-
భూముల రక్షణకు ‘స్వామిత్వ’
న్యూఢిల్లీ: ‘గ్రామీణ ప్రజలకు ఆస్తి కార్డులను పంపిణీ చేసే ‘స్వామిత్వ’ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ఇది గ్రామీణ భారతాన్ని మార్చే విప్లవాత్మక కార్యక్రమం అని, ‘ఆత్మనిర్భర్ భారత్’ దిశగా కీలక ముందడుగు అని పేర్కొన్నారు. ఈ కార్డులను ఉపయోగించి పల్లె ప్రజలు బ్యాంకుల్లో రుణాలు పొందవచ్చన్నారు. అలాగే, దీంతో గ్రామస్తుల మధ్య భూ యాజమాన్యానికి సంబంధించిన ఆస్తి తగాదాలు తొలగిపోతాయన్నారు. ఈ ‘సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్(స్వామిత్వ)’ కార్యక్రమంలో వీడియో కాన్ఫెరెన్స్ విధానంలో ప్రధాని పాల్గొన్నారు. ఆస్తిపై యాజమాన్య హక్కు దేశాభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తుందని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు చెప్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ ఆస్తులకు సంబంధించి చట్టబద్ధమైన రికార్డులు ఉన్నవారు మూడింట ఒక వంతు మాత్రమేనని ప్రధాని వెల్లడించారు. ‘గ్రామాల్లోని యువత ఈ ప్రాపర్టీ కార్డులను హామీగా పెట్టి, స్వయం ఉపాధి కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవచ్చు. ఆస్తిపై చట్టబద్ధ హక్కును కలిగి ఉండడం వల్ల యువతలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. తద్వారా స్వావలంబన సాధించగలుగుతారు’ అన్నారు. ప్రజలు తమ ఆస్తులపై స్పష్టమైన యాజమాన్య హక్కులు కలిగి ఉండటం అవసరమని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్ టెక్నాలజీతో భూముల మ్యాపింగ్ చేయాలని యోచిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. ప్రసంగిస్తున్న సమయంలో ప్రధాని వెనుకవైపు ఆదివారం జయంతి ఉన్న సోషలిస్ట్ నేత జయప్రకాశ్ నారాయణ్, ఆరెస్సెస్ దిగ్గజం నానాజీ దేశ్ముఖ్ల ముఖచిత్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో ఆ మహనీయుల సిద్ధాంతాలను ప్రధాని వివరించారు. గ్రామాల్లోని ప్రజలు తరచు ఆస్తికి సంబంధించిన వివాదాల్లో చిక్కుకుపోతే.. వారే కాకుండా, సమాజమూ అభివృద్ధి చెందబోదని నానాజీ దేశ్ముఖ్ భావించేవారిని వివరించారు. ఆ సమస్యను అంతం చేసే దిశగానే ఈ ఆస్తి కార్డుల విధానాన్ని ప్రారంభించామన్నారు. ఆస్తి కార్డుల ద్వారా బ్యాంక్ ఖాతాలను, విద్యుత్ కనెక్షన్, గ్యాస్ కనెక్షన్, పక్కా ఇల్లు తదితర సౌకర్యాలు పొందవచ్చన్నారు. ప్రస్తుతం యూపీ, హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరా ఖండ్, కర్ణాటక రాష్ట్రాల్లోని 763 గ్రామా ల్లో ఈ స్వామిత్వను ప్రారంభించారు. ఈ గ్రామా ల్లోని ప్రజలు తక్షణం అవసరమనుకుంటే తమ ఫోన్లకు అధికారులు ఎస్ఎంఎస్ చేసిన లింక్ ద్వారా ప్రాపర్టీ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆస్తి కార్డుల పంపిణీని త్వరలో ప్రారంభిస్తాయి. ప్రతీ కార్డుకు ఆధార్ కార్డు తరహాలో ఒక ప్రత్యేక సంఖ్య ఉంటుంది. రానున్న మూడు, నాలుగేళ్లలో ప్రతీ కుటుంబానికి ప్రాపర్టీ కార్డులను అందజేస్తామని మోదీ తెలిపారు. వ్యవసాయ బిల్లులను వారే వ్యతిరేకిస్తున్నారు దళారి వ్యవస్థ బాగుపడాలని కోరుకునేవారే వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నారని ప్రధాని విపక్షాలపై విమర్శలు గుప్పించారు. మధ్యవర్తులు, దళారులు అందించిన అధికారంతోనే వారు రాజకీయాలు చేశారన్నారు. వారి కుయుక్తులకు రైతులు మోసపోరని వ్యాఖ్యానించారు. గత ఆరు దశాబ్దాల్లో విపక్ష ప్రభుత్వాలు చేయలేని గ్రామీణాభివృద్ధిని గత ఆరేళ్లలో తమ ప్రభుత్వం చేసి చూపిందన్నారు. ‘దేశ ఆత్మ గ్రామాల్లోనే ఉంటుందని చెబుతుంటారు. కానీ గత ప్రభుత్వాలు గ్రామీణ భారతాన్ని పట్టించుకోకుండా వదిలేశాయి’ అని విమర్శించారు. ‘గ్రామాలు, పేదలు, రైతులు, కూలీలు స్వావలంబన సాధించడం చాలా మందికి ఇష్టం ఉండదు. మా సంస్కరణలు రైతుల పొట్టకొడ్తున్న దళారుల అక్రమ ఆదాయాన్ని దెబ్బతీస్తున్నాయి. అందుకే మా సంస్కరణలపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు’ అని ప్రధాని ఆరోపించారు. ‘ఆ మధ్యవర్తులు, దళారుల వల్ల బలపడిన కొందరు కూడా ఈ వ్యవసాయ సంస్కరణలను వ్యతిరేకిస్తున్నారు’ అని విపక్షాలపై పరోక్ష విమర్శలు చేశారు. -
స్క్రామ్జెట్ పరీక్ష విజయవంతం
చండీపూర్: భారత రక్షణ పరిశోధన సంస్థ మరో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. క్షిపణుల వేగాన్ని ఆరు రెట్లు ఎక్కువ చేసే స్క్రామ్జెట్ ఇంజిన్లను విజయవంతంగా పరీక్షించింది. ఈ ఘనత సాధించిన అతితక్కువ దేశాల సరసన భారత్ను సగర్వంగా నిలిపింది. పూర్తిగా దేశీయంగానే తయారైన ఈ స్క్రామ్జెట్ ఇంజిన్లు భవిష్యత్తు అగ్ని –5, బ్రహ్మోస్ వంటి క్షిపణులను నడిపిస్తాయని అంచనా. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దేశీ పారిశ్రామిక రంగం సాయంతో రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలని లక్షిస్తున్న డీఆర్డీవో ఆ దిశగా మరో ముందడుగు వేసినట్లే. ఒడిశాలోని వీలర్ ఐల్యాండ్లో ఉన్న ఏపీజే అబ్దుల్ కలామ్ కాంప్లెక్స్లో సోమవారం ఉదయం 11.03 గంటలకు ప్రయోగం జరగ్గా... హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ వెహికల్ (హెచ్ఎస్టీటీవీ) విజయవంతంగా నింగికి ఎగసిందని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఒక ప్రకటనలో తెలిపింది. హెచ్ఎస్టీటీవీ 30 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన తరువాత ఏరడైనమిక్ హీట్షీల్డ్స్ వేరుపడ్డాయని, ఆ తరువాత క్రూయిజ్ వాహనం ముందుకు దూసుకెళ్లిందని ఆ ప్రకటన వివరించింది. ముందుగా నిర్దేశించిన మార్గంలో సెకనుకు రెండు కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం మొదలుపెట్టిందని, లాంచ్ వెహికల్ నుంచి వేరుపడిన వెంటనే స్క్రామ్జెట్ ఇంజిన్ పరిసరాల్లోని గాలికి ఇంధనాన్ని జోడించి మండటం మొదలుపెట్టిందని, అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేసినట్లు టెలిమెట్రీ స్టేషన్లలోని రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్ వ్యవస్థలు గుర్తించాయి. స్క్రామ్జెట్ ఇంజిన్ పనితీరును పరిశీలించేందుకు బంగాళాఖాతంలో ఒక ప్రత్యేక నౌకను ఏర్పాటు చేయడం గమనార్హం. దశాబ్దాల పరిశోధనల ఫలితంగా ఈ స్క్రామ్జెట్ ఇంజిన్ ప్రయోగం విజయవంతమైందని, సంక్లిష్టమైన టెక్నాలజీలను సైతం దేశీయంగానే అభివృద్ధి చేయగలమన్న నమ్మకాన్ని పెంచిందని డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఎన్నో ప్రయోజనాలు... స్క్రామ్జెట్ ఇంజిన్ల వల్ల ధ్వనికి ఆరురెట్ల వేగంతో ప్రయాణించడం ఒక్కటే ప్రయోజనం కాదు. రాకెట్లు ప్రయాణించేందుకు ప్రత్యేకంగా ఆక్సిజన్ను మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇంజిన్లో తిరిగే భాగాలు ఏవీ ఉండవు కాబట్టి ప్రస్తుతం రాకెట్లలో వాడుతున్న టర్బోజెట్ల కంటే సులువుగా స్క్రామ్జెట్లను తయారు చేయవచ్చు. అందించే ప్రతి లీటర్ ఇంధనానికి ఈ ఇంజిన్లు అందుకునే వేగం సాధారణమైన వాటికంటే చాలా ఎక్కువ. వేగం కూడా చాలా ఎక్కువ కాబట్టి అంతరిక్ష ప్రయోగాలు చాలా చౌక అవుతాయి. రెండో ప్రపంచ యుద్ధం సమయం నుంచి స్క్రామ్జెట్లను అభివృద్ధి చేసేందుకు పలు దేశాలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. అయితే 1991లో రష్యా తొలిసారి ఈ కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంది. ఆ తరువాతి కాలాల్లో ఫ్రాన్స్, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలు ఈ టెక్నాలజీని అందుకున్నాయి. ఇప్పటివరకూ అభివృద్ధి చేసిన స్క్రామ్జెట్ ఇంజిన్లు సాధించిన గరిష్ట వేగం ధ్వనికి 10 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. 2007లో నాసా, ఆస్ట్రేలియాకు చెందిన డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్లు సంయుక్తంగా ఈ ఘనతను సాధించాయి. ప్రధాని అభినందనలు స్క్రామ్జెట్ ఇంజిన్ను అభివృద్ధి చేసిన డీఆర్డీవోను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ‘హైపర్సోనిక్ టెస్ట్ డెమాన్స్ట్రేషన్ వెహికల్ను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీవోకు అభినందనలు. మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్క్రామ్జెట్ ఇంజిన్ ధ్వని వేగం కన్నా ఆరురెట్లు అధికవేగాన్ని అందుకొంది. అతికొద్ది దేశాలకు మాత్రమే ఈ సామర్థ్యం ఉంది’అని మోదీ ట్వీట్ చేశారు. స్క్రామ్జెట్ ఇంజిన్ పరీక్ష విజయవంతం కావడంపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఓ చరిత్రాత్మక ఘనత అని వ్యాఖ్యానించారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. -
ఎగుమతులు, దిగుమతుల్లో సానుకూలత
న్యూఢిల్లీ: ఎగుమతులు, దిగుమతుల ధోరణులు ఆశాజనకంగా ఉన్నాయని.. ముఖ్యంగా ఎగుమతులు ఈఏడాది ఏప్రిల్లో కరోనా కారణంగా భారీగా పడిపోయిన స్థాయి నుంచి క్రమంగా గత ఏడాది స్థాయిలకు చేరుకుంటున్నాయని కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఎగుమతి ప్రోత్సాహక మండళ్లతో గురువారం నిర్వహించిన సమావేశంలో భాగంగా మంత్రి మాట్లాడారు. ఈ వివరాలను వాణిజ్య శాఖ శుక్రవారం ఓ ప్రకటన రూపంలో విడుదల చేసింది. క్షేత్రస్థాయి పరిస్థితులు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, అంతర్జాతీయంగా భారత వాణిజ్యానికి సంబంధించిన అంశాలను చర్చించేందుకు మంత్రి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మర్చండైజ్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా పథకం కింద రాయితీలకు రూ.2 కోట్ల పరిమితి విధించడం 98%ఎగుమతిదారులపై ప్రభావం చూపించబోదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ పథకం స్థానంలో ఆర్వోడీటీఈపీ అనే కొత్త పథకాన్నిఇప్పటికే ప్రకటించడం గమనార్హం. వరుసగా ఐదో నెల జూలైలోనూ ఎగుమతులు 10% క్షీణించి 23.64 బిలియన్ డాలర్లుగా నమోదు కావడం గమనార్హం. మోదీ సర్కారు ‘ఆత్మనిర్భర్ షిప్పింగ్’ స్థానిక తయారీ టగ్ బోట్లనే వాడాలి ∙ ప్రధాన పోర్టులను కోరిన కేంద్రం స్వావలంబన భారత్ (ఆత్మ నిర్భర్) కార్యక్రమాన్ని మరింత బలంగా ముందుకు తీసుకువెళ్లే చర్యలను కేంద్రం అనుసరిస్తోంది. దేశీయంగా నిర్మించిన చార్టర్ టగ్ బోట్లనే వినియోగించాలంటూ ప్రధాన పోర్టులను (ఓడరేవులు) షిప్పింగ్ మంత్రిత్వ శాఖా తాజాగా ఆదేశించింది. తద్వారా దేశీ షిప్ బిల్డింగ్ పరిశ్రమకు పునరుత్తేజాన్ని తీసుకురావచ్చన్నది కేంద్రం ఉద్దేశ్యం. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద ఆత్మనిర్భర్ షిప్పింగ్ కోసం చేపట్టిన చర్యగా దీన్ని షిప్పింగ్ శాఖా మంత్రి మన్ సుఖ్ మాండవీయ అభివర్ణించారు. సవరించిన ఆదేశాలను ప్రధాన పోర్టులు పాటించాల్సి ఉంటుందన్నారు. టగ్ బోట్ అన్నది తొట్టి ఆకారంతో కూడిన పడవ. ఓడలు పోర్టుల్లోకి వచ్చేందుకు వీటి సాయం అవసరమవుతుంది. భారత షిప్ బిల్డింగ్ పరిశ్రమను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, భారత్లో షిప్ బిల్డింగ్ కోసం కొన్ని దేశాలతో చర్చలు కూడా కొనసాగుతున్నాయని కేంద్ర షిప్పింగ్ శాఖా తన ప్రకటనలో తెలిపింది. -
అన్ని రంగాల్లోనూ ఆత్మనిర్భర్
న్యూఢిల్లీ: అన్ని రంగాల్లోనూ స్వావలంబ భారత్ దిశగా కృషి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ ఆటబొమ్మల మార్కెట్ సుమారు రూ. 7 లక్షల కోట్లు కాగా.. అందులో భారత్ వాటా చాలా తక్కువగా ఉందని గుర్తు చేశారు. భారత్లోని స్టార్టప్స్, యువ పారిశ్రామికవేత్తలు ఈ దిశగా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రపంచ ఆట బొమ్మల కేంద్రంగా భారత్ రూపుదిద్దుకోగలదని, స్థానిక ఆట బొమ్మలకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని ‘మన్ కీ బాత్’లో మోదీ వ్యాఖ్యానించారు. ‘దేశంలో నిపుణులైన బొమ్మల తయారీదారులున్నారు. బొమ్మల తయారీ ద్వారా దేశ ఘన చరిత్రను ప్రచారం చేయవచ్చు. గొప్ప భవిష్యత్తుకు బాటలు వేయవచ్చు’అన్నారు. ప్రత్యేకంగా భారత్పైనే, భారత్లోనే కంప్యూటర్ గేమ్స్ రూపకల్పన జరగాలని, ఆ దిశగా సమిష్టిగా కృషి చేయాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కోరారు. భారత దేశ సాంస్కృతిక ఔన్నత్యం, సంప్రదాయాలు కొత్త కొత్త కంప్యూటర్ గేమ్స్ తయారీకి స్ఫూర్తినివ్వగలవన్నారు. ‘మన దేశంలో చాలా విషయాలున్నాయి. మన చరిత్ర ఘనమైనది. దేశ చరిత్రపై ఆధారపడ్డ గేమ్స్ను భారత్లోనే రూపొందించాలని దేశంలోని నిపుణులైన యువతను కోరుతున్నా’అన్నారు. ప్రతీనెల చివరి ఆదివారం ‘మన్ కీ బాత్’పేరుతో ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారనే విషయం తెలిసిందే. ప్రపంచ ఆట బొమ్మల మార్కెట్లో భారత్ వాటాను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇటీవల ప్రధాని మోదీ ఒక అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రపంచ ఆటబొమ్మల ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనా ప్రథమ స్థానంలో ఉంది. ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ► కరోనా మహమ్మారి సమయంలో ఉత్సవాల నిర్వహణలో భారతీయులు గొప్ప సంయమనం, నిరాడంబరతను పాటిస్తున్నారు. ఇది అభినందనీయం. ► ఈ ఖరీఫ్లో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఇందుకు అన్నదాతలకు అభినందనలు. గత సంవత్సరం కన్నా మొత్తంగా దాదాపు 7% సాగు విస్తీర్ణం పెరిగింది. వరి సాగు 10%, పప్పు ధాన్యాల సాగు 5%, నూనెగింజల సాగు 13%, పత్తి సాగు 3% పెరిగింది. ► 2022 నాటికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలవుతున్న నేపథ్యంలో.. స్థానిక స్వాతంత్య్ర సమరయోధుల గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించాలి. నాడు స్థానికంగా జరిగిన ఘటనలను, కార్యక్రమాలను వారికి విశదీకరించాలి. దానివల్ల మరుగునపడిన చాలామంది స్వాతంత్య్ర యోధుల చరిత్ర ప్రపంచానికి తెలుస్తుంది. ► ఇటీవల జరిగిన ఆత్మనిర్భర్ యాప్ ఇన్నోవేషన్ పోటీకి వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికం దేశంలోని చిన్న, మధ్యతరహా పట్టణాల నుంచే వచ్చాయి. ఆత్మ నిర్భర్ భారత్ దిశగా చోటు చేసుకున్న కీలక ముందడుగుగా దీన్ని భావించవచ్చు. ► భారతీయ పండుగలకు, ప్రకృతికి మధ్య గొప్ప సంబంధముంది. ప్రస్తుత గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో చాలా ప్రాంతాల్లో పర్యావరణ హిత వినాయకుడి ప్రతిమలనే ప్రతిష్టించడం ముదావహం. ► సెప్టెంబర్ నెలను పోషకాహార మాసంగా పరిగణిస్తున్నాం. ముఖ్యంగా గ్రామాల్లో అందరికీ పోషకాహారం అందించడం ఉద్యమంలా మారాలి. ► భారత వ్యవసాయ నిధిని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతీ జిల్లాలో పండించే పంటల వివరాలు, వాటిలోని పోషకాల వివరాలు అందులో అందుబాటులో ఉంచుతాం. ► కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఉద్దేశించిన మార్గదర్శకాలను పాటించండి. మాస్క్ ధరించండి. భౌతిక దూరం పాటించండి. వ్యక్తిగత పరిశుభ్రత కొనసాగించండి. సోఫీ.. విదా.. బలరామ్! కుక్క పిల్లలను పెంచుకోవాలనుకునే వారు ఇండియన్ బ్రీడ్ కుక్క పిల్లలకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని కోరారు. భారతీయ కుక్కపిల్లలు సామర్థ్యంలో వేటికీ తీసిపోవన్నారు. చవకగా లభిస్తాయని, భారతీయ పరిస్థితులకు తట్టుకోగలవని వివరించారు. ‘ఇండియన్ బ్రీడ్స్లో ముధోల్ హౌండ్, హిమాచలి హౌండ్ శ్రేష్టమైనవి. రాజపాలాయం, కన్నీ, చిప్పిపరాయి, కొంబయి కూడా గొప్పవే. ఇంటర్నెట్లో వెతకండి. వీటి గురించి మరిన్ని ఆశ్చర్యపరిచే వివరాలు తెలుస్తాయి’అని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా.. ఆగస్టు 15న ‘చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమండేషన్ కార్డ్’పురస్కారం పొందిన ఆర్మీ డాగ్స్ సోఫీ, విదాలను గుర్తు చేశారు. దేశ భద్రతలో అవి గొప్ప పాత్ర పోషించాయన్నారు. ‘అమర్నాథ్ యాత్రా మార్గంలో దుండగులు పెట్టిన పేలుడు పదార్థాలను బలరామ్ అనే శునకం గుర్తించి, అనేక ప్రాణాలను కాపాడింది’అని వివరించారు. ‘బీడ్ పోలీసులు తమతో పాటు పనిచేసిన రాకీ అనే శునకానికి గొప్పగా ఫేర్వెల్ ఇచ్చిన దృశ్యాలు మీరు టీవీలో చూసే ఉంటారు. 300 కేసులను ఛేదించడంలో పోలీసులకు రాకీ సహకరించింది’అన్నారు. కావాల్సింది పరీక్షలపై చర్చ: రాహుల్ ప్రధాని మోదీ మన్కీబాత్లో పరీక్షల గురించి మాట్లాడతారని విద్యార్థులు ఎదురు చూస్తుండగా.. ఆయన మాత్రం బొమ్మల గురించి మాట్లాడారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నీట్, జేఈఈ పరీక్షలను కోవిడ్ దృష్ట్యా వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా కోరుతున్న విషయం తెలిసిందే. ప్రధాని నోట ఏటికొప్పాక మన్కీ బాత్ కార్యక్రమంలో బొమ్మల గురించి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఏటికొప్పాక బొమ్మల ప్రస్తావన తెచ్చారు. విశాఖకు చెందిన సి.వి.రాజు అద్భుతమైన నాణ్యతతో ఏటికొప్పాక బొమ్మలను తయారు చేస్తున్నారని కొనియాడారు. ఆయన స్థానిక బొమ్మలకు పూర్వవైభవం తెచ్చారన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో నిపుణులైన బొమ్మల తయారీదారులు ఉన్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని కొండపల్లి, కర్ణాటకలోని చెన్నపట్నం, తమిళనాడులోని తంజావూరు, అస్సాంలోని ధుబారీ, ఉత్తరప్రదేశ్లోని వారణాసి బొమ్మల తయారీ కేంద్రాలుగా ఎదిగాయన్నారు. -
కోవిడ్ ప్రొటోకాల్తో వేడుకలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తూ ఉండడంతో ఢిల్లీ ఎర్రకోటలో ఇవాళ జరిగే 74వ స్వాతంత్య్ర దిన వేడుకలకు రక్షణ శాఖ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. జాతీయ పతాకం ఎగుర వేయడం దగ్గర్నుంచి, ప్రధాని ప్రసంగం, జాతీయ గీతాలాపన వరకు ప్రతీ కార్యక్రమంలో భౌతిక దూరం పాటించడం, మాస్కులు, పీపీఈ కిట్లు ధరించేలా మార్గదర్శ కాలను రూపొందించింది. ఎర్రకోట పరిసరా ల శానిటైజేషన్ దగ్గర్నుంచి హాజరయ్యే అతిథుల పాటించే భౌతిక దూరం వరకు ప్రతీ అంశంలోనూ జాగ్రత్తలు తీసుకుంది. పోలీసు సిబ్బందితో వివిధ అంచెల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది. ప్రతీ ఏడాది జరిగే పంద్రాగస్టు వేడుకలకి, ఈసారి జరిగే వేడుకలు ఎలా భిన్నమో వివరిస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరసగా ఏడోసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఎర్రకోట వేదికగా ఆయన శనివారం చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. కోవిడ్ సంక్షోభం, చైనాతో ఉద్రిక్తతలు, ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో మోదీ ఏం మాట్లాడతారని ఆసక్తిగా చూస్తున్నారు. ► ఈసారి వేడుకలకి దౌత్యప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులు కలిపి 4 వేల మందికి ఆహ్వా నం అందింది. ఏటా హాజరయ్యే వారిలో ఇది 20% మాత్రమే. ► పాఠశాల విద్యార్థులకు బదులుగా ఎన్సీసీ సిబ్బంది ఈసారి వేడుకల్లో పాల్గొంటారు ► ఇద్దరి అతిథుల మధ్య 6 అడుగుల దూరం ఉండేలా సీట్ల ఏర్పాటు. అతిథులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ► ఎర్రకోట లోపలికి వచ్చే ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు. కరోనా లక్షణాలున్న వారిని వెంటనే ఆస్పత్రికి తరలించేలా అంబులెన్స్లు సిద్ధం. ► భద్రత విధుల్లో పాల్గొనే పోలీసులందరికీ పీపీఈ కిట్లు. ► ఈసారి వేడుకల్ని చూసే అవకాశం కరోనా వైరస్తో పోరాడి విజేతలైన 1,500 మందికి కల్పించారు. వారిలో 500 మంది పోలీసు సిబ్బంది. -
అగ్రి ఇన్ఫ్రాలో ఏపీకి తొలి విడతగా రూ.6,540 కోట్లు
సాక్షి, అమరావతి: ‘ఆత్మ నిర్బర్ భారత్’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన రూ.లక్ష కోట్ల వ్యవసాయ మౌలిక వసతుల నిధిలో ఆంధ్రప్రదేశ్కు తొలి విడతగా రూ.6,450 కోట్లు కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. ఇవి తాత్కాలిక కేటాయింపులు మాత్రమే. ► ఈ పథకం 2020–21 నుంచి 2029–30 వరకు అంటే పదేళ్లు అమల్లో ఉంటుంది. ► రూ.10 వేల కోట్ల చొప్పున నాలుగేళ్ల పాటు నిధులు మంజూరవుతాయని అంచనా. ► తిరిగి చెల్లింపుల కోసం.. మారటోరియం గడువు 6 నెలల నుంచి రెండేళ్ల వరకు ఉంటుంది. ► గరిష్టంగా రూ.2కోట్ల వరకు రుణాలు ఇస్తారు. 3 శాతం వడ్డీ రాయితీ ఉంటుంది. కాల పరిమితి 7 ఏళ్లు. ఈ పథకం ఏ ప్రాజెక్టులు చేపట్టవచ్చునంటే ► ఇ–మార్కెటింగ్ ప్లాట్ఫారాలు, సప్లై చెయిన్ సర్వీసులు ► గిడ్డంగులు, గరిశలు (సిలోస్) ► ప్యాక్ హౌసులు ► పరీక్ష, తనిఖీ యూనిట్లు ► సార్టింగ్, గ్రేడింగ్ యూనిట్లు ► లాజిస్టిక్ సౌకర్యాలు (ఏదైనా ఒక పనికి సంబంధించిన లావాదేవీలన్నీ) ► ప్రాథమిక శుద్ధి కేంద్రాలు ► పండ్లు మాగబెట్టే గదులు కమ్యూనిటీ ఫార్మింగ్ అసెట్స్ పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులు.. ► సేంద్రియ ఉత్పాదకాల తయారీ యూనిట్లు ► జీవన ఎరువుల తయారీ యూనిట్లు ► తక్కువ ఖర్చుతో సాగు చేసేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన ► సప్లై చెయిన్కు అవసరమైన ప్రాజెక్టులు ► ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ప్రోత్సహించే ప్రాజెక్టులు ఎవరెవరు అర్హులు... ► రైతులు, అగ్రీ పారిశ్రామిక వేత్తలు ► పీఏసీఎస్, మార్కెటింగ్ కో–ఆపరేటివ్ సొసైటీలు, ఎంఎసీలు ► స్టార్టప్స్, పీపీపీ ప్రాయోజిత పథకాలు ► ఈ పథకంలో పాల్గొనదలచిన ఆర్థిక సంస్థలు నాబార్డ్, డీఏసీ ఎఫ్డబ్లు్యతో ఒప్పందం కుదుర్చుకోవాలి. ప్రతిపాదిత పథకం అమలు బాధ్యతను జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయి నియంత్రణ సంఘాలు చూస్తాయి. ఇతర వివరాలకు నాబార్డ్ లేదా వ్యవసాయ శాఖాధికారులను సంప్రదించవచ్చు. -
101 రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం
సాక్షి, ఢిల్లీ : కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం కీలక ప్రకటన చేశారు. 101 రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ఆదివారం ట్విటర్ ద్వారా తెలిపారు. 'ఆత్మనిర్భర్ భారత్' కార్యక్రమానికి ఊతమిచ్చేందుకే రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆయుధాలతో పాటు ఇతర రక్షణ వస్తువులు ఇక మీదట దేశీయంగానే తయారవనున్నాయి. ఇది భారత రక్షణశాఖ తయారీ రంగాన్ని బలోపేతం చేస్తుందని రాజనాథ్ తెలిపారు. ఈ నిర్ణయం భారత రక్షణ శాఖ పరిశ్రమకు ఎంతో ఉపయోగకరమని, వారి సామర్థ్యాలను పెంచుతుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా డీఆర్డీవో రూపొందించిన, అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడానికి ఈ నిర్ణయం గొప్ప అవకాశాన్ని కల్పిస్తోందని ఆయన అన్నారు. భారత్, చైనా మధ్య ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. 2020 నుంచి 2024 మధ్య కాలంలో క్రమంగా దిగుమతులపై నిషేధాన్ని ప్రవేశపెట్టే ప్రణాళికతో కేంద్రం ముందుకు వెళ్తున్నట్లు ఆయన ప్రకటించారు.(రికార్డు స్థాయిలో 64వేలకు పైగా కరోనా కేసులు) రక్షణ రంగంలో దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ రూపొందించిన జాబితాను భారత సైన్యం, ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలతో చర్చించిన తరువాత తయారు చేసినట్లు రక్షణ మంత్రి చెప్పారు. ఉత్పత్తుల కోసం 2015 ఏప్రిల్ నుంచి 2020 ఆగస్ట్ మధ్య సుమారు 3.5 లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చినట్లు రాజనాథ్ సింగ్ తెలిపారు. రాబోయే 6 నుంచి ఏడేళ్లలో దేశీయ పరిశ్రమకు సుమారు రూ .4 లక్షల కోట్లు ఆర్డరు ఇవ్వనున్నారు. -
ఉత్పాదకతకు మరిన్ని రుణాలు
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారితో కుదేలయిన ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ఉత్పాదక రంగాలకు తగిన రుణ సదుపాయం సకాలంలో అందించేలా బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల సీఈఓలు, ఎన్బీఎఫ్సీల చీఫ్లతో ప్రధాని బుధవారం మూడు గంటలపాటు సుదీర్ఘ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉన్నత స్థాయి వర్గాలు అందించిన సమాచారం ప్రకారం సదస్సుకు సంబంధించి కొద్ది ముఖ్యాంశాలు చూస్తే... ► ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ (స్వావలంబన భారత్), దేశం స్వయం సమృద్ధి లక్ష్యాల సాధన వంటి కీలక అంశాలను ఆయన ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఈ విషయంలో ఫైనాన్షియల్ రంగం ప్రాముఖ్యతను వివరించారు. లక్ష్యాల సాధన దిశలో ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అన్నింటినీ అందిస్తుందని పేర్కొన్నారు. ► రుణ సదుపాయాలు, లక్ష్యాల సాధనలో అనుసరించాల్సిన మార్గాలు, టెక్నాలజీ ద్వారా ఫైనాన్షియల్ రంగంలో సాధికారత, ఈ విభాగం స్థిరత్వానికి అనుసరించాల్సిన అత్యున్నత ప్రమాణాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. ► ఎస్బీఐ చైర్మన్ రజ్నీష్ కుమార్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ డైరెక్టర్ ఎస్ఎస్ మల్లిఖార్జున రావు, ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ భక్షీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అదిత్య పురి, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రేణూ సూద్ కర్నాడ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ► 2019 మేలో బ్యాంక్ రుణ వృద్ధి 11.5 శాతం ఉంది. 2020 మేలో ఇది 7 శాతం క్షీణతకు పడిపోయింది. కోవిడ్–19 తీవ్రత దీనికి నేపథ్యం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణతలోకి వెళుతుందన్న సందేహాలూ ఉన్నాయి. రుణాలకు సంబంధించి అటు రుణ దాతల నుంచీ ఇటు రుణ గ్రహీతల నుంచీ సానుకూల స్పందన కనబడ్డం లేదు. ఈ నేపథ్యంలో ప్రధాని నిర్వహించిన సదస్సుకు ప్రాధాన్యత సంతరించుకుంది. నిజానికి బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో చరిత్రాత్మక కనిష్టస్థాయి 4 శాతానికి దిగివచ్చింది. అయినా కార్పొరేట్, రిటైల్ రుణ గ్రహీతలు రుణాలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. దీనితో బ్యాంకులు రివర్స్ రెపో మార్గంలో తమ డబ్బును ఆర్బీఐ వద్ద ఉంచుతున్నాయి. ► వ్యవస్థలో డిమాండ్ను పునరుద్ధరింపజేయడానికిగాను మేలో ఆర్థికమంత్రి ప్రకటించిన రూ.20.97 లక్షల కోట్ల ప్యాకేజీ అంశాల అమలుకు బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. -
స్వచ్ఛం.. సురక్షితం.. కచ్చితం
రేవా: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ఆత్మ నిర్భర్ భారత్’ విద్యుదుత్పత్తిలోనూ స్వావలంబన సాధించడం కీలకమైన విషయమని భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తెలిపారు. మధ్యప్రదేశ్లోని రేవాలో 750 మెగావాట్ల భారీ సౌరవిద్యుత్తు ప్లాంట్ను ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. విద్యుత్తు రంగంలో స్వావలంబనకు సౌరశక్తి ఎంతో తోడ్పడుతుందన్నారు. సౌరశక్తి స్వచ్ఛమైంది మాత్రమే కాకుండా.. కచ్చితంగా అందుబాటులో ఉండేదని, సురక్షితమైంది కూడా అని అన్నారు. ఈ శతాబ్దంలోనే అతిపెద్ద వనరుగా సౌరశక్తి అవతరించనుందని తెలిపారు. సౌర విద్యుత్తు విషయంలో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే ఐదు ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు. ఆసియాలోనే అతిపెద్ద కేంద్రమైన రేవా అల్ట్రా మెగా సోలార్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్తోపాటు ఢిల్లీ మెట్రో రైల్వేకూ విద్యుత్తు అందిస్తుందని అన్నారు. ప్రపంచమిప్పుడు పర్యావరణాన్ని కాపాడుకోవాలా? లేక ఆర్థిక వ్యవస్థనా? అన్న ద్వైదీభావంలో కొట్టుమిట్టాడుతోందని, అయితే స్వచ్ఛభారత్, ఉజ్వల, సీఎన్జీ, విద్యుత్ ఆధారిత రవాణా వ్యవస్థల ద్వారా భారత్ ఈ రెండూ పరస్పర ప్రయోజనకరమని చాటిందని అన్నారు. ప్రపంచం మొత్తమ్మీద అందుబాటులో ఉండే, పర్యావరణాన్ని కలుషితం చేయకపోగా మెరుగుపడేందుకు సాయపడే, ఇంధన అవసరాలను తీర్చుకునేందుకు ఉపయోగపడే సూర్యుడు స్వావలంబనకూ కీలకమని అన్నారు. ఇందుకోసం దేశం సోలార్ ప్యానెళ్లతోపాటు బ్యాటరీలు, ఇతర పరికరాలను సొంతంగా ఉత్పత్తి చేయాలని, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని కోరారు. మధ్యప్రదేశ్లోని రేవా నర్మదా నది, తెల్లపులి కోసం చాలా ప్రసిద్ధి చెందిందని, ఇకపై ఆసియాలోనే అతిపెద్ద సౌరవిద్యుత్తు కేంద్రంగానూ ఖ్యాతి గడిస్తుందని అన్నారు. రేవా తరహాలోనే భారీ సోలార్ ప్లాంట్లను షాజాపూర్, నీమచ్, ఛత్తర్పూర్లలోనూ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని, ఓంకారేశ్వర్ సమీపంలో తేలియాడే సోలార్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మధ్యప్రదేశ్ ఊర్జా వికాస్ నిగమ్, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆప్ ఇండియా సంయుక్తంగా 500 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ భారీ సౌర విద్యుత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేశాయి. -
ఆవిష్కరణలను ప్రోత్సహిద్దాం: వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: దేశ యువతలో, ఐటీ నిపుణుల్లో నిబిడీ కృతమై ఉన్న సృజనాత్మకతను ప్రోత్సహించేం దుకు అవసరమైన వాతావరణాన్ని నిర్మించుకోవాలని, తద్వారా ‘ఆత్మనిర్భర భారత్’లక్ష్యాలను చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆదివారం ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సభాప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో స్వదేశీ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎలిమెంట్స్’యాప్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనం ఇతరులను అనుకరించడాన్ని పక్కనపెట్టి కొత్త ఆవిష్కరణలపై దృష్టిపెట్టాలన్నారు. -
15 రకాల వస్తు దిగుమతులను నివారించొచ్చు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి పిలుపునిచ్చిన ఆత్మ నిర్భర్ (స్వీయ సమృద్ధి) సాధన కోసం భారీగా దిగుమతి చేసుకుంటున్న 15 వస్తువులను అసోచామ్ గుర్తించింది. దేశీయంగా ఉత్పత్తిని పెంచడం ద్వారా వీటి విషయంలో స్వావలంబన సాధించొచ్చని పేర్కొంది. వీటిల్లో ఎలక్ట్రానిక్స్, బొగ్గు, ఐరన్–స్టీల్, నాన్ ఫెర్రస్ మెటల్స్, వంటనూనెలు, తదితర ఉత్పత్తులున్నాయి. ప్రతి నెలా 5 బిలియన్ డాలర్ల విలువైన (37,500 కోట్లు) ఈ వస్తువులను దిగుమతి చేసుకుంటున్నామని.. విదేశీ మారక నిల్వలకు భారీగా చిల్లు పెడుతున్న ఈ దిగుమతులకు వెంటనే కళ్లెం వేయాలని అసోచామ్ సూచించింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న మే నెలలో 2.8 బిలియన్ డాలర్ల విలువైన (రూ.21,000 కోట్లు) ఎలక్ట్రానిక్ వస్తు దిగుమతులు నమోదయ్యాయి. హెచ్ఎంఏ ప్రెసిడెంట్గా సంజయ్ కపూర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (హెచ్ఎంఏ) నూతన ప్రెసిడెంట్గా సంజయ్ కపూర్ ఎన్నికయ్యారు. 2020–21 కాలానికి ఆయన ఈ పదవిలో ఉంటారు. పలు మల్టీనేషనల్ కంపెనీలకు ఆయన కన్సల్టెంట్గా వ్యవహరిస్తున్నారు. -
టీడీపీ అవినీతిపై నిర్మల కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అవినీతి పాలనపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ ఏలుబడిలో జరిగిన అవినీతిపై విచారణ జరపడం ముఖ్యమైన వ్యవహారమని వ్యాఖ్యానించారు. నిందితులపై కేసులు పెట్టి విచారణ జరపాలని అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. దేశంలోని విద్యుత్ కంపెనీలను బాగు చేయాలని నిర్మల చెప్పారు. డిస్కం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 90 వేల కోట్లు కేటాయించిందని అన్నారు. ఈ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకొని డిస్కంలను బాగు చేయాలని కోరారు. ఎఫ్ఆర్బీఎం చట్టం పరిమితిని పెంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు తీసుకునే అవకాశాన్ని మరింత కల్పించామని ఆమె గుర్తు చేశారు. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి బాటలో నడిచేందుకు కేంద్రం చేయూతనిస్తుందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. సహకార సమాఖ్య వ్యవస్థకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఆత్మ నిర్బర ప్యాకేజీని ఉపయోగించుకోవాలని నిర్మల పేర్కొన్నారు. (చదవండి: ‘సీఎం వైఎస్ జగన్ నిజమైన బాహుబలి’) -
మానవీయ స్పర్శ ఏది?
అనుకోని ఆపద వచ్చిపడి నప్పుడు ఆందోళన పడటం కంటే ఆత్మవిశ్వాసంతో వుండటం చాలా అవ సరం. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ మూడునెలల్లో వ్యక్తుల ఆదాయాలతో పాటు వ్యవస్థల, సంస్థల ఆదాయాలు పూర్తిగా తుడి చి పెట్టుకుని పోయాయి. మన దేశంతోపాటు ప్రపంచ దేశాలన్నిటి పరిస్థితి కూడా ఇదే. ఈ కల్లోలం నుంచి ఉపశమనం కలిగించడానికి మన కేంద్ర ప్రభుత్వం తొలి విడత లక్షా 80 వేల కోట్ల రూపాయలు ప్యాకేజీగా ప్రకటించింది. ఆ తదుపరి చాలా ఆలస్యంగా మలివిడత ప్యాకేజీని భారీ అంకె లతో... అంటే రూ. 21 లక్షల కోట్లతో, ఆకర్షణీయ మైన పేరుతో–ఆత్మ నిర్భర్ భారత్ అంటూ ప్రక టించింది. తొలి ప్యాకేజీ–ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్, మలి ప్యాకే జీ–ఆత్మ నిర్భర్ భారత్ కలిసి దేశ స్థూల ఉత్పత్తిలో 10 శాతం అవుతుందని లెక్కలు చెప్పారేగానీ, ఇది రూ. 30 లక్షల 42 వేల 230 కోట్ల వార్షిక బడ్జెట్లో భాగమా అని అడిగితే బీజేపీ నేతలు నోటికి పనిచెబుతున్నారుగానీ, లెక్కలు చెప్పడానికి సిద్ధప డటం లేదు. ‘భారీ ప్యాకేజీ’ ప్రకటించినప్పటి నుంచి బీజేపీ మేధా వులు ‘ఆహా ఓహో’ అంటూ శ్లాఘిస్తున్నారు. వ్యతి రేకించిన వారిని నిందిస్తున్నా రు. కానీ ఆరెస్సెస్ అనుబంధ కార్మిక సంఘమైన భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) నిశితంగా విమర్శిస్తుంటే ఏం మాట్లాడాలో ఈ పెద్దలకు అర్థం కావడం లేదు. ఆ సంస్థ విమర్శించడంతో సరి పెట్టలేదు, కేంద్రానికి వ్యతిరేకంగా కార్మికుల్ని సంఘటితం చేసి ఉద్యమిస్తామని హెచ్చరించింది. కరోనా వల్ల వచ్చిపడిన కష్టం నుంచి దేశాన్ని ఆర్థి కంగా ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం మంచిదే. కానీ ఆచరణలో ‘ఆత్మ నిర్భర్’ అందుకు ఎలా ఉపయోగ పడుతుం దన్నదే అందరినీ వేధిస్తున్న ప్రశ్న. దేశం ఆర్థికంగా బల పడాలంటే అన్ని రకాల ఉత్పత్తులు జరగాలి. వినిమయం పెరగాలి. అది సాధ్యం కావాలంటే ప్రజల వద్ద డబ్బు వుండాలి. అందుకవసరమైన ఆదాయ మార్గాలుండాలి. ప్రజల పొదుపు పెరగాలి. దశాబ్దాలుగా కార్మికుల రక్తం, స్వేదంతో బల పడిన బొగ్గు, రైల్వేలు, ఉక్కు, విద్యుత్, టెలికం, బ్యాంకింగ్, రక్షణ, తపాలా తదితర రంగాల్లో కొన్ని టిని గంపగుత్తగా, కొన్నింటిలో 75 శాతం వాటా ల్ని, మరికొన్నిటిలో ఇంకా గరిష్టంగా ప్రైవేటుపరం చేయడం ఒక్కటే మంచి అవకాశం అవుతుందా? ఇవి పరాధీనతకు సంకేతమా లేక స్వావలంబనకు నిదర్శనమా? దాచేస్తే నిజాలు దాగుతాయా? తొలి విడత ఉద్దీపనలో బ్యాంకులకు చెల్లించే వాయిదాలను మూడు నెలలు వాయిదా వేస్తామని, వాటిపై వడ్డీ మాఫీ చేస్తామని కేంద్రం ఇచ్చిన వాగ్దానం నెరవేరలేదు. బ్యాంకులు యథావిధిగా వాయిదాలు కట్టించుకున్నాయి. అందుకు బ్యాంకుల్ని తప్పుబట్ట లేము. అవి డిపాజిటర్లకూ, రుణ గ్రహీతలకూ మధ్యవర్తులుగా వ్యవహరి స్తాయి. కోశాగారం లోటు ఒకపక్క, కేంద్రం చేస్తున్న అప్పులు మరో పక్క పెరిగి అంతర్జాతీయ స్థాయిలో మన దేశం రేటింగ్ పడిపోయింది. 2020–21లో జీడీపీ వృద్ధి రేటు మైనస్ 1.5 శాతం వుండొచ్చునని కేంద్రమే అంచనా వేసింది. ఇది మైనస్ 1.7 శాతం వుండొచ్చునని కొన్ని సంస్థల అంచనా. భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) మాత్రం ఇకపై జీడీపీకి సంబం దించిన అంచనాల జోలికి వెళ్లబోమని చెప్పింది.ఇక ‘పీఎం కేర్స్’కు జమపడిన విరాళాలెంతో బహిర్గతం చేయకపో వడం మొదలుకొని అనేక అంశాల్లో కేంద్రం పాటిస్తున్న గోప్యత ఎవరికీ అర్ధం కావడం లేదు. సమాఖ్య స్ఫూర్తి గల్లంతు కేంద్రం రాష్ట్రాలతో వ్యవహరిస్తున్న తీరు సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టుగా మారింది. మన రాజ్యాంగ నిర్మాణంలోనే సహకార ఫెడరలిజం అంతర్లీనంగా వుంది. కేంద్ర–రాష్ట్రాలు వేటికవి సర్వసత్తాక సార్వ భౌమాధికారాన్ని కలిగి ఒకదా నితో మరొకటి సహ కరించుకుంటూ జాతీయ సమైక్యతతో ముందు కెళ్లాలన్నది ఫెడరల్భావ స్ఫూర్తి. దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ రాష్ట్రాల అధికారాలను క్రమేపీ తగ్గించి ఈ స్ఫూర్తిని దెబ్బతీసింది. ఎన్డీఏ కూడా దాన్నే కొన సాగి స్తోంది. ఇందువల్ల ప్రజలు తీవ్రంగా నష్ట పోతు న్నారు. మార్చి 24న కేవలం 4 గంటల వ్యవధిలో ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధిం చిన లాక్డౌన్ వల్ల ఎన్ని సమ స్యలు ఏర్పడ్డాయో మూడు నెలలుగా చూస్తూనే వున్నాం. అంతకు చాలాముందే 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాల పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచిందని, కనుక ఆ వాటా ఇక పెరగ దని సాకు చూపించి అనేక కేంద్ర ప్రాయోజిత పథ కాలు నిలిపివేయడమో, కోత పెట్టడమో జరిగింది. 15వ ఆర్థిక సంఘం పరిశీలనాంశాలను కేంద్రమే రూపొందించింది. జనాభాతో ముడిపెట్టి, పన్నుల వాటాను లెక్కించే విధానం వల్ల కొన్ని రాష్ట్రాలకు నష్టం కలగడంతోపాటు, వాటి స్వతంత్ర విధాన నిర్ణయాలలో కేంద్రం జోక్యం చేసుకున్నట్టవుతుంది. జీఎస్టీ ద్వారా కూడా పన్నుల వాటాలో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. విద్యుత్ సవరణ చట్టం ఈ ధోరణితో రూపొందించిందే. దీనికి పలు రాష్ట్రాలు అభ్యంతరం చెబుతున్నాయి. ఇది అమల్లో కొస్తే పేదలకు రాయితీ ధరకు విద్యుత్ అందించే రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు గండిపడుతుంది. మానవత్వమే పరమావధి సంక్షేమ రాజ్య స్థాపన రాజ్యాంగ లక్ష్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా పనిచేస్తూ, తగిన ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి. అందు కోసం సున్నితత్వంతో, మానవత్వంతో వ్యవహరించాలి. కరోనా నేపథ్యంలో వలసకూలీలు ఎదుర్కొన్న కడగండ్లకు కారణం కేంద్రంలో లోపించిన ఈ సున్నితత్వమే నన్న విమర్శలొ చ్చాయి. కరోనా నేర్పిన పాఠాలతో మన గమ్యం ప్రైవేటీకరణ దిశగా కాకుండా... మెరుగైన ఆరో గ్యం, నాణ్యమైన విద్య, రైతులు, పేదల సంక్షేమం వైపుగా అన్నది స్పష్టమైంది. 2004లోనే స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ అందించి దేశానికి దిశా నిర్దేశం చేశారు. ఆరోగ్యశ్రీ, 104, 108 పథకాలతో మారుమూల ప్రాంతాల పేదలకు నాణ్యమైన వైద్య సదుపాయాలు అందిం చారు. ఫీజు రీయింబర్స్ మెంట్తో నిరుపేదల పిల్లలు ఉన్నత విద్యనభ్య సించే అవకాశం అందిం చారు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృ త్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభు త్వంలో విలీనం చేసింది. ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అందించడా నికి పూనుకుంది. చేతివృత్తుల వారికి ఆర్థిక సహా యం అందిస్తోంది. వలస కార్మికుల ఇబ్బందులకు చలించి, వారి ఆకలిదప్పులు తీర్చి, వారిని సగౌర వంగా గమ్యస్థానాలకు చేర్చిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరే. పాలకులు ఇలా సున్నితత్వంతో, మానవత్వంతో ఆలోచిస్తేనే పౌర సమాజానికి భరోసా కలుగుతుంది. కేంద్రం తన భారీ ప్యాకేజీలో సమూల మార్పులు తెచ్చి, ఫెడరల్ సమాఖ్య స్ఫూర్తితో పనిచేయాలి. అప్పుడు మాత్రమే ఆశించిన ఫలితాలు అందుతాయి. సి. రామచంద్రయ్య వ్యాసకర్త మాజీమంత్రి, వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి -
వలస కూలీల కోసం భారీ ప్రణాళిక?
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోవడమే కాకుండా. స్వస్థలాలకు చేరేందుకు నానా అవస్థలు పడ్డ వలస కూలీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకంతోపాటు, ప్రధాని∙మోదీ ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ పథకంలోని పలు పనుల కోసం వలస కూలీలకు ఆయా రాష్ట్రాల్లోనే ఉపాధి కల్పించడం ఈ ప్రణాళికలోని ముఖ్యాంశంగా తెలుస్తోంది. జన్ధన్ యోజన, కిసాన్ కళ్యాణ్ యోజన, ఆహార భద్రత పథకం, ప్రధాని ఆవాస్ యోజన కార్యక్రమాలను వలసకూలీలను లక్ష్యంగా చేసుకుని రూపొందిస్తారు. ఇందుకోసం దేశంలో వలస కూలీలు ఎక్కువగా ఉన్న 116 జిల్లాలను ఎంపిక చేశారు. బిహార్లో 32, ఉత్తర ప్రదేశ్లో 31, మధ్యప్రదేశ్లో 24, రాజస్థాన్లో 22, జార్ఖండ్లో 3, ఒడిశాలోని 4 జిల్లాల్లోనూ అమలు చేయనున్నారు. ఈ జిల్లాల్లో వలస కూలీలను గుర్తించే కార్యక్రమం కొనసాగుతోంది. -
విదేశీ పెట్టుబడులకు రెడ్ కార్పెట్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కల్లోలంతో ఏర్పడిన కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో భారత్కు అంతర్జాతీయ పెట్టుబడులను ఎలా ఆకర్షించాలన్న అంశంపై కేంద్రం దృష్టి సారించింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా నేపథ్యంలో పలు దిగ్గజ కంపెనీలు చైనా నుంచి పెట్టుబడులను తరలిస్తున్నాయని, ఇన్వెస్ట్మెంట్ విధానాలను పునర్వ్యవస్థీకరించుకుంటున్నాయని వస్తున్న వార్తలు తాజా నిర్ణయాలకు నేపథ్యం. వాణిజ్య శాఖ ప్రకటన ప్రకారం క్యాబినెట్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలివీ... ► సెక్రటరీలతో కూడిన ఒక ఉన్నత స్థాయి సాధికార గ్రూప్ (ఈజీవోఎస్) ఏర్పాటు. దీనికి క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వం వహిస్తారు. ► మంత్రిత్వశాఖలు, డిపార్ట్మెంట్లలో ప్రాజెక్ట్ డెవలప్మెంట్ విభాగాలు (పీడీసీ)లు ఏర్పాటవుతాయి. పెట్టుబడుల ప్రతిపాదనల అమలు దిశలో ఉన్న అడ్డంకులను తొలగించి ఆయా అంశాలను సాధికార గ్రూప్ ముందు ఉంచుతాయి. ► ఉన్నతస్థాయి సాధికార గ్రూప్లో నీతి ఆయోగ్ సీఈఓ, డీపీఐఐటీ (డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్), వాణిజ్యం, రెవెన్యూ, ఆర్థిక శాఖల కార్యదర్శులు, ఆయా డిపార్ట్మెంట్ల చీఫ్లు సభ్యులుగా ఉంటారు. క్యాబినెట్ సెక్రటరీ చైర్పర్సన్గా ఉంటే, డీపీఐఐటీ సెక్రటరీ మెంబర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. ► పెట్టుబడుల ఆకర్షణకు విధానాలు, వ్యూహాల రూపకల్పన, ఆయా ప్రాజెక్టులకు సంబంధించి విభిన్న మంత్రిత్వశాఖలు, డిపార్ట్మెంట్ల నుంచి సత్వర, సకాల ఆమోదాలు వచ్చేట్లు చూడ్డం, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లకు తగిన ఇన్ఫ్రా ఏర్పాటు సాధికార గ్రూప్ ప్రధాన విధానాలు. ► వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడులు, నిర్వహణ విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, సహకారం నెలకొల్పడం ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెల్స్ (పీడీసీ) ఏర్పాటు ప్రధాన లక్ష్యం. ఒక మంత్రిత్వశాఖలో జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి పీడీసీ ఇన్చార్జ్గా ఉంటారు. ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ వచ్చేలా చూడ్డం, భూ లభ్యత సమస్యల పరిష్కారం, ఆయా అంశాలను ఎప్పటికప్పుడు ఉన్నతస్థాయి సాధికార కమిటీ దృష్టికి తీసుకువెళ్లడం పీసీడీ విధివిధానాలు. పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణం భారత్లో పెట్టుబడులకు మరింత స్నేహపూర్వక వాతావరణం సృష్టించడానికి తాజా నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని వాణిజ్యశాఖ పేర్కొంది. ఆత్మనిర్భర్ భారత్ మిషన్ను మరింత పటిష్టం చేస్తుందని తెలిపింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి వివిధ రంగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెంచే దిశలో ఈ నిర్ణయం కీలకమైనదని విశ్లేషించింది. 2024–25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించడానికి ఇది ఒక కొత్త యంత్రాంగమనీ అభివర్ణించింది. కరోనా వల్ల అంతర్జాతీయంగా పలు కంపెనీలు తమ పెట్టుబడుల వ్యూహాలను పునర్వ్యవస్థీకరించుకునే పనిలో ఉన్నాయని సూచించింది. ► డిఫాల్టర్లకు ఊరట... ఐబీసీ సవరణ ఆర్డినెన్స్కు ఆమోదం ఇన్సాల్వెన్సీ, దివాలా కోడ్ (ఐబీసీ) సవరణకు వీలుగా ఒక కీలక ఆర్డినెన్స్కు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. కోవిడ్–19 మహమ్మారి కష్టనష్టాల నేపథ్యంలో బకాయిలు చెల్లించలేని వారిపై ఎటువంటి ఇన్సాల్వెన్సీ చర్యలు తీసుకోకుండా వీలుకల్పిస్తూ ఈ ఆర్డినెన్స్కు ఆమోదముద్ర వేసినట్లు ఉన్నత స్థాయి వర్గాల సమాచారం. లాక్డౌన్ విధించిన మార్చి 25 తర్వాత పరిస్థితుల నేపథ్యంలో మొండిబకాయిల (ఎన్పీఏ)పై ఐబీసీ ప్రొసీడింగ్స్ను చేపట్టకుండా ఆర్డినెన్స్ తగిన రక్షణను కల్పిస్తుంది. ఇందుకు అనుగుణంగా కోడ్లోని 7, 9, 10 సెక్షన్లను సస్పెండ్ చేసినట్లు, సెక్షన్ 10ఏను కొత్తగా ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఆరు నెలల పాటు డిఫాల్టర్లపై తాజాగా ఎటువంటి దివాలా ప్రొసీడింగ్స్ను చేపట్టడం సాధ్యం కాదు. ఏడాది పాటు దీనిని పొడిగించడానికి సైతం ఆర్డినెన్స్ వీలు కల్పిస్తోంది. -
వీధి వ్యాపారులకు రూ. 10 వేలు
న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న వీధి వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సూక్ష్మ రుణ పథకాన్ని సోమవారం ఆవిష్కరించింది. దీని ద్వారా వారికి రూ. 10 వేల వరకు రుణం అందించనున్నారు. ఈ ‘ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి’ పథకం సుమారు 50 లక్షల మందికి లబ్ధి చేకూర్చనుందని కేంద్ర పట్టణ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంవత్సరం మార్చి 22 వరకు వీధి వ్యాపారాల్లో ఉన్నవారు ఈ పథకానికి అర్హులని పేర్కొంది. ‘వారు రూ. 10 వేల వరకు రుణం తీసుకోవచ్చు. ఆ రుణాన్ని సులభ నెలవారీ వాయిదాల్లో సంవత్సరంలోపు చెల్లించాలి. సమయానికి కానీ, ముందుగా కానీ చెల్లించినవారికి వార్షిక వడ్డీలో 7% వరకు రాయితీ లభిస్తుంది. ఆ రాయితీ మొత్తం ఆరు నెలలకు ఒకసారి వారి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఈ పథకం మార్చి 2022 వరకు అమల్లో ఉంటుంది. సమయానికి రుణ వాయిదాలు చెల్లించినవారికి రుణ పరిమితిని పెంచే అవకాశం కూడా ఉంది’ అని వివరించింది. ఈ పథకం అమలులో స్థానిక సంస్థలు కీలక పాత్ర పోషించాలని, వీధి వ్యాపారులు, బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థల మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరించాలని కోరింది. పథకం అమలు కోసం మొబైల్ యాప్ను, వెబ్ పోర్టల్ను రూపొందిస్తున్నామని వెల్లడించింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు రైతులు, కూలీలు, శ్రామికుల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకువస్తాయని మోదీ పేర్కొన్నారు. -
గ్లోబల్ లీడర్గా భారత్!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా శనివారం దేశ పౌరులకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను హిందీలో చదివి వినిపించి తన ట్విటర్ అకౌంట్లో పోస్టు చేశారు. కోవిడ్–19పై పోరాటంలో విజయం వైపుగా భారత్ ప్రయాణిస్తోందని ఆత్మవిశ్వాసంతో చెప్పారు. భారత్ గ్లోబల్ లీడర్గా ఎదగాలన్న కల సాకారమయ్యే రోజు ఎంతో దూరంలో లేదన్న మోదీ తన లేఖలో గత ఏడాది పాలనాకాలంలో సాధించిన విజయాలను, ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను, కరోనా గడ్డు పరిస్థితుల్లోనూ భారత్ చేస్తున్న పోరాటాన్ని ప్రస్తావించారు. మోదీ లేఖలోని కొన్ని ముఖ్యమైన అంశాలు.. ఎన్నో సమస్యలకు పరిష్కారం ‘గత ఏడాది లోక్సభ ఎన్నికల్లో మా గెలుపు భారత ప్రజాస్వామ్య చరిత్రలో స్వర్ణయుగం. కొన్ని దశాబ్దాల తర్వాత పూర్తి స్థాయి మెజార్టీతో వరసగా రెండో సారి ఒకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన శుభ సమయం. భారత్ని అత్యున్నత స్థానంలోకి తీసుకువెళ్లి గ్లోబల్ లీడర్గా చూడాలని కలలు కన్న భారతీయులు మమ్మల్ని గెలిపించారు. ఆ కల సాకారం చేసే దిశగా గత ఏడాదిలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం. ఆర్టికల్ 370 రద్దు ద్వారా జాతి ఐక్యత, సమగ్రతా స్ఫూర్తిని చాటి చెప్పాం. రామజన్మభూమి వివాదానికి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా పరిష్కారం లభించడం హర్షణీ యం. అత్యంత అనాగరికమైన ట్రిపుల్ తలాక్ విధానాన్ని చెత్తబుట్టలో పడేశాం. పౌరసత్వ చట్ట సవరణల ద్వారా భారత్ దయాగుణం, కలిసిపోయే తత్వాన్ని తెలియజేశాం’. రైతులు, మహిళలు, యువత సాధికారత ‘మహిళలు, యువత, రైతుల సా«ధికారతకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తాం. పీఎం సమ్మాన్ నిధి పథకం ద్వారా 9 కోట్ల 50 లక్షల మందికిపైగా రైతుల అకౌంట్లలో రూ.72 వేల కోట్లు జమచేశాం. గ్రామీణ భారత్లో 15 కోట్ల ఇళ్లకు జల్ జీవన్ మిషన్ ద్వారా స్వచ్ఛమైన మంచినీరు అందించే ప్రయత్నాలు సాగుతున్నాయి. రైతులు, రైతు కూలీలు, అసంఘటిత రంగంలో ఉన్న 60 ఏళ్లు పై బడిన వారికి నెలకి రూ.3 వేలు పింఛన్ ఇవ్వాలని హామీ ఇచ్చాం’ తొలిగిపోతున్న గ్రామీణ, పట్టణ అంతరాలు ‘పట్టణాలు, గ్రామాల మధ్య అంతరాలు తొలగిపోతున్నాయి. పట్టణాల్లో ప్రజల కంటే 10శాతం ఎక్కువగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఇంటర్నెట్ను వాడుతున్నారు. స్వయం సహాయక గ్రూపుల్లో 7 కోట్ల మందికిపైగా గ్రామీణ మహిళలకు ఆర్థికంగా అండగా ఉంటున్నాం. ఇన్నాళ్లూ రూ.10 లక్షల రుణ పరిమితిని రూ.20 లక్షలకు పెంచాం. ఆదివాసీ పిల్లల విద్య కోసం 400కిపైగా ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలల్ని నిర్మిస్తున్నాం’ కరోనాపై ఐక్య పోరాటం ‘ఏడాది కాలంలో తీసుకున్న ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలతో దేశం ప్రగతి పట్టాలెక్కింది. అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఎన్నో సమస్యలు మనకి సవాళ్లు విసురుతున్నాయి. నేను రేయింబగళ్లు కష్టపడుతున్నాను. నాలోకూడా కొన్ని లోటుపాట్లు ఉండే ఉంటాయి. కానీ మన దేశానికి లోటు లేదు. నా మీద నాకున్న నమ్మకం కంటే మీ మీద, మీ బలం మీద, మీ సామర్థ్యం మీద ఉన్న విశ్వాసం ఎక్కువ. కరోనాపై పోరులో ఐక్యతను చూసి ప్రపంచ దేశాలు విస్తుపోయాయి’ ఆత్మనిర్భర్ భారత్తో కొత్త దశ దిశ ‘లాక్డౌన్ సమయంలో మన కూలీలు, వలస కార్మికులు, చేతివృత్తుల వారు, కళాకారులు, కుటీర పరిశ్రమల్లో పనిచేసేవారు, ఇలా సాటి పౌరులెందరో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. వారిని సమస్యల నుంచి గట్టెక్కించడానికి మనందరం పట్టుదలతో, ఐక్యతగా పనిచేస్తున్నాం. స్వయం సమృద్ధ భారత్ను సాధించడం ద్వారా మనం దేని మీదనైనా విజయం సాధించగలం. ఇటీవల ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీతో మన దేశ దశ, దిశ మారుతుంది. ఈ ప్యాకేజీ ద్వారా రైతులు, కార్మికులు, యువత, చిన్న తరహా పరిశ్రమలు నడిపేవారు ప్రతీ భారతీయుడికి ఉపాధి దొరికి కొత్త శకం ప్రారంభమవుతుంది’. -
హృదయం లేని ఆత్మ నిర్భరం
భావగర్భితంగా చెప్పాలంటే హృదయాన్ని మానవుల సత్సంకల్పానికి, నిస్సహాయులను ఆదుకునే తత్వానికి సంకేతంగా పేర్కొం టుంటారు. శారీరక బాధలకు అతీతంగా ఉండే ఆత్మ అభౌతిక అంశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. కాబట్టే ఎవరైనా తమ ఆత్మనే తప్ప ఇతరుల ఆత్మను అస్సలు పట్టించుకోరు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కరోనా వైరస్ సంక్షోభం నడుమ ఆత్మనిర్భర్ భారత్ (భారత స్వావలంబన) అనే ఆర్థిక ఎజెండాను ప్రకటించారు. దీనికి 20 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీని జోడించారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఉద్దీపన ప్యాకేజీని కేంద్రం ఎలా అమలు చేయనుంది అనే అంశంపై వరుసగా అయిదు మీడియా సమావేశాలు పెట్టి మరీ వివరించారు. ఆరెస్సెస్–బీజేపీ ప్రభుత్వం తలపెట్టిన ఆత్మనిర్భర్ పథకం మొత్తం లక్ష్యం ఏమిటి? మన దేశంలోనూ, ఇతర విదేశాల్లోనూ షేర్లు కలిగివుండి, కంపెనీలను నడుపుతున్న ప్రైవేట్ రంగం (సంపన్న పారి శ్రామికులు, బడా వాణిజ్యాధిపతులు) కరోనా సంక్షోభ కాలంలో జాతి సంక్షేమం, ప్రజా శ్రేయస్సుపై దృష్టి పెట్టకుండా లాభమే పరమావధిగా సాగుతున్నకాలంలో ఆర్థిక వ్యవస్థను మరింత మరింతగా ప్రైవేటీకరిం చడమే కేంద్ర పథకం లక్ష్యం. లాక్డౌన్ నేపథ్యంలో పట్టణ కేంద్రాల్లో జీవితం గడపడం అసాధ్యమైపోయిన భయంకరమైన పరిస్థితుల్లో వేలాదిమైళ్ల దూరం నడుచుకుంటూ స్వస్థలాలకు వెళుతున్న అసంఖ్యాక కార్మికుల జీవితాలను భారత గుత్తపెట్టుబడిదారులు ఏమేరకు ఆదుకుని ఉంటారు అన్నదే అసలు ప్రశ్న. అర్థరాత్రి దేశవ్యాప్తంగా పనిస్థలాలను మూసివేసిన నేపథ్యంలో కూడు, గూడు, నీరు లేని స్థితిలో దేశంలోని 20 కోట్లమంది వలస కార్మికుల (వీరిలో ఎక్కువమంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలే) పరిస్థితి గురించి ఏమాత్రం ఆలోచించకుండానే ప్రధాని మోదీ మార్చి 24న దేశమంతటా లాక్ డౌన్ ప్రకటించారు. అలా కాకుండా లాక్డౌన్ ప్రకటనకు నాలుగైదు రోజులు ముందుగా అప్రమత్తం చేసి ఉంటే కరోనా నుంచి లాక్డౌన్ సమయంలో కాపాడిన వారికంటే ఎక్కువ సంఖ్యలో వలస కూలీలను కాపాడగలిగి ఉండవచ్చు. కరోనా వైరస్ కారణంగా చనిపోతున్న వారందరి పట్ల ప్రేమను, నిజమైన ఆందోళనను ప్రదర్శించడానికి బదులుగా పాలకవర్గాలు ప్రదర్శించిన హృదయరాహిత్యాన్ని వలస కూలీల దుస్థితి తేటతెల్లం చేస్తోంది. ఆకలిదప్పులకు గురవుతూనే నడచుకుంటూ పోతున్న పిల్లలు, మహిళలు రహదారులపై, అడవుల్లో, రైల్వే ట్రాక్లమీదే పడి కుప్పకూలిపోతున్నారు. డస్సిపోయి మరణిస్తున్న చిన్నపిల్లల ముఖాలు కేవల ఆత్మను కాకుండా మానవీయ హృదయాన్ని కలిగిన ప్రతి ఒక్కరినీ చాచికొడుతున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ ఆరెస్సెస్, అతిపెద్ద రాజకీయపార్టీ బీజేపీ నేతలు పూర్తిగా ఇళ్లకే పరిమితమై తమ ప్రాణాలను కాపాడుకోవడంలోనే మునిగిపోయి ఉన్నారు. ఇతర రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కూడా కాలినడకన సాగిపోతూ, ఆకలితో అలమటిస్తూ చనిపోతున్న ప్రజలను కాపాడటానికి తమ నాయకులను కానీ, కేడర్లను కూడా పంపించిన పాపాన పోలేదు. యావత్ ప్రపంచం లాక్డౌన్లో ఉంటున్న కాలంలోనే, తనను మించినవారు లేరని గర్విస్తున్న జాతీయవాద పార్టీ పాలిస్తున్న భారతదేశంలో రహదారులన్నీ వలసకూలీల పాదాలతో రక్తమోడుతున్నాయి. ఉపాధిలేని, అంతకుమించి హృదయం లేని పట్టణ కేంద్రాల్లో కంటే గ్రామాలు ఎంతోకొంత మానవీయ వాతావరణంతో ఉంటాయని వలస కార్మికులు భావిం చారు. నిజానికి లాక్డౌన్ కాలంలో పట్టణ కేంద్రాలు వలస కార్మికులను శారీరకంగా, మానసికంగా కూడా చంపేశాయి. నగరాల్లో సురక్షితంగా బతుకుతామని లేశమాత్రం ఆశ ఉండి ఉంటే, మండువేసవిలో పిల్లలు, గర్భిణీలు, వృద్ధమహిళలతో వలసకూలీలు జాతీయ రహదారులపైకి వచ్చి ఉండేవారు కారు. దేశవ్యాప్తంగా ఆహార ఉత్పత్తిదారులు, భవన నిర్మాతల పట్ల తన హృదయరాహిత్యాన్ని హిందుత్వ నిస్సిగ్గుగా ప్రదర్శించింది. హిందుత్వ శక్తుల జాతీయవాదమే వందలాది వలసకార్మికులను రహదారులపై కరోనాకు బలి ఇచ్చింది. క్రూరమైన వైరస్ బారినపడి వలసకూలీల్లో చాలామంది చనిపోతున్నారు. మన దేశంలో దేవుళ్లు కానీ, ఈ జాతీయవాదులు కానీ వీరిపట్ల కరుణ చూపడం లేదు. భారతదేశంలో గత 95 ఏళ్లుగా ఉనికిలో ఉంటున్న ఆరెస్సెస్, బీజేపీ (గతంలో జనసంఘ్)లు భావజాలపరంగా, ఆచరణాత్మకంగా కూడా దేశంలోని కోట్లాదిమంది శ్రామికుల జీవితాన్ని మెరుగుపర్చడం గురించి ఆలోచించేవిధంగా ఎన్నడూ శిక్షణ పొందలేదు. ప్రజలను కూడగట్టడం, ఆచరణాత్మక తీర్మానాలు రాయడం, ప్రచార క్రమంలో ప్రసంగించడం అనే ఈ సంస్థల మొత్తం ప్రక్రియ మతపరమైన జాతీయవాదంతోనే సాగింది. వీరి జాతీయవాద కీలకలక్ష్యం ముస్లింలను, క్రైస్తవులను వ్యతిరేకించడమే. వారు గొప్పగా చర్చకు పెట్టిన సాంస్కృతిక జాతీయవాదం కూడా దేశంలో ముస్లింలు, క్రైస్తవుల ఉనికిని బలహీనపర్చడం గురించే మాట్లాడింది తప్ప దేశానికి అవసరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్న, భవనాలు నిర్మిస్తున్న పేదవారిని బలోపేతం చేయాలని ఎన్నడూ ప్రయత్నించలేదు. ఎందుకంటే వీరంతా దళితులు, శూద్రులు, ఓబీసీ ఆదివాసీ కుటుంబాలకు సంబంధించినవారే. వీరి జాతీయవాదం పేదవారికి పారిశ్రామికులు, బలిసిన మత గురువులతో సమానస్థాయిని ఇవ్వలేదు. అంతేకాకుండా వీరు ఒక నిర్దిష్టమైన ఆర్థిక జాతీయవాద ఎజెండాను ఎన్నడూ రూపొందించలేదు. 20వ శతాబ్ది మొదట్లో ఆరెస్సెస్ ప్రారంభమైనప్పుడు ఆర్థిక జాతీయవాదం అంటే.. ప్రధానంగా వ్యవసాయం, భూ సమస్య, చేతివృత్తులను బలపర్చడం, కుల విభేదాలను పరిష్కరించడం అనే అర్థాలతో ఉండేది. భారత జాతీయ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ తమ పరిమితుల్లోనే ఈ సమస్యల్లో చాలా వాటిని చర్చించాయి. ఇక అంబేడ్కర్, పెరియార్ రామస్వామి నాయకర్ వారి సహచరులు మానవ అసమానతలను తగ్గించడంతోపాటు కుల నిర్మూలన సమస్యను కూడా లేవనెత్తారు. కానీ వీరిని ఆరెస్సెస్ జాతీయవాదులు శత్రువులుగా భావించారు. ఆరెస్సెస్ సిద్ధాంతకర్తలు ఈ దేశంలోని భూస్వామ్యతత్వంపై, లేక భారత వ్యాపార పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్న వడ్డీ పెట్టుబడికి వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా రాయలేదు. ఈ దేశంలో ముస్లింలు, క్రైస్తవులు వ్యాపారాన్ని, బడా భూ ఎస్టేట్లను ఎన్నడూ నియంత్రించలేదు. ఉదాహరణకు మహారాష్ట్రలో దేశాయి, సర్దేశాయిలు భూస్వాములు. వీరు బ్రాహ్మణులు. తర్వాతికాలంలో శూద్ర మరాఠాలు భూస్వాములుగా మారడానికి ముందు బ్రాహ్మణులే భూమిపై ఆజమాయిషీ కలిగి ఉండేవారు. చాలా మీడియా రిపోర్టులు ఆత్మనిర్భర్ పథకం కూడా ఆరెస్సెస్ ఆర్థిక సిద్ధాంతకర్త దత్తోపంత్ తెంగడి (స్వదేశీ జాగరణ్ మంచ్) రూపొందించిన స్వదేశీ ఎజెండాలో భాగమేనని సూచిస్తున్నాయి. ఇక 1993లో ‘హిందూ ఎకనమిక్స్ ఎటర్నల్ ఎకనమిక్ ఆర్డర్’ అనే పుస్తకం రాసిన హిందుత్వ ఆర్థికవేత్త డాక్టర్ ఎంజీ బొకారే కూడా ఈ ఎజెండా రూపకర్తల్లో ఒకరని తెలుస్తోంది. పైగా ఆరెస్సెస్, బీజేపీలు భారత ఆర్థిక వ్యవస్థలోని విభిన్న రంగాల్లో ఉత్పత్తి, పంపిణీకి సంబంధించిన సూత్రబద్ధతను కలిగి ఉన్నాయా అనేది ప్రాథమిక ప్రశ్న. వీరికి ఉత్పత్తి, పంపిణీపై ఏదైనా సానుకూల సిద్ధాంతం కూడా ఉన్నట్లు రికార్డులేదు. ఈ నేపథ్యంలో కోవిడ్ అనంతర ప్రైవేటీకరణ దేశ కార్మికశక్తిని మరింతగా మృత్యుశయ్యలోకి నెట్టేస్తుందని చెప్పాలి. హిందుత్వ శక్తుల దృష్టి ఎప్పుడూ మతం, సంస్కృతి చుట్టూనే తిరుగుతూవచ్చింది తప్పితే ఆర్థికంపై లేదు. మహాత్మాగాంధీ తన హింద్ స్వరాజ్లో ఉపయోగించిన స్వదేశీ భావన గురించి వీరు అస్పష్టంగా మాట్లాడుతుంటారు. భారతదేశంలో పారిశ్రామికీకరణను గాంధీ వ్యతిరేకించడమే కాకుండా వికేంద్రీకరించిన గ్రామీణ ఆర్థిక నమూనాను సమర్థించారు. చర్కా తన ఆర్థిక నమూనాకు సంకేతం. కానీ నెహ్రూవియన్ సిద్ధాంతకర్తలు, కమ్యూనిస్టులు మాత్రం తొలి నుంచి పారిశ్రామికీకరణ, పట్టణీకరణను బలపర్చేవారు. ఇక హిందుత్వ సిద్ధాంతకర్త దత్తోపంత్ ప్రతిపాదిస్తున్న ’మూడో మార్గం’కి ఏ దారీ తెన్నూ ఉన్నట్లు లేదు. కాబట్టి ఒక స్పష్టమైన ఆర్థిక మార్గం అంటూ లేని ఆరెస్సెస్, బీజేపీల ఆత్మనిర్భర భారత్ స్వరూపం ఎలా ఉండబోతోంది? ఇంతవరకు కేంద్రంలో 11 సంవత్సరాలు పాలించిన ఆరెస్సెస్, బీజేపీలు అంతి మంగా కాంగ్రెస్ అభివృద్ధి నమూనానే పాటిస్తూ వచ్చాయి. కాంగ్రెస్కు భూస్వామ్య భూసంస్కరణ వ్యతిరేక ఎజెండా ఉండేది. కానీ భూసంస్కరణపై ఎలాంటి చర్చనూ ఆరెస్సెస్, బీజేపీలు అనుమతించవు. ఇప్పుడు భూస్వామ్యవిధానం అంతరించింది. భారత ఆర్థికవ్యవస్థ ఆజమాయిషీలోని పట్టణ వ్యాపార పెట్టుబడిదారీ విధానానికి ఆరెస్సెస్ బీజేపీ అనుకూలం. భారత గుత్తపెట్టుబడి అమెరికన్–యూరోపియన్ పెట్టుబడితో మిలాఖతై ఉంది. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం కూడా పూర్తిగా అమెరికన్ అనుకూల ధోరణితో ఉంది. ఇలాంటి పెద్దన్న, చిన్నన్న సంబంధంలో స్వావలంబనకు చోటెక్కడ? మరోవైపున లాక్డౌన్ సంక్షోభకాలంలో కూడా వ్యవసాయ ఉత్పత్తి, వ్యవసాయ శ్రామిక శక్తి వల్లే దేశం భద్రంగా ఉంది. కోవిడ్–19 సంక్షోభ సమయంలో ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ బలహీనంగా ఉంది. అదేసమయంలో ప్రైవేట్ ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా మూతపడిపోయింది. భారత శ్రామిక వర్గం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే వైద్యం పొందే పరిస్థితుల్లో ఉంటోంది. కేంద్రప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపనలో ప్రభుత్వ వైద్యరంగానికి కేటాయించిన వాటా లెక్కలోకి కూడా రాదు. దీన్నంతా చూస్తుంటే వలస కార్మికుల మరణాలను ఫణంగా పెట్టి హృదయంలేని హిందుత్వ ఆత్మ మరింత డబ్బుకోసం వెంపర్లాడుతున్నట్లు కనిపిస్తోంది. వ్యాసకర్త : ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్, డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
ప్రధానికి కాంగ్రెస్ ఎంపీ అభినందనలు
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడిని సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా చర్యలు చేపట్టడమే కాకుండా అయా దేశాలకు వైద్య సహకారం అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అభినందించారు. 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' ప్యాకేజీలో భాగంగా చేనేత వృత్తులకు , చేతి వృత్తిదారులకు నిధులు కేటాయించాలని కోరుతూ ప్రధానికి కోమటిరెడ్డి లేఖ రాశారు. ఈ సందర్భంగా కరోనా సంక్షోభంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అతి పెద్ద ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘కరోనా మహమ్మారి విస్తరించకుండా విధించిన లాక్ డౌన్ కారణంగా తెలంగాణతో పాటు దేశంలో ఉన్న చేనేత, చేతి వృత్తిదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 2019 గణంకాల ప్రకారం 31 లక్షల కుటుంబాలు, 45 లక్షల మంది ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగానికి నిధులు కేటాయించి ఆదుకోవాలి. సంప్రదాయంగా ఇదే వృత్తిని నమ్ముకున్న చేనేత వృత్తిదారులలో ఆధిక శాతం పేదవారు ఉన్నారు. ఇందులో 67 శాతం మంది రూ.5,000 లోపు , 26.2 శాతం రూ.10,000 లోపు, 6.8 శాతం మాత్రమే రూ.10,000 పైన ఆదాయం పొందుతున్నారు. మన దగ్గర తయారైన ఉత్పత్తులను మన దేశంలోనే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసేవారు. లాక్ డౌన్ కారణంగా ముడి సరుకుల రవాణా లేక, పని లేక చేనేత , చేతి వృత్తిదారులకు ఉపాధి కరువైంది. ఇదే వృత్తిని నమ్ముకున్న వారంతా ఆకలితో అలమటిస్తున్నారు. వీరికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని కోరుతున్నాను. ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తే ముడి సరుకుల కొనుగోలు ద్వారా అయా వృత్తులు తిరిగి గాడిలో పడుతాయి. నెలకు రూ. 3,000ల చొప్పున మూడు నెలల పాటు ఆర్థిక సాయం, పౌర సరఫరాల శాఖ నుంచి రేషన్ అందించాలి. దేశంలోని 23 కోట్ల బీపీఎల్ కుటుంబాలకు దోతిలు, చీరలు అందజేయాలని, వీటిని తయారు చేసే బాధ్యతను చేనేత, చేతివృత్తిదారులకు అప్పగించాలి’ అంటూ ప్రధాని మోదీకి రాసిన లేఖలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోరారు. చదవండి: భారత్పై నేపాల్ ప్రధాని షాకింగ్ కామెంట్లు! బస్సుల గోల.. కాంగ్రెస్పై అదితి ఫైర్ -
అక్కరకు రాని ప్యాకేజీలు
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12న జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీలో ఏమేం వుంటాయో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరసగా అయిదు రోజులపాటు అందరికీ తేటతెల్లం చేశారు. భారీ మొత్తం అని ప్రధాని చెప్పారుగనుక... జీడీపీలో పది శాతం అన్నారు గనుక ఈ ఉద్దీపనల పరంపరపై ఆశలు కూడా అదే స్థాయిలో భారీగా వున్నాయి. చివరాఖరికి ఇవి ఎవరినీ సంతృప్తిపరచకపోగా... ఈ వంకన ప్రైవేటీకరణకు, ఇతరత్రా సంస్కరణ లకు కేంద్రం పావులు కదుపుతోందన్న అభిప్రాయం అందరిలోనూ ఏర్పడింది. దీర్ఘకాల ప్రయోజనా లను దృష్టిలో వుంచుకుని ఈ ఉద్దీపనలను రూపొందించామని మంత్రి చెబుతున్నారు. కానీ లాక్డౌన్ పర్యవసానంగా పూట గడవడం కూడా కష్టమైన జనాభాకు తక్షణం చేసేదేమిటో చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై వుంది. కనీసం అంతంతమాత్రంగా వున్న జీడీపీని మందకొడిగా కదిలించడానికైనా ఈ ఉద్దీపనల పరంపర దోహదపడుతుందా అన్నది అనుమానమే. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ను మోదీ ప్రకటించిన నాటికే కేంద్రం, ఆర్బీఐ రూ. 9 లక్షల 94 వేల 403 కోట్ల విలువైన ఉద్దీపనలు ఇచ్చాయి. ఇప్పుడు ప్రకటించిన అయిదు ఉద్దీపనల విలువ రూ. 11 లక్షల 2 వేల 650 కోట్లు. ఈ రెండింటి విలువా లెక్కేస్తే అది రూ. 20 లక్షల 97 వేల 53 కోట్లు. సారాంశంలో ప్రధాని ముందుగా చెప్పిన రూ. 20 లక్షల కోట్ల కంటే ఇది దాదాపు లక్ష కోట్లు అదనం. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో తాను చాలా ఉదారంగా వున్నానన్న అభిప్రాయం కేంద్రంలో దండిగా వున్నట్టే కనబడుతోంది. ఆ అభి ప్రాయం సామాన్యుల్లో కలగజేయడానికి కూడా ప్రయత్నించివుంటే బాగుండేది. ప్రకటించినదాన్లో వాస్తవంగా నగదు రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అందరికీ అందేది ఎంతన్నదే కీలకం. ఈ ఉద్దీపనల పర్యవసానంగా బడ్జెట్పై ఎంత శాతం భారం పడుతుందన్న ప్రశ్నకు మంత్రి జవాబివ్వ లేదు. ఆ మాట చెప్తే కరోనా వల్ల కేంద్రం అదనంగా మోస్తున్న భారమెంతో తెలిసేది. అది రూ. 2.02 లక్షల కోట్లని కొందరు ఆర్థిక నిపుణులు చెబుతుంటే... లక్షన్నర కోట్లు దాటదని మరికొందరి నిపు ణుల అభిప్రాయం. మొత్తానికి జీడీపీలో ఒక శాతం దాటదని వారు లెక్కలు కడుతున్నారు. మరి కేంద్రం చేసిందేమిటి? మొదటిరోజు నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఉద్దీపన ప్రధానంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా(ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు సంబంధించింది. వాటికి బ్యాంకుల నుంచి రూ. 3 లక్షల కోట్ల మేర రుణ సదుపాయం కల్పిస్తున్నట్టు చెప్పడంతోపాటు అందుకు ఎలాంటి హామీ చూపనవసరం లేదన్నారు. కానీ కేంద్రంలో ఆ పరిశ్రమలకు సంబంధించిన శాఖను చూస్తున్న నితిన్ గడ్కారీ చెబు తున్న లెక్క ప్రకారం ఆ సంస్థలకు ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేట్ సంస్థలు చెల్లించాల్సిన బకాయిల విలువే రూ. 5 లక్షల కోట్లు! కనుకనే ‘మాపై అంత ఔదార్యం చూపాల్సిన అవసరం లేదు... మాకు రావాల్సిన బకాయిలేవో తీర్చండి చాల’ని ఎంఎస్ఎంఈలు మొత్తుకుంటు న్నాయి. లాక్డౌన్కు ముందే అవి నానా అగచాట్లూ పడుతున్నాయి. ఇలాంటి సమయంలో వాటికి నగదు లభ్యత పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కేంద్రం పట్టించుకోలేదు. ఈ అయిదు ఉద్దీపనల్లోనూ మొత్తంగా కేంద్రం 40 రకాల చర్యల్ని ప్రకటించింది. కానీ వీటిల్లో అత్యధికం సంస్కరణ లకు సంబంధించినవే తప్ప లిక్విడిటీని పెంచగలిగేవి కాదు. ఈ కరోనా సమయంలో అందరికీ గుర్తొస్తున్న ప్రజారోగ్యానికి ఈ ఉద్దీపనల్లో చోటు దొరికింది. కానీ అందుకు ఎంత కేటా యించదల్చుకున్నదో కేంద్రం చెప్పలేదు. ఎంఎస్ఎంఈలు, చిన్న వ్యాపారులు మొదలుకొని రాష్ట్రాల వరకూ దాదాపు అందరికందరూ రుణాలు తెచ్చుకోవాలి తప్ప కేంద్రం తనకు తానుగా ఇవ్వదల్చు కున్నది లేదు. వలసజీవులకు రెండు నెలలపాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేస్తామని, గ్రామీణ ఉపాధికి అదనంగా రూ. 40,000 కోట్లు కేటాయిస్తామని చెప్పడం బాగానేవుంది. కానీ వలసజీవుల్లో అత్యధికులు ఇప్పుడు నడిరోడ్లపై, రైలుపట్టాలపై వున్నారు. వందలు, వేల కిలోమీటర్ల దూరాల్లో వున్న స్వస్థలాలకు రాత్రనక, పగలనక నడిచిపోతున్నారు. ఆకలిదప్పులతో అలమటిస్తు న్నారు. గుజరాత్, యూపీ, మహారాష్ట్ర తదితరచోట్ల మమ్మల్ని పోనీయమంటూ బయటికొచ్చిన వారిని చావగొడుతున్నారు. అలాంటివారికి ఇప్పుడు ప్రకటించిన ఉద్దీపనల్లోని చర్యలు ఏమేరకు దోహదపడతాయో కేంద్రం ఆలోచించిందా? దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రం మీదుగా నడిచి వెళ్తున్న వలసకూలీల కష్టాలను చూసి చలించి ఆదరించి అన్నం పెడుతోంది. వారికి చెప్పుల జతతో సహా అన్నీ అందించి, రైళ్లు, బస్సుల్లో ఉచి తంగా వారి వారి స్వస్థలాలకు పంపుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి చొరవ చూపాల్సిన అవసరం వుందని గుర్తించి, ఆ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలి. కరోనా కష్టాలు మొదలైనప్పటినుంచీ దాదాపు అన్ని రాష్ట్రాలూ ఆదాయం పడిపోయి, ఖర్చు అమాంతంగా పెరిగి అప్పు తెచ్చుకోవడానికి అనుమతించాలని కోరుతున్నాయి. తెచ్చుకునే రుణాలు జీడీపీలో 3 శాతం మించి వుండకూడదన్న నిబంధన మార్చాలంటున్నాయి. అందుకు కేంద్రం కూడా ఒప్పుకుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి దాన్ని 5 శాతానికి పెంచడానికి అంగీకరించింది. కానీ అందుకు విధించిన షరతులు విస్తుగొలుపుతాయి. మొదటి 0.5శాతం వరకూ పేచీలేదు. ఆ తర్వాత పెంచ దల్చుకున్నవాటికి సంస్కరణలతో ముడిపెట్టింది. ఆ సంస్కరణల సారాంశం జనంపై ఆర్థిక భారం మోపడం. విద్యుత్చార్జీలు, మున్సిపల్ పన్నులు వగైరాలు పెంచితే ప్రభుత్వాలు అప్పులు తెచ్చు కోవచ్చని చెప్పడం అన్యాయం, అమానుషం. దేశ జనాభాలో అత్యధిక శాతంమంది ఇప్పుడు విప త్కర పరిస్థితుల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. వారిని రక్షించడమెలాగన్న అంశంపై దృష్టి పెట్టడం ఇప్పటి అవసరం. కేంద్ర ప్రభుత్వం ఈ సంగతి గ్రహించాలి. -
రాష్ట్రాలకు రుణ పరిమితి పెంపు..
న్యూఢిల్లీ : రాష్ట్రాలకు రుణ పరిమితి 3 నుంచి 5 శాతానికి పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థికి మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రుణ పరిమితిని 3 నుంచి 3.5 శాతం పెంచుకునేందుకు ఎలాంటి షరతులు వర్తించబోవని స్పష్టం చేశారు. అయితే కొన్ని షరతులతో 3.5 నుంచి 5 శాతం వరకు రుణ పరిమితిని పెంచుకునే అవకాశం కల్పించారు. రుణ పరిమితి పెంపు వల్ల రాష్ట్రాలకు రూ. 4.28 లక్షల కోట్లు అదనంగా అప్పులు తెచ్చుకునే అవకాశం లభిస్తుందన్నారు. కరోనా ప్రభావం నుంచి ఆర్థిక రంగాన్ని గట్టెక్కించడానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయం సమృద్ధి భారతం పేరిట రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఆఖరి విడత ప్యాకేజీ వివరాలను ఆదివారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్తో కలిసి మీడియాతో మాట్లాడారు. కోవిడ్ దృష్ట్యా రాష్ట్రాలు ఆదాయాన్ని కోల్పోతున్నాయని అన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలను ఆదుకునేందకు అన్నివిధాలా చర్యలు తీసకుంటున్నామని చెప్పారు. రూ. 11,092 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులను ఇప్పటికే అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. జీతభత్యాల చెల్లింపులో రాష్ట్రాలకు ఓవర్డ్రాఫ్ట్ తీసకునే అవకాశం కల్పించడంతో పాటుగా.. ఓవర్డ్రాఫ్ట్ తీసుకునే అవకాశాన్ని 52 రోజులకు పెంచినట్టు వెల్లడించారు. పన్ను ఆదాయం కింద రాష్ట్రాలకు రూ. 46 వేల కోట్ల కేటాయింపులు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే చాలా రంగాల్లో సంస్కరణలకు సంబంధించి ప్రకటనలు చేశామని నిర్మల గుర్తుచేశారు. ప్రాణం ఉంటేనే.. ప్రపంచం ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటలను గుర్తుచేశారు. పేదలకు ఇబ్బంది కలగకుండా మూడు నెలలకు సరిపడా రేషన్ సరఫరా చేశామని చెప్పారు. పీఎం కిసాన్ పథకం ద్వారా 8.19 కోట్ల మందికి రూ. 2వేల చొప్పున ఇచ్చామని వెల్లడించారు. జన్ధన్ ఖాతాల ద్వారా 20 కోట్ల మంది మహిళలకు నగదు బదిలీ చేశామన్నారు. నిర్మాణ రంగంలో పనిచేసే 2.20 కోట్ల మంది కూలీలకు ఆర్థిక సహాయం అందించామని.. భవన నిర్మాణ కార్మికుల ఖాతాల్లో రూ. 3,995 కోట్లు జమచేశామని చెప్పారు. ఉజ్వల యోజన ద్వారా 6.81 కోట్ల ఫ్రీ సిలిండర్లు సరఫరా చేశామని మంత్రి తెలిపారు. 12 లక్షల మంది ఈపీఎఫ్ ఖతాదారులు ఒకేసారి నగదు విత్ డ్రా చేసుకున్నారని వెల్లడించారు. దేశంలో వైద్య సదుపాయాల ఏర్పాటుకు రూ. 15 వేల కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ఇప్పటికే 51 లక్షల పీపీఈ కిట్లు, 87 లక్షల ఎన్-95 మాస్క్లు సరఫరా చేశామన్నారు. వైద్య రంగంలో పనిచేసే సిబ్బంది రూ. 50 లక్షల బీమా సౌకర్యం అందిస్తున్నట్టు తెలిపారు. కోవిడ్ రిలీఫ్ ఫండ్ కింద రాష్ట్రాలకు రూ. 4,113 కోట్లు అందజేశామని తెలిపారు. ఆర్థిక మంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్యం కోసం ల్యాబ్ల ఏర్పాటు జిల్లా స్థాయిలో ప్రతి ఆస్పత్రిలో డిస్ఇన్పెక్షన్ సెంటర్ల ఏర్పాటు ఆన్లైన్ ఎడ్యుకేషన్ను ప్రోత్సహించడంలో భాగంగా వన్ క్లాస్, వన్ డిజిటిల్ పేరుతో డిజిటల్ పాఠాలు. త్వరలోనే టీవీ, రేడియోల ద్వారా ఆన్లైన్ పాఠాలు దేశవ్యాప్తంగా వైద్య సదుపాయాల ఏర్పాటుకు రూ. 15 వేల కోట్లు కేటాయించాం. గ్రామీణ ఉపాధి హామీ పనులకు అదనంగా మరో రూ. 40 వేల కోట్లు -
నిర్భరమో.. దుర్భరమో!
ఎంత కర్ణపేయమైన మాట అది. ఈ కరోనా రుతువులో మన ప్రధానమంత్రి ప్రజలను ఉద్దేశించి ఐదోసారి చేసిన ప్రసంగంలో ఒక వీనుల విందైన మాట దొర్లింది. ఆత్మ నిర్భర భారత్! ఆ లక్ష్యసాధన కోసం కంకణం కట్టుకుందామని ఉత్తేజపూరితమైన పిలుపునిచ్చారు ప్రధాని. గతంలో మన ప్రధానులు, జాతీయ నాయకులు ఇదే మాటను ఇంగ్లిష్లో సెల్ఫ్ రిలయన్స్ అనే వారు. మనం తెలుగులో స్వావలంబన అని రాసుకునేవాళ్లం. చదువుకునేవాళ్లం. స్వతంత్రం వచ్చిన డెబ్బయ్ మూడేళ్లలో కనీసం నూటా డెబ్బయ్మూడు సార్లు మన దేశాధినేతలు మనచేత స్వావలంబన కంకణాన్ని కట్టింపజేసి ఉంటారు. కానీ, చిత్రమేమిటంటే ఇప్పటికీ చాలామందికి ఆ మాటకు అర్థం తెలియదు. అయినా చెవులు తుప్పుపట్టేంత డెసిబుల్స్ మోతను ఆ శబ్దం మోసుకొచ్చింది. తొలి భారత ప్రధానమంత్రి పండిత జవహర్లాల్ నెహ్రూ 1951లో పంచవర్ష ప్రణాళికల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతూ, వీటి లక్ష్యం ‘సెల్ఫ్ రిలయన్స్’ అంటూ తొలి బాణాన్ని సంధించారు. అప్పటి నుంచి ప్రతి పంచ వర్ష ప్రణాళికలోనూ ప్రధాన లక్ష్యంగా ఈ మాట చోటు చేసు కుంటూనే ఉన్నది. ప్రతియేటా భారత రాష్ట్రపతి పార్లమెంట్ సమావేశాలను ప్రారంభిస్తూ ఈ లక్ష్యాన్ని నొక్కి వక్కాణిస్తూనే ఉన్నారు. ప్రతి వార్షిక బడ్జెట్ ప్రసంగంలోనూ అప్పటి ఆర్థిక మంత్రి ఈ గణపతి పూజను నిష్టగా నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రతి పంద్రాగస్టునాడు భారత ప్రధాని గాత్రంలోంచి వెలువడే ఈ మాటకు ఎర్రకోట కోరస్ పాడుతూనే వస్తున్నది. ఇన్నేళ్లుగా తపస్సు చేస్తూ వస్తున్నా సాక్షాత్కరించని స్వావలంబన శబ్దంపై ఒకరకమైన నిర్లిప్తత జనంలో ఏర్పడిపోయింది. అందువల్లనే భారత ప్రధాని మొన్నటి ప్రసంగంలో ఈ మాటను హిందీలో రీడిజైన్ చేసి వాడటంతో గొప్ప రిలీఫ్ లభించింది. నిజం చెప్పా లంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ చేసిన ‘ఉద్దీపన’ కంటే ‘ఆత్మనిర్భర్’ అనే పంచాక్షరీ వల్ల కలిగిన ఉద్దీపనే గొప్ప. నిజంగానే ఈ పంచాక్షరీ మంత్రం ఫలితమిచ్చి, కరోనా నంతర ప్రపంచ పరిణామాల్లో భారత్ స్వావలంబనను సాధిం చగలిగితే, చరిత్రలో ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, డెంగ్ షియావో పింగ్ల సరసన నరేంద్ర మోదీ పేరు చేరిపోతుంది. 1929–30ల నాటి మహా మాంద్యం (గ్రేట్ డిప్రెషన్) ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అమెరికాను మరింతగా. ఈ సంక్షోభం అనంతరం అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ ‘న్యూడీల్’ పాలసీతో ఆర్థిక స్థితిని చక్కదిద్దడం ప్రారంభించి రెండో ప్రపంచయుద్ధం ముగిసేవరకూ మూడు పర్యాయాలు పదవిలో కొనసాగారు. ఆ తర్వాత అమెరికా వెనుతిరిగి చూడలేదు. సైనికపరంగా కొంత కాలంపాటు సోవియట్ రష్యాతో పోటీపడవలసి వచ్చినప్పటికీ, ఆర్థికంగా మాత్రం అజేయశక్తిగానే కొనసాగుతున్నది. 1950వ దశకంలో అప్పటికి వ్యవసాయిక దేశంగా ఉన్న చైనాను ఉన్న పళంగా కమ్యూనిస్టు వ్యవస్థగా తీర్చిదిద్దడంకోసం చైర్మన్ మావో జెడాంగ్ ప్రారంభించిన ‘గొప్ప ముందడుగు’ (గ్రేట్ లీప్ ఫార్వర్డ్) అనే ఆర్థిక ఉద్యమం విధ్వంసకరంగా తయారైంది. లక్ష లాదిమంది గ్రామీణ ప్రజలు ఆకలి చావులకు బలయ్యారు. మావో ప్రారంభించిన సాంస్కృతిక విప్లవం కూడా వికటించి చైనా పెను సంక్షోభంలో కూరుకొనిపోయింది. ఈ దశలో చైనా విప్లవ అగ్ర నాయకత్రయంగా ప్రసిద్ధిచెందిన చైర్మన్ మావో, ఝౌ ఎన్లై, జనరల్ ఝూడే ఏడాదికాల వ్యవధిలో ఒకరి తర్వాత మరొకరు కన్నుమూశారు. అప్పుడు చైనా కమ్యూనిస్టు పార్టీ పగ్గాలు చేతబట్టిన డెంగ్ షియావో పింగ్ ప్రాప్తకాలజ్ఞతతో వ్యవహరించి దేశంలో సోషలిస్టు మార్కెట్ ఎకానమీని ప్రారం భించి తొలిసారిగా అంతర్జాతీయ సమాజానికి చైనా తలుపులు తెరిచారు. అక్కడి నుంచి బయల్దేరిన చైనా ఆర్థిక ప్రగతి పయనం రెండో బలమైన ఆర్థిక వ్యవస్థ దశకు చేరుకున్నది. నేడు ప్రపం చంలో రెండు బలమైన ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న ఈ రెండు దేశాలూ పెను సంక్షోభాల్లోంచి ఫీనిక్స్ పక్షుల్లాగా పైకెగసిన పాఠం మనముందున్నది. ఇప్పుడు భారత్ ఎదుర్కొంటున్నది కూడా పెను సంక్షోభ దశే. ఈ దశ దాటిన తర్వాత దేశ భవిష్యత్తు ఏవిధంగా ఉండబోతున్నదనేదే మిలియన్ డాలర్ ప్రశ్న. పారిశ్రామిక విప్లవం ఫలితంగానే యూరప్ దేశాలు ప్రపంచం మీద పెత్తనం చేశాయనీ, వలస దేశాలను పీల్చి పిప్పి చేసిన కారణంగానే అవి అభివృద్ధి చెందాయనే విషయాలు మనకు తెలుసు. తొలి పారిశ్రామిక విప్లవం యూరప్ కంటే కనీసం వెయ్యేళ్లు ముందుగానే భారత్లో వచ్చి ఉండాల్సిందని చాలామంది చరిత్రకారులు ఇప్పటికీ అభిప్రాయపడుతుంటారు. ఎందుకంటే, వేదకాలం నుంచే ఈ దేశంలో శాస్త్ర, సాంకేతిక, ఇంజనీరింగ్ రంగాలకు సంబంధించిన అద్భుత పరిజ్ఞానం ఉంది. 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య ఆస్థానంలో కొలువుదీరిన సాయన సంస్కృతంలో మహాపండితుడు రుగ్వే దానికి భాష్యం రాశాడు. ఒక రుగ్వేద శ్లోకానికి అర్థం చెబుతూ కాంతివేగాన్ని సెకనుకు 3,25,940 కిలోమీటర్లుగా నిర్ధారించా రని పేర్కొన్నారు. ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఆ వేగాన్ని 3 లక్షల కిలోమీటర్లుగా తేల్చింది. దాదాపు కచ్చితత్వంతో రెండువేల సంవత్సరాలు ముందుగానే భారతీయ విజ్ఞానం లెక్కతేల్చింది. ప్రస్తుత కొలమానాల ప్రకారం చూస్తే ఒక మీటర్ పరిమాణాన్ని వందకోట్ల భాగాలుగా విభజిస్తే చివరికి మిగిలే పరిమాణమే పరమాణువు అని అగ్నిపురాణం పేర్కొన్నదనీ, ఆ లెక్కను ఆధు నిక విజ్ఞానం అంగీకరించిందనీ చెబుతారు. సున్నాను ప్రవే శపెట్టి గణిత శాస్త్రాన్ని మలుపుతిప్పిన ఆర్యభట్ట అంతరిక్ష శాస్త్రానికి కూడా పితామహుడు. ఘనమైన వైజ్ఞానిక నేపథ్య మున్న దేశంలో ముందుగా పారిశ్రామిక విప్లవం ఎందుకు పురివిప్పలేదన్న అంశంపై భిన్నమైన వాదనలున్నాయి. బౌద్ధ మతం ప్రబలంగా ప్రచారంలో ఉన్నంతకాలం కులాలకు అతీ తంగా విజ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టే ప్రయత్నం చేశారు. ప్రబుద్ధ కాత్యాయనుడు ఆటమిక్ థియరీని, ఆచార్య నాగా ర్జునుడు రసాయన శాస్త్రాన్ని బోధించేవారని చెబుతారు. మనం స్వర్ణయుగంగా కొనియాడుతున్న గుప్తుల కాలం వచ్చేనాటికి బౌద్ధవ్యాప్తి క్షీణించడం మొదలైంది. వైదికం రాజ్యమతమైంది. వేదవిజ్ఞానం పూజాక్రతువుగా మారిపోయింది. సంస్కృతం కులీన వర్గానికే పరిమితమైంది. శ్రామికవర్గాలు, ఉత్పత్తి కులాల వారు పొరపాటున వేదం వింటే చెవుల్లో సీసం పోసే మనుధర్మ శాస్త్రం నాలుగు పాదాల మీద నడవడం ప్రారంభమైంది. విద్యకు, విజ్ఞానానికి ఉత్పత్తి కులాలను దూరం చేసిన ఫలితంగా ఉత్పత్తి రంగంలో నూతన ఆవిష్కరణలు సాధ్యంకాలేదు. రవి అస్తమించని భారతీయ సామ్రాజ్యం ఏర్పడే అవకాశాన్ని చెరిపి వేసి బానిస దేశంగా బతికే దౌర్భాగ్యాన్ని ఈ సామాజిక వివక్ష ప్రసాదించింది. నాడు సంస్కృతాన్ని, విద్యనూ పేదవర్గాలకు నిరాకరించినట్లే ఈనాడు ఇంగ్లిష్ విద్యను కూడా శ్రామిక కులా లకు నిరాకరిస్తే ఇకముందు కూడా ఈ దేశ భవిష్యత్తు దౌర్భా గ్యమస్తుగానే మిగులుతుంది. దేశంలో ఈనాటికీ సగం జనాభా వ్యవసాయరంగంపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆధారపడి వుంది. అందువల్ల ఈ రంగంలో ఉత్పాదకతను పెంచడానికి చర్యలు తీసుకుని, లాభ సాటి రంగంగా మార్చడం ద్వారానే భారత ఆత్మ నిర్భరత గమ్యంలో తొలి అడుగు వేయడం సాధ్యమవుతుంది. అగ్రికల్చర్ సెన్సస్ 2015–16 ప్రకారం దేశంలోని మొత్తం రైతు జనాభాలో 86 శాతం మంది ఐదెకరాల లోపు చిన్న రైతులే. సగటు కమతం విస్తీర్ణం రెండున్నర ఎకరాలు. ఇందులో కూడా అత్యధిక సంఖ్యా కులు ఒకటిన్నర ఎకరం వారే. ఈ ఒకటిన్నర ఎకరం రైతు కుటుంబం స్వయం సమృద్ధమైతేనే వ్యవసాయ రంగం లాభ సాటిగా మారినట్టు. అర ఎకరం విస్తీర్ణంలో రైతు కుటుంబానికి కావలసిన తిండి గింజలు, కూరగాయలను ఉత్పత్తి చేసుకొని మిగిలిన ఎకరం ద్వారా రెండు లేదా మూడు పంటలు తీసి, కోళ్ల పెంపకం, పాడి వగైరా సమీకృత విధానాల ఆచరణతో, ఖర్చులు పోను సాలీనా లక్ష రూపాయల లాభం తీస్తేనే రైతు ఆత్మగౌరవంతో జీవిస్తాడు. వ్యవసాయ రంగంలో ఆత్మనిర్భర తకు ఇదే గీటురాయి. ఈ దిశలో ఇప్పటికే అడుగులేసిన తెలుగు రాష్ట్రాల కార్యక్రమాలను కేంద్రం అధ్యయనం చేయాలి. రైతు భరోసా, రైతు బంధు పేర్లతో రెండు రాష్ట్రాలూ రైతుకు పెట్టుబడి ఖర్చులను ముందుగానే అందజేస్తున్నాయి. కేంద్రం కూడా ఆలస్యంగా రంగంలోకి దిగినా నామమాత్రంగా రెండు వేల రూపాయల చొప్పున మాత్రమే ఇస్తున్నది. ఐదెకరాల లోపు చిన్న, సన్నకారు రైతులందరికీ కనీసం పదివేలు చొప్పున పెట్టు బడి ఖర్చుల కింద కేంద్రం కూడా అందజేస్తే వ్యవసాయ రంగంలో ఉత్సాహపూరిత వాతావరణం ఏర్పడుతుంది. తెలం గాణ ప్రభుత్వం రాష్ట్రంలో పంటలు పండించే తీరుతెన్నులు, స్థానిక ప్రజల ఆహారపు అలవాట్లపై ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే ఫలితాల ఆధారంగా రాష్ట్రంలో వినియోగమయ్యే ఆహార ఉత్పత్తులను సాధ్యమైనంత మేరకు రాష్ట్రంలోనే పండించే విధంగా ఒక ప్రణాళికను రూపొందించింది. ఏయే ప్రాంతంలో రైతులు ఏయే పంటలు వేస్తే లాభసాటిగా ఉంటుందో నిపుణుల చేత అంచనాలు వేయించి రైతులకు సూచించబోతున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నాడు రైతుబంధు సమితి సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ఉన్న రైతుబంధు సమితుల పర్యవేక్షణలో ఈసారి రైతులు క్రమబద్ధీకరించిన విధంగా పంటలు వేయబోతున్నారు. ఈనెల 30వ తేదీనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ప్రారంభం కాబోతు న్నాయి. ప్రతి గ్రామంలో ఈ ఆర్బీకేలు రైతులకు అందుబా టులో ఉంటాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాలు మొదలైనవన్నీ గ్రామంలోనే ఆర్బీకేల ద్వారా రైతులకు అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా నియోజకవర్గ కేంద్రంలో ఉన్న అగ్రీ ల్యాబ్స్ పరీక్షించి ధృవీకరించిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులనే ఆర్బీకేలలో విక్రయిస్తారు. వాటిని రైతు ఇంటికే చేరుస్తారు. ఈ కేంద్రంలో ఉండే గ్రామ వ్యవసాయ సహాయాధికారి రైతులకు అవసరమైన సలహాలు ఇవ్వడానికి అందుబాటులో ఉంటారు. గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాల ఏర్పాటుతో ఇప్పటికే పునరుజ్జీవం పొందిన పల్లెసీమలు ఆర్బీకేల ఏర్పాటుతో మరింత కళకళలాడబోతున్నాయి. 3 వేల సంవత్సరాల నాగరిక చరిత్ర అనంతరం చేనులో కలుపు తీసే యంత్రాన్ని కూడా దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకునే దుస్థితిలో ఉన్న భారత వ్యవసాయ రంగాన్ని ఆత్మనిర్భరత దిశగా మళ్లించాలంటే తెలుగు రాష్ట్రాలు చూపుతున్నటువంటి చొరవనే కేంద్రం కూడా చూపవలసి ఉంటుంది. అంతే తప్ప బ్యాంకుల ద్వారా అప్పు లిప్పించి, పీఎఫ్లో దాచుకున్న సొమ్మును అడ్వాన్స్గా ఇప్పించి పండుగ చేసుకోమనే ప్యాకేజీల ద్వారా వచ్చేది ఆత్మ నిర్భరత కాదు. ఆత్మ దుర్బలతో, ఆర్థిక బర్బరతో అనాల్సి ఉంటుంది. -వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
ఈపీఎఫ్: 3 నెలలు పొడిగింపు.. రూ. 2500 కోట్లు
న్యూఢిల్లీ: అభివృద్ధిని ఆకాంక్షిస్తూ.. స్వయం సమృద్ధితో కూడిన భారత్ నిర్మాణం కోసమే భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినట్లు ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలతో చర్చించిన తర్వాతే ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటే స్వయం ఆధారిత భారత్ అని.. ఐదు మూల స్థంభాల ఆధారంగా దీనిని రూపొందించినట్లు పేర్కొన్నారు. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తూ.. లోకల్ బ్రాండ్లను విశ్వవ్యాప్తం చేయడమే తమ లక్ష్యమన్నారు. లాక్డౌన్ కాలంలోనూ కేంద్రం అనేక సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు. కాగా కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన.. ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పథకం గురించి నిర్మల బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీ విధివిధానాలను ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. దేశ వ్యాపార వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపి... వారిని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.(రూ.20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీ) తమ ప్రభుత్వం గతంలో తీసుకువచ్చిన సంస్కరణలు.. ఇప్పుడు మంచి ఫలితాలనిస్తున్నాయని నిర్మలా సీతారామన్ అన్నారు. బ్యాంక్ అకౌంట్ల కారణంగా కరోనా కష్టకాలంలో.. పేదల అకౌంట్లలోకి నేరుగా నగదు బదిలీ చేయగలిగామని పేర్కొన్నారు. కోట్లాది మంది ప్రజలకు ధాన్యం, ఉచిత సిలిండర్లు అందజేశామని తెలిపారు. ఇప్పటి వరకు గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ ద్వారా ఆర్థిక ఉద్దీపన అమలు చేశామని.. స్వయం ఆధారిత భారత్కు కావాల్సిన పునాదులు ఇప్పటికే మోదీ సర్కారు పూర్తి చేసిందని వెల్లడించారు. పదిహేను రకాల ఉద్దీపన పథకాలను ఈరోజు ప్రకటించబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలకు... ప్రభుత్వ గ్యారంటీతో మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇస్తామని స్పష్టం చేశారు. అక్టోబర్ 31 వరకు ఎంఎస్ఎంఈలు ఈ పథకం ద్వారా అప్పులు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదే విధంగా ఈపీఎఫ్ పరిధిలోని ఎంఎస్ఎంఈలకు జూన్, జూలై, ఆగస్టు నెలెల పీఎఫ్ మొత్తాన్ని కేంద్రమే భరిస్తుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇందుకు గానూ రూ. 2500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దీంతో దాదాపు 70 లక్షల మంది కార్మికులకు లబ్ది చేకూరుతుందన్నారు. ఇక విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ. 90 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు నిర్మల తెలిపారు. అలాగే ప్రస్తుతం చెల్లిస్తున్న టీడీఎస్, టీసీఎన్ను 25 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించారు. మే 14 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఇది అమల్లో ఉంటుందన్నారు. ఇక కరోనా సంక్షోభంతో కుదేలైన రియల్ ఎస్టేట్ కంపెనీలు.. భవన నిర్మాణాలు పూర్తి చేసుకునేందుకు మరో ఆరు నెలల సమయం ఇస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. నిర్మలా సీతారామన్ ప్రసంగం- ముఖ్యాంశాలు లాక్డౌన్తో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయి 45 లక్షల చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊరట రూ. 3 లక్షల కోట్ల రుణాలకు ప్రభుత్వ గ్యారెంటీ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు అక్టోబరు 31 వరకు అప్పులు అత్యవసరాల కోసం చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం రూ. 20 వేల కోట్ల అప్పులు 4 సంవత్సరాల కాలపరిమితికి అప్పులు తీసుకోవచ్చు విద్యుత్ డిస్కంలను ఆదుకునేందుకు రూ. 90 వేల కోట్ల నిధులు ఈపీఎఫ్: ప్రభుత్వమిస్తున్న సాయం మరో 3 నెలల పాటు పొడిగింపు తద్వారా 70.22 లక్షల మంది ఉద్యోగులకు లబ్ది ఇందుకోసం రూ. 2500 కోట్లు కేటాయింపు ప్రాథమిక, సెకండరీ మార్కెట్లలో పెట్టుబడులపై రూ. 30 వేల కోట్లు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లను ఆదుకునేందుకు రూ. 30 వేల కోట్లు ప్రభుత్వ రంగ సంస్థలు ఇవ్వాల్సిన బాకీలు తీరుస్తాం కేంద్ర ప్రభుత్వ సంస్థల పరిధిలోని కాంట్రాక్టులన్నీ 6 నెలల వరకు పొడిగింపు కరోనాతో వాయిదాపడిన రియల్ ఎస్టేట్ నిర్మాణాల కాలపరిమితి 6 నెలల పాటు పొడిగింపు పనిని బట్టి కాంట్రాకట్లర్లకు డబ్బులు చెల్లింపు ఇక పన్నుల విషయానికొస్తే.. రేపటి నుంచి మార్చి 2021నాటికి చెల్లించాల్సిన టీడీఎస్, టీసీఎస్ 25 శాతం తగ్గింపు తద్వారా 50 వేల కోట్ల రూపాయలు ప్రజల చేతుల్లోనే ట్యాక్స్ రిటర్న్స్ తేదీ 31 జూలై నుంచి నవంబరు 30 వరకు పొడిగింపు చిన్న మధ్య తరహా పరిశ్రమల మూలధన పరిధిని పెంచిన కేంద్రం రూ.కోటి పెట్టుబడి, రూ.5 కోట్ల టర్నోవర్ ఉన్న ప్రతి కంపెనీ సూక్ష్మపరిశ్రమగా గుర్తింపు 10 కోట్ల పెట్టుబడి, 50 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలు చిన్నతరహా పరిశ్రమలుగా గుర్తింపు రూ.200 కోట్ల విలువ వరకు గ్లోబల్ టెండరింగ్ అవసరం లేదు. -
లాక్డౌన్ 4.0 : మోదీ కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : నాలుగో దశ లాక్డౌన్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత బుధవారం సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు మిగతా కేబినెట్ మంత్రులంతా హాజరయ్యారు. మంగళవారం ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో నాలుగో దశ లాక్డౌన్ ఉంటుందని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ 4.0 నిబంధనలను పూర్తి భిన్నంగా రూపొందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ కేబినెట్ సమావేశానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. నాలుగో దశ లాక్డౌన్కు సంబంధించిన పూర్తి వివరాలను మే 18 లోపు వెల్లడిస్తామని ప్రధాని పేర్కొన్నారు. నాలుగో దశ లాక్డౌన్లో ఏయే రంగాలకు సడలింపులివ్వాలి, ఆర్థిక కార్యకలాపాలను దేశమంతటా ఎలా పరుగులు పెట్టించాలన్న దానిపై మోదీ కేబినెట్ సమావేశంలో ప్రస్తావించనున్నట్లు సమాచారం. -
‘ఆత్మ నిర్భర్’ ఫన్నీ మీమ్స్ వైరల్
లాక్డౌన్ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించిన తర్వాత ఓ పదం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘ఆత్మ నిర్భర్’ అంటే అర్థం ఏంటో చెబుతూ నెటిజన్లు ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఆత్మ నిర్భర్’ అంటే ‘స్వయంగా వంట చేసుకోవడం’ ‘మన పని మనం చేసుకోవడం’ అంటూ కొంత మంది కామెంట్స్ చేయగా.. మరికొందరూ ‘కొడుకును ఓ తల్లి నువ్వు పెళ్లి ఎప్పడూ చేసుకుంటావ్ అని అడిగిన ప్రశ్నకు.. కొడుకు అమ్మ నేను అత్మనిర్భర్’ అని బదులు ఇచ్చినట్లుగా నెటిజన్లు ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. మరోక ట్విటర్ యూజర్ ‘నేను నా పబ్జీ పేరు ఆత్మనిర్భర్గా మారుస్తాను.. ఇప్పుడు చూడండి నా బృందం నాకు మద్దతు ఇవ్వదు’ అంటూ సరదాగా కొత్తకొత్తగా అర్థాలు వెతుకుతున్నారు. (ప్రధాని ప్రసంగం.. అర్థం ఏంటో!) Meet Pandiyan, he has trained himself to pee in the pot. And has been working hard to be atmanirbhar much before Modiji came along & made it trend. Pandiyan's atmanirbharta is of as much consequence as today's speech. pic.twitter.com/RpdDNXChsV — Manisha (@ManiFaa) May 12, 2020 ఇక ‘మా పెంపుడు పిల్లి పాండియన్ను చూడండి. అది టాయిలేట్ వస్తే బాత్రూంకు వెళ్లడానికి శిక్షణ తీసుకుంది. అంటే ప్రధాని మోదీ ‘ఆత్మనిర్భర్’గా ఉండాలని చెప్పక మునిపే పాండియన్ ‘ఆత్మనిర్భర్’గా ఉండటానికి చాలా కష్టపడుతున్నాడు’ అంటూ నెటిజన్లు తమదైన శైలిలో అర్థాలు వెతుకుతున్నారు. కాగా దేశ వ్యాపంగా అమలవుతున్న లాక్డౌన్ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పేరిట రూ.20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. ఆత్మ విశ్వాసం, ఆత్మ బలంతో ప్రజలు ఉండటమే కాకుండా ‘ఆత్మ నిర్భర్ భారత్’ అనేది దేశ ప్రజల నినాదం కావాలని ఆయన పిలుపునిచ్చారు. Mom : son when will you marry ?? Son : mom , I am #Atmanirbhar !! pic.twitter.com/G3Xvc7cWEy — Last Man Standing RELUCTANT_ECONOMIST (@Mnomics_) May 12, 2020