కడ్తాల్: మానవ అక్రమ రవాణాను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఐసీడీఎస్ సీడీపీఓ రోజా, ప్రజ్వల సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ బలరాం కృష్ణ పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి, మహిళా శిశు సంక్షేమశాఖ, ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో రెండు రోజులుగా అంగన్వాడీ సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమం మంగళవారం ముగిసింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన సీడీపీఓ రోజా మాట్లాడుతూ.. నేటి సమాజంలో మానవ అక్రమ రవాణా కొత్త పద్ధతుల ద్వారా సైబర్ ట్రాఫికింగ్తో జరుగుతుందన్నారు. మొబైల్లో ఆన్లైన్ వాడుతున్న ఎవరైనా దీనికి గురయ్యే అవకాశం ఉందన్నారు. సమాజంలో ప్రధానంగా యువతతో పాటు, ప్రముఖులు కూడా ఇంటర్నెట్, మొబైల్ ద్వారా సైబర్ ట్రాఫికింగ్ బారిన పడుతున్నారన్నారు. యువతులు సెల్ఫోన్లో వచ్చే రకరకాల యాప్స్తో లైంగిక వ్యాపారానికి గురికావడం జరుగుతుందని, ఫొటోస్ మార్పింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిపారు. మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో అంగన్వాడీలు ప్రత్యేక కృషి చేయాలన్నారు. మహిళలు, పిల్లలకు రక్షణ కవచంలా మారాలని సూచించారు. అనంతరం ప్రజ్వల సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ బలరాం కృష్ణ మాట్లాడుతూ.. ప్రజ్వల సంస్థ గత 28 ఏళ్లుగా లైంగిక వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాడుతుందని, ఇప్పటి వరకు 28,500 మంది మహిళలను కాపాడామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పద్మశ్రీ డాక్టర్ సునీత కృష్ణన్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు శబరి, సరళ, ప్రజ్వల సిబ్బంది సురేశ్, అనిల్, అంబర్సింగ్, మిఽథాలీరాజ్, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఐసీడీఎస్ సీడీపీఓ రోజా
Comments
Please login to add a commentAdd a comment