-
ప్రియురాలిని వదిలి వెళ్లలేక, షోను వదులుకోలేక..
ముంబై : ప్రముఖ రియాలిటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ' పదకొండవ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో జరిగే ఈ షోలో పాల్గొనేందుకు ఇప్పటికే కంటెస్టెంట్లు సన్నద్ధం అయ్యారు. ప్రముఖ సింగర్, బిగ్బాస్ ఫేం రాహుల్ వైద్య, వరుణ్ సూద్, దివ్యంకా త్రిపాఠి అర్జున్ బిజ్లాని, నిక్కి తంబోలి, అభినవ్ శుక్లా సహా పలువురు ఈ షోలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో గత రాత్రి ముంబై ఏయిర్పోర్టుకు చేరుకున్న రాహుల్ ప్రియురాలు దిషా పర్మార్ని వదిలి వెళ్లేటప్పుడు ఎమోషల్ అయ్యారు. ప్రియురాలికి ముద్లులు, హగ్గులు ఇచ్చి విడ్కోలు పలికారు. ఈ ఫోటోలను క్లిక్ మనిపించిన ఫోటోగ్రాఫర్లు వీరిది ఎంతో క్యూట్ జోడీ అంటూ కొనియాడారు. ఇక ఈ పోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హిందీ బిగ్బాస్-14లో రుబీనా దిలైక్తో తలపడి రాహుల్ రన్నరప్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇదే షోలో ప్రియురాలు దిశా పర్మార్ని కూడా పరిచయం చేసిన రాహుల్ మరొకొద్ది నెలల్లోనే తమ వివాహం ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే పెళ్లి పనులు మొదలు పెట్టినా కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఖత్రోన్ కే ఖిలాడీ షోలో పాల్గొనేందుకు సన్నద్ధం అయ్యారు. అయితే ఏయిర్పోర్టులో ప్రేయసిని వదిలి వెళ్లలేక, షోను వదులుకోలేక రాహుల్ మదనపడుతూ కనిపించాడు. View this post on Instagram A post shared by Rahul Vaidya world (@mad_fan_of_rahul_vaidya_) ఛదవండి : 'బిగ్బాస్' వల్ల నాకు ఒరింగిందేమీ లేదు : నటి నా కుమారులు నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమంటున్నారు: నటి -
మా ఆటగాళ్లకు వైరస్ లేదు: ఈసీబీ
కేప్టౌన్ : దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టులో ఇద్దరు ఆటగాళ్లకు వైరస్ లక్షణాలు లేవని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) స్పష్టం చేసింది. బయో బబుల్లో ఉన్నప్పటికీ వీరితో పాటు బస చేసిన హోటల్ సిబ్బందికి కరోనా సోకినట్లు వార్తలొచ్చాయి. ఈ గందరగోళంలోనే మూడు వన్డేల సిరీస్ పూర్తిగా రద్దయింది. అయితే కరోనా అనుమానితుల్ని మిగతా ఆటగాళ్లకు దూరంగా ఐసోలేషన్లో ఉంచారు. ఈసీబీ వైద్యబృందం వారి నమూనాల్ని మరోసారి స్వతంత్ర వైరాలజీ ల్యాబ్లో పరీక్షించింది. అయితే వైరస్ జాడ లేదని తెలియడంతో ఈసీబీ, దక్షిణాఫ్రికా క్రికెట్ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఇప్పుడు ఆ ఇద్దరు ఆటగాళ్లు ఐసోలేషన్ నుంచి విడుదలయ్యారు. జట్టుతో కలిసి గురువారం స్వదేశానికి పయనం కానున్నారు. -
క్వారంటైన్లో ముగ్గురు క్రికెటర్లు
కేప్టౌన్: స్వదేశంలో ఇంగ్లండ్తో వన్డే, టి20 సిరీస్లకు సన్నద్ధమవుతున్న సమయంలో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టును కరోనా తాకింది. జట్టులో సభ్యుడొకరు కోవిడ్–19 పాజిటివ్గా తేలాడు. దాంతో అతడిని బయో బబుల్నుంచి బయటకు పంపించివేశారు. అతనితో సన్నిహితంగా మెలిగిన మరో ఇద్దరు క్రికెటర్లకు వైరస్ లక్షణాలు లేనప్పటికీ ముందు జాగ్రత్తగా క్వారంటైన్కు తరలించినట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు. ఆ ముగ్గురి స్థానాలను ఇతర క్రికెటర్లతో భర్తీ చేయబోమని చెప్పింది. (భారత్ కంటే ఆస్ట్రేలియా మెరుగు) మరో వైపు తాజా సిరీస్లో మోకాలిపై కూర్చొని నల్లజాతివారికి సంఘీభావం తెలిపే కార్యక్రమానికి తాము దూరంగా ఉంటున్నామని దక్షిణాఫ్రికా కోచ్ మార్క్ బౌచర్ వెల్లడించాడు. తమ దేశంలో ఈ మొత్తం ఉద్యమంలో కీలకంగా ఉన్న జట్టు సభ్యుడు లుంగీ ఇన్గిడితో తాను మాట్లాడానని... కొన్నాళ్ల క్రితం జరిగిన 3టీసీ మ్యాచ్లో ఇలా చేశాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదని వివరించినట్లు బౌచర్ తెలిపాడు. -
మాజీ క్రికెటర్ సోదరుడు కాల్చివేత
కేప్టౌన్: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ వెర్నోన్ ఫిలాండర్ సోదరుడు టైరోన్ ఫిలాండర్ కాల్చివేతకు గురయ్యాడు. ఈ ఘటన బుధవారం టైరోన్ స్వస్థలమైన రావెన్స్మీడ్లో చోటు చేసుకుంది. తన సోదరుడ్ని కొందరు దుండగులు కాల్చివేసిన విషయాన్ని వెర్నోన్ ఫిలాండర్ ట్వీటర్ ద్వారా వెల్లడించాడు. ‘ నా సోదరుడు టైరోన్ దారుణ హత్యకు గురయ్యాడు. మా హోమ్ టౌన్లోనే ఇది జరిగింది. ఈ కష్టసమయంలో మా కుటుంబానికి ప్రైవసీని గౌరవించాలని కోరుతున్నారు.(చదవండి: శాంసన్ రాత మారేనా? మళ్లీ అదే డ్రామానా?) ఇది పోలీసుల దర్యాప్తులో ఉంది. ఈ విషయంలో పోలీసులకు మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా. దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించనందున ఎటువంటి తప్పుడు వార్తలు రాయొద్దు. ఊహాగానాలతో దర్యాప్తు కష్టంగా మారిపోతుంది. టైరోన్ ఎప్పుడూ మా మనసుల్లో ఉంటాడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. టైరోన్ కాల్చబడ్డ సమయంలో పక్కంటి వారికి వాటర్ డెలివరీ చేయడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు స్థానిక మీడియా ద్వారా తెలుస్తోంది. -
‘438’.. సీన్ రిపీట్ అవుతుందా?
‘438’ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ నంబర్పై తీవ్ర చర్చ జరుగుతోంది. క్రికెట్ అభిమానులకు ముఖ్యంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఫ్యాన్స్ మరిచిపోని నంబర్ ‘438’. ఎందుకంటే టీ20 ఫార్మట్ అంతగా ఎస్టాబ్లిష్ కాకముందే వన్డే చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో రికార్డు స్కోర్ నమోదు చేసింది దక్షిణాఫ్రికా జట్టు. కేప్టౌన్ వేదికగా ఆసీస్ విసిరిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ప్రొటీస్ జట్టు అందరినీ షాక్కు గురిచేస్తూ 438 పరుగులు సాధించి అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అదెప్పుడో 2006లో జరిగింది కదా మళ్లీ ఇప్పుడు ఎందుకు ఆ చర్చ అనుకుంటున్నారా? అయితే అదే మ్యాజిక్ ఫిగర్ దక్షిణాఫ్రికాను మరోసారి ఊరిస్తోంది. దీంతో సోషల్ మీడియా వేదికగా ‘438’ మరోసారి తెరపైకి వచ్చింది. నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా ఆతిథ్య సఫారీ లక్ష్యం 438 పరుగులు. పర్యాటక ఇంగ్లండ్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్ను 391/8 వద్ద డిక్లెర్డ్ చేసింది. దీంతో 46 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని డుప్లెసిస్ సేన ముందు ఇంగ్లండ్ 438 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది. ఇక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ప్రొటీస్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఎల్గర్(34), హమ్జా(15) అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం క్రీజులో మలాన్(63 బ్యాటింగ్), నైట్ వాచ్మన్ కేశవ్ మహారాజ్(2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. సఫారీ జట్టు గెలవాలంటే ఆట చివరి రోజు 312 పరుగులు సాధించాలి. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. అయితే గెలుపు కోసం పోరాడటంతో పాటు ఓడిపోకుండా జాగ్రత్తగా ఆడాలని ప్రొటీస్ జట్టు భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్లో తప్పక గెలిచి నాలుగు టెస్టుల సిరీస్ను 1-1తో లెవల్ చేయాలని రూట్ సేన ఉవ్విళ్లూరుతోంది. అయితే కేప్టౌన్ వేదికగా దక్షిణాఫికా ‘438’ సీన్ మరోసారి రిపీట్ చేస్తుందని ఆ దేశ అభిమానులు ఆశిస్తున్నారు. అంతేకాకుండా ఆనాటి మ్యాచ్కు సంబంధించి మధురస్మృతులను గుర్తుచేసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఆనాటి మ్యాచ్కు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇక ఆ మ్యాచ్లో అప్పటి సారథి రికీ పాంటింగ్ (164) భారీ సెంచరీ సాధించడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 434 పరుగులు చేసింది. అనంతరం హెర్షల్ గిబ్స్(175), స్మిత్(90)తో పాటు బౌచర్(50 నాటౌట్) రాణించడంతో దక్షిణాఫ్రికా 49.5 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 438 పరుగులు సాధించి విజయాన్ని అందుకుని ఛేజింగ్లో సరికొత్త చరిత్రను సృష్టించిన విషయం తెలిసిందే. -
బ్యాటింగ్ కన్సల్టెంట్గా కల్లిస్
కేప్టౌన్: సంధి దశను ఎదుర్కొంటున్న దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు దిద్దుబాటు చర్యలను వేగవంతం చేసింది. ఇటీవల ప్రధాన కోచ్గా మార్క్ బౌచర్ను నియమించిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు.. తాజాగా బ్యాటింగ్ కన్సల్టెంట్గా మరో దిగ్గజ ఆటగాడు జాక్వస్ కల్లిస్ను ఎంపిక చేసింది. సమ్మర్లో సద్వేశంలో జరుగనున్న మొత్తం మ్యాచ్లకు కల్లిస్ను బ్యాటింగ్ కన్సల్టెంట్గా నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈరోజే బ్యాటింగ్ కన్సల్టెంట్ బాధ్యతలను కల్లిస్ స్వీకరించనున్నాడు. ఈ విషయాన్ని తమ అధికారిక ట్వీటర్ అకౌంట్లో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. 519 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన కల్లిస్ దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించాడు. ఆల్ రౌండర్గా సఫారీలకు వెన్నుముకగా నిలిచాడు. 166టెస్టులు, 328 వన్డేలు, 25 అంతర్జాతీయ టీ20లు ఆడిన అనుభవం కల్లిస్ది. దక్షిణాఫ్రికా తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 25, 534 పరుగులు సాధించిన కల్లిస్.. 577 వికెట్లు తీశాడు. -
ఎలాగైనా బౌలింగ్ చేస్తా.. వికెట్ తీస్తా!
కేప్టౌన్: క్రికెట్లో రెండు చేతులతో బౌలింగ్ చేయడం చాలా అరుదు. గతంలో శ్రీలంక స్పిన్నర్ కామిందు మెండిస్ రెండు చేతులతో బౌలింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇప్పుడు అదే తరహా బౌలింగ్తో మరొక బౌలర్ వచ్చేశాడు. తనకు కుడి-ఎడమ తేడా లేదంటున్నాడు దక్షిణాఫ్రికా గ్రెగొరీ మహలోక్వానా. రెండు చేతులతో బౌలింగ్ చేయడం అనేది చాలా కష్టం. ఎంతో శ్రమిస్తేకానీ ఇలా బౌలింగ్ చేయలేదు. సౌతాఫ్రికాలో జరుగుతున్న ఎమ్జాన్సీ టీ20 సూపర్ లీగ్లో గ్రెగొరీ రెండు చేతులతో బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లు కూడా సాధించాడు. కేప్టౌన్ బ్లిట్జ్ తరఫున ఆడుతున్న గ్రెగొరీ.. ఆదివారం డర్బన్ హీట్తో జరిగిన మ్యాచ్లో రెండు వికెట్లు సాధించాడు. తొలుత కుడి చేతి బౌలింగ్ చేసి ఓపెనర్ సారే ఎర్వీని ఔట్ చేసిన గ్రెగొరీ..ఆపై ఎడమ చేతితో బౌలింగ్ చేసి డానే విలాస్ను బోల్తా కొట్టించాడు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఈ మ్యాచ్లో కేప్టౌన్ బ్లిట్జ్ 10 పరుగుల తేడాతో గెలిచింది. ముందు బ్యాటింగ్ చేసిన కేప్టౌన్ ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయగా, డర్బన్ హీట్ ఏడు వికెట్లు కోల్పోయి 164 పరుగులే చేసింది. WICKET | SJ Erwee c Linde b Mahlokwana 16 (23b 1x4 0x6) SR: 69.56 Will the ambidextrous Mahlokwana be able to take a left handed and a right handed wicket today?#MSLT20 pic.twitter.com/rkw29YIb3g — Mzansi Super League 🔥 🇿🇦 🏏 (@MSL_T20) November 17, 2019 WICKET | DJ Vilas b Mahlokwana 8 (10m 8b 0x4 0x6) That's Mahlokwana's second of the day. His first wicket was bowled Right handed and now he gets a wicket with the quicker left arm.#MSLT20 pic.twitter.com/Gey4JPypq1 — Mzansi Super League 🔥 🇿🇦 🏏 (@MSL_T20) November 17, 2019 -
ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న విమానం కూలిన వీడియో
-
చనిపోయాడని చెప్పారు.. కానీ!
కేప్టౌన్(దక్షిణాఫ్రికా) : ఆ రోజు జూన్ 24, తెల్లవారు జామున.. రోడ్డు సరిగా కనిపించడం లేదు. అసలే అది కేప్టౌన్లోకెల్లా చాలా ప్రమాదకరమయిన రోడ్డు. ఆ రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగింది. కారులో నలుగురులో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. ఎంత తీవ్రంగా అంటే కారులో నుంచి రోడ్డు మీద పడ్డారు. నాల్గో వ్యక్తికి మాత్రం అంత పెద్ద దెబ్బలేం తగల్లేదు. దాంతో అతను సాయం కోసం ఎదురు చూస చూస్తుండగా.. సమాచారం అందుకున్న ప్రైవేటు అంబులెన్స్ సర్వీస్ వారు అక్కడికి వచ్చారు. గాయపడిన నాల్గో వ్యక్తిని కాపాడటం కోసం ఆస్పత్రికి తరలించారు. మిగతా ముగ్గురిని పరీక్షించి చనిపోయినట్లుగా నిర్ధారించారు. అనంతరం వారిని మార్చురికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ముగ్గురిని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి తీసుకెళ్తుండగా చనిపోయిన వారిలో ఒక వ్యక్తి శ్వాస తీసుకుంటున్నట్టు గమనించారు. అతన్ని పరీక్షించగా బతికే ఉన్నాడు. కొద్ది నిమిషాల ముందు మరణించాడని ప్రకటించిన వ్యక్తి మళ్లీ ఎలా బతికాడు...? ఇలాంటి సంఘటనలు ఇక్కడే కాదు ప్రంపంచ వ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి బీబీసీ కొన్ని కథనాలను కూడా ప్రచారం చేసింది. వాటిలో గత జనవరిలో గోన్జాలో మొన్టోయో అని వ్యక్తి మరణించినట్లు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు డాక్టర్లు నిర్ధారించారు. అతనికి పోస్టు మార్టమ్ చేద్దామని శరీరంపై గుర్తులు కూడా పెట్టారు. కానీ ఉన్నట్టుండి ఆ వ్యక్తి లేచి కూర్చున్నాడు. మూడేళ్ల క్రితం 91 ఏళ్ల వృద్ధురాలిని మరణించినట్లు ప్రకటించారు. కానీ ఆమె మరణించినట్లు ప్రకటించిన 11 గంటల తర్వాత ఆ బామ్మ నింపాదిగా లేచి కూర్చుని వేడి వేడిగా ఓ కప్పు కాఫీ, పాన్ కేక్ తీసుకురమ్మని డాక్టర్లకు చెప్పింది. దాంతో డాక్టర్లు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టారు. కొన్నేళ్ల క్రితం ఓ 80 ఏళ్ల బామ్మకు గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. డాక్టర్లు ఆమెను మరణించిందని నిర్ధారించి, ఫ్రీజర్లో ఉంచారు. కొన్ని రోజుల తర్వాత చూస్తే ఆమె ముక్కు పగిలి సగం బయటకు వచ్చి ఉంది. ఏం జరిగిందో ముందు డాక్టర్లకు అర్థం కాలేదు. తర్వాత తెలిసిందేంటంటే పాపం ఆ వృద్ధురాలిని ఫ్రీజర్లో పెట్టిన తర్వాత బతికిందని, అందుకే బయటకు రావడానికి ప్రయత్నించి ఉంటుందని తెలిపారు డాక్టర్లు. మరణం తర్వాత జీవం ఎలా... వైద్యులు పరీక్షించి, మరణించారని నిర్ధారించిన తర్వాత కూడా వీరంతా మళ్లీ ఎలా బతుకుతున్నారన్నదే చాలా ఆశ్చర్చకరమైన విషయం. అయితే దీనికి వైద్యులు చెప్పే సమాధానం మరణించారని నిర్ధారించిన వ్యక్తులు కొన్నిసార్లు నిజంగానే మరణించరు. ఆ సమయంలో వారు ‘కాటలాప్సి’(కండరాలు బిగుసుకుపోవడం) అనే స్థితికి చేరుకుంటారు. ఆ సమయంలో వారి హృదయ స్పందనలు, శ్వాస తీసుకోవడం వంటి వాటిని గుర్తించలేనంత లో-లెవల్కు పడిపోతాయి. కాబట్టి వారు మరణించిన వారిలానే ఉంటారు. కండరాల బిగువు సడలిన తర్వాత వారి శరీరం సాధారణ స్థితిలోకి వచ్చి ఉన్నట్టుండి ఒక్కసారిగా బతుకుతున్నారని తెలిపారు వైద్యులు. -
సాంబా.. చంపేయబోయింది
కేప్టౌన్ : మచ్చిక చేసుకున్నవైనా.. మన ఆధీనంలోనే ఉన్నా క్రూర జంతువుల దగ్గర చాలా జాగ్రతగా ఉండక తప్పదు. లేకపోతే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. దక్షిణాఫ్రికాలో తాజాగా జరిగిన ఓ సంఘటన ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. ఓ జూ యజమానిపై సింహం దాడికి దిగగా.. ఆయన అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. బ్రిటన్కు చెందిన మైక్ హాడ్జ్(67) కొన్నేళ్లుగా దక్షిణాఫ్రికాలోని లింపోపో ప్రావిన్స్లో మారకెలె శాంక్చురీ పేరుతో జూ నిర్వహిస్తున్నారు. ఇందులో వివిధ రకాల జంతువులతోపాటు సాంబా అనే పేరు గల సింహం ఉంది. గత సోమవారం (ఏప్రిల్ 30) జూకు వచ్చిన సందర్శకులకు వివరాలు చెబుతూ.. ఏదో దుర్వాసనను గమనించిన హాడ్జ్ ఎన్క్లోజర్లోకి వెళ్లారు. అదే సమయంలో దూరం నుంచి సింహం రావడం చూసి సహాయం కోసం కేకలు వేస్తూ గేటు వైపు పరిగెత్తాడు. అయితే ఈ లోపలే ఆయన మీద సింహం దాడి చేసి పొదల్లోకి లాక్కెళ్లింది. ఆ తర్వాత కాసేపటికి సందర్శకుల్లో ఎవరో రైఫిల్తో కాల్చడంతో సింహం ఆయన్ని వదిలేసింది. తీవ్రంగా గాయపడిన ఆయన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. కాగా, సింహం నుంచి తప్పించుకునేందుకు హాడ్జ్ పరిగెత్తడం, సింహం ఆయన్ని నోట కరుచుకొని లాక్కెడం రికార్డయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
కేప్టౌన్కు ఐస్బర్గ్స్ ఉపశమనం..!!
జోహన్నెస్బర్గ్ : దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో ఏర్పడిన తీవ్ర నీటి కొరతను తగ్గించేందుకు మెరైన్ నిపుణులు ఆ దేశ ప్రభుత్వం ముందు పరిష్కారాన్ని ఉంచారు. అంటార్కిటికా ఖండం నుంచి భారీ మంచు దిమ్మెలను కేప్టౌన్కు తీసుకువచ్చి, కరువు ప్రాంతాల్లోని నీటి కుంటలు, సరస్సులు, నదుల్లో వాటిని కరిగించాలనేది ప్రతిపాదన. 20వ శతాబ్దంలోనే అతిపెద్ద కరువుగా కేప్టౌన్ కరువును అభివర్ణిస్తున్న విషయం తెల్సిందే. మంచు దిమ్మెలను కేప్టౌన్కు తీసుకురావడ తప్ప కరువుకు మరో ప్రత్యామ్నాయం ఏమీ లేదని నిపుణులు దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. 2015 నుంచి కేప్టౌన్లో తీవ్రదుర్భిక్షం నెలకొంది. దీంతో ఈ కరువును దక్షిణాఫ్రికా ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించింది. కేప్టౌన్లో ఇప్పటికే నీటిపై ఆంక్షలు ఉన్నాయి. ఈ ఏడాది వర్షాలు లేకపోతే తాగునీరు పూర్తిగా లేకుండా పోయే ప్రమాదం ఉంది. అనుమతిస్తే అంటార్కిటికా నుంచి మంచు తునకలను త్వరగా కరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకుని కేప్టౌన్కు తీసుకువస్తామని నిపుణులు దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి నివేదించారు. ఒక భారీ ఐస్బర్గ్ ఏడాది పాటు కరుగుతూ రోజుకు 150 మిలియన్ లీటర్ల తాగునీటిని ఇస్తుందని పేర్కొన్నారు. -
ప్రతి చుక్కా.. ఓ లెక్కే..!
ఉన్నట్టుండి ఓరోజు.. కొళాయిల్లో నీళ్లు రావని ప్రభుత్వం ప్రకటిస్తే..! ఇంకేముంది.. నానా గందరగోళం తప్పదు.. అటకెక్కినబిందెలు కిందకు దిగేస్తాయి.. రేపటికోసం ఈరోజే ఖాళీ బిందెలతో పే...ద్ద క్యూలు ఏర్పాటవుతాయి. అచ్చం ఇలాంటి పరిస్థితినే చివరిక్షణంలో అధిగమించింది కేప్టౌన్. సకాలంలో వానలు పడటంతో గండం గట్టెక్కినా.. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా.. ఎవరికైనా రావచ్చు అనేందుకు సూచిక ఇది. మరి తరుణోపాయం..? భవిష్యత్ ఎలా ఉంటుందో ఊహించలేం. కానీ వాస్తవ పరిస్థితుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. అందుకనుగుణంగా మనం మసలుకోవాలి. నానాటికీ పెరుగుతోన్న జనాభా, పట్టణీకరణ, కుప్పలు తెప్పలుగా కాంక్రీటు భవనాల నిర్మాణం, నీటిచుక్క ఇంకే జాడేలేకపోవడం. అంతా పెద్ద పెద్ద కాంక్రీటు రోడ్లూ, ఫ్లైఓవర్ల పిల్లర్లు.. మినహా మట్టికింత జాగాలేకపోవడం.. పట్టణాలనూ, నగరాలనూ పట్టిపీడిస్తోన్న నీటిఎద్దడికి ఇలాంటివే ఎన్నెన్నో కారణాలు. పెరుగుతోన్న జనాభాకి అనుగుణంగా నీటి వనరులను ఒడిసిపట్టుకోలేకపోవడం, నీటి సమస్యను అధిగమించడమెలాఅన్నదే ఇప్పుడు సమస్య. మానవ నాగరికతలన్నీ నీటి చుట్టూతానే అల్లుకుని ఉంటాయి. నీటి ప్రవాహం పొడవునా పరుచుకున్నదే ఏ సంస్కృతైనా.. తరతరాల నాగరికత ఒకే ఒక్క తుపానుకు తుడిచి పెట్టుకుపోయినట్టు చరిత్ర లో చదివాం. కానీ నేడు నీటి చుట్టూ అలము కున్న కరువు ప్రపంచ చరిత్రను ప్రమాదంలో పడేసే రోజొచ్చింది. ఇక జరగబోయేవన్నీ నీటి యుద్ధాలేనన్న విషయం నిజమయ్యే రోజు ఎం తో దూరంలో లేదని అర్థమవుతోంది. దక్షిణా ఫ్రికాలోని ‘డేజీరో’ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. వానలకు భరోసా లేదని గుర్తించాలి.. వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా భవిష్యత్తులో వానలకు భరోసా ఉండదన్న విషయాన్ని గుర్తించాలి. కేప్టౌన్ విషయాన్నే తీసుకుంటే ఈ నగరం తాగునీటి అవసరాల కోసం రిజర్వాయర్లపైనే ఆధారపడి ఉంది. మూడేళ్లపాటు వరుణుడు ముఖం చాటేయడంతో ఇవి నోళ్లు తెరిచాయి. భవిష్యత్తులో ఇలాంటి కరువు కాటకాలు మరింత తరచుగా వస్తాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని అందుకు తగ్గట్టుగా ప్రభుత్వాలు తాగునీటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. రెండు దశాబ్దాల క్రితం ఆస్ట్రేలియా చేసింది ఇదే. పెర్త్ నగరంలో తాగునీటి ఎద్దడి ఏర్పడిన విషయాన్ని గుర్తించిన అక్కడి ప్రభు త్వం ఆ తర్వాత తన విధానాలను సవరించుకుంది. సముద్రపు నీటి నుంచి మంచి నీటిని తయారుచేసే నిర్లవణీకరణ ప్రక్రియకు ప్రోత్సాహం కల్పించింది. ఇప్పుడు ఆ నగరంలో సగం నీరు నిర్లవణీకరణ ద్వారా అం దుతూంటే.. ఇంకో 40 శాతం అవసరాలను భూగర్భ జలా ల ద్వారా తీర్చుకుంటున్నా రు. రోజువారీ వ్యవహారాల్లో వాడే నీటిని మళ్లీమళ్లీ వాడుకునేలా ఏర్పాట్లు చేసుకోవడం వంటి చర్యల ద్వారా ‘డేజీరో’ ను అధిగమించవచ్చన్నది నిపుణు ల అభిప్రాయం. ప్రతి వానచుక్కను ఒడిసి పట్టుకోవడం, సురక్షితంగా నిల్వ చేసుకుని వాడటంపై కూడా ప్రజల్లో చైతన్యం పెరగాల్సిన అవసరముంది. స్థానిక ప్రభుత్వాలే కీలకం.. నీటి ఎద్దడి పరిష్కారం విషయంలో స్థానిక మున్సిపాలిటీలు, జిల్లా యంత్రాంగాలే కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేకచోట్ల నిరూపితమైన అంశమిది. అవసరాలకు తగ్గట్టుగా సత్వర నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యమన్నది గుర్తించాలి. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో చేపట్టే ఏ కార్యక్రమమైనా విజయవంతమ య్యే అవకాశాలు ఎక్కువ. తాగునీటి నిర్వహణ, ఎద్దడి నివారణ కూడా ఇందుకు భిన్నమేమీ కాదు. ప్రయోజనాలెన్నో.. తాగునీటి నిర్వహణ విషయంలో ప్రభుత్వాలు ఎంత పారదర్శకంగా ఉంటే అంత మేలు జరుగుతుందని గత అనుభవాలు సూచిస్తున్నాయి. నీటి వినియోగం, అందుబాటులో ఉన్న వనరులు తదితర అంశాలన్నింటిపై ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాచారం అందివ్వడం ద్వారా ప్రజలు పరిస్థితులను అర్థం చేసుకోగలుగుతారు. సమస్య పరిష్కారానికి చేస్తున్న ప్రయత్నాలనూ వారికి వివరించడం ప్రయోజనకారి. సమాచారాన్ని తొక్కిపట్టి.. అంతా బాగుందన్న భ్రమ కల్పిస్తే నీటిని పొదుపుచేయడం అస్సలు సాధ్యం కాదు. కేప్టౌన్లో ‘డే–జీరో’పరిస్థితిని అధిగమించేందుకు అక్కడి ప్రభుత్వం ఏర్పాటుచేసిన అవేర్నెస్ వెబ్సైట్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దూరదృష్టి అవసరం.. మబ్బుల్లో నీళ్లు చూసి ముంతవలకబోసుకున్నట్లు.. అనే సామెత తెలుగువారికి సుపరిచితమే. అయితే తాగునీటి సమస్యలు నివారించుకోవాలంటే ఈ రకమైన ఆలోచన అస్సలు పనికి రాదు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో తాగునీటి అవసరాలపై కచ్చితమైన మదింపు.. అందుకు తగ్గట్టుగా సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం అవసరం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళికలు రూపొందించుకోవాలని.. అందుబాటులో ఉన్న వనరులను ఏ ప్రాధాన్యత క్రమంలో ఖర్చు చేయాలన్నదీ ముందుగానే నిర్ణయమై ఉండాలని ఈ రంగంలో కృషిచేస్తున్న నిపుణులు సూచిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో మనం వాడే ప్రతినీటి బొట్టునూ లెక్కపెట్టేందుకు డిజిటల్ మీటర్లు ఏర్పాటు చేయడం ఇక్కడ ప్రస్తావనార్హం. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
డేంజర్కు దగ్గరగా బెంగళూరు
సాక్షి, న్యూఢిల్లీ : నీరే జీవకోటికి ప్రాణాధారం. జలం లేకపోతే జీవమే ఉండదు. ఇతర గ్రహాలు మనుషుల ఆవాసానికి అనుకూలమా, కాదా అనే విషయం కూడా అక్కడి నీటి లభ్యత మీద ఆధారపడి ఉంటుంది. నీరు లేకపోతే ఈ సృష్టే అంతరిస్తుంది. ఈ విషయం తెలిసి కూడా చేజేతులా భూతాపాన్ని పెంచి తీవ్రమైన వాతావరణ మార్పులకు కారణమవుతున్నాము. అందుకే అతివృష్టి, అనావృష్టిలాంటి పరిస్థితులు. ఇంకా వేసవి పూర్తిగా ప్రారంభమవలేదు. అయినప్పటికీ అప్పుడే నీటి ఎద్దడి సమస్యలు ప్రారంభమయ్యాయి. ఈ సమస్య తీవ్రంగా ఉండి ఇప్పుడు సిలికాన్ సిటీ బెంగళూరును బెంబేలెత్తిస్తోంది. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) పత్రిక ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న10 నగరాల జాబితాను విడుదల చేసింది. వాటిలో బెంగళూరు ఒకటి. అనతి కాలంలోనే బెంగళూరు మరో కేప్ టౌన్ కానుంది. వరుస కరువు, ముందుచూపులేని ప్రభుత్వం తీరుతో కేప్టౌన్ తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. గత జూన్-.జూలైలో అక్కడ 'డే జీరో' (ట్యాప్లలో నీరు రాకుండా పూర్తిగా నిలిచిపోవడం) పరిస్థితి. ప్రస్తుతం అక్కడ నీటిని కూడా రేషన్లో తీసుకోవాల్సిన దుస్థితి. మరికొన్ని రోజుల్లో బెంగళూరులోను ఇవే దృశ్యాలు కనిపించనున్నట్లు సీఎస్ఈ వెల్లడించింది. ఈ పత్రిక వెల్లడించిన అంశాల ప్రకారం ప్రణాళిక ప్రకారం లేని నగరీకరణ, నిర్మాణాల వల్ల 79శాతం నీటి వనరులు తగ్గిపోయాయి. 1973 నుంచి నిర్మాణాలకు సంబంధించిన స్థల విస్తీర్ణం 8 శాతం నుంచి 77 శాతానికి పెరిగింది. బెంగుళూరులో ఇంతకుముందు నీటి లభ్యత 10-12 మీటర్ల లోతు లోపు ఉండేది, కానీ ప్రస్తుతం ఇది 76-91 మీటర్లకు పడిపోయింది. 30 ఏళ్ల క్రితం 5 వేల వరకూ ఉన్న బావుల సంఖ్య ప్రస్తుతం 0.45 మిలియన్లకు పెరిగింది. బెంగుళూరు జనాభా ప్రతి సంవత్సరం 3.5శాతం పెరుగుతూ 2031 నాటికి 20.3మిలియన్లకు చేరుకుంటుంది. నూతన ఆవిష్కరణలు చేయడంతోపాటు ప్రస్తుతం ఉన్న నీటి వనరులను సవ్యంగా వినియోగించుకోకపోతే కేప్టౌన్లాంటి పరిస్థితులు ఇక్కడ కూడా ఎదురవ్వడానికి ఎంతో సమయం పట్టదు. ఈ పది నగరాలు ఇప్పటికైనా మేల్కోనకపోతే అతి త్వరలోనే తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటాయని ఈ పత్రిక వెల్లడించింది. బెంగుళూరుతోపాటు చైనాలోని బీజింగ్, మెక్సికోలోని మెక్సికో సిటీ, కెన్యాలోని నైరోబీ, పాకిస్తాన్లోని కరాచీ, ఆఫ్గానిస్తాన్లోని కాబూల్, టర్కీలోని ఇస్తాంబుల్లో కూడా ఇవే పరిస్ధితులు నెలకొని ఉన్నాయి. -
2050 నాటికి ప్రపంచం గొంతెండిపోతుంది
సాక్షి, హైదారాబాద్: దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్ మహానగరం.. తాగునీరు లేక ఎడారిగా మారబోతున్న నగరం... మనిషికి 50 లీటర్లు మాత్రమేనంటూ నీటికి రేషన్ విధించింది తొలి నగరం. ఆ దుస్థితే ప్రపంచ దేశాలు చూసే రోజు ఎంతో దూరంలో లేదు. నీటిసంక్షోభం 2050 నాటికి మరింత తీవ్రతరం కానుందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక హెచ్చరించింది. అప్పటికి 500 కోట్ల మంది నీరు లభ్యం కాని ప్రాంతాల్లోనే నివాసం ఉండాల్సిన పరిస్థితి వస్తుందని వెల్లడించింది. 2050నాటికి ప్రపంచ జనాభా వెయ్యి కోట్లకు చేరుకుంటుందని అంచనాలున్నాయి. అంటే సగం మంది జనాభా గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీరు దొరక్క అవస్థలు పడతారన్న మాట. అందులోనూ సురక్షిత నీరు దొరక్క భారత్ వంటి దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నాయి. మార్చి 22న వరల్డ్ వాటర్ డే సందర్భంగా యునెస్కో తన నివేదికలో నీటివనరులపై భవిష్యత్ చిత్రపటాన్ని ఆవిష్కరించింది. వాతావరణంలో వస్తున్న మార్పులు, నీటికి డిమాండ్ పెరగడం, నీటి కాలుష్యాన్ని అరికట్టడంలో ప్రభుత్వాల వైఫల్యం వంటి కారణాలతో నీటికి తీవ్ర కొరత ఏర్పడుతుందని తెలిపింది. ఆ నివేదిక ఏం చెప్పిందంటే ... చైనా, భారత్, అమెరికా, రష్యా, పాకిస్థాన్ దేశాలు అత్యధికంగా నీటిని వినియోగిస్తున్నాయి. ఆ దేశాలే నీటి సంక్షోభంలో చిక్కుకొని విలవిలలాడతాయి. భూమిపై 70 శాతం నీరు ఉంటే అందులో స్వచ్ఛమైన నీరు కేవలం 2 శాతం మాత్రమే మధ్య భారతం అత్యధికంగా నీటికొరతను ఎదుర్కొంటుంది. 2050నాటికి 40 శాతం నీటి వనరులు తగ్గిపోతాయి. పంజాబ్, హర్యానా, ఢిల్లీలలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోతాయి. దక్షిణ భారత్ నీటి కాలుష్యం సమస్యని అత్యధికంగా ఎదుర్కొంటుంది. దక్షిణభారతంలో ఉన్న నదులన్నీ 2050నాటికి విషతుల్యంగా మారతాయి. బహిరంగ మలవిసర్జన, వివిధ రకాల వ్యర్థాల కారణంగా భూగర్భజలాలు కాలుష్యంతో నిండిపోతాయి. ఈకోలి బ్యాక్టేరియా సమస్య తీవ్రతరమవుతుంది. భారత్లో 21 శాతం వ్యాధులు నీటి ద్వారా సంక్రమిస్తున్నవే. ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల మంది సురక్షిత మంచి నీరు అందడం లేదు. భారత్లో 16.3 కోట్ల మంది భారతీయులకు రక్షిత మంచినీరు లభ్యం కావడం లేదు. పరిశుభ్రమైన తాగు నీరు లేక భారత్లో ప్రతీరోజూ అయిదేళ్ల లోపు వయసున్న చిన్నారులు దాదాపు 500 మంది మరణిస్తున్నారు. ఏడాదికి ఏడాది నీటి వినియోగం 1 శాతం పెరుగుతూ వస్తోంది. వాతావరణంలో వస్తున్న విచిత్రమైన పరిస్థితుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో నీటికి కట కట ఉంటే, మరికొన్ని ప్రాంతాల్లో వరద ముంపునకు గురవుతాయి. 2050 నాటికి 116 కోట్ల మందికి వరదల వల్ల ముప్పుని ఎదుర్కొంటారు. ప్రపంచవ్యాప్తంగా నీటి సమస్యల్ని అధిగమించడానికి ప్రకృతి సంబంధమైన పరిష్కారాల కోసం కసరత్తు చేయాలని యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజౌలే సూచించారు. వర్షపు నీటిని రీసైక్లింగ్కు చైనా అనుసరిస్తున్న విధానాలు, భారత్లో ఎడారి ప్రాంతమైన రాజస్థాన్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేపట్టిన నీటిసంరక్షణ, అటవీప్రాంతాన్ని విస్తరించడం వంటి చర్యలు, ఉక్రెయిన్లో కృత్రిమ చిత్తడి నేలల్ని రూపొందించడం వంటివి అన్ని చోట్లా చేపట్టాలని ఆ నివేదిక సిఫారసు చేసింది. అలా చేయడం వల్ల నీటి సంక్షోభం బారి నుంచి తప్పించుకోవడమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఆహార ఉత్పత్తుల్ని 20 శాతం పెంచుకోవచ్చునని ఆ నివేదిక వివరించింది. -
‘కేప్టౌన్’కు భారత్, దక్షిణాఫ్రికా జట్ల సాయం
జొహన్నెస్బర్గ్: తీవ్ర వర్షాభావంతో నీటికి కటకటలాడుతున్న కేప్టౌన్కు భారత్, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్లు 8,500 అమెరికన్ డాలర్లు (రూ.5.52 లక్షలు) విరాళం ప్రకటించాయి. ఈ డబ్బును నగరంలో బాటిళ్లతో నీటి సరఫరా, బోర్లు వేసేందుకు వినియోగిస్తారు. గత శనివారం కేప్టౌన్లోని న్యూలాండ్స్లో మూడో టి20 అనంతరం ఈ మొత్తాన్ని రెండు జట్ల కెప్టెన్లు విరాట్ కోహ్లి, డు ప్లెసిస్లు ‘గివర్స్ ఫౌండేషన్’కు అందజేశారు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టుతో పాటు మూడో వన్డే, చివరి టి20లకు కేప్టౌన్ ఆతిథ్యమిచ్చింది. ఆటగాళ్లు సంతకాలు చేసిన జెర్సీల వేలం ద్వారా నగరంలో నీటి ఎద్దడి నివారణకు నిధులు సేకరించాలని తాను, కోహ్లి చర్చించుకున్నామని డు ప్లెసిస్ చెప్పాడు. -
గొంతెండిన కేప్టౌన్
గుక్కెడు మంచినీటి కోసం మున్ముందు ప్రపంచ ప్రజానీకం పడబోయే కష్టాలెలా ఉంటాయో దక్షిణాఫ్రికా నగరం కేప్టౌన్ శాంపిల్గా చవిచూపిస్తోంది. అభివృద్ధి పేరిట నేల విడిచి ఆకాశం వైపు దూసుకెళ్తున్న నగరాలకు భవిష్యత్తులో ఇలాగే చుక్కలు కనబడటం ఖాయమని ఆ నగర పౌరులు పడుతున్న ఆప సోపాలు చూస్తే అర్ధమవుతుంది. ఇప్పటికే నగరంలో రేషన్ మొదలైంది. మనిషికి 50 లీటర్ల చొప్పున ఇచ్చే నీటితో కాలక్షేపం చేస్తున్న నగర పౌరులు మరో మూడు నెలల్లో మరిన్ని ఇబ్బందులు పడకతప్పదని అధికారులు చెబుతున్నారు. మే 11ను వారు ‘జీరో డే’గా ప్రకటించారు. ఆ రోజు మొదలుకొని కేప్టౌన్లోని 40 లక్షలమంది పౌరుల ఇళ్లకూ, వ్యాపార సంస్థలకూ నల్లాల ద్వారా నీటి సరఫరా నిలిచిపోతుంది. పౌరులందరూ నగరంలో ఏర్పాటయ్యే 200 నీటి కేంద్రాల వద్ద బారులు తీరి నిలబడి నీళ్లు పట్టుకోవాల్సివస్తుంది. అప్పటినుంచీ మనిషికి కేవలం 25 లీటర్ల నీటిని మాత్రమే ఇస్తారు. తెల్లారింది మొదలుకొని రాత్రి నిద్రపోయేవరకూ ప్రతి ఒక్కరూ ఈ నీటితోనే తమ సమస్త అవసరాలనూ తీర్చుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా 2022 నాటికల్లా నీటి వనరులన్నీ యుద్ధాలకు వనరులుగా మారబోతున్నాయని అయిదారేళ్లక్రితం అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థ అంచనా వేసింది. ఎత్తయిన భవంతుల్ని, కళ్లు జిగేల్మనేలా విద్యుత్ దీప కాంతుల్ని, వాహనాలు శరవేగంతో దూసుకెళ్లడానికి వీలయ్యే రోడ్లనూ పరిచి, అక్కడ సమస్తమూ కేంద్రీకరించి ఆ నగరాలను అభివృద్ధి నమూనాలుగా, తమ ఘనతగా చాటే పాలకులు కళ్లు తెరవక తప్పదని కేప్టౌన్ అనుభవం చెబుతోంది. దక్షిణ అట్లాంటిక్ మహా సముద్ర తీరాన ఉండే కేప్టౌన్ సాధారణ నగరం కాదు. నల్లజాతి ప్రజల మహానాయకుడు నెల్సన్ మండేలాను దీర్ఘకాలం బందీగా ఉంచిన కారాగారం ఆ నగరంలోనిదే. దేశంలో ప్రధాన నగరం జోహ న్నెస్బర్గ్ అయినా ప్రపంచంలోని సంపన్నుల కళ్లన్నీ కేప్టౌన్పైనే ఉంటాయి. ఏటా ప్రపంచం నలుమూలలనుంచీ ఆ నగరానికి 16 లక్షలమంది సందర్శకులు వస్తుంటారు. వారు అక్కడ చేసే ఖర్చు 330 కోట్ల డాలర్ల(రూ.21,000 కోట్ల) పైమాటే. ఆకాశాన్నంటే అయిదు నక్షత్రాల హోటళ్లు, బీచ్లు, కేబుల్ కార్లు, ప్రపంచం మూల మూలలనుంచీ తరలివచ్చిన రకరకాల వినియోగవస్తువులతో కొలువు దీరే మహా దుకాణ సముదాయాలు, సైకిల్ రేసులు, క్రికెట్ మొదలుకొని రగ్బీ వరకూ తరచుగా జరిగే జాతీయ, అంతర్జాతీయ క్రీడలు పర్యాటకులకు మంచి కాలక్షేపాన్నిస్తాయి. నగరానికి దగ్గర్లో సముద్ర గర్భాన ఉండే రాబెన్ ద్వీపానికి రాత్రి, పగలు తేడాలేకుండా పడవల్లో రాకపోకలు సాగించే జనాన్ని చూసి తీరాల్సిందే. కేప్టౌన్ ప్రధాన ఓడరేవున్న నగరం కూడా. ఇంత హడావుడి నగరం కనుక అక్కడికి పొట్టపోసుకొనేందుకొచ్చే వలస జనం కూడా ఎక్కువే. డబ్బే సర్వస్వమైన ఆ నగరం ఇప్పుడు నీటి చుక్కకు కటకటలాడే దుస్థితి తలె త్తడాన్ని సహజంగానే జీర్ణించుకోలేకపోతోంది. ఇదెక్కడో ఏర్పడ్డ సంక్షోభమని కొట్టి పారేయడానికి లేదు. మన నగరాల తలుపు తట్టే రోజు ఎంతో దూరంలో లేదు. రాబోయే రోజుల్లో నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనబోతున్న నగరాల జాబితాను ఈమధ్యే బీబీసీ ప్రకటించింది. అందులో బ్రెజిల్ ఆర్థిక రాజధాని సావోపావ్లో మొదటి స్థానంలో ఉంటే ఆ తర్వాత నగరం బెంగళూరే. బీజింగ్, కైరో, మాస్కో తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఈ నగరాలన్నీ చెప్పుకోవడానికి ‘శరవేగంగా’ అభివృద్ధి చెందుతున్న నగరాలే. వాటి ద్వారా ప్రభుత్వాలకు లభిస్తున్న ఆదాయం సైతం భారీగానే ఉంటున్నది. కానీ అక్కడికి చేరుతున్న జనాభాకు అవసరమైన జల వనరులు ఆ నగరాలకు అందుబాటులో లేవు. వెనకా ముందూ చూసుకోకుండా అభివృద్ధినంతటినీ ఒకేచోట కేంద్రీకరించడం వల్ల తలెత్తిన సమస్య ఇది. బెంగళూరుకు నీటి సమస్య కొత్తగాదు. అక్కడ సమస్య ఉన్నట్టు ప్రభుత్వాలు సైతం గుర్తించి దశాబ్దాల వుతోంది. అయినా ఎవరికీ చీమ కుట్టినట్టయినా లేకపోయింది. పాలకులు హ్రస్వ దృష్టితో వ్యవహరించారు. అడవుల్ని విచక్షణారహితంగా నాశనం చేస్తుంటే, కొండల్ని పిండి చేస్తుంటే వానలు పడటం తగ్గుతుందని, కరువు రాజ్యమేలుతుందని పర్యావరణవాదులు హెచ్చరిస్తున్నా పెడచెవిన పెట్టారు. పైపెచ్చు అభివృద్ధి మాటున తామే సహజ సంపదను ధ్వంసం చేసే పనికి పూనుకున్నారు. కరువు కాటకాల వల్ల నదులు చిక్కిపోతున్నాయి. పారినంత మేరా అనేక వ్యర్థాల బారిన పడి అవి కాలుష్యమయమవుతున్నాయి. ఇక నగర జనాభాకు నీటి లభ్యత అడుగంటడంలో ఆశ్చర్యమేముంది? భూ ఉపరితలంపై నీటి వాటా 70 శాతమైతే 30 శాతం మాత్రమే భూభాగం. ఇంత పుష్కలంగా నీరున్నా అందులో తాగడానికి పనికొచ్చేది 3 శాతం మాత్రమే. ప్రపంచ జనాభా 760 కోట్లయితే అందులో కోటిమందికి అసలు మంచినీటి సదుపాయమే లేదు. మరో 270 కోట్లమంది ఏటా కనీసం నెలరోజులపాటు చాలి నంత నీరు లభ్యంకాక సతమతమవుతున్నారు. ప్రపంచంలోని 500 మహా నగరాలు మున్ముందు నీటి ఇబ్బందుల్లో పడతాయని నాలుగేళ్ల క్రితం వెలువడిన సర్వే అంచనా వేసింది. ప్రతి నాలుగు నగరాల్లోనూ ఒకటి మంచినీటి వెతల్ని ఎదుర్కొనవలసి వస్తుందని ఆ సర్వే అంటున్నది. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని తమ అభివృద్ధి నమూనాలను సమీక్షించుకోనట్టయితే ప్రమాదకర పర్య వసానాలు ఏర్పడటం ఖాయం. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని అన్ని రాష్ట్రాలూ ఆదర్శంగా తీసుకోవాలి. 2020 నాటికి ఆ రాష్ట్రంలోని 46,530 చెరు వుల్ని, సరస్సుల్ని పునరుద్ధరించాలన్న సంకల్పంతో 2015లో ప్రారంభించిన ‘మిషన్ కాకతీయ’ అనుకున్నట్టు విజయం సాధిస్తే ఇటు మంచినీటి కొరతనూ తీరుస్తుంది. అటు సాగునీటి లభ్యతనూ పెంచుతుంది. ఇది అనుసరణీయమైన మార్గం. ముప్పు ముంచుకొచ్చే వరకూ పట్టనట్టు ఉంటే ఇప్పుడు కేప్టౌన్ వాసులు ఎదుర్కొంటున్న దుస్థితే అందరికీ దాపురిస్తుంది. బహుపరాక్!! -
కోహ్లి విజృంభణ.. దక్షిణాఫ్రికాకు భారీ లక్ష్యం
కేప్టౌన్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేల్లో కెప్టెన్ విరాట్ కోహ్లి (160), ఓపెనర్ ధావన్(73)లు విజృంభించడంతో భారత్, ఆతిథ్య జట్టుకు 304 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్కు రోహిత్ డకౌటవ్వడంతో ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లి, ధావన్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ తరుణంలో వేగంగా ఆడిన ధావన్ 42 బంతుల్లో 9 ఫోర్లతో కెరీర్లో 25వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ అనంతరం వేగం పెంచిన ధావన్ సఫారీ కెప్టెన్ మార్క్రమ్ అద్భుత క్యాచ్కు వెనుదిరిగాడు. దీంతో రెండో వికెట్కు నమోదైన 140 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రహానే(11) విఫలమయ్యాడు. తొలి వన్డేలో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న రహానే ఈ మ్యాచ్లో తీవ్రంగా నిరాశపరిచాడు. మిడిలార్డర్ విఫలం తొలి రెండు వన్డేల్లో అంతగా బ్యాటింగ్ అవకాశం రాని మిడిలార్డర్ బ్యాట్స్మన్ ఈ మ్యాచ్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. పాండ్యా(14), ధోని(10), జాదవ్(1)లు దారుణంగా విఫలమయ్యారు. భువీ అండతో ఒకవైపు వికెట్లు పడుతుండటంతో భారత్ సాధారణ లక్ష్యానికే పరిమితం అనుకున్న సందర్భంలో కోహ్లి, భువనేశ్వర్ అండతో భారీ స్కోర్ దిశగా ప్రయత్నించాడు. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలిస్తూ స్కోరు బోర్డు వేగాన్ని పెంచాడు. భువనేశ్వర్(16) సైతం కోహ్లికి మద్దతివ్వడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. కోహ్లి 160(159 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సులు) నాటౌట్గా నిలిచి వన్డేల్లో మూడోసారి 150 పైగా పరుగులు చేశాడు. ఇక ప్రొటీస్ బౌలర్లలో డుమినీకి రెండు వికెట్లు దక్కగా.. మోరిస్, రబడ, తాహీర్, ఆండీల్ పెహ్లుక్వాయో, తాహిర్లకు తలో వికెట్ దక్కింది. -
కోహ్లి సెంచరీ.. మరో అరుదైన రికార్డు
కేప్టౌన్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో శతకం సాధించాడు. దీంతో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే తొలి వన్డేలో సెంచరీ సాధించిన కోహ్లి, రెండో వన్డేలో 46 నాటౌట్గా నిలిచి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అదే ఫామ్ను కొనసాగిస్తూ మూడో వన్డేలో సైతం 119 బంతుల్లో 7 ఫోర్లతో కెరీర్లో 34వ సెంచరీ నమోదు చేశాడు. ఈ సెంచరీతో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్ల జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు. 54 సెంచరీలతో ఇప్పటి వరకు ఈ స్థానంలో హాషిమ్ ఆమ్లా( దక్షిణాఫ్రికా), మహేళా జయవర్ధనే(శ్రీలంక)లతో నిలిచిన కోహ్లి తాజా సెంచరీతో వారిని వెనక్కి నెట్టాడు. వన్డేల్లో 34, టెస్టుల్లో 21 సెంచరీలతో కలపి కోహ్లి మొత్తం 55 సెంచరీలు చేశాడు. ఇక తొలి స్థానంలో సచిన్(100) ఉండగా.. పాంటింగ్(ఆస్ట్రేలియా) 71, సంగక్కర(శ్రీలంక) 63, జాక్వస్ కల్లీస్(దక్షిణాఫ్రికా) 62లు కోహ్లికన్నా ముందు వరుసలో ఉన్నారు. కోహ్లి భవిష్యత్తులో ఇదే ఫామ్ను కొనసాగిస్తే సచిన్ను అధిగమించడం అతిశయోక్తికాదు. -
రోహిత్ డకౌట్.. భారత్ 0/1
కేప్టౌన్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ అయి మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో భారత్ పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్ వేసిన రబడా బౌలింగ్లో 6 బంతులు ఎదుర్కొన్న రోహిత్ చివరి బంతికి కీపర్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. గత రెండు వన్డేల్లో తీవ్రంగా నిరాశపర్చిన రోహిత్ ఈ మ్యాచ్లోనైనా చేలరేగుతాడని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. అనంతరం క్రీజులోకి కోహ్లి వచ్చాడు. -
భారత్దే బ్యాటింగ్
కేప్టౌన్: భారత్తో న్యూలాండ్స్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోకపోగా ఆతిథ్య జట్టులో స్వల్ప మార్పులు జరిగాయి. గాయంతో దూరమైన సఫారీ కీపర్ డికాక్ స్థానంలో హెన్రీచ్ క్లాసెన్, బౌలర్ మోర్కెల్ స్థానంలో లుంగి ఎంగిడిలను తీసుకున్నారు. ఈ ఇద్దరు ఈ మ్యాచ్తో అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచి మంచి ఊపు మీదున్న కోహ్లి సేన మరో విజయం సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాలని ఉవ్విల్లూరుతోంది. ఇక ఆతిథ్య జట్టుకు గాయాల బెడద వెంటాడుతుండగా ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్పై అవకాశాలు వదులుకోవద్దని సఫారీ జట్టు భావిస్తోంది. జట్లు భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రోహిత్, రహానే, జాదవ్, ధోనీ, పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా. దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్), ఆమ్లా, డుమిని, మిల్లర్, జొండొ, హెన్రీచ్ క్లాసెన్, మోరిస్, రబడ, తాహీర్, ఆండీల్ పెహ్లుక్వాయో, లుంగి ఎంగిడి -
స్టెయిన్ ‘గన్ డౌన్’
భారత్తో జరుగుతున్న కేప్టౌన్ టెస్టులో 17.3 ఓవర్లు వేసిన తర్వాత... ఈ మ్యాచ్కు ముందు తాను ఆడిన ఆఖరి టెస్టులో ఆస్ట్రేలియాపై పెర్త్లోనూ తొలి ఇన్నింగ్స్లో 12.4 ఓవర్ల తర్వాత... అంతకు కొన్నాళ్ల క్రితం డర్బన్లో ఇంగ్లండ్పై రెండో ఇన్నింగ్స్లో 3.5 ఓవర్ల తర్వాత... దానికంటే ముందు మొహాలీలో భారత్తో జరిగిన తొలి టెస్టులో 11 ఓవర్లకే! దిగ్గజ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ మ్యాచ్ మధ్యలోనే తప్పుకోవడం ఇది కొత్త కాదు. తాను బరిలోకి దిగిన గత ఆరు టెస్టుల్లో గాయం కారణంగా నాలుగు మ్యాచ్ల్లో ఆట మధ్యలోనే మైదానం నుంచి నిష్క్రమించాడు. ఇప్పుడు కూడా అతను తొలి టెస్టుతో పాటు సిరీస్కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. తాజా పరిణామాలు చూస్తుంటే అతను మళ్లీ కోలుకొని జట్టులోకి రావడం, గత స్థాయిలో ప్రదర్శన ఇవ్వడం చాలా కష్టం కావచ్చు. పదమూడేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్పై తనదైన ముద్ర వేసి ఎందరో బ్యాట్స్మెన్ను భయపెట్టిన స్టెయిన్ కెరీర్ ప్రమాదంలో పడింది. తొలి టెస్టుకు ముందు దక్షిణాఫ్రికా కోచ్ ఒటిస్ గిబ్సన్ మీడియాతో మాట్లాడుతూ స్టెయిన్కు తుది జట్టులో దాదాపుగా అవకాశం లేదని తేల్చేశాడు. జట్టు కూర్పు ఒక సమస్య కాగా, గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అతను, ఏదైనా జరిగి మ్యాచ్ మధ్యలో తప్పుకుంటే సమస్యగా మారుతుందని స్పష్టంగా చెప్పాడు. నిజంగా ఆయన భయపడినట్లే జరిగింది. న్యూలాండ్స్ పిచ్ను దృష్టిలో ఉంచుకొని సఫారీ జట్టు నలుగురు పేసర్లతో బరిలోకి దిగడంతో స్టెయిన్కు చాన్స్ లభించినా... అతను మళ్లీ గాయంతో వెనుదిరగడం ఆ టీమ్ను ముగ్గురు పేసర్లకే పరిమితం చేసింది. ఇది చివరకు జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపించవచ్చు కూడా. భుజం గాయం నుంచి కోలుకొని ఏడాది తర్వాత పునరాగమనం చేశాక ఇప్పుడు మరో కొత్త తరహా గాయం (మడమ)తో అతను మధ్యలోనే వెళ్లిపోవడం ఏమాత్రం మేలు చేసేది కాదు. భారత్తో సిరీస్ తర్వాత మార్చిలో కీలకమైన ఆస్ట్రేలియా సిరీస్ కూడా ఉంది. అతను అప్పటిలోగా కోలుకోగలడా? ప్రదర్శన బాగున్నా... భుజం గాయం నుంచి కోలుకున్న తర్వాత స్టెయిన్ ముందుగా దేశవాళీ టి20ల్లో ఐదు మ్యాచ్లు ఆడి తన ఫిట్నెస్ పరీక్షించుకున్నాడు. ఆ తర్వాత జింబాబ్వేతో ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా 12 ఓవర్లు వేశాడు. అయితే అనారోగ్యంతో జింబాబ్వేతో టెస్టు ఆడలేకపోయాడు. భారత్తో మ్యాచ్లో అతని బౌలింగ్లో ఎప్పటిలాగే పదును కనిపించడం విశేషం. షార్ట్ బంతులు, అవుట్ స్వింగర్లు వేయడంలో ఎక్కడా తీవ్రత తగ్గకపోగా, బౌలింగ్ రనప్, యాక్షన్లో ఎక్కడా పాత గాయం సమస్య కనిపించలేదు. ధావన్ను వెనక్కి పంపిన బంతిగానీ, ఆ వెంటనే కోహ్లిని దాదాపుగా అవుట్ చేసినట్లుగా అనిపించిన బంతిగానీ పాత స్టెయిన్ను చూపించాయి. చాలా సార్లు స్టెయిన్ బంతులు గంటకు 140 కిలోమీటర్ల వేగాన్ని కూడా దాటాయి. ఆ తర్వాత సాహా వికెట్, పాండ్యా క్యాచ్ డ్రాప్ అయిన బంతి కూడా అతని గొప్పతనాన్ని చాటాయి. అయితే దురదృష్టవశాత్తూ గాయం అతని జోరుకు బ్రేక్ వేసింది. నిజానికి దక్షిణాఫ్రికా టీమ్ మేనేజ్మెంట్ లెక్కల ప్రకారం పేస్కు బాగా అనుకూలించే తర్వాతి రెండు టెస్టుల వేదికలు సెంచూరియన్, జొహన్నెస్బర్గ్లలో అతను తప్పనిసరిగా జట్టులో ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆ అవకాశం కనిపించడంలేదు. గత రెండేళ్ల కాలంలో అతను తుంటి, రెండు సార్లు భుజం, మడమ గాయాలకు గురయ్యాడు. భుజానికి సర్జరీ కూడా జరగడంతో అతను ఏడాది పాటు ఆటకు దూరం కావాల్సి వచ్చింది. అద్భుతమైన రికార్డు... సమకాలీన క్రికెట్లోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో స్టెయిన్ ఒకడు అనడంలో సందేహం లేదు. గత కొన్నేళ్ళలో జీవం లేని పిచ్లు, చిన్న మైదానాలు, పెద్ద బ్యాట్లు రాజ్యమేలుతున్న సమయంలో కూడా అతను తన ముద్ర చూపించాడు. గాయాలు ఇబ్బంది పెడుతున్నా అతని బౌలింగ్ ఇంకా భీకరమే. గాయంతో పెర్త్ టెస్టు నుంచి తప్పుకోవడానికి ముందు తొలి ఇన్నింగ్స్లో అతని అద్భుత బౌలింగ్ పునాదితోనే దక్షిణాఫ్రికా మ్యాచ్ గెలవగలిగింది. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో స్టెయిన్ టాప్–10లో ఉన్నాడు. వారిలో కేవలం ఇద్దరు పేసర్లకు (మెక్గ్రాత్, హ్యాడ్లీ)లకు మాత్రమే స్టెయిన్ (22.32) కంటే మెరుగైన సగటు ఉంది. ఎంతో మంది పేసర్లు తమ సొంతగడ్డపై, అనుకూల పిచ్లపై చెలరేగినా... ఉపఖండానికి వచ్చేసరికి మాత్రం తేలిపోయారు. అయితే ఈతరంలో తనతో పోటీ పడిన బ్రెట్ లీ, మిచెల్ జాన్సన్, అండర్సన్, బ్రాడ్ తదితరులతో పోలిస్తే భారత్లాంటి చోట అతని ప్రదర్శన స్టెయిన్ను అందరికంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. భారత గడ్డపై 6 టెస్టుల్లో కేవలం 21.38 సగటుతో 26 వికెట్లు పడగొట్టడం, పాకిస్తాన్లో 24.66, శ్రీలంకలో 24.71 సగటు అతనేమిటో చెబుతాయి. దక్షిణాఫ్రికా తరఫున 44 టెస్టు విజయాల్లో భాగమైన స్టెయిన్... వాటిలో నమ్మశక్యం కాని రీతిలో 16.03 సగటుతో 291 వికెట్లు పడగొట్టడం అతని విలువేమిటో చూపిస్తోంది. ఇలాంటి గొప్ప ఆటగాడి కెరీర్ అర్ధాంతరంగా ముగియా లని ఏ జట్టూ కోరుకోదు. డాక్టర్ల సహకారంతో వీలైనంత త్వరగా అతను కోలుకునేలా ప్రయత్నిస్తామని జట్టు మేనేజర్ మూసాజీ చెప్పడం తమ స్టార్ ఆటగాడిపై వారికి ఉన్న నమ్మకమే కారణం. వారు ఆశించినట్లుగా స్టెయిన్ మళ్లీ తిరిగొచ్చి తన సత్తా చూపించాలని క్రికెట్ ప్రపంచం కూడా కోరుకుంటోంది. 419: 86 టెస్టుల్లో స్టెయిన్ పడగొట్టిన వికెట్ల సంఖ్య. ఓవరాల్గా పదో స్థానంలో ఉన్న అతను... మరో మూడు వికెట్లు తీస్తే అత్యధిక వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా బౌలర్గా షాన్ పొలాక్ (421)ను అధిగమిస్తాడు. 60 ఏళ్ల వయసులో కూడా 90 కిలోమీటర్ల మారథాన్ పరుగెత్తే కొందరు మిత్రులే నాకు ఆదర్శం. ఫిట్నెస్ గురించి నాకు బెంగ లేదు. ప్రస్తుతం మా జట్టులోని చాలా మంది యువ ఆటగాళ్లకంటే నా ఫిట్నెస్ చాలా బాగుంది. కనీసం ఈ ఏడాది మొత్తం ఆడిన తర్వాతే కెరీర్పై పునరాలోచిస్తా. ప్రస్తుతం 35 ఏళ్ల వయసులో నాకు క్రికెట్ గురించే తప్ప రిటైర్మెంట్, ఇతర వ్యాపకాల గురించి ఆలోచన లేదు. సాధ్యమైనంత ఎక్కువ కాలం క్రికెట్ ఆడాలని భావిస్తున్న నాకు వయసు సమస్యే కాదు. –కేప్టౌన్ టెస్టుకు ముందు స్టెయిన్ వ్యాఖ్య కేప్టౌన్కు వానొచ్చింది ► మూడో రోజు ఆట పూర్తిగా రద్దు ► భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు కేప్టౌన్: అనూహ్య మలుపులు తిరుగుతూ ఆసక్తికరంగా మారిన భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు మ్యాచ్కు ఆకస్మిక విరామం... రెండు రోజుల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన టెస్టుకు మూడో రోజు వాన అడ్డంకిగా మారింది. భారీ వర్షం కారణంగా ఆదివారం ఆట పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. రోజంతా ఒక్క బంతి వేయడం కూడా సాధ్యం కాలేదు. శనివారం రాత్రి నుంచే నగరంలో కురుస్తున్న వర్షం ఆదివారం ఉదయం జోరందుకుంది. మధ్యలో కొన్ని సార్లు తెరిపినిచ్చినా, గ్రౌండ్ను సిద్ధం చేసేందుకు అది సరిపోలేదు. అంపైర్లు కనీసం న్యూలాండ్స్ మైదానాన్ని పరిశీలించాల్సిన అవసరం కూడా లేకుండా ఆటను రద్దు చేశారు. మ్యాచ్ నిర్దేశిత ఆరంభ సమయంనుంచి సరిగ్గా ఐదు గంటల తర్వాత అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లకు 65 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా ఓవరాల్గా 142 పరుగులు ముందంజలో ఉంది. మిగిలిన రెండు రోజుల ఆట ఎలాంటి మలుపులు తీసుకుంటుందో, ఎలాంటి తుది ఫలితం వస్తుందో చూడాలి. సోమ, మంగళవారాల్లో రోజుకు 98 ఓవర్ల చొప్పున ఆట సాగనుంది. మరోవైపు ఈ భారీ వర్షం స్థానికంగా క్రికెట్ వీరాభిమానులను కూడా ఏమాత్రం నిరాశపర్చలేదు. ఈ వాన వారిలో అమితానందాన్ని నింపింది. వర్షాలే లేకపోవడంతో గత వందేళ్లలో ఎన్నడూ లేనంత తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్న కేప్టౌన్కు ఇదో వరంగా వారు భావిస్తున్నారు. వాతావరణ శాఖ సూచన ప్రకారం సోమవారం మాత్రం వర్షసూచన లేదు. –సాక్షి క్రీడా విభాగం -
వాటర్ బాటిల్ బదులు.. 10 బీర్లు ఇస్తాం!
కేప్టౌన్ : దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ ఆడుతున్న భారత జట్టును నీటి కష్టాలు ఇబ్బందులు పెడుతున్నాయి. ప్రస్తుతం కేప్టౌన్లో అత్యంత దారుణ దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలో నీటికొరత తీవ్రంగా ఉంది. దీంతో భారత క్రికెటర్లు వినియోగించే నీటిపై అధికారులు ఆంక్షలు విధించారు. షవర్ కింద రెండు నిమిషాలు మాత్రమే స్నానం చేయాలని క్రికెటర్లకు అధికారులు స్పష్టం చేశారు. అలాగే టబ్ బాత్ను పూర్తిగా నిషేధించారు. ప్రస్తుతం కేప్టౌన్లో ఉష్ణోగత చాలా ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలనుంచి ఉపశమనం పొందేందుకు తాగే నీటిపైనా అధికారులు ఆంక్షాలు విధించారు. ‘తాగేందుకు కావలసిన స్థాయిలో నీరు ఇవ్వలేం.. కానీ ఎంత కావాలన్నా బీరు అందిస్తాం. ఒక వాటర్ బాటిల్ బదులు.. 10 బీర్లు ఇస్తామ’ని అధికారులు చెప్పడంతో.. షాక్ తినడం క్రికెటర్ల వంతైంది. ఇదిలావుంటే.. పిచ్క్యూరింగ్, గ్రౌండ్ సిబ్బంది అవసరాల కోసం రోజుకు 87 లీటర్ల నీటిని మాత్రమే అధికారులు సరఫరా చేస్తున్నారు. పిచ్పై పచ్చికను కాపాడేందుకు కూడా ఈ నీరు సరిపోదని క్యూరేటర్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అవుట్ ఫీల్డ్ పూర్తిగా పొడిబారి పిచ్ స్పిన్కు అనుకూలించే అవకాశం ఉందని క్యూరేటర్ అన్నారు. -
కేప్టౌన్లో బుమ్రాను ఆడించాలి: నెహ్రా
న్యూఢిల్లీ: భారత్, దక్షిణాఫ్రికా మధ్య కేప్టౌన్లో జరిగే తొలి టెస్టులో యువ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఆడించాలని మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అన్నారు. ‘టీమ్ మేనేజ్మెంట్ మదిలో ఏముందో నాకైతే తెలీదు... కేప్టౌన్లోని న్యూలాండ్స్ వికెట్ బుమ్రాకు సరిగ్గా నప్పుతుంది. రంజీల్లో గుజరాత్ తరఫున అద్భుతమైన యార్కర్లతో చెలరేగాడు. అతని బౌలింగ్ శైలి ప్రత్యర్థి బ్యాట్స్మెన్కు ఇబ్బందికరంగా ఉంటుంది. పైగా సుదీర్ఘమైన స్పెల్స్ వేయగలడు. ఇవన్నీ సఫారీ గడ్డపై అతనికి కలిసొస్తాయి’ అని నెహ్రా విశ్లేషించారు. ఈ జనవరిలో కేప్టౌన్ వాతావరణం ఎండవేడిమితో ఉంటుందని, సీమర్లకు ఇది కాస్త ఇబ్బందిగా ఉంటుందని చెప్పారు. ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగితే షమీ, ఇషాంత్ల తర్వాతే మూడో సీమర్ ఎవరనే చర్చ ఉంటుందని చెప్పారు. ఇషాంత్ తన బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను అదేపనిగా అసహనానికి గురి చేస్తాడని, దీనివల్ల మరో ఎండ్లో బౌలర్కు దొరికిపోతారన్నారు. -
ఫ్రిడ్జ్లో 12 అడుగుల కొండచిలువ
కేప్టౌన్: నిత్యవసర వస్తువులను కొనుగోలు చేసుకునేందుకు ఓ మహిళ తన నివాసానికి దగ్గరలోని సూపర్ మార్కెట్లోకి వెళ్లింది. పెరుగు ప్యాకెట్ తీసుకుందామని ఫ్రిడ్జ్లో చేయిపెట్టిన ఆమె చేతికి 12 అడుగుల కొండచిలువ తగిలింది. అది గమనించిన ఆమె ఒక్కసారిగా భయంతో కేకలు వేసింది. అప్రమత్తమైన మార్కెట్ సిబ్బంది ఫ్రిడ్జ్ వద్దకు చేరుకుని అందులో ఉన్న కొండచిలువను చూసి హతశులయ్యారు. వెంటనే పాములు పట్టుకునే వారికి సమాచారం అందించారు. మహిళ కొండచిలువను పట్టుకున్న సమయంలో అది గాఢనిద్రలో ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే మార్కెట్కు చేరుకున్న పాములు పట్టే బృందం కొండచిలువను ఫ్రిడ్జ్ లోపలి నుంచి బయటకు లాగింది. ఆ తర్వాత దాన్ని జాతీయ పార్కులో వదిలేశారు. తమ సూపర్మార్కెట్ వెనుక చాలా పొదలు ఉన్నాయని, పై కప్పు నుంచో లేదా మార్కెట్ కింది భాగంలో ఉన్న మురుగు కాలువ నుంచో కొండ చిలువ వచ్చి ఫ్రిడ్జ్లో చేరుంటుందని యాజమాన్యం పేర్కొంది. -
శ్రీలంకపై దక్షిణాఫ్రికా భారీ విజయం
కేప్ టౌన్: శ్రీలంకతో జరిగిన రెండోటెస్టు మ్యాచ్లో దక్షిణాప్రికా 282 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 507 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక 224 పరుగులకే ఆలౌట్ అయింది. దక్షిణాప్రికా తొలి ఇన్నింగ్స్లో 392 పరుగులు చేయగా.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 110 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్లో 224 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ని డిక్లేర్ చేసి శ్రీలంక ముందు 507 పరుగుల టార్గెట్ను ఉంచింది. భారీ లక్ష్యంలో బరిలోకి దిగిన శ్రీలంక 224 పరుగులకే ఆలౌట్ అయింది. దక్షిణాప్రికా బౌలర్ రబడ మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. మూడు టెస్టుల సిరీస్లో మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ను దక్షిణాఫ్రికా సొంతం చేసుకుంది. మూడో టెస్టు జనవరి 12న జోహన్నెస్బర్గ్లో ప్రారంభం కానుంది.