-
కొత్తజంటపై హత్యాయత్నం
కృష్ణాజిల్లా, జి. కొండూరు (మైలవరం): ప్రేమ వివాహం చేసుకొన్న యువ జంటపై యువతి అన్నయ్యతో పాటు మరో ఐదుగురు కలిసి హత్యాయత్నం చేయబోయిన ఘటన జి. కొండూరు మండల పరిధిలోని తెల్లదేవరపాడు గ్రామంలో బుధవారం ఉదయం చోటు చేసుకొంది. బాధితుల వివరాల ప్రకారం... జి.కొండూరు మండల పరిధిలోని గంగినేని గ్రామానికి చెందిన పొదిలి బాలగిరీష్ 8 నెలల క్రితం బెంగళూరులోని ఓ షాపింగ్ మాల్లో అకౌంటెంట్గా చేరాడు. బెంగళూరుకు చెందిన తన సహ ఉద్యోగి మానసతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరి ప్రేమ వ్యవహారం మానస కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆమెకు వేరే పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న బాలగిరీష్.. మానసను తీసుకొని డిసెంబరు 15వ తేదీన ద్వారకాతిరుమల వచ్చి స్నేహితుల సహాయంతో వివాహం చేసుకొన్నాడు. అనంతరం తెల్లదేవరపాడులో ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. వీరిద్దరి పెళ్లైన వారం రోజుల తర్వాత మానస కుటుంబ సభ్యులు కర్ణాటక పోలీసులతో కలిసి గంగినేని వచ్చారు. కుటుంబ సభ్యులు మానసను తమతో రావాలని కోరారు. తల్లిందండ్రులతో వెళ్లేందుకు మానస నిరాకరించింది. ఇద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు కూడా చేతులెత్తేశారు. చేసేదిలేక కుటుంబ సభ్యులు వెనుదిరిగి వెళ్లారు. అయితే మానస అన్నయ్య వినయ్ తన ఐదుగురు స్నేహితులతో కలిసి రెండు రోజుల క్రితం బెంగళూరు నుంచి జి. కొండూరు వచ్చాడు. మానసతో రెండు రోజులుగా ఫోన్లో మంచిగా మాట్లాడుతూ అడ్రస్ సేకరించాడు. తనతో వచ్చిన ఐదుగురు స్నేహితులతో కలిసి కారులో వచ్చిన వినయ్ బుధవారం ఉదయం తెల్లదేవరపాడులో మానస, బాలగిరీష్ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లారు. మానసను తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమె ఇంట్లోకి వెళ్లి తలుపు గడియ పెట్టింది. అంతలోనే బయటకు వచ్చిన బాల గిరీష్పై వినయ్తో పాటు అతని స్నేహితులు వెంట తెచ్చిన కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించారు. ఇంటి పక్కన వాళ్లు వచ్చి నిందితులను పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అయితే ఇరుపక్షాలు రాజీకి రావడంతో జి. కొండూరు పోలీసులు నిందితులను బైండోవర్ చేసి వదిలేశారు. -
అడ్డుగా ఉన్నాడని... భర్తపై హత్యాయత్నం
కర్ణాటక, కృష్ణరాజపురం : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంగా ఓ మహిళ, ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి భర్తపై హత్యాయత్నం చేసిన ఘట న సోమవారం హుళిమావు పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. వివరాలు... కూలిగా పనిచేస్తున్న నాగరాజు భార్య మమతతో కలిసి అరికెరెలో నివాసం ఉంటున్నాడు. నాగరాజు పనుల కోసం బయటకు వెళ్లిన సమయంలో ఇంటి యజమాని ప్రశాంత్తో మమతకు పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం నాగరాజుకు తెలియడంతో భార్యను హెచ్చరించాడు. దీంతో భర్త అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడుతో కలిసి పథకం వేసింది. మమత సూచన మేరకు ప్రశాంత్ తన సహచరులు అనిల్, జాకిర్, హరీశ్లతో కలసి గతనెల14న నాగరాజును హత్య చేయడానికి నిర్ణయించుకున్నారు. అనుకున్న ప్రకారం ఇంట్లోకి చొరబడడానికి ప్రయత్నిస్తుండగా అదే సమయంలో వాటర్క్యాన్ సరఫరా చేసే వ్యక్తి అక్కడికి రావడంతో హత్యాయత్నాన్ని విరమించుకొని అనుమానం రాకుండా ఉండడానికి నాగరాజుపై దాడి చేసి నగదు, ఆభరణాలు దోచుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న హుళిమావు పోలీసులు మమత ప్రవర్తనపై అనుమానించి తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం వెలుగు చూసింది. సోమవారం మమతతో పాటు ప్రశాంత్ అతడి సహచరులను అరెస్ట్ చేశారు. -
వినియోగదారులుగా వచ్చి హత్యాయత్నం..
నాచారం: బ్యూటీపార్లర్కు వినియోగదారులుగా వచ్చి నిర్వాహకురాలిపై హత్యాయత్నం చేసి సొత్తు చోరీ చేసిన నిందితులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.ఈ సంఘటన మల్కాజిగిరి సీసీఎస్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మల్కాజిగిరి సీసీఎస్ డీసీపీ నాగరాజు ఆధ్వర్యంలో నాచారంలోని సీసీఎస్ పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సఫిల్గూడలోని వైల్ ఫీల్డ్స్ అపార్ట్మెంట్లో నివాసం ఉండే బిట్రా విష్ణుప్రియ (25), మౌలాలి షఫీనగర్కు చెందిన ముత్తిరాజు మౌనిక (21) ఇద్దరు టైలర్ పనిచేస్తుంటారు. దువ్వ వెంకటరత్నకుమారి (50) వైల్ ఫీల్డ్స్ అపార్ట్మెంట్లో తన నివాసంలో బ్యూటీపార్లర్ నిర్వహిస్తుంటుంది. విష్ణుప్రియ తరచూ వెంకటరత్నకుమారి మేకప్ చేసుకోవడానికి వెళ్తుటుంది. ఆ సమయంలో ఆ ఇంట్లో ఉన్న నగదు, బంగారం ఇతర వస్తువులను చూస్తూ ఉండేది. అసలే ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న విష్ణుప్రియ ఒంటరిగా ఉన్న వెంకటరత్నకుమారి ఇంట్లో దొంగతనం చేయాలని నిశ్చయించుకుంది. విష్ణుప్రియ, మౌనిక ఇద్దరు కలిసి డిసెంబర్ 25 మధ్యాహ్నం 3 గంటల సమయంలో మేకప్ కోసం వెంకటరత్నకుమారి ఇంటికి వెళ్లారు. మౌనికకు మేకప్ చేసే సమయంలో విష్ణుప్రియ రోకలిబండతో వెంకటరత్నకుమారి తలపై గట్టిగా కొట్టింది. ఆమె కిందపడిపోగానే చార్జింగ్ వైర్తో గొంతుకు చుట్టి హత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి నోటి నుండి రక్తం రాగానే చనిపోయిందనుకొని ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు, బంగారు గాజులు, ఐఫోన్, తీసుకొని పరారయ్యారు. కొంతసేపటి తర్వాత వెంకటరత్నకుమారి స్పృహలోకి వచ్చి తనపై జరిగిన దాడి గురించి నేరెడ్మెట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యాప్తు చేపట్టారు. ఫిర్యాదు అందిన 24 గంటలలోపే నింధితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ.1,56 లక్షల విలువ గల 18 తులాల బంగారం, ఒక ఐఫోన్లను స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును తొందరగా చేదించిన సీసీఎస్ మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ లింగయ్య, కె.జగన్నాదరెడ్డి, పోలీసు బృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో మల్కాజిగిరి అడిషనల్ డీసీపీ క్రైం ఎస్కె.సలీమా, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
యువకుడిపై హత్యాయత్నం
గుంటూరు, తెనాలిరూరల్: మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఆమెతో సహజీవనం చేస్తున్న యువకుడిపై మరో ప్రియుడు కత్తితో హత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలపాలైన అతను ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పట్టణానికి చెందిన ఆలూరు త్రివేణి భర్తతో విడిపోయి, మల్లెపాడు పరిధిలోని ద్వారకానగర్కు చెందిన తాడిబోయిన గోపి అలియాస్ గాలి గోపితో కొంతకాలం సహజీవనం చేసింది. అనంతరం అతనితో విడిపోయి సుమారు ఏడాదిగా సాలిపేటకు చెందిన వెండి వస్తువుల తయారీ కార్మికుడు సూరేపల్లి శ్రీనివాసరావు అలియాస్ వాసుతో సహజీవనం చేస్తోంది. ద్వారకానగర్లోనే గది అద్దెకు తీసుకుని నివసిస్తోంది. అవివాహితుడైన వాసు అప్పుడప్పుడు ఆమె వద్దకు వచ్చి వెళుతుండే వాడు. గోపితో పరిచయాన్ని ఇటీవలి కాలంలో తిరిగి కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి త్రివేణి వద్దకు వెళ్లిన శ్రీనివాసరావు, త్రివేణి నడవడిక గురించి ప్రశ్నించగా, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. త్రివేణి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో శ్రీనివాసరావు తన స్నేహితుడు జిలానిని తోడుకు పిలిపించుకుని ఇద్దరూ కలసి త్రివేణి ఇంట్లో పడుకున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో వీరు ఉన్న ఇంటికి వచ్చిన గోపి కత్తితో శ్రీనివాసరావుపై దాడి చేశాడు. తలకు, ఎడమ బుగ్గపై తీవ్ర గాయాలయ్యాయి. మధ్యలో అడ్డుకోబోయిన జిలాని ఎడమ చేతి వేలికి గాయమైంది. శ్రీనివాసరావును ప్రకాశం రోడ్డులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. సమాచారమందుకున్న డీఎస్పీ మందపల్లి స్నేహిత, త్రీ టౌన్ ఎస్ఐ బొడ్డు అశోక్కుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్రివేణితో ఘర్షణ పడ్డాడన్న కారణంగానే వాసుపై గోపి హత్యాయత్నం చేశాడని భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
ప్రేమోన్మాది ఘాతుకం
ప్రేమోన్మాది వేధింపులకు భయపడి యువతి ఉద్యోగం మానేసి ఇంటికి పరిమితమైనా ఆ మృగాడు వదలలేదు. ఇంటికి వచ్చి హత్యాయత్నానికి తెగబడ్డాడు. గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డలో జరిగిన ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. గాయపడిన యువతి జీజీహెచ్లో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ప్రేమోన్మాది పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. గుంటూరు ఈస్ట్: వేధింపులకు భయపడి యువతి ఉద్యోగం మానేసి ఇంటికి పరిమితమైనా వెంటాడి మరీ హత్యాయత్నానికి తెగబడ్డాడు ఓ ఉన్మాది. ప్రేమ ముసుగులో ఉన్మాదిగా మారి యువతిని కత్తితో పొడిచి తర్వాత తనను తాను గాయపరుచున్నాడు. గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడ్డ యువతి జీజీహెచ్లో చికిత్స పొందుతోంది. జొన్నలగడ్డలో నివసించే పుప్పాల సాంబయ్య, సామ్రాజ్యం దంపతుల మూడో కుమార్తె దివ్య డిగ్రీ పూర్తి చేసింది. గుంటూరు అరండల్పేటలోని ఓ ప్రైవేటు మార్కెటింగ్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా కొన్ని నెలలు పనిచేసింది. అదే సమయంలో మాచర్లకు చెందిన బాలాజీనాయక్ అనే యువకుడు దివ్య వద్ద అసిస్టెంట్ సేల్స్ ప్రమోటర్గా పనిచేశాడు. తనను ప్రేమించమంటూ వెంట పడ్డాడు. అతని వేధింపులకు భయపడిన దివ్య ఉద్యోగం మానేసి కొద్ది రోజులుగా ఇంటి వద్దే ఉంటోంది. బుధవారం దివ్య ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో బాలాజీ నాయక్ ఆమె వద్దకు వచ్చాడు. తనను ప్రేమించి పెళ్లికి ఒప్పుకోవాలంటూ ఒత్తిడి చేశాడు. దివ్య నిరాకరించడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె పొట్టలో పొడిచాడు. మళ్లీ పొడిచే ప్రయత్నం చేయగా దివ్య పెద్దగా కేకలు వేస్తూ చేతులు అడ్డం పెట్టడంతో చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. దివ్య తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడిపోవడంతో.. ఇంట్లో ఉన్న కుక్కర్ మూతతో బాలాజీనాయక్ తనను తాను తలపై కొట్టుకుని గాయపరుచుకున్నాడు. అలజడికి అక్కడికి చేరుకున్న స్థానికులు వారిద్దరినీ జీజీహెచ్కు తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. దివ్య ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉన్నా, ప్రాణాపాయం లేదని తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
ఆస్తి కోసం తండ్రిపై హత్యాయత్నం
అనంతపురం, ఆత్మకూరు: ఆస్తి కోసం కన్నతండ్రిపైనే హత్యాయత్నం చేసిన కుమారులు, కూతురి ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తమ పేరిట ఆస్తి రాసివ్వాలని కుర్లపల్లికి చెందిన నారాయణస్వామిని కుమారులు జోగి రాజు, జోగి బాలచంద్ర, కుమార్తె మేనక శనివారం అడిగారు. ఆస్తి పంచడానికి నిరాకరించిన నారాయణస్వామికి కళ్లల్లోకి కారం కొట్టి, గొడ్డలిని తిప్పేసి తలపై కొట్టి హత్యాయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన నారాయణస్వామి స్థానికుల సహాయంతో అదే రోజు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆదివారం నిందితులను అరెస్ట్ చేసి అనంతపురంలో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వీరికి మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారని పోలీసులు తెలిపారు. -
భార్యపై హత్యాయత్నం చేసిన ఉపాధ్యాయుడు
అనంతపురం, ఉరవకొండ: వివాహేతర సంబంధం గురించి ప్రశ్నించిన భార్యపై ఉపాధ్యాయుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీల నాయకుల సహకారంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రాకెట్ల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గౌరిశంకర్కు ఉరవకొండకు చెందిన సరస్వతితో 2000 సంవత్సరంలో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. గౌరీశంకర్ మండలంలోనే పనిచేసే మహిళా ఉపాధ్యాయురాలితో వివాహేతర సంబంధం ఉంది. ఆమెతో సహజీవనం కూడా చేస్తున్నాడు. దీనిపై నిలదీసిన భార్యను వేధించేవాడు. పెద్దలు జోక్యం చేసుకుని.. వివాహేతర సంబంధాన్ని వదులుకోవాలని సూచించినా పద్ధతి మార్చుకోలేదు. ఎలాగైనా తన కాపురాన్ని చక్కదిద్దుకోవాలని భావించిన సరస్వతి తనకు న్యాయం జరిగేలా చూడాలని ఉపాధ్యాయ, మహిళా సంఘాల ప్రతినిధులతోపాటు రాజకీయ నాయకులను కలిసి గోడు వెల్లబోసుకుంది. విషయం తెలుసుకున్న గౌరీశంకర్ ఆగ్రహంతో ఊగిపోయాడు. శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉన్న సరస్వతిని ఇష్టానుసారంగా చితకబాదాడు. తనకు భర్త నుంచి ప్రాణహాని ఉందని బాధితురాలు ఉపాధ్యాయసంఘాల నాయకులతోపాటు జెడ్పీటీసీ తిప్పయ్య సహకారంతో శుక్రవారం రాత్రి ఉరవకొండ పోలీసుస్టేషన్లో ఎస్ఐ జనార్దన్నాయుడుకు ఫిర్యాదు చేసింది. -
వైఎస్సార్సీపీ నేత హత్యకు కుట్ర?
అనంతపురం సెంట్రల్: కనగానపల్లి మండలం సింగిల్ విండో మాజీ ఉపాధ్యక్షుడు, వైఎస్సార్సీపీ నాయకుడు ముత్యాలు అలియాస్ పైలెట్ ముత్యాలు హత్య కుట్ర ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అజ్ఞాత వ్యక్తి అప్రమత్తం చేయడంతో ముప్పు తప్పింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. రాప్తాడు నియోజకవర్గంలో అలజడి సృష్టిం చేందుకు మంత్రి పరిటాల వర్గం హత్యా రాజకీయాలకు తెరలేపుతోందనే చర్చ ఎప్పటి నుంచో సాగుతోంది. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి హత్యకు కుట్ర జరిగినవిషయం కలకలం రేపుతోంది. కనగానపల్లి మండలం సింగిల్విండో మాజీ ఉపాధ్యక్షుడు, కోనాపురం గ్రామానికి చెందిన ముత్యాలు హత్యకు రూ.10 లక్షల సుపారీ ఇచ్చి దుండగులను ఉసిగొల్పారు. దీని వెనుక మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్, ఆమె సోదరుడు బాలాజీతో పాటు టీడీపీ నాయకులు రవీంద్ర, లవకుమార్లు ఉన్నట్లు ముత్యాలు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కనగానపల్లి మండలం చంద్రాచర్ల గ్రామంలో రెండు వారాల క్రితం టీడీపీ నాయకుని కుమార్తె అదే గ్రామానికి చెందిన మరో టీడీపీ నాయకుని కుమారునితో వెళ్లిపోయింది. ఇతర ప్రాంతాలకు వెళ్లి రిజిష్టర్ వివాహం చేసుకున్నారు. ఇరువురి కులాలు వేరు కావడంతో యువతి తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. పరువు హత్య చేయడానికి పథకం రచించారు. రెండు వారాల నుంచి గాలిస్తున్నా వారి ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో మంత్రి సునీత సోదరుడు బాలాజీని ఆశ్రయించినట్లు సమాచారం. సదరు ప్రేమజంటకు వైఎస్సార్సీపీ నాయకుడు ముత్యాలు ఆశ్రయం కల్పిస్తున్నట్లు అనుమానించారు. దీంతో తొలుత ముత్యాలను హత్య చేస్తే వారే బయటకు వస్తారని భావించి అదే మండలానికి చెందిన పాత నేరస్తుడు, టీడీపీ నాయకునికి రూ.10 లక్షలు సుపారీ ఇచ్చినట్లు ముత్యాలుతో పాటు అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అప్రమత్తం చేసిన అజ్ఞాత వ్యక్తి హత్యకు జరుగుతున్న కుట్రను ఓ అజ్ఞాత వ్యక్తి ముత్యాలుకు చేరవేశాడు. నిన్ను హత్య చేయాలనే కుట్ర జరుగుతోందని, బయటకు రావద్దని సూచించాడు. మరికొంత సమాచారం కూడా బాధితునికి చేరవేశాడు. అయితే సదరు అజ్ఞాత వ్యక్తి చెప్పిన విధంగానే ఈ నెల 27న కొంతమంది మారణాయుధాలతో పోలీసులకు పట్టుపబడినట్లు తెలిసింది. రెండు రోజుల పాటు అనంతపురం పోలీసులే నిందితులను కస్టడీలో ఉంచుకొని విచారించినట్లు సమాచారం. అనంతరం కేసు బయటకు పొక్కకుండా ధర్మవరం పోలీసులకు అప్పగించినట్లు చర్చ జరుగుతోంది. కేసును తప్పుదోవ పట్టించడానికి నేరుగా ఓ ప్రజాప్రతినిధి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పోలీసులు ఈ హత్య కుట్ర సమాచారాన్ని బయటకు చెప్పడం లేదని సమాచారం. రక్షణ కల్పించండి నా హత్యకు కుట్ర జరిగింది. దీని వెనుక పరిటాల శ్రీరామ్, బాలాజీ, టీడీపీ నాయకులు రవీంద్ర, లవకుమార్లు ఉన్నట్లు తెలిసింది. నాకు సంబంధం లేని కేసులోకి నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తా. కుట్ర ఉదంతాన్ని వివరించడంతో పాటు రక్షణ కల్పించాలని మానవహక్కుల కమిషన్ను ఆశ్రయించా. – ముత్యాలు, వైఎస్సార్సీపీ నాయకుడు, కోనాపురం, కనగానపల్లి మండలం నేను సెలవులో ఉన్నా హత్యకు కుట్రపై నాకు ఎలాంటి సమాచారం లేదు. నేను సెలవులో ఉన్నా. దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు కానీ, అనంతపురం నుంచి ఇక్కడికి తరలించినట్లు కానీ తెలియదు. – వెంకటరమణ, డీఎస్పీ, ధర్మవరం -
అత్తామామలపై హత్యాయత్నం
అనంతపురం ధర్మవరం అర్బన్: భూ తగాదాల నేపథ్యంలో అత్తమామలపై మేనల్లుడు కొడవలితో హత్యాయత్నం చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు.. ధర్మవరం పట్టణంలోని గుట్టకిందపల్లిలో నివాసముంటున్న దాసరి నారాయణస్వామి, అలివేలమ్మ దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నారాయణస్వామి తండ్రి యల్లప్పకు ప్రభుత్వం కుణుతూరు పొలంలో 3.15ఎకరాల భూమి మంజూరు చేసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నారాయణస్వామి తన అక్క కపాడం సాలమ్మ కుమారుడు కపాడం శివయ్యకు రూ.2.80 లక్షలకు అమ్మాడు. కాగా నారాయణస్వామి బ్యాంకులో తీసుకున్న రుణం మాఫీ అవుతుందని, అది వర్తించాక భూమిని రిజిష్టర్ చేయిస్తానని చెప్పగా శివయ్య అందుకు అంగీకరించాడు. అనంతరం వారి మధ్య మనస్పర్థలు రావడంతో శివయ్యకు భూమిని రిజిస్ట్రేషన్ చేయించలేదు. ఈ భూమి విషయంపై పలుమార్లు గొడవ పడ్డారు. ఆదివారం ఉదయం దాసరి నారాయణస్వామి, భార్య అలివేలమ్మ తోటలో పాలు పితుకుతుండగా కపాడం శివయ్య కొడవలితో వెళ్లి అత్త దాసరి అలివేలమ్మపై దాడి చేసి హత్యాయత్నం చేశాడు. గమనించిన నారాయణస్వామి అడ్డుపడగా అతనిపై కూడా దాడి చేశాడు. వారి కేకలు విన్న స్థానికులు అక్కడికి రాగానే శివయ్య పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన నారాయణస్వామి, అలివేలమ్మలను బంధువులు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ వైద్యులు చికిత్సలు చేసి మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఓ తండ్రి అమానుషం
కర్నూలు ,ఆదోని: ఓ కసాయి కన్నతండ్రి అనుమానపు రాక్షసి ఓ యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. ఎవరినో ప్రేమించిందనే కక్షతో కన్నకూతురు అంజలి (17)ని వెంటాడి కత్తితో పొడిచి హతమార్చేందుకు యత్నించాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ చికిత్స పొందుతోంది. శుక్రవారం రాత్రి కర్నూలు జిల్లా ఆదోనిలో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి తల్లి రంగమ్మ, మేనత్త లక్ష్మీ, సోదరులు కల్యాణ్, ఈశ్వర్, టూటౌన్ ఎస్ఐ మస్తాన్ వలీ అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆదోని పట్టణంలోని అంబేడ్కర్నగర్లో నివాసముంటున్న అంజలికి శుక్రవారం సాయంత్రం ఫోన్ వచ్చింది. ఇంట్లోనే ఉన్న తండ్రి జహంగీర్ అలియాస్ జానీ ఫోన్ తీశాడు. ఓ వ్యక్తి హలో అనడంతో ఫోన్ కట్చేసి ఇంట్లోనే ఉన్న అంజలిని నిలదీశాడు. తనకు ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవని చెప్పినప్పటికీ.. అలాంటిదేమీ లేకపోతే ఎవరో అబ్బాయి ఫోన్ ఎందుకు చేశాడంటూ కర్రతో ఇష్టానుసారం కొట్టాడు. ఆ సమయంలో తల్లి రంగమ్మ, ముగ్గురు సోదరులు ఇంట్లో లేరు. దెబ్బలకు తాళలేక అంజలి శంకర్నగర్లో ఉన్న మేనమామ దుర్గ ఇంటికి వెళ్లింది. అయితే ఆయన లేడు. దీంతో మేనమామ భార్య లక్ష్మీతో జరిగిన విషయం చెప్పింది. తాను మాట్లాడతానంటూ ఆమె బాధితురాలిని ఓదార్చే యత్నం చేస్తుండగానే కత్తితో వెళ్లిన జానీ విచక్షణారహితంగా అంజలిని పొడిచాడు. అడ్డువచ్చిన లక్ష్మీని లాగేశాడు. దీంతో ఆమెకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. వీధిలో ఉన్నవారంతా పరుగెత్తుకొచ్చి ఆమెను రక్షించారు. జనం రావడంతో జానీ పరారయ్యాడు. అప్పటికే ఆమె ఒంటిపై 12 చోట్ల కత్తిపోట్లు పడ్డాయి. ఒంటినిండా కత్తిపోట్లతో రక్తమోడిన అంజలి అక్కడే కుప్పకూలింది. వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. తాగుడుకు బానిసైన తన భర్త జానీకి మానవత్వం లేదని, ఏ పాపం ఎరుగని కూతురుపైనే కత్తితో పొడిచి హతమార్చేందుకు యత్నించాడంటూ భార్య రంగమ్మ కన్నీరు మున్నీరుగా విలపించింది. టూటౌన్ ఎస్ఐ మస్తాన్వలి ఆస్పత్రికి వెళ్లి ఘటనపై విచారణ చేపట్టారు. బాధితురాలి తల్లి రంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. -
నడిరోడ్డుపై హత్యాయత్నం
సైదాబాద్: మొన్న ఎర్రగడ్డలో మాధవిపై దాడి చేసిన మనోహరాచారి... నిన్న అత్తాపూర్లో రమేష్ను నరికిచంపిన కిషన్, మల్లేష్... తాజాగా ఆదివారం రాత్రి సైదాబాద్లో ఆటోడ్రైవర్ అర్జున్పై హత్యాయత్నం... నగరంలో వరుసపెట్టి నడిరోడ్డుపై జరిగిన దారుణాలివి. పాత కక్షల నేపథ్యంలో ఆటో డ్రైవర్పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దాడి దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. గతంలో జరిగిన రెండు ఉదంతాల మాదిరిగానే అర్జున్ విషయంలోనూ స్థానికులు సరైన రీతిలో స్పందించకుండా చోద్యం చూశారు. ఈ ఘటన పూర్వాపరాలివీ... ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి గుడిసెల్లో నివసించే గోపి, మహేష్, సభావత్ లక్ష్మణ్, పవన్ ఫంక్షన్ హాళ్లలో క్యాటరింగ్ పనులు చేస్తుంటారు. వారం రోజు క్రితం ఓ ఫంక్షన్ హాల్లో పని చేసిన వీరు అర్ధరాత్రి వేళ చంపాపేట్ నుంచి తమ ఇళ్లకు వెళ్లేందుకు మాదన్నపేటకు చెందిన అర్జున్ ఆటోను మాట్లాడుకున్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత కిరాయి విషయంలో వీరి మధ్య ఘర్షణ జరిగింది. అర్జున్ ఎక్కువ మొత్తం డిమాండ్ చేయడంతో వీరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నా ఆపై ఎవరికి వారు తమ తమ ఇళ్ళక వెళ్లిపోయారు. ఆదివారం రాత్రి అర్జున్ ఓ ప్రయాణికుడిని భానునగర్లో దించేందుకు వెళుతుండగా భానునగర్ సమీపంలో వీరు నలుగురు డ్రైవింగ్ సీటులో ఉన్న అర్జున్ గుర్తించి ఆటోను ఆపారు. అతడిని ఆటోలోంచి బయటికి లాగి దాడికి పాల్పడ్డారు. రోడ్డుపై పడేసి కాళ్ళు, చేతులతో విచక్షణారహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా సమీపంలో ఉన్న రాళ్లు తెచ్చి అర్జున్ తల, మెడ, వీపు భాగాల్లో ఒకరి తరా>్వత ఒకరు కొట్టారు. ఆ సమయంలో ఆటోలో ఉన్న వ్యక్తి అక్కడి నుంచి పారిపోగా... రోడ్డుపై వెళ్తున్న వాహనచోదకులు చూస్తూ కూడా పట్టనట్లు వ్యవహరించారు. దాదాపు పది నిమిషాల పాటు అర్జున్పై దాడి జరుగుతున్నా ఎవరూ వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ దాడి దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వారు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత తీవ్రంగా గాయపడిన బాధితుడు తేరుకుని తానే ఫోన్ తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు వచ్చేవరకు రోడ్డు పైనే పడిపోయి ఉన్న అర్జున్ను కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆపై సైదాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. సోమవారం నలుగురినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ మోహన్రావు తెలిపారు. -
చిత్తూరులో వ్యక్తిపై హత్యాయత్నం
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో పూలమార్కెట్కు చెందిన మోహన్ అనే వ్యక్తిపై సోమవారం రాత్రి హత్యాయత్నం జరిగింది. చవితిను పురస్కరించుకుని బజారువీధిలో ఏర్పాటు చేసిన వినాయకుడిని నిమజ్జనం చేయడానికి మోహన్ అతని అనుచరులు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో పలమనేరు రోడ్డులోని కట్టెలదొడ్డికి చెందిన శరవణ అనే వ్యక్తి ఊరేగింపులో పాల్గొని గొడవ చేశాడు. దీనిపై మోహన్, శరవణల మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో శరవణ తన వద్ద ఉన్న కత్తి తీసుకుని మోహన్ తలను నరకడానికి ప్రయత్నించాడు. ఇంతలో అక్కడే డ్యూటీలో ఉన్న సీఐ మోహన్ను పక్కకు తోసేయడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాగా శరవణ టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాని వద్ద ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడని మోహన్ పోలీ సులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఇతను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు గాయపడ్డ వ్యక్తి మాజీ ఎమ్మెల్యే సీకే బాబు అనుచరుడు కావడంతో ఈ ఘటనకు రాజకీయ రంగు పులుముకుంది. -
రాడ్లు, కత్తులతో బీభత్సం
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్: ఏలూరు తంగెళ్ళమూడి కబాడీగూడెంలో ఒక వ్యక్తిపై ఐదుగురు రాడ్లు, కత్తులతో దాడి చేసి హత్యచేసేందుకు ప్రయత్నించారు. నడిరోడ్డుపై సినీ ఫక్కీలో దాడికి తెగబడడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. తలపై తీవ్ర గాయాలు కావటంతో వెంటనే బాధితుడిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి, పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య చికిత్సనిమిత్తం గుంటూరు తరలించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి వద్ద బాధితుడి బంధువులు, కుటుంబ సభ్యులు చేరటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కబాడీగూడెంలో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ప్రజలు భయాం దోళనలకు గురవుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏలూరు తంగెళ్ళమూడి 50వ డివిజన్ కబాడీగూడెంకు చెందిన కాశీ సత్యనారాయణ అలియాస్ సతీష్, అలియాస్ కాశీ (28)పై గురువారం రాత్రి 8గంటల ప్రాంతంలో అతని ఇంటివద్దనే ఐదుగురు వ్యక్తులు రాడ్లు, కత్తులతో తీవ్రంగా నరికారు. అక్కడే ఉన్న రాళ్ళతో తలపైనా, చాతీపైనా కొట్టటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే సతీష్ను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. తలపై కత్తులతో నరకటంతో తీవ్రంగా రక్తస్రావం కావటంతో పరిస్థితి విషమంగా మారింది. వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు తరలించారు. కాశీ సత్యనారాయణ అలియాస్ సతీష్పై పాతకక్షల నేపథ్యంలోనే హత్య చేసేందుకు కుట్ర చేశారని చెబుతున్నారు. సతీష్పై కత్తులు, రాడ్లతో దాడి చేసిన వారిలో మున్నుల సీతయ్య, మున్నుల సాయి, మున్నుల శివ, మున్నుల మూర్తి, మున్నుల వెంకన్న అనే వ్యక్తులు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే గతంలో రౌడీషీటర్ జొన్నకూటి రాటాలుతో గొడవలు జరగటం, కొంత వివాదం నేపథ్యంలో అదను కోసం వేచిఉన్నట్లు సమాచారం. దీంతో గురువారం ఉదయం నుంచి కొబ్బరి శివ, జొన్నకూటి రాటాలు సతీష్కు బాగా మద్యం తాగించారని తెలుస్తోంది. మద్యం సేవించి ఉన్న సతీష్పై దాడి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇవ్వటంతో ఐదుగురు వ్యక్తులు రాడ్లు, కత్తులతో హత్యాయత్నం చేశారని పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే ఏలూరు టూటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు.కాశీ సత్యనారాయణపై హత్యాయత్నంతో కబాడీగూడెం ప్రాంతంలోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని భయపడుతున్నారు. పోలీసులు తమకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఇరు వర్గాలు దాడులకు తెగబడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని మాజీ మేయర్ కారే బాబూరావు పోలీసులను కోరారు. -
పాశవిక హత్యాయత్నం !
జిల్లాలోని హనుమాన్జంక్షన్లో ఓ బ్యూటీషియన్పై జరిగిన దారుణ హత్యాయత్నం తీవ్ర కలకలం సృష్టించింది. నిందితుడు కత్తితో కర్కశంగా ఆమె చేతులు, మెడ కోశాడు. కాళ్లను వైర్తో కట్టేసి ఊడిపోకుండా ట్యాగ్లు వేశాడు. ముఖాన్ని కవర్తో ముసుగు వేసి పాశవికంగా దాడికి పాల్పడ్డాడు. ఇరుగుపొరుగు వాళ్లకు కేకలు వినిపించకుండా మత్తు ఇంజక్షన్ ఇచ్చి విచక్షణారహితంగా కత్తిపోట్లు పొడిచాడు. తీవ్ర గాయాలతో బాధితురాలు మృత్యువుతో పోరాడుతోంది. హనుమాన్జంక్షన్ రూరల్ : హనుమాన్ జంక్షన్లో ఓ బ్యూటీషియన్పై జరిగిన దారుణ హత్యాయత్నం తీవ్ర కలకలం సృష్టించింది. కాళ్లు కట్టేసి, చేతులను కత్తితో అత్యంత క్రూరంగా నరికి వేయటం, ముఖానికి పూర్తిగా కవర్ చుట్టి వేసిన అఘాయిత్యం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. ఇరుగుపొరుగు వాళ్లకు ఆమె కేకలు వినిపించకుండా మత్తు ఇంజక్షన్ ఇచ్చి పైశాచికంగా హత్యాయత్నం చేశారు. మహిళ శరీరంపై విచక్షణరహితంగా కత్తిపోట్లు పొడిచి శాడిజాన్ని చూపించారు. హత్యాయత్నం చేసిన వారు పరారైన తర్వాత బాధితురాలు రక్తపు మడుగులో దాదాపు 36 గంటల పాటు మృత్యువుతో పోరాడింది. వివరాల్లోకి వెళ్లితే.. రాజమండ్రికి చెందిన పల్లె పద్మ, సూర్యనారాయణలకు సుమారు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. కొన్నేళ్ల పాటు ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉన్న వీరు ఆ తర్వాత జంక్షన్ సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో సూర్యనారాయణకు ఉద్యోగం రావటంతో ఇక్కడకు మకాం మార్చారు. పద్మ కూడా ఏలూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చూసుకుంది. అప్పటి వరకూ సాఫీగానే సాగిన వీరి సంసారంలో మనస్పర్ధలు మొదలయ్యాయి. దీంతో భర్తతో విభేదించిన పద్మ కొద్దికాలంగా ఏలూరులోని వెన్నవల్లి వారి వీధికి చెందిన బత్తుల నూతనకుమార్ విక్టర్ అనే వ్యక్తితో సహ జీవనం చేస్తోంది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ బ్యూటీపార్లర్లో పద్మ బ్యూటీషియన్గా పని చేస్తుండగా, నూతనకుమార్ ఓ ప్రైవేట్ బ్యాంకులో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్నాడు. ఇరవై రోజుల క్రితం తారకరామ కాలనీ సమీపంలోని ఓ ఇంట్లో వీళిద్దరూ కలిసి అద్దెకు దిగారు. ఈ నెల 23వ తేదీ రాత్రి పద్మ, నూతనకుమార్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని భర్త దగ్గరే ఉంటున్న తన పెద్ద కూతురుతో ఫోన్లో పద్మ ఆ రాత్రే చెప్పింది. ఆ తర్వాత నుంచి ఆమె సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ రావటంతో ఆందోళన చెందిన కుమార్తె తన తండ్రి సూర్యనారాయణకు విషయం చెప్పింది. దీంతో ఇద్దరూ పద్మ అద్దెకు ఉంటున్న ఇంటి వద్దకు శనివారం ఉదయం వచ్చి తలుపులు తీయటంతో రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. జంక్షన్ పోలీసులకు సమాచారం అందించటంతో హుటాహుటిన 108 అంబులెన్స్లో పద్మను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో దృశ్యం అత్యంత క్రూరంగా ఉండటం పోలీసులను సైతం విస్మయానికి గురి చేసింది. ఒంటిపై దుస్తులు తీసివేసి కత్తితో కర్కశంగా చేతులు, మెడ నరికివేయటం, కాళ్లు రెండు వైర్తో కట్టేసి, మళ్లీ ఆ వైర్ ఊడిపోకుండా ట్యాగ్లు వేయటం, ముఖానికి కవర్తో ముసుగు వేయటం హత్యాయత్నానికి పాల్పడిన దుండగుల పైశాచికత్వాన్ని తెలియజేస్తున్నాయి. పద్మ పడి ఉన్న గదిలో ఇంజక్షన్లు, సిరంజన్లు, మందు బాటిళ్లు పడి ఉన్నాయి. చుట్టుపక్కల నివాసం ఉంటున్న వాళ్లకు ఆమె అరుపులు వినిపించకూడదనే ఉద్దేశ్యంతో మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బహుశా 24వ తేదీ ఉదయమే హత్యాయత్నం జరిగి ఉండవచ్చని ఘటనాస్థలిలో ఎండిపోయిన రక్తపు మరకలను బట్టి పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ హత్యాయత్నంపై జంక్షన్ సీఐ వైవీవీఎల్. నాయుడు, ఎస్ఐ వి.సతీష్ ముమ్మర దర్యాప్తు చేపట్టారు. పద్మతో కలిసి సహజీవనం చేస్తున్న ఏలూరుకు చెందిన బత్తుల నూతనకుమార్ విక్టర్పైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అతను పరారీలో ఉండటంతో ఆ అనుమానానికి మరింత బలం చేకూరింది. వీళ్లిద్దరూ సహ జీవనం ప్రారంభించిన తర్వాత నూతనకుమార్ వ్యవహారంతో విసుగు చెందిన పద్మ గతంలో జంక్షన్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. కాగా, అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పద్మ ఇచ్చే వాంగ్మూలం ఆధారంగానే నిందితుడిని గుర్తించేందుకు ఆస్కారం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. -
టిఫిన్ డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు..
తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: అమలాపురం చిన్న వంతెన వద్ద గల ఆమని హోటల్ యాజమాని నల్లా సాయిబాబుపై ఓ వ్యక్తి రౌడీయిజం చేయడమే కాకుండా, హత్యాయత్నం చేశాడు. అమలాపురం ఉప్పరకాలనీకి చెందిన కోసూరి ప్రసాద్ అనే వ్యక్తి రోజూ ఆ హోటల్కు వచ్చి టిఫిన్లు తిని డబ్బులు ఇవ్వకుండా ఘరానాగా వెళ్లిపోతున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం ప్రసాద్ హోటల్కు వచ్చి టిఫిన్ తిని డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతున్నప్పుడు హోటల్ యాజమాని సాయిబాబు డబ్బులు ఇవ్వమని అడిగారు. నేను లోకల్...నన్నే డబ్బులు అడుగుతావా? అంటూ రౌడీయిజం చేశాడు. అక్కడే ఉన్న స్థానిక మార్కెట్కు చెందిన అమలదాసు గోవిందు అతడిని వారించాడు. అయినా ప్రసాద్ హోటల్ యాజమానిని చంపేస్తానంటూ బెదిరించాడు. అంతటితో ఆగకుండా తన జేబులోంచి బ్లేడ్ తీసి సాయిబాబు పీక కోసేందుకు ప్రయత్నించాడు. సాయిబాబు త్రుటిలో తప్పించుకున్నా అతని ఎడమ బుగ్గ, పెదవి చీరుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. అలాతప్పించుకున్న సాయిబాబుపై బ్లేడ్తో దాడి చేసేందుకు ఇంకా ప్రయత్నిస్తుండడంతో స్థానికులు అతడిని అదుపు చేశా రు. తీవ్ర రక్తస్రావం అదుతున్న సాయిబాబును తక్షణమే అత్యవర వైద్యం కోసం అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుడైన హోటల్ యాజమాని సాయిబాబు ఫిర్యాదు మేరకు ప్రసాద్పై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ శ్రీరామ కోటేశ్వరరావు తెలిపారు. కత్తులతోనే కాదు బ్లేడ్తో దాడి చేసినా రౌడీయిజం, హత్యాయత్నానికి పాల్పడినట్టేనని సీఐ శ్రీరామ కోటేశ్వరరావు అన్నారు. ఎస్సై పి.విజయశంకర్ దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. -
భర్తపై హత్యాయత్నం.. ఆపై ఆత్మహత్య
పశ్చిమగోదావరి, పాలకోడేరు: భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని, పట్టించుకోవడం లేదని అనుమానం పెంచుకుంది. అర్ధరాత్రి అతడు నిద్రపోతున్న వేళ కత్తితో దాడి చేసి పలుసార్లు పొడిచింది. భర్త మరణించాడని భావించి ఆపై ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గురువారం రాత్రి పాలకోడేరు మండలం గొరగనమూడిపాలెంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. గొరగనమూడిపాలెంకు చెందిన బొక్కా తులసి (55), బొక్కా సత్యనారాయణ (60) దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పిల్లలందరూ మంచి ఉద్యోగాల్లో వివిధ చోట్ల స్థిరపడ్డారు. ఆ దంపతులు మాత్రం గొరగనమూడిపాలెంలో కాపురం ఉంటున్నారు. తులసికి ఎప్పటి నుంచో భర్త సత్యనారాయణపై అనుమానం ఉంది. తులసి కొన్నాళ్లుగా అల్సర్తో బాధపడుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న తనను భర్త పట్టించుకోవడం లేదని, ఇతరులతో వివాహేతర సంబంధం ఉందని ఆమె అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో సత్యనారాయణ నిద్రపోయిన తర్వాత కర్రతో అతడి తలపై మోది కత్తితో శరీరంపై పలుచోట్ల పొడిచేసింది. భర్త చనిపోయాడని భావించిన అనంతరం పక్కగదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే సత్యనారాయణ తీవ్ర గాయాలతో రక్తమోడుతూ బయటకు వచ్చి పొరుగు వ్యక్తి సాయంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. సత్యనారాయణ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న పాలకోడేరు పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. హత్యాయత్నం, ఆత్మహత్యపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పాలకోడేరు ఎస్సై వి.వెంకటేశ్వరరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎంత వయసు వచ్చినా దాంపత్య జీవితంపై అవగాహన లేక పోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని సైకాలజిస్ట్ డాక్టర్ బి.చలపతిరావు వ్యాఖ్యానించారు. -
కుటుంబ కలహాలతో సవతి తల్లిపై హత్యాయత్నం
నల్లబెల్లి జయశంకర్ జిల్లా : కుటుంబ కలహాలతో సవతి తల్లిపై కుమారుడు పెట్రోలు పోసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బూర సాంబయ్య తన మొదటి భార్య 20 ఏళ్ల క్రితం చనిపోగా విజయను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కుమారుడు రాజుకుమార్ బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వెళ్లి జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం రాజుకుమార్ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో ఇంటి కరెంట్ బిల్లు చెల్లింపు విషయంలో మంగళవారం కుటుంబంలో గొడవ జరగగా అతడు విజయ–సాంబయ్య దంపతులపై దాడి చేసి గాయపరిచాడు. కాగా వారు పోలీసులు ఆశ్రయించారు. దీంతో ఆగ్రహనికి గురైన రాజుకుమార్ ప్లాస్టిక్ బాటిల్లో పెట్రోలు తీసుకొచ్చి ఇంటి ముందున్న సవతితల్లిపై పోసి నిప్పంటిం చేందుకు యత్నించాడు. అప్రమత్తమైన ఆమె ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగెత్తింది. ఆగ్రహంతో ఊగిపోయిన రాజ్కుమార్ ఇంటి ఆవరణలో ఉన్న తండ్రి ద్విచక్రవాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో దహనమైంది. దీంతో బాధితులు మళ్లీ పోలీసులను ఆశ్రయించారు. -
కులాంతర వివాహం చేసుకుందని..
బెజ్జంకి(సిద్దిపేట): కులాంతర వివాహం చేసుకుందని చెల్లెలిపై ఓ అన్న కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వీరాపూర్ లో జరిగింది. గ్రామానికి చెందిన చిట్టం పెల్లి మౌనిక 12 రోజుల క్రితం మండలంలోని తోటపల్లికి చెందిన తన డిగ్రీ క్లాస్మేట్ సొల్లు సాయిని ఆర్య సమాజ్లో ప్రేమ వివాహం చేసుకుంది. ఆపై తమకు రక్షణ కల్పించాలని ఆ జంట పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ కోసం శనివారం బెజ్జంకి పోలీస్స్టేషన్కు రావల్సిన మౌనికతో సోదరుడు నాగరాజు ఘర్షణ పడ్డాడు. పరువు తీస్తున్నావంటూ కత్తితో దాడికి పాల్పడటంతో ఆమె వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నాగరాజు పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న మౌనికను తాతయ్య, స్థానికులు కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తాత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఈ పిల్లలు హత్యాయత్నం చేశారట!
యోగీ ఆదిత్యనాథ్ పాలన ఉత్తర ప్రదేశ్ లో దళిత కుటుంబాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పట్టుమని పన్నెండేళ్ళు కూడా నిండని తమ పిల్లలు కేవలం దళితులు అయిన నేరానికి గత రెండు నెలలుగా జైళ్ళలో మగ్గిపోతున్నారని దళిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అరెస్టు చేసే ముందు నువ్వు చమర్వా? లేక జాతవా? అని ప్రశ్నించి మరీ అరెస్టు చేసినట్టు వారారోపిస్తున్నారు. ‘‘నా కొడుకు సచిన్. సెయింట్ దేవ్ఆశ్రమంలో చదువుకొంటున్నాడు. కోచింగ్ క్లాసుల గురించి తెలుసుకునేందుకు బయటకెళ్ళిన 15 ఏళ్ళ నా కొడుకుని పట్టుకుని జైల్లో పెట్టారు.’’సచిన్ తండ్రి 62 ఏళ్ళ ధర్మవీర్ సింఘ్ ఆవేదన ఇది. ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసుల్లో ఎటువంటి విచారణ లేకుండా నేరుగా అరెస్టులు చేసే అధికారాన్ని నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా దళిత సంఘాల నేతృత్వంలో ఏప్రిల్ 2 న ఇచ్చిన భారత్ బంద్ పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో చెలరేగిన హింసలో పన్నెండు పదమూడేళ్ళ బాలురు ముగ్గురిపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పదిహేను సెక్షన్లకింద వివిధ నేరాలు మోపి, గత రెండు నెలలుగా అమాయకులైన వారిని అన్యాయంగా జైల్లో నిర్బంధించినట్టు ఆ కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. భారత్ బంద్ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో ప్రధానంగా ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్లలో హింస చెలరేగింది. అది పోలీస్ ఫైరింగ్కి దారితీసిన విషయం తెలిసిందే. మా పిల్లలు చేసిన నేరమల్లా దళితులుగా పుట్టడమే నంటాడు ధర్మవీర్. చదువుకొని మమ్మల్నాదరిస్తాడనుకుంటే ఇలా జైల్లో మగ్గిపోతున్నాడని ఆవేదన చెందుతున్నారు ధర్మవీర్, అతని భార్య రామేశ్వరి. బాలనేరస్తులకోసం కేటాయించిన జువైనల్ హోంలో కాకుండా మీరట్ జైల్లో పెద్ద పెద్ద నేరగాళ్ళ సరసన సచిన్ని ఉంచారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సచిన్ ఆధార్కార్డుని, స్కూల్ స్టేట్మెంట్ని పోలీసులకు చూపించినా జువైనల్ హోంకి పంపేందుకు వాళ్ళు నిరాకరించారని ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్లోని మీరట్ జిల్లా కలియాగరి, సరైకాజి దళితవాడల్లో కుటుంబాలను ఈ అరెస్టులు కలవరపెడుతున్నాయి. సరైకాజికి చెందిన రోష్ని కొడుకు పన్నెండేళ్ళ అజయ్ది కూడా ఇదే కథ. ఐదో తరగతి చదువుతున్న అజయ్ని సైతం పోలీసులు వదిలిపెట్టలేదు. ఏప్రిల్ 2వ తేదీన మందులు తెస్తానని తల్లికి చెప్పి వెళ్ళిన అజయ్ రెండు రోజులు ఏమయ్యాడో తెలియదు. వికలాంగురాలైన అజయ్ తల్లి రోష్ని చివరకు తన కొడుకు ఆచూకీ తెలుసుకుని జైలుకెళ్లింది. అజయ్ని సైతం అరెస్టు చేసే ముందు నువ్వు చమర్వా అని ప్రశ్నించినట్టు రోష్ని వివరించారు. 12 ఏళ్ళు కూడా నిండని నా కొడుకు ఇంత పెద్ద నేరాలకు ఎలా పాల్పడతాడు? అంటూ ఆమె ప్రశ్నించారు. చేయని నేరానికి చిన్న పిల్లలను అరెస్టు చేయడమే కాకుండా, వారిని కలవడానికెళ్ళిన వారిని కూడా జైల్లో పడేస్తామని బెదిరిస్తున్నట్టు ఆమె ఆరోపించారు. పై అధికారులనుంచి తమకు ఆదేశాల్లేవంటూ రెండు నెలలుగా చిన్నపిల్లలను వదలిపెట్టడంలేదన్నారామె. కలియాగరీ కి చెందిన 35 ఏళ్ళ సుందరి, నానక్ చంద్ల పన్నెండేళ్ళ కొడుకు అభిషేక్ ని సైతం ఏప్రిల్ 2వ తేదీన చౌదరి చరన్ సింఘ్ యూనివర్సిటీ దగ్గర మంచినీళ్ళు తాగుతున్నవాడిని తాగుతున్నట్టే అరెస్టు చేసారు. ఈ బాలుడిని కూడా అరెస్టు చేసే ముందు కులం గురించి ఆరాతీసారు. ప్రస్తుతం జువైనల్ జైల్లో పెట్టినా లాకప్లోనే తన కొడుకుని రోజూ కొట్టేవారనీ అభిషేక్ తల్లిదండ్రులు చెప్పారు. కులం అడిగి మరీ తనను అరెస్ట్ చేసినట్టు అభిషేక్ తల్లిదండ్రులకు వివరించాడు. ఐపిసి 147, 149, 332, సెక్షన్ 353, 336, 435, చివరికి హత్యాయత్నం 307, సెక్షన్ 395 దోపిడీ నేరం, శాంతిని భగ్నం చేసినవారిపై పెట్టే 504, సెక్షన్ 120(బి)కుట్ర, సెక్షన్ 427లకు తోడు తీవ్రమైన నేరారోపణలు సెక్షన్ 7, ఐపిసి 1932 యాక్టు, 1984(4) ప్రివెన్షన్ ఆఫ్ డామేజింగ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ లాంటి తీవ్రమైన నేరాలను ఈ ముగ్గురు మైనర్ బాలురపైనా మోపారు. అయితే ఎఫ్ఐఆర్లో మాత్రం వీరి వయస్సుని ఎక్కువగా చూపించి దాదాపు 15 రకాల సెక్షన్లకింద అందరిపైనా ఒకేరకమైన నేరాలను మోపడం ఈ కేసులోని డొల్లతనాన్ని బహిర్గతం చేస్తోందని వీరి తరపు న్యాయవాది సతీష్కుమార్ వాదిస్తున్నారు. -
ఈ రోజు దొరికావు చంపుతాను
ప్రొద్దుటూరు క్రైం : అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ కుమారుడు వైఎస్సార్సీపీ కార్యకర్తను చంపేందుకు పిడి బాకు తీసుకొని వెంటాడిన సంఘటన ఆదర్శ నగర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆదర్శకాలనీకి చెందిన తిరుపాలు కూలి పని చేసుకొని జీవనం సాగించేవాడు. అతని కుటుంబ సభ్యులతో పాటు వీధిలో చాలా మంది వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. గతంలో ఉన్న మనస్పర్థలను సాకుగా చూపి అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ కాకి తిరుపతమ్మ కుమారుడు సురేంద్ర వైఎస్సార్సీపీ కార్యకర్తలతో గొడవ పెట్టుకునేవాడు. తిరుపాలు, ప్రసాద్, పెంచలయ్యతో పాటు కొందరు యువకులు దారిలో నిల్చొని ఉన్నా ‘ నేను వస్తుంటే మీరు వెళ్లి పోవాలి.. లేదంటే చంపేస్తాను’ అని వారిని బూతులు తిడుతూ బెదిరించేవాడు. కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డికి చెందిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుండగా సురేంద్ర అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు వారు తెలిపారు. ఈ క్రమంలోనే పిడి బాకు తీసి అతను చంపుతానని బెదిరించాడన్నారు. పండుగ రోజు కావడంతో ఆ రోజు వారు స్టేషన్లో ఫిర్యాదు చేయలేదు. అప్పటి నుంచి వీరు భయ పడుతూ తిరిగే వారు. ఈ క్రమంలో మంగళవారం ఆదర్శకాలనీ సమీపంలోని గవిని దగ్గర ఉండగా సురేంద్ర అక్కడికి వచ్చి ‘ఇన్ని రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నావ్.. ఈ రోజు దొరికావు చంపుతాను ’ అంటూ తన వద్ద ఉన్న పిడి బాకు తీసి పొడవడానికి ప్రయత్నించగా తిరుపాలు ప్రాణ భయంతో పరుగులు తీశాడు. అయినా అతను కొంత దూరం వెంబడించాడు. తమను టార్గెట్ చేసి చంపేందుకు కాచుకొని ఉన్న కాకి సురేంద్రపై తగు చర్యలు తీసుకొని న్యాయం చేయాలని తిరుపాలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టు టౌన్ పోలీసులు తెలిపారు. -
యోగా టీచర్ హత్య కేసు నిందితుడిపై హత్యాయత్నం
సాక్షి, విశాఖపట్నం: యోగా టీచర్ హత్య కేసులో నిందితుడిపై హత్యాయత్నం జరిగింది. మర్రిపాలెం ‘వుడా’ లే అవుట్ లో శుక్రవారం అర్ధరాత్రి వెంకటరమణ అనే యోగ టీచర్ను ఇంట్లోనుంచి బయటకు పిలిచి నలుగురు దుండగులు రాడ్లతో కొట్టి హతమార్చిన విషయం విదితమే. ఈ కేసులో నిందితుడు కీలపర్తి వెంకట రమణపై ఆదివారం ఉదయం హత్యా యత్నం జరిగింది. కత్తులతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఆయన్ను పోలీసులు కేజీజీహెచ్కు తరలించారు. -
సహజీవనం చేస్తున్న మహిళపై అనుమానంతో..
సాక్షి, గుంటూరు: అనుమానం పెనుభూతమై తనతో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసేందుకు యత్నించాడో వ్యక్తి. ఈ సంఘటన గుంటూరుజిల్లా సత్తెనపల్లిలో జరిగింది. రామాంజనేయలు, అరుణలు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే ఆమెపై అనుమానం పెంచుకున్న రామాంజనేయులు ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఆమెను కత్తితో పొడిచి అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా వీరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నం!
భామిని: అధికార పార్టీ నాయకులు మరోసారి వైఎస్సార్సీపీ నాయకుడిపై దాడి చేశారు. తనపై హత్యాయత్నం చేశారని వైఎస్సార్సీపీ నాయకుడు అగతముడి శేషగిరి పోలీస్లకు సోమవారం ఫిర్యాదు చేశారు. శేషగిరి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం కొరమలో టీడీపీ నాయకులు శేషగిరి, అతని భార్య విశాలాక్షిపై దాడి చేశారు. వీరు కొత్తూరు ఆస్పత్రిలో వైద్య సేవలు పొంది ఇంటికి చేరిన సమయంలో మరోసారి వీరిపై దాడి చేశారు. వీరిని మళ్లీ కొత్తూరు ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు బత్తిలి ఏఎస్సై విశ్వనాథం కేసు నమోదు చేశారు. కాగా కొత్తూరు ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతున్న బాధితులను వైఎస్సార్సీపీ నాయకులు బత్తిలి సర్పంచ్ టింగ అన్నాజీరావు, పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు అగతముడి రఘుపతి నాయుడు పరామర్శించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కొరమలో పోలీస్ పికెటింగ్ వరుసగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో కొరమలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. పాతపట్నం సీఐ బి.వి.వి ప్రకాశరావు, బత్తిలి ఎస్సై ఎం.ముకుందరావు ఆధ్వర్యంలో పహారా ఏర్పాటు చేశారు. -
కాంగ్రెస్ నేతపై హత్యాయత్నం
ఇద్దరి అరెస్ట్ కేకే.నగర్ : పాండిచ్చేరి తిరుభువనం సమీపంలో కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో చొరబడి హత్యకు యత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుభువనం సమీపంలో కుచ్చిపాలయంకు చెందిన ముత్తువేల్ (40) తిరుభువనై డివిజన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. సోమవారం ముత్తువేల్ ఇంట్లో ఉన్న సమయంలో ఇద్దరు యువకులు అతని ఇంట్లోకి చొరబడి హత్య చేయడానికి యత్నించారు. వారి నుంచి ముత్తువేల్ పారిపోవడానికి యత్నించగా అతడిని వారు వెంబడించారు. వారిని అడ్డుకోవడానికి సోదరి కుమారుడు సంతోష్ను ఆ యువకులు కత్తులతో దాడి చేసి పారిపోయారు. సమాచారం అందుకుని తిరుభువనై పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. విషయం తెలిసి ముత్తువేల్ బంధువులు ఆందోళనకు దిగారు. తిరుభువనై పోలీసులు విచారణ జరిపారు. కదిరవన్ (23), కృపాకరన్ (23) అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని జరిపిన విచారణలో ముత్తుపై హత్యాయత్నం చేసింది తామేనని నేరం అంగీకరించడంతో వారిద్దరిని అరెస్ట్ చేశారు. -
లేడీ బాస్పై హత్యాయత్నం.. నిందితుడి అరెస్టు
తన మాజీ లేడీ బాస్ను గొంతు కోసి చంపేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అనిల్ పన్వర్ అలియాస్ కల్లూ (27) అనే వ్యక్తి ఇంతకుముందు ఫ్యాషన్ డిజైనర్ అయిన కావేరి లాల్ (27) వద్ద డ్రైవర్గా పనిచేసేవాడు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఆమె బోయ్ఫ్రెండుతో అసభ్యంగా ప్రవర్తించినందుకు అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. తీసేసిన తర్వాత కూడా అతడు నెల రోజుల జీతం ఇవ్వాలని ఆమెను డిమాండ్ చేశాడు. ఈనెల 14వ తేదీన కారు సరిగా పార్కింగ్ చేయాలన్న పేరుతో కావేరిలాల్ను పన్వర్ ఆమె ఇంటినుంచి బయటకు పిలిచి, తన బాకీ ఏమైందని అడిగాడు. ఆమె ఇవ్వడానికి నిరాకరించడంతో కత్తితో దాడి చేశాడు. దాంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం మాక్స్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు కత్తిని అక్కడే వదిలేసి పారిపోయాడు. అతడు ఎక్కడ ఉంటాడోనన్న అనుమానంతో పోలీసులు పలు ప్రాంతాల్లో గాలించారు. చివరకు అతడి ఏటీఎం లావాదేవీలపై కూడా కన్నేసి ఉంచారు. నిజాముద్దీన్ ప్రాంతంలోని ఒక నైట్ షెల్టర్లో ఉన్నట్లు విశ్వసనీయంగా సమాచారం అందడంతో అక్కడకు వెళ్లి అతడిని అరెస్టు చేశారు. పన్వర్కు పెళ్లయ్యి, ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు.