Civil Supplies Department
-
మే నుంచి చిరుధాన్యాల పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం కార్డుదారులకు పూర్తిస్థాయిలో నిత్యావసరాలను అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగా ఆయా పంట ఉత్పత్తులను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసేలా ప్రణాళికలు రచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2023ను మిల్లెట్ ఇయర్గా ప్రకటించిన నేపథ్యంలో మే 1వ తేదీ నుంచి రాయలసీమ జిల్లాల్లో చిరుధాన్యాల (జొన్నలు, రాగులు) పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి జొన్న ఉత్పత్తులను సేకరించగా.. కర్ణాటక ప్రభుత్వం నుంచి ఎఫ్సీఐ ద్వారా రాగులు కొనుగోలు చేయనుంది. చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచేలా.. పేదలకు పీడీఎస్ కింద పౌష్టికాహార ఉత్పత్తులను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలో ఖరీఫ్ నుంచి చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచేలా వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా రైతులు మిల్లెట్లు పండించేలా అవగాహన కల్పించనున్నారు. చిరుధాన్యాల ఉత్పత్తులను స్థానికంగానే రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసి పీడీఎస్లో పంపిణీ చేయనున్నారు. ఫలితంగా రైతులకు మార్కెట్లో పక్కా ధర భరోసా దక్కనుంది. వచ్చే ఖరీఫ్లో కందుల కొనుగోలు రాష్ట్రంలో ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి సుమారు 4లక్షల టన్నుల వరకు కందుల దిగుబడి నమోదవుతోంది. ఈ క్రమంలోనే పీడీఎస్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఖరీఫ్లో నేరుగా రైతుల నుంచి కందులు సేకరించేలా పౌరసరఫరాల శాఖ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో 1.45 కోట్ల రైస్ కార్డులు ఉండగా.. ఇందులో ప్రతి నెలా సగటున 5,500 టన్నుల కందిపప్పు అవసరం అవుతున్నది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో కందిపప్పు సాధారణ రకం రూ.120–రూ.125, ఫైన్ వెరైటీ రూ.130 వరకు పలుకుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం సబ్సిడీపై కిలో కందిపప్పును రూ.67కే అందిస్తోంది. ఫలితంగా ఏప్రిల్లో ఏకంగా 7,100 టన్నుల కందిపప్పును వినియోగదారులకు సరఫరా చేసింది. బియ్యం బదులు గోధుమ పిండి కేంద్ర ప్రభుత్వం పీడీఎస్ కింద నెలకు 1,800 టన్నులు మాత్రమే గోధుమ ఉత్పత్తులను రాష్ట్రానికి కేటాయిస్తుండగా.. వాటిని తొలి ప్రాధాన్యత కింద వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో పంపిణీ చేస్తున్నారు. కిలో రూ.16 చొప్పున కార్డుకు గరిష్టంగా రెండు కిలోలు సరఫరా చేస్తున్నారు. అయితే గోధుమను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసేందుకు వినియోగదారుల నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలను సేకరించనున్నారు. ఇక్కడ ప్రతినెలా ఇచ్చే రేషన్లో కేజీ బియ్యం బదులు ఉచితంగా గోధుమ పిండి ఇచ్చేలా పౌరసరఫరాల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. స్థానిక అవసరాలకు అనుగుణంగా.. రాష్ట్రంలో ప్రజా పంపిణీకి అవసరమైన నిత్యావసరాల ఉత్పత్తులను స్థానికంగా రైతుల నుంచి కొనుగోలు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఫలితంగా రైతులకు మద్దతు ధర భరోసా దక్కడంతో పాటు.. కేంద్ర ప్రభుత్వం సరుకు ఇచ్చే వరకు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
ఒక్క గింజా వదలం.. నయా పైసా పోనియ్యం
సాక్షి, హైదరాబాద్: కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లర్లకు కేటాయించిన ధాన్యంలో ఒక్క గింజను వదులుకోబోమని, ఒక్క రూపాయిని కూడా ఊరికే పోనివ్వ మని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ధాన్యం అమ్ముకునే మిల్లర్లను, రేషన్ బియ్యం పక్కదారి పట్టడాన్ని గుర్తించి సమాచారం అందించిన పౌరులకు సైతం రివార్డులు అందజేయడంతోపాటు వారి వివరాల్ని గోప్యంగా ఉంచుతామన్నారు. శుక్రవారం పౌర సరఫరాల శాఖ, సంస్థల అధికారులతో హైదరాబాద్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ సూర్యాపేట, నల్గగొండ, వనపర్తి, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోనే అధికంగా మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని, సీఎంఆర్ అప్పగింతలో కూడా ఈ జిల్లాల్లో డిఫాల్టర్లు అధికంగా ఉన్నారని వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో పటిష్టమైన టాస్క్ఫోర్స్ను తక్షణమే ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మిగతా అన్ని జిల్లాల్లోనూ రిటైర్డ్ పోలీస్, రెవెన్యూ ఉన్నతాధికారులతో కట్టుదిట్టమైన టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆరు రెట్లు ధాన్యం దిగుబడి.. రెండు రెట్లు మాత్రమే పెరిగిన మిల్లింగ్ కెపాసిటీ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయ అభివృద్ధికి చేసిన కృషితో 24 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 141 లక్షల మెట్రిక్ టన్నులకు ధాన్యం సేకరణ పెరిగిందని మంత్రి కమలాకర్ తెలిపారు. ఆరింతలుగా పెరిగిన ఈ ధాన్యం సేకరణకు అనుగుణంగా మిల్లింగ్ కెపాసిటీ పెరగలేదని, కేవలం గతానికి ఇప్పటికి 2 రెట్లు మాత్రమే పెరిగిందన్నారు. అందువల్ల మిల్లర్లకు అదనంగా ధాన్యం కేటాయింపులు చేయడం జరుగుతుందని, ఇదే అదనుగా కొన్ని చోట్ల మిల్లర్లు ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్న ట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి వారిపై క్రిమినల్ కేసులతోపాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ ను ప్రయోగించి 125 శాతం నగదు రికవరీ చేస్తా మని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్ల నుంచి 90 శాతం రికవరీ చేశామని, మిగతా పది శాతం సైతం రికవరీ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రెండు లారీ ల బియ్యం మిల్లుకు అక్రమంగా తరలిస్తుండగా, విజిలెన్స్ బృందాలు పసిగట్టి పట్టుకున్నాయని చెప్పారు. పెద్దపల్లితో పాటు సూర్యాపేట, ఇతర జిల్లాల్లో జరిగిన బియ్యం అక్రమాలపై కూడా కేసులు బుక్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ధాన్యం నిల్వ కోసం ఇంటర్మీడియట్ గోదాంలు ఈ యాసంగిలో ఇంటరీ్మడియట్ గోదాములను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి గంగుల తెలిపారు. సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో ఖాళీగా ఉన్న మిల్లింగ్ కెపాసిటీని వాడుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సీఎంఆర్ డిఫాల్టర్లకు, అక్రమ మిల్లర్లకు ఈసారి ఒక్క గింజను కూడా కేటాయించబోమని చెప్పారు. సమీక్షలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి గంగులను కలిసిన గెల్లు శ్రీనివాస్ సాక్షి, హైదరాబాద్: పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమితులైన హుజూరాబాద్ నియో జకవర్గం బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 15న ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కావలసిందిగా ఆయన్ను కోరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ను అభినంస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని, సీఎం కేసీఆర్ అప్పగించిన బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని గంగుల సూచించారు. -
కస్టమ్ మిల్లింగ్పై స్పెషల్ ఫోకస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందాను పూర్తిగా అరికట్టేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)పై పటిష్ట నిఘాను ఏర్పాటు చేసింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించి వాటిని బియ్యంగా మార్చే ప్రక్రియలోకి పీడీఎస్ బియ్యం వచ్చి చేరకుండా జాగ్రత్త పడుతోంది. దేశంలోనే తొలిసారిగా ఏపీలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీఎంఆర్ మిల్లుల విద్యుత్ వినియోగం, కస్టమ్ మిల్లింగ్ జరిగిన బియ్యం పరిమాణాన్ని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తోంది. ఇందులో భాగంగానే 8 జిల్లాల్లో సుమారు 46 మిల్లుల్లో సీఎంఆర్ బియ్యం పరిమాణం కంటే విద్యుత్ వినియోగం చాలా తక్కువగా ఉండటాన్ని గుర్తించింది. తక్కువ విద్యుత్ వాడి ఎక్కువ మొత్తంలో మిల్లింగ్ చేయడం ఎలా సాధ్యమైందన్న అంశంపై ఆరా తీస్తోంది. ఇందులో భాగంగా ఆయా మిల్లులను వెంటనే తనిఖీ చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్లను ఆదేశించింది. తగ్గిన అక్రమ రవాణా మరోవైపు విజిలెన్స్ బృందాలతో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తుండటంతో చాలావరకు రేషన్ బియ్యం అక్రమ రవాణా తగ్గింది. దీనికి తోడు 6ఏ కేసులను త్వరగా విచారించి పట్టుబడ్డ బియ్యాన్ని తిరిగి బహిరంగ వేలం ద్వారా మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఇందుకు ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్, డీసీఎస్వో, పౌర సరఫరాల శాఖ ఏఎం, మార్కెటింగ్ శాఖ ఏడీలతో ప్రత్యేక కమిటీలను నియమించింది. వీరు సంబంధిత తహసీల్దార్ ఆధ్వర్యంలో బియ్యం నాణ్యత, రకాన్ని బట్టి అప్సెట్ ధరను నిర్ణయించి బహిరంగ వేలానికి వెళ్తున్నారు. అక్రమ రవాణాలో దొరికిన బియ్యాన్ని ఎప్పటికప్పుడు బయటకు పంపించేలా ప్రతి నెలలో రెండు సార్లు బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు. సాధారణంగా రేషన్ దుకాణంలో రికార్డులకు మించి స్టాక్ ఉంటే దానిని సీజ్ చేసి కేసు నమోదు చేస్తారు. ఇటువంటి నిల్వలకు మోక్షం కలి్పంచి పీడీఎస్ ధరకే ప్రజా పంపిణీలోకి తీసుకొస్తున్నారు. సరైన పత్రాలు లేకుండా ప్రైవేట్ గోడౌన్లు, దుకాణాలు, లారీల్లో స్వా«దీనం చేసుకున్న బియ్యాన్ని మాత్రం బహిరంగ వేలానికి పెడుతున్నారు. నిల్వలతో సమస్య అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ బియ్యాన్ని స్వాధీనం చేసుకుంటున్న అధికారులు కేసులు నమోదు చేసి ఎక్కడికక్కడ ఎంఎల్ఎస్ పాయింట్లలో సరుకును నిల్వ చేస్తున్నారు. అయితే, కేసుల విచారణ జాప్యంతో నిల్వలు పేరుకుపోయి బియ్యం ముక్కిపోవడం, రంగు మారడం, పురుగులు పట్టి ప్రజా వినియోగానికి పనికిరావట్లేదు. వీటి ప్రభావం ఎంఎల్ఎస్ పాయింట్లలోని తాజా సరుకులపైనా పడుతోంది. ఒక్కోసారి ఈ నిల్వలు సాధారణ పీడీఎస్లో కలిసిపోతుండటంతో సరైన లెక్కలు ఉండట్లేదు. వీటిని అరికట్టేందుకు జిల్లాల్లో ఒకట్రెండు ఎంఎల్ఎస్ పాయింట్లను గుర్తించి వాటిలో మాత్రమే అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ చౌక బియ్యాన్ని నిల్వ చేస్తున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసుల్లో సరుకు విలువ రూ.50 లక్షలకు పైబడి ఉంటే కలెక్టర్, రూ.50 లక్షలు లోపు ఉంటే జాయింట్ కలెక్టర్ విచారించనున్నారు. కోర్టు పరిధిలో ఉన్న కేసులు మినహా మిగిలిన వాటిని జిల్లా స్థాయిలో వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నారు. సీఎంఆర్పై ప్రత్యేక దృష్టి పౌరసరఫరాల శాఖలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మిల్లుల కరెంటు వాడకం, వారిచ్చిన కస్టమ్ మిల్లింగ్ బియ్యం పరిమాణాన్ని పోల్చి చూస్తున్నాం. కొన్ని మిల్లుల్లో సీఎంఆర్ చేసి ఇచ్చిన బియ్యానికి, వాడిన కరెంట్కు పొంతన లేదు. తక్కువ కరెంట్తో ఎక్కువ బియ్యం సీఎంఆర్ చేసినట్టు చూపిస్తున్నారు. దీనిపై ఆయా జిల్లాల జేసీలను తనిఖీ చేయాలని ఆదేశించాం. వారిచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటాం. – హెచ్.అరుణ్కుమార్, పౌరసఫరాల శాఖ కమిషనర్ వేగంగా కేసులను డిస్పోజ్ చేస్తున్నాం రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన బియ్యం అందిస్తుండటంతో చాలా వరకు రేషన్ అక్రమ రవాణా తగ్గింది. దీనితో పాటు ఇప్పటివరకు నమోదైన 6ఏ కేసులను కూడా త్వరగా విచారించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాం. కొన్నేళ్లుగా విచారణకు నోచుకోని కేసులు, భారీగా పేరుకుపోయిన నిల్వలను క్లియర్ చేస్తున్నాం. సరైన పత్రాలు లేకుండా తరలిస్తూ పట్టబడ్డ బియ్యానికి బహిరంగ వేలం నిర్వహించి ప్రజా వినియోగంలోకి తీసుకొస్తున్నాం. – విజయ సునీత, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ -
ఎండీయూ ఆపరేటర్లకూ వాహనమిత్ర
సాక్షి, అమరావతి: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికీ రేషన్ సరఫరా చేస్తున్న మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్(ఎండీయూ) ఆపరేటర్లకు బీమా ప్రీమియాన్ని ఈ ఏడాది నుంచి వాహన మిత్ర పథకంలో భాగంగా చెల్లించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. తమకు వచ్చే వేతనం నుంచి ఎండీయూ వాహనాల ప్రీమియాన్ని ఏటా బ్యాంకులు జమ చేసుకోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఎండీయూ ఆపరేటర్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావుకు విన్నవించారు. ఇదే విషయాన్ని మంత్రి కారుమూరి సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే సీఎం సానుకూలంగా స్పందించారు. బీమా ప్రీమియం చెల్లింపును వాహనమిత్ర పథకం కిందకు చేర్చి 2021 నుంచి అమలు చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు. ఈ ఏడాది జూలైలో సొంతంగా ఆటో, ట్యాక్సీలు నిర్వహించుకునే వారికి చెల్లించే వాహనమిత్ర పథకంతో.. ఎండీయూ ఆపరేటర్లకూ ప్రీమియం మొత్తం రూ.9 కోట్లు ప్రభుత్వం నేరుగా చెల్లించనుందని మంత్రి కారుమూరి శనివారం రాత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు. -
పేదలందరికీ అన్నం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ప్రతి ఆరు నెలలకోసారి నూతన బియ్యం కార్డుల మంజూరుకు శ్రీకారం చుట్టింది. తొలి అర్ధ సంవత్సరం జూన్లో, చివరి అర్ధ సంవత్సరం డిసెంబర్లో.. అప్పటి వరకు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కొత్త కార్డులను అందిస్తోంది. తాజాగా 26 జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 70,807 రైస్ కార్డులను మంజూరు చేసింది. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి వీటిని పంపిణీ చేయనుంది. ఈ మేరకు కార్డుల ముద్రణను దాదాపు పూర్తి చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 1.39 కోట్ల కార్డులు మాత్రమే ఉండేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక కార్డుల సంఖ్యను 1,45,43,996కు పెంచింది. వీటి కింద 4.24 కోట్ల మందికి 2.31 టన్నుల బియ్యాన్ని ప్రతి నెలా పంపిణీ చేస్తోంది. ఇప్పుడు కొత్తగా ఇచ్చేవాటితో కలిపితే మొత్తం కార్డుల సంఖ్య 1,46,14,803 అవుతుంది. అదనంగా 1.66 లక్షల మందికి ప్రతి నెలా 8.30 లక్షల టన్నుల రేషన్ను పంపిణీ చేయనుంది. ఇందుకుగాను ప్రభుత్వంపై నెలకు రూ.3.40 కోట్ల భారం పడుతుంది. ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ పంపిణీతో పాటు, దేశంలో ఎక్కడా లేని విధంగా నాణ్యమైన(సార్టెక్స్) బియ్యం ఇస్తోంది. అందువల్ల ప్రతి నెలా 90 శాతానికి పైగా ప్రజలు రేషన్ తీసుకుంటున్నారు. ఆరు దశల ధ్రువీకరణ ముఖ్యం రాష్ట్రంలో బియ్యం కార్డుల మంజూరులో ప్రభుత్వం ఆరు దశల ధ్రువీకరణ(సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్) విధానాన్ని అవలంబిస్తోంది. ఇందులో అర్హులైతేనే కొత్త కార్డులిస్తోంది. ఈ క్రమంలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో వెసులుబాటు కల్పించాం. వీటిపై వచ్చే దరఖాస్తులను సచివాలయ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పునఃపరిశీలన జరిపి అర్హులని తేలితే.. ఆ మేరకు సరిచేసి కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం. – హెచ్.అరుణ్కుమార్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ -
Andhra Pradesh: రైతుకు సంపూర్ణ ‘మద్దతు’
దళారుల దోపిడీ నుంచి విముక్తి గతంలో ధాన్యం అమ్ముకోవాలంటే ఇబ్బంది పడేవాడిని. ఆర్బీకేల ద్వారా కల్లాల్లోనే ధాన్యం కొనుగోలు చేసి రైతుల ప్రమేయం లేకుండా మిల్లుకు పంపడం ఆనందంగా ఉంది. నేను రూ.3.75 లక్షల విలువైన 245 బస్తాల ధాన్యం ఆర్బీకే ద్వారా విక్రయించాను. కొందరు రైతులు బయటి వ్యక్తులకు అమ్మి బస్తాకు రూ.300 నష్టపోయారు. ఇప్పుడు బాధ పడుతున్నారు. ప్రతి ఆర్బీకేలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో సకాలంలో పంటను అమ్ముకోగలుగుతున్నాం. – సత్తి జగదీశ్వరరెడ్డి, రైతు, కృష్ణంపాలెం, తూర్పుగోదావరి జిల్లా పూర్తి మద్దతు ధర దక్కింది ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ ధాన్యం సేకరణ విధానంతో రైతుగా నాకు ఎంతో మేలు జరిగింది. నేను తొలిసారి పూర్తి మద్దతు ధర పొందాను. గతంలో ఎప్పుడూ బస్తాకు రూ.100– 200 తక్కువకు అమ్ముకునేవాడిని. ఈ సారి 3.5 ఎకరాల్లో పంట సాగు చేస్తే 95 క్వింటాళ్ల పంటను ఆర్బీకేలో విక్రయించాను. రూ.1.96 లక్షలు వచ్చింది.ఐదు రోజులు తిరక్కుండానే నా ఖాతాలో నగదు జమైంది. హమాలీ, ట్రాన్స్పోర్టు ఖర్చులు కూడా ప్రభుత్వం ఇచ్చింది. వచ్చే పంటకు ముందుగానే డబ్బులు చేతిలోకి వచ్చాయి. గతంలో ఇంత వ్యవస్థ లేదు. ఎవరూ పట్టించుకునేవారు కాదు. అందుకే దళారులకు అమ్ముకునే వాళ్లం. – డి.సాయి ప్రసాద్, రైతు, కొత్తపేట, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో రైతులకు దక్కాల్సిన మద్దతు ధరను కాజేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం రైతు ఒక్క గింజ కూడా నష్టపోకుండా కాపు కాస్తోంది. రైతు కల్లంలో ధాన్యం ఆరబోసిన దగ్గర నుంచి మిల్లుకు తరలించేంత వరకు ప్రభుత్వమే అన్నీతానై అండగా నిలుస్తోంది. ధాన్యం సేకరణలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు రైతు చెంతకే మద్దతు ధరను తీసుకెళ్లాయి. సాగుదారుల్లో ఎక్కువగా ఉండే చిన్న, సన్నకారు రైతులకు మరింత మేలు చేస్తూ గోనె సంచుల వినియోగ చార్జీల నుంచి హమాలీల కూలి, రవాణా ఖర్చుల వరకు ప్రభుత్వమే భరిస్తోంది. వీటి కింద ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకు రూ.14.80 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసి వారికి ఖర్చుల భారాన్ని తగ్గించింది. 35 లక్షల టన్నుల సేకరణ అంచనా ఈ ఖరీఫ్లో 85.58 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేశారు. ఈ మొత్తం దిగుబడిలో రైతులు తమ కుటుంబ, విత్తన అవసరాల కోసం 20–30 శాతం వరకు ధాన్యాన్ని నిల్వ చేసుకుంటారు. మిగిలిన 70 శాతం మార్కెట్కు వస్తుంది. ఇందులో 20–30 శాతం వరకు ఫైన్ వెరైటీలు (సన్నరకాలు) ఉంటాయి. వీటికి బహిరంగ మార్కెట్లో మంచి రేటు దొరుకుతుంది. మిగిలిన 40–50 శాతం సాధారణ రకాలను ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. ఈ క్రమంలోనే 3,216 ఆర్బీకేల ద్వారా 35 లక్షల టన్నుల ధాన్యం సేకరణ అంచనాగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 1.93 లక్షల మంది రైతుల నుంచి రూ.2,303 కోట్ల విలువైన 10.91 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఇందులో 83 వేల మంది రైతులకు 21 రోజుల్లోపే రూ.752 కోట్లు చెల్లింపు చేసింది. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు కృష్ణాలోనూ 75 శాతం వరకు ధాన్యం సేకరణ పూర్తయింది. ఇప్పుడిప్పుడే శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరులో కోతలు, నూర్పిడులు వేగం పుంజుకున్నాయి. గతంలో కంటే మిన్నగా.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 18 లక్షల మంది రైతుల నుంచి రూ.43 వేల కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ప్రస్తుత ప్రభుత్వం మూడున్నరేళ్లలోనే 26.63 లక్షల మంది రైతుల నుంచి రూ.50,825 కోట్ల విలువైన 2.71 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇక్కడ గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రస్తుతం మద్దతు ధర పొందుతున్న రైతులు అధికంగా ఉండటం విశేషం. ప్రభుత్వ పారదర్శక విధానాలు, మిల్లర్లు, దళారుల దోపిడీకి పూర్తిగా అడ్డుకట్ట వేయడంతో రైతులు సంతోషంగా మద్దతు ధరకు ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. మిల్లర్ల ప్రమేయానికి స్వస్తి ఇన్నేళ్ల ధాన్యం సేకరణ చరిత్రలో ప్రభుత్వం తొలిసారిగా మిల్లర్ల ప్రమేయానికి స్వస్తి పలికింది. ఆర్బీకే సిబ్బంది ఆధ్వర్యంలో ధాన్యం తూకం వేసి, ఎఫ్టీవో (ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్) జనరేట్ చేసిన తర్వాత మద్దతు ధర ఒక్క రూపాయి కూడా తగ్గకుండా జమయ్యేలా చర్యలు చేపడుతోంది. మిల్లుకు చేరిన ధాన్యంపై మిల్లరు అభ్యంతరం వ్యక్తం చేస్తే పరిష్కరించేలా ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. ఫలితంగా ఆర్బీకే ఫైనల్ చేసిన తేమ శాతానికి, బరువుకు మిల్లరు కట్టుబడాల్సిన పరిస్థితిని తీసుకొచ్చి రైతులకు పూర్తి మద్దతు ధరను అందిస్తోంది. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు, కృష్ణాలోనూ కొన్ని చోట్ల మిలర్లు రైతులను నేరుగా పిలిపించి తేమ శాతం పేరుతో ధాన్యం కోత పెట్టే ప్రయత్నం చేయడంతో పౌర సరఫరాల సంస్థ అధికారులు వారిని కస్టమ్ మిల్లింగ్ రైస్ నుంచి బ్లాక్ లిస్టులో పెడతామని గట్టిగా హెచ్చరించారు. ధాన్యం సేకరణతో పాటు రైతులకు పూర్తి మద్దతు కల్పనను ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకున్న నేపథ్యంలో జిల్లాల్లో కలెక్టర్లు, జేసీలు సైతం ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. చాలా వరకు ధాన్యం కోతలు యంత్రాలపై చేస్తుండటంతో పంట వేగంగా బయటకు వస్తోంది. తేమ శాతం నిర్దిష్ట ప్రమాణం 17 కంటే ఎక్కువగా ఉంటే రెండు, మూడు రోజులు ఆరబెట్టాక ఆర్బీకే సిబ్బంది ధాన్యాన్ని మిల్లుకు తరలించి రైతులకు మేలు చేసేలా పని చేస్తున్నారు. 2014–15లో అప్పటి ప్రభుత్వం రెండు సీజన్లలో కలిపి 1.18 లక్షల మంది రైతుల నుంచి 40.62 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. ఇందు కోసం రూ.5,583 కోట్లు చెల్లింపులు చేసింది. ఇక్కడ సగటున ఒక్కో రైతు నుంచి సేకరించిన ధాన్యం 34.42 టన్నులు. చిన్న, సన్నకారు రైతులు అధికంగా ఉన్న రాష్ట్రంలో ఒక్కో రైతు నుంచి ఇంత పెద్ద మొత్తంలో ధాన్యం కొనుగోలు చేయడం ఎలా సాధ్యం? అంటే ఇక్కడ దళారులే రైతుల పేరిట ప్రభుత్వానికి ధాన్యం విక్రయించి మద్దతు ధరను కొట్టేశారన్నది సుస్పష్టం. 2015–16లోనూ అంతే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గతంలో రైతుల పేరుతో దోపిడీ గతంలో పేరుకే ప్రభుత్వం ధాన్యం సేకరణ జరిపేది. రైతులకు మద్దతు ధర పేరుతో దళారులకు, కొందరు మిల్లర్లకు దోచిపెట్టేవారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని బస్తాకు (75 కేజీల) మద్దతు ధర కంటే రూ.200 వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరానికి తక్కువలో తక్కువ 30 నుంచి 33 బస్తాల దిగుబడి వేసుకున్నా.. రూ.6వేలకు పైగా ప్రత్యేక్షంగా రైతులు నష్టపోయేవారు. తేమ శాతం పేరుతో ఇష్టమొచ్చినట్టు కోత పెట్టేవారు. ఇలా రైతుల నుంచి దళారులు కొన్న ధాన్యం తిరిగి ప్రభుత్వం దగ్గరకు వచ్చేది. మద్దతు ధరను రైతుల పేరుతో దళారులు బొక్కేసేవారు. మిల్లర్లు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ధాన్యం సేకరణలో మిల్లర్లు నిబంధనలు అతిక్రమిస్తే బ్లాక్ లిస్టులో పెడుతున్నాం. క్షేత్ర స్థాయిలో కలెక్టర్లు, జేసీలు కూడా ధాన్యం సేకరణను పర్యవేక్షిస్తున్నారు. మిల్లరు దగ్గర తేమ శాతంలో తేడా వచ్చే అవకాశం లేదు. ఆర్బీకే ఫైనల్ చేసిందే మిల్లరు తీసుకోవాలి. – వీరపాండియన్, ఎండీ, పౌర సరఫరాల సంస్థ రైతులు మిల్లర్ల దగ్గరకు వెళ్లొద్దు రైతులు ఆర్బీకేల్లో ధాన్యం విక్రయించిన తర్వాత మిల్లరు దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఏమైనా సమస్యలు వస్తే ఆర్బీకే సిబ్బంది, కస్టోడియన్ అధికారి చూసుకుంటారు. రైతులకు ఎఫ్టీవో జనరేట్ అయిన తర్వాత అందులో చూపించిన మొత్తం ఎట్టి పరిస్థితుల్లో రైతు ఖాతాలో జమవుతుంది. నిబంధనల ప్రకారం ధాన్యం ఉంటే ఎక్కడా ఒక్క రూపాయి కూడా మద్దతు ధర తగ్గనివ్వం. – హెచ్.అరుణ్ కుమార్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ -
స్టూడెంట్ లీడర్ టు మాస్ లీడర్.. సివిల్ సప్లయ్ చైర్మన్గా సర్దార్
సాక్షి, కరీంనగర్: ఉద్యమ నాయకుడు సర్దార్ రవీందర్సింగ్ను అదృష్టం వరించింది. స్టూడెంట్ లీడర్గా రాజకీయ అరంగ్రేటం చేసిన రవీందర్సింగ్ మాస్లీడర్గా, న్యాయవాదిగా, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ పట్టణ అధ్యక్షుడిగా, ఐదుసార్లు కౌన్సిలర్గా, కార్పొరేటర్గా ఎన్నికవ్వడమే కాకుండా కరీంనగర్ కార్పొరేషన్ మేయర్గా బాధ్యతలు నిర్వహించారు. తాజాగా రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్గా రవీందర్సింగ్ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేయడంతో అదృష్టమంటే రవీందర్సింగ్దే అంటూ చెప్పుకోవచ్చు. సాక్షాత్తు సీఎం కేసీఆర్ కరీంనగర్లో రవీందర్ సింగ్ కూతురు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కొద్దిసేపటిలోనే రాష్ట్రస్థాయి చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదిస్తూ నిర్ణయాలన్ని ఒకేరోజు కావడం అనూహ్యంగా జరిగాయి. సివిల్ సప్లయ్ చైర్మన్గా సర్దార్ కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్సింగ్ను రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం జీవో ఆర్టీ 2313 నెంబర్ ద్వారా రవీందర్సింగ్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ జీవో విడుదల చేశారు. కరీంనగర్లో రవీందర్సింగ్ కూతురు వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులను ఆశీర్వదించారు. సీఎం వివాహ వేడుక నుంచి వెళ్లిపోయిన కొద్ది సేపటిలోనే ఉత్తర్వులు వెలువడడంతో రవీందర్సింగ్ కూతురి పెళ్లికి సీఎం గిఫ్ట్ ఇచ్చారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. స్టూడెంట్ లీడర్గా.. మాస్ లీడర్గా.. రవీందర్సింగ్ విద్యార్థి దశలోనే 1984లో ఎస్సారార్ డిగ్రీ కళాశాలకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలంటే మక్కువ. ఎల్ఎల్బీ పూర్తి చేసి న్యాయవాద వృత్తిని చేపట్టి కొద్ది కాలంలోనే రాజకీయ అరంగ్రేటం చేశారు. కరీంనగర్ మున్సిపాల్టీలో 1995లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించి కౌన్సిలర్గా బాధ్యతలు స్వీకరించారు. 2001లో బీజేపీ నుంచి కౌన్సిలర్గా ఎన్నికై ఆ పార్టీ ఫ్లోర్లీడర్గా బాధ్యతలు స్వీకరించారు. 2005లో జరిగిన ఎన్నికల్లో మరోసారి బీజేపీ నుంచి కార్పొరేటర్గా ఎన్నికవ్వడంతోపాటు బీజేపీ నగర అధ్యక్షుడిగా 2006 వరకు పనిచేశారు. 2006లో సీఎం కేసీఆర్ కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. కేసీఆర్ పిలుపును అందుకొని బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ సమక్షంలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షునిగా ఉంటూ టీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చే పిలుపునందుకొని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అన్ని వర్గాలను భాగస్వాములను చేస్తూ కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా మారారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం కరీంనగర్ నగరంలో ఉధృతంగా నడిపించడంతో కేసీఆర్కు నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. కరీంనగర్ నగరంలో టీఆర్ఎస్ పార్టీ ఎదుగుదల కోసం తీవ్రంగా పనిచేయడంతో కేసీఆర్ అనేక సందర్భంలో రవీందర్ సింగ్ను ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ కుటుంబానికి విధేయుడిగా ఉన్న సర్దార్ రవీందర్ సింగ్కు ఎమ్మెల్సీ అవకాశం ఖాయమంటూ ఒక దశలో ప్రచారం జరిగింది. కానీ ఎమ్మెల్సీ అవకాశం అందినట్లే అంది అందకుండా పోయింది. రాష్ట్రస్థాయి పథకాలు అమలు.. టిఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా, మేయర్గా పనిచేసిన కాలంలో సర్దార్ రవీందర్ సింగ్ కరీంనగర్ నగరంలో ఒక్క రూపాయి మేయర్గా ప్రసిద్ధి పొందారు. ఒక్క రూపాయికే నల్లా కలెక్షన్ ఇవ్వడం, ఒక్క రూపాయికే అంత్యక్రియలు చేయడం, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ నుంచి ప్రశంసలు అందుకున్నారు. మేయర్గా ఉంటూనే కరీంనగర్ నగరంలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్, ప్రైవేట్ టీచర్, క్రీడా, కార్మిక సంఘాలకు, సంఘటిత, అసంఘటిత కార్మిక సంఘాలకు గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతూ మాస్ లీడర్గా, మేయర్గా మన్ననలు పొందారు. -
మరింత సమర్ధంగా ఇంటింటికీ బియ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపడుతోంది. ఇంటింటికీ రేషన్ అందించే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ (ఎండీయూ వాహనాలు) క్రమం తప్పకుండా లబ్ధిదారుల ప్రాంతాలకు వెళ్లేలా పక్కాగా పర్యవేక్షించనుంది. ఇందులో భాగంగా రూట్ మ్యాపింగ్, జీపీఎస్ ట్రాకింగ్ వంటి సాంకేతిక సేవలను వినియోగించనుంది. ఎండీయూ పరిధిలోని లబ్ధిదారులు తమ ఇళ్ల నుంచి ఎక్కువ దూరం వెళ్లకుండా సమీపంలోకే వాహనం వచ్చేలా అధికారులు ప్రత్యేక పాయింట్లను గుర్తిస్తున్నారు. ఈ కొత్త విధానం ద్వారా ఐదారు ఇళ్లకు ఒకచోట ప్రతి నెలా ఎండీయూలో రేషన్ అందించేలా సాంకేతిక వ్యవస్థతో అనుసంధానం చేస్తారు. వాహనాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా బియ్యం లబ్ధిదారులకు అందుతుంది. తొలుత పైలెట్ ప్రాజెక్టు కింద వచ్చె నెలలో మండలానికి ఒక ఎండీయూ పరిధిలో దీనిని అమలు చేస్తారు. జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొనసాగించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రభుత్వ విప్లవాత్మక చర్యలతో పెరిగిన రేషన్ పంపిణీ శాతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో ప్రతి నెలా రేషన్ తీసుకునేవారి శాతం గణనీయంగా పెరిగింది. లబ్ధిదారులకు నాణ్యమైన (సార్టెక్స్) బియ్యం ఇవ్వడంతో పాటు 9,260 ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే తీసుకెళ్లి అందించడం మంచి ఫలితాలను ఇస్తోంది. ప్రతి నెలా 1.45 కోట్ల కార్డుదారులకు 2.30 లక్షల టన్నుల బియ్యం అవసరం అవుతుంది. గతంలో నెలకు 80 నుంచి 85 శాతం మాత్రమే రేషన్ పంపిణీ జరిగితే.. ఇప్పుడు 90 శాతానికి చేరుకొంది. మరోవైపు అనివార్య కారణాలతో ఎండీయూ వాహనదారులు ఎవరైనా తప్పుకుంటే వారి స్థానాన్ని భర్తీ చేసేంత వరకు గరిష్టంగా మూడు నెలల పాటు ఇన్చార్జి ఎండీయూకు (వేరే ఎండీయూ వాహనదారుడు పని చేస్తే) బాధ్యతలు అప్పగిస్తోంది. వీరికి నెలకు రూ.18,000 చొప్పున అదనంగా అందిస్తూ ఎక్కడా రేషన్ పంపిణీలో జాప్యం జరగకుండా చర్యలు చేపడుతోంది. 2 నుంచి 3 నెలలు నిల్వ చేసిన తర్వాతే రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేసిన వెంటనే పీడీఎస్లోకి తీసుకురావడంతో సమస్యలు వస్తున్నాయి. కొత్త బియ్యం వండితే అన్నం బాగోలేదని, ముద్దగా అవుతుందనే ఫిర్యాదులున్నాయి. దీనిని అధిగమించేందుకు కస్టమ్ మిల్లింగ్ అనంతరం 2 నుంచి 3 నెలలు బఫర్ గోడౌన్లలో నిల్వ ఉంచిన తర్వాతే పంపిణీ చేసేలా పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. -
వినియోగదారుల హక్కుల పరిరక్షణే లక్ష్యం
సాక్షి, అమరావతి: వినియోగదారుల హక్కుల పరిరక్షణ, సత్వర న్యాయమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారుల రక్షణ చట్టాన్ని సవరించినట్లు పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు.సచివాలయంలో గురువారం పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ అధ్యక్షతన రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి తొలి సమావేశం జరిగింది. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ సవరించిన చట్టం ప్రకారం కొనుగోలుదారులు వస్తువులు ఎక్కడ కొన్నప్పటికీ వారి నివాస ప్రాంతం నుంచి ఆన్లైన్లో, స్థానిక గ్రామ, వార్డు సచివాలయాల్లో, లేదా వినియోగదారుల సేవ కేంద్రంలోని 1967, 18004250082 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా కేసు విచారణకు హాజరు కావొచ్చని చెప్పారు. వినియోగదారులు దోపిడీకి గురికాకుండా గత పది నెలల్లో విస్తృతంగా తనిఖీలు చేసి 1,748 కేసులు నమోదు చేశామన్నారు. పాత వాటితో కలిపి మొత్తం 2,139 కేసులు పరిష్కరించినట్లు చెప్పారు. పెట్రోల్ బంకులపై 97 కేసులు, ఎరువుల దుకాణాలపై 350 కేసులు, విశాఖపట్నం, విజయవాడలోని షాషింగ్ మాల్స్పై 175 కేసులు నమోదు చేశామన్నారు. త్వరలో బంగారు నగల దుకాణాల్లో కూడా తనిఖీలు చేస్తామన్నారు. ఆహార పదార్థాల కల్తీని అరికట్టేందుకు 15 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తామని, వీటిలో ఆరు ఫిబ్రవరికి అందుబాటులోకి తెస్తామని చెప్పారు. విశాఖలోని ల్యాబ్ను ఆధునీకరిస్తామని, విజయవాడ, తిరుపతిలో కూడా ల్యాబ్లను అభివృద్ధి చేస్తామన్నారు. ఉక్రోషంతో చంద్రబాబు దుర్భాషలు భవిష్యత్తులో రాజకీయ జీవితం ఉండదని చంద్రబాబునాయుడు ఉక్రోషంతో దుర్భాషలకు దిగుతున్నారని మంత్రి విమర్శించారు. ప్రజలు పట్టించుకోవట్లేదని, ఇక ఇంటికి వెళ్లాల్సిందేనని అర్థమైన చంద్రబాబు చివరి ఎన్నికలని, అసెంబ్లీకి పంపాలని వేడుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. క్షేత్ర స్థాయిలో టీడీపీకి నాయకత్వమే లేదన్నారు. ప్రభుత్వ పథకాలు అందుతుండటంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలను వారి కుటుంబ సభ్యులే తిడుతున్నారన్నారు. ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తాం రైతుల నుంచి ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని మంత్రి తెలిపారు. నూతన ఆన్లైన్ విధానం ద్వారా రైతులకు, మిల్లర్లకు సంబంధం లేకుండా ఒక్కపైసా కూడా నష్టపోకుండా మద్దతు ధర కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎఫ్టీవో వచ్చిన 21 రోజుల్లోగా నగదు జమ చేసేలా ఆదేశించామన్నారు. ఇప్పటికే 2.30 లక్షల టన్నుల ధాన్యాన్ని కొని, రూ.160 కోట్లకు పైగా చెల్లించామన్నారు. ఇందులో ధాన్యం అమ్మిన మరుసటిరోజే నగదు జమయిన∙ రైతులు కూడా ఉన్నట్లు వివరించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. -
రేషన్ పంపిణీలో నిర్లక్ష్యం వద్దు
సాక్షి, అమరావతి: రేషన్ పంపిణీలో నిర్లక్ష్యం వహించొద్దని పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ హెచ్చరించారు. బుధవారం ఆయన మంగళగిరిలో చౌక దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీఎంజీకేఏవై కింద ఉచిత బియ్యం పంపిణీని పరిశీలించారు. ప్రతి దుకాణం వద్ద తప్పనిసరిగా ఉచిత బియ్యం లబ్ధిదారుల జాబితా ప్రదర్శించాలని ఆదేశించారు. సమీపంలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎండీయూ వాహన సేవలు, బియ్యం నాణ్యతపై అభిప్రాయాణలను సేకరించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. నాణ్యమైన (సార్టెక్స్) బియ్యాన్ని వాహనాల్లో ఇంటి వద్దకే అందించడం ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో రేషన్ తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. చాలా మంది పేదలు ప్రభుత్వం ఇస్తున్న రూపాయికే కిలో బియ్యంతో కడుపు నింపుకుంటున్నట్టు చెప్పారన్నారు. -
సజావుగా ధాన్యం సేకరణ
సాక్షి, అమరావతి: ధాన్యం సేకరణలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ధాన్యం సేకరణలో ఈసారి నుంచి సరికొత్త విధానం అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ విషయంలో అక్కడక్కడా తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల ఉన్నతాధికారులతో ఆదివారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించి 21 రోజుల్లోనే నగదు చెల్లిస్తున్నామని చెప్పారు. కనీస మద్దతు ధరతో పాటు గోనె సంచుల డబ్బులు, హమాలీ చార్జీలు నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరిస్తే క్రిమినల్ చర్యలు ఈ క్రాప్ ద్వారా నమోదు చేసుకున్న రైతులు తమ పంటను నేరుగా ఆర్బీకేల వద్దకు తీసుకుని రావాలని మంత్రి కారుమూరి సూచించారు. రైస్ మిల్లర్ల వద్దకు వెళ్లవద్దని చెప్పారు. ధాన్యం సేకరణ విషయంలో మిల్లర్ల జోక్యం తగదని.. ఈ మేరకు ఇప్పటికే వారికి ఆదేశాలు ఇచ్చామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తే మిల్లర్లపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి వారిని బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. ఆర్బీకేల ద్వారా సేకరించిన ధాన్యాన్ని మాత్రమే మిల్లింగ్ చేయాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్బీకేల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట ఆర్బీకేల సంఖ్యను పెంచాలన్నారు. గత ముఖ్యమంత్రుల కన్నా సీఎం జగన్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. రైతుల ముసుగులో కొందరు ధాన్యం సేకరణ విషయంలో రాజకీయం చేస్తున్నారని, అలాంటి వారిని ఉపేక్షించమని హెచ్చరించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండ్యన్, పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
పౌరసరఫరాల శాఖ అధికారుల నివాసాల్లో ఏసీబీ సోదాలు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ఒంగోలు: ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో పౌరసరఫరాల శాఖలో రూ.29.87 కోట్ల అవినీతికి పాల్పడిన ఐదుగురు అధికారులు, ఉద్యోగుల నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోదాలు నిర్వహించింది. పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ పి.పద్మ, అసిస్టెంట్ మేనేజర్లు సీహెచ్.చల్లా జయశంకర్, ఎంవీవీడీ శర్మ, రికార్డ్ అసిస్టెంట్ పి.అరుణ కుమారి, డేటా ఎంట్రీ ఆపరేటర్ శివ కుమార్లకు విజయవాడ, ఒంగోలు, నెల్లూరుల్లో ఉన్న నివాసాల్లో ఏసీబీ బృందాలు బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు తనిఖీలు కొనసాగించాయి. ఆ అధికారుల ఆస్తుల పత్రాలు, బంగారు, వెండి ఆభరణాలతోపాటు ఇతర విలువైన వస్తువులను ఏసీబీ జప్తు చేసింది. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ కార్యాలయంలో ఈ ఏడాది మొదట్లో ఇంటర్నెల్ ఆడిట్ నిర్వహించగా అవినీతి వ్యవహారం బయటపడింది. 2020–21, 2021–22లకు సంబంధించి రూ.29.87 కోట్ల నిధులు దారి మళ్లినట్లు గుర్తించారు. దాంతో పి.పద్మ, చల్లా జయశంకర్, ఎంవీవీడీ శర్మ, టి.అరుణ కుమారి, శివ కుమార్లతోపాటు కాంట్రాక్టర్ చేజెర్ల దయాకర్, ప్రైవేటు వ్యక్తులు ఎం.రాడమ్మ, సూరి పవన్, చీపురుపల్లి రాజు, చేజెర్ల కామాక్షి, గరికిపాటి ప్రశాంతిలపై నెల్లూరులోని విద్యాధరపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అనంతరం ఆ కేసును ఏసీబీకి బదిలీ చేశారు. దీంతో వారిపై ఈ నెల 6న కేసు నమోదు చేసిన ఏసీబీ..బుధవారం అధికారులు, ఉద్యోగుల నివాసాల్లో సోదాలు నిర్వహించింది. సోదాలు పూర్తి అయిన తరువాత ఆధారాలను బట్టి తదుపరి చర్యలు తీసుకోనుంది. -
19 నుంచి ఉచిత బియ్యం పంపిణీ
సాక్షి, అమరావతి: ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద మూడునెలల పాటు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ ఆహార భద్రత కార్డుదారులు రేషన్ దుకాణాల వద్ద ప్రతినెల 19వ తేదీ నుంచి 28వ తేదీలోగా బియ్యాన్ని తీసుకోవాలని సూచించారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అవసరమైన నిల్వలను కేటాయించిందని, దీన్లో కొంత నాన్ సార్టెక్స్, మరికొంత నాన్ సార్టెక్స్ ఫోర్టిఫైడ్ బియ్యం ఉన్నాయని తెలిపారు. నవంబర్లో ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న నిల్వల ఆధారంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, మన్యం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ, ఎన్టీఆర్, బాపట్ల, నెల్లూరు జిల్లాలకు నాన్ సార్టెక్స్, మిలిగిన 16 జిల్లాలకు నాన్ సార్టెక్స్ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నట్లు వివరించారు. 2.68 కోట్ల మంది ఎన్ఎఫ్ఎస్ఏ లబ్ధిదారుల జాబితాను చౌకదుకాణాలు, సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. ఒక్కో వ్యక్తికి ఐదుకిలోల వంతున బియ్యం ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంపూర్ణ పోషణ ధ్యేయంగా ఏడు జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని, వచ్చే ఏప్రిల్ నాటికి అన్ని జిల్లాలకు విస్తరిస్తామని తెలిపారు. ఇందులో ఐరన్, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బీ12 సమృద్ధిగా ఉంటాయని, వీటివల్ల రక్తహీతన తగ్గి, గర్భస్థ శిశువుకు మేలు జరగడంతోపాటు నాడీవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని వివరించారు. ఫోర్టిఫైడ్ బియ్యం తేలికగా ఉండి నీటిలో తేలడంతో కొంతమంది ప్లాస్టిక్ బియ్యంగా అపోహపడుతున్నారని పేర్కొన్నారు. రేషన్ అక్రమ రవాణాకు ఆస్కారం లేదు రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలిపారు. 9,260 ఎండీయూ వాహనాల ద్వారా లబ్ధిదారుల వేలిముద్రలతో ఇంటివద్దకే బియ్యాన్ని సరఫరా చేస్తుండటంతో బియ్యం బయట మార్కెట్కు తరలించే ఆస్కారం లేదని పేర్కొన్నారు. ఎల్లో మీడియా పనిగట్టుకుని విషప్రచారం చేయడం సరికాదని హితవుపలికారు. చౌకదుకాణాలు, ఎండీయూ వాహనాలను నిత్యం ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. విజిలెన్సు కమిటీలను నియమించి ప్రజాపంపిణీలో లోపాలు, అక్రమాలు లేకుండా నిఘావ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఫిర్యాదుల కోసం 1902 టోల్ ఫ్రీ నంబర్ను ఎండీయూ వాహనంపై ముద్రించి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ మూడేళ్లలో పక్కదారిపట్టిన 31,073 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్చేసి సెక్షన్ 6ఏ ప్రకారం 6,979 కేసులతోపాటు 1,603 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వివరించారు. రైస్మిల్లుల్లో రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ పట్టుబడితే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్చేసే అనుమతిని రద్దుచేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల స్టాక్ పాయింట్లో ఇటీవల కొన్ని అవకతవకలు చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రాథమిక విచారణ అనంతరం స్టాక్ పాయింట్ ఇన్చార్జిని సస్పెండ్ చేయడంతో పాటు క్రిమినల్ చర్యలకు ఆదేశించినట్లు తెలిపారు. -
కేరళకు ఆంధ్రా ధాన్యం
సాక్షి, అమరావతి/ తణుకు అర్బన్: రాష్ట్రంలో పండించే జయ రకం ధాన్యం (ఎంటీయూ 3626 బొండాలు), బియ్యాన్ని తమకు సరఫరా చేసేలా రాష్ట్ర ప్రభుత్వంతో కేరళ ఒప్పందం చేసుకుంది. కేరళ పర్యటనలో భాగంగా మంగళవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్, ఏపీ డీడీసీఎఫ్ ఎండీ బాబు.ఏ సమక్షంలో రెండు రాష్ట్రాల అధికారులు ఎంవోయూ చేసుకున్నారు. ఏపీలో పండించే జయ బొండాలకు కేరళలో మంచి డిమాండ్ ఉంది. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేరళ పౌరసరఫరాల శాఖ మంత్రి జీఆర్ అనిల్ తమకు జయ బొండాలతోపాటు పలురకాల నిత్యావసరాలు తమకు సరఫరా చేయాలని కోరారు. ఏపీ మంత్రితో పాటు అధికారుల బృందాన్ని కేరళ పర్యటనకు ఆహ్వానించారు. కేరళ మంత్రి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం... జయ రకం ధాన్యంతోపాటు ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు వంటి నిత్యావసరాలను కూడా సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి, అధికారుల బృందం కేరళ పర్యటనకు వెళ్లగా... ఇరు రాష్ట్రాల మంత్రులు, అధికారులు ప్రత్యేక భేటీలో సుదీర్ఘంగా చర్చించి పరస్పర అవగాహన ఒప్పందం చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో జయ బొండాలు పండించే రైతులకు మద్దతు ధర లభించడంతోపాటు పెద్ద ఎత్తున మేలు జరుగనుంది. ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా సరఫరా చేసే నిత్యావసరాలను కేరళ పౌరసరఫరాల సంస్థ మావెల్లి స్టోర్స్ ద్వారా మార్క్ఫెడ్ బ్రాండ్తోనే వినియోగదారులకు అందించనుంది. ఈ సందర్భంగా ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, కేరళ మంత్రి అనిల్తో కలిసి మావెల్లి స్టోర్స్ను సందర్శించి, అక్కడి వినియోగదారులకు నిత్యావసరాల సరఫరాను పరిశీలించారు. -
ఇంటింటికీ గిరిజన ఉత్పత్తులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రేషన్ దుకాణాలు, రేషన్ పంపిణీ వాహనాల (ఎండీయూ) ద్వారా గిరిజన ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపడుతోంది. నవంబర్ 1వ తేదీ నుంచి పైలట్ ప్రాజెక్టు కింద విశాఖపట్నం, తిరుపతి జిల్లాల్లో ప్రారంభించనుంది. తొలి దశలో 290 రేషన్ వాహనాలు, 570 రేషన్ దుకాణాల్లో అమలు చేయనున్నారు. గిరిజన కో–ఆపరేటివ్ కార్పొరేషన్ ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ కల్పించడంతోపాటు ఎమ్మార్పీ కంటే తక్కువ రేట్లకే వినియోగదారులకు అందించనున్నారు. ఎండీయూలకు ఆర్థిక బలం చేకూర్చేలా.. ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థలో 9,260 ఎండీయూ వాహనాలు సేవలందిస్తున్నాయి. రేషన్ డోర్ డెలివరీ నిమిత్తం ఎండీయూ ఆపరేటర్లకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.18 వేల రెమ్యునరేషన్ ఇస్తోంది. వారికి మరింత ఆర్థిక బలం చేకూర్చేందుకు ప్రభుత్వరంగ సంస్థలైన గిరిజన, ఆయిల్ ఫెడ్, మార్క్ఫెడ్ ఉత్పత్తులను విక్రయించుకునే వెసులుబాటు కల్పించింది. ఆయా సంస్థల నుంచి సబ్సిడీపై సరుకులను తీసుకునే ఆపరేటర్లు వాటిని ఎమ్మార్పీ కంటే తక్కువ ధరకు ప్రజలకు విక్రయించాల్సి ఉంటుంది. ప్రతినెలా పీడీఎస్ బియ్యం పంపిణీలో జాప్యం లేకుండా విక్రయాలు చేసేలా చర్యలు చేపట్టింది. వినియోగదారులకు తెలిసేలా వస్తువుల ధరల పట్టికను ప్రదర్శించనున్నారు. విక్రయించే ఉత్పత్తులు.. గిరిజన కో–ఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా తేనె, అరకు కాఫీ పొడి, వైశాఖి కాఫీ పొడి, త్రిఫల చూర్ణం, నన్నారి షర్బత్, ఆయుర్వేద సబ్బులు, చింతపండు, కుంకుడుకాయ పొడి, షికాకాయ పొడి, కారంపొడి, పసుపు, కుంకుమతోపాటు ఆయిల్ఫెడ్ నుంచి పామాయిల్, సన్ఫ్లవర్, రైస్బ్రాన్, వేరుశనగ నూనెలను అందుబాటులో ఉంచనున్నారు. గిరిజనులకు మేలు చేసేలా.. గిరిజనులకు మేలు చేసేలా ఎండీయూ వాహనాల ద్వారా వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నాం. తొలుత విశాఖ, తిరుపతి జిల్లాల్లో స్పందనను బట్టి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాం. రేషన్ లబ్ధిదారులే కాకుండా ప్రజలందరూ ఈ ఉత్పత్తులను కొనుక్కోవచ్చు. బియ్యం ఇచ్చే సమయంలో వినియోగదారులపై ఎటువంటి ఒత్తిడి చేయకుండా విక్రయాలు చేసుకోవాలని ఎండీయూలకు సూచించాం. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ -
కేరళ బృందం మిర్చి యార్డు సందర్శన
కొరిటెపాడు(గుంటూరు): కేరళ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ బృందం గుంటూరులోని వ్యవసాయ మార్కెట్ యార్డును మంగళవారం సందర్శించింది. బృందంలోని సభ్యులు కమిషనర్ డాక్టర్ డి.సజిత్బాబు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంజీబ్కుమార్ పట్జోషి, కేరళ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రైవేటు సెక్రటరీ ప్రదీప్కుమార్ యార్డును సందర్శించిన వారిలో ఉన్నారు. వారికి గుంటూరు కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి, మిర్చి యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి సాదర స్వాగతం పలికారు. మిర్చి యార్డులోని మిర్చి కమీషన్ షాపులను కేరళ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు పరిశీలించారు. యార్డు పనితీరు తదితర అంశాలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మిర్చి యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం ఛాంబర్లో కేరళ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏసురత్నం మాట్లాడుతూ.. ప్రపంచంలోని సుమారు 15 దేశాలకు గుంటూరు నుంచి మిర్చి ఎగుమతి చేస్తున్నామన్నారు. కేరళ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం, అనంతవరప్పాడు గ్రామంలో మిర్చి పంట సాగును బృందం పరిశీలించింది. ఆర్డీవో ప్రభాకరరెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారిణి పద్మశ్రీ, ఉద్యానశాఖ అధికారి ఎన్.సుజాత తదితరులు పాల్గొన్నారు. -
కేరళకు ఆంధ్రా ధాన్యం
సాక్షి, అమరావతి: కేరళ ప్రజలు తమ ఆహారంలో ఎంతో ఇష్టంగా తినే ఎంటీయూ–3626 జయ రకం ధాన్యం (బోండాలు), బియ్యం కొనుగోలుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపిస్తోందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వెల్లడించారు. విజయవాడలోని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో సోమవారం కేరళ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి జీఆర్ అనిల్తో కూడిన కేరళ ఉన్నతాధికారుల బృందం మంత్రి కారుమూరితో భేటీ అయింది. తమకు కావాల్సిన సరుకుల సరఫరా సాధ్యాసాధ్యాలపై చర్చించారు. అనంతరం మంత్రి కారుమూరి మాట్లాడుతూ లక్ష టన్నుల ధాన్యం, 60 వేల టన్నుల బియ్యం కావాలని కేరళ ప్రభుత్వం అడగటం శుభపరిణామమని పేర్కొన్నారు. నెలకు 550 టన్నుల ఎండుమిర్చి, కంది, పెసర, మినుములు సైతం సరఫరా చేయాలని కోరిందని తెలిపారు. ఈ నెల 21న మరోసారి సమావేశమై ధరలు నిర్ణయిస్తామన్నారు. ధరలు రైతులకు లాభదాయకంగా ఉంటే ఈ నెల 27న కేరళలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకుంటాయని వివరించారు. పౌర సరఫరాల కమిషనర్ అరుణ్కుమార్, డైరెక్టర్ విజయ సునీత, ఏపీ ఎస్సీఎస్సీఎల్ ఎండీ వీరపాండియన్, సహకార సంఘాల కమిషనర్ ఎ.బాబు పాల్గొన్నారు. టీడీపీ హయాంలో రూ.30 కోట్లు కొట్టేశారు టీడీపీ హయాంలో నెల్లూరు జిల్లాలో పౌర సరఫాల శాఖ నిధులు రూ. 30 కోట్లు కొల్లగొట్టారని మంత్రి కారుమూరి చెప్పారు. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్నామని, ప్రాథమికంగా ఐదుగురి తప్పు తేలడంతో వారిని సస్పెండ్ చేసినట్టు చెప్పారు. నిందితుల ఆస్తులను అటాచ్ చేశామని, మొత్తం వసూలు చేస్తామన్నారు. తప్పుడు పత్రాలతో చెరువులు, కాలువలు, తోటలను వరి పొలాలుగా చూపి ఈ–క్రాపింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇకపై ధాన్యం నగదుతో పాటే రవాణా చార్జీలనూ రైతుల అకౌంట్లో వేస్తామన్నారు. -
ధాన్యం సేకరణకు చురుగ్గా ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ ధాన్యం సేకరణకు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చురుగ్గా ఏర్పాట్లుచేస్తోంది. ఇందుకు నవంబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా కసరత్తు చేస్తోంది. ఇటీవల ప్రభుత్వం వరికి మద్దతు ధరను క్వింటాకు రూ.100 పెంచింది. దీంతో క్వింటా ఏ–గ్రేడ్ రకం రూ.2,060, సాధారణ రకం రూ.2,040కు చేరింది. వరి సాగైన విస్తీర్ణం, దిగుబడి అంచనా ప్రకారం 37 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని భావిస్తున్నారు. ఈసారి కొనుగోళ్లు పారదర్శకంగా చేపట్టేందుకు ప్రభుత్వం 10,300 మంది వలంటీర్ల సేవలను వినియోగించుకోనుంది. వీరికి కొనుగోళ్ల సమయంలో నెలకు రూ.1,500 ప్రోత్సాహకం అందించనున్నారు. 3,423 ఆర్బీకే క్లస్టర్లలో ధాన్యం సేకరణ ఈ ఖరీఫ్లో 3,423 ఆర్బీకే క్లస్టర్ల ద్వారా ధాన్యం సేకరణకు పౌర సరఫరాల సంస్థ సమాయత్తమవుతోంది. ధాన్యం సేకరణ సామర్థ్యాన్ని బట్టి రెండు, మూడు ఆర్బీకేలను కలిపి ఒక క్లస్టర్గా గుర్తిస్తోంది. ఇందులో రెండువేల టన్నులకు పైగా సేకరణ ఉండే క్లస్టర్లను ఏ, 1,000–2,000లోపు ఉంటే బీ.. 1,000లోపు ఉంటే సీ కేటగిరీలుగా విభజించింది. అవకతవకలకు ఆస్కారం లేకుండా వెబ్ల్యాండ్, కౌలు రైతులకు ఇచ్చే పంటసాగు హక్కు పత్రాల (సీసీఆర్సీ కార్డులు) ఆధారంగా పక్కాగా 100 శాతం ఈ–క్రాప్ నమోదును పూర్తిచేశారు. వచ్చే 16 నుంచి ఈ–క్రాప్ జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తారు. వాటిల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే సవరిస్తారు. ఇక పంట ఉత్పత్తులను తరలించేందుకు అవసరమైన గోనె సంచులు, హమాలీలు, రవాణా సౌకర్యాలను ప్రభుత్వమే అందిస్తోంది. రైతులే స్వయంగా గోనె సంచులు ఏర్పాటుచేసుకుంటే క్వింటాకు రూ.12.66 ఇవ్వనున్నారు. సొంతంగా ధాన్యాన్ని తరలించే వెసులుబాటునూ కల్పించారు. ఇందుకైన రవాణా, హమాలీ ఖర్చులు మొత్తాన్ని ధాన్యం విక్రయించిన సొమ్ముతో కలిపి 21 రోజుల్లో రైతు ఖాతాలో జమచేస్తారు. ఆర్బీకే నుంచి మిల్లుకు చేరే ధాన్యం తూకంలో వ్యత్యాసం, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా మిల్లు వద్ద్ద ఒక కస్టోడియన్ అధికారిని కూడా నియమించారు. దళారులు, మిల్లర్ల అక్రమాలకు చెక్ అలాగే, ధాన్యం సేకరణలో దళారులు, మిల్లర్ల పాత్రను పూర్తిగా తొలగించేలా సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇప్పటివరకు ఆయా ఆర్బీకేలకు మిల్లులను మ్యాపింగ్ చేసేవారు. దీంతో కొనుగోలు చేసిన ధాన్యం ఏ మిల్లుకు వెళ్తుందో ముందుగానే తెలిసిపోయేది. ఈ క్రమంలో కొందరు దళారులు, మిల్లర్లు అక్రమాలకు పాల్పడేవారు. దీనిని అధిగమించేందుకు మిల్లులను జోన్లుగా విభజించారు. చివరి నిమిషంలో మాత్రమే ధాన్యాన్ని ఏ మిల్లుకు తరలించాలో చెప్పేలా ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టారు. పారదర్శకంగా కొనుగోళ్లు ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెస్తోంది. రైతులకు వంద శాతం మద్దతు ధరను అందించేలా పారదర్శక విధానాన్ని పక్కాగా అమలు చేయనున్నాం. గోనె సంచులు, హమాలీలు, రవాణా వాహనాలను ముందుగా ఏర్పాటుచేయాలని జేసీలకు సూచించాం. ఒకవేళ రైతులే వాటిని ఏర్పాటుచేసుకుంటే ఖర్చులను వారి ఖాతాల్లో జమచేస్తాం. – హెచ్. అరుణ్కుమార్, కమిషనర్, ఏపీ పౌరసరఫరాల శాఖ మిల్లుల వద్ద కస్టోడియన్ అధికారులు ఆర్బీకేల్లో సజావుగా ధాన్యం విక్రయించినప్పటికీ మిల్లర్ల కొర్రీలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉందని, తూకంలో వ్యత్యాసం పేరుతో రైతుల మద్దతు ధరకు కోత పెడుతున్నారు. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం మిల్లుల వద్ద ఒక కస్టోడియన్ అధికారిని సైతం నియమించింది. అవకతవకలకు తావులేకుండా ధాన్యం సేకరణలో ప్రతి ప్రక్రియను ఫొటోతీసి అప్లోడ్ చేస్తారు. – వీరపాండియన్, ఎండీ, పౌరసరఫరాల సంస్థ -
పొరసరఫరాల శాఖపై సీఎం రివ్యూ
-
ఇంటి దొంగలు కాజేస్తున్నారు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రతీ నెలా లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందిస్తున్నాయి. అయితే పౌరసరఫరాల శాఖలో కొందరు ఇంటి దొంగలు ఆ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ, రూ.కోట్ల సొమ్ము కాజేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతినెలా రేషన్ లబ్ధిదారులకు ఉచిత బియ్యం పంపిణీ కోసం సీఎంఆర్ (కస్టం మిల్లింగ్ రైస్) కింద మిల్లర్లు ఇచ్చిన బియ్యాన్ని ఎఫ్సీఐ, పౌరసరఫరా శాఖ ప్రధాన గోదాముల్లో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి మండల స్థాయి గోదాం (ఎంఎల్ఎస్) పాయింట్లు, అటు నుంచి రేషన్షాపులకు బియ్యం సరఫరా అవుతుంది. ఈ రెండు దశల్లో బియ్యం రవాణాకు కాంట్రాక్టర్లు ఉంటారు. చాలా చోట్ల ప్రభుత్వానికి సొంత గోదాములు లేక అద్దెకు తీసుకుంటోంది. కొన్ని చోట్ల ప్రైవేటు, సహకార శాఖ, గిడ్డంగుల సంస్థ, వ్యవసాయ మార్కెట్, జీసీసీ గోదాములను ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో 170 ఎంఎల్ఎస్ పాయింట్లు ఉండగా, రేషన్ షాపులకు 2.95 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉంది. మొదట ఒక్కో లబ్ధిదారుడికి ఆరు కిలోలు చొప్పున బియ్యం ఇవ్వగా, కరోనా తర్వాత లబ్ధిదారులకు పది కిలోల చొప్పున ఇవ్వడంతో ఆ కోటా పెరిగింది. ఈ నేపథ్యంలో స్టాక్ పెరగడం, ఉచిత బియ్యం కావడంతో క్షేత్రస్థాయిలో అక్రమాలు పెరిగాయి. ఆన్లైన్, తనిఖీలు ఉన్నా.. ప్రతీ ఎంఎల్ఎస్ పాయింట్లలో నెల నెలా బియ్యం నిల్వలపై ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలి. జిల్లాల్లో స్థానిక అదనపు కలెక్టర్ (రెవెన్యూ), పౌరసరఫరాల శాఖ అధికారులు, ఆర్డీవో, ఎమ్మార్వో లు ఈ పాయింట్లను తనిఖీలు చేయాలి. కానీ ఇది చాలా చోట్ల జరగడం లేదు. పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నప్పుడు మాత్రం తేడాలు బయటపడుతున్నాయి. చాలా చోట్ల ఎంఎల్ఎస్ పాయింట్ల ఇన్చార్జిలు నేరుగా కొంతమంది రేషన్ డీలర్లు, రైస్మిల్లర్లతో సంబంధాలు కొనసాగిస్తూ అక్కడి నుంచి బియ్యం పక్క దారి పట్టిస్తున్నారు. మిల్లులకు రీ సైక్లింగ్కు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎంఎల్ఎస్ పాయింట్ల ఇన్చార్జిలు ఉన్నతాధికారుల అండదండలతోనే హమాలీ, రవాణా చార్జిలు, గన్నీ సంచుల్లోనూ అవకతకవలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. కొన్ని చోట్ల ఎంఎల్ఎస్ పాయింట్లలోనే బఫర్ స్టాక్ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రైస్ మిల్లు నుంచి బియ్యం రాకున్నా వచ్చినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి ఆసిఫాబాద్లో రూ.3 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు. ఇందులో ఉన్నతాధికారుల నుంచి సైతం పరోక్షంగా సహాయ, సహకారాలు అందుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. మరోవైపు నెలా వారీ కోటా బియ్యంలో క్వింటా, అరక్వింటా తక్కువగా వస్తున్నాయని డీలర్లు వాపోతున్నారు. అయితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు మాత్రం సాహసం చేయడం లేదు. ఇలా అక్రమంగా దారిమళ్లించిన బియ్యాన్ని తమకు నమ్మకం ఉన్న డీలర్లకు కోటాకన్నా ఎక్కువగా పంపిస్తూ.. వారి ద్వారా బయట అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల గుర్తించిన అక్రమాలు.. ►ఆసిఫాబాద్ ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో 8,339 క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టింది. గత కొంతకాలంగా గోదాంకు బియ్యం రాకున్నా వచ్చినట్లు నమోదు చేస్తూ భారీగా అవకతకలకు పాల్పడ్డారు. వీటి విలువ రూ.3 కోట్లు ఉంటుందని అంచనా. అక్కడి ఇన్చార్జి, డీఎస్వో సైతం సస్పెండ్ అయ్యారు. ఇంకా విచారణ జరుగుతోంది. ►మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఎంఎల్ఎస్ పాయింట్లో 218.25 క్వింటాళ్ల బియ్యం తక్కువగా వచ్చింది. గోదాం ఇన్చార్జిపై విచారణ జరుగుతోంది. ►మంచిర్యాల ఎంఎల్ఎస్ పాయింట్లో 650 క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టింది. దీంతో ఇన్చార్జిని సస్పెండ్ చేసి, బియ్యాన్ని రికవరీ చేశారు. -
పాఠశాలలకు నేరుగా బియ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే నాణ్యమైన (సార్టెక్స్) బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటి ముంగిటికే వాహనాల ద్వారా (ఎండీయూ) డోర్ డెలివరీ చేస్తుండగా.. ఈ నెల నుంచి ఐసీడీఎస్ (అంగన్వాడీలు), మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలలకు, సంక్షేమ హాస్టళ్లకు కూడా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని నేరుగా రవాణా చేయనుంది. తద్వారా ఎండీయూ ఆపరేటర్లకు అదనపు ఆదాయం సమకూర్చనుంది. ఇప్పటివరకు అంగన్వాడీలు రేషన్ దుకాణం నుంచి, స్కూళ్లు, హాస్టళ్ల యాజమాన్యాలు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి వ్యయప్రయాసలతో బియ్యం తెచ్చుకునేవారు. ఒకరోజు ప్రత్యేకంగా బియ్యం కోసం కేటాయించాల్సి వచ్చేది. పైగా రవాణా, ఎగుమతులు, దిగుమతుల విషయంలో ఇబ్బందులు పడేవారు. వీటన్నింటికి పరిష్కారంగా ప్రభుత్వమే రేషన్ను డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. ఫైన్ క్వాలిటీ ధాన్యం సేకరణ రాష్ట్రంలో అంగన్వాడీలు, స్కూళ్లు, హాస్టళ్లలో విద్యార్థుల భోజనానికి ఏడాదికి 2.54 లక్షల టన్నుల బియ్యం అవసరం. ఇప్పటివరకు ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యార్థులకు సార్టెక్స్ బియ్యాన్ని (సాధారణ రకాలు) ఫోర్టిఫై చేసి ఆహారంగా అందిస్తోంది. వచ్చే జనవరి నుంచి ఫైన్ క్వాలిటీ (స్థానిక రకాలు, సన్న రకాలు) బియ్యాన్ని కూడా సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే 2022–23 ధాన్యం సేకరణలో మార్పులు తీసుకొస్తోంది. విద్యార్థులకు మరింత నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు అవసరమైన ఫైన్ క్వాలిటీ ధాన్యాన్ని ఏడాదికి 4 లక్షల నుంచి 5 లక్షల టన్నుల మేర రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేయనుంది. తద్వారా విద్యార్థులకు, రైతులకు మేలు జరగనుంది. దీనికితోడు అప్పుడే పండిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయడం ద్వారా వచ్చే బియ్యంతో వండే అన్నం ముద్దగా ఉంటుందనే ఫిర్యాదులను పరిష్కరించేలా.. సేకరణకు, మిల్లింగ్కు మధ్య రెండు నుంచి మూడునెలల వ్యవధి ఉండేలా చర్యలు చేపడుతోంది. ఏప్రిల్ నుంచి ఫోర్టిఫైడ్ రైస్ ఏప్రిల్ నుంచి అన్ని జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసేలా పౌరసరఫరాల శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు జిల్లాలతో పాటు ఐసీడీఎస్, మధ్యాహ్న భోజనం, సంక్షేమ హాస్టళ్లకు మాత్రమే ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో ఈ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఆహారంగా తీసుకున్న వారిలో రక్తహీనత శాతం తగ్గినట్టు ఆరోగ్య సర్వేలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు మొత్తం ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ప్రజలకు అవగాహన కల్పించేలా అంగన్వాడీలు, స్కూల్ టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఫోర్టిఫైడ్ రైస్ అంటే.. మంచి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు బియ్యానికి అదనంగా చేర్చడాన్ని రైస్ ఫోర్టిఫికేషన్ అంటారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్–బి12 వంటి కీలక సూక్ష్మపోషకాలను బియ్యంలో అదనంగా చేరుస్తారు. విటమిన్ టాబ్లెట్ కంటే పవర్ఫుల్ ప్రభుత్వం అందించే ఫోర్టిఫైడ్ రైస్ విటమిన్ టాబ్లెట్ కంటే ఎంతో పవర్ఫుల్. అందుకే రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. దీంతోపాటు విద్యార్థులకు మంచి ఆహారం అందించేలా ఫైన్ క్వాలిటీ బియ్యాన్ని పంపిణీ చేయనున్నాం. రాష్ట్రంలో 9,260 ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని అంగన్వాడీలు, పాఠశాలలు, హాస్టళ్లకు విస్తరిస్తున్నాం. – అరుణ్కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
మరో 8 ఎల్ఎంటీలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: యాసంగి ధాన్యం నుంచి మరో 8 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ఫోర్టిఫైడ్ పారాబాయిల్డ్ రైస్ (పౌష్టికాహార ఉప్పుడు బియ్యం)ను సెంట్రల్ పూల్కు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి గురువారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్కు లేఖ రాశారు. కేంద్రం గతంలో సెంట్రల్ పూల్ కింద తీసుకునేందుకు అంగీకరించిన 6.05 ఎల్ఎంటీల ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్కు ఇది అదనం. దీంతో పాటు తడిసిన యాసంగి ధాన్యానికి సంబంధించి 3 ఎల్ఎంటీల ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ తీసుకునేందుకు 2 రోజుల కిందట కేంద్రం అంగీకరించింది. అంటే ఈ యాసంగి సీజన్ కు సంబంధించి మొత్తం 17.05 ఎల్ఎంటీల ఫోర్టిఫైడ్ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి సేకరించనుందన్న మాట. రాష్ట్ర రైతులు ఇబ్బంది పడకూడదనే సేకరణ తెలంగాణ నుంచి మరో 8 లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ పారాబాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతాంగం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలించింది: మంత్రి గంగుల ‘యాసంగి ధాన్యం మిల్లింగ్ విషయంలో సమస్యను కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లాం. దీంతో కేంద్రం స్పందించింది. 8 ఎల్ఎంటీల ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ తీసుకునేందుకు అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలించింది.’ మోదీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం: బండి సంజయ్ ‘రాష్ట్రం నుంచి 8 ఎల్ఎంటీల ఫోర్టిఫైడ్ పారాబాయిల్డ్ రైస్ సేక రించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం హర్షణీయం. రైతులు, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మోదీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. ప్రధానికి, కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్కు కృతజ్ఞతలు.’ -
100 శాతం ‘మద్దతు’
సాక్షి, అమరావతి: ఖరీఫ్ పంటల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటి నుంచే పక్కా ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. కనీస మద్దతు ధర కంటే ఒక్క పైసా కూడా తగ్గకుండా కొనుగోళ్లు చేపట్టాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్రకు స్వస్తి పలకాలన్నారు. వే బ్రిడ్జిలను క్రమంగా దశలవారీగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల పరిధిలోకి తేవడంతోపాటు గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగులను ధాన్యం కొనుగోళ్లలో భాగస్వాములను చేసి ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖలపై ముఖ్యమంత్రి జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాణ్యత పరీక్షలు.. అన్నదాతలకు మేలు చేసేలా ఆర్బీకేల స్థాయిలోనే ధాన్యం క్వాలిటీ, క్వాంటిటీ టెస్టింగ్ చేయాలి. ధాన్యం కొనుగోలు ప్రక్రియ, ఎంఎస్పీకి సంబంధించి అన్నదాతలకు అవగాహన కల్పించాలి. ఇందుకోసం విస్తృతంగా కరపత్రాల ముద్రణ చేపట్టి పోస్టర్లు, హోర్డింగ్లను ఏర్పాటు చేయాలి. ధాన్యం కొనుగోళ్లలో మోసాలు, అక్రమాలను నివారించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. నమన్వయంతో సమర్థంగా.. రైతులకు అండగా నిలుస్తూ ఆర్బీకేలు పలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు.. మత్స్య, పశుసంవర్థక, ఉచిత విద్యుత్, సీహెచ్జీల నిర్వహణ ఇలా అన్నీ చేస్తున్నాం. వీటిని మరింత సమర్థంగా ముందుకు తీసుకెళ్లాలంటే సంబంధిత శాఖల మధ్య (లైన్ డిపార్ట్మెంట్స్) చక్కటి సమన్వయం అవసరం. ముఖ్యంగా వ్యవసాయ, మత్స్య, రెవెన్యూ, పౌరసరఫరాలు, డిజాస్టర్ మేనేజ్ మెంట్ తదితర శాఖల మధ్య సమన్వయం సమర్థంగా ఉండాలి. ఈ ప్రక్రియలో సజావుగా ముందుకు సాగేలా పటిష్ట మార్గదర్శకాలు, ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. దీనిపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలి. భూసార పరీక్ష కార్డులు విచక్షణా రహితంగా ఎరువులు, పురుగు మందులు, రసాయనాలు వాడకుండా నివారించడంపై అధికారులు దృష్టి పెట్టాలి. ఖరీఫ్, రబీ సీజన్లు ముగిసిన తరువాత దాదాపు రెండు నెలలు పంట విరామం ఉంటుంది. ఆ సమయంలో భూసార పరీక్షలన్నీ నిర్వహించి వాటి ఫలితాల ప్రకారం ఆ భూమికి ఎలాంటి పోషకాలు, ఎరువులు వాడాలో సూచించాలి. ప్రతి రైతుకూ తన సాగు భూమికి సంబంధించిన భూసార పరీక్ష కార్డులను క్రమం తప్పకుండా అందించే కార్యక్రమాన్ని రూపొందించాలి. ఎంత మోతాదులో ఎరువులు, పురుగు మందులు వాడాలో çస్పష్టమైన అవగాహన కల్పించాలి. డాక్టర్లా ఆర్బీకేలు ఒక మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు డాక్టర్ ఎలా సేవలందిస్తారో పంటల సాగులో ఆర్బీకేలు కూడా అదే విధంగా రైతన్నలకు ఉపయోగపడాలి. ఆర్బీకేలు ఒక రకంగా పొలం డాక్టర్ల మాదిరిగా పనిచేయాలి. వైద్యారోగ్యశాఖలో ఫ్యామిలీ డాక్టర్ విధానం తరహాలో క్రమం తప్పకుండా గ్రామాల్లో ఆర్బీకేలు రైతులకు సలహాలు, సూచనలు అందచేయాలి. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, సీఎస్ డాక్టర్ సమీర్శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్, వ్యవసాయ శాఖ కమిషనర్ సి.హరికిరణ్, మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న, పౌరసరఫరాల కార్పొరేషన్ వీసీ, ఎండీ వీరపాండ్యన్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. -
ఆ బాధ్యత మనదే.. సీఎం జగన్ కీలక ఆదేశాలు..
సాక్షి, తాడేపల్లి: వ్యవసాయ, పౌర సరఫరాల శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ నేపథ్యంలో ఇ-క్రాపింగ్, ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోళ్లు అంశాలపై సీఎం సమీక్షించారు. ఖరీఫ్ ప్రారంభం అవుతోందని.. రైతు పండించిన పంటను కచ్చితంగా ఇ-క్రాపింగ్ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. చదవండి: ఆ రెండు వేల కోసం విమర్శిస్తున్నారు: సీఎం జగన్ ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే... ♦ఈ డేటా ఆధారంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ఇతరత్రా ఏ కష్టం వచ్చినా రైతును ఆదుకునేందుకు వీలు ఉంటుంది ♦ఇ-క్రాప్ ప్రక్రియను మరింత బలోపేతం చేయాలి ♦ఇ-క్రాప్ చేసిన తర్వాత డిజిటల్ రశీదుతోపాటు, ఫిజికల్ రశీదుకూడా ఇవ్వాలని గతంలో నేను స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను ♦డిజిటల్ రశీదును నేరుగా రైతు సెల్ఫోన్కు పంపాలి ♦ఒకవేళ తనకు నష్టం వస్తే.. ఆ రశీదు ఆధారంగా రైతులు ప్రశ్నించగలిగే హక్కు వారికి వస్తుంది ♦దీనికి సంబంధించిన ఎస్ఓపీని బలోపేతం చేయాలి ♦వీఆర్వో, సర్వే అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్ల జాయింట్ అజమాయిషీ బాధ్యతను అప్పగించాలి ♦ఆ గ్రామంలో సాగుచేస్తున్న భూములు, సంబంధిత రైతుల వివరాలతో కూడిన మాస్టర్ రిజిస్టర్ను వీరికి అందుబాటులో ఉంచాలి ♦జియో ట్యాగింగ్, ఫొటో గ్రాఫ్స్ ఇ–క్రాప్లో లోడ్ చేయాలి ♦జూన్ 15 నుంచి ఇ– క్రాపింగ్ మొదలుపెట్టి, ఆగస్టు చివరినాటి పూర్తిచేయాలి ♦సెప్టెంబరు మొదటివారంలో సామాజిక తనిఖీచేపట్టాలి ♦జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచాలి ♦ఉన్నతాధికారుల స్థాయిలో ప్రతి 15 రోజులకోసారి ఇ–క్రాపింగ్పై సమీక్ష, పర్యవేక్షణ చేయాలి ♦మండలస్థాయి, జిల్లా స్థాయిల్లో అధికారులు ఇ–క్రాపింగ్ జరుగుతున్న తీరును తనిఖీచేయాలి ♦ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర తీసివేయాలి ♦ఆర్బీకేల ద్వారానే ధాన్యం కొనుగోళ్లు జరగాలి ♦ధాన్యం విక్రయం కోసం రైతులు మిల్లర్ల దగ్గరకు వెళ్లే పరిస్థితులు ఉండకూడదు ♦ధాన్యం కొనుగోలు బాధ్యత పౌర సరఫరాల శాఖదే ♦ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత వారికి డబ్బు చెల్లించే బాధ్యత కూడా పౌరసరఫరాల శాఖదే ♦రైతు నుంచి కొనుగోలు చేసిన తర్వాత... ఆ ధాన్యాన్ని వేరే వే-బ్రిడ్జి వద్ద తూకం వేయించి రశీదును రైతుకు ఇవ్వాలి ♦దీనివల్ల రైతుకు ఎంఎస్పీ లభిస్తుంది ♦రావాల్సిన ఎంఎస్పీలో ఒక్క రూపాయికూడా తగ్గకుండా రైతుకు రావాలి ♦పాలకులుగా, అధికారులుగా మనం గొంతులేని వారిపక్షాన నిలవాలి ♦వారి పక్షం నుంచి మనం ఆలోచన చేయాలి ♦రైతుల విషయంలో కూడా అంతే ♦వారి పంటలకు అందే ధర విషయంలో రైతుల పక్షాన మనం నిలవాలి ♦కొనుగోలు చేయడమే కాదు, ఎంఎస్పీ కూడా కల్పించాల్సిన బాధ్యత మనది: అధికారులకు స్పష్టం చేసిన సీఎం జగన్ సమీక్షా సమావేశానికి వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏపీ అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్యకార్యదర్శి వై మధుసూధన్ రెడ్డి, సివిల్ సఫ్లైస్ కమిషనర్ ఎం గిరిజాశంకర్, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ సి హరి కిరణ్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ప్రభుత్వ ఔట్లెట్లలో లక్ష లీటర్ల నూనె విక్రయం
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వంట నూనెల ధరలను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. రైతుబజార్లు, మున్సిపల్ మార్కెట్లలో విజయ బ్రాండ్ ఔట్లెట్ల పేరుతో చేపట్టిన విక్రయాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 12నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఔట్లెట్లలో 1,01,165 లీటర్ల వంట నూనెను విక్రయించడం విశేషం. ఇందులో రైతుబజార్లలో 70,580 లీటర్లు, మున్సిపల్ మార్కెట్లలో 30,585 లీటర్ల అమ్మకాలు జరిగాయి. మరోవైపు డిమాండ్కు అనుగుణంగా మున్సిపల్ కార్పొరేషన్లు, 2వేల జనాభాపైడిన పంచాయతీల్లోనూ స్వయం సహాయక సంఘాల ద్వారా విజయ నూనె విక్రయానికి సన్నాహాలు చేస్తున్నారు. విస్తృతంగా తనిఖీ.. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వంట నూనెల ధరలు భారీగా పెరగడంతో పాటు దిగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలో వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి డిమాండ్ను సొమ్ము చేసుకోకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఇప్పటి వరకు తనిఖీల్లో నిత్యావసరాల చట్టం ప్రకారం (6ఏ) 76 కేసులు నమోదు చేసి 22.59 లక్షల లీటర్ల నూనెను సీజ్ చేసింది. వీటిల్లో కేసులు పరిష్కరించిన వాటిని మార్కెట్లోకి విడుదల చేయడంతో పాటు మిగిలిన వాటిని ప్రభుత్వ నూనె కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. మరోవైపు మార్కెట్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా సన్ఫ్లవర్ స్థానంలో సోయాబీన్, రైస్బ్రాన్ నూనె అమ్మకాలను చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రైవేటు ఔట్లెట్లలో ప్రభుత్వ ధరలకే.. అంతర్జాతీయంగా నూనెల ధరల సెగ నుంచి సామాన్యులు, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం ఊరట కల్పిస్తోంది. ఆయిల్ రిఫైనరీస్, ఉత్పత్తి, సరఫరాదారులు, చాంబర్ ఆఫ్ కామర్స్తో సమావేశాలు నిర్వహించి తక్కువ ధరలకు నూనెలు విక్రయించేలా ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే వంట నూనెల ధరలు చాలా వరకు అదుపులోకి రావడంతో పాటు ఎక్కడా కూడా కృత్రిమ కొరత తలెత్తలేదు. హోల్సేల్ విక్రేతల సాయంతో 256 రిటైల్ ఔట్లెట్స్ ద్వారా సుమారు 11.20లక్షల లీటర్ల వంట నూనెను ఎమ్మార్పీ కంటే తక్కువ రేట్లకే అందించడం గమనార్హం. విజయ ఆయిల్స్కు మంచి ఆదరణ వంట నూనెల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ప్రభుత్వం విజయ ఆయిల్ పేరుతో విక్రయాలు చేపట్టింది. మార్కెట్ ధరలతో పోలిస్తే విజయ ఆయిల్స్ ధరలు తక్కువగా ఉండడంతో మంచి ఆదరణ లభిస్తోంది. విక్రయాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నిల్వలను సిద్ధం చేసుకుంటున్నాం. – చవల బాబురావు, ఏపీ ఆయిల్ఫెడ్ ఎండీ ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తాం.. ఇటీవల అంతర్జాతీయ పరిణామాలు వంట నూనెల ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఈ క్రమంలో మన దగ్గర నిల్వలను సక్రమంగా వినియోగించుకుంటూనే విదేశాల నుంచి దిగుమతయ్యే నూనెల స్థానంలో ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తున్నాం. ఎప్పటికప్పుడు మార్కెట్ ధరలను సమీక్షిస్తూ అవసరానికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నాం – గిరిజా శంకర్, పౌరసరఫరాలశాఖ కమిషనర్