యయిక స్థితి’ అమల్లోకి తెచ్చారు. చాలా మంది ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం జైళ్లలో పడేసింది. మీడియాపై ఆంక్షలు విధించింది.న్యాయ వ్యవస్థపై నియంత్రణ చట్రం బిగించింది. ఎమర్జెన్సీ విధించి 49 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సభ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పరిరక్షించడంతోపాటు దాని విలువలకు కట్టుబడి ఉందని నేను హామీ ఇస్తున్నా’’ అని నూతన స్పీకర్ బిర్లా బుధవారం పేర్కొన్నారు. స్పీకర్ ఆ తీర్మానాన్ని చదువుతున్న సందర్భంలో కాంగ్రెస్ సహా విపక్ష నేతలంతా నిలబడి తీవ్ర నిరసన వ్యక్తం చేయడం తెలిసిందే. -
హైకమాండ్ పెద్దలతో రేవంత్ భేటీ.. ఏ క్షణమైనా టీపీసీసీ చీఫ్ను ప్రకటించే ఛాన్స్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై హై కమాండ్ కసరత్తు చేస్తోంది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశమయ్యారు. కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి , మధుయాష్కి గౌడ్ సమావేశమయ్యారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక అంశంపై చర్చించారు.పీసీసీ అధ్యక్ష రేసులో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. అధిష్టానం ఎవరిని పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేసినా కలిసి పనిచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గం, డిప్యూటీ సీఎం ఎస్సీ సామాజిక వర్గం కావడంతో పీసీసీ అధ్యక్ష పదవి బీసీ వర్గానికి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాలపై పొన్నం ప్రభాకర్, మహేష్ గౌడ్లకు పట్టు ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మెలిసి పనిచేసే నేతకు అధిష్టానం అవకాశమిస్తుందా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించేలా పాత కాంగ్రెస్ నేతలకు అవకాశం ఇస్తారా? అనే దానిపై కూడా చర్చ నడుస్తోంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు చుక్కెదురు
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ఏసీపీ ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీ భుజంగ రావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు కొట్టేసింది నాంపల్లి కోర్టు. పోలీసుల వాదనలతో న్యాయ స్థానం ఏకీభవించింది.ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ఏసీపీ ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీ భుజంగ రావు, తిరుపతన్నలు బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్పై గురువారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సమయంలో కేసులో పోలీసులు ఎటువంటి ఛార్జీషీట్ దాఖలు చేయలేదని తమ వాదనల్ని వినిపించారు.అయితే పిటిషన్లు దాఖలు చేసినట్లు చెప్పారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి ఛార్జ్షీట్లో మూడు కీలకమైన డాక్యుమెంట్లను జత చేసినట్లు తెలిపారు. ఈ కేసులో మరో కీలక నిందితుడైన ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్నారని, ఆయన్ని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. ఫోన్ ట్యాంపింగ్పై మరికొంతమందిని విచారించాల్సి ఉందని, ఈ తరుణంలో వీరికి బెయిల్ ఇస్తే సాక్ష్యాల్ని రూపుమాపడమే కాకుండా..సాక్ష్యుల్ని బెదిరించే అవకాశం ఉందని వాదించారు. పోలీస్ శాఖలో కీలక పదవుల్లో ఉన్నారని, కేసులో మిగిలిన నిందితులు అరెస్ట్ చేసే వరకు బెయిల్ ఇవ్వకూడదని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పోలీసుల వాదనల్ని ఏకీభవించిన కోర్టు నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది నాంపల్లి కోర్టు. -
ఎమర్జెన్సీపై వ్యాఖ్యలు.. స్పీకర్ను కలిసిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ోక్సభ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ తాజాగా పార్లమెంట్ సమావేశాలను కుదిపేస్తోంది. ఎమర్జెన్సీని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ సమా బీజేపీ నేతలంతా ఆ కాలం ప్రజలకు చీకటి రోజులుగా అభివర్ణిస్తున్నారు. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,, లోక్సభ స్పీకర్ సైతం ఎమర్జెన్సీ గురించి మాట్లాడారు.అయితే దీనిని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనిపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఇండియా కూటమి సీనియర్ సభ్యులు గురువారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. ఎమర్జెన్సీని చీకటి రోజులుగా స్పీకర్ పార్లమెంటులో ప్రస్తావించడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓం బిర్లా చర్యలు పార్లమెంట్ విశ్వసనీయతను ప్రభావితం చేసే తీవ్రమైన విషయంగా కాంగ్రెస్పేర్కొంది పార్లమెంటరీ సంప్రదాయాలను అపహాస్యం చేయడంపై తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది.ఈ మేరకు ఓ ప్రటకటన విడుదల చేసింది కాంగ్రెస్. "26 జూన్ 2024న మీరు లోక్సభ స్పీకర్గా ఎన్నికైనందుకు అభినందనలు తెలిపే సమయంలో సభలో సాధారణ స్నేహభావం ఏర్పడింది. అలాంటి సందర్భాలు ఏర్పడతాయి. కానీ తీరువాత సభా వతి నుంచి ఎమర్జెన్సీ ప్రకటన రావడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది.సభాపతి నుంచి ఇలాంటి రాజకీయ ప్రస్తావన రావడం పార్లమెంటు చరిత్రలో అసహజమైనది. కొత్తగా ఎన్నుకైన స్పీకర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది. పార్లమెంట్ పనితీరు గురించి చాలా విషయాలు చర్చించారు. దీనిని స్పీకర్ మమాట్లాడకుండా ప్రతిపక్ష నాయకుడిగా ఓం బిర్లాను సూచించారు. ఇది స్పష్టంగా రాజకీయ ప్రస్తావన అని, తప్పకుండా ఖండిచాల్సిందని కేసీ వేణుగోపాల్ పేరుతో ప్రకటన విడుదలైంది.ఇందిరా గాంధీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని దూషిస్తూ తీర్మానాన్ని చదివిన ఓం బిర్లా రెండు నిమిషాల మౌనం పాటించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి. -
తెలంగాణలో జంపింగ్ పాలిటిక్స్.. కేసీఆర్ ప్యూచర్ ప్లాన్ ఏంటి?
తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్, ఏడుసార్లు గెలుపొందిన ఎన్నికైన సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల నుంచి రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్లు కాంగ్రెస్లోకి జంప్ చేయడం భారత రాష్ట్ర సమితికి పెద్ద దెబ్బే అవుతుంది. శ్రీనివాసరెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విశేష గౌరవమే ఇచ్చారు. సంజయ్ అయితే కేసీఆర్కు సొంత మనిషి కింద లెక్క. అయినా వారిద్దరూ పార్టీని వీడారంటే ఏమిటి అర్థం. రాజకీయాలలో తమ వ్యక్తిగత అవసరాలకు అధిక ప్రాధాన్యం ఉంటుందని మరోసారి వెల్లడైంది. ఇందులో కులం లేదు. ప్రాంతం లేదు. సిద్దాంతం లేదు.. తమ స్వప్రయోజనాలే మిన్నగా ఉంటాయి. ప్రత్యేకించి రాజకీయంగా ఇప్పటికిప్పుడు జరిగే నష్టం కన్నా, నైతికంగా పార్టీ క్యాడర్పై దీని ప్రభావం పడుతుంది.పెద్ద నేతలు, పలు ముఖ్యమైన పదవులు చేసినవారు సైతం పార్టీని వీడుతున్నారన్న అభిప్రాయం ప్రబలితే కిందిస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది. తాము కూడా పక్క చూపులు చూడాలా అన్న ఆలోచనకు వస్తారు. విశేషం ఏమిటంటే ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించిన పోచారం శ్రీనివాసరెడ్డి తాను కూడా పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం. రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చని చెబుతారు. దానికి పోచారం ఉదంతం కూడా ఒక ఉదాహరణే. పోచారం ఇంటికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లి ఆహ్వానించడం విశేషం. దీని ద్వారా ఆయనకు గౌరవం ఇచ్చినట్లయింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు కూడా రేవంత్ వెంట వెళ్లారు.ఇప్పటికే మరో సీనియర్ నేత, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండవ వెంకటేశ్వరరావు వంటివారు కాంగ్రెస్లో చేరిపోయారు. బహుశా అలాంటివారి ప్రభావం కూడా పోచారంపై పడి ఉండవచ్చు. 1994లో తొలిసారి శాసనసభకు టీడీపీ పక్షాన ఎన్నికైన పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్ వాడ నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న నేతగా ఎదిగారు. 1995లో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంతకాలానికి పోచారానికి మంత్రి పదవి వచ్చింది. కాని ఆయన అల్లుడుపై వచ్చిన స్టేషనరీ స్కామ్ కారణంగా పదవికి రాజీనామా చేశారు. ఆ స్కామ్ రుజువు కాకపోవడంంతో సేఫ్గా బయటపడ్డారు. 2004లో ఓటమి చెందిన ఈయన 2009లో తిరిగి గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం ఉధృతం అవడంతో కెసిఆర్ కోరిక మేరకు ఆయన టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరారు.అప్పుడు జరిగిన ఉప ఎన్నికలో కూడా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఈయన కేసీఆర్ క్యాబినెట్లో మంత్రి పదవి పొందారు. ఐదేళ్లపాటు ఆ పదవిలో ఉన్న ఆయన 2018లో మరోసారి గెలిచారు. ఈసారి ఆయన తెలంగాణ శాసనసభ స్పీకర్ అయ్యారు. స్పీకర్గా ఇతరత్రా పెద్ద వివాదాస్పదుడు కాకపోయినప్పటికీ, ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి కొందరుఎమ్మెల్యేలు చేరే క్రమంలో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. కేసీఆర్ సూచనల ప్రకారమే వ్యవహరించారు తప్ప ఈ విషయంలో స్వతంత్రంగా పనిచేయలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పన్నెండు మంది టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్)లో విలీనం చేసినట్లు ప్రకటించారు. 2023 ఎన్నికలలో మరోసారి గెలిచారు. నిజానికి పోచారం బదులు ఆయన కుమారుడు 2023 ఎన్నికలలో పోటీచేయవచ్చని అనుకున్నారు. కాని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈయననే పోటీచేయాలని కోరారు .దాంతో పోటీచేయక తప్పలేదు. బీఆర్ఎస్ అధికారంలోకి రాలేకపోయింది.అయినా గత ఆరు నెలలుగా పార్టీ సమావేశాలలో ఆయన పాల్గొన్నారు. పోచారం కదలికలపై కొంత అనుమానం ఉన్నప్పటికీ, ఈ వయసులో పార్టీ మారతారా అన్న భావన ఉండేది. బహుశా ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై కాంగ్రెస్ పార్టీ భరోసా ఇచ్చి ఉండాలి. అలాగే బీఆర్ఎస్కు మళ్లీ అధికారం వచ్చే అవకాశం లేదని ఆయన భావిస్తుండాలి. ఈ క్రమంలోనే స్థానిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి ఉండవచ్చు. మరో వైపు బీజేపీ కూడా బీఆర్ఎస్ నుంచి నేతలను, క్యాడర్ను ఆకర్షించే యత్నాలు చేస్తోంది. లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్తో సమానంగా బీజేపీకి ఎనిమిది సీట్లు రావడం ఆ పార్టీకి ఉత్సాహాన్ని ఇచ్చింది.దీంతో రేవంత్, కాంగ్రెస్ నేతలు మరింత అప్రమత్తమై బీఆర్ఎస్ నుంచి వీలైనంతమందిని ఆకర్షించే పనిలో పడ్డారు. వీరు తొందరపడకపోతే బీజేపీ నాయకత్వం గాలం వేసి వారివైపు తిప్పుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ గెలిచినా, లోక్ సభ ఎన్నికలలో బీజేపీ గెలిచింది. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బీజేపీకి సహకరించారన్న అభిప్రాయం వచ్చింది. బీజేపీ పక్షాన గెలిచింది కూడా ఒకప్పుడు టీఆర్ఎస్లో కీలకంగా ఉన్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కావడం గమనార్హం.ప్రస్తుత పరిస్థితిలో బీఆర్ఎస్ను ఖాళీ చేయడానికి కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. రేవంత్ చొరవ తీసుకుని పార్టీని బలోపేతం చేసుకోవడం, సొంత వర్గాన్ని పెంచుకోవడం చేయకపోతే కాంగ్రెస్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చన్న భయం ఉంటుంది. అందుకే టీడీపీ బాగ్రౌండ్ ఉన్న నేతలను ఆకట్టుకునే పనిలో ఉన్నారనిపిస్తుంది. గతం నుంచి తనకు సన్నిహితంగా ఉన్న టీడీపీ నేతలను ఆయన తనతో పాటు క్యారీ చేస్తున్నారు. ఉదాహరణకు వేం నరేంద్రరెడ్డి వంటివారు సలహాదారు పదవిలో కీలకంగా ఉన్నారు. ఇప్పటికే సీనియర్ నేత కడియం శ్రీహరిని కాంగ్రెస్ లోకి తెచ్చారు.ఆయన కుమార్తెకు ఎంపీ పదవి కూడా వచ్చింది. తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డికి కూడా మంత్రి పదవి ఇవ్వవచ్చని చెబుతున్నారు. ఉత్తర తెలంగాణలో పార్టీని పటిష్టం చేయడం కోసం ఈయనను కాంగ్రెస్ లోకి తీసుకు వచ్చి ఉండాలి. పోచారం కాంగ్రెస్లో చేరడంతో ఇబ్బంది రాలేదు కాని, జగిత్యాల నుంచి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లోకి రావడం సీనియర్ నేత టి.జీవన్ రెడ్డికి ఆగ్రహం తెప్పించింది. కనీసం తనకు చెప్పకుండా చేస్తారా అని తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి ఆయన సిద్దమయ్యారు.అధిష్టానం పెద్దలు జోక్యం చేసుకుని ఆయనను చల్లబరిచారు. ఇలాంటి సమస్యలు అక్కడక్కడా ఉన్నా, ఈ నాలుగేళ్లు ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి, బీజేపీకి అవకాశాలు తగ్గించి, బీఆర్ఎస్ను బలహీనపరచడానికి రేవంత్ ఇదే రూట్ లో వెళ్లవచ్చు. కాగా పోచారం తాను ఎందుకు పార్టీ మారింది చెప్పిన విషయాలు వింటే తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడమేతకు అన్న చందంగా ఉందని చెప్పాలి. రేవంత్ ప్రభుత్వం రైతులకు మేలు చేస్తోందని, అందుకే కాంగ్రెస్లోకి వెళుతున్నానని అన్నారు. తన రాజకీయ జీవితం కాంగ్రెస్తోనే మొదలైందని వెల్లడించారు. మరి కొందరు నేతలు కే.కేశవరావు, దానం నాగేందర్ వంటివారు ఇప్పటికే కాంగ్రెస్లోకి జారుకున్నారు.వరంగల్ ప్రాంతానికి చెందిన ఎర్రబెల్లి దయాకరరావు కూడా పార్టీ మారవచ్చని ప్రచారం జరిగినా, ఆయనైతే ఖండించారు. పోచారం పార్టీ మారుతున్న సమాచారంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు ఆయన ఇంటి వద్ద ఆందోళన చేశారు. పోచారం పార్టీ మారడాన్ని వారు తప్పు పట్టారు. ఆయనకు ఏమి తక్కువ చేశామని పార్టీ ఫిరాయించారని ప్రశ్నించారు. నిజానికి బీఆర్ఎస్ నేతలకు ఇలా ప్రశ్నించే నైతిక హక్కు లేదని చెప్పక తప్పదు. ఎందుకంటే వారు అధికారంలో ఉన్నప్పుడు వివిధ పార్టీల నుంచి నయానోభయానో తమ పార్టీలోకి తెచ్చుకున్నారు. అధికారం పోవడంతో ఇప్పుడు అదే పనిని ఇతర పార్టీలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఎందరు వస్తే అందరిని, ప్రత్యేకించి ఎమ్మెల్యేలను లాగడానికి కాంగ్రెస్ కృషి చేస్తోంది. పదిహేను నుంచి ఇరవైమంది ఎమ్మెల్యేలు పార్టీ మారవచ్చని చెబుతున్నా, అవన్ని ఒక కొలిక్కి రాలేదు. ఈలోగా బీజేపీ వారు కూడా వలపన్నుతున్నట్లుగా ఉంది.ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఈడి దాడులు ఇందులో భాగమేనా అన్న సందేహం పలువురికి వచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ను బలహీనపర్చితే కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ వీక్గా ఉన్నట్లు కనిపిస్తున్నా, వచ్చే ఎన్నికల నాటికి పుంజుకోకూడదని ఏమీ లేదు. ఉదాహరణకు శాసనసభ ఎన్నికల ముందువరకు జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్కు డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. అయినా సాధారణ ఎన్నికలలో గెలిచి అధికారం చేపట్టింది. కాని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్ను నైతికంగా దెబ్బతీస్తున్నాయి. అందువల్లే కేసీఆర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర నేతలతో భేటీ అవుతూ వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. బీఆర్ఎస్కు భవిష్యత్తు ఉంటుందని వారికి నమ్మకం కలిగించే యత్నం చేస్తున్నారు. అవి ఎంతవరకు ఫలిస్తాయో అప్పుడే చెప్పలేం. ప్రజలలో కేసీఆర్ మళ్లీ పట్టు సాధిస్తారన్న విశ్వాసం ఏర్పడడానికి ఇంకా సమయం పడుతుంది. సంక్షోభంలో ఉన్న బీఆర్ఎస్ ఏ మేరకు ఈ ఫిరాయింపు రాజకీయాలను తట్టుకుని నిలబడుతుందన్నదానికి కాలమే సమాధానం ఇస్తుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
శాం పిట్రోడాకు కీలక బాధ్యతలు.. ప్రధాని ఎప్పుడో చెప్పారు: కిరణ్ రిజిజు
లోక్సభ ఎన్నికల వేళ భారతీయుల చర్మ రంగుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత శాం పిట్రోడాకు కాంగ్రెస్ ఓవర్సీస్ అధ్యక్షుడిగా తిరిగిబాధ్యతలు అప్పగించడంపై బీజేపీ తాజాగా విమర్శలు గుప్పించింది. దీనిపై కేంద్రమంత్రి కిరణ్ రిజుజు స్పందిస్తూ.. శాం పిట్రోడాకు కాంగ్రెస్ మళ్లీ కీలక బాధ్యతలు అప్పగిస్తుందని ప్రధాని మోదీ గతంలోనే చెప్పారని అన్నారు. ఈ మేరకు ట్విటర్లో పోస్టు పెట్టారు. ‘ప్రధాని మోదీ ఊహించినట్లే.. రాహుల్ గాంధీ సలహాదారుడు, దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లుగా , ఈశాన్య ప్రజలు చైనీస్గా కనిపిస్తారు, వెస్ట్ ఇండియన్లు అరబ్బులు, ఉత్తర భారతీయులు శ్వేతజాతీయులుగా కకనిపిస్తారని వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి మళ్లీ కీలక పదవి అప్పగించారు. ఈ చర్చ మమ్మల్ని ఆశ్చర్యపరచలేదు. ఎందుకంటే దీనిని ప్రధాని మోదీ ముందుగానే ఊహించారు’. అని పేర్కొన్నారు.ఈ మేరకు గతంలో ఓ ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడిన వీడియోను జత చేశారు. ‘కొన్నిసార్లు ఆ పార్టీ (కాంగ్రెస్ను ఉద్దేశిస్తూ) పక్కా ప్లాన్తో ఉంటుంది. వారి నేతలు సొంతంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తారని నేను అనుకోను. ముందు వారితో అలా మాట్లాడిస్తారు. ఆ తర్వాత పార్టీ వారిని దూరం పెడుతుంది. కొన్నాళ్లకు మళ్లీ వారిని ప్రధాన కార్యకలాపాల్లోకి తీసుకొస్తారు.అమెరికాలోని వారి గురువు (పిట్రోడా) విషయంలోనూ ఇలాగే జరగనుంది. ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ బాధ్యతలు అప్పగిస్తారు చూడండి..! కొత్త అంశాలను తెరపైకి తెచ్చి ప్రజలను గందరగోళానికి గురిచేసేందుకు, ప్రత్యర్థులను తప్పుదోవ పట్టించేందుకు ఆ పార్టీ చేస్తున్న కుట్రలివి’ అని మోదీ ఆ వీడియోలో అన్నారు.కాగా లోక్సభ ఎన్నికల సమయంలో ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. భారత్లో తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా, పశ్చిమవాసులు అరబ్బుల మాదిరిగా కనిపిస్తారు. ఇక ఉత్తరాది వాళ్లు శ్వేత జాతీయులుగా, దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్ల మాదిరిగా ఉంటారు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేపాయి. ఈ క్రమంలోనే పిట్రోడా తన పదవికి రాజీనామా చేయగా.. ఇప్పుడు మళ్లీ ఆయననే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్గా పార్టీ నియమించింది. -
‘రాజదండం స్థానంలో రాజ్యాంగ ప్రతిని అమర్చండి’
ఢిల్లీ: 18వ పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉదయం రాష్ట్రపతిని ‘రాజ దండం’తో ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, ప్రధని మోదీ పార్లమెంట్లోకి స్వాగతం పలికారు. అయితే లోక్సభలో రాజ దండాన్ని స్పీకర్ చైర్ పక్కన గోడకు అమర్చటంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. రాజదండానికి ఉన్న ప్రముఖ్యత ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో రాజదండం స్థానంలో రాజ్యాంగ ప్రతిని అమర్చాలని సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆర్కే చౌదరీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.‘దేశంలో ప్రజాస్వామ్యంలో కోసం రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం ఒక చిహ్నం.బీజేపీ గత ప్రభుత్వంలో రాజదండాన్ని స్పీకర్ చైర్కు పక్కన గోడకు అమర్చారు. సెంగోల్ అనే తమిళ పదం నుంచి వచ్చింది. సెంగోల్ అర్థం దండం. రాజదండం అంటే రాజు చేతి కర్ర. మనం రాజరిక పాలన నుంచి ఎప్పుడో విముక్తులం అయ్యాము. ప్రస్తుతం ఓటు అర్హత కలిగి ఉన్న స్త్రీ,పరుషులు ఓటువేసి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నారు. దేశంలో పాలన రాజ్యాంగంతో నడవాలా? లేదా రాజదండంతో నడవాలా?. రాజదండం స్థానంలో రాజ్యాంగాన్ని అమర్చి.. రాజ్యాంగాన్ని రక్షించండి’ అని ఆయన స్పీకర్కు రాసిన లేఖలో ప్రస్తావించారు.సెంగోల్పై విపక్షాలు చేస్తున్న విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ‘సమాజ్వాదీ పార్టీ గతంలో రామచరిత్మానస్పై విమర్శలు గుప్పించింది. ఇప్పుడు భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా తమిళ సంస్కృతిలో భాగమైన సెంగోల్పై విమర్శలు చేస్తోంది. సమాజ్వాదీ పార్టీ సెంగోల్ను అవమానించడాన్ని డీఎంకే పార్టీ సమర్థిస్తుందో? లేదో? స్పష్టం చేయాలి’ అని విపక్షాల విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. -
రేవంత్ రెడ్డి ప్లేస్ లోకి ఎవరు?
-
ఫిరాయింపులకు పునాది వేసిందెవరు?: కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి ఫైర్
న్యూఢిల్లీ, సాక్షి: ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోయాలనే భావదారిద్ర్యంలో కేసీఆర్ ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్ర తాజా రాజకీయాలపై ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం మధ్యాహ్నాం మీడియాతో మాట్లాడారు. ‘‘మాజీ సీఎం కేసీఆర్కు సిగ్గుండాలి. అసెంబ్లీకి రమ్మంటే రాడు. రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆహ్వానించినా రాడు. తన కుటుంబానికే అన్ని కావాలనే స్వార్థంలో ఉన్నారు. 64 సీట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మాది. ఆది కేసీఆర్ కుప్పకూలిపోతుందని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ బీజేపీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలని అనుకోలేదా?. కాంగ్రెస్ను ఓడించాలనే బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి బదిలీ చేయించారు. సిరిసిల్ల, సిద్దిపేటలో బీజేపీకి అన్ని ఓట్లు పడ్డాయంటే అర్థమేంటి?. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతికత కేసీఆర్కు లేదు. ఎంతో మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బీఆర్ఎస్లో చేర్చుకున్న విషయం ఆయనకు గుర్తులేదా? ఫిరాయింపులకు పునాది వేసింది బీఆర్ఎస్. అమరవీరుల స్తూపం దగ్గర కేసీఆర్ ముక్కును నేలకు రాయాలి. ఇన్నాళ్లూ ఎమ్మెల్యేలను దగ్గరకు రానివ్వని కేసీఆర్ ఇప్పుడు ఫామ్హౌస్ తలుపులు తెరిచారు. మొన్నటిదాకా ఎమ్మెల్యేలను కలవడానికి ఇష్టపడని కేసీఆర్.. ఇవాళ ఇంటికి పిలిచి భోజనం పెడుతున్నారు విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కోరింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి. విచారణ కమిషన్ కేసీఆర్కు లేఖ రాయగానే విచారణ ‘ఎందుకు?’ అని ప్రశ్నిస్తున్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో ఎలాంటి సమస్యలు లేవు. ఏమైనా ఉంటే పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని రేవంత్రెడ్డి అన్నారు.మంత్రి వర్గ విస్తరణపై చర్చించలేదుఅన్ని శాఖలకు సమర్థవంతులైన మంత్రులున్నారు. ఎలాంటి శాఖ ఖాళీ లేదు. మంత్రి వర్గ విస్తరణపై అధిష్టానంతో ఎలాంటి చర్చా జరపలేదు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా పని చేసి.. మంత్రులను కొన్ని నెలలపాటు పెట్టుకోలేదు. మా కేబినెట్లో అన్ని శాఖలకు సమర్థవంతమైన మంత్రులు ఉన్నారు. విద్యాశాఖ నా దగ్గరే ఉంది. ఏమైనా లోపాలు ఉన్నాయా?. ఇప్పటివరకు ఎన్నో సమీక్షలు చేశాను. జీవన్రెడ్డి అలక ఎపిసోడ్ గురించి.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. ఈ పరిణామంతో జీవన్రెడ్డి కాస్త మనస్తాపానికి లోనయ్యారు. పీసీసీ వైపు నుంచి కొంత సమన్వయ లోపం కనిపించింది. అందువల్లే ఈ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. జీవన్రెడ్డి విషయంలో ఏమైనా జరిగితే బాగుండని గోతికాడ నక్కలు ఎదురు చూశాయి. కానీ, జీవన్రెడ్డికి కాంగ్రెస్పై ఆయనకున్న నిబద్ధతకు వాళ్లకు అర్థం కాదు. అధిష్టానం జీవన్రెడ్డి అనుభవం, నిబద్ధతను దృష్టిలో పెట్టుకుంది.జీవన్రెడ్డి గౌరవానికి భంగం కలగడని అధిష్టానం ఆహామీ ఇచ్చింది. సమయం, సందర్భం వచ్చినప్పుడు జీవన్రెడ్డి అనుభవాన్ని వినియోగించుకుంటాం. తెలంగాణకు త్వరలో కొత్త పీసీసీకొత్త పీసీసీపై అధిష్టానంతో చర్చ జరిగింది. పీసీసీ చీఫ్ ను నియమించమని కోరా. ప్రస్తుతం నా పీసీసీ పదవి కాలం జులై 7వ తేదీతో ముగుస్తుంది. నా హయాంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. పీసీసీ ఎంపిక విషయంలో తగిన న్యాయం జరగుతుందని భావిస్తున్నా. బీఆర్ఎస్కు ఛాన్స్ ఇవ్వలేదుఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రాష్ట్రాభివృద్ధే మా ధ్యేయం. తెలంగాణ ప్రజలకు రాహుల్గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయబోతున్నాం. ఆనాడు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తానని చెప్పి ఆ వాగ్దానాన్ని నెరవేర్చారు. రాష్ట్రంలో ఎలాంటి ఘటనలు జరగకుండా ఎన్నికలు పూర్తయ్యాయి. దానిపై విమర్శించడానికి బీఆర్ఎస్కు అవకాశం లేకుండా పోయింది. శాంతిభద్రతలను కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నాం.కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రయత్నిస్తున్నాం. ఇందుకోసం త్వరలో ప్రధాని, కేంద్ర మంత్రుల్ని కలుస్తాం. పక్క రాష్ట్రంతో పునర్విభజన ప్రయోజనాల కోసం చర్చిస్తాం. ఇందుకోసం మంత్రివర్గ ఉపసంఘం వేస్తాం. తెలంగాణను రోల్ మోడల్ స్టేట్గా తీర్చి దిద్దుతాం. భేషజాలకు పోకుండా మా వంతు ప్రయత్నం మేం చేస్తున్నాం అని రేవంత్ అన్నారు. -
అలక వీడిన జీవన్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన హామీతో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి వ్యవహారంలో కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. తనకు సమాచారం లేకుండా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్కుమార్ను పార్టీలో చేర్చుకో వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన జీవన్రెడ్డి అధిష్టానం హామీతో సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అధిష్టానం ఆదేశాల మేరకు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం జీవన్రెడ్డిని వెంటబెట్టుకుని ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి రాత్రి 7.30 గంటలకు నేరుగా తెలంగాణ భవన్లోని శబరి బ్లాక్కు చేరుకున్నారు. అక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులతో భేటీఅయి అరగంట పాటు మంతనాలు సాగించారు. అనంతరం 8 గంటలకు జీవన్రెడ్డిని తోడ్కొని దీపాదాస్, శ్రీధర్బాబులు జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసానికి వెళ్లి సుదీర్ఘంగా చర్చించారు.అండగా నిలిచిన వారిని గుర్తిస్తామన్నారు: జీవన్రెడ్డిఏ పార్టీకైనా కార్యకర్తలే ముఖ్యమని, కార్యకర్తల మనోభావాలు గుర్తించి, పార్టీకి అండగా నిలిచిన వారిని ప్రాధాన్యమిచ్చి గుర్తిస్తామని కేసీ వేణుగోపాల్ చెప్పారని జీవన్రెడ్డి అన్నారు. వేణుగోపాల్తో భేటీ అనంతరం జీవన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఏ పార్టీకైనా కేడర్ ఆత్మగౌరవమే ప్రధానం. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాం. పార్టీకి అండగా నిలిచినవారి ఆలోచనలకు అనుగుణంగానే ముందుకెళ్తాం. వారి కృషికి ప్రాధాన్యత ఇస్తామని వేణుగోపాల్ ఇచ్చిన హామీతో సంతృప్తి చెందాను’ అని జీవన్రెడ్డి తెలిపారు. మారుతున్న రాజకీయ పరిణామాలు, పరిస్థితుల కారణంగా కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదని, అందరికీ కావాల్సింది పార్టీ ఐక్యతే అన్నారు. ఈ భేటీకి చొరవ తీసుకున్న దీపాదాస్ మున్షీ, శ్రీధర్బాబు, లక్ష్మణ్లకు ధన్యవాదాలు తెలిపారు.తలుపులు తెరిచే ఉంటాయి: దీపాదాస్ మున్షీకాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసంతో ఎవరైనా ఎమ్మెల్యే పార్టీలోకి రావాలనుకుంటే పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ చెప్పారు. ‘కాంగ్రెస్లో ఇప్పటికే చాలామంది చేరారు. ఇంకా చాలామంది చేరబోతున్నారు. మా పార్టీలోని కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా కలిసి నడుస్తాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో పటిష్టంగా నడుస్తోంది’ అని అన్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల నియామకం ఉంటుందా అనే ప్రశ్నకు.. ‘పిక్చర్ అభీ బాకీ హై (సినిమా ఇంకా ఉంది) త్వరలోనే ఉంటుంది. పీసీసీ అ«ధ్యక్షుడి ఎంపిక అధిష్టానం నిర్ణయం. అసెంబ్లీ, పార్లమెంటులాగా కాలవ్యవధి ఉండదు’ అని మున్షీ బదులిచ్చారు.దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: శ్రీధర్బాబుగత పదేళ్లలో కాంగ్రెస్ పార్టీని చీల్చి, నష్టపరిచి, బలహీనపరిచిన వారే పార్టీ చేరికలపై మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి శ్రీధర్బాబు మండిపడ్డారు. కాంగ్రెస్లోకి వచ్చేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని, అయితే రాజీనామాలు చేసి రావాలన్న నిబంధనపై పార్టీ ఆలోచన ఏవిధంగా ఉంటుందో చూడాలన్నారు. -
ఒత్తిళ్లకు లొంగొద్దు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: పార్టీలో చేరాలంటూ ఒత్తిళ్లు వచ్చినా లొంగిపోకుండా పార్టీ కోసం పనిచేయాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలు బుధవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్తో భేటీ అయ్యారు. వీరిలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు కాలేరు వెంకటేశ్ (అంబర్పేట), మర్రి రాజశేఖర్ రెడ్డి (మల్కాజిగిరి), లక్ష్మారెడ్డి (ఉప్పల్)తో పాటు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కూడా ఉన్నారు. సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై అధినేత చర్చించారు. అధికార పార్టీ పెట్టే ప్రలోభాలు, ఒత్తిళ్లకు తలొగ్గి పొరపాట్లు చేయొద్దని, బీఆర్ఎస్కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ పార్టీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అధికారమే పరమావధిగా పనిచేసే వారికి ప్రజల్లో ఆదరణ ఉండదని గతంలో అనేక పర్యాయాలు నిరూపితమైందన్నారు. తొందరపాటు నిర్ణయాలతో ప్రజా జీవితంలో చెడ్డపేరు తెచ్చుకోవద్దని చెప్పినట్లు సమాచారం. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు కేసీఆర్ కోరినట్లు తెలిసింది. కాంగ్రెస్ సర్కారు పాలనా వైఫల్యాలను ప్రజల్లో ఎత్తి చూపే విధంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందంటూ సంకేతాలు ఇచ్చారని సమాచారం. ఎర్రవల్లికి తరలివస్తున్న నేతలు ట్రాఫిక్, పార్కింగ్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ అపాయింట్మెంట్ కోరుతున్న నాయకులకు ఎర్రవల్లి నివాసానికి రావాల్సిందిగా ఆహ్వానం అందుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఎర్రవల్లికి వస్తున్నారు. అలాగే పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఇతర ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు కూడా కేసీఆర్ను కలుస్తున్నారు. ఆయన ప్రతి ఒక్కరినీ కలుస్తూ వారితో ఫోటోలు దిగుతున్నారు. త్వరలో జిల్లాల వారీగా కేసీఆర్ పర్యటనలు ఉంటాయని, స్థానికంగా బస చేసి కార్యకర్తలను కలుస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. పార్టీ రాష్ట్ర కార్యవర్గం పునర్వ్వస్థీకరణ, క్షేత్ర స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు, అన్ని స్థాయిల్లో పార్టీ కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై త్వరలో కేసీఆర్ షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది. -
వారంలో విస్తరణ! ఢిల్లీలో ముమ్మర కసరత్తు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఢిల్లీలో ముమ్మర కసరత్తు జరుగుతోంది. కేబినెట్లో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలను భర్తీ చేయడంపై నేతలు దృష్టి సారించారు. గడిచిన మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి ఈ అంశంతో పాటు, పీసీసీ అధ్యక్షుడి నియామకంపై అధిష్టానం పెద్దలతో వరుస భేటీలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. బుధవారం కూడా ఏఐసీసీ పెద్దలతో సమావేశమయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీలతో జరిపిన భేటీల్లో మంత్రివర్గ విస్తరణకు గ్రీన్సిగ్నల్ లభించడంతో పాటు, కొన్ని పేర్లపై సానుకూలత వ్యక్తమైనట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆయా పేర్లపై రాష్ట్ర సీనియర్ మంత్రుల అభిప్రాయాలను నేతలు తీసుకున్నట్లు తెలిసింది. అన్నీ కుదిరితే వారంలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మూడు కోణాల్లో పరిశీలన: రాష్ట్ర కేబినెట్లో ప్రస్తుతం 12 మంది మంత్రులు ఉండగా, మరో 6 స్థానాలు భర్తీ చేసేందుకు అవకాశం ఉంది. ఈ ఆరు స్థానాలకు ప్రస్తుతం 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటీ పడుతున్నట్లు సమాచారం. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, పి.సుదర్శన్రెడ్డి, టి.రామ్మోహన్రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి లాంటి వారు రేసులో ఉన్నారు. అయితే ఇప్పటివరకు అసలు ప్రాతినిధ్యం లేని జిల్లాల్లో నిజామాబాద్ నుంచి సుదర్శన్రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తున్నా, ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచి్చన సీనియర్ నేత పోచారం శ్రీనివాస్రెడ్డి పేరు సైతం తాజాగా తెరపైకి వచి్చనట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు రైతు కమిషన్ చైర్మన్ పోస్టు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. సీఎంతో రాష్ట్ర నేతల సమావేశాలు సుదర్శన్రెడ్డికి సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్, భట్టి విక్రమార్కలు మద్దతిస్తున్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్రెడ్డి, రామ్మోహన్రెడ్డిలు ఇద్దరూ గడిచిన మూడ్రోజులుగా ఢిల్లీలోనే ఉండి బలంగా లాబీయింగ్ చేస్తున్నారు. బుధవారం ఈ ఇద్దరు సీఎం రేవంత్తో భేటీ అయ్యారు. బీసీ సామాజిక వర్గం నుంచి మహేశ్గౌడ్, వాకాటి శ్రీహరి పేర్లు పరిశీలనలో ఉండగా, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన శ్రీహరికి మంత్రి పదవి దాదాపు ఖరారైందని అంటున్నారు. వీరిద్దరు కూడా మూడ్రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. శ్రీహరి సైతం బుధవారం ముఖ్యమంత్రిని కలిసి తన పేరు పరిశీలనకు విన్నవించినట్లు తెలిసింది. వెలమ సామాజిక వర్గం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్ రావు, మదన్మోహన్తో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ల మధ్య పోటీ నెలకొన్నట్లు సమాచారం. అయితే ఈ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే జూపల్లి కృష్ణారావు ఉన్నందున మరొకరికి అవకాశం ఇస్తారా? లేదా? అన్న దానిపై చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. ప్రేమ్సాగర్రావుకు అవకాశం ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించినట్లు తెలిసింది. ఇక ఎస్సీ కోటాలో జి.వివేక్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ప్రాతినిథ్యం లేని జిల్లాలు, సామాజిక వర్గాలతో పాటు ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో వారి పనితీరు ఆధారంగా మంత్రి పదవులు భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. నేతలు బిజీబిజీ మంత్రివర్గ విస్తరణపై రెండ్రోజుల కిందటే మల్లికార్జున ఖర్గే, రాహుల్గాం«దీ, కేసీ వేణుగోపాల్తో చర్చలు జరిపిన సీఎం రేవంత్రెడ్డి బుధవారం మరోమారు వారితో సమావేశమయ్యారు. విస్తరణ విషయంలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మరోపక్క పదవుల పంపకంపై చర్చించేందుకు ఢిల్లీకి వచి్చన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్ రెడ్డి, శ్రీధర్బాబులు ముందు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీప్దాస్ మున్షీతో భేటీ అయ్యారు. కాగా కేబినెట్ విస్తరణపై హైకమాండ్ పెద్దలు రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, జూలై 1 లేదా 2న విస్తరణ జరగవచ్చని తెలిసింది. పీసీసీ రేసులో ముగ్గురు పీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రధానంగా మూడు పేర్లపై హైకమాండ్ పెద్దల వద్ద చర్చలు జరిగినట్లు తెలిసింది. ఎంపీలు బలరాం నాయక్, సురేశ్ షెట్కార్, ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్ ఈ పదవికి పోటీ పడుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు పీసీసీ పదవిని ఎస్టీకి ఇవ్వనందున బలరాం పేరును ముఖ్యమంత్రి ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే ఆయన పేరును కొందరు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. దీంతో మహేశ్గౌడ్కు రేవంత్, ఇతర సీనియర్లు మద్దతు పలికినట్లు తెలుస్తోంది. మహేశ్గౌడ్ కూడా హైకమాండ్ పెద్దలతో తనకున్న పరిచయాలను ఆధారంగా చేసుకుని లాబీయింగ్ చేస్తున్నారు. -
వివాదాస్పద వ్యాఖ్యలు.. శామ్ పిట్రోడాకు కాంగ్రెస్కు కీలక పదవి
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ దక్షిణాది భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా మరోసారి వార్తల్లో నిలిచారు. భారతీయుల చర్మ రంగుపై జాతివివక్షతో వ్యాఖ్యలు చేయడంతో ఆయన కోల్పోయిన పదవి మళ్లీ దక్కింది. శామ్ పిట్రోడాను బుధవారం ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్గా హస్తం పార్టీ తిరిగి నియమించింది.శామ్ పిట్రోడాను తక్షణమే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్గా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించినట్లు సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటనలో తెలిపారు.కాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తూర్పు భారతీయులు చైనియుల్లా, దక్షిణాది భారతీయులు ఆఫ్రికన్ల కనిపిస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో మే 8న ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ పదవికి శామ్ పిట్రోడా రాజీనామా చేశారు. -
‘తొందర పడకండి’..బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్
సాక్షి,హైదరాబాద్ : ‘తొందరపడకండి.. పార్టీ మారుతున్న నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలి’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యేలకు హితబోధ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్లో చేరడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బాన్సువాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్లు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు.ఈ తరుణంలో కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్హౌస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో వరసు భేటీ అవుతున్నారు. నిన్న పలువురు ఎమ్మెల్యలతో కేసీఆర్ మంతనాలు జరపగా.. ఇవాళ హరీశ్ రావు, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, సుధీర్ రెడ్డి,బండారి లక్ష్మారెడ్డిలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ మారుతున్న నేతల పట్ల జాగ్రత్తగా ఉండాలని, తొందరపడొద్దని ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.కాగా మంగళవారం ఎర్రవల్లిలోని ఫాంహౌజ్లో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, ప్రకాశ్గౌడ్, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్ రెడ్డి, దండె విఠల్, మాజీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, నాయకులు క్యామ మల్లేశ్, రావుల శ్రీధర్ రెడ్డిలు హాజరైన విషయం తెలిసిందే. -
ఏపీ కాంగ్రెస్లో ముదురుతున్న వార్
సాక్షి, విజయవాడ: ఏపీ కాంగ్రెస్లో వార్ ముదురుతోంది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డిలకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. షర్మిళ, మాణిక్యం ఠాకూర్ అవినీతికి పాల్పడ్డారని పద్మశ్రీ, రాకేష్రెడ్డి ఆరోపించారు. వాళ్లు చేసిన ఆరోపణలపై ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది.నోటిసులకు సమాధానం ఇచ్చిన పద్మశ్రీ, రాకేష్ రెడ్డి.. 20వ తేదీన అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు షర్మిళ ప్రకటించారని తెలిపారు. అన్ని కమిటీలు రద్దు చేసినప్పుడు క్రమ శిక్షణ కమిటీ కూడా రద్దవుతుందని పద్మశ్రీ, రాకేష్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. నోటీసులో పేర్కొన్న విధంగా వివరణ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్న ఎవరికి ఇవ్వాలో అయోమయంలో ఉన్నామని నేతలు అంటున్నారు. తాను అడిగిన ప్రశ్నలకు ముందు సమాధానాలు ఇవ్వాలని నేతలు కోరుతున్నారు. -
కాంగ్రెస్ అధిష్టానం పిలుపు.. ఢిల్లీకి ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరటంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. కాంగ్రెస్ విప్ అడ్లూరి లక్ష్మణ్తో కలిసి జీవన్రెడ్డి బుధవారం ఢిల్లీకి బయలుదేరారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ను కలిసి వారితో జీవన్ రెడ్డి భేటీ కానున్నట్లు తెలుస్తోంది.కాగా.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కాంగ్రెస్లోకి చేర్చుకోవడం, తనకు సమాచారం లేకుండానే ఇదంతా జరగిందంటూ టి. జీవన్రెడ్డి ఎమ్మెల్సీ పదవి రాజీనామాకు సిద్ధపడ్డారు. అటువంటి నిర్ణయం తీసుకోవద్దని ఆయన్ను కాంగ్రెస్ నేతలు, మంత్రలు బుజ్జగించారు. జీవన్రెడ్డితో కాంగ్రెస్ హైకమాండ్ సైతం చర్చలు జరుపుతోందని, ఆయనకు మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో జీవన్రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం పిలుపుతో ఢిల్లీ బయలుదేరటంపై ప్రాధాన్యత సంతరించుకుంది. -
18వ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా
న్యూఢిల్లీ, సాక్షి: లోక్సభ స్పీకర్ ఎవరనేదానిపై ఉత్కంఠకు తెరపడింది. బుధవారం ఉదయం జరిగిన ఎన్నికలో.. 18వ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా.. వరుసగా మంత్రులు ఆ ప్రతిపాదనను బలపరిచారు. అటు ఇండియా కూటమి తరపున కె.సురేశ్ పేరును శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానం తీసుకొచ్చారు. దీన్ని పలువురు విపక్ష ఎంపీలు బలపర్చారు. అనంతరం మూజువాణీ విధానంలో ఓటింగ్ చేపట్టా.. ఇందులో ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు.విపక్ష కూటమి ఓటింగ్కు పట్టుబట్టకపోవడంతో.. ఓం బిర్లా ఎన్నిక సుగమమైంది. ఓం బిర్లా ఎన్నికపై ప్రధాని మోదీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పరస్పర కరచలనం ద్వారా అభినందనలు తెలియజేశారు. ఈ ఇద్దరితో పాటు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు దగ్గరుండి ఓం బిర్లాను స్పీకర్ చెయిర్లో కూర్చోబెట్టారు. #WATCH | BJP MP Om Birla occupies the Chair of Lok Sabha Speaker after being elected as the Speaker of the 18th Lok Sabha.Prime Minister Narendra Modi, LoP Rahul Gandhi and Parliamentary Affairs Minister Kiren Rijiju accompany him to the Chair. pic.twitter.com/zVU0G4yl0d— ANI (@ANI) June 26, 2024ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సభను నడిపించడంలో స్పీకర్ పాత్ర ఎంతో కీలకం. కొత్తగా ఎన్నికైన ఎంపీలకు స్పీకర్ స్ఫూర్తిగా నిలుస్తారు. గత ఐదేళ్లుగా విజయవంతంగా సభను నడిపించారు. ఓం బిర్లా చరిత్ర సృష్టించారు. 17వ లోక్సభను నిర్వహించడంలో ఆయన పాత్ర అమోఘం. ఆయన నేతృత్వంలోనే కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టాం. జీ-20 సమ్మిట్ ఆయన సలహాలు, సూచనలు అవసరం. మరో ఐదేళ్లు కూడా సభను విజయవంతంగా నడిపిస్తారని ఆశిస్తున్నా. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సభలో విపక్షాల సభ్యులు చర్చించేందుకు అవకాశం ఇవ్వలి. మా గొంతు నొక్కితే సభ సజావుగా నిర్వహించినట్లు కాదు. ప్రజల గొంతుక ఎంత సమర్థవంతంగా వినిపించామన్నదే ముఖ్యం. ఓం బిర్లాకు వైఎస్సార్సీపీ అభినందనలులోక్ సభ స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు వైఎస్ఆర్సీపీ అభినందనలు తెలిపింది. లోక్సభ పక్ష నేత మిథున్రెడ్డి మాట్లాడుతూ.. ‘‘గడిచిన లోక్సభను ఓం బిర్లా ఎంతో హుందాగా నడిపారు. ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు మాట్లాడే అవకాశం ఇచ్చారు.అదే తరహాలో ఈసారి కూడా విజయవంతంగా సభను నడపాలి’’ అని ఆకాంక్షించారు. ఇక.. రెండోసారి స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు. విజయవంతంగా స్పీకర్ పదవి నిర్వహించాలని కోరారాయన. స్పీకర్గా ఓం బిర్లా ట్రాక్ రికార్డు.. లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం 48ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. బుధవారం జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఇండియా కూటమి అభ్యర్థి సురేష్పై ఓం బిర్లా విజయం సాధించారు. ఓం బిర్లా(61) రాజస్థాన్లోని కోటా నుంచి మూడోసార్లు ఎంపీగా గెలిచారు. 2014లో ఎన్నికైన ఆయన లోక్సభలో 86శాతం హాజరును నమోదు చేసుకున్నారు. 671 ప్రశ్నలడిగారు. 2019లో గెలిచాక అనూహ్యంగా స్పీకర్ పదవి చేపట్టారు. ఇప్పుడు.. తొలి నుంచి జరుగుతున్న ప్రచారం నడుమే రెండోసారి స్పీకర్ పదవి చేపట్టబోతున్నారు. లోక్సభ స్పీకర్ పదవిని వరుసగా రెండుసార్లు చేపట్టిన ఐదో వ్యక్తి ఓం బిర్లా. ఆయనకంటే ముందు ఎం.ఎ.అయ్యంగార్, జి.ఎస్.ధిల్లాన్, బలరాం ఝాఖడ్, జి.ఎం.సి.బాలయోగి వరసగా రెండు విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు. వీరిలో బలరాం ఝాఖడ్ ఒక్కరే పదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేశారు. -
స్పీకర్ ఎన్నిక: ఓటింగ్కు ఆ ఏడుగురు దూరం!.. ప్రభావమెంత?
ఢిల్లీ: అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఏకాభిప్రాయం కుదరకపోవటంతో 18వ పార్లమెంట్లోని లోక్సభ స్పీకర్ ఎన్నిక అనివార్యం అయింది. ఇవాళ లోక్సభ సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే అన్ని పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. అయితే రెండురోజులు పాటు పార్లమెంట్లో ఎంపీల ప్రమాణ స్వీకారం జరగ్గా.. మరో ఏడుగురు సభ్యులు ఎంపీలుగా ప్రమాణం చేయలేదు. ఇది ఇవాళ్టి ఓటింగ్పై ప్రభావం చూపబోతుందా? అనే చర్చ నడుస్తోంది. ఎంపీలుగా ప్రమాణం చేయని వాళ్లలో ఇండియా కూటమికి చెందినవారే ఐదుగురు ఉండగా, మిగతా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు. శశిథరూర్, శతృఘ్న సిన్హాలాంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. ఎంపీలుగా ప్రమాణం చేయలేదు కాబట్టి ఇవాళ స్పీకర్ ఎన్నికలో ఈ ఏడుగురు ఓటింగ్కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అయితే.. ఓటింగ్పై ఇది ప్రభావం చూపెట్టే అవకాశాలు తక్కువేనని విశ్లేషకులు చెబుతున్నారు. సభకు హాజరయ్యే సభ్యుల ఆధారంగనే ఓటింగ్ మెజార్టీని లెక్కగడతారని వారంటున్నారు. అదే సమయంలో.. ఎన్డీయే కూటమి 293 సీట్లతో మెజార్టీలో ఉంది. స్పీకర్ ఎన్నికకు మ్యాజిక్ ఫిగర్ 269గా ఉంది. మరోవైపు బీజేపీ విజ్ఞప్తి మేరకు వైఎస్సార్సీపీ సానుకూలంగానే స్పందించింది. ఇక.. ఇండియా కూటమిలో మొత్తం 232గాను 227 మంది ఎంపీలు ప్రమాణం చేశారు. అంటే ఇండియా కూటమికి మెజార్టీ లేదనే చెప్పాలి. దీంతో స్పీకర్ ఎన్నిక ఎన్డీయే వైపు ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇక.. స్పీకర్ ఎన్నిక కోసం మెజార్టీ ఎంపీలు ఉన్నప్పటికీ బీజేపీ స్పీకర్ ఎన్నికలో 300 ఎంపీల ఓట్ల కోసం టార్గెట్ పెట్టుకుంది. అందులో భాగంగానే ఎన్డీయే కూటమిలో లేని పార్టీలను సైతం బీజేపీ మద్దతు కోరింది. స్పీకర్ ఎన్నికకు ఎన్డీయే కూటమి మాజీ స్పీకర్ కోటా ఎంపీ ఓం బిర్లాను, ఇడియా కూటమి కేరళ ఎంపీ కే. సురేష్ను బరిలోకి దింపాయి. ఇవాళ 11 గంటలకు స్పీకర్ ఓటింగ్ జరగనుంది. -
నాడు కారుకూతలు.. నేడు పథకాల్లో కోతలు
సాక్షి, హైదరాబాద్: ‘నాడు కారుకూతలు, నేడు పథకాల్లో కోతలు’ అన్నట్లుగా సీఎం రేవంత్రెడ్డి పాలన సాగుతోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా రేవంత్ చేసిన తప్పులను సరిదిద్దుకోలేడని ఆయ న వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో నిరంజన్రెడ్డి మాట్లాడారు. రూ.2 లక్షల రుణమాఫీ, రైతు కూలీలకు రూ.12 వేలు సాయం, మహాలక్ష్మి పథకం, కొత్త రేషన్ కార్డులు మొదలుకుని అన్నీ అమలుకాని హామీలను ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.రుణమాఫీ వ్యవహారం సినిమా ఫంక్షన్లను తలపిస్తోందని నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రుణ మాఫీ జరగకుండానే సంబురాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ గెలుపునకు బీఆర్ఎస్ సహకరించిందని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలోనే బీజేపీకి ఎక్కు వ ఓట్లు వచ్చాయని, బీజేపీని నిలువరించడంలో కాంగ్రెస్ విఫలమైనందునే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఫలితాలపై విచారణ కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. మీడియా సమావేశంలో మాజీ ఎంపీ లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ఇకనైనా కుటిలరాజకీయాలు, చీకటి ఒప్పందాలు మానాలి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఇకనైనా కుటిల రాజకీయాలు, చీకటి ఒప్పందాలు వీడి ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ సూచించారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రజాసమస్యలపై అర్థవంతంగా చర్చకు సహకరించి పరిష్కారమార్గాలు సూచించాలని ఒక ప్రకటనలో కోరారు. దేశాన్ని అస్థిరపరిచి, బలహీనపరిచేందుకు విదేశీ శక్తుల పాత్ర ఉందనే సాకుతో అధికారాన్ని నిలుపుకునేందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారని గుర్తుచేశారు. ‘ఆ చీకటి అధ్యాయానికి 50 ఏళ్లు. ఎమర్జెన్సీపాలన దేశానికి ఓ మాయని మచ్చ.ప్రజల గొంతునొక్కి కాంగ్రెస్ చేసిన అరాచకాలు, అధికార దాహానికి ఎమర్జెన్సీ నిదర్శనం’ అని మండిపడ్డారు. అధికారం కోసం ఇందిరాగాంధీని మించి ఆమె మనవడు రాహుల్గాంధీ దురాలోచన చేస్తున్నారని ఆరోపించారు. వివిధ దేశాల్లో పర్యటిస్తూ ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది’ అనే ముసుగులో రాహుల్ పాశ్చాత్య దేశాల జోక్యాన్ని నిస్సిగ్గుగా కోరుతూ దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు యత్నించారని ధ్వజమెత్తారు. గతంలో ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చేందుకు 99 సార్లు 356 ఆర్టికల్ను దుర్వినియోగం చేసిన చరిత్ర కాంగ్రెస్దేనని దుయ్యబట్టారు.తెలుగురాష్ట్రాల్లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన డీఎస్పీరెడ్డి, జంగారెడ్డి, వి.రామారావు, జూపూడి యజ్ఞనారాయణ, పీవీ.చలపతిరావు, వెంకయ్య నాయుడు, సీహెచ్.విద్యాసాగర్రావు, ఇంద్రసేనారెడ్డి, ఇంకా సంఘ్ పరివార్ కార్యకర్తలను అరెస్ట్ చేసిన చరిత్ర కాంగ్రెస్దేనని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేసి ఓట్లు పొందాలని చూసినా, కాంగ్రెస్కు దేశ ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. అయినా ఆ పార్టీ నేతలు తీరు మారలేదని బండిసంజయ్ విమర్శించారు. -
మళ్లీ మంచిరోజులు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హామీల అమలులో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని, భవిష్యత్లో బీఆర్ఎస్కు మళ్లీ మంచిరోజులు వస్తాయని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మె ల్యేలకు భరోసా ఇచ్చారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి పార్టీ మారడాన్ని పట్టించుకోవా ల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ బీఆర్ఎస్ ఎమ్మె ల్యేలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకొని ఉద్యమస్ఫూర్తి ని దెబ్బతీసేందుకు ప్రయత్నించినా వెనుకంజ వేయలేదన్నారు.పార్టీ ఫిరాయింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో బీఆర్ ఎస్కు చెందిన పలువురు శాసనసభ్యు లు, శాసన మండలి సభ్యులు మంగళవారం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఎర్రవల్లి నివాసంలో జరిగిన ఈ భేటీ లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అరడజను మంది ఎమ్మెల్యేలు ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్ చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం, క్షీణించిన శాంతిభద్రతలు వంటి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి.రాష్ట్ర ఏర్పాటు ద్వారా అనుభవం కలిగిన నేతలను పునర్నిర్మాణంలో భాగస్వాము లు చేయాలనే లక్ష్యంతోనే కొందరిని బీఆర్ ఎస్లో గతంలో చేర్చుకున్నట్టు కేసీఆర్ చెప్పారు. అధికారం కేంద్రంగా పరిభ్రమించే వ్యక్తులు కొందరు అన్నిచోట్లా ఉంటారని, అలాంటి వారిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పినట్టు సమాచారం. పార్టీ వెంట నడిచే వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కేసీ ఆర్ భరోసా ఇచ్చినట్టు భేటీలో పాల్గొన్న నేతలు వెల్లడించారు.నగర ఎమ్మెల్యేల భేటీకి ప్రాధాన్యంఎర్రవల్లిలో కేసీఆర్ను కలిసిన వారిలో మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డితోపాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నేతలున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఖైరతాబాద్ ఎమ్మె ల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరిన నేపథ్యంలో మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అదే తోవ పడుతున్నారనే ప్రచారం జరు గుతోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యే లు కేసీఆర్తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.కేసీఆర్ను కలిసిన గ్రేటర్ ఎమ్మెల్యేల్లో అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), మాగంటి గోపీనాథ్ (జూబ్లీహిల్స్), మాధవరం కృష్ణారావు (కూకట్పల్లి), ముఠా గోపాల్ (ముషీరాబాద్), ప్రకాశ్గౌడ్ (రాజేంద్రనగర్), కేపీ.వివేకానంద (కుత్బుల్లాపూర్) ఉన్నారు. వీరితోపాటు ఎమ్మె ల్సీలు శేరి సుభాష్రెడ్డి, దండె విఠల్, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, పార్టీ నేతలు క్యామ మల్లేశ్, రావుల శ్రీధర్రెడ్డి కూడా కేసీఆర్ను కలి శారు. కేసీఆర్తో భేటీ అధికారిక సమావేశం కాదని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. బుధ వారం కూడా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్తో భేటీ అయ్యే అవకాశముంది. రెండు రోజులుగా కేసీఆర్ను కలిసేందుకు వందల మంది నాయకులు, కార్యకర్తలు తరలివస్తుండటంతో ఎర్రవల్లి నివాసం వద్ద సందడి నెలకొంది.కౌశిక్ హరికి అభినందనలుఇటీవల రామగుండం కేశోరాం సిమెంట్స్ ఫ్యాక్ట రీ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ప్యానెల్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘంనేత కౌశిక్ హరి కుటుంబ సమేతంగా ఎర్రవల్లి నివాసంలో కేసీ ఆర్ను కలిశారు. కౌశిక్ హరిని కేసీఆర్తోపాటు కేటీఆర్, హరీశ్రావులు కూడా అభినందించారు.కేసీఆర్కు ఊరట రైల్రోకో కేసు దర్యాప్తును నిలిపివేసిన హైకోర్టుసాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావుకు హై కోర్టులో ఊరట లభించింది. ఆయనను నిందితుడిగా చేర్చిన మౌలాలి రైల్రోకో కేసులో దర్యాప్తును నిలిపివేసింది. తదుపరి విచారణ వరకు దర్యాప్తుపై స్టే విధించింది. పోలీసుల కు నోటీసులు జారీ చేసిన జస్టిస్ బి.విజయ్ సేన్రెడ్డి తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. విచారణను జూలై 23 కు వాయిదా వేశారు. 2011లో తనపై నమోదైన రైల్రోకో కేసును కొట్టివేయాలని, ఎలాంటి ఆధారాలు లేకు న్నా తనను నిందితుల జాబితాలో చేర్చారంటూ కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో భాగంగా 2011లో మౌలాలి రైల్వేస్టేషన్లో జరిగే రైల్రోకోలో పాల్గొనా ల ని ఉద్యమకారులను నేను, ప్రొఫెసర్ కోదండరామ్ పురిగొల్పినట్లు పేర్కొంటూ కేసు నమోదు చేశారు. స్వరాష్ట్ర పోరాటంలో నేను, కోదండరామ్లు తమకు పిలుపునిచ్చారన్న సాక్షుల మౌఖిక వాంగ్మూలం తప్ప పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. నేను ఆ రైల్ రోకోలో పాల్గొనలేదు. ఆధారాలు లేకుండా నిందితుల జాబితాలో నా పేరు చేర్చారు. కనుక ఈ కేసు కొట్టివేయాలి’ అని కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ చేపట్టిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి వాదనల సందర్భంగా.. కేసీఆర్ రైల్ రోకోలో పాల్గొన్నట్లు చార్జిషీట్లో పేర్కొనలే దు కదా అని అన్నారు. ఆధారాలు లేకుండా కేసు నమోదు చేయడం సరికాదని చెప్పారు. -
హస్తినలో కాంగ్రెస్ నేతల చక్కర్లు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో కీలక పదవుల భర్తీపై దేశ రాజధానిలో హైకమాండ్ పెద్దల కసరత్తు తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర నేతలంతా ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. అత్యంత ప్రాధాన్య మైన పీసీసీ అధ్యక్ష పదవి సహా మంత్రి పదవుల భర్తీ, ఇతర నామినేటెడ్ పదవుల నియామకానికి సంబంధించి హైకమాండ్ పెద్దలతో చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రెండ్రోజులుగా ఢిల్లీలో ఉంటున్నారు. దీంతో నేతలంతా ఆయనను, పార్టీ ఇతర పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఐదుగురు రాష్ట్ర మంత్రులతోపాటు సుమారు పది మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర సీనియర్ నేతలు ఢిల్లీలో తిష్టవేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.పీసీసీ పదవికి తీవ్ర పోటీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ స్థానంలో కొత్తవారిని నియమించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆ పదవిని ఆశిస్తున్న ముఖ్యనేతంతా ఢిల్లీలోనే మకాం వేశారు. పీసీసీని ఆశిస్తున్న మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్లు రెండ్రోజులుగా హస్తిన లోనే ఉన్నారు. మధుయాష్కీ ఢిల్లీలో తనకున్న పరిచయాలను వాడుకుంటూ పెద్దల దృష్టిలో పడేందుకు యత్నిస్తుండగా, ఇతర నేతలు మంగళవారం ముఖ్యమంత్రిని కలిసి తమ అభ్యర్థిత్వంపై వినతులు ఇచ్చారు.ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తోనూ వీరు భేటీ అయ్యారు. మరోపక్క ముఖ్యమంత్రి ప్రతిపాదిస్తున్న జాబితాలో ఉన్న ఎంపీలు బలరాం నాయక్, సురేశ్ షెట్కార్లు సైతం రోజంతా సీఎం చుట్టూతే ఉన్నారు. హైకమాండ్ పెద్దలను సీఎం కలిసిన సమయంలోనూ ఈ ఇద్దరు ఆయనతో పాటు నేతలను కలిశారు. ఇక్కడే ఉన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డితోనూ పీసీసీ ఆశావహులు భేటీ అయ్యి వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి పదవుల కోసం మరికొందరుమరికొద్ది రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో పలవురు ఆశావహులు పార్టీ పెద్దలను కలిసే ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారు. మంత్రి పదవి దక్కుతుందని గంపెడాశతో ఉన్న మల్రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్లు రేవంత్రెడ్డిని కలిశారు. ఈసారి విస్తరణలో తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేలు జి.వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సైతం కేసీ వేణుగోపాల్ సహాæ ఇతర నేతలను కలిశారు.ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు పార్లమెంట్కు వచ్చిన ముఖ్యమంత్రితో కలిసి రాష్ట్ర నాయకులు అగ్రనేతలైన సోనియాగాంధీ, ప్రియాంకగాంధీలతో ముచ్చటిస్తూ కనిపించారు. ఇక సోమవారం ఖర్గే, రాహుల్లను కలిసిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డిలు రేవంత్తో ఆయన అధికారిక నివాసంలో భేటీ అయ్యి, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికపై మాట్లాడినట్లు తెలిసింది. ఇక వీరితోపాటు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న పలువురు నేతలు సైతం ఢిల్లీలోనే ఉండి హైకమాండ్ పెద్దలకు తమ వినతులు అందజేశారు. ఢిల్లీలో గూడెం మహిపాల్సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సైతం ఢిల్లీలో కనిపించారు. ఆయన కాంగ్రెస్లో చేరేందుకే ఢిల్లీకి వచ్చారని ప్రచారం జరిగినా, సుప్రీంకోర్టులో ఓ కేసు విషయమై వచ్చినట్లు ఆయన వివరణ ఇచ్చారు. ఇక పటాన్చెరుకే చెందిన కాంగ్రెస్ నేత, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు సైతం ఢిల్లీలోనే ఉండి కాంగ్రెస్ పెద్దలను కలవడం గమనార్హం.నేడు ఢిల్లీకి భట్టి, ఉత్తమ్ అధిష్టానం పిలుపుతోనే ఇద్దరు నేతల హస్తిన పయనం సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో స్పష్టమైన కదలికలు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీలో ఉండగా, అధిష్టానం పిలుపు మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు, సీనియర్ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడకు వెళ్లనున్నారు. బుధవారం ఉదయం ఈ ఇద్దరు నేతలు హస్తినకు పయనమవుతున్నారు.పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీలోనే ఉండటంతో కీలక పరిణామాలు చోటుచేసుకోవచ్చనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్ష పదవితోపాటు నామినేటెడ్ పదవుల కసరత్తును ఓ కొలిక్కి తెచ్చేందుకే అధిష్టానం మొగ్గు చూపుతోందని, అందుకే రేవంత్కు తోడు ఆ ఇద్దరికీ ఢిల్లీ నుంచి పిలుపు వచి్చందని తెలుస్తోంది. రేవంత్రెడ్డి బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్కు బయలుదేరతారని తెలుస్తోంది. ఈలోపే ఢిల్లీ పెద్దలతో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతల భేటీ జరిగే అవకాశముంది. -
ఇంకా అలక వీడని జీవన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తనకు సమాచారం లేకుండా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ను పార్టీలో చేర్చుకోవడంపై కినుక వహించిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి ఇంకా అలకపాన్పు వీడలేదు. సంజయ్ను పార్టీలో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ పదవిని వదులుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. సమాచారం తెలుసుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క,సీనియర్ మంత్రి శ్రీధర్బాబు మంగళవారం హైదరాబాద్లోని జీవన్రెడ్డి నివాసానికి వెళ్లి గంటన్నర పాటు చర్చించారు. చర్చల తర్వాత కూడా ఆయన తన వైఖరి మార్చుకోలేదు. కాంగ్రెస్ పార్టీని తాను వదిలే ప్రసక్తే లేదని, అయితే ఎమ్మెల్సీ పదవికి మాత్రం త్వరలోనే రాజీనామా చేస్తానని జీవన్రెడ్డి మీడియాకు వెల్లడించారు. మండలి చైర్మన్కు ఫోన్ సంజయ్ చేరిక సమయంలో కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వలేదన్న మనస్తాపంతో ఉన్న జీవన్రెడ్డితో కాంగ్రెస్ నాయకత్వం సోమవారం చర్చలు జరిపింది. పార్టీ అధిష్టానం కూడా మాట్లాడింది. అయినా, తన వైఖరిలో మార్పు లేదంటూ జీవన్రెడ్డి మంగళవారం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు తాను కలుస్తానంటూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డికి ఫోన్ చేశారు. కానీ, తాను అందుబాటులో లేనని, నల్లగొండ వెళుతున్నానని గుత్తా వెల్లడించడంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబులు బేగంపేటలోని జీవన్రెడ్డి నివాసానికి హుటాహుటిన వెళ్లారు. గంటన్నరకు పైగా అక్కడే ఉండి జీవన్రెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ తగిన గౌరవం ఇస్తుందని, సీనియారిటీకి ఎక్కడా గౌరవం తగ్గకుండా తాము చూస్తామని నచ్చజెప్పారు. అయితే, మంత్రులతో చర్చల సందర్భంగా జీవన్రెడ్డి తన మనసులోని మాటలను వారికి వెల్లడించారని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని, తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గంలోని తన రాజకీయ ప్రత్యరి్థని పార్టీలో చేర్చుకోవడం ద్వారా తనకు ఏం గౌరవం ఇచి్చనట్టని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో తనది నాలుగు దశాబ్దాల అనుబంధమని, తాను పార్టీని వీడే ప్రసక్తే లేదని, అయితే ఎమ్మెల్సీ పదవిలో కొనసాగే ఆలోచన ప్రస్తుతానికి లేదని, తన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేసినట్టు సమాచారం. జీవన్రెడ్డి మా మార్గదర్శకులు: డిప్యూటీ సీఎం భట్టి మంత్రి శ్రీధర్బాబు, ఇతర నేతలతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని పదేళ్లు పార్టీ జెండాను భుజాన మోస్తూ పార్టీ భావజాలాన్ని చట్టసభల్లో వినిపించిన నాయకుడు జీవన్రెడ్డి అని అన్నారు. ఆయన మనస్తాపానికి గురైతే తాము కూడా బాధపడతామని వ్యాఖ్యానించారు. జీవన్రెడ్డి తమందరికీ మార్గదర్శకులని, ఆయన అనుభవాన్ని ప్రభుత్వాన్ని నడిపేందుకు తప్పనిసరిగా వినియోగించుకుంటామని చెప్పారు. ఆయన సీనియారిటీకి ఎలాంటి భంగం కలిగించకుండా పార్టీ సముచిత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. సీనియర్ నాయకులను వదులుకునేందుకు పార్టీ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని జీవన్రెడ్డిని తాము కోరామని, ఆయన సానుకూలంగా స్పందించారని భట్టి వెల్లడించారు. చైర్మన్ను సమయం ఎందుకు అడిగానో ఆలోచించుకోండి: జీవన్రెడ్డి భట్టి, శ్రీధర్బాబులతో చర్చలు ముగిసిన అనంతరం జీవన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీతో 40 ఏళ్ల అనుబంధం ఉదని చెప్పారు. జరిగిన పరిణామాలు కొన్ని బాధించాయని వ్యాఖ్యానించారు. తనతో పార్టీ ఇన్చార్జ్ మున్షీ కూడా మాట్లాడారని వెల్లడించారు. శాసనమండలి చైర్మన్ అందుబాటులో లేరని, ఆయన అందుబాటులోకి రాగానే నిర్ణయం చెబుతానని, త్వరలోనే మండలి చైర్మన్ దగ్గరకు వస్తానని అన్నారు. మీరు ఎమ్మెల్సీగా కొనసాగుతారా? రాజీనామా చేస్తారా అని ప్రశ్నించగా, మండలి చైర్మన్ టైం ఎందుకు అడిగానో అర్థం చేసుకోవాలని జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు.