-
డీజీపీ, ఐజీపీ అధికారులతో మోదీ చర్చలు
న్యూఢిల్లీ: గుజరాత్లోని కేవదియాలో జరుగుతున్న డీజీపీ, ఐజీపీల వార్షిక సదస్సులో ప్రధాని మోదీ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు పాటిస్తున్న భద్రతా విధానాలు, పోలీసింగ్ను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ‘ శనివారం కూడా అధికారులతో ప్రధాని చర్చలు కొనసాగనున్నాయి. అలాగే ఈ సమావేశాల నేపథ్యంలో జాతీయ పోలీస్ స్మారకం స్టాంప్ను, సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ను మోదీ ప్రారంభించనున్నారు. విధుల్లో విశేష ప్రతిభ చూపిన ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) అధికారులకు ప్రెసిడెన్షియల్ పోలీస్ మెడల్స్ను ప్రదానం చేస్తారు. ఈ సదస్సుకు హాజరైన సభికుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు’ అని ప్రధాని కార్యాలయం ప్రకటనలో తెలిపింది. -
దావోస్ సదస్సులో షారుఖ్కు క్రిస్టల్ అవార్డు
న్యూఢిల్లీ/జెనీవా: దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో బాలీవుడ్ హీరో షారుఖ్ఖాన్ అరుదైన గుర్తింపు దక్కనుంది. సదస్సు సందర్భంగా ఈ నెల 22వ తేదీన హాలీవుడ్ హీరోయిన్ కేట్ బ్లాంచెట్, ప్రఖ్యాత గాయకుడు ఎల్టన్ జాన్తోపాటు షారుఖ్ క్రిస్టల్ అవార్డు అందుకోనున్నారు. షారుఖ్ ఖాన్ గత 30 ఏళ్లుగా భారతీయ చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారని డబ్ల్యూఈఎఫ్ తన ప్రకటనలో పేర్కొంది. దేశంలో స్త్రీలు, పిల్లల హక్కుల ఆయన సాగిస్తున్న పోరాటానికి ఈ అవార్డు ఇస్తున్నట్లు తెలిపింది. యాసిడ్ దాడి, అగ్ని ప్రమాద బాధితులను ఆదుకునేందుకు మీర్ ఫౌండేషన్ను నడుపుతున్నారని, కేన్సర్ బాధిత చిన్నారులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నారని వివరించింది. గతంలో ఈ అవార్డును అందుకున్న ప్రముఖుల్లో అమితాబ్ బచ్చన్, మల్లికా సారాభాయ్, ఏఆర్ రెహమాన్, షబానా అజ్మి తదితరులున్నారు. -
భద్రతపై ప్రత్యేక దృష్టి
టెకాన్పూర్: దేశ అంతర్గత భద్రతపై సమీక్షతోపాటుగా భవిష్యత్తులో భద్రతను మరింత పటిష్టపరచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై.. దేశంలోని పోలీసు ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ విస్తృతంగా చర్చించారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ సమీపంలోని బీఎస్ఎఫ్ అకాడమీలో జరుగుతున్న డీజీపీలు, ఐజీల వార్షిక సదస్సు లో మోదీ పాల్గొన్నారు. ఆదివారం దినమంతా మోదీ అధికారులతో విస్తృతమైన చర్చలు జరిపారు. ‘పోలీసింగ్, భద్రత అంశాలపై పోలీసు అధికారులతో చర్చించాను. ఈ సమావేశం ఫలప్రదంగా జరిగింది. మూడేళ్లుగా తీసుకున్న నిర్ణయాల అమలుతీరుపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు’ అని మోదీ ట్వీట్ చేశారు. సోమవారం కూడా పోలీసు ఉన్నతాధికారులతో మోదీ సమావేశం కొనసాగనుంది. సదస్సు వివరాలు పూర్తిగా వెల్లడికానప్పటికీ.. దేశవ్యాప్తంగా భద్రతను పటిష్టం చేయటంతోపాటుగా జమ్మూకశ్మీర్, ఈశాన్యరాష్ట్రాలు, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్లాలని మోదీ అధికారులకు సూచించినట్లు తెలిసింది. దాదాపు 250 మంది రాష్ట్రాల పోలీసు బాస్లు, కేంద్రీయ పోలీసు బలగాల సంస్థల అధిపతులు మూడ్రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. శనివారం కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభోపన్యాసం చేస్తూ.. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రస్థావరాలు ఇంకా దేశంలో అక్కడక్కడ బయటపడుతున్నాయన్నారు. కశ్మీర్లో యువతను రెచ్చగొట్టేందుకు పాకిస్తాన్ ప్రతిక్షణం ప్రయత్నిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక కేంద్రాలను అపవిత్రం చేసే ప్రయత్నాలు, అక్కడ అల్లర్లకు ప్రయత్నించే వారిపై కఠినంగా వ్యవహరించాలని రాజ్నాథ్ ఆదేశించారు. గతేడాది హైదరాబాద్.. ఈసారి గ్వాలియర్ ప్రతి ఏడాదీ రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు, కేంద్రీయ బలగాల ఉన్నతాధికారులు సమావేశమై దేశవ్యాప్తంగా ఉన్న భద్రతాపరమైన అంశాలపై చర్చిస్తారు. మామూలుగా ఈ సమావేశం ఢిల్లీలో జరుగుతుంది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక. ఢిల్లీ బయట వేర్వేరు కేంద్రాల్లో ఈ సమావేశం ఏర్పాటుచేస్తోంది. 2014లో గువాహటిలో, 2015లో రణ్ ఆఫ్ కచ్, 2016లో హైదరాబాద్లో ఈ సదస్సు జరిగింది. గతేడాది హైదరాబాద్లో జరిగిన సదస్సులో సీమాంతర ఉగ్రవాదం, ఉగ్రవాద ప్రేరేపిత అంశాలపై విస్తృత చర్చ జరిగింది. -
హార్వర్డ్ సదస్సుకు కేటీఆర్, అమరీందర్
వాషింగ్టన్: ఫిబ్రవరి 10, 11వ తేదీల్లో హార్వర్డ్ యూనివర్సిటీలో జరగనున్న 15వ భారత వార్షిక సదస్సుకు కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు, పంజాబ్ సీఎం అమరీందర్, సినీ నటుడు కమల్ హాసన్ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సదస్సులో ‘భారత్ – అద్భుత ఆవిష్కరణలు’ అనే అంశంపై చర్చ జరగనుంది. సదస్సుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి తారక రామారావు, బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి, నటి దివ్య స్పందన, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఆదిల్ జైనుల్బాయ్ తదితరులు హాజరుకానున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. -
తిరుపతిలో ఐఈఏ మహాసభలు ప్రారంభం
తిరుపతి: తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీలో ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ 99వ మహాసభలు మంగళవారం ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో జరుగుతున్న ఈ సభలను ముఖ్యమంత్రి చంద్రబాబు జ్యోతి ప్రజ్వలనంతో ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో హాజరైన ఆర్థికవేత్తలను ఉద్దేశించి అనంతరం ఆయన ప్రసంగించారు. సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవటం ద్వారా అనేక సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. కరువు పీడిత ప్రాంతాలపై డ్రోన్ల సాయంతో సర్వే చేపట్టి, అంచనా వేస్తున్నట్లు చెప్పారు.