ఒక్క గింజా వదలం.. నయా పైసా పోనియ్యం | Gangula Kamalakar in a high level review of the Civil Supplies Department | Sakshi
Sakshi News home page

ఒక్క గింజా వదలం.. నయా పైసా పోనియ్యం

Published Sat, Apr 8 2023 3:37 AM | Last Updated on Sat, Apr 8 2023 3:37 AM

Gangula Kamalakar in a high level review of the Civil Supplies Department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం మిల్లర్లకు కేటాయించిన ధాన్యంలో ఒక్క గింజను వదులుకోబోమని, ఒక్క రూపాయిని కూడా ఊరికే పోనివ్వ మని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. ధాన్యం అమ్ముకునే మిల్లర్లను, రేషన్‌ బియ్యం పక్కదారి పట్టడాన్ని గుర్తించి సమాచారం అందించిన పౌరులకు సైతం రివార్డులు అందజేయడంతోపాటు వారి వివరాల్ని గోప్యంగా ఉంచుతామన్నారు.

శుక్రవారం పౌర సరఫరాల శాఖ, సంస్థల అధికారులతో హైదరాబాద్‌ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ సూర్యాపేట, నల్గగొండ, వనపర్తి, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోనే అధికంగా మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని, సీఎంఆర్‌ అప్పగింతలో కూడా ఈ జిల్లాల్లో డిఫాల్టర్లు అధికంగా ఉన్నారని వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో పటిష్టమైన టాస్క్‌ఫోర్స్‌ను తక్షణమే ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మిగతా అన్ని జిల్లాల్లోనూ రిటైర్డ్‌ పోలీస్, రెవెన్యూ ఉన్నతాధికారులతో కట్టుదిట్టమైన టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 

ఆరు రెట్లు ధాన్యం దిగుబడి.. రెండు రెట్లు మాత్రమే పెరిగిన మిల్లింగ్‌ కెపాసిటీ 
రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ వ్యవసాయ అభివృద్ధికి చేసిన కృషితో 24 లక్షల మెట్రిక్‌ టన్నుల నుంచి 141 లక్షల మెట్రిక్‌ టన్నులకు ధాన్యం సేకరణ పెరిగిందని మంత్రి కమలాకర్‌ తెలిపారు. ఆరింతలుగా పెరిగిన ఈ ధాన్యం సేకరణకు అనుగుణంగా మిల్లింగ్‌ కెపాసిటీ పెరగలేదని, కేవలం గతానికి ఇప్పటికి 2 రెట్లు మాత్రమే పెరిగిందన్నారు. అందువల్ల మిల్లర్లకు అదనంగా ధాన్యం కేటాయింపులు చేయడం జరుగుతుందని, ఇదే అదనుగా కొన్ని చోట్ల మిల్లర్లు ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్న ట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు.

ఇలాంటి వారిపై క్రిమినల్‌ కేసులతోపాటు రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ను ప్రయోగించి 125 శాతం నగదు రికవరీ చేస్తా మని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్ల నుంచి 90 శాతం రికవరీ చేశామని, మిగతా పది శాతం సైతం రికవరీ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి రెండు లారీ ల బియ్యం మిల్లుకు అక్రమంగా తరలిస్తుండగా, విజిలెన్స్‌ బృందాలు పసిగట్టి పట్టుకున్నాయని చెప్పారు. పెద్దపల్లితో పాటు సూర్యాపేట, ఇతర జిల్లాల్లో జరిగిన బియ్యం అక్రమాలపై కూడా కేసులు బుక్‌ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 

ధాన్యం నిల్వ కోసం ఇంటర్మీడియట్‌ గోదాంలు 
ఈ యాసంగిలో ఇంటరీ్మడియట్‌ గోదాములను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి గంగుల తెలిపారు. సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక,    ఆంధ్రప్రదేశ్‌లలో ఖాళీగా ఉన్న మిల్లింగ్‌ కెపాసిటీని వాడుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సీఎంఆర్‌ డిఫాల్టర్లకు, అక్రమ మిల్లర్లకు ఈసారి ఒక్క గింజను కూడా కేటాయించబోమని చెప్పారు. సమీక్షలో పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

మంత్రి గంగులను కలిసిన గెల్లు శ్రీనివాస్‌  
సాక్షి, హైదరాబాద్‌: పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమితులైన హుజూరాబాద్‌ నియో జకవర్గం బీఆర్‌ఎస్‌ నేత గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ శుక్రవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ నెల 15న ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కావలసిందిగా ఆయన్ను కోరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను  అభినంస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని, సీఎం కేసీఆర్‌ అప్పగించిన బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని గంగుల సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement