-
Supreme Court: బాబు బెయిల్ రద్దు పిటిషన్.. విచారణ వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ బెయిల్ను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ నేడు విచారణకు వచ్చింది. జస్టిస్ బేల ఎం. త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. కౌంటర్ దాఖలు చేసేందుకు బాబు తరపు న్యాయవాదులు సమయం కోరడంతో ఈ కేసును ధర్మాసనం ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. కంటి చికిత్స, ఇతరత్ర ఆరోగ్య సమస్యల దృష్ట్యా స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు అక్టోబర్ 31వ తేదీన తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆపై ఆ బెయిల్ను రెగ్యులర్ బెయిల్గా మారుస్తూ నవంబర్ 20వ ఆదేశాలు ఇచ్చింది. అయితే.. బెయిల్పై ఏపీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బెయిల్ ఇచ్చే విషయంలో హైకోర్టు తన పరిధిని మీరిందని పేర్కొంటూ ఆ మరుసటిరోజే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఏపీ ప్రభుత్వం స్కిల్ కేసులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లో నారా చంద్రబాబు నాయుడిని ప్రతివాదిగా చేర్చింది. ఈ ఎస్ఎల్పీ తేలేంత వరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. హైకోర్టు స్కిల్ కుంభకోణంలో సీఐడీ చేసిన ఆరోపణల పూర్వాపరాల్లోకి వెళ్లి చంద్రబాబుకు క్లీన్చీట్ ఇచ్చిందని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఎస్ఎల్పీలో ఏముందంటే.. బెయిల్ మంజూరు సందర్భంగా హైకోర్టు తేల్చిన పలు అంశాలు వాస్తవ విరుద్దం. ట్రయల్ సందర్భంగా కింది కోర్టును ప్రభావితం చేసేలా హైకోర్టు తీర్పు ఉంది. బెయిల్ పిటిషన్పై హైకోర్టు ఏకంగా 39 పేజీల తీర్పు వెలువరించింది. బెయిల్ మంజూరు సందర్భంగా హైకోర్టు మినీ ట్రయల్ నిర్వహించింది. రికార్డుల్లో ఉన్న అంశాలకు విరుద్దంగా హైకోర్టు తన నిర్ణయాన్ని వెలువరించింది. ఈ కేసులో హైకోర్టు తన పరిధిని అతిక్రమించింది బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కేసు లోతుల్లోకి వెళ్లకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్దంగా హైకోర్టు వ్యవహరించింది హైకోర్టు చంద్రబాబు బెయిల్ పిటిషన్ను డిశ్చార్జ్ పిటిషన్ను విచారించినట్లు విచారించింది స్కిల్ కుంభకోణం కేసు లోతుల్లోకి వెళ్లి మరీ చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది ఇదీ చదవండి: చంద్రబాబు రిమాండ్ సబబే.. తేల్చేసిన సుప్రీం కోర్టు స్పష్టంగా నగదు జాడలు ‘ప్రాజెక్టు విలువ రూ.36 కోట్లు అని చంద్రబాబు తదితరులు చెబుతున్నారు. అలా అయితే గత ప్రభుత్వం రూ.370 కోట్లు ఎందుకు విడుదల చేసినట్లు? మిగిలిన రూ.280 కోట్లు దారి మళ్లినట్లే. ఎంవోయూ, జీవో ప్రకారం అందచేయాల్సిన సాంకేతికతను సీమెన్స్, డిజైన్ టెక్లు అందించలేదన్నది వాస్తవం. అయితే సీఐడీ ఈ అంశాన్ని లేవనెత్తలేదని హైకోర్టు తన తీర్పులో చెప్పింది. వాస్తవానికి రిమాండ్లోనూ, హైకోర్టు వాదనల్లోనూ ఈ అంశాన్ని లేవనెత్తాం. ఫోరెన్సిక్ ఆడిట్ను ప్రతికూల కోణంలో చూడటం ద్వారా హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించినట్లయింది. ►స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొత్తం విజయమైందని, దీని ద్వారా 2.13 లక్షల మంది విద్యార్థులు శిక్షణ పొందినట్లు తేల్చింది. ఇలా చెప్పడం ద్వారా హైకోర్టు తప్పు చేసింది. హైకోర్టు చెప్పింది ఎంత మాత్రం వాస్తవం కాదు. అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చే అధికారం చంద్రబాబుకు ఉందని హైకోర్టు తేల్చింది. ఒకవేళ అలాంటిది ఉందని అనుకున్నా, చంద్రబాబు తన, షెల్ కంపెనీల స్వీయ లబ్ధి కోసం దురుద్దేశపూర్వకంగా ఆ అధికారాన్ని ఉపయోగించారు. ఈ విషయాన్ని హైకోర్టు తన తీర్పులో పూర్తిగా విస్మరించింది. ►ఈ కుంభకోణానికి సంబంధించి సీమెన్స్, డిజైన్టెక్ ఉద్యోగులు ఇచ్చిన వాంగ్మూలాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ ప్రాజెక్టులో రాజకీయ జోక్యం ఉందని, ప్రాజెక్టు అమలుకు అడ్డువచ్చిన వారిని 24 గంటల్లో బదిలీ చేశారన్న వాంగ్మూలాలను పట్టించుకోలేద’ని సుప్రీంకోర్టు నిర్ధేశించిన పరిధుల అతిక్రమణ ‘ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే హైకోర్టు తీర్పు చెల్లుబాటు కాదు. దానిని రద్దు చేయాలి. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇప్పటికే స్పష్టంగా తేల్చిన న్యాయపరమైన కొలమాలన్నింటినీ హైకోర్టు తన తీర్పు ద్వారా అతిక్రమించింది. బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా సాక్ష్యాలను పూర్తి స్థాయిలో పరిశీలించడం, కేసు లోతుల్లోకి వెళ్లడాన్ని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో తీవ్రంగా తప్పుపట్టింది. మినీ ట్రయల్ కూడా నిర్వహించకూడదని చెప్పింది, అయితే హైకోర్టు ఏకంగా ట్రయల్ నిర్వహించింది. ►బెయిల్ మంజూరు సందర్భంగా సీఐడీ ఆరోపణలను, వారి తీవ్రతను, డాక్యుమెంట్ల విశ్వసనీయతను, సాక్ష్యాల విలువను హైకోర్టు తన తీర్పులో తేల్చేసింది. హైకోర్టు బెయిల్ మంజూరు సమయంలో అనుసరించాల్సిన ప్రాథమిక కొలమానాలన్నింటికి విరుద్దంగా వ్యవహరించింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ నమోదు చేసిన కేసు ప్రభావితం అయ్యేలా హైకోర్టు వ్యవహరించింది. దుర్వినియోగం చేసిన నిధులు తెలుగుదేశం పార్టీ ఖాతాలకు మళ్లించారని తేల్చేందుకు నిర్ధిష్ట ఆధారాలు లేవని హైకోర్టు తేల్చింది. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ అంశాల జోలికి వెళ్లరాదు. ►హైకోర్టులో పెండింగ్లో ఉన్న బెయిల్ పిటిషన్ను అడ్డంపెట్టుకుని తెలుగుదేశం పార్టీ వర్గాలు సీఐడీ దర్యాప్తునకు అడ్డుగోడలా నిలబడ్డాయి. సీఐడీ సమన్లకు ఏ మాత్రం సహకరించలేదు. సీఐడీ సమన్లకు టీడీపీ వర్గాలు స్పందించలేదన్న వాస్తవాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. మనీ లాండరింగ్ అంశంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. నిధులు ఎక్కడకు వెళ్లాయన్న దానిపై నిర్ధిష్ట ఆధారాలున్నాయి. వాటిని హైకోర్టు ముందు ఉంచడం జరిగింది. అన్నీ అంశాలపై ఏపీ సీఐడీ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో నిధుల మళ్లింపు జరగలేదని తేల్చడం ద్వారా హైకోర్టు ఘోర తప్పిదానికి పాల్పడింది. క్వశ్చన్ ఆఫ్ లా.. హైకోర్టు తీర్పులో పలు అంశాలపై అనుమానాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. ‘క్వశ్చన్ ఆఫ్ లా’కి సంబంధించి పలు ప్రశ్నలను సుప్రీంకోర్టు ఎదుట ఉంచింది. హైకోర్టు కసరత్తులో న్యాయపరమైన విధానం లోపించిందా? దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాధారాలు, నిందితుడి నేరానికి సంబంధించిన అంశాలపై హైకోర్టు వ్యాఖ్యలు న్యాయపరమైన అంశాలకు విరుద్ధంగా ఉన్నాయా? బెయిల్పై పిటిషనర్ల వాదనలు లేనప్పుడు హైకోర్టు విస్తృతమైన తీర్పు ఇవ్వగలదా? పీసీ చట్టం 1988 ప్రకారం అధికారిక నిర్ణయాల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని నిర్దోషిగా భావించొచ్చా? అధికారం, అధికార వినియోగం, అధికారిక పరిధి లేకపోవడం, అధికార సామర్థ్యాన్ని దుర్వినియోగం చేయడం, ఇతరులకు సొమ్ము రూపంలో లబ్ధి చేకూర్చడం తదితరాలపై హైకోర్టు నిర్ణయం సరైనదేనా?’ అనే ప్రశ్నలను సుప్రీంకోర్టు ముందుంచింది. నిరంజన్సింగ్ వర్సెస్ ప్రభాకర్ రాజారామ్, సుమిత్ శుభాచంద్ర గంగ్వాల్ వర్సెస్ మహారాష్ట్ర కేసుల్లో తీర్పులతోపాటు స్కిల్ స్కామ్ కేసులో సాక్ష్యాధారాలను వివరించే అంశాన్ని హైకోర్టు పదేపదే తిరస్కరించిందని పేర్కొంది. సంగీతబెన్ వర్సెస్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రస్తావిస్తూ ప్రస్తుత కేసులో హైకోర్టు ఆయా అంశాలను పరిశీలించకుండా బెయిల్ కేసును మినీ ట్రయల్గా మార్చిందని, ట్రయల్ కోర్టు పనితీరును విస్మరించిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ ఒక్క కేసు పరిశీలనతోనే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టవచ్చని నివేదించింది. క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం! సీమెన్స్, డిజైన్టెక్ నుంచి రావాల్సిన 90 శాతం నిధులు రాలేదని, అందువల్ల ప్రభుత్వం చెల్లించాల్సిన 10 శాతం నిధులను చెల్లించడం సరికాదన్న అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి అభ్యంతరాలను చంద్రబాబు పట్టించుకోని విషయాన్ని హైకోర్టు పూర్తిగా విస్మరించింది. అవినీతి నిరోధక చట్టం మౌలిక సూత్రాల నుంచి, పబ్లిక్ సర్వెంట్ అధికారం దుర్వినియోగం వంటి వాటి నుంచి హైకోర్టు దూరంగా వెళ్లింది. చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేసే విషయంపై హైకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఎంత మాత్రం హేతుబద్దమైనవి కావు. తన పీఏ పెండ్యాల శ్రీనివాస్ విదేశాలకు పారిపోవడం, కీలక నిందితులు సీఐడీ ముందుకు రాకపోవడం వంటి వాటి విషయంలో చంద్రబాబు పాత్ర ఉన్న విషయాన్ని హైకోర్టు పట్టించుకోలేదు. చంద్రబాబు రాజకీయంగా చాలా పలుకుబడి కలిగిన వ్యక్తి. దర్యాప్తును ప్రభావితం చేయడం, సాక్షులను భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దర్యాప్తుకు విఘాతం కలిగేలా కొందరు నిందితులు మీడియా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వర్గాలు దర్యాప్తునకు సహకరించడం లేదు. చంద్రబాబుకు బెయిల్ కోసం కాకుండా క్లీన్ చిట్ ఇచ్చే అంశంగా పరిగణించి ఆదేశాలు ఇచ్చినట్లు ఉంది. వీటన్నింటిరీత్యా చంద్రబాబు జుడీషియల్ రిమాండ్లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
నేడు తేలనున్న చంద్రబాబు భవితవ్యం !
-
నేడు చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ
-
చంద్రబాబు బెయిల్ రద్దుపై నేడు సుప్రీం కోర్టులో విచారణ
-
వివేకా కేసు.. ఏ1 గంగిరెడ్డి బెయిల్ రద్దు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కి ఊరట లభించింది. ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ను రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు. ఈ మేరకు వచ్చే నెల 5వ తేదీలోగా హైదరాబాద్ సీబీఐ కోర్టులో లొంగిపోవాలని గంగిరెడ్డిని ఆదేశించింది. ఒకవేళ లొంగిపోకపోతే.. గంగిరెడ్డిని అరెస్ట్ చేయవచ్చని సీబీఐకి తెలిపింది న్యాయస్థానం. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నాడు ప్రధాన నిందితుడు (ఏ–1) ఎర్ర గంగిరెడ్డి. అయితే.. బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేకా కేసు విచారణ జరుపుతున్న తెలంగాణ హైకోర్టులో సీబీఐ ఓ పిటిషన్ దాఖలు చేసింది. వివేకా హత్యకు కుట్ర పన్నింది ఎర్ర గంగిరెడ్డేనని, దాన్ని అమలు చేయడంలోనూ అతనిది కీలక పాత్ర అని దర్యాప్తు సంస్థ వాదనలు వినిపించింది. అంతేకాదు.. సాక్ష్యాలు తారుమారు చేయడంలోనూ అతను కీలకంగా వ్యవహరించాడని పేర్కొంది. గంగిరెడ్డి గనుక బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారు కాబట్టి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ వాదించింది. అయితే.. గంగిరెడ్డి డీఫాల్ట్ బెయిల్ను రద్దు చేయించాలని సీబీఐ పలుమార్లు ప్రయత్నించి విఫలమైందని అతని తరపున న్యాయవాది వాదించారు. సీబీఐ దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్లను.. కడప కోర్టు, ఏపీ హైకోర్టు కూడా కొట్టివేశాయని ప్రస్తావించారు. బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు కూడా చెప్పలేదని తెలంగాణ హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ హత్యతో గంగిరెడ్డికి సంబంధం లేదని, బెయిల్ను రద్దు చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ హైకోర్టు బెంచ్కు విజ్ఞప్తి చేశారు. అయితే వాదనలు విన్న ఏకసభ్య బెంచ్.. సీబీఐ వాదనతోనే ఏకీభవించింది. దర్యాప్తు దశలో.. గంగిరెడ్డి బెయిల్ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. మే 5వ తేదీలోపు సీబీఐ కోర్టులో గంగిరెడ్డి లొంగిపోవాలని, లేకుంటే అరెస్ట్ చేసుకోవచ్చని దర్యాప్తు సంస్థకు సూచించింది హైకోర్టు. అలాగే.. రెండు నెలల్లోపు వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తి చేయాలని, జూన్ 30వ తేదీ వరకు మాత్రమే గంగిరెడ్డి బెయిల్ను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జులై 1వ తేదీ తర్వాత గంగిరెడ్డికి తిరిగి బెయిల్ ఇవ్వొచ్చని ట్రయల్ కోర్టుకు తెలిపింది హైకోర్టు. 2019 అక్టోబర్లో వివేకా కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి డీఫాల్ట్ బెయిల్ ఇచ్చింది పులివెందుల కోర్టు. ఆపై 2021లో ఎర్ర గంగిరెడ్డిపై సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఏ1గా కేసును ప్రభావితం చేసే అవకాశం ఉన్నందునా.. బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరుతూ వస్తోంది. ఇదీ చదవండి: వివేకా రెండో భార్య సంచలన స్టేట్మెంట్ -
ఎర్ర గంగిరెడ్డిదే కీలక పాత్ర.. తెలంగాణ హైకోర్టులో సీబీఐ వాదనలు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కుట్ర పన్నింది ఎర్ర గంగిరెడ్డేనని, దాన్ని అమలు చేయడంలోనూ అతనిది కీలక పాత్ర అని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించింది. సాక్ష్యాలు తారుమారు చేయడంలోనూ అతను కీలకంగా వ్యవహరించాడని పేర్కొంది. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు (ఏ–1) ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ చిల్లకూర్ సుమలత గురువారం విచారణ జరిపారు. సీబీఐ తరఫున పీపీ నాగేంద్రన్ వాదనలు వినిపిస్తూ.. ‘గంగిరెడ్డి బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారు. వివేకా వద్ద డ్రైవర్గా పనిచేస్తానని, హత్య చేయలేనని చెప్పినా గంగిరెడ్డి రూ.40 కోట్లు ఇస్తానని ఆశ చూపాడని దస్తగిరి (ఏ–2) వాంగ్మూలంలో వెల్లడించాడు. పథకం ప్రకారం ముందుగా వివేకా ఇంటికి వెళ్లిన గంగిరెడ్డి.. ఆ తర్వాత ముగ్గురు నిందితులు లోపలికి వచ్చేందుకు సహకరించాడు. గంగిరెడ్డి ఆదేశాలతోనే హత్యను వేరేవాళ్లపై నెట్టేలా చావుబతుకుల్లో ఉన్న వివేకా లేఖ రాశారు. అతని విచారణ తప్పనిసరి. వివేకా హత్య జరిగిన రోజు వాచ్మెన్ రంగన్న ఇతర నిందితులతో పాటు గంగిరెడ్డిని కూడా గుర్తించాడు. హత్య తర్వాత గంగిరెడ్డి, శివశంకర్రెడ్డి సాక్ష్యాలను చెరిపివేశారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలి’ అని వాదించారు. చదవండి: ఏది నిజం?: వివేకా హంతకుల్ని నడిపిస్తున్నదెవరు? డీఫాల్ట్ బెయిల్ను మెరిట్ ఆధారంగా పరిశీలించి రద్దు చేయవచ్చని వివేకా కుమార్తె సునీతారెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది ఎల్. రవిచందర్ వాదనలు వినిపించారు. గంగిరెడ్డి డీఫాల్ట్ బెయిల్ను రద్దు చేయించాలని సీబీఐ పలుమార్లు ప్రయత్నించి విఫలమైందని గంగిరెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శేషాద్రి నాయుడు వెల్లడించారు. సీబీఐ దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్లను కడప కోర్టు, ఏపీ హైకోర్టు కొట్టివేశాయని చెప్పారు. బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు కూడా చెప్పలేదన్నారు. ఈ హత్యతో గంగిరెడ్డికి సంబంధం లేదని, బెయిల్ను రద్దు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణను ఈనెల 25కి వాయిదా వేశారు. దస్తగిరికి తెలంగాణ హైకోర్టు నోటీసులు హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు (ఏ–4) షేక్ దస్తగిరికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దస్తగిరిని అప్రూవర్గా పేర్కొంటూ సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడాన్ని కొట్టివేయాలంటూ ఎంవీ కృష్ణారెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి తెలంగాణ హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ కె.సురేందర్ గురువారం మరోసారి విచారణ చేపట్టారు. భాస్కర్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి వాదనలు వినిస్తూ.. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న కిరాయి హంతకుడు దస్తగిరికి క్షమాబిక్ష చెల్లదని అన్నారు. ఈ పిటిషన్లలో ప్రతివాది అయిన దస్తగిరికి ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసులో నిందితుడు దస్తగిరికి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను జూన్కు వాయిదా వేశారు. -
IRCTC scam: తేజస్వీ యాదవ్ బెయిల్ రద్దు చేయండి: సీబీఐ
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కుంభకోణం కేసులో బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్కు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేసింది. ‘తేజస్వీ యాదవ్ సాదాసీదా వ్యక్తి కాదు. బాగా పలుకుబడి కలిగిన వాడు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులను దూషిస్తూ, బెదిరిస్తూ బహిరంగ హెచ్చరికలు చేశారు. సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు’ అని సీబీఐ తన పిటిషన్లో పేర్కొంది. కోర్టులను కూడా తక్కువ చేస్తూ ఆయన మీడియా సమావేశాల్లో మాట్లాడారని తెలిపింది. దీనిపై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ శనివారం తేజస్వీ యాదవ్కు నోటీసు జారీ చేశారు. ఈ నెల 28వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని అందులో ఆదేశించారు. రెండు ఐఆర్సీటీసీ హోటళ్ల కాంట్రాక్టును ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించడంలో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలపై నమోదైన కేసులో యాదవ్కు 2018 అక్టోబర్లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
ఆ వివరాలన్నీ మా ముందుంచండి
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి కింది కోర్టు ఎప్పుడు బెయిల్ ఇచ్చింది? దాన్ని రద్దు చేయాలని సీబీఐ ఎప్పుడు పిటిషన్ వేసింది? ఆ పిటిషన్ను కింది కోర్టు ఎప్పుడు కొట్టేసింది? గంగిరెడ్డి బెదిరింపులకు పాల్పడినట్లు ఇచ్చిన వాంగ్మూలాలు తదితర వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు సోమవారం సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఉత్తర్వులు జారీచేశారు. గంగిరెడ్డికి కింది కోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ సీబీఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ రాయ్ విచారణ జరిపారు. ఈ సందర్భంగా సీబీఐ న్యాయవాది ఎ.చెన్నకేశవులు వాదనలు వినిపిస్తూ.. బెయిల్పై బయట ఉన్న గంగిరెడ్డి సాక్షులను బెదిరిస్తున్నారని, ప్రలోభాలకు గురిచేస్తున్నారని చెప్పారు. వివేకా హత్య వెనుక రాజకీయ పెద్దల ప్రమేయం ఉందన్నారు. నిందితుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి వాంగ్మూలం సైతం ఇచ్చారని తెలిపారు. సీఆర్పీసీ 164 కింద వాంగ్మూలం ఇస్తానని మొదట చెప్పిన సీఐ శంకరయ్య, గంగాధర్రెడ్డి, కృష్ణారెడ్డిలు గంగిరెడ్డి, అతడి అనుచరులు బెదిరించడంతో 164 వాంగ్మూలం ఇవ్వలేదని చెప్పారు. గంగిరెడ్డి బయట ఉంటే దర్యాప్తునకు తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. ఈ వాదనలను గంగిరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు తోసిపుచ్చారు. సీబీఐవి కేవలం ఆరోపణలు మాత్రమేనన్నారు. గంగిరెడ్డి సాక్షులను బెదిరించినట్లు ఆధారాలు లేవన్నారు. శంరయ్య తదితరులు వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరిస్తే దానికీ గంగిరెడ్డికి ఏం సంబంధమని ప్రశ్నించారు. బెయిల్ రద్దుకోసం సీబీఐ దాఖలు చేసిన ఈ పిటిషన్ను కొట్టేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పూర్తివివరాలు తమముందు ఉంచాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. -
నిరాధార ఆరోపణలతో బెయిల్ రద్దు కుదరదు
సాక్షి, అమరావతి: నిందితులపై వచ్చే అస్పష్ట ఆరోపణల ఆధారంగా వారికిచ్చిన బెయిల్ను రద్దుచేయడం సాధ్యం కాదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఆరోపణలకు ఆధారాలు లేనప్పుడు బెయిల్ రద్దుచేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో గత ఏడాది జూన్లో జరిగిన జంటహత్య కేసులో నిందితులకు కింది కోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ మృతుల్లో ఒకరైన ప్రతాపరెడ్డి సతీమణి లక్ష్మీదేవి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. ఈ జంటహత్య కేసులో చార్జిషీట్ దాఖలు చేసేవరకు నిందితులు పెసరవాయి గ్రామంలోకి అడుగుపెట్టడానికి వీల్లేదని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఇటీవల తీర్పు చెప్పారు. పెసరవాయిలో గత ఏడాది జూన్ 17న టీడీపీ నేతలైన వడ్డు ప్రతాప్రెడ్డి, వడ్డు నాగేశ్వరరెడ్డి హత్యకు గురయ్యారు. రాజకీయ కక్షలతో జరిగిన ఈ హత్యలపై దర్యాప్తు జరిపిన గడివేముల పోలీసులు నిందితులు ద్వారం శ్రీకాంత్రెడ్డి, ద్వారం కేదారనాథ్రెడ్డిలతో పాటు మరికొందరిని అదేనెల 25న అరెస్ట్ చేశారు. అనంతరం వీరు నంద్యాల కోర్టులో బెయిల్ కోసం పిటిషన్లు వేసుకున్నారు. రెండుసార్లు బెయిల్ పిటిషన్లను కొట్టేసిన కోర్టు మూడోసారి షరతులతో బెయిల్ మంజూరు చేసింది. దీంతో నిందితులు విడుదలయ్యారు. నిందితుల బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ మృతుడు ప్రతాప్రెడ్డి సతీమణి లక్ష్మీదేవి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ విచారించారు. సాక్షులను బెదిరిస్తూ, దర్యాప్తులో జోక్యం చేసుకుంటున్నందున నిందితులకు కింది కోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దుచేయాలని పిటిషనర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కోరారు. సాక్షులను బెదిరిస్తున్నట్లు ఫిర్యాదు లేదు పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శెట్టిపల్లె దుష్యంత్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. నిందితులు పెసరవాయిలోకి అడుగుపెట్టరాదన్న కోర్టు బెయిల్ షరతును వారు పాటిస్తున్నట్లు చెప్పారు. నిందితులు బెదిరిస్తున్నట్లు ఒక్క సాక్షి నుంచి కూడా పోలీసులకు ఫిర్యాదు అందలేదన్నారు. నిందితుల న్యాయవాదులు కూడా పిటిషనర్ ఆరోపణలను తోసిపుచ్చారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి.. నిందితులు సాక్షులను బెదిరిస్తున్నారన్న ఆరోపణలకు ఆధారాలు చూపనందున బెయిల్ను రద్దుచేయడం సాధ్యం కాదని తీర్పు చెప్పారు. -
బెయిల్ రద్దు చేయండి మహాప్రభో..!
సాక్షి, చెన్నై: తనకు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ.. కొడనాడు కేసు నిందితుడు ఊటీ కోర్టుకు విన్నవించుకున్నాడు. ఈ అంశం ప్రస్తుతం హాట్ టాఫిక్గా మారింది. వివరాలు.. దివంగత సీఎం జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్లో గతంలో జరిగిన హత్య, దోపిడీ గురించి తెలిసిందే. ఈ కేసులో సయన్, మనోజ్తో పాటుగా పలువురిని అరెస్టు చేసి పోలీసులు కేసును ముగించారు. అయితే, డీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చినానంతరం ఈ కేసు మళ్లీ మొదటి నుంచి దర్యాప్తు చేస్తున్నారు. విచారణ వేగవంతం అయిన నేపథ్యంలో బెయిల్ మీదున్న నిందితులు ఒకొక్కరుగా తమ వద్ద ఉన్న సమాచారాన్ని విచారణ బృందానికి తెలియజేస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే అరెస్టయ్యి ఇటీవల బెయిల్పై బయటకు వచ్చిన వాలయార్ మనోజ్ తాజాగా తన బెయిల్ ను రద్దు చేయాలని, కటకటాల్లోకి నెట్టాలని ఊటీ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. అయితే, మనోజ్కు బెయిల్ ఇచ్చిన క్రమంలో కొన్ని కఠిన నిబంధనల్ని కోర్టు విధించింది. వీటి ప్రకారం కేరళకు చెందిన ఈ మనోజ్ ఊటీలోనే ఉండాల్సి ఉంటుంది. తాజాగా తనకు ఇచ్చిన బెయిల్ రద్దు చేసి, కటకటాల్లోకి నెట్టాలని మనోజ్ వేడుకోవడం వెనుక ఈ నిబంధనలూ ఓ కారణంగా తేలింది. బుధవారం దాఖలు చేసిన తన పిటిషన్లో మనోజ్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశాడు. తనకు ఊటీలో బస చేయడానికి అద్దె గదులు కూడా ఇవ్వడం లేదని, తినేందుకు ఆహారం కూడా కరువైందని, విచారణ ఓ వైపు ఉంటే, ఆకలి కష్టాలు మరోవైపు తీవ్రంగా కలిచి వేస్తున్నాయని పేర్కొన్నాడు. కాగా ఈ పిటిషన్పై గురువారం విచారణ చేపట్టాలని ఊటీ కోర్టు నిర్ణయించింది. -
మెహుల్ చోక్సీకి నో బెయిల్
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి డొమినికా న్యాయస్థానం బెయిల్ మంజూరుకు నిరాకరించింది. అంటిగ్వా నుంచి తమ దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన చోక్సికి బెయిల్ ఇవ్వలేమని గురువారం పిటిషన్ను కొట్టివేసింది. చోక్సీ(62) వీల్ చైర్లో కోర్టుకు హాజరయ్యారు. చోక్సీ అక్రమంగా డొమినికాకు రాలేదని, ఆయనని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువచ్చారని అందుకే బెయిల్ ఇవ్వాలంటూ చోక్సీ తరఫు లాయర్ వాదించారు. మరోవైపు చోక్సీకి బెయిల్ ఇస్తే అతను పారిపోతాడని, భారత్లో ఆర్థిక నేరాలకు సంబంధించిన 11 కేసులు ఉన్నాయని, ఇంటర్పోల్ నోటీసులూ అతనిపై జారీ అయ్యాయని ప్రభుత్వం తరఫు లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. చోక్సీ చుట్టూ ఉన్న పరిస్థితులు అత్యంత తీవ్రంగా ఉండడం వల్ల బెయిల్ ఇవ్వలేమని మెజిస్ట్రేట్ కేండియా కేరట్ జార్జ్ ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో అక్రమంగా ప్రవేశించినందుకు వేసే జరిమానాకు రెట్టింపు మొత్తం 10 వేల కరీబియన్ డాలర్లు చెల్లిస్తామని చోక్సీ తరఫు లాయర్ చెప్పినా న్యాయమూర్తి అంగీకరించలేదు. అయితే బెయిల్ కోసం పై కోర్టుకు వెళతామని లాయర్ విజయ్ అగర్వాల్ మీడియాకి వెల్లడించారు. వాదనల సమయంలో భారత్ నుంచి వెళ్లిన బృందం కోర్టుకి హాజరైంది. డొమినికా ప్రభుత్వం చోక్సీని అప్పగిస్తే భారత్కు తీసుకురావడానికి ఆ బృందం వెళ్లింది. అయితే ఇప్పుడిప్పుడే చోక్సీని అప్పగించే అవకాశాలు కనిపించడం లేదని నిపుణులంటున్నారు. చోక్సీపై కోర్టుకు వెళితే మరిన్ని రోజులు ఈ కేసు సాగే అవకాశాలున్నాయి. 2018 నుంచి అంటిగ్వాలో తలదాచుకుంటున్న చోక్సీ అక్కడ్నుంచి హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. అతను ప్రేయసితో విహార యాత్ర కోసం డొమినికాకు వెళ్లాడన్న ఆరోపణలున్నాయి. మే 23న తమ దీవుల్లోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించారంటూ డొమినికా పోలీసులు చోక్సీని అదుపులోకి తీసుకున్నారు. చోక్సీని వెనక్కి తెస్తాం: భారత విదేశాంగ శాఖ మెహుల్ చోక్సీని కచ్చితంగా భారత్కు తీసుకువస్తామని విదేశాంగ శాఖ ధీమా వ్యక్తం చేసింది. డొమినికాలో న్యాయపరమైన ప్రక్రియ పూర్తయితే వెంటనే అతనిని భారత్కి తెస్తామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బగ్చి చెప్పారు. ఆ సమస్య మనకొద్దు చోక్సీని డొమినికా నుంచే భారత్కు పంపిస్తే మంచిదని అంటిగ్వా, బార్బుడా దేశం భావిస్తోంది. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో చోక్సీ అంశమే ప్రధానంగా చర్చకు వచ్చినట్టు అక్కడి మీడియా వెల్లడించింది. ప్రస్తుతం చోక్సీ డొమినికా పోలీసు కస్డడీలో ఉన్నందున ఇది వాళ్ల వ్యవహారమని, ఇక్కడికి వస్తే ఆ సమస్యలు తమకు చుట్టుకుంటాయని సమావేశం అభిప్రాయపడింది. -
రాజకీయ దురుద్దేశాలతోనే పిటిషన్
సాక్షి, హైదరాబాద్: ‘ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యక్తిగత ప్రయోజనాలతోను, రాజకీయ దురుద్దేశాలతోను నా బెయిల్ను రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఇది చట్టప్రక్రియను దుర్వినియోగం చేయడమే..’ అని సీఎం వైఎస్ జగన్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. పిటిషన్ దాఖలు చేసిన తీరు, అందులో వాడిన భాష ఆయన దురుద్దేశాన్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. అవాస్తవాలు, తప్పుడు ఆరోపణలు, అభూత కల్పనలతో ఈ పిటిషన్ దాఖలు చేశారని, ప్రత్యేక కోర్టు విధించిన బెయిల్ షరతులను తాను ఎప్పుడూ ఉల్లంఘించలేదని జగన్ తెలిపారు. సీఎం జగన్బెయిల్ను రద్దుచేయాలంటూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్పై జగన్ తరఫు న్యాయవాది జి.అశోక్రెడ్డి మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఓ సాక్షిని జగతి పబ్లికేషన్స్ ఇంటర్వ్యూ చేసిందన్న కారణంగా 2017లో బెయిల్ రద్దుచేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ను ప్రత్యేక కోర్టు కొట్టివేసిందని తెలిపారు. జగన్ బెయిల్ షరతులను ఉల్లంఘించలేదని, ఆయన బెయిల్ను రద్దు చేయాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసిందన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా సీఎం హోదాలో చర్యలు తీసుకోవాల్సి ఉన్నందునే కోర్టు విచారణకు హాజరుకాలేకపోతున్నానని, తాను హాజరుకాకపోయినా విచారణకు ఎక్కడా అంతరాయం కలగలేదని తెలిపారు. వ్యక్తిగత ద్వేషంతో రాజకీయంగా ప్రయోజనం పొందాలని దాఖలు చేసే ఈ తరహా పిటిషన్లు ఎంతమాత్రం విచారణార్హం కాదని పేర్కొన్నారు. అందువల్ల ఈ పిటిషన్ను కొట్టివేయాలని కోరారు. రఘురామ అనేక కేసుల్లో నిందితుడు బెయిల్ రద్దుచేయాలని కోరే హక్కు థర్డ్పార్టీకి లేదని అనేక కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులిచ్చిందని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు రోజువారీ పద్ధతిలో ఈ కేసులను విచారిస్తోందని, నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు వింటోందని తెలిపారు. విచారణను జాప్యం చేస్తున్నారంటూ రఘురామ పేర్కొనడం కోర్టు ధిక్కరణకు పాల్పడమేనని పేర్కొన్నారు. రఘురామ వాస్తవాలను దాచి ఈ పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. ఆయనపై బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్న రూ.947.71 కోట్లకుపైగా ఎగ్గొట్టారనే తీవ్రమైన ఆరోపణలున్నాయని, సీబీఐ నమోదు చేసిన 2 కేసుల్లో నిందితుడని తెలిపారు. ఆయనపై 7 క్రిమినల్ కేసులున్నాయని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించినందున ఎంపీగా ఆయన్ని అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ గతేడాది లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేసినట్లు కౌంటర్లో జగన్ వివరించారు. దీనిపై రిజాయిండర్ దాఖలు చేసేందుకు గడువు ఇవ్వాలని రఘు న్యాయవాదులు కోరడంతో విచారణను న్యాయమూర్తి ఈనెల 14కు వాయిదా వేశారు. కాగా, ఈ పిటిషన్పై చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని సీబీఐ ప్రత్యేక కోర్టులో మెమో దాఖలు చేసింది. -
గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయండి
హైకోర్టులో కర్నూలు జిల్లా పోలీసుల పిటిషన్ సాక్షి, హైదరాబాద్: ఎర్ర చందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ కర్నూలు జిల్లా పోలీసులు హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. గంగిరెడ్డికి హైకోర్టు ఈ నెల 15న బెయిల్ మంజూరు చేసిందని, అయితే అతను బహ్రెయిన్కు పారిపోయాడని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణా కేసులో ఇతర నిందితులూ దేశం దాటేందుకు అతను సహకరించే ప్రమాదం ఉందని, ఇతనికి అంతర్జాతీయ స్మగర్లతో సంబంధాలు ఉన్నాయని, అందుకుగాను వెంటనే అతని బెయిల్ను రద్దు చేయాలని కోర్టుకు విన్నవించారు. కర్నూలు గ్రామీణ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ గురువారం విచారించనున్నారు. -
మాజీ మంత్రి బెయిల్ రద్దు
సాక్షి, ముంబై: జల్గావ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం కేసులో చిక్కుకున్న రాష్ట్ర మాజీమంత్రి గులాబ్రావ్ దేవ్కర్కు అత్యున్నత న్యాయస్థానంలో మంగళవారం చుక్కెదురైంది. ఈ కేసులో జిల్లా కోర్టు గులాబ్రావ్కు మంజూరు చేసిన బెయిల్ను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. దీంతో ఆయనను ఏక్షణంలోనైనా అరెస్టు అవకాశాలు కనిపిస్తున్నాయి. అనేక సంవత్సరాలుగా నత్తనడకన సాగుతున్న ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అప్పట్లో సురేష్ జైన్తోపాటు అప్పటి సహాయ మంత్రి గులాబ్రావ్ దేవ్కర్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అయితే జిల్లా కోర్టు గులాబ్రావ్కు బెయిల్ మంజూరు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలుచేస్తూ ప్రేమానంద్జాదవ్ అనే వ్యక్తి బాంబే హైకోర్టుకు చెందిన ఔరంగాబాద్ ధర్మాసనాన్ని ఆశ్రయించారు. దీంతో ఔరంగాబాద్ ధర్మాసనం దేవ్కర్ బెయిల్ను రద్దు చేసింది. దేవ్కర్ ఈ నిర్ణయాన్ని సవాలుచేస్తూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై పలుసార్లు విచారణ జరిపిన సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. గులాబ్రావ్ దేవ్కర్ బెయిల్ రద్దు చేయడమే కాకు ండా రెండు రోజులలోగా పోలీసులకు లొంగిపోవాలంటూ ఆదేశించింది.