నోరు అదుపులో పెట్టుకోకుంటే ఉమా భరతం పడతాం | Jogi Ramesh Fires On Devineni Uma Maheswara Rao | Sakshi
Sakshi News home page

నోరు అదుపులో పెట్టుకోకుంటే ఉమా భరతం పడతాం

Published Tue, Feb 18 2020 4:45 AM | Last Updated on Tue, Feb 18 2020 4:45 AM

Jogi Ramesh Fires On Devineni Uma Maheswara Rao - Sakshi

సాక్షి, అమరావతి : మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అభ్యంతరకరమైన భాష వాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోకపోతే ఆయన భరతం పడతామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ హెచ్చరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఉమా తన భాషను మార్చుకోకుంటే ఆయన తోక కత్తిరిస్తానని, తానే ఆయన ఇంటికి వెళతానని అన్నారు. ‘స్వయం ప్రకటిత మేధావి యనమల, అచ్చోసిన ఆంబోతు అచ్చెన్నాయుడు, లోకజ్ఞానం లేని లోకేష్, బొంకే బుచ్చయ్య, పిచ్చికుక్క లాంటి పవన్‌ కల్యాణ్‌ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు’ అని రమేష్‌ ధ్వజమెత్తారు. ‘పోలవరం కట్టిందెవర్రా..’ అంటూ ఉమా నోరు పారేసుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌తో సంబంధం లేదన్నారే!
చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌పై ఆదాయ పన్ను శాఖ దాడులు చేస్తే అతనితో తమకేం సంబంధం లేదని, అతనేమీ టీడీపీ వాడు కాదన్న ఆ పార్టీ నేతలు ఇప్పుడు శ్రీనివాస్‌ వద్ద రూ.2 లక్షలే దొరికాయి, 12 తులాల బంగారమే దొరికిందని ఎందుకు మాట్లాడుతున్నారని రమేష్‌ ప్రశ్నించారు. శ్రీనివాస్‌ ఇంట్లో రూ.2 వేల కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు బయట పడ్డాయని, ఇందులో నిజానిజాలు బయటకు వస్తాయని ఐటీ శాఖ మీడియాకు, ప్రజలకు తెలియజేసిన విషయం టీడీపీ నేతలు చూడలేదా? అని నిలదీశారు. ‘ఏబీసీడీలు రాని కొందరు, బుద్ధి లేని బుద్దా వెంకన్న లాంటివారు కూడా ట్వీట్లు పెడుతున్నారు’ అని మండిపడ్డారు. డబ్బులు చంద్రబాబు, లోకేష్, శ్రీనివాస్‌ ఇళ్లల్లో ఉంటాయా? వారు డబ్బులను దారి మళ్లించి అకౌంట్లలో వేసుకుంటారని రమేష్‌ అన్నారు.  బీసీలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మోసం చేసిందని అచ్చెన్నాయుడు అంటున్నారని.. సచివాలయ ఉద్యోగాల్లో 2.65 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారే ఉన్నారని, మార్కెటింగ్, దేవాలయ పాలకమండళ్లలో 50 శాతం బడుగుబలహీనవర్గాలకే పదవులిచ్చినట్టు జోగి రమేష్‌ వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement