ఆగిన ప్రమాణం | Obstacle to Kodandaram, Aamer Ali Khan swearing in as MLCs | Sakshi
Sakshi News home page

ఆగిన ప్రమాణం

Published Wed, Jan 31 2024 3:32 AM | Last Updated on Wed, Jan 31 2024 3:32 AM

Obstacle to Kodandaram, Aamer Ali Khan swearing in as MLCs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గవర్నర్‌ కోటా కింద కొత్తగా శాసనమండలి సభ్యులుగా నియమితులైన ప్రొఫె­సర్‌ కోదండరాం, జర్నలిస్ట్‌ ఆమెర్‌ అలీ ఖాన్‌ ప్రమాణ స్వీకారానికి బ్రేక్‌ పడింది. ఈ విషయంలో యథాతథస్థితి కొనసాగించాలని (స్టేటస్‌కో) ఆదేశిస్తూ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని హైకో­ర్టు ధర్మాసనం మంగళవారం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 8వ తేదీ వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని, ఆ రోజు పూర్తిస్థాయిలో వాదనలు వింటామని స్పష్టం చేసింది.

గతంలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను సిఫారసు చేస్తూ అప్పటి ప్రభుత్వం గవ­ర్నర్‌కు ప్రతిపాదనలు పంపింది. అయితే 2023 సెప్టెంబర్‌ 19న గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వాటిని తిరస్కరించారు. గవర్నర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 171(5) ప్రకారం తనకున్న విస్తృత అధికారాల మేరకు ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లుగా గవర్నర్‌ ప్రకటించడాన్ని వారు సవాల్‌ చేశారు.

ఈ పిటిషన్లపై గత వారం విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం.. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. పిటిషన్ల విచారణార్హతతో పాటు వాటిలో­ని వాస్తవాలు, సాంకేతిక అంశాలను పరిశీలిస్తామని చెప్పింది. ఈ పిటిషన్లపై విచారణ ముగిసే వరకు కొత్తగా గవర్నర్‌ కోటాలో ఎవరినీ నియమించకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేయగా తోసిపుచ్చింది. అలా గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వడం చట్టపరంగా సాధ్యం కాదని స్పష్టం చేసింది. ‘పెద్దమనుషుల ఒప్పందం’ (జెంటిల్‌మెన్‌ అగ్రిమెంట్‌) మాదిరి అందరూ హుందాతనం పాటించాలని సూచించింది.  

కొత్త నియామకాలపై స్టే ఇవ్వండి 
తాజాగా గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా ఫ్రొఫెసర్‌ కోదండరాం, జర్నలిస్ట్‌ ఆమెర్‌ అలీ ఖాన్‌లను నియమిస్తూ.. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ గవర్నర్‌ తమిళిసై ఈ నెల 25న ఉత్తర్వులు వెలువరించారు. దీంతో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ఇందుకు సంబంధించిన జీవో నంబర్‌ 12ను సవాల్‌ చేస్తూ హైకోర్టులో మధ్యంతర అప్లికేషన్‌ (ఐఏ)లు దాఖలు చేశారు. కొత్త నియామకాలను నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే కోదండరాం, అమేర్‌ అలీఖాన్‌లను ప్రధాన పిటిషన్‌లో ఇంప్లీడ్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ఐఏలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ జూకంటి ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. దాసోజు తరఫున సీనియర్‌ న్యాయవాది అదిత్యా సోదీ వాదనలు వినిపించారు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల అంశం హైకోర్టులో విచారణ దశలో ఉండగా కొత్త వారిని నియమించడం సరికాదని ఆయన అన్నారు. ఈ నెల 17న మీడియాకు విడుదల చేసిన నోట్‌లో.. కోర్టు ఉత్తర్వులు ఇచ్చేవరకు కొత్త నియామకాలు చేపట్టబోమని గవర్నర్‌ పేర్కొన్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

ఇది న్యాయస్థానం సూచించిన ‘పెద్దమనుషుల ఒప్పందం’ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఇద్దరి పేర్లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం సిఫారసు చేసిందని, వాటిని పరిశీలించిన తర్వాతే గవర్నర్‌ ఆమోదించారని తెలిపారు. వీరి నియామకం చట్టప్రకారమే జరిగిందని, స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీజే ధర్మాసనం దీనిపై స్టేటస్‌ కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  

చైర్మన్‌ లేక వీలు పడకపోవడంతో.. 
హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో కోదండరాం, ఆమెర్‌ అలీఖాన్‌లు బుధవారం ప్రమాణ స్వీకారం చేసేందుకు వీల్లేకుండా పోయింది. వాస్తవానికి వీరు ప్రమాణ స్వీకారం చేసేందుకు సోమవారం (29న) నాడే శాసనమండలికి వెళ్లారు. కానీ వారు వెళ్లే సమయానికి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన చాంబర్‌లో లేరు. దీంతో ఆయన రాక కోసం వారు కౌన్సిల్‌ హాల్‌లోనే చాలాసేపు ఎదురు చూశారు. అయినా చైర్మన్‌ రాకపోవడంతో వెనుదిరిగారు. అయితే ఆరోగ్యం బాగోలేనందున చైర్మన్‌ మండలికి రాలేకపోయారని, ఈ నెల 31న ప్రమాణ స్వీకారానికి రావాలని వారిద్దరికీ కౌన్సిల్‌ నుంచి సమాచారం అందింది. ఈ మేరకు వారు సిద్ధమవుతున్న సమయంలో స్టేటస్‌కో విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా నేడు బల్మూరి, మహేశ్‌కుమార్‌ల ప్రమాణం 
శాసనసభ్యుల కోటాలో ఇటీవల శాసనమండలికి ఎన్నికైన ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 3.30కు శాసనమండలి చైర్మన్‌ చాంబర్‌లో బల్మూరి వెంకట్, మహేశ్‌కుమార్‌ గౌడ్‌లు మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కాగా హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని కోదండరాం, ఆమెర్‌ అలీఖాన్‌లు నిర్ణయించుకున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement